Sunday, December 29, 2019

కన్నడంలో ద్వ్యక్షరి


కన్నడంలో ద్వ్యక్షరి




సాహితీమిత్రులారా!

కన్నడంలో మొదటి అలంకార గ్రంథంగా చెప్పబడే కవిరాజమార్గలో
చిత్రకవిత్వాన్ని గురించిన విషయాలునాన్నయి. దీన్ని రాష్ట్రకూటరాజైన
అమోఘవర్ష నృపతుంగుడు కూర్చాడు. దీనిలోని ద్య్వక్షరిని అంటే కేవలం రెండు వ్యంజనాలతోనే కూర్చిన పద్యం ఇక్కడ గమనించండి-

ಮಾನಿನೀ ಮುನ್ನಮಾಂ ನೀನೆ ನೀನಾ ನಿಂನನುಮಾನಮೊಂ
ಮಾನಮಾನಾನೆ ಮುಂನಂನೆ ಮಾನಮಾನನಮುಂನಿನಾ

మానినీ మున్న మాం నీనె నీనా నినంననుమానమొం
మానమానానె ముంనంనె మానమాననముంనినా
                                                                          (కవిరాజమార్గ - 2 - 122)

ఇందులో రెండు హల్లులనే వాడటం జరిగింది అవి న,
గమనించగలరు.

Friday, December 27, 2019

గుమ్ము బుస్సు ఱింగు బొణుగు


గుమ్ము బుస్సు ఱింగు బొణుగు




సాహితీమిత్రులారా!

కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో రాయలవారి అనుజ్ఞ తీసుకొని
మొల్లను పరీక్షింప శ్రీమహావిష్ణువు గజేంద్రుని రక్షించు సమయంలో
ఏ విధంగా వైకుంఠం నుండి ప్రయాణమై గజేంద్రుని వద్దకు పోయాడో
వివరించే విధంగా సీసపద్యంలో వరుసగా నాలుగు పాదాలలో
గుమ్ము, బుస్సు, ఱింగు, బొణుగు - ఈ పదాలను ఉపయోగించి చెప్పమన్నాడు మొల్లను.
అప్పుడా కవయిత్రీరత్నం ఒకమారు ఆకాశం వంక దృష్ఠిని సారించి, మనస్సులో రామచంద్రుని నిల్పి చెప్పడం తన మృదుమధుర గంభీర స్వరంతో మొదలెట్టింది.......

సీ.
 అనిలాభిహత దక్షిణావర్త శంఖంబు
            గుంఫితంబై కేల గుమ్ము రనఁగ
     గొడగయి తఱచుగాఁ బడగ లొక్కెడ దట్టి
            భుజగాధిపతి మీద బుస్సు రనఁగ
    చరచి నిబ్బరముగా బరతెంచు ఖగరాజు
            ఱెక్కగాడ్పులు మింట ఱింగు రనఁగ
    దొంతి బ్రహ్మండ పంక్తులు బొజ్జలోనుండి
            బెనకి యొక్కొకమారు బొణుగు రనఁగ
తే.గీ.  కూక కనుచూపుమేరకుఁ గోక విసరి
        వెఱకు! వెఱవకు! వెఱవకు! వెఱవ! కనుచు
        నుద్ద వడి వచ్చి గజరాజు నొద్ద వ్రాలె
        నార్తరక్షణ చణుఁడు నారాయణుండు

అత్యంత మనోహరమైత ఈ పద్యం పూర్తవగానే సభాసదులు
కరతాళధ్వనులచే తమ హర్షాన్ని తెలియజేశారు.
దానితో రాయలవారి సత్కారం లభించింది.

Wednesday, December 25, 2019

శూర్పనఖా విలాపం


శూర్పనఖా విలాపం




సాహితీమిత్రులారా!

చిత్రకావ్యాలలో అనేక చిత్రాలు. అందులో శబ్దచిత్రం ఒకటి.
ఇందులో చిత్రాలు కొల్లలు. చిత్రకవిత్వాభిలాషులకు వీటిని గురించి 
వింటూంటే చూస్తుంటే చదువుతూంటే సమయమే తెలియదు.
మేల్పుత్తూర్ నారాయణ భట్ట కవి వరులు విరచించారు ఒక అద్భుత
చిత్రకావ్యం.

రామలక్ష్మణుల అరణ్యవాస సమయంలో శూర్పనఖ రావడం జరిగిందికదా అక్కడ జరిగిన సంఘటనలో లక్ష్మణుడు ఆమెకు ముక్కు చెవులు కోశాడుకదా మన లచ్చన్న. ఆమె అలాగే వెళ్ళి రావణుని సభలో మాట్లాడిందికదా అప్పుడు ఆమె అనునాశికాలను పలకలేదు కదా
ఎందుకంటే ఆమెకు ముక్కులేదు. మరి ఆమె ఎలా మాట్లాడింది వారికి ఎలా అర్థమైంది అని కొందరు వ్యంగ్యంగా అడుగుతుంటారు. సరిగ్గా అలాంటి ఆలోచనే మన నారాయణ భట్టుగారికి వచ్చింది దాని ఫలితమే శూర్పనఖా విలాపం. ఇది నిరనునాశికంగా వ్రాయబడింది. దీన్నే నిరనునాశిక చంపువు అని కూడా పిలుస్తారు.
ఇందులోని గద్యపద్యాలను ముక్కుమూసి చదవవచ్చు.

మనం ముక్కుతో ఒక రెండుమూడు వాక్యాలైనా చెప్పగలమా!
ఏమో! ఆలోచించాల్సందే కదా
ఇది చాల చిన్న కావ్యం. ఆరు పుటలలో ఉన్నదని కొందరన్నారు
కాని ఆకావ్యం మనకు దొరకడం కష్టం దొరికితే 
అందులోని పద్యాలు
ఒకటో రెండో దొరుకుతున్నవని కొందరంటారు 
మనమూ ప్రయత్నిద్దాం.

Sunday, December 22, 2019

వలవదా మీద సురభాష నిలుపరాదు


వలవదా మీద సురభాష నిలుపరాదు



సాహితీమిత్రులారా!


మరింగంటి సింగరాచార్యులు శుద్ధాంధ్ర నిరోష్ఠ్య కావ్యరచనకు ఆద్యుడు
ఆయనే తన శుద్ధాంధ్రనిరోష్ఠ్యసీతాకళ్యాణ కావ్యంతో ఈ విధంగా నిరోష్ఠ్యనియమాన్ని ఆచరించలేదు. ఇలాంటివి అనేక మంది కవులు
తవ కావ్యాల్లో చేసివున్నారు.
మరింగంటి సింగరాచార్యులవారు తన కృత్యాదిన ఈ విధంగా చెప్పివున్నారు.

అరయ కగచజటడతదనా యలసహ
రద్వయమెకాని యొండక్షరములు చొఱవు
మఱియు నౌత్వోత్వములు కొమ్ము మాముడియు
వలవదా మీద సురభాష నిలుపరాదు
                                                       (శుద్ధాంధ్రనిరోష్ఠ్యసీతాకళ్యాణం-1-34)

ఈ పద్యాన్ని బట్టి ఆయన పెట్టుకొన్న నిర్యోష్ఠ్య నియమమున
అచ్చులు ఔ,ఓ,ఒ,ఉ,ఊ ల తర్వాత వత్తు తీసుకోబడింది
దీనికి ఉదాహరణగా ఈ క్రింది పద్యం చెప్పవచ్చు.

జిగిచన్గట్లని యాడందీఱైన లేచెక్కిళ్ళ చక్కిన్ని గ
న్నిగ లీనంగఁగ డారికంటి సిరిడాల్ నిండంగ గై చిన్నియల్ 
తెగలై నల్దెసలాని చక్కగఁజికిల్ సేయన్ నెఱాసిగ్గెదన్ 
దగలన్ రానెలఁజేరి కాళ్ళకడ చెంతన్ సాగిలెన్ నాతి దాన్
                                                                       (శుద్ధాంధ్రనిరోష్ఠ్యసీతాకళ్యాణం- 2-63)


Friday, December 20, 2019

హిందీలో ఏకాక్షరి


హిందీలో ఏకాక్షరి




సాహితీమిత్రులారా!


ఏకాక్షరి అంటే ఒకే వ్యంజనాన్ని ఉపయోగించి శ్లోకం లేదా పద్యం వ్రాయటం.
దానిలో అచ్చులు ఏవైనా రావచ్చు. ఇలాంటివి సంస్కృతంలోనూ,
తెలుగులోనూ ఉన్నాయి. అలాగే హిందీలోను ఉన్నాయి.
సేనాపతి రచించిన ''కవిత్త రత్నాకర'' నుండి ఒకదాన్ని
ఇక్కడ గమనిద్దాం -

लोली लल्ला लल्लली लै ली लीला लाला
लालौ लीलौ लोल लोल लै लै लै लीला लाल
                                                            (कवित्त रत्नाकर - 5 - 73)

లోలీ లల్లా లల్లలీ లై లీ లీలా లాలా
లాలౌ లీలౌ లోల లై లై లై లీలా లాల
                                                        (కవిత్త రత్నాకర - 5 - 73)

చూచారుకదా!

ఇలాంటివి మరోసారి మరో భాషలో చూద్దాం!

Wednesday, December 18, 2019

కన్నడంలో నిరోష్ఠ్య చిత్రం



కన్నడంలో నిరోష్ఠ్య చిత్రం



సాహితీమిత్రులారా!

ఓష్ఠ్యం అంటే పెదవి. పెదవితో మాత్రమే పలికే వాటిని ఓష్ఠ్యాలు అని
పెదవులతో పలకని వాటిని అక్షరాలతో కూర్చిన వాటిని నిరోష్ఠ్యాలని అంటారు. ఇవి సంస్కృతంలోనే కాదు తెలుగులో, హిందీలో కూడా కనిపిస్తాయి. అలాగే కన్నడంలో కూడా ఉన్నాయి వాటిలో కొన్ని ఇక్కడ చూద్దాం........

ఇది కన్నడంలోని మదనతిలకం నుండి గమనించండి

ಖರಕಿರಣನ ತನಯನ ಖರ|
ಕಿರಣಕರ ದಶರಥನ ನಳನಜಳಜ ಜನಧರಾ ||
ವರನ ಶಶಧರನ ಚಕ್ರನ |
ಚರಿತೆಯೆ ನಿಜಚರಿತಮೆನಿಸಿದಾಶನನೊಲ್ಗುಂ ||

ఖరకిరణన తనయన ఖర
కిరణకర దశరథన నళినజళజ జనధరా
వరన శశధరన చక్రన
చరితెయె నిజచరితమెనిసిదాశననొల్గుం

చూశారుకదా ఇది చదివేప్పుడు పెదాలు కదిలాయా కదిలితే ఇది నిరోష్ఠ్యం కాదు.

Monday, December 16, 2019

మంచి కవి, మంచి స్నేహితుడు


మంచి కవి, మంచి స్నేహితుడు




సాహితీమిత్రులారా!


1957లో అనుకుంటాను, ఒక రోజున మా ఇంటి ముందు ఓ రిక్షా ఆగింది (అప్పట్లో అవి మనుషులు తొక్కే సైకిల్‌ రిక్షాలు). అందులోంచి సన్నని గ్లాస్గో పంచె కట్టుకుని, అంతే సన్నని తెల్ల లాల్చీ తొడుక్కుని, ఒక సుకుమారమైన మనిషి దిగి, “నారాయణరావుగారంటే మీరేనా? నాపేరు బాలగంగాధర తిలక్‌. మీతో మాట్లాడదామని వచ్చాను” అన్నాడు.

నేను నివ్వెర పోయాను. మనిషినెప్పుడూ చూడలేదు గానీ, బాలగంగాధర తిలక్‌ నాకు చాలా ఇష్టమైన కవి. నేను అతని మాటల పొందికనీ, సమాసాల కూర్పునీ, మనసు లోపల పొరల్లోకి చొచ్చుకుని వెళ్ళే అతని అందమైన ఊహల్నీ – అన్నిటికన్నా కవిత్వం మీద అతనికున్న స్పష్టమైన, ధైర్యవంతమైన నమ్మకాన్నీ తలుచుకుని తలుచుకుని ఉప్పొంగిపోతూ ఉండేవాణ్ణి. అలాంటి బాలగంగాధర తిలక్ తిన్నగా మాయింటికి వచ్చేస్తాడని నేను ఊహించలేదు.

నా ఉబ్బితబ్బిబ్బులోంచి నేనింకా తేరుకోక ముందే, అలా వచ్చిన మనిషి కుర్చీలో కూర్చుని మాట్లాడటం మొదలు పెట్టాడు. నేనూ అంతే మామూలుగా అతని కబుర్లలో కలిసిపోయాను. మేమిద్దరం అంతకు ముందునుంచీ చాలాకాలంగా ఎరిగున్న స్నేహితుల్లా కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టాం. గంటలు గడిచిపోతున్నాయి. కవిత్వాన్ని గురించీ, సాహిత్యాన్ని గురించీ, అప్పుడు రాస్తున్నవాళ్ళ మంచిచెడ్డల్ని గురించీ, ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క మాట, ఒక్కొక్క ఒడుపు ఎంత బాగుందో ఒకరికొకరు ఎంతో ఇష్టంతో ఊహలు కలబోసుకుంటున్నాం. అతను చాలా పెద్ద కవి అని నా గుర్తులో లేదు. నేను చాలా చిన్నవాణ్ణని ఆయన అనుకున్నట్టూ లేదు. అలా మాకు తెలియకుండా కాలం గడిచిపోతూంటే, వీధిలో ఉన్న రిక్షావాడు నాకు కనిపించాడు. అతనికి డబ్బిచ్చి పంపేయలేదే, ఏమిటా అని ఆశ్చర్యపోయాను నేను. అప్పుడు చెప్పాడు తిలక్‌, రిక్షా అక్కడే ఉండాలని, “లేకపోతే నాకు భయం, నడవాల్సొస్తుందేమోనని. ఏం ఫర్వాలేదు లెండి. ఉంటాడు.”

తిలక్‌ని తల్చుకోగానే నాకు జ్ఞాపకం వచ్చేవి రెండు – కవిత్వంలో ఆయనకున్న ధైర్యం, నిబ్బరం. జీవితంలో ఆయన నిస్సహాయత, భయం. ఈ రెండూ సమానంగా పెరుగుతూ వచ్చాయి తిలక్‌లో నేనెరిగున్నన్నాళ్ళూ. వ్యక్తులుగా తిలక్‌, నేనూ ఆయన జీవితపు చివరి దశాబ్దంలో బాగా స్నేహితులమయ్యాం. ఆయన తణుకునించీ తరుచు ఏలూరు వచ్చేవాడు. తణుకులో ఆయన తమ్ముడు, దేవరకొండ శివకుమార శాస్త్రిగారు పేరున్న లాయరు. ఆయన ఇంటికి, తిలక్‌, ఆయన భార్య ఇద్దరూ వచ్చేవారు. తిలక్‌ ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణం చేసేవాడు కాదు. నడిచి వెళ్ళేవాడు కాదు ఆఖరికి పట్టుమని ఫర్లాంగు దూరమైనా. నేను అంత తరుచుగా కాదుగానీ అప్పుడప్పుడు తణుకు వెళ్ళేవాణ్ణి, ఆయన కోసం. ఈ మానసిక ఆందోళన, భయంలేని ఆరోగ్యవంతమైన రోజులు తిలక్‌ జీవితంలో చాలా ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో తిలక్‌ని నేనెరగను.

తిలక్‌ రాయడం మొదలుపెట్టిన రోజుల్లో (ఆయన మొదటి పద్యం 1941లో రాశాడు) భావకవిత్వం వెనకబట్టి, శ్రీశ్రీ ప్రభావం బలపడుతోంది ముఖ్యంగా యువకుల్లో. కవులు లోకంలో జరిగే అన్యాయాలను పట్టించుకోవాలని, రాజకీయంగా, సామాజికంగా ఒక ప్రత్యేక తరహా న్యాయంకోసం తమ కవిత్వపు గొంతుకతో పోరాడాలని, ఒక కొత్త అభిప్రాయం బలపడడం మొదలైంది. కవిత్వం త్రికాలాబాధితమనీ, రసానందమే దాని పరమావధి అనీ అలంకారశాస్త్రంలో చెప్పిన మాటలు పాతబడి చాలా కాలమయింది. దాంతోబాటు, భావకవిత్వపు రోజుల్లో బలపడిన ఊహలు కూడా నీరసపడడం మొదలైంది. ప్రేయసీ, వెన్నెలా, మలయానిలమూ, మల్లెపువ్వులూ వేళాకోళపు మాటలయ్యాయి. భావకవి అభావకవి అయ్యాడు. విప్లవమూ, వర్గపోరాటమూ, ఎర్ర జెండా కొత్త కవితా వస్తువులయ్యాయి. యువకులందరూ ధైర్యంగా శ్రీశ్రీ కవితా, ఓ కవితా చదివి సొమ్మసిల్లి పోతున్నారు. శ్రీశ్రీ కవిత్వం అప్పటికింకా అచ్చు కాకపోయినా చాలా మంది జేబుల్లో రాతప్రతులుగా, చాలా మంది నోళ్ళల్లో గీతప్రతులుగా చలామణీ అవుతోంది. ముందుకు కుచ్చిళ్ళు వదిలేసి, బెంగాలీ కట్టు గ్లాస్గో పంచెలు, సిల్కు లాల్చీలు, గిరజాలు కవికి గుర్తులవడం తగ్గి, పంట్లాలూ చొక్కాలూ తొడుక్కున్న కవులు సభల్లో కనిపిస్తున్నారు.

అలాంటి దశలో వచ్చాడు తిలక్‌.

నా కవిత్వం కాదొక తత్వం
మరి కాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.

ఈ పద్యం చాలామందిని ఆపి, అల్లరిపెట్టింది. ఇందులో తరవాత రెండు చరణాలు ఇటు కొంచెం భావకవిత్వం వైపు, అటు కొంచెం శ్రీశ్రీ కవిత్వం వైపు మొగ్గుతున్నట్టు కనిపిస్తాయి. జాగ్రత్తగా చూస్తే నిజానికవి రెండూ కావు.

గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్రలోకపు మణిస్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.

అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల ధగద్ధగ రవాలు.

కవిత్వంలా కనిపించడానికి ప్రయత్నిస్తున్న ఈ మాటల వెనకాతల, తిలక్‌లో గాఢంగా నాటుకుని ఉండి రూపొందుతున్న ఒక తీవ్రత ఉంది. మనిషి తన జీవితంలో ప్రపంచాన్ని ఆనందించడానికి పడే తపన అక్కడితో ఆగిపోకుండా, ఈ పద్యంలో ఉన్న చివరి మూడు పంక్తులూ నన్ను కట్టి పడేశాయి.

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తులవహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు

ఆఖరి చరణం దాకా మామూలుగా అప్పటి పద్యాలలో అలవాటైన మాటల కూర్పులే సున్నితంగా కనిపిస్తాయి. అయితే అందులో ఒక ఒడుపుంది, పంక్తికొక తూగుంది. మొత్తం మీద పద్యం శక్తిమంతంగా చేసే నేర్పుంది. కానీ అకస్మాత్తుగా ఆఖరి చరణం చిన్న మాటల్లో మామూలు వాడుకలోని తెలుగులో ఏ ఆర్భాటమూ లేకుండా అంతకు ముందు పద్యంలో ఉన్న ఆర్భాటాన్ని అకస్మాత్తుగా చల్లారుస్తూ మనం ఊహించని మామూలు తనంతో కనిపించే సరికి, పద్యం ఒక్కసారి అపూర్వమైన ప్రాణం పోసుకుంటుంది. నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అనే మాట తిలక్‌లో అంతకు ముందు ఎవరికీ లేని, ఆ తరవాత ఎవరికీ అబ్బని ఒక అసాధారణమైన, సాధారణ శబ్దశక్తిని ప్రపంచించింది. ఆ ఒక్క పంక్తీ ఇతను నిజంగా కవి అని నాకు గుర్తుకు తెచ్చింది.

ఈ పద్యంలో తిలక్‌ తన కవిత్వాన్ని గురించే కాకుండా అసలు కవిత్వాన్ని గురించి చెప్పాడు. రాజకీయాల అలజడిలో, ఉద్యమాల ఉత్సాహంలో ఉపన్యాసానికీ కవిత్వానికీ మధ్య తేడా చెరిగిపోవడం మొదలైన రోజుల్లో వచ్చిన ఈ పద్యం చాలామందికి ప్రాణం పోసింది. ఇంకా చాలామందికి కోపం తెప్పించింది.

ఆ తరవాత తిలక్‌ రకరకాల పద్యాలు రాశాడు. అంతర్జాతీయ సమస్యలూ, యుద్ధాల కష్టాలూ, పేదవాళ్ళ బాధలూ, ప్రేమికుల అనుభవాలూ, మధ్యతరగతి మనుష్యుల అనుభవాలూ, తుఫాన్లూ, కాటకాలూ అతన్ని రకరకాలుగా అలజడి పెట్టాయి. అతని మాటలు ఎటు వెళ్ళాలో తెలియక, ఐనా అతను అంతర్గతంగా భావిస్తున్న ప్రపంచాన్ని వదులుకోలేక, దారితప్పుతున్న కవిత్వాన్ని దారిలో పెట్టడానికి, మళ్ళా బావుండదనుకుని ఆ దారిలోనే వెళ్ళడానికి ప్రయత్నిస్తూంటాయి. అప్పుడప్పుడు ధైర్యం పుంజుకుని, తన కవితా విశ్వాసాన్ని ఒక తీవ్రమైన ఉపన్యాసంలాగా, ఒక పదునైన వాగ్దానంలాగా చురుక్కుమని ప్రకటిస్తాడు. అలాంటి పద్యం 1955లో రాసిన కవివాక్కు.

1955 నించీ తిలక్‌ మళ్ళీ కవిగా పుంజుకోవడం మొదలు పెట్టాడు.

వివేకం లేని ఆవేశం విపత్కరమౌతుంది
సంయమం లేని సౌఖ్యం విషాదకారణ మౌతుంది
సమ్యక్‌ సమ్మేళనం లేని తౌర్యత్రికం కఠోరమౌతుంది
కరుణ లేని కవివాక్కు సంకుచిత మౌతుంది !

ఇందులో ఆఖరి పంక్తిలో చెప్పిన కరుణ తిలక్‌ కవిత్వానికి ప్రాణభూతమైన అంశం. అందుకే అతని మాటలు మనస్సుల్లో సహజంగా ఉండి, అవతలి వాళ్ళ సంతోషాన్నీ, బాధనీ మనదిగా అనుభవించగల ఒక సహజమైన శక్తిని ఉద్దీపింపజేస్తాయి.

నేను బాధపడుతున్నానంటే ఏడుపు, అవతలి వాళ్ళు బాధపడుతున్నారంటే జాలి.

జాలిని కన్నీళ్ళుగా మార్చకుండా, ఆర్ద్రమైన కవిత్వంగా మార్చడం కవిగా తిలక్‌ మాటలకున్న శక్తి. పంక్తి పంక్తికీ ఎంత బరువు కావాలో ఎక్కడ తేలిగ్గా ఉండాలో, ఏ మాటని ఏ మాటతో కలిపితే అతను అంతకు ముందు చెప్పిన తౌర్యత్రికం (musical ensemble) మనని భౌతికస్థాయి నించి దాని పైమెట్టుకి తీసుకెళుతుందో తిలక్‌ పట్టుకున్నాడు. అతనివల్ల తెలుగు భాష కొత్త ప్రాణం పోసుకుంది. ఆర్తగీతం అనే ఆయన 1956లో రాసిన పద్యం అలాంటిది. అందులో నా దేశాన్ని గూర్చి పాడలేను అని కఠినంగా మొదలయ్యే పద్యం –

నీ కొత్త సింగారమ్ము వలదు, ఉదాత్త సురభిళాత్త
శయ్యాసజ్జితమ్ము వలదు,
రసప్లావితము వలదు
చిత్ర శిల్ప కవితా ప్రసక్తి వాంఛింపను, తత్వసూత్ర
వాదోక్తి చలింపను
సుందర వధూ కదుష్ణ పరిరంభముల రసింపను
గత చారిత్రక యశఃకలాపమ్ము వివరింపకు, బహుళ
వీరానేక గాథాసహస్రమ్ము వినిపింపకు
ఇంక నన్ను విసిగింపకు

ఈ చరణాలు ఒక్కటొక్కటిగా మనకి అలవాటైన మొద్దుబారిన అందాల పొరలని నిర్దాక్షిణ్యంగా వొలిచేస్తాయి. ఏ తొడుగులూ, ఏ కప్పులూ లేని నిరాచ్ఛాద్యమైన మనస్సు తరవాత రాబోయే చరణాలలో ఉన్న బాధనీ, వేదననీ శారీరకంగా తెలుసుకోవడానికి సిద్ధపడుతుంది. కష్టాలు ఊహలు కావు. ఊహలు మనస్సు పడేవి, కష్టాలు శరీరానికి నాటుకునేవి. ఆ తరవాతి పద్యం మన శరీరంలోకి ప్రవేశిస్తుంది, మన చర్మంలోకి వెళుతుంది. మనల్ని క్షోభ పెడుతుంది, హింస పెడుతుంది. ఈ పద్యం లోని ఆర్తి మన ఆర్తి అవుతుంది. అది మన నిస్సహాయతని బలంగా మారుస్తుంది.

ఈ పద్యం చదివినప్పుడల్లా ఈ మాటల్లోంచి తప్పించుకోలేను, కళ్ళముందు కనిపించే ఈ బొమ్మల్లోంచి బైట పడలేను అన్నంత భయం కలుగుతుంది. ఇది జాలి పద్యమా, లేదా నాకీ పద్యంలో ఉండడం ఇష్టంలేక ఇది నాకు ఇచ్చే ధైర్యాన్నీ, కసినీ, కోపాన్నీ భరించే శక్తిలేక నన్ను నేను తప్పించుకోడానికి నేను వేసుకున్న వ్యూహం మాత్రమేనా? ఈ పద్యం చదవడం కష్టం, చదివాక మరిచిపోవడం కష్టం.

తిలక్‌ ప్రపంచంలో సరదా కోసం రాసిన పద్యాలు – తపాలా బంట్రోతు మీద రాసిన పద్యంలో ఈ పంక్తులు తపాలానీ, బంట్రోతునీ దాటి, అతని మనస్సులోకీ విశాలమైన సముద్రంలాంటి ప్రపంచంలోకీ మనల్ని తీసుకు వెళతాయి.

ఉత్తరం యిచ్చి నిర్లిప్తుడిలాగ వెళ్ళిపోయే నిన్ను చూసినపుడు
తీరం వదిలి సముద్రంలోకి పోతూన్న ఏకాకి నౌక చప్పుడు

అందరికీ నచ్చి, అందానికి మారుపేరై అతడి పుస్తకానికి పేరై నిలబడ్డ కవిత అమృతం కురిసిన రాత్రి. జీవితం పట్ల అతనికున్న ఇష్టానికీ, జీవితంలో అతనికున్న గాఢమైన నమ్మకానికీ, బతుకు అందమైనది, బతకడమే సౌందర్యం అనే అతని సిద్ధాంతానికీ ఈ పద్యం కన్నా స్ఫుటమైన ఉదాహరణ మరొకటి లేదు. అమరత్వమంటే చచ్చిపోకుండా ఉండటం కాదు, అమరత్వమంటే బతికున్న క్షణాలు గాఢంగా బతకడం అని ఈ పద్యం పొడుగూతా మాట మాటా అలాంటి ఒక కొత్త లోకాన్ని ఆవిష్కరించి పెడుతుంది. కాంక్షా మధుర కాశ్మీరాంబరం, హసన్మందార మాల ఈ పద్య ప్రపంచాన్ని కొత్త చప్పుళ్ళతో ఆవిష్కరిస్తాయి. ఎవరికీ దొరకని రహస్యాల్ని వశపర్చుకున్నవాడు, జీవితాన్ని ప్రేమించినవాడు, జీవించడం తెలిసినవాడు అనే పంక్తులు, ఆ పద్యంలోనే చివర అలవాటునీ అస్వతంత్రతనీ కావిలించుకున్నారు, అధైర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు అనే పంక్తుల్ని హాయిగా విశాలంగా ఎదుర్కొంటాయి. పద్యనిర్మాణంలో మాటల కూర్పులో తెలుగులో ఉన్న గొప్ప పద్యాల్లో ఇదొకటి.

సరదాగా రాసినా, బాధగా రాసినా, ఉత్సాహంగా రాసినా, ఊరికినే రాసినా తెలుగు మాటలకి తిలక్‌ అప్పటికి అవసరమైన కొత్త ప్రాణం పోశాడు. రాజకీయాల అలజడిలో, సిద్ధాంతాల ఘర్షణలో కవిత్వానికున్న ప్రాణశక్తి బలహీనమై పోతున్న రోజులలో వాటినన్నీ తట్టుకుని, తిలక్ కవిత్వం కోసం ధైర్యంగా నిలబడ్డాడు. అప్పుడప్పుడు కార్టూను కవిత్వం, కేలండర్‌ కవిత్వం, అంతగా అవగాహన లేని రాజకీయ కవిత్వం తిలక్‌ రాయకపోలేదు. కానీ అవి కావు తిలక్‌ని మనకి గుర్తుండేలా చేసేవి. అవి అతని గాఢమైన కవితా వ్యక్తిత్వంలోంచి వచ్చినవీ కావు.

తిలక్ తన కవితా సామర్థ్యం పరమోచ్చదశలో ఉండగా అకస్మాత్తుగా చచ్చిపోయాడు. 1966 జులైలో అతను పోయేడని టెలిఫోన్‌ కబురు తెలిసేసరికి నేను నమ్మలేకపోయేను. ఏంచెయాలో తెలియక అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ నండూరి రామమోహనరావు గారికి ఫోన్‌ చేసి చెప్పాను. కాని అదే ఆంధ్రజ్యోతిలో అతని మరణవార్త చదివిన తరవాతగాని అతను నిజంగా పోయాడన్న సంగతి నాకు మనస్సుకి పట్టలేదు.

కవిత్వాన్ని వదిలేసి, కవిత్వం పేరుతో ఉపన్యాసాలూ, వచనకవిత్వం పేరుతో చాతకాని వచనమూ విశృంఖలంగా వస్తున్న ఈ రోజుల్లో ఏది కవిత్వమో ఏది కాదో తెలుసుకోగల శక్తి నశించిపోయి, ప్రచారం చేసుకోగల వాళ్ళకి బహుమానాలు, కాకా పట్టగలవాళ్ళకి కనకాభిషేకాలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో తిలక్‌ని మనం మరొక్కసారి జాగ్రత్తగా అతని పదవిన్యాసం కోసం, అతని పద్యనిర్మాణం కోసం, అతని ఊహగాఢత్వం కోసం, అతని ప్రపంచవైశాల్యం కోసం చదవడం అవసరం.
-----------------------------------------------------
రచన: వెల్చేరు నారాయణరావు, 
ఈమాట సౌజన్యంతో

Saturday, December 14, 2019

వెడలెను కోదండపాణి


వెడలెను కోదండపాణి



సాహితీమిత్రులారా!


ధగద్ధగాయమానమైన కిరీటం ధరించి మొహంలో వర్ఛస్సు తాండవమాడుతూంటే రావణుడు సభలో గర్వంగా చర్చిస్తున్నాడు తాను బ్రహ్మ ఇచ్చిన కోరికతో దాదాపు అమరుడైన సంగతి. తపస్సులో పది తలలూ అగ్నిలో ఆహుతి చేసి రావణుడు కోరుకున్న వరం – యక్ష, కిన్నర, కింపురుష, నాగ, గంధర్వ, దేవతలనుంచి మరణం ఉండకూడదు అని. సందేహంగా అడిగాడో మంత్రి రావణుణ్ణి:

“ఇంతమంది చేత మరణం లేకుండా వరం అడిగిన మహారాజు మానవుల గురించి అడగడం మర్చిపోయేరా? ఎందుకు వాళ్లని వదిలేసినట్టో?”

“మానవులు నాకు తృణప్రాయులు. అందుకే వాళ్ళని వదిలేశాను!”

“మరి ఆ మానవుల్లోంచే మనకి అపాయం వస్తే?”

“అదంత తలలు బద్దలు కొట్టుకునేంత విషయమా? ఇప్పటునుంచే మానవుడన్నవాడెవడు బాగా బలం పుంజుకోకుండా చేస్తే చాలదూ?” సమాధానం సేనాని ప్రహస్తుడు చెప్పేడు.

“మరి దానికి అనేక యుద్ధాలూ, జన నష్టాలూ…”

“జన నష్టాలు ఎలాగా జరుగుతూనే ఉంటాయి. యుద్ధం లేకపోతే వ్యాధులో, ప్రకృతి వైపరీత్యాలో వచ్చి జనం ఎప్పుడు చస్తూనే ఉంటారు కదా?”

“సరే. మనం ఇప్పుడు చేయవల్సిన కార్యం?”

“భూమండలం మీద ఉండే ఒక్కో రాజునూ ఓడించుకుంటూ పోవడమే. వేగుల్ని పంపించి ఎక్కడెక్కడ రాజులు బలం పుంజుకుంటున్నారో విచారించి ఎప్పటికప్పుడు వాళ్ళని అణిచేయడమే!”

“అలాగైతే మొదటి దండయాత్ర ఎక్కడ మొదలు పెడదాం?”

“ఇక్ష్వాకు రాజధాని అయోధ్య”

రాజ్యాలన్నీ జయించి విజయగర్వంతో తిరిగివచ్చిన రావణాసురుడు ముందున్న ప్రణాళికలు ఆలోచిస్తున్నాడు. ఎప్పటికప్పుడు వేగుల ద్వారా వినడం బట్టి బలం పుంజుకున్న ఏ రాజైనా సరే తలొంచి దేహీ అనకపోతే ప్రాణం తీయడమే. దిక్పాలకులని జయించిన తర్వాత పోనీ వరసకి అన్న అవుతాడు కదా అని కుబేరుణ్ణి చూసీ చూడకుండా వదిలేస్తే ఆయనే ఓ దూతని పంపించేడు తనకి సుభాషితాలు చెప్పించడానికి. ఎంత ధైర్యం? ఆ దూతని భక్షించి దండయాత్ర కెళ్ళేసరికి అంతటి ధనవంతుడూ తోకముడిచి పారిపోయేడు లంక లోంచి; పిరికిపంద. ఇప్పుడు సునాయాసంగా పుష్పకం, లంకానగరం చేతిలోకి వచ్చేయి. శత్రుశేషం మిగిలి ఉన్నంత వరకూ ఇలా చూస్తూ ఉండవల్సిందే. ఏ తరానికా తరాన్ని నాశనం చేయకపోతే ఏమో ఏ పుట్టలో ఏ పాము పుడుతుందో? గాలిలో, భూమ్మీద, ఇంట్లో, బయట, ప్రాణం ఉన్నదానితో గానీ లేనిదానితో గానీ చావు రాకూడదని కోరుకున్న హిరణ్యకశిపుణ్ణి ఆ పెద్దాయన ఎలా చంపేడో జగమెరిగిన సత్యం. ఎల్లకాలం అప్రపమత్తంగా ఉండవల్సిందే. అయినా ఇన్ని తరాల్లోనూ మానవమాత్రుడెవరూ తనముందు కత్తి ఎత్తలేకపోయేడు. వీళ్ళా నన్ను చంపేది? నవ్వొచ్చింది రావణుడికి. తాను కోరుకున్న కోరిక అద్భుతమైంది. బ్రహ్మ అమరత్వం ఇవ్వనంటే నేను సాధించుకోలే ననుకున్నట్టున్నాడు. అప్రయత్నంగా రావణుడి చేయి మీసం మీదకి పోయింది.

ఈ లోపుల ద్వారం దగ్గిర్నుంచి వినిపించిందో సేవకుడి కంఠం, “విభీషణులవారు మాట్లాడడానికి వచ్చారు. ఏమి శెలవు?”

“పంపించు.”

లోపలికొచ్చిన విభీషణుడు ఏమీ ఉపోద్ఘాతం లేకుండా చెప్పేడు. “అన్నా, ఇన్ని రోజులూ పుంజుకుంటున్న తర తరాల మానవులని చంపేం. మన రాజ్యం అప్రతిహతంగా సాగుతోంది. నయానో భయానో యక్ష, కిన్నర, కింపురుష, దేవతల్నీ జయించడం కూడా అయింది. ఇంక యుద్ధాలు మానడం మంచిదని నాకనిపిస్తోంది. మనకి లంకలో దుశ్శకునాలు కనిపిస్తున్నాయి; చచ్చిన రాజుల ఉసురు ఊరికే పోదు కదా? ఇప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది…”

ఏదో చెప్పబోతున్న విభీషణుణ్ణి అడ్డుకుని అన్నాడు రావణుడు. “నేను బ్రహ్మని కోరిన అసలు వరం మృత్యువు రాకూడదనే. విరించి అలా వరం తీర్చడం కుదరదన్నప్పుడు ఈ మానవులని వదిలేసి మిగతా వాళ్ళచేతుల్లో చావకూడదని కోరుకున్నాను. ఈ గడ్డిపరకలన్నింటినీ ఎప్పటికప్పుడు ఏరి పారేస్తూంటే నాకు మృత్యువనేదే లేదు. వీళ్ళని ఏరిపారేయడం కోసం ఆ మధ్య కైలాసం పైకెత్తి శివుణ్ణి మెప్పించాను కదా? ఆయనిచ్చిన చంద్రహాసంతో…”

విభీషణుడు నమ్మలేనట్టు చూసేడు రావణుడి కేసి. నోరు పెగుల్చుకుని అన్నాడు “అన్నా, నువ్వు నిజంగానే అమరుడవని నమ్ముతున్నావా?”

“ఎందుకా సందేహం?”

“నువ్వు కైలాసం పైకెత్తినప్పుడు నందీశ్వరుడిచ్చిన శాపం మర్చిపోయాయావా?”

రాజభవనం కదిలిపోయేలాగ నవ్వేడు రావణుడు తన పేరుని సార్ధకం చేస్తూ. “యముణ్ణి జయించిన నేను – ఇంద్రుణ్ణి జయించిన మేఘనాదుడూ, కుంభకర్ణుడూ, నువ్వూ నాకు అండగా ఉండగా – కోతి మూకల మూలంగా చస్తానా? ఎవడో ఒక ఎద్దు మొహంగాడు ఏదో అంటే దాన్ని పట్టుకుని నాకు పిరికిమందు పోయకు విభీషణా!”

శివ శివా! చెవులు మూసుకున్నాడు విభీషణుడు. “నేను చెప్దామనుకున్న విషయం విను. ఎప్పుడో ఇక్ష్వాకు వంశంతో మొదలుపెట్టి ఇప్పటిదాకా ప్రతీ తరం రాజునీ అణుస్తూనే ఉన్నాం. ఇప్పుడు అక్కడే ఉన్న అయోధ్య రాజు అణరణ్యుడనేవాడు బలం పుంజుకుంటున్నాడని వార్తలొస్తున్నాయి. ఇది చెప్పడం నీ ఆంతరంగికుల్లో ఒకనిగా నా బాధ్యత. యుద్ధం వద్దు అని చెప్పడానికి వచ్చాను ఎందుకంటే నువ్వు ఎంతమందిని ఎన్నిసార్లు అణిచినా మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు కానీ ఈ పరిస్థితిలో నేను చెప్పేది నీకు నచ్చేటట్టు కనిపించదు, శెలవు.”

రావణుడి సమాధానం కోసం చూడకుండా బయటకి నడిచేడు విభీషణుడు చిన్న బోయిన మొహంతో.

పదిరోజుల్లో అయోధ్య మీద విరుచుకు పడింది రాక్షససేన. పిరికివాడిగా పారిపోకుండా ధనుస్సు చేతబట్టుకుని బాణాలు సంధించేడు అనరణ్యుడు. పదితలల రావణుడి ముందా ప్రతాపం? రావణుడు వేసిన అస్త్రాలలో తలకి ఎనిమిదివందల బాణాలు తగిలి నేలకొరిగిపోయేడు మహారాజు. కొస ప్రాణంతో ఉన్న రాజుని చూడ్డానికొచ్చేడు రావణుడు ఠీవిగా నడుచుకుంటూ. కళ్ళెత్తి రావణుడికేసి చూసేడు అనరణ్యుడు. మొదట కనబడిన దృశ్యంలో రావణుడు నవ్వే విషపు నవ్వు క్రమక్రమంగా ఏడుపులోకి మారుతోంది. ఏడుస్తూన్న రావణుడు నేలమీద పడి పొర్లుతున్నాడు. పక్కనే ఓ ఆజానుబాహువు కిందపడిన రావణుడి కేసి జాలిగా చూస్తున్నాడు. పరికించి చూస్తే మొహం బ్రహ్మ వర్ఛస్సుతో సూర్యుణ్ణి తలపిస్తున్న ఆ ఆజానుబాహువు, సూర్యవంశపు రాజే! తర్వాతి దృశ్యంలో విగతజీవుడైన రావణుడు యుద్ధభూమిలో పడిఉన్నప్పుడు దేవతలు పుష్పవర్షం కురిపిస్తున్నారు ఆ ఆజానుబాహుడి మీద. ఏదో అర్ధమైనట్టూ, అనరణ్యుడు చెప్పేడు పైకి,

ఉత్పత్స్యతే కులే హ్యస్మిన్న్ ఇక్ష్వాకూణాం మహాత్మనాం
రాజా పరమతేజస్వీ యస్తే ప్రాణాన్ హరిష్యతి

“నీ ప్రాణాన్ని తీయడానికి త్వరలో ఓ మహాతేజస్వి నా కులంలో పుట్టబో….” ఈ మాటలు నోట్లోంచి వస్తూండగానే అనరణ్యుడి ప్రాణం అనంతవాయువుల్లో కల్సిపోయింది. ఎవరో ఛెళ్ళున చెంప మీద కొట్టినట్టూ రావణుడు కంగారు పడ్డాడు. వంధిమాగదులు చదివే స్తోత్రాలు కళ్ళు కప్పేసినా లంకకి రాగానే విభీషణుణ్ణి పిలిపించేడు మాట్లాడ్డానికి. అనరణ్యుడు ప్రాణం పోయే ముందు అన్న మాట చెప్పగానే విభీషణుడన్నాడు,

“అన్నా నందీశ్వరుడి శాపం మహత్తరమైంది. సందేహం లేదు. ఇప్పుడీ అనరణ్యుడు అన్న మాట చూస్తే ఈ మనుషులు ఎప్పటికప్పుడు బలం పుంజుకుంటున్నారనీ, మనుషుల్లోంచే నీ ప్రాణాంతకుడు పుట్టబోతున్నాడనేది తెలుస్తూనే ఉంది. ఇంతమంది ఉసురు మనకి అనవసరం. కాస్త ఆలోచించి చూడు. అనరణ్యుడు బలం పుంజుకుంటున్నాడని తెలుస్తోంది కానీ మనమీద యుద్ధానికి కాలు దువ్వలేదే?”

“విభీషణా, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే ఎలా?”

“దేనికీ అంత అప్రమత్తంగా ఉండడం?”

“రాబోయే చావుకి!”

“అది తప్పించగలవా?”

“మనుషులందర్నీ నా చెప్పుచేతల్లో పెట్టుకోగల్గితే, తప్పకుండా తప్పించుకోగలను.”

“ఎంతకాలం తప్పించుకోగలవు? ఎవరూ చంపలేకపోతే వ్యాధి రూపం లోనో, మరోవిధంగానో యముడు కాచుకుని కూర్చునుంటాడు కదా?”

“యముడా?” నవ్వేడు రావణుడు, “ఆయనకంత ధైర్యం ఉందా? నా చేతిలో ఓడిపోయేక నా కేసి చూడగలడా?”

“సరే, నీ ఇష్టం.” విభీషణుడికి ఒక్కసారి ఏదో స్ఫురించినట్లయింది.

“అన్నా, పుట్టిన ప్రతీ జీవి గిట్టక తప్పదనేది బ్రహ్మ వాక్కు. లేకపోతే ఆయన నువ్వడిగినప్పుడు అమరత్వం ఇచ్చి ఉండేవాడు కదా? నేను ఎంతచెప్పినా ఒకటే. నీ మీదకి దండయాత్రకి రాని మనుషుల మీద దాడి చేయడం అనవసరం. మానవమాత్రులు బలం పుంజుకుంటున్నారంటే వాళ్ళనో కంట కనిపెట్టడం మంచిదే కానీ ఇలా వార్త రాగానే ఏదో అత్యవసరం అన్నట్టు వాళ్లని చంపేసి రావడం ఎంతవరకూ సమంజసం? ఇది కూడా దాదాపు ఇష్టం లేని స్త్రీని బలాత్కరించడం వంటిదే. ఓ వేదవతి శాపం, రంభ ఇచ్చిన శాపం, కామధేనువు బిడ్డడైన నందీశ్వరుడి శాపం, ఇప్పుడు అనరణ్యుడు చెప్పిన వాక్కూ అవన్నీ ఒక్కసారిగా కలబడి మీద పడితే అప్పుడు చేసేదేమీ ఉండదు కదా? నువ్వు జగత్సంహారకుడైన శివుణ్ణి మెప్పించిన పులస్త్య బ్రహ్మ వంశ సంజాతుడివి. ఇంతటి నీచానికి దిగజారవల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆలోచించి చూడు.”

“నువ్వెన్ని చెప్పు విభీషణా, నేను ఈ మనుషులని అదుపులో ఉంచవల్సిందే.”

విభీషణుడు చెప్పేది మొదట్లో కాస్త విన్నట్టు అనిపించినా చావు గుర్తొచ్చేసరికి రావణుడు లేచిపోయేడు. విభీషణుడు నిట్టూర్చేడు.

కుటీరం బయట చెట్టునీడలో కళ్ళు మూసుకుని కూర్చున్నాడు విశ్వామిత్రుడు. కొద్దిరోజుల క్రితం తాను చేయబోయిన యాగం గుర్తొచ్చింది. యాగం మొదలయేలోపుల అగ్ని ఆరిపోయేది. సమిధలు మాయమై వాటి స్థానే ఎముకలు కనిపించేవి. ఈ పనులన్నీ మారీచ సుబాహులవే. వీళ్ళకి తోడు ఆ తల్లి తాటకి ఒకత్తె. ఈ కుర్ర కుంకల్ని చంపడం పెద్ద పని కాదు కానీ ఇన్ని వేల ఏళ్ళు తపస్సు చేసి తన శతృవు చేత బ్రహ్మర్షి అనిపించుకున్న తనకి యాగం చేసే సమయంలో కోపం రాకూడదు. అయినా ఈ రాక్షసులకి ఇంతబలం రావడానిక్కారణం వీళ్ళ పైనున్న దశకంఠుడిది. వాడి అండ చూసుకునే కదూ పేట్రేగిపోతున్నారు. ఏదో ఒకనాడు తనకి కోపం తెప్పించి ఎలాగోలా యుద్ధానికి రప్పించడానికి పది తలలతో విశ్వప్రయత్నం చేస్తున్నాడు. వీడి చావు ఎవరి చేతుల్లో ఉందో? ఈ యాగం ప్రస్తుతానికి ఆపి ఏదో ఒకటి ఆలోచించాలి…

బిగ్గరగా ఏడుస్తున్న ఓ స్త్రీ కంఠం వినిపించి కళ్ళు తెరిచి చూసేడు మహర్షి. నడుము వంగిపోయి చింపిరి జుట్టుతో నేలమీద పడి పొర్లుతూ ఏడుస్తోందో స్త్రీ.

“ఏమమ్మా? ఏమైంది?” అడిగేడు ఆతృతతో.

ఏడుపు ఆపి ఆవిడ చెప్పిన కధ అంతా విన్నాడు. కోపంతో మొహం జేవురించింది. జరగబోయేది చూడడానికా అన్నట్టు ఒక్క క్షణం ధ్యానంలో కళ్ళు మూసుకున్నాడు.

“విచారించకు. నువ్వు అయోధ్యకి వెళ్ళి అక్కడున్న ఇక్ష్వాకు మహారాజు దశరధుడితో నేను నిన్ను ఆశ్రయం కోసం పంపించాననీ, రాబోయే రోజుల్లో వచ్చి కలుసుకుంటాననీ చెప్పు. నీకీ గతి పట్టించినవాణ్ణి సర్వనాశనం చేయడానికీ నీచేత్తోటే బీజం వేద్దువు గాని. ఆలశ్యం చేయకుండా బయల్దేరు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన ఈ విశ్వామిత్రుడి మాట జరిగి తీరుతుందని గుర్తు పెట్టుకో.”

ఆవిడటు వెళ్ళగానే కళ్ళుమూసుకున్నాడు విశ్వామిత్రుడు. ఈ సారి మనసుని దొలిచే ప్రశ్న ఒకటే. ఈ రావణుడి చావు ఎవరిచేతిలో రాసిపెట్టి ఉందో? ధ్యానంలో ఖంగు ఖంగుమని మోగే ధనుష్టాంకారం వినిపిస్తోంది. పినాకపాణిదా? మరి పరమ శివుడు రావణుడికి చంద్రహాసం ఇచ్చినట్టు విన్నాడే? కొద్ది క్షణాల్లో ఆ ధ్వని ఎవరిదో తెలిసింది. సుదర్శనమూ, నందకమూ ఎప్పటికప్పుడు స్వామి అడగకుండానే సిద్ధంగా ఉంటాయి కనక శార్గ్య ధనువుకి ఇప్పటిదాకా ఏం చేయడానికీ అవకాశం రాలేదు. ఇప్పుడు ధనువుదే అవకాశం. అదన్నమాట ధ్వని. మరి ఇంతటి రాక్షస కులాన్ని నిర్మూలించడానికి, ఎక్కడో మూలనున్న రావణుణ్ణి ఆ స్వామి ఎలా చేరతాడో? శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని లంఘించవద్దూ? అయినా ఇంత ఆలోచన దేనికీ? తన పని ఏమిటో తెల్సింది కదా? తను సాధించిన శస్త్రాస్త్ర సంపదంతా ఆయన ధారాదత్తం చేస్తే చాలు. సాగర లంఘనం, రావణ సంహారం అవన్నీ ఆయనే చూసుకోడూ? సాగర లంఘనం ఓ పెద్ద పనా? ఏ కోతైనా దూకగలదు కావాల్సివచ్చినప్పుడు.

కిచకిచ చప్పుళ్లకి ధ్యానభంగమై కళ్ళు తెరిచేడు. ఎప్పుడొచ్చాయో చెట్టుమీద కోతులన్నీ దిగి చుట్టూరా కూర్చొనున్నాయి. ఇదన్నమాట అసలు రహస్యం. వీటితోటే ఆయన కావాల్సిందీ, చేతనైనదీ చేస్తాడు. తనపని తాను చేయడమే. లేచి కుటీరం లోకి వెళ్ళి ఉన్న పళ్ళు అన్నీ తెచ్చి కోతుల గుంపు ముందు పెట్టేడు తినడానికి.

“మహారాజు మీ కోసం ఒక కొత్త దాసిని పంపించారు, లోపలకి పంపమన్నారా?” కైకని అడిగింది ద్వారం దగ్గిర మనిషి.

“ఇదెప్పట్నుంచి? నా దాసీలని నేను చూసుకోలేనా? సరే పంపించు.”

“ఏమిలా వచ్చావ్?” లోపలికొచ్చిన గూని మనిషిని చూసి కొంత జాలితో అడిగింది కైక.

“నా కుటుంబం అంతా సర్వ నాశనం అయింది తల్లీ. దిక్కులేక కడుపుచేత్తో పట్టుకుని విశ్వామిత్రుల వారి ఆశ్రమానికి వెళ్తే, రాజు గారి దగ్గిరకి వెళ్ళమనీ మీరు ఆశ్రయం ఇస్తారనీ చెప్తే ఇలా వచ్చాను.”

“నీ పేరు?”

“మంధర.”

“నీ కుటుంబానికి ఏమైంది?”

మంధర తన కధ చెప్పడం మొదలుపెట్టింది. “మేము రాజ కుటుంబీకులమే. ఓ రోజు చెప్పా పెట్టకుండా యుద్ధం అన్నారు. దాడి చేసేది ఎవరో, ఎందుకో అవన్నీ తెలియవు. ఇంట్లోంచి బయటకొచ్చే వీలు లేదు. మహారాజు ధనుర్బాణాలు పూని బయటకెళ్ళిన మూడు గంటల్లో పంచత్వం పొందారని వినికిడి. యుద్ధం నెగ్గిన వాడు రావణుడనే రాక్షసుడనీ ఎక్కడో దక్షిణంగా ఉన్న లంకానగరంలో ఉంటాడనీ చెప్పుకున్నారు. ఆ తర్వాత రెండురోజుల్లో మా రాజ్యంలో ఇళ్ళన్నీ వెదికి వెదికి మరీ రాజ కుటుంబీకులని చంపేశారు. ఆడా లేదు మగా లేదు కనిపించిన ప్రతీ ప్రాణాన్నీ తీయడమే. నేను పారిపోయి దాక్కున్నాను కనిపించకుండా. మొత్తం రాజ్యం అంతా నాశనం చేసి ఇళ్ళన్నీ తగలబెట్టేశారు. అవన్నీ అంటుకుపోతూంటే వాటి మధ్యలో ఈ రాక్షసులందరూ వికృతంగా పైశాచికానందంతో నాట్యం చేయడం! బయటకి వచ్చి చూస్తున్న నన్ను కూడా చంపడానికొచ్చేరు మీదకి. కాళ్ళావేళ్ళా పడి బతిమాలాను నన్ను వదిలేయమని. ఎందుకో కనికరించి వదిలేసినా చివరగా వెళ్ళిపోయేటప్పుడు నన్నో నాలుగు తన్నులు తన్ని గుర్రంతో తొక్కించి వెళ్ళేరు. ఆ గాయం మానేసరికి నేను గూనిదానిలా తయారయ్యేను. ఎక్కడికెళ్ళాలో తెలియని పరిస్థితి. అష్టకష్టాలు పడి విశ్వామిత్రులవారి ఆశ్రమానికి చేరాను. పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు నా ఖర్మకి? మహారాజు దగ్గిరకి వెళ్ళమని పంపించేరు. చూశావుటమ్మా? నేను ఒక్కత్తినీ అసలు ఎందుకు బతకాలో? ఎవరి కోసం?…” దుఃఖంతో ఇంక నోట మాట రాక చెప్పడం ఆపింది మంధర.

మౌనంగా ఉన్న కైక నోరు తెరిచింది. “మంధరా, ఇప్పుడు నువ్వు వచ్చినది రఘువంశ మహారాజు దశరధుడి దగ్గిరకి. రఘువెటువంటివాడో, సూర్యవంశం ఎటువంటిదో నీకు తెలియకపోవచ్చు. నిన్ను ఇక్కడకి విశ్వామిత్రులవారు పంపించారంటే అందులో మనకి తెలియని నిగూఢ రహస్యం ఏదో ఉందన్న మాట. చూద్దాం ఏం జరగబోతోందో. ఈ రాజభవనం నీ ఇల్లే అనుకో. నీ చేతనైన సహాయం చేస్తూండు. మా పూర్వీకులని కూడా రావణుడు చంపాడని నేను విన్నాను. ఏదో ఒకరోజు వాడికి ఆయుర్దాయం తీరిపోతుంది.”

ఏళ్ళు గడుస్తున్నాయి. మంధర కిప్పుడు కూటికీ గుడ్డకీ లోటులేదు కానీ నా అన్నవాడెవడూ లేడు. ఒంటరి బతుకెంత దుర్భరమో అనుభవించేవారికి తప్ప ఇంకెవరికీ తెలియదు. మంధర ఆలోచించేది: కారణం లేకుండా తన వంశాన్ని నిర్మూలించిన దశకంఠుడి మీద పగ చల్లారేలా లేదు. ఎక్కడి లంకా నగరం? ఎక్కడి రావణుడూ? తన పగ ఎప్పటికి చల్లారేను? కాలం గాయాల్ని మాన్పుతుందా? మరి తన పోయేలోపుల రావణుడి చావువార్త తనకి చేరేదెలా? పిల్లలు లేరని మహారాజు చేసిన పుత్రకామేష్టి తర్వాత పుట్టిన నలుగురి పిల్లలతోటీ ఈ రాణులకి సరిపోతోంది సమయం అంతా. ఎంత అణుచుకుందామన్నా తగ్గని కోపం ముందు తననే చంపేసేలా ఉంది. రావణుడికేం? ఎన్ని రాజ్యాలు తగలబెట్టినా వాడి బతుకు బ్రహ్మాండంగానే ఉంది. ఇదేనా ధర్మం? సరే రేపు ఎలాగా విశ్వామిత్రులవారు అయోధ్య వస్తున్నట్టు వార్త వచ్చింది. నన్ను ఇక్కడకి పంపించింది ఎందుకో ఆయన్నే అడుగుదాం. అంతటి మహర్షి మాట వ్యర్ధమౌతుందా?

మర్నాడు మహారాజును కల్సుకోవడానికి విశ్వామిత్రుడు బయల్దేరుతూంటే ఎదురొచ్చింది మంధర. చిరునవ్వుతో పలకరించేడు మహర్షి. పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకున్నాక అంది మంధర, “ఎన్నాళ్ళిలా బతుకు ఈడవమంటారు? నా బతుక్కో గమ్యం లేనట్టుంది. నేను బతికి ఏం ప్రయోజనం? మమ్మల్ని సర్వనాశనం చేసిన వాడు బాగానే ఉన్నాడు.”

“మంధరా, నేను చెప్పినది అక్షరం కూడా పొల్లుపోదు. ఇప్పుడు నేను వచ్చింది మహారాజు కొడుకులకి అస్త్రవిద్య అంతా నేర్పడానికే. ఇవి నేర్చుకున్న వాళ్ళే రావణుణ్ణి చంపడానికి అర్హులు. ఈ అస్త్ర సంపద ఇవ్వడం వరకే నా బాధ్యత. మరి తర్వాత, ఈ రాజు కొండలూ, కోనలూ, అడవులూ, నదీ నదాలు దాటుకుంటూ ఎలా ఎక్కడికి రావణుణ్ణి వెతుక్కుంటూ వెళ్తారనే దానితోటి నాకు సంబంధం లేదు. నేను నా బాధ్యత తీర్చుకోవడానికొచ్చాను. ఇది అయ్యాక మిగిలిన విషయాల్లో ఎవరి పని వాళ్ళు చేయడం జరుగుతుంది. మరి నేనేం చేయాలి అని నన్ను అడక్కు. నువ్వేం చేయాలో కాలమే చెప్తుంది. సమయం ఆసన్నమైనప్పుడు నువ్వు కాళ్ళు ముడుచుకుని కూర్చున్నా, అది నిన్ను కాళ్ల మీద నిలబెట్టి బలవంతగా ఆ పని చేయిస్తుంది. జాగ్రత్తగా గమనిస్తూ ఉండు.” మహర్షి ముందుకి సాగిపోయేడు పన్నెండేళ్ళ కుర్రాళ్ళని భవిష్యత్తులో అసమాన ధనుర్వేత్తలుగా చేయడానికీ, మొదట్లో కొంచెం బెంగపడినా ఇక్ష్వాకు రాజులు ఇచ్చినమాట ఎలా నిలబెట్టుకుంటారో ప్రపంచానికి చూపించడానికీను.

మంధరకి ఒక్కసారి చిక్కుముడి వీడిపోతున్నట్టనిపించింది. ఇదా సంగతీ? ఈ నలుగురు పిల్లల్లో ఎవరో ఒకరు రావణుణ్ణి చంపుతారన్నమాట. హమ్మయ్యా, ఇన్నేళ్లకి నా కష్టాలు పోయే రోజు దగ్గిర్లోనే ఉందా? చూద్దాం ఈ నలుగురి పిల్లల్లో ఎవరికి అర్హత ఉందో ఈ ఋషి ఇచ్చే ధనుర్విద్య నేర్చుకునే తాహతూ అదీని. ఓ సారి ధనుర్విద్య నేర్చుకునేవాడెవడో తెలిస్తే తర్వాత జరగబోయేది ఆలోచించవచ్చు.

సాయంకాలానికి వార్త తెలియనే తెల్సింది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులని కూడా పంపమంటే దశరధుడు వాళ్ళు చిన్నపిల్లలనీ, వాళ్లని వదిలేయమనీ, కావలిస్తే తాను వస్తాడనీ బతిమాలినా వశిష్టులవారి ప్రోద్బలంతో ఒప్పుకున్నాడు. మంధర మొహంలో కనిపించిన చిరునవ్వు క్రమంగా పెద్దదైంది. కుర్రాళ్ళని పంపించమంటే నేను వస్తాను, వీళ్లని వదిలేయండి అన్నాట్ట. ఈ ముసలి రాజేం చేయగలడు రావణుణ్ణి? ఈయనకేమైనా చేతనైందా? పుత్రకామేష్టిలో బయటకొచ్చిన యజ్ఞ పురుషుడు పాయసం ఇచ్చింది ఇందుకేనన్న మాట. ఆ పాయసంలో ఎక్కువ భాగం కౌసల్యకి ఇచ్చ్చినప్పుడు రాజుగారికి ఆవిడంటే మహా ప్రేమ అని అందరూ అనుకోలేదూ? ఇప్పుడర్ధమౌతోంది. అధికభాగం పాయసం తీసుకున్న కౌసల్య కొడుకేనా రావణుణ్ణి చంపబోయేది? అన్నం తినకుండా చందమామ కావాలని పేచీ పెడితే అద్దం చూపించి రామచంద్రుడనీ, మంత్రి భద్రుడు ఎత్తుకున్నప్పుడు రామభద్రుడనీ పిలిపించుకున్న ఈ నీలమేఘశ్యాముడే, రావణుడంతటివాణ్ణి చంపేదీ? మనసు తేలికైంది మంధరకి. ఇంక చూద్దాం ఇప్పుడు ఈ కుర్రాళ్ళు గానీ ఏదో విధంగా, రావణుడితో యుద్ధానికెళ్ళారా? అప్పుడు విశ్వామిత్రుల వారివ్వబోయే అస్త్రాలతో వాణ్ణి చంపడం ఖాయం. అంతట్లోనే మరో సందేహం. మీసం కూడా రాని పాల బుగ్గల పన్నెండేళ్ళ కుర్రాళ్ళు రావణాసురుడంతటివాడి మాయలు ఎదుర్కోగలరా?

తర్వాత మూడు నెలల్లో జరిగిన ఎన్నో అద్భుతాలు ఒక్కొక్కటీ మంధరకి తెలిసొచ్చాయి. తాటకిని చంపి మొదట అస్త్ర విద్య నేర్చుకున్నది రాముడు. రాముడి వెంటే నీడలా ఉండే తమ్ముడికి ఆ తర్వాత. దుమ్మూ ధూళీలో రాయిలా పడి ఉన్న అహల్య రామ పాదం సోకి మామూలు మనిషైంది. మహామహులైన రాజులెవ్వరూ ఒక్క అంగుళం కూడా ఎత్తలేని శివధనుస్సుని రాముడు అవలీలగా పైకెత్తి నారి సంధించబోయేసరికి మిన్ను విరిగి మీదపడ్డట్టూ ముక్క ముక్కలైంది. ఆ తర్వాత మిథిలా నగరంలో జరిగిన కళ్యాణంలో, జానక్యాః కమలామలాంజలి పుటేః యాః పద్మరాగాయితః అనే విశేషం ప్రతీనోటా విన్నదే. అయోధ్యకు వస్తుంటే అడ్డొచ్చిన పరశురాముడంతటివాణ్ణి ఈ కుర్రాడు నిలువరించాడు. అసలు ఇంతకాలం రాముడు ఇంట్లో ఉండిపోబట్టే ఇవన్నీ జరగలేదు కాబోలు. ఈ అద్భుతాలన్నీ జరగడానికి రాముణ్ణి పంపించమంటే జరగక్కుండా ముసలి రాజుగారు అడ్డుకోబోయేడు. దీనికన్నా విచిత్రమేమిటంటే ముందు, మా పిల్లల్ని పంపలేను బాబోయ్! అని నెత్తీ నోరూ కొట్టుకున్న ఆ ముసలి రాజే మనసు కష్టపెట్టుకుంటూనో మరో విధంగానో ఋషి కూడా పంపించేడు. ఇదే కాబోలు కర్మ ఫలం అనుభవించడమంటే. మహర్షి చెప్పినట్టూ నేను ఈ పని చేయను అనేవాడే కర్మ పరిపాకం కాగానే చేయనన్న ఆ పనే చేసి తీరుతాడు కాబోలు.

వినయమునను కౌశికునివెంట జని నాంఘ్రులను జూచేదెన్నటికో, అందువెనక రాతిని నాతిజేసిన చరణములను జూచేదెన్నటికో, చనువున సీతను బొట్టుగట్టిన కరమును జూచేదెన్నటికో, మున భృగుసుతుచాపబలమందుకున్న బాహువు జూచేదెన్నటికో అనుకుంటూ ఈ రాముణ్ణి చూడకుండా ముగ్గురు రాణులూ, తానూ ఈ మూడు నెలలూ ఎలా బతికారో? ఇంతకన్నా విశేషాలేం కావాలి? రాముడే తన కక్ష తీర్చగలవాడు. ఇప్పటి నుంచి ఇంక ఆలోచించవల్సింది ఈ రాముణ్ణి ఎలా రావణుడితో యుద్ధానికి ఉసిగొలపాలనేదే. అయ్యో, ఈ యుద్ధం కాని ఏదో విధంగా వస్తే పాపం ఇప్పుడే అత్తవారింటికొచ్చిన కొత్త పెళ్ళికూతురు ఎలా ఓర్చుకుంటుందో? ఏదైనా తాను కొన్నాళ్ళు ఆగి మహర్షి చెప్పినట్టూ వేచి చూట్టం తప్ప మరేం చేయలేదు. అయినా ఏ కారణం పెట్టి రాముణ్ణి యుద్దానికి పురికొలపడం? రావణుడు ఎక్కడుంటాడో, వాణ్ణి చంపడానికెన్నాళ్లు పడుతుందో? చూస్తూ చూస్తూ తన స్వహస్తాలతో ఎత్తుకుని ఆడించిన ఈ చంటిబిడ్డని కైలాసం ఎత్తి శివుడి దగ్గిర్నుంచి మహత్తరమైన ఖడ్గం సంపాదించిన ఆ రావణుడి మీదకి పంపడానికి చేతులెలా వస్తాయి తనకి? ఒక్కసారి మనసంతా పాడైపోయింది మంధరకి.

రాత్రి నిద్రలో కల. ఒకప్పుడు తమ రాజ్యం మీదకి దండెత్తుకొచ్చినట్టే అయోధ్య మీదకి రావణుడు దండయాత్ర కొచ్చేడు. కారణం ఏమీ లేదు. ముసలి రాజు గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చుంటే రాముడు ధనుస్సు తీసి బాణం సంధించేడు. ఆ బాణం వింటిని దాటకుండానే రావణుడు విసిరిన ఖడ్గంతో రాముడి తల తెగి కిందపడింది. రక్తం ఓడుతున్న యుద్ధభూమిలో ఈ ముగ్గురు రాణులూ జుట్టు విరబోసుకు ఏడుస్తూంటే, ఇంకా యవ్వనం రాని పసిపిల్ల జానకికి ఏం చేయాలో, ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. చటుక్కున మెలుకువ వచ్చింది మంధరకి. ఛీ, ఎంత పీడ కల? రామ రామ, రామ రామ రక్తవర్ణం, రామ రామ, రామ రామ రాక్షసాంతకం. నా కక్ష తీరక రావణాసురుడు చావకపోయినా నాకొచ్చిన ఈ కల నిజం అవకుండు గాక. జీవితంలో నాకొచ్చిన కష్టాలు ఈ అయోధ్య ప్రజలకి రాకుండు గాక. ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేసినా మంధరకి నిద్ర కరువైంది.

మనశ్శాంతి కోసం మరోసారి విశ్వామిత్రుణ్ణి చూడడానికి బయల్దేరింది. చుట్టూరా ఉన్న ఆయన శిష్యులతో కూర్చునుండగా నారదుడొచ్చేడు. కుశలప్రశ్నలయ్యేక అడిగేడు “మహర్షీ, మీరిచ్చిన అస్త్రాలన్నింటితో రాముడు రావణుణ్ణి చంపడానికి వెళ్తాడనుకుంటూంటే ఇక్కడ ఆ కుర్రాడు కళ్యాణం చేసుకుని సంసారం మొదలు పెట్టబోతున్నాడా? మరి ఈయన సంసారంలో పడితే ఈ దండకారణ్యంలో రాక్షసులూ ఆ మూలనున్న రావణుడూ చచ్చేదెలా? ఎంతకాలం ఈ నవగ్రహాలన్నీ వాడి మాట వింటూ ఉండాలి? పూర్ణచంద్రుడి తర్వాత అమావాస్య దాని తర్వాత మళ్ళీ చంద్రోదయం రావాలి కదా?”

“ఎందుకంత ఆదుర్దా నారదా? ఏదో విధంగా రాముడు కనక జనస్థానం దాకా వెళ్ళాడా, అక్కడున్న రాక్షసులు ఇతని మీద పడడం ఖాయం. అక్కడ్నుంచి ఒక్కొక్కటీ అవే గొలుసులా రావణుడి దగ్గిరకి దారి చేసుకుంటూ పోతాయి.”

“నారాయణ, నారాయణ. మరి సృష్టికి ప్రతిసృష్టి చేసిన మీ అంతటి మహామహులే వెళ్ళి రాముణ్ణి కూడా పంపమంటే కడుపూ కాళ్ళూ కొట్టుకున్న దశరధుడు రాముణ్ణి ప్రతీ అంగుళం కౄర రాక్షసులతో నిండి ఉన్న జనస్థానం దాకా వెళ్లనిస్తాడా? నేను కూడా వస్తా అనడూ?”

“అనొచ్చు, అనకపోవచ్చు. కూడా దశరధుడు జనస్థానం దాకా వెళ్లినా వెళ్ళకపోయినా రాముడు వెళ్ళవల్సిందే.”

“మరి రాముణ్ణి అయోధ్యలోంచి బయటకి రప్పించడం ఎలా?”

“ఎవరో ఏదో విధంగా చేయాలి తప్పదు.” విశ్వామిత్రుడీమాట అంటూ ఓరగా మంధర కేసి చూసేడు. మంధర వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది. వడివడిగా లేచి ఇంటికొచ్చిందన్నమాటే గానీ చాలా రోజులదాకా మహర్షి చూసిన చూపు మంధరని రాముడు సంధించిన వెనుతిరగని బ్రహ్మాస్త్రంలా వెంటాడుతూనే ఉంది.

కాలం గడిచి రాముడిప్పుడు ఇరవై అయిదేళ్ళ వాడయ్యేడు. మంధర జోల పాట పాడుతూంటే నిద్రలోకి జారుకున్న ఒకప్పటి పాల బుగ్గల కుర్రాడిప్పుడు నల్లని వాడు, పద్మ నయనంబుల వాడు, మహాశుగంబులున్ విల్లును దాల్చు వాడు, గడు విప్పగు వక్షము వాడు, మేలు పై జల్లెడు వాడు, నిక్కిన భుజంబుల వాడు, యశంబు దిక్కులన్ జల్లెడు వాడు. రాముడెలా ఉన్నా, మంధర బతుకు మాత్రం ఇలా కొట్టుమిట్టాడుతూండగానే ఓ రోజు పిడుగులాంటి వార్త. మహారాజు విశ్రాంతి కోరుకుంటూ రాముణ్ణి రాజుగా అభిషేకించబోతున్నాడు. ఓ విధంగా ధర్మమూర్తి అయిన రాముడు రాజైతే ప్రజలందరికీ మంచిదే. మరి ఇక్కడ రాముడికి శస్త్రవిద్యంతా పట్టుబడిందనీ, రాజౌతున్నాడనీ తెలిస్తే రావణాసురుడు యుద్ధం ప్రకటించడూ? కైకమ్మ చెప్పడం ప్రకారం అనరణ్యుడి తోటీ, మాంధాత తోటీ ఈ రావణుడు యుద్ధాలు చేయలేదా? వాళ్ళని ఓడించలేదా? తమ రాజ్యంలాగే అయోధ్య, ఇక్ష్వాకు వంశం కూడా సర్వ నాశనం అవబోతున్నాయా? మరి రాముడు ఇక్కడ రాజ్యం ఏలుతూ కూర్చుంటే రావణుణ్ణి చంపేదెప్పుడూ? పరధ్యానంగా నడుస్తూ కైక మందిరం లోకి వచ్చింది మంధర.

“మంధరా ఇది విన్నావుటే, రాముడు మహరాజు కాబోతున్నాడు!” సంతోషంగా అడుగుతోంది కైక. చూడబోతే కైక కాళ్ళు నేలమీద ఆనుతున్నట్టు లేదు. ఆవిడ సంతోషం ఆవిడది.

“విన్నానమ్మా, నాకూ సంతోషమే.”

“అలా నీరసంగా అంటావేమే?”

“నా కుటుంబం గుర్తొచ్చి అలా అనిపించింది. ఏమనుకోకమ్మా.”

“అవునా? పోనీలే, ఎందుకంతగా గుర్తు తెచ్చుకోవడం ఆ పాత విషయాలు?”

“ఓ సారి రాముడు రాజైతే మళ్ళీ అకారణంగా రావణాసురుడొచ్చి యుద్ధం ప్రకటిస్తాడేమో, ఈ అయోధ్య కూడా మా రాజ్యం లాగానే సర్వనాశనం అవుతుందేమో అనే భయం నన్ను నిద్ర పోనీయట్లేదమ్మా.”

కైక ఒక్కసారి ఆలోచనలో పడింది. మంధర చెప్పింది నిజమే. పాతికేళ్ళ రాముడు యుద్ధాల్లో చేయి తిరిగిన రావణుడి ముందు నించోగలడా? కైకకి ఒక్కసారి రాముడు విశ్వామిత్రుడి దగ్గిర శస్త్రాస్త్రాలు సంపాదించడం, శివధనుస్సు ఎక్కుపెట్టడం గుర్తొచ్చాయి.

“అవన్నీ ఆలోచించకు మంధరా, రాముడి దగ్గిర దివ్యాస్త్రాలు ఉన్నాయి కదా?”

తనకి వచ్చే పీడకలల్లో రాముడు రావణుడిచేతిలో ఎలా ఓడిపోయాడో, రాముడు వేసే అస్త్రాలన్నీ ఎలా పనికిరాకుండా పోయాయో రాముడు పోయాక ముగ్గురు రాణూలూ ఎలా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారో అన్నీ విపులంగా చెప్పి అంది మంధర,

“ఏమోనమ్మా, రావణుడు మమ్మల్ని వంశాంకురం అనేది లేకుండా నాశనం చేశాడు. ఇక్కడేం జరుగుతుందో ఏం చెప్పగలం?”

“మరి ఇప్పుడు ఏమిచేద్దాం?”

“నాదగ్గిర చిన్న ఉపాయం ఉంది మరి మీకు నచ్చుతుందో లేదో?”

“చెప్పు చూద్దాం?”

“వద్దులెండి. అది మీకూ నాకూ మంచిది కాదు.”

“అదేం?”

“మీరూ మీ ఇద్దరి సవతులూ రాముడు లేకుండా బతకలేరనే మాట అందరికీ తెల్సిందే కదా? ఇంక మహారాజు రోజూ రాముడి మొహం చూడకపోతే ప్రాణంతో ఉండలేరు. రాముని తమ్ముళ్ళ సంగతి చెప్పేదేముంది? నేను చెప్పేది ఏమో ఎటు తిరిగి ఎటు వస్తుందో? వద్దులెండి.”

“మరి ఈ గండం గడవడం ఎలా? చెప్పు చూద్దాం అసలు.”

“సరే అయితే, మరో మాట. ఇలా చెప్పినందుకు నా మీద కోపం తెచ్చుకోనని మాట ఇస్తేనే చెప్తాను.”

“సరే”

“రాముణ్ణి ఏదో విధంగా అడవుల్లోకి పంపించగల్గితే అక్కడ్నుంచి ఒక్కో రాక్షసుణ్ణీ చంపుకుంటూ చివరకి రావణుణ్ణి చంపడం కుదురుతుందని విశ్వామిత్రులవారు అనడం విన్నాను.”

“ఎన్ని రోజులు వెళ్ళాలి అడవుల్లోకి?”

“ఏమో, రెండు మూడు రోజులు సరిపోవు కదా? జనస్థానం నుంచి దండకారణ్యం దాకా నేల ఈనినట్టు కాచుకుని ఉన్నారు రావణ సేన. ఎన్ని వేలమంది ఉన్నారో ఎవరికెరుక? మరో మాట కైకమ్మా, రాముడు ఒంటరిగా వెళ్తేనే మంచిది అడవుల్లోకి. మళ్ళీ మందీ మార్బలంతో వెళ్తే, ఈ వార్త రావణుడికి చేరిందా వాడే వచ్చి యుద్ధం ఆరంభించవచ్చు. అనవసరపు జనక్షయం. మనలో రాముడు తప్ప మహారాజుతో సహా మిగతావారంతా తోక ముడిచే వీరులనే సంగతి మీకూ తెలుసు కదా?”

“ఒక్కడూనా?” కైక ఆశ్చర్యపోయింది.

“అవునమ్మా అలా వెళ్తేనే యుద్ధ ధర్మం ప్రకారం రావణుడు ఒక్కడూ వస్తాడు యుద్ధానికి. ప్రజలందర్నీ చావకుండా రక్షించవచ్చు. ఇంతకుముందు మా రాజ్యంలో జరిగిన మారణకాండ గుర్తు పెట్టుకుని చెప్తున్నాను. ఒక్కడి కోసం రాజ్యంలో ప్రజలనందర్నీ పణంగా పెట్టడం దేనికీ?”

“మరి రాముడు ఒక్కడూ రావణుణ్ణి ఎదుర్కోగలడా?”

“మీరే చెప్పారు కదా? ధనుర్విద్యలో రాముడంతటివాడు లేడనీ? ఇంకా సందేహిస్తున్నారేం? విశ్వామిత్రుడంతటి ఋషి ఇచ్చిన అస్త్రాలు అత్యంత శక్తివంతమైనవి కాదూ? రాముడు ధనుష్టాంకారం చేసి యుద్ధంలో నిలబడితే ఎవరమ్మా ఎదురు నిలవగలిగేది?”

కాసేపు మౌనం తర్వాత సాలోచనగా అంది కైక “పధ్నాలుగు రోజులు నేను రాముణ్ణి చూడకుండా ఉండగల్ను. పూర్వం విశ్వామిత్రుడికి దగ్గిరకి పంపినట్టే ఈసారి కూడా రాముణ్ణి అడవుల్లోకి పంపమని మహారాజునీ ఒప్పించగలననుకో. కౌసల్యనీ, సుమిత్రనీ కూడా ఎలాగోలా ఒప్పించగలను కూడా. అంతవరకూ అయితే సరే. ఆ పైన నగుమోము కలవాని నా మనోహరుని, జగమేలు శూరిని జానకీ వరుని, సుజ్ఞాన నిధిని సూర్యలోచనుని చూడకుండా కుదరదు మరి. ఏం చేద్దాం?”

“పధ్నాలుగురోజుల్లో ఏమౌతుందో?” తన ఆలోచన పైకే అంది మంధర.

“మంధరా, ఇంతకన్నా నేను నీకేమీ చేయలేను. కావాలిస్తే చెప్పు. పధ్నాలుగు రోజులు. అంతే.”

మంధర ఆలోచించింది ఒక్క క్షణం. విశ్వామిత్రుడు తనకేసి చూసిన చూపులూ, తన చేత రావణ సంహరానికి బీజం వేయిస్తానని చెప్పడం అన్నీ గుర్తొచ్చాయి. ఇదే తనకి ఉన్న ఒకే ఒక అవకాశం. ముందు రాముడు అడవుల్లో కి వెళ్తే అప్పుడు చూసుకుందాం. అసలు రాముడు ఎక్కడికీ వెళ్లకుండా అయోధ్యలో పిల్లా పాపల్తో సంసారం చేయడం కంటే పధ్నాలుగు రోజులు వెళ్ళడమే మంచిది. ఇక్కడ సంసారం చేస్తూ కూచుంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ రావణుడొచ్చి అయోధ్యని తగలబెడతాడు. అప్పుడు మొత్తం రాజ్యం నాశనం అవడం ఖాయం, “సరే మీ ఇష్టం, కానీ అడవుల్లోకి పంపడానికి కారణం ఏం చెప్తారు?” అడిగింది కైకని.

“నువ్వే చెప్పు, ఎలా అడగాలో మహారాజుని.”

“ఆ మధ్య మీకు మహారాజు రెండు వరాలిచ్చారని అన్నారు కదా? అవి ఇప్పుడు అడగండి. మొదటిది రాముడు పధ్నాలుగు రోజులు అడవిలోకి, రెండోది ఈ పధ్నాలుగు రోజులూ భరతుడు రాజు అయ్యేటట్టూ.”

“భరతుడా? లక్ష్మణుడుండగా భరతుడేమిటే? నీకేమైనా పిచ్చెక్కలేదుకదా?”

“లేదమ్మా, భరతుడి కోసం కౄరమైన సవితి తల్లి అవతారం ఎత్తండి ఈ ఒక్కరోజుకీ. ఓహో సొంత కొడుకు కోసం ఇలా అడిగింది అనుకుంటారు ప్రజలు. అయినా ఈ రెండు కోరికలు మహారాజు తీర్చినప్పుడు కదా? రేపు పట్టాభిషేకం అనగా ఇలాంటి కోరిక కోరితే ఈయన తట్టుకోగలడా?

“ఏమౌతుందేం?”

“ఏమో మహారాజుకేమైనా అయితే మీ ముగ్గురి రాణులకీ వైధ… ఎందుకు నాచేత అనిపిస్తారు? వద్దులెండి, చూద్దాం. రాజు ఒప్పుకోడనే నా అనుమానం. ఒప్పుకున్నా పధ్నాలుగురోజుల్లో ఏదో పెద్ద అద్భుతం జరిగితే తప్ప రాముడు రావణుణ్ణి ఎదుర్కోడానికి సమయం చాలవద్దూ? రాక్షసులు చూడబోతే లక్షల్లో ఉండొచ్చు. రాముడేమో ఒక్కడు.”

“చూద్దాం. నేను అడగవల్సింది అడుగుతాను.”

“తాతగారింటికి వెళ్ళిన భరతుడిప్పుడు ఇక్కడెలాగా లేడు. మీరు ఎంతకాలమైనా భరతుణ్ణి చూడకుండా ఉండగలరు కానీ రాముణ్ణి చూడకుండా ఉండలేరు కదా? సరే మీ ఇష్టం, మీ మాటే కానివ్వండి.”

కైక భవనంలోంచి మంధర తిన్నగా ఇంటికొచ్చిందన్న మాటే గానీ రాత్రంతా ఉత్కంఠ. కైక అడుగుతుందా? రాజు ఏమంటాడో? మర్నాడు పొద్దున్నే వార్త దావానలంలా వ్యాపించింది. రామ పట్టాభిషేకం రద్దు చేశారు, కైక కోరిన వరాల వల్ల. ఆశ్చర్యం ఏమిటంటే పధ్నాలుగు రోజులు మాత్రమే రాముణ్ణి విడిచి ఉండగలను అని మంధరతో పట్టుపట్టిన కైక కోరిన మొదటి వరం రాముణ్ణి పధ్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపమని అడగడం. మంధర తాను విన్నదాన్ని నమ్మలేక దాదాపు పరుగెట్టుకుంటూ వెళ్ళి కైకని చూడబోయింది. మొదలు నరికిన చెట్టులా కూలబడిపోయి ఉంది కైక. మహారాజు వంటిమీద తెలివి లేదు. పరిచర్యలు చేశాక కూడా ఏమీ తేరుకున్నట్టు లేదు. మంధర రావడం చూస్తూనే మిగిలిన పరిచారకులు పక్కకి తప్పుకున్నారు.

“ఏమమ్మా నేను విన్నది నిజమేనా?” మంధర అడిగింది.

నిజమే అన్నట్టూ తలూపింది కైక, “పధ్నాలుగు రోజులు అనబోయేసరికి ఏదో భూతం ఆవహించినట్టుంది నన్ను. పధ్నాలుగు సంవత్సరాలు అని అప్రయత్నంగా వచ్చేసింది నోట్లోంచి. ఎందుకిలా అయిందో? ఎంత ఆలోచించినా అర్ధం కావడం లేదు.”

మంధర మొహంలో కత్తివాటుకి నెత్తురు చుక్కలేదు. ఈ పధ్నాలుగు రోజులు పధ్నాలుగు సంవత్సరాలుగా మారినందుకు ఇప్పుడేమౌతుందో? కౌసల్య తట్టుకోగలదా? కౌసల్య ఎలాగోలా తట్టుకున్నా రాముడు లేకుండా కైక బతకగలదా? మహారాజో? ఏదో కీడు జరగబోతోందనేది సుస్పష్టం. లేకపోతే కైక మాట తూలడం ఎన్నడైనా విన్నదా కన్నదా? ఒకట్రెండు సంవత్సరాలు చాలవూ రావణుణ్ణి చంపడానికీ? పధ్నాలుగు సంవత్సరాలే? రాముడు ఇన్నేళ్ళు అడవుల్లోకి వెళ్తే జానకి ఏం చేస్తుంది? అడిగేటప్పుడు కాస్త చూసుకోవద్దూ? కైకమ్మ ముందూ వెనకా చూసుకోకుండా అర్ధం పర్ధం లేని ఈ కోరిక ఎలా కోరింది? ఇప్పుడీ మతిలేకుండా పడిపోయిన రాజు కాలం చేస్తే రావణుడు ఇక్కడికి రాకుండానే ఈ రాజ్యం శ్మశానంలాగా తయారవదూ? ఎంతపని చేశావు కైకమ్మా? ఈ కోరికలన్నీ విన్నాక ఇలా అడగమని కైకని పురిగొల్పినందుకు రాముడు తనని నరికి పారేయడూ? నీకాశ్రయం ఇచ్చింది ఇందుకా అని అడిగితే ఏ మొహం పెట్టుకుని ఏం సమాధానం చెప్పాలి?” మంధర నుదిటి మీద చేత్తో కొట్టుకుంటూ అక్కడే నేలమీద కూలబడింది.

కాసేపటికి రాముడు రానే వచ్చాడు కైక దగ్గిరకి. మంధర తెర వెనుకకి తప్పుకుంది. తల్లి పాదాలకు నమస్కరించి అడిగేడు కైకని, “అమ్మా చెప్పండి ఏమిటిలా పిలిచారు?”

కైక రాముడికేసి చూసింది. అదే చిరునవ్వు. గుండె రంపంతో కోసేస్తున్న భాధ. రాముడితో ఎలా చెప్పడం? నోటమ్మట మాట రాక కూలబడిపోతూంటే రాముడే పొదివి పట్టుకున్నాడు కైకని ఆత్రంగా. దుర్విషయంబులు మనసున దూరకజేసే నినునెరనమ్మక నే మోసబోదునటరా, నటరాజవినుత – ఇటువంటి రాముణ్ణి పధ్నాలుగు ఏళ్ళు వనవాసం చేయమని ఎలా అనగలిగింది తాను? రాముడు ఈ మాట విని అడవుల్లోకి వెళ్తాడనేది సత్యం. రాముడటు వెళ్ళగానే తాను బతికి ఉండగలదా? ఇప్పటికే జీవఛ్ఛవంలా పడి ఉన్న మహారాజు బతుకుతాడా? కౌసల్యో? ఎంతటి దరిద్రానికి నోచుకుంది తన నోరు?

దగ్గిరే కూర్చున్న రాముడు కాసేపాగి అడిగేడు మళ్లీ, “చెప్పమ్మా? నేనేం చేయాలి?”

కైక నోరు విప్పింది, “ఏం అడుగుతున్నానో తెలియని ఒక క్షణంలో మహారాజునో రెండు కోరికలు కోరాను. కానీ అడిగేటప్పుడు ఏదో భూతం ఆవహించినట్టూ రోజులు అని అడగడానికి బదులు సంవత్సరాలు అని అప్రయత్నంగా నోట్లోంచి వచ్చేసింది. ఇలా ఎందుకు జరిగిందో ముందేమౌతుందో అని…”

“పూర్తిగా చెప్పమ్మా.”

“నువ్వు పధ్నాలుగు సంవత్సరాలు అడవుల్లోకి వెళ్ళాలనీ, భరతుణ్ణి నువ్వొచ్చేదాకా రాజుని చేయాలనీ అడిగేను. కానీ రామా, రోజులు అని అడగబోతూంటే సంవత్సరాలు అని నోట్లోంచి అప్రయత్నంగా వచ్చేసింది.”

చిరునవ్వు నవ్వేడు రాముడు, “అంతే కదా? దీనికే అంత వ్యధ దేనికమ్మా? నువ్వు అడిగితే నా చేత్తోనే భరతుణ్ణి మహారాజుగా అభిషేకించి ఉండేవాణ్ణి కదా? నా వనవాసం అంటావా? పధ్నాలుగేళ్ళు ఎంతసేపు? ఇలా వెళ్ళి అలా వచ్చినట్టు జరిగిపోవూ? నువ్వేమీ మనసులో శంక పెట్టుకోకు. అసలు ఇలా అడుగుదాం అనుకున్నాను, అలా మాట తూలిందేం అని సందేహించకు సుమా. అయితే వెళ్ళేటప్పుడు అమ్మ కౌసల్యని చూసి వెళ్లవచ్చా?”

కైక కడుపు తరుక్కుపోయింది. రాముడు కత్తితో తనని నిలువునా నరికేసి ఉన్నా అంత భాధ ఉండదేమో? ఇంతటి కష్టంలోనూ రాముడి మొహంలో చెదరని చిరునవ్వెలా వస్తోంది?

వెళ్ళొచ్చు అన్నట్టూ తల ఊపి మళ్ళీ నేలమీద కూలబడింది. కైకని చూసుకోమని పరిచారకులకి అప్పచెప్పి రాముడు బయల్దేరేడు. ముందు జరగబోయే చిత్రాతిచిత్రమైన విషయాలు చూడడానికి మంధర రాముడికి తెలియకుండా వెనుకనే బయల్దేరింది. తిన్నగా నడుచుకుంటూ కౌసల్యని చేరాక, జరిగింది చూచాయగా చెప్పి తాను ఆ రోజే వనవాసానికి బయల్దేరుతున్నట్టూ, జానకిని తానొచ్చేదాకా జాగ్రత్తగా చూసుకోమనీ రాముడు చెప్పడం మంధర విన్నదే. అప్పుడే జరిగింది ఎవరూ కలలో కూడా ఊహించని విచిత్రం. రాముడు లేకుండా తాను బతకలేననీ రాముడెక్కడుంటే తానూ అక్కడేననీ సీతకూడా బయల్దేరింది. రాముడు మరో మాటనేలోపు లక్ష్మణుడు కూడా తయారైపోయేడు. అడిగినందరికీ ఒకటే సమాధానం – రాముడు లేకుండా లక్ష్మణుడు లేడు. కైకకీ మంధరకీ కూడా జరిగిన విషయాలకి తల తిరిగిపోయింది. ఇంతటి కంగారులో కైక – మంధర అడగమన్నట్టూ – ‘రాముడొక్కడే’ అడవుల్లోకి వెళ్ళాలని అడగడం ఎలా, ఎందుకు మర్చిపోయిందో అటు కైకకి గానీ ఇటు మంధరకి గానీ గుర్తు రాలేదు.

నారబట్టలు కట్టుకునేటప్పుడు కౌసల్య అడిగింది రాముణ్ణి, “ఈ కోరికలు మహారాజు నీతో చెప్పినవా లేకపోతే కైక అడిగినవా?”

“ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? ఎవరైనా ఒకటే కదా నాకు?”

“కాదు, కాదు. మహారాజు ఆజ్ఞ అయితే దాన్ని అతిక్రమించడానికి అధికారం సూర్యవంశ రాణులకి ఉంది. కానీ కైక కనక ఆజ్ఞాపిస్తే నువ్వు తప్పకుండా అడవులకి వెళ్లవల్సిందే?”

అర్ధం కానట్టూ కౌసల్య కేసి చూశాడు రాముడు.

“కైకే కనక నిన్ను అడవులకి వెళ్లమంది అంటే, దాని పర్యవసానాలన్నీ అలోచించే నిన్ను వెళ్లమని ఉంటుంది. కైక ఇలా అడగడంలో అంతర్యం నీ క్షేమం, లోక కళ్యాణం అయి తీరుతుంది. నేను నిన్ను స్వంత కొడుకులా ప్రేమించలేకపోయినా కైక నిన్ను భరతుడికన్నా ఎక్కువగా చూసుకుంటూంది కదా? నీ వనవాసంలో ఏదో మహత్కార్యం జరబోతూందన్న మాట. ఇంతకీ చెప్పు ఎవరు నిన్ను ఆజ్ఞాపించినది? మహారాజా? కైకా?”

“అమ్మే ఆజ్ఞాపించినది.”

కౌసల్య మొహంలో దుఃఖం స్థానే నవ్వు తొణికిసలాడింది, “నేను అనుకున్నదేనన్నమాట. ఇప్పుడు మహారాజు మనసు మార్చుకున్నాసరే నువ్వు వనవాసం చేసి తీరవల్సిందే. నాకు తెలిసినంతలో ఈ ప్రపంచంలో కైక కన్నా నీ క్షేమం ఎక్కువగా కోరేవారెవరూ లేరు. నీ చేత ఏదో బృహత్కార్యం కావాల్సి ఉంది. సందేహించకుండా బయల్దేరు.”

ఎవరికీ కనిపించకుండా ఈ విషయాలన్నీ వింటున్న మంధర స్థాణువైపోయింది. సవితి తల్లి కొడుకుని అడవుల్లోకి ఒకటి కాదు, రెండు కాదు, పధ్నాలుగేళ్ళు కారడవిలోకి వెళ్ళమంటే, స్వంత తల్లి అది జరిగి తీరాలంటోంది. ఎందుకంటే ఆ సవితి తల్లి ఈ కొడుకు క్షేమం, లోక కళ్యాణం దృష్టిలో పెట్టుకునే వెళ్ళమంటోందిట! రేప్పొద్దున్న భరతుడొచ్చి రాజ్యాధికారం చేపట్టేక మళ్ళీ రాముణ్ణి నగరం లోకి రానీయకపోతే? ఈ తల్లీ కొడుకులు ఎక్కడ, ఎలా బతుకుతారు? అధికారం వంటబట్టేక భరతుడు వీళ్ళిద్దరిచేతా అడ్డమైన చాకిరీ చేయించుకోడూ? ఈ ఆలోచనలు వస్తూంటే ఎవరో పక్కనుంచి కొరడా దెబ్బతో కొట్టినట్టూ మంధర అంతరాత్మ హెచ్చరించింది – రాముడంతటి వాడికి భరతుడు తమ్ముడైతే అతను అలా చేస్తాడా? అతనికీ ఉదాత్తమైన ఆలోచనలుండవూ? తనకి మల్లే చవకబారు ఆలోచనలు ఎలా వస్తాయి? తనలాంటి కాకులు హంస వేగం ఎలా అందుకోగలవు? సింహం కడుపున మేక పుట్టడం ఎక్కడైనా విన్నామా? ఈ కౌసల్య ఆలోచనలూ రాముడి వ్యవహారం చూస్తే వీళ్ళు మామూలు మనుషులు కాదని తెలుస్తూనే ఉంది. ఆలోచనల్లోంచి తేరుకుని చూసేసరికి రాముడు వశిష్టులవారి తోనూ మిగతా మంత్రుల తోనూ మాట్లాడుతున్నాడు. చూడబోతే విశ్వామిత్రులవారు చెప్పినది నిజం కాబోతోంది. పధ్నాలుగేళ్ళలో రాక్షస సంహారం జరిగితీరుతుంది కాబోలు. లేకపోతే రోజులనబోయి సంవత్సరాలు అని ఎలా అంది కైకమ్మ? కాళ్ళు నేలలో దిగిపోయి, మతిపోయినట్టూ కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది మంధర.

తను దేని కోసమైతే పుట్టాడో అది నెరవేర్చడానికి రామభద్రుడు బయల్దేరుతున్నాడు. మంధర అందరితోబాటే నించుని చూస్తోంది జరుగుతున్న జగన్నాటకం. కాబోయే మహారాజుని నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టల్తో ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తున్న ఇంతటి ఎంతో దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా? కడుపు తరుక్కుపోతోంది కానీ తప్పదు. జగదానంద కారకా, నా ఒక్కదాని కోసం కాదు కానీ జగత్కళ్యాణం కోసం ఒక్క పధ్నాలుగు సంవత్సరాలు కొంచెం ఓర్చుకో తండ్రీ. విశ్వామిత్రులవారిచ్చిన అస్త్రసంపదకి ప్రయోజనం చేకూరే రోజు దగ్గిర్లోనే ఉంది. తోకతొక్కిన కోడెతాచులా భుజంమీద మెరుస్తున్న ధనుస్సు సర్వ శక్తులూ కూడగట్టుకుని పడగ విప్పి కాటువేయడానికి ఉద్యుక్తమౌతోంది. ఎవరయ్యా ఈ శరాగ్నుల్లో శలభంలా కాలిపోకుండా మిగిలేది? నారబట్టలు కట్టుకుని కూడా వచ్చే సీతాలక్ష్మణులతో బయల్దేరే రాముడి మొహం లోకి సూటిగా చూసింది మంధర. ఎప్పటిలాగే గంభీరంగా, ప్రశాంతంగా అదే మోము – పరమ శాంత చిత్త జనకజాధిప సరోజభవ వరదాఖిల, జగదానంద కారకా. మంధర మొహం సంతోషంతో వికసించింది. తాను చేసింది తప్పు కాదు. తన వంశాన్ని సమూలంగా నాశనం చేసి, మూడు లోకాల్నీ ఏడిపించుకు తింటూన్న రావణుడూ వాడి జాతి మొత్తం అంతా నాశనం కావడానికి తాను వేసిన ఎత్తు అత్యద్భుతంగా పనిచేయబోతోంది. సందేహం లేదు. పరమ యోగులకు పరి పరి విధముల వరమొసగెడి పాదాలని అడవుల్లో పధ్నాలుగేళ్ళు కటిక నేలమీద నడిపించి కందిపోయేలా చేస్తున్న తనకి అతి హేయమైన అధోగతి పడితే పట్టొచ్చుగాక. కామిని పాపము కడిగిన పాదము సుతలంలో సర్వవేళలా బలిని రక్షించడానికి సిద్ధమవ్వగా లేనిది నాకూ ఏదో ఒక రక్ష కల్పించదా? బ్రహ్మ కడిగిన పాదము పావుకోళ్ళని మోస్తూ ముందుకి నడుస్తూంటే మంధర కంట్లోంచి ధారాపాతంగా కన్నీళ్ళు. మసక మసకగా కనిపించిన ఆఖరి దృశ్యంలో అనుజ సౌమిత్రినిగూడి, కరమున శర చాపములు ఘనముగ వెలయ, సురులెల్ల వినుతి సేయ, వసుధ భారమెల్ల తీర్ప వెడలిన కోదండపాణి.
------------------------------------------------------
రచన: ఆర్. శర్మ దంతుర్తి, 
ఈమాట సౌజన్యంతో

Thursday, December 12, 2019

తెరచాటు-వులు: 1. ఆదిన


తెరచాటు-వులు: 1. ఆదిన




సాహితీమిత్రులారా!

మనవాళ్ళుట్టి వెధవలోయ్!
గిరీశంగారే పూనుకుని ఓ డెబ్భై యేళ్ళ తరువాత ప్రఖ్యాత హాలీవుడ్ స్క్రీన్‌రైటర్ విలియమ్ గోల్డ్‌మన్‌లా (William Goldman) పుట్టి ఇంచుమించుగా అదే భావాన్ని ఆంగ్లంలో ఉవచించారు – Nobody knows anything అని. ‘నాకు సంగీతం అస్సలు తెలియదు ‘ అంటూ వయోభారం కంటే అణుకువ వల్లనే ఒకింత క్రుంగి నడిచే బాలుగారి వ్యాఖ్యలాగా, ఈ పై వాక్యంలో సూక్ష్మం గ్రహించాలి తప్పితే, యథాతథంగా నిజమే ఎవడికీ ఏమీ తెలియదుట అని అనుకోవడం పొరపాటే. ముఖ్యంగా సినిమాల విషయానికి వస్తే – హాలివుడ్‌లోనే ఎవడికీ ఏమీ తెలియదంటే (ఆ వాక్యాన్ని ఫ్రీమేక్ చేసుకుని) మనకు అస్సలు ఏమీ తెలిసే అవకాశం లేదనుకోవడం కూడ పొరపాటే. గోల్డ్‌మన్‌గారి బహు ప్రాచుర్యం పొందిన ఆ వ్యాఖ్య విజయవంతమైన సినిమాని తీయడం ఎలాగో ఎవడికీ తెలియదు అన్న సందర్భంలో అన్వయించుకోవాలి తప్ప, అసలు సినిమా అంటేనే ఎలాగూ ఎవడికీ ఏమీ తెలియదు కాబట్టి, ఒక రాయి వేస్తే పోలా, అందితే పుష్పం లేకుంటే శష్పం అనుకోవడం ప్రమాదకరమే. సరే, మన గొడవకొద్దాం. కొన్ని సినిమాలను చూస్తే, అసలు ఇలాంటి కళాఖండాలు ఎలా తీశారు/ తీస్తారు అన్న సందేహం కంటే, అసలు వీటిని ముందు ఏమనుకుని మొదలు పెట్టారు అన్న అనుమానం రాకపోదు. వెండితెర వెలుగులో ఏదో విధంగా తమ పేరుని మెరుపులో (ఇప్పుడు డిజిటల్‌గా ఆ సౌలభ్యాలు కూడా అందుబాటులోకి వచ్చాయి కాబట్టి) చూసుకుని మురిసిపోవాలనే తపన తీవ్రతమమై కథ, నటన వంటి పనికిమాలిన వాటిని పక్కన పెట్టి, కేవలం నిడివికే ప్రాధాన్యం ఇచ్చి (కనీసం గంటన్నర లేకపోతే సెన్సార్ వాళ్ళు, అటుపైన ఇంటర్వల్లో పుణుకులు, పాప్కార్న్ అమ్ముకునే థియేటర్ వాళ్ళూ ఒప్పుకోరు కాబట్టి) రీళ్ళను కళామతల్లికి కసికొద్దీ చుట్టేసి, నేను కూడా ఈ సాంస్కృతిక యజ్ఞానికి రీలునొక్కటి తగలవేశాను (అదే, ఆహుతిచ్చాను) అని తన వీపును కాస్త ఇబ్బంది పడైనా చరుచుకోవడమే — ఈ కళాకృతుల ప్రాథమికోద్దేశంలాగా కనపడుతుంది. తీసేవాడికి ఇంతకంటే గొప్పగా ఎవరు తీయలేరు అన్న స్వకుచ మర్దన, చూసేవాడికి ఎందుకు చూశామురా అనుకుని ఆనక స్వకపోల మర్దన రెండూ తప్పని ప్రక్రియలే. ఇంతకీ తగులాటం తీతతోనా, దృష్టిలోనా? గుడ్డు, కోడిపిల్ల కంటే జటిలమైన సమస్య ఇది.

పాత కథే…
స్క్రిప్టు ఇంకా పూర్తిగా రాయబడలేదు. క్లయిమాక్సుని ఎలా ముగించాలో తెలియక సినేరిస్టులు (అంటే స్క్రీన్‌రైటర్లే. సినేరియోలు రాస్తారని అలా అనేవారు లెండి ఒకప్పుడు) తలలు పట్టుకున్నారు. అప్పటికే ముగ్గురి తలలు ఎగిరి పడ్డాయి కూడా. ఈ లోపల హీరోగారికి అసహనం పెరిగిపోతోంది. సొంత సినిమానే కాబట్టి, ఏం పర్లేదు ముందు సినిమా మొదలుపెట్టేద్దాం, అక్కడికి వచ్చాక చూసుకుందాం అన్నారు. హీరోనే సై అనే సరికి తక్కిన గణాలన్నీ హైహై అన్నై. డబ్బు వాషర్ పోయిన వీధి కొళాయిలో నీళ్ళలాగా పారింది. సగం దూరం వచ్చాక సమస్య క్లయిమాక్సుతో కాదు, అసలు మొత్తం సెకండ్ హాఫ్‌దే అని నిర్ణయించారు దర్శకుడుగారు. కోట్లు పెట్టి మొదలు పెట్టిన ఆ జగన్నాథ రథాన్ని ఒక్క సారి ఆపే ప్రయత్నం చేశారు. ఫలితంగా చక్రాల కింద నలిగి కొంత మంది సినేరిస్టులు, ఒకరిద్దరు దర్శకులు వీరగతిని పొందారు. హీరోగారు కల్పించుకుని ఈ మధ్యనే రిలీజ్ అయి తుప్పు లేపుతున్న లేటెస్ట్ సినిమా గ్రేటెస్టు రైటరుని పట్టుకొచ్చి కాళ్ళు పట్టుకున్నంత పని చేసి, అన్యధా శరణం నాస్తి అన్నారు. ఒక వైపు డబ్బు, మరొక వైపు సమయం, ఇంకోవైపు డేట్లు కలిసి చేసిన ముప్పేట దాడిలో హీరోగారు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఎట్టకేలకు రచయిత తన పని ముగించి అందరి చేతా అవుననిపించాడు. రథం మళ్ళీ కదిలింది. ఎంతో గొప్పగా భారీ యెత్తున చరిత్రలో నిలబడిపోయే క్లయిమాక్సు అనుకున్నది సూక్ష్మంలో మోక్షం అనిపించారు. సినిమా అయిపోయిందే గానీ ఎవరికి తృప్తిగా లేదు. అయ్యవారిని చేయబోయిన చందంలో చివరికి ఫైనల్ కాపీ వచ్చింది. రిలీజు డేటు ప్రకటించారు. భయం, బాధ, సందేహం, అనుమానం. హీరోగారు పెదవి విరిచారు. దర్శకులవారు చేతులు కడిగేసుకున్నారు. రచయితలు అది నాది కాదంటే నాది కాదన్నారు. అనుకున్న ఘడియ రానే వచ్చింది…

ఈ కథని ఇక్కడ ఆపి బేతాళుడు రాజుని అడిగాడు. రాజా తప్పెవరిది అని అడగను, ఎలా చేసి ఉండాల్సింది అని అంతకంటే అడగను, ఇంత తెలిసిన వాళ్ళు కూడా ఇలా ఎలా చేస్తారు అని అడగను కాక అడగను. ఒక్క ప్రశ్న మాత్రం వేస్తాను. ఇంతకీ ఆ బొమ్మ బాక్సాఫీసు దగ్గర ఏమయ్యింది – చతికిల పడిందా? చరిత్ర సృష్టించిందా? తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో…

ఈ పై ఉదాహరణలో కల్పన, అతిశయోక్తి లవలేశమైనా లేదు. ఇదొక యదార్థ(వ్యధార్థ) గాథ. సినిమా కొన్ని యేళ్ళ క్రితం వచ్చిన World War Z. విడుదలై బాక్సాఫీసు దగ్గర బోల్తా పడుతుంది అని ఖరాఖండీగా నమ్మినవాళ్ళనే బురిడీ కొట్టించి వసూళ్ళతో కుప్పిగంతులు వేసింది. సైన్సు లాబ్‌లో ప్రయోగాలు చేసే ముందు ప్రయోజనం, పద్ధతి, ఫలితం అనేవి రాయడం తప్పనిసరి. ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఏమి చూస్తున్నాం అని. బహుశా సినిమా విషయంలో మాత్రమే ఫలితం అనేది ప్రయోజనం, పద్ధతులతో ఏమాత్రం సంబంధం లేకుండా తన దారి తను చూసుకుంటుంది. కఠోర శ్రమ, పకడ్బందీ సబ్జెక్టుల మిశ్రమం గురి తప్పని విజయమా? కావచ్చు కాకపోవచ్చు. నచ్చచ్చు, ఛీకొట్టించుకోవచ్చు. Nobody knows anything అని గోల్డ్‌మన్‌గారు శలవిచ్చింది ఇందుకే. నమ్మలేని, నమ్మరాని, నమ్మశక్యం కాని నిజం. ఎవ్వడికీ ఏమీ తెలియదు. ఆ చిత్ర విజయం తరువాత వేనిటీ ఫెయిర్ పత్రిక (Vanity Fair) వారు ఓ పది పేజీల శవపరీక్ష జరిపి, అసలు ఈ సినిమా ఎలా బతికి బట్టకట్టిందో తేల్చడం వీలు కాదంటూ పెదవి విరిచారు. అసలే క్రమశిక్షణకి మారుపేరు అని చెప్పుకునే హాలీవుడ్ పరిశ్రమ. స్క్రిప్టు లేనిదే నయాపైసన్నా రాలదన్న ప్రశస్తి. అందులోనూ స్టుడియోలు, వాటి అధిపతులు, ఒక సినిమా గడప దాటే ముందు దాటాల్సిన లక్ష్మణ రేఖలు, ప్రకరణాలు, చేయాల్సిన ప్రదక్షిణాలు, అనుమతులు, అంగీకారాలు, ఇవన్నీ తోసిరాజని ఈ సినిమా అసలు ఎలా బయట పడింది? అందునా 200 మిలియన్ డాలర్ల ఖర్చు ఎలా మించి పోయింది, ఈ మధ్యలోనే హీరోగారికీ దర్శకుడికీ పేచీలు, పోట్లాటలు, ఫైరింగులు, హైరింగులు, లిటరల్‌గా అంతే తెలియని ప్రయాణాలూ…

సరే, ఈ మోస్తారు కన్నీటి గాధలు కోకొల్లలు. కాని పురిటిసంధి కొట్టుకుని పోవాల్సిన ప్రాణం గుక్కతిప్పుకుని కేర్ కేర్ మని ఎలా అన్నది అన్న లోగుట్టు ఆ కళామతల్లికే ఎరుక. ఇది అసలు చిక్కు. ఇటువంటి అష్టకష్టాలు పడి కష్టనష్టాలు ఓర్చి బయటపడిన సినిమాలన్నీ విజయకేతనాలు ఎగరవేశాయా? సక్సెస్‍కి సూత్రం సవాలక్ష సమస్యలేనా? కష్టే ఫలా బలా? సినిమా ఎలా తియ్యకూడదో సోదాహరణంగా చెప్పిన సినిమా ఇది. పేపర్ మీద లేకుండా సెట్ మీదకి వెళ్ళి చూసుకుందాం అన్న అజ్ఞానంతో మిళితమైన మూర్ఖత్వం ససేమిరా కూడదన్న సూత్రాన్ని బుట్టదాఖలు చేసిన సినిమా ఇది. అహంకారానికి అధోపాతాళమే దారన్న వారింపును తలబిరుసుతో తలదన్నిన సినిమా ఇది. ఇది విశ్లేషకులకూ విమర్శకులకూ (ఆ మాటకొస్తే, వైజ్ఞానికులకు కూడా) అంతుపట్టని అంతుచిక్కని శేష ప్రశ్న.

మరో వైపు…
ఈ మధ్య మన తెలుగులో ఓ దర్శకులవారు (ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు, కృష్ణవంశీ), సెట్ మీదే నటుల ముఖాలను చూసి ప్రేరణ పొంది నేను అక్కడికక్కడ స్క్రిప్టు రాస్తాను అని ప్రకటించారు. అది ఎలా సాధ్యం అని అడిగేలోపే, నా హిట్ సినిమాలన్నీ ఆవిధంగా రాసినవే అని ఒక సినీఅణుబాంబు పేల్చారు. ఆలోచించడానికి తగిన సమయం, తప్పొప్పులు తీరిక మీద బయటపడేందుకు వలసిన వ్యవధి, ఇవేవీ అవసరం లేకుండా ఆశువుగా స్క్రిప్టులను ఎడంచేత్తో రాసి పారేస్తున్న ఆ దర్శకుని ప్రజ్ఞను అభినందించాలో, ఎలా రాసి పారేస్తున్నా తీసి పారేస్తున్నా అక్కున చేర్చుకుంటున్న ప్రేక్షకుల ఉదారతను మెచ్చుకోవాలో తెలియని పరిస్థితి. సరే చట్టం తన పని తను చేసుకు పోతుందన్న నలిగిన సినిమా డైలాగులా దర్శకులు తప్పో ఒప్పో తనకి తెలిసిన పద్ధతిలో తీసి ప్రేక్షకుల ముందు పడేశారు.

అందరూ శుంఠలే…
తీసిన వాడి తెలివి తెల్లారిందే అనుకుందాం, మరి చూసే వాడి బుద్ధి ఏమైపోయింది? సినిమా ఆడాలంటే ప్రేక్షకుడి (కర)తాళం తప్పనిసరి. కానీ ఆ ప్రేక్షకుడు దేనిని చూసి, ఎందు చేత చప్పట్లు కొడతాడూ? ఇదొక బ్రహ్మ పదార్థం. గీతా శ్లోకమల్లే, అణువు కంటే అణువు, అభేద్యమైనది, అర్థం కానిది, అంతు పట్టనిది. మంచికి ఎప్పుడూ పట్టం కడతాడా? చెప్పడం కష్టం. పోనీ చెడును ఎప్పుడు చిమ్మివేస్తాడా? చెప్పడం ఇంకా కష్టం. ఇష్టం అనేది ఎందుకు కలుగుతుంది అన్న మనోవైజ్ఞానికమైన ప్రశ్న ఈ ప్రేక్షకుడి అభిరుచి. అభిరుచికి భావసందర్భం రాయడం రెండు చేతులతోనూ ఒకే సారి రెండు వైపుల నించీ రాసే ప్రక్రియలాంటిది. కొన్ని సినిమాలు ఎందుకు ఆడతాయో తెలియనట్టే, ఎందుకు కొన్ని సినిమాలు ఆడలేదో తెలియడం కూడా. కొన్నాళ్ళ క్రితం బాలకృష్ణగారి సమరసింహారెడ్డి సినిమా ఒక దుమ్ము దులిపింది. మరికొన్నాళ్ళ తరువాత మళ్ళీ అదే కథాంశంతో (ఏమాత్రం తేడా లేకుండా) తయారయిన నరసింహ నాయుడు సినిమా మళ్ళీ దుమారం సృష్టించింది. ఈ రెండో చిత్ర విజయం నిజంగానే ఒక సినీ చారిత్రక అద్భుతం. వెరైటీ వెరైటీ అంటూ వెంపర్లాడే తెర వెనక భాగోతులూ తెర ముందరి రసజ్ఞులూ పాత చింతకాయనే వారు వేడిగా వేడిగా వడ్డించడం, వీరు అంతే ఆబగా లాగించడం అద్భుతంగాక మరేమిటి? అది గోల్డ్‌మన్‌గారి వేష్ట – Nobody knows anything.

ఎవడికీ ఏమీ తెలియదు అని మొదలు పెట్టుకుంటే ఎక్కడినించో, ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం మొదలవుతుంది కాబట్టి వచ్చే భాగాలనుంచి తమసోమా జ్యోతిర్గమయ!
(సశేషం)
-------------------------------------------------
రచన: శ్రీనివాస్ కంచిభొట్ల, 
ఈమాట సౌజన్యంతో

Monday, December 9, 2019

నన్నెచోడుని క్రౌంచపదము


నన్నెచోడుని క్రౌంచపదము





సాహితీమిత్రులారా!

పరిచయము
తెలుగు కవులు ఎంత గొప్పవారైనా వారి జీవిత విశేషాలని దురదృష్టవశాత్తు వారు ఎక్కడా వ్రాయలేదు, వారి కావ్యాల్లో మనకు ఎక్కువ ఆధారాలను వదలలేదు. ఉన్న ఆధారాలతో వారి కాలాన్ని నిర్ణయించడం కష్టతరమైన కార్యం, కానీ కొన్ని పద్ధతులతో చేయడానికి వీలవుతుంది. అందులో కొన్ని: 1. సామాన్యంగా రాజులు కవులను పోషించేవారు, ఆ రాజులకు కవులు తమ కావ్యాలను అంకితం చేసేవారు. ఆ ప్రభువుల రాజ్యపాలనా కాలము కవుల కాలాన్ని కూడా తెలుపుతుంది. 2. కవులు తమకు ముందున్న కవులను, తమ సమకాలీన కవులను పొగడి పద్యాలను రాసేవారు. కవుల కాలం అట్లు పొగడబడిన కవులకు పిదప కాలం అని మనం అనుకోవచ్చు. 3. కవుల పేరులు, వారి కుటుంబపు వారి పేరులు లేక వారిని పోషించిన రాజుల పేరులు ఉండే కొన్ని శిలాశాసనాలతో కొందరు కవుల కాలాన్ని నిర్ణయించవచ్చు. 4. కవుల గ్రంథాల శైలి, వారి వ్యాకరణము, ఛందస్సు, వారు ఉపయోగించిన పలుకుబడులు ఇత్యాదులు.

నన్నెచోడుడు తన గురించి చెప్పుకొన్నదల్లా తన తండ్రి చోడబల్లి అని, తల్లి శ్రీదేవి అని, గురువు మల్లికార్జునుడని. తానేమో టెంకణాదిత్యుడన్నాడు. టెంకణము అంటే దక్షిణదేశం. పూర్వకవి స్తుతిలో వాల్మీకిని, వ్యాసుని, కాళిదాసును, భారవిని, ఉద్భటుని, బాణుని పేర్కొన్నాడు. తెలుగు కవులను మరెవ్వరిని పేర్కొనలేదు, నన్నెచోడుని కూడ మరెవ్వరు పేర్కొన్నట్లు ఆధారాలు లేవు. ఇక మనకు మిగిలిందల్లా శిలాశాసనాలు, కుమారసంభవ కావ్యం మాత్రమే. కేవలం వీటి ఆధారంగా నన్నెచోడుని కాలనిర్ణయం ఎలా చేయగలమో వివరించడమే ఈ వ్యాసపు ముఖ్యోద్దేశం. నన్నెచోడుడు ఉపయోగించిన విశేష వృత్త ఛందస్సులనూ, ముఖ్యంగా క్రౌంచపదమనే వృత్తాన్ని గురించి వివరించి, ఈ వృత్త లక్షణాల ఆధారంగా ఇతడు తెలుగులో మొదటి ఛందోగ్రంథాన్ని రాసిన కవిజనాశ్రయకర్తకన్నా పూర్వుడనే నా అభిప్రాయాన్ని విశదీకరిస్తాను.

శాసనప్రమాణాలు
మానవల్లి రామకృష్ణకవి ఈ కవి నన్నయకంటె పూర్వీకుడని నిర్ణయించిన దానికి ఆధారాలు[1]: కుడుంబలూరు శాసనం (క్రీ.శ. 900-950) ప్రకారం విక్రమకేసరి అనే ఒక రాజు మల్లికార్జునుడనే ఒక మతాచార్యునికి ఒక మఠాన్ని దానం చేశాడు. బీచుపల్లి అనే మరో శాసనంలో (క్రీ.శ. 902) చోడబల్లి అనే రాజు కృష్ణానది ఒడ్డులో ఉండే ఒక గుడికి భూదానం చేశాడు. ఇక మూడో శాసనంలో నన్నెచోడుడనే రాజు పశ్చిమ చాళుక్యులతో చేసిన యుద్ధంలో క్రీ.శ. 940లో చనిపోయాడు. తండ్రి పేరు, గురువు పేరు, నన్నెచోడుని పేరు ఈ మూడూ మూడు శాసనాలలో ఉన్నాయి, కాబట్టి ఇతడు నన్నయకు ముందటి వాడని కవి తీర్మానం.

ఇంతవరకు, నన్నెచోడుడు ఎప్పటివాడో అన్నది కేవలం శిలాశాసనాలపై ఆధారపడిందే. చోడుడు నన్నయ తిక్కనలకు మధ్య కాలం వాడన్న దానికి ఆధారాలు[1]: పెదచెరకూరు శాసనం అని ఒకటి ఉంది. ఇది కాకతీయ రాజు గణపతిదేవునికోసం మల్లిదేవుడనే చోళరాజు చేసిన దానాన్ని గురించినది. దీని కాలం క్రీ.శ. 1250 సంవత్సరం. ఇందులో ఏ సందేహమూ లేదు. మల్లిదేవుని వంశంలోని పూర్వుల జాబితా ఇలాగుండి ఉంటుందని ఊహ: మల్లిదేవుడు (1250) – నన్నెచోడుడు – మల్లిదేవుడు – ఘటంకారుడు – సురభూపతి, రాజరాజ మహీపతి – నన్నెచోడుడు – చోడబల్లి – కరికాలచోడుడు . ఇక పోతే ఒక తరానికి మరో తరానికి మధ్య ఎన్నేళ్లు తీసికోవాలో అనే దానిపై అంగీకృతమైన విషయం 25 నుండి 30 ఏళ్లని. దీని ప్రకారం ఇందులోని నన్నెచోడుని కాలం బహుశా క్రీ.శ. 1125 ప్రాంతం. అదీ కాకుండా కొప్పరపు శాసనం ప్రకారం క్రీ.శ. 1125 ప్రాంతంలో చోడబల్లి అనే రాజు ఒక మల్లికార్జునయోగిని సత్కరించాడట. ఈ వాదం ప్రకారం నన్నెచోడుడు నన్నయ తిక్కనల నడిమి కాలం వాడు. ఈ వాదాన్నే అనేకులు బలపరిచారు.

నన్నెచోడుని కవితలో తిక్కన, నాచన సోమనల ఛాయలు ఉన్నాయని, కావున ఇతడు తిక్కనకు తరువాతి వాడని మరి కొందరి వాదం[1]. ఇక పోతే ఇతని కవితలోని గూఢాంశాలను నిశితంగా పరిశీలించి ఇతడు నన్నయకు సమకాలీనుడని దేవరపల్లి కృష్ణారెడ్డి తీర్మానించారు[2]. చివరగా కొర్లపాటి శ్రీరామమూర్తి మానవల్లి రామకృష్ణకవే కుమారసంభవ కావ్యాన్ని రాసి నన్నెచోడునికి ఆపాదించారని ఒక పెద్ద పుస్తకం రాశారు[3].

మంగళాచరణ పద్యాలు
నన్నయ తిక్కనలు తమ కావ్యాలను సంస్కృత పద్యాలతో ఆరంభించారు. కాని నన్నెచోడుడు తెలుగులో రాసి మార్గదర్శి అయ్యాడు. మనకు దొరికిన తెలుగు ఛందోగ్రంథాలలో అతి పురాతనమైనది రేచన వ్రాసిన కవిజనాశ్రయము. ఇందులో కూడా మంగళాచరణమైన కింది మొదటి పద్యం (సంజ్ఙాధికారము నుండి) తెలుగులోనే ఉంది [4],[5].

కం. శ్రీకాంతాతిప్రియ వా
        క్ఛ్రీ కాంత జగత్రయైక సేవిత నుత వి
        ద్యాకాంత దివ్య కావ్య స
        దేకాంత నితాంత కాంతి నీవుత మాకున్

శ్రీకాంతునికి అతి ప్రియమైన దానా, పలుకుల సిరిరాణీ, ముల్లోకములయందు పూజింపబడుదానా, విద్యల తల్లీ, మంచి కావ్యములయందు ప్రీతి చూపుదానా, ఎల్లప్పుడు మాకు నీ కాంతుల నొసగుమని దీనికి అర్థము.

ఇది ఎందుకు ముఖ్యమంటే నన్నయ తిక్కనలవలె కాక ఈ ఇద్దరు కవులు తెలుగు పద్యంతో కావ్యారంభం చేశారు. ఇందులో ఎవరు ఎవరిని అనుసరించారన్నది ఎవరు ముందో ఎవరు వెనుకో అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అంతే కాక రేచన తేటగీతి లక్షణాలను తెలిపేటప్పుడు “వస్తుకవి జనాశ్రయా” అంటూ వస్తుకవిత అనే పదాన్ని కూడా వాడాడు[4],[5]. ఈ రెండు పద్యాలు జయంతి రామయ్యపంతులుగారి ప్రతిలో[6]లేదు.

గోవిందకవి చోడుని అనుసరించాడా?
కుమారసంభవ కావ్యపు ముద్రణ లన్నింటికీ తంజావూరు సరస్వతీమహలు ప్రతియే మూలాధారం. మరొక ప్రతి ఉందని కవిగారు చెప్పినా దానిని మరెవ్వరు చూచింది లేదు. ఆ తంజావూరు ప్రతి నిజమయిందేనా అనే సంశయాన్ని కొందరు వెలిబుచ్చారు. ఈ మధ్య నేను తాళదశప్రాణప్రదీపిక[7] అనే గ్రంథం చూశాను. ఇది సంగీతంలోని తాళాలపైన ఒక గొప్ప పుస్తకం. దీనిని పోలూరి గోవిందకవి రాశాడు. ఈ కవి కాలం బహుశా నన్నయ నన్నెచోడుల పిదప. ఇతడు మంగళాచరణ పద్యాన్ని తెలుగులో ప్రారంభించాడు. నన్నెచోడునివలె షష్ఠ్యంతాలను కూడా రాశాడు. ఈ కవి నన్నయను, గణిత శాస్త్రములో ప్రావీణ్యము గడించిన పావులూరి మల్లనను మాత్రమే పేరు పెట్టి ప్రశంసించాడు. బ్రాహ్మణేతర కవులను ఆ కాలములో స్తుతించరో ఏమో? కాని “నన్నయ ప్రముఖాంధ్ర సన్నుత ప్రాక్తన కవిరాజరాజుల కవనతు లిడి” అన్నప్పుడు వ్యంగ్యంగా నన్నెచోడుని కూడా పేర్కొన్నాడని నా ఊహ. ఇదే నిజమయితే కవిరాజశిఖామణిని ప్రస్తుతించిన ఒకే కవి ఇతడు కాబోలు! ఈ గ్రంథపు ప్రతి కూడా తంజావూరు సరస్వతి మహలు నుండే, అక్కడ తప్ప వేరెక్కడా లేదు. మరి ఒకే ప్రతి ఉన్న ఈ పుస్తకాన్ని కవిపండితులు అంగీకరించి, కుమారసంభవాన్ని ఎందుకు కూట సృష్టి అంటారో అర్ధం కాదు.

రేచన నన్నెచోడులు
కవిజనాశ్రయము తెలుగులో మనకు దొరికిన మొదటి ఛందోగ్రంథము. దీని రచయిత రేచనయా లేక వేములవాడ భీమకవియా అన్న విషయం కూడా ఇంకా సరిగా తీర్మానించబడలేదు. జయంతిరామయ్యచే పరిష్కృతమైన ప్రతిలో[6] ఈ పుస్తకాన్ని భీమకవి రాశాడన్నాడు. దీనిని భీమనఛందం అనడం వాడుక. వావిళ్ల ప్రతిలో[5] నిడదవోలు వేంకటరావు భీమకవి రేచనలు వేరువేరు వారనియూ, రేచనయే కవిజనాశ్రయపు కర్త అని తీర్మానించారు. అంతేకాక కుమారసంభవం, కవిజనాశ్రయములోని కొన్ని పద్యాలకు సామ్యాన్ని కూడా వీరు ఎత్తి చూపారు. మచ్చుకు కింది రెండు పద్యాలు ఒకదాని కొకటి అనుసరణ అనుటలో సందేహం లేదు. నన్నెచోడుని కుమారసంభవము (7.1) నుండి –

కం. శ్రీ శ్రితవక్షుఁడు ముక్తి
        శ్రీ శ్రిత సహజావదాతచిత్తుఁడు వాణీ
        శ్రీశ్రితసుముఖుఁడు కీర్తి
        శ్రీశ్రితదిఙ్ముఖుఁడు శేముషీనిధిపేర్మిన్

లక్ష్మీదేవికి ఆశ్రయమైన వక్షఃస్థలము గలవాడు, మోక్షలక్ష్మికి ఆశ్రయమైన నిర్మలచిత్తుడు, విద్యాలక్ష్మికి ఆశ్రయమైన ముఖము గలవాడు, కీర్తిలక్ష్మికి ఆశ్రయమైన దిఙ్ముఖుడు, బుద్ధివంతుడు అయిన జంగమ మల్లికార్జునుని ఉద్దేశించి, రేచన (కవిజనాశ్రయము, దోషాధికార ప్రకరణము) రాసినది ఈ పద్యము.

కం. శ్రీ శ్రితవక్షుఁడు విద్యా
        శ్రీశ్రితముఖుఁడఖిలజనవిశేషితకీర్తి
        శ్రీశ్రితభువనుఁడు సుకవిజ
        నాశ్రయుఁడెఱిగించు కృతులనగు దోషంబుల్

లక్ష్మీదేవికి ఆశ్రయమైన వక్షఃస్థలము గలవాడు, విద్యాలక్ష్మికి ఆశ్రయమైన ముఖము గలవాడు, లోకములో జనులెల్లరిచే పొగడబడుచు కీర్తిలక్ష్మికి ఆశ్రయమైన వాడు, మంచి కవులకు ఆశ్రయమిచ్చువాడు గ్రంథములలోని దోషములను తెలియజేయును.

శార్దూలవిక్రీడిత లక్షణాలను చెప్పేటప్పుడు రేచన రాసిన పద్యానికి, నన్నెచోడుని దారిద్ర్యవిద్రావణ దశకములోని ఒక పద్యానికి ఆరంభంలో ఉన్న పోలికను కూడా నేను గమనించాను. రేచన, కవిజనాశ్రయము, యతిచ్ఛందోధికార ప్రకరణము నుండి ఈ పద్యం:

శా. సారాచారవిశారదా, యినయతిన్ శార్దూలవిక్రీడితా
        కారంబై మసజమ్ములిమ్ముగ సతాగప్రాప్తమై చెల్వగున్

శ్రేష్ఠములైన ఆచారములను తెలిసికొన్న వారిలో గొప్పవాడా, పన్నెండుకు విరిగే శార్దూలవిక్రీడితము మ-స-జ-స-త-త-గలతో ఒప్పారును అని దీనర్ధం. నన్నెచోడుని దారిద్ర్యవిద్రావణదశకములో ఒక పద్యం (10.98) కూడా ఇలాగే ఆరంభమవుతుంది.

శా. సారాచారవిచారదక్షు లమలజ్ఞానక్షణోద్వీక్షణా
        ప్రారంభాత్మకు లాత్మ నిన్ను నెనయన్ భావించి దుర్వార సం
        సారాంభోనిధి పారమెయ్ది సుమహత్సౌఖ్యాత్ములై మర్త్యు లా
        ధారాధేయ విముక్తియుక్తు లగుదుర్ దారిద్ర్యవిద్రావణా

అర్ధం:ఓ దారిద్ర్యవిద్రావణా, విమలవంతములైన ఆచారముల నెరిగినవారు, ఒక త్రుటిలో నిర్మల జ్ఞానాన్ని తెలిసికొనే శక్తిగలవారు నిన్ను మనసులో సంస్మరించి ఈ గొప్ప సంసారసాగరానికి ఆవలి ఒడ్డు చేరి పారమార్థిక సౌఖ్యాలను అనుభవించిన మానవులు ఈ జన్మనుండి విముక్తి పొందుతారు గదా!

నన్నెచోడుడు ఒక లాక్షణికుడా?
కుమారసంభవములోని పద్యాల సంఖ్యను ఈ పట్టికలో చూడగలరు. ఇందులో సామాన్యముగా తెలుగులో రాసే కందము, సీసము, ఆటవెలది, తేటగీతి, శార్దూలమత్తేభ విక్రీడితాలు, చంపకోత్పలమాలలు ఎక్కువ. సీసపద్యానికి చివర ఆటవెలదినో లేక తేటగీతినో వ్రాయాలి. దీనిని ఎత్తుగీతి అంటారు. నన్నయభట్టు భారతంలో సీసపు ఎత్తుగీతిగా ఆటవెలదులే ఎక్కువ. నన్నెచోడుడు పై పట్టిక ప్రకారం రెంటిని సరి సమానముగా వాడాడు. ఆ ఒక కారణం వల్ల నన్నెచోడుడు నన్నయకు పిదప వాడని నిర్ధారించలేము. ప్రాచీన శాసనాలలో సీసపద్యానికి ఎత్తుగీతిగా తేటగీతులు కూడా ఉన్నాయి. ఆటవెలదిగీతికన్న తేటగీతులు మూడింతలకన్న ఎక్కువగా ఉన్నాయి కుమారసంభవములో. ఇది నన్నెచోడునికి తేటగీతిపైన ఉండే సుముఖతను, సౌలభ్యాన్ని సూచిస్తుంది. ఈ సుముఖతయే సీసపు ఎత్తుగీతిలో కూడా ప్రసరించి ఉండవచ్చు కదా!

ఖ్యాత వృత్తాలు, జాత్యుపజాతుల తరువాత మిగిలిన వాటిలో మహాస్రగ్ధర, లయగ్రాహి, ఉత్సాహ కన్నడమునుండి గ్రహించబడినవి. తరువోజ తెలుగు శాసనాలలో కనిపిస్తుంది. స్రగ్ధర, వనమయూరము, లలితగతి, వసంతతిలకము, భుజంగప్రయాతము, మందాక్రాంత, స్వాగతము, మాలిని, తోటకము సంస్కృత ఛందస్సులో ఉన్నాయి. మిగిలినవి క్రౌంచపదము, మత్తకోకిల, మానిని, లయహారిణి, కవిరాజవిరాజితము, మంగళమహాశ్రీ, మణిగణనికరము. వీటిలో క్రౌంచపదము, మణిగణనికరము, మంగళమహాశ్రీలను గురించి తరువాత చర్చిస్తాను. ఇవి పోగా ఉండేవి మత్తకోకిల, మానిని, కవిరాజవిరాజితము, లయహారిణి. సామాన్యముగా లాక్షణికులు లక్షణాలకు లక్ష్యాలను ఇచ్చేటప్పుడు ముద్రాలంకారాన్ని వాడుతారు అనే విషయాన్ని మనము జ్ఞాపకములో పెట్టుకోవాలి.

ఇందులో మత్తకోకిల(4.108), మానినీ వృత్తాలను(7.9) ముద్రాలంకారంతో వాడాడు చోడుడు. ఆ పద్యాలు-

మత్త. మెత్త మెత్తన క్రాలు దీవు సమీరణుండ, మనోభవుం
        డెత్తకుండఁగ వేగకూడఁగ నెత్తు, మెత్తక తక్కినన్
        జత్తు సుమ్ము వసంతుచే నని చాటునట్లు చెలంగె నా
        మత్తకోకిల లారమిం గడు మాసరంబగు నామనిన్

అందమైన ఆమనివేళలో ఆ తోటలోని మత్తకోకిలలు “ఓ పవనమా, నీవేమో మెల్లమెల్లగా వీస్తున్నావు. మన్మథుడు నీపై దండయాత్ర చేయకముందు నీవే త్వరగా వానిపై దండెత్తు, అలా చేయకపోతే వసంతుడు నిన్ను చంపుతాడు, జాగ్రత్త సుమా” అని హెచ్చరించేటట్లు ధ్వనులు చేశాయట.

కన్నడములో మత్తకోకిలకు పేరు మల్లికామాలె. కన్నడములోని ఉత్పలమాలె, చంపకమాలె తెలుగులో ఉత్పలమాల, చంపకమాలలయ్యాయి. మరి మల్లికామాలె మల్లికామాల ఎందుకు కాలేదు? దీనికి మత్తకోకిల అని ఎవరు పేరు పెట్టారు? మల్లికామాల అని పద్యంలో రాయాలంటే ఆ పదాన్ని ఒక పాదం చివరనుండి మరొక పాదం మొదట పెట్టితేనే సాధ్యమవుతుంది. కాని మత్తకోకిల పదాన్ని పాదంలో ఎక్కడైనా వాడవచ్చును. నన్నెచోడుడు ముద్రాలంకారాన్ని ఉపయోగించాడు ఒక మత్తకోకిలలో, కాబట్టి అతడే దీనికి మత్తకోకిల అని పేరు పెట్టి ఉండవచ్చు గదా?

మా. ఆననలీల సుధాకరబింబ నవాంబురుహంబుల చెల్వగుటన్
        వేనలి కృష్ణభుజంగకలాపి సవిస్తరభాసురమై చనుటం
        దా నతి బాలకి యయ్యుఁ దపం బుచితస్థితిఁ జేయుచునుండుట నీ
        మానిని రూపచరిత్ర లుదారసమం బగుచున్నవి చిత్రగతిన్

ముఖమో చంద్రబింబము లేక అప్పుడే విరిసిన పద్మాలు. జడ నల్లటి త్రాచు పామువలె లేక నెమలిలా ప్రకాశిస్తూ ఉంది. తనేమో చిన్న పిల్ల అయినా దీక్షతో తపస్సు చేస్తూ ఉంది. ఈ మానిని రూపము, గుణము అతి విచిత్రముగా ఉన్నదని దీని భావము.

నన్నయ (ఏచి తనర్చి తలిర్చిన ప్రోవుల నింపగు తావుల…), నన్నెచోడుడులు ఇద్దరూ మానినీ వృత్తానికి ఒక్క యతినే పాటించారన్న విషయం గమనార్హము. కాని రేచన మానినీవృత్తాన్ని యతిచ్ఛందోధికార ప్రకరణములో విశదీకరించేటప్పుడు ఒక్క యతినే చెప్పినా, ఆ పద్యంలో మూడు యతులు వాడాడు. ఆ పద్యం-

మా. కారకముల్ క్రియఁ గన్గొన నేడు భకారము లొక్క గకారముతో
        గారవమై చనఁగా యతి పండ్రెటఁ గల్గిన మానిని కామనిభా

ఓ మన్మథాకారుడా, ఏడు భ-గణములతో, ఒక గురువుతో పన్నెండు అక్షరాలకు విరిగే వృత్తాన్ని మానిని అంటారు.

మానినిని సంస్కృతములో మదిరా అంటారు. మదిర అనే పేరు నచ్చక దీనికి మానిని అని నన్నెచోడుడు పేరు పెట్టి ఉండవచ్చుగదా? ఈ కోవకు చెందినదే కవిరాజవిరాజిత వృత్తం కూడా. నన్నయ(చనిచని ముందట నాజ్య హవిర్ధృత సౌరభ ధూమ లతాతతులన్ …), నన్నెచోడుడు(11.214, కింది పద్యం) ఒక్క యతినే వాడారు.

కవి. మనునిభ చారుచరిరుఁ బవిత్రు నమానుష పౌరుషవర్తి జగ
        జ్జననుత నిర్మలకీర్తి రమావిభు శాశ్వత యోగ పదస్థిరు, స
        న్మునిజన ముఖ్యు శివాగమవేది నమోఘవచోనిధి ధీనిధిఁ బా
        వనతరమూర్తి సమస్త జగద్గురు వంద్యు ననింద్యు, సదాత్మవిదున్

మనువువలె అత్త్యుత్తమ చరిత్ర గలవానిని, పవిత్రుని, మానవాతీతమైన పురుషరూపుని, లోకమునందలి ప్రజలచే కొనియాడబడి విష్ణుమూర్తివలె కీర్తివంతుని, అచంచల యోగమూర్తిని, మునీశ్వరులలో ముఖ్యుడైనవానిని, ఈశ్వరవేదజ్ఞానిని, అనర్గళమైన వాక్కుల సిరిగలవానిని, ధీమంతుని, పరమ పావనుని, గురువులకే గురువైన వానిని, అనింద్యుని, బ్రహ్మజ్ఞానియైన జంగమ మల్లికార్జునుని గురించి రాసినదని ఈ పద్యార్ధము. రేచన ఈ పద్యానికి యతిచ్ఛందోధికార ప్రకరణములో లక్షణాలు చెప్పేటప్పుడు యతి మాటే ఎత్తలేదు, కాని లక్షణపద్యంలో మూడు యతులను వాడాడు.

కవి. క్రమమున నొక్క నకారము నాఱు జకారములుం బరగంగ వకా
        రమును నొడంబడి రాఁ గవిరాజవిరాజిత మన్నది రామనిభా

అర్థం: ఓ రామరూపా, వరుసగా న-గణము, ఆరు జ-గణాలు, పిదప వ-గణము కవిరాజవిరాజిత వృత్తానికి ఉంటుంది. ఈ కవిరాజవిరాజితాన్ని సంస్కృతములో, కన్నడములో హంసగతి వృత్తము అంటారు. కవిరాజవిరాజిత వృత్తాన్ని ఆదిశంకరులు కూడా వాడారని “శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము” అన్న వ్యాసంలో తెలియజేసాను . తెలుగులో ఎప్పుడు ఎవరు కవిరాజవిరాజితమన్న పేరును పెట్టారో తెలియదు. బహుశా ఒక వేళ కవిరాజశిఖామణియైన నన్నెచోడుడు మొట్టమొదట దీనిని వాడినప్పుడు కవిరాజవిరాజితమన్నాడా?

అలాగే, లయహారిణికి కూడా ఆ పేరు ఎలా వచ్చిందో తెలియదు. నన్నెచోడుడు ఈ వృత్తంలో రాసిన రెండు పద్యాలలో ఒక దానిలో లలితగతి అనే పదం ఉంది. ఇతడు దీనికి లలితగతి అని పేరుంచాడేమో? ఈ నా ఊహకు కారణం, లయహారిణిలో చివరి రెండు గురువులకు బదులుగా ఒక స-గణమును ఉంచితే ఆ వృత్తాన్ని లలితలతా అంటారు. భారతములో ఈ ఉద్ధురమాలా వృత్తము కనబడదు. పైన చెప్పిన కారణాలవల్ల నన్నెచోడుడు పాత వృత్తాలకు కొత్త పేరులను కల్పించియుండవచ్చును. ఇదే నిజమయితే, కవిజనాశ్రయకారుడు కవిరాజశిఖామణి పిదప జీవించి ఉండాలి.
క్రౌంచపదము
క్రౌంచపదము అనేది ఒక వృత్తఛందస్సు. (క్రౌంచము అనే పేరుతో ఒక పక్షి (Heron), ఒక కొండ కూడా ఉన్నాయి.) తెలుగు ఛందస్సులో క్రౌంచపదంలో ప్రతి పాదానికి 24 అక్షరాలు ఉంటాయి. ఇది సంకృతి ఛందములో పుట్టిన 4193479వ వృత్తము. దీని గణములు- భ-మ-స-భ-న-న-న-య. ఇది ఒక చతుర్మాత్రల తాళవృత్తము. మాత్రాగణములుగా దీనిని ఇలా వ్రాయవచ్చు- UII UU UII UU IIII IIII IIII UU, అనగా ప్రతి పాదములో ఎనిమిది చతుర్మాత్రలు. సంస్కృతములో[8] , కన్నడములో[9] ఈ పేరుతో, ఇదే లయతో ఒక వృత్తము ఉన్నది. కాని అది పాదానికి 25 అక్షరాలు గల అభికృతి ఛందస్సులోని 16776391వ వృత్తము. తెలుగులో చివరి మాత్రాగణము గ-గము. సంస్కృతము, కన్నడములలో అది స-గణము. క్రౌంచపదముతో ఛందఃపరముగా ఎన్నో ఆటలను ఆడుకోవచ్చు[10]. సంస్కృతములో పింగళ ఛందస్సులో దీనికి “యా కపిలాక్షీ పింగళకేశీ …” అనే ఉదాహరణ ఉంది. ఇది ఒక కురూపియైన స్త్రీ వర్ణన. దీనికంటే ఒక అందమైన ఈ క్రింది పద్యాన్ని మధ్వాచార్యులు సంస్కృతంలో రాశారు.[11]:

సం.క్రౌ. అంబరగంగా చుంబితపాదః పదతలవిదలిత గురుతరశకటః
        కాలియనాగశ్వేలనిహంతా సరసిజనవదలవికసితనయనః
        కాలఘనాలీ కర్బురకాయః శరశతశకలితరిపుశతనివహః
        సంతతమస్మాన్ పాతు మురారిః సతతగసమజవఖగపతినిరతః

ఆకాశగంగను ముద్దాడిన పాదాలు గలవాడా, పెద్ద బండినే విరగగొట్టిన అడుగులవాడా, కాళియుని ఉనికిని నాశనము చేసినవాడా, కొత్త తామరపూల రేకులవంటి కన్నులు గలవాడా, కారు మేఘములవంటి దేహము గలవాడా, శత్రువులను బాణములతో జయించినవాడా, ఎల్లప్పుడు గరుడదేవునిపై వెళ్ళెడివాడా, ఓ మురారీ, నన్నెల్లపుడు కాపాడవయ్యా అని దీనికి అర్థం. పై పద్యంలో మొదటి రెండు పాదాలలో యాదృచ్ఛికముగా పూర్వార్ధములో ప్రాసయతి కుదిరింది. కన్నడములో కూడా మొదటి సగ పాదంలో ప్రాసయతి ఉన్నది. ఆ కన్నడ క్రౌంచపద పద్యము [9]–

క. క్రౌ. శీతకరోర్వీ-వాత-శశాంకర్ యుగ-మిత-సురపుర-నివహద కడెయొళ్
        భూతగణేశం, భూత-శరాశా గజదొళె యతిగళు మెసెదరె పెసరిం
        నీతియుతే, కేళ్ నీ సాతిశయోక్తి-క్రమదొళె నెగళ్దుది దతిశయ రచనో
        పేతమశేషోర్వీతలకం క్రౌంచపదమిదతిశయపదరచనెగళిం

చంద్రుడు(భ-గణము), భూమి(మ-గణము), వాయువు(స-గణము), చంద్రుడు(భ-గణము), నాలుగు దేవలోకాలు(న-గణాలు), చివర ఒక శుక్రాచార్యుడు(గురువు), భూతాలు(ఐదు), బాణాలు(ఐదు), దిగ్గజాలు(ఎనిమిది), ఋషులు(ఏడు) యతులుగా ఉండినచో, ఓ మానవతీ, విను, ఆ అతిశయ రచనను క్రౌంచపదము అంటారు అని నాగవర్మ తన భార్యను ఉద్దేశించి ఈ పద్యాన్ని వ్రాసినాడు.

ఇందులో కూడా ప్రథమార్ధములో ప్రాసయతి ఉంది. కన్నడములో యతికి అక్షరమైత్రి లేదు, పాదవిచ్ఛేదన మాత్రమే. కావున ప్రతి పాదం ఐదు, ఐదు, ఎనిమిది, ఏడు అక్షరాలుగా విరుగుతుంది. కాని తెలుగులో మాత్రం పాదానికి 24 అక్షరాలు. దానిని రేచన కవిజనాశ్రయములో ఇలా వివరిస్తాడు-

క్రౌ. పంచశరాభా, సంచితపుణ్యా, భమసభననయల పరిమితమైనన్
        గ్రౌంచపదాఖ్యం బంచిత మయ్యెన్ గ్రమయతి దశవసుకలితము కాగన్

మన్మథాకారుడా, పుణ్యవంతుడా, భమసభనననయలతో కూడియున్నదై పదికి, ఎనిమిదికి తరువాత యతి ఉండినచో దానిని క్రౌంచపదమందురు. ఇందులో అక్షరయతి మాత్రమే సూచించబడినా, ఉదహరణలో ఐదక్షరాల తరువాత ప్రాసయతి కూడా ఉన్నది. అసలు సంస్కృత, తెలుగు క్రౌంచపదాలకు లయలో భేదము ఏ మాత్రము లేదు. దీనిని నిరూపిస్తూ కింద ఒక పద్యము చూడండి. ఇందులో కుండలీకరణములలో నున్న పదాలు తెలుగు క్రౌంచపదానికి, అలా లేని చివరి పదాలు సంస్కృత వృత్తానికి వర్తిస్తాయి.

క్రౌ. ఇంచు సడుల్ నే నించుక వింటిన్ హృదయము నిజముగ హృతమయె నహహా (నాహా)
        ఎంచితి నిన్ బ్రేమించితి రాత్రిన్ హిమకర కరములు హితమయ మయెగా (మయ్యెన్)
        కాంచనమాలా చంచల హేలా గగనము మురిసెను కడు ముద మొసగన్ (మీయన్)
        కాంచగ రావా క్రౌంచపదమ్మున్ గనగను వినగను కమల సునయనా (సునేత్రీ)

ఈ నేపథ్యముతో నన్నెచోడుని క్రౌంచపదాన్ని(10.30) పరిశీలిద్దాము.

క్రౌ. చంచుల నాస్వాదించుచు లేఁదూండ్లకరువు ప్రియులకు నలదుఁచు మై రో
        మాంచము లోలిం గంచుకితంబై పొడమఁగ నడరుచుఁ బులినములం గ్రీ
        డించుచు సంభాషించుచుఁ బ్రీతిం బొలుచుచుఁ జెలగుచుఁ బొలయు సముద్య
        త్క్రౌంచగతుల్ వీక్షించుచు భాస్వజ్జ్వలనుఁడు శరవణ సరసికి వచ్చెన్

ముక్కులతో లేత తూడులను తింటూ, పుప్పొడిని తమ ప్రియురాళ్లకు పూస్తూ, గగుర్పాటుతో ఒళ్లు నిండిపోయి విజృంబిస్తూ, ఆ ఇసుక తిన్నెలపై ఆడుతూ, మాట్లాడుతూ, సంతోష ధ్వనులతో మురిసిపోతూ ఉండే ఆ క్రౌంచ పక్షులను చూస్తూ మండిపోతూ ఉండే అగ్నిదేవుడు శరవణ సరసికి వచ్చాడు. శివుని రేతస్సును మోసికొని అగ్ని శరవణసరసికి వచ్చినప్పుడు క్రౌంచపక్షుల విహారాన్ని వర్ణించే పద్యము ఇది.

నన్నయ భారతములో క్రౌంచపదము లేదు. నన్నెచోడుని క్రౌంచపదమే తెలుగు సాహిత్యములో మొట్టమొదటిది. ఇందులోని విశేషాలు:

సంస్కృతమువలె, కన్నడమువలె కాక ఇందులో పాదానికి 24 అక్షరాలు ఉన్నాయి.
ఇందులో పూర్వార్ధములో ప్రాసయతి ఉన్నది.
ఉత్తరార్ధములో అక్షరయతి ఉన్నా, అది మొదటి అక్షరముతో చెల్లడం లేదు. సీస పాదమువలె మొదటి సగములో ప్రాసయతి, రెండవ సగములో సామాన్య యతి ఉన్నది.
ఈ మూడవ విశేషాన్ని గమనించిన కవి[12] సీసమునుండి క్రౌంచపదము పుట్టినది అన్నారు. కాని నాకు ఇది అంత సబబుగా తోచలేదు. ఎందుకంటే, సీసపదముగా నుండాలంటే చివరి రెండు చతుర్మాత్రలను త్రిమాత్రలు చేయాలి. నన్నెచోడునికి నాగవర్మ ఛందోంబుధి పరిచితమై ఉంటుంది. అందులోని విధముగా ప్రాసయతిని ఉంచాడు. కాని అక్షరయతి ఉంచేటప్పుడు ద్వితీయార్ధాన్ని స్వతంత్రంగా తీసికొన్నాడు. అసలు 25 అక్షరాల పాదం 24 అక్షరాలు ఏలాగయింది? రేచన కవిజనాశ్రయాన్ని చూసి వ్రాసింది కాదు. రేచన కవిజనాశ్రయము నన్నెచోడునికి ముందు వ్రాయబడి ఉంటే, లక్ష్యాలేమియు లేని రేచన సంస్కృత లక్షణాలను స్వీకరించి ఉంటాడు. నన్నయ మధ్యాక్కరకు ఐదవ గణముతో యతి నుంచాడు. నన్నెచోడుడు మధ్యాక్కరను రాయలేదు. కాని చంపకోత్పలమాలలలో మధ్యాక్కరను గర్భితము చేయడానికి ప్రయత్నించినట్లుందని “చంపకోత్పలమాలల కథ” అన్న వ్యాసంలో తెలియజేసాను. (11.131, 11.132). ఇలా చేస్తే అదనముగా యతి నుంచలేని కారణాన, మధ్యాక్కరకు నాలుగవ గణముతో యతి కుదురుతుంది. ఎఱ్ఱన మధ్యాక్కరకు నాలుగవ గణముతో యతిని ఉంచాడు. రేచన మధ్యాక్కరలోని నాలుగవ గణానికి యతిని నియమిచాడు. ఇక పోతే ఇద్దరు నన్నియలు మానినికి, కవిరాజవిరాజితమునకు ఒకే యతి నుంచారు. కాని కవిజనాశ్రయకర్త మూడు యతులను వివరించాడు. ఈ కారణాలవల్ల కవిజనాశ్రయము నన్నయ నన్నెచోడుల పిదప వ్రాయబడినది కాని ముందు కాదు. అంటే భీమనచందము అని పిలువబడే కవిజనాశ్రయాన్ని భీమన వ్రాసెనో లేక రేచన వ్రాసెనో మనకు నిక్కచ్చిగా తెలియదు. కాని ఆ రచయిత నన్నయ, నన్నెచోడుల తరువాతివాడే.

క్రౌంచపదానికి పూర్వార్ధపాదములో అందరూ ప్రాసయతిని ఉంచలేదు. తిక్కన కవిజనాశ్రయ లక్షణములను విధిగా పాటించాడు. ఎఱ్ఱన పూర్వార్ధములో అక్షరయతిని ఉంచాడు. నంది తిమ్మన, అప్పకవి పద్యాలలో ప్రాసయతి లేదు [13]. నన్నెచోడుని ద్వితీయార్ధ యతిలా కాక అక్షరయతి ఎప్పుడూ మొదటి అక్షరముతో చెల్లుతుంది మిగిలిన కవుల పద్యాలలో. సంస్కృత క్రౌంచపదము రుక్మవతీ (ప్రథమార్ధము) మణిగణనికరముల (ద్వితీయార్ధము) సంయోగము. మనకు దొరికిన నన్నెచోడుని మణిగణనికరము(8.93) లక్షణయుక్తముగా లేదు.

మణి. సరసిజహితుఁ డటు సనఁ దరతర మ
        త్యరుణరుచిని మెఱుఁ గడరుచు వడి సం
        బరమున నుడుతతి ప్రవిమల మయ్యెన్
        నిరుపమ మణిగణనికర విభాతిన్

సూర్యుడు అలా అస్తమించాడు, ఎర్రని కాంతులు మెల్లమెల్లగా ఆకాశములో వ్యాపించాయి. నక్షత్రాలు మణిగణముల రాశిలా దేదీప్యమానముగా వెలుగ నారంభించాయి. పుస్తకములో పద్యం ఇలాగే ఉంది. ఈ రీతిలో నన్నెచోడుడు వ్రాసి ఉంటే మొదటి రెండు పాదాలకు మాత్రమే మణిగణనికరపు లక్షణాలు ఉన్నాయి. మూడవ, నాలుగవ పాదాల చివర రెండు లఘువులు, ఒక గురువుకు బదులు రెండు గురువులు ఉన్నాయి. ఈ లక్షణాలతో ఉండే వృత్తమును కమలవిలసితము లేక గౌరీ అంటారు. మూడవ పాదములో అయ్యెన్ కు బదులుగా అయెగా అనియూ నాలుగవ పాదములో మణిగణనికర విభాతిన్ కు బదులుగా మణిగణనికరము విధమై అని చెబితే మణిగణనికరపు లక్షణాలు సరిపోతాయి. మొదటి రెండు పాదాలు మణిగణనికరములా ఉన్నా, చివరి రెండు పాదాలు కమలవిలసితములా ఉన్నది (ఉదా. కంకంటి పాపరాజు ఉత్తరరామాయణములోని[14] వనజనయనుఁ గరివరదునిఁ జేరన్ …). కాని ఈ కమలవిలసితవృత్తము కవిజనాశ్రయములో లేదు. దీనినే పింగళుడు[8] గౌరీ అని పిలిచాడు.

ఇంతవరకు ఈ క్రౌంచపదాన్ని గురించి వ్రాసినవారందరూ ఒక విషయం మరచినట్లుంది. తెలుగు క్రౌంచపదపు లక్షణాలు ఉన్న వృత్తము పింగళఛందస్సు, ఛందోంబుధిలో లేవు. అంతమాత్రాన దానిని ఏ లక్షణకారుడు నిర్వచించలేదు అనడం తప్పు. జనాశ్రయుని, జయదేవుని (గీతగోవిందకారుడు కాదు) పిదప జయకీర్తి అనే లక్షణకారుడు ఇప్పటి కర్ణాటకములో ఉండేవాడు. అతని లక్షణగ్రంథము ఛందోనుశాసనము (తరువాతి కాలంలో హేమచంద్రసూరి కూడా ఛందోనుశాసనమనే మరొక గ్రంథాన్ని రచించాడు). నాగవర్మ ఛందోంబుధి క్రీ. శ. 990 నాటిది. తరువాత కొన్ని సంవత్సరాల పిదప జయకీర్తి ఛందోనుశాసనమును సంస్కృతములో రాసినాడు. ఇందులో తెలుగు క్రౌంచపదపు లక్షణాలతో హంసపదము అనే ఒక వృత్తము ఉన్నది[15]. జయకీర్తి ప్రకారము దాని లక్షణాలు-

హంసపదం స్యాద్భాంచ గణాః స్యుర్వ్రతశరవసుయతి మసభననాన్యౌ

తరువాతి కాలంలో హంసపదమును కోకపదము అని కూడా పిలిచేవారు. వేరు లక్షణాలతో హంసపదమనే మరొక వృత్తము కూడా ఉన్నది[16]. జయకీర్తి హంసపదాన్ని నన్నెచోడుడు చూచి అదే క్రౌంచపదమనుకొని వ్రాసినాడేమో? సంగీతపరంగా క్రౌంచపదము చాలా ముఖ్యమైనది, అందుకే దేశికార ప్రబంధములలో పదనైవదిగా క్రౌంచపదాన్ని, పదహారవదిగా హంసపదాన్ని (క్రౌంచపదము కాని మరొక హంసపదము) మతంగముని బృహద్దేశిలో[17] పేర్కొన్నాడు. ఇలా ఈ రెండు పదవృత్తాలను గురించి తికమకలు పడడానికి అవకాశం ఉందా అనే ప్రశ్నకు నా జవాబు: మణిగణనికరములో అన్ని పాదాలు ఒకే విధముగా లేవు కదా? అందులోని మొదటి రెండు పాదాలు సంస్కృత క్రౌంచపదములోని ద్వితీయార్ధములాగా, చివరి రెండు పాదాలు తెలుగు క్రౌంచపదములోని ద్వితీయార్ధములాగా ఉన్నవి కదా?

ఈ చర్చల సారాంశము ఏమంటే – రేచన కవిజనాశ్రయములోని క్రౌంచపదపు లక్షణాలు నన్నెచోడుని పద్యాన్ని అనుసరించి వ్రాసినది. నన్నెచోడునికి సంస్కృత క్రౌంచపదము, జయకీర్తి ఉదహరించిన క్రౌంచపదము తెలిసి ఉండాలి. ఇతడు తెలుగు కన్నడ సీమల సరిహద్దులకు రాజు కదా! తాను వ్రాసినప్పుడు ఒక దాని లక్షణాలను మరొకదానికి తారుమారు చేసి ఉంటాడు, మణిగణనికరమును సంకరము చేసినట్లు. కన్నడములోలా ప్రాసయతిని ఉంచినా, అక్షరయతిని ఎందుకు మొదటి అక్షరముతో పెట్టలేదో అన్నది ఇంకా చర్చనీయమే. దానిపై నా అభిప్రాయాలు ఇవి – క్రౌంచపదమును వ్రాసేటప్పుడు నన్నెచోడుడు ఒక సందిగ్ధావస్థలో పడ్డాడు. తాను వ్రాసిన స్రగ్ధర, మహాస్రగ్ధరలకు తప్ప మిగిలిన అన్ని పద్యాలకు అక్షర సామ్య యతి ఒకటే. స్రగ్ధరలోని రెండు యతులు సంస్కృతములో శతాబ్దాలుగా నియతమై ఉన్నవి. మహాస్రగ్ధర స్రగ్ధరనుండి పుట్టిన వృత్తము, కావున అందులో కూడా యతి నియమము కష్టమైనదేమీ కాదు. క్రౌంచపదములో నన్నెచోడుడు ఒక కొత్త సమస్యను ఎదుర్కొన్నాడు. ఇందులో ప్రాసయతి, సామాన్య యతి రెంటినీ మిశ్రితము చేయాలి. కన్నడ పద్ధతి దీనికి ఏ సహాయమూ చేయదు. ఎందుకంటే కన్నడములో స్వరయతి లేదు. సీసాన్ని వ్రాసేటప్పుడు నన్నయ యతి సాంకర్యము ఎక్కువగా చేయలేదు. నన్నెచోడుడు ఒకే పాదములో రెంటినీ మిశ్రణము చేసినట్లుంది. కాని కుమారసంభవమంతా తంజావూరు ప్రతిపైన ఆధారపడినది కావున గ్రంథ స్ఖాలిత్యాలు ఇందులో ఎక్కువ.

ఈ సందిగ్ధతనుండి బయటపడడానికి రెండు మార్గాలు. ఒకటేమో, మొదటి అక్షరముతో యతి కుదర్చడము. దీనివల్ల ఇప్పటికీ ఒక నష్టమేమంటే, అక్షరసామ్యము పది అక్షరాల తరువాత వస్తుంది, కావున శ్రవణసుభగత్వము అంతగా ఉండదు ఇట్టి పద్యాలలో. రెండవ అర్ధ పాదములోని అక్షరాలకు యతిని ఉంచితే వినడానికి బాగుంటుంది. ఈ కారణాలవల్ల నన్నెచోడుడు క్రౌంచపదానికి యతి నిర్ణయం ఇలా చేసి ఉంటాడు. ఇది కేవలం ఊహాగానమైనా నాకేమో తర్కరీతిగా సబబు అనే తోస్తుంది. పై సిద్ధాంతాలు అంగీకృతమైతే, నన్నెచోడుని కాలం ఛందోనుశాసన కర్త జయకీర్తి తరువాత, రేచనకు ముందు అని చెప్పవచ్చు. అంటే ముగ్గురు నన్నియలు (నన్నియభట్టు, నన్నియ నారాయణాభట్టు, నన్నిచోడుడు) సమకాలికులని అనుకోవచ్చు. కుమారసంభవము భారతంకన్న ఒక పదేళ్ల ముందు లిఖితమయి ఉండవచ్చును. సంఖ్యాశాస్త్రాదుల నుపయోగించి కృష్ణారెడ్డి[2] నన్నెచోడుడు నన్నయభట్టు సమకాలికులనే తీర్మానించారు.

మంగళమహాశ్రీ
పంపకవి కన్నడ భారతాన్ని మంగళం అనే పదముతో అంతం చేశాడు. అందులో మత్తేభవిక్రీడితములోని చివరి పదాలు[18] ‘విభవం భద్రం శుభం మంగళం’. నన్నెచోడుని కుమారసంభవములోని చివరి పద్యములోని చివరి పదము ‘మంగళమహాశ్రీ’. ఈ పద్యం కూడా ముద్రాలంకారముతో వ్రాయబడినది. మంగళమహాశ్రీ వృత్తము ఆ కాలపు ఏ ఛందోగ్రంథములలో కూడా వివరించబడలేదు. అనగా ఇది అసలు సిసలైన ఒక కొత్త పద్యము. నాగవర్మ ఛందోంబుధిలో[9] మంగళము అనే 16అక్షరాల వృత్తము (న భ జ జ జ గ) ఉన్నది. పింగళ ఛందస్సులో[8] దీనిని పద్మ అని పిలిచారు. మంగళమహాశ్రీ కవిజనాశ్రయములో చెప్పబడినది.

ఈ వృత్తము ఎలా పుట్టింది అనే ప్రశ్న కలుగవచ్చు. ఛందోంబుధిలో లలితవృత్తము, లయగ్రాహి చెప్పబడి యున్నది. ఈ రెంటికీ గణాలు ఒక్కటే. లయగ్రాహిలో ఉన్న చివరి ప్రాసయతి లలితలో ఉండదు. అదొక్కటే ఈ రెంటికీ తేడా. నన్నయ నన్నెచోడులు లయగ్రాహిని వ్రాసియున్నారు. లయగ్రాహికి 30 అక్షరాలు. కాళిదాసో లేక నా ఉద్దేశములో శంకరాచార్యులో అశ్వధాటీవృత్తాన్ని దేవీ అశ్వధాటిలో వ్రాసియున్నారు. అశ్వధాటికి 22 అక్షరాలు. ఇందులో పాదానికి ఆరు పంచమాత్రలు (UUI, UIII), చివర ఒక గురువు. లయగ్రాహిలో ఏడు పంచమాత్రలు (UIII), రెండు గురువులు. ఇక్కడ ఒక చిక్కు, వృత్తాలలో 26 అక్షరాలకంటె ఎక్కువ ఉండరాదు. 30 అక్షరాలలో నాలిగింటిని అంటే ఒక పంచమాత్రను తీసివేస్తే మనకు 26 అక్షరాలు దొరుకుతాయి. దీనికి ఉదాహరణగా నా యీ కింది పద్యమును చదవండి. ఇందులో కుండలీకరణములతో చదివితే లయగ్రాహి, వాటిని వదలి చదివితే మంగళమహాశ్రీ మనకు దొరుకుతాయి.

(ఓ రమణి) సంతసము మీరగ వసంతముననీరముల చారు సుమ హారములు పూచెన్
(కారుకొను) వంత లిక తీరువడు, వర్ధిలును ధారుణియు, వర్షములు ధారలయి పాఱున్
(దారుణపు) చింత లిక దూరమగు శ్రీలు కడు చేరువగు, చెల్వముల తారకలు తోచున్
(స్ఫారమగు) కాంతుల నపారమగు గానసుధ లూరు, శుభకాలములు చేరు ధర శాంతిన్

బహుశా ఆ అలోచనే చోడునికి తట్టి ఉంటుంది. ఇది వృత్తము కాబట్టి లయగ్రాహిలోని ప్రాసయతికి బదులు, క్రౌంచపదములా ప్రాసయతి సాంకర్యము లేక, ఇందులో రెండు మాత్రాగణాలకు ఒక అక్షరయతి ఉంచబడినది. లయగ్రాహిలోని ఒక పంచమాత్రారాహిత్యము వలన మంగళమహాశ్రీని చోడుడు కల్పించి ఉంటాడు. అలా ఈ వృత్తము ఉత్కృతి ఛందములో 15658735వ వృత్తమైనది. నన్నెచోడుని మంగళాంత పద్యమును(12.231) కింద చదువవచ్చు. ఇందులో మొదటి పాదములో చివరి రెండు గురువులకు ముందు ఒక పంచమాత్ర లోపమై ఉన్నది.

మం. భూవినుతుఁ, డార్యజనపూజితుఁడు, సద్గుణవిభూషితుఁడు, సర్వా-
        శా వివర పూరిత విశాల శర నిర్మలయశఃప్రసరశోభితుఁడు, సద్భూ
        దేవకులశేఖరుఁడు, దేవమునిముఖ్యుఁడు, సుధీజనవరేణ్యుఁడు, ప్రియుండై
        యీ వసుధ శిష్టతతి కిష్టఫలయుక్తముగ నిచ్చు దయ మంగళమహాశ్రీ

భూమిలో పొగడబడినవాడు, పెద్దలచే పూజించబడినవాడు, మంచి గుణాలతో శోభిల్లువాడు, దిక్కుదిక్కుల వ్యాప్తమైన కీర్తిధవళిమతో అలరారువాడు, బ్రాహ్మణశ్రేష్ఠుడు, దేవతలలో మునులలో ముఖ్యుడు, పండితజనులలో ప్రథముడు – జంగమ మల్లికార్జునుడు – కోరిన కోర్కెలను మంగళమైన గొప్ప సంపదలను సజ్జనులకు ప్రసాదించును అని దీనికి అర్థము

ముగింపు
నన్నెచోడుడు ఒక చిన్న సామంత రాజు, కాని కవిరాజులకు రారాజు. పరమేశ్వరారాధకుడు మాత్రమే కాదు, ప్రబంధ పరమేశ్వరుడు కూడ. జాను తెలుగులో వస్తుకవితకు మార్గదర్శి. తెలుగు కావ్యకన్యకకు అలంకారాలను తీర్చి దిద్దిన అసమాన శేముషీ దురంధరుడు. చిత్ర కవి, లాక్షణికుడు, ఛందోవతంసుడు, నూతన పథాన్వేషణాసక్తుడు, స్వతంత్రుడు. వైష్ణవద్వేషి కాని వీరశైవుడు. స్మరుని స్మరించిన శృంగారరసోల్లాసి. స్కందుని ప్రీతికై కందానికి అందాలను దిద్దిన కల్పనా నిపుణుడు. సీసానికి మాసిపోని మూసల నేర్పరచి వాసికెక్కిన వర్ణనాత్మకుడు. నవరస పిపాసి, నటరాజోపాసి. ఆంధ్రభాషలోని ఆదికవి లేక ఆదికవులలో ఒకడు.

గ్రంథసూచి
జొన్నలగడ్డ మృత్యుంజయ రావు, నన్నెచోడకృత కుమారసంభవము, ప్రథమ భాగము, పీఠిక, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు, 1994.
దేవరపల్లి కృష్ణారెడ్డి, నన్నిచోడకవి చరిత్ర, బీ.ఎన్.కే. ప్రెస్, మదరాసు, 1951.
కొర్లపాటి శ్రీరామమూర్తి, నన్నెచోడుని కుమారసంభవము ప్రాచీనగ్రంథమా?, రమణశ్రీ ప్రచురణ, విశాఖపట్టణము, 1983.
అమరేశం రాజేశ్వరశర్మ, నన్నెచోడుని కవిత్వము, అజంతా ప్రింటర్స్, సికిందరాబాదు, 1958.
మల్లియ రేచన లేక వేములవాడ భీమకవి, కవిజనాశ్రయము, వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1950.
మల్లియ రేచన లేక వేములవాడ భీమకవి, కవిజనాశ్రయము, ఆంధ్ర సాహిత్య పరిషత్, సుజనరంజనీ ముద్రాక్షరశాల, కాకినాడ, 1932.
పోలూరి గోవిందకవి, తాళదశప్రాణ ప్రదీపిక, తంజావూరు సరస్వతీ మహల్ సీరీస్ – 13, గవర్నమెంట్ అఫ్ మెడ్రాస్, 1950.
పింగలాచార్య, ఛందఃశాస్త్రం, పరిమల్ పబ్లికేషన్స్, ఢిల్లీ, 1994.
నాగవర్మ, కన్నడ ఛందస్సు, సం. ఎఫ్. కిట్టెల్, బేసెల్ మిషన్ బుక్అండ్ ట్రాక్ట్ డెపాసిటరీ, మంగళూరు, 1875.
జెజ్జాల కృష్ణ మోహనరావు, ద్వికందగర్భిత క్రౌంచపదము – , క్రౌంచపదము – హరిగతిరగడ
వ్యాసనకెరె ప్రభంజనాచార్య, స్తోత్రమాలికా, శ్రీమన్మధ్వసిద్ధాంతోన్నాహినీ సభ, తిరుచానూరు, 1994.
మానవల్లి రామకృష్ణకవి, మానవల్లికవి రచనలు, సం. నిడదవోలు వేంకటరావు, పోణంగి శ్రీరామ అప్పారావు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు, 1972.
రావూరి దొరసామిశర్మ, తెలుగు భాషలో ఛందోరీతులు, వెల్డన్ ప్రెస్, మదరాసు, 1962.
కంకంటి పాపరాజు, ఉత్తరరామాయణము, 4.281, సీ. వీ. కృష్ణా బుక్ డిపో, మదరాసు, 1957.
జయకీర్తి ఛందోనుశాసనం, జయదామన్, సం. హరి దామోదర్ వేళంకర్, హరితోషమాల, బాంబే, 1949.
జెజ్జాల కృష్ణ మోహనరావు, హంసపద
మతంగముని, బృహద్దేశి, పరిష్కర్త, ద్వారం భావనారాయణరావు, ద్వరం పబ్లికేషన్స్, విశాఖపట్టణము, 2001.
నిడుదవోలు వేంకటరావు, ఆంధ్ర కర్నాట సారస్వతములు, క్రాంతి ప్రెస్, మదరాసు, 1962.
----------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో