Showing posts with label భోజమహారాజు - సమస్యా పూరణలు. Show all posts
Showing posts with label భోజమహారాజు - సమస్యా పూరణలు. Show all posts

Tuesday, August 31, 2021

భోజమహారాజు - సమస్యాపూరణలు - 2

 భోజమహారాజు - సమస్యాపూరణలు - 2





సాహితీమిత్రులారా!

ఒకమారు ధారాధీశుడైన భోజుడు వ్యాహ్యళికై వెళ్ళగా
బోగమువీథిలో బోగముపడుచుపిల్ల  ఒకతె చెవిలో
నల్లకలువ పువ్వు పెట్టుకొని చెండాట ఆడుతూంది
అలా ఆడే సమయంలో కదలికవల్ల చెవిలోని కలువపూవు
జారి కాళ్ళమీద పడింది. అది చూచిన రాజుగారు మనసులో పెట్టుకొని
సభకు వెళ్ళాడు. అక్కడ కవీశ్వరులను కందుకాన్ని వర్ణించమని
కోరగా భవభూతి
ఈ విధంగా వర్ణించాడు-

విదితం నను కందుక! తే హృదయం
ప్రమదాధర సంగమలుబ్ద ఇవ,
వనితాకరతామరసాభిహత:
పతిత: పతిత: పునరుత్పతసి


(ఓ కందుకమా! నీ అభిప్రాయం నాకు తెలిసిపోయింది.
యువతీమణి తనచేతితో
మాటిమాటికి కొట్టుచున్నా కిందపడి కూడ నీవు
ఎందులకు మరల పైకెగురుచున్నావో నాకు తెలిసిందిలే
ఆవిడ కెమ్మోవిపానకమును త్రాగుటకుకదా!)
అని చెప్పెను.
తరువాత మరొకకవి ఈ విధంగా చెప్పాడు

ఏకోపి త్రయ ఇవ భాతి కందుకోయం
కాంతాయా: కరతలరాగరక్తరక్త:
భూమమౌ తచ్చరణమరీచిగౌరగౌర:
ఖస్థస్సన్ నయనమరీచినీలనీల:


(ఒక కాంత చెండాడుతుంటే ఆ చెండు ఎలావుందంటే -
ఆ కాంతామణి అఱచేత చరచునపుడు ఆ అఱచేయి
ఎరుపుడాలునకు ఎరుపుగను, చేతి దెబ్బ తగిలి నేలమీద
ఆమె కాళ్ళముందర పడినతరువాత ఆమె
కాలిగోళ్ళ తెల్లనికాంతి సోకి తెల్లగను,
పైరెగిరినపుడు ఆమె ముఖము పైకెత్తి చూడగా
ఆ కలువకంటి కన్నుల నీలపుకాంతులతో నల్లనల్లగను
మూడురకములుగా ప్రకాశించుచున్నది.)
అని చెప్పెను.
ఆ తరువాత కాళిదాసు
ఈ విధంగా వర్ణించాడు-

పయోధరాకారధరో హి కందుక:
కరేణ రోషాదభిన్యతే ముహు:,
ఇతీవ నేత్రాకృతి భీతముత్పలం
స్త్రియ ప్రసాదాయ పపాత పాదయో:

(పాలిండ్ల ఆకృతి ధరించినందున ఈ బంతిని
ఈ ఇంతి రోషముతో మాటిమాటికి తనచేతితో కొట్టుచున్నది.
ఇక ఈ కలువకంటి సాదృశ్యము ధరించిన నాకు మాత్రమీమెవలన
ఇలాంటి దండన కలుగకుండునా! అని భయపడి ఆమె చెవిలోపెట్టుకొన్న
కలువపూవు ఆమె కాళ్ళపై పడి ఆమె అనుగ్రహమును కోరుచున్న
దానివలె తటాలున పాదములపై బడెను)
అని వర్ణించెను.
భోజరాజు ఆ ముగ్గురికి తగినవిధంగా
బహుమానములిచ్చెను.
కాళిదాసును మాత్రం
తనమనసులోని విషయాన్ని
చూచినవానివలె చెప్పినందులకు
ప్రత్యేకముగా సన్మానించెను.

Friday, August 27, 2021

భోజమహారాజు - సమస్యా పూరణలు

 భోజమహారాజు - సమస్యా పూరణలు




సాహితీమిత్రులారా!



ధారానగరంలో భోజుడు అంతఃపురంలో నిద్రిస్తున్నాడు.
ఆ సమయంలో ఒక పండితచోరుడు రాజుగారి కోశాగారంలో
ప్రవేశించాడు. అక్కడ వజ్రవైఢూర్యాలను, మరకతగోమేధికాలను,
మాణిక్యాలను ఎన్నిటినో మూటగట్టుకొని పోబోతుండగా
ఇంతలో వానిమనసులో ఒక భావం తళుక్కున మెరిసింది.
అయ్యో పూర్వజన్మలో ఎన్నో తప్పుడు పనులు చేయబట్టి
కదా ఈ జన్మలో చాలమంది వికలాంగులై, కుష్ఠురోగులై,
గ్రుడ్డి, కుంటి, వారుగాను, దరిద్రులుగాను బాధపడుచున్నారు.
నేనుకూడ పూర్వజన్మలో చేసినపాపం వల్లే నేడు దరిద్రుడనైనాను.
ఇంకా ఈ జన్మలో తప్పులు చేసి పాపం మూటకట్టుకో వలసిందేనా
-అని అనుకొంటూ ఆలోచిస్తున్నాడట. ఇంతలో భోజుడు మేల్కొని
తన సుఖసంపదలను, అష్టైశ్వర్యాలను తలంపునకు తెచ్చుకొని
ఈ శ్లోకాన్ని చెప్పాడు-

చేతో మహా యువతయః సుహృదో2నుకూలాః
సద్భాంధవాః ప్రణయగర్భగిరి శ్చ భృత్యాః
గర్భన్తి దంతి నివహా స్తరలా స్తురంగాః

(మనస్సునెంతగానో ఆకర్షించే మత్తకాశినులున్నారు.
అనుకూలురగు మిత్రులు, మంచి బంధువులు,
చెప్పినంతనే పనులు చేస్తూ , చాటూక్తులు పలికే
సేవకులున్నారు. ఏనుగులు, గుఱ్ఱాలు, ఒకపక్క
గర్జిస్తున్నాయి. ఇలా అష్టైశ్వర్యాలతో అన్నిసుఖాలు
అనుభవిస్తున్నా ---)
అని చదివి మిగిలిన నాలుగవపాదం కోసం
చడబడుతున్న సమయంలో
ఆ పండిత చోరుడు ఈ విధంగా పూరించాడు-

సంమీలనే నయనయో ర్న హి కించి దస్తి
(అవి కట్టెదుట కనబడుతున్నా, కన్నులు మూయగానే
ఇవేవీ కంటికి కన్పడవు సుమా)
(అంటే భౌతికములైన సుఖాలు అన్నీ క్షణభంగురాలేకాని
శాశ్వతాలు కావని భావం.)

దీనికి రాజు సంతసించి అతని పూర్వాపరాలు విచారించి
ఆ చోరపండితునికి తగినంత బంగారమిచ్చి సన్మానించి
పంపించాడట.