Friday, August 31, 2018

రామాన్వేషణ


రామాన్వేషణ





సాహితీమిత్రులారా!

సీతాన్వేషణ మనం విన్నాం సినిమాల్లో కన్నాం
కానీ ఇక్కడ రామాన్వేషణ ఆస్వాదించండి మరి..........

“సీతే..సీతే!” అన్న అరుపులు ఎక్కడో అగాధంలోంచి వస్తున్నట్టున్నాయి.

అగాధపు అంచుల్లో ఉన్న సూడో-సీత ఆ అరుపులను లెక్కచేయకుండా, “రామా! రామా!” అని అక్కడక్కడే వెతుకుతుంది.

సూడో-రాముడు అపహరణ గురైయ్యాడన్న వార్త సూడో-సీతకు ఇప్పుడిప్పుడే అందింది. ఆ వార్తను చెప్పుకోడానికి, బాధను పంచుకోడానికి, కలిసి వెతకడానికి లక్ష్మణుడు, హనుమంతుడు వగైరాలెవ్వరూ సూడో-సీతకు అందుబాటులో ఉండరు. వాళ్ళంతా రాముడి పక్షం కదా! వాళ్ళకి సూ.సీత ఉందని కూడా తెలీదు.

సూ.సీత అక్కడక్కడే వెతికి వేసారింది. కట్టుకున్న మనుషులైతే కారడవులు దాటుకొని, ఆనకట్టలు కట్టుకొని వెతుకుతారని మనం విని ఉన్నాం. కానీ, కంటికి ఆనని మనుషులు వెతకాల్సినవచ్చినప్పుడు చాలా టర్మ్స్ ఆండ్ కండీషన్స్ ఉంటాయి. “రామా!” అన్న పిలుపు సూ.రాముడికి కాదు కదా, మరెవ్వరికి వినిపించకూడదు. ప్రైవసీ ఇష్యూస్! మాటమాటల్లో తనకు కొన్ని ప్రత్యేక స్థావరాలు, కొన్ని రహస్య మందిరాలూ ఉన్నాయని సూ.రాముడు చెప్పాడు. వాటిల్లోకి సూ.సీతకు ప్రవేశం నిషిద్ధం అని కూడా చెప్పాడు. కానీ, అవి ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు. పొరపాటున కూడా వాటి జోలికి వెళ్ళకూడదని సూ.సీత, అక్కడక్కడే తచ్చాడుతూ “రామా! రామా!” అని తనకి కూడా వినిపించనంత బిగ్గరగా అరుస్తుంది.

ఇదేదో “రోల్ రివర్సల్” కథలా ఉంది. మరప్పుడు టైటిల్ “సీతాయణం” అని ఉండాలేమోగా – అని మీరు ఉత్సాహపడచ్చు.

కథ ఎప్పుడూ రాముడిదే! సీతది అందులో కథను ముందుకో, పక్కకో నడిపించే పాత్ర మాత్రమే. సూడోసీత కాబట్టి కథను నడిపించడంలో ఆమె పాత్రే లేదు. అందుకే సూడో అయినా సరే, ఇది రామాయణమే! (కాదూ, కూడదు అని మీరు వాదించదల్చితే, సూ.సీత ఆగ్రహానికి లోనవ్వాల్సి వస్తుంది. అసలే సూ.రాముడు కనబడ్డం లేదన్న చిరాకులో ఉంది. ఆలోచించుకోండి.)

సూ.రాముడు రాముడంతటివాడు. (కానీ, రాముడు కాదు. అందుకే సూడో-రాముడు. హెన్స్ ప్రూవ్డ్.) రాజ్యాలూ, పూజ్యాలూ లేని మామూలు వాడైనా తనదంటూ ఉన్న ప్రపంచాన్ని రామరాజ్యం అన్నట్టు భావిస్తాడు. ( అందులో ఎన్నటికీ ప్రవేశంలేని సూ.సీత అదే నిజమనుకుంది.) ప్రాణమిచ్చే బలగం అతడి ఆస్తి. మంచి బాలుడే – మంచిలో ఒక గరిటెడు చిలిపితనం, ఒక బకీటుడు రసికతనం, ఒక గంపెడు బతకనేర్చినతనం కలుపుకుంటే!

అచ్చంగా జరిగిందేంటో తెలీదు గానీ.. (మాకు తెలియాలి! తెలిసి తీరాలి! – అని మీరు ఆవేశపడకండి. సూ.సీత దాటలేని గీతలు, ప్రవేశించలేని రహస్యమందిరాలు ఉన్నాయని మీకు ఇదివరకే తెలియజేయడం జరిగింది. అయినా, జరిగిందేదో తెలిసి తీరాలంటే…కరెక్ట్.. మీరు సూ.సీత ఆగ్రహానికి లోనవ్వాలి. రాముడికోసం తపిస్తున్న సీత దగ్గరకు వెళ్ళడానికి రావణుడే జంకాడు. ఆపై మీ ఇష్టం.)

మళ్ళీ.. అచ్చంగా జరిగిందేంటో తెలీదు గానీ, సూ.రాముణ్ణో రాక్షసుడు ఎత్తుకుపోతూ ఉంటాడు, అప్పుడప్పుడూ. (రాక్షసుడే! రాక్షసి అయ్యుంటే – “స్త్రీలను గౌరవించడం మన సంపద్రాయం” అని ఆర్టిసి బస్సుల సూత్రం ప్రకారం కిక్కురుమనకుండా అక్కడే ఉండిపోయేంత మంచి బాలుడు.)

మరి యుద్ధాలు చేసి గెలిచే వస్తాడో, లేక తప్పించుకొని పారిపోయే వస్తాడో తెలీదుగానీ, సూ.రాముడే తిరిగివచ్చేస్తుంటాడు. ఒక్కోసారి త్వరగా వచ్చేస్తాడు. ఒక్కోసారి ఎంతకీ రానట్టే అనిపిస్తాడు. వెనక్కి వచ్చేశాక మాత్రం తన రాజ్యంలో ఉన్నవారందరి బాగోగులూ దగ్గరుండి చూసుకుంటాడు. తరతమ బేధాలు లేకుండా అందరికి బోలెడంత సంతోషాన్ని కలిగిస్తాడు, వాళ్ళందరూ అతణ్ణి పూజింజేంతగా!

సు.రాముడు అలా మాయమైనప్పుడల్లా సూ.సీత ఇలా వెతకటం మొదలెడుతుంది.
కథ మధ్యలో ఇలా జొరబడటం మర్యాద కాకపోవచ్చుగానీ.. ఇలా వెతకటం వల్ల లాభం ఏంటి? ఇలా అయితే రాముణ్ణి ఏ రాక్షసుడు తీసుకెళ్తున్నాడు? తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు? అక్కడ నుండి రాముడు ఎలా తప్పించుకుంటున్నాడు? చంపి వస్తున్నాడా? అలా అయితే, రాక్షసుడు మళ్ళీ ఎలా వస్తున్నాడు? ఇంకోడుగానీ పుట్టుకొస్తున్నాడా?
చంపకుండా తప్పించుకుంటుంటే – ఎన్నాళ్ళిలా? రాక్షసుడిని చంపాలిగా కదా? ఎలా? దానికోసం ప్రణాళిక.. ప్లానింగ్ కమిషన్…వర్కింగ్ కమిటీ..

మీరూ… మీ గాభరా! మనకన్నా చాలా ముందునుండే గాభరా పడుతున్న సూ.సీత ఇప్పటి వరకూ సాధించిన పురోగతి ఏమీ లేదు.

ఎందుకుండదండీ? మనసుంటే మార్గం అదే ఉంటుంది. దీని బట్టి సీతకి రాముడిపై దొంగప్రేమే.. అదే …సూడోప్రేమ ఉన్నట్టుంది. నిజమైన ప్రేమే ఉంటే ఎప్పుడూ రాముణ్ణి కనిపెట్టుకొని ఉండి, అతడినే “ఫాలో” అయితే ఈ రాక్షసుడు ఎప్పుడు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నవి తేలిగ్గా తెల్సుకోవచ్చు!

ఈ టెహల్కా ట్రిక్ సూ.సీత తెలీక కాదు. సూ.రాముణ్ణి రాక్షసుడిలా ఎత్తుకుపోతాడన్న సంగతి నిర్ధారణ చేసుకున్నాక, రాక్షసుడి రాక కోసం కాపుకాచింది. రాక్షసుడు వచ్చాడు. సూ.రాముడి ఇంటిలోకి వెళ్ళాడు. తలుపులు మూశాడు. కొంతసేపటి వరకూ భీకరమైన శబ్ధాలు వినిపించాయి. ఆ తర్వాత ఆగిపోయాయి. అప్పటి వరకూ బయట కారిడర్‌లో తచ్చాడుతున్న సూ.సీత టెన్షన్ తట్టుకోలేకపోయింది. తలుపులు బద్దలు కొట్టింది. లాభం లేదని కిటికి అద్దం పగలగొట్టింది.

అగ్నిపత్ సినిమా క్లైమాక్సులో హృతిక్ రోషన్‌లా, టి-20లలో బౌలర్లలా సూ.రాముడు చావుదెబ్బలు తింటున్నాడు, రాక్షసుని చేతిలో. ఉక్రోషంతో సూ.సీత మళ్ళీ ఇంకో రాయి విసిరింది కిటికిల్లోంచి.

రాక్షసునికే తగిలింది.

“ఇది చీటింగ్!” అన్నాడు రాక్షసుడు, సూ.రామునికేసి చూస్తూ.
“టైమ్ ప్లీజ్” అన్నాడు సూ.రాముడు

వచ్చి, సూ.సీత చేయి పట్టుకొని గట్టిగా కొరికి వదిలిపెట్టాడు సూ.రాముడు. వెంటనే వెళ్ళకపోతే ఆమెనే తినేస్తానన్నాడు. ఆమె ఏడ్చుకుంటూ తిరిగివచ్చేసింది.

అలా కొరికింది తన రాముడు అయ్యుండడని, అలా భయపెట్టటం తనవాడికి చేతకాదని సూ.సీతకో గట్టి అనుమానంతో కూడిన వట్టి నమ్మకం. అదంతా రాక్షసమాయని నచ్చజెప్పుకుంటుంటుంది ఇప్పటికీ. అప్పటినుండి మళ్ళీ యుద్ధానికి వెళ్ళలేదులే. (అతడు తినేస్తాడేమోనన్న భయం కాదు. అతడికి తాను అరగకపోతే అని బాధ!)

ఏడ్చినట్టే ఉంది… ఇలా అయితే ఈ కథ ఎక్కడికి పోతుంది?

సూ.సీతలా… అక్కడక్కడే…

రాముడు దొరికేస్తే…అదే తిరిగొచ్చేస్తే, అంతా హాపీసేగా…

హాపీస్ అంటే సూ.రాముడికి హాపి. అతడి బంధుజనానికి హాపి. వాళ్ళెవ్వరైనా దయతలచి ఫేస్‌బుక్ అప్‌డేట్ చేస్తే, విషయం తెల్సుకున్న సూ.సీత కూడా హాపీ..

వియోగంలో ఉన్న సూ.సీతకు ఆశోకవనం లాంటి లగ్జరీలు లేవు. పైగా బాస్‌లకి, డెడ్‌లైన్లకి ఇవ్వనీ వినడానికి మీకున్నంత ఓపిక ఉండదు. అందుకని సూ.రాముడు మాయమైపోయినప్పుడల్లా సూ.సీత అగాధంలోకి పడిపోయీ పోనట్టుంటుంది. సూ.రాముడొచ్చేశాడని తెలిశాక, పడిపోయిన సీతను పడిపోని సీత బయటకు తెచ్చుకోవాలి.

అయితే, కథ మొదట్లో, సీతే, సీతే అని వెతుకుతుందీ… సీత తాలూకా.. ?

అంతే!

హమ్మ్.. మల్టి లేయర్డ్ పెర్పెచ్యువల్ గేమ్ ఆఫ్ సూడో-సెర్చింగ్?

నాట్ బాడ్.

ఏంటో.. రాముడు-సీత, మధ్యలో రాక్షసుడు అనే కథ మాకు కంఠతావచ్చు. ఇదేంటో, రాముడూ-రాక్షసుడూ, మధ్యలో సీత కథ? అసలా రాముడి గతమేంటి? ఆ రాక్షసుడికి ఏం కావాలి? మధ్యలో సీతకు ఎందుకొచ్చిన సంత?

అవ్వన్నీ.. మరెప్పుడైనా..

వాట్ ది…
[ఇంకా (ఉన్నట్టే) ఉంది]
--------------------------------------------------------
రచన - పూర్ణిమ తమ్మిరెడ్డి, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

Thursday, August 30, 2018

లవరే మాయ వైఫే మాయ (పేరడీ)


లవరే మాయ వైఫే మాయ (పేరడీ)





సాహితీమిత్రులారా!


జగమే మాయ బ్రతుకే మాయ అనే పాటకు
లవరే మాయ వైఫే మాయ అనే పేరడీని
అందించారు జొన్నవిత్తులగారు అది ఇక్కడ
విని ఆనందించండి-



Wednesday, August 29, 2018

తెలుగు భాషాదినోత్సవ ఉపన్యాసం


తెలుగు భాషాదినోత్సవ ఉపన్యాసం




సాహితీమిత్రులారా!

నేటి మన భాషా స్థితికి కారకులెవరంటారు
ప్రతిరోజూ తెలుగు అంతరించిపోతుందని
తెలుగుకు విలువ తగ్గిపోతోందని మనం
వింటున్నాం దీనికి కారణం ఎవరంటారు
వీటిని గురించి 21 ఫిబ్రవరి 2018న
అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవంరోజున
భారత్ టుడే ఛానల్ వారు జరిపిన
చర్చా గోష్ఠిని వీక్షించి కారకులెవరో
గమనించి మార్చే ప్రయత్నం చేయగలరేమో !
చూడండి-


Monday, August 27, 2018

మొగుణ్ణి నమ్మబోకుమా(పేరడి)


మొగుణ్ణి నమ్మబోకుమా(పేరడి)





సాహితీమిత్రులారా!

జొన్నవిత్తులగారు వైజాగ్ @20లో
పాడిన పేరడీ పాట వీక్షించండి-



Sunday, August 26, 2018

మేధకు పదును పెట్టే క్రాస్ వర్డ్ పజిళ్లు


మేధకు పదును పెట్టే క్రాస్ వర్డ్ పజిళ్లు



సాహితీమిత్రులారా!


మెదడుకు ఉత్తేజాన్నిచ్చి, మేధ (intelligence)కు పదును పెట్టే ప్రక్రియ క్రాస్ వర్డ్ పజిల్. మతిమరుపు ముఖ్య లక్షణంగా గల Alzheimer’s disease ఈ రోజుల్లో ఎందరినో పట్టి పీడిస్తున్న సంగతి మనకు తెలిసిందే. దాని బారిన పడకుండా వుండాలంటే ప్రతిరోజూ సుడోకు, క్రాస్ వర్డ్ మొదలైన పజిళ్లను పూరించడం, కొత్త భాష(ల)ను నేర్చుకోవడం, శాస్త్రీయ సంగీతాన్ని వినడం, ఎడమ చేతితో దంతాలను బ్రష్ చేసుకోవడం, అరికాలునూ పాదాల వేళ్లనూ అన్ని దిక్కుల్లో వంచుతూ ఓ ఐదు నిమిషాల సేపు చిన్న వ్యాయామం చేయడం – ఇవన్నీ అవసరమని వైద్యశాస్త్రం చెప్తోంది. ప్రామాణికమైన క్రాస్ వర్డ్ లను పూరించడం మెదడుకు మేలును కలిగిస్తుందనటంలో అనుమానం లేదు. భౌతికమైన వ్యాయామం చేస్తే కండరాలు పెరిగినట్టే, మెదడును ఈ రకమైన వ్యాయామానికి గురి చేస్తే మెదడులోని నాడీకణాలు వృద్ది చెందుతాయని పరిశోధన ద్వారా రుజువైంది.

దాదాపు నలబై సంవత్సరాల క్రితం జ్యోతి మాసపత్రికలో శ్రీశ్రీ గారు నిర్వహించిన ‘పదబంధ ప్రహేళిక’ చాలా ప్రామాణికంగా, జటిలంగా ఉండేది. తర్వాత ఆ శీర్షికను ఆరుద్ర గారు కొంతకాలం పాటు కొనసాగించారు. అంతకన్న దాదాపు పది సంవత్సరాల ముందు – అంటే 1965 ప్రాంతంలో – వీటికన్న తక్కువ ప్రమాణికత ఉన్న క్రాస్ వర్డ్ ఒకటి ‘పుస్తక ప్రపంచం’ అనే పత్రికలో వచ్చేది. నాకు జ్ఞాపకమున్న మొట్టమొదటి క్రాస్ వర్డ్ అదే. 2007 – 2011 ప్రాంతంలో ‘పొద్దు’ ఇంటర్నెట్ పత్రికలో ధారావాహికంగా వచ్చిన పజిళ్లు కూడా చాలా వరకు ప్రమాణికతను కలిగి ఉన్నవే. ఈ రోజుల్లో మన తెలుగు పత్రికలలో వస్తున్న క్రాస్ వర్డ్ లు చాలా సులభమైనవి కనుక, వాటిని పూరించడం వలన మెదడుకు అంతగా వ్యాయామం ఉండదు. జటిలమైన పజిళ్లు సాధారణ పాఠకులకు విసుగును తెప్పిస్తాయి కనుక, వాటికి ఆదరణ తక్కువ. అందుకే వాటిని ప్రచురించడానికి పత్రికలు జంకుతాయి.

ఇంగ్లిష్ క్రాస్ వర్డ్ ల విషయానికి వస్తే, న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వచ్చే క్రాస్ వర్డ్ కు అన్నిటికన్న ఎక్కువ జటిలమైనదనే పేరుంది. దాన్ని వదిలేస్తే, నేను చూసినంత వరకు ఇంగ్లిష్ , తెలుగు రెండు భాషల్లో కలిపి చూసినా The Hindu పత్రికలో వచ్చే క్రాస్ వర్డ్ అన్నిటికన్న జటిలమైనదే కాక, ఎంతో thrill ను ఇచ్చే పజిల్. అయితే క్రాస్ వర్డ్ పూరణకు సంబంధించిన కిటుకులు తెలిస్తే తప్ప హిందు పత్రికలోని పజిల్ను పూరించడం చాలా కష్టం. అవి తెలియనప్పుడు భాష ఎంత బాగా వచ్చినా లాభం లేదు. ఇంగ్లిష్ లో కానీ, తెలుగులో కానీ ఈ పజిళ్ల క్లూలు (ఆధారాలు) రెండు రకాలుగా ఉంటాయి. నేరుగా ఉండే ఆధారాలు (డైరెక్ట్ క్లూస్) మొదటి రకం. ఇక్కడ సాధారణంగా ఆధారంలో ఒకటే పదం ఉండి, దానికి సమానార్థక పదం సమాధానంగా ఉంటుంది. ఇక రెండవ రకం ఆధారాలను cryptic clues (నిగూఢ ఆధారాలు) అంటారు. ఇవి వాక్యాల రూపంలో ఉండి, డైరెక్టుగా ఉండక  చాలా తికమక పెడతాయి. కాని సరైన సమాధానం దొరికితే గొప్ప thrill కలుగుతుంది. ముందు ఆంగ్ల పజిళ్ల గురించి చెప్పి, తర్వాత తెలుగు పజిళ్లకు వస్తాను.

హిందులో వచ్చే క్రాస్ వర్డ్ ను శ్రీశ్రీ గారు ప్రతిరోజూ ఉదయం కాఫీ తాగేటప్పుడు పూరించానికి ప్రయత్నించేవారట. హిందు క్రాస్ వర్డ్ లో ఉండే ఆధారాలలో దాదాపు వంద శాతం cryptic (నిగూఢ) రకానికి చెందినవే కాబట్టి, ట్రిక్స్ తెలియకుంటే ఆంగ్లభాష బాగా వచ్చినవాళ్లు కూడా చాలా మంది ఒక్కటంటే ఒక్క ఆధారానికి సైతం సమాధానం చెప్పలేకపోవచ్చు. ఆ ఆధారాలు ఎలా ఉంటాయో తెలుపడానికి ఈ కింద కొన్ని ఉదాహరణలిచ్చి, వాటికి సమాధానాలను వివరిస్తాను. బ్రాకెట్లలో ఉన్నది సమాధానంలోని అక్షరాల సంఖ్య. పాఠకులు సులభంగా అర్థం చేసుకోవడం కోసం కొన్ని కీలకమైన అక్షరాలను bold font లో ఇస్తున్నాను. కాని, పజిళ్ల ఆధారాలను అచ్చు వేసినప్పుడు అవి ఈ విధంగా red bold font లో ఇవ్వబడవు.

1. Flower in my control (7)

దీనికి సమాధానం mastery. ఎట్లా అంటే, my అనే పదంలో aster (ఒక పువ్వు పేరు)ను చొప్పించాలి. అంటే m ను ఒక చివరన y ని మరొక చివరన వుంచి, మధ్య aster ను పెట్టాలన్న మాట. అప్పుడు mastery వస్తుంది. Mastery అన్న పదం control కు సమానార్థకం కదా!

2. Run and fall in Karnataka (3)

దీనికి సమాధానం jog. వివరణ చూడండి. Jog (జాగ్) అంటే run (పరుగెత్తడం). ఇక Jog (జోగ్) అన్నది జలపాతం (fall = waterfall) కూడా. ఇది కర్ణాటక రాష్ట్రంలో వుంది!

3. Edward got ten by ten to project (6)

దీనికి సమాధానం extend. ఎలాగంటే, Edward కు Ed ను short form గా తీసుకోవాలి. ఆ రెండు అక్షరాలను దూరంగా వుంచి, వాటి మధ్యన xten ను చొప్పించాలి. రోమన్ సంఖ్యల ప్రకారం X అంటే పది. తర్వాత మరొక పదికి ten ను అలాగే పెట్టాలి. Extend అన్నా project అన్నా ఒకటే (చొచ్చుకుని బయటికి రావడం).

4. They take pictures – hundred and a thousand times (7)

దీనికి సమాధానం cameras. రోమన్ సంఖ్యల ప్రకారం C = 100, M = 1000, eras = times. ఈ సమాధానంలో, ఆధారంలోని a ను ఉన్నదున్నట్టుగానే c తర్వాత వుంచాలి.

5. Wander with or without Right (5)

దీని సమాధానం amble. ఎట్లా అంటే, wander = తిరగడం లేక నడవడం. దీనికి సమానార్థక పదం amble. ఇక్కడ చమత్కారమేమంటే with or without Right అన్నప్పుడు ఆధారంలోని Right కు మొదటి అక్షరమైన R ను తీసుకోవాలి. దాన్ని amble కు ముందు వుంచితే ramble వస్తుంది. అప్పుడు కూడా అర్థం మారదు. R ఉన్నా లేకపోయినా ఒకటే అర్థం అన్న మాట (Ramble అన్నా amble అన్నా నడవడం లేక తిరగడం)

6. Discovers Sun revolving around a planet (7)

దీనికి సమాధానం unearths. ఇక్కడ earth ఒక planet కనుక, ఆ పదం చుట్టూ Sun లోని మూడక్షరాలను అమర్చాలి. అయితే ఇక్కడ Sun అని కాక, uns అని చేర్చాలి. ఇక unearths = discovers.

7. Some walk in grass and see a person of royal origin (4)

దీనికి సమాధానం king. హిందు క్రాస్ వర్డ్ లోని ఆధారాలలో ఎక్కడైనా some అని వస్తే సాధారణంగా సమాధానం నేరుగా (ఎటువంటి మార్పు లేకుండా) ఆ ఆధారంలోనే వుంటుంది. అయితే అది ఒకే పదంగా కాక, దానిలోని అక్షరాలు రెండు లేక మూడు పదాలలో వ్యాపించి ఉంటాయి. ఈ ఆధారంలో walk లోని చివరి అక్షరం, grass లోని మొదటి అక్షరం, ఆ రెండింటి మధ్య in ను తీసుకోవాలి. అంటే సమాధానం మనకు en-bloc గా  దొరికిందన్న మాట.

8. Beginners in empirical research role often repeat this mistake (5)

దీనికి సమాధానం error. ఇక్కడ beginners అంటే రాబోయే పదాలను ప్రారంభించే అక్షరాలు అని అర్థం చేసుకోవాలి. Empirical, research, role, often, repeat – ఈ పదాల మొదటి అక్షరాలను కలిపితే error వస్తుంది. అది mistake కు సమానం.

9. Nasty agreement to disown male adolescent (8)

దీనికి సమాధానం teenager. ఇక్కడ agreement లోంచి m అనే అక్షరాన్ని తొలగించి (disown చేసి), మిగిలిన అక్షరాలను తారుమారు చేయగా teenager వస్తుంది. అది adolescent కు సమానం. Nasty అంటేనే తారుమారైన అని అర్థం చేసుకోవాలి. ఒక పదంలోని అక్షరాలను తారుమారు చేసి సమాధానాన్ని పొందటం చాలాసార్లు అవసరమౌతుంది క్రాస్ వర్డ్ పజిళ్లలో. వీటిని anagrams అంటారు. ఉదాహరణకు lived – devil, Nepal – panel, ruminates – anti serum, amusing or – ignoramus మొదలైనవి.

10. After removing the tail, sear and eat fish (7)

దీనికి సమాధానం sardine. ఎట్లా అంటే, the అనే పదానికి tail (తోక) అయిన e ని sear లోంచి తీసేస్తే sar మిగులుతుంది. దాని పక్కన eat కు సమానమైన dine ను చేర్చాలి. అప్పుడు sardine వస్తుంది. అది ఒక చేప రకం పేరు!

11. Money holders with everyone set out (7)

దీనికి సమాధానం wallets. ఆధారంలో ఉన్న with అనే పదంలోని మొదటి అక్షరమైన w ను తీసుకుని, దానిపక్కన everyone కు సమానమైన all నూ, తర్వాత set ను తారుమారు చేయగా వచ్చిన ets నూ చేర్చితే wallets వస్తుంది. వాలెట్స్ (పర్సులు) మనీ హోల్డర్సే కదా.

12. Hit the French and get a glass ring (6)

దీనికి సమాధానం bangle. Hit = Bang. ఇక the కి le తీసుకోవాలి  (ఫ్రెంచ్ భాషలో the ని Le, Les అంటారు). Bangle = Glass ring.

అదే విధంగా sailor కు ab (Able Bodied men కు short form), work కు op (సమానార్థక పదమైన operation లోని మొదటి రెండక్షరాలు), worker కు ant, ship కు SS, the Spanish కు el, doctor కు MO లేక MB, bachelor కు BA, politician కు MP, student కు L (Learner లోని మొదటి అక్షరం), father కు pa, m other కు  ma – ఇట్లా లెక్కలేనన్ని సంకేతాక్షరాలు, పదాలు ఉంటాయి. చాలా సందర్భాల్లో అవి సంకేత పదాలు అని నిఘంటువులలో ఇవ్వబడదు. మరి ఆ విషయం మనకు ఎట్లా తెలియాలి అంటే క్రాస్ వర్డ్ లను పూరించడంలో అనుభవం ఉన్నవారిని అడిగి తెలుసుకోవాలి. క్రాస్ వర్డ్ లను గురించిన పుస్తకాలలో కూడా దీనికి సంబంధించిన సమాచారం ఉండవచ్చు. లేదా ప్రతిరోజూ క్రాస్ వర్డ్ ను నింపటానికి ప్రయత్నం చేస్తూ, అంతకు ముందురోజు ఇవ్వబడిన పజిల్ సమాధాలను జాగ్రత్తగా పరిశీలించి కొత్త సంకేతాక్షరాలను, పదాలను నేర్చుకోవాలి.

13. Slight deficiency in a hormone (7) అనే ఆధారానికి insulin ఎట్లా సమాధానం అయిందో తెలుసుకోవడానికి తలను బద్దలు కొట్టుకోవాల్సివచ్చింది. ఇక్కడ slight అంటే కొంచెం అని కాక, అవమానించుట/అవమానం అనే అరుదైన మరో అర్థాన్ని తీసుకోవాలి. దానికి సమానార్థక పదం insult. అయితే deficiency (కొరత) ఉన్నదంటున్నారు కనుక, ఒక అక్షరాన్ని (ఇక్కడ చివరి అక్షరమైన t ని) తీసేయాలి. అప్పుడు insul మిగులుతుంది. ఆధారంలో ఉన్న in ను అలాగే ఉంచి కలపాలి. అప్పుడు insulin వస్తుంది. ఇది రక్తంలోని గ్లూకోజును నియంత్రించే ఒక హార్మోను! చూశారా, దీంట్లో ఎంత తిరకాసు వుందో.

14. Sultana’s odd, substituting king with knight (5). ఇది మరొక క్లిష్టమైన ఆధారం. దీనికి సమాధానం queen. ఎట్లా అంటే, odd కు సమానార్థక పదం queer. ఆ పదంలోని చివరి అక్షరమైన r రాజును సూచిస్తుంది (Royal, regal అనే పదాలలోని మొదటి అక్షరం R కనుక). Queer లోని r ను తొలగించి దాని స్థానంలో knight లో ఉచ్చారణపరంగా మొదటి అక్షరమైన n ను పెట్టాలి. అప్పుడు queen వస్తుంది. సుల్తానా అంటే ముస్లిమ్ రాణి కదా! ఇక్కడ Sultana’s అంటే Sultana is అన్న మాట. హిందు క్రాస్ వర్డ్ లో ఇంతకన్న ఎక్కువ క్లిష్టమైన ఆధారాలు కూడా వుంటాయి. వాటిని చర్చిస్తే మెదడు విపరీతంగా వేడెక్కిపోతుంది.

హిందు క్రాస్ వర్డ్ లోని ఆధారాలలో ఇవ్వబడే చాలా పదాలకు సాధారణ అర్థమున్న పదాలను కాక, అరుదైన అర్థమున్న పదాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు writer అన్నప్పుడు రచయిత అని కాక pen అనే పదాన్ని (that which writes)  తీసుకోవాలి.  Pen అన్నప్పుడేమో కలం అని కాక sty (పందుల దొడ్డి)ని తీసుకోవాలి. Rail అన్నప్పుడు రైలు/పట్టా అని కాక shout/ rant (కోపంతో అరచుట)ను, see అన్నప్పుడు look/behold అని కాక eye ని (క్రియాపదాన్ని), locks అన్నప్పుడు తాళాలు అని కాక hair ను (side locks = side hair) తీసుకుని ఉపయోగించాలి. అదే విధంగా will అన్నప్పుడు దాన్ని helping verb గా కాక, వీలునామా అనే అర్థంలో తీసుకోవాలి. Retire ను ఉద్యోగ విరమణ చేయడం అనే అర్థంలో కాక, sleep (రాత్రి పూట నిద్ర పోవటం) ను తీసుకోవాలి.

తెలుగు పజిళ్లలో anagrams కాని, అటువంటి పదాలున్న ఆధారాలను కాని, ఇచ్చినప్పుడు తారుమారైన, కకావిలైన, తలక్రిందులైన, అస్తవ్యస్తమైన, అయోమయమైన, గజిబిజిగా – ఇట్లాంటి పదాల ద్వారా సూచన ఇవ్వబడుతుంది. కాని, హిందు క్రాస్ వర్డ్ లో కొన్నిసార్లు అటువంటి సూచన ఏమీ ఉండదు. మనమే ఊహించి తదనుగుణంగా పజిల్ పూరణ చేసుకోవాలి.

ఇటువంటి వివిధ రకాల విన్యాసాలతో, చమత్కారంతో కూడిన ఆధారాలుంటాయి హిందు క్రాస్ వర్డ్ లో. ఒక్కటి మాత్రం తప్పక గుర్తు పెట్టుకోవాలి. అదేమిటంటే, ఆధారాలలోని వాక్యాలు ఇచ్చే అర్థం ప్రకారం సమాధానం వెతికితే పజిల్ను అసలే పూరించలేము. దానికి బదులు వాక్యపు అర్థాన్ని పూర్తిగా మరచిపోయి, ఆధారంలోని కీలక పదాన్ని గుర్తు పట్టి, దానికి సమానార్థక పదాన్ని ఆలోచించాలి. ఈ కీలక పదం సాధారణంగా ఆధారంలోని మొట్టమొదటి పదం కాని, చివరి పదం కాని అయి వుంటుంది.

***

ఇక తెలుగు పజిల్స్ కు వద్దామా?

శ్రీశ్రీ తయారు చేసిన ఆధారాలు కొన్ని మాత్రమే జ్ఞాపకమున్నాయి నాకు. వాటిని ఈ కింద ఇస్తున్నాను.

1. ఒకటి, ఇంకొకటి, మరొకటి (1, 1, 1)

దీనికి సమాధానం టి, టి, టి. వివరణ అవసరం లేదనుకుంటాను.

2. విరోధాలు (రాత్రికా?) (3)

దీనికి సమాధానం పగలు. శత్రుత్వాలు అన్నది ఒక అర్థమైతే daytime అన్నది మరొక అర్థం. ఇక్కడ చమత్కారమేమంటే పగలు (daytime) రాత్రికి విరోధం లేక వైరుధ్యం (opposite) కూడా!

3. ఆవాలు (1, 1, 1, 1)

దీనికి సమాధానం వా, వా, వా, వా. దీనికి కూడా వివరణ అవసరం లేదనుకుంటాను.

4. పొట్టితనం (x గాడిదా?) (4)

దీనికి సమాధానం వామనత. ఇందులో విశేషమేమీ లేదు. కాని, ఒక విలక్షణమైన చమత్కారం వుంది. అదేమిటంటే నిజానికి x స్థానంలో ఆ రోజుల్లో తన శత్రువైన ఒక ప్రసిద్ధ వ్యక్తి పేరును పెట్టాడు శ్రీశ్రీ. ఆ వ్యక్తి పొట్టిగా ఉంటాడు. ఇక్కడ ‘గాడిదా?’ ను రెండు రకాలుగా explain చేయవచ్చును కదా.

5. ఒకటికన్న రెండు నయం (3).

దీనికి సమాధానం తలలు. అయితే దీని గురించి పెద్ద దుమారం చెలరేగింది. ఇంత జటిలమైన ఆధారాన్నివ్వడం అన్యాయం, అసమంజసం అని పాఠకులు గగ్గోలు పెట్టారు. ఈ ఆధారానికి తలలు అనే సమాధానం ఎట్లా వస్తుందంటే, Homer రాసిన Iliad అన్న గ్రంథంలో Two heads are better than one అనే సామెత లాంటి ప్రసిద్ధ వాక్యం ఒకటి వుంది. దాని అర్థం ప్రకారం ‘తలలు’ సరైన సమాధానమే. క్రాస్ వర్డ్ ను పూరించటంలో కూడా ఒకటికన్న రెండు తలలు నయం అనే సూత్రం బాగా వర్తిస్తుంది సుమండీ – ముఖ్యంగా ఆ రెండు తలలు క్రాస్ వర్డ్ ను పూరించటంలో అనుభవాన్ని కలిగినవి అయినప్పుడు!



ఇక ఈ వ్యాస రచయిత చాలా కాలం క్రితం కలంపేరుతో కాక తన అసలు పేరుతో ‘రచన’ మాసపత్రికలో నాలుగైదు సంవత్సరాల పాటు పజిలింగ్ పజిల్ అనే పెద్ద (చాలా గడులున్న) క్రాస్ వర్డ్ ను నిర్వహించినప్పుడు తయారు చేసి ఉపయోగించిన ఆధారాలలోంచి కొన్నిటిని ఉదాహరిస్తాను.

1. బీరువాలో ఉండేవి. నాలుగుంటే రెండవుతాయి. (3)

దీనికి సమాధానం అరలు. అరలు అంటే సొరుగులు అనే కాక, సగాలు (½ లు ) అనే మరో అర్థం వుంది. నాలుగు సగాలు 2కు సమానం అవుతాయి కదా!

2. హణ హణ హణ హణ హణ తర్వాతది అధిరోహించడం (4)

దీనికి సమాధానం ఆరోహణ. ఎట్లా అంటే, ఆధారంలో ఐదు హణలు ఇచ్చి తర్వాతది అడగబడింది. ఐదు హణల తర్వాత ఆరవ లేక ‘ఆరో’ హణ వస్తుంది. ఆరోహణ అంటే అధిరోహించడం.

3. వార్తా పత్రిక – సత్రములో వెనక్కి పరచామా? (4, 3)

దీనికి సమాధానం సమాచార పత్రము. ‘స’ ను ఎడమ వైపు, ‘త్రము’ను కుడివైపు దూరంగా వుంచి మధ్యన ‘పరచామా’ అనే అక్షరాలను వెనక్కి (అంటే రివర్స్ ఆర్డర్లో) అమర్చితే సమాచార పత్రము వస్తుంది.

4. నీ వార ఫలాలు ఫరవా లేదు, మణులు రావచ్చు. (3)

‘నీ వారఫలాలు’ లోంచి ‘ఫరవా’ తీసేస్తే నీలాలు మిగులుతుంది. నీలాలు ఒక రకమైన మణులు కనుక, అదే జవాబు.

5. పవిత్ర నది కోసం మంచి ప్రారంభానంతరం దానికి సవరణ చెయ్యాలి. (4)

మంచి ప్రారంభం అంటే మంచి అనే పదంలోని మొదటి అక్షరం ‘మం’ అన్న మాట. తర్వాత దానికి అన్న పదాన్ని ‘దాకిని’గా మార్చి కలిపితే మందాకిని వస్తుంది. అది పవిత్ర నది.

6. తదుపరి చారి కట్టబోయే దాంట్లో దాగివున్న సేవకురాలు. (5)

ఇక్కడ సమాధానమైన ‘పరిచారిక’ ఆధారంలోనే en- bloc గా దాగివుంది.

7. చిత్తూరు పొలిమేరల నడుమ తారుమారై కూలు బాలాజీ గుడి ఉన్న ప్రసిద్ధ క్షేత్రం (4)

ఇక్కడ చిత్తూరు అనే పదంలోని రెండు చివరలైన చి,రు పొలిమేరలన్న మాట.వాటి మధ్యన తారుమారైన ‘కూలు’ ను – అంటే ‘లుకూ’ను – ఉంచితే చిలుకూరు వస్తుంది!

8. అర్ధరాత్రికి గంటన్నర ముందు అడ్డదిడ్డంగా పన్నదిర! (4)

అర్ధరాత్రి అంటే పన్నెండు గంటల సమయం. దానికి గంటన్నర ముందు అంటే పదిన్నర కదా. ‘పన్నదిర’ అడ్డదిడ్డంగా ఉన్నది కనుక దాన్ని సరి చేస్తే ‘పదిన్నర’ వస్తుంది!

9. స్పర్ధ కోసం నడుమ లేకుండా అట్నుంచి టీ తేపో. (2)

ఇక్కడ పోటీ అన్నది సమాధానం ఎలా అయిందంటే, ‘టీ తేపో’ లోని మధ్య అక్షరమైన ‘తే’ ను తీసేసి రివర్స్ చెయ్యాలి. స్పర్ధ అంటే పోటీ అని అర్థం.

10. తలకిందులైన నావ చుట్టూ పలు గాలులు (4)

ఇక్కడ నావను తలకిందులు చేస్తే ‘వనా’ వస్తుంది. దానికి అటూ యిటూ ‘పలు’ అమర్చితే పవనాలు వస్తుంది. కనుక అదే సమాధానం. దీన్ని నిలువు ఆధారాలలో ఒకటిగా ఇస్తే బాగుంటుంది.

11. తెలివి లేనివాడు అని లోపల జ్ఞానం సగమే ఉంటుంది. (3)

‘అని’ లోపల జ్ఞానంలోని సగమైన ‘జ్ఞా’ను చేర్చితే అజ్ఞాని వస్తుంది. అదే సమాధానం.

12. పాక్షికమైన పలవరింత తర్వాత కొంత కాలానికి మాట్లాడాలా? (4)

పలవరింత పాక్షికమే కనుక ‘పల’ మాత్రమే తీసుకోవాలి. దాని తర్వాత ‘కాలానికి’లో కొంత (కాలా) మాత్రమే తీసుకుని కలపాలి. అప్పుడు పలకాలా (మాట్లాడాలా) వస్తుంది.

13. తలుపేసి నడుమ తారుమారుగా తలకెక్కేవి. (2)

దీనికి పేలు సమాధానం ఎలా అంటే, తలుపేసి అన్న పదం మధ్యన పేలు తారుమారై వుంది.

14. నా నా నా – ఇట్లాంటివి నూరు నమస్కారాలు. (4)

నా అనే అక్షరాలు నూరు (వంద) – అంటే వందనాలు అనే కదా. అదే సమాధానం.

15. వేరు మూల్యం యావత్తు పోయింది. (2)

ఇక్కక వేరుకు సమాన పదమైన మూలం సమాధానం. ‘మూల్యం’లోంచి ‘యా’వత్తు పోయిందన్న మాట!

ఈ విధంగా ప్రామాణికమైన, జటిలమైన క్రాస్ వర్డ్ లను ప్రతిరోజు నింపటానికి ప్రయత్నిస్తే మెదడుకు మంచి వ్యాయామం దొరికి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ వ్యాసం ఒకరిద్దరికైనా స్ఫూర్తిని కలుగజేసి క్రాస్ వర్డ్ పట్ల ఆసక్తిని పెంచితే ఈ వ్యాసకర్త ధ్యేయం నెరవేరినట్టే.
----------------------------------------------------------
రచన - ఎలనాగ, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

Saturday, August 25, 2018

కవికులగురువు - 2


కవికులగురువు - 2




సాహితీమిత్రులారా!

కవికుల గురువు కాళిదాసును గురించిన వ్యాసంలో రెండవ భాగం
ఆస్వాదించండి-
నిన్నటి తరువాయి..........

5-3. వ్యంగ్యభావాలు
ఇన్ని చెప్పే కాళిదాసులో పుష్కలంగా కొంటెకోణాలు కూడా ఉన్నాయి. కొన్నింటిని కవిగా తనే చూపిస్తాడు. కొన్ని పాత్రల ద్వారా చెప్పిస్తాడు.

ఇందీవరశ్యామతనుర్ నృపోఽసౌ త్వం రోచనాగౌరశరీరయష్టిః
అన్యోన్యశోభా పరివృద్ధయే వాం యోగస్తటిట్టోయదయో రివాస్తు – (రఘువంశః 6-65)

(ఇందుమతికి స్వయంవరం అవుతూంటే, పక్కనున్న చెలికత్తె సునంద ఆమెకి ప్రతీరాజు గురించీ, వాడి రాజ్యం గురించీ చెపుతూంటుంది. ఒకడి దగ్గరకి రాగానే వాడేదేశానికి రాజో వాడికెంత రాజ్యముందో చెప్పి — నల్లగా కలవపువ్వులా ఉన్నాడు వీడు. నువ్వు పచ్చగా గోరోజనంలా, చక్కని శరీరం కలిగినదానివి. మీ ఇద్దరికీ సంబంధం కుదిరితే, మెరుపుతీగ-మేఘంలా ఉంటుంది. ఒకళ్ళ రంగుతో మరొకళ్లకి పోటీగా, అని కాకి ముక్కుకి దొండపండన్నట్టుగా చెపుతుంది.)

అలాగే, శాకుంతలంలో, దుష్యంతుడు శకుంతలని చూసి మనసులో ఏమనుకుంటున్నాడో ప్రథమాంకంలో చెప్పేస్తాడు. రెండో అంకంలో దుష్యంతుడు తన స్నేహితుడితో మళ్ళీ మెదలు పెడతాడు. అది పరాకాష్ఠకి వెడుతుంది. దుష్యంతుడు సిగ్గు వదిలేసి ఇలా అంటాడు

అనాఘ్రాతం పుష్పం కిసలయ మలూనం కరరుహై
రనావిద్ధం రత్నం మధు నవ మనాస్వదితరసమ్
అఖండం పుణ్యానాం ఫలమివ చ తద్రూప మనఘం
న జానే భోక్తారం కమిహ సముపస్థాస్యతి విధిః – (అభిజ్ఞానశాకుంతలం – ద్వితీయాంకః)

ఈమె వాసన చూడబడని పువ్వు. ఏ గోళ్ళ చేతా గిల్లబడని చిగురుటాకు. కన్నం తొలవబడని రత్నం. రుచి చూడబడని తియ్యని కొత్తతేనె. చేసుకున్న పుణ్యాలకి పరిపూర్ణమైన ఫలం. ఎవడు ఈ అమ్మాయిని అనుభవించాలని బ్రహ్మ వ్రాసిపెట్టాడో! నాకు తెలియదు.

రసికులంతా దీన్ని విరహతాపంలా చిత్రీకరిస్తుంటారు. కాని, నాకైతే, ఈ శ్లోకంలో కనిపించే నిర్లజ్జని బట్టి కాళిదాసు దుష్యంతుడి వ్యామోహానికి పరాకాష్ఠగా దీన్ని మలిచాడనిపిస్తుంది.

మరొక సన్నివేశం. పార్వతి శివుడికై తపస్సు చేస్తూంటే, శివుడే కపటబ్రహ్మచారిగా వచ్చి శివుణ్ణి గురించి వేళాకోళంగా మాట్లాడతాడు. పార్వతి తన సమాధానాలతో తిప్పికొడుతుంది. చివరికి విసిగిపోయి, నువ్వేమనుకుంటే నాకేమిటయ్యా? వెళ్ళవయ్యా వెళ్ళు…” అంటుంది. ఇక్కడ కాళిదాసు ఆమెలో తెగింపుని కొంటెగా ఇలా చెపుతాడు. మమాత్ర భావైకరసం మనః స్థిరం, న కామవృత్తిర్వచనీయ మీక్ష్యతే (నా మనస్సు వాడే నా శృంగారమూర్తి అని నిశ్చయం చేసేసుకుంది. ఇలా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు ఆక్షేపణల్ని పట్టించుకోరు.)

ఈ శ్లోకం తరువాత వ్రాసిన రెండు చిన్న శ్లోకాలు ఎంత దర్శనీయాలో! శివుడు పార్వతిని చేపట్టిన రీతినీ, అప్పుడామె మనోభావాల్నీ కేవలం రెండు శ్లోకాలలో మనోహరంగా మన మనోఫలకం మీద చిత్రీకరిస్తాడు.
3. దృశ్య చిత్రీకరణ
ఒక సన్నివేశాన్ని రమ్యం గానో, లేదా రసయుక్తం గానో చెప్పడమే కాదు, కళ్ళకి కట్టినట్టు చూపించడంలో కూడా కాళిదాసు దిట్ట. పతాకసన్నివేశాల్ని మరీ మనోహరంగా చిత్రిస్తాడు. దీనికి మొదటి ఉదాహరణగా, శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన వెంటనే కాళిదాసు చెప్పిన శ్లోకం చూద్దాం. మామూలుగా సర్గంతా చిన్న వృత్తాల్లో వ్రాసినా, సర్గ చివర్లో పెద్ద వృత్తాలు వాడడం ఇతని అలవాటు. ఈ వాడకంలో కూడా ఒక పద్ధతి ఉంది. ఒక పని పూర్తయి సఫలత చేకూరినప్పుడు, ఆ సర్గ చివర సాధారణంగా మాలినీ వృత్తం వాడతాడు. ఇది ఆ కోవ లోదే.

అథ మదగురుపక్షై ర్లోకపాలద్విపానామ్
అనుగత మలిబృందై ర్గండభిత్తీర్విహాయ
ఉపనతమణిబంధే మూర్ధ్ని పౌలస్త్యశత్రోః
సురభి సురవిముక్తం పుష్పవర్షం పపాత – (రఘువంశః 12-102)

[అథ = పిమ్మట; మద = ఏనుగు కుంభస్థలం మీద తిరగడం వల్ల అంటుకున్న మదజలము చేత; గురు= బరువెక్కిన; పక్షైః = రెక్కలుగల; అలి బృందైః = తుమ్మెదగుంపుల చేత; లోకలపాలద్విపానామ్ = ఆకాశంలో ఉన్న దిక్పాలకుల ఏనుగుల యొక్క; గండభిత్తీః = గండస్థలాల్ని (నుదుటి ప్రదేశాల్ని); విహాయ = వదలిపెట్టి; అనుగతం = వెంబడింప బడ్డదీ; సురభి = పరిమళములు గలదీ; సురవిముక్తం = దేవతలచేత కురిపింపబడ్డదీ అయిన; పుష్పవర్షం = పువ్వుల వాన; ఉపనత మణిబంధే = సమీపకాలమున జరగబోతున్న కిరీటధారణముగల (కొద్దికాలములో కిరీటం పెట్టుకోబోతున్న); పౌలస్త్యశత్రోః = పులస్త్యుని మనుమడైన రావణుని శత్రువు యొక్క (శ్రీరాముని యొక్క); మూర్ధ్ని = తలపైన; పపాత = పడెను(కురిసెను).]

(పులస్త్యుని మనుమడైన రావణుడితో శ్రీరాముడు యుద్ధం చేస్తున్నాడు. దిక్కుల్ని పాలించే ఎనిమిది మంది దేవతలు వాళ్ళవాళ్ళ దిగ్గజాల్ని (ఏనుగుల్ని) ఎక్కి యుద్ధాన్ని చూస్తున్నారు. ఈ యుద్ధం జరుగుతున్నంతసేపూ, ఆ దిగ్గజాల గండస్థలాల మీద ఉన్న మదజలాలకోసం తుమ్మెదలు తచ్చాడుతూ తమ రెక్కలకి మదం అంటించుకుంటున్నాయి. వాటితో వాటి రెక్కలు బరువెక్కి ఎగరడానికి చాలా ప్రయాస పడుతున్నాయి. ఇంతలో రావణుణ్ణి శ్రీరాముడు యుద్ధంలో నేలకూల్చాడు. ఒక్కసారిగా దేవతలు సువాసనలు వెదజల్లే పువ్వుల్ని పెద్దవానగా కురిపించారు. తుమ్మెదలు ఈ గండస్థలాల్ని వదిలేసి ఆ పువ్వుల వెనక పడ్డాయి. భూమి వైపుగా పోతున్న వాటి వెనక ప్రయాణించడం తుమ్మెదలకి సులువుగా ఉంది. (క్రిందకి పడుతున్నప్పుడు రెక్కల బరువు లెక్క చెయ్యక్కర్లేదుగా). అలా తుమ్మెదల సంగీతంతో, పరిమళ భరితమైన పూలు శ్రీరాముడి తలపైన పడ్డాయి. ఆ సంగీతఘోష, పుష్పాభిషేకం, శత్రుసంహారం చేసి కొద్దిరోజుల్లో పట్టాభిషేకం చేసుకోబోయే ఆతని శిరస్సుకి తగిన సత్కారంలా ఉంది.)

ఈ శ్లోకంలో చాలా రమ్యతలున్నాయి. మాలినీ వృత్తం కావడం వల్ల ముందు లఘువుల సముదాయం మెల్లగా గురువుల గుంపుగా మారి ఉత్కంఠతను చాటుతుంది (crescendo.) ముఖ్యంగా ఆఖరి పాదంలో సురభి సురవిముక్తం అన్నంతసేపూ, దేవతల చేతుల్లో ప్రారంభమై మెల్లగా క్రిందకి దిగడం మొదలు పెట్టిన పువ్వుల వాన, పుష్పవర్షం అనేసరికి వేగం పెరిగినట్టూ, పపాత అనగానే శ్రీరాముడి తలమీద పడి ఆగినట్టూ అనిపిస్తుంది. నిజానికి మాలినీ వృత్తంలో ఆఖరి అక్షరం గురువు అవాలి. కాని సంస్కృత శ్లోకాల్లో ఆఖరి అక్షరం లఘువైనా పర్వాలేదనే నియమం ఉంది. ఈ శ్లోకంలో ఆ నియమాన్ని కాళిదాసు అద్భుతమైన ముగింపు కోసం వాడుకున్నాడు. అనుగత మలిబృందైః అన్నప్పుడు పైన పూలకి చెప్పిన వేగమే ఇక్కడ తుమ్మెదలకి వరిస్తుంది. కాని భావం పూర్తయ్యే మూడవ పాదంలో పౌలస్త్యశత్రోః అన్నపదాన్ని వినగానే అవి కూడా రావణుడిలాగే పూలని (స్తీలని) కొల్లగొట్టేవి కాబట్టి శ్రీరాముడి శిరస్సుని చూడగానే పారిపోయాయి.

ఆకాశంలో ఏనుగుల మీద దేవతలూ, పుష్పవృష్టి, వెంటాడే తుమ్మదలూ, నేలపై రథంమీద గెలిచి నిలచిన శ్రీరాముడు, తుమ్మెదల సంగీతం, పూల పరిమళం, రాముని తల మీదా, శరీరం మీదా పువ్వులూ, అక్కడివరకూ వచ్చి పారిపోయే తుమ్మెదలూ.. ఈ చిత్రాన్ని కాళిదాసు ఎంత మనోహరంగా మన మనసుల మీద ముద్రించాడో!

ఇందుమతీ స్వయంవరం సన్నివేశం లోని ఈ శ్లోకం చూడండి.

సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ యం యం వ్యతీయాయ పతింవరా సా
నరేంద్రమార్గాట్ట ఇవ ప్రపేదే వివర్ణభావం స స భూమిపాలః – (రఘువంశః 6-67)

[పతింవరా సా = భర్తను వరించవలసిన ఆ ఇందుమతి; రాత్రౌ = రాత్రి వేళల్లో; సంచారిణీ = నడుస్తున్న; దీపశిఖా ఇవ = దీపజ్వాలలా; యం యం = ఏ ఏ రాజును; వ్యతీయాయ = దాటి వెళ్ళెనో; సః సః = ఆ ఆ ; భూమిపాలః = రాజు; నరేంద్రమార్గ = రాజవీథిలోని; అట్ట ఇవ = అట్టాలముల వలె; వివర్ణభావం = కాంతివిహీతని (వెలవెలబోవడాన్ని); ప్రపేదే = పొందెను.]

(ఇందుమతి స్వయంవరంలో తనకి నచ్చినవాణ్ణి ఎన్నుకోవాలి. ఆమె అందచందాలు మెచ్చి చాలామంది ఆశపడి వచ్చికూర్చున్నారు. ఆమె నడుస్తున్న దీపశిఖలా వాళ్ళ ఎదుటనుంచి నడిచి వెళుతోంది. ఆమె దగ్గరకి రాగానే ప్రతీ రాజుకీ తననే వరిస్తుందేమోనని ముఖం వెలిగిపోతోంది. కాని ఆమె దాటి వెళ్ళిపోగానే ఆ రాజు ముఖం కాంతి తప్పి వెలవెలబోతోంది.)

అట్టాలములంటే బాల్కనీ గదుల్లాంటివి. రాజమార్గంలో బాల్కనీ గదులు వరసగా ఉన్నాయి. ఒకడు పెద్ద దివ్వెని పట్టుకుని నడుస్తూంటే, వాడు ఒక బాల్కనీకి ఎదురుగా రాగానే ఆ బాల్కనీ అంతా వెలుగుతో నిండి పోతుంది. వాడు దివ్వె తీసుకుని ముందుకు పోగానే ఆ బాల్కనీ చీకటిగా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చే బాల్కనీ వెలుగుతో నిండుతుంది. ఇక్కడ కాళిదాసు రాజుల ముఖాల్ని ఆ గదుల్తో పోల్చాడు. గదుల్లాగే వాళ్ళ ముఖాలు కూడా కదలిక లేనివయాయని సంజ్ఞ.

ఇందుమతి దీపశిఖగా పోల్చడం ఆమె అందాన్నీ, తేజస్సునీ, స్వచ్ఛతనీ సూచిస్తోంది. నరేంద్రమార్గ అన్న పదానికి రెండు అర్థాలు స్ఫురించేలా రాస్తాడు. ఒక అర్థం రాజులు కూర్చున్న వరస అనీ (ఇందుమతి నడుస్తున్నదీ,) రెండోది రాజవీధి (దివ్వె నడుస్తున్నదీ) అనీ. సంచారిణీ అనడం ద్వారా ఇందుమతి దేహమే కాదు, మనసు కూడా విహరిస్తోందే అన్న భావం కలిగించాడు. ‘సంచారిన్’ శబ్దానికి అగరు గంధం నుంచి వచ్చే పొగ అనే అర్థం కూడా. అలా ఆమె మనసు ఎన్నోవిధాలైన ఆలోచనల్లో ఉందనే భావం కూడా. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం చేసేటప్పుడు మనసు పరిపరి విధాలుగా ఆలోచించడం సాధారణమే కదా! ఈ ఉపమాలంకారం ఎంత ప్రాచుర్యం పొందిందంటే, కవిని ‘దీపశిఖా కాళిదాస’నేటంత.

ఇంకొక ఉదాహరణ.

లతాగృహద్వారగతోఽథ నందీ వామప్రకోష్ఠార్పితహేమవేత్రః
ముఖార్పితై కాంగుళిసంజ్ఞ యైవ మాచాపలా యేతి గణాన్ వ్యనైషీత్

నిష్కంప వృక్షం నిభృతద్విరేఫం మూకాండజం శాంతమృగప్రచారం
తచ్ఛాసనాత్ కానన మేవ సర్వం చిత్రార్పితారంభ మివావతస్థే – (కుమారసంభవమ్ 3-41,42)

[అథ = అంతట; లతాగృహద్వారగతః = పొదరింటి గడప దగ్గర ఉన్న; వామ ప్రకోష్ఠ అర్పిత హేమవేత్రః = ఎడమచేతి మణికట్టుపై ఉంచుకోబడ్డ బంగారు బెత్తము కలవాడైన; నందీ = నందీశ్వరుడు;ముఖ-అర్పిత-ఏక-అంగుళి-సంజ్ఞయా ఏవ = నోటిమీద ఉంచుకున్న ఒక వ్రేలి యొక్క సంజ్ఞ చేతనే; గణాన్ = ప్రమథగణాల్ని; మా చాపలాయ = ‘అల్లరి చెయ్యకండి’; ఇతి=అని; వ్యనైషీత్ = ఆజ్ఞాపించెను (శిక్షించెను).

నిష్కంప వృక్షం = చలనం లేని చెట్లు గలదీ; నిభృతద్విరేఫం = కదలని తుమ్మెదలు గలదీ; మూకాండజం = కూయని పక్షులు గలదీ; శాంతమృగప్రచారం = ఆగిపోయిన మృగసంచారం కలదీ; కాననం సర్వం ఏవ = అడవి అంతాకూడా; తత్ శాసనాత్ = ఆ నందీశ్వరుని ఆజ్ఞవల్ల; చిత్రార్పిత = బొమ్మలో గీయబడ్డ; ఆరంభం ఇవ = ప్రయత్నంలా; అవతస్థే = ఉండెను.]

శివుడు తపస్సమాధిలో ఉన్నాడు. ఎవరు ఆయన సమీపానికి వెళ్ళాలన్నా, ముందు నందీశ్వరుడు వెళ్ళి ఆయనకి చెప్పి అనుజ్ఞ పొందితేనే దర్శనం. ఆ సమాధిస్థితికి నందీశ్వరుడు ఎలా తోడ్పడ్డాడో చెప్పిన రెండు శ్లోకాలివి. నందీశ్వరుడు ఎప్పుడూ అనవసరంగా బలప్రదర్శన చెయ్యని మహా బలవంతుడు. నందీశ్వరుడు బెత్తం చేతిలో ఉన్నా వ్రేలితోనే అదలించాడని వ్రాయడం ఒక ఉదాత్తత. ఆ అదలింపుకి సర్వజగత్తులోనూ సంచారం ఆగిపోడాన్ని అతిగంభీరంగా వివరించాడు రెండవ శ్లోకంలో. ప్రకృతి చిత్తరువులా నిలబడిపోవడం గురించి ‘నిష్కంప వృక్షం నిభృతద్విరేఫం మూకాండజం శాంతమృగప్రచారం’ అని రెండే రెండు పాదాల్లో కాళిదాసే చెప్పేస్తాడు. వేరేమీ చెప్పక్కర్లేదు.

4. కథాసంవిధానం
కాళిదాసు కథన ప్రతిభకి మచ్చుతునకలు రఘువంశం, ఆభిజ్ఞానశాకుంతలమ్. రఘువంశం గురించి కొద్దిగా విస్తరిస్తాను. రఘువంశ మహాకావ్యం ఇక్ష్వాకువంశంలో పుట్టిన కొందరు రాజుల కథ. దిలీపుడు, రఘువు, అజుడు, దశరథుడు, రాముడు, కుశుడు, అతిథి, నలుడు, పుండరీకుడు, అగ్నివర్ణుల కథ. అగ్నివర్ణుడు క్షయవ్యాధితో చనిపోతే గర్భవతి అయిన అతని భార్యకు పట్టాభిషేకం చెయ్యడంతో రఘువంశకావ్యం ముగుస్తుంది. ఇందరి కథల్ని 19 సర్గల్లో పాఠకులకి విసుగుపుట్టకుండా చెప్తాడు కాళిదాసు. ప్రతీ రాజు కథలోనూ ఒక ముఖ్యఘట్టాన్ని మాత్రమే ఎంచుకుని (ఒక్క రామకథలో తప్ప) ఆ రాజుల్లో ఉన్న గొప్పదనాలు, బలహీనతలు అన్నిటినీ నిష్కర్షగా చెప్తాడు. రఘువంశ రాజుల కీర్తిప్రమాణాలు క్రమేణా ఎలా క్షీణించాయో వివరిస్తాడు.

వాల్మీకి మహర్షి రామాయణం చదివిన వాళ్ళకి ఒక విషయం అర్థం అవుతుంది. వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణాన్ని ఒక మధురమైన కావ్యంగా జాతికి అందించాడు. మళ్ళీ దాన్ని తిరగ వ్రాయడానికి ప్రయత్నించ కూడదు – అని. ఆ విషయం కాళిదాసుకి కూడా తెలుసు. అయినా రఘువంశంలో రామకథని చెప్పి తీరాలి. శ్రీహరి ఆ వంశాన్ని ఎంచుకుని అందులో పుట్టాడు. ఆ కారణం వల్ల రామకథని మిగిలిన రాజుల కథలా తగ్గించలేడు. ఈ పరీక్షలో కాళిదాసు తన అభిరుచి, వివేకం వాడి ఎలా కృతకృత్యుడయాడన్నది 10 నుండి 15వ సర్గ వరకూ ఉన్న శ్రీరామకథని చదివినవాళ్ళకే అర్థమవుతుంది.

5. ఉపసంహారం
కాళిదాసు కవిత్వం కవులకి శిక్షణాలయం, సంస్కృత విద్యార్థులకి పాఠ్యప్రణాళిక, రసికులకి వినోదం, భాషాపండితులకి సంభ్రమాశ్చర్యాల్తో కూడిన ప్రశ్న, అలంకారికులకి విందు, ధార్మిక బుద్ధిగలవారు సంప్రదించే గ్రంథావళి. అసంగతంగా సాగే తాత్వికభావనలు, బహ్వర్థాలు, ప్రతిదాన్నీ కవితావస్తువుగా చూస్తూ అన్నిటికీ సమాన ప్రతిపత్తి కలిగించే అతని నిజాయితీ, ఇవన్నీ అతన్ని కవిగా, అధ్యాపకునిగా, మార్గదర్శకునిగా ఉన్నతస్థానంలో నిలబెట్టాయి. పార్వతీ పరమేశ్వరుల్ని పాత్రలుగా చూసేటప్పుడు మామూలుగా అందరి ప్రవృత్తుల్ని వర్ణించినట్లుగానే వాళ్ళని కూడా కవితాపరంగా చూశాడు. వారి పారమార్ధిక, దైవ విభూతుల్ని గురించి చెప్పినప్పుడు వేరొక పద్ధతి అవలంబించాడు. ఇక ఇతని విషయ, శాస్త్ర పరిజ్ఞానం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. సాంప్రదాయాలు, రాచమర్యాదలు, ఆర్షధర్మ కర్మవిశేషాలు, స్మృతిశాస్త్రపురాణజ్ఞానం, ప్రకృతిధర్మాలు, జంతువృక్షమనుష్యదేవగణజాతుల వృత్తిప్రవృత్తులు, నైసర్గిక, సామాజిక, వాతావరణ, వ్యాకరణ, జ్యోతిష్య, లలితకళా, న్యాయ, యోగ, వేదాంతాది శాస్త్రజ్ఞానం… ఇలా ఎన్నో కోణాల్ని సరైన మోతాదుల్లో తన కవిత్వంలో చూపించాడు. క్లుప్తంగా, మధురమైన చిన్నపదాలలో, సరళమైన ఛందోరీతుల నుపయోగించి కవిత్వం వ్రాశాడు. ఇటువంటి దార్శనికత, బహుముఖప్రజ్ఞ అతన్ని కవికులగురువును చేశాయి.

చివరిగా ఒక విన్నపం – భారతీయ సంస్కృతిలో పుట్టిన ప్రతీవ్యక్తీ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా చదవవలసినవి రెండు పుస్తకాలు: 1. వాల్మీకి మహర్షి మనకందజేసిన శ్రీమద్రామాయణం; 2. కాళిదాస మహాకవి రచించిన రఘువంశం.
---------------------------------------------------------
రచన: భాస్కర్ కొంపెల్ల, 
ఈమాట అంతర్జాల పత్రిక సౌజన్యంతో

Friday, August 24, 2018

కవికులగురువు - 1


కవికులగురువు - 1




సాహితీమిత్రులారా!

కవికుల గురువు కాళిదాసును గురించిన
వ్యాసంలో మొదటి భాగం
ఆస్వాదించండి-

మహాకవి కాళిదాసు గురించి వ్రాసిన తన వ్యాసంలో శ్రీ అరోబిందో అంటారు: భారతజాతి తనకున్నదంతా కోల్పోయినా, వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణం, వ్యాస మహాభారతం, కాళిదాస గ్రంధాలూ మిగిల్తే చాలు. అవి మన ఆలోచనా విధానాలకీ, విశ్లేషణకీ, మనం నిర్మించుకున్న సంస్కృతికీ, మన నైతిక, మానసిక, తాత్విక, రస సిద్ధులకీ వాటి పరిణామ క్రమానికీ, మనం జీవితాన్ని వైభవోపేతం చేసుకున్నపద్ధతులకీ, సాధనలకీ ప్రతీకలన్నది శ్రీ అరోబిందో పరిశోధించి మనకి అందించిన సత్యం.

పాత రోజుల్లో, అంటే కొన్ని వేలసంవత్సరాల క్రితం, భారతదేశంలో ప్రజలు రకరకాల జీవన విధానాల మీద ప్రయోగాలు చేశారు. వాటిలో ముఖ్యంగా చెప్పవలసినవి మూడు రకాల ప్రయోగాలు. మొదటిది నైతిక జీవనాన్ని, రెండవది తార్కిక జీవనాన్ని, మూడవది రసమయ జీవనాన్ని ఆధారంగా చేసుకున్నవి. నైతికజీవనాన్ని వాల్మీకి మహర్షి, తార్కికజీవనాన్ని వ్యాస మహర్షి, వివరిస్తూ ప్రతిబింబిస్తూ శ్రీమద్రామాయణ, మహాభారతాల్ని అందించారు.

కొన్ని వేల సంవత్సరాల తరువాత, ప్రజాజీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుని, ప్రజల్లో జీవితాన్ని పండగలా చేసుకోవాలనే ఆరాటం మొదలైంది. ఆ రసమయ ప్రపంచాన్ని మనకందించడం లోనూ, తన సృజనాత్మకతతో పరిపుష్టం చేయడం లోనూ, అలాంటి జీవితాన్ని ఆనందించడానికి సరైన మానసికస్థితుల్ని తెలియజెయ్యడం లోనూ, మార్గదర్శకుడైన వాడు మహాకవి కాళిదాసు. వాల్మీకి, వ్యాసులని వ్యతిరేకించకుండా, ఆ ధర్మాన్ని చాటుతూనే, జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం అన్న ప్రక్రియని తనవైన కొత్త భావాల్తో కవిత్వరూపంలో ఆవిష్కరించిన స్రష్ట. రసమయ జీవితాన్ని తరవాత తరాల కోసం రకరకాల రంగుల్లో చిత్రీకరించిన తొలికవి. ఆ తరవాత వచ్చిన కవులు ఈతని పంథాలోనే పయనించారు. రసమయ భావప్రపంచాల్ని కావ్యాలుగా మలచారు. కాని, ఏ కవులూ కాళిదాసుకున్న ప్రతిభావ్యుత్పత్తుల్ని ప్రదర్శించలేకపోయారన్నది అందరూ ఒప్పుకున్న సత్యం. ఈ భావాల్నే కొందరు చిన్న శ్లోకంలో చమత్కారంగా చెప్పారు.

పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసా
అద్యాపి తత్తుల్యకవే రభావాదనామికా సార్ధవతీ బభూవ

[పురా = పూర్వం రోజుల్లో; కవీనాం గణనా ప్రసంగే = కవులను లెక్కించే ప్రస్తావన వచ్చినప్పుడు; కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసా = చిటికినవేలు మీద కాళిదాసు నిలబడ్డాడు. అద్యాపి = (అప్పటినుంచి) ఈ రోజు దాకా; తత్ తుల్యకవేః = అతనికి సమానమైన కవియొక్క; అభావాత్ = (ఉనికి) లేకపోవడంవల్ల; అనామికా = ఉంగరంవేలు (అనామిక); సార్ధవతీ బభూవ = సార్ధకనామధేయురాలైంది.]

(పూర్వం కవుల్ని లెక్క పెడదామని మొదలు పెట్టి, లెక్కపెట్టేవాడు చిటికిన వేలెత్తి ‘కాళిదాసు’ అన్నాడు. తర్వాత పక్కనున్న వేలు ఎత్తి ఇంకో కవి పేరు చెప్పాలంటే (అది ఉంగరం వేలు, చిటికినవేలు కన్న పెద్దది) అంతకన్న పెద్దకవిని లెక్కపెట్టాలి. అలాంటివాడు లేడు కాబట్టి ఆ లెక్కపెట్టేవాడు అక్కడే ఆగిపోయాడు. ఆ కారణం వల్ల ఉంగరం వేలుకి అనామిక (పేరులేనిది) అన్న పేరు సరిగ్గా సరిపోయింది.)

మిగిలిన కవులు కూడా గొప్ప కవిత్వాన్ని సృష్టించారనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని జయదేవుడు ఒక శ్లోకంలో మనోహరంగా చెప్తాడు.

యస్యాశ్చోర శ్చికురనికరః కర్ణపూరో మయూరో
భాసో హాసః కవికులగురుః కాళిదాసో విలాసః
హర్షో హర్షో హృదయవసతిః పంచబాణస్తు బాణః
కేషాం నైషా కథయ కవితాకామినీ కౌతుకాయ

[యస్యాః = ఎవరికి; చోరః = చోరకవి; చికురనికరః = చిక్కని జుట్టో; మయూరః = మయూరుడు; కర్ణపూరః = చెవికమ్మయో; భాసః = భాసుడు; హాసః =నవ్వో; కవికులగురుః = కవికులగురువైన; కాళిదాసః = కాళిదాసు; విలాసః = విలాసమో; హర్షః = శ్రీహర్షుడు; హర్షః = ఆనందమో; బాణః= బాణుడు; హృదయవసతిః = మనసులో నిలచిన; పంచబాణః = మన్మథుడో ; ఏషా కవితాకామినీ = అట్టి ఈ కవితాకామిని; కేషాం = ఎవరికి; కౌతుకాయ = ఉత్సాహము కొరకు (ఉత్సాహమునిచ్చునది); న తు = కాదో; కథయ = చెప్పుము?]

(కవితాకామినికి చోరకవి కేశపాశం, మయూరుడు చెవులకి ఆభరణంలాంటి వాళ్ళు. భాసుడు ఆమె చిరునవ్వు. కవికులగురువు కాళిదాసు ఆమె విలాసం. హర్షుడు ఆమె ఆనందం. బాణుడు ఆమె మనసులో నిలచిన మన్మథుడు. ఇలాంటి అమ్మాయి ఎవరికి ఉత్సాహం కలగించదో చెప్పండి )

ఈ ప్రశంసలో జయదేవకవి ఒక్క కాళిదాసుని గురించి చెప్పినప్పుడు మాత్రమే కవికులగురుః అని సంబోధించాడు.

భాష, భావం, రసఙ్ఞత, దృశ్యచిత్రీకరణ, పరిసరాల పరిశీలన, మనోహరమైన భావవ్యక్తీకరణ, శిల్పసౌందర్యం, రమ్యంగా కథ చెప్పడం, మనోవిశ్లేషణ, విషయపరిజ్ఞానం, … ఇలా ఎన్నో విషయాలు కవితాత్మలో భాగాలు. కాళిదాసు వీటన్నిటినీ నభూతో నభవిష్యతి అన్నట్లు పోషించి ప్రతి కావ్యాన్నీ, ప్రతి శ్లోకాన్నీ, ప్రతి నాటకాన్నీ భారతీయ సంస్కృతికి దర్పణంగా సృష్టించి అర్పించి కవికులగురువయ్యాడు. అంతే కాదు, అలాంటి విద్యని అభ్యసించడానికి పునాదుల్ని వేసి జాతికి అధ్యాపకుడయ్యాడు.

కాళిదాసు భారతీయ కవితకి ఆత్మ వంటివాడు. కవిత ఏ రూపాన్నైనా పొంది ఉండవచ్చు. కవితాత్మ పాలు కొంతైనా దానిలో ఉంటుంది. ఇలా కాళిదాసప్రభావం తరువాత తరాల కవుల్లో ఉంటూనే వచ్చింది. కాళిదాసు భారతసంతతికి కేవలం కవిత్వాన్నే ఇవ్వలేదు. ఇంకా కొన్ని మౌలిమైన, మేధాపరమైన, సాంస్కృతిక పరమైన ఉపాధుల్ని సమకూర్చాడు. అవేమిటి? కాళిదాసు కవికులగురువు ఎందుకయ్యాడు? అన్నది ఈ వ్యాసానికి మూలవస్తువు.

కవితాత్మలో కొన్ని భాగాల్ని కాళిదాసు ఎలా పండించి పోషించాడు? ఏ విధంగా అతడు మనకి అధ్యాపకుడు? అన్నది స్థూలంగా చర్చించడమే మిగిలిన వ్యాసం యొక్క ముఖ్యోద్దేశ్యం. కాళిదాసు కవిత్వంలో రసజ్ఞత గురించి వేరే చెప్పక్కర్లేదు. అది అన్నివేళలా తొణికిసలాడుతూనే ఉంటుంది. ఇక మిగిలిన విషయాలకొస్తే, ఇంత చిన్న వ్యాసంలో అన్నీ కూలంకషంగా (ఈ ఒడ్డునుంచి ఆ ఒడ్డు దాకా) చర్చించడం సాధ్యం కాదు కాబట్టి, కొన్నింటిని కాస్త విశదంగా, కొన్నింటిని స్థాలీపులాకంగా, కొన్నింటి గురించి సూక్షంగానూ చెప్పి ముగిస్తాను.

1. భాష
భాషని నాదయోగంగా భావించినవాడు కాళిదాసు. పలికే మాట (శబ్దం), దానికున్న అర్ధం, వీటి మధ్యనున్న విడదీయరాని అర్థనాదేశ్వరబంధం అర్ధనారీశ్వరబంధంలాంటిదని పూర్తిగా తెలిసినవాడు. కాబట్టే రఘువంశాన్ని,

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ — (రఘువంశః 1-1)

అని మొదలు పెట్టాడు. పైగా వాగర్థప్రతిపత్తి (శబ్దం, అర్థం రెండింటికీ సంబధించిన జ్ఞానం అబ్బడం) కోసమే జగత్తుకి తల్లిదండ్రులైన (పితరౌ) పార్వతిని, పరమేశ్వరుణ్ణీ ప్రార్థిస్తున్నానన్నాడు. పార్వతీపరమేశ్వరౌ = పార్వతీప + రమేశ్వరౌ అని విడదీస్తే శివుడు, విష్ణువు అనే అర్థం వస్తుంది. సంస్కృతభాషలో పితరౌ అంటే ఇద్దరు తండ్రులు అని కూడా అర్థం ఉంది. అందువల్ల ప్రపంచానికి తండ్రులైన శివవిష్ణువులను కూడా ప్రార్థిస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు. మొదటి శ్లోకంలోనే, వాగర్థప్రతిపత్తికోసం ప్రార్థిస్తున్నా (వందే) అనగానే అది పుష్కలంగా దొరికేసినట్టుంది, వెంటనే పార్వతీపరమేశ్వరౌ అనే గొప్ప శ్లేష చూపాడు.

రమ్యమైన పదాల్తో పూలజల్లులు కురిపించడం, కోమలమైన పదబంధాల్తో కట్టిపారెయ్యడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. సంస్కృతభాషతో పరిచయం తక్కువ ఉన్న (లేదా అసలు లేని) వాళ్ళకి కూడా హృద్యంగా తోచే విధంగా కూడా వ్రాశాడు. కేవలం పదనాదం ద్వారా రమ్యతను సృష్టించాడు. ఋతుసంహార కావ్యంలో కాళిదాసు ఆరు ఋతువుల్నీ ఆరు సర్గల్లో వర్ణించాడు. మచ్చుకి ఋతుసంహారం లోని మూడు శ్లోకాలు చూడండి.

సదా మనోఙ్ఞం స్వనదుత్సవోత్సుకం వికీర్ణ విస్తీర్ణ కలాపి శోభితం
ససంభ్రమాలింగనచుంబనాకులం ప్రవృత్తనృత్యం కులమద్యబర్హిణామ్ – (వర్ష ఋతువు)

(ఎప్పుడూ మనోజ్ఞంగా, శబ్దాలతో కూడిన మహోత్సవంలో తేలియాడుతూ, విస్తరించి విసరబడిన పింఛంతో శోభిస్తూ ఉన్న నెమళ్ళ గుంపులు ఇప్పుడు ముప్పిరిగొన్న ఆనందంలో ఒకదాన్నొకటి కౌగిలించుకుంటూ, ముద్దులాడుకుంటూ నాట్యం చెయ్యడం మొదలుపెట్టాయి. పైన చెప్పిన శబ్దాలు నెమళ్ళ కేకలు కావచ్చు లేదా మేఘాల గర్జనలు కావచ్చు.)

నితాంత లాక్షారసరాగరంజితైః నితంబినీనాం చరణైః సనూపురైః
పదే పదే హంసరుతానుకారిభిః జనస్య చిత్తం క్రియతే సమన్మథమ్ – (గ్రీష్మ ఋతువు)

(దట్టంగా పూసిన లాక్షారసం రంగు వల్ల ఎర్రబడి, అందెలతో కూడిన స్త్రీల పాదాలు అవి వేసే ప్రతీ అడుగులోనూ హంసల ధ్వనులను అనుకరిస్తున్నట్టుగా ఉన్నాయి. అది విన్న జనులందరి మనస్సులూ మన్మథప్రభావాన్ని పొందుతున్నాయి.)

ఆమ్రీ మంజులమంజరీ వరశరః సత్కింశుకం యద్ధనుః
జ్యా యస్యాలికులం కలంకరహితం ఛత్రం సితాంశుః సితం
మత్తేభో మలయానిలః పరభృతా యద్ద్వందినో లోకజిత్
సోఽయం వో వితరీతరీతు వితనుర్భద్రం వసంతాన్వితః – (వసంత ఋతువు)

(ఎవడి గొప్ప బాణాలు అందమైన ఆకర్షణీయమైన మామిడిపూల గుత్తులో, ఎవడి విల్లు మోదుగపువ్వో, ఎవడి వింటినారి తుమ్మెదల బారో, ఎవడి మచ్చలేని తెల్లని గొడుగు తెల్లని కిరణాల్తో కూడిన చందమామో, ఎవడి మదపుటేనుగు గంధపుచెట్లున్న మలయపర్వతపు వాయువో, ఎవడి వంది జనం (స్తోత్రపాఠాలు చేసేవాళ్ళు) కోకిలలో, అటువంటి లోకాల్ని జయించే మన్మథుడు, తన స్నేహితుడైన వసంతుడితో కలిసివచ్చి (అంటే వసంతకాలంలో) మీ అందరిమీదా సుఖభాగ్యాల్ని వెదజల్లుగాక! )

ఋతుసంహారం కాళిదాసు తొలిరోజుల్లో వ్రాసినది. రాను రాను, పదలాలిత్యానికి గాఢమైన భావాల్ని కూడా జోడించి తన భాషకీ, పదనాదానికీ కొత్త రంగులు దిద్దాడు. తరువాత వ్రాసిన రఘువంశ, కుమారసంభవ, మేఘదూత కావ్యాల్లో ఇది బాగా కనిపిస్తుంది. ఆ కావ్యాలు చదివి ఆనందించాలంటే సంస్కృతభాష నేర్చుకోవాలి. శ్రీమద్రామాయణం చదవాలంటే కొద్దిగా భాష తెలిస్తే చాలు. ఒక విధంగా చెప్పాలంటే, ఏ భాషవాళ్ళకి, ఆ భాషలో వాల్మీకి మహర్షి వ్రాసిన పాటలా ఉంటుంది. శ్లోకంలో ఉన్న పదాల్ని గద్యక్రమంలో (కర్త-కర్మ-క్రియ వరసలో) పేర్చుకుని అర్థం చేసుకోవడం చాలా సులువు. కాళిదాసు కావ్యాలకొస్తే, ఋతుసంహారంలో తప్ప మిగిలిన కావ్యాల్లో శ్లోకాల్ని గద్యక్రమంలో పేర్చుకోవడం, కొన్ని పదబంధాలకి అర్థాన్ని తెలుసుకోవడం అంత సులువు కాదు. భాషను ఒక గురువు దగ్గర నేర్చుకోవాలి. ఆ పరిణామాన్ని పై మూడు శ్లోకాల్లోనే చూడవచ్చు. వీటిలో మూడవ శ్లోకం ఋతుసంహారంలో ఆఖరి సర్గ అయిన వసంతర్తువులో ఆఖరి శ్లోకం.

ఇలా భాషను నేర్వగా, నేర్వగా ఈ క్రింద చెప్పిన లాంటి శ్లోకాల్లో, గీతరచయిత వేటూరి చెప్పినట్టుగా ‘ఆరు ఋతువులూ ఆహార్యములై’ కనిపిస్తూంటే, భావాల విందు, నాదాల పసందు రెండింటినీ అనుభవిస్తాం.

అది కుబేరుడి అలకానగరం అవడం వల్ల అన్ని ఋతువులూ అన్ని వేళలా ఉంటాయి. అందువల్ల అక్కడి వనితలు అన్ని ఋతువుల పువ్వుల్నీ అన్ని వేళలా దేహమంతా ధరిస్తారని మేఘుడికి (మబ్బుకి) యక్షుడు చెప్తున్నాడు.

హస్తే లీలాకమల మలకే బాలకుందానువిద్ధం
నీతా లోధ్రప్రసవరజసా పాండుతామాననే శ్రీః
చూడాపాశే నవకురువకం చారు కర్ణే శిరీషం
సీమంతే చ త్వదుపగమజం యత్ర నీపం వధూనామ్ – (మేఘసందేశః 2-2)

[యత్ర= ఏ (అనగా ఆ కుబేరుని అలకానగరంలో); వధూనామ్ = స్త్రీల యొక్క; హస్తే = చేతిలో; లీలా కమలమ్ = విలాసం కోసం పట్టుకున్న తామరపువ్వు (ఇది శరదృతువులో లభిస్తుంది); అలకే = ముంగురుల్లో; బాలకుందానువిద్ధమ్ = తురుముకోబడ్డ అప్పుడే విరిసిన మల్లెలు (ఇది హేమంత ఋతువులో లభిస్తుంది); ఆననే = ముఖం మీద; లోధ్రప్రసవరజసా = లొద్దుగ పువ్వుల పుప్పొడిచేత (దీన్ని పౌడర్ లా వాడి); నీతా= ఇవ్వబడిన; పాండుతామ్ శ్రీః= గౌరవర్ణపు శోభ (లొద్దుగ శిశిర ఋతువులో లభిస్తుంది); చూడాపాశే = కొప్పు ముడిలో; నవకురువకం = ఎర్ర గోరింట పువ్వు (ఇది వసంత ఋతువులో లభిస్తుంది); కర్ణే = చెవియందు; చారు శిరీషం = అందమైన దిరిసెన పువ్వు (ఇది గ్రీష్మ ఋతువులో లభిస్తుంది); సీమంతే = పాపటలో; త్వత్ =నీ; ఉపగమజం = రాక వల్ల పుట్టిన (వర్షాకాలం లో లభించే); నీపం చ = నీపకుసుమమూ (ఉంటాయో/యి).]

ఈ విధమైన భాషావికాసమే కాళిదాసుని కవికులగురువుగా మాత్రమే కాదు, సంస్కృతగురువుగా కూడా నిలబెట్టింది. సంస్కృతం నేర్చుకోవడంలో మొదటి భాగం పంచకావ్యాలు గురువు దగ్గర కూర్చుని చదివి అర్థం చేసుకోవడం. పంచకావ్యాలంటే రఘువంశం (కాళిదాసు), కుమారసంభవం (కాళిదాసు), కిరాతార్జునీయం (భారవి), శిశుపాలవధం (మాఘుడు), నైషధీయ చరితం (శ్రీహర్షుడు). దాక్షిణాత్యులు కొందరు నైషధీయ చరితం బదులు మేఘసందేశం (కాళిదాసు) అని అంటారు. ఏ లెక్కన చూసినా, అధ్యయనం విషయానికొస్తే, కాళిదాస గ్రంథాలకే పెద్దపీట. భాష నేర్వాలన్నా, భాషాసౌందర్యాన్ని అనుభవించాలన్నా కాళిదాసే.

ఆ కావ్యాల్ని చదవడం కూడా పైన చెప్పిన వరస లోనే చదవాలి. అప్పుడే భాషని సవ్యంగా నేర్చుకోగలుగుతాం. రఘువంశంలో భాష సరళంగా ప్రారంభమై, ఒక కావ్యాన్నుండి మరో కావ్యానికి వెడుతూంటే సంక్లిష్టంగా మారుతూ విద్యార్థుల మెదడుకి పరీక్షలు పెడుతుంది. అందుకే, నైషధం విద్వదౌషధం అనే సామెత. ఈ పాఠ్యప్రణాళికలో, కాళిదాసు విద్యార్ధులకిచ్చిన గొప్ప బహుమతి రఘువంశం నుంచీ కూడా కవితాసువాసనల్ని వెదజల్లడం. ఒకప్రక్క భాషని నేర్చుకుంటూండగానే, అద్భుతమైన భావసంపదలో చదువుకునే వాళ్ళని ముంచి తేల్చడం. భాషావిషయమైన అంతరార్ధాల్ని తెలియజెప్పడం. (రఘువంశం మొదటి శ్లోకంలోనే చూడండి. పదానికీ, దానికుండే అర్థానికీ గల సంబంధంతో మొదలు పెట్టాడు కావ్యాన్ని.)

కాళిదాసుకి భాషావ్యాకరణాలపైన ఉన్న మక్కువ గురించి సరదాగా, సూచనప్రాయంగా కొన్ని ఉదాహరణలిస్తాను.

తా నరాధిపసుతా నృపాత్మజైః తే చ తాభి రగమన్ కృతార్థతామ్
సోఽభవ ద్వర వధూ సమాగమః ప్రత్యయ ప్రకృతి యోగ సన్నిభః (రఘువంశః 10- )

[తాః నరాధిపసుతాః = ఆ రాజకన్యలైన సీత, ఊర్మిళ, మాండవిక, శ్రుతకీర్తులు; నృపాత్మజైః = రాజకుమారులైన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల చేతనూ; తే తాభిః చ = వీరు వారిచేతనూ (అంటే రామలక్ష్మణభరతశత్రుఘ్నులు, సీత-ఊర్మిళ-మాండవిక-శ్రుతకీర్తుల చేతనూ); కృతార్థతామ్ = కులం, శీలం, వయస్సు, రూపం మొదలయినవాటిని; అగమన్ = పొందిరి. సః వరవధూ సమాగమః = ఆ పెళ్ళికొడుకుల, పెళ్ళికూతుళ్ళ కలయిక; ప్రత్యయ ప్రకృతి యోగ సన్నిభః = ప్రత్యయాల యొక్క,ప్రకృతుల యొక్క కలయికలా ప్రకాశించినదిగా; అభవత్ = అయ్యెను.]

సంస్కృత భాషలో ప్రకృతికి ప్రత్యయాన్ని జత చేస్తేనే ఉద్దేశింపబడ్డ అర్థం వస్తుంది. దాదాపు ఇది అన్ని భారతీయభాషలకీ వర్తిస్తుంది. ఉదాహరణకి, భూ (ఉండు), డుకృఞ్ (చేయు) అనే పదాలు ప్రకృతులు (ఇవి ధాతువులైన ప్రకృతులు). వీటికి తిజ్ అనే ప్రత్యయం చేరి భవతి (ఉన్నది, ఉన్నాడు) కరోతి (చేయుచున్నది, చేయుచున్నాడు) మొదలైన అర్థాలున్న పదాలు ఏర్పడతాయి. ఇలా, సుప్, సన్ మొదలైన రకరకాల ప్రత్యయాలు వేర్వేరు ప్రకృతులకు చేరి రకరకాల పదాలు ఏర్పడి అర్థాన్నిస్తాయి. ఇలా పదార్థాల్నిచ్చే కలయికతో, పురుషార్ధాల్నిచ్చే వధూవరుల చేరికని పోలుస్తున్నాడు కాళిదాసు పై శ్లోకంలో.

ఇలా ఎన్నో సందర్భాల్లో వ్యాకరణ విషయాల ప్రసక్తిని తెస్తూనే ఉంటాడు. ధాతోః స్థాన ఇవాదేశం సుగ్రీవం సంన్యవేశయత్ — అంటాడు వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యమిప్పించే సందర్భంలో (రఘు 12-58.) ధాతువు యొక్క స్థానంలో ఆదేశధాతువు వచ్చినట్టు వాలి స్థానంలో సుగ్రీవుణ్ణి స్థాపించాడని సామ్యం చెపుతున్నాడు. అస్తేర్భూః అనే పాణిని యొక్క వ్యాకరణ సూత్రప్రకారం అస ధాతుస్థానంలో భూ అనే ఆదేశ ధాతువు వచ్చి చేరుతుంది. ఇలాంటివే మరికొన్ని:

సంస్కారవత్యేవ గిరా మనీషీ
తయా స పూతశ్చ విభూషితశ్చ – (కుమారసంభవమ్ 1-28)

[సంస్కారవత్యా = వ్యాకరణం మొదలైనవి చదవగా పుట్టిన సంస్కారంతో కూడిన; గిరా = వాక్కుచేత; మనీషీ ఇవ= పండితుని వలె; తయా = ఆమె చేత (పార్వతీదేవి చేత); సః = అతడు (పార్వతి తండ్రియైన హిమవంతుడు); పూతః = పవిత్రుడు; చ= మరియు; విభూషితః చ = అలంకరింపబడ్డవాడు కూడా (అయ్యాడు).]

పురాణస్య కవే స్తస్య వర్ణస్థాన సమీరితా,
బభూవ కృతసంస్కారా చరితార్థైవ భారతీ – (రఘువంశః 10-36)

[పురాణస్య = మిక్కిలి పురాతనుడైన; కవేః = కవి అయిన(సర్వం తెలిసిన); వర్ణ = అకారం మొదలు క్షకారం వరకూ ఉన్న అక్షరాల యొక్క; స్థాన= ఉత్పత్తి స్థానాలైన కంఠం, అంగుడు, నాలుక, దంతాలు, పెదవులు యందు; సమీరితా=చక్కగా ఉచ్చరింపబడ్డదీ; కృతసంస్కారా= చేయబడిన (బాగా ఉచ్చరించాలనే) ప్రయత్నాలు గలదీ అయిన; భారతీ = వాణి లేదా వాక్కు; చరితార్థా ఏవ బభూవ = కృతార్థురాలు తప్పక అయినది.]

అందమైన, వినసొంపైన, సరళమైన పదాలు వాడి కవిత్వం వ్రాయడం కాళిదాసు ప్రత్యేకత. ఇతని కవితారీతి వైదర్భీ రీతి. వైదర్భీ రీతిలో గంభీరమైన భావాల్ని చిన్నచిన్న పదాల్లో హృద్యంగా చెప్పాలి. ఆ రీతిని అవలంబించి అద్భుతంగా కవిత్వం వ్రాసిన వారిలో ఇతడు అగ్రగణ్యుడు. ముఖ్యంగా, పదాలవాడకంలో ఇతని సందర్భశుద్ధి ఎన్నదగ్గది. ఆ పదాలేవీ ఇతడు కొత్తగా కల్పించినవి కావు. అవి చదివేటప్పుడు మనకు దొరికే సంపద ఎలా ఉంటుందో చెప్పడానికి రెండు ఉదాహరణలు.

హేమపాత్ర గతం దోర్భ్యా మాదధానః పయశ్చరుం
అనుప్రవేశా దాద్యస్య పుంస స్తేనాపి దుర్వహం – (రఘువంశః 10-51)

[ఆద్యస్య = సృష్టికి మొదటివాడైన; పుంసః = పురుషుని యొక్క (విష్ణువు యొక్క); అనుప్రవేశాత్ = చేరుటవలన; తేన అపి = వానికి కూడా (అగ్నిలోంచి వచ్చిన ప్రజాపత్యపురుషునికి కూడా); దుర్వహం = మోయడానికి సాధ్యంకాని; హేమపాత్రం గతం = బంగారు గిన్నెలో ఉన్న; పయశ్చరుం = పాలతో వండిన అన్నమును; దోర్భ్యాః = రెండు చేతులతోటీ; ఆదధానః = పట్టుకున్నవాడై; (బయటకు వచ్చాడు).]

దశరథుడు పుత్రకామేష్ఠి చేస్తే, యజ్ఞపురుషుడు వస్తున్న సందర్భం. పాలతో వండిన పరమాన్నంతో నిండిన బంగారుగిన్నె రెండు చేతుల్తోనూ మోయలేక మోయలేక మోసుకుంటూ యజ్ఞగుండం లోంచి బయటకి వచ్చాడు. కారణం ఆ పాయసంలో విష్ణుతేజం నిండి ఉండడమే. అందుకే అంత బరువు. పుట్టబోయే శ్రీరాముని అవతారం సంపూర్ణమైన అవతారం. హేమపాత్రమ్ అనడం ద్వారా లక్ష్మీదేవి రాకని కూడా సూచించాడు కాళిదాసు. వెంటనే పయశ్చరుమ్ అన్నాడు. పయః అంటే పాలు. చరుమ్ అంటే వార్చకుండా యజ్ఞాగ్నిలో ఉడికించే అన్నం. ఈ పదం ఏ ఒక్కర్నీ వైకుంఠంలో వదిలెయ్యకుండా అందరితో (ఆదిశేషుడు, శంఖచక్రాలు అన్నీ వస్తున్నాయి) అవతరిస్తున్నాడన్న సూచన. ఇలాంటి ప్రయోగంలో నేర్చిన చరు శబ్దాన్ని జీవితంలో మరువగలమా?

జ్యోతిర్లేఖా వలయి గళితం యస్య బర్హం భవానీ
పుత్రప్రేమ్ణా కువలయదళ ప్రాపి కర్ణే కరోతి – (మేఘసందేశః 1-48)

ఈ శ్లోకంలో పార్వతికి కుమారస్వామి మీద ఉన్న ప్రేమని గురించి చెపుతూ కాళిదాసు ఇలా అంటాడు. కుమారస్వామి వాహనం నెమలి. అందుకని పిల్లవాడి మీద ప్రేమకొద్దీ (పుత్రప్రేమ్ణా) పార్వతి (భవానీ) కాంతిరేఖలు వలయాలుగా కలిగిన (జ్యోతిర్లేఖా వలయి) నెమలి కన్నును (బర్హం) చెవికి ఆభరణంగా పెట్టుకుంటుంది (కర్ణే కరోతి). ఆ నెమలి కన్ను ఎలా వచ్చింది ఆవిడకు? గళితం అంటే అదంతట అదే రాలిపడింది అని. పార్వతీదేవి దాన్ని నెమలివంట్లోంచి లాక్కుని దాన్ని హింసించి తెచ్చుకున్నది కాదు. ఈ సునిశితమైన భావాన్ని చెబుతూ, గళితం అన్నపదాన్ని వాడాడు.

భాష విషయంలో చివరిమాట. పదాల్ని అందంగా కూర్చే ఈ నేర్పరి, మాటల గారడీ కూడా చెయ్యగలడని ఒకసారి నిరూపించి వదిలేశాడు. ఆ తర్వాత ఆ ఫక్కీని బాణుడు, శ్రీహర్షుడు, భారవి లాంటివాళ్ళు వాడి పండించారు. ఈ కాళిదాస పదవిన్యాసాన్ని చూడాలనుకుంటే రఘువంశకావ్యం లోని తొమ్మిదవ సర్గని చదవండి.

ప్రియతమా యతమానమపాహరత్, గజవతీ జవతీవ్ర హయాచమూః, ఘనరవా నరవాహన సంపదః, స్వనవతా నవతామరసాననః, — ఇలా సాగే పాదాల్లో అక్షరాల వరస 1234 23456789. ఈ పదవిన్యాసం వరస తప్పకుండా 54 దృతవిలంబిత వృత్తాల ఆఖరిపాదాల్లో వచ్చి మనసునీ, మేధస్సునీ గిలిగింతలు పెడుతుంది.

2. భావం
ఈ విషయాన్ని చర్చించాలంటే మొత్తం ఇతని కవిత్వాన్నంతా తిరగతోడాలి. ప్రతి శ్లోకమూ రసాత్మకమే. తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నంత. అందువల్ల ఇక్కడ నేను చెప్పబోయేది లేశమాత్రమే.

2-1. గంభీరభావాలు
స సేనాం మహతీం కర్షన్ పూర్వసాగరగామినీం
బభౌ హరజటాభ్రష్టాం గంగామివ భగీరథః – (రఘువంశః 4-32)

[పూర్వసాగరగామినీం = తూర్పు సముద్రం వైపుగా వెడుతున్న; మహతీం సేనాం = గొప్ప సైన్యాన్ని; కర్షన్ సః = వెంట తీసుకునిపోతున్న ఆ రఘుమహారాజు; హరజటాభ్రష్టాం = శివుని జటాజూటం నుంచి జారిపోయి, పూర్వసాగరగామినీం = తూర్పు సముద్రం వైపుగా వెడుతున్న; గంగాం = గంగానదిని; కర్షన్ = వెంట తీసుకునిపోతున్న; భగీరథః ఇవ = భగీరథుని వలె; బభౌ = ప్రకాశించెను.]

ఈ శ్లోకం చూడ్డానికి చిన్నదానిలా కనిపించినా అర్థం అపారం. ఎన్నో భావాల్ని చిన్న పదాల్లో పొదిగి వ్రాశాడు కాళిదాసు. ఇక్కడ మనం కొద్దిగా పాత కథ ఒకటి చెప్పుకోవాలి. సూర్యవంశంలోనే పుట్టిన సగరుడనే చక్రవర్తి రఘువుకు పూర్వీకుడు. సగరుని అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి ఇంద్రుడు యాగంలో వాడే గుర్రాన్ని పాతాళంలో దాచేస్తాడు. ఆ గుర్రాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని అరవై వేలమంది కొడుకులు భూమిని తవ్వి సముద్రాన్ని తయారు చేస్తారు. (సగరుని కొడుకులు తయారుచేశారు కాబట్టి సముద్రాన్ని సాగరం అంటారు.) అక్కడ పాతాళంలో గుర్రాన్ని కపిలమహాముని దగ్గర ఉండడం చూసి, ఆయన్ని విమర్శించి, అతని శాపానికి భస్మమై పోతారు. వాళ్ళకి ఉత్తమగతులు లభించాలంటే స్వర్గంలో ఉన్న గంగను పాతాళానికి తేవలసి వచ్చింది. సగరుడూ అతని కొడుకు అసమంజసుడూ తపస్సు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని మనుమడు భగీరధుడు, తన తాతలకు ఉత్తమగతులు ప్రాప్తించాలని, రాజ్యం వదులుకుని, గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై, నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు? అని అడిగింది. అప్పుడు భగీరధుడు శివుని కోసం తపస్సు చేస్తాడు. అనుగ్రహించిన శివుడు గంగను భూమి మీదకి వస్తూంటే తన తలపై మోపి, జటాజూటంలో బంధిస్తాడు. భగీరధుని ప్రార్ధనతో ఒక పాయను నేలపైకి వదులుతాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగుతుంది. దాన్ని భగీరథుడు తూర్పుసముద్రంలో ఉన్న తాతల బూడిదల మీదకు పంపి వాళ్ళకు ఉత్తమగతులు కలిగిస్తాడు. అకుంఠిత దీక్ష, అనంతమైన పట్టుదలకు మారు పేరుగా భగీరథ కృషిని పేర్కొంటారు. అదీ పాతకథ.

ఆ పాత సన్నివేశంతో పోలిక చెపుతున్నాడు కాళిదాసు. రఘువు వెనక తూర్పు సముద్రం వైపుగా వెడుతున్న గొప్ప సేన, ఈశ్వరుడి జడల మధ్య నుంచి జారిపోయి భగీరథుని వెనుక తూర్పు సముద్రం వైపు పరిగెత్తుతున్న గంగలా ఉంది అని. ఇది కేవలం వస్తువుల మధ్య, మనుష్యుల పోలిక మాత్రమే కాదు. ఆశయాల్లో పోలిక, భావసంపదలో పోలిక, ఆదర్శాల్లో పోలిక. ఇక్కడ మనకి కాళిదాసులోని ప్రతిభావ్యుత్పత్తులు అర్థమవుతాయి.

ఇప్పటి కథకి వస్తే, రఘుమహారాజు క్షత్రియధర్మాన్ని పాటించి ప్రజలకి మంచి పరిపాలనని అందించాలని, దిగ్విజయమనే ఒక యాత్ర మొదలుపెట్టాడు. అది అతని ధర్మప్రకారం ఒక పవిత్రకార్యం. అది అందరికీ (క్షత్రియునిగా ధర్మపాలన వల్ల రఘువుకీ, దాస్య, దరిద్రాల నుంచి విముక్తి కలిగి ప్రజలకీ) ఐశ్వర్యాన్నిచ్చేది. రాజుకు ఐశ్వర్యం అతని సేన, వీరత్వం. ఆ రెండింటినీ వెంట తీసుకుని ప్రజావిముక్తి కోసం తూర్పు సముద్రం వైపు రఘువు వెడుతున్నాడు. ఐశ్వర్యం అంటేనే ఈశ్వరకృపవల్ల లభించేది అని అర్థం. కాబట్టి, ఈశ్వరుడు వదిలిన గంగతో సేన పోల్చబడింది. రఘువు తన ప్రజల విముక్తి కోసం చేసే ప్రయత్నం అవడం వల్ల, రఘువుని అతని పూర్వీకుడైన భగీరథునితో పోల్చాడు (భగీరథుడు కూడా తాతల విముక్తి కోసం పాటుపడ్డాడు.) రఘువు ఆశయానికీ, భగీరథుని ఆశయానికీ కూడా చెప్పకుండా పోలిక చెప్పాడు. కర్షన్ అన్న శబ్దప్రయోగం వల్ల పూర్వం భగీరథుడు, ప్రస్తుతం రఘువు వాళ్ళ వాళ్ళ కృషితో సంపాదించిన ఫలం (గంగ, సేన) వాళ్ళని అనుసరించి రావడాన్ని సూచించాడు. మహతీం అనడం ద్వారా వాటి లోని పవిత్రత, వీరత్వం సూచించాడు. భ్రష్టాం అనడం ద్వారా గంగ క్రిందకి పడడాన్ని, సేనకి యుద్ధంలో తప్పనిసరైన నష్టాన్నీ సూచించాడు. మొత్తం శ్లోకానికి పతాకసన్నివేశం — పూర్వ సాగరగామినీం అనడం. ఇది ఎన్నో అర్థాలని సూచించే ప్రయోగం.

గంగ తూర్పు సముద్రంలో కలుస్తుందన్న సత్యం.
ఇద్దరూ సగర సంతతి వాళ్ళే కాబట్టి వాళ్ళ ధర్మమార్గం వేరుగా ఉండదు అని చెప్పడం. ధర్మం వేరైనది కావచ్చు. ఇక్కడ రఘువుది ప్రజాపాలనకైన క్షాత్రధర్మం, భగీరథుడిది తాతల ఋణాన్ని తీర్చే పౌత్రధర్మం.
‘సాగర’ శబ్దంతో సముద్రానికీ భగీరథుడికీ, రఘువుకీ ఉన్న సంబంధాన్ని మరొక్కసారి తెలియజెయ్యడం. (పైన చెప్పిన పాతకథ ప్రకారం.)
సూర్యవంశరాజులైన భగీరథుడు, రఘువు తెల్లవారి లేవగానే ఆరాధించేది పూర్వసాగరంలో ఉదయించే సూర్యుణ్ణే. వాళ్ళ మనోదృష్టి ఎప్పుడూ అక్కడే. అందువల్ల ఇక్కడ కాళిదాసు వాడిన ‘గమ’ శబ్దంలోని అద్భుతమైన ఈ సంజ్ఞని గమనించాలి.
మరొక ఉదాహరణ.

తాం హంసమాలా శ్శరదీవ గంగాం, మహౌషధీం నక్తమివాత్మభాసః
స్థిరోపదేశా ముపదేశకాలే ప్రపేదిరే ప్రాక్తనజన్మవిద్యాః — (కుమారసంభవమ్ 1-30)

[స్థిరోపదేశాం = స్థిరమైన శిక్షణపొందుతున్న; తాం = ఆ పార్వతిని; ఉపదేశ కాలే = శిక్షణ పొందుతున్న సమయంలో; ప్రాక్తన జన్మ విద్యాః = ముందు జన్మల్లోని (అప్పుడు నేర్చిన) విద్యలు; శరది = శరత్కాలంలో; గంగాం = గంగానదిని; హంసమాలాః ఇవ = హంసల బారుల్లాగా; నక్తం = రాత్రి సమయంలో; మహౌషధీం = ఒక గొప్ప ఓషధీ లతని; ఆత్మభాసః ఇవ = దానిలో దాగియున్న వెలుగు వలె; ప్రపేదిరే = పొందినవి.]

పార్వతి చదువు నేర్చుకునే విధానాన్ని గురించి కాళిదాసు ఒకే ఒక శ్లోకం చెప్పాడు. అదే ఇది. ఆవిడ చదువంతా ఉపదేశంతోనే ముగిసిందిట. శిక్షణ మొదలవగానే ముందుజన్మల్లో నేర్చిన విద్యలన్నీ ఆమెని పొందాయి. అంటే, అవంతట అవే వచ్చి ఆమెలో నెలకొన్నాయనే భావం తెలపటానికి ప్రపేదిరే అనే భావగర్భితమైన క్రియని వాడాడు కాళిదాసు. అలా జరగడాన్ని రెండు రకాల సంఘటనల్తో పోల్చాడు.

ఈ పోలికలు, ‘ప్రపేదిరే ప్రాక్తనజన్మవిద్యాః’కి దీటుగా ఉండాలి. లేకపోతే, విషయం అభాసుపాలవుతుంది.

ఆ ఘట్టంలో ఉన్న పవిత్రతకి ప్రతిరూపంగా హంసమాలా శ్శరదీవ గంగాం అని పోల్చాడు. హంస స్వచ్ఛతకీ, ఉత్తమతకీ, గంగ పవిత్రతకీ, లోతుకూ ప్రతీకలు. గంగపైన హంసలు సహజంగా వచ్చితీరడం అనే విషయాన్ని పవిత్రత ఉన్నచోట స్వచ్ఛత అన్నది అదంతట అది వచ్చితీరుతుందన్న ప్రతిపాదనగా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఆ సంఘటనతో ప్రపేదిరే ప్రాక్తనజన్మవిద్యాః పోల్చాడు. ఇక్కడ ఇంకో కొన్ని చమత్కారాలు చేశాడు. హంసమాలాః అన్నాడు. అంటే హంసలబారు. ఇది చాలాకాలం పాటు నేర్చుకోవలసిన విద్యని సూచిస్తుంది. అది పార్వతికి క్షణంలో అబ్బేసింది. శరది అనడం ద్వారా ఉత్తినే అబ్బడం కాదు, ప్రస్ఫుటంగా కనిపించేలా అబ్బింది అని సూచించాడు. శరత్కాలపు వెన్నెల్లో హంసల బారులు అద్భుతమైన దర్శనాన్నిస్తాయి గదా!
ఆమె నేర్చిన విద్యలోని నిగూఢతనీ, గాఢతనీ తెలియజేస్తూ, మహౌషధీం నక్తమివాత్మభాసః అన్నాడు. మందుగా వాడే లత చూడడానికి మామూలుగానే కనిపించినా దాని లోపల దాని ఉపయోగం, అది చేసే మంచి, ఆ మంచి తాలూకు గాఢత మొదలయినవి దాగిన వెలుగుల్లా ఉంటాయి. లత పుట్టీపుట్టగానే దానికున్న పారంపర్యం వల్ల ఆ వెలుగులన్నీ దానికి సహజంగా అబ్బుతాయి. అలాగే పార్వతికి ప్రపేదిరే ప్రాక్తనజన్మవిద్యాః. ఇక్కడ కూడా ఒక చమత్కారం చేశాడు. మామూలు వ్యక్తులు ఆ లతని తీసుకుంటే దాని ప్రభావం తెలియక మామూలైన ఒక లతగా భావిస్తారు. వాళ్ళు వైద్యులవగానే అది అర్థమవుతుంది. చీకటి అజ్ఞానానికి ప్రతీక కాబట్టి, నక్తం అన్న పదం వాడడం ద్వారా విద్యాభ్యాస స్థితిని సూచించాడు. మరొక అర్థంలో ఓషధులు రాత్రి సమయంలో తమ ప్రభావాన్ని తేజోరూపంలో బయటపెట్టినట్లుగా, ప్రపేదిరే ప్రాక్తనజన్మవిద్యాః అన్నాడు. ఇంకొక చిన్న చమత్కారం – పార్వతి నల్లనిది. ఆమెలో మేల్కొన్న విద్యలు తేజోరూపంలో ఉన్నాయని సంజ్ఞ.
శరది అని తెల్ల రంగునీ, నక్త అని నల్లరంగునీ పోలికలో తెచ్చి వ్యతిరేకతలో ఏకతని చెప్పాడు.


మరి కొన్ని మంచి ఉదాహరణలు:

పార్వతి పుట్టడం గురించి:

సా భూధరాణామధిపేన తస్యాం, సమాధిమత్యా ముపపాది భవ్యా
సమ్యక్ ప్రయోగా దపరిక్షతాయాం నీతా వివోత్సాహ గుణేన సంపత్ – (కుమారసంభవమ్ 1-22)

(ఉత్సాహమనే గుణం ఉన్నవాడు నీతిని బాగా పాటించడం వల్ల కోరుకున్న పనుల్ని నెరవేర్చుకోగల్గుతాడు, వాడికి సంపద అదంతట అదిగా పుడుతుంది. అలాగే ఉత్సాహవంతుడైన హిమవంతుడు నీతివంతురాలైన మేనాదేవి యందు (మంచి సంతానం కలగానే సంకల్పంతో) జరిపిన సవ్యమైన ప్రయోగము చేత పార్వతి అనే ఒక గొప్ప సంపద పుట్టింది.)

దుష్యంతుడు ఆకాశం నుంచి వచ్చే పాట విన్న తర్వాత:

రమ్యాణి వీక్ష్య, మధురాంశ్చ నిశమ్య శబ్దాన్
పర్యత్సుకో భవతి యత్ సుఖితోఽపి జంతుః
త చ్చేతసా స్మరతి నూన మబోధపూర్వం
భావస్థిరాణి జననాంతర సౌహృదాని – (అభిజ్ఞానశాకుంతలమ్ – పంచమాంకం)

(ఎంతటి సుఖావస్థలో ఉన్న ప్రాణి అయినా, అందమైన దృశ్యాల్ని చూసిన తర్వాత, మధురమైన శబ్దాల్ని విన్న తర్వాత, ఇలాంటి పర్యుత్సుకతని (excitement) పొందుతూనే ఉంటుంది. ఇంతకు పూర్వం తెలియని ఏదో ఒక విషయాన్ని గురించి మనసులో నెమరు వేసుకుంటూనే ఉంటుంది. అందువల్లే, పూర్వజన్మల్లో ఏర్పడ్డ స్నేహాలు మనస్సుల్లో గాఢంగా నాటుకుని ఉంటాయి. )

ఉన్మత్తుడైన పురూరవుడు అన్న మాటల్లో:

యదే వోపనతం దుఃఖా త్సుఖం త ద్రసవత్తరమ్
నిర్వాణాయ తరుచ్ఛాయా తప్తస్య హి విశేషతః – (విక్రమోర్వశీయమ్ – తృతీయాంకం)

(దుఃఖానుభవం నుంచి తీసుకొని రాబడ్డ సుఖం రసవత్తరంగా ఉంటుంది. ఎక్కువ ఎండలో పరితపించిన వాడికే చెట్టు నీడ మిక్కిలి ఆనందం కలిగిస్తుంది.)

దుష్యంతుడు శకుంతలను చూసి ఆమె బ్రాహ్మణ కన్యయోమో అని అనుకుని తర్వాత మనస్సమాధానం చేసుకునేటప్పుడు:

అసంశయం క్షత్రపరిగ్రహక్షమా య దార్య మస్యా మభిలాషి మే మనః
సతాం హి సందేహ పదేషు వస్తుషు ప్రమాణ మంతః కరణ ప్రవృత్తయః – (అభిజ్ఞానశాకుంతలమ్ – ప్రథమాంకం)

(పరమ పవిత్రమైన నా మనసు ఈమెని కోరుకుంటోంది. కనుక ఈమె తప్పకుండా క్షత్రియుడు పెళ్ళాడడానికి తగినదే (క్షత్రియకన్యయే.) ఎందుకంటే, సత్పుషులకు ఏ విషయంలోనైనా సందేహం వస్తే, వాళ్ల అంతఃకరణ, ప్రవృత్తులే వాళ్లకి ప్రమాణాలు అవుతాయి.)

2-2. సరసభావాలు
కాళిదాసకవిత్వంలో గంభీరభావాలు ఎంత సులువుగా పలుకుతాయో, సరసమైన భావాలు కూడ అంత సహజంగానూ దొర్లుతాయి. ప్రకృతి పట్ల, రసమయజీవనం పట్ల ఇతనికున్న ప్రీతి దానికి కారణం కావచ్చు. ధనికులైనా, పేదవాళ్ళైనా అతనికి వ్యత్యాసం లేదు. ఋతుసంహారం, మేఘసందేశాల్లో ధనికవర్గాల విలాసాన్ని చూపిస్తే, అభిజ్ఞానశాకుంతలంలో సాధు జీవనాన్ని సాగించే శకుంతలలో విలాసాన్ని చూపిస్తాడు. అలకానగరాన్ని వేదికగా చేసుకుని యక్షుల ఐశ్వర్యవిలాసాల్ని, నృత్యగానవినోదాల్నీ ఉద్యానవిహారాల్నీ వర్ణిస్తాడు.

గత్యుత్కంపా దలకపతితై ర్యత్ర మందారపుష్పైః
పత్రచ్ఛేదైః కనకకమలైః కర్ణవిభ్రంశిభిశ్చ
ముక్తాజాలైః స్తనపరిసరచ్ఛిన్నసూత్రైశ్చ హారైః
నైశోమార్గః సవితు రుదయే సూచ్యతే కామినీనాం – (మేఘసందేశః 2-11)

(రాత్రంతా విలాసంగా గడిపి తెలతెల్లవారగానే హడవుడిగా ఇళ్ళకి వెళ్ళిపోయిన కామినీ జనాన్ని గురించి చెపుతున్న శ్లోకం ఇది. వాళ్ళు రాత్రి గడిపారని ఎలా చెప్పగలం అంటే, హడావుడిగా వెళ్ళిపోతున్న సమయంలో వాళ్ళ ముంగురుల్లో ఉన్న మందారపువ్వులు జారిపడతాయి, చిగురుటాలకుల్తో వాళ్ళ దేహంమీద చేసుకున్నఅలంకారాలూ రాలిపడిపోతాయి, చెవులకి పెట్టుకున్న బంగారు తామరలూ రాలిపోతాయి, తెగిపోయిన ముత్యాల హారాల నుంచి ముత్యాలు రాలిపడతాయి. ఇవన్నీ నేలమీద పడి రాత్రి వాళ్ళు నడిచిన దారులు తెలియజేస్తాయి.)


వాసశ్చిత్రం మధు నయనయో ర్విభ్రమాదేశదక్షం
పుష్పోద్భేదం సహ కిసలయై ర్భూషణానాం వికల్పాన్
లాక్షారాగం చరణకమలన్యాసయోగ్యం చ యస్యా
మేకః సూతే సకల మబలామండనం కల్పవృక్షః – (మేఘసందేశః 2-13)

(ఇంత విలాసంగా జీవించడానికి కావలసిన రంగురంగుల బట్టలు, కళ్ళకి జిలుగునీ, విలాసాన్నీ కలగజేసే మధువు, చిగురుటాకుల్తో కలిసి ప్రస్ఫుటంగా కనబడే పువ్వులు, ఆభరణాలు, కమలాల్లా ఉన్న పాదాలకి రాసుకునే లాక్షారసం… ఇలా కావలసిన అలంకారసామగ్రి అంతా కల్పవృక్షమే ఇస్తుంది.)

మునుల మధ్య వనంలో నివసిస్తున్న శకుంతల విలాసం గురించి చెపుతూ — ఆమె సహజమైన సౌందర్య సౌకుమార్యాల వల్లే ఆకర్షణీయంగా ఉంది, అంటాడు. దుష్యంతుడు మొదటిసారిగా శకుంతలని చూసినప్పుడు మనసులో అనుకున్న మాట.

సరసిజ మనువిద్ధం శైవలేనాపి రమ్యం
మలినమపి హిమాంశో ర్లక్ష్మ లక్ష్మీం తనోతి
ఇయమధిక మనోజ్ఞా వల్కలేనాపి తన్వీ
కిమివహి మధురాణాం మండనం నాకృతీనాం – (అభిజ్ఞానశాకుంతలమ్ – ప్రథమాంకం)

అందంగా లేని నాచుతో కూడినదైనా పద్మం అందంగానే కనబడుతుంది. చంద్రుళ్ళో మచ్చ నల్లగా ఉన్నా, అది అతనికి కొత్త శోభల్ని కలిగిస్తూనే ఉంటుంది. ముతకచీర కట్టుకున్నా ఈ సన్నని తీగ లాంటి అమ్మాయి అధికమనోజ్ఞురాలిగా కనబడుతోంది. సహజమైన అందం ఉన్నవాళ్ళకి అలంకారం కానిదేది?

ఆ శకుంతల అత్తవారింటికి వెడుతూంటే, వనమంతా కలిసి అన్ని అలంకార సామగ్రులూ సమకూర్చిందంటాడు. (యక్షులకి కల్పవృక్షమైతే శకుంతలకి వనమంతా.)

క్షౌమం కేనచి దిందుపాండు తరుణా మాంగల్య మావిష్కృతం
నిష్ఠ్యూత శ్చరణోపభోగసుభగో లాక్షారసః కేనచిత్
అన్యేభ్యో వనదేవతా కరతలై రాపర్వభగోత్థితైః
దత్తాన్యాభరణాని తత్కిసలయోద్భేద ప్రతిద్వందిభిః – (అభిజ్ఞానశాకుంతలం – చతుర్థాంకం)

ఒక చెట్టు చంద్రుడికున్న తళతళలతో కూడి, మంగళకార్యానికి తగినట్టున్న పట్టుచీర నిచ్చింది. మరొక చెట్టు ఆమె పాదాలు అందంగా కనిపించడానికి కావలసిన లాక్షారసాన్ని కక్కింది (ఇచ్చింది). వేరే చెట్లు, ఎర్రని తమ చేతుల్ని చాచి వనదేవతలిస్తున్నాయా అన్నట్టుగా ఎన్నో ఆభరణాల్ని ఇచ్చాయి. ఆ చెట్లకున్న ఎర్రని చిగురుటాకులు, ఆ వనదేవతల చేతుల్తో పోటీ పడుతున్నట్టున్నాయట.

శాకుంతలంలో అడుగడుగునా సరళంగా, సహజంగా జీవించే మునుల జీవితంలో ఉండే మాధుర్యాన్ని కూడా నొక్కి చెపుతాడు. రసమయజీవితానికి కావలిసినది స్పందించే రసహృదయమే కాని, మరే భేషజం కాదని మనకనిపించేలా తన కావ్యనాటకాల్ని మలిచాడు కాళిదాసు.
---------------------------------------------------------
రచన: భాస్కర్ కొంపెల్ల, 
ఈమాట అంతర్జాల పత్రిక సౌజన్యంతో

Wednesday, August 22, 2018

వేఱర్థములవేవి వేంకటేశ?


వేఱర్థములవేవి వేంకటేశ?






సాహితీమిత్రులారా!

ఈ పొడుపు పద్యంలోని ప్రశ్నలకు
సమాధానాలు చేప్పగలరేమో?
చూడండి-


అష్టావధాన శతావధానములకు
                     వేఱర్థములవేవి వేంకటేశ?
అస్త్రంబననేమి శస్త్రంబనఁగనేమి?
                    వేఱర్థములవేవి వేంకటేశ?
అక్షబమననేమి అక్షీబమననేమి?
                    వేఱర్థములవేవి వేంకటేశ?
అగ్రజుండెవఁడగు అవరజుండెవఁడగు?
                     వేఱర్థములవేవి వేంకటేశ?
శ్రీయుతాకారభువిని నల్పాయువేది?
శేషశైలవాసా చిరజీవియేది?
మెప్పుగా నుత్తరమ్ములు చెప్పవలయు
దేవ శ్రీ వేంకటేశ! పద్మావతీశ!

సమాధానాలు-
అష్టావధానము - ఎనిమిదిమంది ఇచ్చే
                              వివిధ ప్రశ్నలకు జవాబులివ్వడం
శతావధానము - 100 ముంది ఇచ్చే వివిద
                            ప్రశ్నలకు సామాధానాలివ్వడం
అస్త్రం       -       మంత్రప్రయోగబాణం
శస్త్రం        -      ఇనుపబాణం
అక్షిబము      - మునగచెట్టు
అక్షీబము      - సముద్రపు ఉప్పు
అగ్రజుడు       - అన్న
అవగ్రజుడు   - తమ్ముడు
అల్పాయువు  - పొట్టేలు
చిరజీవి           - కాకి

Tuesday, August 21, 2018

వాలుకనులదానా(పేరడీ)


వాలుకనులదానా(పేరడీ)







సాహితీమిత్రులారా!

ఈటివి ప్లస్ లో ఆహా ఈహీ ఓహో
అనే ప్రోగ్రామ్ లో "ప్రేమికుల రోజు"
సినిమాలోని "వాలుకనులదానా "
అనే పాటకు పేరడీ ఇక్కడ చూడండి-



Monday, August 20, 2018

అనంతాక్షర సౌరభాల గనులు


అనంతాక్షర సౌరభాల గనులు





సాహితీమిత్రులారా!


ఈ కవితలో ఉత్పలమాల పద్యాలు ఉన్నాయి.
కాని వీటిని ఒక కవితగా వ్రాశాడు ఎలనాగగారు
చూడండి-

పుస్తకమే నయం
కుమిలిపోయిన ఆత్మల మీద
ప్రేమతో కాస్త ప్రమోదరశ్మిని
సుఖాన్ని ప్రతుష్టిని చల్లుతుంది
ఈ ఆస్తిని యెప్పుడూ
మన గృహాంతర సంపద
చేయగల్గినామా
స్తిమితం అనేది
మన మానసవీధిని
కమ్మటం నిజం

అక్షరమే అనంత నిధి
ఆ యెరుకే
వొక సాటి లేని భాగ్యం
క్షితిపై మనీష
తన కాంతిని పూసిన
సాధనం యిదే
సాక్షరుడైనవాడి మనసంత
వసంత విరాజితం!
అనంతాక్షర
సౌరభాల గనులైన
కితాబుల మైత్రి ఓ వరం
                                  (వాకిలి సాహిత్య పత్రిక  నుండి)

ఉత్పలమాల పద్యాలు-

పుస్తకమే నయం కుమిలిపోయిన ఆత్మల మీద ప్రేమతో 
కాస్త ప్రమోదరశ్మిని సుఖాన్ని ప్రతుష్టిని చల్లుతుంది ఈ 
ఆస్తిని యెప్పుడూ మన గృహాంతర సంపద చేయగల్గినా
మా స్తిమితం అనేది మన మానసవీధిని కమ్మటం నిజం


అక్షరమే అనంత నిధి ఆ యెరుకే వొక సాటి లేని భా
గ్యం క్షితిపై మనీష తన కాంతిని పూసిన సాధనం యిదే
సాక్షరుడైనవాడి మనసంత వసంత విరాజితం! అనం
తాక్షర సౌరభాల గనులైన కితాబుల మైత్రి ఓ వరం

Sunday, August 19, 2018

బట్టతలపై పద్యం


బట్టతలపై పద్యం




సాహితీమిత్రులారా!


బట్టతలపై పద్యం ఎవరు రాశారో తెలియదు
ఇది వాట్సప్ లో హల్ చల్ చేస్తున్నది
విని మీరు ఆనందించగలరు-





Friday, August 17, 2018

ఒకే కవిత నాలుగు అనువాదాలు!


ఒకే కవిత నాలుగు అనువాదాలు!





సాహితీమిత్రులారా!


కవిత్వం ఒక క్రియాత్మక వ్యవసాయం అనుకుంటే అందులో రెండు రకాలున్నాయి. ఒకతీ కవి స్వతహగా తన ప్రేరణతో రాసే కవిత్వం. రెండో రకం, అంతకంటే తక్కువ స్థాయిది అయినప్పటికీ, ఒక మూల భాషలోని సౌందర్యాన్ని తనకి ఒద్దికగా ఉన్న మరో భాషలోకి చేసే అనువాదం. అందుకే అనువాదాన్ని అనుసృజన అనవచ్చు. నిజానికి ప్రతి భాషలోను తొలుత వచ్చేవి అనువాదాలే. కారణం ఆ భాష ఇంకా స్థిరపడకపోవడం, అంతవరకు మరొక భాషతో కలిసి ఉన్న ఆ భాష తన అస్థిత్వాన్ని నిలుపుకోవడంలో భాగంగా సాహిత్య సృష్టి చెయ్యవలసిన అవసరం రావడం కొన్ని ముఖ్యమైన కారణాలు. అనువాదాల్లో మాతృకకి దగ్గరగా ఉన్నవి కొన్నయితే, కొన్ని కేవలం నామమాత్ర మూలకథనో, సంఘటననో సందర్భాన్నో తీసుకుని, కవి తన ప్రతిభతో రెండవభాషలో పూర్తిగా స్వయం ప్రతిపత్తి గల వస్తువుగా తీర్చిదిద్దడం. మూడవది మూలంలోని లోపాలను పరిహరిస్తూ, (సమకాలీన) ఔచిత్యానికి భంగం లేకుండా అనువాదం చెయ్యడం. ఇక్కడ సమకాలీన అని ఎందుకు అన్నానంటే, ఒక యుగంలో ఉండే రస ప్రమాణాలు మరొక యుగంలో ఎబ్బెట్టుగా మారిపోతుంటాయి.

అనువాదం చేసేటప్పుడు వచ్చే సమస్యల్లో పలుకుబడులు(usages), నుడికారాలు (idioms)సామెతలు (proverbs), సందర్భాలూ (contexts), చాలా ముఖ్యమైనవి. మానవ ఇతిహాసంలో భాషకి అతీతంగా అనుభవాలూ, ఆవేశాలూ సర్వ సామాన్యమైనప్పటికీ, మనిషి నివసించే పరిసరాలూ, సహజీవనం చేసే జంతుజాలాలూ, తినే పదార్థాలూ వేరవడం వల్ల, ఆయా వస్తువులు ఉపమానాలుగానో, రూపకాలుగానో ప్రతీకలై భాషలో కలిసిపోయినపుడు, వాటికి సమానమైనవి అనువాదభాషలో కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో శబ్దాశ్రయమైన అనువాదం కంటే, భావాత్మకమైన అనువాదం పాఠకుడికి మూల భావాన్ని చేరవెయ్యడంలో ఉపకరిస్తుంది. నిజానికి ఏది మంచి అనువాదం అన్నది చెప్పడం ఎప్పుడూ కష్టమే! రెండూ మనసు రంజింపచెయ్యగలిగినప్పుడు.

అయితే, అనువాదాలు ఖచ్చితంగా చెప్పేది ఒకటుంది: ఒక కావ్యానికి ఎన్ని ఎక్కువ అనువాదాలు వస్తే, ఆ కావ్యం, అందులోని వస్తువూ కాలాన్ని అతిక్రమించి నిలబడగలుగుతున్నాయి; దాని relevance మనుషులు మారినప్పటికీ పోలేదు; అందులో ఏదో నిగూఢమైన సార్వజనీనత ఉంది.

అలాంటి కవిత నాకు అంతర్జాలం పుణ్యమా అని ఒకటి లభించింది. నిజానికి ఇందులోని రెండు అనువాదాలని తులనాత్మకంగా పరిశీలించడానికి ఒకరు దీని ఒక Website లో ప్రచురిస్తే, దాన్ని చదివిన ఇద్దరు అదే కవితకి తమ తమ అనువాదాలనుకూడా ప్రచురించారు స్పందనలో.
Du Fu లేదా Tu Fu ( 712- 770) చినీ కవిత్వానికి స్వర్ణ యుగంగా పిలవబడే Tang Dynasty కి చెందిన గొప్పకవులలో ఒకరు. ఆ కాలపు 300 కవితల సంకలనం ద్వారానే బాహ్య ప్రపంచానికి చీనీ కవిత్వం గొప్పదనం తెలిసింది. అది చైనాలో పిల్లలకు పాఠ్యభాగం. ఈ దిగువలింకులో మీకు మంచికవితలు దొరుకుతాయి: http://etext.lib.virginia.edu/chinese/frame.htm


విశాలప్రకృతిలో ఒక రాత్రి… తూ ఫూ, చీనీ కవి
తీరంవెంబడి పచ్చికపై పిల్లగాలి అలలుగా తేలియాడుతోంది
రాత్రల్లా, కదలని నా తెరచాప కొయ్యపైకి
ఆరుబయట ఆకాశంలోంచి చుక్కలు ఒద్దికగా వాలుతూనే ఉన్నాయి.
చంద్రుడు నది మీంచి గబగబా పరిగెత్తుకుని వచ్చేడు.
నా విద్య నాకు పేరు ప్రతిష్ఠలు తీసుకువచ్చి
ఈ వాటారిన వయసులో బాధ్యతలు తప్పించగలిగితేనా!
పరిగెడుతూ, పరిగెడుతూ, ఏమిటీ జీవితం,
ఈ అనంత విశ్వంలో ఎల్లమ్మ కాకిలా!
(అనువాదం: విటర్ బైనర్)

A Night Abroad
A light wind is rippling at the grassy shore….
Through the night, to my motionless tall mast,
The stars lean down from open space,
And the moon comes running up the river.
..If only my art might bring me fame
And free my sick old age from office! –
Flitting, flitting, what am I like
But a sand-snipe in the wide, wide world!
Du Fu / Tu Fu
(Translated by Witter Bynner, 1929)

రాత్రి ప్రయాణం
రెల్లు గడ్డి మీద పిల్లగాలి తేలిపోతోంది.
నేను ఒంటరిగా ఈ ఓడకొయ్యకి చేరబడ్డాను.
విశాలమైన మైదానం మీదకి చుక్కలు వాలుతున్నాయి
నదీ ప్రవాహంలో చంద్రుడు లోలకంలా ఊగుతున్నాడు
చదువు నాకు కీర్తి తెచ్చిపెట్టలేదు.
పదవులా? దానికి వయసు మించిపోయింది.
ఎటుపోతున్నానో తెలీని నా బతుకు ఏమిటి?
నింగీ నేలా మధ్య తిరుగాడే నీటికాకిలా.
(అనువాదం: విక్రం సేఠ్, 1992)

“Thoughts While Travelling at Night”
Light breeze on the fine grass
I stand alone at the mast.
Stars lean on the vast wild plain
Moon bobs in the great river’s spate.
Letters have brought no fame
Office? Too old to obtain.
Drifting, what am I like?
A gull between the earth and sky.
(Translation by: Vikram Seth, 1992)

రాత్రి ప్రయాణంలో ఆలోచనలు
నదీ తీరాన రెల్లు గడ్దిలో
చిరుగాలి సవ్వడి చేస్తోంది.
నా ఒంటరి పడవ తెరచాప
చీకటిలో ఉవ్వెత్తుగా ఎగురుతోంది.
విశాలమైన నీటి ఎడారిపై
చుక్కలు మెరుస్తున్నాయి. ఉరకలేస్తున్న
నీటితో వెన్నెలకూడా ప్రవహిస్తోంది.
నా కవిత్వం నాకు పేరు తెచ్చింది కాని,
నేను అలసి, వయసుడిగి, రోగాలతో
అటో ఇటో దూరంగా ఎక్కడికో కొట్టుకుపోతాను.
భీమికీ ఆకాశానికీ మధ్య
దారి తప్పిన నీటికాకిని నేను.
(అనువాదం: కెన్నెత్ రెక్స్ రాత్)

Night Thoughts While Travelling
A light breeze rustles the reeds
Along the river banks. The
Mast of my lonely boat soars
Into the night. Stars blossom
Over the vast desert of
Waters. Moonlight flows on the
Surging river. My poems have
Made me famous but I grow
Old, ill and tired, blown hither
And yon; I am like a gull
Lost between heaven and earth.

రాత్రి ప్రయాణంలో ఆలోచనలు
నదీ తీరాన చిరుగాలిరెల్లుగడ్డిని ఓలలాడిస్తోంది.
రాత్రి, ఒంటరిగా, నా పడవ
తెరచాపని చూస్తుంటే
దూరంగా పొలాల్లోకి
ఒక చుక్క పడిపోడం గమనించేను.
నిశ్చలంగా ఉన్న ఈ నది ముఖం మీదకి
చంద్రుదు మెల్లగా ఎగబాకుతున్నాడు.నేను కవిగా పేరుతెచ్చుకోలేకపోయాను
కనుక ఓ ముసలి రోగిష్టి ఉద్యోగిలా
నా ఉద్యోగాన్ని విరమించుకోవాలి.
ఎగురుతూ రెక్కలు కొట్టుకుంటూ
ముందుకీ వెనక్కీ గమ్యంలేకుండా
నా మనసు చక్కర్లు కొడుతోంది…
భూమికీ ఆకాశానికీ మధ్య
దారితప్పిన ఒంటరి నీటికాకిలా.
(అనువాదం : స్టేంటన్ హేగర్)
NIGHT THOUGHTS AS I TRAVEL
A gentle breeze sways the deep grass
along the riverbanks.
At night, alone, glancing at my boat’s
tall mast,
I spot a star plunging into a far-off field.
On the still face of the Yangtze, the
moon traces its slow ascent.
I’ve not made my mark as a poet, and
Should, like an old and ill official, retire
from my career.
Flapping and fluttering this way, that,
and back again,
My soul wheels in aimless circles,
a lost lone gull adrift
Between heaven and earth.
(Translation by: Stanton Hager)
---------------------------------------------------------
రచన - నౌడూరి మూర్తి, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

Thursday, August 16, 2018

శ్రీ శ్రీ దేశచరిత్రలకు పారడీ


శ్రీ శ్రీ దేశచరిత్రలకు పారడీ





సాహితీమిత్రులారా!


శ్రీ.శ్రీ. గారి
"ఏదేశచరిత్రచూచినా" అనే కవితకు పేరడీగా
భరద్వాజ్ గారు వ్రాసిన కవిత చూడండి-


ఏ సినిమా చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం?
సినీమాల చరిత్ర సమస్తం
నరపీడన పారాయణత్వం

సినిమాల చరిత్ర సమస్తం
స్టార్ హీరోల పాద సేవనం
సినిమాల చరిత్ర సమస్తం
చెంచాల వీరవిహారం

సూపర్స్టార్ పాత్ర ప్రధానం
తారాగణ అతివికారం
సినిమాల చరిత్ర సమస్తం
ప్రేక్షకులను కాల్చుకు తినడం

దర్శకుడే హీరొయిన్లచే
వ్యభిచారం చేయించాడా?
పరకాంతలు తెలుగు భామలై
సినీరంగమున ప్రసిద్ధికెక్కిరి

రాసక్రీడలు లేని చోటు టా
లీవుడ్ లో వెదకిన దొరకదు
హీరోయిన్ తడిసె వర్షమున
లేకుంటే హీరో స్వేదములో

కల్లోలిత సంసారాలు
దిగజారిన సంస్కారాలు
అపహాస్యపు హాహాకారం
సినిమాల్లో నీలుగుతున్నవి

అవివేకం అతిమూర్ఖత్వం
రీమేకులు కాపీ కథలూ
మాయలతో మారు పేర్లతో
సినిమాల్లో కనిపిస్తున్నవి

ఏయన్నార్ ఎంటీవోడు
శొభన్ సూపర్ స్టార్ కృష్ణ
చిరంజీవో ఎవడైతేనేం?
ఒకొక్కడూ శిరభక్షకుడు

నాగార్జున వెంకటేషులు
బాలయ్య పవన్ కల్యాణులు
మహేష్ బాబు ఉదయ్ కిరణ్ చేసిరి
మెదళ్ళతో రస పానీయం

అభిమానుల సందోహంలో
మీడియా ప్రకంపనలలో
ప్రకటనల పరంపరలో
సినిమాలను తీసిన మనుష్యులు

అంతా తమ ప్రయోజకత్వం
తామే ఇక సామ్రాట్టులమని
స్థాపించిన స్టూడియోలు
నిర్మించిన ఫిల్మ్ సిటీలూ

ప్రేక్షకుల చీత్కారంతో
పడిపోయెను పేకమేడలై
పరస్పరం సంగ్రహించిన
స్టోరీలతో సినిమా పుట్టెను

సహజమైన కథానికలు
మధురమైన సినీసంగీతం
అర్థమయ్యే మాటలు, పాటలు
ఇంకానా? ఇకపై ఉండవు

ఒక మహిళకు ఒకరే భర్త
ఒక పురుషునఒకరే పత్ని
ఉండే ఏ సినిమా అయినా
ఇంకానా? ఇకపై ఆడదు

మెగాస్టార్ ఘరానా మొగుడు
గోల్డ్ స్టార్ సమరసింహుడు
యువసామ్రాట్ మాస్ బాస్ బాస్ మాస్
సూపర్ హీరోలే అందరూ

పావలాకి రూపాయి నటన
హీరోయిన్ బికినీ వీక్షణ
సెంటిమెంటల్ చావబాదుడు
కలిపేస్తే సినిమా అయ్యెను

ఏ స్తాలిన్ ఎవడిని నరికెనో
లక్ష్మీ, మాస్ ఏ స్టేప్పేసెనో
నరసిమ్హుడి కంటిచూపులు
ఇంతేనా సినిమా అంటే?

ఏ షూటింగ్ ఎక్కడ జరిగెనో
ఏ సినిమా ఎన్నాళ్ళాడెనో
రికార్డులు గాసిప్ రచనలు
ఇదీ సినీ పత్రికల సారం

హాలివుడ్ వాడిపారేసిన
ఫార్మ్యులా ల జోలికి పోని
కథలేవో కావాలిప్పుడు
వినకుంటే ఇక వాళ్ళిష్టం

ముచ్చటైన సన్నివేశం
వెనకనున్న రచయిత ఎవ్వరు?
మణిరత్నం చీకటి షాట్లో
పనిచేసిన లైట్ బాయ్ ఎవ్వడు?

ఆకాశపు విన్యాసాల్లో
స్టంట్ మేన్ల సాహసమెట్టిది?
హీరోల స్టెప్పులు కాదోయ్
అవి నేర్పిన మేస్టర్ ఎవ్వడు?

ఏ పోరి ఎవడితో తిరిగెనో
ఏ గుంటడు ఎవతిని తార్చెనో
న్యూస్ చానెళ్ళ స్పై కేం స్టింగులు
సృష్టించెను గందరగోళం

పదికోట్లతో తీసిన చిత్రం
అది చూసిన ప్రేక్షకులెవ్వరు?
ఆ సినిమా ఏ కాలంలో
సాధించిన దే పరమార్ధం?

ఏ కథనం ఏ సంగీతం?
ఏ మధనం ఏ సాహిత్యం?
ఏ జన్మల పాపమీ చిత్రం?
ఏం చేస్తాం? ఏమీ చెయ్యలేం!!
----------------------------------------------------------
రచన - భరద్వాజ్, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

Wednesday, August 15, 2018

క్రాస్ వర్డ్ పజిళ్లు – నా ప్రస్థానం


క్రాస్ వర్డ్ పజిళ్లు – నా ప్రస్థానం




సాహితీమిత్రులారా!



“ఆలేస్తు కంది”

“ఏం కూర వండమంటారు?”

“టటమా రకూ”

“ఈరోజేం వారం?”

“శురవా ముక్ర” (లేదా బువాధరం)

“ఇప్పటిదాకా ఫోన్లో మాట్లాడింది ఎవరితో?”

“లక్ష్మీ జరాం”

“ఆయనెక్కడుంటున్నాడిప్పుడు?”

“రామం జడ్రి”

ఇట్లాంటి సంభాషణ నాకూ నా శ్రీమతికీ మధ్య అప్పుడప్పుడు జరుగుతుందంటే మీరు నమ్ముతారో లేదో కానీ, తారుమారు మాటల వ్యవహారం మొదట్నుంచీ నాకెంతగానో నచ్చే విషయం! పై సంభాషణలోని 1, 3, 5, 7, 9 వాక్యాలకు సరైన రూపాలు ఆకలేస్తుంది, టమాట కూర, శుక్రవారము (బుధ వారం), లక్ష్మిరాజం, రాజమండ్రి అని మీరిప్పటికే గుర్తు పట్టి వుంటారు.

1965 ప్రాంతంలో – అంటే నేను ఆరవ తరగతిలోనో, ఏడవ తరగతిలోనో ఉన్నప్పుడు – పుస్తక ప్రపంచం అనే పత్రిక వచ్చేది. అందులోని చిన్న క్రాస్ వర్డ్ పజిల్ ను ఎంతో ఇష్టంగా పూరించే వాడిని. అది జటిలంగా ఉండేది కాదు. వేరు తెగిన వేరుశనగ, తల తారుమారైతే వచ్చే తీగ – ఇట్లా ఉండేవి ఆధారాలు. ఆ విధంగా నాకు తెలియకుండానే పజిళ్ల మీద Love at first sight ఏర్పడింది.

చాలా కాలం తర్వాత – అంటే నేను ఎం.బి.బి.ఎస్. లో ఉన్నప్పుడు – ఇంగ్లిష్ క్రాస్ వర్డ్ పజిళ్ల మీద నాకు మమకారం మరింతగా మొగ్గ తొడగటం మొదలైంది. ఎట్లా అంటే, నా సహాధ్యాయులైన రఘు, రాజేందర్ రెడ్డి, జయంతి నాయుడు క్లాస్ రూములో హిందు పత్రికలోని క్రాస్ వర్డ్ ను నింపుతుండేవారు. రఘు ఇప్పుడు కార్డియాలజిస్ట్. రాజేందర్ రెడ్డి పీడియాట్రిషన్. జయంతి నాయుడు కూడా ఏదో స్పెషలిస్ట్ అనుకుంటా. రఘు తప్ప మిగిలిన ఇద్దరు ఇప్పుడు USA లో ఉంటున్నారని నా ఊహ. అయితే, వాళ్లద్వారా నేను మరీ అంతగా నేర్చుకున్నదేం లేదు. వాళ్లు గడులను నింపుతుంటే కేవలం గమనిచేవాడిని – అంతే. కాని, తర్వాతి కాలంలో రఘు, నేను పక్కపక్క గదుల్లో ఉంటున్నప్పుడు, వాడు నాకు ఇంగ్లిష్ క్రాస్ వర్డ్ లను గురించిన ప్రాథమిక అవగాహనను కలిగించాడు. తర్వాత చాలా సంవత్సరాల అనంతరం నేను కాకతీయ మెడికల్ కాలేజ్ లో పీడియాట్రిక్స్ పి.జి. కోర్సు చేస్తున్నప్పుడు డాక్టర్ విఠల్ జనరల్ మెడిసిన్ పి.జి. విద్యార్థి. ఇప్పుడు కార్డియాలజిస్ట్ అయ్యాడు. అతను కూడా హిందు క్రాస్ వర్డ్ లను నింపుతుండేవాడు. మేం హాస్టల్లో ఉండేవాళ్లం కనుక ఉదయం, మధ్యాహ్నం తిండి కోసం డైనింగ్ హాల్లోకి వచ్చినప్పుడు కలిసి ఆ పజిల్ ను నింపటం మొదలు పెట్టాము. డాక్టర్ శ్రీరామ్ అనే ఒక తమిళుడు అప్పుడే రేడియాలజీలో పి.జి. కోర్సు చేస్తూ మా హాస్టల్లోనే ఉండేవాడు. అతనికి ఆంగ్లభాష మీద మంచి పట్టు ఉన్నా కూడా హిందు పజిల్ ను అసలే నింపలేక పోయేవాడు. ఒకసారి నా దగ్గరికి వచ్చి “సార్, ఎట్లా నింపుతారు మీరు అవన్నీ? నాక్కొంచెం వివరించరా ప్లీజ్” అని అడిగాడు. నేను అతనికి అవగాహన కలిగే విధంగా సాధ్యమైనంత వరకు తెలియజెప్పాను. తర్వాత అతను పుంజుకున్న తీరు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వారం రోజుల్లోనే ఎంతో నేర్చుకున్నాడు. ఉదయం కొంత మధ్యాహ్నం కొంత నింపి, సాయంత్రం టీ కోసం డైనింగ్ హాలుకు వచ్చినప్పుడు పజిల్ ను పూర్తి చేసేవాళ్లం. కొన్నిసార్లు నాకు రాని ఒకటి రెండు సమాధానాలను శ్రీరామ్ సాధించేవాడు. ఇక అప్పుడతని ఆనందానికి అవధులుండేవి కావు. నన్ను గట్టిగా కౌగిలించుకుని “కమాన్, లెటజ్ సెలెబ్రేట్ సర్” అంటూ బలవంతంగా రెస్టరాంట్ కు తీసుకుపోయి, బిస్కెట్లూ కేకులూ తినిపించి, టీ తాగించేవాడు. ఇప్పుడతను బెంగళూరులో స్థిరపడ్డాడని విన్నాను.

ఈ లోగా నేను ‘రచన’ మాసపత్రికలో రెండు దఫాలుగా పజిలింగ్ పజిల్ అనే శీర్షికన నిగూఢ ఆధారాలు గల పజిళ్లను దాదాపు నాలుగైదేళ్ల పాటు కూర్చాను. అయితే అవి మరీ అంత జటిలంగా ఉండేవి కావు. కాని, పాఠకాదరణను బాగానే చూరగొన్నాయి. క్రాస్ వర్డ్ పజిళ్లను గురించిన నా అభిప్రాయమేమంటే, మూసిన నా పిడికిలిలో ఏముందో చెప్పుకో అన్నట్టుగా ఆధారాలు జటిలంగా ఉండటం కాక, పజిల్ను పూరించింతర్వాత పాఠకులకు తృప్తి, త్రిల్ కలిగించే విధంగా ఉండాలి, అని. అక్షరక్రీడకు/పదక్రీడకు (word play కు) అవకాశం ఉన్నప్పుడే తృప్తి, త్రిల్ కలిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని అనిపిస్తుంది నాకు. ఆధారంలోనే జవాబు దాగి వుండి, బాగా ఆలోచిస్తే అది మెదడుకు తట్టాలి. అట్లాంటి ఆధారాలను వర్ణించడానికి మన తెలుగు భాషలో అంతర్లాపి అనే ఒక పదమున్నదని నా అన్నయ్య (నాగరాజు రామస్వామి) చెప్తే తెలిసింది నాకు. ‘ద హిందు’ ఆంగ్లపత్రికలో వచ్చే క్రాస్ వర్డ్ పజిళ్లలో అటువంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వాటిని ఛేదించాలంటే ఆంగ్లభాష బాగా రావటమే కాకుండా పదునైన ఊహాశక్తి, చురుకైన మేధ అవసరం. హిందు పత్రికలోని క్రాస్ వర్డ్ పజిళ్లను నేను కొన్ని దశాబ్దాలుగా దాదాపు ప్రతిరోజూ నింపుతూ వస్తున్నాను. అయినా ఇప్పుడు కూడా ఒక్కో పజిల్ను నింపటంకోసం గంటల తరబడి శ్రమించాల్సి వుంటుంది. సాధారణంగా 60 నుండి 99 శాతం వరకు కరెక్టుగా వస్తుంది. చాలా అరుదుగా – అంటే సరాసరిన నెలకొకసారి మాత్రమే – వంద శాతం కరెక్ట్ గా పూరించ గలుగుతాను. దీన్ని బట్టి ఆ పజిళ్లు ఎంత జటిలంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయినా ప్రతిరోజూ పూరించడానికి ప్రయత్నించటం మానను.

సుడోకు లాగానే ఈ క్రాస్ వర్డ్ పజిళ్ల పట్ల ఆసక్తి కూడా వ్యసనంగా మారే అవకాశముంది. అయితే అది లాభాన్నే చేకూరుస్తుంది తప్ప హానిని కలిగించదు కదా. పజిల్ను పూరించేటప్పుడు పర్యాయ పదాలకోసం బాగా ఆలోచించాల్సి వస్తుంది, నిఘంటువుల్లో వెతకాల్సి వస్తుంది. తద్వారా కొత్తకొత్త పర్యాయ పదాలనెన్నింటినో నేర్చుకుంటాం. ఇక మరుసటి రోజు జవాబుల్ని చూసుకున్నప్పుడు కూడా కొత్త వాటిని నేర్చుకుంటాం. ఇదంతా మెదడుకు వ్యాయామం లాంటిది కనుక, దీనివల్ల జ్ఞాపకశక్తి తప్పక పెరుగుతుంది.

నిగూఢ ఆధారాలతో కూడుకున్న పజిల్ ప్రక్రియను నేను సాహిత్య ప్రక్రియతో సమానంగా భావిస్తాను.

***

ఈ నెలతో ‘వాకిలి నుడి’ శీర్షిక రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక ఈ శీర్షికను నేను నిర్వహించ బోవటం లేదు. వేరొకరి చేత నిర్వహింపజేయాలా వద్దా అనే విషయాన్ని ప్రధాన సంపాదకులు నిర్ణయిస్తారు. ద్వైపార్శ్వ సౌష్ఠవం కలిగిన గ్రిడ్లు, నవ్యత చమత్కారం వైవిధ్యం కలిగిన ఆధారాలు – వీటిని సంతృప్తికరంగా తయారు చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని. అయినా, దీన్ని నడిపినంత కాలం నేను మాత్రం బాగా ఆనందించాను.

చాలా ఎక్కువ మంది పోటీలో పాల్గొనేలా పజిళ్లను రూపొందించక పోవడానికి కారణం ప్రమాణికతను నిలుపుకోవాలనే నా తపన మాత్రమే. మామూలు రకం పజిళ్లను చాలా పత్రికలు నిర్వహిస్తూనే ఉన్నాయి. వాటికి భిన్నంగా శీర్షికను ఉన్నత స్థాయిలో నడపాలని నాకొక బలమైన కోరిక ఉండింది. ఆధారాలు జటిలంగా ఉండాలా లేక సులభంగా ఉండాలా అన్నది ముఖ్యం కాదు. వాటిలో తెలుగు నుడికారం తాలూకు చమత్కారాన్ని మేళవిస్తున్నామా లేదా, వాటిని సరిగ్గా పూరించిన తర్వాత పాఠకుడు ఒక త్రిల్ ను పొందుతున్నాడా లేదా అన్నదే ముఖ్యమని నా అభిప్రాయం. ఇక ఆధారాలను రూపొందించడంలో నవ్యతను, వైవిధ్యాన్ని చూపాలన్నదే నాతపన.

నా ఈ ఆధారాలలోని కిటుకులను మొదట్లో చాలా మంది పట్టుకోలేక పోయినా, పజిల్ ప్రియులైన కొందరు పాఠకులు మెల్లమెల్లగా మెళకువలను నేర్చుకుని, సరిగ్గా పూరించే నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. అట్లా సంపాదించుకోలేని వారు ఈ పజిళ్లలో పస లేదని పెదవి విరిచారు. ఇప్పటిదాకా వచ్చిన, ఇప్పుడు వస్తున్న తెలుగు పజిళ్లలో ఉన్న నవ్యత కంటె, వైవిధ్యం కంటె నా పజిళ్లలో ఆ లక్షణాలు కొంచెమైనా ఎక్కువ పాళ్లలో ఉన్నాయని పాఠకులెవరైనా భావిస్తే, నేను నా లక్ష్యసాధనలో కృతకృత్యుడినయ్యానని అనుకుని ఆనందిస్తాను.
-----------------------------------------------------------
రచన - ఎలనాగ, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో