Showing posts with label గ్రంథ పరిచయం. Show all posts
Showing posts with label గ్రంథ పరిచయం. Show all posts

Monday, March 11, 2019

సురపురం


సురపురం




సాహితీమిత్రులారా!


సురపురం. ‘ఏవిటీ పుస్తకం? దేనిగురించీ?’

‘మెడోస్ టైలర్ (Philip Meadows Taylor) అన్న పందొమ్మిదో శతాబ్దపు నైజాం ప్రభుత్వంలోని ఆంగ్ల అధికారి ఆత్మకథ ఈ సురపురం.


‘మెడోస్ టైలరా?! ఎవరతనూ? ఎప్పుడూ పేరు వినలేదే! సురపురం పేరూ విన్న గుర్తులేదు!! ఎక్కడుందా ఊరూ? ఆంగ్ల అధికారి ఆత్మకథకు సురపురం అన్న పేరేవిటీ? విచిత్రంగా ఉందే…’

హైదరాబాద్‌కు నైరుతి దిశలో 250 కిలోమీటర్లు, సింధనూరుకు ఉత్తరంగా 100 కిలోమీటర్ల దూరాన తెలుగు, కన్నడ, మరాఠా దేశాలు కలిసే ప్రాంతంలో, కృష్ణా-భీమ నదుల మధ్య భాగాన ఉన్న అతి చిన్న సంస్థానం సురపురం. ఆ పట్టణం ఇప్పటి పేరు షోర్‌పూర్. ఏభైవేల జనాభా. కర్నాటక రాష్ట్రంలో యాదగిరి తాలూకాలో ఉంది.

మెడోస్ టైలర్ అన్న ఆంగ్ల యువకుడు జీవనోపాధిని వెతుక్కుంటూ 1824లో భారతదేశం వచ్చాడు. కొన్నికొన్ని పరిస్థితులవల్ల తాను ముందుగా అనుకొన్నట్టు ఆంగ్ల వ్యాపార సంస్థలలోనో ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వంలోనో కాకుండా నిజాం ప్రభుత్వ అధికారిగా సురపురం సంస్థానంలో చేరి పదిపదిహేనేళ్లపాటు పనిచేశాడు. ఆరోగ్య కారణాలవల్ల 1860లో- ఏభైరెండేళ్ల వయస్సులోనే – పదవీవిరమణ చేసి స్వదేశం వెళ్లాడు. తన ఆత్మకథను ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ అంటూ రాశాడు. 68 ఏళ్ల వయసులో మరణించాడు. ఆ ఆత్మకథకు తెలుగు రూపం సురపురం.

కల్నల్ మెడోస్ టైలర్ 1808లో లివర్‌పూల్‌లో ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు. తాత మతగురువు. తండ్రి వ్యాపారి. ఆ వ్యాపారం దెబ్బతినగా కుటుంబమంతా ఊళ్లు మారారు. ఇళ్లు మారారు. బీదరికం అనుభవించారు. ఆ ఒడిదుడుకుల మధ్య సాగీసాగని అంటీఅంటని చదువు. కొంతకాలం బోర్డింగ్ స్కూల్లో… అది నచ్చక పారిపోవడం… బాగా చిన్నవయసులోనే ఒక అతిచిన్న ఉద్యోగంలో చేరడం, అందులో రాణించడం, అందువల్ల సహోద్యోగుల అసూయకు గురికావడం, ఉద్యోగం వదిలెయ్యడం… అనారోగ్యం… మళ్లా బాక్సర్ అనే వ్యాపారికి బొంబాయిలో ఉన్న కార్యాలయంలో ఉద్యోగ అవకాశం… ఇండియా ప్రయాణం… పదహారేళ్ల వయసులో బొంబాయి చేరడం…

నాలుగున్నర నెలల ఓడ ప్రయాణం తర్వాత 1824 సెప్టెంబరులో టైలర్ బొంబాయి చేరతాడే గానీ అనుకొన్నట్టుగా బాక్సర్ కంపెనీలో ఉద్యోగం స్థిరపడదు. మూడు నెలల ఊగిసలాట తర్వాత, అప్పటికే అక్కడ పనిచేస్తోన్న ఓ మేనమామ వరస ఉన్నతాధికారి పుణ్యమా అని నిజాం ప్రభుత్వ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఉద్యోగం దొరుకుతుంది. ఔరంగాబాద్‌లో 1824 డిసెంబర్‌లో ఉద్యోగంలో చేరతాడు. వేటాడటం, హిందీ భాష నేర్చుకోవడం, చిత్రలేఖనం, స్థానిక తిరుగుబాట్లను అణచడం, అనారోగ్యం, సర్వేయింగ్ నేర్చుకోవడం, పై అధికారుల నమ్మకం అభిమానం సంపాదించడం, అవకాశాలు అందినట్టే అంది చేజారిపోవడం, కార్యరంగం హైదరాబాదుకు మారడం, ఓ విశాలమైన ప్రాంతానికి పోలీసు సూపరింటెండెంటుగా వెళ్లడం, మరాఠీ తెలుగు కన్నడ భాషలు నేర్చుకోవడం, సున్నితమైన స్థానిక సమస్యలను మానవీయతతో కూడిన చాకచక్యంతో పరిష్కరించడం, అవసరమైనచోట సాహసించడం, అనుకోని పరిస్థితులవల్ల నైజాం ప్రభుత్వపు ఉద్యోగం అయోమయంలో పడటం, మళ్లీ నిలబడటం, నిజాం దృష్టిలో టైలర్ పడడం, నిజాం తమ్ముడు చేసిన తిరుగుబాటును ధైర్యంగా పరిష్కరించడం, సాటి సైనికులంతా ‘మహదేవబాబా’ అంటూ జయజయధ్వానాలు చెయ్యడం, ఆ పేరూ బిరుదూ జీవితాంతం నిలబడిపోవడం– ఇవన్నీ జరిగేసరికి టైలర్ వయస్సు ఇంకా పాతిక నిండనేలేదు. కానీ బాల సైనికుడు యువ అధికారిగా పరిణతి చెందిన సమయమది. హైదరాబాద్‌లోనే ఉండే ఓ ఆంగ్లో ఇండియన్ అధికారి కూతురును పెళ్లిచేసుకొని గృహస్థుడయిన సమయమది.

వ్యక్తిగా ఎంత ఎదిగినా, ఉద్యోగపరంగా ఎన్ని బాధ్యతలు నిర్వహించినా, టైలర్ కుటుంబ జీవితం ఒడిదుడుకులమయం. తనలాగే భార్యకూ నిరంతర అనారోగ్యం. పుట్టిన ఇద్దరు బిడ్డలూ చిన్నవయసులోనే పోవడం… తనకు కూడా నిలకడలేని ఆరోగ్యం… తరచుగా జబ్బుపడటం– పన్నెండేళ్ల కొలువు తర్వాత లెఫ్టినెంట్ నుంచి కెప్టెన్‌గా పదోన్నతి పొందాక పరిస్థితులను చక్కబరచుకోవడం కోసం మూడేళ్ల శెలవు తీసుకొని 1838-40ల మధ్య ఇంగ్లండ్ చేరడం… అప్పటికి పదేళ్ల క్రితమే తాను అనుమానించినట్టు గొలుసు హత్యలు చేసిన ముఠాలవాళ్లు థగ్గులేనని కాలక్రమేణా తేలడం, ఆయా ఘాతుకాల గురించి ఓ వ్యాసం రాయగా దాన్ని చూసినవాళ్లు మరికొన్ని వివరాలు జోడించి నవలగా రాయమని టైలర్‌ను ప్రోత్సహించడం… తనకున్న సమాచారమూ అనుభవాల నేపథ్యంలో కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్ అన్న పుస్తకం రాయడం, దానినో ప్రచురణకర్త స్వీకరించడం… భారతదేశపు స్థితిగతుల గురించీ, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధపు విషయాల గురించీ వ్యాసాలు రాయడం, పుస్తకాలకీ వ్యాసాలకూ ఆదరణ లభించడం, కుటుంబంతో పునఃసంథానం, మరికొన్ని పుస్తకాలు రాయమని ప్రచురణకర్తలు అడగడం, ఇంగ్లండులోని ఉన్నత అధికారులను కలుసుకోవడం, రాణిగారితో ముఖాముఖి– మానసికంగా శారీరకంగా స్వస్థత పొంది తిరిగి భారతదేశానికి తిరిగిరావడం…

భారతదేశానికి తిరిగివచ్చిన కొద్దికాలానికే టైలర్‌కు ఆర్థికంగా రాజకీయంగా ఒడిదుడుకులమయంగా ఉన్న సురపురం సంస్థానానికి నైజాం ప్రభుత్వపు రాజప్రతినిధిగా వెళ్లవలసిన అవసరం వస్తుంది. హైదరాబాద్‌లోని బ్రిటిష్ రెసిడెంట్ కూడా తనమీద నమ్మకముంచి అక్కడికి వెళ్లమని అడిగినపుడు ఆ చిక్కుముడుల సంస్థానానికి వెళ్లడమన్నది ఒక సవాలుగా, ఒక అవకాశంగా తీసుకొని, 1844లో అక్కడికి చేరతాడు మెడోస్ టైలర్.

ఆమధ్యే మరణించిన రాజా, వారసుడిగా ఏడేళ్ల కొడుకు, ఆధిపత్యం కోసం దాయాదుల పోరు, కొడుకు తరఫున సంస్థానాన్ని ఏలసాగిన రాణి ఈశ్వరమ్మ, ఆవిడ నిలకడలేనితనం, దివాళా తీస్తోన్న సంస్థానం, పరిస్థితులను ఒక కొలిక్కి తీసుకువచ్చి టైలర్ ఆ యువరాజుకు పట్టాభిషేకం జరిగేలా చూడటం… ఆ ప్రాంతంలో ప్రబలంగా ఉన్న బేడర్లు అని పిలవబడే బోయదొరల తిరుగుబాటు, తనకు ముప్పయ్యారేళ్ల వయసులోనే భార్య మరణించడం… రాజకుమారుణ్ని తొలగించేయాలన్న దాయాదుల కుట్రలు, నిబద్ధతతో మెడోస్ టైలర్ వాటిని పూర్వపక్షం చెయ్యడం… రోడ్లు వెయ్యటం, నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం, చెట్లు నాటించడం, పాఠశాలలు స్థాపించడం లాంటి విషయాల్లో దృష్టి నిలపడం… పదేళ్లపాటు ఆ సంస్థానంలో ‘భారతదేశపు జీవన వైవిధ్యాల మధ్య ఒక ఇంగ్లీషు మనిషి జీవితం– మనోజ్ఞమైన అనుభూతి.’

నిజాం ప్రభుత్వం బ్రిటిషువారికి దత్తం చేసిన అయిదు జిల్లాల్లో ఒకదానికి పరిపాలకుడిగా నియమిస్తున్నామని హైదరాబాదులోని రెసిడెంటునుంచి కబురు రాగా సురపురం వదిలి హైదరాబాదు చేరతాడు టైలర్. చివరికి నవ్‌దుర్గ్‌లో నియామకం, వేలవేల చిక్కులున్న ఎల్లలు కూడా స్పష్టంగాలేని 15వేల చదరపు మైళ్ల ప్రాంతాన్ని చిన్న పదాతిదళం సహాయంతో పరిపాలించవలసి రావడం; పరిపాలన, న్యాయవిచారణ, నీటి పారుదల, పత్రికారచన, శాంతి పరిరక్షణ, పన్నుల వసూలు, రోడ్ల నిర్మాణం– ఇలా విరామమెరుగని జీవితంతో, రోజుకు పదిహేను గంటలు పనిచేస్తూ, ఆ పనిని ఆస్వాదిస్తూ… అలా మూడేళ్లు… 1856… ఎప్పుడు వచ్చిందో తెలియని నడివయస్సు! 1857నాటి నేపథ్యంలో ఒడిదుడుకులకు గురి అయిన బిరార్ జిల్లాకు బదిలీ. 1858 నాటికి మళ్లా సురపురంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించుకుంటూ అక్కడికి కమిషనర్‌గా బదిలీ…

ఒకప్పటి పసి రాజకుమారుడు 1857కల్లా విచక్షణ లేని దుస్సాహస యువకుడిగా తిరుగుబాటులో భాగస్వామి అవగా, బ్రిటిషువారు అతగాడిని బందీని చేసి మరణశిక్ష అమలుపరచబోతున్న సమయమది. తన చేతులమీద పెరిగిన రాజకుమారుడ్ని ఉరికంబం నుంచి రక్షిద్దామని టైలర్ ప్రయత్నాలు… స్వాభిమాని అయిన రాజకుమారుడు అందుకు అంగీకరించకపోవడం… అయినా రెసిడెంటు ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం… తన మీద తనకే విరక్తి కలిగిన రాజకుమారుని ఆత్మహత్య. ఏడాదీ రెండేళ్లలో చల్లబడిన 1857నాటి ఉద్రిక్తత.

మళ్లా ఇబ్బంది పెడుతోన్న అనారోగ్యం పుణ్యమా అని టైలర్ రెండేళ్ల శెలవు మంజూరు చేయించుకొని 1860లో ఇంగ్లండ్ వెళతాడు. ‘ప్రజలకు ఇంత చేశావుగదా, ప్రతిఫలం ఏం దొరికిందీ?’ అని ఎవరో స్నేహితులు అడిగితే, ‘నా ఆనారోగ్యం పుణ్యమా అని నేను చెయ్యవలసినంత చెయ్యనేలేదు. అయినా శెలవు తర్వాత తిరిగివెళ్లి ప్రజల మధ్య పనిచేస్తూనే చచ్చిపోవాలని నా కోరిక’ అంటాడు మెడోస్ టైలర్! కానీ రెండేళ్ల శెలవు తర్వాత కూడా తన ఆరోగ్యం కుదుటబడకపోవడంతో ‘భగవంతుని నమ్ముకొని ఉద్యోగానికి రాజీనామా’ఇస్తాడు టైలర్. తన అనుభవాలను తార, రాల్ఫ్ డార్నెక్, సీత, ఎ నోబుల్ క్వీన్ అన్న నవలలుగా 1860లు, 70లలో రాస్తాడు. 1874-75లలో ఆరోగ్యం మరింత క్షీణించగా మార్పు కోసం– బహుశా భారతదేశం అంటే ఉన్న మమత వల్ల కూడా కావచ్చు– 1875 సెప్టెంబరులో హైదరాబాదుకు ప్రయాణం కట్టి, అక్కడో అయిదు నెలలు గడిపి, ఇంగ్లండు తిరుగుప్రయాణం ఆరంభిస్తాడు. ఇంగ్లండు చేరే లోపలే 1876 మే నెలలో 68 ఏళ్ల వయసులో మరణిస్తాడు.

తన జీవితానుభవాలను కల్నల్ ఫిలిప్ మెడోస్ టైలర్ తన అక్షరాలలోనే 1874 వరకూ రాసుకొన్నాడు. 1874-76 సమయపు వివరాల చిట్టచివరి అధ్యాయాన్ని అతని కూతురు ఎలీస్ రాసింది. ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ అన్న ఆ ఆత్మకథ 1882లో ప్రచురితమయింది. దానిని జర్నలిస్టు జి. కృష్ణ తెలుగు చేసి 1986లో సురపురం పేరిట ప్రచురించారు. తిరుపతిలోని రాజాచంద్ర ఫౌండేషన్ మళ్లీ 2011లో ప్రచురించారు.

మెడోస్ టైలర్ జీవితమూ సురపురం పుస్తకమూ అనేక విధాలుగా విలక్షణమైనవి.

1757లో ప్లాసీ యుద్ధం (Battle of Plassey) తర్వాత భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ రూపంలో బ్రిటిషువారి పాలన ఆరంభమయింది. మరాఠా దేశం, పంజాబు లాంటి ప్రాంతాల్లో వారి ఆధిపత్యం కొనసాగడానికి మరో యాభై అరవై ఏళ్లు పట్టింది. 1857లో వారి నూరేళ్ల ఆధిపత్యానికి పెనుసవాలు ఎదురయింది. ఆ తర్వాత కానీ వారి సంపూర్ణ సార్వభౌమత్వం స్థిరపడలేదు.

1825-60 నాటి సమయమూ అంటే ఒక సమాంతర రాజకీయ, న్యాయ, విద్యా, పరిపాలనా వ్యవస్థ వేల సంవత్సరాల సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, మత నేపథ్యం గల విశాల ప్రాచ్య భూఖండంలో వేరూని నిలదొక్కుకున్న సమయమన్నమాట. ఆ సమయానికీ ఆయా పరిణామాలకూ ప్రత్యక్ష సాక్షి మెడోస్ టైలర్ ఆత్మకథ సురపురం!

సురపురంలో మొదటగా మనకు రాజా రామ్మోహన్‌రాయ్‌కు సతి నిషేధంలో మద్దతు పలికిన గవర్నర్ జనరల్ లార్డ్ విలియమ్ బెంటిన్క్ (William Bentinck) కనబడతాడు. 1835లో మెడోస్ టైలర్ నీలగిరుల్లో విశ్రాంతి కోసం వెళ్లినపుడు అక్కడే మకాం చేస్తోన్న బెంటిన్క్‌ను కలిసే అవకాశం వస్తుంది. అక్కడే పరిచయమయిన మెకాలే (Thomas Mccaulay) ప్రస్తావన వస్తుంది. బెంటిన్క్ గురించి ‘తనకు అప్పగించిన ప్రభుత్వ వ్యవస్థలో మేధాపటిమను, నీతిని పరివ్యాప్తం చేయడానికి నిరంతర కృషి చేసిన వ్యక్తి.’ అని మెకాలే అనడం కనబడుతుంది. భారతీయులు ఉన్నత నాగరికత కలవారని, వారు ఇంగ్లిష్ వారంతటి వారేననీ 1838లో టైలర్ భావించడం కనిపిస్తుంది.

లార్డ్ వెల్లింగ్‌టన్‌తో మరాఠా యుద్ధం కబుర్లూ, టిప్పు సుల్తాన్ కబుర్లూ చెప్పుకోవడం కనిపిస్తుంది. అలాగే నిజాం దగ్గర మంత్రిగా ఉన్న సూరజ్ ఉల్‌ముల్క్ చనిపోగా అతని మేనల్లుడు సాలార్‌జంగ్ మంత్రి అవడం గురించి తెలుస్తుంది. నిజాం ప్రభుత్వం ఆర్థిక ఒడిదుడుకుల వల్ల కొన్ని జిల్లాలను బ్రిటిషువారికి దత్తం చెయ్యడం, డల్‌హౌసీ ప్రభువు జౌధ్ లాంటి రాజ్యాలను బ్రిటిష్ ప్రభుత్వంలో చేర్చుకున్న వైనం– ఆనాటి అనేక సంఘటనలకు సాక్షీభూతం మెడోస్ టైలర్, అతని జీవిత చరిత్ర. మన దేశ చరిత్రలలో డల్‌హౌసీ ప్రభువు గురించి చిత్రించిన విధానానికి విరుద్ధంగా ‘భారతదేశాన్ని పాలించినవారిలో డల్‌హౌసీ అంతటి ప్రయోజకుడు, విధినిర్వహణా ఆసక్తుడు లేడనే చెప్పాలి. ఏ పథకాన్ని తలపెట్టినా అభ్యుదయకరంగా నిర్వహించేవాడు. భారతదేశంలో నెలకొన్న అన్ని ఆధునిక సౌకర్యాలకూ, ప్రజల అభ్యున్నతికీ అతనే మూలకారకుడు.’ అంటాడు టైలర్.

రచయితగా టైలర్‌లో రెండు పార్శ్వాలు కనిపిస్తాయి: వ్యాసకర్త, నవలాకారుడు. థగ్గులు, భారతీయ విద్యావిధానంలాంటి అనేకానేక విషయాలమీద భారతీయ పత్రికల్లోనూ, ఇంగ్లండ్‌లోని పత్రికల్లోనూ తరచూ రాశారాయన. ఆయన వ్యాసాలు తమ పాఠకులకు నచ్చడంతో టైమ్స్ పత్రిక వారు ఆయన్ను ప్రత్యేక విలేఖరిగా నియమించుకున్నారు. సాలుసరి వరుమానమూ ఏర్పాటుచేశారు.

గ్రంథకర్తగా 1839లో మొదలయిన ఆయన ప్రయాణం పాతికేళ్ళపాటు సాగింది. ఆరోగ్య కారణాలవల్ల 1861లో ఉద్యోగానికి వీడ్కోలుచెప్పినా రచన పట్ల ఆయన అనురక్తి ఏమాత్రం సడలలేదు. వైద్యుల అనుమతితోనే తాను అప్పటికే ఇరవై ఏళ్లనుంచీ మనస్సులో రూపురేఖలు కల్పించుకొంటూ వచ్చిన తార అన్న నవల రాయడానికి పూనుకొన్నారు. మరాఠారాజ్య ప్రాదుర్భావం, వారు ముసల్మానుల మీద దెబ్బదీయడం– అన్న ప్రధాన ఇతివృత్తంతో తార నవల రూపుదిద్దుకొంది. 1869లో అది ప్రచురించబడింది.

అదే ఒరవడిలో మరో మూడు నవలలు రాశారు టైలర్. 1757లో ప్లాసీ యుద్ధంలో గెలుపొందిన బ్రిటిషువాళ్లు క్రమక్రమంగా తమ అధికారాన్ని ఎలా విస్తరించారో ఆ వివరాలను చూపెట్టే నవల రాల్ఫ్ డార్నెల్. 1865లో వెలువడిన ఈ నవల పాఠకుల మెప్పు పొందింది. 1857లో జరిగిన తిరుగుబాటు మూడవ నవల సీత ఇతివృత్తం. ఇది 1874లో ప్రచురితమయింది.

1874-75ల మధ్య అనారోగ్యం బాగా వేధించినా, చాంద్ బీబీ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఎ నోబుల్ క్వీన్ అన్న నవల రాశారు. అలాగే 1871లో ఆయన రాసిన ‘విద్యార్థుల కోసం భారతదేశ చరిత్ర ‘(A student’s manual of the history of India) గ్రంథం వెలువడింది. భారతీయ ప్రజలను గురించి ఎనిమిది సంపుటాల గ్రంథావళి రాశారన్న వివరమూ ఆయన ఆత్మకథలో ఉంది. రాయడమే కాకుండా ‘భారతీయులనూ భారతదేశాన్నీ ఇంగ్లండుకు సన్నిహితం చెయ్యాలి’ అన్న ఉద్దేశ్యంతో ఆయన అనేకచోట్ల ఉపన్యాసాలిచ్చారట. ‘భారతదేశ పురాణ సాహిత్యం’, ‘భారత గ్రామీణ ప్రజలు’, ‘కొందరు భారతీయ ప్రముఖులు’, ‘కొందరు భారతీయ ప్రముఖ మహిళలు’ – ఆయన ఉపన్యాసాల కొన్ని శీర్షికలు! ‘నాకు తెలిసిన ప్రజల గురించే రాశాను. గొప్పవారి గురించి రాస్తే జోబులు నిండేవేమో కాని ఆనందం ఉండేది కాదు కదా’ అంటారాయన.

పరిపాలన, రచన ఆయన అభిమాన విషయాలేగావచ్చు కానీ జీవితంలోని అనేక పార్శ్వాలను తడమటం ద్వారా, అనేక రంగాలలో అడుగుబెట్టి విలక్షణమైన కృషి చెయ్యడం ద్వారా తన జీవితానికి అనితర సాధ్యమనిపించే సార్థకతను సంతరించుకొన్న వ్యక్తి కల్నల్ టైలర్.

చిత్రలేఖనం ఆయన్ని చిన్నవయసులోనే ఆకర్షించి చివరిదాకా అనుసరించింది. 1865లో డబ్లిన్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో భారతీయ విభాగాన్ని నిర్వహించారాయన. ఆయనకు భాషలంటే ప్రేమ ఉంది. హిందుస్థానీ, పర్షియన్, మరాఠీ, తెలుగు, కన్నడ భాషలు నేర్చుకొన్నారు. ఒక భాష నేర్చుకొనేటప్పుడు కష్టపడైనా సరే నుడికారం నేర్చుకొని తీరాలి. సంబోధించే తీరుతెన్నులు విధిగా తెలుసుకోవాలి. పాటించాలి అని ఆయన నియమం.

తన బాధ్యతలలో భాగంగా గ్రామాల్నీ పొలాల్నీ సర్వే చేయవలసిన అవసరం వచ్చినపుడు దాన్నో మొక్కుబడి వ్యవహారంలాగాకుండా ఎంతో ఆసక్తితో చేశారాయన. ఆయన అనుసరించిన పద్ధతులు కాలక్రమేణా ఇతర ప్రాంతాలలో కూడా మార్గనిర్దేశం చేశాయి. అలాగే న్యాయవిచారణ కూడా తన బాధ్యత అయినపుడు నిజాయితీ, నిష్పక్షపాతం, నిక్కచ్చితనం- అన్న లక్షణాలను పరికరాలుగా చేసుకొని ఆ బాధ్యతనూ సమర్థవంతంగా ఆయన నిర్వర్తించారు. ఒక పరిపాలకుడిగా తన ప్రాంతాల్లోని సామాన్యుల జీవితాలను మెరుగుపరచడం కోసం జలవనరుల నిపుణుడి అవతారం ఎత్తి తటాకాల, జలాశయాల రూపకల్పనకు పూనుకొన్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చితనం, నిర్మొహమాటం, నిజాయితీ, నిష్పక్షపాతం ఆయనకు దీపస్థంభాలయినా స్నేహం, సాయంచేసే గుణం, సామాన్యులతో కలసిపోగలగడం ఆయన జీవ లక్షణాలు.

సురపురం చదివితే ఒక అతి సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన వైనం కనిపిస్తుంది. తనమీద తనకు నమ్మకం ఉన్న మనిషి, తనతోనూ పరిసర ప్రపంచంతోనూ సామరస్యం సాధించిన మనిషి– ఎన్ని గొప్ప పనులూ సాహసాలూ చెయ్యగలడో స్పష్టమవుతుంది. కీర్తీ, తన కృషికి సరిపడే జీతభత్యాలూ తనకు అందకపోయినా అలాంటి నిరాశల గురించి యథాలాపంగా, నిర్లిప్తంగా చెప్పే ఒక స్థితప్రజ్ఞత ఆయన జీవనసూత్రం.


ఇంత విశాలమైన జీవితం గడిపిన ఏ మనిషైనా ఆత్మకథ రాసుకొన్నప్పుడు లీలగానైనా ఆత్మస్తుతీ పరనిందా కనిపించడం సహజం. సురపురంలో వాటి ఆచూకీ దొరకదు. రచన నిండా నిజాయితీ ధగధగలాడుతూ కనిపిస్తుంది. రాసింది 1874లోనే అయినా చదివేటపుడు సమకాలీన రచన అనే అనిపిస్తుంది. నిరాడంబరమైన పదాలు, చిన్న చిన్న వాక్యాలు, పేదలు రైతులు స్త్రీలు జమీందార్లు రాజులు– ఇలా వివిధ వర్గాల మీద సమంజసమైన ఆరోగ్యకరమైన ఆలోచనా ధోరణి, జీవితమంటే సమగ్రమైన సమతౌల్య అవగాహన – ఈ భావనకు దోహదం చేస్తాయి. అదే కాలంలో జీవించి వ్యవహరించిన ఏనుగుల వీరాస్వామిగారి కొన్నికొన్ని భావాలతో (స్త్రీలు, నేరస్తులు…) టైలర్ భావాలను సరిపోల్చినపుడు ఈతని ఆలోచనాధోరణిలోని ఆధునికత తెలిసివస్తుంది.

‘విధి నిర్వహణకై కృషిచేసిన వ్యక్తిననే భగవంతుడు నన్ను సంభావించుగాక…’ అంటారాయన తన ఆత్మకథ చివరి వాక్యంలో. ‘భారతదేశం వెళ్ళేవారందరికీ ఒక మాట చెపుతాను. అక్కడివారిని మర్యాదగా చూడండి. వారు ఏ తరగతివారయినా మర్యాద ఇచ్చిపుచ్చుకోండి. గట్టిగా ఉండండి– క్రూరంగా వద్దు. వారి ఆత్మగౌరవాన్ని కించపరచవద్దు.’ అని హితోక్తి చెపుతారు. ‘ఓర్పుతో పట్టుదలతో పనిచేస్తే అన్ని చిక్కులూ తీరతాయి.’ అన్న అతి చిన్న పరిపాలనా సూత్రాన్ని జీవితాంతం నమ్మి విజయవంతంగా అనుసరించారాయన.

నూటఏభై రెండువందల ఏళ్లనాటి భారతదేశపు జనజీవన చిత్రణ. తెలుగు, కన్నడ, మరాఠా గ్రామసీమలతోపాటు బొంబాయి, హైదరాబాదు లాంటి నగరాల భౌగోళిక సాంస్కృతిక వివరాల దర్పణం. ఆనాటి రాజకీయాల సాధికార పరామర్శ. రూపుదిద్దుకొంటోన్న పాలనావ్యవస్థకు అక్షర రూపం. సంస్థానాధీశులూ, జమీందార్లు, నవాబులు, బోయ యోధులు, రౌడీలు, థగ్గులు, అరబ్బు సైనికులు, యూరోపియన్లు, యూరేషియన్లు నడయాడిన రంగస్థలం సురపురం పుస్తకం. బెంటిక్, మెకాలే, వెల్లింగ్టన్, డల్హౌసీ, నిజాం, సాలార్జంగ్, 1857 తిరుగుబాటు – ఇలాంటి అనేకానేక విషయాల ప్రత్యక్ష సాక్షి…

…సురపురం ఒట్టి ఆత్మకథ కాదు!

సురపురం చదవటమంటే ఒక సామాన్యుని అసామాన్య జీవితాన్ని అతడిని తోడుగా చేసుకొని గమనించడమే!
--------------------------------------------------------
రచన: దాసరి అమరేంద్ర, 
ఈమాట సౌజన్యంతో

Sunday, March 10, 2019

విధి నా సారథి: పొత్తూరి వేంకటేశ్వరరావు ఆత్మకథ


విధి నా సారథి: పొత్తూరి వేంకటేశ్వరరావు ఆత్మకథ




సాహితీమిత్రులారా!


– చిన్న పత్రికలో చిన్న ఉద్యోగంతో మొదలై, దాదాపు తెలుగులో వెలువడే ప్రధాన పత్రికలన్నింటికీ సంపాదకుడుగా
– నక్సలైట్లకూ, ప్రభుత్వానికీ మధ్య చర్చల్లో అనుసంధానకర్తగా
– టి.టి.డి. వ్యవహారాలపై అధ్యయనం చేసే కమిటీ సభ్యునిగా
– ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సభ్యునిగా


ఎమెస్కో బుక్స్, రూ. 175
ఇలా ఒకదానికొకటి సంబంధం లేని రంగాలు. సంపాదకులుగా వారు సంతరించుకున్న వ్యక్తిత్వమే వారిని అంత సుదీర్ఘకాలంపాటు, రాజకీయాలతో సంబంధం లేకుండా, విభిన్న స్వభావాలు కలిగిన వ్యక్తులందరిలోనూ విశ్వసనీయత కలిగించి ఉంటుంది. అసలు సంపాదకుడు కావడానికి వారికున్న అర్హతలేవి? డిగ్రీ ఫెయిల్. పోనీ ఎవరైనా గురువువద్ద సంప్రదాయబద్ధంగా కుదురుగా విద్యనభ్యసించిన దాఖలాలు లేవు. అలాంటి వ్యక్తి అసలు జర్నలిస్టు కావడమే గొప్ప. ఇక సంపాదకుడుగా, అదీ అన్ని ప్రధాన పత్రికలకూ!

“తక్కిన వాటికంటే కూడా జీవితానికి సన్నిహితమైంది జర్నలిజం. తక్కిన వారికంటే జర్నలిస్టు, జీవితంతో మరింతగా సంబంధం పెట్టుకోవాలి. మరింతగా దానినుంచి పాఠాలు నేర్చుకోవాలి. రెండుతరాల క్రితంవరకు బ్రిటిష్ జర్నలిజంలో ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల పట్టభద్రులకు స్థానం లభించేదికాదు. ఈ పెద్దచదువులు చదివినవారికి పుస్తకాలతో ఉన్నంత పరిచయం బ్రతుకుతో ఉండదని, వారు నిత్యజీవిత సమస్యలు, వాటి పరిణామాలు సరిగా అర్థం చేసుకోలేరని, తమ పాండిత్య ప్రదర్శనకు వారు అనవసర ప్రయత్నం చేస్తారని, సామాన్య పాఠకులకు అర్థంకాని పదజాలాన్ని వాడతారని, వారిని జర్నలిజంలోకి అడుగు పెట్టనిచ్చేవారు కాదు.“- ఇదీ తెలుగుకు సంబంధించి జర్నలిస్ట్ పితామహుడుగా ఎన్నదగ్గ నార్ల వేంకటేశ్వరరావుగారి అభిప్రాయం. ఈ దృష్ట్యా చూస్తే జర్నలిజం వృత్తికి పెద్దపెద్ద డిగ్రీలు, విస్తార పాండితి అర్హతలు కాదుగదా, ఒకవిధంగా అవి గుదిబండలే.

నేను ఒక పది దాకా స్వీయచరిత్రలు చదివాను.(అక్కిరాజు రమాపతిరావు మూడువందలదాకా చదివారట!) కానీ ఒక పత్రికా సంపాదకుడి స్వీయచరిత్ర చదవడం ఇదే ప్రథమం. తెలుగు సంపాదకులెవరైనా స్వీయచరిత్ర వ్రాసుకున్నారో, లేదో గూడ నాకు తెలియదు. స్వీయచరిత్ర చదివించాలి, చదివించే జీవశక్తి దానికి ఉండాలి. డైరీని ఎత్తి ముద్రించిన చందంగా ఉంటే, పత్రికల్లో వచ్చే ప్రకటనలకుండే విలువే దానికి. అలా చదివించాలంటే, ఆ ‘స్వీయం’ మరుగునపడి ‘చరిత్ర’ బయటకు పొంగాలి, పెరుగును చిలికితే వచ్చే వెన్న చందంగా. అలాటివాటిలో నేను చదివినవాటిలో అత్యుత్తమమైనది హంపీ నుంచి హరప్పా దాకా. ఎంత విస్తృతి! ఎంత విషయం! తిరుమల రామచంద్రుడు ఎక్కడా కనిపించడే!

నాటక రచయితలు తమ నాటకారంభంలో చేసే నాందీ ప్రస్తావనల ద్వారానే నాటక కథను చూచాయగా ప్రకటిస్తారట. విధి నా సారథి అన్న పేరుతోనే పొత్తురు వేంకటేశ్వరరావు స్వీయచరిత్ర, పుస్తకం తెరువకుండానే పాఠకులకు సూచనప్రాయంగా అవగతమవుతుంది. వారు ఎంత సాధారణంగా ఉంటారో నాకు స్వానుభవం. ఈ పుస్తకం చదివాక, ఇంతమంది హేమాహేమీలతో (మర్రి చెన్నారెడ్డి, ఎన్.టి. రామారావు, కోట్ల విజయభాస్కర రెడ్డి, రామోజీరావు, రామనాథ్ గోయెంకా లాంటి ఎందరో!) సన్నిహితంగా మెలిగిన వ్యక్తి ఎదురుగా ఒక అరగంటకు పైగా కూర్చుని (ఒకమారు కాదు, రెండుమార్లు.) మాట్లాడాను, అనే స్మరణే అతిశయాన్ని కలిగిస్తూ ఉంది. ‘విజయనగర్ కాలనీలో హర్షద్ అయుబ్ క్రికెట్ అకాడమీ నుంచి కొంత ముందుకు వచ్చాక ఫలానా నంబరు(గుర్తులేదు) గల పాత ఫియట్ కారు స్థిరంగా ఉంటుందండీ. అదే మాయిల్లు. మేడపైన నేను ఉంటాను.’ అని వారు ఫోన్లో చెప్పిన అడ్రస్ ఇప్పటికీ గుర్తే. ఇది 2002లో. ఆ ఫియట్ కారే అనుకుంటా వారు గోయెంకాల నుంచి కొన్నదీ, ఈ గ్రంథంలో ప్రస్తావించబడ్డదీ.

స్వీయచరిత్ర రచనకు వారిని ప్రేరేపించిన కారణాలను ప్రారంభంలోనే ఇలా చెప్పుకున్నారు.

మంచీ చెడూ, నాకు ఇష్టమైనవీ, ఇష్టం కానివీ చాలా జరిగాయి. వాటిలో నాపాత్ర ఎంత?
నేను చేసిన పొరపాట్లు, తప్పులు ఇతరులు చేయకుండా జాగ్రత్తపడమని చెప్పడం. నేను చేసినవేగాదు, ఇతరులు నా విషయంలో ఏ దురుద్దేశం లేకుండానే చేసిన పొరపాట్లు సైతం ఉన్నాయి.
జీవితంలో కొందరికి నేను చాలా ఋణపడి ఉన్నాను. అది చెప్పవలసిన అవసరం ఉంది.
సమకాలీన చరిత్రకు సంబంధించి నాకు తెలిసిన కొన్ని సత్యాలను గ్రంథస్థం చేయడం భవిష్యత్ తరాలకు మంచిదనే భావన.
ఇందులో ఒకటవ, మూడవ అంశాలు వారి వ్యక్తిగతం. అవి పాఠకునికి ఆసక్తికరంగా ఉండవచ్చూ ఉండకపోవచ్చూ. కానీ రెండవ అంశం, జర్నలిజంలోనే గాదు, మరి ఏ ఇతర రంగంలోనైనా ఎదగగోరేవారికి, ఇందులో అనుభవాలు కాగడాల్లా పనిచేస్తాయనడంలో ఏలాంటి అనుమానం లేదు. ఇక నాల్గవ అంశం చారిత్రికం. అలాంటివాటిని గ్రంథస్థం చేయకపోతే, భావితరాలకు అమూల్యమైన సమాచారం తెలియకుండా పోతుంది. ఆ విషయంలో పొత్తూరి చాలా నిష్కర్షగా, శషభిషలు లేకుండా భావితరాలకు వాస్తవాలను అందించడంలో కృతకృత్యులయ్యారు.

యౌవనంలో నాస్తికులుగా వారు చెప్పుకున్నారు. తరువాత అమ్మ ఒడి చేరినా, తమ హేతువాద దృక్పథం నుంచి ప్రక్కకు జరగలేదు.

-‘బ్రాహ్మణులు శాకాహారులు గనుక వారు స్వయంగా జంతువును ఇవ్వకపోయినా (బలి), జంతువును కొనడానికి డబ్బులు ఇవ్వడం, బలిని ప్రోత్సహించడం నాకు విడ్డూరంగా, తమనుతాము వంచించుకోవడంగా అనిపించింది.‘
-‘భర్త పోయిన స్త్రీలను వితంతువులుగా చేసే విధానం నాకు ఏహ్యభావాన్ని కలిగించింది.‘
-‘సమానావకాశాలని రాజ్యాంగంలో వ్రాసుకున్న ఎంతోకాలానిగ్గూడా పేదవర్గాల పిల్లలు ఇతర వర్గాలవారితో సమాన స్థాయికి కాకపోయినా దరిదాపులకు గూడ చేరలేకపోవడం గురించి నేను పెద్దయ్యాక తెలిసింది.‘

ఇలాంటి ఆలోచనలు ఏదో చప్పట్లకోసం చెప్పినట్లనిపించదు, వారు నిజంగానే తమ అంతరంగంలో అలాంటి ఆవేదన అనుభవించారనిపిస్తుంది.

ఒక పత్రిక సంపాదకుడికుండాల్సిన విశాలదృష్టి, నిష్పాక్షికత వారిలో పుష్కలంగా ఉండబట్టే, అన్ని ప్రధాన పత్రికల సారథ్య బాధ్యతలు సమర్థంగా నిర్వహించడం సాధ్యమయ్యుంటుంది. హేతువాద దృక్పథానికి అమ్మ ఒడి కూడ తోడవ్వడంతో, జీవితానికి సంబంధించి ఒక వాస్తవమైన అవగాహన వారికి ఏర్పడిందని చెప్పుకున్నారు. జీవితాన్ని పరిశీలించే దృష్టి నిశితమైంది. కాబట్టే ‘విజ్ఞానశాస్త్ర విజయాలను చూడడం, వాటివల్ల కలిగిన భౌతిక సుఖాలను అనుభవించడం వేరు, వాటిని అనుభవిస్తూ ఆనందంగా జీవించడం వేరు. చల్లని ఎయిర్ కండిషన్డ్ గదిలో ఉన్నవారు ఆనందంగా ఉంటారన్న పూచీ లేదు. ఇతరత్రా కష్టాలు కలిగితే శీతల సౌకర్యం సుఖాన్నీ ఆనందాన్నీ ఇవ్వలేదు.’ లాంటి నగ్న సత్యాలను చెప్పగలిగారు. హంద్రీ-నీవా ఒక విఫల పథకం అని నిష్కర్షగా భావిని ఆవిష్కరించారు. ‘నా మహా వైఫల్యాలలో ఒకటిగా ఈ స్వీయ చరిత్రలో వ్రాసుకోవడానికి శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పాలకమండలిలో నా సభ్యత్వం ఉపయోగపడింది.’ అని ఎంతో వినమ్రంగా తమ వైఫల్యం చాటుకుంటున్నా, దాని వెనుక వ్యవస్థకు పట్టిన తుప్పు గూర్చిన ఆవేదన నిశిత దృష్టికి గోచరం కాకపోదు.

ఏదో ఒకరంగంలో అత్యున్నత శిఖరాలకు చేరినవారందరూ ఉత్తమ సంస్కారులు, ఉన్నత వ్యక్తిత్వం కలవారూ కానక్కరలేదు. అప్పటి పరిస్థితులు, కలిసొచ్చిన అదృష్టం కూడా వారినా స్థాయికి చేర్చుండొచ్చు. అలాంటివారు తమ గురించి చెప్పుకునేప్పుడు వారిలో నిజాయితీలేమి బయటపడుతూనే ఉంటుంది. వైఫల్యాలకు ఇతరులను బాధ్యులను చేయడం, లోపాలను కప్పిపుచ్చుకోవడం జరుగుతూంటుంది. కానీ పొత్తురివారా స్థాయికి దిగే ప్రయత్నం ఎక్కడా చేయకపోవడం వారి ఉన్నత స్థాయినేగాక, ఉన్నత వ్యక్తిత్వాన్నీ తెలుపుతుంది. అమ్మను చేరిన తరువాత స్త్రీ విషయంలో తమ దృష్టిలో వచ్చిన మార్పును వారు వెల్లడించిన తీరు అద్భుతం.

-‘లైంగిక సంబంధమైన ఆలోచనలు చాలా చిన్న వయసునుంచే ఉన్నాయి. తప్పు చేయకూడదని కాదుగానీ, చేసే ధైర్యం లేకపోయిందనడం సత్యం. నికరంగా చెప్పాలంటే తప్పు చేశాను.’ ‘సెక్స్ పత్రికలు రహస్యంగా చదివేవాడిని. స్త్రీలను సెక్స్ దృష్టితో చూడడం మొదలైంది.‘
-‘తనకు కీర్తికాంక్ష లేదనీ, డబ్బుమీద వ్యామోహం లేదనీ, పరస్త్రీని కన్నెత్తి చూడననీ చెప్పేవారిలో ఎంతమంది నిజం చెబుతున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. స్త్రీని శృంగార దృష్టితోగాక మాతృమూర్తిగా చూసే ఉత్తమ సంస్కారం అలవడడం సులభం కాదు.‘
-‘కట్నం తీసుకోగూడదని అనుకునేవాడిని. కానీ వారు ఇచ్చారు, మేము తీసికున్నాము. వారు ఇచ్చిన ఆరువేల రూపాయలు గాక, మేము మరో వెయ్యో, రెండువేలో అప్పు చేశాము కూడా.‘

ఇవన్నీ వారి నిజాయితీకీ, క్రమంగా పరిణతి చెందిన వ్యక్తిత్వానికీ దృష్టాంతాలే.

మామూలుగా చూస్తే పొత్తూరివారు చాలా లౌక్యులు, వ్యవహారజ్ఞాని అనిపిస్తుంది. అది నిజమే అయినా, వారి వృత్తివ్యాపకాలవరకే సుమా! వారి వ్యక్తిగత వ్యవహారాల్లో వారు చాలా అమాయకులనే విశదమవుతుంది. కాని పక్షంలో పంజాగుట్ట వంటి అతి విలువైన ప్రాంతంలో అత్యంత విలువైన స్థలాన్ని అంత అమాయకంగా పోగొట్టుకుంటారా! అదీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు, ఐ.ఏ.ఎస్., ఐ.పీ.ఎస్. అధికారులెంతమందో సన్నిహితంగా ఉండి, తాము స్వయంగా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులై ఉండీ. పరపతిని వ్యక్తిగతంగా వాడుకోరాదనే వారి నిబద్ధతకు, వారు భరించిన ఆ నష్టమే నిదర్శనం. ఒక జిల్లా కేంద్రంలో స్టింగర్లుగా పనిచేస్తున్నవారు సాగించుకొనే పైరవీలు చూస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది, మరి వారి స్థాయికది ఓ లెక్కా! వారి నిబద్ధత అంత గొప్పది. వారి నిజాయితీ నిబద్ధతలకు తిరుగులేని సాక్ష్యం, ఐ.ఏ.ఎస్. అధికారి ఎస్.ఆర్. శంకరన్ తామేర్పాటు చేసుకున్న కమిటీ ఆఫ్ కన్సర్న్‌డ్ సిటిజన్స్‌లో వీరికి ప్రవేశం కల్పించడం. శంకరన్‌గారి నీతీనిజాయితీలను గురించి, నిబద్ధత గురించీ అనుమానాలెవరికీ ఉండవు.


ప్రభుత్వానికీ, నక్సలైట్లకూ మధ్య చర్చల గురించి వ్రాసిన విషయంలో భావితరానికి ఉపయోగపడే సమాచారం చాలా ఉంది. ప్రజాహక్కుల ఉద్యమకారులకా బాధ్యత తప్పదు, ఫర్వాలేదు గూడా, వాళ్ళకు వాళ్ళకు మధ్య కొన్ని రహస్య అవగాహనలు ఉంటాయి గనుక. కానీ ఎటూ మొగ్గుచూపని ఒక సంపాదకుని హోదాలో వేంకటేశ్వరరావు చాలా రిస్క్ తీసుకున్నారనిపించింది. అసలిలాంటి విషయాల్లో రాజకీయ ప్రయోజనాలకూ, బ్యూరోక్రాట్ల వ్యూహాలకూ మధ్య ఉండే విరుద్ధ ప్రయోజనాలు బాగా అర్థమవుతాయి. అవును మరి. సమస్య దీర్ఘకాలికం, దాన్ని ఎదుర్కొనే వ్యవస్థా దీర్ఘకాలికమే. రాజకీయాలు, రాజకీయ నేతలు తాత్కాలికం. చర్చల ఫలితం ఎలాగున్నా, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన పొత్తూరి ఈ విషయంలో చూపిన చొరవ, తెగువ ప్రశంసనీయాలు.

ఇక, ఒక నాన్ బిలీవర్‌గా ప్రారంభమైన వీరి జీవితంలో, అమ్మపై భక్తితో ఆధ్యాత్మిక తేజం ప్రజ్వరిల్లి సన్యాసాశ్రమం దాకా నడిపించిన విధానం చలం, నండూరి రామ్మోహన్ రావు జీవితాల్లో గూడా కనిపించిన యూ-టర్న్ వంటిదే.

‘ఇవన్నీ ఎప్పటినుంచో చేస్తున్నారు, మనమూ చేద్దామని చాలామంది చేస్తుంటారు. దేవుడు సర్వత్రా ఉన్నాడంటూనే ఒకవైపు తిరిగి చేసే ప్రార్థనలూ, ఒకరి మతాన్ని ఒకరు హేళనచేసే విధానం, మతం పేరుతో జరిగే మారణకాండ… కాస్త సేపటికి తగలేయడమో, పూడ్చడమో చేసే శవానికి స్నానాలూ, అలంకరణలేమిటి? చనిపోయిన మనిషి నోటిలో బియ్యం పోసి దారిబత్తెమనడమేమిటి?’ ఇలాంటి ఆలోచనలు హేతువాదమార్గంలో వారి పరిణతిని, సంప్రదాయాల ఔచిత్యాన్ని వారు నిర్భయంగా ప్రశ్నించడాన్నీ ఆవిష్కరిస్తాయి. అయితే మరోమారు ‘శ్రీ వేంకటేశ్వరస్వామి తన కిరీటాలను, తను ఒకప్పుడు ధరించిన, ఇప్పుడు ధరిస్తున్న అన్ని ఆభరణాలనూ తాకి చూసే మహదవకాశాన్ని నాకు కలిగించాడు, నా జీవితంలో ఇదొక గొప్ప అనుభవం. అది స్వామి వైభవ స్పర్శ.’ అనడం పై పరిణతికి విరుద్ధంగా అనిపిస్తాయి. మర్రి చెన్నారెడ్డి వ్యక్తిగత బలహీనతల గురించి ఆయన్నే నేరుగా ప్రశ్నించడం, వై.ఎస్. రాజశేఖర రెడ్డిని వ్రేలు చూపిస్తూ మాట్లాడడం (వారి నేపథ్యం తెలిసికూడా), ఎన్.టి. రామారావు అహంభావం తెలిసీ ఆయన పథకాలను ఆయనెదుటే విమర్శించడం లాంటి సంఘటనలు అమాయకంగా, మెత్తగా కనిపించే వేంకటేశ్వరరావులో నిగూఢంగా ఉన్న ధీరగంభీరత్వాన్నీ, నిర్భీతినీ తెలియజేస్తాయి; మహాభారతంలోని ‘ధర్మరాజు మెత్తని పులి’ అన్న మాటను తలపింపజేస్తాయి.

– స్వాతంత్రసమర త్యాగాలను గానీ, ఆదర్శాలను గానీ శాసనసభల సభ్యత్వాలకు కాంగ్రెస్ పార్టీ యోగ్యతగా గుర్తించేకాలం అప్పటికే పోయింది. (1950-54 మధ్యకే)
– త్యాగధనులకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేకపోవడం అప్పటికే మొదలైంది. (అధరాపురపు శేషగిరిరావుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడం గురించి ప్రస్తావిస్తూ)
– పి.వి. నరసింహారావుగారు, వి.బి. రాజుగారు పొరబాటున కూడ సంజయ్ గాంధీని పొగడలేదు. అదీ వారి వ్యక్తిత్వం.

ఇలాంటి వ్యాఖ్యలు చేయాలంటే, అదీ తనకు సన్నిహితంగా ఉండే చాలామంది నాయకులకివి రుచించవని తెలిసీ, చాలా ధైర్యం కావాలి. కొంతమందికి మ్రింగుడుపడకపోవచ్చుగానీ, హిందూయిజాన్నీ, దాన్ని విమర్శించేవారినీ కూడా కలిపి వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆసక్తిదాయకం.

– ఎన్ని యుగాలు గడిచినప్పటికీ దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న అలాగే నిలిచి ఉంటుంది. ఇది సమాధానం సాధ్యం కాని ప్రశ్న.
– వేదంలో లేని కులం అనే భావన మనువు మూలాన వైదిక సమాజాన్ని చీలికలు పేలికలు చేసింది.
– దేవుడు లేడని నమ్మేవారిలో కొందరు సైంటిఫిక్ ప్రూఫ్ లేదనే వాదనతో హోమియో వైద్యం మూఢ విశ్వాసం అంటారు. యోగాభ్యాసాన్ని వ్యతిరేకిస్తారు.
– ఆర్గనైజ్డ్ మతాలు కొన్నింటిపై ఎవరూ బహిరంగ విమర్శలు చేయరు. చంపుతారనే భయం వల్ల నోరెత్తరు. ఎంత తిట్టినా ఎవరూ ఏమీ అనరనే భరోసావల్ల వైదిక మతాన్ని తిట్టేవాళ్ళు ఎక్కువ. వైదిక మతానికి ఆధిపత్య వ్యవస్థ లేదు, వ్యక్తులు లేరు. పీఠాధిపతులలో ఒకరంటే ఒకరికి పడదు.

ఈ గ్రంథం నిండా ఇలాంటి అపూర్వ విశేష విషయాలెన్నో! పి.వి. నరసింహారావుతో అనుబంధం, మొరార్జీ దేశాయితో రష్యా పర్యటన, ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ సభ్యునిగా వారి అనుభవాలూ… ఇలాంటివి లెక్కకుమించి. అయితే కొన్ని డామేజింగ్ సంఘటనల్లో సంబంధిత వ్యక్తుల పేర్లను గుంభనంగా ఉంచడం కొంత నిరాశకు గురిచేసినా, దాని వెనుక ఉన్న ఉదారభావన గూడ చాలా గొప్పదే అనిపిస్తుంది. ‘పీఠాధిపతుల సమావేశానికి గూడ పార్టీ అధినేత్రి (ఇందిరాగాంధీ కాదు) అనుమతి కావలసిందేనని అనుభవరీత్యా తెలిసిన రహస్యం’ అనడంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దివాలాకోరుతనం; ‘రహదారిలో ప్రమాదం జరిగితే ఆగి సహాయం చేద్దామనుకునే పుణ్యాత్ములు తగ్గిపోతున్నారు. ఎవరి తొందర వాడిది. మనుషుల మధ్య ప్రేమలు తగ్గాయి. కుటుంబ వ్యవస్థ మరింత బలహీనపడింది.’ అనడంలో సామాజిక పరమైన ఆవేదన స్పష్టంగా కనిపిస్తాయి. ఆంధ్ర, తెలంగాణా సమస్యలో తెలంగాణావాదనే న్యాయం అని చెప్పడం కూడా సాహసమే. ఇక వారి జీవితంతోబాటు తెలుగు పత్రికారంగ క్రమ ఉత్థానమూ ఇందులో నిబిడీకృతమై ఉంది. ఈ వ్యాసంలో దాన్ని ప్రస్తావించకపోవడం అందుకే.

తెలుగు పత్రికల డిజిటైజషన్ ప్రక్రియ వేంకటేశ్వరరావు కృషినీ, కీర్తినీ తెలుగు జాతితో నిత్యం సజీవంగా ఉంచుతుంది. ఎవర్నో మెప్పించడానికో, లేక మరెవర్నో నొప్పించకూడదనో కాకుండా తాము నమ్మింది, అనుభవించింది నిర్భయంగా ప్రకటించిన మనీషి పొత్తూరి వేంకటేశ్వరరావు.
----------------------------------------------------------
రచన: ఇంద్రకంటి వేంకటేశ్వర్లు, 
ఈమాట సౌజన్యంతో

Sunday, July 1, 2018

గ్రంథ పరిచయం: శ్రీవిజయుని కవిరాజమార్గం


గ్రంథ పరిచయం: శ్రీవిజయుని కవిరాజమార్గం



సాహితీమిత్రులారా!


రాష్ట్రకూట రాజవంశానికి చెందిన అమోఘవర్ష నృపతుంగ చక్రవర్తి పరిపాలించిన కాలంలో (క్రీ. శ. 814-877) వెలువడిన అలంకారశాస్త్రం కవిరాజమార్గం. ఇది కన్నడంలో లభ్యమైన మొట్టమొదటి గ్రంథం కావడం విశేషం. 1898లో కె. బి. పాఠక్ అనే పండితుడు మొదటిసారి ప్రచురించిన నాటినుండి కవిరాజమార్గం అనేక దేశవిదేశీయుల దృష్టినాకర్షించింది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

సంస్కృత కావ్యశాస్త్రాలలో అత్యంత ప్రాచుర్యం పొందింది కావ్యాదర్శం. క్రీ. శ. 6-7 శతాబ్దాలకు చెందిన దండి రాసిన ఈ అలంకారగ్రంథాన్ని ఆధారంగా చేసుకొని నృపతుంగ ఆస్థానకవి శ్రీవిజయుడు కవిరాజమార్గాన్ని రచించాడు. ఈ గ్రంథానికి మరో ఆధారం భామహుని కావ్యాలంకారం (క్రీ. శ. 6-7 శతాబ్దాలకు చెందింది). కవిరాజమార్గం అచ్చయి వంద ఏళ్ళు దాటినా ఆ గ్రంథానికి చెందిన అనేక ప్రశ్నలు అలాగే మిగిలి ఉన్నాయి. రాజకవి అయిన నృపతుంగుడే దాన్ని రచించాడని కొందరు భావిస్తే, ‘నృపతుంగుడి అనుమతితో ఇది రచితమైందని’ గ్రంథంలోనే ఉన్న ఆధారాన్ని బట్టి దీన్ని శ్రీవిజయుడనే కవి రాసి కవిరాజయిన నృపతుంగుని మార్గాన్ని లోకంలో ప్రచారం చేశాడని చాలామంది పండితులు అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనా భారతీయ భాషలలోనే కాక ప్రపంచ భాషల్లోనే కవిరాజమార్గం ఒక విశిష్ట శాస్త్ర గ్రంథమని చెప్పడానికి ఆస్కారం ఉంది. భారతీయ అలంకారశాస్త్ర సంప్రదాయాన్ని స్థానిక భాషలో పరిచయం చెయ్యడానికి పూనుకొని, తన భాష, సంస్కృతి, కావ్యసంప్రదాయం, జనుల రీతి నీతుల్ని చేర్చి తీర్చిదిద్దిన ఘనత శ్రీవిజయునిది. తమిళంలో తొల్కాప్పియమ్ ఇలాంటి గ్రంథమే. కానీ, అది తమిళాన్నే దృష్టిలో ఉంచుకొని రాసిన వ్యాకరణం. కొంతవరకూ ఇతర శాస్త్రాలకు సంబంధించిన విషయాలున్నా కవిరాజమార్గానికి ఉన్న వైవిధ్యం అందులో లేదు. కన్నడ గ్రంథానికున్న వైశిష్ట్యం ఏమిటంటే దాన్ని రచించిన కవికి భారతీయ అలంకార శాస్త్ర సంప్రదాయం మీద గౌరవం ఉంది. కన్నడ భాషా సంస్కృతుల మీద అపారమైన అభిమానం ఉంది. ఇలాంటి సామరస్యాన్ని సాధించడంలోనే ఈ గ్రంథం ప్రత్యేక గుణం వ్యక్తమవుతుంది.

ఈ రచనలో మొత్తం 536 పద్యాలున్నాయి. చాలా వరకూ కందపద్యాలే. శాస్త్రగ్రంథాలకు కందపద్యాన్ని వాడే అలవాటు తెలుగు వారికీ ఉండడం విశేషం. హితంగా, మితంగా చెప్పడానికి కందపద్యం అనువైనదని ఈ రెండు భాషలవాళ్లు భావించారు. అంతేకాదు, ఈ రెండు భాషల వారికీ సమానంగా ఉండే కొన్ని కావ్యపీఠికా సంప్రదాయాలు కవిరాజమార్గంతోనే ప్రారంభమయ్యాయి. కావ్యాన్ని శ్రీకారంతో ప్రారంభించడం; అందులోనూ నాంది పద్యంలాగా మొదటి పద్యాన్ని ఆశీర్నమస్క్రియలతో రచించడం; దేవతాస్తుతి, పూర్వకవి స్తుతి, సత్కవి ప్రశంస, కుకవినింద మొదలైనవన్నీ ఈ గ్రంథంతోనే ప్రారంభమయ్యాయి. ఈ గ్రంథంలోని కొన్ని ఆధారాలను బట్టి శ్రీవిజయుడు జైనుడని భావించవచ్చు. తెలుగులో జైనుడైన రేచన కవిజనాశ్రయము అనే పేరుతో ఛందోగ్రంథాన్ని రాయడానికి కవిరాజమార్గం ప్రేరణ ఇచ్చిందేమో అని ఒక ఊహ.

శ్రీవిజయుని గ్రంథంలో మొదటి పరిచ్ఛేదం అనేక విధాల ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ భాగంలోని విషయాలు రచయితలకుండే కొన్ని స్పష్టమైన అభిప్రాయాలను విశదపరుస్తున్నాయి. కన్నడనాడు, కన్నడనుడి, కన్నడ సంస్కృతి మొదలైన విషయాలను గురించి తొమ్మిదవ శతాబ్దిలోనే ఇంత స్పష్టంగా చెప్పడం ఈ గ్రంథంలో విశేషం. మొదటి పరిచ్ఛేదంలోని కొన్ని విశేషాలు మాత్రమే ఈ పరిచయంలో ప్రస్తావిస్తాను. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

కావ్యాలలో గద్యకావ్యాలు, పద్యకావ్యాలు, గద్యపద్యాలు రెండూ ఉండే కావ్యాలు ఉన్నాయి. గద్యపద్యాలున్నవి చంపూ కావ్యాలని దండి చెప్పాడు. కానీ, కన్నడంలో అలాంటి వాటిని ‘గద్యకథ’ అంటారని శ్రీవిజయుడు చెప్పడం విశేషం.

మిగె కన్నడగబ్బంగళొ
ళగణిత గుణ గద్య పద్య సమ్మిశ్రితమం
నిగదిసువర్ గద్యకథా
ప్రగీతియిం తచ్చిరంతనాచార్యర్కళ్ (1-27)

(కన్నడ కావ్యాలలో లెక్కకు మీరిన గుణాలతో కూడిన గద్యపద్యాల సమ్మిశ్రితమైన దాన్ని ప్రాచీనాచార్యులు గద్యకథ అన్న పేరుతో పిలుస్తారు.)

తొమ్మిదవ శతాబ్దికి ముందే కొంతమంది గద్యకవులున్నారని శ్రీవిజయుడు ఒక పట్టిక ఇచ్చాడు.

విమళోదయ నాగార్జున
సమేత జయబంధు దుర్వినీతాదిగళీ
క్రమదొళ్ నెగళ్చె గద్యా
శ్రమ పద గురుతా ప్రతీతియం కైకొండర్ (1-29)

(విమళోదయ, నాగార్జున, జయబంధు, దుర్వినీతాduలు ఈ క్రమంలో ప్రకాశించి గద్యాశ్రమ పదగురుతా ప్రతీతిని సంపాదించారు.)

వాళ్ళు సంస్కృత కవులా, ప్రాకృత కవులా, లేక కన్నడ కవులా అన్నది మాత్రం స్పష్టం కావడం లేదు. విమళోదయ, నాగార్జున, జయబంధు, దుర్వినీతాదులు కన్నడ కవులేనని కన్నడ పండితులు భావిస్తున్నారు. శ్రీవిజయుడు పేర్కొన్న ఈ కవులు కన్నడ గద్య కవులు కాకున్నా మరో పట్టిక (1-32) మాత్రం కన్నడ కవులదే అని ఒప్పుకోక తప్పదు.

పరమ శ్రీవిజయ కవీ
శ్వర, పండిత చంద్ర, లోకపాలాదిగళా
నిరతిశయ వస్తు విస్తర
విరచనె లక్ష్యం తదాద్య కావ్యక్కెందుం (1-32)

(పరమశ్రీ విజయ కవీశ్వర, పండిత చంద్ర, లోకపాలాదులు గొప్పవైన వస్తువిస్తర రచనలకు లక్ష్యాలను ఆద్యకావ్యానికి సమకూర్చారు.)

తొమ్మిదవ శతాబ్దికి ముందే కన్నడంలో కవులు, కావ్యాలు ఉండడమే కాకుండా చత్తాణ, బెదండె వంటి దేశి సాహిత్య ప్రక్రియలున్నాయని కూడా శ్రీవిజయుడు చెప్పాడు

నుడిగెల్లం సల్లద క
న్నడదొళ్ చత్తాణముం బెదండెయుమెందీ
గడిన నెగళ్తెయ కబ్బదొ
ళొడంబడం మాడిదర్ పురాతనకవిగళ్ (1-33)

(ఇతర భాషల కంటే వేరైన కన్నడంలో చత్తాణ, బెదండెవంటి ప్రసిద్ధ కావ్యాలు ఒనగూడేట్లుగా పురాతన కవులు రచించారు.)

కందమమళిన వృత్తము
మొందొందెఁ‌డెగొందు జాతి జాణెసెయె బెడం-
గొందివఱొళమరె పేళల్
సుందరరూపిం బెదండెగబ్బమదక్కుం (1-34)

(కందం, అమలిన వృత్తం ఒక్కొక్కటి వాటి మధ్య జాతి పద్యం చక్కగా చేరగా అందంగా అమర్చి చెప్తే సుందరరూపంగల బెదండె కావ్యమవుతుంది.)

కందంగళ్ పలవాగిరె
సుందర వృత్తంగళక్కరం చౌపది మ-
త్తం దల్ గీతికె తివదిగ
ళందంబెత్తెసెయె పేళ్వొడదు చత్తాణం (1-35)

(పలు కందపద్యాలు, సుందరవృత్తాలు అక్కర, చౌపది ఇంకా గీతికె త్రిపది అందంగా చేర్చి చెబితే అది చత్తాణం.)

కందం, వృత్తాలు జాతులు కలసిన అందమైన ప్రక్రియ బెదండె. ఇది ‘వైదండికా’ శబ్దభవం కావచ్చు. ఈ కావ్య పఠనానికి వైదండికా అనే వాద్యం నేపథ్య సంగీతాన్ని సమకూర్చేదేమో. చత్తాణ అనే ప్రక్రియలో కందపద్యాలు ఎక్కువగా సుందర వృత్తాలు, చౌపది, గీతికె, తివది (త్రిపది) ఉంటాయని రచయిత చెప్పాడు.

ఏ గ్రంథంలోనూ లేని విధంగా ఒక ప్రాంతానికి స్పష్టమైన ఎల్లలు నిర్దేశించి, అచ్చగన్నడనాడును– అంటే ప్రామాణిక కన్నడ భాషను మాట్లాడే ప్రాంతం – గురించి చెప్పడం కూడా విశేషం. ‘వడక్కే వేంగడం, తెన్ కుమరిమునై’ అని తమిళంలో కనిపిస్తుంది కానీ, కాలనిర్ణయం మాత్రం సాధ్యం కాదు. శ్రీవిజయుడు కావేరి నుంచి గోదావరి దాకా ఉన్న నాడు కన్నడనాడు అని స్పష్టం చేశాడు (1-36). అంతేకాక ఆనాట కిసువొళల్, మహాకొపణనగరం, పులిగెరె, ఒక్కుంద అనే ప్రదేశాల మధ్య ఉన్నదే సారభూతమైన కన్నడం అని చెప్పాడు.

కావేరియిందమా గో
దావరివరమిర్ద నాడదా కన్నడదొళ్
భావిసిద జనపదం వసు-
ధా వలయ విలీన విశద విషయ విశేషం (1-36)

(కావేరి నుండి ఆ గోదావరి వరకు ఉన్న కన్నడ నాట భావించగల్గిన జనపదం ఈ భూమండలంలోని విశద ప్రదేశాలలో విశేషమైనది.)

అదఱొళగం కిసువొళలా
విదిత మహా కొపణ నగరదా పులిగెఱెయా
సదభిస్తుతమప్పొంకుం
దద నడువణ నాడె నాడె కన్నడద తిరుళ్ (1-37)

(అందులో కిసువొళల్, ప్రసిద్ధమైన మహాకొపణనగరం, పులిగెఱె, స్తుత్యమైన ఒక్కుంద అనే ప్రదేశాల నట్టనడుమ ఉన్న నాడు అచ్చమైన కన్నడనాడు.)

కన్నడిగులు ఎలాంటివారు అని చెప్పడంలోనూ రచయిత ఆత్మాభిమానం కనిపిస్తుంది. ‘సొగసుగా చెప్పడం, చెప్పినదానిని శోధించడం వీరికి తెలుసు. వాళ్ళు చాతుర్యం కలవారు. చదువు లేకున్నా కావ్యాన్ని రాయగల పరిణతములు (1-38)’ అని కన్నడిగుల గురించి చెప్పాడు.

పదనఱిదు నుడియలుం నుడి
దుదనఱిదారలుమార్పరా నాడవర్గళ్
చదురర్ నిజదిం కుఱితో
దదెయుం కావ్య ప్రయోగ పరిణత మతిగళ్ (1-38)

(ఆ ప్రదేశంలో వారికి సొగసుగా చెప్పడం, చెప్పిన దాన్ని శోధించడం తెలుసు. వాళ్ళు చతురులు, చదువు లేకున్నా కావ్యాన్ని రాయగల పరిణత మతులు.)

మిగతా పండితకవుల లాగా కాకుండా జానపదులను కూడా మెచ్చుకున్నాడు. ‘వీళ్ళు తమ తమ నుడులలో జాణతనం ఉన్నవాళ్ళు’ అని ప్రాంతీయ భాషల సొగసును పొగిడాడు. చివరకు చిన్నపిల్లలు, మూగవాళ్లు కూడా వివేకం కలవారన్నాడు.

కుఱితవరల్లదె మత్తం
పెఱరుం తంతమ్మ నుడియొళెల్లర్ జాణర్
కిఱువక్కళ్ మామూగరు
మఱిపల్కఱివర్ వివేకమం మాతుగళం (1-39)

(ముందు చెప్పిన వాళ్ళే కాకుండా మిగిలిన వారు కూడా తమ తమ నుడులలో జాణతనం కలవారు. చిన్న పిల్లలు, మూగవాళ్ళు సైతం మాటల్లో వివేకాన్ని చూపించగల సమర్థులు.)

సంస్కృత ప్రాకృతాలను గురించి శ్రీవిజయుడు వ్యక్తం చేసిన అభిప్రాయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ భాషల్లో నిర్దిష్టమైన లక్ష్యలక్షణాలున్నాయి. అందువల్ల ఆ భాషల్లో రాయడం తేలికే. కానీ, కన్నడంలో అలాంటి లక్షణగ్రంథాలు లేకున్నా రాస్తున్నారు కాబట్టి తమ భాషలో వాళ్ళే ఒజ్జబంతులని చెప్పాలి.

అరిదాదం కన్నడదొళ్
తిరికొఱెగొండఱియ పేళ్ వెనెంబుదిదార్గం
పరమాచార్యరవోల్ సై-
తిరలఱియర్ కన్నడక్కె నాడవరోజర్ (1-42)

(అరుదైన కన్నడంలో పరమాచార్యులలాగా గొప్పగా చెప్పడానికి సాధ్యం కాకపోవచ్చు. కానీ కన్నడానికి సంబంధించినంత వరకూ ఆ నాడులో ఉన్నవారే ఒజ్జలు.)

మాండలికాలను గుర్తించిన మొదటి కవి కూడా ఇతనే. కన్నడంలో దేసి వేరువేరుగా ఉండడం వల్ల “దాన్ని తెలుసుకొని మాండలిక భేదాలను గుర్తించడం వాసుకి వల్లకూడా కాదు” అన్నాడు.

దోసమినితెందు బగెదు
ద్భాసిసి తఱిసందు కన్నడంగళొళెందుం
వాసుగియుమఱియలాఱదె
బేసఱుగుం దేసి బేఱెబేఱప్పుదఱిం (1-46)

(కన్నడ భాష ప్రభేదాలలోని దోషాలను విడమర్చి చెప్పడానికి వాసుకి వల్ల కూడా కాదు. దేసి వేరువేరుగా ఉండడం వల్ల అతనికే విసుగు పుడుతుంది.)

‘ఎవరికీ తమ తమ దోషాలను తెలుసుకోవడం సాధ్యం కాదు. తమ కన్నులలోని కాటుకను ఎవరూ చూచుకోలేరు. అందువల్ల తెలివిగల వారెవరికైనా చూపించి కావ్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి,’ అని గొప్ప సలహా ఇచ్చిన శ్రీ విజయుణ్ణి ప్రశంసించాల్సిందే.

కాణనేగెయ్దుం తన్న దోషమం
కాణదంతెందుం కణ్గళ్ తమ్మ కాడిగెయం
పూణిగనాదుదఱిం పెఱరిం
జాణరినోదిసి పేళ్వుదు కబ్బమం (1-45)

(తన దోషాన్ని తాను తెలుసుకోవడం కష్టం. కళ్ళు తమ కాటుకను ఎప్పుడూ చూడలేవు. అందువల్ల కావ్యరచనకు పూనుకున్నవాడు తెలివిగల వాళ్ళ చేత తన కావ్యాన్ని చదివించుకోవాలి.)

పాతవడ్డ మాటల్ని గురించి శ్రీ విజయుని అభిప్రాయం స్పష్టంగా ఉంది. ‘పాతమాటలు పురాణకావ్య ప్రయోగానికి సొగసుగానే ఉంటాయి. కానీ, ‘దేసి’కి అవి పనికిరావు. వాటిని వాడితే, ముసలిదాన్ని సంభోగిస్తున్నట్టు ఉంటుంది,’ అని కటువుగా చెప్పడం గమనించదగింది.

దొరెకొండిరె సొగయిసుగుం
పురాణ కావ్య ప్రయోగదొళ్ తత్కాలం
విరసం కరమవు దేసిగె
జరద్వధూ విషయ సురత రస రసికతెవోల్ (1-50)

(పురాణకావ్య ప్రయోగానికయితే, [పాత కన్నడ పదాలు] ఆ కాలానికి చక్కగానే ఉంటాయి. కానీ, దేసికి సంబంధించినంత వరకూ అవి ముసలిదాన్ని సంభోగించే రసికతలాగా చాలా విరసంగా ఉంటాయి.)

‘తత్సమాల్ని కూడా చూచుకోని వాడండి, ఇష్టం వచ్చినట్లు వాడవద్దు. సంస్కృతాన్ని కన్నడాన్ని కలిపి రాయవద్దు. అహరహః, ముహుర్ముహుః, పునఃపునః, లాంటి అవ్యయాల్ని అలాగే వాడవద్దు. కన్నడాన్ని, సంస్కృతాన్ని ఈ విధంగా కలిపి రాస్తే కరడె, మద్దెలల లాగా కర్కశంగా ఉంటుంది’ (1-51 నుండి 1-53 వరకూ) అన్నాడు రచయిత.

సమ సంస్కృతంగళొళ్ సై-
తమర్దిరె కన్నడమనఱిదు పేళ్గెంబుదిదా-
గమ కోవిద నిగదిత మా
ర్గమిదం బెరసల్కమాగదీ సక్కదదొళ్ (1-51)

(సంస్కృత సమాసాలతో కన్నడాన్ని కలిపి చెప్పేటప్పుడు జాగ్రత్త వహించాలన్నది ఆగమకోవిదులు నిర్దేశించిన మార్గం. సంస్కృతంతో కన్నడం కలిపి చెప్పడానికి వీలులేదు.)

అహరహరుచ్చైర్నీచై
ర్ముహుర్ముహురితస్తతః పునః పునరంత-
ర్బహిరాదిహ ప్రాదురహో-
సహసాదిగళవ్యయంగళసహాయంగళ్ (1-52)

(అహరహః, ఉచ్చైః, నీచైః, ముహుర్ముహుః, ఇతస్తతమ్, పునః పునః, అంతర్, బహిర్, ఇహ, ప్రాదుర్, అహో వంటి అవ్యయాలను అలాగే వాడుకోకూడదు).

బెరసిరె కన్నడదొళ్ బం
ధురమాగదు కావ్యరచనె పేళ్దొడె పీనం
పరుషతరమక్కుమొత్తుం
గరడెయ మద్దళెయ జర్ఝరధ్వనిగళవోల్ (1-53)

(వీటిని కలిపివేస్తే కన్నడం అందంగా ఉండదు. చాలా పరుషంగా కరడె, మద్దెల చేసే కర్కశ ధ్వనిలాగా ఉంటుంది).

అలా ఛందోబద్దమైన పద్యం హృద్యమైనదని శ్రీవిజయుని అభిప్రాయం. పద్యకవులను గురించి రాసేటప్పుడు పద్యం ఎంత సొగసుగా ఉంటుందో తెలిపాడు. చక్కని సంస్కృత పదాలను వాడడం వల్ల ఈ పద్యం తెలుగు వాళ్లకూ అర్థమవుతుంది.

పద్యం సమస్త జనతా
హృద్యం పదవిదితపాదనియమనివేద్యం
విద్యా పారాయణ
మాద్యం సద్వృత్తి వృత్త జాత్యాయత్తం (1-30)

(పద్యం సమస్త జనతకు హృద్యమైనది. పదములతో కూడి పాదనియమం కలిగి ఉండేది. విద్యావంతులకు ఇష్టమైనది. ఆద్యమైనది. వృత్తాలతోనూ, జాతులతోనూ కూడి ఉండేది.)

ఇంకా ఈ అలంకార శాస్త్రంలో ఉన్న అన్ని విశేషాలను చెప్పాలంటే చాట భారతం అవుతుంది. కన్నడంలో యతి స్వరూపం, కారకాదులలో దోషాలు, గురులఘుదోషాలు, అలంకార లక్షణం, అలంకార భేదాలు, ప్రాస భేదాలు, దక్షిణోత్తర మార్గాలు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, వాటికి లక్ష్యాలు కవిరాజమార్గంలో ఉన్నాయి. దండి కావ్యాదర్శంలో ఉన్నట్లే చిత్రకవిత్వం గురించి కూడా ఇందులో విపులమైన వివరణ ఉంది. ధ్వనిని కూడా అలంకారంగా నిరూపించడం ఒక విశేషం. మహాకావ్య లక్షణాన్ని విశదీకరించి తన లక్షణ గ్రంథాన్ని ముగించాడు శ్రీవిజయుడు.

ఇన్ని విధాల విశిష్టతను సంతరించుకొన్న కవిరాజమార్గం తొమ్మిదవ శతాబ్దిలోనే రచించిన శ్రీవిజయుడు, ఈ మార్గాన్ని నిర్దేశించిన నృపతుంగుడు యశోభూషణులు అయ్యారు. నీతినిరంతరుడు, ఉదారుడు, అతిశయధవళుడు అని బిరుదులు పొందిన నృపతుంగ చక్రవర్తి సార్థక నామధేయుడయ్యాడు.
--------------------------------------------------------
రచన: రాళ్ళపల్లి సుందరం, 
ఈమాట సౌజన్యంతో