Sunday, November 29, 2020

ప్రేయసీ - ప్రియుల సంవాద పద్యం

 ప్రేయసీ - ప్రియుల సంవాద పద్యం




సాహితీమిత్రులారా!



ప్రేయసి  ప్రియుల మాటలు ఎంత సరసంగా ఉంటాయో 

చెప్పడానికి ఈ శ్లోకం చూస్తే తెలుస్తుంది. 

ఇది చాటుధరాచమత్కారసారమనే దానిలోనిది.

శ్లో. కఠిన కుచౌ తవ బాలే, చటుల చకోరాక్షి తావకే నయనే
     కుటిల సుకే శ్యలకా స్తే మిథ్యావాదిన్లతాంగి తవ మథ్యమ్


ప్రేయసి - కఠిన! (ఓ కఠినుడా!)
ప్రియుడు - కుచౌ తవ బాలే 
(ఓ బాలికాతిలకమా నీకుచములు కఠినముగాని నేనుగాదు)
ప్రేయసి - చపల! (ఓ చపలస్వభావం కలవాడా!)
ప్రి - చకోరాక్షి తావకే నయనే
(ఓ చకోరమువంటి కన్నులు గలదానా! నీకను్నలే చపలములు నేనుగాదు.)
ప్రే.- కుటిల! (వంకర నడతగలవాడా!)
ప్రి.- సుకే శ్యలకా స్తే 
(మంచి వెంట్రుకలుగలదానా! నీముంగురులే కుటిలములు నేనుగాదు)
ప్రే.- మిథ్యావాదిన్! (కల్లరీ!, మిథ్యను పలికేవాడా!)
ప్రి. - లతాంగి తవ మధ్యమ్ 
(తీగెవలె సన్ననిశరీరంగలదానా! నీ నడుమే మిథ్య(కల్ల) నేను కాదు)

ఇది ఒకనాటి సంవాదం


Friday, November 27, 2020

రెండు ప్రశ్నలకు సమాధానము ఒకటే

 రెండు ప్రశ్నలకు సమాధానము ఒకటే





సాహితీమిత్రులారా!


పొడుపుపద్యంలో పాదానికి రెండు ప్రశ్నలున్నాయి

రెండిటికి ఒకేసమాధానం కనిగొనాలి గమనించండి-


రాజులకెటువంటి రత్నముల్ ప్రియమయ్యె

రాయలే చెట్లవి కరులుమ్రింగు

నీశ్వరుఁడెవ్వాని నెచ్చోట ధరియించు

జారుఁడే ప్రొద్దునెవ్వారిఁగోరు

నెన్నెన్ని దినములకుకేతెంచు పున్నమ

జనయిత్రి పుత్రియేజాడఁదోఁచు

బంధువులేయెడ బలసియేతెంతురు

యీతగాఁడెందున భీతిఁజెందు

నన్నిటికి, జూడనైదేసి యక్షరములు

తిఱిగిచదివిన నాపేరె మఱలవచ్చు

రెండుప్రశ్నలకొక్కటేరీతినుండు

సమ్మతిగఁజెప్ప భావజ్ఞచక్రవర్తి


దీనిలో ప్రతి పాదంలో రెండు ప్రశ్నలున్నాయి

వాటికి ఒకటే సమాధానం 5 అక్షరాలలో ఉండాలి

మరియు 

ఎటు చదివినా ఒకలాగే ఉండాలి

ఇవి షరతులు-

మరి సమాధానాలు

రాజులకెటువంటి రత్నముల్ ప్రియమయ్యె

రాయలే చెట్లవి కరులుమ్రింగు

సమాధానం- వెలగలవె  

నీశ్వరుఁడెవ్వాని నెచ్చోట ధరియించు

జారుఁడే ప్రొద్దునెవ్వారిఁగోరు

సమాధానం- నెలతలనె 

నెన్నెన్ని దినములకుకేతెంచు పున్నమ

జనయిత్రి పుత్రియేజాడఁదోఁచు

సమాధానం- నెలనెలనె  

బంధువులేయెడ బలసియేతెంతురు

యీతగాఁడెందున భీతిఁజెందు

సమాధానం-నెగడగనె


Tuesday, November 24, 2020

యజుర్వేదంలోని ప్రశ్నోత్తర చిత్రం

 యజుర్వేదంలోని ప్రశ్నోత్తర చిత్రం



సాహితీమిత్రులారా!



చిత్రకవిత్వంలో ప్రశ్నోత్తరచిత్రం ఒకటి

ఇక్కడ యజుర్వేద మంత్రాలలోని 

ప్రశ్నోత్తరచిత్రాన్ని చూద్దాం.

ప్రశ్నలు ఒక శ్లోకంలో  సమాధానాలు మరో శ్లోకంలో

ఇవ్వబడ్డాయి గమనించండి-

క స్వి దేకాకీ చరతి క ఉ స్వి జ్జాయతే పున:
కిగ్ం స్విద్ధిమస్య భేషజం కిం వావపనం మహత్ 

                                                             (యజు. 23-9)
ఇందులో ప్రశ్నలు మాత్రమే ఉన్నవి.  ప్రశ్నలు-
1. క స్వి దేకాకీ చరతి?
    ఒంటరిగా తిరిగునదేది? (ఏ గ్రహం చుట్టూ తిరుగనటువంటిది)
2.   క ఉ స్వి జ్జాయతే పున:?
      నలువైపులా తిరుగునదేది?
3. కిగ్ం స్విద్ధిమస్య భేషజం? (చలికి మందేది)
4. కిం వావపనం మహత్ ?
    విత్తనము మొలకెత్తుటకు అన్నిటి కంటె పెద్ద క్షేత్రమేది?


ఈ ప్రశ్నలకు ఈ మంత్రంలో  సమాధానాలు ఉన్నవి.

సూర్య ఏకాకీ చరతి చంద్రమా జాయతే పున:
అగ్నిర్ హిమస్య భేషజం భూమిరావపనం మహత్

                                                              (యజు. 23-10)
జవాబులు -
1. సూర్య ఏకాకీ చరతి  (సూర్యుడు దేనిచుట్టూ తిరుగడు)
2. చంద్రమా జాయతే పున: (చంద్రుడు నలువైపులా తిరుగుతుంటాడు)
3. అగ్నిర్ హిమస్య భేషజం (చలికి మందు వేడి(అగ్ని))
4. భూమిరావపనం మహత్
    విత్తనములు మొలకెత్తుటకు అన్నిటి కంటె పెద్దక్షేత్రం భూమి

వేదంలో విజ్ఞాన బీజాలు గ్రంథం నుండి

Sunday, November 22, 2020

విభక్తి గూఢము

 విభక్తి గూఢము




సాహితీమిత్రులారా!



ఒక పద్యం లేక శ్లోకంలో  విభక్తిని మరుగు

పరచిన దాన్ని విభక్తిగూఢము అంటారు.

దీని ఉదాహరణగా ఈ శ్లోకం చూడండి-


పాయా న్మా మురసావితః శ్రియమునా రాధ్యాం ప్రపద్యేత మాం

కోవా న స్థిర మశ్నుతే శమధనో2 ప్యాలోకితో జాతుచిత్

వేదాంతై ర్వినుతాంఘ్రయే న కి ముతశ్శ్రేయోనతిం తన్వ తాం

సేవా మో రచయామి మానస సదా భక్త్యా పహా వాదరమ్


దీనిలో సప్త విభక్తులు- ప్రథమావిభక్తి నుండి సప్తమీవిభక్తి వరకు

ఉన్న 7 విభక్తులు గూఢం చేయబడినవి. అవి తెలియాలంటే

ముందుగా శ్లోకాన్ని పదవిభాగాలుగా చేసుకోవాలి-

పదవిభాగం-

పాయాత్, మాం, ఉరి, అసే, ఇతః, శ్రియం, ఉనా,

ఆరాధ్యాం, ప్రపద్యేతమాం, కరి, వా, న, స్థిరం, అశ్నుతే,

శం, అధనః, అపి, ఆలోకితః, జాతుచిత్, వే, దాంతైః,

వినుతాంఘ్రయే, న, కిమ్, ఉతః, శ్రేయః, నతిం,

తన్వతాం, సేవాం, ఓః, రచయామి, మానస, సదా,

భక్త్యా, ఆవహ, ఔ, ఆదరమ్.


దీనిలో లక్ష్మీ వాచకమైన ఉ - శబ్దం యొక్క ఏడు విభక్తులు

సంధిమూలంగా దాగిఉన్నాయి.

ఓ మనసా, లక్ష్మి యందు ఎల్లపుడు ఆదరాన్ని కలిగి ఉండమని

కోరే శ్లోకం ఇది.

ఉరసాపాయాత్, వేదాంతైః, సేవామో, భక్త్యావహౌ

మొదలైన చోట్ల అపార్థ భ్రమ కలిగించే విధంగా

శ్లోకం కూర్చబడింది.

ఉ - శబ్దానికి క్రమంగా 7 విభక్తులలో రూపాలు-

ఉః, ఉం, ఉనా, వే, ఓః, ఓః, ఔ - అని ఉంటాయి.

శ్లోకంలో ఉరసా అనే చోట ఉః - అనే ప్రధమ(కర్త) గుప్తము.

శమధనః - లో శం అనే ద్వితీయ(కర్మ) గుప్తమైంది.

యమునా రాధ్యాం - లో ఉనా - తృతీయవిభక్తి(కరణం) గుప్తం.

శ్రియముతః - లో ఉతః - అనే చోట పంచమీ(అపాదానం) గుప్తం

పంచమ్యర్థంలో తసిల్ ప్రత్యయం - సేవామోరచయామి - అనే చోట

ఓః - అని షష్ఠి గుప్తము, భక్త్యావహౌ - అనే చోట ఔ - అనే సప్తమీ గూఢంగా ఉంది.


ఈ లక్ష్మి నన్ను కాపాడుగాక,

శివునిచే పూజింప దగిన లక్ష్మిని

నేను ఆశ్రయిస్తున్నాను.

ఆమె కటాక్షానికి పాత్రుడైన

ఏ దరిద్రుడు సంపదను పొందడు

దాంతులైన మునులచే నమస్కరించబడు

లక్ష్మి వలన వారికి శ్రేయస్సుకలుగుటలేదా

ఓ మనసా........ లక్ష్మి యందు ఆదరము

కలిగి ఉండుము. ఆమెకు సేవ చేస్తాను-

శ్లోక భావం.

Friday, November 20, 2020

ముక్కుతో పలుకని పద్యం

 ముక్కుతో పలుకని పద్యం





సాహితీమిత్రులారా!



ముక్కుతో పలికే అక్షరాలను

అనునాసికాలు అంటారు

ఙ,ఞ,ణ,న,మ - అనేవి అనునాసికాలు

ఇవిలేకుండా పద్యం వ్రాస్తే ముక్కుతో పనిలేదు

వాటిని నిరనునాసికాలు అంటాం.

ఇక్కడ నిరనునాసిక చంపువు అనే కావ్యం నుండి

ఒక ఉదాహరణ చూద్దాం-

లక్ష్మణుడు శూర్పనఖకు ముక్కుచెవులు కోసిన తర్వాత

అన్న అయిన రావణుని దగ్గరకు వెళ్ళి 

ఈ విధంగా చెప్పిందట


హా! హా! రాక్షస దుష్పరిభవగ్రస్తస్య ధిక్ తే భుజా

విద్యుజ్జిహ్వువిపత్తిరేవ సుకరా క్షుద్రపప్రతాప త్వయా

ధ్వస్తాపత్రప పశ్య పశ్య సకలైశ్చక్షుర్భిరేతాదృశీ

జాతా కశ్యచిదేవ తాపసశిశోఃశస్త్రాత్తవైవ స్వసా

                                                                          (నిరనునాసిక చంపువు - 2)

ఓ రాక్షసరాజా! నీకు నీ 20 చేతులకు అవమానం, 

దయనీయమైంది నీ శౌర్యం, నీ 20 కళ్లతో బాగా చూడు

ఆ మునికుమారుని కత్తి నీ సోదరికి ఎంత బాధాకరమైన 

అవమానం కలిగించిందో (ముక్కు చెవులు కోసివేయబడినాయి)


ఈ పద్యంలో ఒక అక్షరమైనా ముక్కుతో పలుకుతుందేమో చూడండి.


Wednesday, November 18, 2020

నాలుక కదలని పద్యం

 నాలుక కదలని పద్యం





సాహితీమిత్రులారా!

ఒక పద్యంకాని శ్లోకంకాని నాలుక కదలకుండా పలికే అక్షరాలతో

కూర్చితే దాన్ని "అచలజిహ్వ" అంటారు.

"ఆయలూరు కందాళయార్య" విరచిత "అలంకారశిరోభూషణే "

శబ్దాలంకారప్రకరణంలోనిది ఈ శ్లోకం.

చూడండి నాలుక కదులుతుందేమో!


భవభామా భావగాహ బహుభామా మవాభవ

మమ భోభవభూమావ భవభూపా వభూమహ 


(పార్వతీదేవి యొక్క హృదయమందు చేరినవాడా(శ్రీరామనామ రూపంతో

ఆమె హృదయమందున్నవాడు) అధిక తేజస్సంపన్నుడా! సంసారగంధ గ్రహితుడా

శ్రీ భూవల్లభా! సంసార మండలంలో కలిగిన పాపాధిత్యాను నశింపచేయువాడా!

నన్ను రక్షించు)

Monday, November 16, 2020

గూఢచతుర్థి(పాదగోపనము)

 గూఢచతుర్థి(పాదగోపనము)





సాహితీమిత్రులారా!



పాదగోపనము అంటే ఒక పద్యంలోని పాదాన్ని మిగిలిన

పాదాలలో గోపనం చేయడం. అది మొదటిపాదమైతే

ప్రథమపాదగోపనము అని, రెండవపాదమైతే 

ద్వితీయపాదగోపనమని, మూడవపాదమైతే 

తృతీయపాదగోపనమని, నాలుగవపాదమైతే

గూఢచతుర్థి అని అంటారు.

ఇక్కడ మనం గూఢచతుర్థిని 

కొడవలూరు రామచంద్రరాజుగారి

మహాసేనోదయం అనే గ్రంథంనుండి 

తీసుకొని వివరించుకుంటున్నాము.-

వనజసమాననేత్రక కృపాజలధీశ సరస్తవ క్షమా
హననదురాసదార్ధిప్రణతా సమరోన్నత సాదరాశయా
మునిమహనీయలాలసవిభూత్యభిసేవన ధూర్తభంజనా
జనకజశస్తమానసప్రసన్న దయామయ సత్యవర్తనా

మొదటి మూడు పాదాలలో గోపన
పరచిన అక్షరాలను కలుపగా నాలుగవపాదము వస్తుంది. అంటే నాలుగవ పాదము గోపనము లేక గూఢపరచినది.

వనజసమాననేత్రక కృపాజలధీశ సరస్తవ క్షమా
హననదురాసదార్ధిప్రణతా సమరోన్నత సాదరాశయా
మునిమహనీయలాలసవిభూత్యభిసేవన ధూర్తభంజనా

ఈ మూడు పాదాలలో చివరిదైన
నాలుగవ పాదం గూఢంగా ఉంది
ది ఎలా తెలుసుకోవాలంటే
మొదటి పాదంనుండి ప్రతి మూడవ
అక్షరం తీసుకుంటే 4వపాదం వస్తుంది

వనసమానేత్ర కృపాలధీ సరస్తవ క్షమా
హనదురాదార్ధిప్రణతా మరోన్నత సారాశయా
మునిహనీలాలవిభూత్యభిసేన ధూర్తభంజనా

ఆ అక్షరాలన్నీ కలుపగా

జనకజశస్తమానసప్రసన్న దయామయ సత్యవర్తనా -
అని ఏర్పడుతుంది.
పూర్తి పద్యం క్రింద చూడండి-

వనసమానేత్ర కృపాలధీ సరస్తవ క్షమా
హనదురాదార్ధిప్రణతా మరోన్నత సారాశయా
మునిహనీలాలవిభూత్యభిసేన ధూర్తభంజనా
జనకజశస్తమానసప్రసన్న దయామయ సత్యవర్తనా

Saturday, November 14, 2020

కానక గన్న సంతానంబు

 కానక గన్న సంతానంబు




సాహితీమిత్రులారా!



అయ్యలరాజు రామభద్రుని
రామాభ్యుదయములోని ఈ పద్యం చూడండి-
ఇది రాముడు అరణ్యమునకు పోవు సందర్భములో
దశరథడు బాధతో పలికిన పలుకులు ఎంత చమత్కారంగా
చెప్పబడినవో గమనింపుడు.

కానక గన్న సంతానంబు గావున
        గానక గన్న సంతానమాయె
నరయ గోత్ర నిధానమై తోచుగావున
        నరయ గోత్ర నిధానమయ్యె నేడు
ద్విజకులాదరణ వర్ధిష్ణుడు గావున
        ద్విజ కులాదరణ వర్ధిష్ణుఁడయ్యె
వివిధాగమాంత సంవేద్యుండు గావిన 
        వివిధాగమాంత సంవేద్యుఁడయ్యెఁ
గటగటా దాశరథి సముత్కట కరీంద్ర
కట కలిత దాన ధారార్ధ్ర కటక మార్గ
గామి, యెటు సంచరించు, నుత్కట కరీంద్ర
కటకలిత దాన ధారార్ధ్ర కటకతటుల

                            (రామాభ్యుదయము -5-12)

ఈ పద్యంలో ముందు భాగం తరువాతి భాగం
ఒకలానే కనిపిస్తూ అర్థభేదంకలిగి ఉన్నాయి.
1. కానక గన్న సంతానంబు - కలుగక కలిగిన సంతానము,
                                           అడవికొరకే కన్నసంతానము.
2. గోత్రనిధానము - వంశమునకు మూలమైనది,
                             కొండలు నివాసముగా గలది
3. ద్విజకులాదరణ వర్ధిష్ణుడు - బ్రాహ్మణ కుమును పోషించువాడు,
                                              పక్షిసముదాయమును పోషించువాడు.
4. వివిధాగ మాంత సంవేద్యుఁడు - బహువిధ వేదాంతములవలన తెలిసుకొనదగినవాడు,
                                                 బహువిధ వృక్షములనడుమ తెలిసుకొన దగినవాడు

5. సముత్కట కరీంద్ర .... కటక మార్గ
                     ఏనుగుల మదజలముచే తడిసిన పురములకేగువాడు,
                     ఏనుగుల మదజలముచే తడిసిన కొండవాలులుగల త్రోవలందు సంచరించువాడు
ఈ విధంగా రెండర్థములను ఆలోచిస్తూ దు:ఖిస్తున్నాడు దశరథుడు.

దీపావళి శుభాకాంక్షలు

 దీపావళి శుభాకాంక్షలు



సాహితీమిత్రులకు

శ్రేయోభిలాషులకు

దీపావళి శుభాకాంక్షలు

Wednesday, November 11, 2020

ఒక కందంలో అనేక కందాలు

ఒక కందంలో అనేక కందాలు




సాహితీమిత్రులారా!



ఒక కందపద్యంలో ఒక కందపద్యం, 

ఒక కందపద్యంలో రెండు కందాలు ఇలా

ఒక కందంలో నాలుగు కందాలు , ఒక కందంలో 8 కందాలు

ఒక కందంలో 16 కందాలు, ఒక కందంలో 116 కందాలు

ఒక కందంలో 256 కందాలు ఉండేలా మన తెలుగు కవులు కందపద్యాన్ని

ఇన్నిరకాలుగా  కూర్చారు. 

మనం ఇక్కడ మనం 1. చతుర్విధ కందం, 2. అష్టముఖికందం, 3. షోడశముఖి కందం

అనే మూడు రకాల కందాలను గమనిద్దాం-

చతుర్విధ కందం -

నన్నెచోడుని కుమారసంభవములో

12 ఆశ్వాసంలో శివుడు కుమారస్వామికి

జ్ఞానోపదేశం చేసే సందర్భంలో

తెలుగులో మొదటి చతుర్విధకందం

కూర్చబడింది చూడండి-


సుజ్ఞాన యోగ తత్త్వవి

ధిజ్ఞుల్ భవబంధనముల, ద్రెంచుచు భువిలో

నజ్ఞాన పదము బొందక

ప్రాజ్ఞుల్ శివుఁ గొల్తు రచలభావన దవులన్

                                                                   (కుమారసంభవము - 12- 217)


సుజ్ఞానము, యోగము, తత్త్వము అనువాని విధులు తెలిసిన

ప్రాజ్ఞులు సంసారబంధములను త్రెంచుచూ, భువిలో అజ్ఞాన

పదమును పొందక స్థిరబుద్ధితో శివుని కొలిచెదరు - అని భావం


ఈ కందపద్యంలో నాలుగు కందపద్యములను

ఇమిడ్చి కూర్చబడింది.

ఈ విధంగా ఒక ఛందస్సులో అనేక ఛందస్సులను ఇమిడ్చి వ్రాయటాన్ని గర్భకవిత్వము(పద్యగూఢము) అంటారు.

ఇందులో మొదటి కందము మనం ముందుగా వ్రాసినదే


సుజ్ఞాన యోగ తత్త్వవి

ధిజ్ఞుల్ భవబంధనముల, ద్రెంచుచు భువిలో

నజ్ఞాన పదము బొందక

ప్రాజ్ఞుల్ శివుఁ గొల్తు రచలభావన దవులన్



మరి రెండవ కందము-

రెండవ పాదంలోని మొదటి రెండు

అక్షరాలను విడచి ప్రారంభించిన

రెండవ కందము వస్తుంది

అది ఇక్కడ చూడండి-


భవబంధనముల ద్రెంచుచు 

భువిలో నజ్ఞాన పదము బొందక ప్రాజ్ఞుల్ 

శివుఁ గొల్తు రచలభావన 

దవులన్ సుజ్ఞాన యోగ తత్త్వవిధిజ్ఞుల్


మూడవ కందము మూడవ పాదం

మొదటినుండి ప్రారంభమవుతుంది.

అది ఇక్కడ చూడవచ్చు-

కొలుతురచలభావమునఁబ్రా

జ్ఞులుశివునిన్ యోగతత్త్వసుజ్ఞాననిధి

జ్ఞులుత్రెంచుచు భవబంధన

ములఁ దవులజ్ఞానపదముఁ బొందక భువిలోన్



నాలుగవ కందము నాలుగవ పాదము రెండు

అక్షరాలను విడచి ప్రారంభించ సరిపోవును.

అది ఇక్కడ చూడండి-


శివుఁ గొల్తు రచలభావన 

దవులన్ సుజ్ఞాన యోగ తత్త్వవి  ధిజ్ఞుల్ 

భవబంధనముల ద్రెంచుచు 

భువిలో నజ్ఞాన పదము బొందక ప్రాజ్ఞుల్


వీటన్నిలో 1,3 పద్యములకు జ్ఞ - ప్రాస, 2,4 పద్యములకు

వ - ప్రాసగా గూఢపరచబడినది.


అష్టముఖికందం-

ఒక కందపద్యంలో మరో 7 పద్యాలు మొత్తం 8 కందపద్యాలు

ఒకే కందంలో కూర్చారు తూము రామదాసుగారు

తన నిర్వచన మిత్రవిందోద్వాహములో

ఆ పద్యం ఇక్కడ చూద్దాం-

చరణక జునకును భవనది

తరికినిస్తుతమునికవికిని ధనవిభుపతికిన్

క్షరదతనునకునుప్రవిహిత

కరికినుతవాసవికినిగణరాడ్పతికిన్ 

                                             (నిర్వచన మిత్రవిందోద్వాహము - 1- 36)

ఇందులో ఇదికాక 7 కందపద్యాలున్నాయి.

కనుక్కోవడం ఎలాగంటే 

ప్రతిపద్యం మొదటిపాదం మూడవ గణంనుండి ప్రారంభిస్తేసరి.

ఇక చూద్దాం-

రెండవ పద్యం-

భవనది తరికినిస్తుతముని

కవికిని ధనవిభుపతికినని క్షరదతనునకున్ 

ప్రవిహిత కరికినుతవా

సవికినిగణరాడ్పతికిని చరణక జునకున్ 


మూడవ పద్యం-

స్తుతముని కవికిని ధనవిభు

పతికినని క్షరదతనునకును ప్రవిహిత కరికిన్

నుతవా సవికినిగణరా

డ్పతికిని చరణక జునకును భవనది తరికిన్


నాలుగవ పద్యం-

ధనవిభు పతికినని క్షరదత

నునకును ప్రవిహిత కరికిన్ నుతవాసవికిన్

గణరాడ్పతికిని చరణక 

జునకును భవనది తరికినిస్తుతమునికవికిన్


ఐదవ పద్యం -

క్షరదత నునకును ప్రవిహిత 

కరికిని నుతవాసవికిని గణరాడ్పతికిన్

చరణక జునకును భవనది 

తరికినిస్తుతమునికవికిని ధనవిభు పతికినన్


ఈ విధంగా చేస్తే 8 పద్యాలు కనిపిస్తాయి.


షోడశముఖి కందం-

 "షోడశముఖీ కందం" పేరున

నాదెళ్ళ పురుషోత్తమకవి రచించిన

అద్భుతోత్తర రామాయణంలోనిది

సప్తమాశ్వాసంలోని 149వ పద్యం-


ధరజవు తరుచవు తఱుటను

దఱుగను దఱిగొన దఱికను తఱుగను దరుగన్

ధరజను దరిగొన దరమును

దరమును దఱుమను దఱియను దఱలును ద్వరగన్


దీనిలో ప్రతిగణం ఒక పద్య మొదలౌతుంది.

ఇందులో 16 గణాలున్నాయి. 16 కందపద్యాలు

అవుతున్నాయి.  గమనించండి.


1ధరజవు 2తరుచవు 3తఱుటను

4దఱుగను 5దఱిగొన 6దఱికను 7తఱుగను 8దరుగన్

9ధరజను 10దరిగొన 11దరమును

12దరమును 13దఱుమను 14దఱియను 15దఱలును 16ద్వరగన్


ప్రతి గణం రెండవ

అక్షరం ప్రాస అవుతూ ఉంటుంది. కాబట్టి

- అనే అక్షరం ప్రాస అవుతున్నది.


 

Monday, November 9, 2020

అనులోమ ప్రతిలోమ పద్యం

అనులోమ ప్రతిలోమ పద్యం




సాహితీమిత్రులారా!
ఒక పద్యం మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు చదివితే ఒక అర్థం వస్తుంది. 
ఆ పద్యాన్నే చివర నుండి మొదటికి చదివిన మరో పద్యం వచ్చి మరోఅర్థం వస్తుంది. 
దీన్నే అనులోమ ప్రతిలోమ పద్యం అంటారు.

నసమాశనవాగారం నమేమత్వామజేయతం
తరసారమ్యనవ్యాభమరామాదయమా విభో

                                                           (అలంకారశిరోభూషణే శబ్దాలంకారప్రకరణం - 34)

(ఆశలు కోరికలు లేని నిష్కాముల యొక్క యజ్ఞాలు
నిలయంగా కలవాడవు, జయింప వీలుకానివాడవు,
నిత్యనూతన తేజస్సుకలవాడవు, శీఘ్రంగా ఫలాలను
ఇచ్చేదయగలవాడవు. అయిన
లక్ష్మీ వల్లభా! రంగనాధా! నమస్కారం)

ఇదే శ్లోకాన్ని చివరినుండి మొదటికి రాయగా

భోవిమాయదమారామ భర్యా నమ్య రసారత
తం యజేమత్వామమేన రంగావాన శమాసన

                                   

(మాయా రహితులైన ఇంద్రియ మనోనిగ్రహాల
చేత క్రీడించు పుణ్యాత్ముల చేత నమస్కరింప
దగిన శ్రీరంగపుణ్యభూమి యందు
ఆసక్తి కలవాడా! ఆనందంగా ఉండేవాడా!
శ్రీరంగనిలయుడవాన నిన్ను
సన్నిధిలో సేవిస్తాను.)



విక్రాల శేషాచార్యులవారి
శ్రీవేంకటేశ్వర చిత్రరత్నాకరములోని
గతిచిత్ర పద్యాన్ని ఇక్కడ చూద్దాం.

అనులోమ పద్యం -
(మొదట నుండి చివరకు చదివేది)

సారాకారా సమరస
సారసగ సరాస యనఘ జయయవ్యసనా
మారాకారా కలియమ
భారవ జసరా సమహిమ భాధవ భసరా


సారాకారా -
సార - ఉత్తమమైన, అకారా - అ అను వర్ణము(పేరు)గలవాడా,
సమ-రస - లక్ష్మితో కూడిన ప్రేమరసము కలవాడా,
సారసగ - శంఖమును పొందినవాడా,
సరాస - రాసక్రీడతో కూడినవాడా,
అనఘ - నిర్మలమైనవాడా,
అవ్యసనా, మారాకారా,
కలియమ - యుద్ధములలో యముని వంటివాడా,
భా-రవ-జ-సరా - శాంతితోను ధ్వనితోను జయముతోను
కూడిన బాణములుగలవాడా,
సమహిమ - భా-ధవ - భూదేవియొక్క వల్లభా,
భ-సరా - నక్షత్రములయందును గతిగలవాడా !
అనగా వాటియందును ఉండువాడా!

విలోమపద్యం -
(పై పద్యన్ని క్రింది నుండి చదువగా వచ్చే పద్యం)-

రాసభవధ భామహిమస
రాసజవరభామ యలికరాకారామా
నా సవ్యయ యజ ఘన యస
రాసగ సరసా సరమ సరాకారాసా


(రాసభ - గార్ధభాసురుని యొక్క, వధ - సంహారమునందలి
భా - దీప్తికిని, మహీమ - గొప్పదనమునకు,
స - స్యందన పథమువంటివాడా
అనగా స్యందనము దాని పథమునందు ఎట్లునడచునో
అట్లే గర్ధభాసురవధ జనిత తేజోమహిమలు వీరియందు నడచినవి అని,
రాస - జ వరరామ - రాసక్రీడయందు త్వరతో కూడిన ఉత్తమస్త్రీలుగలవాడా,
అలిక-రాకారామా - ముఖమునందునిండుపున్నమ
భార్యగా గలవాడైన చంద్రుడవే అయినవాడా,
నా సవ్యయ - అధికమైన శుభావహవిధులతో కూడినవాడవు కానివాడా)

Saturday, November 7, 2020

చిత్రకవిత్వాని - రూపగోస్వామి స్తవమాల

 చిత్రకవిత్వాని - రూపగోస్వామి స్తవమాల





సాహితీమిత్రులారా!


రూపగోస్వామి కృత చిత్రకవిత్వానిస్తవమాల ను 

గురించిన వీడియో వీక్షించండి-





Thursday, November 5, 2020

A talk on Chitra Kavya by Vikram Chandra

 A talk on Chitra Kavya by Vikram Chandra





సాహితీమిత్రులారా!

విక్రం చంద్ర గారు చిత్రకావ్యాన్ని గురించి

ప్రసంగించి ప్రదర్శించారు 

ఆ వీడియో ఆస్వాదించండి-



Tuesday, November 3, 2020

గోమూత్రికాబంధం

 గోమూత్రికాబంధం




సాహితీమిత్రులారా!


డా. శంకర్ రాజరామన్ ప్రముఖ అవధాని

మరియు  దేవీదానవీయం, చిత్రనైషధం

అనే  చిత్రకావ్యాల రచయిత.

ఈయన కూర్చిన ఒక గోమూత్రికా బంధం

ఇక్కడ వీక్షించండి-




Sunday, November 1, 2020

చతుర్విధకందం

చతుర్విధకందం



 సాహితీమిత్రులారాా!


చిత్రకవిత్వం అనేక విధలైన
కవిత్వపు రీతుల సమాకలనం.
అందులోని విభాగమే గర్భకవిత్వం.
దీనికే పద్యగోపన చిత్రమని అంటారు.
ఇది ఛందోప్రధానమైన విభాగం
ఒక ఛందస్సులో అనేక ఛందస్సులను
ఇమడ్చడం అనే ప్రక్రియనే గర్భకవిత్వం
అంటున్నారు.
మన తెలుగులో మొదట నన్నెచోడుడు
తన కుమార సంభవంలో ఈ ప్రక్రియను
ప్రారంభించాడు.
ఇందులో చతుర్విధకందము అనే పేరున
ఒక కందపద్యంలో మరో మూడు కందపద్యాలను
ఇమిడ్చి చూపాడు.
అలాగే మహాసేనోదయములోని
చతుర్విధ కందముము- (2-251)
ఇక్కడ గమనిద్దాం

నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణ మధుర భాషణనివహా
శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా

ఈ పద్యంలో ఇమిడిన కందపద్యాలు
మొదటిది-

నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణ మధుర భాషణనివహా
శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా

ఈ పద్యంలోని రంగుల ఆధారంగా 
మొదటి గర్భిత కందం గమనించవచ్చు
ఈ విధంగా అమర్చిన పూర్తి కందమవుతుంది


భవహరణ మధుర భాషణ
నివహా శైలధరశత్రు నిచయవి ఫాలా
నవకమలనేత్ర పాలిత
సవనా నీలాభ్రదేహ సజ్జన పాలా

ఇది పూర్తి కందము

భవహరణ మధురభాషణ
నివహా శైలధరశత్రు నిచయవిఫాలా
నవకమలనేత్ర పాలిత
సవనా నీలాభ్రదేహ సజ్జనపాలా

రెండవ కందము -


నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణ మధుర భాషణనివహా
శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా

ఈ మొదటి కందంలో పూర్వార్థము,  ఉత్తరార్థముములలో 
ఉత్తరార్థము పూర్వార్థంగా పూర్వార్థము ఉత్తార్థంగా మార్చిన 
రెండవ గర్భిత కందమగును.

శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా
నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణమధురభాషణనివహా

మూడవ కందము -


నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణ మధుర భాషణనివహా
శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా

ఈ పద్యాన్ని ఈ విధంగా రంగులలో చూపినట్లు 
తీసుకుంటే మూడవ పద్యం వస్తుంది

నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణ మధుర భాషణనివహా
శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా

నవకమలనేత్ర పాలిత
సవనా నీలాభ్రదేహ సజ్జన పాలా
భవహరణ మధుర భాషణ
నివహా శైలధరశత్రు నిచయవి ఫాలా

ఇది మూడవ గర్భితకందము -

నవకమలనేత్ర పాలిత
సవనా నీలాభ్రదేహ సజ్జనపాలా
భవహరణ మధుర భాషణ
నివహా శైలధరశత్రు నిచయవిఫాలా