Thursday, February 28, 2019

నౌషాద్‌


నౌషాద్‌



సాహితీమిత్రులారా!

చాలా ఏళ్ళ కిందట నేనెరిగిన ఒక అయోమయపు పెద్దాయనకు నేను చెప్పినదాకా మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనేవాడొకడు ఉంటాడని తెలియదు. ఆయన ఎన్నో ఏళ్ళుగా పాటలు విని ఆనందించేవాడు కాని అవన్నీ సుశీలా, ఘంటసాలా తదితరులంతా తమంతట తాముగా “అనుకుని” పాడుతున్న పాటలనుకునేవాట్ట. తరవాతి తరాల శ్రోతలకు మాత్రం వివిధ్‌ భారతి ప్రసారాల ధర్మమా అని ప్రతి సినిమా పాటకూ రచయిత ఎవరో, సంగీత దర్శకుడెవరో తెలుసుకునే అవకాశం కలిగింది. అంతకు ముందు రేడియో సిలోన్‌ ద్వారా పాటలు పాప్యులర్‌ అయాయి కాని ఈ వివరాలు తెలిసేవి కావు. పేర్లు తెలియడంతో బాటు పాటలను రూపొందించేవారి గురించిన సమాచారం కూడా అందుబాటులోకి వచ్చింది. ఉత్తమ సినీ సంగీతదర్శకుడికి సంగీతాన్ని గురించి కేవలం శ్రవ్యపరమైన అవగాహన ఉండడమే కాక సంగీతం దృశ్యపరంగా, భావపరంగా, ప్రేక్షకులపై ఎటువంటి ప్రభావం కలిగిస్తుందో కూడా బాగా తెలుస్తుంది. తన సినిమాలకు తానే సంగీతం సమకూర్చుకున్న మేధావి సత్యజిత్‌ రాయ్‌ ఒక సందర్భంలో సినీ సంగీతం గురించి చెపుతూ “నేపథ్య సంగీతం దర్శకుడు తెర మీద వ్యక్తీకరించదలుచుకున్న విషయాన్ని అండర్‌లైన్‌ చెయ్యాలి” అన్నాడు.

మంచి సంగీతదర్శకుడికి (కనీసం ఆనాటి స్వర్ణయుగంలో) తెలియవలసిన ఇంకా అనేక విషయాలున్నాయి. పాటలో కవి చెప్పదలుచుకున్న భావాలూ, కథలోనూ, సన్నివేశంలోనూ ఇమిడిపోయే ట్యూన్‌ నిర్మాణమూ, గాయనీగాయకుల పటిమను వెలికితీసే ప్రతిభా, వివిధ వాయిద్యాల అనుకూలతలూ, మొత్తంమీద వినేవారికి కలగవలిసిన ఆడియో ప్రభావమూ వీటిలో ముఖ్యమైనవి. ఇవికాక ట్యూన్‌ తన కాళ్ళమీద తాను నిలబడగలగాలి. ఉదాత్తత కోల్పోకుండా, చవకబారు అనిపించకుండా, ఆధునికం అనిపిస్తూనే ప్రజాదరణ పొందాలి. సినిమా ఆడినా ఆడకపోయినా పాట కలకాలం నిలవాలి. (నీలిమేఘాలలో పాట తెలియని తెలుగువారుండరు. బావ మరదళ్ళు సినిమా గురించి ఎంతమందికి తెలుసు?)

2006 మే 5వ తేదీన బొంబాయిలో 87 ఏళ్ళ వయసులో కాలం చేసిన నౌషాద్‌ కొన్ని దశాబ్దాలుగా ఎనలేని గౌరవం పొందాడు. అతను మరణించినప్పుడు అతని జీవిత విశేషాలను గురించి వివరంగా రాయని పత్రిక లేదు. ఏ షారుఖ్‌ఖాన్‌ లేదా అమితాభ్‌ బచ్చన్‌ పెంపుడు కుక్కకో జలుబు చేసినప్పుడు మాత్రమే హడావిడి పడిపోయి, అదొక ముఖ్యవార్తలాగా కవర్‌ చేసే బొంబాయి జర్నలిస్టులందరూ ఏనాడో మరుగునపడిపోయిన నౌషాద్‌ గురించి ప్రత్యేకవ్యాసాలు రాశారు. అందుకు కారణమేమిటి? నౌషాద్‌ను హిందీ సినిమా సంగీతానికి ఆదిపురుషుడనలేం. అందరికన్నా ఎక్కువ పాటలను స్వరపరచాడనీ కాదు. డబ్బు సంపాదనపరంగా కాని, పాప్యులారిటీని బట్టిగాని అతనికి అగ్రస్థానం లభించదు. ఇతర సంగీతదర్శకులలో అతనికున్న ప్రత్యేకత ఎటువంటిది? నౌషాద్‌ జీవితవిశేషాలను చాలా పత్రికలు ప్రచురించాయి కనక వాటి గురించి మళ్ళీ వివరంగా చెప్పుకో నవసరంలేదేమో. అతని సంగీతపు విశిష్టతను గురించి నా అభిప్రాయాలను పంచుకోవడమే ఈ రచన యొక్క ఉద్దేశం. తక్కిన ప్రొఫెషనల్‌ రంగాలలాగే సినిమా సంగీత దర్శకులు ఒకవంక గత వైభవాన్నీ, తమ పాత పాటలకు లభిస్తున్న ఆదరణనూ అస్వాదిస్తారు కాని వర్తమానకాలంలో చేతినిండా పని ఉన్నవాడిదే విజయం అనే భావన వారిని వెన్నాడుతుంది. 85 ఏళ్ళు దాటాక 2005లో తాజ్‌మహల్‌ అనే సరికొత్త సినిమాకి సంగీతాన్నందించిన నౌషాద్‌ అజయ్‌ చక్రవర్తి, హరిహరన్‌ మొదలైనవారి చేత పాడించిన పాటలు ఆనందాన్నీ, ఆశ్చర్యాన్నీ కూడా కలిగిస్తాయి. మియాఁ మల్హార్‌ మొదలైన జటిలమైన శాస్త్రీయ రాగాల్లో ఆయన మధురమైన బాణీలు కట్టాడు.

మనదేశపు సినిమాల్లోని అనేక అవాస్తవిక అంశాల్లో ముఖ్యమైనది సంగీతం. వాస్తవికతను మరిచిపోగలిగితే మన సినిమాపాటలకు సినిమాలతో సంబంధం లేనటువంటి ఒక ప్రత్యేక అస్తిత్వం ఉంది. అది ప్రజల సంగీతంగా నిత్యజీవితంలో ఒకప్పటి జానపద సంగీతపు స్థానాన్ని ఆక్రమించేసింది. కొన్ని మంచి సినిమాపాటలు సంప్రదాయ సంగీతాన్ని పోలిన “శాశ్వతత్వం” సంపాదించుకున్నాయి. మనదేశపు సంగీతంతో సంపర్కం కోల్పోనంతవరకూ, లేదా పూర్తిగా విడనాడనంతవరకూ ఇటువంటివాటికి త్వరలో మరుగున పడే ప్రమాదం ఉండదు. మన సంగీత సంప్రదాయాలకు ప్రాంతీయ భేదాలున్నాయనేది తెలిసినదే. రకరకాల భారతీయ భాషల్లోని సినిమా పాటలు ఈ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఇవన్నీ పాత బాణీలకు కొత్త సంగీతరూపంలో కొన్ని దశాబ్దాలనుంచీ దేశంలో ప్రతి మూలకూ శ్రోతలకు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు ప్రతి ప్రాంతంలోనూ ముస్లిం మతస్థులూ, హిందీ, ఉర్దూ భాషలు తెలిసినవారూ ఉండడంతో వీటిలో ఎక్కువ ప్రాచుర్యం పొందినవి హిందీ సినిమాపాటలే. దాదాపు 70 ఏళ్ళ క్రితం టాకీలు మొదలైనప్పటి నుంచీ మన దేశపు సినిమాల్లో సంగీతం ప్రధాన ఆకర్షణ అయింది. మొదట కలకత్తా, తరవాత బొంబాయి, మద్రాసు వగైరా నగరాల్లో పెద్ద ఎత్తున మొదలైన చిత్రనిర్మాణంతో బాటు సంగీతదర్శకులూ, గాయనీగాయకులూ, వాద్యకారులూ అందరూ పేరు సంపాదించి, పరిశ్రమలో ప్రధాన అంశం అయిన సంగీతాన్ని అందించసాగారు. వీరిలో నౌషాద్‌ ముఖ్యుడు.

సినిమా సంగీతానికి పితృసమానుడని అనిల్‌ బిశ్వాస్‌ను ఎవరో పొగడబోతే ఆయన వారిస్తూ ఆ బిరుదుకు నిజంగా అర్హుడైనవాడు ఆర్‌. సీ. బోరాల్‌ అనీ, తనను కావాలంటే పినతండ్రిగా అనుకోవచ్చనీ ఛలోక్తి విసిరాడు. 1937 ప్రాంతాల్లో తానొక యువకుడుగా ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి బొంబాయికి వచ్చినప్పటికే అనిల్‌ బిశ్వాస్‌ సంగీత దర్శకుడుగా పనిచేస్తున్నాడని నౌషాద్‌ ఒక సందర్భంలో చెప్పాడు. ప్లేబాక్‌ లేని ఆ రోజుల్లో ఔట్‌డోర్‌ షూటింగ్‌ చూడటానికి నౌషాద్‌ కొత్తగా వెళ్ళినప్పుడు ఏదో సినిమాకి ట్రాలీ షాట్‌ తీస్తున్నారట. అక్కడ అనిల్‌ బిశ్వాస్‌ ఆర్కెస్ర్టాని కండక్ట్‌ చేస్తూ, వెనక్కి నడుస్తూ గోతిలో పడ్డాడట. తబలాలూ, హార్మోనియం అన్నీ మెడల్లో కట్టుకుని వాయిస్తూ అందరూ మైక్‌ రేంజ్‌ని దాటకుండా ఉండవలసి వచ్చేదనీ, ప్లేబాక్‌తో ఆ పరిస్థితులు మారాయనీ నౌషాద్‌ వివరించాడు. అతని శకం అటువంటి రోజుల్లో మొదలైంది. అప్పట్లో బెంగాలీ పద్ధతిలో కలకత్తాలో తయారైన సంగీతానిదే పెద్దపీట. కొంత శాస్త్రీయం, కొంత స్థానిక జానపదం, కొంత రవీంద్ర సంగీత్‌ కలిసిన ట్యూన్లు బోరాల్‌, తిమిర్‌ బరన్‌, పంకజ్‌ మల్లిక్‌ మొదలైన నిష్ణాతుల చేతుల్లో జనాదరణ పొందిన సినిమాపాటలుగా అందరినీ ఆకట్టుకోసాగాయి. వీటిలో ఈడుస్తూ, సాగదీస్తున్నట్టు వినబడే బెంగాలీ గాత్రధోరణిని తొలగించినవాడు కె.ఎల్‌.సైగల్‌. తెలుగులో ఘంటసాలలాగా తానున్నంత కాలమూ పోటీ అనేది లేకుండా సాగిన అతని జైత్రయాత్ర అపూర్వమైనది. అప్పట్లో బొంబాయిలో కొందరు పంజాబీ, ఉత్తరాది శైలిలో ట్యూన్లు చెయ్యగలిగిన సంగీత దర్శకులుండేవారు కాని సైగల్‌తో సరితూగగలిగిన గాయకులు లేరు. ఒకప్పుడు హిందీ సినిమా గాయకుల్లో మకుటంలేని మహారాజుగా వెలిగినవాడతను.

యువకుడుగా నౌషాద్‌

కె.ఎల్‌.సైగల్‌ బొంబాయికి తన నివాసం మార్చుకున్నాక 1946లో షాజహాన్‌ చిత్రంలో నటించాడు. దానికి సంగీత దర్శకుడు నౌషాద్‌. అప్పటికే నడివయస్సు పోకడలతో, అనారోగ్యంతో కనిపించే సైగల్‌ ఆ సినిమాలో ఒక కవి పాత్రలో కనిపిస్తాడు. అతని ప్రేమ సఫలం కూడా కాదు. అయినా ఈ నాటికీ ఆ సినిమాలో చెప్పకోదగినవల్లా సైగల్‌ పాటలే. కుర్రతనంలో నౌషాద్‌ బొంబాయి చేరినప్పటికే సైగల్‌ చాలా పెద్ద స్టార్‌. నేను విన్న ఒక ఇంటర్‌వ్యూలో ఏదో సందర్భంలో మొదటిసారిగా తనకు బట్టతలతో కనిపించిన సైగల్‌ను గుర్తించలేకపోయానని నౌషాద్‌ చెప్పాడు. తన పేరు విని విస్తుపోయిన నౌషాద్‌ను చూసిన సైగల్‌ నవ్వి “సినిమాల్లో నువ్వు చూసేది నా విగ్గు నాయనా” అన్నాట్ట. తరవాత షాజహాన్‌ చిత్రం రికార్డింగ్‌కి తాగి వచ్చిన సైగల్‌తో నౌషాద్‌కు నానా ఇబ్బందులూ కలిగాయట. పైగా పాట బాగా రావటానికి సైగల్‌ తన డ్రైవర్‌ను పిలిచి “కాలీ పాంచ్‌” పట్టుకురమ్మన్నాడట. హిందూస్తానీ సంగీతంలో “కాలీ పాంచ్‌” అంటే ఆరున్నర శ్రుతి. సైగల్‌ భాషలో అది “మందు” సీసాకు ముద్దుపేరు. ఆ ప్రయత్నాన్ని వారిస్తూ నౌషాద్‌ ఆ మర్నాడు తాగకుండా రమ్మని సైగల్‌ను బతిమాలుకున్నాట్ట. మైకం లేకుండా పాడిన తన పాటలన్నీ బాగా వచ్చాయని గమనించిన సైగల్‌ నౌషాద్‌తో “నీవంటి యోగ్యుడు నాకు మునుపే పరిచయమై ఉంటే బావుండేది” అన్నాట్ట. ఆ సినిమాలో రూహీ మేరే సప్నోంకీ రానీ అనే పాటలో చివరి పంక్తి సైగల్‌తో పాడతానని కోరిన అప్పటి యువగాయకుడు రఫీ గొంతు కూడా ఆ పాటలో వినిపిస్తుంది. అందులో (సింధు) భైరవిలో సైగల్‌ పాడిన జబ్‌ దిల్‌ హీ టూట్‌గయా అనే పాట సైగల్‌కు ఎంత ఇష్టమంటే ఆయన చివరి కోరిక ప్రకారం అంత్యక్రియల సందర్భంలో నౌషాద్‌ తన ఆర్కెస్ర్టా చేత ఆ ట్యూన్‌ వాయింపించాడట. అస్తమిస్తున్న సైగల్‌ తేజం, ఉదయిస్తున్న నౌషాద్‌ ప్రతిభా కలిసిన అద్భుత సమ్మేళనాన్ని షాజహాన్‌ పాటల్లో మనం చూడవచ్చు.

షాజహాన్‌ చిత్రంలో సైగల్‌

1919లో లక్నోలో జన్మించిన నౌషాద్‌ అలీ కుటుంబంలో సంగీతం ప్రసక్తి ఉండేదికాదు. చిన్నప్పుడు మూకీ సినిమాలకు సందర్భాన్నిబట్టి తెర ఎదుట కూర్చున్న వాద్యబృందం సంగీతం వాయిస్తూంటే అతను ముగ్ధుడై వినేవాడట. హార్మోనియం రిపేర్లతో మొదలైన అతని సంగీతపు పిచ్చి క్రమంగా బలపడటంతో 1937 ప్రాంతాల పద్ధెనిమిదేళ్ళ వయసులో తండ్రిని ఎదిరించి బొంబాయికి పారిపోయి వచ్చేశాడు. అక్కడ కొత్తలో కాలు నిలదొక్కుకునేందుకు అతను చాలా అవస్థలు పడవలసివచ్చింది. ఆ వివరాలన్నీ నౌషాద్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

(http://www.indianmelody.com/naushadarticle1.htm)

పియానిస్టుగానూ, అసిస్టెంట్‌ సంగీతదర్శకుడుగానూ సినిమాల్లో పని మొదలుపెట్టిన నౌషాద్‌కు గురువు వంటివాడు ఖేమ్‌చంద్‌ ప్రకాశ్‌. మహల్‌ చిత్రంలో 1949లో లతా పాడిన ఆయేగా ఆయేగా పాటతో ఈనాటికీ అందరికీ గుర్తున్న ఖేమ్‌చంద్‌ ప్రకాశ్‌ అంతకుముందు కె.ఎల్‌.సైగల్‌ నటించిన తాన్‌సేన్‌ మొదలైన ఎన్నో సినిమాలకు చక్కని సంగీతం అందించాడు. 1950లో తన 43వ ఏటనే చనిపోయిన ఖేమ్‌చంద్‌ ప్రకాశ్‌ సంగీతపు ఛాయలు కొన్ని నౌషాద్‌ పాటల్లో మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు మహల్‌లో లతా పాడిన ముష్కిల్‌ హై బహుత్‌ ముష్కిల్‌ అనే పాట ఆ తరవాత బైజూబావ్‌రా కోసం నౌషాద్‌ చేసిన బచ్‌పన్‌కీ ముహబ్బత్‌కో అనే పాటకు మాతృకలాగా అనిపిస్తుంది.

ఖేమ్‌చంద్‌ ప్రకాశ్‌

సితార్‌ విద్వాంసుడైన రవిశంకర్‌ తన పుస్తకంలో “సినిమా సంగీతమంతా తక్కువ రకమైనది కాదు. అందులో నౌషాద్‌వంటి ప్రతిభావంతులు కొద్దిమంది ఉన్నారు” అని రాశాడు. ముగలే ఆజంలో తాన్‌సేన్‌కు బడే గులామలీ చేత ఖయాల్‌ పద్ధతిలో పాడించడాన్ని మాత్రం తప్పుపట్టాడు. పదహారో శతాబ్దంలో ఖయాల్‌ పద్ధతి ఇంకా మొదలుకాలేదనేది తెలిసిన సంగతే. బైజూ బావ్‌రాలో అమీర్‌ఖాన్‌ చేత పాడించినప్పుడు కూడా అదే పొరపాటు జరిగిందని చెప్పవచ్చు. అందులో పతాక సన్నివేశంలో పోటీకి బైజూకు డి.వి.పలూస్కర్‌, తాన్‌సేన్‌కు అమీర్‌ఖాన్‌ పాడారు. టైట్‌ల్‌ సంగీతానికి కూడా అమీర్‌ఖాన్‌ చేత పూరియా ధనాశ్రీ (పంతువరాళిని పోలినది) రాగంలో పాడించారు. షబాబ్‌లో మళ్ళీ అమీర్‌ఖాన్‌ ముల్తానీ రాగంలో ఒక ఖయాల్‌ పాడాడు. ఇవన్నీ నౌషాద్‌ పెద్ద గాయకులతో చేసిన మంచి ప్రయత్నాలు. ఇదికాక నౌషాద్‌ ఆర్కెస్ర్టాలో ఇమ్రత్‌ఖాన్‌, రయీస్‌ఖాన్‌ వంటి మేటి సితార్‌ విద్వాంసులూ, రామ్‌నారాయణ్‌వంటి సారంగీ నిపుణులూ, శివకుమార్‌ శర్మవంటి ఉత్తమ సంతూర్‌ వాయిద్యకారులూ అనేకసార్లు పాల్గొన్నారు. బడే గులామలీని తాను మొదట సంప్రదించినప్పుడు ఆయన పాడటానికి నిరాకరించాడనీ, ముగలే ఆజం దర్శకుడైన కె. ఆసిఫ్‌ మాత్రం తన మొండిపట్టు వదలలేదనీ నౌషాద్‌ ఒక ఇంటర్‌వ్యూలో చెప్పాడు. “ఇదెక్కడి గొడవయ్యా బాబూ, నేను ఏకంగా పాతిక వేలిమ్మని అడుగుతాను, మీ డైరెక్టర్‌ పారిపోతాడు” అన్నాట్ట ఉస్తాద్‌గారు. అయినా నౌషాద్‌ చెప్పినట్టే జరిగింది. కోరినంతా ఇచ్చి ఆసిఫ్‌ ఆయన చేత పాడించాడు.

ఇతర సంగీత దర్శకులకు నౌషాద్‌ అంటే చాలా గౌరవం. 1950లలో హిందీ సినీ సంగీత దర్శకులందరూ ఎక్కడ కలుసుకున్నా నౌషాద్‌ గురించే చెప్పుకునేవారట. సచిన్‌ దేవ్‌ బర్మన్‌ “మేమంతా ట్యూన్లు ఎలా కట్టాలో నౌషాద్‌ను చూసే నేర్చుకున్నాం” అన్నాడు. బర్మన్‌ ఇంటో పనివాడొకడు అస్తమానమూ నౌషాద్‌ పాటలనే కూనిరాగాలు తీసేవాడట. “ఏరా, నీకు నా పాటలు నచ్చవా?” అని అడిగితే “ఇష్టమే కాని నౌషాద్‌ పాటలు ఇంకా ఎక్కువ ఇష్టం” అనేవాడట. అలాగే తెలుగు కంపోజర్ల మీద నౌషాద్‌ ప్రభావం బాగా ఉండేది. సి.ఆర్‌.సుబ్బరామన్‌ లైలామజ్నూలో ఆర్‌. బాలసరస్వతి చేత పాడించిన ఏల పగాయే అనే పాట సాక్షాత్తూ నౌషాద్‌ హిందీ పాటలాగే ఉంటుంది. అలాగే నౌషాద్‌ స్ఫూర్తితో పెండ్యాల తదితరులు చేసిన పాటలు ఎన్నో ఉన్నాయి. వేదికమీద నౌషాద్‌ ఉన్నప్పుడు ఎమ్మెస్‌ విశ్వనాథన్‌ గౌరవంకొద్దీ అతని పక్కన కూర్చోకుండా నిలబడే ఉండేవాడు. ప్రసిద్ధ మలయాళ సినీ సంగీతదర్శకుడు దేవరాజన్‌, కన్నడంలో విజయభాస్కర్‌ కూడా నౌషాద్‌ ప్రభావానికి గురిఅయినవారే.

నావంటి తెలుగువాడు నౌషాద్‌ పాటలు వింటున్నప్పుడు వాటిలో ఎస్‌. రాజేశ్వరరావుకు ఉండిన అద్భుతమైన కల్పనాశక్తీ, ఘంటసాల సంగీతదర్శకుడుగా కనబరిచిన శాస్త్రీయ సంగీత సౌష్ఠవం, పెండ్యాల పాటల్లోని మృదుత్వమూ, మాస్టర్‌ వేణు ఆర్కెస్ట్‌రైజేషన్‌ అన్నీ కలగలిసినట్టుగా అనిపిస్తుంది. “పాటకు ట్యూన్‌ కట్టడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మాబోటివాళ్ళం ప్రతి అక్షరాన్ని గురించీ, స్వరమూ, గమకాలను గురించీ ఎంతో మథనపడతాం” అని నౌషాద్‌ ఒక ఇంటర్‌వ్యూలో చెప్పాడు. అతని ఏ పాట విన్నా అది తెలుస్తూనే ఉంటుంది.

తనకు ఇరవయ్యేళ్ళు నిండకమునుపే సినిమాల్లోకి దిగిన నౌషాద్‌కు సంగీతంలో అంతటి పరిపక్వత ఎలా సాధ్యమయిందోనని ఆశ్చర్యం వేస్తుంది. అతను హిందూస్తానీ సంగీతాన్నీ, జానపదగీతాలనీ, గజల్‌ మొదలైన అంశాలనీ, పాశ్చాత్య రీతులనూ నిత్యమూ అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. నా లెక్కన కేవలం శాస్త్రీయ రాగాల అందాలమీదనే ఆధారపడి మంచి ట్యూన్లు చెయ్యడం అంత విశేషం అనిపించుకోదు. ఎందుకంటే ఆ సౌందర్యాన్ని విద్వాంసులు మరింత బాగా వినిపించగలరు. రాగంలో సామాన్యంగా శాస్త్రీయ విద్వాంసులు తడమని విశేషాలను ఎత్తి చూపగలిగే ప్రజ్ఞ మేధావులైన సినీ సంగీత దర్శకులు కొందరిలో మాత్రమే కనిపిస్తుంది. అలాంటివారిలో నౌషాద్‌ను మించినవారు లేరు. రాగాలూ, జానపదబాణీలూ కూడా సోకని కొన్ని పాటల్లో నౌషాద్‌ గొప్పతనం నాకు మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అమర్‌ సినిమాకు అతను లతా చేత పాడించిన జానేవాలే సే ములాకాత్‌ న హోనే పాయీ అనే విషాదగీతాన్ని వినగానే షూటింగ్‌కని సెట్‌ మీద కొచ్చిన మధుబాల కళ్ళలో నీళ్ళు తిరిగాయట. సామాన్యంగా విషాదభావాన్ని ప్రతిఫలించని యమన్‌ (కల్యాణి) రాగంలోని ఈ ట్యూన్‌ ఎంతో గంభీరంగా పదాల భావాన్ని వ్యక్తీకరించే అద్భుత సంగీత రచన.

సినీ ఆర్కెస్ట్రా రూపురేఖల్లోనూ, రికార్డింగ్‌, నొటేషన్‌ పద్ధతిలోనూ నౌషాద్‌ ఆ రోజుల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాడు. ఆన్‌ సినిమాకు తొలిసారిగా 100 వాయిద్యాలు ఉపయోగించాడు. పాశ్చాత్యసంగీతాన్ని పరిశీలించి అనేక కొత్తపద్ధతులని ప్రవేశపెట్టాడు. 1950లలో అతను గాత్రం లేకుండా ఉత్త వాయిద్యాలతో కంపోజ్‌ చేసిన ఒక 78 ఆర్పీఎం రికార్డు మా ఇంటో ఉండేది. అందులో దులారీ సినిమాలోది ఒకటీ, స్నేక్‌ డాన్స్‌ అనే మరొకటీ (ఇది రేడియో సిలోన్‌ ఆప్‌హీ కే గీత్‌ కార్యక్రమానికి సిగ్నేచర్‌ ట్యూన్‌గా ఈనాటికీ రోజూ వినిపిస్తుంది) గొప్ప ట్యూన్లుండేవి. ఆర్కెస్ర్టా, ట్యూన్‌ వగైరాల గురించిన అతని విస్తృత అవగాహన వీటిలో కనిపిస్తుంది. అంతేకాక నౌషాద్‌ అనేకమంది గాయనీ గాయకులను సినీరంగానికి పరిచయం చేశాడు. నౌషాద్‌ పాటలద్వారా పైకొచ్చిన వారిలో రఫీ, లతాలే కాక నూర్జహాన్‌, సురైయా, షంషాద్‌ బేగం, మహేంద్రకపూర్‌ తదితరులున్నారు. ఒక పాటల పోటీలో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన నౌషాద్‌, అందులో బహుమతి గెలుచుకున్న గాయకుడికి అవకాశమిస్తానని చెప్పడంతో, అన్నమాట ప్రకారం మహేంద్రకపూర్‌ చేత తొలిసారిగా సోహినీ మహివాల్‌ చిత్రంలో పాడించాడు.


నౌషాద్‌, 1982లో భారత్‌కు వచ్చిన నూర్జహాన్‌


నౌషాద్‌, సి.రామచంద్ర తన అసిస్టెంట్‌ మహమ్మద్‌ షఫీతో నౌషాద్‌


పంచరత్నాలు మన్నాడే, రఫీ, లతా, ముకేశ్‌, తలత్‌ మహమూద్‌

1947లో సైగల్‌ మరణం తరవాత ఏర్పడ్డ ఖాళీని వెంటనే భర్తీ చెయ్యగలిగిన గాయకులెవరూ అప్పట్లో లేరు. సైగల్‌ను పోలిన శైలి కారణంగా ముకేశ్‌కు ఆదరణ ఉండేది. ముకేశ్‌కు తారస్థాయిలో అపస్వరాలు పలుకుతాయని నౌషాద్‌కు కొన్ని అభ్యంతరాలుండేవి. అందుకనే అందాజ్‌, మేలా మొదలైన సినిమాల్లో ముకేశ్‌ చేత అతను మంద్ర స్థాయిలో పాడించాడు. ఒక్క “తూ కహే అగర్‌” పాట కోసమని ముకేశ్‌ నౌషాద్‌ ఇంటికి వచ్చి 23 సార్లు రిహార్సల్‌ చేశాడట. అప్పటి కమిట్‌మెంట్‌ అటువంటిది.


ముకేశ్‌, నౌషాద్‌

అలాగే బాబుల్‌ మొదలైన సినిమాల్లో తలత్‌ మహమూద్‌ పాడాడు. అతనికి రికార్డింగ్‌లో కూడా సిగరెట్‌ తాగే అలవాటుండేదట. నౌషాద్‌ సమక్షంలో తానలా అమర్యాదగా ప్రవర్తించి ఉండకూడదని తలత్‌ తరవాతి రోజుల్లో ఒక ఇంటర్వ్యూలో అన్నాడు కూడా. తలత్‌ అంతగా పైకి రాకపోవడానికి ముఖ్యకారణం దిలీప్‌కుమార్‌వంటి హీరోలంతా రఫీని అభిమానించడమే అనిపిస్తుంది. ఎందుకంటే నౌషాద్‌ అతని చేత సాథీ, ఆద్మీ మొదలైన సినిమాలకు పాడించాడు కాని హీరోలు కాదనడంతో ఆ ప్రయత్నాలు విజయవంతం కాలేదు. నౌషాద్‌ దర్శకత్వంలో మన్నాడే, హేమంత్‌ కుమార్‌ రెండు మూడు పాటలు పాడారు. 1975లో సునెహరా సన్సార్‌ అనే సినిమాలో కిశోర్‌కుమార్‌, ఆశా చేత నౌషాద్‌ ఒక పాట పాడించాడుకాని అది రిలీజ్‌ కాలేదు. అలాగే గీతాదత్‌ కూడా అతని పాటలేవీ పాడలేదు. లతా కాక ఆశా భోన్స్లే, సుమన్‌ కల్యాణ్‌పూర్‌ తదితరులు చాలా పాటలే పాడారు. తక్కినవన్నీ మహమ్మద్‌ రఫీవే.



లతా మంగేశ్కర్‌తో ఆశా భోన్స్లేతో


రఫీతో

రఫీతో నౌషాద్‌ సంబంధం చాలా గాఢమైనది. తొలి రోజుల్లో కంపోజింగ్‌ పనిలో ఉన్న నౌషాద్‌ను ఏదో సిఫార్సు ఉత్తరం కోసమని కలవడానికి వచ్చిన రఫీ చాలా వినయంగా నిలబడ్డాట్ట. ఉత్తరం ఇచ్చేసి రిహార్సల్‌లో నిమగ్నుడై చాలా సేపటి తరవాత వెనక్కి తిరిగి చూస్తే రఫీ ఇంకా నిలుచునే ఉన్నాట్ట. ఏమిటని అడిగితే వెళ్ళడానికి బస్సు డబ్బులు కూడా లేవని సిగ్గుపడుతూ చెప్పాట్ట. ఆ విధంగా మొదట్లోనే సహాయపడిన నౌషాద్‌ రఫీ జీవితాన్ని సంగీతపరంగా తీర్చిదిద్దాడనే చెప్పవచ్చు. తారస్థాయిలో అవలీలగా పలికే అతని కంఠాన్ని నౌషాద్‌ అనేక సందర్భాల్లో చక్కగా ఉపయోగించుకున్నాడు. దీదార్‌లో మేరీ కహానీ, బైజూబావ్‌రాలో ఇన్సాన్‌ బనో, దునియా కే రఖ్‌వాలే, షబాబ్‌లో యెహీ అర్‌మాన్‌ లేకర్‌, ముగలే ఆజంలో జిందాబాద్‌ మొదలైన పాటల్లో ఈ విషయం గమనించవచ్చు.

ఇంటర్‌వ్యూల్లో నౌషాద్‌ అస్తమానమూ భారతీయ శాస్త్రీయ రాగాల విశిష్టత గురించి చెపుతూ ఉండేవాడు. తొలిరోజుల్లో సినిమా సంగీతమంతా “మట్లు” ఉపయోగించే పద్ధతిలోనే ఉండేది. శాస్త్రీయ సంగీతపు రాగాలూ వగైరాలన్నిటినీ పాటలకు పనికొచ్చేవిగా పరిగణించే అలవాటుండేది కాదు. బంగారపు గనివంటి సంప్రదాయ సంగీతాన్ని తిన్నగానూ, సమర్థవంతంగానూ సినిమా పాటలకు వాడుకోవచ్చునని రుజువు చేసినది నౌషాదే. ఇందుకు ప్రధానమైన ఉదాహరణలు బైజూబావ్‌రా మొదలైన సినిమాల్లో చూడవచ్చు. గుజరీ తోడీ (ఇన్సాన్‌ బనో), భైరవ్‌ లేదా మాయామాళవగౌళ (మొహే భూల్‌గయే సావరియా), మాల్‌కౌఁస్‌ లేదా హిందోళం (మన్‌తర్‌పత్‌), దేసీ (బైజూ, తాన్‌సేన్‌ల పోటీ పాట), పిలూ (ఝూలే మేఁ పవన్‌ కే) మొదలైన పాటలన్నీ శుద్ధ శాస్త్రీయ రాగాలతో తయారైన పాప్యులర్‌ సినిమా పాటలు. ఇటువంటి ప్రయోగం అంతకు మునుపెన్నడూ జరగలేదని లతావంటివారే అన్నారు. కోహినూర్‌లో మధుబన్‌ మేఁ రాధికా హమీర్‌ రాగంలోని పాట. ప్రతి రాగంలోనూ స్వతహాగా కొంత డ్రామెటిక్‌ ఎలిమెంట్‌ ఉంటుంది. దాన్ని నౌషాద్‌ బాగా వినియోగించుకున్నాడు. ఆ తరవాత అందరూ అదే కాస్తో కూస్తో మొదలుపెట్టారు.

ఇతర విమర్శకులు అతని పాటల్లోని జానపద సంగీతపు అందాలను వర్ణిస్తారు. దీనికి మంచి ఉదాహరణలు మదర్‌ ఇండియా, గంగా జమునా సినిమాలు. విశేష జనాదరణ పొందిన ఆ పాటల్లోని విరుపులూ, వాద్యవిశేషాలూ సినిమాల విజయానికి ఎంతో దోహదపడ్డాయి. అంతేకాక మరుగుపడిపోతున్న కొన్ని జానపద సంగీత శైలులకి జీవం కూడా పోశాయి. శాస్త్రీయ, జానపద సంగీతాలు నౌషాద్‌ విజయరథానికి రెండు చక్రాల్లాంటివి. నౌషాద్‌ చేసిన ఇతర సాంఘిక సినిమా పాటల్లో కూడా ఇవి రెండూ ప్రధానమైన అంశాలే కాని వీటిని మించిన అద్భుత సౌందర్యమేదో వాటిలో కనిపిస్తుంది. ఎందుకంటే వీటిని ఇతర ప్రసిద్ధ సంగీతదర్శకులందరిలోనూ కొంతకొంతగా మనం చూడవచ్చు. నౌషాద్‌కు సమకాలికులై, అతనికన్నా వయసులో పెద్దవారైన ఎస్‌.డి. బర్మన్‌, రోషన్‌, సి. రామచంద్ర తదితరులందరూ శాస్త్రీయ, జానపద రీతుల్లో నిష్ణాతులే. అయితే నా లెక్కన నౌషాద్‌ ట్యూన్లలో వారందరినీ మించిన నిర్మాణ సౌందర్యం ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్‌ కనిపిస్తుంది. పల్లవి మొదలై, ఇంటర్లూడ్స్‌ తరవాత చరణం, అది తిరిగే మలుపులూ, మళ్ళీ పల్లవికి చేరుకోవడం, అంతా తాజ్‌మహల్‌ గోపురపు ఆకారంలాగా అద్వితీయంగా కొనసాగుతుంది. ఏనాడో ఆన్‌లో అతను లతాచేత పాడించిన ఆజ్‌ మేరే మన్‌మేఁ సఖీ పాట ఎన్ని అందమైన సొంపులతో తిరుగుతుందో చూడవచ్చు. ఇవన్నీ పాత సంప్రదాయాలను యాంత్రికంగా అనుసరించడంవల్ల సాధ్యపడినవి కావు. అనితరసాధ్యమైన నౌషాద్‌ జీనియస్‌ పనిచెయ్యడమే ఇందులో కనిపిస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.


నౌషాద్‌తో రాగాల డజన్‌

1. బర్మన్‌, 2. మదన్‌మోహన్‌, 3. రామచంద్ర, 4. జైకిషన్‌, 5. గులాం హైదర్‌, 6. ఖయ్యాం, 7. శంకర్‌, 8. రోషన్‌, 9. గులాం మహమ్మద్‌, 10. అనిల్‌ బిశ్వాస్‌, 11. నయ్యర్‌, 12. హేమంత్‌ కుమార్‌

సినీ సంగీత దర్శకుల్లో పదాలను తాళం మీద అందంగా పేర్చడంలో బర్మన్‌ ఘటికుడు. మన దేశపు ఈశాన్య ప్రాంతాల సంగీతం అతనికి కరతలామలకం. కవ్వాలీలకూ, మాటల అర్థాన్ని ప్రస్ఫుటంగా వినిపించడానికీ రోషన్‌ను మించినవారు లేరు. ప్రజల టేస్ట్‌ శంకర్‌ జైకిషన్‌లకు తప్ప ఎవరికీ తెలియదని ఒకప్పుడు అనిపించేది. చిటికలేసే హుషారు పాటలకు నయ్యర్‌ది పెట్టింది పేరు. నాజూకులూ, వయ్యారాలూ సి. రామచంద్ర సొంతం. గజల్‌ కింగ్‌ మదన్‌మోహన్‌ కూడా సామాన్యుడు కాడు. సలిల్‌ చౌదరి, హేమంత్‌ కుమార్‌ తదితరులు బెంగాలీ సంగీతపు అందాలను గుప్పించగలరు. ఇవన్నీ వేటికవిగా గొప్ప విషయాలే. ఇలా ఎందరో గొప్పవారున్నప్పటికీ పాటలో ఒక రకమైన పరిపూర్ణతను నౌషాద్‌ సాధించినట్టుగా మాత్రం ఎవరూ సాధించలేదు.

ప్రతి పాటనూ పాలరాతి శిల్పంలా మలిచే నౌషాద్‌చేత కొన్ని సందర్భాలకు తగినట్టుగా ఆషామాషీ ట్యూన్లు కట్టించడం కష్టం అయి ఉండవచ్చు. అందుకనే ఇతరుల పాప్యులారిటీకి అతని మేధస్సు ఆటంకం కాలేదు. సినిమాల్లోని వైవిధ్యాన్ని బట్టి అందరికీ అవకాశాలు కలిగాయి. అల్‌బేలా (నాటకాలరాయుడు) వంటి సినిమాలకు రామచంద్రదే తగిన సంగీతం. పైగా అందరికీ అందరితోనూ పొసగదు. ఉదాహరణకు గురుదత్‌ తన సినిమాలోని పాటలన్నీ అకస్మాత్తుగా మొదలవాలని అనేవాట్ట. పాట మొదలవబోతున్నట్టు నేపథ్యసంగీతం ద్వారా ప్రేక్షకులకు ముందుగా తెలియనివ్వకూడదని అతని ఉద్దేశం. బర్మన్‌, నయ్యర్‌ తదితరులంతా అతని సినిమాల్లో ఆ ప్రకారమే చేశారు. నౌషాద్‌ అటువంటి షరతులకు తల ఒగ్గి ఉంటాడా అనేది చాలా అనుమానాస్పదం. బాపూ, ముళ్ళపూడి వెంకటరమణలకు రాజేశ్వరరావు సంగీతమంటే చాలా ఇష్టం. అయినా తమ సినిమాలకు అతన్ని ఉపయోగించుకోలేదు. ఈ విషయం గురించి ఒకసారి నేనడిగితే కె.వి.మహాదేవన్‌ తమతో బాగా సహకరిస్తాడని బాపూ అన్నారు. తమ సంగీతం గురించి పట్టింపులున్న కొందరు సీనియర్‌ కంపోజర్లకు స్వయంగా స్టార్‌ హోదా ఉంటుంది. ఇతరుల నిబంధనలకు వారు సులువుగా ఒప్పుకోరు. నౌషాద్‌ సినిమాల్లో అతనే ముందుంటాడు; పాటలు రాసిన షకీల్‌ బదాయునీది ఎప్పుడూ ద్వితీయ స్థానమే. కథలోని సందర్భాన్ని అనుసరించి, ఒక్క మేరే మెహబూబ్‌ టైట్‌ల్‌ సాంగ్‌లో మాత్రమే నౌషాద్‌ ట్యూన్‌ కవి రచనకు అడ్డురాకుండా కాస్త ఒదిగి ఉంటుంది. సాహిర్‌ లూధియానవీ వంటి మహాకవి రచనలు ధగధగా మెరిసేది మాత్రం రోషన్‌ సంగీత దర్శకత్వంలోనే.

స్వరరచయితగా నౌషాద్‌ “సంపన్నుడు”; కొద్దిలో కిట్టించే కక్కూర్తి రకం కాదు. జవాఁ హై మొహబ్బత్‌ (నూర్జహాన్‌ అన్‌మోల్‌ ఘడీ) మొదలైన పాటల్లో నాలుగు చరణాలకూ నాలుగు వేరువేరు ట్యూన్లు. ఏ పాటలోనైనా మొదటి చరణానికి వాడిన ఇంటర్లూడ్‌ రెండోదానికి మళ్ళీ వాడడు. ప్రతి ఇంటర్లూడ్‌కూ ఒక ఖచ్చితమైన “ఉద్దేశమూ”, స్వరూపమూ ఉంటుంది. చాలామంది కంపోజర్లు స్వరాలను పొదుపుగా వాడుకుంటారు. ఏ రాజ్‌కపూర్‌ సినిమాకో అయితే అద్భుతమైన సంగీతం అందించగల శంకర్‌ జైకిషన్‌వంటివారు ఇతర సినిమాల్లో కేవలం రెండు మూడు స్వరాలతోనే సరిపెట్టిన సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి. ప్రొఫెసర్‌ సినిమాలో వారు స్వరపరిచిన కోయీ ఆయేగా ఆయేగా అనే పాటనూ, దాని చరణాలనూ (రిరిగ సాసా రిరిగ సాసా రిరిగ సాసా ససాసా ఇదే రెండుసార్లు వింటాం. దాంతో చరణం పూర్తవుతుంది!) వింటే ప్రజాదరణ పొందటానికి సంగీత దర్శకులు పెద్దగా శ్రమపడనవసరం లేదని మనకర్థం అవుతుంది. నౌషాద్‌లో ఇలాంటి రాజీ ధోరణి కనిపించనే కనిపించదు. అతని బలహీనతల్లా చవకబారు పాటలు కట్టలేకపోవటమేనేమో.

తరవాతి కాలంలో ఎవరో విలేకరి అతనితో “ఈ రోజుల్లో మీ సత్తా అయిపోయిందనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది” అంటే నౌషాద్‌ కోపంగా “సత్తా అనేది అయిపోవడానికి దుకాణంలో సరుకనుకున్నారా? పాప్యులారిటీ అనేది కాలాన్ని బట్టీ, టేస్ట్‌ను బట్టీ మారుతుంది. మాకు ప్రేరణ సినిమా ద్వారానే కలుగుతుంది. కాస్త ఓపిక పట్టండి. ప్రస్తుతం నేను దిలీప్‌కుమార్‌ స్థానంలో రాజేంద్రకుమార్‌ను ఊహించుకోవటానికి ప్రయత్నిస్తున్నాను” అన్నాట్ట. సినిమాల మ్యూజిక్‌ డైరెక్టరంటే ఎవడో బేండ్‌ మాస్టరనే అభిప్రాయం ఉన్నవాళ్ళని అతను విమర్శించేవాడు. మొత్తంమీద తనది ఒకే మూస ధోరణి కాదని నిరూపించడానికి నౌషాద్‌ సాథీ సినిమాకు విభిన్నమైన పద్ధతిలో కంపోజ్‌ చేశాడు. తనకు నచ్చిన శాస్త్రీయ, జానపద సంగీతాలని వాడనే లేదు. అందులో మృదంగం దరువుతో ముకేశ్‌, సుమన్‌ కల్యాణ్‌పూర్‌లు పాడిన మేరా ప్యార్‌భీ తూహై అనే పాట చాలా జనాదరణ పొందింది. అందులోనే లతా పాడిన మేరే జీవన్‌ సాథీ అనే పాటలో అతి సంక్లిష్టమైన వెస్టర్న్‌ ఇంటర్లూడ్స్‌ ఉపయోగించాడు.

ట్యూన్లలో రాగాల చేత “అందంగా చాకిరీ చేయించుకోవడం” నౌషాద్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. వినేవారికి అందులో ఏ రాగం వాడబడిందో, ఆ రాగపు లక్షణాలేమిటో తెలియకపోయినా విని ఆనందిస్తారు. శాస్త్రీయ సంగీతపు అసలు లక్షణం ఇదే; రాగాలు అనగానే బోరు కొడుతుందేమో అనిపిస్తుంది కాని అవన్నీ వినడానికి అందమైనవే. విద్వాంసులు పాడుతున్నప్పుడు మామూలు శ్రోతలకు “చెట్లు అడ్డంగా ఉండడంవల్ల అడవిని చూడలేకపోయిన” పరిస్థితి కలుగుతుందేమో కాని రాగాలను విని ఆనందించడానికి పాండిత్యం అవసరం కాదు. షబాబ్‌లో లతా జోగన్‌ బన్‌జాఊఁగీ తిలక్‌ కామోద్‌ రాగంలో పాడినా, మర్‌గయే హమ్‌ మిశ్ర తిలంగ్‌ రాగంలో పాడినా, ముగలే ఆజంలో బేకస్‌ పే కరమ్‌ కేదార్‌ రాగంలో పాడినా, రఫీ సుహానీరాత్‌ పహాడీ రాగంలో పాడినా వినేవారికి మాత్రం ఏదో మంచిపాట వింటున్నట్టే ఉంటుంది. నౌషాద్‌ పిలూ రాగంలో నదియా ధీరే బహో అనే హిందూస్తానీ ఠుమ్రీని అవే మాటలతో ఉడన్‌ ఖటోలా సినిమాలో జానపద శైలిలో పడవపాటగా ఉపయోగించాడు. అదే రాగాన్ని షబాబ్‌లో చందన్‌కా పల్‌నా అనే జోలపాటగానూ, గంగా జమునాలో నామానూఁ అనే జానపదగీతంగానూ కూడా అద్భుతంగా పలికించిన ఘనుడు నౌషాద్‌. ముగలే ఆజంలోని మోహే పన్‌ఘట్‌పే అనే పాట పిలూ రాగమని చాలామంది పొరబడతారు కాని నిజానికి అది (మధ్యమం నుంచి) గారా అనే రాగం. అలాగే నౌషాద్‌ (సింధు) భైరవి అందాలను లెక్కలేనన్నిసార్లు వాడుకున్నాడు. జానపద రీతిలో తూ గంగాకీ మౌజ్‌ (లతా, రఫీ బైజూ బావ్‌రా), భక్తిపరంగా ఇన్సాఫ్‌ కా మందిర్‌ (రఫీ అమర్‌), గజల్‌ శైలిలో తీర్‌ ఖాతే జాయేంగే (లతా దీవానా), ఆనందగీతంగా తుమ్హారే సంగ్‌ మైఁ భీ చలూంగీ (లతా సోహినీ మహివాల్‌), రొమాంటిక్‌ పద్ధతిలో జాదూగర్‌ కాతిల్‌ (ఆశా కోహినూర్‌) ఇలా ఎన్నో సందర్భాల్లో ఆ రాగాన్ని మరచిపోలేని విధంగా ఉపయోగించాడు. లలిత సంగీతానికి అంతగా పనికిరావనిపించే మార్‌వా (పాయలియా బావ్‌రీ లతా సాజ్‌ ఔర్‌ ఆవాజ్‌), శహానా కానడా (మహలోఁమేఁ రెహెనేవాలే రఫీ, బృందం, షబాబ్‌) మొదలైన రాగాల్లో కూడా పాటలు స్వరపరిచాడు.

వ్యక్తిగత జీవితంలో నౌషాద్‌ది పిల్లాపాపలతో పెద్ద కుటుంబమే. ఆయనకు ఇబ్బంది కలగకుండా ఆయన భార్యే ఇంటి వ్యవహారాలన్నీ చక్కబెట్టేదట. అతను మాట్లాడే పద్ధతి అంతా పాతకాలపు లక్నో మర్యాదలతో ఎంతో చక్కగా ఉండేది. బొంబాయిలో మేమంతా ప్రసిద్ధ వేణు విద్వాంసుడు ఏల్చూరి విజయరాఘవరావుగారి ప్రేరణతో 1979లో రాజేశ్వరరావు నైట్‌ ఏర్పాటు చేసినప్పుడు నౌషాద్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నాడు. సంగీత శిఖరాలనదగిన ఆ ముగ్గురితో షణ్ముఖానందహాలు వేదిక వెలిగినట్టనిపించింది. నౌషాద్‌ ఆప్యాయంగా “నా పాతమిత్రుడు రాజేశ్వరరావు” అంటూ ఆయనను చాలా ప్రశంసించాడు. ఒకరు ఉర్దూలోనూ, మరొకరు తెలుగులోనూ మాత్రమే మాట్లాడగలిగినా వారిద్దరి మాతృభాషా సంగీతమే అనిపించింది.

సంగీతం విషయంలో నౌషాద్‌కు ఆత్మగౌరవం ఎక్కువ. అతనింటో మ్యూజిక్‌ రూమును దేవాలయంలాగా పరిగణించేవాడట. పాడేది ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ట్యూన్‌ విని నేర్చుకోవడానికి ఆ గదికి వచ్చి తీరవలసిందే. నౌషాద్‌కు మొదటి నుంచీ అనారోగ్యమంటే భయం ఉండడంతో నిత్యమూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకున్నాడు. ఒకప్పుడు వేటలోనూ, చేపలు పట్టడంలోనూ ఆసక్తి ఉండేది. తాను స్వయంగా కొంత కవిత్వం రాయగలడు కనక సంభాషణల్లోనూ, ఉపన్యాసాల్లోనూ తన పంక్తులు కొన్ని ఉదహరించేవాడు. కొన్ని సినిమాలకు కథా రచనలోనూ, కొన్ని సినిమాల నిర్మాణంలోనూ పాల్గొన్నాడు. అతను ఏనాడూ ఒకటి రెండు తప్ప ఏకకాలంలో డజన్ల కొద్దీ సినిమాలకు పని చెయ్యడానికి అంగీకరించలేదు. ప్రతి పాటనూ శ్రద్ధగా మలిచి తయారు చేసినవాడతను. పాటలే కాక రీరికార్డింగ్‌లో నేపథ్యసంగీతం కూడా ఎంతో చక్కగా స్వరపరిచేవాడు. గులాం మహమ్మద్‌ పాకీజాకు పాటలన్నీ కంపోజ్‌ చేసి, సగం పని ముగించి చనిపోయాక నౌషాద్‌ సమకూర్చిన నేపథ్యసంగీతం ఎంతో హుందాగా, ప్రస్ఫుటంగా వినిపించింది. సినీ సంగీత రంగంలో నౌషాద్‌ ఉస్తాదోంకే ఉస్తాద్‌.

సుమారు పదేళ్ళకిందట బొంబాయిలో టీవీలో ఆధునిక సంగీతం గురించిన ఒక చర్చ ప్రసారమైంది. అందులో పాత పాటలని సమర్థించిన నౌషాద్‌తో బాటుగా కొత్తగా వినిపిస్తున్న ఎమ్‌టీవీ శైలిలో తప్పులేదని వాదించిన ఒక పాప్‌ గాయని కూడా పాల్గొంది. చాలాసేపు అందరి వాదనా వింటూ మాట్లాడకుండా కూర్చున్న ఒక బట్టతలాయన చివరకు నోరువిప్పాడు. అతనికొక కేసెట్‌ కంపెనీ ఉందట. కొత్త పాటలు అమ్ముడుపోక నష్టం వచ్చినప్పుడల్లా వాళ్ళు పాత పాటల్ని రిలీజ్‌ చేసి, అమ్ముకుని నష్టాలని పూడ్చుకుంటూ ఉంటారట. దాంతో చర్చకు తెరపడింది.

(ఈ వ్యాసంలో పేర్కొన్న నౌషాద్‌ పాటలు చాలా మటుకు http://www.musicindiaonline.com/ అనే వెబ్‌సైట్లో దొరుకుతాయి)
---------------------------------------------------------
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, February 27, 2019

తేలిక తెలుగు


తేలిక తెలుగు




సాహితీమిత్రులారా!

“ప్రయోగం పేరిట పవిత్రమైన మన భాషని అభాసు చేస్తావుటయ్యా, ఱావూ!”

                                                                                                – మరొక శంకరశాస్త్రి.

1. తేలిక తెలుగు అవసరం ఏమిటి?
కేలిఫోర్నియా విశ్వవిద్యాలయపు డేవిస్ కేంద్రంలో, ఇరవై ఒకటవ శతాబ్దపు మొదటి దశకంలో, మొదటి సంవత్సరం విద్యార్థులకి ఆరేళ్లపాటు తెలుగు నేర్పేను. ఆ సందర్భంలో తెలుగు రెండవ భాషగా నేర్పడంలో ఉన్న కష్టాలు కొన్ని అర్థం అయాయి. ఈ కష్టాలనుండి గట్టెక్కడానికి రకరకాల చిటకాలు వాడవలసి వచ్చింది. పబ్బం గడుపుకోడానికి వాడిన ఈ చిటకాలు అన్నీ తెలుగువాళ్లు అందరూ ఆమోదిస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. కాని అప్పటి ఆలోచనలని క్రమబద్ధం చేసి ఎక్కడో ఒకచోట రాసి పెట్టాలనే కోరికే ఈ వ్యాసానికి ప్రేరణ.

తరగతిలో సగటున 15 నుండి 20 వరకు విద్యార్థులు నమోదు అయేవారు. వీరి వయస్సు ఇటూ అటూగా 18 ఏళ్లు. వీరిలో భారతీయ సంతతి ఇద్దరో ముగ్గురో ఉంటే, అందులో తెలుగు సంతతి ఒకటో అరో ఉండేవారు. ఈ భారతీయ సంతతిని మినహాయిస్తే, ఈ తరగతిలో ఉన్న విద్యార్థులకి తెలుగు భాష గురించి ఏమీ తెలియదు. ఈ భాషని ఎప్పుడూ విని ఉండలేదు. అంటే వీరికి తెలుగుతో పరిచయం పరమ పూజ్యం. “మీరు తెలుగు తరగతిలో ఎందుకు నమోదు అయేరు?” అని అడిగితే “కేవలం కుతూహలం,” అని కొందరు, “భాషాశాస్త్రం అధ్యయనం చెయ్యాలని ఉంది, అందుకని,” అని మరి కొందరు చెప్పేవారు.

ఈ రకం విశ్వవిద్యాలయపు విద్యార్థులకి తెలుగు నేర్పుతూన్నప్పుడు వారందరూ ఛందోబద్ధంగా కవిత్వం రాయగలగాలని కాని, అటువంటి కవిత్వం చదివి అర్థం చేసుకుని ఆనందించాలని కాని నేను ఎప్పుడూ ఆశించలేదు. తెలుగు వినడానికి వారి చెవులకి తరిఫీదు ఇవ్వడం, నిత్య జీవితంలో పనికొచ్చే తెలుగు పదసంపదని వారికి పరిచయం చెయ్యడం, తెలుగు చదవడం, రాయడం – గీత బాగుంటే, మాట్లాడడం – వస్తే చాలని అనుకున్నాను. ఇది చాల పరిమితమైన గమ్యం. పది వారాల కాల పరిమితిలో, వారానికి రెండు గంటల బోధనతో ఇంతకంటె ఆశించడం అవివేకం అనిపించింది. పరిస్థితులు అనుకూలిస్తే తెలుగు వ్యాకరణంలో ఉన్న ప్రత్యేకతలు ఎత్తి చూపాలని కూడ అనుకున్నాను. ఇటువంటి పరిమితమయిన లక్ష్యంతో నా ప్రయాణం మొదలయింది.

తెలుగు రెండవ భాషగా నేర్పడం అనేది తెలుగు వారికి ఒక కొత్త అనుభవం. మన పిల్లలకి తెలుగు నేర్పబూనుకున్నప్పుడు, అప్పటికే వారికి భాష మీద బాగా పట్టు ఉంటుంది. మనం నిజంగా వారికి నేర్పేది రాయడం, చదవడం, వ్యాకరణం, వగైరాలు – భాష కాదు. అమెరికాలో తారసపడే విద్యార్థులకి తెలుగు నేర్పేటపుడు పరిస్థితి వేరు; ఈ పరిస్థితులకి అనుకూలంగా నేర్పాలి కాని, ‘ఎప్పుడో మా తాతలనాడు పడవలలో ప్రయాణం చేసేం కనుక ఇప్పుడూ పడవలే వాడాలి’ అనే కోణం కుదరదు.

2. తేలిక తెలుగు అంటే ఏమిటి?
ఈ కొత్త తరం విద్యార్థుల మనస్సులని ఆకట్టుకుని, వీరికి తెలుగు నేర్చుకోవాలనే కోరిక పెంపొందించాలన్నదే నా ప్రథమ లక్ష్యం. అందుకని వీరికి ‘తేలిక చెయ్యబడ్డ’ తెలుగుని బోధించాలని నిర్ణయించుకున్నాను. అందుకనే ఈ వ్యాసానికి తేలిక తెలుగు అని పేరు పెట్టేను. మనం ఈ రోజుల్లో నిత్యం వాడే భాషలో ఒక భాగం ఈ తేలిక తెలుగు. గణిత పరిభాషలో చెప్పాలంటే మనం వాడుకునే తెలుగు ఒక సమితి అనుకుంటే తేలిక తెలుగు అందులో ఒక ఉపసమితి.

నేను ఊహించుకుంటూన్న తేలిక తెలుగులో అచ్చులు అయిదు జతలు, ఒక పూర్ణానుస్వారం:

అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఒ, ఓ, అం

ఇదే విధంగా తేలిక తెలుగులో మొదట నేర్చుకోవలసిన హల్లులు ఇరవయిమూడు:

క, ఖ, గ, ఘ, చ, ఛ, జ, ఝ, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ

అటుపైన:

య, ర, ల, ళ, వ, శ. ష, స, హ, న్ (నకారపొల్లు)

ఈ తేలిక తెలుగు నుండి మినహాయించిన వర్ణాలు ఇవి:

ఋ, ౠ, ఌ, ౡ (అచ్చు లు, లూ) ఐ, ఔ, అః, ఙ, ఞ, ఱ, క్ష, ఁ (అర సున్న.)

ముందస్తుగా ఇక్కడ ఇలా కొన్ని అక్షరాలని మినహాయించినడం వల్ల వచ్చే కష్టసుఖాలని, లాభనష్టాలని ఒక క్రమ పద్ధతిలో పరిశీలిద్దాం. మన విచారణ అచ్చులతో మొదలుపెడదాం.

తేలిక తెలుగులో ఌ, ౡ లు లేవు. వీటి తరఫున వకాల్తా పుచ్చుకుని వాదించేవారు ఈ రోజుల్లో ఎవ్వరూ లేరనే నా నమ్మకం. ఉదాహరణకి, క్లుప్తం లో ఉండవలసిన ఌ-కారాన్ని ఈ రోజుల్లో అందరూ లు-కారం గానే రాస్తున్నారు. కనుక ఌ, ౡ లని నేను మినహాయించేనని నన్ను ఎవ్వరూ తూలనాడుతారని అనుకోను. వీటిని చాదస్తంగా వాడదామన్నా, లేఖిని వంటి కంప్యూటరు ఉపకరణాలలో ఈ రెండు వర్ణాలకి తావే లేదు.

తేలిక తెలుగులో విసర్గ లేదు; సంస్క్రుత పదాంతాలలో ఇది ప్రత్యయ రూపంలో తరచు వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ విసర్గ లేకుండా తెలుగులో రాసే అలవాటు బాగా వాడుకలోనే ఉంది. కొన్ని ఉదాహరణలు:

బహుశః > బహుశ, బహుశా (చాలవరకు, probably)
క్రమశః > క్రమేణా, క్రమేపీ (వరుసగా, gradually)
జన్మతః > జన్మతా (పుట్టుక నుండీ, congenital)
స్వతః > స్వతహా, స్వతహాగా (instinctively)
ప్రాయశః > ప్రాయశంగా (తరచుగా, frequently)

విసర్గ మాట మధ్యలో వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది. కొన్ని సందర్భాలలో తద్భవాలు వాడవలసి రావచ్చు, కొన్ని సందర్భాలలో వర్ణక్రమం కొద్దిగా మార్చవలసి రావచ్చు, కొన్ని సందర్భాలలో వ్యాకరణ సూత్రాన్ని అతిక్రమించవచ్చు, మరికొన్ని సందర్భాలలో ఒక మాటకి బదులు మరొక మాట వాడవలసి రావచ్చు. ఈ దిగువ ఇచ్చిన ఉదాహరణలు అన్నీ శాస్త్రసమ్మతం కాదు కాని ఎక్కువ వాడుకలో ఉన్నవే.

మనఃశాంతి > మనశ్శాంతి
చతుఃషష్టి > చతుష్షష్టి
నమఃకారం > నమస్కారం
తిరఃకారం > తిరస్కారం
అయఃకాంతం > అయస్కాంతం
దుఃఖం > దుఖ్ఖం, దుక్ఖం
అంతఃపురం > అంతహ్పురం, అంతిపురం
అంతఃకరణం > అంతహ్కరణం, అంతరాత్మ, మనస్సు
ప్రాతఃకాలం > ప్రాతహ్‌కాలం, వేకువ, తెల్లవారుజాము
తపఃఫలం > తపోఫలం
వయఃపరిమితి > వయోపరిమితి

కనుక ఎక్కువ కష్టపడకుండా విసర్గని విసర్జించి పబ్బం గడుపుకుంటే ప్రమాదం ఏమీ ఉండదనే నా నమ్మకం.

ఇక ఋ, ౠ ల సంగతి చూద్దాం. మాట మొదట్లో కాని, మధ్యలో కాని ౠ రావడం నా అనుభవ పరిధిలో చూడలేదు. ఋ తో మొదలయే మాటలు నాకు తెలుసున్నంత వరకు నాలుగు: ఋషి, ఋతువు, ఋణం, ఋత్విక్కు. ఇవి సంస్కృతం. తెలుగు మాటలు కావు. వీటిని మనలో చాల మంది అప్పుడే రుషి (లేదా రిషి), రుతువు, రుణం, రుత్విక్కు అని రాసేస్తున్నారు. కనుక ఋ, ౠ లు లేకపోయినా సరిపెట్టుకు పోవచ్చు కాని, ఋ హల్లుతో కలసినప్పుడు వచ్చే వట్రసుడి రూపం లేకుండా ‘సరిపెట్టుకు పోవడం’ అన్ని సందర్భాలలోనూ రాణించకపోవచ్చు; ప్రత్యేకించి, రాసేటప్పుడు కంటికి ఇంపుగా కనిపించకనూ పోవచ్చు. కొన్ని ఉదాహరణలు చూద్దాం.

కృష్ణ-ని క్రిష్ణ అని కొంతమంది, క్రుష్ణ అని కొంతమంది రాస్తున్నారు. ఈ రెండింటిలో క్రిష్ణ-కి కొంచెం ప్రాచుర్యం ఎక్కువ ఉంది. ఈ ప్రాచుర్యానికి కారణం ఇంగ్లీషు వర్ణక్రమం, ఉచ్చారణల ప్రభావం కారణం కావచ్చు.

వట్రసుడి లేకపోతే సంస్కృతం అన్న మాటని సంస్క్రుతం అని రాయాలి. నృత్యం-ని న్రుత్యం అని రాయాలి. నృపుడు-ని న్రుపుడు అని రాయాలి. ఈ రకం ప్రయోగాలు చేసినప్పుడు చెవి ఉచ్చారణ దోషాన్ని పసికట్టలేకపోయినా, రాసినప్పుడు కంటికి కొంచెం ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. కాకపోతే నృపుడు, నృత్యం వంటి మాటలు వాడడం మానేసి వాటి స్థానంలో వాటికి సమానార్థకాలయిన నర్తనం, నాట్యం, రాజు వంటి మాటలతో తేలిక తెలుగు సరిపెట్టుకోవాలి. ఈ మార్పు వల్ల తెలుగుకి వాటిల్లే నష్టం పెద్దగా లేదనే నా అభిప్రాయం.

తేలిక తెలుగులో ఐ, ఔ లు ప్రత్యేక వర్ణాలు కావు; వీటిని అయ్, అవ్ అని రాయవచ్చు. కొన్ని ఉదాహరణలు:

ఐదు > అయిదు
ఐపు > అయిపు
ఐతే > అయితే
అందమైన > అందమయిన
ఖైదు > ఖయిదు
కైవశం > కయివశం
కైవారం > కయివారం
ఔరా > అవురా
ఔను > అవును
కౌగిలి > కవుగిలి
చౌక > చవుక

ఇంగ్లీషు మాటలని తెలుగు లిపిలో రాసినప్పుడు ఐ స్థానంలో అయి రాయవచ్చు కాని కొంచెం క్రుతకంగా ఉన్నట్లు అనిపించవచ్చు:

హైవే > హయివే
ట్రైసికిల్ > ట్రయిసికిల్
డ్రైవ్ > డ్రయివ్

ఈ పద్ధతి సంస్క్రుతపు మాటలలో ‘వృద్ధి సంధి’ వచ్చిన సందర్భాలలో అంత సులభంగా కుదరకపోవచ్చు.

ఉదాహరణకి కౌంతేయుడు-ని కవుంతేయుడు-గా మార్చితే బాగుండదేమో. కౌరవులు అన్న మాటని నా ఆరేళ్ల మనవడు ‘కూరవులు’ అన్నప్పుడు నాకు నవ్వు వస్తుంది. కాని యౌవనం అని రాయవలసిన చోట్ల మనలో అనేకులు యవ్వనం అనే రాసేస్తూ ఉంటే నవ్వు రావాలి కాని రావడం లేదు. ఎందుకుట? మనం అంతా ఈ తప్పు చేస్తున్నాము కనుక. అందుచేత అక్కడక్కడ కొన్ని సంస్క్రుత పదాలతో ఇబ్బంది వచ్చినా ఐ, ఔ లకి బదులు అయ్, అవ్-లు రాస్తే పరవాలేదనే అనిపిస్తోంది.

ఇప్పుడు హల్లుల నుండి మినహాయించిన అక్షరాలని చూద్దాం. క, ఖ, గ, ఘ ల తరువాత వచ్చే ఙ ని నా జీవితంలో నేను ఎప్పుడూ వాడలేదు. కాని చ, ఛ, జ, ఝ ల తరువాత వచ్చే ఞ ని జ్ఞానం అనే మాటలో నేను తరచు వాడుతూ ఉంటాను, జ్ఞానం, జ్ఞాతి వంటి అతి కొద్ది మాటలు తప్పితే ఞ అవసరం మరెక్కడా కనిపించడం లేదు. కనుక ఞ ని కూడ తేలిక తెలుగులో వాడొద్దు. ఈ అక్షరం లేకుండా జ్ఞానం, జ్ఞాతి మొదలైన మాటల ఉచ్చారణ సూచించడానికి మరొక మార్గం ఉంది; అది తరువాత చెబుతాను.

ఇక మిగిలిన అక్షరాలలో ఱ (బండి ర) సంగతి చూద్దాం. నేను రాసే తెలుగులో ఈ శకటరేఫ ఎప్పుడూ వాడ లేదు. నేను చదివే తెలుగులో అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది కాని ఱ స్థానంలో ర రాస్తే నన్ను ఎవ్వరూ ఆక్షేపించలేదు. కనుక ఈ అక్షరం కూడ అనవసరమే, కనీసం, నా తేలిక తెలుగులో.

చివరకి మిగిలినది క్ష. ఈ అక్షరం తెలుగు అక్షరమాలలో లేదు కాని అక్కడక్కడ కొందరు దీన్ని ఱ ముందు రాస్తూ ఉంటారు. ఈ అక్షరం హిందీ అక్షరమాలలో ఉంది. తెలుగులో క కింద ష వత్తు రాస్తే క్ష అనే సంయుక్తాక్షరం వస్తుంది. కనుక దీనికి తెలుగు అక్షరమాలలో ఒక స్థానం ఇవ్వక్కర లేదు.

ఇక మిగిలినది అరసున్న. దీని వాడుక తగ్గిపోయింది కనుక దీనిని తేలిక తెలుగులో వాడదలుచుకోలేదు.

ఈ విశ్లేషణ అయిన తరువాత నా తేలిక తెలుగులో మిగిలిన అక్షరాలు ఇవి:

అ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ ఎ, ఏ, ఒ, ఓ, అం
క, ఖ, గ, ఘ
చ, ఛ, జ, ఝ
ట, ఠ, డ, ఢ, ణ
త, థ, ద, ధ, న
ప, ఫ, బ, భ, మ
య, ర, ల, వ, శ, ష, స, హ.

ఈ 42 అక్షరాలతోపాటు కొన్ని లేఖన చిహ్నాలు అవసరం వస్తూ ఉంటాయి.

అచ్చుతో కలపకుండా కేవలం హల్లుని రాయడానికి ఉపయోగపడే గుర్తు – నకార పొల్లు.

ఇదే విధంగా ప్రత్యేక ఉచ్చారణ అవసరమని చెప్పటానికి ఒక కొత్త గుర్తు, ~ (టిల్డా)ని నేను ప్రవేశ పెడుతున్నాను. ఈ గుర్తు కనిపించినప్పుడల్లా అక్కడ సాధారణ ఉచ్చారణ కాకుండా ఒక విలక్షణమైన ఉచ్చారణ ఉంటుందని సూచిస్తుంది, అంతే. కొన్ని ఉదాహరణలు:

బ్రౌన్ సూచించిన ౨ (రెండు గుర్తు) బొత్తాల బల్ల మీద లేదు కనుక, ౘ, ౙ (దంత్య చ, జ) కావలసి వచ్చినప్పుడు, చ మీద, జ మీద, ౨కి బదులు ఈ ~ గుర్తు వాడొచ్చు.

ఇంగ్లీషులో – బేంక్, బేట్, పెన్, వంటి మాటలకి తాలవ్యోచ్చారణ ఉందని చెప్పడానికి బేంకు అని రాసి, ఆ బే మీద ఈ టిల్డా గుర్తు వేయవచ్చు. కాని ఎన్నో ఇంగ్లీషు మాటలకి ఈ రకం ఉచ్చారణ ఉంది కనుక ఈ టిల్డా గుర్తు వేయకపోయినా అది ఇంగ్లీషు మాట అని గుర్తించగానే ఉచ్చారణ తెలుస్తుంది.

విజ్ఞానం వంటి మాటలు రాయవలసి వచ్చినప్పుడు రెండవ అక్షరం అయిన జా మీద ఈ టిల్డా గుర్తు వేసి అక్కడ ప్రత్యేకమయిన ఉచ్చారణ ఉందని సూచించవచ్చు.

అంటే నియమం ఏమిటన్నమాట? కేవలం తేలిక తెలుగులో ఉన్న అక్షరాలతో మనకి కావలసిన ప్రత్యేకమైన శబ్దాన్ని పుట్టించడం కష్టమైనప్పుడు మనకి అందుబాటులో ఉన్న లేఖన చిహ్నాలతో ఆ మాటని రాసి, ‘ఇక్కడ ప్రత్యేక ఉచ్చారణ ఉంది సుమా’ అని హెచ్చరించడానికి ఈ టిల్డా (కాకపోతే మరొక చిహ్నం) వాడమని నా సలహా. అంటే, ఈ టిల్డాకి ఒక నిర్దిష్టమయిన ఉచ్చారణ అంటూ ఏదీ లేకపోవడం ఒక లక్షణం, దాని ‘ఉచ్చారణ విలువ’ అది వాడిన స్థానాన్ని బట్టి మారుతుంది అనేది దీని రెండవ లక్షణం.

కనుక తేలిక తెలుగులో 5 అచ్చుల జతలు, 31 హల్లులు, 3 లేఖన చిహ్నాలు (సున్న, నకారపొల్లు, టిల్డా.) ఇక్కడ పూర్ణానుస్వారాన్ని లేఖన చిహ్నాలలో కలిపి లెక్కిస్తున్నాను.

3. తేలిక తెలుగులో సున్నలు, అరసున్నలు
నేను తెలుగు నేర్చుకోలేదు, ఎవ్వరూ నేర్పలేదు; దానంతట అదే వచ్చేసింది. భాష వచ్చిన తరువాత రాయడం, చదవడం గురుముఖంగా నేర్చుకున్నాను. కనుక తెలుగంటే ఏమిటో బొత్తిగా తెలియని వాళ్లకి తెలుగు నేర్పడంలో ఉన్న కష్టసుఖాలు, తెలుగు నేర్చుకునేటప్పుడు విద్యార్థులు చేసే తప్పులు నా విద్యార్థులకి పాఠాలు చెప్పే సందర్భంలోనే నాకు అవగతం అయేయి. మరొక విధంగా చెప్పాలంటే ఒక భాషని మొదటి భాషగా నేర్చుకోవడం వేరు, రెండవ భాషగా నేర్పడం వేరు. ఈ అధ్యాయం ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకుని చదవండి.

నా విద్యార్థులకి రాతలో ప్రావీణ్యం రాకముందే మాట్లాడడం నేర్పాలని నిశ్చయించుకున్నాను. అందుకని వారికి RTS, లేఖిని, పద్మ వంటి పనిముట్లు వాడడం మొదట్లోనే నేర్పేను. RTS అనేది తెలుగుని ఇంగ్లీషు లిపిలో రాయడానికి ఒక ప్రమాణం. లేఖిని, పద్మ అనేవి RTS ప్రమాణం ప్రకారం ఇంగ్లీషు లిపిలో రాసిన వాక్యాలని తెలుగు లిపిలోకి తర్జుమా చేసే సాఫ్ట్‌వేర్ పనిముట్లు. ఇవన్నీ ఉచితంగా అంతర్జాలంలో దొరుకుతాయి. ఈ కాలపు పిల్లలకి వీటి వాడకం నేర్పడం పెద్దగా శ్రమ లేని పని.

నేను నల్లబల్ల మీద తెలుగులో ఒక మాట రాసి, దాని పక్కనే ఇంగ్లీషు లిపిలో (RTS పద్ధతిలో) దాని ఉచ్చారణ సూచించేవాడిని. అది వారు చూసి, వారివారి కంప్యూటర్లలో లేఖిని ఇచ్చిన పెట్టెలో కాని, పద్మ సూచించిన పెట్టెలో కాని రాసుకుంటే కంప్యూటరు దానిని తెలుగులిపి లోకి మార్చి చూపించేది. దానికి నకలు తీసి Word ఫైల్లో అంటించుకుని దాచుకునేవారు.

ఈ RTS వాడకం వల్ల ఒక ఇబ్బంది వచ్చి పడింది. RTSలో పూర్ణబిందువుని సూచించడానికి M అనే అక్షరం వాడాలి. ఉదాహరణకి, అందరు – అని తెలుగులో రాయాలంటే ఇంగ్లీషు లిపిలో aMdaru అని రాయాలి. ఇక్కడ వచ్చిన చిక్కు సమగ్రంగా అర్థం కావాలంటే ఈ దిగువ కథనం చదవండి.

తెలుగులో రెండు రకాల బిందువులు (లేదా సున్నలు) వాడుకలో ఉన్నాయి. ఒకటి నిండు సున్న లేదా పూర్ణ బిందువు లేదా పూర్ణానుస్వారం. మరొకటి అర సున్న లేదా అర్ధ బిందువు లేదా అర్ధానుస్వారం. నిజానికి, మొదట్లో, తెలుగు భాషలో అరసున్న లేదు; ముద్రణ వచ్చిన తరువాతే అరసున్న అనే లేఖన చిహ్నం వాడుకలోకి వచ్చి చేరింది. ఆధునిక భాషలో అరసున్న ప్రయోగం లేదు; తేలిక తెలుగులోనూ లేదు.

తెలుగు మాటలలో నిండు సున్న చాల తరచుగా వస్తుంది. ఈ రోజులలో మాట చివర ము-వర్ణానికి బదులు నిండు సున్న వాడడం పరిపాటి అయిపోవడంతో నిండు సున్న వాడకం ఇనుమడించింది.

కేవలం బిందువు అక్షరం కాదు; దాని ముందున్న వర్ణంతో కలసి అక్షరం అవుతుంది. అందుచేత నిండు సున్న మాట మధ్యలో వచ్చినప్పుడు ఆ మాటని సున్న ముందు విరచి తరువాత వరసని సున్నతో ఆరంభించి రాయకూడదు.

ఇటాలియన్ లాగే తెలుగు అచ్చులతో అంతమయే మాటల మూట అనిన్నీ, అందుకనే ఇటాలియన్ లాగే తెలుగు కూడ సంగీతానికి అనువైన భాష అనిన్నీ నా విద్యార్థులకి చెప్పేవాడిని. ఆదిలోనే హంసపాదులా అక్కడే పిల్లలు అభ్యంతరం చెప్పేరు. మేం, మనం, వస్తాం, వెళతాం, ఉంటాం, చేస్తాం, ధనం, ఇస్లాం, ముస్లిం, రామబ్రహ్మం, సుబ్రహ్మణ్యం, ఇలా సున్నతో అంతం అయేవన్నీ అనే న్ హల్లుతో అంతం అయినట్లు వారి చెవికి వినపడుతున్నాయే అని వారి సందేహం.

మరొక సందర్భంలో, “తెలుగులో ఎలా రాస్తే అలా ఉచ్చరిస్తాం. ఎలా ఉచ్చరించాలో అలానే రాస్తాం. ఇంగ్లీషులో ఒకే మాటని పలువురు పలు విధాలుగా ఉచ్చరించడానికి సావకాశం ఉంది; ఇంగ్లీషు ఫోనెటిక్ భాష కాదు, తెలుగు ఫోనెటిక్ భాష,” అని చెప్పేను. చెప్పి, నా వాదాన్ని బలపరచుకోడానికి నల్లబల్ల మీద సుద్దముక్కతో ukraine అని రాసి దానిని చదవమంటే కొందరు ఉక్రెయిన్ అనిన్నీ మరికొందరు యుక్రెయిన్ అనిన్నీ చదివేరు. కాని విద్యార్థులకి నా ఉదాహరణ నచ్చలేదు. నా ఉదాహరణకి పోటీగా వారు కందులు అనే మాట తీసుకున్నారు. దీనిని కమ్‌దులు అనాలా? కన్‌దులు అనాలా? నేను కం-ని comeలా పలుకుతున్నా, కందులు-ని కన్‌దులు అని పలుకుతూన్నట్లు వారి చెవికి వినపడుతోందని వారి వాదన.

మనం సున్నతో, లేదా పూర్ణబిందువుతో, కూడిన మాటలు తరచు వాడుతూ ఉంటాం కాబట్టి నా విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నని కొంచెం తరచి చూడవలసిన అవసరం ఉందనిపించింది. పూర్వం, ము వచ్చే చోటల్లా ఇప్పుడు సున్ననే వాడుతున్నాం, రాతలో ము రాసినా సున్ననే పలుకుతున్నాం. దీని వాడుక ఎక్కువ అవడం వల్ల ఒకప్పుడు అజంతంగా వర్ధిల్లిన భాష స్వభావం ఇటీవలి కాలంలో హలంతంగా మారిపోతోంది. తెలుగు అజంత భాష అనడానికి వీలు లేనంతగా తెలుగు స్వరూపం మారిపోతోంది.

శాస్త్రం ప్రకారం తెలుగు భాషలోలో సున్న క, చ, ట, త, ప– లకి, గ, జ, డ, ద, బ– లకి ముందే వస్తుంది. ఉదాహరణకి: వంక, కంచము, గంట, కంత, కంప, కొంగ, గుంజ, కొండ, కంద, చెంబు, వగైరాలు. సున్న తరువాత కచటతపలు, గజడదబలు కాక ఇతర హల్లు ఏది ఉన్నా ఆ మాట తెలుగు మాట కాదని చెప్పవచ్చు. ఉదాహరణకి: సంయమనం, సంవాదం, సంస్కృతం, వంశం, హంస, వగైరాలు.

ఇప్పుడు పైన ఉదహరించిన మాటలని ఎలా ఉచ్చరిస్తామో ఒక సారి చూద్దాం. కంది-ని కంది అని పూర్ణానుస్వారాన్ని నొక్కి మకారంతో పలుకుతామా లేక కన్‌ది అని కాని కన్ది (న కింద ద) అని నకారంతో కాని పలుకుతామా? రాతలో పూర్ణానుస్వారాన్ని వాడినా పలికేటప్పుడు చాల మంది నకారంతో కన్ది అనే అంటారు. ఈ విషయం అమెరికా పిల్లలు పసిగట్టి నన్ను అడిగేసరికి నా సుడి బాగుండి, వేళకి ‘కటపయాది సూత్రం’ స్పురణకి వచ్చి వారికి ఈ విధంగా (తప్పో, ఒప్పో) సమాధానం చెప్పేను:

ఒక్క తెలుగులోనే కాదు, చాల భారతీయ భాషలలో హల్లులని అయిదు వర్గాలుగా విడగొట్టి రాస్తారు: క-వర్గు, చ-వర్గు, ట-వర్గు, త-వర్గు, ప-వర్గు. ప్రతి వర్గులోను అయిదేసి అక్షరాలు ఉంటాయి; అయిదోది అనునాసికం, అంటే, ముక్కుతో పలికేది. ఒక వర్గులోని హల్లు ముందు ఆ వర్గు చివర ఉన్న అనునాసికమే వస్తుంది. కనుక వంక అని రాయవలసి వచ్చినప్పుడు వఙ్క అనిన్నీ, గంట-ని గణ్ట అనిన్నీ, కంత-ని కన్త అనిన్నీ, కంప-ని కమ్ప అనిన్నీ రాయాలి – కటపయాది సూత్రం ప్రకారం. అప్పుడు పరుష సరళాల తరువాత సున్న అవసరం ఉండదు; రాసినట్లే ఉచ్చరిస్తాము కూడ. ప్రాచీన కాలంలోనే ఈ అనునాసికాల వాడకానికి కాలదోషం పట్టి ఆ స్థానంలో సున్న చేరింది. చేరి, ఉచ్చారణలో సందిగ్ధత తీసుకొచ్చింది.

(అవకాశం వచ్చింది కదా అని ఇదే సందర్భంలో) భారతీయ భాషలలో వర్ణమాల అమరిక – అంటే ముందుగా అచ్చులు, తరువాత హల్లులు, వాటిని కూడ ఆషామాషీగా కాకుండా ఒక క్రమ పద్ధతితో, ధ్వని పుట్టే ప్రదేశాన్ని బట్టి కంఠ్యములు (అ, ఆ, క, ఖ, గ, ఘ), తాలవ్యములు (ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ), మూర్దన్యములు (ట, ఠ, డ, ఢ, ణ, ర, ష), దంత్యములు (త, థ, ద, ధ, న, ల, స), ఓష్ఠ్యములు (ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ) అని అమర్చిన విధం లోని శాస్త్రీయతని ఎత్తి చూపి ఇంగ్లీషు వర్ణమాలలో వచ్చే అక్షరాలు ఆ వరుసలో ఉండడానికి ఒక తార్కికమైన కారణం అంటూ ఏదీ లేదని చెప్పేసరికి వారికి తెలుగు మీద ఒక రకం గురి, గౌరవం కలిగేయి.

4. పదసంపద
భాష మీద పట్టు రావాలంటే వ్యాకరణ సూత్రాల కంటె ముఖ్యమయినది పదజాలం. మనం అయిదేళ్ల వయసప్పుడు ఒకటవ తరగతిలో చేరి తెలుగు నేర్చుకునే వేళకి మనకి తెలుగు పదజాలం మీద మంచి పట్టే ఉంటుంది. అమెరికాలో నా విద్యార్థులకి తెలుగు పదజాలంతో పరిచయమే లేదు. ఈ సమస్యని ఎదుర్కోడానికి నా అనుభవాల మీదనే ఆధారపడవలసి వచ్చింది.

నేను మొట్టమొదట ఉద్యోగం చేసిన ఊరు తమిళ దేశంలోని నేవేలీ. నాకు అప్పట్లో తమిళంతో ఏమాత్రం పరిచయం లేదు. నా స్నేహితుడు ఆనందవికటన్, కుముదం అనే పత్రికలు తెచ్చుకుని చదివేవాడు. ఆ పత్రికలలో వ్యాపార ప్రకటనలు ఉండేవి. లక్సు, రెక్సోనా సబ్బులు, రీటా హెయిర్ ఆయిల్, అమృతాంజనం, ఆస్ప్రో, ఈనోస్ ఫ్రూట్‌సాల్ట్, వంటి పేర్లు తమిళంలో చూసి పక్కపక్కన ఉండే బొమ్మలలో ఉండే ఇంగ్లీషు మాటలతో సరిపోల్చి చూసి, ఎవ్వరూ నేర్పకుండా, నా అంతట నేనే తమిళం ఓనమాలు, గుణింతాలు, రాయడం, చదవడం నేర్చుకున్నాను. రెండు భాషల వ్యాకరణాలూ సమాంతరంగా ఉన్నాయి కనుక ఒక ఇబ్బంది తప్పింది. సినిమా ప్రకటనలు కూడ ఈ ప్రయత్నంలో ఎంతగానో ఉపయోగపడేవి. మన నాగయ్య, సావిత్రి, భానుమతి – వీళ్ల ముఖాలు చూసి, కిందనున్న తమిళం పేర్లు చదివేవాడిని. చుట్టూ ఉన్నవాళ్లంతా, లేచింది మొదలు పక్క మీద మేను వాల్చేదాకా, తమిళం మాట్లాడుతూ ఉంటే వినేవాడినేమో క్రమేపీ మాట్లాడడం కూడ కొద్దికొద్దిగా వచ్చింది – కేవలం నాలుగు నెలలలో! దీనినే ఇంగ్లీషులో ఇమ్మర్షన్ పద్ధతి అంటారుట. నిండా ములిగితే కాని భాష అంటదంటారు. ఆ రోజులలో నేవేలీలో నేను, మరొకడు తప్ప మూడో తెలుగు ముఖం నాకు కనిపించలేదు. తమిళం ఒంటపట్టడానికి ఈ ఒంటరితనం కూడ ఒక విధంగా సహాయం చేసింది.

నేను భిలాయిలో మూడేళ్లు ఉద్యోగం చేసినప్పుడు నా అంతట నేనే పుస్తకాలు చదివి రష్యన్ నేర్చుకున్నాను. రోజల్లా రష్యన్ ఇంజనీర్లతో పని కాబట్టి, అవసరం కొద్దీ మాట్లాడడం వచ్చింది. రాయడం, చదవడం నా ప్రయత్నం వల్ల వచ్చింది. మొదట్లో వాక్యం పూర్తిగా నిర్మించి మాట్లాడలేకపోయినా తోకా (కరెంటు), వప్రషేనియా (ఓల్టేజి), సప్రతివ్లేనియా (రెసిస్టెన్స్) వంటి ముఖ్యమయిన మాటలు వస్తే అంతా ఇంజనీర్లమే కనుక భావం అర్థం అయిపోయేది. తమాషా ఏమిటంటే భిలాయిలో ఉన్న మూడేళ్లల్లో రష్యన్ వచ్చింది కాని హిందీ రాలేదు. దీనికీ కారణం ఉంది. పని నుండి ఇంటికి తిరిగొచ్చిన తరువాత నా సహచరులు, స్నేహితులు, అంతా తెలుగు వాళ్లే! పనిలో ఉన్నంత సేపు రష్యాలో ఉన్నట్లే ఉండేది.

కాని, అమెరికాలో నా విద్యార్థులకి నేను తప్ప మరొక తెలుగువాడు తెలియదు. తరగతి గదిలో కూర్చున్నప్పుడు తప్ప వారికి తెలుగుతో ఎక్కడా సంపర్కం లేదు. ఈ పరిస్థితులలో వారికి ఓనమాలతో పాటు తెలుగు పదజాలం కూడ నేనే నేర్పవలసి వచ్చింది. భాష మీద పట్టు రావాలంటే పదజాలం మీద అధికారం ఎంత ముఖ్యమో అప్పుడు తెలిసింది.

పదజాలం మీద అధికారం రావాలంటే నాకు తెలిసిన మార్గాలు రెండు: ఒకటి నేను చిన్నప్పుడు ఒకటో తరగతిలో నేర్చుకున్నట్లు, అ – అమ్మ, ఆ – ఆవు, ఇ – ఇల్లు, ఈ – ఈగ, … అనుకుంటూ బొమ్మల పుస్తకంలో బొమ్మలు చూస్తూ చదవడం. తరువాత బొమ్మలు లేకపోయినా శబ్దాన్ని అనుకరించే టకటక, బరబర, గడగడ, చకచక, వంటి మాటలు బట్టీయం వెయ్యడం.

భాషతో పరిచయం లేని వాళ్లు భాష నేర్చుకునేటప్పుడు బాగా పని చేసే పద్ధతి మరొకటి ఉంది. విద్యార్థులని ఒక ఊహా ప్రపంచం లోని బజారుకి తీసుకెళ్లడం. అక్కడ ఒక వస్తువు కొనడానికి తెలుగులో ఎలా మాట్లాడడమో నేర్పడం. మరొక రోజు ట్రెయిను టికెట్టో, బస్సు టికెట్టో కొనడం నేర్పడం. ఇలా రకరకాల సందర్భాలు తయారు చేసి ఆయా సందర్భాలలో తెలుగు ఎలా మాట్లాడడమో నేర్పడం. ఈయీ సందర్భాలలో వచ్చే మాటలని ఒక జాబితాలా రాసి వారి చేత ఆ మాటలని పదేపదే వాడమని ప్రోత్సహించడం. అదే సందర్భంలో వ్యాకరణ సూత్రాలని, ఏక వచనం, బహువచనం, లింగ భేదం సూచించడం, మొదలైనవి నేర్పడం. మా విశ్వవిద్యాలయంలో ఇతర దేశాల భాషలు నేర్పే శాఖలు ఉన్నాయి. వారిని సంప్రదిస్తే ఈ పయిన చెప్పిన విధంగా తెలుగు నేర్పమని నన్ను ప్రోత్సహించేరు.

నా విద్యార్థులందరికీ ఇంగ్లీషు వచ్చు కనుక ఇంగ్లీషు పదాలని తెలుగు వాక్యాలలో వాడడం ఎలాగో నేర్పడం తేలిక:

డౌన్‌టౌన్ (కి) వెళదామా?
లంచ్ (ని) తిందామా?
సినిమా (ని) చూద్దామా?
బుక్స్ ఏవి?

ఇలా మొదలు పెట్టిన తరువాత చెప్పేను: “ఇతర భాషల నుండి మాటలు అరువు తెచ్చుకుని వాడడంలో తెలుగు వెనుకాడదు. పూర్వం సంస్క్రుతం నుండి అరువు తెచ్చుకున్నట్లే ఈ రోజుల్లో ఇంగ్లీషు నుండి అరువు తెచ్చుకుంటున్నాము కనుక ఇంగ్లీషు నామవాచకాలు ధారాళంగా వాడండి,” అంటూ ప్రోత్సహించేను. నా ప్రయత్నాన్ని ఎక్కువగా క్రియలమీద, విభక్తి ప్రత్యయాల మీద, సర్వనామాల మీద కేంద్రీకరించేను.

ఈ రోజులలో వాడుకలో ఉన్న తెలుగులో దరిదాపు 50 శాతం వరకు సంస్క్రుతం మాటలు ఉండొచ్చని ఒక అంచనా ఉంది. ఈ మాటలు శతాబ్దాల తరబడి తెలుగులో జీర్ణించుకుపోయాయి కనుక ఏవి తెలుగు మాటలో, ఏవి సంస్క్రుతం నుండి వచ్చేయో చాల మందికి తెలియదు.

ఇలా తెలుగు మీద సంస్క్రుతం వెయ్యేళ్లబట్టి తన ప్రభావాన్ని చూపెడుతోంది. ఇటీవల ఇదే రకమయిన ప్రభావాన్ని ఇంగ్లీషు చూపెడుతోంది. కనుక ఇంగ్లీషు మాటలు, ప్రత్యేకించి నామవాచకాలు, భయపడకుండా వాడేవాళ్లం, తేలిక తెలుగులో. కొన్ని తెలుగు విభక్తి ప్రత్యయాలు, క్రియావాచకాలు నేర్చుకుంటే వాటిని ఇంగ్లీషు నామవాచకాలతో కలిపి వాడితే మరేమీ ఎబ్బెట్టుగా ఉండదని హామీ ఇచ్చేను. ఈ దెబ్బతో నా విద్యార్థులకి తెలుగు పదజాలం మీద అధికారం లేకపోయినందువల్ల కలిగే నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసుకోగలిగేను.

5. తత్సమాలు, తద్భవాలు
ప్రతి భాషకూ ఒక ధ్వని వ్యవస్థ ఉంటుంది. ఇతర భాషల నుండి మాటలు అరువు తెచ్చుకున్నప్పుడు అవి మన భాషలో ఇమడకపోతే మన భాషకు అనుగుణంగా మార్చుకుంటాం. కొన్ని సందర్భాలలో పరభాషా పదాలతోపాటు వాటి ఉచ్చారణని కూడ అరువు తెచ్చుకుంటాం. ఉదాహరణకి సంస్క్రుతం నుండి కాని, ఇంగ్లీషు నుండి కాని తెలుగులోకి అరువు తెచ్చుకున్నప్పుడు రెండు పద్ధతులు అవలంబించాం: తత్సమాలు మూల భాషలోని ఉచ్చారణని యధాతథంగా అనుకరించగా వచ్చినవయితే తద్భవాలు మన భాషలోని ఉచ్చారణకి అనుకూలంగా మార్చుకుని తెచ్చుకున్నవి. ఉదాహరణకి సంస్క్రుతం నుండి తెలుగులోకి వచ్చిన కొన్ని తద్భవాలు:

పుణ్యము > పున్నెం
రథము > అరదం
భక్తి > బత్తి
మృత్యువు > మిత్తి
భాష > బాస
ద్యూతం > జూదం

ఇంగ్లీషు నుండి తెలుగులోకి వచ్చి మార్పు చెందిన మాటలకి కొన్ని ఉదాహరణలు:

pension > పింఛను
constable > కనిష్టీపు
hospital > ఆసుపత్రి

ఇవి కొద్ది ఉదాహరణలే అయినా వీటిని బట్టి పూర్వకాలం నుండీ కూడ తత్సమాలకి ఉన్న ఆదరణ తద్భవాలకి లేదేమో అనిపిస్తుంది. అందుకని ఇంగ్లీషు మాటలని తత్సమ రూపంలో వాడేసినా పరవాలేదని ఒక నిశ్చయానికి వచ్చేం.

ఇటీవలి కాలంలో తత్సమాల వాడుక ఎక్కువయింది. ఉదాహరణకి, పూర్వం ఆసుపత్రి అనే మాట విస్తారంగా వాడుకలో ఉండేది; ఈ రోజులలో హాస్పిటల్ అనేవారే ఎక్కువ. ఇంగ్లీషు మాటలు, సంస్క్రుతం మాటలు తెలుగులో తత్సమ రూపంలో విస్తారంగా ప్రవేశించడం వల్ల తెలుగు అజంతం అని చెప్పుకోడానికి వీలు లేకుండా పోతోంది.

మనం నిత్యం వాడే తెలుగులో తెలుగు మాటలతోపాటు సంస్క్రుతం మాటలు, ఇంగ్లీషు మాటలు ఎక్కువగా కలిసిపోతూ ఉంటాయనుకున్నాం కదా. ఇంగ్లీషు మాటలని గుర్తించడం తేలికే గాని, ఏది తెలుగో ఏది సంస్క్రుతమో గుర్తించడానికి కొంచెం అనుభవం, మరి కొంచెం పాండిత్యం ఉండాలి. అలా గుర్తు పట్టగలిగితే తప్పులు దొర్లడానికి సావకాశం తక్కువ.

6. సంధులు, సమాసాలు
కాలప్రవాహానికి ఎంత లొంగినా తెలుగు స్వతహాగా అచ్చులతో అంతం అయే భాష (అజంతం.) అంటే తెలుగు మాటల చివర అచ్చులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కనుక మొదటి మాట అచ్చుతో అంతం అయి తరువాయి మాట అచ్చుతో మొదలయినప్పుడు రెండు అచ్చులు వరసగా రావాలి కదా. కాని తెలుగు మాటలలో రెండు అచ్చులు వరసగా రావు; ఇటువంటి సందర్భంలో సంధి జరుగుతుంది. ఈ సంధి గురించి కొంచెమయినా అర్థం అయితే ఉచ్చారణదోషాలు తగ్గుతాయని నా నమ్మకం. ఉదాహరణకి, హిమాలయ వంటి మాటలని హిమలయా అని అనకుండా ఉండాలంటే అక్కడ జరుగుతూన్న సంధి తెలియాలి.

తెలుగులో సంధి జరగడమంటే మొదటి మాట చివరి అచ్చు లోపించి, రెండవ మాటలోని మొదటి అచ్చు ప్రకాశిస్తుంది. అప్పుడప్పుడు సంధి జరగకపోవచ్చు. సంధి జరగని సందర్భాలలో రెండు అచ్చులకి మధ్య ఒక హల్లు వచ్చి చేరుతుంది. సర్వసాధారణంగా అలా వచ్చి చేరిన హల్లు య అవుతుంది; అప్పుడు దానిని యణాదేశ సంధి అంటారు. తేలిక తెలుగు యణాదేశ సంధిని ప్రోత్సహించదు. కనుక తేలిక తెలుగులో ‘మా ఊరు’ని మాయూరు అని రాయం; మా ఊరు అని సంధి చెయ్యకుండానే రాస్తాం. ఇదే విధంగా పెద్ద ఎత్తున అన్న పదబంధాన్ని పెద్దయెత్తున అని రాయం; పెద్ద ఎత్తున అనే రాస్తాం.

భారతీయ భాషలలో సంధి తరచుగా జరిగే ప్రక్రియ. ఈ సంధి ఇంగ్లీషులో కూడ ఉందని సోదాహరణంగా చూపిస్తాను. ఈ దిగువ ఉదాహరణలు చూడండి.

no + one = none           o లోపించింది.
ride + ing = riding           e లోపించింది
guide + ance = guidance           e లోపించింది
hope + ing = hoping           e లోపించింది
entire + ly = entirely           e లోపించలేదు
like + ness = likeness           e లోపించలేదు
arrange + ment = arrangement          e లోపించలేదు

ఈ ఉదాహరణలలో ఉత్తరపదం అచ్చుతో (a, e, i, o, u) మొదలయినప్పుడు, పూర్వ పదం చివర ఉన్న అచ్చు లోపిస్తుంది – తెలుగులో లాగే!

ఇంగ్లీషులో సంధిని పోలిన మరొక ప్రక్రియతో బోలెడు కొత్త మాటలు తయారు చేస్తున్నారు. (ఉదా. smoke + fog = smog, motor + hotel = motel, wiki + encyclopedia = wikipedia). ఇక్కడ రెండు మాటలని జత చేసి, అలా జత చేయగా వచ్చిన సమాసాన్ని కుదించి రాస్తారు. ఈ పద్ధతి ఉపయోగించి తెలుగులో ప్రయోగాత్మకంగా తయారు చేసిన ఉదాహరణలు:

బహుళమైన + అణువు = బణువు (మాలిక్యూల్)
ద్వియాంశ + అంకం = ద్వింకం (బైనరీ డిజిట్ లేదా బిట్)
వ్యాకరణ + కర్తలు = వ్యాకర్తలు.

పదబంధం మరీ పొడుగయిపోతే కేవలం పొడి అక్షరాలతో మాటలు అల్లవచ్చు: కసాగు (కనిష్ఠ సామాన్య గుణిజం), గసాభా (గరిష్థ సామాన్య భాజకం).

7. తేలిక తెలుగు రాతలో నియమాలు
ఏ భాషలోనయినా సరే అన్ని శబ్దాలని పుట్టించడానికి కావలసినన్ని లేఖన చిహ్నాలు ఉండవు. ఉదాహరణకి సంస్క్రుత శబ్దాలని ఉచ్చరించడం కొరకు మనం తెలుగులో ఎన్నో లేఖన చిహ్నాలు ప్రవేశపెట్టేం. వీటిలో చాలవాటిని తేలిక తెలుగులో కూడ వాడుతున్నాం (ఉదా. మహాప్రాణాలు లేక ఒత్తు అక్షరాలు, శ, ష లు). ఇన్ని అక్షరాలు ఉన్నా ఇంగ్లీషు లోని బేంక్ వంటి శబ్దాలని ఉచ్చరించడానికి మరొక సరికొత్త లేఖన చిహ్నం ఉండాలని వాదించేవారు లేకపోలేదు.

పైన నుడివిన సమస్య బొమ్మ అనుకుంటే దానికి బొరుసు సమస్య మరొకటి ఉంది: తెలుగులో కొన్ని శబ్దాలని పుట్టించడానికి ఒకటి కంటె ఎక్కువ పద్దతులలో రాయవచ్చు. ఉదాహరణకి ఇ, ఈ, ఎ, ఏ లని తెలుగులో యి, యీ, యె, యే అనిన్నీ, ఉ, ఊ, ఒ, ఓ లని వు, వూ, వొ, వో అనిన్నీ రాస్తూ ఉంటారు. తేలిక తెలుగులో నియమం ఏమిటంటే – మాట మొదట్లో యి, యీ, యె, యే, వు, వూ, వొ, వో-లు రావు. ఈ నియమం ప్రకారం తేలిక తెలుగులో, యిక్కడ, యెప్పుడు, యేవి, అని రాయకూడదు; ఇక్కడ, ఎప్పుడు, ఏవి అనే రాయాలి. ఉట్టి అని రాయాలి కాని వుట్టి అనే ప్రయోగం కూడదు. దీనినే సూత్రంలా చెప్పాలంటే: అజాది పదాలని హలాదులుగా రాయవద్దు.

ఇదే విధంగా మాట మధ్యలో కాని, చివర కాని ఇ, ఈ, ఎ, ఏ, ఉ, ఊ, ఒ, ఓ-లు రావు. కొన్ని ఉదాహరణలు. తేలిక తెలుగులో ఐ లేదు కనుక పైకం-ని పయికం అని రాయాలని చెప్పేను కదా. ఈ మాటని పఇకం అని రాయకూడదు. ఇదే విధంగా రయితు సరి అయిన ప్రయోగం కాని రఇతు కాదు. మరొక రకం ఉదాహరణ: ఆవు అనే రాయాలి కాని ఆఉ అని రాయకూడదు.

ఒకే మాటలో రెండు అచ్చులు వరసగా రావు. అఇతే, ఆఉ, ఏఓ, మొదలైన పద్ధతిలో తెలుగులో మాటలు రాయకూడదు. వీటిని అయితే, ఆవు, ఏవో, అని రాయాలి.

9. ఒత్తులు
సంస్క్రుతం తెలుగులో వచ్చి కలవడం వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు అన్నే ఉన్నాయని నా అనుమానం. అలాగని సంస్క్రుతాన్ని విడనాడి అచ్చ తెలుగు వాడమని నేను అడగడం లేదు.

ఉదాహరణకి సంస్క్రుతం తెలుగులో కలియడం వల్ల తెలుగు పదజాలం విపరీతంగా పెరిగింది. ఆ పదజాలంతో పాటు సంస్క్రుత నియమాలు, వర్ణక్రమాలు, వ్యాకరణ సూత్రాలు, వగయిరా తెలుగులో వచ్చి చేరేయి. వీటిని తెలుగు లిపిలో రాయడానికి తెలుగులో కొత్త అక్షరాలు కూడ వచ్చి చేరాయి. ఇలా వచ్చి చేరిన అక్షరాలలో అధిక భాగం ఒత్తు అక్షరాలు లేదా మహాప్రాణాలు.

మనం, ఒత్తు అన్న మాటని రెండు అర్థాలలో వాడతాం. ‘క కింద ర ఒత్తు ఇస్తే క్ర, ష కింద ట ఒత్తు ఇస్తే ష్ట’ వంటి ప్రయోగంలో ఒత్తు అంటే హల్లుకి ఉండే ప్రత్యామ్నాయ రూపం. ‘ప కింద ఒత్తు ఇస్తే ఫ’ అయినప్పుడు ప అల్పప్రాణం, ఫ మహాప్రాణం. ఈ రెండు రకాల ప్రయోగాలని ఒత్తు అనే అంటున్నాను. హల్లులు అచ్చులతో కలసినప్పుడు వాడే గుర్తులని ఒత్తులు అనరు కాని, తేలిక తెలుగులో మనని ఎక్కువగా ఇబ్బంది పెట్టే వట్రసుడిని కూడ ఈ కోవలో చేర్చి మాట్లాడుకుందాం.

నా దగ్గర శాస్త్రీయమయిన గణాంకాలు లేవు కాని ఈ నాడు వాడుకలో ఉన్న తెలుగులో ఎక్కువ వర్ణక్రమదోషాలు దొర్లే సమయం ఒత్తులు ఉపయోగించే సందర్భంలోనే అని నా నమ్మకం.

తెలుగులో ఒత్తక్షరాలు లేవు. సంస్క్రుతం నుండి దిగుమతి అయిన మాటలని తెలుగు లిపిలో రాయడానికని ఒత్తు అక్షరాలని మన వర్ణమాలలో ప్రవేశపెట్టేరు. కనుక ఏ మాటలో ఏ అక్షరానికి ఒత్తు ఉందో తెలియాలంటే సంస్క్రుతంతో పరిచయం ఉండాలి. ఆ పరిచయం లేకపోతే ఒత్తులు ఎక్కడ పెట్టాలో బట్టీయం వెయ్యాలి తప్ప అన్ని సందర్భాలలోను పని చేసే నియమాలు, సూత్రాలు, బండగుర్తులు లేవు. కనుక ఒత్తులు ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పెట్టకూడదో చెబుతూ కూర్చుంటే నాకు ఉన్న నియమిత కాలం సరిపోదు. అందుకని తప్పనిసరి సందర్భాలలోనే ఒత్తులు ఉన్న మాటలు వాడి పబ్బం గడుపుకోవలసి వచ్చింది. సంస్క్రుత పదాల వాడుక తగ్గిస్తే ఒత్తుల అవసరం తగ్గుతుంది కదా.

ఒత్తక్షరాల విషయంలో మూడు రకాల తప్పులు దొర్లుతూ ఉంటాయి:

లేని చోట ఒత్తు పెట్టడం: కర్మ కి బదులు ఖర్మ అని, ఉచ్చారణకి బదులు ఉచ్ఛారణ అని రాయడం ఉదాహరణలు.
ఉండవలసిన చోట ఒత్తు పెట్టకపోవడం: బాధ, భేదం, బంధం, వగైరా మాటలలో ఒత్తు ఎక్కడుండాలో చాలమందికి తెలియక తప్పు చోట ఒత్తు పెడుతూ ఉంటారు.
ఒత్తు ఉన్న చోట తప్పు రకం ఒత్తు పెట్టడం: సాధారణంగా త, థ ఒత్తులని, థ, ధ ఒత్తులని, ట, ఠ ఒత్తులని తారుమారు చెయ్యడం ఈ రకం తప్పులకి ఉదాహరణలు. అర్థం, అర్ధం, షష్టి, షష్ఠి వంటి మాటలలో ఒత్తుని బట్టి అర్థం మారిపోతుంది. ప్రథమ, ప్రధమ, విశ్వనాథం, విశ్వనాధం వగైరాలు మరొక జాతి తప్పులకి ఉదాహరణలు.
ఒత్తులని పూర్తిగా మానేసి, సాదకబాదకాలు అని రాస్తే, ఏదోలే, రచయిత విక్రుతి రూపం వాడి ఉండొచ్చు! అని సరిపెట్టుకోవచ్చు కాని, సాదకబాధకాలు అని ఒక చోట ఒత్తు సరిగ్గా రాసి, మరొక చోట రాయకపోతే భండారం బయట పడుతుంది.

ఒక మాటలో ఏ అక్షరానికి ఒత్తు ఉందో అనుమానం వచ్చినప్పుడు అదే ధాతువు నుండి పుట్టిన ఏకోదర పదాలు నెమరు వేసుకుంటే కొంత లాభం ఉండొచ్చు. కొన్ని ఉదాహరణలు: భేదం అనే మాటలో బ-కి ఒత్తు ఇవ్వాలి. ఈ మాటకి ఎక్కడ ఒత్తు పెట్టాలా అనే సంశయం నాకూ వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ భేదం యొక్క ధాతువు నుండి ఏర్పడ్డ సమీప పదాలని ఒక సారి నెమరు వేసుకుంటాను: విభేదం, భేదించు, దుర్భేద్యం, మొదలయినవి. ఇలా మననం చేసుకున్నప్పుడు ఎక్కడ ఒత్తు ఉండాలో సాధారణంగా తెలుస్తుంది. అలాగే బంధం, ప్రబంధం, అనుబంధం, దిగ్బంధం, నిర్బంధం,… ఇలా వల్లె వేసుకుంటూ పోతే ఒత్తు ఎక్కడ ఉండాలో సాధారణంగా నాకు స్పురిస్తుంది.

సాధారణంగా అర్ధ ఎక్కడ వాడాలో, అర్థ ఎక్కడ వాడాలో నాకు అనుమానం వస్తూ ఉంటుంది. ఒక్క సగం అనే భావాన్ని వ్యక్తపరచవలసినప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాలలోను అర్థ అనే ప్రయోగమే సరి అయినది. అర్ధ అంటే సగం, అర్థ అంటే కోరబడేది. ఈ వివరణతో పదార్థం, అర్థశాస్త్రం, విద్యార్థి, నిరర్థకం, పార్థసారథి, మొదలయిన పదాలన్నిటిలోను ర కింద థ వస్తుంది.

10. వర్ణక్రమదోషాలు, చిటకాలు
ఇంగ్లీషులో వర్ణక్రమదోషాలు రాకుండా కాపాడుకోడానికి నా చిన్నతనంలో నాలుగు చిటకాలు నేర్చుకున్నాను. ఇవి కేవలం చిటకాలు మాత్రమే; సర్వత్రా అన్వయించవు, చాల మినహాయింపులు ఉన్నాయి. కాని ఏ సూత్రం లేకపోవడం కంటె ఏదో ఒక సూత్రం ఉంది కదా అన్న ధోరణిలో ఈ సూత్రాలు తరతరాలబట్టి వస్తున్నాయి.

మొదటి సూత్రం: E after I, except C
EXAMPLES: believe, chief, piece, and thief; deceive, receive.
COMMON EXCEPTIONS: efficient, ancient, weird, height, weight, freight, neither, caffeine, foreign.

రెండవ సూత్రం: Drop the final E, before a suffix beginning with a vowel (a, e, i, o, u), but not before a suffix beginning with a consonant.
EXAMPLES:
ride + ing = riding
guide + ance = guidance
hope + ing = hoping
entire + ly = entirely
like + ness = likeness
arrange + ment = arrangement

COMMON EXCEPTIONS: truly, usable.

మూడవ సూత్రం: Change a final y to i before a suffix, unless the suffix begins with i.
EXAMPLES:
defy + ance = defiance
party + es = parties
pity + ful = pitiful
try + es = tries
try + ing = trying
copy + ing = copying
occupy + ing = occupying

COMMON EXCEPTIONS: journeying, memorize.

నాలుగవ సూత్రం: Double a final single consonant before a suffix beginning with a vowel when both of the following conditions exist:
(a) a single vowel precedes the consonant; (b) the consonant ends an accented syllable or a one-syllable word.
EXAMPLES:
stop + ing = stopping
admit + ed = admitted
occur + ence = occurrence
stoop + ing = stooping
benefit + ed = benefited
delight + ful = delightful

ఈ రకం చిటకాలని మనం తేలిక తెలుగులో తయారు చేసుకోవాలి. మచ్చుకి కొన్ని చూపెడతాను.

తేలిక తెలుగు మాటల మొదట్లో సున్న, నకారపొల్లు, ణ, థ, ళ ఉండవు.
ఒకే మాటలో రెండు అచ్చులు వరసగా ఉండవు.
మాట మొదట ద్విరుక్తం ఉండదు. ద్విరుక్తం అంటే ఒకే హల్లు రెండు సార్లు రావడం. అనగా, క్క, గ్గ, ట్ట వంటి అక్షరాలతో మాటలు మొదలవవు.
పదాదిలో ధకారమే ఉంటుంది, థ కారం ఉండదు: ధనం, ధాన్యం, ధ్వని.
సంయుక్త వర్ణం అంటే రెండు కాని, అంత కంటె ఎక్కువ కాని వివిధ హల్లుల సమాగమం. తేలిక తెలుగులో రెండవ వర్ణం ర-కారం అయినప్పుడు, ఆ ర-కారం లోపించిన రూపాన్నే వాడండి. ఉదాహరణకి కింద, కుక్కు, కొత్త, కొవ్వు, గుడ్డి, తవ్వు, తాగు వంటి ప్రయోగాలనే వాడండి.
కచటతప-లకి థ ఒత్తే ఉంటుంది కాని ధ ఉండదు: అశ్వత్థ.
గజడదబలకి ధ ఒత్తే ఉంటుంది: బద్ధ, బుద్ధ, ప్రసిద్ధ, సిద్ధ, శుద్ధ, సిద్ధాంత.
సకారంతో థ కారమే వస్తుంది, ధ కారం రాదు: స్థితి, స్థాన, అవస్థ, ఆస్థి, స్థూల, స్థితి, స్థాన, అవస్థ, ప్రస్థాన.
చివరగా, మనలో చాల మంది దేముడు అని రాస్తారు. ఇలా రాయకూడదని తప్పు ఎత్తి చూపితే, ఇది మా మాండలికం! అని దబాయిస్తారు. అదే వ్యక్తి దేమాలయం, దైమత్వం, దేమత, అని రాయడే! దేవాలయం, దైవత్వం, దేవత సరి అయిన ప్రయోగాలు కనుక దేవుడు అన్నదే సరి అయినది. మాండలికం ముసుగులో తప్పు రాసి సమర్ధించుకోవడం మంచి అలవాటు కాదు.

11. ప్రత్యయాలు, ఉపసర్గలు
ఏ భాష అయినా పెరిగి పెద్దదవాలంటే కొత్త మాటలు తయారు చేసుకునే సామర్ధ్యం ఉండాలి. ఈ ప్రతిభ సంస్క్రుతానికి ఎక్కువగా ఉంది. సంస్క్రుతము, లేటిన్, గ్రీకు ఒకే మూలం నుండి పుట్టేయని అంటారు కనుక ఇదే రకం ప్రతిభ లేటిన్‌కి, గ్రీకుకి ఉంది. అందుకనే ఇంగ్లీషు లేటిన్, గ్రీకుల మీద ఆధారపడ్డట్లే తెలుగు సంస్క్రుతం మీద ఆధారపడుతుంది. కనుక ఇంగ్లీషులో మనకి తారసపడ్డ కొత్త మాటని తెలుగులోకి అనువదించాలని అనుకున్నప్పుడు ఆ మాట యొక్క మూలం తెలుసుకుంటే ఆ మూలానికి సరితూగే సంస్క్రుత మూలం మనకి దొరుకుతుంది. అప్పుడు సంస్క్రుతం నుండి తెలుగులోకి దింపుకోవడం తేలిక.

పదనిర్మాణానికి ధాతువు మూలం. ఆ ధాతువుకి ఒక అర్థం ఉంటుంది. దానికి ప్రత్యేకమయిన అర్థాలు కల్పించడానికి ధాతువు ముందు ఉపసర్గలు చేర్చుతాం. ఉపసర్గని ఇంగ్లీషులో ప్రిఫిక్స్ (prefix) అంటారు. ప్రి (pre) అన్నదే ఒక ఉపసర్గ. దాని అర్థం ముందు అని కనుక ప్రిఫిక్స్ అంటే, ముందు ఉండేది అని స్వయం బోధకమయిన అర్థం వస్తుంది. మాట చివర చేరేదాన్ని ప్రత్యయం, సఫిక్స్(suffix) అంటారు. మాట చివర చేరేవి కనుక విభక్తులని విభక్తి ప్రత్యయాలు అని కూడ అంటారు.

ఇంగ్లీషులో సర్వసాధారణంగా కనిపించే ఉపసర్గలు 35 ఉన్నాయి. మచ్చుకి కొన్ని ఇంగ్లీషు ఉపసర్గలని చూపిస్తున్నాను:

a – అ , mono – ఏక, pre – ముందు, sub – అడుగున, tri = త్రి

ఇదే విధంగా సంస్క్రుతంలో 22 ఉపసర్గలు ఉన్నాయి. ఉదాహరణకి సంస్క్రుతంలో ప్ర అనే ప్రత్యయం ఉంది. దీనికి మిక్కిలి, మంచి, మొదలయిన అర్థాలు ఉన్నాయి. ఉదాహరణకి, యోగం అనే ధాతువుకి కూర్చడం, కలపడం, దగ్గరకి తీసుకు రావడం అనే అర్థాలు ఉన్నాయి కనుక ప్రయోగం అంటే బాగా చెయ్యడం లేదా బాగా చేసిన పని. అందుకనే ఇంగ్లీషులో ఎక్స్‌పరిమెంట్ అనే మాటని ప్రయోగం అంటున్నాం. ఈ ప్రయోగం చేసిన వ్యక్తి ప్రయోక్త, అనగా ఎక్స్‌పరిమెంటర్. కంపం అంటే వణకడం కనుక ప్రకంపం అంటే బాగా వణకడం. ఇంగ్లీషులో వైబ్రేషన్ అన్న మాటకి సమానార్థకంగా ప్రకంపం వాడుతున్నాం. క్రియ అంటే ఏక్షన్ (action) అయినప్పుడు ప్రక్రియ అంటే ప్రోసెస్ (process) అవుతుంది. ఇక్కడ, బాగా సాగదీసిన క్రియ – అని చెప్పుకోవాలి. క్రియ అనేది ఒక క్షణంలో జరిగే పని అయితే ప్రక్రియ జరగడానికి కొంత కాలం పడుతుంది. కొట్లాడుకుంటూన్న రెండు దేశాల మధ్య శాంతి భద్రతలు నెలకొనాలంటే జరిగే ప్రయత్నం ఒక రోజులో జరిగేది కాదు కదా? అందుకనే దానిని శాంతి ప్రక్రియ అనొచ్చు (పీస్ ప్రోసెస్).

ఉద్యాపన
ఈ వ్యాసంలో నేను ప్రయోగాత్మకంగా చేసిన పని లోని ముఖ్యమయిన అంశాలని ప్రస్తావించేను తప్ప ఇదే మార్గంలో అందరూ కాకపోయినా కొందరైనా ప్రయాణిస్తారన్న ఆశతో రాసినది కాదు. నా కష్ట సుఖాలని చెప్పుకున్నాను. మన భాష రూపురేఖలు ఎలా ఉంటాయో పాశ్చాత్య విద్యార్థులకి చూపిద్దామనే ఉద్దేశంతో చేసిన ప్రయోగం ఇది. ఈ పది వారాలలోనూ నా విద్యార్థులు తెలుగు నేర్చేసుకుని, కవిత్వాలు అల్లేసేరని నేను బుకాయించినా మీరు నమ్మరని నాకు తెలుసని మీకూ తెలుసు!
---------------------------------------------------------
రచన: వేమూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, February 26, 2019

ఖండిత, కలహాంతరిత


ఖండిత, కలహాంతరిత





సాహితీమిత్రులారా!


ఖండిత
నీత్వాఽన్యత్ర నిశాం ప్రాతరాగతే ప్రాణవల్లభే|
అన్యాసంభోగచిహ్నై స్తు కుపితా ఖండితా మతా||

అని విద్యానాథుని ప్రతాపరుద్రీయములో ఖండిత నిర్వచనము. ‘రాత్రియంతయు అన్యకాంతతో గడిపి, ప్రొద్దున తత్సంభోగచిహ్నములతో వచ్చిన నాయకునిపట్ల కుపితయైన నాయిక ఖండిత’ అని దీని కర్థము. ప్రతాపరుద్రీయమునే అనుసరించిన రామరాజభూషణుని ‘విభుఁడన్య సతిఁ బొంది వేఁకువ రాఁ గుందు నబల ఖండిత’ అను నిర్వచనము దీనికి దాదాపుగా సరిపోవుచున్నది. కాని ఈ నిర్వచనములో నాయకుని యొక్క అన్యస్త్రీసంగమచిహ్నముల ప్రసక్తి లేదు. చిహ్నములు లేకున్నను ప్రియుడు అన్యకాంతాసంగము చేసి వచ్చినాడని శంకించి కోపగించిన నాయికయు ఖండితయే యగుచున్నది. అన్యకాంతాసంగము జరిగినదను అనుమానమే ఈనాయికయొక్క రోషదైన్యాదులకు కారణము.

అన్యవ్యాపకముల వల్ల నాయకుడు రాకున్నచో మనోవైకల్యమును జెందునది విరహోత్కంఠిత. ఈవిధముగా ఖండిత యొక్కయు, విరహోత్కంఠిత యొక్కయు మనఃస్థితులకు కారణమైన పరిస్థితులకు స్పష్టమైన భేదమున్నది. అందుచే వీరు వేర్వేరు నాయికలుగా గుర్తింపబడినారు. సాపరాధుడైన నాయకుని దేహమునందలి పరకాంతాసంగమసంకేతములను పరిశీలించి, చింత, నిశ్శ్వాసము, ఖేదము, సఖీసంలాపము, గ్లాని, దైన్యము, అశ్రుపాతము, రోషము, భూషణత్యాగము, రోదనాదులతో ఖండితానాయిక తన యవస్థ నభినయించవలెనని భరతుడు తెల్పినాడు. రసార్ణవసుధాకరములోని ఈక్రింది శ్లోకము ఇట్టి ఖండితానాయికయొక్క చేష్టలను చక్కగా వర్ణించుచున్నది.

ప్రభాతే ప్రాణేశం నవమదనముద్రాంకితతనుం
వధూర్దృష్ట్వా రోషాత్ కిమపి కుటిలం జల్పతి ముహుః|
ముహుర్ధత్తే చిన్తాం ముహురపి పరిభ్రామ్యతి ముహు
ర్విధత్తే నిఃశ్వాసం ముహురపిచ బాష్పం విసృజతి||

తాత్పర్యము: ప్రభాతమునందు ప్రాణేశునియొక్క నవమదనముద్రాంకితమైన తనువును చూచి, అతని కాంత రోషంతో మాటికి ఏవో కుటిలమైన (ఎత్తిపొడుపు) మాటలు వల్లించును. మఱిమఱి చింత వహించును. మఱిమఱి నిలుకడ లేక చలించును, నిఃశ్వాసములు వెడలించును, కన్నీటిని గార్చును. ఇట్లు కాంతుని ప్రవర్తనపట్ల కాంతలో గలిగిన సంక్షోభము నామె చేష్టలు ప్రవ్యక్తమొనర్చినవి.

వసుచరిత్రం లోని ఈక్రింది పద్యంలో రామరాజభూషణుడు బహురమ్యంగా తుమ్మెద తనువందు పద్మినీసంగమచిహ్నము లున్నట్లు వర్ణించినాడు.

ఉ. తుమ్మెద త్రిమ్మరీఁడు పయిఁదోఁచుపిశంగిమ పద్మినీనిశాం
     కమ్మది తాఁ బరాగపటిఁ గప్పి మధువ్రతిఁ జేరఁబోవుచున్
     నమ్మిక కంగజప్రహరణమ్ముల ముట్టెడుఁ జూడవమ్మ ప
     ల్గొమ్మలఁ జెందువారలు తగు ల్విరియాటలు నేర కుందురే.

తాత్పర్యము: తుమ్మెద యను త్రిమ్మరి మధువ్రతిని (ఆడతుమ్మెదను) జేరబోవుచు, తన శరీరమునందలి నిశాంకమైన (రాత్రి పద్మినిని గూడియున్నందువలన మేనికంటిన) పసుపుపచ్చని మరకను (తెల్లని) పరాగమను వస్త్రముతో గప్పి, తాను రాత్రియందు పద్మినీసంగము చేయలేదని మధువ్రతికి నమ్మిక కల్గునట్లు మన్మథాయుధములను ముట్టుకొనుచున్నాడు. మఱి పలుకొమ్మలను (అనేకస్త్రీలను, అనేకతరు శాఖలను) పొందువారు తగులములు (ఆసక్తులు), విరియాటలు (పుష్పక్రీడలు, స్వేచ్ఛావిహారములు) నేర్వకుందురా? – నేర్తురుగదా యని కాకువు.

వివరణ: తుమ్మెదలు రాత్రియందు ముకుళించు పద్మములయందు జిక్కుకొని పగ లాపద్మములు విచ్చికొనగానే బయల్వెడునని వర్ణించుట కవుల సంప్రదాయము. అట్లు (తుమ్మెద యను నాయకుడు) పద్మినితో (అనగా పద్మలతయను పద్మినీజాతిస్త్రీతో) రాత్రియంతయు గడపుటచేత ఆనాయకునిమేనికి నిశాంకము పచ్చగా నంటినది. ఇచ్చట నిశాంక మనగా రాత్రికేళీపరమైన చిహ్నము. ‘నిశాఖ్యా కాంచనీ పీతా హరిద్రా వరవర్ణినీ’ అని యుండుటచేత నిశాశబ్దమునకు పసుపనియు అర్థము. అందుచే ఆపద్మినీజాతిస్త్రీ శరీరమున లేపనము చేసికొన్న పసుపు ఆమెతో రాత్రి క్రీడించుటచే నాయకున కంటుకొన్నదని అర్థము. రాత్రిపూట పద్మములో జిక్కుకొనుటచే పద్మపరాగము తుమ్మెదమేనికి పచ్చగా పసుపుమరకవలె అంటుకొన్నదని స్వాభావికార్థము. అట్టి పరస్త్రీసంగమచిహ్నమును (తెల్లని) పరాగమను వస్త్రముతో గప్పివైచి, పైగా దానేమి తప్పును చేయలేదని నమ్మకము కల్గించుటకై మన్మథాస్త్రములను ముట్టుకొని ఒట్టును పెట్టుకొనుచున్నాడీ మగతుమ్మెద యను ధృష్టనాయకుడు. మన్మథాస్త్రములన పువ్వులు. మన్మథునికి అస్త్రములు పువ్వులే కదా! పద్మములలో నుండి వెల్వడిన తుమ్మెద లితరపుష్పముల పరాగమును ధరించుట, ఇతరపుష్పములను స్పృశించుట స్వాభావికమేకదా! ఇట్లీ ప్రశస్తమైన పద్యములో ఖండితానాయికకు కోపకారణమైన నాయకుని యొక్క పరకాంతాసంగమచిహ్నములు చక్కగా వర్ణింపబడినవి. కపటియైన నాయకుడా చిహ్నములను గప్పిపుచ్చి తాను నిర్దోషినని మన్మథప్రహరణములను ముట్టుకొని ఒట్టుపెట్టుకొని ఆమెను నమ్మించి, ప్రమాదమును తప్పించుకొనినాడు.

రాత్రిర్యామత్రయపరిమితా, వల్లభాస్తే సహస్రం
మార్గాసక్త్యా మమ గృహమపి ప్రాత రేవాగతోసి|
కిం కర్తవ్యం? వద! నృపతిభిః వీక్షణీయా హి సర్వాః
కోవా దోషస్తవ? పునరహం కామ మాయాసయిత్రీ||

పై శ్లోకము ఖండితాలక్షణమునకు ప్రతాపరుద్రీయములో విద్యానాథు డిచ్చిన చక్కని ఉదాహరణము. దీనికి శ్రీమాన్ చలమచర్ల రంగాచార్యుల వారి అనువాద మీక్రింది పద్యము:

మ. సరిగా జాములు మూఁడు రేయికిఁ; బ్రియాసంఘంబ వేయింటి కౌ,
     వఱువాతన్ నృప! దారిఁబోవుచు నిటుల్ వైళంబ విచ్చేసితే?
     నరపాలుర్ దమ, రందఱం గనుఁగొనన్ న్యాయ్యంబెగా! యేమనన్?
     మఱి మీదోసము లేదు లెండు, మిగులన్ బాధించు నాదోసమే!

రాత్రి యంతయు అన్యకాంతతో గడపి, ప్రొద్దున సంభోగచిహ్నములతో నిలు చేరిన ప్రభువును జూచి ఖండితానాయిక వక్రోక్తిగా ననుచున్నది: రాత్రియో మూడుజాములు మాత్రమే. తమరికో ప్రియాసంఘము వేయింటి కున్నది. ఏదో తెల్లవాఱి (రాత్రి కాదని భావము) దారిని బోవుచు (అనైచ్ఛికముగా ననుట) ఈయింటిలో దూరితిరి. తాము ప్రభువులు (సరసులు గారనుట). మీకందఱు సమానులే (గుణదోషవిచక్షణ లేదనుట). అందఱిని చూడవలసినవారే. మీకింతటి బాధను (ప్రయాసను) కలిగించుట నాదే దోషము. మీదోష మిసుమంతయు లేదు.

ఇటువంటి వక్రోక్తి (వ్యాజస్తుతి) గలదే పుష్పబాణవిలాసం లోని అందమైన ఈక్రింది శ్లోకము.

సత్యం తద్యదవోచథా మమ మహాన్ రాగ స్త్వదీయాదితి
త్వం ప్రాప్తోఽసి విభాత ఏవ సదనం మాం ద్రష్టుకామో యతః|
రాగం కించ బిభర్షి నాథ హృదయే కాశ్మీరపత్త్రోదితం
నేత్రే జాగరజం లలాటఫలకే లాక్షారసాపాదితమ్.||

వివరణ: నాయకుడు రాత్రి అన్యకాంతతో గడిపి, వేకువన తనకాంత కడకు వచ్చినాడు. అతనిని జూచి, వ్యాజస్తుతితో ఆనాయిక ఇట్లు ఉపాలంభించుచున్నది. నాథ=ప్రియుడా! త్వదీయాత్=నీకంటె, మమ రాగః మహాన్ ఇతి= నా రాగము అధికమైనదని, యత్=ఏది, అవోచథాః= పలికితివో, తత్=అది, సత్యం=సత్యమే; యతః=ఎందుచేత ననగా, మాం=నన్ను, ద్రష్టుకామః =చూడగోరినవాడవై, త్వం=నీవు, విభాత ఏవ = పెందలకడనే (రాత్రి రాలేదనుట), ప్రాప్తోఽసి=వచ్చితివి; కించ=మఱియు, హృదయే=ఎదయందు, కాశ్మీరపత్త్రోదితం= కుంకుమ పత్త్రభంగజనితమైనట్టిదియు, నేత్రే జాగరజం= కనులయందు జాగరణచే గల్గినదియు, లలాటఫలకే=నొసటియందు, లక్షారసాపాదితం= లాక్షా రసముచే గల్గినదియు నగు, రాగం=రాగమును , బిభర్షి=ధరించియున్నావు.

తాత్పర్యము: ఓ నాయకుడా! నాకు మనసులో మాత్రమే నీపై రాగమున్నది. మఱి నీకో శరీరమందంతటను రాగమున్నది. నీయెదలో కశ్మీరపత్ర రాగ మున్నది; కనులలో జాగరణరాగ మున్నది; నొసటిపై లాక్షారసరాగ మున్నది. నాపై ఎంత మక్కువయో, నాకడకు పెందలకడనే వచ్చితివి (రాత్రి రాలేదనుట). నీవు వచించినట్లు నీకు నాయందు గల రాగాతిశయ మధికమైన దనుటలో అసత్య మింతయు లేదు. ఇచ్చట రాగ మనగా అనురాగమనియు, ఎఱ్ఱదనమనియు గ్రహింపవలెను. ‘నాకు మనసులో మాత్రమే రాగమనగా అనురాగ మున్నది. నీకో శరీర మంతటను రాగము (అనగా అన్యకాంతాసంభోగచిహ్నమైన ఎఱ్ఱదనము) ఉన్నది’ అని వ్యాజస్తుతిచే నాయిక నాయకుని ఉపాలంభించుచున్నది.



న బరీభరీతి కబరీభరే స్రజో, న చరీకరీతి మృగనాభిచిత్రకమ్|
విజరీహరీతి న పురేవ మత్పురో, వివరీవరీతి న చ విప్రియం ప్రియా||

అందమైన ఈశ్లోకం పుష్పబాణవిలాసంలోనిది. నాయకుని అన్యకాంతాసంగమచిహ్నములను గాంచి ఒక ఖండితానాయిక ఈర్ష్యామానములు వహించినది. అతనివైపు చూచుట లేదు, అతనితో మాటాడుట లేదు. అతని కామె నెట్లు ప్రసన్నురాలిని చేసికొనవలెనో తోచుట లేదు. ఆతడామె చెలికత్తెతో నిట్లనుచున్నాడు: ప్రియా=ప్రియురాలు, పురా ఇవ=ముందువలె, కబరీభరే=గొప్పనైన కొప్పునందు, స్రజః=పూదండను, న బరీభరీతి=మఱిమఱి తుఱుముకొనదు; మృగనాభిచిత్రకమ్=కస్తూరితిలకమును, న చరీకరోతి= మఱిమఱి (సవరించి) పెట్టుకొనదు; మత్పురః=నాయెదుట, న విజరీహరీతి=తరచుగా (మఱిమఱి) చరింపదు; విప్రియం=(నా)తప్పిదమును, న వివరీవరీతి చ= (మఱిమఱి యడిగినను) చెప్పదు గూడ.
ఓ చెలీ! ఈమె వైఖరి నీకు దెలిసియున్న చెప్పుము.

అలంకారశాస్త్రప్రకారము ఈనాయిక మధ్యా-ధీరా అను కోవకు చెందినది. ‘మధ్యా ధీరా ప్రియం మానే న పశ్యతి న భాషతే’ – ‘మధ్యా ధీర మానము (ప్రణయకోపమును) వహించినప్పుడు ప్రియునివైపు చూడదు, మాటాడదు’ – అని ఆమె లక్షణము. పైశ్లోకములో అపరాధియైన నాయకునిపట్ల ఇట్టి (ఖండిత)నాయిక చేయు విపరీతవర్తనము వర్ణింపబడినది. ఇందులో గల ‘బరీభరీతి’, ‘చరీకరీతి’ ఇత్యాది పౌనఃపున్యార్థ కములైన యఙ్లుగంతరూపములు ఈశ్లోకమునకు అధికమైన అందము నొసగుచున్నవి.

ఖండితానాయికకు కావ్యాదులనుండి ఎన్నియో చక్కని ఉదాహరణ లీయవచ్చును. ఉదాహరణకు పారిజాతాపహరణకావ్యములోని ప్రథమాశ్వాసములో సత్యభామను చక్కని ఖండితానాయికగా ముక్కుతిమ్మన నిరూపించినాడు. రుక్మిణియందలి అనురాగముచే తనను కించపఱచినాడని సత్యభామ ఈర్ష్యాపరిపూర్ణమానసయై అట్లు చేసినది. రుక్మిణిసిగలో పారిజాతమును తుఱిమినపుడు శ్రీకృష్ణునిమేనిలో నెలకొన్న ‘పారిజాతకుసుమాగతనూతనదివ్యవాసనల్’ అతని అన్యకాంతానురక్తిని పట్టియిచ్చు చిహ్నములైనవి. ఇవి ఆమె ఈర్ష్యాకోపముల నినుమడింప జేసినవి. ‘వేఁడినిట్టూర్పులు దళంబుగా నిగిడినవి’. ‘మానసంబున నెలకొన్న క్రోధరసము న్వడిఁగట్టుచునున్నకైవడిన్’ స్తనతటమందలి కుంకుమపత్రభంగములు చెమటచే కరఁగి వెలిపట్టుపయ్యెద తడిసి ఎఱ్ఱవారినది. ఆమె శ్రీకృష్ణుని శిరస్సును తన్నుటయే గాక అతని ననేకవిధముల సూటిపోటిమాటలతో తూలనాడినది. చివరికి ‘ఈసునఁ బుట్టి డెందమున హెచ్చిన శోకదవానలంబుచే గాసిలి’, ‘పంకజశ్రీ సఖమైన మోముపయిఁ జేలచెఱంగిడి బాలపల్లవగ్రాసకషాయకంఠకలకంఠవధూకలకాకలీధ్వని’తో నేడ్చినది. ఈమానసికలక్షణములు, చేష్టలన్నియు అలంకారశాస్త్రములో లాక్షణికులు ఖండిత కాపాదించినవే. ఇట్లు ఖండితయొక్క పరిపూర్ణస్వరూపమును ముక్కుతిమ్మన సత్యభామయందు చూడనగును.

కలహాంతరిత
ఈర్యాకలహనిష్క్రాన్తో యస్యా నాగచ్ఛతి ప్రియః|
సామర్షవశసంప్రాప్తా కలహాన్తరితా భవేత్||

అని నాట్యశాస్త్రములో కలహాన్తరితాలక్షణము గలదు. ‘అల్క నధిపుఁ దెగడి అనుశయముఁ జెందు సతి కలహాంతరిత’ యను నిర్వచనము దీనికి సమముగానే యున్నది. ‘కలహేన అంతరితా వ్యవహితా అర్థాత్ ప్రాణనాథతః’ – ‘కలహమువల్ల వల్లభునితో ఎడయైనది’ అని కలహాంతరితా శబ్దమునకు వ్యుత్పత్తి. ఈకలహము రోషము, ఈర్ష్య, అసహనములచేత కలుగవలెను. ఇట్టి మనఃస్థితి అన్యకాంతానురక్తుడైన నాయకుని విషయమున గలుగుట సహజము. అట్టి కాంత ఖండిత యగును. అట్లు తనచే నుపాలంభింపబడి దూరమైన నాయకునిగూర్చి చింతించుచు, తనచర్యకు పశ్చాత్తాపము నొందు నాయిక కలహాంతరిత యగును. ఇట్లు ఖండితకు, కలహాంతరితకు స్వాభావికమైన పారంపర్యము గలదు. అమరుకశతకంలోని ఈ క్రింది శ్లోకము ‘కలహాంతరిత’కు చక్కని ఉదాహరణము.

చరణపతన ప్రత్యాఖ్యాన ప్రసాద పరాఙ్ముఖే
నిభృతకితవాచారేత్యుక్తే రుషాపరుషీకృతే|
వ్రజతి రమణే నిఃశ్వస్యోచ్చైః స్తనార్పితహస్తయా
నయనసలిలచ్ఛన్నా దృష్టిస్సఖీషు నిపాతితా||

అర్థవివరణము: నాయకునియందు పరస్త్రీసంభోగచిహ్నములు బయల్పడుటచే ఆమె కృద్ధురాలైనది. ఆమె కోపము నుపశమింపజేయుటకై ఆమె చెలుల సమక్షములో నాయకు డామె పాదములపై బడినాడు (ముక్కుతిమ్మన శ్రీకృష్ణుడును ఇట్లే చేసినాడు). ఐనను ఆమె అతనియందు విముఖురాలైనది. పైగా ‘నిభృతకితవాచారా =(సిసలైన మోసగాడా)’ అని అతనిని (చెలుల యెదుట) పరుషముగా నిందించినది. అతడు (రోషముతో) వెడలిపోసాగినాడు. ఆతని నివారించుట కామె మాన మడ్డము వచ్చినది. అంతలో తన చేష్టల కామెకు కొంత పశ్చాత్తాపము కల్గినది. అప్పుడామె స్తనతటమం దుంచిన హస్తముతో, బిగ్గరగా (దీనయై) నిట్టూర్చుచు, ఆశ్రుచ్ఛన్నములైన నేత్రములను (మీరైన ఆతనిని మఱలింపలేరా అను భావముతో) చెలులపై నిల్పినది. కోపముతో నిందింపబడిన నాయకుడు , తనను విడిచిపోగా తన చేష్టలకు పశ్చాత్తాపము నొందు నాయిక యిందు వర్ణింపబడినది.

రామరాజభూషణుని కావ్యాలంకారసంగ్రహములోని క్రింది యుదాహరణముసైతము రమ్యముగా నున్నది.

ఉ. ఆనఁగరాని కోపమున నప్పుడు కాంతుని ధిక్కరించుచో
     మానదురాగ్రహగ్రహము మానుపలేకపు డెందుఁ బోయెనో
     యా ననవింటిదంట యిపు డేఁపఁదొడంగె; భవిష్యదర్థముల్
     గానని నా మనంబునకుఁ గావలె నిట్టి విషాదవేదనల్.

తాత్పర్యము: ఈర్ష్యాకోపముల బట్టలేక ఒకకాంత నాయకుని దూఱినది, తిరస్కరించినది. అతడామెకు దూరమైనాడు. వల్లమాలిన మానము, దురాగ్రహములనెడు భూతము తనను సోకినప్పుడు వానిని నివారింపలేని మన్మథుఁడు తననిప్పుడు సోకి బాధించుచున్నాడు. ముందుచూపు లేక యట్లు ప్రవర్తించిన తన మనసున కిట్టి దుఃఖము, ప్రయాస కల్గవలసినదే యని ఆకాంత పశ్చాత్తప్తురా లైనది.

ఇటువంటి మానసికస్థితిని ప్రతిబింబించునదే ఈక్రింది భానుదత్తుని ‘రసమంజరి’లోని శ్లోకము:

అకరోః కిము నేత్ర! శోణిమానం?
కిమకార్షీః కర! పద్మతర్జనం వా?
కలహం కిమధా ముధా? రసజ్ఞే!
హితమర్థం న విన్దతి దైవదృష్టాః!

దీనికి నా భావానువాదము:

తే. పూనితేల నేత్రంబ! ప్రశోణిమంబు?
      జగడమాడితి వేల రసజ్ఞ! వృథగ?
      కేలుదమ్మిచే వెఱపించితేల? కరమ!
      మిమ్మనఁగ నేల? నాభాగ్య మిట్లు గ్రాల!

వివరణ: ఒక ఖండితానాయిక కాంతుని నిందించినది. అతఁడు పాదగ్రస్తుఁడై ఆమెను అనునయింప యత్నించినాడు. ఐనను మానవతియైన ఆమె ప్రసన్నురాలు కాలేదు. ఇంకను కనులెఱ్ఱచేసి అతనిపై కోపగించినది. నిష్ఠురము లాడి కలహించినది. హస్తమందలి లీలాపద్మమును ౙళిపించి ఆతని వెఱపించినది. ఆతడామెను వీడి పోయినాడు. కొంతసేపటి కామె మానము వీగిపోయినది. కలహాంతరితయైన ఆమె తన కాత్మీయమైన నేత్రజిహ్వాహస్తములే వైరులవలె నట్లు చేసినవని వానిని నిందించినది. కాని అట్లు వాని ననుట వ్యర్థమనుకొన్నది. తన దౌర్భాగ్యముచే నట్లు జరిగినదని విధినే దూషించుచు పశ్చాత్తాపము నొందినది. ఇట్టి చేష్టావిశేషములవల్ల ఆనాయిక ప్రౌఢ యని తేలుచున్నది. చివరిగా రసభావానుకూలముగా టొరంటోలోని శ్రీమతి చర్ల రత్నశాస్త్రిగారు పాడిన మత్కృతమైన యీక్రిందిపాటలో, అన్యకాంతా సంభోగచిహ్నముల గాంచి కాంతుని దూషించిన ఖండితానాయిక, కలహాంతరితయై పశ్చాత్తాపముతో వానిని ప్రసన్నుని జేసికొని రమ్మని సరసురాలైన తన సఖిని వేడికొనుట ఇతివృత్తముగా నున్నది:

(మోహనరాగం)

పల్లవి:
ఏమి సేతునె చెలియ! ఇంకేమి సేతునే
విభుని దూరము సేసి, విరహంబు పాలైతి
అ.పల్లవి:
తగవులాడితి చాల, తాకంగ వలదంటి
మునుపుగూడినదాని పొంతకే పొమ్మంటి |ఏమి సేతునె|
చరణం 1:
వాని తనువున దాని వలపుగుర్తులు గంటి
గండమందున దానికంటికాటుక గంటి
కనులయందున జాగరణ చిన్నెలను గంటి
నన్ను దాకకు, దాని సన్నిధికె పొమ్మంటి |ఏమి సేతునె|
చరణం 2:
బాలనని నన్నింత వంచింతువా యంటి
చాలులే మురిపాలు సరసాలు పొమ్మంటి
అంటి నే గాని యిటులొంటరిని ననుజేసి
స్మరువింటి కెరసేసి చనడేమొ యనుకొంటి |ఏమి సేతునె|
చరణం 3:
సరసురాలవు నీవు, చతురవూ నీవు
త్వరతోడ జని వాని తిరిగి రమ్మనవె
తాళుకొంటిని వాని తప్పిదం బనవె
బాళితో నలరింతు పంతమేలనవె |ఏమి సేతునె|
--------------------------------------------------------
రచన: తిరుమల కృష్ణదేశికాచార్యులు, 
ఈమాట సౌజన్యంతో

Monday, February 25, 2019

ఉద్యోగపర్వము – రాయబారాలు


ఉద్యోగపర్వము – రాయబారాలు



సాహితీమిత్రులారా!

మహాకవికి తన ప్రతిభా వ్యుత్పత్తులను సమగ్రంగా ప్రదర్శించటానికి తగిన వస్తువు లభించడం అతని అదృష్టం. కవి గొప్పతనం అతడు స్వీకరించిన వస్తువు మీద, తన్నిర్వహణ విధానం మీద ఆధారపడి ఉంటుంది. సవ్యసాచి అస్త్రకళాకౌశలానికి, భుజబలోద్రేక విలాసోన్నతికి గాండీవం లభించినట్లు తిక్కన ప్రతిభా వ్యుత్పత్తులకు, కావ్యశిల్ప కళాపారగత్వానికి తగిన భారతం కథావస్తువుగా లభించటం అతని భాగ్యవిశేషం.

భారత రచనలో కవిబ్రహ్మ తనకు గల రాజనీతివేతృత్వాన్ని, యుద్ధకళా పరిచయాన్ని, వేదాంత విద్యావైశారద్యాన్ని, కూలంకషమైన సర్వశాస్త్ర పాండిత్యాన్ని, అసాధారణమైన లౌకిక జ్ఞానసంపదను ప్రదర్శించటానికి తగిన అవకాశం దొరికింది. ముఖ్యంగా విరాటోద్యోగ పర్వాలలో అతడు చూపించిన కావ్యశిల్ప వైభవం, రాజనీతి శాస్త్ర వైదుష్యం అద్వితీయము, అనితరసాధ్యము. హృదయాహ్లాదకరము, ఊర్జితము, నానారసాభ్యుదయోల్లాసి అయిన కథ విరాట పర్వంలో ఉంది. కావ్యకళాజనిభూమి యైన కవిబ్రహ్మ తనకున్న కావ్యశిల్ప కళాపారగత్వాన్ని సమగ్రంగా ప్రదర్శించటానికి ఆ కథలో అవకాశం దొరికింది. మఱి ఉద్యోగ పర్వంలో అట్టి మనోహరమైన కథ లేదు. అసలీ పర్వంలో కథకు ప్రాధాన్యం మిక్కిలి తక్కువ. ఉపాఖ్యానాలను తొలగించి చూస్తే దీనిలోని ప్రధాన కథావస్తువు ద్రుపద పురోహితుని, సంజయుని, కృష్ణుని రాయబారాలే. ఈ మూడు రాయబారాల్లో ఉన్న కథను మూడు ముక్కలలో తేల్చి చెప్పవచ్చని విమర్శకుల అభిప్రాయం. “చిన్న నాటి నుంచీ కౌరవులు పాండవుల మీద పగబూని వారినెన్నో కష్టాల పాలు చేశారు. వాటినన్నింటిని సహించి శాంతాత్ములైన పాండవులు తమ రాజ్యభాగం తమ కిచ్చినట్లయితే సంధి కాగలదని సందేశ మంపుతున్నారు. అలా ఇచ్చి సంధి చేసుకోవడం కంటే న్యాయమేమున్నది? ” ద్రుపద పురోహితుడు చెప్పినా, సంజయుడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, చివరకు భీష్మ ద్రోణ విదుర ధృతరాష్ట్రాదులు చెప్పినా విషయమిదే. ఇంతమంది ఒకే విషయాన్ని చెప్పితే అది పునరుక్తి అవుతుంది. అలా పునరుక్తి కాకుండా, ఉత్కంఠ కలిగిస్తూ విషయ వివరణ చేయటం లోనే కవిబ్రహ్మ ప్రతిభ, అనన్య సామాన్యమైన వస్తు సంవిధాన నైపుణ్యం మనకు గోచరిస్తాయి.

‘ఉద్యోగ’ శబ్దానికి ప్రయత్నమని అర్థం. ప్రయత్నము సంధికా? సమరానికా? అన్నది ప్రశ్న. ఈ రెంటికీ అనియే చెప్పవలసి ఉంటుంది. సంధి సమర ప్రయత్నాలు ఎప్పుడూ ఏకకాలం లోనే జరగటం సహజం. సమర ప్రయత్నాలు సంపూర్ణంగా చేసుకొని, తమ స్థితిని బలపర్చుకున్న తరువాతనే సంధి ప్రయత్నాలు ప్రారంభించటం నేడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. Speak from strength అన్నది నేటికీ రాజనీతి శాస్త్రంలో ప్రధాన విషయం గానే ఉంది. అదే విధంగా ఉద్యోగ పర్వంలో కూడా సమర ప్రయత్నాలు పూర్తి అయిన తరువాతనే సంధి ప్రయత్నాలు ప్రారంభ మైనాయి. అయితే సమర ప్రయత్నాలు బయటికి కనపడకుండా నిగూఢంగా, సమర్థంగా సాగుతూ ఉండగా, సంధి ప్రయత్నాలు మాత్రం లోకంలో బహుళ ప్రచారం పొందుతాయి. అదే విధంగా, భారతంలో కూడా సమర ప్రయత్నాల ప్రాధాన్యం బయటికి కనపడకుండా, సంధి ప్రయత్నాలే విస్తృతంగా వర్ణింప బడటం గమనింప దగిన విశేషం. సంధి ప్రయత్నాలు విరివిగా జరిగినా, ఆ ప్రయత్నాలు చేసిన వారెవ్వరూ సంధి కాగలదన్న విశ్వాసంతో చేసిన వారు కారు. అందరూ అధర్మాన్ని ఎదుటివారిపై నెట్టి తాము ధర్మమార్గ వర్తులమని నిరూపించుకోవటానికి మాత్రమే ప్రయత్నం చేశారు. ఉద్యోగ పర్వం లోని రాయబారాలని పరిశీలించి చూస్తే ఈ విషయం విశదమవుతుంది. అందుచేత సంధి ప్రయత్నాలు సమర ప్రయత్నాలకి బలాన్ని చేకూర్చేవి మాత్రమే కావడం చేత ఉద్యోగ శబ్దానికి సమరోద్యోగం గానే విమర్శకులు అర్థం చెప్పారు. తిక్కన కూడా ఈ పర్వాన్ని సమరోద్యోగ పర్వం గానే భావించాడనటానికి అంతరంగ సాక్ష్యాధారాలు తరువాతి పర్వాలలో లభిస్తాయి.

అభిమన్యుని వివాహానికి వచ్చిన రాజులందరితో నిండిన సభలో శ్రీకృష్ణుడు చేసిన ఉపన్యాసంతో ఉద్యోగ పర్వం ప్రారంభమవుతుంది. ఈ ఉపన్యాసం ఉద్యోగ పర్వ కథావిధానానికి బీజప్రాయమైనదని చెప్పవచ్చు. ఈ పర్వ పరమార్థమైన సంధి సమర ప్రయత్నాల ప్రాధాన్యం సూచన ప్రాయంగా ఇందులో ప్రతిపాదించటం జరిగింది. ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ, “అలఘు బల విక్రమోదాత్తులకైనా బలము లేక అనంతములగు శత్రు సైన్యములను గెలువ వశమా?” అని ప్రశ్నించుతూనే దానికి సమాధానంగా, “భూవల్లభకోటి యిచట ప్రోవగు,” అంటాడు శ్రీకృష్ణుడు. పాండవులకు తోడుపడే రాజులనందరిని పిలిపించాలని, సమర సన్నాహాలు చురుకుగా సాగించాలని ఇందులో ధ్వనిరూపంగా సూచించడం జరిగింది. పిదప సంధి ప్రయత్నాల విషయం ప్రస్తావిస్తూ, “ఎదిరి మత మెఱుగక యెట్టి కార్య నిశ్చయము సేయ వెరవు గాదు; కావున నియ్యవవసరమున తగిన మానిసి నందులకు పుచ్చవలయు” నని కార్యవిధానాన్ని నిర్ణయించాడు. ఉద్యోగ పర్వం లోని పరమార్థమని చెప్పదగిన సంధి, సమర ప్రయత్నాలను సూచ్యంగా, సూత్రప్రాయంగా శ్రీకృష్ణుడు తన ఉపన్యాసంలో ప్రతిపాదించాడు. ఆ సూత్రాన్ని గ్రహించి వయోజ్ఞాన వృద్ధుడైన ద్రుపదుడు తమకు తోడ్పడే రాజులందరి దగ్గరకు దూతల నంపే విషయాలను నిర్ధారణ చేసి, కౌరవసభకు వెళ్ళే రాయబారిగా తన పురోహితుడిని నిర్ణయించాడు. ఈ కార్య విధానాన్ని ఆమోదించి అచ్చటి రాజులందరూ సమర సన్నాహాలు చేయటానికి తమ తమ పట్టణాలకు ప్రయాణమయ్యారు. పాండవుల సమర ప్రయత్నాల చందం విన్న దుర్యోధనుడు కూడా బంధుమిత్రులయిన రాజులతో సమర సన్నాహాలు చురుకుగా సాగించాడు. ఈ విధంగా ఉభయ కటకాల్లోను సమరోద్యోగం ముమ్మురంగా సాగుతున్న సమయంలో ధర్మరాజు అనుమతితో పాంచాలపతి తన పురోహితుని కౌరవుల దగ్గరకు రాయబారిగా పంపటానికి సభకు రప్పించాడు.

వయోజ్ఞాన వృద్ధుడైన తన పురోహితునిలో దూతకు కావలసిన లక్షణాలన్నీ ఉన్నవని ద్రుపదుని భావం. పురోహితుడు అతనికి హితుడు. ముఖ్యంగా రాయబారి తనను పంపేవాని హితం త్రికరణ శుద్ధిగా కోరాలి. అంతే కాక రాయబార కార్యం మిక్కిలి క్లిష్టమైనది. ఆ కార్య నిర్వహణ కెంతో చాకచక్యం, ప్రజ్ఞాప్రాభవం కావాలి. ఎట్టి విషయాన్నయినా ఎదుటి వారి మనస్సు నొచ్చుకోకుండా చెప్పే నేర్పు అవసరం. ఎంత మతిమంతుడైనా చతురవచన కోవిదుడైనా, సమయజ్ఞత, పరేంగిత జ్ఞానం దూతకు కావలసిన ముఖ్య గుణాలు. వీటికి ఆభిజాత్య గౌరవం మరింత వన్నె పెడుతుంది. ఈ లక్షణాలన్నీ తన పురోహితునిలో ఉన్నవని ద్రుపదుడు సభ లోనే చెప్పటం జరిగింది. అయితే, ద్రుపదుడు సంధి కాగలదనే ఆశాభావం తోనే ఈ రాయబారిని పంపుతున్నాడా? ఈ పురోహితుడు కౌరవ సభలో ఏ కార్యాన్ని, ఏ పద్ధతిలో సాధించాలని పాంచాలపతి ఆశించాడు? ఈ రాయబారి ద్వారా పంపిన సందేశ మేమిటి? అనే ప్రశ్నలను పరిశీలిస్తే ఈ పురోహితుని రాయబారం లోని ఆంతర్యం మనకు చక్కగా అర్థమవుతుంది. కౌరవులతో సంధి కాగలదన్న విశ్వాసం ద్రుపదునకు లేదు. “ఎల్లభంగుల సంగరంబు కాగల యది,” అని అతని నిశ్చితాభిప్రాయములు. “న కస్యాంచి దవస్థాయాం దాస్యంతి వైరాజ్యం,” కౌరవులెట్టి స్థితి లోను రాజ్యభాగ మీయరు అని అతని తలంపు. ఏ విధం గానూ రాజ్యభాగ మీయని కౌరవుల దగ్గరకు రాయబారం పంపడం దేనికి? ఒకవేళ రాయబారి వెళ్ళినా అతడు సాధించుకొని రావలసిన పనులేమిటి? అనే ప్రశ్నలు కలగటం సహజం. వీటికి సమాధానంగా ద్రుపదుడు తన పురోహితుడు రాయబారిగా వెళ్ళి సాధించుకుని రావలసిన కార్యాలను రెండుగా నిర్దేశించాడు. అందు మొదటిది కౌరవ పక్షం లోని వీరుల మనస్సులు పాండవ పక్షం వైపుకు మరలేటట్లు చేయటం. రెండవది అవతలి పక్షం లోని వారి చిత్తవృత్తులు తెలిసికొని రావటం. వ్యాస భారతంలో ద్రుపదు డాశించిన ప్రయోజనాలు వీటికి ఇంచుక భిన్నంగా ఉంటాయి. కౌరవ పక్షం లోని అమాత్యుల్లో, యోధుల్లో బేధం పుట్టించటం, వారి సమర సన్నాహాలను ఛిన్నాభిన్నం చేయటం, కొంత కాల మక్కడే ఉండి వారి సమర ప్రయత్నాలు సాగకుండా చేసి, ఆ సమయంలో పాండవులకు సైన్య సమీకరణకు, ద్రవ్య సంచయానికి అవకాశం కలిగించటం, ద్రుపదుడీ రాయబారం నుంచి ఆశించిన ప్రయోజనాలుగా మూలంలో చెప్పబడ్డాయి. ఈ విషయాలు గోప్యంగా ఉంచదగ్గవే కానీ వాచ్యం చేయటం ఉచితం గాను ఉదాత్తం గాను ఉండకపోగా ఆ కృత్యం కుటిల రాజతంత్ర మవుతుంది. అందుచేత, కవిబ్రహ్మ ఈ రాయబార సందర్భాన్ని కొంత వరకు మార్చి తన అనువాదానికి మెరుగులు దిద్దుకున్నాడు.

ద్రుపదుడు తన కప్పగించిన రాయబార కార్యాన్ని పురోహితుడు ఏ విధంగా నిర్వహించాడో పరిశీలించవలసి ఉంది. ఇతడు హస్తినాపురికి చేరే సమయానికి ఉభయ పక్షాలలోను సమర సన్నాహాలు పూర్తి అయినవి. అంటే సమర ప్రయత్నాలు సంపూర్ణంగా చేసికొన్న తరువాతనే సంధి ప్రయత్నాలు ప్రారంభించబడడం గమనింపదగిన విశేషం. పురోహితుడు ధృతరాష్ట్ర, ధార్తరాష్ట్ర, భీష్మ, ద్రోణ, కృపాది ప్రధాన పురుషుల నందరినీ వారి వారి మందిరాలలోనే దర్శించి వారి వారి చిత్తవృత్తులను చక్కగా ఆకళింపు చేసికొన్న తరువాతనే కౌరవసభలో రాయబార కార్యాన్ని నడపటానికి పూనుకున్నాడు. మొదట కౌరవుల వలన పాండవులు పడిన కష్టాలను సభ్యుల మనస్సుల కెక్కేటట్లు చెప్పి, ధృతరాష్ట్రుని ఉద్దేశించి, “దీనికెల్ల నియ్యకొనియె నీ పెద్దరాజు నేమనఁగ నేర్తు,” అని కొసమెరుపుగా పలుకుతాడు. దుష్కృతాల కన్నింటికి వృద్ధరాజు సమ్మతి కలదని ముఖం మీదే కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పడం జరిగింది. తరువాత ద్రౌపదీ పరాభవాన్ని, అరణ్య, అజ్ఞాతవాస క్లేశాలను స్మరిస్తూ ఇన్ని కష్టాల ననుభవించ గలిగిన పాండవులు కౌరవులతో సంధి గావించుకుని జీవించే కష్టాన్ని భరించలేరా? అని చెప్పటంలో పాండవుల కష్టసహిష్ణుత, సమయపాలన బుద్ధి, వంశగౌరవం, హృదయౌన్నత్యం – ఇత్యాది సద్గుణాలను కౌరవుల దుర్గుణాలతో తులనాత్మకంగా చూపిస్తూ సభ్యుల మనస్సులు పాండవుల వైపు మరలేటట్లు మాట్లాడతాడు. చివరకు, “కౌరవుల వృత్తము, పాండవుల వర్తనము తెఱగు మాత్సర్యం లేకుండా పరిశీలించి ధృతరాష్ట్రునకు గారవమున బుద్ధి చెప్పగా దగును మీకు,” అని చెప్పడంతో పురోహితుని రాయబార నిర్వహణ చాతుర్యం పరాకోటి కెక్కింది. కురుసభలో ధృతరాష్ట్రుని ఇలా కాదు అలా అని దిద్ది చెప్పగలవాడు భీష్ము డొక్కడే. పితృ ధనమైన రాజ్యభాగాన్ని పాండవుల కిచ్చి ధృతరాష్ట్రుడు వారిని తన కొడుకుల వలెనే చూచుకోవలనని కర్తవ్యాన్ని ఉపదేశిస్తూనే గాంగేయుడు, అలా చేయకపోతే కవ్వడి కోపాని కీలోకంలో ఎవ్వరూ ఆగలేరని పలుకుతాడు. అర్జునుని త్రిభువనైకధన్విగా పొగడిన భీష్ముని మాటలకు కోపించిన కర్ణుడు పాండవులు సమయాన్ని అతిక్రమించి రాజ్యభాగాన్ని అడగడమే తప్పని, రాజులను కూర్చుకొని ఎత్తివచ్చినంత మాత్రాన కురురాజు భయపడి రాజ్యభాగమిస్తాడా? అంటూ సంధి ప్రయత్నాలను భగ్నం చేయటానికి పూనుకుంటాడు. ఈ మాటలకు కటకటపడ్డ గంగానందనుడు కర్ణుని తీవ్రంగా మందలించుతాడు. కురుసభలో వాతావరణం మారిపోసాగింది. ద్రుపద పురోహితుని రాయబార ప్రయోజనానికి అనుగుణంగానే సభలోని కార్య విధానం పరిణమిస్తున్నది. కర్ణ గాంగేయులు వివాదం లోనికి దిగినారు. క్రమ క్రమంగా గురుకృపాదులు, దుర్యోధనాదులు ఆ వాగ్వాదం లోనికి దిగే అవకాశం లేకపోలేదు. ఆ కొలువుకూటం కలహకూటంగా మారే స్థితి ఎంతో దూరంలో లేదు. ప్రజ్ఞా చక్షువైన ధృతరాష్ట్రుడు పురోహితుని రాయబారం లోని ఆంతర్యాన్ని ఇట్టే పసిగట్టి పరిస్థితి విషమించక ముందే అతనిని హస్తినాపురి నుండి సాదరంగా సాగనంపాలని తలంచినాడు. గాంగేయుని భక్తితో అనునయించి, కర్ణుని మందలించి, పురోహితునితో, “నేను, బంధువులు, మంత్రులు, పెద్దలు ఆలోచించి ప్రజలందరకు ప్రీతి కలిగేటట్లు సౌమ్యుడైన వానిని బిడ్డలైన పాండవుల దగ్గరకు పంపుతాను,” అని అతనికి వీడ్కోలు చెప్పినాడు. ఈ విధంగా ఉద్యోగ పర్వంలో పురోహితుని రాయబారం ముగిసింది. ఈ రాయబారాన్ని పంపేటప్పుడు ద్రుపదు డాశించిన ప్రయోజనాలన్నీ పూర్తిగా చేకూరినవని చెప్పడంలో సందేహం లేదు. కౌరవ పక్షం లోని ప్రధాన పురుషుల చిత్త వృత్తులను పురోహితుడు చక్కగా అర్థం చేసుకున్నాడు. భీష్మాదుల మనస్సులు పాండవుల వైపుకు వ్రాలే విధంగా కౌరవుల సభలో రాయబార కార్యాన్ని నడిపించాడు. కర్ణ గాంగేయుల వాగ్వివాదం వలన ప్రధాన యోధులలో ఎలా భేదం కలిగించినాడో కూడా స్పష్టమవుతూనే ఉంది. ఈ రాయబారం వలన ద్రుపదుడు ఏయే ప్రయోజనాలు సాధించవలెనని ఆశించినాడో ఆవి అన్నీ కూడా నూటికి నూరుపాళ్ళు సాధింపబడినవని ఈ రాయబారాన్ని పరిశీలిస్తే విదిత మవుతుంది.

సౌమ్యునొక్కని పాండవుల దగ్గరకు పంపగలనని ధృతరాష్ట్రుడు పురోహితునితో చెప్పటం జరిగింది. ఆ సౌమ్యుడే తరువాత సంజయు డయ్యాడు. ధృతరాష్ట్రుడు సంజయుని ఏ స్థితిలో ఎందుకు రాయబారిగా పంపినాడో పరిశీలిస్తే గాని సంజయ రాయబారం లోని ఆంతర్యం సరిగ్గా అర్థం కాదు. విప్రుని రాయబారం తరువాత ధృతరాష్ట్రుడు క్లిష్ట పరిస్థితి నెదురుకొనవలసి వచ్చింది. తమ రాజ్యభాగం లేకుండా పాండవులు సంధి కంగీకరించరనే విషయం స్పష్టమయింది. వారికి పాలు పంచి ఇవ్వటంలో తన మాట ఎట్లున్నా దానికి దుర్యోధను డంగీకరించడు. కొడుకు మాట కెదురాడే సామర్థ్యం వృద్ధరాజుకు లేదు. ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహ పీడితుడు. అతిలోభ దూషితుడు. అట్టివాడు పాండవులకు రాజ్యభాగమిస్తాడా? పాలు పంచి ఇవ్వకపోతే యుద్ధము జరుగక తప్పదు. యుద్ధమే సంభవిస్తే గురు భీష్మాదుల వలన తమకే విజయము చేకూరగలదన్న ఆశ యొకవైపు, భీమార్జునుల కెదురు నిలుచు ప్రతివీరులు లేరన్న భయం ఒక వైపు, అతన్ని సందేహాందోళిత మనస్కునిగా చేశాయి. అందుచేత పాండవులకు భాగ మీయకుండా, యుద్ధము రాకుండా ఉండే మార్గాన్ని ఆలోచించడం మొదలు పెట్టాడు. తమ భాగాన్ని పొందకుండా పాండవు లూరుకోరు. ఏడక్షౌహిణుల సైన్యాన్ని కూర్చుకొని ఎత్తిరావటానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్టి స్థితిలో పాండవులు రాజ్యభాగం లేకుండా యుద్ధం మానివేసే పద్ధతిలో కార్యాన్ని సాధించుకుని రాగలిగిన సమర్థుని రాయబారిగా పంపవలెనని ధృతరాష్ట్రుడు యోచించినాడు. అట్టివాడు ఎవ్వరన్నది ప్రశ్న. గురుభీష్మాదులు యుద్ధ తంత్ర ప్రవీణులే గాని సంధికార్య నిర్వహణ చతురులు గారు. అంతేకాక తన కౌటిల్యాని కంగీకరించేవారు కారు. అతనికి తోడు నీడల లాగా బహిః ప్రాణాలవలె సంచరించే వారిద్దరున్నారు; విదురుడు, సంజయుడు. విదురుడు సమస్త కౌరవ సామ్రాజ్యానికి సచివుడు. ఇంక సంజయుడా ధృతరాష్ట్రునకు ఆంతరంగిక సచివుడు. వీరిద్దరూ మహారాజు మనోగతిని పూర్తిగా అర్థం చేసుకున్నవారు. సమస్త శాస్త్ర పారంగతులు. రాజనీతి దురంధరులు. చరర వచో నిపుణులు. ప్రజ్ఞావంతులు. రాజకార్య నిర్వహణ దక్షులు. వీరిద్దరూ రాయబార కార్య నిర్వహణ సమర్థులే. ఈ విషయాన్నే సంజయ రాయబారం తరువాత ధర్మరాజు సంజయునితో, “నీవు, విదురుడు గాక ఈ రాయబారాన్ని నడపగల సమర్థు డింకొకడున్నాడా?” అంటాడు. అయితే విదురుని వదలి సంజయునే ఎందుకు రాయబారిగా ఎన్నుకోవటం జరిగింది? రాజ్యభాగం లేకుండా పాండవులను యుద్ధము మానిపించే సంధి పద్ధతి కౌటిల్యంతో కూడింది. ధర్మ పక్షపాతి అయిన విదురుడే రాయబారి అయితే ఆ సంధి సందేశం లోని కౌటిల్యాన్ని సభ లోనే బయటపెట్టి ఉండేవాడు. విదురుడు ధృతరాష్ట్రునకు తమ్ముడు – ఆప్తుడు, సచివుడు. అన్నకు ఈ తమ్మునిపై ఎంతో ప్రత్యయం. ఈ తమ్మునికి అన్నపై ఎంతో గౌరవము, అంతకు మించిన చనువు. అన్న ఆలోచన అధర్మ మార్గంలో సాగితే వెంటనే సరిదిద్దే చనువు విదురునికి ఉంది. అందుచేత ధృతరాష్ట్రుడు కపటంతో కూడిని ఈ రాయబార కార్యనిర్వహణ భారాన్ని తనను చక్కగా అర్థం చేసుకొని, మారు మాటాడకుండా త్రికరణ శుద్ధిగా ప్రభుకార్య సాఫల్యానికి ప్రయత్నించే చతురతానిధియైన సంజయునకు అప్పగించడానికే నిశ్చయించుకున్నాడు.

ద్రుపద పురోహితుడు తిరిగి వచ్చి తన రాయబార విశేషాలను పాండవులకు నివేదించాడు. ఆ తరువాత ధృతరాష్ట్రుడు సంజయుని రాయబారిగా పంపటానికి నిండు కొలువుకు రప్పించాడు. సంస్కృత భారతంలో ధృతరాష్ట్రుడు తన సంభాషణ మంతా సంజయు నుద్దేశించి చేయగా తెలుగు భారతంలో అధిక భాగం సభ నుద్దేశించి చేయటం గమనింప దగిన విశేషం. సభకు వచ్చిన సంజయునితో ఇలా అంటాడు కురురాజు:

పాండు నరపాల సుతు లుపప్లావ్యమునకు
వచ్చి యున్నారు నీవేగి వాసుదేవ
సహితముగ వారిఁ గని తద్వివాద మేమి
భంగి మాను నమ్మెయి దగఁ బలుక వలయు.

వాసుదేవ సహితంగా పాండవులను చూచి, అరణ్య, అజ్ఞాత వాస క్లేశాల వలన కలిగిన విషాదమును మాన్పుటకు వీలైన పద్ధతిలో మాట్లాడవలసినదిగా చెప్పిన తరువాత ధర్మజుని సభలో మొదట ఇలా చెప్పంటాడు:

మీ యయ్య మీరు వన వా
సాయాసము నిస్తరించి యభ్యుదయమునన్
డాయుట విని ముదితాత్ముం
డై ఇట పుత్తైంచె నన్ను ననుమీ మొదలన్.

‘మీ యయ్య’ అని సంభాషణ ప్రారంభించుటలోనే ధృతరాష్ట్రుని గడుసుదనం బయట పడుతున్నది. ఇలా చెప్పటం వలన అతని లోని పితృభావం వెల్లడియై పాండవు లాతనికి దుర్యోధనుని వంటి వారేనన్న అభిప్రాయం కలుగుతుంది. అరణ్య, అజ్ఞాత వాస క్లేశాలకు ఆ తండ్రి ఎంతో వ్యథ చెందాడని, దైవకృపచే తన పుత్రులు కష్టాలను గడచి అభ్యుదయం పొందటం విని ఎంతో సంతోషించాడని చెప్పటంలో అతనికి గల పుత్రవాత్సల్యం వ్యక్తమవుతుంది. మొదట సంజయుడు చెప్పవలసిన పద్ధతి ఇది అని చెప్పటంలోనే ధృతరాష్ట్రుని చతురత, లోకజ్ఞత స్పష్టమవుతున్నాయి. పాండవులపై గల వాత్సల్యానికి, సద్భావానికి సభలోని వారంతా సంతోషించేటట్లు మాట్లాడిన ధృతరాష్ట్రుడు సంజయునితో మాట్లాడటం మాని చుట్టూ ఉన్నవారితో చిన్న ఉపన్యాసం చేశాడు. అందులో అతడు పోయిన పోకడలు, చేసిన చమత్కారం ఇంతింత కాదు. కౌరవ పాండవుల మధ్య కలిగింది చిన్న కలక మాత్రమేనట. దానికి కారణం దుర్యోధనుడు. అదీ అతడు కార్యాకార్యజ్ఞుడు కాకపోవటం చేతనే కలిగిందట. అంతే గాని, ఆర్యులు, దృఢధైర్యులు, రణధుర్యులు అయిన పాండుసుతులు దోషాన్వితులే, అంటాడు ధృతరాష్ట్రుడు. దోషాన్వితులే? అని ప్రశ్నార్థకంగా చదువుకుంటే, కారనియే అర్థం వస్తుంది. సభవారికి అర్థమైనదిదే. కాని, దోషాన్వితులే అని కాకుస్వర విశేషంతో నిశ్చయార్థకంగా చదివినట్లయితే దోషాన్వితులే సుమా! అనే అర్థం రాకపోదు. విప్రుని రాయబారం పంపటం ఇత్యాదులు దోషాలు అని కురురాజు హృదయం కావచ్చు. అన్నదమ్ముల్లో వచ్చిన ఈ కలకను గోరంతలు కొండంతలు చేయవలసిన పని లేదని, వారు అన్యోన్యంగా కలిసి జీవించటం తనకు ఆనంద హేతువని పల్కుతూనే కలిసి జీవించవలసిన తీరును ఇలా సూచిస్తాడు.

క్షీరోదక వృత్తి మనము
వారలునుం గలిసి బ్రదుక వలదే నెమ్మిన్
వారిడుమఁ బడఁ దగియెడి
వారే పితృభాగ మేలువారలు గారే.

కౌరవులు, పాండవులు పాలూ నీరులా కలిసి జీవించాలని ధృతరాష్ట్రుని ఉద్దేశం. పైకి ఎంతో మంచి ఉద్దేశం లాగ కనిపిస్తున్నది. అయితే, క్రమాలంకారంలో పరిశీలిస్తే కౌరవులు పాలు, పాండవులు నీరు అవుతున్నారు. ఇలా చెప్పటం లోని ధృతరాష్ట్రుని లోతుగుండె ఎట్టిదో మనకు అర్థమవుతుంది. అంటే పాండవులు తమ రాజ్యభాగం సంగతి ఎత్తకుండా కౌరవులతో కలిసి బ్రదుకవలెనని వృద్ధరాజు అభిమతం. ఈ విధంగా సంధి జరిగేటట్లు ప్రయత్నించమని సంజయునకు సూచన. అంతటితో ఊరుకోక, “వారిడుమలబడ దగియెడు వారే పితృభాగ మేలువారలు గారే,” అని బల్లగుద్ది చెప్పుతున్నాడు. పాండవులు కష్టాలు పడ తగినవారు కాదు. తండ్రిభాగాన్ని పాలించటానికి యోగ్యులు అనే భావాన్ని సభకు కలిగించుతూనే తన హృదయగత భావాన్ని గడుసుదనంతో సూచిస్తూ ఉన్నాడు. “వారిడుమల బడదగియెడు వారే పితృభాగ మేలువారలు గారే,” అని కాకుస్వర విశేషంతో నిశ్చయార్థకంగా చదివితే , కారు అనే అర్థం వస్తుంది! ఈ సన్నివేశంలో ధృతరాష్ట్రుని వాక్యాలను సూక్ష్మంగా పరిశీలిస్తే ఇట్టివే పెక్కు విశేషాలు గోచరిస్తాయి. కౌరవ పాండవులు పాలూ నీరులా కలిసి జీవించాలని ఇప్పుడనుకున్నా పాండవులు వీరిని నమ్ముతారా? అనే సందేహం సభలోని వారికి కలుగకపోదు. అదే విషయాన్ని ధృతరాష్ట్రుడు చెప్పుతూనే అంతా చక్కదిద్దే సమర్ధత ధర్మరాజు కున్నదనే ‘భరోసా’ వెల్లడిస్తాడు. ఒకవేళ సంధి జరగకుండా ఉంటే పాండవ వీరుల కెదురు నిలిచే శక్తి ఎవ్వరికీ లేదంటూ వారి బలపరాక్రమాలను వర్ణించటానికి పూనుకొని ఇలా ప్రారంభిస్తాడు.

మనకీ కుండగ వచ్చునే మనము దుర్మానంబు వాటించి యొ
ప్పని కార్యంబులు వట్టి వారికిఁ దగం బాలీక గర్వంబు లా
డిన నిక్కంబగు నల్క నర్జునుడు గాండీవంబు మోపెట్ట గృ
ష్ణుని సారథ్యమునై జగత్త్రితయ సంక్షోభంబు గాకుండునే.

మనము దుర్మానాన్ని పాటించి వారి రాజ్యభాగ మీయకుండా ఉంటే జగత్ప్రళయం సంభవిస్తుంది. మనకు రాజ్యభాగ మీయకుండా ఉండటానికి వీలు లేదు, అంటూ తన వాక్ప్రవాహంతో సభను సమ్మోహితం చేసి, పాండవులకు రాజ్యభాగ మీయటానికి సిద్ధంగా ఉన్నాననే భావం వారికి కలిగించిన ధృతరాష్ట్రుడు సంజయుని వైపుకు తిరిగి ఇలా అంటాడు.

నీవు ధర్మరాజు పాలికి నెమ్మి నరుగు
మతడు పేరోలగం బున్న యవసరమున
గాన్పు మతనికి ననుజ వర్గంబునకును
బంధులకు నింపు పుట్టంగఁ బలుకు మచట.

నెయ్యము వాటించి కడుం
దియ్య మెసఁగ నలుక లెల్ల దీఱునటులుగా
గయ్యమను దలపు లోనుగ
నయ్యమనందనుడు మానునట్టి తెఱగునన్

శాంతి ప్రకారంబునం గార్యంబు నడపి యొక్కటియై మనుట యొడగూర్చి రమ్ము. రథంబెక్కి పొమ్ము.

సంజయుడు రాయబారిగా వెళ్ళి నిర్వహించుకొని రావలసిన కార్యమెట్టిదో ఈ పద్యాలలో నిర్దేశించటం జరిగింది. ధృతరాష్ట్రుడు నిజంగా సంధినే కోరుతున్నాడా? కోరితే ఏ పద్ధతిలో అది ఉండాలని అతని భావం? రాయబారిగా వెళ్ళుతున్న సంజయుడు సాధించుకు రావలసిన కార్యమేమిటి? ఇట్టి ప్రశ్నల కన్నింటికి సమాధానాలు ఈ పై పద్యాలను పరిశీలించి మాత్రమే తెలుసుకోవలసి ఉంది. సంజయుడు ధర్మరాజు దగ్గరకు వెళ్ళి, అతడు నిండు కొలువులో ఉన్నప్పుడు దర్శించాలి. మొదట అతనికి, అతని తమ్ములకు, బంధువులకు ఇంపు పుట్టే విధంగా మాటాడాలి. ఆ తరువాత శాంతి ప్రకారంగా కురుపాండవులు ఒక్కటిగా కూడి జీవించే పద్ధతిలో కార్యాన్ని సాధించుకొని రావాలి. ఇదీ ధృతరాష్ట్రుని ఆదేశం. అయితే, శాంతి ప్రకారంగా కార్యాన్ని ఎలా నడిపించాలి? నెయ్యాన్ని పాటించి మిక్కిలి తియ్యగా మాట్లాడి, ఇంతకు ముందున్న కోపతాపాల నన్నిటిని పోగొట్టి, యుధిష్ఠిరుడు యుద్ధమనే తలంపు మానేటట్లు కార్యాన్ని నడిపించాలి. ‘మనకీ కుండగ వచ్చునే’ అని సభ నుద్దేశించి చేసిన ఉపన్యాసానికి, ఈ మాటలకు ఎంత భేదముందో గ్రహిస్తేనే గాని ధృతరాష్ట్రుని హృదయం మనకు అర్థం కాదు. పాండవులకు రాజ్యభాగ మీయటానికి సిద్ధంగా ఉన్నట్లు సభలోని వారిని భ్రమింపజేసిన ధృతరాష్ట్రుడు ఇక్కడ దాని ప్రస్తావనే తీసుకు రాకపోవడం గమనింప దగిన విశేషం. రాజ్యభాగం సంగతి తేలకుండా సంధి జరగడం సాధ్యమా? అనే సందేహం కలుగకపోదు. ఇది అసాధ్య కార్యం. దీన్ని సాధించుకొని రమ్మని ధృతరాష్ట్రుని ఆదేశం. బంధుస్నేహాన్ని పాటించి, మధురోక్తులతో పాండవుల క్రోధాన్ని చల్లార్చి, యుధిష్ఠిరుని యుద్ధ సంకల్పాన్ని మాన్చితే శాంతి నెలకొంటుందని, ఆ తరువాత కురుపాండవులు కలిసి జీవించగలరని ధృతరాష్ట్రుని ఉద్దేశం. కలిసి జీవించవలసిన తీరు కూడ ముందే సూచించినాడు. కౌరవులు పాండవులు క్షీరోదక వృత్తిని కలిసి బ్రతకాలని అతని ఆకాంక్ష. అయితే పురోహితుని రాయబారం వల్ల రాజ్యభాగం లేకుండా పాండవులు సంధి కంగీకరించరనే విషయం విస్పష్టంగా తేలింది. రాజ్యభాగం సంగతి లేకుండానే సంధి చేసుకు రమ్మని సంజయుని పంపుతున్నాడు ధృతరాష్ట్రుడు. ఇది ఎంత అసాధ్య కార్యమో అర్థమవుతూనే ఉంది. ఇట్టి అసాధ్య కార్యాన్ని సాధించుకొని రమ్మని ఆదేశించటంలో ధృతరాష్ట్రుని లోని కాపట్యం ఎటువంటిదో స్పష్టమవుతూనే ఉంది. ఇటువంటి రాయబారాన్ని నడిపే సంజయుడెట్టివాడో చెప్పాలంటే, ఒక్క మాటలో ‘జీవన్ముక్తుడు.’ అట్టివాడు తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మరుగు పరచి, కేవలము ప్రభుని ఆదేశము శిరసా వహించి, ఆ ప్రభుకార్యాన్ని ఎంత సమర్థంగా నిర్వర్తించాడో పరిశీలించవలసి ఉంది.

సంజయుడు ఉపప్లావ్యానికి వచ్చి నరనారాయణులను సందర్శించి సంధి సందేశాన్ని వినిపించటానికి ధర్మరాజు సభలో ప్రవేశిస్తాడు. ఆ సభలో మంత్రరక్షణ కళా ప్రావీణ్యగణ్యుడు, మహారాజనీతివేత్త అయిన శ్రీకృష్ణుడున్నాడు. నరాంశ సంభూతుడయిన సవ్యసాచి, ద్రుపదాది వృద్ధభూపతులు ఉన్న ధర్మరాజు పేరోలగమది. ధర్మరాజు సామాన్యుడా? వశీకృత చిత్తుడు. మెత్తని పులి. ఆ సభలో అట్టి ధర్మజుని ముందు తాను తెచ్చిన సారం లేని సంధి సందేశాన్ని వినిపించి, తన వ్యక్తిత్వానికి సరిపడని కపటంతో కూడిన రాయబారాన్ని విజయవంతంగా నడపటం సంజయుని వంటి వానికే చెల్లింది.

“భాగ్యవశం చేత నిన్ను చూడటం వలన నా చూపు చరితార్థమయ్యింది. ఇక్కడ మీరున్న విషయం విని మీ తండ్రి ధృతరాష్ట్ర మహారాజు నీవు, తమ్ములు, ద్రౌపది, పుత్రులు ఉన్న యోగక్షేమ సమాచారాలను తెలుసుకు రమ్మని నితాంత స్నేహపూర్ణ చేతోవృత్తితో నన్ను పంపించాడు,” అని ధర్మజునితో సంభాషణ ప్రారంభిస్తాడు సంజయుడు. మీ తండ్రి అని చెప్పటంలో పెన వైచుకున్న బాంధవ్యాన్ని గుర్తు చేస్తూ, మీ తండ్రి హృదయం పుత్రవాత్సల్యంతో నిండి ఉన్నది అని చెప్పటంలో సంజయుని నేర్పు వ్యక్తమవుతున్నది. ‘మీ యయ్య’ అని మొదట చెప్పమని ధృతరాష్ట్రుడు సంజయునితో చెప్పడం జరిగింది కదా. దానికి సమాధానంగా, “ఆ రాజు మా దెసం గల కారుణ్యము కతమునను సుఖమున నిట్లున్నారము,” అని ధర్మరాజు కీలెఱిగి వాత పెట్టినట్లు అన్నాడు. బాంధవ్యాన్ని ముందుకు నెట్టి ‘మీ తండ్రి’ అని సంజయుడంటే, దాన్ని వెనుకకు నెట్టి ‘ఆ రాజు’ అంటున్నాడు ధర్మరాజు. అరణ్య, అజ్ఞాత వాస క్లేశాల ననుభవించి, ఇప్పుడిలా ఉండటానికి ఆ రాజు కారుణ్యమే కారణమని గడుసుదనంతో చెప్పి మాటలో తన నేర్పు చూపిస్తున్నాడు. ధర్మజ సంజయులు ఉక్తి ప్రత్యుక్తి చాతుర్యంలో ఒకరి కొకరు తీసిపోయేవారు కారు. కౌరవ పక్షము లోని ప్రధాన పురుషుల యోగక్షేమాలను పేరు పేరునా ప్రశ్నిస్తూనే, అందులో కౌరవుల అవినీతిని, పెద్దల పట్ల అవిధేయతను స్ఫురింపజేస్తూ ఘోషయాత్రను గుర్తు చేసి తమ ఔన్నత్యాన్ని తెలుపుతూనే, అర్జునునకు ప్రతివీరులు లేరనే విషయము నీకు తెలుసు కదా? అంటూ చమత్కారంగా సంభాషణ సాగించాడు ధర్మరాజు.

ధర్మరాజు ప్రశ్నల కన్నింటికి సమాధానం చెప్పటం సాధ్యమయ్యేది కాదు. కౌరవులను సమర్థించి మాట్లాడి నెగ్గుకు రావటం దుర్లభం. తన వాదము బలహీనమయినప్పుడు ఎదుటివారు చెప్పినదాని నంగీకరిస్తూనే అదనెఱిగి వారిని బోల్తా కొట్టించటం ప్రజ్ఞావంతులు చేసే పని. అదేవిధంగా సంజయుడు కూడా “కురురాజు వద్ద అవినీతులు, నీతిమంతులు ఇలా అనేక విధాల వారున్నారు. వారిని గురించి అంత చెప్పవలసిన పని లేదు,” అంటూనే, “నీవు చంద్రునిలా చల్లనైన విమల హృదయంతో సంధి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నావు. వారందరికి సేమం నిన్నటివరకు లేకపోయినా నేటి నుంచి ఉంది.” అని ధర్మరాజు ముందరి కాళ్ళకు బంధం వేశాడు. తమ కష్టాలకు ధృతరాష్ట్రుడు కారణమని ధర్మరాజు సూచించటాన్ని గుర్తించిన సంజయుడు ఇలా అంటాడు.

ధృతరాష్ట్ర భూపతికి వృ
ద్ధత కతమునఁ జిత్తమొక విధము గామి సుతో
ద్ధతి మాన్పడ నాడు మనః
క్షతి పిదప బుట్టి ఇపుడు శాంతుండయ్యెన్.

ధృతరాష్ట్ర మహారాజు పెద్దతనం వల్ల మనస్సొక తీరుగా నుండక పోవటం చేత ఆనాడు దుర్యోధనుని ఔద్ధత్యాన్ని మాన్పలేక పోయాడు. తరువాత ఎంతో మానసిక క్షోభ ననుభవించాడు. ఇప్పుడాత డెంతో మారిపోయి ప్రశాంత చిత్తంతో ఉన్నాడు. ఏమైనా, ఇట్టి చందాలన్నీ నీవు పుణ్య చిత్తంతో సహించితేనే చెల్లుతాయి. నీ యజాత శత్రుత్వం సమస్త లోక విశ్రుతం కదా! అంటూ ధృతరాష్ట్రుని గతవర్తనను సమర్ధిస్తూ, ధర్మరాజును స్తుతిస్తూ అనుకూల వాతావరణాన్ని ఏర్పఱచుకొని తన సంధి సందేశాన్ని వినిపించటానికి పూనుకున్నాడు సంజయుడు. ధర్మరాజు వైపుకు తిరిగి చేతులు జోడించి, “ధృతరాష్ట్ర మహారాజు శాంతినే కోరి సంధి చేసుకోవటానికి తహతహ లాడుతున్నాడు. మనము వివేకంతో ప్రవర్తించవలసి ఉంది. మీ వంటి ధర్మజ్ఞులకు శాంతులకు చులకని కార్యం చేయటం తగవు కాదు. మడుగు వస్త్రానికి మసి దాకినట్లుగా మీ సత్కులానికి దుర్యోధనుని వలన కల్మషం కలిగింది. దానిని పోగొట్టగల కార్యనిపుణ హృదయుడవు నీవే. యుద్ధం వలన సమస్త జన క్షయం జరుగుతుంది. జయాపజయాలలో ఏది కలిగినా చివరకు సుఖం లభించదు. అంతేకాక నీవంటి దయాపయోనిధికి వృద్ధులను, బాలురను, సఖులను, గురువులను వధించిన తరువాత సమస్త సుఖాలు సమకూరితే మాత్రం ప్రయోజన మేముంటుంది. నీవు యుద్ధాని కంగీకరించవు గాని, మీ ముందు దేవతలైనా నిలువగలరా? ఇక కౌరవ పక్షము సంగతంటావా, వారిని జయించటానికి స్థాణునకైనా వశం కాదు. అట్టి మీ ఇరు పక్షాలకు అన్యోన్య కలహం నాకు మేలనిపించటం లేదు. నా మాటే కాదు రెండు పక్షాల హితాన్ని ప్రియాన్ని గోరేవారిని అడిగి చూడు.” అని కొలువు కూటాన్ని ఒక్కసారి కలయజూచి నాటకీయంగా, “వాసుదేవునకు మ్రొక్కుతున్నాను, సవ్యసాచికి చేతులు మోడ్చుతున్నాను. తక్కిన వారికి విన్నవించుతున్నాను. అసూయలు విడిచిపెట్టి అనుజ్ఞ సేయండి. ఈ కరుణాకరుడైన ధర్మరాజును క్రోధశాంతికి శరణు వేడుతున్నాను.” అంటూ ప్రణామ పూర్వకంగా ధర్మజుని ముఖం మీద చూపు నిలిపి, “దేవా, ఉపశమించుట లెస్స. ఈ పద్ధతికి కురుపితామహుడు సంతసించుతాడు. ఇది సర్వలోక సమ్మతమైన సంగతి.” అని తన సంధి సందేశాన్ని ముగించాడు సంజయుడు.

ఈ సందేశంలో ఎక్కడా రాజ్యభాగం సంగతి ప్రస్తావించబడ లేదు. ధర్మరాజు చేత యుద్ధాన్ని మాన్పించటమే సంజయుడు చేయవలసిన ముఖ్యమైన పని కదా. దాని కనుగుణంగా పాండవుల వంటి ధర్మజ్ఞులు, శాంతులు చులుకని కార్యమైన యుద్ధం చేయటం తగదని, అది సమస్త జనక్షయకరమని, జయాపజయాలు రెండూ చివరకు సౌఖ్యాన్ని ఇవ్వవని, అందులోను బంధువులను వధించటం వలన కలిగిన సౌఖ్యాల వలన ప్రయోజన ముండదని ఎంతో నేర్పుతో చెప్పటం జరిగింది. ఒకవేళ యుద్ధమే సంభవిస్తే కౌరవులను జయించటం మీకు సాధ్యం కాదు అని సూచనగా చెప్పి వెఱపించుతూ చెప్పటంలో సంజయుని చాతుర్యం, గడుసుదనం గమనింప దగినవి.

సంజయుని రాయబారం లోని ఆంతర్యం శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అనే విషయం ధర్మరాజు గ్రహించాడు. దాన్ని బట్టబయలు చేయటానికి సంభాషణ ఇలా సాగించాడు. “సంజయా! నా మాటల్లో స్నేహం తప్ప వేరొకటి నీ చెవులకు సోకిందా? ఎందుకు యుద్ధానికి అంత భయపడతావు. మేము మాత్రం యుద్ధం కావాలంటున్నామా. యుద్ధం లేకుండా కార్యసిద్ధి కలిగితే వెఱ్ఱివాడైనా యుద్ధం చేస్తాడా. మా సంగతి తెలియదా? మహారాజు ఆనాడు వక్రత్వంతో నీతిమార్గాన్ని విడిచిపెట్టి ఈ రోజు మమ్మల్ని చక్కని దారిలో నడవమని బుద్ధులు చెపుతున్నాడు. బాగానే ఉంది. ఎదుటివారిని తమలాగే చూస్తేనే సంధి అవుతుంది కానీ మాకు కుడుమియ్యండి, మీరు వక్క తీసుకోండి అంటే మనసులు చేరువవుతాయా! మహారాజు మారిపోయాడంటావు. అతని చరిత్ర మాకు నీకు తెలియనిదా. అడియాసలతో వచ్చి మమ్ముల నెందుకు బాధిస్తావు. కొడుకు విషం మ్రింగినా నమ్మకం తోనే చూస్తూ ఉంటాడు కదా ఆంబికేయుడు. కొడుకులు, శకుని, కర్ణుడు ఎలా నడిపించితే అలా నడుస్తాడే గాని వేరొకరీతిగా ఉండదు కదా అతని నడక. అయితే, నీవొక చమత్కారం చేశావు. ముందు మమ్ము పొగిడి తరువాత వారిని గెలవడం శక్యం కాదన్నావు. ఆ పక్షపాతాన్ని మాత్రం విడిచిపెట్టు. మాముందు కౌరవులు నిలువలేరన్న విషయం నీకు తెలియదా? సద్గుణవంతుడివైన నీవు వచ్చి మాకు కోపం శాంతించేటట్లు మాటాడినావు. ఎన్నో పరాభవాలు పొంది కూడా కౌరవుల దుర్గుణాలను సహించటం నీకు తెలియనిది కాదు కదా. ఇక ముందు మాత్రం అలాగే చేసి బాధలు కొని తెచ్చుకుంటామనే శంకలు విడిచిపెట్టు. మా యయ్యకు విచారము కలిగినట్లయితే చుట్టరికం మొలకెత్తగా మమ్ములను రమ్మని పిలిచి, కొడుకులకు మా రాజ్యభాగమిమ్మని చెప్పటం తగినది కదా. ఇది ప్రపంచమంతా ప్రశంసించే పద్ధతి,” అన్నాడు.

ఉత్తచేతులతో వచ్చి మమ్ములను జోకొట్ట చూస్తున్న నీ సంగతి నాకు తెలియదా అన్నట్లు సాగింది ధర్మరాజు ఉపన్యాసం; “ధృతరాష్ట్ర మహారాజు వెనుకటి స్థితిలో లేడు, ఎంతో మారిపోయాడు, మీయందు పుత్రవాత్సల్యం పొంగి పొర్లిపోతున్నదని అంటావు. అడియాసలతో వచ్చి ఎందుకయ్యా మమ్ములను ఊరికే బాధ పెడతావు. అతడు మారతాడా? కొడుకులు, శకుని, కర్ణుడు, గీచిన గీటు దాటతాడా. అది నీకు మాత్రం తెలియనిదా? ఒకవేళ మారితే బాంధవ్యం ఇప్పుడే అంకురించిన దన్నమాట. అటువంటప్పుడు మమ్ములను పిలిచి మా రాజ్యభాగం మాకిప్పించటం న్యాయం కదా,” అని చెప్పటంలో ధర్మరాజు మా రాజ్యభాగం సంగతి ఏమిటి? అది లేకుండా సంధి ఎలా జరుగుతుంది? అని సంజయుని నిలదీసి అడిగినాడు. రాజ్యభాగ విషయం ధృతరాష్ట్రుడు చెప్పలేదు. దానికి సమాధానం సంజయుని దగ్గర లేదు. ఇంకొకరెవరైనా అయితే తెల్లమొగం వేయవలసినదే. సంజయుడు సామాన్యుడా? ధర్మజుని విభవం అనింద్య చరిత్రము, అహింస అని ప్రశంసించి –

పాలిక కౌరవులు దు
శ్శీలతఁ జెడఁ దలచిరేనిఁ జెప్పెద రుధిరా
భీలాన్నంబున కంటెను
మేలగు భిక్షాన్నమైన మీ నడవడికిన్

అంటాడు. ఈ మాటలు సంజయుడు కాక మరెవ్వరు పలికినా ఎదుటి వారికి కోపాన్ని కలిగించేవే. ఎంత కర్కశ భావాన్ని అయినా సున్నితంగా చెప్పటంలో సంజయుడు సాటి లేనివాడు. “శాంతి దాంతి కలిగిన నీ పవిత్ర చరిత్ర హింసా కళంకితము కాకుడదు. తాల్మియే ధనంగా కలిగిన నీవు చివరకు క్రూరకర్మాస్పదమైన తీరులో బంధువులను, గురువులను వధించి సౌఖ్యం అనుభవించుతావా? అది ఆర్యుల చేత నిందింపదగినది, అస్థిరమైనది కదా.” అని హింస ధర్మమా? అధర్మమా? అనే చర్చ లోకి ధర్మరాజును మళ్ళించటానికి ప్రయత్నించాడు సంజయుడు. అది తేలేది కాదు. ఆ చర్చలో సంజయుని ఎదుర్కొని నెగ్గుకు రావటం కూడా ధర్మజున కంత తేలిక కాదు. తన నేవైపుకు మళ్ళించుతున్నాడో గుర్తించి ధర్మారాజు సంజయుని ముఖం మీద చూపు నిలిపి, “కొన్ని ధర్మాల వలె కనిపించి చివరకు అధర్మాలవుతవి. కొన్ని అధర్మ కర్మలు చివరకు ధర్మసమ్మతాలవుతవి. మనకెందుకీ వితర్కం. ఇది కర్తవ్యము, ఇది అకర్తవ్యము అని మనల శాసింప వాసుదేవుండు కలడు,” అని కార్య నిర్ణయ భారాన్ని కృష్ణుని పైకి నెట్టినాడు. శ్రీకృష్ణుడు సంజయ రాయబారము లోని మర్మాన్ని, కాపట్యాన్ని బట్టబయలు చేసి, కౌరవుల నిర్ణయాలను, ద్రౌపదీ పరాభవ సన్నివేశాన్ని కన్నులకు కట్టినట్లు వర్ణించి, “ఈ సంధి కార్యంబు అత్యంత దుర్ఘటంబు. దీనిని ఘటింపజేయుట అశక్యంబు. అయినను-

పాండవేయులఁ దగబ్రార్థించి యందుల
కక్కట యేనైన నరుగు దెంచి
కౌరవులకు బుద్ధిగాఁ జెప్పి రాజ్యంబు
పాలు చేసిన మృత్యు పాశములకు
దప్పరే వారలు దగవును నేర్పును
నా మీద నిలుచుట నాకు గీడె”

అని కురుపాండవ సంధి కార్యభారాన్ని తన మీద వేసుకున్నాడు. అప్పుడు సంజయుడు “అట్లయిన కడు లెస్స గదా! దేవా, నా వచ్చిన కార్యంబు సఫలంబయ్యెనని వినియెద,” అన్నాడు. తన రాయబార కార్యము సఫలమైనదని సంజయుడే అంటున్నాడు. ధర్మజుని చేత యుద్ధాన్ని మాన్పించటమే ఈ రాయబార ప్రయోజనము. యుద్ధప్రమాదము శాశ్వతంగా కాకపోయినా తాత్కాలికంగా నైనా తొలగిందనియే చెప్పవచ్చు. జగన్నాటక సూత్రధారియైన శ్రీకృష్ణుడు సంధికై ప్రయత్నిస్తే సంధి జరుగక పోతుందా అనే ఆశ ఉండటం సహజం. ఒకవేళ సంధి జరుగకపోయినా శ్రీకృష్ణు డంతటి వాని ప్రయత్నమే ఫలించకపోతే ఇంక చేయగలిగిన దేముంటుంది. అందుచేత ఏ విధంగా చూచినా సంజయుడు తాను వచ్చిన కార్యాన్ని సాధించుకొని వెళ్ళినాడనియే చెప్పవలసి ఉంది.

శ్రీకృష్ణ రాయబార సమయానికి భారత కథ మిక్కిలి క్లిష్టమైన ఘట్టానికి చేరింది. కౌరవ పాండవులకు సంధి జరిగితే సర్వజన శ్రేయస్సు, సమరం జరిగితే సర్వజన క్షయం కలుగుతుంది. ఇంతకు ముందు జరిగిన సంధి ప్రయత్నాలను పరిశీలిస్తే సమరం తప్పదనే భావమే అందరికీ ఉంది. ఆ యుద్ధం వలన కలిగే సమస్త జనక్షయాన్ని తప్పించటానికి యత్నించవలసిన బాధ్యత ప్రాజ్ఞులైన వారందరి మీదా ఉంది. కాని, మిగిలిన వారు తమ శక్తిసామర్థ్యాలు దానికి చాలవని తెలుసుకొని ఆ ప్రయత్నం చేయలేదు. శ్రీకృష్ణుడు వారివలె సామాన్యుడు కాడు కదా. పురుష రూపంలో ఉన్న పురుషోత్తముడు. అట్టి కృష్ణుడు అఖిల జనక్షయాన్ని తప్పించటానికి ప్రయత్నించటం ధర్మం. అతడలా చేయకపోతే, “ఉపేక్షించాడు గాని పూనుకుంటే సంధి జరుగదా,” అని ప్రాజ్ఞులు కాకున్నా అజ్ఞులైనా అనుకోకపోరు. రాయబారిగా వెళ్ళినప్పుడు విదురునితో సంభాషించే సన్నివేశంలో కృష్ణుడే ఈ విషయాన్ని వివరింపటం గమనింప వలసి ఉంది. అజ్ఞులకు కూడా అటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా ఉండటానికే ఈ కార్యభారాన్ని తనమీద వేసుకున్నాడు. అంతేకాకుండా ఆ తరువాత పార్థసారధియై సర్వజనక్షయకారకుడు కాబోతున్నాడు. అలా సర్వజన నాశనాన్ని చేయించిన కృష్ణుడు లోకకల్యాణం కోసం ఎందుకు ప్రయత్నించలేదు. ప్రయత్నిస్తే ఫలితం ఉండేది కదా – అని అనుకోవడానికి అవకాశం లేకపోలేదు. ఆ ప్రయత్నాన్ని చేయవలసినంత చేసిన తరువాత ధర్మ సంరక్షణార్థం కురుక్షేత్ర సంగ్రామానికి సూత్రధారుడు కావలసి వచ్చింది – అని చాటి చెప్పటం కోసమే రాయబార కార్యానికి పూనుకున్నాడు. సంధి జరుగుతుందని తలచి శ్రీకృష్ణుడు ఈ రాయబారానికి పూనుకోలేదు. పొందు పొసగదని, సమర మనివార్యమని, అది విధినియతి అని తెలిసి ప్రయత్నం చేయటం లోనే శ్రీకృష్ణ తత్వం లోని విశిష్టత గోచరిస్తుంది. “కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన,” అన్న ఒక్క గీతావాక్యం లోనే భగవద్గీత సారమంతా ఇమిడి ఉందని విజ్ఞులు చెపుతారు. గీతోపదేష్ఠ ఆ ఉపదేశాన్ని ఆచరణలో చూపించడానికే ఈ రాయబారానికి పూనుకున్నాడు. ఫలాపేక్ష లేకుండా మానవుడు ప్రయత్నం చేయాలనే సత్యాన్ని ఈ ఘట్టంలో వ్యంగ్యంగా, వాచ్యంగా సూచిస్తూనే ఉన్నాడు భగవానుడైన శ్రీకృష్ణుడు.

సంజయుడు వెళ్ళిన మరునాడు ధర్మరాజు – తమ్ములు, ద్రౌపది, కొడుకులు, రాజులు వెంటరాగా మాధవుని మందిరానికి వెళ్ళి పాండవ దూతగా కౌరవసభకు వెళ్ళవలసినదిగా అతనిని ప్రార్థిస్తాడు. సంధికి సంబంధించి తమ తమ అభిప్రాయాలను పాండవులు, ద్రౌపది వాసుదేవునకు అక్కడ వివరంగా చెపుతారు. రాయబారిగా వెళ్ళే కృష్ణుడు వారి ప్రసంగాలను ఎలా ఆలకించాడు? అప్పుడతని మనస్థితి ఎలా ఉంది? వారి మాటల కెలా ప్రత్యుత్తరమిస్తూ ఏ విధంగా వారిని చక్కదిద్దుతున్నాడు? అనే అంశాలను పరిశీలిస్తేనే గాని శ్రీకృష్ణ రాయబారం లోని తత్వం స్పష్టం కాదు. ధర్మరాజు, భీమార్జున నకుల సహదేవులు, ద్రౌపది వారి వారి సంస్కారాన్ని బట్టి శ్రీకృష్ణునితో ప్రసంగించారు. అందుచేతనే చెప్పే విషయ మొక్కటే అయినా చెప్పే తీరులో వైవిధ్యం ఏర్పడింది. ధర్మజాదుల చిత్త సంస్కార స్థాయి ననుసరించి తత్తదుచితంగానే వారికి వాసుదేవుడు సమాధానాలివ్వటం గమనింపవలసి ఉంది.

ధర్మరాజీ సందర్భంలో గంభీరమైన ఉపన్యాసం చేశాడు. ఇది అతని రాజనీతివేతృత్వాన్ని చాటి చెప్పేదిగా ఉంది. సంధి విషయంలో తన అభిప్రాయాలేమిటో వివరంగా చెప్పి, కౌరవుల సభలో శ్రీకృష్ణుడు నిర్వహించవలసిన కార్యాన్ని సవిస్తరంగా విశదీకరించి చివరకు, “పొమ్మెవ్వడ నీకు నేను బుద్ధులు చెప్పన్,” అనటంలోని ధర్మరాజు గడుసుదనం గమనింప దగింది. వశీకృత చిత్తుడైన ఇతడు చేసిన ఉపన్యాసంలో ఇతని మనోగతి ఏలాంటిదో తెలుసుకోవటం సామాన్యులకు సాధ్యమయ్యేదిగా లేదు. కౌరవు లైదూళ్ళిచ్చినా సంధి చేసుకోవటాని కీతడు సిద్ధంగా ఉన్నాడన్నట్లుగానే ఉందతని ప్రసంగం. సంధి జరగాలనే ఆకాంక్ష అయితే ఉన్నది కాని, సంధి జరుగుతుందనే ఆశ మాత్రం ధర్మరాజుకు లేదు. తార్కికంగా, గంభీరంగా, విరోధాభాస ధోరణిలో సాగిన ఈతని ఉపన్యాసం లోని అంతరార్థం అందరికీ అంతు పట్టేదిగా లేదు. ఇతడు యుద్ధవిముఖుడుగా, సంధికే కృతనిశ్చయుడై ఉన్నట్లుగా సభాసదులు భ్రాంతి చెందే అవకాశం లేకపోలేదు. తరువాతి భీముని ప్రసంగాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. సంధి జరుగుతుందనే విశ్వాసంతో సమర సన్నాహాలను సడలించటం గాని, వీరులలో ఉత్సాహాన్ని జారిపోనీయడం గాని కూడని పనులు. ధర్మరాజు హృదయం తనకు పూర్తిగా అర్థమైనా సభాసదులలో కలిగిన భ్రాంతిని పోగొట్టటానికి శ్రీకృష్ణుడు సమరమే జరుగుతుందని అతని చెప్పినట్లుగా చెపుతూనే సభను హెచ్చరిస్తాడు. ఆ వైపున ఉన్న బంధు సుహృజ్జనులను సంపదకై వధించి దూఱెక్కుట దోషమందుట అను దురవస్థల కోర్వ వచ్చునే, అని పల్కిన ధర్మరాజుకు సమాధానంగా శ్రీకృష్ణుడిలా అంటాడు.

“క్రూరాత్ములగు కౌరవులు ఎల్లవారికి వధ్యులు గాదగుదురు. నీకేల అవధ్యులైరి? పాపాత్మకులగు హింసకులం బాముల నేట్లట్ల నిర్విచారంబుగ వధించుట కర్తవ్యం.”

ఈ విధంగా సమరమే కర్తవ్యంగా నిశ్చయం చేశాడు. అయితే సంధికై కౌరవ సభకు వెళ్ళటం దేనికి? వెళ్ళి ఏమి చేస్తావు? అనే ప్రశ్నలకు వెంటనే సమాధానంగా –

“ఆతలకు నేను జని వి
ఖ్యాయంబుగ నీదు వినయ మభివర్ణింతున్,

నీదు పుణ్యచరితంబులు, నీవు ధర్మ మార్గము దలచుటయుం దెలియం బలికెద” అంటాడు.

కౌరవసభలో ధర్మజుని వినయాన్ని సవిస్తరంగా వర్ణించి, ధర్మమార్గవర్తులైన పాండవుల సచ్చరిత్ర నందరికీ తెలియజెప్పి, వారిదేమీ తప్పు లేదు, కౌరవులదే దోషమంతా – అని నిరూపించటానికి వెళుతున్నాడట. కౌరవసభకు తాను వెళ్ళినప్పుడు అక్కడ ఏమి జరుగుతుందో ముందుగానే ఊహించి ఎంత స్పష్టంగా ధర్మరాజుతో చెప్పినాడో గమనింపదగిన విశేషం.

“దుర్యోధనుం డియ్యకొనక తెఱంగు మాలిన మాటలాడుటయు, తండ్రి యతని వారింప నేరమికిఁ దోడుపేక్షకుండగుటయుఁజూచి మీ తొల్లింటి పాట్లునుం దలచి యెల్లవారును వారిని గర్హింతురు. ఇంతియ కాక మనకు నొండేమి వలయు.”

తామిద్దరూ ఆశించిన రాయబార ప్రయోజనమేమిటో చక్కగా సూచించటం జరిగింది. ఇంకా తానక్కడికి వెళ్ళి ఏమి చేస్తాడో ఇలా వివరిస్తాడు.

“నా యోపినంతయుఁ బెక్కుభంగుల సంధియ కావింపఁ జూచెద. అవ్విధంబు సిద్ధించిన మేలు కాదె? అట్లుగాక తక్కిన, నచ్చోటి యోధుల యుత్సాహంబు చందంబును, అందు చేయంగల వారి వర్తనంబులుఁ గొలందులు నెఱింగి, నీకు విజయంబగు తెఱంగున జను దెంచెద.”

తన రాయబార నిర్వహణ విధి విధానాన్ని, దాని ఫలితాన్ని, ప్రయోజనాన్ని ఇంత చక్కగా వివరించిన తరువాత శ్రీకృష్ణుడు సుయోధనుని ముక్కులో ఊపిరుండగా మీకు రాజ్యభాగమీయడు. యుద్ధమే కలుగుతుంది. నీవు ఉత్సాహాన్ని విడిచిపెట్టవద్దు, అంటూ హెచ్చరిస్తాడు.

భీముడు ధర్మరాజు వలెనో, అర్జునుని వలెనో శ్రీకృష్ణుని తత్వాన్ని ఆర్థం చేసుకున్నవాడు కాదు. దైవమానుషాలలో మానుషానికే అధిక ప్రాధాన్య మిచ్చినవాడు. ఇతడు ఉద్ధతుడైనా ఎట్టి స్థితిలోనూ అన్న మాట కెదురాడే వాడు కాడు. ధర్మరాజు ఉపన్యాసం లోని గడుసుదనం పూర్తిగా అర్థం కాక ఇతడ తన సహజప్రవృత్తికి విరుద్ధంగా మెత్తబడి మాట్లాడినాడు. ఇట్టి సంస్కారం గల భీముని యుద్ధానికి పురికొలుపుతూ మేలంపు మెయివడిని సంభాషణ సాగించాడు కృష్ణుడు. అర్జునుడు నరాంశ సంభూతుడు. గీతాశ్రోత. గీతోపదేష్ట అయిన శ్రీకృష్ణుని తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవాడు. వీరిద్దరి సంభాషణలో ప్రౌఢసంస్కారం, గాంభీర్యం, మహనీయత గోచరిస్తాయి. సంధి కాదు సమరమే జరుగుతుంది అని శ్రీకృష్ణుడు పదే పదే చెపుతున్నాడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా అంటాడు.

ధృతరాష్ట్రుం డతి లోభ దూషితుడు ధాత్రీభాగ మీ నేర్చునే
సుతుడుం గష్టుడు సంధి యేల యగు నంచున్ మున్న కై పెక్కిన
ట్టి తలం పచ్యుత నీకు గల్గినది గాండీవంబు దివ్యాస్త్ర సం
తతియుం బెట్టిన యట్లయుండ మముఁ జింతం బాప రాదోకదే.

నరుడు నారాయణుని హృదయాన్ని ఎంత చక్కగా చదువ గలిగాడు! సంధి చేయమని ఎంత చక్కగా చెప్పాడు. శక్తి చాలక సంధి చేయమనటం కాదు. ఆ చెప్పటంలో ఎంత ప్రౌఢసంస్కార ముంది. అంతటితో ఊరుకోకుండా అసలు రహస్యాన్ని బయట పెట్టి ఎలా నిలవేసి అడుగుతున్నాడో గమనిస్తే గాని అర్జునుని పాత్ర సరిగా అర్థం కాదు.

నీవొనరింపఁ బూనిన పనిం గమలోదర కీడుపుట్టు నే
కావనినట్ల యుండి యవుఁ గార్యం లట్లగుటం బ్రయత్న సం
భావన సేఁత పౌరుషము పద్ధతి తత్ఫల సిద్ధి వొందుచో
దైవము తోడ్పడన్ వలయుఁ దథ్యము రెండును నీ వినోదముల్

కమలోదర అన్న సంబోధన లోనే శ్రీకృష్ణుని పరమేశ్వర తత్వాన్ని సూచించడం జరిగింది. పరమేశ్వరుడవయిన నువ్వు చేయబూనుకున్న పనికి కీడు కలుగుతుందా? అయితే ఇప్పుడు కురుపాండవులకు సంధి కాని పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాని, కొన్ని పనులు కానట్టే కనిపించి చివరకు ఫలిస్తాయి. ఎలా అంటావా? పురుష ప్రయత్నం, దైవం తోడ్పాటు ఈ రెండూ ఇప్పుడు నీ వినోదాలే. పురుష ప్రయత్నం చేసేది నీవే. దైవానివీ నీవే. పాండవ దూతగా కౌరవసభకు వెళ్ళి సంధికై నీవు చేసేది పురుష ప్రయత్నం. ఆ ప్రయత్నం ఫలించాలనే సంకల్పం నీ మనసులో కలిగితే దైవం తోడ్పడినట్లే. ఈ రెండూ జరిగితే తప్పకుండా పొందు పొసుగుతుంది. అది నీకిష్టం లేదంటావా. ఇదంతా దేనికి? ఇలా చేయమని మమ్ముల నాజ్ఞాపించరాదా? నీవు చెప్పినట్లు చేయడం నేడు మాకు క్రొత్తగా రాలేదు కదా! అంటూ సూటిగా ప్రశ్నించే అర్జునునికి శ్రీకృష్ణుడు ఏమని సమాధానం చెపుతాడు? సంధి అయ్యేటట్లు చూస్తానంటాడా? చేయటం నాకిష్టం లేదంటాడా?

వెరవున లావునం గృషికి వేయి విధంబుల మేలొనర్చినన్
దొరకొనునే ఫలంబు దఱితోఁ దగు వర్షము లేకయున్న నే
ప్పరుసున లెస్స చేసినను పౌరుషముల్ ఫలియించుటెల్ల నా
దరణమునం బ్రసన్నమగు దైవము చేఁతన సూవె ఫల్గుణా

కాఉన సంధికి బురుషకార మొనర్చెద నోపినంతయున్
దైవము చేత ఎట్లగునొ దాని నెఱుంగ,

అని పై ప్రశ్నలకు ప్రత్యుత్తరమిచ్చినాడు శ్రీకృష్ణుడు.

ఎన్నో ఉపాయాలతో శక్తినంతా ఉపయోగించి వేయివిధాలుగా వ్యవసాయం చేసినా సమయానికి వర్షం పడకపోతే పంట ఫలించదు. వేయి విధాలుగా మేలొనర్చటం పురుష లక్షణం, తఱితో తగు వర్షం కురియటం దైవము సేత. మానవ ప్రయత్నాలు దైవ సంకల్పము వల్లనే ఫలిస్తాయి. దైవ సంకల్పం లేకుండా ఏ మానవ ప్రయత్నం ఫలించదు. శ్రీకృష్ణుడు సంధికై శక్తి కొలదీ కృషి చేస్తాడట. దైవముచేత ఎలా ఉందో తా నెఱుగడట. ఓపినంతగా సంధి కోసం పురుష ప్రయత్నం చేస్తాను గాని దైవంగా మాత్రం తోడ్పడను సుమా, అని చెప్పడమే. అంటే పొందు పొసగదని వ్యంగ్యంగా సూచించటమే. ఆ వ్యంగ్యస్ఫూర్తిని అర్థం చేసుకోగల సంస్కారం అర్జునునికి ఉంది కాబట్టి అలా చెప్పటం జరిగింది. ధర్మజ భీమార్జునులతో తాను చెప్పిన మాటలు విన్న తరువాత కూడా, నీ పోయి నప్పుడ యీ కార్యంబు చక్కనగు అని అంటూ ఉన్న నకులునితో శ్రీకృష్ణుడేమని చెపుతాడు. ఉచితమైనది కయ్యమ అంటూ రణభేరి మ్రోగించే సహదేవునితో చెప్పవలసింది ఏముంది?

శ్రీకృష్ణునిలోని భగవత్తత్వం ద్రౌపదికి అర్థమయినట్లుగా ఎందరికో కాలేదని చెప్పటం అతిశయోక్తి కాదు. ‘దుష్ట నిగ్రహము పూని జగంబుల గాచునట్టి’ శ్రీకృష్ణుడు తన తోబుట్టువని గుర్తించిన పరమ భక్తురాలామె. ఆ భగవంతుడే సంధి కార్య నిర్వహణకు పూనుకుంటే అది కాకుండా ఉంటుందా? సంధి జరిగితే ఎన్నా మహావమానాలను పొందిన తన స్థితి ఏమిటి? ఈ విధమైన కంటకస్థితిలో ఆమె ఒక కంట అశ్రుకణాలు వేరొక కంట అగ్నికణాలు కురిపిస్తూ మాటాడింది. అర్జునునకు వ్యంగ్యంగా సూచించిన విషయాన్నే శ్రీకృష్ణుడు తన చెల్లెలయిన ద్రౌపదికి వాచ్యంగా చెప్పాడు. విషాద రోషాలు కావగలేని స్థితిలో ఉన్న ఆమెకు వ్యంగ్యంగా చెప్పితే అర్థం కాదని వాచ్యం చేశాడేమో. సంధి కార్య వచనాలు కౌరవుల చెవుల కెక్కవని ఎంత రమణీయంగా చెపుతాడు!

యమ మహిష ఘంటికా నా
దము వినఁ గౌతూహలంబు దళుకొత్తెడు చి
త్తములు గల కౌరవుల కి
ష్టము లగునే సంధికార్య శాంతవచనముల్.

కౌరవులు విధిప్రేరితులు, వారికి కాలమాసన్న మయ్యింది. సంధికార్య వచనాలు వారికిష్టం కావు, అని చెపుతూనే-

మొదల విధి నియతియు న
ట్టిద యందురు పెద్ద లది ఘటింపక పోదే
మదిఁ జూచి చెప్పినను ద
ప్పదు మేరువు దిరిగినేనిఁ బాంచాలా సుతా

అంటాడు. సంధి కాకపోవటం, సమరం జరగటం, అందులో కౌరవులు నశించటం అన్నది విధి నియతి. అది తప్పదు. ఏ మనస్సుతో తూచి చెప్పినా తప్పదు; ఎవరి అభిప్రాయమైనా అదే అని సామాన్యమైన అర్థము. శ్రీకృష్ణుని దైవమానుష సంబంధాలైన ఏ మనస్సుతో ఆలోచించి చూచినా అది తప్పదు అని విశేషార్థం మరొకటి గోచరిస్తున్నది. నేను మనస్సు లోకి చూచి చెప్పినా అది తప్పదు అనే ఇంకొక సూక్ష్మమైన విశేషార్థ మిందులో ధ్వనిస్తున్నది. అంటే, “నేను అంతర్ముఖుడనై విధి నిర్ణయాన్ని గమనించి చెపుతున్నాను. యుద్ధం తప్పదు. అందులో కౌరవులు నశించి తీరుతారు,” అని శ్రీకృష్ణుడీ పద్యంలో ధ్వనింప జేయటం గమనింప దగిన విశేషం.

శ్రీకృష్ణుడు హస్తినాపుర ప్రయాణంలో నారద జమదగ్ని కణ్వాది మహామును లాతనికి కన్పించిన సన్నివేశం సామాన్యమైనదిగా కనిపించినా పరిశీలిస్తే మహత్తరమైనదిగా గోచరిస్తుంది. వారిని చూచి మీ రిక్కడకు విజయం చేసిన కారణాన్ని సెలవీయండని నారాయణుడు అడుగగా నారదుడిలా అంటాడు.

అనఘ పుణ్యాత్ముడవగు నున్నుఁ గనుగొనఁ
గౌరవ సభ నీవు గారవమునఁ
బలికెడి పలుకుల భంగు లాకర్ణింప
విదుర భీష్మాదులు విని తెఱంగు
నుత్తరంబిచ్చు కార్యోక్తులు నెఱుగంగ
వేడుక వచ్చిరి వీరలెల్ల.

మహర్షులు కౌరవ సభకు రావడం వల్ల శ్రీకృష్ణ రాయబారానికి ఒక ఔన్నత్యం, ఔజ్జ్వల్యం చేకూరినవని చెప్పవచ్చు. త్రికాలజ్ఞులయిన నారదాది మునులకు సంధి జరగదనే విధి నిర్ణయం తెలియదా? తెలిస్తే ఎందుకు వచ్చినట్లు? విధి నియతి వారికి తెలుసు. విధి నియతి దైవమే సంధి కార్య నిర్వహణకు పూనుకొని, దానికై ఎలా ప్రయత్నం చేస్తాడో చూడాలనే కుతూహలం మహర్షులకు కలిగింది. పురుష ప్రయత్నం చేసేదీ తానే అయ్యి, దైవమూ తానే అయిన శ్రీకృష్ణుడు రాయబారానికి పూనుకోవటం ఒక గొప్ప విశేషం. ఆ విశేషాన్ని చూడాలనే ఉత్కంఠ మునులను కౌరవ సభకు రప్పించింది. అంతే కాకుండా, “అనఘ, పుణ్యాత్ముడవగు నిన్నుఁ గనుగొన కౌరవ సభ,” అని చెప్పడంలో కృష్ణుడు ప్రదర్శించే విశ్వరూపాన్ని సందర్శించటానికి కూడా వారు వచ్చారనే ధ్వని కూడా లేకపోలేదు.

శ్రీకృష్ణుడు హస్తినాపురంలో ప్రవేశించి ధృతరాష్ట్రాదులను కుంతిని దర్శించిన తరువాత విదురుని ఆతిథ్యం స్వీకరించడానికి అతని గృహానికి వెళతాడు. అక్కడ అభ్యంతర మందిరంలో అతనితో ఏకాంతంగా సంభాషిస్తాడు. రాయబార నిర్వహణలో శ్రీకృష్ణుని మనోభావాలను అర్థం చేసుకోవటానికి ఈ సన్నివేశం ఎంతో తోడ్పడుతుంది. విదురుడు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు.

“నీవిట వచ్చుట వినిన యప్పుడు ధార్త్రరాష్ట్రులందరుం గూడం బాఱి తమలో నిశ్చయించిన తెఱంగు నీ శాసనం బుల్లంఘింప గలవారు పాండునందనులకు నేమియు నీకుండువారు దార ధాత్రి యంతయు బీఱువోవకుండ నేలువారు… … సంధి కానేరదు. వారి తలంపులు కీడు. పాండవేయులపై స్నేహంబునను నీమీద భక్తిం జెప్పెద నందు బోవలదు.”

దీనికి సమాధానంగా కృష్ణుడు నీవు తల్లిదండ్రుల లాగా హితం చెప్పావు. అయినా నేనెందుకు వచ్చానో చెపుతాను విను… అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి తనకంతా ముందే తెలుసన్నట్లుగా “ఎఱుగుదు నేను సుయోధను కొఱగామియు… సంధి పొసగదనియ మహాత్మా” అని పలుకుతాడు. ఇంత తెలిసి ఎందుకు వచ్చావని అంటావేమో.

పుడమి యెల్ల నొడ్డ గెడనయి గజవాణి
యుతముగాఁ గడంగి యుగ్రమృత్యు
ముఖము మొరగఁ దివురు మూర్ఖత మాంచుట
యధికమైన పుణ్యమనఘచరిత!

భారతదేశంలో ఉన్న రాజులంటా యుద్ధానికి సన్నద్ధమయ్యారు. సర్వజన క్షయం కాబోతున్నది. ఇట్టి స్థితిలో వారి మూర్ఖత్వాన్ని మాన్చే ప్రయత్నం చేయవద్దా! విశ్వ శ్రేయోదాయకమైన ఆ ప్రయత్నం పుణ్యప్రదం కదా. అయితే మాన్పటానికి వీలున్నదా అంటేవేమో.

దొరకొని పుణ్యం పాపము
నరుఁ డర్థిం జేయుచుండ నడుమ నొకట న
వ్వెర వెడలి తప్పినను ద
త్పరిణతి ఫలమొందునండ్రు ధర్మ నిధిజ్ఞుల్.

నరుడు పాపపుణ్యాలు చేస్తాడు. వాటి ఫలితాలని అనుభవిస్తాడు. ఏదో ఉపాయంతో ఆ ఫలితాలను అనుభవించటం తప్పించుకున్నా చిట్టచివరకు అనుభవించటం తప్పదు. పాపాత్ములైన కౌరవులు తాత్కాలికంగా సుఖాల ననుభవిస్తూ ఉన్నా పాపం యొక్క పరిణతి ఫలాన్ని వారనుభవించక తప్పదు. పుణ్యాత్ములైన పాండవులు ఎన్నో కష్టాల ననుభవించినా పుణ్యపరిణతి ఫలాన్ని వారు తప్పక పొందుతారు. యుద్ధం జరుగుతుంది. అందులో కౌరవులు నశించి పాండవులకు జయం కలుగుతుందని భ్యంగ్యంతరంగా చెప్పటమే. సమరమే జరుగుతుంది సంధి కాదు అని తెలిసి కూడ తాను రాయబారిగా రావటం లోని ప్రయోజనమేమిటో ఇంకా ఈ విధంగా వివరించి చెపుతాడు.

చుట్టములలోన నొప్పమి పుట్టినప్పు
డడ్డపడి వారితోడఁ గోట్లాడియైన
దాని నుడుపంగఁ జొరకున్నవానిఁ గ్రూర
కర్ముడని చెప్పుదురు కర్మకాండ విదులు.

అన్నదమ్ములు దమలోనం బోరఁ గృష్ణుండు వారింపక యుపేక్షించె. తనచేత చక్కం బడదా యని యజ్ఞులైన జనులాడుదురు.

ఈ సన్నివేశంలో తాను చేయబోయే ప్రయత్నం యొక్క ఫలితాన్ని ముందే ఊహించిన కృష్ణుడు రాయబార కార్యానికి ఎందుకు పూనుకున్నాడో స్పష్టంగా చెప్పటం గమనింప వలసి ఉంది.

కౌరవసభలో శ్రీకృష్ణుడు రాయబారాన్ని నిర్వహించిన ఘట్టాన్ని భారతంలో సాటిలేని మహోజ్జ్వల ఘట్టంగా చెప్పవచ్చు. భీష్మ బాహిల్కాది కురువృద్ధులతో, ద్రోణ క్రుపాది ఆచార్యులతో, విదుర సంజయాది నీతికోవిదులతో, సకల రాజలోకంతో నిండి ఉన్నది కౌరవసభ. అంతేకాకుండా శ్రీకృష్ణ సందేశాన్ని ఆలకించటానికి వేంచేసిన త్రికాలజ్ఞులైన నారదాది మునుల వల్ల, ఆకాశమంతా నిండిన దేవతల వల్ల, ఆ సభకొక నిండుదనం, మహనీయత ఏర్పడ్డాయి. ఇక రాయబారాన్ని నిర్వహించే వాడా భగవానుడయిన శ్రీకృష్ణుడు. ఏ కార్యనిర్వహణమయినా, దాన్ని నిర్వహించే వ్యక్తి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. శ్రీకృష్ణుని అనుభావాన్ని గురించి వేరుగా చెప్పవలసిన అవసర మేముంది. అతని ధర్మోత్సాహం, మాహాత్మ్యం కౌరవ సభలో అతడు నిర్వహించిన రాయబారానికి ఔజ్జ్వల్యాన్ని, దీప్తిని చేకూర్చినాయి.

కౌరవసభలో ఉపన్యసించటానికి లేచి నిలుచున్న శ్రీకృష్ణుని రూపం సభ్యులను ఏ విధంగా ఆకర్షించింది? అతడు ఉపన్యాసాన్ని ఏవిధంగా ప్రారంభించాడు? చెప్పదలసిన విషయాలను ఎలా వివరించాడు? దాని ప్రభావం సదస్యులపై ఏ విధంగా ఉంది? ఇవన్నీ పరీశ్లించవలసిన విషయాలే. అంబుద శుభగాత్రుడు, పీతాంబరధారుడు, కమలదళనిభాక్షుడు అయిన హరి రూపాన్ని చూస్తున్న సభ్యుల లోచనాలు అమృతాన్ని ఆనినట్లు సమ్మదంలో తేలినవట. ఆ కొలువులోని వారందరు ఆ దివ్యమంగళ సుందర విగ్రహాన్ని దర్శించి, కదలక, మాటలేక, వింజమాకిడిన విధంగా తన్మయ స్థితిలో చిత్రిత ప్రతిమల వలె ఉన్నారు. అప్పుడు జలదస్వన గంభీరమైన ఎలుగుతో, దంతదీప్తులు వెలుగొందగా, అఖ్లీజనులు చెవులు రిక్కించి వినగా తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు. ఇక్కడ కొద్దిపదాలలో శ్రీక్ష్ణుని రేఖాచిత్రణం మనోజ్ఞంగా చేయబడింది. నీలమేఘశ్యామ గ్రాతం — కట్టింది పీతాంబరము — పుండరీకాక్షములు — ఇందలి మనోహరమైన వర్ణసమ్మేళనం గమనింపదగిన విశేషం. అంబుద శుభగాత్రునకు దంతదీప్తులు ఒక వింత చెలువును చేకూర్చినాయి. పెదవి కదల్చక ముందే శ్రీకృష్ణుడు సభ్యుల మనస్సు నాకట్టుకున్నాడు. ఇక ఉపన్యాసాన్ని ఇలా ఆరంభిస్తాడు.

జననాథ! నీయెఱుంగని
పనులు గలవె? యైనఁ దగవుఁ బరమ హితంబుం
దన వారికిఁ జెప్పన తగు
నని వచ్చితి భారతాన్వయము ప్రియమందన్.

మానవ మనస్తత్వాన్ని కాచి వడకట్టిన శ్రీకృష్ణుని వంటి మహారాజనీతివేత్తే ఈ విధంగా ప్రసంగాన్ని ప్రారంభించగలడు. ధృతరాష్ట్రుడు తనకంటే పెద్దవాడు, పోరాని చుట్టము. అట్టివానికి ఉపదేశించినట్లుగా చెప్పటం ఉచితంగా ఉండదు. అందుచేత “అంతా నీకు తెలుసు” అన్నట్లు నేవెఱుగని పనులు గలవె అని వినయంగా ప్రారంభిస్తున్నాడు. అయితే జూదము, ద్రౌపదీ పరాభవము – మొదలైన పనులు గూడ నీ వెఱుగనివి కావు కదా అనే అర్థచ్ఛాయ కూడా ఇందులో లేకపోలేదు. అన్ని విషయాలు ధృతరాష్ట్రునకే తెలిస్తే తానెందుకు వచ్చాడో అన్నదానికి సమాధానంగా తనవారికి తగవు, హితాన్ని చెప్పటానికి తగుదునని వచ్చానని అంటున్నాడు. మూలం లోని ‘భారత’ అనే ధృతరాష్ట్రుని సంబోధన తెలుగులో ‘జననాథ’గా మారింది. రాజువైన నీకు జనహితం ముఖ్యమని తెలియదా అనే సూచన ఇందులో ఉంది. ఇదే విధంగా ఈ సాందర్భంలో శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని కురుప్రవర, కౌరవ్య వంశాగ్రణీ, ధరిత్రీ రమణాగ్రగణ్య, ఉర్వీరమణ – ఈ మొదలుగా సాభిప్రాయ విశేషణాలతో సంబోధింపటం గమనింపవలసి ఉంది.

వక్తబ్యాంశ మేమితో తెలీయ నీయకుండా ఉపన్యాసం సాగించటం ఒక పద్ధతి. పాండవ సభలో సంజయుడు చేసిన ఉపన్యాస మిటువంటిది. ఆ రాయబారానికి ఆ పద్ధతి తగి ఉంది. చెప్పదలచుకున్న విషయాన్ని సూత్రప్రాయంగా ముందు ప్రతిపాదించి దానిని వివరించటం వేరొక పద్ధతి. శ్రీకృష్ణుడు ఈ పద్ధతిని అవలంబించాడు.

క్షీరోదక గతిఁ బాండవ
కౌరవు లొడఁగూడి మనికి కార్యం బది నీ
వారసి నడువుము; వారన
వీరనఁ గురుముఖ్య, నీకు వేఱుం గలదే.

శ్రీకృష్ణుని ఉపన్యాసానికి ఈ పద్యం బీజప్రాయమైనదని చెప్పవచ్చు. తరువాతి ప్రసంగం దీని వివరణమే. క్షీరోదక గతి పాండవులు, కౌరవులు కలిసి జీవించటం కార్యం. అలా కలిసి జీవించేటట్లు చూడవలసిన బాధ్యత ధృతరాష్ట్రుని మీద ఉంది. అతడు కురు ముఖ్యుడు. కురుపాండవులలో అతనికి భేదభావం లేదు. ఇద్దరూ అతని బిడ్డలే. ఇలా ప్రసంగాన్ని ప్రారంభించిన కృష్ణుడు పాండవ కౌరవులు క్షీరోదక గతి కలిసి జీవించటం కార్యమంటున్నాడు. క్రమాలంకారంలో పాలు పాండవులు, నీరు కౌరవులు. క్షీర నీరములలో క్షీరం ప్రధానం కదా. సంజయుని రాయబారిగా పంపేటప్పుడు ధృతరాష్ట్రుడు కూడా “క్షీరోదక వృత్తి మనము వారలునుం గలసి బ్రదుక వలదే” అని చెప్పటం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవలసి ఉంది. ధృతరాష్ట్రుని ధృష్టిలో పాలు కౌరవులు, నీరు పాండవులు. రాయబారిగా వెళ్ళే కృష్ణునితో భీముడు కూడ “పాండవ కౌరవుల్ గలిసి పాలును నీరును బోలె నెమ్మిమై నుండగ” అంటాడు. ఇక్కడ పాటించిన క్రమాన్ని కూడా గమనింపవలసి ఉంది. ఒక చిన్న ఉపమానంతో ఎంతో ప్రయోజనాన్ని సాధించటం జరిగింది. పై పద్యంలో ‘కురుముఖ్య’ అని ధృతరాష్ట్రుని సంబోధించి కురువంశ సంప్రదాయాల నన్నింటినీ నిలబెట్టవలసిన బాధ్యత అతనిమీదే నిలిచి ఉన్నదని గుర్తు చేస్తూ, ఆ కురువంశ మెట్టిదో, దాని సుచరిత క్రమమెట్టిదో ఇలా వివరిస్తాడు.

భరత కులంబు ధర్మమును బాడియు సత్యము బొత్తుఁ బెంపునున్
గరుణయుఁ గల్గియుండు ననగా నుతి గన్నది యంది సద్గుణో
త్తరులరు నీవు నీయనుగు దమ్ముడు నీతనయుల్ యశోధురం
దర శుభ శీలురీ సుచరిత క్రమ మిప్పుడు దప్ప నేటికిన్.

భరతవంశం ధర్మం, న్యాయం, సత్యం, పొత్తు, పెంపు, కరుణ కలిగి నుతి కెక్కింది. దాయాది భాగాలకై తగవులాడుకొని కుత్తుకలను ఉత్తరించుకోవటానికి ఎప్పుడూ సిద్ధం కాలేదు. తండ్రి సౌఖ్యం కోసం రాజ్యాన్నే కాకుండా సర్వసౌఖ్యాలను త్యాగం చేసినవాడు భీష్ముడు. అన్న జాత్యంధుడైనా అతనిని సింహాసనం మీద కూర్చుండ బెట్టినవాడు పాండురాజు. ఈ విధంగా రాజ్యాన్ని త్యాగం చేయటమే గాని దానికై వంశ నాశనానికి పూనుకోవటం భరతవంశ సంప్రదాయం కాదు. ఆ వంశం యొక్క సుచరిత్ర క్రమాన్ని ఇప్పుడు తప్పటం దేనికి? ఈ వంశానికి ఇప్పుడూ కలిగిన హానిని పోగొట్టవలసిన బాధ్యత నీమీదే ఉంది. ఎందు చేతనంటావా?

ఈ వంశంబునకెల్ల నీవ కుదురిం దెవ్వారి చందంబు లె
ట్లై వర్తిల్లిన ఁగీడు మేలుఁ దుది నీయం దొందెడుం గాన స
ద్భావం బారసి, లోని పొత్తు, వెలి వృత్తంబున్, జన స్తుత్యంబుల్
గావింపం దగు నీక యెవ్విధమునం గౌరవ్య వంశాగ్రణీ.

ఈ భరత వంశానికి నీవే కుదురు. ఈ వంశం లోని మంచిచెడ్డలు నీకే చెందుతాయి. అందుచేత సద్భావంతో బయటికి బాగున్నార న్నట్లుగా కాకుండా మనస్సు లొక్కటిగా కలసి నీ బిడ్డలు జీవించేటట్లు చేయవలసిన కర్తవ్యం నీమీద ఉంది. సుయోధనాదులయిన నీ కొడుకులు ధర్మమార్గాన్ని విడిచి మీవంశ వర్తనానికి దూరులై బంధువుల మనస్సులు నొచ్చుకోనేటట్లు ప్రవర్తిస్తున్నారు. కౌరవులు పాండవులు సంధి చేసుకొని శాంతితో జీవించటం నీకు నాకు కులానికి ఈ రాజులకు మేలు. అంతేగాక ప్రపంచాని కంతటికీ శ్రేయస్కరం. యుద్ధమే జరిగితే మహాపద కలుగుతుంది. ఇదంతా జాగ్రత్తగా ఆలోచించి తప్పకుండా సంధి జరిగేటట్లు చూడు.” అని కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ ‘తెఱగు నీవశమున మదియ’ అంటాడు. కార్య విధానమంతా నీ అధీనం లోనే ఉంది అని చెప్పటంలో శ్రీకృష్ణుని నేర్పు వ్యక్తమవుతుంది. ధృతరాష్ట్రుని మూలశక్తిగా గుర్తించిన వాడు గదా కృష్ణుడు. ఆ వైపునున్న వృకోదరార్జునులను యుద్ధంలో అతిశయించే వారెందరున్నారు. ఈ వైపునున్న భీష్మద్రోణాదులను ఎదురు నిలిచే వారెందరున్నారు. వారు వీరు యుద్ధంలో కూలటం కన్నా అందరూ నీవారై కలసి బ్రదుకటం మేలు కదా. అందుచేత శాంతి వర్ధిల్లే టట్లు కార్యాన్ని నడిపించు. కౌరవ పాండవులలో ఎవరికి చావు, బాధ కలిగినా దుఃఖించేది నీవే కదా. అలా కాకుండా ఈ రెండు పక్షాల వారిని కాచుకోవలసిన కర్తవ్యం నీదే. అని ఉపదేశించి పాండవులు ఒక్క మాటగా ధృతరాష్ట్రునితో చెప్పమన్న విషయాన్ని చెప్పి, వారు సభ్యులతో చెప్పమన్న విషయాన్ని ఈ విధంగా వివరిస్తాడు.

సారపు ధర్మమున్ విమల సత్యముఁ బాపము చేత బొంకుచేఁ
బారము బొందలేక చెడబాఱినదైన యవస్థ దక్షులె
వ్వార లుపేక్ష చేసిరది వారల చేటు గాని ధర్మ ని
స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్.

ధర్మం అధర్మం చేత, సత్యం అసత్యం చేత ఫలితాన్ని పొందలేని దుస్థితి కలిగినప్పుడు సమర్థులు ఉపేక్షించ కూడదు. అలా చేస్తే వారికే చేటు కలుగుతుంది గాని ధర్మనిస్తారకము, సత్యశుభదాయకము అయిన దైవం లేకపోలేదు. కౌరవుల వలన సత్యానికి ధర్మానికి హాని చేకూరింది. ఆ సత్యధర్మాలను ఉద్ధరించటానికి దక్షులైన భీష్మద్రోణాదులు ఉపేక్ష వహిస్తున్నారు. దీనివలన వారికి కీడు కలుగుతుందే గాని సత్యాన్ని, ధర్మాన్ని పాలించే పాండవులను దైవం తప్పక రక్షిస్తాడు.

సత్యధర్మాలకు కీడు వాటిల్లినప్పుడు ఉపేక్షించటం కూడ అధర్మమేనని భీష్మాదులకు సూచిస్తూ వారికి స్వధర్మ స్మృతిని కలిగించటం గమనింపదగిన విశేషం. ఇంకా సభ్యులతో “ఏను ధర్మంబును నీతియును మున్నిడుకొని మనో వాక్ప్రకారంబు లేక రూపంబైన సత్యంబకాఁ జెప్పితి. ఇత్తెఱంగు మీకు మేలు.” అని చెపుతూ తానింత వరకు చేసిన ప్రసంగ పద్ధతిని తానే సమీక్షిస్తున్నాడు. కర్తవ్యం ఇంతకంటె వేరేమున్నదని వారితో ఒత్తి ఇలా చెపుతున్నాడు.

పాండవులకుఁ దగిన పాలు మేదినిఁ బంచి
ఇచ్చుకంటెఁ గార్యమెద్ది గలదు
ధర్మమెద్ది సముచితంబగు విధమెద్ది
శక్యమెద్ది చెపుడ వాక్యవిధులు.

తాను చెప్పవలసిన విషయాన్ని బల్ల గుద్ది చెప్పిన ధోరణిలో చెప్పిన తరువాత ధృతరాష్ట్ర మహారాజుతో పాండవులకు వారి తండ్రి పాలు వారికి పంచి ఇచ్చి నీ పాలు నీ పుత్ర పౌత్రచయంతో అనుభవించి సుఖంగా ఉండండి. ఇది బంధుమిత్రులు, సజ్జనులు మెచ్చుకొనే తీరు. అజాతశత్రుని ధర్మ వర్తనము, సత్యనిష్ఠ, శక్తిసామర్థ్యాలు, అతడు నిన్ను ఏవిధంగా అనుసరించాడో, నీకు తెలుసు కదా. అయినా చెపుతున్నాను విను. అంటూ ధృతరాష్ట్రునకు, ధర్మరాజు ఇంద్రప్రస్థ పురాన్ని పాలించేటప్పుడు ధృతరాష్ట్రునకు పెంపు పేరు కలిగించటానికి రాజసూయం చేసినట్లు చెపుతున్నాడు.

మద మడగించి భూపతి సమాజము నెల్లను నినుఁ గొల్వఁ జే
యుదునని పూని దిగ్విజయు మున్నతిఁ జేసి మహా విభూతితో
మది మదినుండ నీసుతుడు మంత్రులు సౌబలు జూదమార్చి సం
పదఁగొని యంతఁ బోవక సభన్ ద్రుపదాత్మజ భంగ పెట్టరే.

వక్త తాను చెప్పదలచుకున్న విషయాన్ని ఏ క్రమంలో చెప్పాలో, ఏ అంశాని కెంత ప్రాధాయమిచ్చి మాటాడాలో ముందే నిర్ణయించుకుంటాడు. అంతే కాకుండా తాను ఉద్దేశించిన ప్రయోజనానికి అనుగుణంగా ఆయా అంశాలను ఎలా వ్యాఖ్యానించాలో కూడా నిర్ణయించుకోవటం వక్త ప్రతిభకు ఒరగల్లు. రాజసూయం దుర్యోధనుని అసూయకు కారణమయ్యింది. అది జూదానికి దారి తీసింది. జూదం ద్రౌపదీ పరాభవానికి, అది మహాభారత యుద్ధానికీ కారణమయ్యింది. అని చెప్పవచ్చు. అంటే మహాభారత సమరానికి బీజాలు రాజసూయం నాడే పడినాయి. అట్టి రాజసూయాన్ని ధృతరాష్ట్రుని పేరు, పెంపు వృద్ధి చేయటానికే ధర్మరాజు చేశాడని చెపుతున్నాడు కృష్ణుడు. ధర్మరాజు తన కీర్తి కొరకో, చక్రవర్తిత్వాన్ని కాంక్షించియో, లేక తన తండ్రికి పుణ్యలోకాలు ప్రాప్తించటానికో రాజసూయం చేసి ఉంటాడు. భూపతి సమాజమంతా ధృతరాష్ట్రుఁ గొల్వఁజేయటానికే దిగ్విజయం చేశాడట ధర్మరాజు. అట్టి ధర్మరాజు చేత జూదమాడించి నీ కొడుకులు సర్వసంపదలు హరించి, అంతటితో ఊరుకోకుండా నిండు సభలో ద్రౌపదిని పరాభవించి, వారిని అడవులకు పంపినారు. దానికి నీవు కూడ అంగీకరించావు. అయినా ధర్మరాజు అన్నింటిని ఓర్చి సంధి కోరుతున్నాడు. అతని శాంతం, వినయం, గౌరవం ఏ రాజులో ఉంది? అతనికతడే సాటి. అంటూ వ్యాఖ్యానిస్తూ తన విషయ వ్యాఖ్యాన నైపుణ్యాన్ని, ప్రదర్శనశక్తి ప్రాగల్భ్యాన్ని చూపించినాడు కృష్ణుడు. చెప్పవలసినదంతా చెప్పి కార్య నిర్ణయ భారాన్ని ధృతరాష్ట్రుని మీదే మోపుతూ చివరకు తన ఉపన్యాసాన్ని ఈ విధంగా ముగిస్తున్నాడు.

వారలు శాంతశూరులు భవచ్చరణంబులు గొల్వఁ బూని యు
న్నారటు గాక మీకది మనంబున కప్రియమేని నింతకుం
బోరికి వచ్చుచుండుదురు భూవర! రెండు తెఱంగులందు నీ
కారయఁ బథ్యమేది యగు నవ్విధ మేర్పడ నిశ్చయింపుమా.

నీ తమ్ముని బిడ్డలైన పాండవులకు వారి రాజ్యభాగం వారికిస్తే శాంతులై నీ పాదాలను గొల్వటానికి సిద్ధంగా ఉన్నారు. అది నీకిష్టం కాకపోతే శూరులైన వారు యుద్ధానికి సన్నద్ధులయ్యే ఉన్నారు. ఈ రెండు పద్ధతులలో నీకేది పథ్యమో నీవే నిర్ణయించుకో వలసింది అని ధృతరాష్ట్రునకే కార్య నిశ్చయాన్ని ఒదిలివేయటం జరిగింది. ఈ పద్యం ప్రారంభంలో ఉన్న శాంతశూరులు మనోజ్ఞమైన విచిత్ర విరోధాభాస సమాసం. పద్యభావమంతా ఈ పదబంధం లోనే సూచింపబడింది. శ్రీకృష్ణుడు చేసిన ఈ మహోజ్వలమైన ప్రసంగం సభలోని సదస్యులపై ఎటువంటి ప్రభావాన్ని కలిగించిందో ఈ క్రింది పద్యంలో మనోజ్ఞంగా వర్ణించబడింది.

అనవుడు రోమహర్షణము లంగములం బొడమన్ సదస్యు లె
ల్లను బ్రియమంది నెమ్మనములం బురుషోత్తముఁ డింత యొప్పఁ బ
ల్కునె మఱు మాటలాడ నయకోవిదుఁ డెవ్వడు ధీరుడెవ్వఁ డిం
దనువరి యెవ్వఁడంచు నచలాకృతులై నెఱి నూరకుండగన్.

ఆ స్థితిలో జామదగ్న్యుడు, కణ్వుడు, నారదుడు అనే ముగ్గురు మునీంద్రులు ‘కృష్ణుని మాట విని కౌరవ కులాన్ని రక్షింపు’మని దుర్యోధనునకు హితోపదేశం చేశారు. దానిని విన్న గాంధారేయుడు రాధేయుని చూచి చేయప్పళించి నవ్వి వీరలింత వెఱ్ఱులగుదురే యని పలికి వారల వైపు తిరిగి ఇలా అన్నాడు.

మునులార నన్ను విధి యే
మనిమును పుట్టించె నట్టులయ్యెడుఁ గాకీ
వినఁజవి గాని పలుకులకుఁ
బని గలదే యుడుగు డింక బహుభాషణముల్.

విధి ప్రేరణ చేతనే ఇతడీవిధంగా మాట్లాడినాడా అన్నట్లు పలికాడు సుయోధనుడు. వీని దుర్మానానికి, మూర్ఖత్వానికి, అవధి ఏముంది? ఇంతవరకు ధృతరాష్ట్రుడు మౌనాన్నే వహించాడు. శ్రీకృష్ణుడు కార్యం నీవశమే, సంధియో, సమరమో నిశ్చయించవల్సింది నీవే అంటున్నాడు. మునుల హితోపదేశాన్ని పెడచెవిని పెట్టటమే కాకుండా వారిని అపహసించి దురభిమానంతో మూర్ఖంగా సమాధానం చెపుతున్నాడు దుర్యోధనుడు. ఇట్టి స్థితిలో అతనికి మౌనముద్ర వదిలి పెదవి కదల్చక తప్పలేదు.

మీరు సెప్పిన బుద్ధులు గారవమునఁ
జేయగాంచినఁ బుణ్యంబు సేయనెట్లు
వా ముఖంబునఁ గార్యంబు నడవదేమి
సేయువాడ నొండెద్దియుఁ జెప్పలేదు.

“తెఱగు నీ వసమున యదియ” అని శ్రీకృష్ణుడంటే “నాముఖంబున కార్యంబు నడవదేమి సేయువాడ” అని చేతులు కడుగుకోవడం గమనింపదగిన విశేషం. ఆ తరువాత శౌరితో “అనఘా! నీవు ఇహము పరము కలిగే విధంగా చెప్పావు. కాని నీవు చెప్పినట్లుగా కార్యాన్ని నడపడానికి నాకు చనవు అనువు లేదు. ఎందుచేతనంటావా? నా కొడుకు మందబుద్ధి. నీవు మాకు పోరాని చుట్టానివి. మహానుభావుడవు. దయార్ద్ర చిత్తుడవు. ఎలాగైనా ఈ మందబుద్ధిని అనునయించి చక్కదిద్దు” అని భారాన్ని శ్రీకృష్ణుడిపై పెట్టినాడు. చెప్పలేదని నన్ను అనటం దేనికి, నీవే చెప్పి చూడు అన్నట్లుగా ఉంది. “నన్ను విధి ఏమని మును పుట్టించెనట్టు లయ్యెడు గాక ఈ విన చవిగాని పలుకులకు పనిగలదా” అని పలికిన దురభిమానం గల దుర్యోధనుని చక్కదిద్దటం అసాధ్య కార్యమని ధృతరాష్ట్రునకు, కృష్ణునకు, ఇద్దరకూ తెలుసు. అయితే ‘సుతువాడు’ కొడుకు వలచినట్టి వాడు అయిన ధృతరాష్ట్రుడు అట్టి వ్యర్థప్రయత్నానికి పూనుకోడు. భారతంలో అతని పాత్రను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం విశదమవుతుంది. కాని పురుష ప్రయత్నాన్ని పూర్తిగా చేయటానికి వచ్చిన శ్రీకృష్ణుడీ కార్యానికి పూనుకోకుండా ఎలా ఉంటాడు? అందుచేత సుయోధనునకు హితోపదేశం చేయటనికే నడుం కట్టాడు. ఇంతకు ముందు కృష్ణుడు సభ నుద్దేశించి ప్రసంగించాడు. దాని ప్రయోజనము, పద్ధతి వేరు. సదస్యులను సమ్మోహింపజేసే వాక్యవైఖరితో అది సాగింది. ఇప్పుడు దుర్యోధనునితో చేసిన ప్రసంగం అటువంటిది కాదు. ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడింది. దీని ప్రయోజనము, పద్ధతి వేరు. యుక్తియుక్తంగా మాట్లాడి, నచ్చచెప్పే తీరులో ఇది సాగుతుంది. “విమలతరమైన భరతవంశంలో జన్మించావు. నీకు దురాగ్రహం తగదు. నీ వారందరినీ చెడుమార్గం పట్టకుండా చూసుకో. అల్పబుద్ధుల పెడమాటలు చెవి యొగ్గి వినకు. దానివల్ల దోషం, కీడు కలుగుతుంది. పాండిత్య శౌర్య నిత్యులైన పాండుపుత్రులతో కలిసి బ్రదుకుట కురుముఖ్యుల కందరికీ సంతోషకరం. వారెల్లరూ కోరేది అదే పాండవులను గెల్వటం అసాధ్యం. యుద్ధమే జరిగితే నీకు కులనాశనం కలుగుతుంది. రాజుకు కులనాశనుడనే నింద మేలు కాదు. పాండవులతో కలిసి బ్రదుకు. అది ఏ విధంగా నంటావా-

రాజ్యము భారమెల్ల ధృతరాష్ట్రుని యందె వెలుంగుచుండఁ ద
త్పూజ్య కుమార పట్టమునఁ బొల్చి చరింపగ నీవు పాండవుల్
సజ్యతఁ దండ్రి చిత్తము ప్రసన్నతఁ బొందగఁ గొల్చి యుంకి సా
మ్రాజ్యముగాఁ దలంతురను రక్తమతిం దమకున్ ధరాధిపా.

రాజ్యభారమంతా ధృతరాష్ట్రుని యందే వెలుగొందగా నీవు పాండవులు కుమారపట్టమున ప్రకాశిస్తూ ఉంటే మీ తండ్రి మనస్సుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అప్పుడు మీ రాజ్యాన్ని సామ్రాజ్యంగా భావించి రాజులంతా అనురాగంతో మిమ్ములను సేవిస్తారు. అని కురుపాండవులు కలిసి జీవించ వలసిన పద్ధతిని శ్రీకృష్ణుడు చాల చక్కగా సూచించాడు.

భీష్మ ద్రోణులు దుర్యోధనుని చక్క దిద్దటానికి ఎన్నో మార్లు ప్రయత్నించి విఫలులయ్యారు. అతని దురభిమానాన్ని దుర్బుద్ధిని మాన్పటం వారికి శక్యం కాలేదు. కృష్ణు డప్పుడు కౌరవ సభలో ‘దక్షులెవ్వార లుపేక్ష చేసిరది వారల చేటగు’ అంటున్నాడు. మేము ఉపేక్ష చేయలేదు. చేయవలసినంత ప్రయత్నం చేస్తూనే ఉన్నామని తెలియ జేయటానికి భీష్మ ద్రోణులిద్దరు మరల సుయోధనునకు హితోపదేశం చేశారు. ఇందరు కొడుకుకు బుద్ధులు చెపుతున్నా తాను నోరు మెదపక పోవడం బాగుండదనుకున్న ధృతరాష్ట్రుడు దుర్యోధనుని వైపు తిరిగి “ఈ హరి నాశ్రయించి నీ అన్న అయిన అజాత శత్రుని దర్శించు. దీనివల్ల మన పనులన్నీ చక్కబడతాయి. కృష్ణుని మాట వినకపోతే చివరకు అంతా కీడే జరుగుతుంది” అన్నాడు. ఇది సభలో ఉన్నవారి కోసం చేసిన హితోపదేశమే కాని దుర్యోధనుని మనస్సు మార్చటానికి చేసిన ప్రయత్నం మాత్రం కాదు. అయినా దీనినే ఊతంగా తీసుకొని భీష్మ ద్రోణులు మరల దుర్యోధనునకు గట్టిగా కర్తవ్యాన్ని బోధించారు. ఆ మూర్ఖునకు ఈ పలుకులు తల కెక్కుతాయా? అతడు కృష్ణుని చూసి ఈ విధంగా అన్నాడు. గురువు, తండ్రి, తాత ఎప్పుడూ నన్నే నిందిస్తారు. ఇప్పుడు నీవూ నన్నే నిందిస్తున్నావు గాని న్యాయమాలోచించవేమిటి? పాండవులను అకారణంగా కష్టాల పాలు చేశానంటున్నారు. ఆలోచించి చూస్తే అందులో నా తప్పేమైనా ఉందా? ధర్మరాజు శకునితో జూదమాడి ఓడిపోయాడు. దానిలో నా బాధ్యత ఏముంది? అతడే దారిని పడినా తన ఇష్టంతోనే పడ్డాడు. నా చిన్నతనంలో తెలియనప్పుడు తండ్రి తాత వారికి రాజ్యభాగమిస్తే ఊరుకున్నాను గాని ఇప్పుడు మరల అలా చేస్తే నే సమ్మతిస్తానా? నా నిశ్చయాన్ని చెప్తున్నా విను.

ఏ మును వారు పంచుకొని యేలుట గల్గదు పల్కకుండు మిం
కేమియు వాడిసూది మొన యించుక మోపిన యంత మాత్రమున్
భూమి యొనర్చి పాండు నృప పుత్రుల కిత్తునె యెవ్వరైన సం
గ్రామమునన్ జయంబు గొని రాజ్యము సేయుట నిశ్చయించితిన్.

మేము పాండవులు రాజ్యాన్ని పంచుకొని పాలించటం జరగదు. ఈ విషయాన్ని గురించి నీవు మాటాడ వద్దు. వారికి వాడిసూదిమొన మోపిన నేల కూడా ఇవ్వను. ఎవరినా యుద్ధంలో జయాన్ని పొంది రాజ్యాన్ని పాలించుకోవటమే కార్యంగా నిశ్చయించాను – అని పలుకుతూ ఉన్న దుర్యోధనుని ధోరణి ఎవరికైనా కోపాన్ని తెప్పించేది గానే ఉన్నది. పెనుకోపం రావలసిన స్థితిలో కృష్ణుడు కినుకతో కూడిన నవ్వు నవ్వినాడు. ఆ నవ్వు ముఖానికొక కొత్త అందాన్ని ఇచ్చింది. అతనిలో ఏమాత్రం ఉద్రిక్తత లేదు. ఏ కొంచం కూడా గాంభీర్యం సడలలేదు. కాని ఆ చిరునవ్వులో తృణీకారభావం, అపహాస్యం తొంగి చూస్తూనే ఉన్నాయి. కౌరవుల నాశనం తప్పదు. దానికింక ఆలస్యం లేదు అని ధ్వనించేటట్లుగా “మొన తలబడియెదు నీ చెప్పిన యట్టుల, తడవు లేదు” అంటూ ప్రౌఢంగా పలుకుతాడు. దుర్యోధనుని దుర్ణయాల నన్నింటిని ఉగ్గడించుతూ కినిసి, జంకించి మాటాడుతాడు.

ఇది కృష్ణుడు కౌరవసభలో చేసిన మూడవ ప్రసంగం. కోపించి దుర్యోధనుని దుష్కార్యాల నన్నింటిని తీవ్రధోరణిలో ఎత్తి చూపిస్తూ సదస్యుల కతనిపై వైముఖ్యాన్ని పాండవులపై సానుభూతిని కలిగేటట్లు చేసి అతడు కటకటపడే విధంగా సాగింది. ఈ స్థితిలో దుశ్శాసనుని ప్రోత్సాహంతో దుర్యోధనుడు దిగ్గున లేచి సభ నుండి నిష్క్రమించాడు. ఒక్కసారి కొలువంతా సంచలించిపోయింది. అతని వెనుక కర్ణుడు, తమ్ములు, శకుని, మిత్రులైన రాజులు నడచారు. సభాగౌరవాన్ని ధిక్కరించి కనీస మర్యాదను కూడ విడిచి కొలువు వెడలిన సుయోధనుని చూచి గాంగేయుడు “ఇతడు క్రొవ్వి రాజుననే వృథాబిమానంతో మతి చెడి లోభ మోహ మదమాత్సర్యాలు తన్ను త్రిప్పగా ఇట్లసంగతంగా ఎందుకు వెళ్ళాడు. వెనుక వెళ్ళిన రాజులంతా ఏమనుకొని వెళ్ళారు” అని కృష్ణుని వైపు తిరిగి “ఈ రాజుల కందరకూ కాలం పక్వమయ్యింది” అన్నాడు. కృష్ణుని రాయబారం చివరి ఘట్టానికి చేరింది.

ధృతరాష్ట్రుడు “నా ముఖంబున కార్యంబు నడవదేమి సేయువాడ” అంటూ తన అశక్తతను వెల్లడించి కార్యనిర్ణయము చేయవలసింది తన కొడుకేనని సూచించాడు. ఆ దుర్యోధనుని దురభిమానం, దుర్ణయం, దుర్బుద్ధి ఎటువంటివో సభలోని వారందరికీ స్పష్టంగా తెలిసింది. సంధికి ఏ పరిస్థితి లోను అంగీకరించడనే సంగతి కూడ తేటతెల్ల మయ్యింది. అతని మనస్సు మార్చగల సామర్థ్యం కూడ ఎవ్వరికీ లేదని తేలిపోయింది. కురుపాండవులు శాంతిగా జీవించటానికి దుర్యోధను డొక్కడే ప్రతిబంధకం అనే విషయం సదస్యుల కందరికీ స్పష్టమయ్యేటట్లు శ్రీకృష్ణుడు కార్య విధానాన్ని నడిపించాడు. కొడుకు ముఖ్యమో, కులము ముఖ్యమో తేల్చి చెప్పవలసిన పరిస్థితిని ధృతరాష్ట్రునకు కల్పిస్తున్నాడు కృష్ణుడు. కొడుకును కాదని కులాన్ని రక్షించుకుంటాడా? కొడుకును కాదనలేక కులాన్ని నాశనం చేసుకొని కులనాశనుడనే పేరు తెచ్చుకుంటాడా? కులమే కాదు సర్వ నాశనం జరిగినా కొడుకును కాదనే శక్తి ధృతరాష్ట్రునకు లేదు. అతని పుత్రవ్యామోహ మట్టిది. కొడుకు సంగతి సభకు వెల్లడయ్యింది. ఇక తండ్రి స్వరూపాన్ని బయట పెట్టవలసి ఉంది. దానికై కృష్ణుడు సభలోని వారి నుద్దేశించి ఈ విధంగా అంటున్నాడు.

ఈ దుర్యోధనుఁడింత గర్వి యగునే యీయున్న వారెల్ల నా
చే దైన్యంబునఁ బొందుటొప్పదని చర్చింపండ ఈ భంగికిన్
లేదే యొండు దెఱంగు సత్కులముఁ బాలింపంగ వర్జింప రా
దే దుష్టత్మకు నీచు నొక్కరునిఁ బొదే భేద మీ జాతికిన్.

“ఈ దుర్యోధనుడింత గర్వి అవుతాడా? ఇక్కడున్న వారంతా బాధ పడతారని కూడా ఆలోచింపడా? దీనిని చక్కదిద్దటానికి వేరు దారి లేదా?” అంటూనే “సత్కులాన్ని రక్షించటానికి దుష్టుడు నీచుడు అయిన వాని నొక్కని విడిచిపెట్టరాదా? దానితో భరత జాతికి భేదభావం పోదా?” అని చెప్పి, “అటువంటిది అపూర్వ విషయం కాదు. వీద్యుడు దుర్మాంసాన్ని కోసినట్లు నేను కంసుని సంహరించి ఆ కులాన్ని ఉద్ధరించటం మీకు తెలియదా? అదే విధంగా మీరూ చేస్తే బాగుండదా? అలా చేస్తే ఆపదలన్నీ తీరిపోతాయి. వంశగౌరవం అధికమవుతుంది. కురుపాండవులు కలిసి జీవించుతారు. ఈ పద్ధతి మీకు తగింది కాదా?” అని పలికిన కృష్ణుని మాటలు విని ధృతరాష్ట్రుడు అదిరి పడ్డాడు. అతని నెత్తిపై పిడుగు పడినట్టయ్యింది. సభలోని వారు దుర్యోధనుని వర్జింపమని చెప్పితే తన గతి ఏమి కాను? దుర్యోధనుడు లేని లోకం అతనికి శూన్యం కదా! ఆ స్థితి నుంచి బయట పడటానికి విదురుని పంపి గాంధారిని సభకు రప్పించి, ఆమె చేత కొడుకుకు హితబోధ చేయించుతాడు. వానికి తల్లి మాటలు తలకెక్కుతాయా? గాంధారి చెప్పిన హితాన్ని పెడచెవిన బెట్టి మరల సభ నుంచి పోయి కర్ణాదులతో కలిసి దురాలోచన చేయటానికి పూనుకున్నాడు. శ్రీకృష్ణుడు గురుభీష్ములను కూర్చుకొని తమను పట్టటానికి ప్రయత్నిస్తున్నాడు. మనమే అతనిని పట్టి బంధించితే కార్యం తీరిపోలేదా? దీనితో పాండవులకు దిగులు పుడుతుంది. యుద్ధం మాటే ఎత్తరు. ఒకవేళ ఎత్తి వచ్చినా వారిని తేలికగా నిర్జింపవచ్చు. కోరలు తీసిన పాములు ఏమి చేస్తాయి. అని దుష్టచతుష్టయం దుర్మంత్రం చేసి హరిని బంధించటానికి ప్రయత్నం ప్రారంభించారు. దానిని గుర్తించి సాత్యకి, జనార్దనునకు ఆవిషయం తెలిపి, అతని అనుమతితో కౌరవేశ్వర, బాహ్లిక, భీష్మ విదురులకు దానిని తెలిపాడు. అప్పుడు విదురుడు అదిరిపడి ధృతరాష్ట్రునకా విషయం ఒత్తి చెపుతాడు. తాను వచ్చిన పని ముగిసిందన్నట్లు ధృతరాష్ట్రుని వద్ద సెలవు తీసుకుంటూ శ్రీకృష్ణుడీ విధంగా అంటాడు.

రోషము నాపయిం గలిగి క్రూరతఁ గౌరవు లింతసేత సం
తోషమ నీవు ప్రాభవముతోఁ దగ నాకు ననుజ్ఞ యిమ్ము ని
ర్దోషత నేను నోపుగతి దోర్బల దుర్జయులైన వారి వి
ద్వేషమ్య్ఁ జక్కబెట్టి జగతీవర యింతకు పోయి వచ్చెదన్.

అతని రాయబార కార్యం ఇంచు మించుగా ముగిసినట్లే. రాజు దగ్గర సెలవు కూడా తీసుకున్నాడు. ధృఅతరాష్ట్రుడు విదురుని పంపి, దుర్యోధనుని అతని పరివారాన్ని సభకు రప్పించి, తాను, విదురుడు వానిని గట్టిగా మందలించుతారు. ఆ స్థితిలో కట్టెదుర ఉన్న సుయోధనుని చక్కగా చూచి కృష్ణుడు “నేనొక్కడనే నని తలంచి దుర్మదంతో బంధించటానికి ఉత్సాహం చూపావా?” అంటూ చిరునవ్వు నవ్వి విశ్వరూపాన్ని చూపించాడు. ఈ విశ్వరూప ప్రదర్శనంతో శ్రీకృష్ణుని రాయబారం ముగిసింది. విశ్వరూపాన్ని సందర్శించిన తరువాత కూడ దుర్యోధనుని మనస్సులో మార్పు రాలేదు. విధి నియతి ఎంత బలీయమైనదో దీనివల్ల స్పష్టమవుతుంది. కృష్ణుడు కురుపాండవులకు సంధి చేసి సర్వజన క్షయం కాకుండా ఉండటానికి చేయవలసినంత పురుష ప్రయత్నాన్ని చేసి చివరకు తన దివ్యమైన విశ్వరూప ప్రదర్శనంతో తన రాయబార కార్యాన్ని ముగించటం వల్ల దీనికొక గాంభీర్యం, ఔజ్జ్వల్యం చేకూరినాయి.

ఉద్యోగ పర్వంలోని ఈ మూడు రాయబారాలు మూడు విభిన్నమైన రీతులలో తీర్చిదిద్దబడి కవి ప్రజ్ఞా ప్రాభవానికి నికశోపలాలై ఒప్పినవనటంలో సందేహం లేదు. దేని ప్రత్యేకత దానిదే. మొదటిది ద్రుపద పురోహితుని రాయబారం. విప్రుని చేత నిర్వహించబడింది. వేదాధ్యయన సంపన్నుడయిన విప్రుడు రాయబారాన్ని నిర్వహించితే ఏ విధంగా ఉంటుందో దీనివలన తెలుసుకోవచ్చు. మనసులో మాయ, మర్మం లేకుండా ఎదుటివారి ముఖం మీద కుండ బ్రద్దలు కొట్టినట్లు మాట్లాడటం విప్రుని లక్షణం. “నిండు మనంబు నవ్యనవనీతమానము పల్కు దారుణాఖండలశస్త్రతుల్యము” అన్నాడు కదా ఆదికవి. ఈ లక్షణమే ఈ రాయబారంలో గోచరిస్తుంది. తిక్కన పాత్రల స్వభావాలను ఇతర పాత్రల ప్రసంగాలలో సూచించిన విధంగానే ఈ మూడు రాయబారాలను పాత్రల ముఖంగా సమీక్షిస్తాడు. వీటిని చక్కగా అవగాహన చేసుకోవటానికి అవి సూత్రప్రాయంగా (clue) ఉపకరిస్తాయి. ద్రుపద పురోహితుని రాయబార నిర్వహణ విధానం భీష్ముని ముఖంగా ఈ విధంగా సమీక్షించబడింది.

నీ వాక్యము విప్ర స్వా
భావికమై యిట్లు శ్రుతికిఁ బరుషంబయినన్
భావింపఁ గార్యమున యం
దేవిధమున సభకు నింత నిష్టంబగునే.

పురోహితుని మాటలు చెవులకు పెళుసుగా ఉన్నా ఆలోచించితే చెప్పిన కార్యపద్ధతి సభకు చాలా ఇష్టంగా ఉంది అన్నాడు భీష్ముడు. ఇతని వాక్యాలు శ్రుతికి పరుషంగా ఉండటానికి కారణం విప్రస్వభావం. విప్రుని పల్కులు దారుణాఖండల శస్త్రతుల్యాలు కదా. ఈ రాయబారం యొక్క ప్రధాన లక్షణం పారుష్యమని తిక్కన్న గారే సూచించటం గమనింపదగిన ముఖ్య విశేషం.

మహారాజనీతివేత్తచే నిర్వహింపబడినది రెండవ రాయబారం. సంజయుడు ప్రాజ్ఞుడు. జాతి చేత సూతుడైనా రాజనీతిలో ధర్మజాదులకు దీటు రాదగినవాడు. ప్రభుభక్తికి మారుపేరు సంజయుడు. తన ప్రభువైన ధృతరాష్ట్రునికై తన సర్వాన్ని త్యాగం చేయటానికి వెనుదీయని విశ్వాసపాత్రుడైనా విశిష్ట రాజభక్తిపరాయణుడు. తన జీవితాన్ని ధృతరాష్ట్రుని సేవకై అంకితం చేసినవాడు. అతనిని నీడలా అనుసరించినవాడు. అతడు హస్తినాపురంలో ఉన్నప్పుడే గాక ఆశ్రమవాసంలో కూడా అనుసరించి జీవితాంతం తన ప్రభువును సేవించినవాడు. అంధుడైన ధృతరాష్ట్రునకు సంజయ విదురిలిద్దరు రెండు కళ్ళు. ఇద్దరూ సమస్త శాస్త్ర పారంగతులు. పవిత్ర జీవితం గడిపిన వారు.

ధృతరాష్ట్రుని కౌటిల్యాన్ని, అధర్మ మార్గాన్ని ఎప్పుడూ ఆమోదించినవారు కారు. అతనిని ఆ మార్గం నుండి మళ్ళించటానికి నిరంతరం ప్రయత్నించిన వారు. ఇద్దరికీ రాజు దగ్గర చనువు మిక్కుటమే. అయితే అందులో భేదం లేకపోలేదు. అన్న దగ్గర తమ్మునకు, రాజు దగ్గర మంత్రికి ఉండేటటువంటిది విదురునిది. ఆంతరంగికుడు, విశ్వాసపాత్రుడు అయిన సేవకునకు రాజు దగ్గర ఉండే చనువు సంజయునిది. ఈ సంజయుని రాయబారిగా నిర్ణయించటం లోనే ధృతరాష్ట్రుని మేధాశక్తి వ్యక్తమవుతున్నది. రాజ్య భాగం లేకుండానే నేరిమి మాటలతో అలుకలన్నీ దీర్చి సంధి చేసుకుని రమ్మని సంజయుని పంపటంలో గ్రుడ్డిరాజు కౌటిల్య మెంతటిదో అర్థమవుతూ ఉంది. ఇట్టి రాయబారాన్ని నడిపింపడం సంజయుని వ్యక్తిత్వానికి విరుద్ధమైనది. అయినా తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మరుగు పరిచి, తన ప్రభువు కోసం కుటిలమైన రాయబారాన్ని నడపటానికి పూనుకొని ధర్మరాజు వంటి వానిని ఢీకొని ఎంతో చాతుర్యంతో తన కార్యాన్ని సాధించుకొని వచ్చిన వాడు సంజయుడు. హస్తినాపురికి తిరిగి వచ్చి ధృతరాష్ట్రుని ఏకాంతమందిరంలో దర్శించినప్పుడు అంతవరకు ఉగ్గబట్టిన అతని వ్యక్తిత్వం ఒక్కసారి బయటపడింది. ఈ సన్నివేశాన్ని పరిశీలిస్తే సంజయుడు ఎటువంటివాడో, ధృతరాష్ట్రుని, కురుపాండవులను ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడో, రాజు దగ్గర అతనికున్న చనువు ఎటువంటిదో కార్య విధానంలో ఉన్న కీలకాన్ని అతడు ఎంత అర్థం చేసుకున్నాడో స్పష్టమవుతుంది. తన రాయబార ఫలితాన్ని సూచనా మాత్రంగా చక్కని రీతిలో ఈ విధంగా తెలుపుతాడు.

మానుషశక్తి యొల్లడు సమంచిత దైవమ యూదియుండు నీ
పైన నతండు పుణ్యమును పాపముఁ బెట్టిన వాడు నీవు నీ
సూను వశంబ కాని యొక చొప్పుఁ దలంపవు కర్ణ సౌబలా
ధీనము కార్య నిశ్చయము దెల్లము నీమత మొప్పదేమియున్.

ధర్మరాజు మానవశక్తిపై ఆధారపడి లేడు. దైవం మీదే భారం వేశాడు. అంటే శ్రీకృష్ణుని మీద కార్య భారాన్ని మోపాడు. అతడు పాపమో పుణ్యమో కార్య నిర్ణయ భారాన్ని నీమీదే ఉంచాడు. నీవా నీ కొడుకు మాటకు కట్టుబడి ఉండేవాడివే గాని స్వబుద్ధి ఉపయోగించవు. పోనీ నీ కొడుకు తన బుద్ధి మీద ఆధారపడినవాడా? కాదు. కర్ణ శకునులు ఏది చెపితే అది చేసేవాడు. కార్య నిశ్చయము కర్ణసౌబలాధీనం కావటం స్పష్టమైన విషయం. అది మంచి పద్ధతి కాదు. అని అసలు విషయాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు ఎంతో చక్కగా చెప్పాడు. కురు పాండవుల కలహాన్ని, అందులో ధృతరాష్ట్రుని పాత్రను చెపుతూ ధర్మరాజు అవలంబించే కార్యపద్ధతిని ఇలా వివరిస్తాడు.

అనయము పుట్టె జూదమున యప్పుడ యెంతయుఁ జిచ్చువెట్టి కా
ల్చినయది నీయుపేక్షయ వశీకృత చిత్తుడు ధర్మసూతి మె
త్తని పులి యెల్లవారలు నధర్మము నీ పయిఁ బెట్టునంతకున్
వినడును గానడుం బిదప నీకును నాకు మరల్ప వచ్చునే.

సంజయుడు రాయబారాన్ని ఎంతో నేర్పుతో నిర్వహించి తిరిగి వచ్చిన తరువాత అక్కడి స్థితిని సూక్ష్మబుద్ధితో విశ్లేషించి సూత్రప్రాయంగా ధృతరాష్ట్రునకు ఏకాంతమందిరంలో నివేదించి మరునాడు కురుసభలో విషయాన్ని అంతా వివరిస్తాడు. సంజయుడు నిర్వహించిన రాయబారం తీరు ధర్మరాజు ముఖంగా ఇలా సమీక్షించబడింది. ధర్మరాజు సంజయునితో ఈవిధంగా అంటాడు.

ఎదురున్న రూపు వలుకగఁ దుది కటకటఁ బడవు నీవు దుర్ణయమును బే
ట్టిదమును బెండును నగుపలు కొదవదు నీ నాలుకకు నయోన్నత యెప్పుడున్
నీవొండె విదురుండొండెను గావలయుం గాక యిట్టి కార్యంబులకున్
రా వేఱె కలరే తగువారీ వినయము నేర్పు గలదె ఇతరుల కెందున్.

ఈ ధర్మరాజు మాటలని పరిశీలించి చూస్తే సంజయరాయబారం లోని ప్రధాన గుణం చాతుర్యమని తిక్కన్న గారే సూచించారు.

మూడవ రాయబారం జగన్నాటక సూత్రధారి యయిన శ్రీకృష్ణుడు నిర్వహించినది. కురుక్షేత్ర సంగ్రామం జరగటం విధినియతి అని తెలిసిన భగవానుడు కురుపాండవులకు పొందు కుదర్చటానికి పురుష ప్రయత్నమంతా చేసిన రాయబారమిది. దీని నిర్వహణ పద్ధతి ఇట్టిదని చెప్పి ఒప్పించటం మానవులకు సాధ్యమయ్యేది కాదు. అందుచేత తిక్కన్నగారు శ్రీకృష్ణుని ముఖంగానే దీనిని సమీక్షించటం ఉచితమని భావించారు. కౌరవ సభనుండి తిరిగి వచ్చిన తరువాత శ్రీకృష్ణుడు తాను రాయబారం నిర్వహించిన తీరును సూత్రప్రాయంగా ధర్మరాజుకు ఈ విధంగా వివరించుతాడు.

“ఏనును నా యోపినంత సామవాదంబు లాడితి. నారదాది మహామునులను సుయోధనునకు బుద్ధులు సెప్పునట్లు సేసితి. ఏమి సెప్పినను నెంతటం బోకున్నం గినుక దెచ్చికొని జంకించియు భంగించియు ధిక్కరించియుఁ దృణీకరించియుం జూచితి. కార్యంబు భగ్నంబగుట కొల్లక వెండియు శాంత వచనంబులు పలికితి. అతం డశక్తత దుర్జనత సేయం జూచిన నమానుషంబులగు వానిం గొన్ని వెడమాయలం బన్ని పెక్కు పోకలం బోయితి. ఎన్ని భంగుల సంధియ కావలయునని పొరలం గలయంతయుం బొరలితి. అప్పాపాత్ముం డెట్లునుం జక్కంబడక రాజ్యంబు పాలిచ్చువాడు గాడు. కౌరవుల యెడ దండంబు దక్క నొండుపాయంబు లేదు.”

ఈ వాక్యాలను సూత్రాలుగా గ్రహించి కృష్ణుని రాయబారాన్ని పరిశీలిస్తే దాని నిర్వహణ విధానం విశదమవుతుంది. కృష్ణరాయబారం లోని ముఖ్యలక్షణం ఔజ్జ్వల్యమని విమర్శకుల అభిప్రాయం. మొదటి రెండు రాయబారాలు తిక్కన్న భారత భారతికి ఎత్తిన మణిదీపాలు. కవిబ్రహ్మ కవితాసరస్వతికి వెలకట్టలేని మణికిరీటం శ్రీకృష్ణుని రాయబారం.
--------------------------------------------------------
రచన: పొట్లూరి నారాయణదాసు, 
ఈమాట సౌజన్యంతో