Showing posts with label పుస్తక పరిచయం. Show all posts
Showing posts with label పుస్తక పరిచయం. Show all posts

Sunday, December 1, 2019

బడి పిల్లల అయోమయం


బడి పిల్లల అయోమయం




సాహితీమిత్రులారా!

నామిని బడిపిల్లల కోసం ఒక పుస్తకం రాశారు. ఇందులో రచయిత సదుద్దేశాన్ని అపార్థం చేసుకోకూడదు. పిల్లలకి ఎన్నో మంచి విషయాలు చెప్పాలనే రచయిత తాపత్రయం. పొలాల్లో కష్టపడి పని చేయడం, తల్లితో కలిసి పనిచేయడం, వగైరా మంచి విషయాలన్నీ పిల్లలకి చెప్పాలనుకోవడం చాలా చాలా మంచి వుద్దేశ్యం. కానీ ఎంత మంచి వుద్దేశ్యం వున్నా, రచయితకి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియకపొతే, ఆ చెప్పే విషయాలు పొరపాటుగా వుంటాయి. పిల్లలకి నేర్పించే ముందర రచయిత కూడా నేర్చుకోవాలి కొన్ని మంచి విషయాలు.నామిని రాసిన బడిపిల్లల పుస్తకం, “మా అమ్మ చెప్పిన కతలు” (మొదటి ముద్రణ, ఏప్రిల్ 2002). ముందు మాటలో “ధైర్యంగా” ఈ పుస్తకం “బడిపిల్లల కోసం” అని చెప్పుకున్నారు రచయిత. అంటే ఎలిమెంటరీ స్కూలు పిల్లల కోసం అని అనుకోవచ్చు. ఒకటి నించీ అయిదో క్లాసు వరకూ చదివే పిల్లల కోసం. ఈ పుస్తకంలో రచయిత బడిపిల్లలకి చెప్పిన విషయాలు ఏమిటి?

దేవుళ్ళూ, వాళ్ళ మహిమలూ
చావులూ, చంపడాలూ
బండతనం, లాజిక్ లేకపోవడం
పిల్లలకి చెప్పకూడని విషయాలు చెప్పడం
కొన్ని మంచి విషయాలు
ఈ పరిశీలన అంతా బడిపిల్లలని మాత్రమే దృష్టిలో పెట్టుకుని చేశాను.

1. దేవుళ్ళూ, వాళ్ళ మహిమలూ

పిల్లలకి కష్టపడి జీవించాలని చెబుతూ, ఆ జీనవంలో వున్న ఆనందాన్ని వారికి తెలియచేసే కథలు చెబుతున్నపుడు, ఆ కథల్లో దేవుళ్ళ మహిమల గురించి చెప్పచ్చా? అలా చెప్తే “పుట్టపర్తి సాయిబాబా” మహిమల పుస్తకాలకీ, ఇటువంటి మంచి పుస్తకాలకీ తేడా ఏముంటుంది?”కాకమ్మ-చీమమ్మ” అనే కథలో చీమమ్మ కష్టజీవి. కాకమ్మ అన్యాయం చేస్తే, దేవుళ్ళొచ్చి చీమమ్మకి వరాల రూపంలో బోలెడు డబ్బిచ్చి, కాకమ్మని శిక్షిస్తారు. చీమమ్మ జాలితో కాకమ్మని చేరదీసి, ఇంత తిండి పెడుతుంది.ఒక బళ్ళో రకరకాల మతాలకి చెందిన పిల్లలుంటారు. వారికి పార్వతీ, పరమేశ్వరుల మహిమ గురించి కథలో చెప్పడం అంటే ఏదో ఒక మతం గురించి మాత్రమే మాట్లాడ్డం అన్నమాట. “చీమ ఏమి, కంటికి కడవడు నీళ్ళు కార్చడం ఏమి’ తెలుసుకుందామని ఆకాశమార్గాన పోతున్న పార్వతీ పరమేశ్వరులు రథాన్ని కిందికి దించినారు.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 7).

“కాకమ్మ-చీమమ్మ” అన్న కథలో కాకమ్మ చీమమ్మకి అన్యాయం చేస్తే, “పార్వతమ్మ” వచ్చి వరాలిచ్చేస్తుంది.కాబట్టి పిల్లలూ, ఇకనించి మీ పక్క పిల్లో, పిల్లాడో మీకు అన్యాయం చేస్తే టీచరు దగ్గరకి న్యాయానికి పోకండేం! ఎంచక్కా ఆకాశమార్గాన దేవుళ్ళ కోసం ఎదురు చూడండి. వాళ్ళొచ్చి మీకు వరాలిచ్చేస్తారు.ఈ విధమైన దేవుళ్ళ మహిమలోనూ చూపించిందేమిటి? కష్టపడకుండా బోలెడు డబ్బు సంపాదించేయడం! అదీ వరాల రూపంలో! ఇంక పిల్లలకి కష్టపడటం అంటే ఇష్టం ఏం కలుగుతుందీ?ఇలా కాకుండా, చీమమ్మ ఎవరో పెద్ద మనిషికి కష్టం చెప్పుకున్నట్టూ, ఆ పెద్దమనిషి కాకమ్మని శిక్షించి, చీమమ్మకి న్యాయం చేసినట్టూ చూపిస్తే, పిల్లలకి ఎంతో నేర్పించినట్టుంటుంది.లేకపోతే కష్టపడ్డ వాళ్ళకి మనుషులు ఏమీ న్యాయం చేయలేరూ, దేవుళ్ళే (అదీ ఒక మతానికి మాత్రమే చెందిన దేవుళ్ళే) న్యాయం చేస్తారూ అని చెప్పినట్టవుతుంది. ఈ దేవుళ్ళ న్యాయం కూడా కష్టం కన్నా ఎన్నో రెట్లు డబ్బివ్వడం ద్వారా చెప్పడం లెండి.

“అన్నదానంలో వున్న మహిమ” అన్న కథలో ఒక “బాపన” బిక్షువు కొడుక్కి ఒకాయన అన్నం పెట్టి, పడుకోవడానికి చోటిచ్చి, జంతువు వాత పడి చనిపోయి, రాజు కొడుకుగా పుడ్తే, ఆ ఒకాయన భార్య ఏమీ సాయం చేయకుండా పంది పిల్లగా పుడుతుంది. (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీలు – 10 నించి 13 వరకూ)మళ్ళీ మహిమలు! ఈ మహిమ కూడా ఎప్పుడు? జంతువు వాత పడి ఘోరంగా చచ్చిపోయేక! ఆ గొప్ప మహిమ కూడా ఏమిటి? రాజు కొడుకుగా పుట్టడం. రాజు కొడుకుగా పుట్టడం గొప్ప మహిమ అని పిల్లలెందుకు అనుకుంటారు? ఇలాంటి కథలన్నీ పిల్లలకి, “రాజు కొడుకుగా పుడితే పనులేం చేయక్కరలేదూ, బోలెడుమంది సేవకులుంటారూ” అని ఎప్పటి నించో నేర్పిస్తూ వుంటాయి.అన్నదానం చేసి, పడుకోవడానికి తన చోటిచ్చినందుకు ఆ మనిషికి ముందరగా దొరికిందేమిటి? ఘోరమైన చావు జంతువు వల్ల. ఇదీ పిల్లలు ఈ కథలో నేర్చుకోవలసిన మహిమ!నిజానికి “రాజుకొడుకు” కన్నా “పందిపిల్ల”కే సమాజంలో ఎంతో వుపయోగం!మళ్ళీ ఈ కథలో ఒక మతానికి చెందిన “బ్రహ్మదేముడు” కూడా వుంటాడు.

ఇంక “పాపిష్టి పిల్లి” అనే కథ చూడండి. (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీలు – 41 నించి 44 వరకూ)ఈ కథలో, ఒక పిల్లి వాన వచ్చి, తన పిడకిల్లు కొట్టుకుపోతే, కొంగమ్మ ఇంట్లో చేరి, కొంగమ్మ గుడ్లు తినేస్తే, కొంగమ్మ మంత్రి దగ్గరకి న్యాయానికి వెళితే, ఆ మంత్రి పిల్లి చేత దేముడి మీద ప్రమాణాలు చేయించి, నీళ్ళలో దింపితే, ఆ దేముడి మహిమ వల్ల పిల్లి నీళ్ళలో మునిగి చచ్చిపోతుంది.”పాపిష్టి పిల్లి” అని కాకుండా “చెడ్డ పిల్లి” అని పేరు పెడితే కొంచెం బాగుండేది. పిల్లలకి పాపాలూ, పుణ్యాలూ, మహిమలూ నేర్పడం, వాటిమీద నమ్మకాలు పెంచడం ఈ కథలో విషయాలు.కొంగమ్మ తెలివిగా మనిషి న్యాయం చేస్తాడని మంత్రి దగ్గరకి వెడితే, ఆ మంత్రి మాత్రం మన రచయితలాగా, దేముడి సాయం తీసుకుని పిల్లిని శిక్షిస్తాడు.ఒక మతానికి చెందిన “గంగమ్మ” కూడా వచ్చేస్తుంది ఈ కథలో. “తేలించు గంగమ్మ తేలించు” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 43)”దేముడంటే నాకెందుకు భయమూ, భక్తీ లేవు? నిద్ర పడక లేవగానే మొహాన బొట్టు పెట్టుకోందే నేను గడపే దిగను.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 42)ఒక మతానికి చెందిన బొట్టూ, ఆ నమ్మకాలూ!

“అవ్వ-పొటేలు” అన్న కథలో కూడా కష్టంలో వున్న పొటేలుకి, “దేముడా! నన్ను బద్రంగా మా అవ్వ దగ్గరకి చేర్చు” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 47) అని ప్రార్థిస్తేనే గానీ ఒక వుపాయం దొరకలేదు.ఇంట్లో దేముడు, బళ్ళో దేముడు, వీధిలో దేముడు, కథల్లో దేముడు అంటే ఇదే మరి!ఇంక కష్ట పడటం గురించి ఎవరు వింటారు?అసలు బళ్ళో ఏ మతం గురించీ నేర్పించకూడదు.దేముడి విషయం గురించే మాట్లాడకూడదు.అవన్నీ ఇళ్ళలో పెద్దవాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి.బళ్ళో ఆస్తికుల పిల్లలే కాదు, నాస్తికుల పిల్లలు కూడా వుంటారు.కష్ట జీవనం గురించి పిల్లలకి నేర్పించే కథల్లో దేవుళ్ళూ, వాళ్ళ మహిమలూ వుండకూడదు.కష్ట జీవనం అనేది అన్ని మతాల పిల్లలకీ, నాస్తికుల పిల్లలకీ కూడా మంచిది.అలా వుండచ్చు అనుకుంటే, పాత చందమామలు తిరగేస్తే చాలు, ఇలాంటి కథలు ఎన్నో!ఇలాంటి కథలు పిల్లలకి చెప్పడానికి నామిని లాంటి మంచి రచయిత ఎందుకు?

2. చావులూ, చంపడాలూ

చిన్న పిల్లలకి మంచి విషయాలు నేర్పించే కథల్లో చావులూ, చంపడాలూ వుండకూడదు. ఎంతో అవసరం అయినప్పుడు మాత్రం ఒక చావు గురించి ప్రస్తావించ వచ్చునేమో గానీ చంపడం గురించి మాత్రం చెప్పకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇది మామూలు ఇంగితం.ఈ బడిపిల్లల కథల్లో ఎన్నెన్ని చావులో, ఎన్నెన్ని చంపడాలో!సినిమాల్లో హింస ఎక్కువైపోతోందని ఎన్నో కేకలేస్తాం గానీ, ఇలాంటి చిన్న పిల్లల పుస్తకాల్లో ఎంత హింసని తెలివి తక్కువగా చూపిస్తున్నామో అర్థం చేసుకోము.”అన్నదానంలో వున్న మహిమ” అన్న కథలో ఒక మంచి మనిషి ఒకబ్బాయికి అన్నం పెట్టి, పడుకోవడానికి చోటిచ్చి, జంతువు వాత పడి ఘోరంగా మరణిస్తాడు. (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 12)

ఇంక “లొట్టిగాడు” అన్న కథ చూడండి. ఇది చదువుతున్నప్పుడు ఎంత దడుచుకున్నానో నేను.ఈ కథ గురించి మాట్లాడే ముందర ఒక సంగతి చెప్పాలి.అమెరికా వాళ్ళ టీవీలో “అమెరికాస్ ఫన్నీయెస్ట్ వీడియోస్”్ (అమెరికా వాళ్ళ సరదా పుట్టించే వీడియోలు) అనే ప్రోగ్రామ్ వస్తుంది. మామూలు మనుషులు వాళ్ళ పరగణాలో జరిగిన విషయాలు అనుకోకుండా వీడియో కెక్కించినపుడు, వాటిని టీవీ వాళ్ళకి పంపుతారు. ఆ వీడియోల నిండా మనుషులు జారి పడిపోవడాలూ, జంతువులు దెబ్బలు తగిలించుకోవడాలూ! అవతల వాడు కాలు జారి పడితే ఫక్కున నవ్వే మనస్తత్వం గల మనుషులే చుట్టూ. “అయ్యో” అనే వాళ్ళు తక్కువే. ఈ వీడియోలు చూసి, జనాలు “ఫన్నీగా వున్నాయంటూ” పకపకా నవ్వేస్తూ వుంటారు. ఇలా వుంటుంది వెకిలి హాస్యం.అలాగే కథల్లో కూడా సరదాగా మనుషులని చంపేయడం.”లొట్టిగాడు” కథలో “లొట్టిగాడు” అని అన్నందుకు లొట్టిగాడు ఇద్దరు పెళ్ళాల్నీ, ఒక ఎనుమునీ, ఒక కుక్కనీ చంపేసి, చివరకి నీళ్ళలోకి దూకి చచ్చిపోతాడు. (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీలు – 21 నించి 24 వరకూ)

ఈ కథలో ఏం నీతి వుందో రాసిన వాళ్ళకే తెలియాలి.హింస అయితే విపరీతంగా వుంది.”లొట్టిగాడు కోపానికి పోయి చిన్న పెళ్ళాన్ని నరికేసినాడు.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 21)అంతేనా! ఒక్క నరుకుడేనా!?”లొట్టిగాడు కోపానికి పోయి పెద్ద పెళ్ళాన్ని కూడా నరికేసినాడు.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 22)అమ్మయ్య! రెండు నరుకుళ్ళయ్యాయి. కథ పాకాన పడింది.వుత్తినే నరికేసి, వదిలేస్తే ఏం బావుంటుందీ?”ఇద్దరి పెళ్ళాల్నీ నరికేసి పూడ్చి పెట్టినాడు గదా.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 22)ఇంచక్కా నరికేసాక ఏం చెయ్యాలో కూడా పిల్లలకి నేర్పించేశాం!ఇక్కడ “ఇద్దరి పెళ్ళాల్నీ” అని రాయడం నా అచ్చు తప్పు కాదు. అది రచయిత అచ్చు తప్పు. కోట్ చేస్తున్నానని ఎలా వున్నది అలాగే వుండనిచ్చాను.”ఎనుముకు గూడా మనం అలుసై పోయామా, అని చెప్పి ఎనుమును నరికేసి…….” (“మా అమ్మ చెప్పిన కథలు”, పేజీ – 22)మనుషుల్నే వదల్లేదు, జంతువుల్ని వదులుతామా?”కుక్కకు కూడా మనం అలుసై పోయామా అని చెప్పి, ఆ కుక్కను పట్టుకుని పోయి బావిలో వేసేసినాడు.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 23)కొంచెం సంతోషం! కుక్కని నరకలేదు.చివరికి లొట్టిగాడు, “మునిగి పోయి చచ్చిపోయినాడూ.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 24)ఈ కథను బడిపిల్లలు ఎగురుకుంటూ చదువుకోవాలి.ఇన్ని నరకడాలున్న కథని పిల్లలకి కానుకగా ఇస్తున్నందుకు ఎంత సంతోషించాలో బాబూ!!

“డాం డాం డాం” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీలు – 29 నించి 32 వరకూ) అన్న కథ చూడండి. ఈ కథ సరదాగా మొదలవుతుంది. చిన్నప్పుడు విన్న కోతీ-ముల్లూ కథ ఇది. నవ్వుతూ చదువుతూ వుంటే, “దొమ్మరోళ్ళు ఆ పిల్లకు గెడెక్కేది నేర్పిస్తూ వుంటే కింద పడి చచ్చిపోతుంది.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 31).ప్రాణం వుసూరు మంటుంది చదవగానే.ఈ కథలో ఆ పిల్ల చచ్చిపోవాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. అదీగాక చిన్నప్పుడు మేం నేర్చుకున్న కోతీ-ముల్లూ కథలో ఈ చావు లేదు.నామినికి చావులు అంటే చాలా మామూలు విషయం అయిపోయింది.చిన్న పిల్లల కథలో కావాలా, అక్కరలేదా అన్న ఆలోచన లేకుండా చావులు గుప్పించెయ్యడం!”పాపిష్టి పిల్లి” కథలో గూడా చెడ్డ పిల్లి చచ్చిపోతుంది లెండి.మంచి జంతువులకీ, మంచి మనుషులకే దిక్కు లేదు. ఇంక చెడ్డ జంతువులూ, చెడ్డ మనుషులూ చచ్చిపోతే ఏ పిల్లలు పట్టించుకుంటారు లెండి.

“అవ్వ-పొటేలు” కథలో పొటేలు అవ్వకి, “అప్పుడు నువ్వు నన్ను అమ్ముకుంటే దండిగా రూపాయలొస్తాయి. కోసుకుంటే దండిగా కూరవుతుంది.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 45) అని చెబుతుంది. అంతే గానీ, నేను ఎక్కువ బలం తెచ్చుకుని నీ పనుల్లో సాయంగా వుంటాను అని మాత్రం చెప్పదు. పిల్లల కథల్లో మాట్లాడే జంతువులని కోసుకుని కూరొండుకోవడం గురించి చెప్పకూడదని కూడా తెలియదు. మాట్లాడే పొటేలు పని చేస్తే తప్పా? అలా చెప్తే, “కోసుకోవడం” గురించి చెప్పలేము గదా! పిల్లలకి “కోసుకోవడాలూ”, “నరకడాలూ” నేర్పద్దూ మరి!కానీ ఈ చావులూ, చంపడాలూ పిల్లల కథల్లో వున్నాయన్న విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి.అమెరికాలో రెండు, మూడు స్కూళ్ళలో జరిగిన సంఘటన ఇది. ఎలిమెంటరీ స్కూలు పిల్లలు తమ ఇళ్ళలోంచి తుపాకులు స్కూళ్ళకి తీసుకువచ్చి, తమని కించపరుస్తున తోటి పిల్లలనీ, అడ్డం వచ్చిన టీచర్లనీ కాల్చి చంపేశారు. ఈ సంఘటనలు జరిగినప్పటినించీ ఏ పిల్లాడన్నా కోపంగా “చంపేస్తాను” అని పక్క పిల్లాడినంటే చాలు, స్కూలు వాళ్ళు పోలీసుల్ని పిలిచేయడం, పెద్దాళ్ళని పిలిచేయడం, ఇళ్ళని తుపాకుల కోసం వెదకడం జరిగాయి కొన్నాళ్ళు.పిల్లలు హింస నేర్చుకుంటారంటే నేర్చుకోరూ ఇలా బండతనంగా!

3. బండతనం, లాజిక్ లేకపోవడం

పిల్లలకి కథలు చెప్పేటప్పుడు అవి చక్కగా, సాఫీగా సాగి పోయేటట్టు చెప్పాలి. ఆ కథల్లో చక్కటి తర్కం వుండాలి. కొన్ని, కొన్ని విషయాలు ఎగర కొట్టేయ కూడదు. కథలు పిల్లలకి సున్నితత్వం నేర్పాలి గానీ, బండతనం కాదు. కొన్ని పరిస్థితుల్లో ఒక కథలో ఒక పాత్ర సరిగా ప్రవర్తించకపోతే, దాన్ని ప్రశ్నించాలి పిల్లలు. ఏది ముఖ్యమో, ఏది కాదో అర్థం అయిపోతూ వుండాలి పిల్లలకి. మళ్ళీ ఇవన్నీ చిన్న, చిన్న విషయాల్లోనే. ఇటువంటి పద్ధతులు పాటించకపోతే, పిల్లలు ఆ కథలు చదివి బండతనం మాత్రమే నేర్చుకుంటారు. తర్కమనేదే వుండదు.

“అన్నదానంలో వున్న మహిమ” అనే కథ చూడండి. ఈ కథలో ఒక చిన్నవాడు అడవిలో పోతూ, ఒకాయన ఇంటికి వెళ్తాడు. ఆయన చిన్నవాడికి తిండి పెట్టి, మంచె మీద పడుకోవడానికి చోటిచ్చి, ఆ రాత్రి మంచె మీదనించి కింద పడి, జంతువు వాత పడి చచ్చిపోతాడు.అప్పుడు, “చిన్నవాడు నిద్ర లేచి, మంచె దిగి, మళ్ళీ అడవి మార్గం పట్టి పోయినాడు పోయినాడు పోయినాడు.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 12)ఎంత బండతనం! తనకి తిండి పెట్టి, పడుకోవడానికి తన చోటిచ్చినాయన చచ్చిపోతే, ఆ చిన్నవాడు మామూలుగా వెళ్ళిపోతాడా!ఈ కథ చెబితే, మూడో క్లాసు చదివే పిల్లలు, “అమ్మయ్య! ఆ మంచాయన పోతే పోయాడు గానీ మన చిన్నవాడు “బ్రహ్మదేముడి”ని పట్టుకుంటాడా, లేదా” అని తపించిపోతారు కదూ?కథలో చిన్నవాడు, ఆ మంచి మనిషి చచ్చిపోయినందుకు కొంతసేపు ఏడిచి, ముందుకు సాగిపోయాడు అని రాస్తే ఎంత చక్కగా వుంటుంది!ఒక పక్క చావులు. ఇంకో పక్క వాటిని చాలా మామూలుగా తీసేసుకుని ముందుకి సాగిపోవడం. ఎంత బాగా కర్తవ్య పాలన గురించి నేర్పిస్తుందో ఈ కథ.

“లొట్టిగాడు” అన్న కథ చూడండి. ఈ కథలో లొట్టిగాడు పొద్దున్న చద్దికూడు తీసుకు వచ్చిన చిన్న పెళ్ళాన్ని నరికేస్తే, ఏమీ జరగనట్లు పెద్ద పెళ్ళాం మధ్యాహ్నం సంగటి ఎత్తుకుపోతుంది. ఈ పెద్ద పెళ్ళానికి ఏమీ పట్టదు తన చెల్లెలి చావు గురించి.ఏమన్నా అంటే, ఇది చిన్న పిల్లల కథ కాబట్టి ఇందులో అన్ని వివరాలూ ఇవ్వం అంటారేమో!చావుల మీద చావులకి బాధ పడకపోవడం బండతనమైతే, ఆ చావులు గురించి మిగిలిన వాళ్ళు అడగలేదేమని అడగకపోవడం లాజిక్ లేకపోవడం.”పాపిష్టి పిల్లి” కథ చూడండి. పిల్లి పిడకలిల్లు వానకు కొట్టుకుని పోతే, కొంగ ఇంటికి వెళ్ళి, కొంగ గుడ్లు “పటక్ పటక్”్ మని కొరుక్కుతింటే, కొంగ ఏం తింటున్నావని అడుగుతుంది.”మా అత్తగారు నిన్ననే మురుకులు కాల్చి పంపించినారు. ఈ చలికి వాటిని నాలుగు తెచ్చుకుని కొరుక్కుతింటున్నాను కొంగమ్మా” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 41) అంటుంది పిల్లి.వానకి పొట్టుకుపోయిన ఇంట్లోంచి కరకలాడే మురుకులు తెచ్చుకుంది పిల్లి. ఆ విషయం కొంగమ్మ నమ్మేస్తుంది.ఈ కథ చదివిన పిల్లలు కూడా ఆ విషయం నమ్మేస్తారు అప్పటికి.పొలాల్లో పని చేస్తూ, పల్లెటూళ్ళలో వుండే లొట్టిగాడు నీళ్ళలో మునిగి చనిపోవడం ఏమిటీ, వాడికి ఈత రాదూ అన్న ప్రశ్న లాజికల్గా పిల్లలకి కలగకూడదు. మీరు పిల్లలు గదా! మేం చెప్పే కథలు నోరు మూసుకుని, సంతోషంగా వినాలంతే మరి! లాజికల్ ప్రశ్నలు అడగ్గూడదు.

4. పిల్లలకి చెప్పకూడని విషయాలు

కథలు చెప్పేటప్పుడు చిన్న పిల్లలకి కొన్ని విషయాలు చెప్పకూడదు. కొన్ని విషయాలు కొన్ని పద్ధతుల్లో చెప్పకూడదు. ఎంతసేపూ పిల్లలకి కథలు చెబుతున్నామన్న విషయం గుర్తు పెట్టుకోవాలి.”తిండిగింజలు” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 14)లో, “అమ్మ అలిగి పస్తు పడుకుంటే నాకు దుఃఖం వస్తుంది.” అని రచయిత నేర్పిస్తారు.అమ్మ అలగడం, పస్తు పడుకోవడం!ఇలాంటి విషయాలు పిల్లలకి చెప్పచ్చా?అలిగి తిండి మానేసేది తల్లైనా సరే, తండ్రైనా సరే, ఎవరూ జాలి చూపించకూడదు.అలిగి తిండి మానేయడం అనే బండ విషయం పిల్లలకి చెప్పకూడదు.ఇదే పేజీలో, “చక్కెర వ్యాధికి సంగటి ఎంతో మంచిది.” అని రచయిత చెప్తారు.అయిదో క్లాసు లోపల పిల్లలకి చక్కెర వ్యాధి గురించి చెప్పడం ఎందుకు? వాళ్ళకేం అర్థం అవుతుంది?

“అన్నదానంలో వున్న మహిమ” అన్న కథలో “ఒకూళ్ళో ఒక బాపనాయన.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 10) అంటూ కథ మొదలు పెడతారు రచయిత. ఆ తర్వాత ఈ కథలో “బాపనాయన” అన్న పదం ఇంకో నాలుగు సార్లు వాడతారు రచయిత. ఎందుకు ఈ కులాలకి సంబంధించిన పేర్లు పిల్లలకి చెప్పడం?”లొట్టిగాడు” అనే కథలో, “ఒకూళ్ళో ఒక లొట్టిగాడు. వాడికిద్దరు పెళ్ళాలు.” (“మా అమ్మ చెప్పిన కథలు”, పేజీ – 21) అంటూ కథ మొదలవుతుంది.ఇద్దరు పెళ్ళాలూ, ముగ్గురు మొగుళ్ళూ లాంటి కథలు పిల్లలకి చెప్పచ్చా?”ఎవరు బలశాలి” (“మా అమ్మ చెప్పిన కథలు”, పేజీలు – 33 నించి 36 వరకూ) కథలో ఒకావిడ, “ఆయన ముందే కోపగల్లోడు, నేను వేళకి ఆయనకి చద్దికూడు పెట్టాలి….” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 34) అంటుంది.ఎందుకంటే ఆ మొగుడు ఈవిడని కొడుతూ వుంటాడు. ఈ విషయం కూడా ఒక తప్పు విషయం గురించి చెప్పినట్లు చెప్పరు రచయిత. మరీ మామూలు విషయం, అంటే మొగుళ్ళనే వాళ్ళు పెళ్ళాలని కొడుతూ వుంటారనే విషయం, చాలా సీదా, సాదాగా చెప్తారు.”నిన్న రెండు దెబ్బలు కొట్టాం కదా, ఆ కోపంతో మన పెళ్ళాం మన మీదికి కొట్లాటకు వస్తా వుంది గదరా స్వామీ” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ 34) అని ఆవిడ మొగుడు అనుకుంటాడు.పిల్లలు ఈ విషయం చదివి ఏమనుకుంటారు?మొగుడు పెళ్ళాన్ని కొట్టడం మామూలు విషయమే అనుకుంటారు. అప్పుడప్పుడు పక్కింట్లో మొగుడు తన పెళ్ళాన్ని కొడుతూ వుంటాడు గదా! మగ పిల్లలయితే కొట్టడానికీ, ఆడపిల్లలయితే దెబ్బలు తినడానికీ చిన్నప్పడినించే తయారయి పోతూ వుంటారు ఇటువంటి కథల్తో.

“ఆలీ-మొగుడు” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీలు – 37 నించి 39 వరకూ) కథలో పాడె గురించీ, స్మశానం గురించీ పిల్లలకి చెపుతారు రచయిత. ఎంత ముఖ్యమైన సహజ విజ్ణ్జానమో!”వూళ్ళో వాళ్ళు పాడె కట్టీనారు. ఆ ఆలీ మొగుణ్ణీ చెరొక పాడెమీద పెట్టి స్మశానానికి చేర్చినారు. రెండు గుంతలు తవ్వినారు.” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 38) అని రచయిత ఎంతో వివరంగా విజ్ణ్జానాన్ని పిల్లలకి సవినయంగా అందచేస్తారు.అంతా చేస్తే, ఈ కథలో ఏముందో పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా అర్థం కాదు. మొగుడూ, పెళ్ళాం రొట్టె కోసం కొట్టుకుంటూ వుంటారు కథంతా.పిల్లల కథల్లో చెడు ఎప్పుడూ ఓడిపోతూ వుండాలి.మంచి ఎప్పుడూ గెలుస్తూ వుండాలి.చెడ్డవాళ్ళు బుద్ది తెచ్చుకుని మంచిగా అయిపోతూ వుండాలి.ఇవీ పిల్లల కథల్లో వుండాల్సిన కనీస విషయాలు.”అమ్మకి జే జే” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీ – 40) లో, “అప్పుడు మీ అమ్మ భలేగా నవ్వి మీ తలకాయి చుట్టూ చేతులు తిప్పి దిష్టి తగలకుండా మెటికలు విరుస్తుంది.” అని రచయిత పిల్లలకి తెలియజేస్తారు.ఎలిమెంటరీ స్కూలు పిల్లలకి దిష్టి గురించి చెప్పాలి!హైస్కూలు పిల్లలకి చేతబడి గురించి చెప్పాలి!కాలేజీ పిల్లలకి కాష్మోరా గురించి చెప్పాలి!విజ్ణ్జానం అనేది ఇలా అంచెలంచెలుగా సాగిపోతూ వుండాలి!

5. కొన్ని మంచి విషయాలు

ఇంత విమర్శించాం గదా అని ఈ పుస్తకం చెత్త పుస్తకం అనుకోకూడదు.”గువ్వ చాతుర్యం” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీలు 15 నించి 19 వరకూ) చాలా అంటే చాలా బాగుండే కథ.”అబ్బోడు” (“మా అమ్మ చెప్పిన కతలు”, పేజీలు – 25 నించి 27 వరకూ) కథ చక్కగా వుంది.”పిల్ల చచ్చిపోవడం” అన్న సంగతి మార్చేస్తే, “డాం, డాం, డాం” కథ కూడా సరదాగా వుంది.”పార్వతీ పరమేశ్వరులూ”, “వరాలూ” అన్న విషయాలు మార్చేస్తే, “కాకమ్మ-చీమమ్మ” కూడా చక్కటి కథ.”మొగుడు పెళ్ళాన్ని కొట్టడం” అన్న విషయం మార్చేస్తే, “ఎవరు బలశాలి” అన్న కథ కూడా బాగుంటుంది.”కోసుకోవడం” అనే ముక్కని వదిలేస్తే “అవ్వ-పొటేలు” కథ కూడా బాగుంటుంది.ఈ కథలన్నింటినీ కొంచెమంటే కొంచెం మార్చి రాయచ్చు కూడా!కథలే కాకుండా, కథ చివరలో రచయిత ఎన్నో మంచి విషయాలు చెబుతారు పిల్లలకి. ఈ విషయాలు చదువుతూ వుంటే పిల్లలకే కాదు, పెద్దాళ్ళకి కూడా సంతోషం కలుగుతుంది. ఈ విషయాలు పెద్దవాళ్ళు పిల్లలకి చక్కగా నేర్పించవచ్చును.బడి పిల్లల కోసం నామిని రాసిన మొదటి పుస్తకం ఇది. తప్పులుండటం సహజం. అవి దిద్దుకుంటే, పిల్లల కోసం ఇంకా అద్భుతమైన పుస్తకాలు రాయవచ్చు. లేకపోతే ఇది కూడా కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది.
------------------------------------------------------
రచన: జె. యు. బి. వి. ప్రసాద్, 
ఈమాట సౌజన్యంతో

Monday, August 12, 2019

అందీ అందని కావేరీ సంగమం…


అందీ అందని కావేరీ సంగమం…



సాహితీమిత్రులారా!

కావేరి ఎక్కడ? ఎక్కడ కావేరీ ముఖద్వారం? ఎక్కడా? ఎక్కడా?

చిదంబరం వదిలిపెట్టాక మనసు నిండా ఇవే ప్రశ్నలు…

నదీమూలాలు, సాగరసంగమ ముఖద్వారాలూ చూడాలన్నది నా కోరిక.

కృష్ణ, గోదావరి, నర్మద, తపతి, గంగ లాంటి నదుల విషయంలో ఈ కోరిక తీరింది.

కావేరీనది పుట్టిన చోటు చూశాను. నదిని అనేకకానేక చోట్ల అనేకానేక దశల్లో చూశాను. కూర్గు కొండలు దాటి కుశాలనగర్‌ దగ్గర మైదానాల్లోకి ప్రవేశించడం చూశాను. మైసూరు దగ్గర కృష్ణరాజసాగరమవడం చూశాను. శ్రీరంగపట్టణం చేరువలోని రంగనతిట్టు దగ్గర పక్షుల స్వర్గధామానికి ఆయువుపట్టు అవడం చూశాను. మళ్లా మేకదాటు దగ్గర మేకలు కూడా దాటగల అతి సన్నని ప్రవాహం అవడం గమనించాను. మరికాస్త దూరంలో హొగెనకల్ దగ్గర రాళ్లలో పొగలు సృష్టించడం చూశాను.

శివసముద్రం దగ్గర శ్రీశ్రీకి కూడా ఉత్సాహం కలిగించడం చూశాను. తిరుచ్చి శ్రీరంగం దగ్గర విప్రనారాయణ రంగనాథుని గుడికి ద్వీపాన్ని ఇవ్వడం చూశాను. ఆ దిగువన కరికాల చోళుని ఆనకట్టకూ త్యాగరాజు కీర్తనలకూ మూలాధారమవడం చూశాను. అన్ని దశలలో చూసిన కావేరిని సాగరసంగమ దశలోనూ చూడాలని నా ప్రగాఢ వాంఛ.

చిదంబరం దాటాక ఓ అరగంటలో పెద్ద నది కనిపించింది.

ఇదేనా కావేరీ?!

బ్రిడ్జి దగ్గర శిలాఫలకం మీద కొళ్ళిడం బ్రిడ్జి అని రాసి ఉంది.

బ్రిడ్జి దాటీదాటగానే ఎడమపక్కగా పోతోన్న నదిని హత్తుకొని సాగుతున్న సన్నని దారి కనిపించింది. ఆ మొగలో ఓ టీకొట్టు.

లోపలికి వెళ్లిపోయాను. ఓ టీ తీసుకొని ఆ చనువుతో నా కావేరీ నది వాకబు మొదలెట్టాను. వాళ్లంతా తమిళంలో కొళ్ళిడం కొళ్ళిడం అంటున్నారు. అదో తికమక. ఆపద్బాంధవుడిలా ఓ పెద్దాయన- తెలుగు తెలిసిన బాబు- మాట కలిపాడు.

“ఇదే నువు అనుకొంటోన్న సాగరసంగమ బిందువు. ఇహ కాస్త పైకి వెళితే సముద్రమే. నువు కావేరీ కావేరీ అంటున్నావు. మేవు ఇక్కడ కొళ్ళిడం అంటాం. అదీ ఇదీ ఒకటోగాదో చెప్పలేనుగానీ ఈ ప్రాంతాల్లో అటు వంద మైళ్లూ ఇటు వంద మైళ్లూ దీన్ని మించిన నది లేదని మాత్రం ఘంటాపథంగా చెప్పగలను…”

మరి ఇక అనుమానమెందుకూ? ఇదే కావేరి!

“సాగరసంగమం ప్రాంతం దగ్గరేనంటున్నారు. నేను అక్కడిదాకా వెళ్లాలి. దారి చెప్పండి,” దాదాపు వేడుకుంటున్న ధోరణిలో అడిగాను.

వింతగా చూశాడు. జాలిపడ్డాడు. కరుణించాడు.

“ఇదిగో ఈ రోడ్డు పట్టుకొని తిన్నగా వెళిపోతే సుమారు పది కిలోమీటర్ల దూరాన ఆలక్కుడి అన్న గ్రామం వస్తుంది. బహుశా నీకు కావలసింది ఆ గ్రామమే…”
కోటి కోటి వందనాలు చెప్పుకొని ముందుకు సాగాను.

నదిని ఆనుకొనే సాగింది ఆ బాట. సన్నని బాటే అయినా వాహనాలు లేకపోవడంతో ఏ రకమైన చిరాకూ లేకుండా స్వచ్ఛమైన ఆహ్లాదంతో సాగింది ఏక్టివా పరుగు.


ఆకాశంలో తెల్లని మేఘాలు. నదిలో నీళ్లూ ఇసుకతిన్నెలూ సమపాళ్లు. కనిపించీ కనిపించని ఆవలి ఒడ్డున చెట్లున్న పచ్చదనం. హఠాత్తుగా ఊడలమర్రి చెట్ల నీడలో ఓ మండపం (శవదహన వేదికా?). ఓచోట ఎత్తైన గట్టుమీంచి దిగువున నదిదాకా దిగిన పాతిక ముప్ఫై మెట్లు, ఓ పడవ. పైన రోడ్డు మీద నా ఏక్టివా, దాని పక్కనుంచి నడచిపోతోన్న ఐదారుగురు స్థానికులు, వెనక తెల్లకొండలా ఓ పెనుమేఘం… ఏదో ఆర్ట్‌ సినిమా దృశ్యమా!

ఇరవై పాతిక నిమిషాలు గడిచాక ఆలక్కుడి గ్రామం చేరుకొన్నాను.

రోడ్డు అక్కడితో అంతమయింది!

ఏదీ సాగరసంగమం?!

“ఇంకా ఓ మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సముద్రం. రోడ్డు లేదుగానీ కాలిబాటల వెంట వెడితే రెండు కిలోమీటర్లలో మహేంద్రపల్లి అన్న ఊరు వస్తుంది. అక్కడ అడుగు.”

అక్షర భాష, హావభావాల భాష కలగలిపి సంభాషించగా నాకు అందిన సమాచారం.

ఒక రకంగా విస్తుపోయాననాలి.

కావేరీలాంటి అతి ముఖ్యమైన నది సముద్రంలో కలిసే చోటు గురించి స్థానికులకు కూడా ఇంత సమాచార రాహిత్యం ఏమిటీ? ఎలా సాధ్యం? పిఛావరం లాంటి ప్రదేశాన్నే అత్యాధునిక టూరిస్టు కేంద్రంగా మలచిన ప్రభుత్వం వారికి ఈ సాగర సంగమం గురించి పట్టకపోవడమేమిటీ? అసలు నేను సరైన నదీ ముఖద్వారాన్నే వెదుకుతున్నానా?

మహేంద్రపల్లి చేరాను.

సముద్రం కనిపించలేదు గానీ ఉప్పగాలి తగిలింది. ఉప్పుమళ్లు కనిపించాయి. చేపల చెరువులు కనిపించాయి. ఆ చెరువుల గట్లమీంచి స్కూటర్లు వెళ్లే మార్గాలు కనిపించాయి. దూరాన విశాల కావేరి కనిపిస్తోంది. సముద్రం మాత్రం ఆచూకీ లేదు.

భర్తృహరిగారి మధ్యముడిలా ఆచెరువుల గట్ల వెంబడే ముందుకు సాగాను.

ఊరు దాటి ఓ అరకిలోమీటరు వెళ్లాక ఆ గట్ల దారీ మూతబడిపోయింది.

దగ్గరలో ఓ చేపల చెరువుకు సంబంధించిన ఓ పూరిపాక… జన సంచారం!

ఆ జనవరి మధ్యాహ్నాన ఊరూ పేరూ లేని చోట దారీ తెన్నూ లేని ప్రాంతంలో నేను, నాకు కనిపించిన ఓ ముగ్గురు తమిళ చేపల పనివాళ్లు!! ఏదో అబ్సర్డ్‌ నాటకం దృశ్యంలా అనిపించి నాకే నవ్వొచ్చింది.

మా మాటల శబ్దానికి నాలుగో మనిషి పాక బయటకు వచ్చాడు. ఈ ముగ్గురి మీద సూపర్‌వైజరులా ఉన్నాడు… మహానుభావుడు ఇంగ్లీషు మాట్లాడాడు.

“నిజమే! సాగరసంగమ స్థలం మైలులోపే ఉన్న మాట నిజమే కానీ మీరు అక్కడికి చేరలేరు. నడవాలన్నా కష్టం. దారితప్పి తీరతారు. అక్కడికి రావడానికి ఓ చుట్టుదారి ఉంది. తిరిగి ఆలక్కుడి వెళ్లండి. అక్కడ ఎడమకు మళ్లి కోదండపురం చేరుకోండి. ఆ తర్వాత నల్లూరనే ఊరు వస్తుంది. ఆ తర్వాత పళయపాళ్యం. అది దాటి వెళితే సాగరసంగమ స్థలం వస్తుంది. దాని పేరు పళైయాఱు.” వివరమందించాడు.

“ఈ చుట్టుమార్గం ఎంత దూరమూ?”

“ఇరవై పాతిక కిలోమీటర్లుంటుంది.”

హతాశుడినయ్యాను. ఇప్పటికే పదిహేను. మరో పాతిక. పక్కనున్న కావేరీ ముఖద్వారానికి ఇంతింత దూరాలా! బుద్ధిగా ఆ కొళ్ళిడం బ్రిడ్జి దగ్గరకు వెళ్లిపోయి హైవే 45 పట్టేసుకోనా?

ప్రాణం ఒప్పుకోలేదు. కోదండపురానికే ఓటు వేసింది.

మహేంద్రపల్లి… ఆలక్కుడి… కోదండపురం…

చేపల చెరువులు, ఉప్పుమళ్లు, ఇసుకదారులు వదిలి మామూలు దారుల్లో పడేసరికి హమ్మయ్య అనిపించింది. నదికి దక్షిణంగా దూరంగా వెళిపోతున్నట్టు తెలుస్తోంది. అయినా ఆ చిరుగ్రామాలు… గ్రామాల్లో కొలనులు… గట్ల మీద చెట్లు… ఈ లోపల ఆకలి!

ఓ టీకొట్టులోకి వెళ్లాను.

భోజనమంటూ లేదు. బన్నులు, బిస్కెట్లు, టీ- అంతే!

నా దగ్గరా కొన్ని బిస్కెట్లు కలవు!


టీ తాగుతోంటే- ఓ విప్పార్చిన కళ్లూ, మాసిన తెల్లగడ్డమూ, ఆ గడ్డం వెనకాల అంత వయసు లేని మొహమూ, ఎర్రాపచ్చా అడ్డచారల టీ షర్టూ, మెడలో ముదురు పసుపు కండువా- ఓ పెద్దమనిషి… మాటలు కలిపాడు.

‘కావేరి ముఖద్వారం…’ అని గొణగగా తిన్నగా శిలప్పదిగారంలోకి తీసుకువెళ్లి పోయాడాయన! బాగా పుస్తకాలు చదివిన మనిషి. సంగం సాహిత్యం, తిరువళ్లువర్‌ పదాలు, ఇళంగో శిలప్పదిగారం- కణ్ణగి, కోవలన్‌, మాధవి, పాండ్య రాజు… గలగలా కబుర్లు.

“మా కావ్యాల ప్రకారం కావేరి సముద్రంలో కలిసేది పూంపుహార్‌ దగ్గర. మరి కావ్యకాలంలో ఎలా ఉండేదోగానీ ఇపుడది ఓ పెద్ద సైజు కాలువలా ఉంటుంది. అంతే! నువు ఆశిస్తున్న నదీ ముఖద్వార దృశ్యం కావాలంటే ఈ కొళ్ళిడం నదే సరైనది.” ఆయన భోగట్టా.

ముందుకు సాగాను. పళయపాళ్యం గ్రామం చేరాను. ఓ బస్సుస్టాపు అందంగా కనిపించింది. స్కూటరాపి నా బిస్కెట్లూ బన్నులూ మంచినీళ్లతో లంచ్‌ మొదలెట్టాను. టైము రెండు దాటింది.

కాస్తంత దూరాన ఓ చిన్నపాటి బిల్డింగులో ఇద్దరు ముగ్గురు పోలీసులు ఉండటం గమనించాను. వాళ్లనడిగితే సరయిన సమాధానం దొరకవచ్చని అటు వెళ్లాను. వాళ్లు కూడా నన్నూ నా లంచ్‌నూ గమనిస్తున్నట్టున్నారు.

భాష సమస్య వల్ల కొంచెం ఇబ్బంది ఎదురయినా, మొత్తానికి సమాచారం దొరికింది. దొరికిందా? చెప్పడం కష్టం…

“మేం వెళ్లలేదుగానీ పళయాఱు అన్న ఊరు సముద్రం ఒడ్డున ఉందని విన్నాం. బహుశా పన్నెండు పదమూడు కిలోమీటర్లు ఉంటుంది…”

“అది నదీ ముఖద్వారమేనా?”

“ఖచ్చితంగా చెప్పలేం. అయి వుండొచ్చు…”

మళ్లా ఓసారి పదోసారి హతాశుడినయ్యాను. అప్పటికే రెండున్నర అవవస్తోంది. కనీసం మరో అయిదుగంటల ప్రయాణం ఉంది వేదారణ్యానికి. మళ్లా చీకట్లో బండి నడపడం తప్పదా?

వద్దనిపించింది. కావేరీ వేటను అక్కడితో కట్టిపెట్టాలనిపించింది!!

ఓసారి మ్యాపులు తీసి చూసుకొన్నాను.

పడమట దిక్కుగా వెళితే శీర్కాళి అన్న చిరుపట్నం… హైవే 45ఎ… ఓ అరగంట దూరంలో ఫూంపుహార్‌… మరో గంట సాగితే ట్రాంక్వోబార్… అదే బాటలో కారైక్కాల్… ముందుకు సాగితే వేలాంగణ్ణి… ఇంకా ముందుకు వెళితే వేదారణ్యం- అంతా కలిసి నూటపది కిలోమీటర్లు- ఎక్కడా ఆగకుండా వెళితే నాలుగు గంటల లోపు… చీకటి పడేలోగా చేరుకోవచ్చు!

ప్రయాణం మొదలెట్టాను. సులభంగానే శీర్కాళి దొరికింది. మరికాసేపట్లో తూర్పువేపుకు వెళ్లమంటూ పూంపుహార్‌ బోర్డు కనిపించింది. అయిదు కిలోమీటర్లు- తూర్పువైపుకు.

ఎపుడూ వెళ్లి ఉండకపోయినా పూంపుహార్‌ నాకు బాగా తెలిసిన ఊరు!


దాదాపు రెండువేల సంవత్సరాల క్రితం చోళ రాజుల రాజధాని. శిలప్పదిగారపు కణ్ణగి కోవలన్‌ల కుటుంబాలు నివసించిన ఊరు. వారి దాంపత్యం పండిన ఊరు. నర్తకి మాధవి ప్రభావంతో కోవలన్‌ భార్యకు దూరమయిన ఊరు. ఇద్దరూ తమ తమ సంపదలు కోల్పోయి కొత్త జీవితాన్ని వెదుక్కుంటూ మదురై వెళ్లిపోయిన ఊరు. శిలప్పదిగారంలో ప్రకృతినీ సూర్యచంద్రులనూ వర్ణించడంతో పాటు కావేరీనది ప్రశంస కూడా ఉంది.

ఊరు చేరేసరికి మూడు దాటేసింది.

అప్పటి మహానగరం కానరాలేదు. కనిపిస్తుందని నేను ఆశించనూ లేదు.

ఊరు ఆరంభంలో ఓ వస్తుప్రదర్శనశాల. ముందుకు వెళితే కోలాహలం నిండిన సముద్ర తీరం. ఓ గుడి. పక్కనే లైట్‌హౌసు…

అప్పటి రాజధాని వరదలకూ, కావేరీనది ముంపుకూ, ముందుకు చొచ్చుకు వచ్చేసిన సముద్ర జలాల తాకిడికీ గురి అయి క్రమక్రమంగా కనుమరుగయిందంటారు. ఒకప్పుడు అది సుప్రసిద్ధ రేవుపట్నంగానూ వాణిజ్యకేంద్రంగానూ మెరిసిపోయిందట! ఆ మెరుపులతో నాకు పనిలేదుగానీ కణ్ణగి తిరుగాడిన సముద్రతీరమంతా నడిచి రావాలని కోరిక…

“అంకుల్‌! టాఫీలివ్వవా?” ఓ పల్లెకారుల చిన్నపాప.

“లేవుగదా నా దగ్గర!” ఆశ్చర్యంగా నేను.

“అదిగో ఉన్నాయ్‌! చూడు…” అంటూ బ్యాక్‌పాక్‌ పక్కన ఉండే చిక్కపు ‘జేబు’ అడుగున, వాటర్‌ బాటిల్‌ కింద ఉన్న టాఫీలను చూపించింది. ఎపుడో ఆ పాకెట్లో అవి వేశానని గుర్తు కూడా లేదు. ఆ పాప కళ్లు టాఫీ పసిగట్టేశాయి!

ముచ్చటనిపించింది. ఉన్నవన్నీ తీసి తన చేతిలో పోశాను. ఆరేడేళ్లు ఉంటాయేమో… దూరాన ఉన్న వాళ్ల అన్నయ్యను సంబరంగా పిలిచి టాఫీలు పంచింది. పిల్లలిద్దరితోనూ కాసేపు కబుర్లు.

మళ్లా పూంపుహార్‌ కావేరి ఎక్కడా అన్న వెదుకులాట మొదలయింది.

ఓ కిలోమీటరు దక్షిణాన ఉన్న గట్టుకేసి చూపించారు స్థానికులు.

అలా అలా నడిచి వెళ్లాను. నిజమే, అది కావేరీ సంగమస్థానమే! అలా అని అక్కడి బోర్డు నిర్ధారించింది.

నది కటూ ఇటూ కరకట్టలు- పదిహేను ఇరవై అడుగుల ఎత్తున. మధ్యలో ఓ రెండు మూడువందల అడుగుల వెడల్పున నదీగర్భం. వెనక్కి వస్తోన్న సముద్రపు చిరుకెరటాల నీళ్లే తప్ప నదిలో చుక్క నీరు లేదు. అయ్యో! యాంటీ క్లైమాక్సు… అయినా మమత చావక నది ఇంకాస్త సుందరంగా కనబడుతుందేమోనని పైకి ఓ అర కిలోమీటరు నడిచాను. నిలిచిపోయిన నీళ్లు కనిపించాయే తప్ప ‘అందం’ ఎండమావే అయింది!


తిరిగి వస్తోంటే కరకట్ట మీద కబుర్లు చెప్పుకుంటున్న నలుగురు స్థానిక యువకులు. ఆ మనుషుల్లోనూ, వాళ్లు కూర్చున్న పద్ధతిలోనూ, మాట్లాడుకుంటున్న ధోరణిలోనూ గొప్ప నేటివిటీ కనబడి వాళ్ల అనుమతి తీసుకొనే ఓ ఫోటో…

“ఎవరివయ్యా నువ్వు, ఆ ఫోటోను ఏం చేస్తావూ?” కవ్వింపుగా ఒకతని ప్రశ్న.

“నేనా? పోలీసువాళ్ల మనిషిని! నలుగురు మనుషుల కోసం వాళ్లు వెదుకుతున్నారట- మీకోసమే అయి ఉంటుంది… వాళ్లకీ ఫోటో అందిస్తాను,’’ నా సరిజోడీ ప్రతిస్పందన…

అందరం హాయిగా కడుపారా నవ్వులు… పక్కనే ఉన్న లైట్‌హౌస్‌ ఎక్కడం… గొప్ప దృశ్యాలు… ఫోటోలు…

తిరిగి స్కూటరు దగ్గరకు వెళుతుంటే అక్కడి ప్రదర్శనశాల రా రమ్మని పిలిచింది. సమయం తక్కువాయె- అయినా వెళ్లి అక్కడి కాపలా మనిషిని అడిగాను…

“ఏమున్నాయి? ఎంత సమయం పడుతుందీ?” అని. “శిలప్పదిగారపు చిత్రాలూ శిల్పాలూ రాతప్రతులూ ఉన్నాయి. ఓ గంట పడుతుంది.” అన్నాడు.

ప్రాణం ఉసూరుమనిపించింది. అంత దూరం వెళ్లి ఆ ప్రదర్శన చూడకుండా రావడం తప్పుగాదూ? అవును తప్పే! అయినా తప్పలేదు…
--------------------------------------------------
రచన: దాసరి అమరేంద్ర, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, June 4, 2019

వెల్చేరు చేసిన విశ్వనాథ కథల ఆంగ్లానువాదం వెనుక


వెల్చేరు చేసిన విశ్వనాథ కథల ఆంగ్లానువాదం వెనుక




సాహితీమిత్రులారా!

వెల్చేరు నారాయణరావుగారు ఆంగ్లంలోకి అనువదించిన రెండు కథలు–విశ్వనాథ సత్యనారాయణగారివి, ఇటీవల పెంగ్విన్ ఇండియావారు ప్రచురించారు. ఆ పుస్తకం గురించి ఒక రెండుమాటలు చెప్పదలచుకున్నాను. అయితే, ఇది విశ్వనాథ రచనల సమీక్ష కాదు, ఈ పుస్తకంలో అనువదించిన, విశ్లేషించిన విశ్వనాథ రచనల మీద నారాయణరావుగారి విశ్లేషణపై సమీక్ష మాత్రమే. ఆ రెండు రచనలు: హాహాహూహూ, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు.

ముందుగా వచ్చే ప్రశ్న: విశ్వనాథ అనేకానేక రచనల్లో ఈ రెంటినే నారాయణరావుగారు ఎందుకు ఎంచుకున్నారనేది. ఆ పూర్వరంగాన్ని చూద్దాం.

నారాయణరావుగారి పరిశోధనల్లో ఒక ప్రధాన మార్గం భారతీయ రచనల గురించి పాశ్చాత్యుల ఆలోచనా ధోరణుల్లోని అవకతవకల్ని, ఆ ధోరణుల్ని అనుసరించిన, అక్కడక్కడ అంతకన్నా శ్రుతి మించి అధిగమించిన, భారతీయ పరిశోధకుల మార్గాల్ని ప్రశ్నించటం, ఆధారాల్తో, పటిష్టమైన వాదనల్తో వాటిని ఖండించటం. అలాటి భావాల్లో ఒకటి రచనకీ దాని రచయితకీ ఉన్న సంబంధం చాలా పటిష్టమైందని, ఆ రెంటి మధ్యలో ఇంకెవరూ రారనేది. ఈ భావం మీద తిరుగుబాటే ఆయన తొలి ప్రసిద్ధ రచన తెలుగులో కవితా విప్లవాల స్వరూపం. రచయితకీ ఆ రచనని అందుకునే శ్రోత లేదా పాఠకుడికీ మధ్య మారుతూ వచ్చిన సంబంధాలే కవిత్వ పద్ధతుల్లో మార్పులకి ప్రధాన కారణాలని, అద్భుత భావాలో, ఏ ‘యుగకవుల’ ఆలోచనా స్రవంతులో కావని అందులో ఎంతో సమర్థంగా ప్రతిపాదించారు. కవి కవితావిప్లవాల్ని తీసుకురాడని, కవికీ పాఠకుడికీ మధ్య మారిన సంబంధమే కవితావిప్లవానికి నాంది పలుకుతుందని, అలా మారే సందర్భాన్ని గుర్తించి అందుకు సరిపోయే కవిత్వం రాసినవారే కృతార్థులౌతారనీ, అలా చెయ్యనివారు ఎంత సమర్థులైనా ప్రధాన స్రవంతికి పక్కగానే మిగిలిపోతారని అనేక ఉదాహరణలతో, స్పష్టంగా నిరూపించిందీ గ్రంథం. ఆ తర్వాత ఈ విషయాన్ని ఎంతో విస్తృతంగా, కూలంకషంగా ఎన్నో ఇతర పుస్తకాల్లోను, వ్యాసాల్లోను విపులీకరించటం జరిగింది.

ఆ తర్వాత శ్రీనాథ రచనల గ్రంథం, కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం, కన్యాశుల్కము, ఇంకా అనేక వ్యాసాలు ‘ఆధునికత’ అనే అంశం మీద సుదీర్ఘమైన, లోతైన ఆలోచనల్ని వినిపించాయి. అంతకుముందు ‘విద్యాధికులైన’ భారతీయులు అనేకమంది ఒప్పేసుకున్న భావం పాశ్చాత్యులు వచ్చిన తర్వాతనే ‘ఆధునికత’ భారతదేశంలోకి ప్రవేశించిందని, అంతవరకు వున్న భారతీయ నాగరికత పురాతన భావాలు, ఆచారాలు, శాస్త్రాల ప్రకారమే వుండేదనీ. ఆ ఆలోచనని నారాయణరావుగారు తన రచనల ద్వారా తీవ్రంగా ప్రతిఘటించారు. పింగళి సూరన రచనల్లో గొప్ప ఆధునికత వున్నదని, అది పాశ్చాత్య భావాలకి ఎంతో భిన్నమైన ఆధునికత అని బలంగా వాదించారు. తెలుగు సాహిత్యంలో ‘క్షీణ యుగం’గా భావించబడే కాలంలో ఎన్నో ఆధునికభావాలతో కూడిన రచనలు వచ్చాయని నిరూపించారు. ‘క్షీణయుగం’లాటి పేర్లు పెట్టినవారికి ఆధునికత గురించిన సొంత ఆలోచనలులేక పాశ్చాత్య భావనలని గంపగుత్తగా జీర్ణించేసుకోవటంవల్లే ఇలా జరిగిందని సహేతుకంగా వాదించారు. ‘ఆధునికత’ అనేది అంతకుపూర్వం వున్న సమాజాన్ని, సమాజ భావాల్ని, విలువల్ని, ధ్వంసంచేసి వచ్చేదనే ఆలోచన అపోహ మాత్రమే అని, ఒక శుభ్రమైన, సహజ పరిణామక్రమాన్ననుసరించే ఆధునికత భారతీయ సమాజానికి కొత్త కాదని బల్లగుద్ది వాదించారు. ఈ దృష్టితో చూసి పింగళి సూరనకి నిజమైన వారసుడు గురజాడ అప్పారావుగారని ప్రతిపాదించారు. ఇది చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసిన లోచూపు. ఐతే, ఆనాటి బెంగాలీ, ఆంధ్ర ‘సంఘ సంస్కర్తలు’ పాశ్చాత్య ఆధునికతా వాదానికి లొంగిపోయి సమాజం కుళ్లిపోయిందని, ఆంగ్ల విద్యా పండితులకే దాని కుళ్లు కడిగి కొత్తదారిలోకి మళ్లించటం తెలుసునని భావిస్తున్న తరుణంలో కన్యాశుల్కం చూపిస్తున్నది ఏ సంస్కర్తల అవసరం లేకుండా సమాజమే అవసరమైతే సమష్టిగా నడుంకట్టి అనుచితాలు జరగకుండా చూడగలదని నిరూపించటమని నారాయణరావుగారి వివేచన. అందుకే గురజాడ ఆధునికత పింగళి సూరన జాడలోని ఆధునికత, పాశ్చాత్యుల మార్గంలోని ఆధునికత కాదు అనేది ఆయన వాదన. రవీంద్రనాథ్ ఠాగూర్, కట్టమంచి రామలింగారెడ్డి, కందుకూరి వీరేశలింగం వంటివారు పాశ్చాత్య ఆధునికతా వాదాన్ని నిరభ్యంతరంగా ఒప్పేసుకుని అలాటి ఆధునికతని భారతదేశానికి వీలైనంత త్వరగా దిగుమతి చెయ్యాలని ప్రయత్నిస్తుంటే ఆ భావాల మీద గురజాడ తిరుగుబాటే కన్యాశుల్కం అని నారాయణరావుగారి అభిప్రాయం.

ఇదీ ఈ పుస్తకానికి పూర్వరంగం.

నారాయణరావుగారు విశ్వనాథ రచనల్లోంచి హాహాహూహూ, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు ఎంచుకోవటానికి కారణం–గురజాడ తర్వాత తెలుగులో ఇలా పాశ్చాత్యుల ఆధునిక భావనల్ని నిశితంగా ప్రశ్నించిన రచనల కోసం చేసిన వడపోతలో అవి మిగలటం. కాకుంటే విశ్వనాథ తన ఇతర రచనల్లో దీన్ని ఒక విపరీతధోరణికి తీసుకెళ్లి మను ధర్మశాస్త్రాన్ని పాటించాలని, బాల్య వివాహాలు కావాలని వాదించటం, పింగళి సూరనని కూడా కాదనటం, ఇంకా వెనక్కి వెనక్కి వెళ్లిపోవటం చేస్తారు. అది సమర్థనీయం కాదు. ఈ రచనలో నారాయణరావుగారు విశ్వనాథ ఆలోచనావర్తులం లోని ఆధునికతాభావాన్ని తప్ప మరేభాగాన్నీ స్పృశించరు, అది అప్రస్తుతంగా భావించినట్టున్నారు.

సాధారణంగా నారాయణరావుగారి అనువాద రచనలకి ఒక మూస వుంటుంది; ముందుగా అనువదించే రచనల గురించిన పరిచయం, వాటి పూర్వాపరాలు, వాటి సందర్భం గురించిన చర్చ; తర్వాత అనువాదం; చివరగా అనువాదిత రచనల కర్త గురించి, ఆ రచనల గురించి విపులమైన విశ్లేషణ, ప్రపంచ సాహిత్యంలో ఆ రచనలకి ఎందుకు, ఎలాటి స్థానం వుండాలో ప్రతిపాదన, సమర్థన–ఇదీ ఆ మూస. ఈ పుస్తకం కూడ అదే వరసని అనుసరిస్తుంది.

హాహాహూహూ అనేది మనిషి శరీరమూ, గుర్రపు తలా వున్న ఒక గంధర్వజాతి. వాళ్లు ఆకాశచారులు. మనుషులకన్న ఎన్నో రెట్లు పెద్ద శరీరాలు వాళ్లవి. ఒకరోజు ఏదో కారణంవల్ల ఒక హాహాహూహూ రెక్కలు తెగి లండన్‌లో పడతాడు. అక్కడివారతన్ని బంధించి ఒకచోట వుంచుతారు. అక్కడి శాస్త్రవేత్తలు, రాజకీయవేత్తలు, అతనితో ‘మాట్లాడ’టానికి ప్రయత్నిస్తారు. అతన్ని ఏం చెయ్యాలా అని మల్లగుల్లాలు పడతారు. చివరికి అతను సంస్కృతంలో మాట్లాడుతున్నాడని, దూరంగా విన్నవాళ్లకే అవి మాటల్లా తెలుస్తున్నాయని, దగ్గరివాళ్లకి కేవలం ఏవో శబ్దాలుగా అనిపిస్తున్నాయని గ్రహిస్తారు. సంస్కృత పండితులు అతనితో సంభాషణలు సాగిస్తారు. చివరకు ఏదో తెలియని కారణంతో అతని రెక్కలు మళ్లీ మొలుస్తాయి; అతను ఆకాశానికి ఎగిరిపోతాడు. ఇదీ టూకీగా హాహాహూహూ వృత్తాంతం.

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు ఉత్తమ పురుషలో రాసిన కథ. కథ చెప్పే వ్యక్తికి ఒక వింతకల వస్తుంది. దాన్లో సంస్కృత పంచతంత్రకర్త విష్ణుశర్మ, ఆంధ్రమహాభారతకర్త తిక్కన కనిపించి అతనితో సంభాషణలు సాగిస్తారు. అవి ఎక్కువభాగం ఆంగ్లభాష గురించి, ఇండియాలో దానివల్ల కలిగిన, కలుగుతున్న పరిణామాల గురించినవి. ఆ కల కొన్నాళ్లు ఒక గొలుసుకలగా సాగిపోతుంటుంది. కలలోనే ఎంతోకాలం కూడ గడుస్తుంది. అలా, ఈ కథ దాదాపుగా మొత్తం వాళ్ల మధ్య సంభాషణల రూపంలోనే వుంటుంది. చివరికి కల ముగియటంతో కథా ఐపోతుంది.

నారాయణరావుగారి ఆలోచనల ప్రకారం, భారతీయుల మౌలిక భావనల మీద పాశ్చాత్యుల విమర్శలని ప్రశ్నించటమే కాకుండా పాశ్చాత్యుల మౌలిక ఆలోచనాసరళి లోని లోపాల్ని ఎత్తిచూపే రచన హాహాహూహూ. ఉదాహరణకి ఈ పుస్తకంలో హాహాహూహూ మనిషి శరీరమూ గుర్రపు తలా వున్నవాడు కనక మనిషా మృగమా అనేది ఆంగ్లేయ పండితుల మౌలిక సందేహం. ప్రాణి ఏదైనా సరే ఐతే మనిషి కావాలి కాకుంటే మృగం కావాలి తప్ప మరో రకం తమకు తెలియదు కనక అలాటిది ఉండదనేది వాళ్ల అహంకారం. మనిషైతేనే కొన్ని హక్కులు వస్తాయి, మృగాన్ని ఏమైనా చెయ్యొచ్చు, బతికుండగానే శరీరభాగాల్ని కోసి పరిశీలించటంతో సహా. ఇది భారతీయ భావనలకి పూర్తిగా విరుద్ధం. అలాగే, దేని గురించైనా జ్ఞానం కలగటానికి దాన్ని ముక్కలుముక్కలుగా కోసి మైక్రోస్కోపుల కింద చూడటం సరైన మార్గం కాదని విశ్వనాథ గంధర్వుడి చేత చెప్పిస్తాడు.

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు విచిత్రమైన శిల్పంతో రాసిన నవలిక. ఈ నవలిక ముఖ్యంగా భారతదేశంలో ఇంగ్లీష్ నేర్పించే పద్ధతుల మీద ఒక తీవ్ర విమర్శ. అలాగే సాహిత్య విమర్శ ఎలాటి పెడధోరణులు తీసుకుంటుందో, సమాజంలో ఇంగ్లీష్ ప్రభావం ఎలాటి విపరీత పరిస్థితులకి దారితీస్తుందో చూపిస్తుంది కూడ. ఇందులో విశ్వనాథ భారతీయ-యూరోపియన్ భాషల మధ్య వున్న మౌలిక భేదాన్ని స్పష్టంగా గుర్తించి వివరిస్తారు. భారతీయ భాషలన్నీ కర్త-కర్మ-క్రియ అనే చట్రంలోవైతే యూరోపియన్ భాషల చట్రం దీనికి భిన్నం (కర్త-క్రియ-కర్మ). ఈ మౌలిక భేదాన్ని స్పష్టంగా అర్థంచేసుకుని, ఆ చట్రం పనిచెయ్యటానికి ఏయే హంగులు ఎలా అవసరమయ్యాయో తెలుసుకుంటే తప్ప ఆ భాషలు నిజంగా ఒంటబట్టవు. ఈ గుర్తింపు ఇంగ్లీష్ చెప్పేవాళ్లకే లేకపోవటం వల్ల వాళ్ల దగ్గర నేర్చుకునేవాళ్లూ నానా అగచాట్లూ పడి చివరికి అయోమయంలో మునిగిపోవటం ఖాయం అని తేలుస్తుందీ నవలిక.

నారాయణరావుగారి దృష్టిలో పాశ్చాత్య విజ్ఞానార్జన విధానాల్ని, కేవలం భౌతిక పరిశోధనలే విద్యాన్వేషణ మార్గాలనే భావనల్లోని లోపాల్ని సున్నితంగా ఎత్తిచూపేవి; భారతీయులకీ పాశ్చాత్యులకీ ఆలోచనా ధోరణుల్లో, సంస్కృతీ సంప్రదాయాల్లో వున్న భేదాలు చాలా మౌలికమైనవి; వాటిని స్పష్టంగా గుర్తించినప్పుడే రెంటినీ అనుసంధించటం సాధ్యమని చాటేవి, ఈ పుస్తకంలో వున్న రెండు రచనలూ.

ఇంతకుమునుపు వచ్చిన విమర్శకులు విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు ఇంగ్లీష్ భాషలో లోపాల్ని ఎత్తిచూపుతుందని భావిస్తే, నారాయణరావుగారు అది సరైన లోచూపు కాదని, ఈ రచన గురి కేవలం భారతీయులకి ఇంగ్లీష్ నేర్పించే పద్ధతులు, అలా ఇంగ్లీష్ నేర్పేవారి అజ్ఞానం మీద తప్ప ఇంగ్లీష్ భాష మీద కాదని నిరూపిస్తారు ఈ పుస్తకంలో.

గురజాడకి వారసుడిగా విశ్వనాథని చూపించటం చాలామందికి కొరుకుడుపడని కొయ్యే కావొచ్చు. ఐతే నారాయణరావుగారు తన రచనల్తో ఒక కొత్త మార్గాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఒక కొత్తచూపుని చూపిస్తున్నారు. ఇలా కూడ చూడొచ్చునని, చూస్తే కొత్త కోణాలు, కొత్త దారులు కనిపిస్తాయని ఆహ్వానిస్తున్నారు. ‘ఓపెన్ మైండ్’తో సాహిత్యాన్ని ఆస్వాదించమని, అలా చేస్తే కొత్త అందాలు, కొత్త భావాలు, కొత్త ఆలోచనలు తెరుచుకుంటాయని చేసి చూపిస్తున్నారు. ఆయన ఆలోచనల్తో మనం ఏకీభవించొచ్చు, వించకపోవచ్చు, అది మనిష్టం. కాని ఆ ఆలోచనల్ని, ఆ విధానాల్ని అర్థంచేసుకోవటం వల్ల మన ఆలోచనాపరిధి విస్తృతమౌతుంది. అలా చెయ్యకపోతే మనమే నష్టపోతాం. కనక ఈ రచనని, నారాయణరావుగారి ఇతర రచనల్ని చదవమని ఔత్సాహిక సాహితీపిపాసులందరికీ ఆహ్వానం.

ఈ పుస్తకం ఇప్పుడు ఇండియాలో మాత్రమే దొరుకుతుంది.
-----------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు, 
ఈమాట సౌజన్యంతో