Showing posts with label ఏల్చూరి మురళీధరరావు. Show all posts
Showing posts with label ఏల్చూరి మురళీధరరావు. Show all posts

Sunday, August 29, 2021

26 పదాల వాక్యం

26 పదాల వాక్యం




సాహితీమిత్రులారా!


ఆచార్య ఏల్చూరి మురళీధర రావు గారు

కూర్చిన అక్షరవృద్ధి వాక్యం

ఇందులో 1 అక్షరం పదంతో ప్రారంభమై

26 అక్షరాల పదాలతో ముగుస్తుంది

ఈ వాక్యం ఈ వీడియోలో చూడండి-




Saturday, August 21, 2021

రామలింగకవి పద్యం

 రామలింగకవి పద్యం




సాహితీమిత్రులారా!



తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసం లోని

పద్యం ఇది-

దర, భుజ, గైణ, సింహములు త్వ ద్గళ, వే, ణ్యవలోకనద్వ, యో

దరముల కోడి – వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులన్ గుహాం

తరములఁ – బూన, నిక్కఁ, దిన, దాఁగ; భ్రమింపఁగ, నూర్పు లూర్ప, స

త్వరముగ నేఁగ, నీడఁ గని తత్తరమందఁగఁ జేసి తౌఁ జెలీ!

దీనికి ఏల్చూరి మురళీధరరావు గారి వివరణ-

పద్యభావం ఇది: ఓ చెలీ! లోకంలో ఉపమానద్రవ్యములైన 1) దర (శంఖము) 2) భుజగ (పాము) 3) ఏణ (జింక) 4) సింహము అన్నవి వరుసగా నీయొక్క 1) గళ (కంఠము) 2) వేణి (జడ) 3) అవలోకనద్వయ (కనుగవ) 4) ఉదరములకు సాటిరాలేక – అంటే, దరము గళానికి, భుజగము వేణికి, ఏణము కన్నుగవకు, సింహము ఉదరానికి సాటి కాలేకపోయాయి. ఆ అవమానభారం వలన –

దరము గళమునకున్ ఓడి – వారిధిపదంబులన్ పూనన్; భ్రమింపఁగన్.

శంఖము గళానికి ఔపమ్యలోపం వలన సముద్రతలంలో తలదాచుకొనవలసి రాగా; భ్రమింపఁగన్ = తిరుగుళ్ళు పడగా (శంఖం నీటిలో భ్రమింపవలసిరావటం – కొట్టుమిట్టుకులాడుతుండటం అని ఒక అర్థం; తిరుగుళ్ళు అంటే శంఖానికి దక్షిణావర్తము, వామావర్తము అని భేదాలేర్పడటం అని మరొక అర్థం).

భుజగము వేణికిన్ ఓడి – పుట్టలన్ నిక్కన్; ఊర్పులు + ఊర్పన్.

పాము ఆమె జడకు సాటిరాలేక పుట్టలలో నిక్కవలసిరాగా (అనగా, తలదాచుకొనవలసిరాగా), ఊర్పులు + ఊర్పన్ = చేసేది లేక నిట్టూర్పవలసి ఉండటం (బుసలుకొడుతూ ఉండిపోవటం).

ఏణము అవలోకనద్వయమునకున్ ఓడి – పూరులన్ తినన్; సత్వరముగన్ ఏఁగన్.

జింక ఆమె కన్నుల వంటి అందమైన కన్నులు తనకు లేవన్న అవమానంకొద్దీ పూరి మేయవలసిరాగా (దురవస్థకు లోనయిందని భావం), ఆ బెదురు కారణాన పరుగులు తీయవలసిరాగా.

సింహము ఉదరమునకున్ ఓడి – గుహాంతరములన్ దాఁగన్; నీడఁ గని తత్తరమున్ + అందఁగన్.

సింహము ఆమె నడుము వంటి సన్నని నడుము తనకు లేనందువల్ల (ముఖం చెల్లక, సిగ్గుతో) గుహాంతర్భాగంలో దాగి ఉండేట్లుగా, తన నీడను చూసి తానే భయపడేట్లుగా.

ఒనర్చితివి = చేశావు. ఔన్ = అవును, ఇది నీకే తగును – అని ప్రశంసార్థం.

పద్యంలో క్రమాన్వయం సార్థకంగా ఉండటం వల్ల ఇది యథాసంఖ్యమనే అలంకారం. మెడ, జడ, కన్నులు, నడుము అన్న నాలుగు ఉపమేయవస్తువుల శోభాతిశాయిత వల్ల శంఖము, పాము, జింక, సింహము అన్న వస్త్వంతరాలను అణగింపజేశాడు. ఇది మీలనము అనే అలంకారమని కావ్యాలంకారసంగ్రహంలో భట్టుమూర్తి. ఇది పద్యంలోని అలంకారశోభ. తెనాలి రామలింగకవి వర్ణనానైపుణికి, పద్యరచనాకౌశలికి, అతివిస్తారమైన వ్యుత్పత్తిగౌరవానికి, అనల్పకల్పనాశిల్పానికి, చిత్తవిస్తారరూపమైన చమత్కృతధోరణికి నిదర్శకాలైన పద్యాలివి. దురన్వయాలను సరిచేసి సమన్వయించుకొంటే విశేషార్థాలు వెల్లడవుతాయి. మహాకవుల శబ్దసాగరం ఎంత లోతైనదో తెలిసివస్తుంది.


Sunday, July 21, 2019

రెండు పద్యాలకు విశేషార్థాలు – దురన్వయాలకు సమన్వయాలు


రెండు పద్యాలకు విశేషార్థాలు – దురన్వయాలకు సమన్వయాలు





సాహితీమిత్రులారా!

మౌళిఁ గెంజడల జొంపము ఫాలపట్టికఁ
          దీండ్రించు భసితత్రిపుండకంబుఁ
గర్ణకీలిత రత్నకామాక్షియుగళంబుఁ
          బలుచని నెమ్మేనఁ బట్టుకంథ
కరముల బంగారు సరకట్టుఁ గిన్నెర
          హరిణశృంగంబుఁ బేరురమునందుఁ
గరమూలమున భూరి కరవాల సన్నంపు
          నడుమున నొడ్డియాణంబు దిద్దు

పెరగుపై వ్యాఘ్రచర్మకౌపీనకలన
యోగవాగలు శూలంబు నాగసరము
పొలుపు దళుకొత్తు చెట్టునఁ బుట్టినట్లు
నిరుపమాకార సిద్ధుఁడు నరుగుఁదెంచె.

ఇది ‘సిద్ధపురుషుఁడు: తెన్నాలి రామలింగయ కందర్పకేళీ విలాసము’ అన్న శీర్షికతో ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారు 1989లో ప్రకటించిన సాహిత్యసంపద వ్యాససంపుటం లోని ‘ప్రబంధరత్నాకరము చతుర్థాశ్వాసము – ప్రత్యంతరవిశేషములు’ అన్న వ్యాసంలో (పు. 304-5లు) ఉదాహరింపబడిన పాఠం. ప్రబంధరత్నాకరము అంటే తంజావూరు సరస్వతీ మహలు గ్రంథాలయంలో ఉన్న పెదపాటి జగన్నాథకవి సంకలనగ్రంథం. అందులో లేని పద్యాలు కొన్ని ప్రబంధరత్నాకరము ప్రత్యంతరంలో కొర్లపాటి శ్రీరామమూర్తి గారికి దొరికాయి. వాటిని ఆయన మొదట భారతి పత్రిక లోనూ, ఆ తర్వాత తమ సాహిత్యసంపద వ్యాససంపుటం లోనూ ప్రకటించారు. తంజావూరు ప్రతిలో తెనాలి రామకృష్ణుని రచన కందర్పకేతు విలాసము అని, ప్రత్యంతరంలో కందర్పకేళీ విలాసము అని ఉన్నందువల్ల అవి రెండూ వేర్వేరు గ్రంథాలని ఆయన అభిప్రాయపడ్డారు. కందర్పకేతు విలాసము కథాకావ్యమని, కందర్పకేళీ విలాసము పేరును బట్టి కామశాస్త్రగ్రంథం కావచ్చునని ఊహించారు. అయితే, కందర్పకేతు విలాసము తెనాలి రామకృష్ణకవి రచనమేనని, అది సంస్కృతంలో సుబంధుని వాసవదత్తా కథకూ, కన్నడంలో నేమిచంద్రుని లీలావతీ ప్రబంధానికీ సంయుక్తానువాదమని మునుపు నేను ప్రతిపాదించాను. ఆసక్తి గల పాఠకులు ఆ వ్యాసాలను ఈమాట పత్రిక పూర్వసంచికలలో చూడవచ్చును. కందర్పకేళీ విలాసము అన్నది లేఖనదోషమని, ఆ పేరు గల కావ్యమేదీ ఉండి ఉండదని, పైని ఉదాహరించిన పద్యం కందర్పకేతు విలాసము లోనిదే కాని, కందర్పకేళీ విలాసము లోనిది కాదని – ఈ వ్యాసంలో ప్రతిపాదింపబడుతున్నది.

శీర్షికలో రామలింగకవి అని ఉన్నది. అందువల్ల అందువల్ల ఈ కావ్యరచన నాటికి ఆయన ఇంకా రామలింగడు గానే ఉన్నాడని, సమాశ్రయణం పొందలేదని, రామకృష్ణుడుగా మారలేదని గ్రహించాలి.

ముందుగా పద్యపాఠాన్ని విమర్శించి చూద్దాము. సీసపద్యం రెండవ పాదంలోని కర్ణకీలిత రత్నకామాక్షియుగళంబు అన్నదానిలో ‘కామాక్షి’ అనన్వితం. ఆ మాటకు అర్థం లేదు. దానిని కర్ణకీలిత రత్నకర్ణికాయుగళంబు అని సవరించి చదువుకోవాలి. కర్ణిక అంటే చెవికమ్మ. ‘కర్ణికా తాలపత్రం స్యాత్’ అని అమరకోశం. ‘కర్ణికా కర్ణభూషణం’ అని యాదవ ప్రకాశుల వైజయంతీ కోశం. అయితే, కర్ణిక కర్ణకీలితం కావటం వృథా కథితకథనమే అవుతుంది. ‘చెవికి చెవికమ్మను అలంకరించుకొని’ అన్నట్లు. అందువల్ల, దానిని కర్ణకీలిత రత్నకర్ణికాయుగళంబు అనటం కంటే గండకీలిత రత్నకర్ణికాయుగళంబు అని సవరించటం మేలు. ఇది నిరంకుశమైన సవరణ కాదనీ, మూలవిధేయమేననీ ముందు ప్రతిపాదింపబడుతున్నది.

నాలుగో పాదంలో, భూరి కరవాల అన్నచోట భూరి కరవాలంబు అని ఉండాలి. వైకృతం చేసి భూరి కరవాలు అనటానికి వీలుండదు. అది సమాసత్రుటితమని డా. శ్రీరామమూర్తి దానిని ‘భూరి తరవారి’ అని సరిదిద్దారు. పద్యం సిద్ధపురుష వర్ణనం. ఆ సంగతి శీర్షికలోనే ఉన్నది. కథాసందర్భాన్ని బట్టి ఆ సిద్ధముని శాపానుగ్రహదక్షుడు. ఆయన కరమూలాన భూరి తరవారి (ఖడ్గవిశేషం) అనావశ్యకమే అవుతుంది. పైగా అటువంటి పట్టా కత్తి సిద్ధపురుషాభివర్ణనలో అసంగతం. ఆయన వేషధారణలో అది అనుచితం.

ఎలాగూ దిద్దవలసినదే కనుక దానిని ‘భూరి కరపాళి’ అని దిద్దుకొందాము. కరపాళి అంటే చేతికర్ర. కరపాలి అంటే కత్తి అనే అర్థం కూడా ఉన్నది కాని, అది అసంగతమని ఇప్పుడే అనుకొన్నాము. ‘కరపాలీ హస్తయష్టౌ’ అని శబ్దార్థకల్పతరువు. హస్తదండమని భావమన్నమాట.

ఎత్తుగీతి మొదట, పెరగుపై వ్యాఘ్రచర్మకౌపీనకలన అని ఉన్నది. దానికి అన్వయం లేదు. వ్రాతప్రతిలో ఆ విధంగా ఉండి ఉండదు. లేదా, లేఖకదోషం అనుకోవాలి. కొర్లపాటి వారు తమ తెలుగు సాహిత్యచరిత్ర తృతీయభాగంలో (పు.188) దానికి మారుగా ‘పిఱుఁదుపై వ్యాఘ్రచర్మకౌపీనకలన’ అని ఉదాహరించారు. ఇది తమవద్ద ఉన్న వ్రాతప్రతిని బట్టి సరిచేసిన పాఠమో, లేక యథాయోగ్యంగా ఊహించి వారు సరిచేసిన పాఠమో తెలియటం లేదు. ఏ సంగతీ వారు చెప్పలేదు.

పెరగుపై వ్యాఘ్రచర్మకౌపీనకలన అన్న పాఠానికి అర్థం లేదు. పిఱుఁదుపై వ్యాఘ్రచర్మకౌపీనకలన, కూడా అటువంటిదే. పులితోలు పిరుదుపై ఉండటం ఏమిటి? అది సరి కాదు. పోనీ, వ్యాఘ్రచర్మాన్ని చుట్టచుట్టి ఆ చుట్టను పిరుదు మీద కట్టుకొన్నాడని భావించటం కూడా సాధ్యం కాదు. మొత్తం మీద –

‘పెరగుపై వ్యాఘ్రచర్మకౌపీనకలన’, ‘పిఱుఁదుపై వ్యాఘ్రచర్మకౌపీనకలన’ — అన్న రెండు పాఠాలూ అనన్వితంగానే ఉన్నాయి. అందువల్ల ఈ రెండవ పాఠాన్ని బట్టి ఉత్సాదనీయంగా – బిరుదు వైయాఘ్రచర్మకౌపీనకలన – అన్నది కవి ఉద్దేశించిన పాఠమని ఊహించి దిద్దుకోవాలి. దీనితో అన్వయదోషం తొలగిపోతుంది. వ్రాతప్రతికి సన్నిహితంగానూ ఉంటుంది. బిరుదైన వైయాఘ్రచర్మం అన్నమాట. వ్యాఘ్ర శబ్దానికి తద్ధితం వైయాఘ్రం.

నాల్గవ సీస చరణం చివరి దళంలో సన్నంపు నడుము అని ఉన్నందువల్ల – ఆ తర్వాత ఉన్న ‘దిద్దు’ను దొద్దు (చిరుబొజ్జను కలిగి ఉండటం) అని దిద్దటానికి వీలులేకపోయింది. వ్రాతప్రతిలో పెరగుపై వ్యాఘ్రచర్మ ఇత్యాదిగా ఉన్నట్లయితే, దానిని –

కరమూలమున భూరి కరపాళి, సన్నంపు
నడుమున నొడ్డియాణంబు నుద్ది
పెనఁగు వైయాఘ్రచర్మకౌపీనకలన

అని సరి చేసుకోవాలి. నడుమున యోగపట్టెకు జతగా పెనగొన్న పులితోలుతోడి బిళ్ళగోచి – అని అర్థం. అల్లసాని పెద్దన గారి మనుచరిత్ర లోని ఔషధసిద్ధుని రూపానికి — ఐణేయమైన యొడ్డాణంబు లవణిచే, నక్కళించిన పొట్ట మక్కళించి (1-59) అన్న వర్ణనకు — అనురణనం ఇది. ఈ సవరణలతో పద్యరూపం ఇలా ఉంటుంది:

మౌళిఁ గెంజడల జొంపము, ఫాలపట్టికఁ
          దీండ్రించు భసితత్రిపుండకంబుఁ
గండకీలిత రత్నకర్ణికా(కుండల?)యుగళంబుఁ,
          బలుచని నెమ్మేనఁ బట్టుకంథ
కరముల బంగారు సరకట్టుఁ గిన్నెర,
          హరిణశృంగంబుఁ బేరురమునందుఁ
గరమూలమున భూరి కరపాళి, సన్నంపు
          నడుమున నొడ్డియాణంబు దిద్దు (నుద్ది)

పెనఁగు వైయాఘ్రచర్మకౌపీనకలన,
యోగవాగలు, శూలంబు, నాగసరము
పొలుపు దళుకొత్తు చెట్టునఁ బుట్టినట్లు
నిరుపమాకారసిద్ధుఁడు నరుగుఁదెంచె.

(శిరసుపై గుబురు కట్టిన ఎర్రని జడలు, పలక లాగా నునుపుదేరి సువిశాలంగా ఉన్న నెన్నుదుటిపై ధగధగ మెరుస్తున్న మూడు విభూతిపట్టెలు, చెక్కిళ్ళను పలకరిస్తున్నట్లున్న రత్నాలు పొదిగిన చెవికమ్మలు, యోగవిద్యాభ్యాసం వల్ల పలచబారి దృఢంగా ఉన్న నిండైన శరీరంపైని చిరుగుల బొంత, చేతులలో బంగారు మెట్లవరుస తీర్చిదిద్దినట్లున్న కిన్నెర వాద్యం, విశాలమైన వక్షఃస్థలం మీద అలంకారంగా వ్రేలాడుతున్న లేడికొమ్ము, చంకను పొదివిపట్టిన హస్తదండం, సన్నని నడుముకు ఒడ్డాణం చుట్టినట్లు బిళ్ళగోచి పెట్టిన వ్యాఘ్రచర్మాంబరం, అంతరిక్షమార్గాన సంచరించే యోగులు తొడుక్కొనే పావుకోళ్ళు, నిలువెత్తు శూలం, నాగస్వరం కలిగి సాక్షాత్తు కల్పవృక్షం వరాలను ప్రసాదింపగోరి కట్టెదుట ప్రత్యక్షమైన సాక్షాన్మహేశ్వరమూర్తి వంటి సాటిలేని ఆకృతిశోభతో ఒక సిద్ధపురుషుడు అక్కడికి వచ్చాడు.)

రామలింగకవి, కథానాయకుడు కందర్పకేతుని సంగమాభిలాషను వర్ణింపదలచినప్పుడు అందుకు ఉపయుజ్యమైన భావాన్ని శ్రీ కాళిదాస కృతిగా ప్రసిద్ధిని గన్న శృంగారతిలకములో నుంచి తీసికొని సందర్భోచితంగా అనువాదం చేసుకొన్నట్లే, ఈ సిద్ధపురుషవర్ణనకు అర్హమైన వస్తువిస్తృతి సుబంధుని వాసవదత్తా కథలో లేకపోవటం వల్ల, మహాకవి శ్రీ వామన భట్టబాణుని అపురూపమైన కనకలేఖా కల్యాణమనే సంస్కృత నాటకంలో నుంచి తీసికొని, దానిని తన వర్ణ్యవస్తుసాక్షాత్కరణ నైపుణితో పారితథ్యంగా తెలుగుచేశాడు. ఈ అనువాదాభిమానాన్ని విమర్శకులు కవులకు జన్మాంతరసంస్కారవిశేషంగా అలవడే కవిత్వబీజపు అనవాప్తతకు, ప్రతిభాశూన్యతకు నిదర్శనగా భావింపకూడదు. ఇది రామలింగకవికి ఆ మహాకవిపై కుదురుకొన్న గౌరవాతిశయానికి సాక్ష్యమే కాని, భావదారిద్ర్యం కాదు. అంతే కాక, దీనిని బట్టి క్రీ.శ. 15వ శతాబ్ది ఉత్తరార్ధం నాటికింకా తెలుగుదేశంలో వామనాచార్యుని కృతులు పఠనపాఠనాలలో ఉండేవని గ్రహించాలి. సామాన్యుడా మరి? సాక్షాత్తు వేదభాష్యకర్త శ్రీ విద్యారణ్యులవారి శిష్యతల్లజుడు. పైగా, తనలాగానే రాజాశ్రయానికి లోగినవాడు. తాను కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండినట్లు ఆయనా పెదకోమటి వేమారెడ్డి ఆస్థానిని అలంకరించి గౌరవాలను అందుకొన్నవాడు. తనలాగానే కాలం కలిసి రానప్పుడు పోషకులు లేక తలవంచుకొని అజ్ఞాతవాసం లోనో, అనర్హవాసం లోనో ఉన్నవాడు. ఆ ఆత్మసాత్కృతి వల్ల వామన భట్టబాణుని కావ్యజాతం రామలింగకవిని ఆకర్షించి ఉండటం భావ్యమే అవుతుంది. కనకలేఖా కల్యాణం చదువుకొని, దానినుంచి తెలుగు చేశాడు. పైగా వామన భట్టబాణుని కవితను శ్రీనాథుడంతటివాడు, పిల్లలమర్రి పినవీరభద్రుని అంతటివాడు అనుసరించి, అనుకరించారు కదా. ఆయన కృతులలోని రసవదార్థాన్ని చుబ్బనచూరలుగా తెలుగువారికి పంచిపెట్టారు కదా. తానూ అనుసరించాడు.

కనకలేఖా కల్యాణం నాటకం తృతీయాంకంలో యువరాజు విజయవర్మ వద్దకు విరూపాక్షుడనే సిద్ధపురుషుడు ఆకాశమార్గాన దిగివచ్చి మాట్లాడిన సన్నివేశం ఉన్నది. ఆ సందర్భంలో వామన భట్టబాణుడు చేసిన సిద్ధపురుష వర్ణన ఇది:

పాణౌ వేత్రం పవిత్రం భసితవిరచితం పుణ్డ్రకం ఫాలదేశే
రౌద్రాక్షం దామ కణ్ఠే స్ఫటికమణిమయం కుణ్డలం గణ్డసీమ్ని
వైయాఘ్రం చర్మపట్టం కటిభువిమహితే పాదుకే పాదయుగ్మే
కన్థాం కల్పద్రుమోత్థామపి వపుషి వహన్నేష సిద్ధోభ్యుపైతి.

(చేతిలో బెత్తం, తపస్సిద్ధిని సూచిస్తున్న యజ్ఞోపవీతం, విశాలమైన నెన్నుదుట విభూతి రేఖ, మెడలో రుద్రాక్షహారం, చెక్కిళ్ళపైని మెరుములీనుతున్న స్ఫటికమణిమయాలైన కుండలాలు, నడుముకు చుట్టిన పులితోలు, రెండు పాదాలకు పావుకోళ్ళు, మేనిపై చిరుగుల బొంత ధరించి కల్పవృక్షం మానవాకృతిని దాల్చినట్లుగా ఉన్న సిద్ధపురుషుడు ఎదురుగా వస్తున్నాడు.)

రామలింగకవి బహువిస్తారమైన గ్రంథపరిశీలనకు, ప్రతివిహిత సూక్ష్మేక్షికకు, శాస్త్రజన్య సంస్కారశాలీనతకు, నిరంతర విద్యావ్యసనితకు నికషోపలమైన సన్నివేశం ఇది. స్పష్టమైన శబ్దానుసరణకు మేలైన ఉదాహరణ. కొన్ని పదబంధాలను చూడండి:

భసితవిరచితం పుణ్డ్రకం ఫాలదేశే = ఫాలపట్టికఁ దీండ్రించు భసిత త్రిపుండ్రకంబు.
స్ఫటికమణిమయం కుణ్డలం గణ్డసీమ్ని = గండ (<కర్ణ) కీలిత రత్నకర్ణికా(కుండల?)యుగళంబు.
వైయాఘ్రం చర్మపట్టం కటిభువి = నడుమున, బిరుదు వైయాఘ్రచర్మకౌపీనకలన.
పాదుకే పాదయుగ్మే = యోగవాగలు.
కన్థాం వపుషి = పలుచని నెమ్మేనఁ బట్టుకంథ.
కల్పద్రుమోత్థాం = పొలుపు దళుకొత్తు చెట్టునఁ బుట్టినట్లు.
ఏష సిద్ధః అభ్యుపైతి = నిరుపమాకారసిద్ధుండు నరుగుఁదెంచె.
మొదలైనవన్నీ వామనుని సంస్కృతానికి నీడలే. కల్పద్రుమోత్థాం అన్న రూపణను వ్యస్తంగా పఠించి ఆంధ్రీకర్త, పొలుపు దళుకొత్తు చెట్టునఁ బుట్టినట్లు, అని చిత్రికపట్టాడు. ఏష సిద్ధః అభ్యుపైతి అన్న నిర్దేశాన్ని నిరుపమాకారసిద్ధుండు నరుగుఁదెంచె, అని వాసవదత్త పలికినట్లుగా మార్చి సన్నివేశాన్ని మరింత రక్తి కట్టించాడు. కరముల బంగారు సరకట్టుఁ గిన్నెర – అన్నప్పుడు పసిడి కిన్నెర వీణావిశేషమేనని, సరకట్టు (=మెట్లవరుస) దానికే సూచకమనీ గ్రహించాలి. భగవన్నామ జపానురక్తుడైన సిద్ధుని చేతిలో బెత్తానికంటె (వేత్రం = బెత్తము) బంగారు కిన్నెరను ఉంచటం వల్ల కావ్యంలో దృశ్యదర్శనీయత మరింత రాణింపుకు వచ్చింది.

కొర్లపాటి శ్రీరామమూర్తిగారు ప్రకటించిన ప్రబంధరత్నాకరం లుప్తశేష ప్రత్యంతరంలో ఈ పద్యం ‘సిద్ధపురుషుఁడు: తెన్నాలి రామలింగయ కందర్పకేళీ విలాసము’ అనే శీర్షికతో ఉన్నదని ముందే మనవి చేశాను. కథాసన్నివేశాన్ని బట్టి ఇది సుబంధుని వాసవదత్తా కథకు అనువాదమైన కందర్పకేతు విలాసము లోనిదని ప్రతిపాదించటం జరిగింది. ఇది కందర్పకేళీ విలాసము అనే అభూతపూర్వమైన గ్రంథం లోనిది కాదనీ, సుబంధుని వాసవదత్తా కథకు అనువాద రూపమైన కందర్పకేతు విలాసము లోనిదేననీ నిశ్చయించటానికి పైని పేర్కొన్న కథాసన్నివేశంతోపాటు మరొక ప్రబలమైన ఆధారం కూడా ఉన్నది. అది – ఇదే సందర్భంలో పెద్దాపుర సంస్థానం ఆస్థానవిద్వాంసుడు వక్కలంక వీరభద్రకవి తన వాసవదత్తా పరిణయములో చేసిన సిద్ధపురుష రూపకల్పన:

ఉభయబలములు పోరాడుచుండునంత
నచట కేతెంచె యోగవిద్యావిశేష
కరతలాంచిత జపమాలికా మనోజ్ఞ
మూర్తియై యొప్పి యొక సిద్ధమునివరుండు.

పటుజటాజూటంబు భసితత్రిపుండ్రకంబు
          గండలంబిత తామ్ర కుండలములు
ధవళయజ్ఞోపవీతంబులుఁ(నుఁ?) గాంచన
          యోగపట్టికయు శాతోదరంబు
దీర్ఘకూర్చం బనిందిత తనూవిభవంబుఁ
          బదముల మణిమయపాదుకలును
గరమున జలకుండికయు నాగబెత్తంబు
          శ్రుతితల ద్విగుణాక్షసూత్రకంబుఁ

గలిగి యడుగిడి యడుగిడి నలిననాభ!
చక్రహస్త! మురాంతక! శ్యామలాంగ!
కృష్ణ! కేశవ! పాహి లక్ష్మీశ! యనుచు
న మ్మునీంద్రుండు వలికి డాయంగ నరిగి. — వాసవదత్తా (4-97,98)

ఈ పద్యం కందర్పకేతు విలాసంలోని సిద్ధపురుష వర్ణనకు అనుకరణమని తెలుస్తూనే ఉన్నది. పదసంఘటన ఉభయకావ్యాలలోనూ యాదృచ్చికం అనుకోవటానికి వీలులేదు. పద్యం ఎత్తుగడను మొదలుకొని (మౌళిఁ గెంజడల జొంపము – పటుజటాజూటంబు) పద్యమంతటా పరచుకొని ఉన్న కల్పనాసామ్యం (భసితత్రిపుండ్రంబు – భసితత్రిపుండ్రంబు; రత్న(గండ)కీలితరత్నకర్ణికా(కుండల)యుగళంబు – గండలంబిత తామ్ర కుండలములు) వంటివాటిని బట్టి వీరభద్రకవి కందర్పకేతు విలాసాన్ని ముందుంచుకొని వ్రాశాడనే అనిపిస్తున్నది. తనకు పూర్వం రచితమైన ఆ మహాగ్రంథాన్ని పేర్కొనకపోయినా, ఆయన ధ్యేయకవిస్తుతిలో తెనాలి రామలింగకవిని స్మరించుకొన్నాడు.

రాయాస్థానమునందుఁ బూజఁగొని భూప్రఖ్యాతిగా సత్కృతుల్
వేయాఱుల్ విరచించినట్టి ఘనులన్ వేమాఱు భావింతు స
ద్గేయప్రాభవు నల్లసాని కులజున్ ధీశాలిఁ బెద్దన్నఁ దే
జోయుక్తిం దగు సూరనార్యుఁ గవిరాజున్ రామలింగాఖ్యునిన్. — వాసవదత్తా (1-12)

ఇందులో రామలింగకవిని ప్రత్యేకించి కవిరాజుగా పేర్కొనటం విశేషగౌరవసూచనకే గాని యతిమాత్రనిర్వహణార్థం కాదన్న సంగతి స్పష్టమే.

ఇక, తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసం లోనిదే, రెండవ పద్యం:

ధరభుజగైణసింహములఁ దద్గణవేణ్యవలోకనద్వయో
దరములకోడి వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులన్ గుహాం
తరములఁ బూన నిక్కఁ దిన డాఁగ స్రవింపఁగ నూర్పులూర్ప స
త్వరముగ నేఁగి నీడఁ గని తత్తఱ మందఁగఁ జేసి తౌ చెలీ.

ఇది చాగంటి శేషయ్యగారు 1951లో ప్రకటించిన ఆంధ్రకవితరంగిణిలో (సంపుటం 8; పుట 39) తెనాలి రామకృష్ణుని చరిత్రలో, ‘చాటుపద్యమణిమంజరి నుండి యుద్ధృతము’ అని ఉదాహరించిన పద్యపాఠం. ఇది చాటుపద్యమని పేర్కొంటూనే, శేషయ్యగారు “ఈ పద్యము మనకు లభ్యము కాని యేకందర్పకేతువిలాసములోనిదో యై యుండునని నాయభిప్రాయము” అని కూడా సూచించారు. 1951లోనే అచ్చయినవే, ఆంధ్రకవితరంగిణి మరికొన్ని ప్రతులలో ‘దరభుజగైణసింహముల’ అన్న పాఠం కూడా ఉన్నది. అది సవరణ పాఠమై ఉంటుంది.

పద్యార్థాన్ని పరిశీలిద్దాము. కావ్యనాయిక అందాన్ని ఆమె చెలికత్తె మెచ్చుకొంటున్నదని తెలుస్తూనే ఉన్నది. అయితే, పద్యం ముమ్మొదటను ఉన్న ‘ధర’ అన్న ఉపక్రమణికకు అర్థం లేదు. అది, ఈ భూమియందు అని అర్థం చెప్పుకొని కేవలం పాదపూరకమని సరిపుచ్చుకోవటానికి వీలులేని స్థానంలో ఉన్నది. ధర భుజగైణసింహములన్, అన్నది కర్మార్థకమైతే, దానికి ‘ఓడి’ మొదలైన ధాత్వర్థాలతో ఫలాశ్రయత్వం లేదు. తత్+గణ అన్నప్పుడు ఆ ‘గణ’ శబ్దానికి అర్థం లేదు. అన్వయం లేదు. అంతకంటె, దరభుజగైణసింహముల అన్న పాఠం మేలు. ‘స్రవింపఁగ’ అన్న పదానికి పద్యంలో అన్వయం లేదు.

వేటూరి ప్రభాకరశాస్త్రిగారి చాటుపద్యమణిమంజరికి 1988లో వెలువడిన తృతీయ ముద్రణ ప్రతిలో ఈ పద్యపాఠం ఈ విధంగా ఉన్నది:

దరభుజగైణసింహములఁ దద్గతవేణ్యవలోకనద్వయో
దరముల కోడి వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులన్ గుహాం
తరములఁ బూన నిక్కఁ దిన డాఁగ స్రవింపఁగ నూర్పులూర్ప స
త్వరముగ నేఁగి నీడగని తత్తఱ మందఁగఁ జేసి తౌ చెలీ.

ఇందులోనూ మొదటి పాదంలో ‘తత్+ గత’ అన్నదానికి అన్వయం లేదు. మూడవ పాదంలో ‘స్రవింపఁగ’ అని ఉన్నదానికి అర్థాన్వయాలు రెండూ లేవు. ‘స,త్వరముగ నేఁగి’ అన్న క్త్వాంత దళానికి కారకాన్వయం కనబడదు. మొదటి పాదంలో ‘తద్గళ’ అన్న పాఠాన్ని స్వీకరిస్తే, నిర్దేశకార్థాన్ని నాయికా సంబుద్ధితో అన్వయింపవలసివస్తుంది. అదీ కుదరదు.

పై ఇద్దరికంటె మునుపే, 1893లో శ్రీ గురుజాడ శ్రీరామమూర్తిగారు తమ కవిజీవితములు (పు.241)లో చూపిన పాఠం:

దర, భజ, గేణ, సింహములు తద్గళ, వే, ణ్యవలోకనద్వయో
దరముల కోడి, వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులం గుహాం
తరముల పూన నిక్క, తిన డాఁగ, స్రవింప, నిటూర్పులూర్చ స
త్వరముగ నేఁగి నీడఁగని తత్తరమందఁగఁ జేసి తౌ చెలీ.

ఇందులోనూ పైని పేర్కొన్న దోషజాతం ఉండనే ఉన్నది. కాగా, మూడు పాఠాలలోనూ మూడవ పాదంలో యతి తప్పింది. గుహా(న్త)రముల – (డాఁ)గ అన్నప్పుడు అనుస్వారసంబంధ యతి చెల్లదు. కనుక దోషం. భుజగేణసింహములు అన్నచోట అపసంధి. పద్యంలో అర్థాన్వయం ఎలాగూ లేదు.

పై మూడు పాఠాలలోని దోషాలను సవరిస్తే, రామలింగకవి పద్యం ఈ విధంగా ఉంటుంది:

దర, భుజ, గైణ, సింహములు త్వ ద్గళ, వే, ణ్యవలోకనద్వ, యో
దరముల కోడి – వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులన్ గుహాం
తరములఁ – బూన, నిక్కఁ, దిన, దాఁగ; భ్రమింపఁగ, నూర్పు లూర్ప, స
త్వరముగ నేఁగ, నీడఁ గని తత్తరమందఁగఁ జేసి తౌఁ జెలీ!

‘తద్గళ’ అన్న నిర్దేశానికి అర్థం లేదు. చెలికత్తెను సంబోధిస్తున్న మాట కాబట్టి – త్వత్ + గళ అని ఉండాలి. ‘డాఁగ’ అన్నప్పటి యతిదోషం దాఁగ అని సవరించుకొంటే సరిపోతుంది. అది ‘స్రవించటం’ కాదు – ‘భ్రమించటం.’ స్రవింపఁగ అన్నదానిని భ్రమింపఁగ అని దిద్దుకోవాలి. లేకపోతే పద్యార్థం బోధపడదు.

పద్యభావం ఇది: ఓ చెలీ! లోకంలో ఉపమానద్రవ్యములైన 1) దర (శంఖము) 2) భుజగ (పాము) 3) ఏణ (జింక) 4) సింహము అన్నవి వరుసగా నీయొక్క 1) గళ (కంఠము) 2) వేణి (జడ) 3) అవలోకనద్వయ (కనుగవ) 4) ఉదరములకు సాటిరాలేక – అంటే, దరము గళానికి, భుజగము వేణికి, ఏణము కన్నుగవకు, సింహము ఉదరానికి సాటి కాలేకపోయాయి. ఆ అవమానభారం వలన –

దరము గళమునకున్ ఓడి – వారిధిపదంబులన్ పూనన్; భ్రమింపఁగన్.
శంఖము గళానికి ఔపమ్యలోపం వలన సముద్రతలంలో తలదాచుకొనవలసి రాగా; భ్రమింపఁగన్ = తిరుగుళ్ళు పడగా (శంఖం నీటిలో భ్రమింపవలసిరావటం – కొట్టుమిట్టుకులాడుతుండటం అని ఒక అర్థం; తిరుగుళ్ళు అంటే శంఖానికి దక్షిణావర్తము, వామావర్తము అని భేదాలేర్పడటం అని మరొక అర్థం).

భుజగము వేణికిన్ ఓడి – పుట్టలన్ నిక్కన్; ఊర్పులు + ఊర్పన్.
పాము ఆమె జడకు సాటిరాలేక పుట్టలలో నిక్కవలసిరాగా (అనగా, తలదాచుకొనవలసిరాగా), ఊర్పులు + ఊర్పన్ = చేసేది లేక నిట్టూర్పవలసి ఉండటం (బుసలుకొడుతూ ఉండిపోవటం).

ఏణము అవలోకనద్వయమునకున్ ఓడి – పూరులన్ తినన్; సత్వరముగన్ ఏఁగన్.
జింక ఆమె కన్నుల వంటి అందమైన కన్నులు తనకు లేవన్న అవమానంకొద్దీ పూరి మేయవలసిరాగా (దురవస్థకు లోనయిందని భావం), ఆ బెదురు కారణాన పరుగులు తీయవలసిరాగా.

సింహము ఉదరమునకున్ ఓడి – గుహాంతరములన్ దాఁగన్; నీడఁ గని తత్తరమున్ + అందఁగన్.
సింహము ఆమె నడుము వంటి సన్నని నడుము తనకు లేనందువల్ల (ముఖం చెల్లక, సిగ్గుతో) గుహాంతర్భాగంలో దాగి ఉండేట్లుగా, తన నీడను చూసి తానే భయపడేట్లుగా.

ఒనర్చితివి = చేశావు. ఔన్ = అవును, ఇది నీకే తగును – అని ప్రశంసార్థం.
పద్యంలో క్రమాన్వయం సార్థకంగా ఉండటం వల్ల ఇది యథాసంఖ్యమనే అలంకారం. మెడ, జడ, కన్నులు, నడుము అన్న నాలుగు ఉపమేయవస్తువుల శోభాతిశాయిత వల్ల శంఖము, పాము, జింక, సింహము అన్న వస్త్వంతరాలను అణగింపజేశాడు. ఇది మీలనము అనే అలంకారమని కావ్యాలంకారసంగ్రహంలో భట్టుమూర్తి. ఇది పద్యంలోని అలంకారశోభ. తెనాలి రామలింగకవి వర్ణనానైపుణికి, పద్యరచనాకౌశలికి, అతివిస్తారమైన వ్యుత్పత్తిగౌరవానికి, అనల్పకల్పనాశిల్పానికి, చిత్తవిస్తారరూపమైన చమత్కృతధోరణికి నిదర్శకాలైన పద్యాలివి. దురన్వయాలను సరిచేసి సమన్వయించుకొంటే విశేషార్థాలు వెల్లడవుతాయి. మహాకవుల శబ్దసాగరం ఎంత లోతైనదో తెలిసివస్తుంది.
-------------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు, 
ఈమాట సౌజన్యంతో

Sunday, May 5, 2019

ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం !


ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం !




సాహితీమిత్రులారా!

వేయేండ్లుగా వెలసి విలసిల్లుతున్న ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం ఏది? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటం సులభమేమీ కాదు. వేలకొద్దీ వెలసిన కావ్యాలలో అప్రతీతపదప్రయోగం వల్ల, సుదీర్ఘసమాసకల్పనల మూలాన, భావప్రౌఢి కారణవశాన అర్థనిర్ణయం దుష్కరమైన పద్యాలెన్నో ఉన్నాయి. ఇప్పు డా అలవాటు లేదు కాని, ఒకప్పుడైతే విద్యాగోష్ఠులలో

        క.   కమలాకర కమలాకర

              కమలాకర కమల కమల కమలాకరమై

              కమలాకర కమలాకర

              కమలాకరమైన కొలను గని రా సుదతుల్.

వంటి పద్యాలనిచ్చి అర్థతాత్పర్యాలు చెప్పమనటం పరీక్షకులకూ, పరీక్ష్యులకూ ఒక కేళీవినోదంకరణగా ఉండేది.  `తెనాలి రామకృష్ణ' చిత్రంలో కృష్ణదేవరాయల ఆస్థానానికి కొండవీటి సీమ నుంచి ఒక పండితుడు వచ్చి, `రాజానందనరాజరాజాత్మజులు సాటి, తలఁప నన్నయ వేమ ధరణిపతికి' అన్న పద్యానికి అర్థాన్నడగటమూ, రామకృష్ణకవి చేతిలో భంగపడటమూ రమ్యంగా చిత్రీకరింపబడిన దృశ్యం అటువంటిదే.  పూర్వకవులు ఏకాక్షరాధారితంగానూ, ఏకసమాసనిష్ఠంగానూ చెప్పిన కఠినపద్యాలకు తరగతి గదిలో వల్లెవేసిన నిఘంటువులను బట్టి భావాన్ని గుర్తుపట్టడం ఒకప్పటి పాఠశాలలలో గురువులు విద్యార్థులకు నేర్పించేవారు.

       `దదదదదదదదదదదదదద దదదదదద దదద దదదదదదదదద

       దదద దదదద దదద దదద దదద దదదద దదదద దదదద దదదద.'

        అని 12-వ శతాబ్దంలో భగవద్రామానుజుల వారి శిష్యుడు శ్రీవత్సాంకుల వారు (కూరత్తాళ్వార్) రచించిన యమక రత్నాకరంలోని శ్రీకృష్ణస్తుతిపరకమైన ఒక ఏకాక్షరశ్లోకం. శ్లోకమంతా `ద' అన్న ఒక్క అక్షరంతోనే సాగింది. తెలుగులోనూ ఇటువంటివనేకం ఉన్నాయి. వ్యాకరణపాండిత్యం, వ్యాఖ్యానసాహాయ్యం లేకపోతే అర్థం చేసుకోవటం సులభం కాదు. ఇదొక తీరు ప్రౌఢి.

        ఇక, సమాసం అనగానే, ఇది తెలుగా? సంస్కృతమా? అనిపించే

        శా.   సాధీయోముఖపూరితోద్వమితతాసత్యోర్ధ్వగోదన్వద

                ర్ణోధారాంతరటత్తిమింగిలగిలప్రోద్ధాననిద్ధ్యానల

                బ్ధాధీశప్రభుతాస్వభాగహరణార్థాయాయిహృజ్జాంకధీ

              ప్రాధాన్యాతివిలోలవాగ్దృగబటబ్రహ్మన్! స్తుమ స్త్వా మనున్.

వంటివి, ఆరభటీ వృత్తిలో ఓజోగుణం నిండిన సంస్కృతసమాసభూయిష్ఠపద్యాలే కానక్కరలేదు.  అచ్చతెలుగు సమాసాలూ సాధ్యమే.

        మ. నెలఱాతీవియ సంతసంపు మగఱానీరాళపుం గొప్పటా

              కుల నిద్దంపుఁ బసిండి నున్జవికెనిగ్గుల్ దొట్టు కట్టాణి పూ

              సల మేల్కొల్పు మెకంబు చెక్కడపు కీల్ జాగా జాగా గద్దియన్

              జెలువెచ్చం గొలువుండె నెల్లరును జేజే యంచుఁ దన్గొల్వఁగన్.

అని గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం (1-126). మొదటి మూడు పాదాలూ ఒక్క సమాసం.

        ఇవికాక, ద్వ్యర్థికావ్యాలను, త్ర్యర్థికావ్యాలను  చదివేటప్పుడు ఒక అర్థం సుగమం గానూ, ఒక అర్థం దుర్గమం గానూ ఉండటం కూడా పాఠకులకు అనుభవంలో ఉన్నదే. పింగళి సూరన్నగారి రాఘవపాండవీయం (3-54)లో

        శా.  అక్షుద్రప్రథమానదివ్యశరసంప్రాప్తిం బ్రకాశించు నా

              కుక్షిద్వంశవతంసుఁ గన్గొని, ‘మహాగోదావరీతీరస

              ద్రక్షోపాయపథంబు నేఁడు దొరికెన్, రం!’ డంచు సంరక్షణా

              పేక్షం ద ద్వనభూమిదేవతలు సంప్రీతిం గడున్మూఁకలై.

అన్న పద్యాన్ని చూడవచ్చును. సుతీక్ష్ణముని ఆశ్రమంలో సీతారామలక్ష్మణుల రాకవల్ల రాక్షసుల బారినుండి గోదావరీతీరవాసులకు మహాగోదావరీతీర సద్+రక్షా+ఉపాయపథంబు దొరికినదని తద్ + వన (ఆ ఆశ్రమోద్యానవనం లోని) భూమిదేవతలు (బ్రాహ్మణులు) సంతోషించారన్న రామాయణార్థం సులభంగానే ఉన్నది కాని; దివ్యశరాన్ని (పాశుపతాస్త్రాన్ని) సాధించిన అర్జునుని చూచి మహాగోదావరీతీరసద్రక్షోపాయపథంబు అన్న దళానికి మహత్ + అగః + దావ + రీతీ + రసత్ + రక్షః + అపాయపథంబు అన్న పదచ్ఛేదమూ, ఆ పదచ్ఛేదానికి మహా (గొప్ప) అగః (అపరాధాలతో) + దావ (దావాగ్ని) + రీతీ (వలె) + రసత్ (ఘోషిస్తున్న) + రక్షః (రాక్షసుల) + అపాయపథంబు (వధోపాయ మార్గం) ఈనాడు దొరికినదని తద్ + వనభూమిన్ (ఆ వనభూమికి విచ్చేసిన) దేవతలు (ఇంద్రాదిదేవతలు) సంతసించారన్న మహాభారతార్థమూ ఎంతటి పండితులకైనా స్ఫురించటం కష్టమే.  వ్యాఖ్యానసాపేక్ష మైనందువల్ల ఇదీ కొంత దుర్ఘటార్థమే.  సభంగశ్లేష మూలాన ఏర్పడిన అన్వయప్రౌఢి. భాషాశ్లేషపద్యాలైతే ఉభయభాషాకోవిదులకు కానీ అర్థం కావు.

        భావార్థప్రౌఢి వేఱొక విధంగా ఉంటుంది.

        గీ.   రంగనాథుండు రంగత్తురంగ మెక్కఁ

              గులిశమును దాల్చె  గోత్రారి కుతుక మొప్ప;

              ఖేదమోదంబు లందె నగేంద్రకన్య,

              మౌళిఁ గృష్ణాజినంబున మాఁటె శివుఁడు. 

అని - అల్లమరాజు సుబ్రహ్మణ్యకవిగారి సంస్కృతశ్లోకానికి నా అనువాదం. శత్రుసంహారానికై రంగనాథుడనే రాజు ఉద్యుక్తుడై గుఱ్ఱం ఎక్కుతున్నాడు. ఆ ఎక్కేటప్పుడు నేలపై గుఱ్ఱం కాలిగిట్టల తాకిడి వల్ల ధూళి చెలరేగింది. ఆ ధూళి దుమారమై ఏకంగా సప్తసముద్రాలనూ ముంచెత్తివేసేంత ఉద్భటంగా రేగిందట. సముద్రాలు ఇంకిపోతే - పూర్వం ఇంద్రుడు పర్వతాల ఱెక్కలను నఱికివేసినపుడు హిమవంతుని కొడుకు మైనాకుడు తప్పించుకొని పాఱిపోయి సముద్రంలో దాక్కొన్నాడు కదా, అతనిప్పుడు దొరుకుతాడని గోత్రారి (గోత్రములకు = పర్వతాలకు, అరి = శత్రువైన ఇంద్రుడు) వజ్రాయుధాన్ని చేతబూనాడట. ఆ మైనాకుడు హిమవత్పుత్త్రిక అయిన పార్వతీదేవికి (నగేంద్రకన్యకు) తమ్ముడు కదా, ఇంద్రుని బాఱినుండి తప్పించుకోలేడని ఆమెకు ఖేదం కలిగింది. అయితే ఒకందుకు మోదమూ కలుగకపోలేదు. సప్తసముద్రాలే ఇంకిపోగా లేనిది తన సవతి గంగాదేవి మాత్రం ఉండగలదా? అని మోదం. గంగకు కష్టం కలిగితే పార్వతికి సంతోషమే కానీ, పాపం జగత్తులకు ఈశ్వరుడు, గంగకు భర్త అయిన శివునికి ఎంతైనా భార్య కదా, ఆ దుమ్ము గంగాజలాలకు సోకకుండా జింక చర్మం తీసుకొని శిరోవేష్టనంగా తలకు చుట్టుకొన్నాడట. అశ్వారోహణమే ఇంత ఉద్భటంగా ఉంటే, ఆ రాజెంతటి వాడో! ఆయన పరాక్రమం ఎంతటిదో!! అని ఊహించుకోవాలి.

        `ధూళి రేగటం' అన్న కీలకం బోధపడకపోతే, పద్యార్థం బోధపడదు. ప్రహేళికాప్రాయమైన రచన ఇది. ఇటువంటి చిత్రకవితారీతులింకా అనేకం ఉన్నాయి.

        ఇవన్నీ ప్రౌఢమైన పద్యాలే కాని, తెలుగు సాహిత్యమంతటిలోకీ అత్యంతప్రౌఢమైన పద్యం ఏది? అన్న ప్రశ్నకు సమాధానం నా అత్యంత పరిమితమైన అనుభవంలో నాకు ఇటీవలే భాసించింది. ఏ వ్యాఖ్యానమూ లేనందువల్ల - పద్యాన్ని ముందుంచుకొని దీని అర్థం ఏమిటని తదేకంగా ఆలోచింపగా, ఆలోచింపగా అన్వయం బోధపడటానికి ఒక గంట సేపటికి గాని అసలు స్ఫురించనే లేదు.

        అది నివేదించడానికే ఈ వ్యాసం.



        కావ్యనాయిక మనోజ్ఞసౌందర్యవర్ణనానుగతమైన ఈ పద్యాన్ని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చాటుపద్యమణిమంజరిలో `రామకృష్ణుని ఇతర చాటువులు' అని పేర్కొన్న పద్యావళి నుంచి గ్రహించి శ్రీ చాగంటి శేషయ్యగారు ఆంధ్రకవితరంగిణి 8-వ సంపుటంలోని తెనాలి రామకృష్ణకవి చరిత్రలో ఉదాహరించారు:

         చ.   అల ఘనచంద్రబింబసమమై తనరారెడు వక్త్ర మందులోఁ

              గలిగిన నామభేదములకైవడి నొప్పెడిఁ గప్పు కొప్పు చె

              క్కులు రదనాంశుకంబు లవి గుబ్బలకున్ సరిరాకపోయెఁ జే

              తులు సరులయ్యె దానివలె నున్నది పొంకపుటారు బోఁటికిన్.”

       ఈ పాఠంలో అర్థప్రతీతి లోపించింది. నామవిభక్తులు, విశేష్యవిశేషణాలు తారుమారయ్యాయి.  పైగా, నాలుగవ పాదంలో యతిభంగమైంది.

        వేటూరి వారికి మునుపే 1893లో శ్రీ గురజాడ శ్రీరామమూర్తిగారు `తెనాలి రామకృష్ణుని చాటువులని వాడుక గల పద్యములు' అని తమ బృహత్పరిశోధనాగ్రంథం కవిజీవితములులో వేఱొక పాఠాన్ని చూపారు:

        చ.   అల ఘనచంద్రబింబనిభమై తగు కాంత మొగంబు, దానిలోఁ

              గలిగిన యర్థభేదములఁ గైకొని చెప్పఁగ నొప్పు కొప్పు, చె

              క్కులు రదనాంశుకంబు నవి గుబ్బలకున్ సరిరాకపోయెఁ జే

              తులు సరియయ్యె, దానిగతిఁ దోఁచెను బొంకపుటారు దానికిన్.

అని. ఇందులో నాలుగవ పాదంలోని యతిభంగదోషం తొలగిపోయింది. కొంత భావస్ఫోరకంగానూ ఉన్నది కాని, స్పష్టార్థప్రతీతి లేదు.

       ఈ రెండు పద్యాలనూ అర్థావగతిని బట్టి సమన్వయించి, కవ్యుద్దిష్టానికి అనుగుణంగా నేను రూపొందించిన పాఠం ఇది:             

        చ.   అల ఘనచంద్రబింబనిభ       మై తనరారెడు వక్త్ర; మందులోఁ

              గలిగిన యర్థభేదములఁ        గైకొని చెప్పఁగ నొప్పు కొప్పుఁ, జె

              క్కులు రదనాంశుకంబు – నవి గుబ్బలకున్ సరిరాకపోయెఁ, జే

              తులు సరియయ్యె, దాని గతిఁ దోఁచెను బొంకపుటారు బోఁటికిన్.

అని. లాక్షణికులు దీనిని సతృణాభ్యవహారత్వం అంటారు. చిత్రకవితాప్రీతి ప్రధానమైన ఇటువంటి పద్యాల అర్థప్రవచనం కొంత కష్టమే. శబ్దార్థాలు రెండింటి సంయోజనమూ క్లేశాస్పదం కావటం మూలాన అన్వయం కుదుర్చుకోవటమే దుష్కరం. ఆ పైని  కవి హృదయావిష్కరణం. తెలుగులో ఇటువంటి గూఢరచన మరొకటి లేదు.

        పద్యభావం ఇది:

v మొదటి దళం: ఉపక్రమణిక v

        ౧. బోఁటికిన్, అల, ఘనచంద్రబింబనిభమై తనరారెడు వక్త్రము.

బోఁటికిన్=కాంతకు, అల=ప్రసిద్ధమైన, ఘనచంద్రబింబనిభమై ` ఘన=నిండైన (`ఘనం మధ్యమనృత్యే స్యా త్కాంస్యతాలాదివాద్యకే, పుంసి ముస్తా మేఘ దార్ఢ్య విస్తార ముద్గరేషు చ' – మధురేశుని శబ్దరత్నావళి. `కిం స్విదాపూర్యతే వ్యోమ జలాధారాఘనైర్ఘనైః' – సంస్కృత మహాభారతం, ఆది. ౧౩౬:౨౮), చంద్రబింబ=చంద్రమండలముతో (`బింబో'స్త్రీ మణ్డల త్రిషు' – అమరకోశం), నిభమై=సమానమై (`నియతం భాతీతి నిభః. నిభాదయ ఉత్తరపదస్థా ఏవ సదృశవచనా వాచ్యలిఙ్గాః స్యుః;' – రామాశ్రమి). పూర్ణచంద్రబింబశోభ వంటి శోభతో నిత్యం ప్రకాశించేది కాబట్టి ఘనచంద్రబింబనిభము + ఐ అని.

        తనరారెడు=ఒప్పారెడు, వక్త్రము=ముఖము. దీనిచే భాషించటం జరుగుతుంది కాబట్టి ముఖానికి `వక్త్రము' అనిపేరు. (`ఉచ్యత'నేన. వచ పరిభాషణే, బృవో వచిః. గుధృవీపచివచి (ఉణాది. ౪-౧౬౭) ఇతి త'రః' – రామాశ్రమి) ఇక్కడ అర్థభేదాలు ప్రసంగింపబడుతున్నాయి కనుక సాకూతమైన ప్రయోగం ఇది. వక్త్రానికి వర్తులత్వ-ఆహ్లాదకత్వ-నిర్మలత్వాల వల్ల చంద్రబింబం తోడి పోలిక సుప్రసిద్ధం. `రాజరాజాకృతి రంజిల్లె వదనంబు ... అఖిలసుమనస్సమారాధ్య యయ్యె దివ్య, సౌకుమార్యాంగసౌరభ్యసంపదయును, గాన నా చాన సుందరాకారగరిమఁ, దరమె పొగడఁగ నహిలోకధవుని కైన" -  అని 18-వ శతాబ్ది నాటి గుడారు వేంకటదాసకవి ప్రబంధరాజశిరోభూషణ బలరామచరిత్రము వ్రాతప్రతి. చంద్రబింబోపమానం నాయిక పద్మినీజాతి లక్షణలక్షితకు సూచకమని ఆనాటి కవిసంప్రదాయం. `రాజీవగంధి సద్రాకేందుబింబాస్య, నీలోత్పలశ్యామ నిర్మలాంగి' – అని కూచిరాజు ఎఱ్ఱయ కొక్కోకం. గురజాడ శ్రీరామమూర్తి గారి పాఠంలో `ఘనచంద్రబింబనిభమై తగు కాంత మొగంబు' అన్నప్పుడు ఈ సాభిప్రాయపదప్రయుక్తికి అవకాశం లేకపోయింది. `వక్త్రము' అన్న నిర్దేశం వల్ల పద్యప్రతిపాదితార్థానికి విశదిమ కలిగింది. పరివృత్త్యసహిష్ణుతకు ఉదాహరణీయమైన ప్రయోగం ఇది.

v రెండవ దళం: అర్థభేదాలతో ఉపమానఘటనం v

        ౨. అందులోఁ, గలిగిన యర్థభేదములఁ గైకొని చెప్పఁగ నొప్పు కొప్పుఁ - జెక్కులు – రదనాంశుకంబు.

        అందులోన్ = ఇందాక `పూర్ణచంద్రబింబము' అని అర్థం చెప్పుకొన్న ఆ `ఘనచంద్రబింబ' అన్న సమాసాన్ని ఉపమానత్రయీగర్భమైన సమాసంగా తీసుకొని - ఆ సమాసంలోని 1) ఘన 2) చంద్ర 3) బింబ శబ్దాలకు, కలిగిన = ఏర్పడిన, అర్థభేదములన్ = అర్థభేదాలను, కైకొని = పురస్కరించుకొని, ఆ అర్థాలు మూడింటికీ కొప్పు – చెక్కులు – రదనాంశుకంబులతో, చెప్పఁగన్ = పోలికను చెప్పడం, ఒప్పున్ = సమంజసం – అని భావం.

        సంస్కృతాంధ్రసాహిత్యాలలో ఇటువంటి ప్రయోగం వేఱొకటి లేదు. ఎలాగంటే –

1.    ఘనము = అంటే ఇందాక `నిండైన' అని అర్థం అనుకొన్నాము. ఇప్పుడు `మేఘము' (`ఘనో'మ్బుదః' – అని ధరణికోశం) అని ఉన్న అర్థభేదాన్ని చెప్పుకోవాలి.  ఆ మేఘంతో కొప్పు – వేణీభరానికి నైల్యాధిక్యం వలని పోలిక.

    చూ –

    `గీ.     చంద్రభీతఘనధ్వాంతసంచయమున

              కభయ మొసఁగి వేణీభరం బను నెపమునఁ,

              దాన వెనుక వేసికొన్నది తరుణి మొగము;

              చంద్రుఁ గైకొనమి కిదియ సాక్షి గాదె.'

                            –  పింగళి సూరన ప్రభావతీప్రద్యుమ్నం (2-67)

2.   చంద్రము = అంటే ఇందాక `చంద్రుడు' అని చెప్పుకొన్నాము. ఆ `చంద్ర' శబ్దానికి ఇప్పుడు `బంగారము', `కర్పూరము' (`చంద్రః కర్పూర కామ్పిల్ల సుధాంశు స్వర్ణ వారిషు" – మేదినీ కోశం) అని రెండర్థాలు. ఆ సువర్ణ  కర్పూరాలతో చెక్కులు = చెక్కిళ్ళకు బంగారపు మేల్మి నిగారింపు వలన, కర్పూరపు సౌరభ స్నిగ్ధత్వాల వలన పోలిక.

    చూ –

    `సీ.     కలికి చెక్కులు చంద్రఖండంబులై పొల్చు'

-      రామరాజభూషణుని వసుచరిత్ర (2-33)

3.  బింబము = అంటే ఇందాక `చంద్రుని బింబము' అని అర్థం చెప్పుకొన్నాము. ఇప్పుడు ఆ `బింబ' శబ్దానికి `దొండపండు' (`బింబం తు ప్రతిబింబే స్యా న్మణ్డలే బిమ్బికాఫలే' – అని హైమకోశం) అని అర్థం. ఆ దొండపండుతో రదనాంశుకంబు = పెదవికి - ఎఱ్ఱదనం వల్ల పోలిక.

దంతచ్ఛదమంటే దంతపంక్తికి కప్పు - పెదవి అన్నమాట. `హరాజటాజూట చంద్రరేఖామృతంబు, నబల! నీ దగు దంతచ్ఛదామృతంబు సమముగా...' అని శ్రీనాథుని శృంగారనైషధం (5-27). దంత – రదనాలు, ఛద – అంశుకాల పర్యాయవాచిత్వం వలన రదాంశుకము అన్న పదసృష్టి జరిగింది. పెదవికి రూపసామ్య వర్ణసామ్యాల వల్ల దొండపండుతో ఔపమ్యఘటనం సుప్రసిద్ధమే.

    చూ –

    “సీ.    కమల లక్షణలక్ష్మి గణియించు మొగ మోష్ఠ

                        మరుణబింబపు రక్తి నవఘళించు.”

-   తిరుమల బుక్కపట్టణం వేంకటాచార్యుల అచలాత్మజాపరిణయం (2-40)



v మూడవ దళం: ఆ అర్థభేదాలకు మళ్ళీ పర్యాయపదాలతో ఔపమ్యం v

          ౩.  అవి గుబ్బలకున్ సరిరాకపోయె; చేతులు సరియయ్యె; దాని గతిఁ దోఁచెను పొంకపుటారు.

అవి = ఆ `ఘనచంద్రబింబ' ప్రయుక్తిలోని అర్థభేదాలను (అంటే, ఆ పదాల పర్యాయవాచిత్వం వలన ఏర్పడిన సరికొత్త అర్థభేదాలను) పురస్కరించుకొని, ఆ ఘన-చంద్ర-బింబ పదాల పర్యాయవాచకాలకు – 1) గుబ్బలకున్ సరిరాకపోయె 2) చేతులు సరియయ్యె 3) దాని గతిఁ దోఁచెను పొంకపుటారు అని మూడు అలంకృతవాక్యాలతో క్రమాన్వయం.

        ఇది తెలుగులో ఇంతవరకు ఏ కవీ ప్రయోగించని వినూత్నమైన శబ్దచిత్రం.

1.    ఘనము = “గుబ్బలకున్ సరిరాకపోయె.” మొదట `ఘనము' అంటే చంద్రబింబానికి ధర్మవాచకంగా `నిండైన' అనీ; ఆ తర్వాత ఘనమంటే `మేఘము' అనే అర్థంలో `కొప్పు'తో = వేణీభరంతో పోలికను చెప్పుకొన్నాము.

ఇప్పుడు ఘనము = మేఘము అనే అర్థాన్ని కలిగిన ఆ `ఘన' శబ్దానికి వేఱొక పర్యాయమైన `జీమూతము'ను గ్రహించాలి. (`ఘనో మేఘే' – మంఖకోశం; `జీమూతో వారిదో నభ్రాట్ పర్జన్యో'మ్బుద' అని హర్షకీర్తి శారదీయ నామమాల).

`ఘన' శబ్దానికి పర్యాయపదమైన “మేఘ' శబ్దానికి పర్యాయమైన ఆ `జీమూత' శబ్దానికి గల మఱొక అర్థం `పర్వతం' (`జీమూతో మేఘ పర్వతౌ' – ఇరుగప దండేశుని నానార్థ రత్నమాల).

ఆ పర్వతం `గుబ్బలకున్ (=స్తనములకు) సరి రాకపోయె' అని అన్వయం. ఉపమేయాని కంటె ఉపమానానికి అపకర్ష చెప్పబడుతున్నది.

    చూ –

            `గట్టిగ నుండు కొండలును ... ఇం,

            కెట్టుగ ఈడనం బొసఁగు? నింతి మిటారపు గుబ్బదోయికిన్.'

-   కూచిమంచి తిమ్మకవి నీలాసుందరీ పరిణయము (2-23)

2.  చంద్ర = “చేతులు సరియయ్యె”. మొదట ముఖానికి ఉపమానంగా `చంద్ర' శబ్దానికి అర్థం `చంద్రుడు' అని చెప్పుకొన్నాము. ఆ తర్వాత `సువర్ణము', `కర్పూరము' అనే అర్థాలలో `చంద్ర' శబ్దానికి చెక్కిళ్ళతో పోలిక చెప్పుకొన్నాము.

ఇప్పుడు `చంద్రుడు' అనే ఆ వెనుకటి అర్థంలో (`చన్ద్రో నిశాకరః శౌరిః కలశాబ్ధిభవో భవః భవావతంసః కమలీ వార్ధిసూనం నపుంసకమ్' – అని భోజుని నామమాల) ఉన్న ఆ `చంద్ర' శబ్దానికి పర్యాయమైన `అబ్జ' శబ్దాన్ని గ్రహించాలి (`అబ్జో జైవాతృకః సోమ' – అమరకోశం).

`చంద్ర' శబ్దానికి పర్యాయపదమైన ఆ `అబ్జ' శబ్దానికి గల మఱొక అర్థం `పద్మము' (`లవణామ్బుజయో రబ్జం క్లీబే శంఖే తు పుంసి వా, పుంస్యేవ నిచులే శీతరశ్మౌ ధన్వన్తరావపి' – నానార్థరత్నమాల).

    ఆ `పద్మము'నకు `చేతులు సరియయ్యె' అని ఔపమ్యఘటనం.

    చూ –

            `చేతుల కబ్జములే తుల'

-      చేమకూర వేంకటకవి విజయవిలాసం (1-196)

3.   బింబ = “దాని గతిఁ దోఁచెను పొంకపుటారు.”

మొదట ముఖవర్ణనలో `బింబము'నకు `చంద్రుని యొక్క మండలము' అనీ; ఆ పిమ్మట అధరానికి విశేషణంగా `బింబికా ఫలము' అనీ అర్థద్వయాన్ని చెప్పుకొన్నాము. ఇప్పుడు `బేతి – శోభతే' అన్న వ్యుత్పత్త్యర్థంలో `చంద్రుని యొక్క సుధాసారము' అని ప్రతిపాదింపబడుతున్నది.

`బింబ' శబ్దానికి గల మఱొక ప్రయుక్తివిశేషం `మండల'. చంద్రబింబము – చంద్రమండలము సమానార్థంలో ప్రయుజ్యాలు. `బింబము' అంటే చంద్రునిలోని అమృతపు నిగ్గు. `మండలము'  అంటే కళలు నిండి ఉన్నప్పటి ప్రసన్నమైన తేజోమయరూపం. “బిమ్బే తస్య సుధాసారః, కలాపూర్ణం చ మణ్డలం” - అని భోజుని నామమాలిక. `సుధారసమయారం తు తుషారనిచయాకృతిమ్, హారపఞ్జలసారస్య బహిఃస్థం చారు రాజతే'  అని పౌష్కరసంహిత (14-1) లో  చంద్రబింబలక్షణం.

అర్థసామ్యం వల్ల `బింబ' – `మండల' శబ్దాలు పర్యాయఘటితాలు కాగా, `మండల' శబ్దానికి గల మఱొక అర్థం `పాము'. `మణ్డలం ద్వాదశరాజకే చ దేశే చ బిమ్బే చ కదమ్బకే చ కుష్ఠప్రభేదే 'ప్యుపసూర్యకే'పి భుజఙ్గభేదే శుని మణ్డలః స్యాత్' – అని మహేశ్వరసూరి విశ్వప్రకాశం).

    ఇప్పుడు ఆ మండలార్థమైన `పాము'కు నూగారుతో పోలిక.

    చూ –

    `క.    అండజగామిని యూరుపుఁ

            బిండు వలపు లాన నాభిబిలము వెల్వడి చ

            న్గొండల నడుమను బ్రాఁకెడు

            కుండలియో యనఁగ నారు కొమ రొప్పారున్.'

-      శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద (5-25)

     దాని గతిన్ = ఆ మండలము వలె, పొంకపు+ఆరు = నిండు నూగారు, తోఁచెన్ = పొడచూపెను అని ఉపమ.

       పద్యంలో ప్రతిపాదింపబడుతున్న అర్థాలు మూడు విధాలు:

1.    ముఖము `ఘనచంద్రబింబనిభ'మై నిండు చంద్రుని వలె కళాపూర్ణమై శోభాయమానంగా ఉన్నది.

2.  `ఘనచంద్రబింబ'అన్న దళంలోని అర్థభేదాలను పురస్కరించుకొని వేణీభరం (“ఘన = మేఘము”) నల్లదనం వల్ల మేఘమును; చెక్కిళ్ళు (“చంద్ర = సువర్ణము, కర్పూరము”) నిగారింపు వలన సువర్ణాన్ని, సౌరభ స్నిగ్ధత్వాల వల్ల కర్పూరాన్ని; పెదవి (“బింబ = దొండపండు”) దొండపండును పోలి ఉన్నాయి.

3.  ఆ అర్థభేదాలే పర్యాయపదాల అర్థాలతో పునరుపక్రాంతా లైనప్పుడు (“ఘన = జీమూతము > పర్వతము”) పర్వతము ఆమె వక్షోజమునకు సాటి రాలేకపోయింది. కరములు (“చంద్ర = అబ్జ > పద్మము”) పద్మములను పోలి ఉన్నాయి. నూగారు (“బింబ = మండల > పాము”) పామువలె భాసిస్తున్నది. 

        `దాని గతిఁ దోఁచెను పొంకపుటారు బోఁటికిన్' అన్నప్పుడు పద్యంలో బోఁటికిన్ = కాంతకు (నాయికకు) అనీ; బోఁటికిన్ = సాదృశ్యమునకు అనీ రెండర్థాలు. సాదృశ్యార్థంలో రెండవసారి చెప్పిన అర్థత్రయానికీ – అంటే, `గుబ్బలు సరిరాకపోయె', `చేతులు సరియయ్యె', `తోఁచెను పొంకపుటారు' అన్న మూడు దళాలకూ ఇది వర్తిస్తుంది.  ఉపమాంతర్భావిగా ఇన్ని ఆహ్లాదనీయ చమత్కృతవాక్యాలను సాలంకృతంగా అనుప్రాణింపగలగటం కవి కావ్యకళాశిల్పప్రౌఢికి నిరుపమానమైన నిదర్శనం.

        ఇది గురజాడ శ్రీరామమూర్తిగారు, వేటూరి ప్రభాకరశాస్త్రిగారు భావించినట్లు చాటుపద్యం కాదనీ, కవితరంగిణిలో చాగంటి శేషయ్యగారు `ఈ పద్యము మనకు లభ్యము కాని యే కందర్పకేతువిలాసము లోనివో యైయుండునని నా యభిప్రాయము' అని వ్రాసినట్లు నిజంగానే తెనాలి రామకృష్ణకవి రచించిన కందర్పకేతువిలాసం లోనిదేననీ  నేను వేఱొక వ్యాసంలో నిరూపించాను.

        శబ్దార్థచిత్రాల సమ్యఙ్నివేశానికి, అత్యంతప్రౌఢికి ఉత్తమోదాహరణ ఈ పద్యం. తెలుగులో ఇటువంటి రచన మఱొకటి లేదు.
-----------------------------------------------------
రచన- డా. ఏల్చూరి మురళీధరరావు, 
సృజనరంజని సౌజన్యంతో

Saturday, April 13, 2019

గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2.


సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: 
గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర 
విజయవిలాసము – 2.



సాహితీమిత్రులారా!

నిన్నటి తరువాయి.................

వేంకటకవి ఆత్మోత్కర్షను, వైభవోత్కలికను గురించిన ఈ విమర్శ విషయాన్ని నేనింత విపులంగా ఉదాహరించటానికి గల నేపథ్యాన్ని వివరించాలి.

గ్రంథచౌర్య విమర్శ
వీరేశలింగం గారు ఇప్పుడు మనకు దుర్లభంగా ఉన్న ఆ తమ వ్యాసంలో వేంకటకవి పద్యాన్ని పోలిన పద్యం ఒకటి మూర్తికవి కావ్యాలంకారసంగ్రహంలో ఉండటాన్ని గుర్తించి విమర్శించినట్లున్నది. పూండ్ల రామకృష్ణయ్యగారు తమ పీఠికలో దానిని కొంత సమన్వయించే ప్రయత్నం చేశారు. వీరేశలింగంగారికి అది నచ్చినట్లు లేదు. అసలే స్వోత్కర్షాపరుడని వేంకటకవిమీద బారెడు కోపంతో ఉన్నందువల్ల మరింతగా మండిపడి, ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలో మూర్తికవి కావ్యాలంకార సంగ్రహం నుంచి అభిమానగౌరవాల వల్ల కొంత భాగాన్ని అనుకరించటం జరగలేదని, వేంకటకవి చేసింది ‘గ్రంథచౌర్యము’ అనే నిశ్చయానికి వచ్చారు. అందువల్ల కవుల చరిత్రములో:

వేంకటకవి గ్రంథచౌర్యము చేయువాఁడగుట తెలియుటకయి నరసభూపాలీయము నుండియు, వేంకటేశ్వర విలాసము నుండియు నొక్కొక్క చిన్న పద్యము నుదాహరించుచున్నాము –

ఔరా యోబ నృపాల కు, మారా మను మదనసమ రమాధుర్యుఁడవై
ధీరా నృసింహ కూడితి, మా రామను మదనసమరమాధుర్యుఁడవై.

అని యీ పద్యము కావ్యాలంకార సంగ్రహములో పాదయమకమునకు లక్ష్యముగా నీయఁబడియుండఁగా, వేంకటకవి,

ఔరా మాధవయజ్వ కు, మారా మను మదనసమ రమాధుర్యుఁడవై
ధీరా విటార్య యేలితి, మా రామను మదనసమరమాధుర్యుఁడవై.

అని పై పద్యమునే పేరులు మాత్రము మార్చి పంచదశవర్ణయుక్తపాదయమకమని తన పుస్తకములో వేసికొనియున్నాఁడు.

అని వ్రాశారు. వీరేశలింగం గారు వ్రాసినట్లుగానే, కావ్యాలంకారసంగ్రహంలోని పద్యం ‘పాదయమకము’ అన్న శీర్షికతో చతుర్థాశ్వాసంలో (4-80) ఉన్నది. వేంకటకవి పద్యం ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలో పంచదశవర్ణయుక్తపాదయమకము అన్న శీర్షికతోడి 746వ పద్యం. 1977లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారు వేదము వేంకటరాయశాస్త్రి గారి సంపాదకత్వంలో ప్రకటించిన ప్రతిలో ఇది 730వ పద్యంగా కనబడుతుంది. ఓబ నృపాల కుమారా = గొబ్బూరి ఓబ నరేంద్రునియొక్క తనయుడవైన నరస రాజా, మదనసమ = మన్మథునితో సమానమైన, రమాధుర్యుఁడవై = సౌందర్య యౌవన లక్ష్మీసంపన్నుడవై, మనుము = జీవింపుము అని అన్వయం. ఔరా! ఓబ నృపాల కుమారా! అన్నదానిని కావ్యాలంకారసంగ్రహంలో నుంచి తన కథానుసారం నాగదత్తోపాఖ్యానంలో, ఔరా! మాధవయజ్వ కుమారా! అని అనువర్తించికొన్నాడు. ధీరా! నృసింహ! కూడితి – అన్న దళాన్ని కావ్యాలంకారసంగ్రహంలో నుంచి సందర్భానుగతంగా ధీరా! విటార్య! యేలితి – అని మార్చుకొన్నాడు. మను మదనసమ రమాధుర్యుఁడవై అన్న యమకం ఉభయపద్యాలలోనూ సమానంగా ఉన్నది. పాదయమకానికి సాటిగా తానొక పాదయమకాన్ని వ్రాయక కావ్యాలంకారసంగ్రహంలో నుంచి యాథాతథ్యభావంతో ఎటువంటి మార్పూ లేకుండా ఉన్నదున్నట్లుగా స్వీకరించటం వల్ల వీరేశలింగంగారికి కోపం వచ్చింది.

పూండ్ల రామకృష్ణయ్యగారి ముద్రణ ఈ తరం పాఠకులకు సులభంగా దొరకదు. అందువల్ల ఈ వ్యాసంలో పాఠకుల సౌకర్యార్థం పద్యసంఖ్యలను నేనిక అకాడమి వారి ముద్రణ నుంచే ఇస్తున్నాను. వీరేశలింగంగారు చూపలేదు కాని, ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలో కావ్యాలంకార సంగ్రహానికి అనుకరణలు ఇంకా అనేకం కనబడతాయి. కొన్నింటి శీర్షికలు కూడా రెండింటిలోనూ ఒక విధంగానే ఉన్నాయి. వాటిలో కొన్నింటిని చూపుతాను:

అస్ఫుటము

శ్రీనాయక! తావక భుజ
మానితఖడ్గంబు సకలమహిమండలిలో
నానా రిపుభూనాథ వి
తానార్జిత కీర్తిదుగ్ధధారలు గ్రోలున్. కావ్యా. (2-154)

ఓ రాజా! నీ చేతిని అలంకరించిన ఖడ్గం శత్రురాజులు ఆర్జించిన కీర్తి అనే దుగ్ధాన్ని గ్రోలుతున్నది అని భావం. ఇందులో గొబ్బూరి నరసరాజు చేతిలోని ఖడ్గం పామువలె ఉన్నదని, ఆ ఖడ్గభుజంగి రిపుభూనాథవితానం ఆర్జించిన కీర్తిదుగ్ధధారలను గ్రోలుతున్నదని అన్నప్పుడు ఖడ్గానికి పాముతో గల ఔపమ్యం స్ఫుటంగా లేదు. అరికీర్తిదుగ్ధ మానును, ధరణీశ్వరు ఖడ్గ మనుడు దర్వీకరశే, ఖరము గతి బొల్చు ననియెడి, సరసోపమ కృతులయందు జను నస్ఫుటమై – అని మూర్తికవే దీని ఆంతర్యాన్ని ఆవిష్కరించాడు. ఈ వివరణ మాటెలా ఉన్నా, ఇది అస్ఫుటవ్యంగ్యానికి లక్ష్యమన్నమాట ఇక్కడ ప్రసక్తం. దీనికి వేంకటకవి అనుకరణ ఇది:

అస్ఫుటకందము

శ్రీనాయక! తావక భుజ
మానితఖడ్గంబు సకలమహిమండలిలో
నానా శూరసేనా సం
తాన యశఃస్నిగ్ధదుగ్ధధారలు గ్రోలున్. ప్రబంధ. (140)

వేంకటకవి కావ్యాలంకారసంగ్రహాన్ని యథాతథంగా గ్రహించిన సంగతి స్పష్టంగానే కనబడుతున్నది. మూర్తికవి అస్ఫుటవ్యంగ్యానికి ఇచ్చిన ఉదాహృతిని తానుకూడా అస్ఫుట కందము అని ఆ విధంగానే పేర్కొన్నాడు. శ్రీనాయక! అని మూర్తికవి ప్రభువు పరంగా చెప్పిన సంబోధనను శ్రీ వేంకటేశ్వరునికి అన్వయించాడు. తావక భుజ,మానితఖడ్గంబు సకలమహిమండలిలో, నానా రిపుభూనాథ వి, తానార్జిత కీర్తిదుగ్ధధారలు గ్రోలున్ – అన్నదానిని ఆ విధంగానే కొద్దిపాటి మార్పుతో తావక భుజ,మానితఖడ్గంబు సకలమహిమండలిలో, నానా శూరసేనా సం,తాన యశఃస్నిగ్ధదుగ్ధధారలు గ్రోలున్ – అని గ్రహించాడు. రిపుభూనాథ – శూరసేనా; సంతానము – వితానము; కీర్తి – యశస్సు అన్నవి మాత్రమే పర్యాయరచనలు. ఇంకొక ఉదాహరణను పరిశీలిద్దాము:

అశ్లిష్టమాలాపరంపరిత రూపకము

వనితానేత్రచకోరచంద్రిక యశోవల్లీవసంతోదయం
బనిదంపూర్వకథాసుధాబ్ధి భుజగర్వాదిత్యపూర్వాచలం
బనఘోద్యద్గుణరత్నరోహణము నీ యాకార మెవ్వారికిన్
వినుతింపన్ వశమే? నృసింహ! కరుణావిన్యాస! ధన్యాత్మకా! కావ్యా. (5-49)

ఆర్తరక్షాపరాయణత్వం మూలాన ధన్యుడవై, శరణాగతుల యందు కరుణను కురిపించే ఓ నరస రాజా! నీ శుభాకారం మరులుగొన్న కాంతల కన్నులు అనే చకోరాలకు వెన్నెల. కీర్తి అనే పందిరి తీగకు వసంత కాలోదయం. అపూర్వమైన పుణ్యకథామృతానికి పాలకడలి. భుజదర్పము అనే సూర్యునికి తూర్పుకొండ. పావనములైన గుణరత్నములకు వెండికొండ. ఎంతటివారికైనా నీ రూపశోభను వర్ణించటం సాధ్యమేనా? అని మాలాపరంపరితంగా రూపకాలను కూర్చటం జరిగింది. వీటిలో శ్లేషాధారితం ఏదీ లేదు. అందువల్ల అశ్లిష్టమాలాపరంపరితరూపకాలంకారం అన్నమాట. వేంకటకవి పద్యాన్ని పరిశీలిద్దాము:

అశ్లిష్టమాలాపరంపరిత రూపకము

వనితాదృక్కుముదేందుబింబము యశోవల్లీవసంతాగమం
బనిదంపూర్వకథాసుధాంబుధి భుజౌజోర్కోదయక్ష్మాధరం
బన రాజద్గుణరత్నరోహణము నీ యాకార మెవ్వారికిన్
జనునే సన్నుతి సేయ? శ్రీహరి! దయాసంత్రాతమాద్యత్కరీ. ప్రబంధ. (140)

తులనాత్మకంగా చూసినప్పుడు రెండు పద్యాలూ బింబప్రతింబాలని తెలుస్తూనే ఉన్నది. ప్రభుసన్నుతిని జగత్ప్రభుసన్నుతిగా పరివర్తించటం మాత్రమే ఇక్కడ జరిగింది. తక్కినదంతా పర్యాయపదాలతో యాథాయథ్యంతో చేసిన అనుకరణ మాత్రమే అని అంగీకరింపక తప్పదు.

అయితే, గ్రంథచౌర్యము చేయువాఁడు పదబంధాలకు పదబంధాలను, పాదాలకు పాదాలను, పద్యాలకు పద్యాలను అపహరించటమే గాక, ఆ పద్యాల శీర్షికలను కూడా అపహరిస్తాడా? అని వీరేశలింగం గారు ఆలోచింపలేదు. అసలే కోపంమీదున్నారు. దానితో గ్రంథచౌర్యము చేయువాడు అని తీవ్రమైన నిందమోపటానికి జంకలేదు.

పూండ్ల రామకృష్ణయ్యగారు ఈ ఆరోపణకు తగిన సమాధానం చెప్పాలని ఎంతో ఆలోచించారు. వారికేమీ తోచలేదు. మొత్తం మీద ఒక నిర్ణయానికి వచ్చి, తమ పీఠికలో ఈ విధంగా వ్రాశారు:

బట్టుమూర్తిగారి విరచితమగు నరసభూపాలీయమను కావ్యాలంకారసంగ్రహమును నిక్కవి పూర్ణముగఁ జదివి యందలి లక్ష్యములగు పద్యములం బోలిన పద్యము లిం దనేకములు వ్రాసియున్నాఁడు. ఇంతయేల. కొన్నికొన్ని పద్యములం బోల్చి యంకితాంకములు విడిచి చదివినచో నించుక యైనను భేదము లేకయున్నవి. ఇది చూచునప్పు డి క్కవికి సామర్థ్యము లేక వానిని స్వీకరించినాఁడని యనవలసి వచ్చుచున్నది. అట్లనుటకు మా కించుకయైనను ధైర్యము చాలదు. గుణగ్రహణపారీణులకుఁ దెలియుటకుగా నాయాయి పద్యముల సంఖ్యను నిందుఁ బోల్చి చూపుచున్నాము గాన నయ్యయి పద్యములను బోల్చి చదువుకొనుఁడు.

అని వ్రాసి, రామకృష్ణయ్యగారు రెండు కావ్యాలలోని పద్యాలకూ ఒక పట్టికను వేసి, పోలికలున్న 32 పద్యాల సంఖ్యలను ఇచ్చారు. వారు చూపిన ఆ పద్యాల సంఖ్యలలో కొన్ని పొరపాట్లున్నాయి. అవన్నీ నిజంగా పోలిక కలిగినవి కావు. కొన్నింటి శీర్షిక మాత్రమే రెండు కావ్యాల పద్యాలకూ ఒకటే అయినా, ఆ పద్యాలలో నిజంగా ఎటువంటి పోలికా లేదు. అటువంటి పదహారింటిని నేను వారిచ్చిన పట్టికలో నుంచి తీసివేసి, మిగిలిన పదహారింటిని మాత్రం ఈ క్రింద చూపుతున్నాను:

నరసభూపాలీయము ప్రబంధరాజము నరసభూపాలీయము ప్రబంధరాజము
4-75 139 5-83 351
2-155 140 2-131 353
5-51
141 5-160 360
2-92 146 5-59 362
5-76 147 5-49 363
5-22 149 5-98 368
3-31 206 2-129 388
3-24 215 2-82 423
ఈ పట్టికను చూపుతూ రామకృష్ణయ్యగారు ఇంకొక మాటన్నారు:

నరసభూపాలీయములోని పద్యముల వలె యతిస్థానములు విడువకయే యిందును వ్రాయఁబడియున్నవి. ఎట్లనగాఁ జూడుఁడు. నరసభూపాలీయము చతుర్థాశ్వాసము నందలి 89వ వృత్త, కంద, గర్భ సీసము:

మహిత విద్వజ్జనమండలీ వినుత సా
        హిత్యప్రియంభావు కాత్యుదార
వితత భీమాహవ విక్రమక్రమ సము
        ద్యద్వైరినిర్భేదనాభిరామ
వినుతవిశ్రాణనవిభ్రమాపహసితా
        నూనామరక్ష్మారుహా నృపేంద్ర
వినతభూపాలకవిస్ఫురన్మకుటర
        త్నద్యోతితాంచత్పదా మహాత్మ

నిరుపమదయాపయోధి నిరత భరిత
చారుచరిత నిర్మలతర సత్యరుచిర
తరణికులమణీ నరసింహ ధరణిరమణ
ఘనతరగుణనిధీ మను జనులు బొగడ.

ఇఁక నీ ప్రబంధరాజములోని పై పద్యమును బోలిన పద్యమును జూడుఁడు:

మహిత నానామునిమండలీ విరచితా
        హీనాతివేల్లత్స్తవానుషంగ
వితతజన్యాంగణ విక్రమక్రమలస
        త్క్రవ్యాదసమ్హారకానుభావ
వినతబర్హిర్ముఖవిస్ఫురన్మకుట ర
        త్నశ్రేణిరాజత్పదాభిరామ
విగత విశ్రాణన విస్మయస్మయదివౌ
        కశ్శాఖి జైవాతృకాదిదాన

నిరుపమకృపాపయోంబుధి నిరతశుభద
ధీరచరిత నిర్మలతరదేహరుచి జి
త సజల జలదాయురాగేంద్ర ధరణిధరవ
ర యురుసుగుణనిధీ పక్షిరాజవాహ.

పై పద్యములోని మహిత, వితత, వినత అను మూడు పదములు నరసరాజీయమునందు సీసపద్యములో 1, 2, 4 సీస పాదాదులయందుఁ గూర్పఁబడియున్నవి. నరసభూపాలీయము నందలి సీసపద్యములోని విద్వజ్జనమండలీ అను సమాసమును నానామునిమండలీ అను సమాసముగాను, భీమావహ విక్రమక్రమ సమాసమును జన్యాంగణ విక్రమక్రమ అను సమాసముగాను భూపాలకవిస్ఫురన్మకుటరత్న అను సమాసమును బర్హిర్ముఖవిస్ఫురన్మకుటరత్న అను సమాసముగాను నిందు మార్పఁబడియున్నవి. ఇంతియ కాదు. నరసరాజీయములో సీస తేటగీతి యందలి నిరుపమదయాపయోనిధి నిరత భరిత అను వాక్యమును నిరుపమ కృపాపయోంబుధి నిరతశుభద అను వాక్యముగాను, ఘనతరగుణనిధీ అను పదమును ఉరుసుగుణనిధీ అను పదముగాను మార్పఁబడియున్నవి.

… అరయఁగా నరసభూపాలీయమును ముందిడుకొని యీ గ్రంథమునందు కొన్ని పద్యములు వ్రాసినట్లెంచవలసియున్నది. …

… ఇక్కవికి సామర్థ్యములేక వానిని స్వీకరించినాఁ డనవలసివచ్చుచున్నది. అ ట్లనుటకు మా కించుకయైనను ధైర్యము చాలదు. …

అని ఇంత విపులంగా, అక్షరాక్షరం వివరించారు. అంతటి సమర్థుడైన మహాకవి చేసినది గ్రంథచౌర్యం అనటానికి సందేహించారు.
మూర్తికవి కావ్యాలంకార సంగ్రహముతోడి పోలికలు
నిజానికి, పూండ్ల రామకృష్ణయ్యగారు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం నుంచి పట్టికను వేసి చూపిన పద్యాలే కాక – ఇంకా అనేకపద్యాలు వేంకటకవి కావ్యాలంకారసంగ్రహం నుంచి తీసికొన్నవి ఉన్నాయి. రామకృష్ణయ్య గారు ప్రదర్శించిన పట్టికలోని కొన్నింటిని అనుకరణలు అనటానికి వీలులేదని చెప్పాను. వారు కావ్యాలంకార సంగ్రహంలోని (2-89) సంఖ్య గల పద్యం ప్రబంధరాజంలోని 152వ పద్యానికి అనుకరణమని అభిప్రాయపడ్డారు. ఆ రెండింటికీ శయ్య అనే శీర్షిక ఉండటం మాత్రమే పోలిక. అవి రెండూ శైలి నిరూపణకు విషయాలే కాని, ఒకదానికొకటి అనుకరణలు కావు. పద్యశిల్పంలో మాత్రమే కొంత సామ్యం ఉన్నది కాని, తుల్యసంవాదం లేదు. ఒకానొక ఎత్తుగడ ఆదర్శమైనంత మాత్రాన పద్యాలలో బింబప్రతిబింబత్వం ఉన్నదనటం సరికాదు. అట్లాగే, ప్రబంధరాజంలోని 212-వ పద్యానికి సారాలంకారానుప్రాణితైకావళ్యలంకారము అని శీర్షిక. మూర్తికవి కావ్యాలంకారసంగ్రహములో నుంచి రామకృష్ణయ్య గారు చూపిన సారాలంకారానికి, ఏకావళికి ఉన్న లక్షణలక్ష్యాలతో దానికి ఎటువంటి పోలికా లేదు. ప్రబంధరాజంలోని 192-వ పద్యానికి, కావ్యాలంకార సంగ్రహంలోని (2-63) వ పద్యానికి అజహల్లక్షణము అన్న శీర్షికే తప్ప రామకృష్ణయ్య గారు భావించినట్లు ఎటువంటి పోలికా లేదు. కావ్యాలంకార సంగ్రహంలోని (5-102) వ పద్యానికి, ప్రబంధరాజంలోని 356-వ పద్యానికి ఒకపాటి ఛాయానుసరణమే తప్ప శబ్దానువాదం లేదు. పోలిక ఏ మాత్రం లేని అటువంటి పదహారు పద్యాల సంఖ్యలను నేను రామకృష్ణయ్య గారిచ్చిన పై పట్టికలో నుంచి తొలగించి, ఎంతో కొంత పోలిక ఉన్నవాటిని మాత్రం ఉంచాను.

ఇక, రామకృష్ణయ్యగారు పేర్కొననివీ; కావ్యాలంకార సంగ్రహంలోనూ, ప్రబంధరాజంలోనూ వేర్వేరు శీర్షికలతో ఉన్నందువల్ల పైపైని చూచేవారికి రెండూ పోలిక కలిగినవని స్ఫురింపనివీ అయిన పద్యాలు కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్నింటి సంఖ్యలను ఈ క్రింద పేర్కొంటున్నాను:

నరసభూపాలీయము ప్రబంధరాజము నరసభూపాలీ. ప్రబంధరాజ. నరసభూపాలీ. ప్రబంధరాజ.
5-70 142 2-75 482 5-113 710
5-101 145 5-181 488 3-76 711
5-133 150 3-61 537 2-161 728
4-63 151 3-55 542 5-106 729
3-102 259 3-63 543 4-81 730
5-102 355 అవతారిక – 61 562 5-169 744
2-117 429 3-41 558 4-89 730
3-39 445 3-380 559 2-20 820
3-101 452 5-13 689 2-20 151
3-36 453 4-67 692 3-37 823
3-41 454 3-148 709
కూచిమంచి తిమ్మకవి రసికజనమనోభిరామముతోడి పోలికలు
వీరేశలింగంగారు వేంకటకవిని గురించి ఇంకొక విమర్శను కూడా చేశారు. పూండ్ల రామకృష్ణయ్యగారు ఎంతో ఆలోచించి, దానికి కూడా తగిన సమాధానం చెప్పలేకపోయారు. వీరేశలింగంగారి మాటలివి:

ఈ గణపవరపు వేంకటకవి తనకుఁ బూర్వులయిన కవుల కావ్యములలో నుండి గ్రంథచౌర్యమును విశేషముగాఁ జేసినవాఁడయినందున, — తిమ్మకవి గ్రంథముల నుండియు చౌర్యము చేసినాఁడని చూపుటకుఁ దగిన నిదర్శనము లేకపోలేదు. ఇరువుర గ్రంథములలోని యీ పద్యములను జూడుఁడు –

రసికజనమనోభిరామము (4-173) ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము (ప. 541)
బింబోష్ఠి యని నీవు పెనఁగ రాదు శుకంబ
        సాంకవగంధి యీ పంకజాక్షి
పంకజాక్షి యటంచుఁ బదరకు తేఁటి చం
        పకజాలనాస యీ పల్లవాంఘ్రి
పల్లవాంఘ్రి యటంచు బాధింపకు పికంబ
        రామాంగి యీ బిసప్రచయబాహ
బిసబాహ యని రాకు వెస నంచ జలద శి
        రోరుహ యీ మహి రోమరాజి
యహిపరోమాళి యంచు డాయకయు నెమ్మి
కార్ముకభ్రూలతిక యీ చొకారపుఁ జెలి
యనుచు శుక భృంగ పరభృత హంస నీల
కంఠ నికురుంబములఁ దద్ద కనలి పలికె.

చక్రస్తని యటంచు జగడించకు శశాంక
        గురుతమోవేణి యీ కుందరదన
మధురాధర యటంచు మట్టుమీఱకు తేఁటి
        చంపకనాస యీ జలజవదన
బిసబాహ యని మాఱు మసలకు రాయంచ
        జలధరచికుర యీ కలువకంటి
పల్లవకర యని త్రుళ్లకు కోయిల
        శ్రీరామమూర్తి యీ కీరవాణి
వదన కుంతల యాన సుస్వర సఖిత్వ
మొనసి యుండుట కతన మీ కిత వొనర్పు
ననుచు నళి చంద్ర పరభృత హంసములకు
భయము నయమునఁ దెలియఁగఁ బలికె మఱియు.

ఈ యుభయులలో నెవ్వఁడు పూర్వుఁడో యాతని పద్యమును జూచి రెండవవాఁడు తన పద్యమునైనను వ్రాసికొనియుండవలెను, లేదా యిరువురును గూడఁ బూర్వమున్న యిటువంటి పద్యమును మఱియొకదానిని జూచియైనను వ్రాసికొనియుండవలెను …

వీరేశలింగంగారు అన్నట్లు వేంకటకవి పద్యానికీ, కూచిమంచి తిమ్మకవి రసికజనమనోభిరామంలోని పద్యానికీ పోలికలున్నమాట నిజమే. ఇరువురును గూడఁ బూర్వమున్న యిటువంటి పద్యమును మఱియొకదానిని జూచియైనను వ్రాసికొని యుండవలెను అని వీరేశలింగం గారు ఊహించినట్లు – ఇద్దరూ మంచన కేయూరబాహుచరిత్ర (4-160) లోని పద్యాన్ని అనుకరించిన మాటా నిజమే.

రామకృష్ణయ్యగారు ఈ విమర్శను అంగీకరించారే కాని, తగిన సమాధానం చెప్పలేకపోయారు. వారికేమీ తోచలేదు. ‘ఇక్కవికి సామర్థ్యములేక వానిని స్వీకరించినాఁ డనవలసివచ్చుచున్నది. అట్లనుటకు మా కించుకయైనను ధైర్యము చాలదు,’ అని ఇందాక వ్రాసిన వాక్యాన్నే ఇక్కడా పునరుక్తం చేశారు.

వీరేశలింగంగారు, రామకృష్ణయ్యగారు జాగ్రత్తగా చూసినట్లు లేదు కాని, కూచిమంచి తిమ్మకవి రచించిన రసికజనమనోభిరామంలో నుంచి గణపవరపు వేంకటకవి ఇంకా అనేకపద్యాలను ప్రబంధరాజంలోకి తీసుకొన్నాడు. అవన్నీ స్పష్టమైన అనుకరణలే. ఆ పద్య సంఖ్యలివి:

రసికజనమనోభిరామము ప్రబంధరాజము రసికజనమనోభిరామము ప్రబంధరాజము
2-35 29 2-3 46
4-106 72 1-109 110, 202
1-67 234 6-59 297
3-62 311 1-55, 56 360
2-78 394 3-66 416
3-70 459 2-68 480
2-77, 3-155 503 4-39 518, 520
6-62 542 1-72 564
6-128 608 2-79 669
ఇటువంటివి ఇంకా ఉన్నాయి. వ్యాసవిస్తరభీతి వల్ల ఆ పద్యాలన్నింటిని పేర్కొనటం లేదు.
అయ్యలరాజు నారాయణామాత్యుని హంసవింశతితోడి పోలికలు
రామకృష్ణయ్యగారు ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. వేంకటకవి ప్రబంధరాజంలోని 880వ సంఖ్య గల నమస్కార శబ్దలక్షిత కందద్వయగర్భిత వచనములోని చాలా భాగం అయ్యలరాజు నారాయణామాత్యుని హంసవింశతి కావ్యంలోని (4-213) సంఖ్య గల సీసమాలికను పోలి ఉన్నది. ఆ అనుకరణ ఎలా ఉన్నదంటే, ఒకదానిని చూసి ఒకదానిలోని పాఠాలను సవరించుకోవటానికి వీలుగా ఉన్నది. ఈ రెండు కావ్యాలలోని ఈ పద్యభాగాలూ సాయప వేంకటాద్రి కవి వ్రాసిన సకలజీవసంజీవనములోని (5-22, 5-43) లలో ఉన్న భాగాలను సరిపోలి ఉన్నాయి. కాలానుక్రమణికను బట్టి వేంకటాద్రిని చూసి నారాయణామాత్యుడు, నారాయణామాత్యుని చూసి వేంకటకవి తమతమ రచనలను చేసి వుంటారని ఊహింపవచ్చును. వేంకటకవి అనుకరణ విషయం మాత్రం స్పష్టం. కాదనటానికి వీలులేదు.

రామకృష్ణయ్యగారు ప్రబంధరాజంలో హంసవింశతి కావ్యంలోని ఒక అనుకరణ విషయాన్ని చూశారే కాని, పరీక్షగా చూస్తే ఇంకా అటువంటివి యాభైకి పైగా అనుకరణలున్నట్లు తెలుస్తుంది. రామకృష్ణయ్యగారు జాగ్రత్తగా పోల్చి చూడలేదు. ఒక పోలిక కనబడగానే ఎట్లా సరిపెట్టుకోవాలో తోచక కంగారుపడ్డారనుకొంటాను.

గ్రంథచౌర్యము అనటానికి మనసు ఒప్పుకోదు. ఇక్కవికి సామర్థ్యములేక వానిని స్వీకరించినాఁ డనవలసివచ్చుచున్నది. అట్లనుటకు మా కించుకయైనను ధైర్యము చాలదు. అంటూ, ఒకే మాటను ఎన్నిసార్లని వ్రాస్తారు?

హంసవింశతి కావ్యంలో నుంచి వేంకటకవి తీసుకొన్న పద్యాల సంఖ్యలివి:

హంసవింశతి   ప్రబంధరాజం హంసవింశతి ప్రబంధరాజం హంసవింశతి ప్రబంధరాజం
1-9 అవ.13     1-10 ప.14 1-230 ప.8
2-22, (4-98, 5-370) ప.18 2-22 19 2-225 35
5-222 46 2-159 57 3-29 77
5-263 7 3-29 93 5-123 95
5-124 96 5-125, (5-126) 97, 98 5-128 112
1-140 112 4-186 194 1-42 225
3-31 234 4-70 254 5-355 272
1-58, (1-60) 299 2-4 304 4-195 307
2-19 402 5-103 407 2-101 408
2-81 410 2-235 437 5-169 475
1-62 476 4-196 479 3-70 484
5-19 494 4-72 498 5-21 510
3-128 561 5-84 586 4-140 602
3-147 613 2-142 639 5-152, (5-130, -131) 640
1-245 665 1-242 671, 672 2-104 750
1-155 758 4-14 765
ఇవి కొన్ని మాత్రమే. వీటిలో కొన్ని స్పష్టమైన అనుకరణలు. కొన్ని ఒకపాటి అనుకరణలు. మరికొన్ని కేవలం ఆధారప్రాయమైనవి. ఒకటి రెండు ఉదాహరణలను చూపుతాను:

కుందరమా చెలి పొక్కిలి, కందరమావిలసనములు కచముల్ రదముల్
కుంద రమా సమములు నా, కుం దరమా పొగడ నల కుకుందర సుకటిన్. హంస. (2-19)

కుందరమావిలసమున, కుం దరమా చెలి నఖాళి గుఱి నెన్నఁగ నా
కుం దరమా యని యపు డళు,కుం దరమా కొమ గళమునకుం గనుచోటన్. ప్రబంధ. (402)

హంసవింశతి (2-142) ప్రబంధరాజం (ప. 639)
నెఱినొప్పు మేఘసందేశంబు కనుదోయి
        యందమౌ కువలయానంద మరయఁ
బొంకంపు మోము ప్రబోధచంద్రోదయం
        బధరంబు మణిసార మౌర! చూడ
చెలువంపుఁ జిఱునవ్వు సిద్ధాంతకౌముది
        స్తనయుగంబు రసమంజరి నుతింపఁ
గరరుహంబుల కాంతి కావ్యప్రకాశిక
        ఘననితంబము రసాయనము తలఁపఁ
దను వలంకార; మతనుశాస్త్రములు చూపు
లహహ! మధ్యంబు నాటకం బవనిలోన
విద్యలకు నెల్ల మూల మీ వెలఁదిఁ గనిన
విద్యలు పఠింపఁగా నేల విబుధులకును.

తెఱవ నీ తీయవాతెఱ మణిసారంబు
        రమణి నీ నెన్నొసల్ రసతిలకము
పొలఁతి నీ మోము ప్రబోధచంద్రోదయ
        మతివ నీ నవ్వు కావ్యప్రకాశ
మబల నీ చూపుటొయ్యారంబు కౌముది
        కలికి నీ మే నలంకార సరణి
కొమ నీ కనుంగవ కువలయానందంబు
        మగువ నీ చందోయి మంజరి గతి
నెలఁత నీ కొప్పు మేఘసందేశ మయ్యె
గలికి నినుఁజూచినంతనె కలుగు నతను
విద్య రసికుల కెల్ల నుర్వీస్థలమును
గాఁగ నినువంటి జాణ కీ ఖలుఁడు దగునె.

పైని పద్యాలలోని పోలికలు స్పష్టమే కనుక ఇంతకంటె విస్తరించి వివరింపవలసిన ఆవశ్యకత ఉండదు.
కట్టా వరదరాజు శ్రీరంగమాహాత్మ్యము తోడి పోలికలు
కట్టా వరదరాజు రచించిన ద్విపద రామాయణము పీఠికలో నిడుదవోలు వేంకటరావుగారు వరదరాజు రచించిన మరొక కావ్యం శ్రీరంగమాహాత్మ్యములో నుంచి గణపవరపు వేంకటకవి ఒక పద్యాన్ని అనుకరించాడని చెబుతూ, దానిని ఉదాహరించారు:

ఎకతాళంబున వీరమద్దెళరవం బేకంబుగా నట్టువాల్
ధికతో తొత్తక ఝంకు ఝంకుకిణతాంధిత్తాంగినాలోధికం
ధికతత్తెయ్యది ధిక్కుధిక్కుధికతా ధిత్తాది తాళంబులున్
కకుబంతంబులు మారుఁబల్కుకొన గోల్గశ్యందము న్నాడఁగన్. శ్రీరంగ. (4-161)

ఎకతాళంబున వీరమద్దెళరవం బేకంబుగా నట్టువుల్
ధికతోం తత్తక ఝంకు ఝంకుకిణతాంధిత్తాం కియల్లో ధికు
ద్ధికు తెత్తెయ్య ధిమిక్కుతక్కుధిగుతాం ధిత్తాత్త తాళంబులన్
గకుబంతంబులు మారుఁబల్కుకొను గో … ల్పట్ట నప్పట్టునన్. ప్రబంధ.

వరదరాజు పద్యాన్ని వేంకటకవి పూర్తిగా అనుకరించిన మాట స్పష్టమే. అయితే, వేంకటరావుగారు చూడని విషయం ఏమంటే, ప్రబంధరాజంలో వేంకటకవి వరదరాజు కృతులనుంచి గ్రహించిన పద్యాలు ఇంకా అనేకం ఉన్నాయి. కనీసం పది – పన్నెండు పద్యాలున్నాయి. ప్రబంధరాజంలోనే గాక ఒక పద్యం వేంకటకవి సర్వలక్షణశిరోమణి లోనూ ఉన్నది. దానిని చూడండి:

శ్రీభరిత కుండల కిరీ
టాభా ధగధగిత మందహాస కపోల
శ్రీభరణ రమాకుచకల
శాభోగ విలాస వేంకటాచలవాసా. (శ్రీరంగమాహాత్మ్యము)

శ్రీభామా నర్మోక్తి క
థాభవ నిజమందహాస ధాగధగశ్రీ
శోభిత శుభ తత్కుచకుం
భాభోగకిలాస వేంకటాచలవాసా. (సర్వలక్షణశిరోమణి)

వీటిని బట్టి, గ్రంథచౌర్యము చేయువాఁడు అని నిశ్చయించటం సులభం. ప్రబంధాలను చదివి, దేనిలో నుంచి దేనిని తీసుకొన్నాడో గుర్తుపట్టగలిగితే చాలు. ప్రబంధయుగమున కంతటికిని చెడ్డపేరు తెచ్చినవాఁడు అని ముద్రవెయ్యటానికి పెద్ద ఆలోచన అక్కరలేదు. ఆవేశంలో వీరేశలింగంగారు ఆ పనే చేశారు. పైగా, కవి మితిమీరిన గొప్పలకు పోవటం ఆయనకు నచ్చలేదు. దానితో తీవ్రనిందలకు పాల్పడ్డారు.

ఒక సమర్థుడైన కవి ఇట్లా ఎందుకు చేశాడు? అని స్తిమితంగా ఆలోచించటానికి ఎంతో సహృదయత కావాలి. నిందవేయటం సుళువు. రామకృష్ణయ్యగారు సహృదయంతో ఆలోచించారు కాని, వారికి సముచితమైన సమాధానం తోచలేదు. ఒక నిర్ణయానికి రాలేకపోయారు. కారణ మెయ్యెదియో విచారింపుఁడు అని సవినయంగా సూచించి, అంతటితో వదిలివేశారు. ఆ తర్వాతి విమర్శకులు ఆ మాత్రమూ ఆలోచింపలేదు. గణపవరపు వేంకటకవి కృతులపై పరిశోధన చేసినవారూ పరిశీలింపలేదు.

లక్షణ గ్రంథమా? లక్ష్య గ్రంథమా?
ఇది ఇంకొక చిక్కు సమస్య. గణపవరపు వేంకటకవి రచన లక్షణ గ్రంథమా? లక్ష్య గ్రంథమా? బహుజనపల్లి సీతారామాచార్యుల వారు లక్షణ గ్రంథము అన్న సంగతిని ఇందాక ఉదాహరించాను. 1892 ఆగస్టు 1వ తేదీనాడు అముద్రితగ్రంథచింతామణికి అనుబంధంగా ప్రకటించిన ఒక విడి పీఠికలో పూండ్ల రామకృష్ణయ్యగారు మరొక విధంగా ఆలోచించారు:

… ఇక్కవి తానొక లక్షణగ్రంథమును వ్రాయఁ దలపెట్టి ము న్నిదివఱకే యిద్దరు లాక్షణికులు లక్ష్యలక్షణముల వ్రాసియున్నను లక్ష్యములగు పద్దియములు నరస్తుతులని యెంచి వానిని నోరగ్రుచ్చ మనము రాక తాను మరలఁ గ్రొత్త లక్ష్యములగు పద్యములను మాత్రము వ్రాసి, దానిని శ్రీ వేంకటేశ్వరస్వామికి నంకితం బిచ్చి యీ గ్రంథమును వ్రాసియున్నాఁడు. ఇది కవి యభిప్రాయము గానినాఁడు తాఁ దిరుగ లక్షణమును గ్రంథమునందు వ్రాసియే యుండును. కాఁబట్టి యీ గ్రంథమందుండు పద్యముల కన్నిటికి లక్షణమిది యని కవియే వ్రాసియున్నాడు గాని, యా లక్షణమును వివరించియుండలేదు. కాన మఱియొక గ్రంథమునుంచి లక్షణమును దెలసికొని యిందలి లక్ష్యమును గ్రహించవలయును.

వారికి గణపవరపు వేంకటకవి సర్వలక్షణశిరోమణి విషయం తెలియదు. ఆ రచన అప్పటికింకా బయటపడలేదు. సర్వలక్షణశిరోమణిలో నిర్దిష్టమైన లక్షణానికే ప్రబంధరాజంలో లక్ష్యకల్పన జరిగి ఉండవచ్చునన్న ఊహ వారికి రాలేదు. లక్షణగ్రంథం కాదని, లక్ష్యగ్రంథం మాత్రమేనని మాత్రం ఊహించారు.

1953లో అచ్చయిన, మధుర తంజావూరు రాజుల నాటి దాక్షిణాత్యాంధ్ర సాహిత్యములో నేలటూరి వేంకటరమణయ్యగారు వేంకటకవిని గురించి వ్రాస్తూ, లభించిన గ్రంథములలో నితని ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము గొప్పది. అదియు నమూల్యమైన లక్షణగ్రంథమే కాని, తన్మూలమున నతని కవితాశక్తిని కొంతవఱకు గనుగొనవచ్చును – అని, మరొక్కసారి ఇది లక్షణగ్రంథమన్న భావాన్ని పునరుద్ధరించారు. నిజానికి ప్రబంధరాజంలో లక్షణ నిర్వచనాలు లేవు. వేంకటరమణయ్యగారు పొరబడ్డారనే చెప్పాలి. అందులో నానావిధములైన లక్షణాలకు లక్ష్యాలు మాత్రమే ఉన్నాయి. కవిప్రౌఢోక్తిసిద్ధార్థశక్తిమూల వస్తుకృత వస్తుధ్వని, ప్రాసభేదము, సంస్కృత విభక్త్యంతప్రయోగము అని శీర్షికలు ఉన్నంతమాత్రాన అది లక్షణనిర్వచనం ఎందుకవుతుంది? లక్ష్యరచనమనే చెప్పాలి. అందుకే చాగంటి శేషయ్యగారు ఆంధ్రకవితరంగిణి పన్నెండవ సంపుటంలో దీనికి సమాధానం వ్రాయవలసివచ్చింది: ‘…ప్రతిపద్యము నొక యలంకారమునకో చిత్ర, బంధ కవిత్వము లక్షణముతోఁ గూడిన యొక వృత్తమునకో లక్ష్యముగా రచించుచు వచ్చినాఁడు. అందుచే నిదియొక లక్ష్యగ్రంథమని నుడువవచ్చును.’

ఏకాశ్వాసం ఎందుకున్నది?
ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలో ఒక్క ఆశ్వాసం మాత్రమే ఉన్నది. పద్యసంఖ్య తక్కువేమీ కాదు. దీని విషయమై ఆలోచించి, పూండ్ల రామకృష్ణయ్యగారు ఈ విధంగా వ్రాశారు:

ఆంధ్ర ప్రబంధములలో నాశ్వాసము లనియు నుచ్ఛ్వాసము లనియు నుల్లాసము లనియుఁ దరంగములనియు నంశములనియు ననేకవిధములుగాఁ బ్రతికృతియు విభజింపఁబడియున్నది గాని యీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము వలె గ్రంథమునంతయు నేకాశ్వాసముగా విరచింపఁబడినది యిదివరకు దృష్టిగోచరము గాలేదు. అనేక వ్రాఁతప్రతులఁ జూచితిమి గాని యెన్ని ప్రతులఁ జూచినను నేకాశ్వాసమనియే వ్రాసియున్నది. ఈ గ్రంథమునందు 882 పద్యము లున్నయవి. ఇన్ని పద్దియములను నొక యాశ్వాసమని చెప్పుటకంటే వీని విభజించి వ్రాసి యొండినఁ జదువువారలకుఁ గొంత గ్రుక్కఁద్రిప్పుటకు వసతి గలిఁగియుండును. ఇట్టి వసతి నిసుమంతైన నిక్కవి గల్పించినవాఁడు కాఁడు. కారణమెయ్యెదియో విచారించుకొనుఁడు.

ద్వితీయ ముద్రణ పీఠికలో వేదము వేంకటరాయశాస్త్రి గారన్నారు:

ఈయన కావ్యములో యక్షగాన రచనా ప్రక్రియలు చాలా గలవు. వట్టి కావ్యము గాక, చిత్రకావ్యమును గాక, సంగీతకావ్యముగా కూడ దీనిని గ్రహింపవలసియున్నది. కాఁగా, వానివలెనే, కవి దీనిని ఏకాశ్వాసముగా వ్రాసెనేమో. ఇది నృత్యనాటికగా కూడ కొద్దిమార్పులతో ఆడదగినదిగా కనబడుచున్నది. హరికథాకాలక్షేపమునకు చాల తగియున్నది. సంగీతవిషయముల నెన్నిటినో కవి యిందు చేర్చియున్నాడు.

ఇవన్నీ తెరనాటకమన్న ఊహతో వ్రాసిన మాటలు. అంతగా పట్టించుకోదగినవి కావు.

ఇన్ని అనుకరణలు ఎందుకు?
ప్రబంధరాజంలో ఇన్నిన్ని పూర్వాంధ్రకృతుల అనుకరణలు ఎందుకున్నాయి? అందువల్ల గ్రంథచోరుడన్న విమర్శ సరైనదేనా? ఆఖరికి తనను గురించి తాను చెప్పుకోవలసి వచ్చినప్పుడు, నవగ్రహ నవరత్న నవనిధి నవరస ప్రతిపాదక ప్రతాప సత్కీర్తి సీసము అన్న తన కీర్తిని ప్రతిపాదిస్తున్న అవతారికలోని 31వ సంఖ్య గల పద్యాన్ని సైతం దామెరల వేంగళనాయకుని బహుళాశ్వ చరిత్రము లోనుంచి తీసికొన్నాడు. ఆ పద్యాలను కూడా చూడండి:

పద్మాప్త విద్రుమప్రభఁ గరుణఁ గని హి
        మకరత శృంగారమహిమ వెలసి
ఘన నీల గురుమణి ఖగ రౌద్రతను గేరి
        శంఖజ కవుల హాస్యంబుఁ జేసి
క్ష్మాజ విదూరజౌఘ ముకుంద భయమిడి
        కృత వజ్రవర తమఃస్థితి శమమయి
బుధ పుష్యరాగ సాద్భుత కచ్ఛఁ బరఁగించి
        భా నీల కుంద బీభత్సమందఁ
దగి మహాపద్మ గోమేధిక గరిమ హర
వీరకేతు ద్యుతి జయించి వేఱు వేఱ
నీ ప్రతాపంబు సత్కీర్తి నెగడె నౌర
యప్పయామాత్య కవి వేంకటార్య వర్య. ప్ర. 31

పద్మరాగార్క ప్రభా భయానక మయి
        హిమకర తారాద్భుతము ఘటించి
నీలాప్త గురుచక్ర నిభ రౌద్రగతి మించి
        శంఖ వజ్రోత్త మోజ్జ్వలత నవ్వి
విద్రుమాళి ముకుంద వీరకేతువు మీఱి
        కుంద తారామంద కోప మూని
రక్తాంగ వర పుష్యరాగ బీభత్సమై
        కవి విదూరజ సూత్ర కచ్ఛపాసి
వక్త్రరుచులను గరుణించి వసుధ వెలయు
తన ప్రతాప యశంబులఁ దనరు విబుధ
నుత మహాపద్మ గోమేధిక తరళ స్ర
గంగ శృంగారుఁ డగు వేంకటాద్రివిభుఁడు. బహు. (1-44)


ఈ విధంగా అనుకరణను కవి ఎందుకు చేశాడు? ఇది లక్షణ గ్రంథమా? లక్ష్య గ్రంథమా? ఈ ప్రశ్న లన్నిటికీ సమాధానం ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలో 63వ సంఖ్య గల అవతారికలోని వక్ష్యమాణ లక్ష్య విశేషోద్దేశ వచనము అన్న వచనంలో వేంకటకవి స్పష్టంగానే చెప్పాడు. విమర్శకులు ఆ దృష్టితో చూడకపోవటం వల్ల సాహిత్యచరిత్రలోని ఒక అపురూపమైన విశేషం మరుగునపడిపోయింది. ఇంతకీ, ఆ వచనం ఇది:

వ. అంకితంబుగాఁ బంకజాసనవిలాసినీకరాంచలమణివిపంచికా ఘుమఘుమార్భటీ నిర్భరసుధాప్రాదుర్భవాస్పద నవరససందర్భంబు గుబాళింప విభవంబులకుఁ బ్రభవంబును, విద్యాధికులకు హృద్యంబును, విన్నాణంబులకుఁ జెన్నును, వింతలకుఁ బొంతనంబును, విటవిటీజనంబులకుఁ బుటపుటయును, విరహులకు మెఱమెఱయును, వీటికి నీటును, శబ్దశాస్త్రరీతికి విఖ్యాతియును, ధ్వనుల కునికియును, నుక్తాత్యుక్తాదిగాఁ గల యిరువదాఱు ఛందంబులకుఁ జందంబును, గావ్యాలంకారచూడామణికిఁ గావ్యాలంకారసంగ్రహమ్మును, సకలాలంకారమ్ముల కలంకారమ్మును, లక్షణసారసంగ్రహ సరస్వతీవిలాస సాహిత్యచింతామణి సత్కవిజనసంజీవని భీ మానంత చ్ఛందోముఖాద్యష్టాదశ లక్షణంబులకు లక్ష్యంబును, రేఫ ఱకార నిర్ణయమ్మును, అమ రామరశేష విశ్వ శాశ్వత శబ్దార్ణవ యాదవ వైజయంతికా కార నానార్థరత్నమాలికా కార హలాయుధ భాగురి కేశవ తారపాల ధరణి ధన్వంతరి ధనంజయ రభస విశ్వప్రకాశ మాధవ చింతామణి జయ ప్రతాప శుభాంగ జయపాల క్షీరస్వామి ప్రణీత చతుర్వింశతి వివిధ నిఘంటుపదమ్ములకుఁ బదమ్మును, షష్టివిధ యతిచమత్కారమ్ముల కాధారమును, చతుర్వింశతి ప్రాసమ్ముల కావాసమ్మును, ప్రౌఢికిఁ బ్రౌఢియును, దేఁటకుఁ దేఁటయును, జిరంతనాంధ్రప్రబంధజాలంబుల కాలవాలంబును, సనాతనవిద్వత్కవి రచనావిధంబునకు ఘంటాపథంబును, నిదానీంతనసత్కవినికాయంబునకు సహాయంబును, భవితవ్యకవికలాపంబునకు నాచార్యరూపంబును, నిఖిలభాషావిశేషంబుల కున్మేషంబును, మూఢజాతులకు బోధహేతువును, బ్రౌఢతతికి సమ్మతియును, సర్వజననికరంబున కాశ్చర్యకరంబును, బహువిధాచుంబిత కవితాచమత్కృతికి వసతియును, నగ రార్ణవ శై లర్తు చంద్ర సూ ర్యోద్యాన మంత్ర దూత్య ప్రయాణ రణ నాయకాభ్యుదయ వర్ణనాతిశయంబున కాధారంబును, నన్యానధీన సుధీ నవనవస్తవ్య సర్వపథీన పాండితీమండితచమత్కారంబుగా నా రచియింపం బూనిన రసికజనహృదయోల్లాసం బైన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంబునకుఁ గథాక్రమం బెట్టి దనిన.

శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలో విమర్శకులు గుర్తింపని రహస్యం ఇదే: ఇది చిరంతనాంధ్ర ప్రబంధజాలంబుల కాలవాలంబు!

చిరంతనాంధ్ర ప్రబంధజాలంబుల కాలవాలంబు అంటే, సంకలన గ్రంథం అని అర్థం. ఆదికాలం నుంచి తెలుగులో వెలసిన ప్రబంధాలన్నీ ఇందులో ఉంటాయన్నమాట.
ఇది ఇదానీంతన సత్కవినికాయంబునకు సహాయంబు. అంటే నేటి అభ్యాసకులకు సహాయకగ్రంథం (Guide Book) వంటిదన్నమాట. దీని సాయంతో కవులు తెలుగు కవితారీతులను అభ్యసింపవచ్చునన్నమాట.
అంతే కాదు. ఇది భవితవ్యకవికలాపంబునకు నాచార్యరూపంబు. రాబోయే తరాలవారికి పాఠ్యగ్రంథం (Text Book) వంటిది. దీనిని చూసి విద్యార్థులు కవిత్వకళను నేర్చుకోవలసి ఉంటుంది.
ఇది నిఖిలభాషావిశేషంబుల కున్మేషంబు. అందువల్లనే తెలుగువారు నేర్చుకోవలసిన సంస్కృతశ్లోకాలు, శ్లోకానువాదాలు దీనిలో ఉన్నాయి. అష్టభాషాసీసంలో షడ్విధప్రాకృతా లున్నాయి. వీటిని నేర్చుకోవటం వల్ల ఆ భాషలలోని విశేషాల పరిచయం తప్పక కలుగుతుంది.
ఈ గ్రంథాన్ని అధ్యయనించే విద్యార్థులు కావ్యాలంకారచూడామణి, కావ్యాలంకారసంగ్రహం, కువలయానందం, చంద్రాలోకం వంటి గ్రంథాలలోని లక్షణప్రకరణాలను, లక్షణసారసంగ్రహం మొదలుగా ఉన్న అష్రాదశచ్ఛందోగ్రంథాల లక్షణాలను గుర్తుంచుకొని, వాటికి లక్ష్యాలను ఈ గ్రంథంలో అన్వేషించాలి. విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణి నుంచి, మూర్తికవి కావ్యాలంకారసంగ్రహం నుంచి గ్రంథచౌర్యం చేయాలనే ఉద్దేశం ఉన్నవాడు తన గ్రంథం కావ్యాలంకారచూడామణికిఁ గావ్యాలంకారసంగ్రహమ్మును అని చెబుతాడా? లక్షణ సమన్వయాన్ని నేర్చుకోవటం కోసమే దీనిని చదవాలన్నమాట.

ఇది శబ్దశాస్త్రరీతికి విఖ్యాతి; ధ్వనులకు ఉనికిపట్టు. అచుంబితమైన కవితాచమత్కృతికి వసతిగృహం. రసికజనులకు హృదయోల్లాసకరం.

ఇంకొక చమత్కారం: ఉక్తాత్యుక్తాదిగాఁ గల యిరువదాఱు ఛందంబులకుఁ జందంబును, అమ రామరశేష విశ్వ శాశ్వత శబ్దార్ణవ యాదవ వైజయంతికా కార నానార్థరత్నమాలికా కార హలాయుధ భాగురి కేశవ తారపాల ధరణి ధన్వంతరి ధనంజయ రభస విశ్వప్రకాశ మాధవ చింతామణి జయ ప్రతాప శుభాంగ జయపాల క్షీరస్వామి ప్రణీత చతుర్వింశతి వివిధ నిఘంటుపదమ్ములకుఁ బదమ్మును అన్న వాక్యశకలాలను వేంకటకవి అయ్యలరాజు నారాయణామాత్యుని హంసవింశతి (3-128) లోని పండితపరిశ్రమ వచనంలో నుంచి తీసికొన్నాడు. నారాయణామాత్యునికి, వేంకటకవికి ఈ చతుర్వింశతి నిఘంటువులు ఎక్కడ దొరికాయో తెలియదు. సంప్రదాయజ్ఞులు అధ్యయనీయ నిఘంటువులు ఇరవై ఆరు (షడ్వింశతి) అని చెబుతారు. యతిప్రాసల ప్రస్తావనను కూడా వేంకటకవి హంసవింశతిలోని ఆ వచనంలో నుంచే గ్రహించి, సర్వలక్షణశిరోమణిలో చెప్పిన తన మతానుసారం షష్టివిధ యతిచమత్కారమ్ముల కాధారమును, చతుర్వింశతి ప్రాసమ్ముల కావాసమ్మును అని పెంచి చెప్పాడు. నగ రార్ణవ శై లర్తు చంద్ర సూ ర్యోద్యాన మంత్ర దూత్య ప్రయాణ రణ నాయకాభ్యుదయ వర్ణనాతిశయంబున కాధారంబును అని పేర్కొన్న వర్ణనల వివరాలను దండి కావ్యాదర్శం (1-16, 17) లో నగరార్ణవ శైలర్తు చన్ద్రోదయ వర్ణనైః, ఉద్యాన సలిలక్రీడా మధుపాన రతోత్సవైః, విప్రలమ్భై ర్వివాహైశ్చ కుమారోదయవర్ణనైః, మన్త్ర దూత్య ప్రయా ణాజి నాయకాభ్యుదయై రపి అని ఉన్న చోటినుంచి స్వీకరించాడు.

వేంకటకవి ప్రణాళిక: ముఖ్యసూత్రాలు
వేంకటకవి కృతి సంకలన గ్రంథం అన్నంత మాత్రాన అది ప్రబంధరత్నాకర శార్ఙ్గధర సంహితాదుల వంటి సంకలనగ్రంథం అని పొరబడకూడదు. ఇదానీంతనసత్కవినికాయంబునకు సహాయంబును, భవితవ్యకవికలాపంబునకు నాచార్యరూపంబును, నిఖిలభాషావిశేషంబుల కున్మేషంబును, మూఢజాతులకు బోధహేతువును, బ్రౌఢతతికి సమ్మతియును, సర్వజననికరంబున కాశ్చర్యకరంబును అని ఆయన చెప్పిన ఈ అపూర్వమైన ప్రయత్నంలో ఆయన ప్రణాళిక ఎటువంటిదో తెలుసుకొంటే గాని, అందులోని కీలకం పాఠకులకు స్ఫురింపదు. ఆ ప్రణాళిక నాలుగు విధాలుగా ఉంటుంది:

మొదటిది: ఇతివృత్తస్వీకారం

ఇందులో ఇతివృత్తం నామమాత్రం. తాను లక్ష్యాలుగా నిరూపింపదలచిన లక్షణాలు ఇమడగల ఒక సూక్ష్మవిషయాన్ని ఆలంబనగా గ్రహించి, కావ్యాన్ని సకలవర్ణనాపూర్ణంగా రూపొందించటమే కవి ఆశయం. ప్రధానేతివృత్తంలో చేర్చేందుకు వీలులేని వర్ణనలను లక్షణవిరోధం వాటిల్లకుండా ఆనుషంగికమైన నాగదత్తోపాఖ్యానంలో చొప్పించే ప్రయత్నం చేశాడు.

రెండవది: బింబకల్పన పద్ధతి

ఇతివృత్తాన్ని నిర్ణయించికొన్న తర్వాత, కవి తన గ్రంథంలో చేరతగిన శ్లోకాలను, పద్యాలను – అన్నిటినీ మొదట ఒక క్రమంలో కూర్చుకొన్నాడు. ఆ పద్యాలను యథాతథంగా ఒకచోట, పర్యాయపదాలతో ఒకచోట, రెండు మూడు పద్యాలను కలిపి ఒకచోట, ఛందస్సులను రూపాంతరితం చేసి కొన్నిచోట్ల, అనువాదాలు చేసి కొన్నిచోట్ల, అనువాదకల్పంగా మరొక చోట పరిపరివిధాల మార్చి వ్రాశాడు. ఇందులో ఎన్నో ప్రతీకలను కల్పించాడు.

మూడవది: రచయితృ నామత్యాగం

ఈ వ్యాసంగానికి మూలమైన పద్యాన్ని వ్రాసిన కవి పేరు గాని, ఆ కావ్యం పేరు గాని ఇందులో చెప్పబడవు. ఆ కృషిని పాఠకులే పూనుకొని చేయాలి. అనువాదం ఉన్నప్పుడు పద్యాన్ని మూలంతో సరిపోల్చి, బాగోగులను తెలుసుకోవాలి. శీర్షిక మాత్రమే ఇవ్వబడినప్పుడు ఆ పద్యానికి మూలాన్ని గుర్తించటమే గాక, ఆ శీర్షికలోని లక్షణంతో లక్ష్యాన్ని సమన్వయించటం నేర్చుకోవాలి.

ఈ విధమైన కృషివల్ల అధ్యేతలకు లక్షణ లక్ష్య పరిజ్ఞానం అలవడుతుంది. దీనిని కంఠస్థం చేసినకొద్దీ వందలకొద్దీ కావ్యాలలో నుంచి ఎన్నికైన మంచి మంచి పద్యాలు, పద్యభాగాలు పట్టుబడతాయి. అలంకారాలు, వివిధ పద్యశైలులు అలవడతాయి. ప్రౌఢికి ప్రౌఢి, తేటకు తేట. ఒక్కొక్క పద్యభావాన్ని గ్రహించి, అది ఏ పద్యానికి పర్యాయంగా నిలపబడిందో గుర్తించటం వల్ల బుద్ధికి సూక్ష్మగ్రాహిత కలిగి, నైశిత్యాన్ని పొందుతుంది. ధారణ వృద్ధి చెందుతుంది. ఏది ఏ కవి పద్యమో, ఏ పద్యం ఏ కావ్యం లోనిదో కనుగొనటం మూలాన మనస్సుకు సంతృప్తి కలుగుతుంది. కొన్ని మారుమూల కావ్యాలను ఎక్కడెక్కడి నుంచో సంపాదించి, చదివి అర్థం చేసికొని, అందులోని ప్రతీకలను గుర్తించటం విద్యార్థులకే కాక విద్యాధికులకు కూడా కష్టమైన పనే. అందుచేతనే అటువంటి కృషి విద్యాధికులకు హృద్యంబు అని కవి అన్నాడు. అది మూఢతతికి బోధహేతువు కూడానట.

నాలుగవది: ఆశ్చర్యజనకత్వం

ఈ ప్రకారం ఒక్కొక్క పద్యాన్ని గుర్తుపట్టడం ఒక ఎత్తయితే, దానిని లక్షణంతో సమన్వయింపగలగటం సులభకార్యం కాదు. ఒక్కొక్కప్పుడు మనము చదివిన పద్యమే పర్యాయాలతో కల్పితమైనందువల్ల కనుచూపు జారిపోతుంది. ఎంతో ప్రసిద్ధమైన పద్యాలు కూడా ఛందస్సును మార్చేసరికి వింతరూపును సంతరించుకొంటాయి. ఎంత ఆలోచించినా స్ఫురణకు రావటం కష్టం. వాటిని మనము ప్రయత్నించి గుర్తుపట్టినప్పుడు, ఇంత స్వల్పవిషయాన్ని కనుక్కోలేకపోయానే, కవి యెంత మోసం చేశాడో కదా అని ఆశ్చర్యం కలుగుతుంది. అందుచేతనే వేంకటకవి దానిని సర్వజననికరమ్మునకు ఆశ్చర్యకరంబు అన్నాడు.

ఈ విధంగా శిక్షాప్రణీతమైన అపూర్వ చిత్రకావ్యంలోని కొన్ని పద్యాలను, వాటి మౌలికరూపాలను – ఈనాటి దాకా అభిజ్ఞేయాలుగా ఉన్న వాటిలో కొన్నింటిని పరిశీలించటం మిగిలి ఉన్నది. ఆ పని రెండవ ప్రకరణంలో చేద్దాము.
---------------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు, 
ఈమాట సౌజన్యంతో

Monday, April 8, 2019

గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 1.


సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 1.




సాహితీమిత్రులారా!
పూర్వం ఆంధ్రభాషలో లోతైన పాండిత్యాన్ని సంపాదింపగోరి కావ్యనాటకసాహిత్యం లోతులను గ్రహించేందుకు వ్యాకరణ శాస్త్రం ఛందశ్శాస్త్రం అలంకార శాస్త్రం అధ్యయనం మొదలుపెట్టిన విద్యార్థులకు మూలఘటిక కేతన గారి ఆంధ్రభాషాభూషణం, అపర నన్నయభట్టు రచించిన ఆంధ్రశబ్దచింతామణి మొదలుగా శబ్దతత్త్వాన్ని నిశ్చయించే లక్షణగ్రంథాలు; మల్లియ రేచన కవిజనాశ్రయం, వెల్లటూరి లింగన సరసాంధ్రవృత్తరత్నాకరం వంటి ఛందస్తత్త్వాన్ని నిరూపించే ప్రకరణగ్రంథాలు; గుడిపాటి కోదండపతి రసమంజరి, వడ్డికవి శృంగార రసాలవాలం లాంటి సాహిత్యతత్త్వాన్ని నిర్దేశించే పాఠ్యగ్రంథాలు అనేకం ఉండేవి కాని, అవన్నీ ఆయా శాస్త్రాలలో ఏవో కొన్ని కొన్ని అంశాలకే పరిమితమైన వివృతికల్పాలు. లింగమగుంట తిమ్మకవి సులక్షణసారంలో ఛందస్సుకు ఆవశ్యకమైన వ్యాకరణాంశం చాలా కొద్ది, ఛందోవివరణమూ సంక్షిప్తమే. అనంతామాత్యుని ఛందోదర్పణంలో వ్యాకరణాంశం అతిస్వల్పం, ఛందోవిషయం కొంత విపులతరమే అయినా అందులో అలంకారాలు చర్చకు రావలసిన అవసరం లేకపోయింది. మూర్తికవి కావ్యాలంకారసంగ్రహంలో ఛందోవ్యాకరణాల ప్రసక్తి లేనే లేదు. ఉన్న సాహిత్యశాస్త్రవిశేషమైనా అటు రుయ్యకుని అలంకారసర్వస్వానికీ, విద్యాధరుని ఏకావళికీ, ఇటు విద్యానాథుని ప్రతాపరుద్రీయానికీ సమన్వయం కుదరక, అనువాదం సరిగా లేక ప్రామాణికతను సంతరించుకోలేకపోయింది. అప్పకవీయం వ్యాకరణప్రసంగమే కాని, ఆనుషంగికంగా వచ్చిచేరిన ఛందస్సుకే అందులో అగ్రియత్వం లభించింది. అనంతుని రసాభరణం, భైరవకవి కవిగజాంకుశం మొదలైనవి కొన్ని ఏదో ఒక లఘువిషయాన్ని గ్రహించి, దానినే ఎంతో కొంతగా విస్తరించిన వివృతిమాత్రాలు. ఉన్నంతలో వ్యాకృతికి చింతామణి, అహోబలపండితీయం; ఛందస్సుకు అప్పకవీయం లాగా అలంకారశాస్త్రంలో కావ్యకర్తలకు, కావ్యపాఠకులకు శబ్దార్థరచనారహస్యాన్ని ఎత్తిచూపే వస్తువిమర్శ కలిగిన కావ్యశిక్షాగ్రంథం ఒక్కటీ లేదు.

విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణి, పొత్తపి వెంకటరమణకవి లక్షణశిరోమణి మొదలైనవాటిలో లక్షణలక్ష్యాలు అసమగ్రంగా ఉండటమే గాక అవి పరోక్షసమన్వయసాపేక్షాలుగా ఉంటాయి. ప్రామాణికమైన ఒక లక్షణగ్రంథాన్ని తెచ్చుకొని రుయ్యకుని అలంకార సర్వస్వానికి జయరథుని విమర్శిని, మమ్మటుని కావ్యప్రకాశానికి మాణిక్యచంద్రుని సంకేతం వంటి మహావ్యాఖ్యానాలను ఎదుట ఉంచుకొని ఎక్కడికక్కడ సరిచూసుకొంటూ చదువుకొంటే కాని ఆ అధ్యయనం ముందుకు సాగదు. అటువంటి వ్యాఖ్యానగ్రంథాలైనా చింతామణికి బాలసరస్వతీయం, అధర్వణ కారికలకు అహోబల పండితీయం, అప్పకవీయంలో కొంత భాగానికి సుకవిమనోరంజనం వంటివి వ్యాకరణానికి వెలువడ్డాయి కాని, అన్ని ఛందోలంకారలక్షణగ్రంథాలకూ తెలుగు భాషలో సుపర్యాప్తంగా వ్యాఖ్యానాలు వెలువడలేదు. ఛందోలంకారాలకు సంస్కృతంలోని ఒక మూలాన్ని, దానిపై వెలసిన వ్యాఖ్యానాలను చదువుకొని, వాటికి సరిపడే తెలుగు ప్రయోగాలను సంపాదించి, ఆ రెండింటిని యథాయోగ్యంగా అన్వయించుకొనే అలవాటుండేది కాని, ఆ మాత్రపు కృషికైనా అలంకారశాస్త్రానికి తెలుగులో ఉన్న లక్షణగ్రంథాలు తక్కువ. వాటిపై పదవాక్యప్రమాణవిదుల విజ్ఞానవ్యాఖ్యలు వెలువడేంత ప్రామాణికత వాటికెన్నడూ కలుగలేదు. పైగా వాటి చర్చాపరిధి చాలా తక్కువ. కావ్యస్వరూపం, వృత్తిలక్షణం, గుణదోషనిరూపణం, శబ్దార్థాలంకారవివేచనం, రసభావవిశదిమ, నాయికానాయకుల గుణావస్థానిర్ణయం, దృశ్య శ్రవ్య కావ్యభేదాలు, రూపక పరిభాషాంగ ప్రశంస, కథాశరీరసంవిధానం, కవిసమయప్రదర్శనం, ప్రేక్షకులూ పాఠకులూ తప్పక తెలుసుకోవలసిన పారిభాషికపదాలు, నాట్యధర్ములు, ప్రకీర్ణకవిమర్శబోధ, ప్రకాశార్థాన్ని బట్టి కవి అంతరంగాన్ని ఆవిష్కరించటం మొదలైన ముఖ్యవిషయాలలో ఏ కొన్నింటికో అవి పరిమితాలు. విద్యార్థులు విద్యాధికులైన తర్వాత కూడా శృంగారప్రకాశ సరస్వతీకంఠాభరణాల వలె వారిని విద్యార్ణవం లోలోతులకు తీసికొనివెళ్ళి, విద్యాశిఖరి సమున్నతశిఖరాలపై విహరింపజేసే జీవితకాలప్రబోధగ్రంథం ఒక్కటీ లేదు.

అటువంటి లోపాన్ని పూరించటానికి బహుసంవత్సరాలు కృషిచేసి, వందలకొద్దీ గ్రంథాలనుంచి ప్రయోగాలను సేకరించి, అన్నింటి లక్షణాలను సూక్ష్మేక్షికతో పరీక్షించి, ఛందోవ్యాకరణాలంకార బృహద్విజ్ఞానకోశాన్ని సర్వలక్షణశిరోమణి అన్నపేరుతో కూర్చి; అందులో ఉపదేశింపబడినదానికే లక్ష్యానుబంధంగా ఒక ప్రబంధరాజాన్ని సంధానించిన ఒకే ఒక్క మహనీయుడు శ్రీ గణపవరపు వేంకటకవి. ఆ మహావిద్వాంసుడు కూర్చిన ఆ మహాప్రబంధం పేరు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం.

ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం భారతీయ సాహిత్యచరిత్రాధ్యేతలు ఎన్నడూ కనీ వినీ యెరుగని ఒక అపూర్వమైన, నిరుపమానమైన మహాకావ్యం. నిజం చెప్పాలంటే, అటువంటి కావ్యం భారతీయభాషలలో మరొకటి లేదు. అంతే కాదు. క్రీస్తుశకం 12వ శతాబ్ది నాటి కవి జినపాల గణి రచించిన సనత్కుమార చక్రి చరిత మహాకావ్యాన్ని ప్రశంసిస్తూ ఆయన శిష్యుడు సుమతి గణి తన గణధరసార్ధశతక బృహద్వృత్తిలో చెప్పిన ఒక శ్లోకం గణపవరపు వేంకటకవి రచనకు అన్వయించినట్లు తెలుగులో మరే కవి రచనకూ అన్వయింపదంటే అతిశయోక్తి కాదు. ఆ శ్లోకం ఇది:

నానాలంకారసారం రచితకృతబుధాశ్చర్యచిత్రప్రకారం
నానాచ్ఛందోఽభిరామం నగరముఖమహావర్ణకావ్యప్రకామమ్
దృబ్ధం కావ్యం సటీకం సకలకవిగుణం తుర్య చక్రేశ్వరస్య
క్షిప్రం యై స్తేఽభిషేకాః ప్రథమజినపదాశ్లిష్టపాలా ముదే నః.

వేంకటకవి కావ్యం కూడా బహువిధాలంకారసారమే. రచితకృతబుధాశ్చర్యచిత్రప్రకారమే. చిత్రకవిత్వంలో సాటిలేని కావ్యం ఇది. గర్భకవిత్వంలో దీనిని సరిపోలిన ప్రయోగసరళి నాటికీ, నేటికీ ఎవరికీ సాధ్యం కాలేదు. బంధకవిత్వంలో త్రిదశతరంగిణీ చతుర్హారావళీ చతుర్వింశతిజినస్తుతి విజ్ఞప్తికా విద్యుల్లతాదుల లాగా ఇది కేవల బంధకావ్యం కాకపోయినా, అంతకు మీరిన బంధచిత్రప్రకారాలు దీనిలో ఉన్నాయి. హరిశ్చంద్రనళోపాఖ్యాన రామకృష్ణార్జునరూపనారాయణీయాదులను పోలిన అనేకార్థరచన కాకపోయినా ద్విసంధాన త్ర్యర్థిఘటనాదులున్నాయి. శేషశైలేశలీలా శ్రీశౌరిశైశవలీలాదుల వలె కేవలం స్థానచిత్రాలతో (య-ర-ఱ-ల-ళ-వ-శ-ష-స-హ అనే పది అక్షరాలతో) కూర్చిన రచన కాకున్నా, ఇందులో ఉన్నన్ని చమత్కారాలు వాటిలో లేవు. చిత్రకవితాప్రణయనంలో ‘యదిహాస్తి త దన్యత్ర, యన్నేహాస్తి న తత్క్వచిత్’ అని సగర్వంగా చెప్పదగిన కావ్యం ఇదొక్కటే. సంస్కృతంలో హరవిజయ చిత్రబంధ రామాయణాదులు, ప్రాకృతంలో అజియసంతిథయ సౌరిచరియాదులు దీనితో కొంత సాటికి, పోటీకి వస్తాయేమో. తెలుగులో మాత్రం వేరొకటి లేదు. సనత్కుమార చక్రి చరిత మహాకావ్యం వలె ఇదీ నానాచ్ఛందోఽభిరామమే. ఇందులో ప్రయోగింపబడినన్ని ఛందస్సులను ఇంత మనోహరంగా ఏ తెలుగు కవీ ప్రయోగించలేదు. సనత్కుమార చక్రి చరితకు తుల్యంగా ఇదీ అష్టాదశవర్ణనాపూర్ణమే. దాని వలె ఇదీ సటీకమే. దీనికీ బంధచిత్రాలున్న ప్రతి ఒకటీ, లఘుటీకతోడి ప్రతి ఒకటీ – ఇప్పుడైతే లేవు కాని, గతశతాబ్దం దాకా ప్రచారంలో ఉండేవి. ఆ విధంగా మహాపండితుడు జినపాల గణి రచనను గురించి గణధరసార్ధశతక బృహద్వృత్తిలో సుమతి గణి చెప్పిన శ్లోకం ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసానికి అన్వయించినట్లు మరే కవి రచనకూ అన్వయింపదని స్పష్టం.

తొలినాటి ప్రస్తావనలు
గణపవరపు వేంకటకవిని గురించి సాహిత్యచరిత్రలో తొలిసారి ప్రస్తావించినవాడు శాసన పరిశోధనలలో, వ్రాతప్రతుల సేకరణలో కల్నల్ కోలిన్ మెకంజీకి సహాయుడుగా ఉండిన కావలి వెంకట రామస్వామిగారు. 1829లో ప్రకటించిన తన Biographical Sketches of the Deccan Poetsలో ఆయన Lukshmana Kavi the Second అన్న శీర్షిక క్రింద వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసాన్ని ప్రశంసించి, ఆయనది కొండవీడు అని, Prubandha Rajum అనే వ్యాకరణగ్రంథాన్ని వ్రాశాడని అంటూ — “This was the chief work composed by this poet, and was reckoned a very useful treatise, and it attained for the author the appellation of Lukshmana Kavi, a Grammatical Poet, which cognomen after ages have adapted” — అని, వేంకటకవికి లక్షణకవిగా ఉన్న ప్రసిద్ధిని పేర్కొన్నాడు. ఆయన నిర్దేశంలో Lukshmana Kavi, a Grammatical Poet అన్నది లక్షణకవి అన్న వ్యవహరణకు ప్రామాదికరూపం కాబోలు. అయితే, ఆయన అన్నట్లు Prubandha Rajum (ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం) వ్యాకరణగ్రంథం కాదు. వేంకటకవికి Grammatical Poet అన్న ప్రశస్తి సర్వలక్షణశిరోమణి రచన వల్ల కలిగింది. రామస్వామిగారు సర్వలక్షణశిరోమణి, ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసాలకున్న పారస్పరికసమన్వయాన్ని గ్రహించినందువల్లనో, వేంకటకవి తండ్రి గణపవరపు అప్పనకు లక్షణకవిగా ఉన్న ప్రసిద్ధిని విని ఉన్నందువల్లనో, వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలో తన లాక్షణికతను గురించి స్వయంగా చెప్పికొని ఉండటంవల్లనో, తన కాలంనాటి పెద్దలు చెప్పుకొనే మాటలను బట్టో వేంకటకవిని Lukshmana Kavi (లక్షణకవి) అని పేర్కొన్నాడని ఊహించాలి. లేకుంటే, Lukshmana Kavi the Second అని శీర్షికలో అన్నాడు కాబట్టి – పైడిపాటి లక్ష్మణమంత్రి ఆంధ్రనామసంగ్రహ నిఘంటువుకు ప్రతిగా వేంకటేశాంధ్రము అన్న శుద్ధాంధ్రనామనిఘంటువును సర్వలక్షణశిరోమణిలోని ఒక ఉల్లాసంగా కూర్చాడు కాబట్టి ఆ రోజులలో గణపవరపు వేంకటకవికి Lukshmana Kavi the Second అన్న ప్రఖ్యాతి ఉండినదేమో అనుకోవాలి.

1885లో బహుజనపల్లి సీతారామాచార్యుల వారు శబ్దరత్నాకరము పీఠికలో వేంకటకవిని గూర్చి ప్రస్తావిస్తూ — “అప్పయ వేంకటపతి – ఇతఁడు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసమను నొక పెద్ద లక్షణగ్రంథమును వ్రాసినవాఁడు.” — అని వ్రాశారు. ప్రబంధరాజంలో వివిధపద్యాలకు శీర్షికలుగా ఉన్న లక్షణవిషయాల అన్వయాన్ని బట్టి ‘లక్షణగ్రంథము’ అన్నారే గాని, ఆచార్యుల వారన్నట్లు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం లక్షణగ్రంథం కాదు.

1892లో ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసాన్ని అముద్రితగ్రంథచింతామణి పక్షాన ప్రకటించిన పూండ్ల రామకృష్ణయ్యగారు వేంకటకవి కవి చరిత్రను, జీవితాదికాన్ని కొంత విపులంగానే వివరించారు. 1933 భారతి పత్రిక మార్చి నెల సంచికలో వంగోలు వెంకటరంగయ్య పంతులుగారు ‘ఆనందరంగ పిళ్ళ – డూప్లే ద్విభాషి’ వ్యాసంలో పుదుచ్చేరిలో ఫ్రెంచి గవర్నరు ఫ్రాన్సిస్ జోసెఫ్ డూప్లే వద్ద దుబాసీగా ఉన్నతోద్యోగంలో ఉండిన ఆనందరంగ పిళ్ళై కాలంలో (1709-1761) వేంకటకవి సేనానాయకుడుగా ఉండినట్లు వ్రాశారు కాని, అందుకు ఆధారాలను చూపలేదు. ఆనందరంగ పిళ్ళై, గణపవరపు వేంకటకవి సమకాలికులే అయినా, వేంకటకవి కృతులలో ఆనందరంగ పిళ్ళై సంస్తవం లేదు. అచ్చయిన 12 సంపుటాల ఆనందరంగ పిళ్ళై డైరీలలోనూ, ఆయన జీవితచరిత్ర వ్యాసాలలోనూ ఎక్కడా గణపవరపు వేంకటకవి ప్రస్తావనలు లేవు. కాబట్టి ఈ విషయాన్ని ఇంకా నిర్ధారింపవలసి ఉన్నది.

వేంకటకవి రచనలని చెప్పదగినవి ప్రధానంగా మూడు: సర్వలక్షణశిరోమణి, విద్యావతీ దండకము, ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము. ఇవి గాక వేరేవీ దొరకలేదు. సర్వలక్షణశిరోమణి 1710-1715 (±) ప్రాంతాల, విద్యావతీ దండకం ఆ తర్వాత, ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం 1730-1755 ప్రాంతాల రచింపబడ్డాయి. ప్రకృతవ్యాసంలో ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము యొక్క సర్వాంగీణవిమర్శ గాక, తెలుగు సాహిత్యచరిత్రకు అపరిచితమైన ఒక్క అపూర్వమైన విశేషం మాత్రమే అధికరింపబడుతున్నది. అందులో సంప్రయుక్తమైన లక్షణజాతాన్ని గురించి, చిత్రకవిత్వాన్ని గురించి ప్రత్యేకంగా పరిశీలింపవలసి ఉంటుంది.

నామకరణౌచిత్యం
ఆంధ్రకవులెవరూ తమ కృతులకు ప్రబంధాదిగా పేరుపెట్టినట్లు కనబడదు. ఆ సంప్రదాయం ప్రబంధ చింతామణి, ప్రబంధ రత్నాకరం, ప్రబంధసార శిరోమణి వంటి సంకలన గ్రంథరచయితల సొంతం. సాహిత్యచరిత్రలో శ్రీ వేంకటేశ్వర స్వామి నామాంకితమైన ప్రథమాంధ్ర మహాప్రబంధం కూడా ఇదే. అంతకు మునుపెవరూ అటువంటి పేరుతో ఒక ప్రబంధాన్ని చెప్పలేదు. కొందరు కవులు శ్రీ వేంకటేశ్వర స్వామివారికే తమ కృతులను సమర్పించినప్పటికీ, ఒక్కరైనా శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణగాథను మహాప్రబంధంగా సంతరింపకపోవటం వింతగానే తోస్తుంది.

శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణగాథను, దివ్యలీలలను ప్రతిపాదించే ఈ ప్రబంధరాజానికి శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము అన్న పేరు గర్భితార్థప్రకాశకమై, శ్రుతిసుందరంగా అమరింది. వేంకటకవికి పూర్వం బొడ్డుచెర్ల తిమ్మన కూడా తన ప్రసన్నరాఘవ నాట్యప్రబంధంలో –

నందేల తిమ్మరాజ పు
రందర చిహ్న ప్రసన్నరాఘవ నాట్యా
మంద ప్రబంధరాజము
నందున …”

అంటూ తన కృతిని ప్రబంధరాజం అని చెప్పుకొన్నాడు కాని, ప్రబంధరాజము అన్న పేరును దాని శీర్షికలో నిలుపలేదు. అహోబలపతి కాళిందీకన్యాపరిణయంలో –

కాటుకకప్పు మోవి జిగి, గాదిలి నవ్వును బొత్తుఁ గూడుచుం
గైటభదైత్యవైరి ముఖకంజమునం దనరారెఁ జూడఁగా
మూటికి సాటియైన రసముఖ్యము లాదిగ శోణశుభ్రముల్
మేటి ‘ప్రబంధరాజము’న మేళనమంది మెలంగు కైవడిన్. (6-126)

అని ఈ శబ్దాన్ని వాడుకొన్నాడు కాని, దానిని తన గ్రంథానికి శీర్షికగా స్వీకరింపలేదు.

శ్రీ వేంకటేశ్వరుని కల్యాణగాథను వర్ణించే కావ్యాన్ని వేంకటేశ్వర విలాసము అనకుండా ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము అనటంలోని ఔచిత్యాన్ని మెచ్చుకోవాలి. శృంగార రసాధినాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆకాశరాజు కుమార్తెను పెండ్లాడి శేషాద్రికి తిరిగివచ్చేటపుడు స్వామిపుష్కరిణి దగ్గర నాగదత్తుడనే ధర్మహీనుడు వారిని అడ్డగించి హతప్రభుడవుతాడు. ఆ విధంగా వీరరసభావం అంగిరసమైన శృంగారానికి ఉద్దీపకమై అలరారింది. శ్రీ వేంకటేశ్వరవిలాస శ్రీ వేంకటేశ్వరవిజయాల అభివర్ణన వల్ల కావ్యరచనలో సాంతం శృంగార వీరాలను పోషించే సదవకాశం ఏర్పడింది. అవకాశమైతే ఏర్పడింది కాని, కవి ఉద్దేశం అది కాకపోవటం వల్ల ఆ రసాదివ్యక్తి సార్థకంగా జరగలేదు. ఆ విషయాన్ని మునుముందు వివరిస్తాను.

వేంకటకవి గ్రంథాన్ని అముద్రిత గ్రంథచింతామణి పక్షాన 1892లో ముమ్మొదట అచ్చువేసిన పూండ్ల రామకృష్ణయ్యగారు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము అనే వ్యవహరించారు కాని, 1932 నాటి మద్రాసు ప్రాచ్య లిఖితపుస్తక భాండాగారం వారి An Alphabetical Index of Telugu Manuscriptsలో గ్రంథం పేరు, ప్రబంధరాజ శిరోభూషణ విజయ వేంకటవిలాసము అని పేర్కొనబడింది. గ్రంథాలయంలోని వ్రాతప్రతుల ముఖబంధాలలోనూ, గ్రంథంలోనూ ఆ విధంగా లేదు. వారిదే, Descriptive Catalogue of Telugu MSS (Vol.II-Prabandhas) లోనూ ‘ప్రబంధరాజ శిరోభూషణ వేంకటేశ్వర విజయవిలాసమని యిదివఱలో దీనికి ప్రసిద్ధమై యున్న సమగ్రనామము’ అని ఉన్నది. పుస్తకంలో ఎక్కడా లేని, మునుపెవ్వరూ ఉదాహరింపని – ఈ ప్రబంధరాజ శిరోభూషణము అన్న ఆ ‘సమగ్ర నామం’ వారికెక్కడ దొరికిందో తెలియటం లేదు. ఆంధ్రకవుల చరిత్రములో వీరేశలింగం గారు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము అని ఒకచోట, ప్రబంధరాజ వేంకటేశ్వరవిలాసము అని మరొకచోట పేర్కొన్నారు. క్రొత్తపల్లి సూర్యారావు గారి వంటి మరికొంతమంది విమర్శకులు కూడా తమ వ్యాసాలలో ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము అని కొన్నిచోట్ల, ప్రబంధరాజ వేంకటేశ్వరవిలాసము అని మరికొన్ని చోట్ల ఈ విధమైన పర్యాయనామాంకనం చేశారు.

ఇంతకీ, కావ్యం అసలు పేరేమిటి? గణపవరపు వేంకటకవి సైతం దీనిని కావ్యంలోని అన్నిచోట్ల ఒకే పేరుతో గాక, వేర్వేరు చోట్ల వేర్వేరు పేర్లతో వ్యవహరించినట్లు కనబడుతుంది. ప్రబంధరాజం అవతారికలోని 29వ సంఖ్యగల వచనంలో – ‘యీ విలాసంబునకు సాటి యెందు లేదు’ అని ఒకచోట, ‘యిల విలాసంబు’ (ప.51) అని మరొకచోట దీనిని ఏకదేశంగా ‘విలాసము’ అని ఊరుకొన్నాడు. అవతారికలోని వక్ష్యమాణలక్ష్యవిశేషోద్దేశవచనములో, ‘నా రచియింపం బూనిన రసికజనహృదయోల్లాసం బైన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసమునకుఁ గథాక్రమం బెట్టి దనిన’ (అవ.63) అని ఒకచోట గ్రంథనామం ‘ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము’ అని పూర్తిగా పేర్కొన్నాడు. కావ్యాంతగద్యను వ్రాయకపోవటం వల్ల దానిని మళ్ళీ ఉదాహరించే వీలు లేకపోయింది. పాదాద్యంతాక్షర కావ్య కర్తృనామ గుప్త పూర్వకవినామగుప్త చిత్రము అని ఉన్న 845వ సంఖ్య గల సీసపద్యం పాదాలలోని మొదటి అక్షరాలను చేర్చి చదివితే ‘వెంకటేశ విలాసము’ అని ఏర్పడేటట్లు ఒకచోట వ్యవహరించాడు. వేంకటనగప్రభు పేర నొనర్చె సత్కవిప్రణుత విలాసరాజము ధరన్ అని ఇంకొకచోట దీనిని ‘విలాసరాజము’ అన్నాడు. ఈ విధంగా స్వయంగా వేంకటకవే తన గ్రంథనామాన్ని పరిపరిభంగుల వ్యవహరించటం కనబడుతుంది. సర్వలక్షణశిరోమణిలోని ఉల్లాసమైన ఆంధ్ర ప్రయోగరత్నాకరములో ఈనాడు ప్రబంధరాజంలో ఉన్న ఒక పద్యాన్ని ఉదాహరింపవలసినప్పుడు, స్వయంగా తానే దానిని ప్రబంధరాజియ్యం అన్నాడు. కస్తూరి రంగకవి ఆనందరంగరాట్ఛందము (3-59) లో ప్రబంధరాజం నుంచి ఒక ఉదాహరణను ఇస్తూ దానిని ప్రబంధరాజము అని పేర్కొన్నాడు.

వీటన్నిటినీ సమన్వయించితే, మొత్తం మీద గణపవరపు వేంకటకవి కావ్యానికి –

సంకలన గ్రంథాల లక్షణాన్ని పురస్కరించుకొని (ప్రబంధరాజ),
కథానాయకుని పేరును బట్టి (వేంకటేశ్వర),
నాగదత్తోపాఖ్యానంలో నాయకనిష్ఠమైన వీరరసభావోల్బణనను బట్టి (విజయ),
అంగిరసమై ఉన్న శృంగారాన్ని బట్టి (విలాసము)
అన్న భావాలను ఇమిడ్చికొన్న ఈ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము అన్న పేరు సర్వవిధాల ఔచిత్యవంతమని చెప్పవచ్చును.

ప్రబంధ కథానకం
చిత్రమేమంటే, ఇందులోని కథ సూచ్యగ్రమాత్రవిపులం. అంటే, సూది మొనకంటె కొంచెం పెద్దదన్నమాట. వర్ణనలు లెక్కలేనన్ని. ఉన్నది ఒక్క ఆశ్వాసమే కాని, మొత్తం 904 పద్యాలు (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారి ప్రతిలో 887 పద్యాలు) ఉన్నాయి. గర్భిత పద్యాలను, చిత్రబంధాలను చేర్చుకొంటే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. వర్ణనలు ఎక్కువ, సన్నివేశాలు తక్కువ. పాత్రలు ఇంతలో అడుగుపెట్టి అంతలో మాయమైపోతుంటాయి. సంభాషణలు రామరాజభూషణుని వసుచరిత్ర, తెనాలి రామకృష్ణకవి పాండురంగ మాహాత్మ్యాలలోని కథావ్యక్తుల సంభాషణలకు ప్రతిరూపాలు. అంతా శిథిలజాలబంధం లాగా అందదుకులతో కనబడుతుంది. ప్రథమ ముద్రణ పీఠికలో పూండ్ల రామకృష్ణయ్య గారు ఇలా వివరించారు:

ఈ గ్రంథము కథాప్రారంభము మొదలుకొని వెంకటాచల పట్టణవర్ణనము, నలిబిలిగోపురాది వర్ణనము, స్వామిపుష్కరిణి వర్ణనము, బయకాని కోన పాండుతీ ర్థాకాశగంగాదుల వర్ణనమును, వేంకటశైలవర్ణనమును, శ్రీ వేంకటేశ్వరస్వామి వర్ణనమును, శ్రీవారి వాహనవర్ణనమును, తిరునాళ్ల మహోత్సవాది వర్ణనమును మొదటి 58 పద్యముల వరకు వ్రాయఁబడియున్నది. అదిమొదలు సాయంతనాదివర్ణనాదులు, జాతివార్తలు, స్వామివారియెదుట జరుగు సంగీతము మేళముల వర్ణనములు లోనగు వృత్తాంతములు 112 పద్యముల వరకు వ్రాయఁబడియున్నవి. తర్వాత ప్రభాతవర్ణనాదులు చెంచునాయకులతో శ్రీవారి వేటసన్నాహ వర్ణనాదులు 240 పద్యముల వఱకు వ్రాయఁబడియున్నవి. అవ్వల శ్రీవారి కేలిడేగ యాకాశరాజచంద్రుని సుతయగు నాంచారుదేవి యుపవనమున వ్రాలుటయుఁ దోడ్తోన శ్రీవారచ్చటికి మంత్రిసహితుఁడై విచ్చేసి య వ్వెలంది యుదంత మరయుటకు మంత్రిఁ బంపఁగా నతనివలనఁ దానామె వృత్తాంతము విని య వ్వెలందినిఁ జూచి వర్ణించుటఁ దర్వాత నాకాశరాజు మంత్రివలన వేంకటేశ్వరస్వామివారి యభిప్రాయ మెఱింగి తన సుతకిచ్చి వివాహం బొనర్చి స్వగృహమునకు నగతనయ యగు దన తనయను బంపినపుడు త్రోవలో స్వామివారికిని నాగదత్తుఁడను జోరునకును యుద్ధము సంప్రాప్తమగుటయుఁ జోరవ్రజంబు స్వామిపుష్కరిణిం బడి సారూప్యం బందుటయు నష్టదిక్పాలకులు శ్రీవేంకటేశ్వరస్వామిని స్తుతించుటయు లోనగు పద్యములచేఁ దక్కిన గ్రంథబంతయు నొప్పుచున్నయది. ఈ గ్రంథమునందుఁ గథ విశేషముగ వ్రాయఁబడియుండలేదు. అయినను తన నేర్పఱితనమును లోకమునకుఁ దెల్పుటకై కవి యిదియొక వ్యాజము గల్పించుకొని యిట్టి లక్ష్యగ్రంథమును వ్రాసియున్నాఁడు.

ఇంత సారిష్ఠమైన ఇతివృత్తకల్పన వల్ల కావ్యం కావ్యమయిందా? అకావ్యమయిందా? అని పాఠకులకు సందేహం కలుగుతుంది. శబ్దార్థాలు ఉపసర్జనీకృతార్థాత్మలై ఉన్నప్పటికీ నానావిధాల శైలిభేదప్రదర్శనలౌల్యం మూలాన ఎక్కడికక్కడ వ్యస్తరచనలుగానే మిగిలాయి. విభావానుభావ వ్యభిచారభావాల సంయోగంతో రసనిష్పాదనకు కవి ప్రయత్నింపకపోవటం వల్ల రసాదికం కావ్యాత్మగా అమరేందుకు అవకాశం లేకపోయింది. నాయికానాయకుల పరస్పరదర్శనం, నాయికావిరహాల తర్వాత వివాహాన్ని వర్ణించాడే కాని, అది రతిపర్యవసితం కాకుండా నాగదత్తోపాఖ్యానం అడ్డువచ్చింది. పోనీ, అదన్నా నాయకుని ధర్మవీరానికి ఆలంబం అవుతుందా? అంటే, హరిభటులు చోరులను ఎదుర్కోవటమూ, చోరులు స్వామిపుష్కరిణిలో పడటం మొదలుగా అభివర్ణితం కావటం వల్ల భావశబలతకు దోహదకారిగా అంగిరసం పోషింపబడలేదని అంగీకరింపవలసివస్తుంది. సాంగమైన రసపోషణం ఉద్దేశింపబడనందున రసాదివ్యక్తిసమర్థాలైన శబ్దార్థాల ఎంపికకోసం కవి ప్రయత్నింపనే లేదనిపిస్తుంది. ‘దానికిది లక్ష్యం, దీనికది ఉదాహరణ’ అని పద్యాలను పేర్చుకొనిపోవటమే గాని, కావ్యశిల్పంలోని క్రమవికాసాన్ని కవి ఉద్దేశింపనే లేదని ఎక్కడికక్కడ వెల్లడవుతూనే ఉంటుంది. తరచు కనబడుతుండే రకరకాల శైలిభేదాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

ఏవంవిధమైన కథాశిల్పాన్ని పరికిస్తున్నప్పుడు వేంకటకవి దృష్టిలో కథాశిల్పానికంటె ముఖ్యంగా నిర్వహింపదగినది ఇంకేదో ఉన్నదని పాఠకులకు అడుగడుగున అనిపిస్తూనే ఉంటుంది. దేనినో చెప్పదలిచి ఈ కథను కేవలం ఒక ఆలంబనగా మాత్రమే తీసికొన్నాడేమో? అని సందేహం కలుగుతుంటుంది. సంఘటనలలో వక్తృ-వాచ్య విషయౌచిత్యం భంగపడుతున్నదని గుర్తింపలేనంత సామాన్యుడు కాడు కదా! కూతురు విరహాన్ని చూసిన ఆకాశరాజు అందరు తండ్రుల లాగా ముందువెనుకలు ఆలోచింపక వెంటనే మంత్రులను పిలిపించి వారితో సంబంధాన్ని గురించి సంప్రతిస్తాడు. ఈ సన్నివేశరచనలోని తొందరపాటు స్పష్టమే. నాయిక నాయకుని ఎదుట ఉండగానే, అతనిని కళ్ళెదుట చూస్తూ ఉండగానే, విరహ పరితాపభరమున (ప.454) వెచ్చనూరుస్తుంది. డేగను వెతుకుతూ వచ్చిన నాంచారును చూసిన నర్మసచివుడు, ఆమె ఎవరు? అని ఎవరినీ అడగకుండానే, అన్ని తెలిసినట్లు నాయకునికి ఆమెను గురించి తెలియజెబుతాడు. రసాదితత్పరమైన ప్రబంధనిర్మాణవైభవాన్ని ఉపేక్షించి కవి పద్యాలను నిలిపాడా? అని అనుమానం కలుగుతుంది. చిరుతనూరిలోని నారాయణవనానికి చెలికత్తెలతో జలకేళికి వచ్చిన నాంచారుకు శ్రీనివాసుని కేలిడేగ అక్కడున్న మామిడికొమ్మపై వాలివుండటం కనబడుతుంది. ఆమె వెంటనే, అత్యంతరయంబునన్, పొదివి, ఆ తరుశాఖల నెక్కి, ఆ పక్షిని, మిక్కిలిన్ సంతసంబంది పట్టుకొని చెట్టు దిగుతుంది. తెలుగు కావ్యాలలో ఎన్నడూ కనుపింపని అపూర్వమైన కావ్యనాయికా పరిచయం ఇది. నాయకునికి పక్షిని అందిస్తూ ఆమె అతనికేసి, నిలువున శృంగార రసము నిగ్గులు గులుకన్ (ప.455) చూస్తుంది. రసాదితాత్పర్యంతో కవి వాచ్య-వాచకయోజనకు ఎందుకు ప్రయత్నింపలేదు? పాత్రచిత్రణలో కానవచ్చే దోషాల పరిహారానికి సావధానమనస్కుడు కాలేదేమి? కావ్యార్థస్ఫురణతోనే కావ్యరచనకు పూనుకొన్నాడా? లేక సర్వలక్షణశిరోమణిలో చెప్పిన లక్షణాలకు ఇక్కడ లక్ష్యాలను ప్రదర్శించటంతో సంతోషపడి ఊరుకొన్నాడా? అని పుట్టలు పుట్టలు సందేహాలు పుట్టుకొస్తాయి. మహాలాక్షణికుడై తనపేరు వాఙ్మయచరిత్రలో చిరస్థాయికం కావాలనుకొన్నవాడు ఇటువంటి అందదుకుల కావ్యం ఎందుకు వ్రాశాడో? అనిపిస్తుంది. మొత్తం మీద ప్రబంధకథానకమంతా యాదృచ్ఛికమని, కవి చెప్పదలచినది ఇంకేదో ఉన్నదని – ఎప్పటికప్పుడు అనిపిస్తూనే ఉంటుంది.

అనువాద కావ్యమా?
ఈ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం అనువాద కావ్యమా? స్వతంత్ర కావ్యమా? అన్న ప్రశ్నకు వేంకటకవే స్వయంగా సమాధానం చెప్పాడు –

అఖిల పురాణ సారాంశ మి ట్లలవియే
యిల విలాసంబుగాఁ దెలుఁగుఁ జేయ (ప.51)

అని. ఈ మాటను బట్టి ప్రబంధరాజం అఖిలపురాణసారాంశమని, అఖిలపురాణసారాంశాన్ని విలాసంగా తెలుగు చేశాడు కాబట్టి, అది ఆంధ్రీకరణమే కాని స్వతంత్రకావ్యం కాదని భావింపవలసి ఉంటుంది. అఖిలపురాణసారాంశము అంటే ఏమిటి? అఖిలము అన్న సంజ్ఞతో ఏయే పురాణాలను కవి ఉద్దేశించాడు? అన్న ప్రశ్నలు ఉదయిస్తాయి. తన కావ్యం అఖిలపురాణసారాంశం అన్న భావాన్ని వేంకటకవి ప్రబంధరాజంలోని, ‘పాదాద్యంతాక్షర కావ్య కర్తృనామగుప్త పూర్వకవిగుప్త సీసపద్యము’లో కూడా సూచించివుండటం గమనార్హం. ఆ పద్యం ఇది:

{వెం} టాడి యసురుల విదళించు దేవ [వేం]
{క} ట రాజితాభిధ గ్రావతిల [క]
{టె} క్కైన వేల్పుల సొక్కించు నెఱజూ [ట]
{శ} యబలాతి శయాస శంభుచా [ప]
{వి} బుధసుధాహృతి విశ్రుత నిజవీ [తి]
{లా} వణ్య కారణ లలిత తిల [క]
{స} కలభక్తవ్రాతసారసోదిత ర [వి]
{ము} నిజనానందకృ న్ముఖ్యచరి [త]

(వ్యా) సనిగమోక్త దశశతాహ్వయధురీ (ణ)
(స) మరభుఙ్మాని కీర్తన సారరా (గ)
(పు) వ్వు దీపించు వి ల్గల ప్రోడతా (త)
(రా) వణాహిత దయ మమ్ముఁ బ్రబలఁ గను (ము). (ప.845)

ఈ పద్యం సీసచరణాల మొదటి ఎనిమిది అక్షరాలను వరుసగా జోడిస్తే, వెం-క-టె-శ-వి-లా-స-ము అని; చరణాల చివరి ఎనిమిది అక్షరాలను జోడిస్తే, వేం-క-ట-ప-తి-క-వి-త అని, ఎత్తుగీతి చరణాల ఆద్యంతాలలోని నాలుగు నాలుగు అక్షరాలను జోడిస్తే వ్యా-స-పు-రా-ణ-గ-త-ము అని దళాలు ఏర్పడుతున్నాయి. వ్యాసపురాణగతము అన్న మాటను బట్టి వేంకటపతి తన కావ్యం వేంకటేశ విలాసం వ్యాసపురాణానికి ఆంధ్రీకరణమని ప్రతిపాదిస్తున్నాడు.

వ్యాసపురాణ గతము అంటే ఏ పురాణం? శ్రీ వేంకటేశ్వర కథాప్రశంస బ్రహ్మాండ పురాణం, స్కాంద పురాణం, గరుడ పురాణం, పద్మ పురాణం, మార్కండేయ పురాణం, వామన పురాణం, వరాహ పురాణం మొదలైన ముఖ్యపురాణాలలోనూ, భవిష్యోత్తరంలోనూ, ఇంకా ఇతరత్రానూ ఉన్నది. వేంకటకవి ఏ ఒక్క పురాణపాఠాన్నో పేర్కొనక, అఖిలపురాణగతము అని, వ్యాసపురాణగతము అని, వ్రాసి ఉండటం వల్ల ఉన్న ఆ అన్ని పురాణకథలనూ చదివి, ఒక్కొక్కదానిలో తనకు నచ్చిన అంశాలను తీసుకొంటూ యథోచితంగా కథను నడిపించాడని అర్థంచేసుకోవాలి.

కాని, జాగ్రత్తగా చూస్తే వేంకటకవి శ్రీ ప్రబంధరాజ రచనకోసం గ్రహించిన కథ ఈ పురాణోదితాలలో దేనితోనూ సంవదించేదిగా కనబడటం లేదు. శ్రీనివాసుని కేలిడేగ చిరుతనూరి నారాయణవనంలో ఉన్న ఆకాశరాజు కూతురు కంటబడటమూ, దానిని వెతుకుతూ వచ్చిన నర్మసచివుడు ఆమె వృత్తాంతాన్ని స్వామికి తెలియజేయటమూ, అలమేలుమంగ స్వామిని చూసి విరహిణి కాగా ఆకాశరాజు వారి వివాహానికి పూనుకోవటమూ అన్న కథాభాగం ఈ పురాణాలలో దేనిలోనూ లేదు. నాగదత్తుడనే అధర్మపరుడు భోగలాలసుడై ధర్మపత్నిని విడిచి, వేశ్యల పొందుకోరి, కొంతకాలానికి వారిచే గెంటివేయబడి, చోరవృత్తిని అవలంబించి, అధర్మవర్తనుడై, వివాహితుడై తిరిగివస్తున్న స్వామిని మార్కొని, హరిబలాన్ని ఎదిరించి, పరాజితుడై స్వామిపుష్కరిణిలో పడి హరిని చేరుకోవటం – అన్న ఉపాఖ్యానం బ్రహ్మాండ, స్కాంద, గరుడ, పద్మ, మార్కండేయ, వామన, వరాహ పురాణాదులలో ఎక్కడా లేదు. కథాప్రారంభంలో నిషాదులు వచ్చి స్వామిని మృగయావినోదార్థం అడవికి తీసికొనివెళ్ళటం అన్నది పురాణకథలలో అగపడదు. వరాహ పురాణం ప్రథమభాగంలోని క్షేత్రఖండంలో (54వ అధ్యాయం) సుదర్శన చక్రం తిరుమలలో ఉండిన దొంగలను కడతేర్చిన వృత్తాంతం ఉన్నది. అది నాగదత్తోపాఖ్యానానికి మూలమని చెప్పటానికి వీలులేదు. వరాహ పురాణంలోనే తొండమానుడనే భక్తుడు ఒక పంచవన్నెల చిలుకను చూసి, అది శ్రీ వేంకటాచలాధీశునిదని ఒక బోయవాని వలన తెలిసికొని, స్వామిపుష్కరిణిలో స్నానంచేసి, వృక్షమూలాన ఉన్న స్వామిని దర్శించిన సన్నివేశం ఉన్నది. ఆ కథ వేంకటకవికీ తెలుసునని ప్రబంధరాజంలోని ‘ఊరీకృత తొండమాన్ చక్రవర్త్యాది భక్తసాత్కృత వైభవుని’ అన్న 561వ వచనంలోని దళం నిరూపిస్తున్నది. అది శ్రీనివాసుని కేలిడేగ ఆకాశరాజసుత కంటబడిన సన్నివేశానికి మూలమనలేము. భవిష్యోత్తరంలో ఆకాశరాజపుత్రి పద్మావతి చెలికత్తెలతో ఉద్యానవనంలో విహరిస్తుండగా ఒక ఏనుగు, దానిని వెంబడిస్తూ ఒక సుందరాంగుడు అక్కడికి రాగా – రాజపుత్రికి అతనిపై ప్రేమ అంకురించిన సన్నివేశం ఉన్నది. ఆ సుందరాంగుడప్పుడు తాను శ్రీనివాసుడనని ఎరిగించి, వకుళాదేవి సాయంతో రాయబారం నడిపి, చివరికి ఆమెను పెండ్లాడిన కథ ఉన్నది.

ఐతే, వేంకటకవి రచనలో ఆకాశరాజపుత్రి పేరు నాంచారు అని ఒకచోట (ప.277), అలమేల్మంగ అని ఒకచోట (ప.598), అలరుమేల్మంగ అని ఒకచోట (ప.497), అలమేల్మంగ నాంచారు అని ఒకచోట (ప.569) – రకరకాలుగా ఉన్నా, పద్మావతి అని ఒక్కచోటా చెప్పబడలేదు. నర్మసచివుడు ఆమె జన్మవృత్తాంతాన్ని స్వామికి ఎరుకపరిచేటప్పుడు తలిదండ్రులు ఆమెకు ‘ఒక శుభదినమున జలజనయన యని యభిధ యిడిరి’ అని మరొక తీరున చెప్పాడు. జలజనయన అన్న ఆ పేరును కథలో మళ్ళీ ఎక్కడా ప్రస్తావించలేదు. అలమేల్మంగ చెలికత్తె పేరు కనకమాలిక అని ఒకసారి (ప.334), కాంచనమాలిక అని ఒకసారి (ప.544), పర్యాయపదాలతో చెప్పాడు. ఆకాశరాజు పుత్రసంతానం కోరి బహుకాలం తపస్సుచేయగా శివుడు ప్రత్యక్షమై, చిరుతనూరిలో గల పద్మసరోవరంలో ఒక పద్మం ఉంటుంది. దాని నడుమ ఒక శిశువు కనబడుతుంది. ఆమెను నీ కుమార్తెగా గ్రహించి, పెంచి పెద్దచేశాక శేషశాయికిచ్చి పెండ్లిచెయ్యి, అని వరమిచ్చిన కథాభాగాన్ని ఉపర్యుక్త బ్రహ్మాండ, స్కాంద, గరుడ, పద్మ, మార్కండేయ, వామన, వరాహ పురాణేతరంగా ఏ పురాణంలో నుంచి గ్రహించాడో తెలియదు. వేంకటాచల మాహాత్మ్యాదులు అన్నిటిలో ఆకాశరాజు గృహిణి పేరు ధారుణీదేవి అని ఉన్నది. వేంకటకవి ఆమె పేరు చంద్రకళ అని చెప్పాడు. అలమేలుమంగ తన తల్లిదండ్రులైన చంద్రకళకు, నాకాశరాజునకు దండంబు వెట్టిన; చంద్రకళ తులగల చంద్రకళతో నాకాశరాజనిభయశోవిశదుఁ డగు నాకాశరాజు (ప.605), అని రెండుచోట్ల వచ్చింది. ఈ పేరు ఎక్కడిదో తెలియదు. భవిష్యోత్తరంలోని శ్రీనివాసకల్యాణంలో రాజు బృహస్పతిని, శుకమహర్షిని రావించి, వారి అనుమతి గైకొని, వివాహముహూర్తం నిర్ణయించి, శ్రీనివాసునికి కల్యాణపత్రికను పంపినట్లు, వకుళాదేవి వచ్చిన తర్వాత స్వామి ఆహ్వానాన్ని పురస్కరించుకొని దేవతలందరూ వచ్చి విడిదితీరినట్లూ ఉన్నది. ప్రబంధరాజంలో ఆకాశరాజు తన కుమార్తె విరహవిషయం తెలియగానే మంత్రులను రావించి, ఈతనికి కూఁతు నొసంగ సంగతంబే? (ప.561) అని చర్చించి (మా అమ్మాయిని మీకిచ్చి పెండ్లిచేయాలనుకొంటున్నాము – అని వివాహప్రస్తావం చేసి, వరుడు, వరుని కుటుంబం వారు ఒప్పుకొన్న తర్వాత నిశ్చితార్థం నిర్వహించి, కల్యాణపత్రికను పంపించటానికి బదులు) వెంటనే ఒక ‘సూచన’ను చేసినట్లుగా ఉన్నది. శ్రీనివాసుడు ఆ సూచనకు అంగీకరించి, పెండ్లివారింటికి వస్తాడు. మంగళస్నానం చేసి, సాలంకృతుడై, కల్యాణమంటపానికి చేరుకొంటాడు. అప్పుడు చెలికత్తెలు అలమేలుమంగ వద్దకు వెళ్ళి, ‘మీ తండ్రి దయార్ద్రహృదయుండై ధృతి నినున్ వెన్నునకు సాకల్యముగాఁ(!?) గల్యాణంబు సేయం దలంచి పిలుచుక రమ్మని ప్రేమమ్మున మముం బంపె,'(ప.569) అని ఆ వార్తను వినిపిస్తారు.

ఈ కథాకథనంలోని ఔచిత్యానౌచిత్యాల మాట అటుంచి, ఈ సన్నివేశాలకు మూలం ఏమిటో తెలియటం లేదని, వేంకటకవి ఏయే పురాణాలను చూసి, అఖిలపురాణగతము అన్నాడో నిర్ణయించటం సాధ్యం కాదని ప్రకృతార్థం. ఒకవేళ అనువాదమే అని నిర్ణయింపవలసి వస్తే రామరాజభూషణుని వసుచరిత్ర మహాభారతానికి, సురభి మాధవరాయల చంద్రికాపరిణయం వాల్మీకి రామాయణానికి ఎటువంటి అనువాదాలో, ఇదీ వ్యాసపురాణాలకు అటువంటి అనువాదమే అని గ్రహించాలి. అపూర్వమైన కావ్యానికి ఆలంబనగా అపురూపమైన కథను ఎన్నుకొన్నాడేమో తెలియదు.

‘వినికిసేయు తెరనాటక’మా?
ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసాన్ని 1977లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమికోసం పరిష్కరించిన వేదము వేంకటరాయశాస్త్రి గారు అవతారికలోని ఒక పాఠాన్ని పురస్కరించికొని, ఇది కావ్యసామాన్యం గాక – శ్రావ్యమైన తెరనాటకం కావచ్చునా? అన్న కొత్త ఆలోచనను చేశారు. ప్రబంధరాజంలో ఆ పాఠప్రస్తావం ఉన్న పద్యం ఇది:

భూరిశృంగారంబు పొడగట్టి నిలిచిన
        పోలిక ఘనరసస్ఫూర్తిఁ జెలఁగ
వలపు బోవని నీటిపైఁ దేలు పూవుఁ జ
        ప్పరము తెఱంగున భావ మలర
వనధివీచిక మీఁద వచ్చు వాలుగ విధం
        బున నొక మిన్న గమ్ముకొని రాఁగ
నాడెమై ననుఁగాంచు ననుఁగాంచు మనుచును
        బ్రాణము ల్గల పదరాజి మెఱయ

మునుపు నిపుడుఁ గవు లొనర్చు ననువుఁదెనుఁగుఁ
గబ్బములలోనఁ దెరనాటకంబు లెస్స
గా వినికిసేయు గతి నలంకారసరణి
వెలయ రచియించు యప్పయ వెంకటార్య. (అవతారిక.33)

ఇందులో ‘తెరనాటకంబు లెస్సగా వినికిసేయు గతి’ అన్నదాన్ని పట్టుకొని శాస్త్రిగారు ఈ విధంగా వ్రాశారు:

ఇది ఏకాశ్వాసప్రబంధము … ఆలోచింపఁదగినదే … నాకిట్లు తోఁచుచున్నది. ఈయన కాలమున యక్షగానములు బహుళప్రచారమునకు వచ్చినవి. వానిలో, అవి ప్రదర్శనయోగ్యములైనను, అంకవిభజన లేదు. పాత్రప్రవేశ నిర్గమనాదుల వలన కథ జరిగిపోవుచుండును. రాత్రియంతయు నాటకమాడువారు. ఈయన కావ్యములలో యక్షగానరచనాప్రక్రియలు చాలా గలవు. వట్టి కావ్యము గాక, చిత్రకావ్యమును గాక, సంగీతకావ్యముగా కూడ దీనిని గ్రహింపవలసియున్నది … ఆశ్వాంతమున గద్య వ్రాయక పద్యమే వ్రాసినాఁడు … నాటకములలో భరతవాక్యము శ్లోకమే గావున ఆ స్వరూపము కలుగుటకు కూడ కవి యిట్లొనరించియుండును … ఇది ‘వినికిసేయు తెరనాటకమా?

వేంకటరాయశాస్త్రిగారి ఈ ప్రతిపాదనను అంగీకరిస్తూ వేంకటకవి ప్రబంధరాజం తెరనాటకమే అని నిర్ధారించి, 1985లో మదురై విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య చల్లా రాధాకృష్ణశర్మగారి పర్యవేక్షణలో ‘గణపవరపు వేంకటకవి కృతులు: సవిమర్శక పరిశీలన’ అన్న శీర్షికతో పరిశోధించి పిఎచ్.డి పట్టాన్ని పొందిన ఆచార్య టి.ఎస్.గిరిప్రకాశ్ ఇందుకు సమర్థకంగా ఇంకా నాలుగు ఉపపత్తులను చూపారు:

ప్రబంధరాజం 181వ పద్యంలో కీల్బొమ్మ తెఱఁగున, రసంబు కదలు మాడ్కి, అన్న ప్రయోగాలున్నాయి.
ఇందులోని 105వ పద్యంలో తెఱలోపలఁ గనుపించియుఁ గనుపింపనట్లున్న యింతి మొగము మనోహరంగా వర్ణింపబడింది.
445వ పద్యంలో వలపుల సూత్రధారి, జంత్రపు బొమ్మ వర్ణింపబడ్డాయి.
యక్షగానసామాన్యములైన అష్టకము, ధవళము, శోభాన, హారతి వంటివి ఇందులో ఉన్నాయి.
అందువల్ల ఇది నిస్సందేహంగా ‘వినికిసేయు తెరనాటక’మే.

అని నిర్ధారించారు. జాగ్రత్తగా ఆలోచించి చూస్తే ఆచార్య గిరిప్రకాశ్ చూపిన ఉపపత్తులలో ఏ ఒక్కటీ తర్కానికి నిలిచేది కాదని తెలుస్తుంది. వీటిలో మొదటిది ‘కీల్బొమ్మ’ వేంకటేశ్వరుని అశ్వధాటిని వర్ణించే సందర్భంలో వచ్చింది. ఒక కావ్యంలోని ఒక పద్యంలో వర్ణనానుగతంగా కీల్బొమ్మ అన్న పదం ఉన్నంత మాత్రాన ఆ కావ్యం తెరనాటకం ఎట్లా అవుతుంది? రెండవది వేంకటేశ్వరుని యెదుట జరిగిన నృత్యప్రదర్శన సందర్భంలోనిది. అది ఒకానొక నటియొక్క ముఖవర్ణన. ఆ ముఖం ‘తెఱలోపలఁ గనుపించియుఁ గనుపింపనట్లు’గా ఉన్నదట. ఆ కల్పన కావ్యం తెరనాటకమన్న నిర్దేశానికి ఏ మాత్రమూ సూచకం కాదు. అటువంటి ఒకానొక కల్పన ఉన్నంత మాత్రాన ఆ కావ్యం తెరనాటకం ఎట్లా కాగలదు?

గిరిప్రకాశ్ చూపిన నాలుగవ ఉపపత్తి పద్యకావ్యంలో సంగీతనాటకాలలో ప్రవేశయోగ్యాలైన అష్టకాదుల ప్రయోగం. జాగ్రత్తగా చూస్తే, ఈ అష్టకం, ధవళం, శోభాన, హారతి, జంపె, త్రిపుటరేకులు, అర్ధచంద్రికలు, సువ్వాల, లాలి, ఏల, దరువు మొదలైన ప్రభేదాలన్నీ ప్రబంధరాజంలో 808వదైన చౌషష్టిభేద చిత్రసీసంలో గర్భితంగా వచ్చినవే గాని, కథాగతంగా చోటుచేసికొన్నవి కావు. అవి ఉన్నంత మాత్రాన ప్రబంధరాజం యక్షగానలక్షణలక్షితం కాదు. తెరనాటకమూ కాదు.

ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము తెరనాటకమన్న నిరూపణకు గిరిప్రకాశ్ చూపిన మూడవ ఉపపత్తి విషయాన్ని కూడా చూద్దాము. ప్రబంధరాజంలోని 445వ పద్యంలో వలపుల సూత్రధారి, జంత్రపు బొమ్మ, అన్న పదాలు ఉన్నమాట నిజమే. వేంకటకవి ‘స్తంభము’ అన్న శీర్షికను నిలిపి చెప్పిన ఆ పద్యం ఇది:

నెలఁతుక వేంకటేశ్వరుని నీటు గనుంగొని నిశ్చలాంగియై
వెలసె విలాసచేష్టలను వేఁ గలయంగ నటింపఁజేయు న
వ్వలపుల సూత్రధారి మురవైరి తనూరుచిఁ జూచి దానఁ జం
చలత వహింపఁగాఁ గదలఁ జాలని జంత్రపుబొమ్మ కైవడిన్.

వలపుల సూత్రధారి అయిన నాయకుని చూచి ఒక కాంత ఆయన మ్రోల గాత్రవల్లి నిశ్చలతను వహింపగా యంత్రపు బొమ్మ లాగా నిలిచిన సందర్భం ఇది. ‘స్తంభము’ అన్న సాత్త్వికభావాన్ని వర్ణింపబూనిన దృశ్యం. ఇటువంటి చిత్రణ ఉన్నంత మాత్రాన కావ్యం ‘వినికిసేయు తెరనాటకం’ ఎట్లా అవుతుంది? అంతే కాదు. సాహిత్యవిద్యార్థులకు పై పద్యాన్ని చూడగానే మూర్తికవి కావ్యాలంకారసంగ్రహంలోని సుప్రసిద్ధమైన ఈ పద్యం గుర్తుకు రావటం సహజమే:

కలికి నృసింహభూవరునిఁ గన్గొని నిశ్చలగాత్రవల్లియై
యలరె విలాసచేష్ట లొలయం గలయంగ నటింపఁజేయు నా
వలపుల సూత్రధారుఁ డనవద్యనృపాకృతిఁ జూచి ని
శ్చలత వహింపఁగాఁ గదలఁజాలని జంత్రపు బొమ్మయో యనన్. (3-39)

అని. రెండింటిలోనూ సందర్భం ఒక్కటే. మూర్తికవి గొబ్బూరి నరసరాజుకు అన్వయించి చెప్పిన విశేషణాలను వేంకటకవి శ్రీ వేంకటేశ్వరునికి అనువర్తింపజేశాడు. అందులోని పొరపాట్లను చర్చించటానికి ఇది తావు కాదు. వేంకటకవి పద్యం మూర్తికవి పద్యానికి పర్యాయపదాలతో కూర్చిన అనుకరణ అన్నది మాత్రమే ప్రసక్తింపబడుతున్నది. కలికి = నెలఁతుక. నృసింహభూవరునిన్ + కన్గొని = వేంకటేశ్వరుని నీటు గనుంగొని. నిశ్చలగాత్రవల్లియై + అలరె = నిశ్చలాంగియై వెలసె. విలాసచేష్టలు + ఒలయన్ + కలయంగన్ నటింపఁజేయు = విలాసచేష్టలను వేఁ గలయంగ నటింపఁజేయు. ఆ వలపుల సూత్రధారుఁడు = అ వ్వలపుల సూత్రధారి. అనవద్యనృపాకృతిన్ + చూచి = మురవైరి తనూరుచిఁ జూచి. నిశ్చలతన్ వహింపఁగాఁ = తానఁ జంచలత వహింపఁగా. కదలఁజాలని జంత్రపు బొమ్మయో + అనన్ = కదలఁ జాలని జంత్రపుబొమ్మ కైవడిన్ – అని ఈ అనుకరణ స్పష్టమే.

ప్రబంధరాజం తెరనాటకం అయితే, ఆ ప్రయోగాలకు మూలమైన కావ్యాలంకారసంగ్రహం కూడా తెరనాటకమే కావాలి.

ఆచార్య గిరిప్రకాశ్ గారి సమర్థన మాటను అటుంచి, ఇంతకీ ఈ ‘తెరనాటక’మన్న ప్రతిపాదనను చేసిన వేంకటరాయశాస్త్రి గారి మాటేమిటి? అంటే, పద్యాన్వయంలో శాస్త్రిగారు పొరబడ్డారని తెలుస్తూనే ఉన్నది. ‘కబ్బములలో తెరనాటకంబు లెస్సగా వినికిసేయు గతి’ అంటే అర్థమేమిటి? అసలు తెరనాటకం అంటే ఏమిటి? తెరను కట్టి ఆడే ఛాయానాటకం అనుకొందాము. దృశ్యకావ్యప్రభేదమైన ఆ తెరనాటకాన్ని వినికిచేస్తే అది శ్రవ్యకావ్యప్రభేదమే అవుతుంది గాని, అది తెరనాటకం ఎందుకవుతుంది? ఆ తెరనాటకాన్ని ‘వినికిచేయటం’ కావ్యరచనాగతంగా ఎట్లా వీలవుతుంది? తెరనాటకంలో అంతర్నాటకం వస్తే దానినెట్లా వినికిచేస్తారు? అన్న ప్రశ్నలను శాస్త్రిగారు ఆలోచించలేదన్నమాట.

అసలు సంగతి ఇది: 1892లో అచ్చయిన పూండ్ల రామకృష్ణయ్యగారి ముద్రణలోనూ, 1977లో వేదము వేంకటరాయశాస్త్రిగారు పునర్ముద్రించిన ప్రతిలోనూ ఈ పాఠం తప్పుగానే అచ్చయింది. పాఠదోషం విమర్శకుల అసంగతమైన అపార్థానికి కారణం అయింది. చెన్నైలో అడయారు థియొసాఫికల్ సొసైటీ వారి వ్రాతప్రతుల సంచయంలో ఉన్న ఈ పద్యపాఠం ఇది:

భూరిశృంగారంబు పొడగట్టి నిలిచిన
        పోలికె ఘనరసస్ఫూర్తి చెలఁగ
వలపు గోలని నీటిపై … లు పూవు చ
        ప్పరము తెరంగున భావ మలర
వనధివీచిక మీద వచ్చు వాలుగ విధం
        బున నొక మింన గంబుకొని రాగ
నాణెమై ననుగాంచు నను … ననుచును
        ప్రాణము ల్గల పదరాజి మెరయ

కబ్బములలోన గరనాటకంబు లెస్స
గా వినికిశెయు గతి నలంకారసరణి
మునుపు నిపుడు కవు లొనర్చు ననుపు తెనుగు
వెలయ రచియించు నప్పయ వెంకటార్యా.

అడయారు ప్రతికి 1978లో నేను వ్రాసికొన్న నకలు ప్రతి పాఠం ఇది. పద్యంలోని సాధుపాఠాల సంగతిని అటుండనిచ్చి, ఎత్తుగీతిలోని ప్రసక్తిని చూద్దాము. ‘కరనాటకంబు’ ప్రకృతసందర్భాన్ని బట్టి కర్ణాటకంబు అని ఉంటుంది. ఆధునికుల ముద్రణపద్ధతి ప్రకారం ఇట్లా ఉంటుంది:

కబ్బములలోనఁ గర్ణాటకంబు లెస్స
గా వినికిసేయు గతి నలంకార సరణి
మునుపు, నిపుడుఁ గవు లొనర్చు ననుపుఁ దెనుఁగు
వెలయ రచియింపు మప్పయ వేంకటార్య!

ఓ అప్పయ వేంకటార్యకవీ! నీవు మునుపటి కవులకు, నేటి కవులకు ఆదరణపాత్రమైన అలంకారప్రస్థానంలో నడచి, కావ్యాలలో సుశ్రావ్యమైన కర్ణాటకం లాగా శ్రవణసుభగమూ, సుమనోహరమూ అయిన అందమైన తెలుగులో రచన కావించు!

పద్యంలో ఉండవలసినది కర్ణాటకంబు అని. అది తెఱనాటకంబు కాదు. ఒక్క అపపాఠం ఎంతమంది, ఎన్నెన్ని అపార్థాలకు దారి తీసిందో చూడండి!
వేంకటకవి వైభవప్రశంస
గణపవరపు వేంకటకవి వైభవాన్ని గురించిన స్వీయప్రశంసలు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలో కొంత అధికంగానే ఉన్నాయి. ఆ విశేషణాలు నూరింటికి పైగానే ఉన్నాయి. వాటన్నిటిని క్రోడీకరిస్తే ఆయన 1. కవి, 2. పండితుడు, 3. ధర్మజ్ఞుడు, 4. సచ్ఛీలుడు, 5. భక్తిపరుడు, 6. మంచి పేరున్నవాడు, 7. చూడ చక్కనివాడు, 8. భోగి, 9. మహాదాత, 10. పరాక్రమశాలి, 11. వ్యవహారదక్షుడు అని తెలుస్తుంది. సర్వలక్షణశిరోమణిలో అయితే, వేంకటకవి బిరుదుగద్య కూడా ఒకటున్నది. 1917లో ఆంధ్ర కవుల చరిత్రమును ప్రకటిస్తున్నప్పుడు గణపవరపు వేంకటకవి చరిత్రమును వ్రాయవలసి వచ్చిన కందుకూరి వీరేశలింగంగారు ఆ విశేషణాలను చూసి మండిపడి, ‘స్వాతిశయమును చెప్పుకొన్న యాంధ్రకవులలో నెల్ల నితఁ డగ్రగణ్యుఁ డయినట్లు కనఁబడుచున్నాఁడు’ అని మొదలుపెట్టి, తీవ్రంగా నిప్పులు చెరిగారు. అప్పటికీ కోపం చల్లారక, తమ స్వీయచరిత్రములో కూడా ఈ విషయాన్ని మళ్ళీ తలచుకొని, ‘మనస్సులోఁ జింతయుఁ గోపమును గలిగి వాని విషయమునఁ గొంత కఠినముగ వ్రాయవలసినవాఁడ నైతిని’ అని నెమరువేసుకొన్నారు. కవుల చరిత్రలో చిత్రకవితను నిరసిస్తూ వేంకటకవిని గురించి మునుపు వ్రాసిన ఆ విమర్శనంతటినీ పునరుద్ఘాటించారు. ఆ వాక్యాలలోని తీవ్రతకు ఆశ్చర్యపడిన చాగంటి శేషయ్యగారు 1958లో అచ్చయిన తమ ఆంధ్రకవితరంగిణి 233వ పుటలో, ‘కవి వ్రాసికొనిన యాత్మస్తుతిభాగములను జదివి యేహ్యముఁ జెందిన హృదయముతో నున్నపుడు పంతులుగారి లేఖినినుండి వెలువడిన వాక్యములనుగా వాని నుపేక్షింపవలసియున్నది’ అని సర్దిచెప్పవలసివచ్చింది.

నిజానికి, 1892లో అముద్రిత గ్రంథచింతామణి పక్షాన నెల్లూరులో ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసాన్ని అచ్చువేసిన పూండ్ల రామకృష్ణయ్యగారే ఈ సందేహాన్ని త్రోసిపుచ్చి, పీఠికలో ఎంతో సుదీర్ఘమైన సమాధానం చెప్పారు. ఈనాడు మనకు కర్ణగోచరంగా ఉన్నప్పటికీ, ఒకనాడు నేత్రగోచరంగా ఉండినప్పుడు ఆ కాలపు పండితపామరుల యెదుట ‘ఇట్టి బద్దులగు సుద్దులు వ్రాసి తాను లోకము ముఖమెట్లు చూచుచుండును?’ అన్నారు. కవి ప్రసిద్ధుడై ఉండి, తెంపరితనం కొద్దీ అతిశయోక్తులను వ్రాస్తే, రాజాస్థానాలకు వస్తూ పోతూ ఉండిన రోజులలో ఒక్కరైనా ఈ విషయాన్ని నిలదీసి ఉండరా? అసత్యం ఎంతకాలం దాగుతుంది? అంటూ, వివరించారు. ‘ఇక్కవి వ్రాసినది నిజముగాని పక్షమున నితనికింత ప్రసిద్ధి కలుగనేరదు … … కాఁబట్టి యితఁడు వ్రాసినదంతయు నిజమని నమ్మవలసియున్నది,’ అని సమర్థించారు.

ఈ వాక్యాలను చదువుతున్నప్పుడు 1892లో అముద్రిత గ్రంథచింతామణి పక్షాన పూండ్ల రామకృష్ణయ్యగారు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసాన్ని అచ్చువేయక మునుపే వీరేశలింగంగారు గణపవరపు వేంకటకవి రచనను ఏదో పత్రికలో విమర్శించి ఉంటారని, 1892లో పూండ్ల రామకృష్ణయ్యగారు దానికే సవిస్తరంగా సమాధానం చెప్పివుంటారని, దానితో సంయమనం కోల్పోయి వీరేశలింగంగారు 1917 నాటి తమ కవుల చరిత్రములో దానిని మరింత తీవ్రంగా అభిశంసించి ఉంటారని అనిపిస్తున్నది. వీరేశలింగంగారి ఆ వ్యాసవిషయమై ఇంకా పరిశోధింపవలసి ఉన్నది.
---------------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు, 
ఈమాట సౌజన్యంతో