Saturday, June 29, 2019

జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం


జమిలి వేలుపు కావ్యం – ఉత్తర హరివంశం




సాహితీమిత్రులారా!

“తమతమ లోనిచూడ్కి దము దార కనుంగొను మాడ్కి నింత గా
లము నిను నీవ చూచితి తలంపున నీవును నేన కావునన్”

మనమో కవిత చదివినప్పుడు అందులో కవి చెప్పదలచుకున్న విషయం ఒకోసారి వెంటనే అర్థం కాకపోవచ్చు. అప్పుడేం చేస్తాం? కవితని మళ్ళీ చదువుతాం (ఓపికుంటే!) ఒకోసారి అందులోని ఒకటి రెండు వాక్యాలు కీలకంగా అనిపిస్తాయి. ఆ వాక్యాల ఆధారంగా ఆ కవితకి మనదైన అర్థాన్ని ఊహించుకుంటాం. అస్పష్ట కవిత్వాన్ని కూడా ఇష్టంగా చదివేవాళ్ళకి ఇది అనుభవమే! సరిగ్గా అలాగే, పైనున్న రెండు వాక్యాలూ నాచన సోమన రచించిన ‘ఉత్తరహరివంశము’ మొత్తానికీ కీలకమైన వాక్యాలుగా నాకు కనిపించాయి. ఈ కావ్యం ద్వారా నాచన సోమన చెప్పదలుచుకున్న సారమంతా యీ రెండు వాక్యాలలోనూ నిక్షిప్తమై ఉందని నా ఊహ. ఇవి శివుడు శ్రీకృష్ణునితో అనే మాటలు.

అసలీ వ్యాసం మొదలుపెట్టినప్పుడు, నాచన సోమన పద్య నిర్మాణ విశేషాలని గురించి రాద్దామనుకున్నాను. పద్యాలని ఛందోబద్ధంగా నడిపించడం మాత్రమే కాకుండా, ఆయా ఛందస్సులలో దాగున్న నిర్మాణ విశేషాలకి అనుగుణంగా పద్యాలని నిర్మించి, వాటికొక ప్రత్యేకమైన నడకని సంతరించడం మొదటిసారి, ప్రస్ఫుటంగా కనిపించేది నాచన సోమనలోనే. అయితే ఆ విశేషాలని మాత్రమే ప్రస్తావించి ఊరుకుంటే అతనికి పూర్తి న్యాయం జరగదని అనిపించింది. ఎందుకంటే నాచన సోమన వ్యక్తిత్వం దానికన్నా మరింత విస్తృతమైనది. ఈ తరం సాహితీ ప్రియులకి ముందితని గురించి ఓ విపులమైన పరిచయం అవసరమని తోచింది. అంచేత యీ వ్యాసాన్ని ఆ దిశగా మళ్ళించాను.

తెలుగు సాహిత్యంతో ఏ కాస్తో పరిచయమున్న చాలామందికి శ్రీనాథుడు, పోతన, పెద్దన వంటి కవులు తెలిసినంతగా నాచన సోమన గురించి తెలియకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇతని కవిత్వం మిగతావాళ్ళ కవిత్వం లాగా ‘ప్రజాకర్షకం’ కాదు. దీనికే మనవాళ్ళు గంభీరంగా ఉండాలని ‘ప్రౌఢ’ కవిత్వం అని పేరు పెట్టారు. ఉత్తరహరివంశం మొదటిసారి చదివినప్పుడు కొఱుకుడు పడటం కష్టమే. మరైతే అంత కష్టపడి అసలెందుకీ కావ్యాన్ని చదవాలీ అనే సందేహం తెలుగు పాఠకుడన్నవాడికి తప్పకుండా కలిగి తీరుతుంది! కేవలం సరదా కోసం, ఎంతో శ్రమ పడి, నడుచుకుంటూ, పాకురుకుంటూ కొండలెక్కే వాళ్ళని (trekkersని) ఎందుకంత కష్టపడి కొండెక్కుతారు అని అడిగితే, వాళ్ళేమి సమాధానం చెప్పగలరు? ఆ పైకెక్కే పరిశ్రమ తర్వాత, ఎత్తైన కొండ మీదనుంచి చుట్టూ విశాలంగా కనిపించే ప్రపంచాన్ని చూడటంలో ఉన్న ఆనందం అనుభవిస్తే కాని తెలియదు కదా! ఇలాటి కవిత్వాన్ని చదవడం కూడా సరిగ్గా అలాటి అనుభూతినే ఇస్తుంది.

ఈ కావ్యం పేరే ఒక పెద్ద మిస్టరీ! దీనికి ‘ఉత్తర హరివంశం’ అన్న పేరు సోమన ఎందుకు పెట్టాడో ఎవరికీ అంతుపట్టలేదు. ఎవరికి తోచిన ఊహాగానాలు వాళ్ళు చేశారు. పైగా, ఇదొక ‘తలా తోకా లేని’ కావ్యం (literalగా!). సాధారణంగా మన కావ్యాలకి మొదట అవతారిక ఒకటి ఉంటుంది. ఇందులో, కవి కృతిభర్తల గురించిన సమాచారం, కావ్య రచనా నేపథ్యం మొదలైన విషయాలుంటాయి. ఈ కావ్యానికి అలాటి అవతారిక లేదు, లేదా మనకి దొరకలేదు. అలానే, సాధారణంగా కావ్యం చివర ఉండే గద్యలో అది సంపూర్ణమైనదని చెప్పబడుతుంది. ఈ కావ్యంలో అది కూడా లేదు! అందువల్ల మనకి దొరికిన యీ కావ్యం సంపూర్ణమేనా కాదా అన్న అనుమానం ఇంకా మిగిలే ఉంది. దానికి తోడు ఆ పేరొకటి, ‘ఉత్తర’హరివంశం అని! సంస్కృతంలో ఉన్నది ఒక్కటే హరివంశం. రామాయణానికి ఉత్తరరామాయణంలా దీనికి ఉత్తరహరివంశమేదీ లేదు. ఆ సంస్కృత హరివంశంలో కథలే తెలుగు ఉత్తరహరివంశంలో కనిపిస్తాయి, అన్నీ కావు, కొన్ని. మరి దీనికి ఉత్తరహరివంశం అని సోమన ఎందుకు పేరుపెట్టాడన్నది అంతు తేలని ప్రశ్న. దీని గురించి చాలామందే సాహితీ డిటెక్టివులు పరిశోధించారు.

హరివంశాన్ని ఎఱ్ఱన కూడా తెలుగులోకి అనువదించాడు. అతను హరివంశమనే పేరు పెట్టాడు కానీ, తన తెలుగు అనువాదాన్ని పూర్వ, ఉత్తర హరివంశాలుగా విభజించాడు. పోనీ ఎఱ్ఱన ఉత్తరహరివంశ భాగాన్నే సోమన తిరిగి రచించి, దానికలా పేరుపెట్టాడా అంటే అదీ కాదు! ఎఱ్ఱన ఉత్తరహరివంశ భాగంలో కనిపించే అన్ని కథలూ ఇందులో లేవు. పైగా, అందులో లేని కథ కూడా ఇందులో ఉంది. నాచన సోమన ఉత్తరహరివంశం మొదట్లోనే “హరివంశ ప్రథమ కథాంతరమున గల వింతలెల్ల దప్పక మదిలో దిరమయ్యెగదా” అని పూర్వ హరివంశ ప్రస్తావన ఉంది. వీటన్నిటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తే, సోమన కూడా పూర్వ, ఉత్తర హరివంశాలని రచించాడని అనిపిస్తోంది. నాచన సోమన ఎఱ్ఱన హరివంశాన్ని చదివి ఉంటాడన్నది వాళ్ళ కావ్యాలని పరిశీలిస్తే స్పష్టంగా కనిపించే విషయం. ఎఱ్ఱన రచన సోమనకి సంతృప్తినివ్వక పోవడం చేత, సంస్కృత హరివంశాన్ని యథాతథంగా అనువదించకుండా, అందులో కొన్ని కథలని మాత్రం తీసుకొని తనదైన సంవిధానంతో తెలుగు హరివంశాన్ని తీర్చిదిద్దాడని నా ఊహ. ఇలాటప్పుడే అనిపిస్తుంది, టైం మెషిన్లో వెనక్కి వెళ్ళి అసలు నిజాలని తెలుసుకోగలిగితే ఎంత బాగుండునో అని!

సరే, ప్రస్తుతానికి పేరు గురించి పక్కన పెట్టి, సోమన కవిత్వంలోని ప్రత్యేకతలు ఏమిటని చూస్తే నాకు కనిపించిన ముఖ్య లక్షణాలు మూడు. ఒకటి వైవిధ్యం, రెండు వక్రత లేదా వైచిత్రి, మూడవది సూక్ష్మత. ఇతర కవులనించి ఇతణ్ణి వేరు చేసేవి కూడా యీ లక్షణాలే.

వైవిధ్యం
ఉత్తరహరివంశం ఆసాంతం వైవిధ్యభరితంగా సాగే కావ్యం. ఈ కావ్యంలో ఎంత గ్రాంధిక భాష కనిపిస్తుందో అంతే వాడుక భాష కూడా కనిపిస్తుంది. పూర్తి సంస్కృతంలో ఉన్న పద్యాలూ ఉన్నాయి. అచ్చ తెలుగులో సాగే పద్యాలూ ఉన్నాయి. పద్య రచనలోనూ, నిర్మాణంలోనూ కూడా చాలా వైవిధ్యం చూపించాడు సోమన. ఉదాహరణకి యీ పద్య శైలిని చూడండి:

నెయ్యము లేని సంగతియు, నిక్కము లేని వచోవిలాసమున్
వియ్యము లేని వైభవము, విందుల సందడి లేని ముంగిలిం
దియ్యము లేని చాగమును, ధీరత లేని యమాత్యకృత్యముం
గయ్యము లేని శూరతయు, గైకొని యూరక మెచ్చవచ్చునే!

ఇంతటి ప్రౌఢ కావ్యంలోనూ, నీతి శతకంలోని పద్యంలా ఉన్న శైలి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాగే, ఈ పద్యపాదం చూడండి: “నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కలు నాకు నిండునే”.

ఇవి నరకుడు ఊర్వశితో చెప్పే మాటలు. కృష్ణశాస్త్రి తన ఊహా ప్రేయసి అయిన ఊర్వశితో అనే మాటల్లా లేవూ! పద్య రచనలో ఎన్నో రకాల నడకలు ఉత్తరహరివంశంలో కనిపిస్తాయి. ముఖ్యంగా సీస పద్యాల విషయంలో ఎంతటి వైవిధ్యం చూపించాడో వివరించాలంటే, అదే ఓ వ్యాసం అవుతుంది. ఈ కావ్యంలో ముఖ్యంగా చెప్పుకోవలసినది అందులోని కథలు, వాటి కథనం, పాత్ర చిత్రణ – వాటిల్లో సోమన చూపించిన వైవిధ్యం. ఇందులో మొట్టమొదటి కథ నరకాసుర వధ, దుష్టశిక్షణ. నరకుడు విష్ణువు కుమారుడే. విష్ణువు వరాహావతారమెత్తినప్పుడు అతనికీ భూదేవికీ పుట్టిన వాడు. అయినా రాక్షసుడు, క్రూరుడు, అహంకారి. స్వర్గాన్ని ఆక్రమించడమే కాకుండా, మునులని కూడా హింసిస్తాడు. అందువల్ల శ్రీకృష్ణుడికి అతన్ని చంపక తప్పింది కాదు. పురాణ శైలిలో మొదలయ్యే కథనం ఊర్వశీ నరకుల సంభాషణలలో నాటకీయ శైలి సంతరించుకుంటే, నరకునితో సత్యభామా శ్రీకృష్ణులు చేసే యుద్ధం కావ్య శైలిలో సాగుతుంది. ఇక రెండవ కథ విప్ర సంతానాన్ని బ్రతికించడం, అంటే శిష్ట రక్షణ. ఈ కథలో ఉండేది శుద్ధ వేదాంతం. దీని వెంటనే వచ్చే కథ, కృష్ణుడు సంతానం కోసమై శివుని గురించి తపస్సు చేయడం. ఈ రెండు కథలు చాలావరకు పురాణ శైలిలో సాగుతాయి.

నాల్గవ కథ పౌండ్రక వధ, మళ్ళీ దుష్ట శిక్షణ. ఈ పౌండ్రకుడు రాక్షసుడు కాదు. మూర్ఖుడైన రాజు. తానే దేవుడనుకుంటాడు. నిజమైన వాసుదేవుడు తానేనని చాటుకుంటాడు. భౌతికమైన, యాంత్రికమైన ఆయుధాలతో శ్రీకృష్ణుని జయించగలనని విఱ్ఱవీగుతాడు. కృష్ణునిపై దండెత్తుతాడు కానీ అతని చక్ర ధాటికి తునాతునకలైపోతాడు. ఈ కథనం కావ్య పురాణ శైలీ మిశ్రమంగా సాగుతుంది. దీని తర్వాత వచ్చే కృత్యా సంహారం మరీ విచిత్రమైన కథనం. ఇందులో మూడువంతుల ముప్పావు పాచికలాట వర్ణనే! ఈ పాచికలాట గురించిన విశేషాలు చెప్పాలంటే దానికి మరో వ్యాసం అవసరమవుతుంది.

తర్వాత వచ్చేది హంసడిభకుల కథ. ఇది కూడా దుష్ట శిక్షణే. వీళ్ళు కూడా రాక్షసులు కారు. అయినా వీళ్ళు మూర్ఖులు కారు. వీళ్ళలో హంసుడు చాలా తెలివైనవాడు కూడాను. పౌండ్రకునిలా వీళ్ళు వట్టి భౌతికమైన ఆయుధాలమీద ఆధారపడరు. శివుని మెప్పించి దివ్యాస్త్రాలని పొందుతారు. దానితో వీళ్ళలో అహంకారం పెరుగుతుంది. సన్యాసి అని దుర్వాసుని అవమానిస్తారు. రాజులందరినీ గెలిచి రాజసూయ యాగం చెయ్యాలని హాఠాత్తుగా బుద్ధిపుడుతుంది వీళ్ళకి. శ్రీకృష్ణుని కూడా కప్పం కట్టమని అతని భక్తుడయిన జనార్దనుని రాయబారం పంపిస్తారు. అప్పటికే దూర్వాస మునిని అవమానించినందుకు వాళ్ళకి శాస్తి చెయ్యాలని ఆలోచిస్తున్న కృష్ణుడికి వెదుకబోయిన తీగ కాలికి తగిలినట్లవుతుంది. కప్పం కట్టడానికి ఒప్పుకోననీ యుద్ధానికి సిద్ధం కమ్మనీ జవాబు పంపిస్తాడు. యుద్ధం చేసి హంసుడిని యమునలో ముంచేస్తాడు. అన్న చావుతో డిభకుడు కూడా యమునలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ కథ మొత్తం పూర్తి నాటకీయ శైలిలో సాగుతుంది. సోమనపై తిక్కన ప్రభావం యీ రచనలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఉత్తరహరివంశంలో చివరి కథ బాణుడి వృత్తాంతం. ఇది దుష్ట శిక్షణ అనీ చెప్పలేము, శిష్ట రక్షణ అనీ చెప్పలేము! బాణుడు రాక్షసుడు. బలి చక్రవర్తి కుమారుడు, శివునికి పరమ భక్తుడు అయిన అతడిలో క్రూరత్వం లేదు. బాణుడికి ఉన్నదల్లా చేతుల తీట. అతడికి వెయ్యిచేతులుంటాయి. వాటితో యుద్ధం చెయ్యకపోతే ఎలా అని అతడి బాధ. శివుని కోసం తపస్సు చేసి ఒక మహా యుద్ధాన్ని వరంగా కోరుకుంటాడు. తన భక్తుని మూర్ఖత్వానికి నవ్వుకొని, శివుడు సరే నంటాడు. నాటకానికి పార్వతీదేవి నాంది పలుకుతుంది. బాణుడి కూతురు ఉషకి, కాబోయే భర్త ఫలానా రోజు కలలో కనబడతాడని చెపుతుంది. కలలో కృష్ణుడి మనుమడైన అనిరుద్ధుడు కనిపించడంతో అతని ప్రేమలో పడుతుంది ఉష. చెలికత్తె ద్వారా తన అంతఃపురానికి అతడిని రప్పించుకుంటుంది. ఉషా అనిరుద్ధులు ప్రేమ సాగరంలో ఓలలాడుతూ ఉంటారు. అది తెలిసిన బాణుడు అనిరుద్ధునితో యుద్ధం చేసి అతడిని బంధిస్తాడు. అది తెలుసుకున్న కృష్ణుడు బాణుడి మీదకి దండెత్తి వస్తాడు. శివుడు, కుమారస్వామి బాణుడికి అండగా నిలుస్తారు. ఘోర సంగ్రామం జరుగుతుంది. కృష్ణుడు చివరికి బాణుడి రెండు చేతులు మాత్రం మిగిల్చి తక్కినవన్నీ చక్రంతో నరికివేసి అనిరుద్ధుణ్ణి విడిపించుకొని తీసుకుపోతాడు. యుద్ధానంతరం బాణుడు బుద్ధి తెచ్చుకొని తిరిగి శివుని ప్రార్థించి యథాస్థితిని పొందుతాడు. అలాగే శివుని ప్రమథగణాలలో స్థానాన్ని కూడా సంపాదిస్తాడు. ఇదీ కథ! ఇది చదివితే, ఇదంతా హరిహరులిద్దరూ ఆడిన పెద్ద నాటకమని అనిపించక మానదు. ఇది పూర్తిగా ప్రబంధ శైలిలో సాగే కథ.

ఇలా ఒకే కావ్యంలో యిన్ని శైలీ భేదాలని చూపించాడు సోమన. వైవిధ్య భరితంగా సాగే ఆ కథనం అర్థమైతే, చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

వక్రత
వక్రత అంటే, చెప్పే విషయాన్ని సాధారణంగా సూటిగా కాకుండా, విభిన్నంగా చెప్పడం అని నా ఉద్దేశ్యం. ఉదాహరణకి “శ్రామికుని నెత్తురు చెమటగా కారిపోతోంది” అని చెప్పడం సాధారణ అలంకారం. అదే, “శ్రామికుని నెత్తురు ఎఱ్ఱదనం కోల్పోయి పల్చబడి ఒంటిమీంచి జారిపోతోంది” అని అంటే అది వక్రత. వక్రత చెప్పే విషయాన్ని గూర్చి అనేక కోణాలని చూపించగలుగుతుంది, కానీ కొన్నిసార్లు కవిత్వంలో అస్పష్టతకి కూడా దారితీస్తుంది. ఉత్తరహరివంశంలో అడుగడుగునా యీ వక్రత అగుపడుతుంది. చెప్పే విషయం కానీ, చేసే వర్ణనకానీ ఏదో విలక్షణతతో, వక్రమార్గం లోనే సాగించడం సోమన ప్రత్యేకత. ఉదాహరణకి యీ పద్యం చూడండి:

కుజము కుంజరముచే కూలునో కూలదో?
కూలు; కుంజరము నీ కుజము గూల్చె!
మ్రాను పేరేటిచే మడుగునో మడుగదో?
మడుగు; పేరేటి నీ మ్రాను మడచె!
గాలునో యొకనిచే గాలదో సాలంబు?
గాలు; నీ సాలంబు గాల్చె నొకని!
దునియునో పరశుచే దునియదో వృక్షంబు?
తునియు; నీ వృక్షంబు తునిమె బరశు!

ననుచు దమలోన జర్చించు నమరవరుల
కభిమతార్థ ఫలార్థమై యంద వచ్చు
పారిజాతంబు నా మ్రోల బండియుండ
నంద గంటి నా కోర్కుల నంద గంటి!

ఇది కృష్ణుడు శివుని స్తుతించే పద్యం. పద్యం చదివిన వెంటనే ఇందులో కవి చెప్పదలచుకున్న విషయమేమిటన్నది బోధపడదు. వాక్య నిర్మాణంలోనూ, చెప్పిన విధానంలోనూ ఉన్న వక్రత దీనికి కారణం. శివుని పారిజాతవృక్షంతో పోలుస్తున్నాడు కృష్ణుడు. చెట్టు ఏనుగు చేత కూలుతుందా కూలదా? కూలుతుంది. కాని ఇక్కడ చెట్టు ఒక ఏనుగుని కూల్చింది! అలానే తర్వాత పాదాలలో చెట్టు పెద్ద ఏరువల్ల వంగిపోవడం, అగ్ని వలన కాలడం, గొడ్డలిచేత విరగడం శివుని విషయంలో తారుమారవ్వడం కనిపిస్తుంది. మొదటి పాదంలో ప్రశ్నకి రెండవ పాదం మొదటి పదంతో సమాధానం చెప్పడం, ఆ తర్వాత దానికి వ్యతిరేకమైనది శివుని విషయంలో జరగడాన్ని ప్రస్తావించడం ఇక్కడ పద్య (వాక్య) నిర్మాణంలో సోమన చూపించిన వక్రత. ఇదే అస్పష్టతకి దారితీస్తోంది. అలాగే ఇక్కడ ప్రస్తావించబడిన అంశాలు అర్థమవ్వాలంటే కొంత పురాణ జ్ఞానం అవసరమవుతుంది. శివుడు గజాసురుని సంహరించడం, గంగ గర్వాన్ని అణచడం, మన్మథ దహనం – ఇవి మొదటి మూడు పాదాలలోని అంశాలు, ప్రసిద్ధమైనవే. నాల్గవ అంశం శివుడు పరశువుని ఖండించడం. దక్ష యజ్ఞ ధ్వంసమప్పుడు శివుడు విష్ణుమూర్తి పరశువుని ఖండించాడని ఒక కథ ఉంది. బహుశా ఇక్కడ ప్రస్తావించినది అదే. ఈ కథలు తెలియకపోతే పద్యం అసలు అర్థం కాదు.

ఈ సందర్భంలో నన్ను ఆశ్చర్యపరచిన మరొక విషయాన్ని చెప్పాలి. విశ్వనాథ తన ‘సాహిత్య సురభి’లో యీ పద్యాన్ని గురించి రాస్తూ, ఇది శ్రీకృష్ణుని గురించిన పద్యమని వివరించారు. కానీ ఆ వివరణ సరిగా లేదు. చివరి పాదం మాత్రం తనకి అర్థం కాలేదని కూడా చెప్పారు. కావ్యంలో ఇది కృష్ణుడు శివుని గురించి చెప్పినదని స్పష్టంగా ఉంటే మరి ఎందుకలా అర్థం చేసుకున్నారో అంతుబట్టడం లేదు. విశ్వనాథ అంతటివారే, ఈ పద్యాన్ని గురించి తికమక పడ్డారా అని ఆశ్చర్యం! అలాగే మరో పద్యం చూడండి:

దనుజేంద్రుడా తలోదరి
గనుగొని చొళ్ళెంబు నిమురు గ్రమ్మున బైకొం
గనువు పఱుచు గేదగి రే
కు నఖంబుల జీఱు గులుకు గోర్కుల దేలన్

సభకి రప్పించిన ఊర్వశిని చూడగానే నరకుడు చేసిన చేష్టలివి. కొప్పు నిమరడం, పైకొంగుని సర్దడం, గేదగి రేకులని గోళ్ళతో చీరడం. నరకుడు ఎవరి కొప్పు నిమిరాడు? ఎవరి పైకొంగుని సర్దాడు? ఊర్వశివని విశ్వనాథతో సహా చాలామంది అర్థం చెప్పారు. మరి చివరనున్న గేదగి రేకులని చీరడమేమిటి? లేత చెక్కిళ్ళని గేదగి (మొగలి) రేకులతో పోల్చడం ఆనవాయితీ. నరకుడు ఊర్వశి బుగ్గ గిల్లాడన్నమాట, అని వివరించారు. బుగ్గలని చెప్పకుండా, వాటిని పోల్చే గేదగి రేకులని మాత్రమే చెప్పి ఊరుకోవడము వర్ణనలోని వక్రత. అయితే యీ పద్యాన్ని మరో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు.

నరకుడు తన కొప్పుని నిమురుకున్నాడు. తన పైకొంగుని సర్దుకున్నాడు. తన చేతిలోని గేదగి పూరేకులని గోళ్ళతో చీరాడు. ఇవి కూడా అందమైన స్త్రీని చూస్తే రసికుడు చేసే శృంగార చేష్టలే. నిజానికి యీ అర్థమే నాకు ఎక్కువ సమంజసమనిపిస్తోంది. ఎక్కడో సింహాసనం పైనున్న నరకుడు కిందగి దిగి ఊర్వశి వద్దకి వచ్చి, ఇంకా మాటలైనా మొదలుపెట్టకుండానే ఊర్వశితో అంత చనువు తీసుకున్నాడా అని నా అనుమానం. మొత్తానికి పద్యాన్ని రెండు విధాలుగానూ అర్థం చేసుకోవచ్చు. ఇది పద్య నిర్మాణంలో ఉన్న విలక్షణత, వక్రత. ఇలా పద్యాలని ప్రహేళికల్లా నిర్మించడం చాలా చోట్ల కనిపిస్తుంది.

ఇదే వక్రత సంభాషణలలోనైతే, కాకువుని ధ్వనించి నాటకీయతకి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి, తన కొడుకుని యముని బారినుంచి కాపాడలేకపోయిన అర్జునుడితో బ్రాహ్మణుడు పలికే మాటలు:

నీ వేమి సేయు దీ గాం
డీవము నీకిచ్చి యిమ్ము డెప్పరమైనన్
లావు గలదంచు బలికిన
పావకుజే గాదె కోలుపడితి కుమారున్

ఉరుమురిమి మంగలమ్మీద పడ్డట్టు, తన దుస్థితికి అగ్నిని దోషిగా నిలబెడుతున్నాడా బ్రాహ్మణుడు! ఇది సంభాషణలోని వక్రత. అర్జునుడిని నిందించే సందర్భంలో అతనికి గాండీవాన్ని ఇచ్చిన అగ్ని దేవుడిని కూడా తన నిందలోకి లాగడం, ఆ బ్రాహ్మణుడి అమాయకపు ఆవేదనని చక్కగా స్ఫురింపజేస్తోంది. ఇలాగే, హంసడిభకుల కథలో హంసుడు జనార్దనునితో చెప్పే మాటలు, జనార్దనుడు దూతగా యాదవ సభలో మాట్లాడిన మాటలు వక్రతతో నిండి వారి వారి రాజకీయ చతురతని బాగా పట్టిస్తాయి.

వర్ణన సంభాషణలలోనే కాదు, సోమన రస నిర్వహణలో కూడా వక్ర మార్గాన్ని అనుసరించడం ఆశ్చర్యకరమైన విషయం, చాలామంది విమర్శకులకి మింగుడుపడని విషయం కూడానూ! సాధారణంగా కావ్యంలో ఒక రసం ప్రథానంగా ఉండి ఇతర రసాలు దానికి సహాయంగా ఉంటాయి. ఉత్తరహరివంశంలో ఉన్నది ఒక కథ కాదు. అది కొన్ని కథల సమాహారం. అంచేత మొత్తం కావ్యమంతా ఒకటే ప్రథాన రసం ఉండడం కష్టమైన విషయం. ఇలాటి సందర్భాలలో ఒకో కథకీ ఒకో రసం ప్రథానంగా ఉండడం సాధారణంగా జరుగుతుంది. కానీ ఇందులో అలా కూడా లేదు! ఉత్తరహరివంశంలో ప్రతి కథలోనూ అనేక రసాలు కనిపిస్తాయి. ఏ ఒక్క రసమూ ప్రథాన రసంగా కనిపించదు. ఒకే సన్నివేశంలో రెండు రసాలని సమ ప్రాథాన్యంతో నిర్వహించడం కనిపిస్తుంది. ఒకోసారి, ఒకటి ప్రథాన రసమవుతుందని సాధారణంగా అనుకునే చోట మరొక రసానికి అధిక ప్రాథాన్యం ఉంటుంది! ఇది రస నిర్వహణలో సోమన చూపించిన వక్రత. ప్రతి కథా దీనికి ఉదాహరణే. నరకాసుర వధ ఘట్టంలో ఇది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇందులో శృంగార వీర రసాలని రెంటినీ నిర్వహించాడు సోమన. సాధారణంగా వీర రసం ఇక్కడ ప్రథానమవ్వాలి, కానీ శృంగార రసమే మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఉదాహరణకి, సత్యభామ కొంతసేపు యుద్ధం చేశాక కృష్ణుడు సంతోషించి ఏమి చేశాడో చూడండి:

చెలువచెక్కుల నెలకొన్న చెమట దుడిచి
తరుణి నుదుట బైకొన్న కుంతలములొత్తి
రమణి కుచమధ్యమునకు హారముల ద్రోచి
పొలతిపయ్యెద కొంగు పైబొందుపరచి

ఇది చదువుతూ ఉంటే అది నరకాసునితో వాళ్ళు చేసే యుద్ధంలా కాక, ఒక శృంగార కేళిలానే అనిపిస్తుంది.

ఇలాగే, విప్ర కుమారులని రక్షించే కథలో కరుణ అద్భుత రసాలు రెండూ కనిపిస్తాయి. పౌండ్రకుని కథలో హాస్య వీర రసాలు కనిపిస్తాయి. బాణాసుర వృత్తాంతం శృంగార, వీర, అద్భుత, శాంత రసాలు పెనవేసుకు పోయిన కథ. ఉషా అనిరుద్ధుల ప్రేమ వ్యవహారమంతా ప్రబంధ ధోరణిలో శృంగార రస ప్రథానంగా సాగుతుంది. సాధారణ ప్రబంధమైతే అదే రసం చివరిదాకా నిర్వహించబడాలి. బాణుడు అనిరుద్ధుని బంధించిన తర్వాత, ఉష విరహాన్ని చిత్రించి తిరిగి వాళ్ళ కలయికతో ఆ కథ పూర్తికావాలి. కాని ఇందులో అలా జరగదు. బాణుడు అనిరుద్ధుని బంధించిన తర్వాత ఆ కథలో శృంగారానికి మరి స్థానమే ఇయ్యలేదు సోమన! ఆ తర్వాత అనిరుద్ధుని యుద్ధ వర్ణనలో వీర రసం కనిపిస్తుంది. కృష్ణుడు బాణునితో చేసిన యుద్ధమంతా అద్భుత రసంతో సాగుతుంది. చివరికి యుద్ధానంతరం ఎవరికి వారు తమ యథాస్థితిని పొంది, శాంత రస ప్రథానంగా ముగుస్తుంది. ఉత్తరహరివంశం మధ్యలో, కృష్ణుడు సత్యభామా రుక్మిణులతో ఆడే పాచికలాట, కృత్యా సంహారమూ ఒక విచిత్రమైన పద్ధతిలో సాగే కథ. ఇందులో నిజానికి ఏ రసమూ కనిపించదు!

ఇదీ సోమన రస నిర్వహణలో చూపించిన వక్రత. సోమన ఎందుకిలాంటి వక్ర మార్గాన్ని అనుసరించాడు? ఈ ప్రశ్నకి ముందుముందు సమాధానం వెతుకుదాం. ప్రస్తుతానికి సోమన మరో ప్రత్యేక లక్షణాన్ని పరిశీలిద్దాం.
సూక్ష్మత
చెప్పే విషయాన్ని చాలా క్లుప్తంగానో, గుప్తంగానో చెప్పడం సూక్ష్మత. నాచన సోమన కవిత్వ లక్షణాలలో సూక్ష్మత ఒకటంటే చాలా మంది ఒప్పుకోకపోవచ్చు. సోమన కవిత్వంలో శబ్దాడంబరం తప్ప మరేమీ లేదన్న విమర్శకులున్నారు. అతను ఏ విషయాన్నైనా సమగ్రంగా వర్ణించకుండా ఉండలేడు అన్న వారున్నారు. కాని, వాటి వెనక సూక్ష్మంగా, సోమన తాను చెప్ప దలచుకున్న విషయాన్ని ఎలా ఆవిష్కరించాడో గమనిస్తే అతని కవిత్వంలోని గొప్పదనం తెలుస్తుంది. వర్ణనలలో అయితేనేమి, పాత్ర చిత్రణలోనైతేనేమి సోమన చూపిన సూక్ష్మత అనన్యమైనది. ఉదాహరణకి యీ వర్ణన చూడండి:

నరకాసుర ప్రాణ నాళోత్తరణ కేళి
రణకేళి వలకేలి రమణ జూపె
గంసదానవ శిరః కమల కృత్తన మేలు
తన మేలుచేయి పెద్దలకు నొసగె
జాణూర ముష్టిక క్షతజ కీలాలంబు
నాలంబులో నెల్ల నలవు వఱపె
ముర హయగ్రీవాంత్రమూల ఫేనావలి
నావలి దలగ జీకాకు పఱచె

వీరరససార కాసార విహరణంబు
విష్ణునకు నొప్పు నతనితో విగ్రహింప
దొరకొనిన వచ్చు మనకు మద్దులు మునింగి
పాఱ వెంపళ్ళు తమకెంత బంటి యనుట

ఇందులో పైకి ఎక్కువగా కనిపించేది శబ్దాలంకార ఆడంబరం. విస్తారమైన వర్ణన. కాని వాటిని దాటుకొని అందులోని భావాన్ని తరచి చూస్తే ఏం కనిపిస్తుంది? నరకాసురుని ప్రాణాలనే తామర తూళ్ళని పెరికి పారెయ్యడమూ, కంసుని శిరస్సనే పద్మాన్ని తుంచి పారెయ్యడమూ, చాణూర ముష్టికుల రక్త జలాన్ని నలుదిక్కులా చిమ్మేయడమూ, ముర హయగ్రీవుల ప్రేగులనే నురగల సమూహాన్ని చిందరవందర చెయ్యడమూను. ఇది చదివాక, సరస్సులో స్వైర విహారం చేస్తున్న ఒక మత్త గజం మనకి కనిపించక మానదు! వర్ణన ద్వారా పాఠకుల మనసులలో ఒక చిత్రాన్ని రూపుకట్టించడం కవి ప్రతిభ. ఇక్కడ సోమన ప్రత్యేకతంతా విష్ణువుని మదగజంతో నేరుగా పోల్చకపోవడంలో ఉంది. అది పాఠకుల ఊహకి వదిలివెయ్యడమే ఇందులోని సూక్ష్మత. పైకి కనిపించే శబ్దాలంకారాలకి లొంగి అక్కడే ఆగిపోక, ‘లోనారసి’ చూస్తే ఇందులో దాగిన ఆ చక్కని చిత్రం దర్శనమిస్తుంది. అలాగే మరో వర్ణన చూడండి. నరకుని వలన మునులుపడ్డ బాధలని విని కృష్ణుడు కోపించినప్పుడు అతని క్రోధాన్ని వర్ణించే పద్యమిది :

అరుణాంభోరుహ పత్రనేత్రుడు సముద్యద్భ్రూకుటీ భంగ భా
సుర ఫాలస్థలుడుం జలాచల మనశ్శూలాయమానవ్యధా
పరివేషానన భానుమండలుడునై ప్రత్యక్ష రౌద్రంబనన్
నరకాలంభ విజృంభణంబు నెఱపెన్ నారాయణుండాకృతిన్

ఈ పద్యములో ‘ప్రత్యక్ష రౌద్రంబనన్’ అంటే ఏమిటి? ‘రౌద్ర రసమే సాక్షాత్కరించిందా అన్నట్టుగా’ అన్నది సామాన్యంగా చెప్పే అర్థం. రుద్రుడే, అంటే శివుడే ప్రత్యక్షమయ్యాడా అన్నది సూక్ష్మంగా కవి స్ఫురింప జేస్తున్న అర్థం. భాసురమైన ఫాలస్థలి ప్రస్తావన దీనికి మరింత దోహదం చేస్తోంది. ఇది శ్లేష కాదు. ఒక చిత్రాన్ని లీలగా ఛాయగా ప్రదర్శించడం, ఇక్కడ మరో విశేషం. ఇలాగే వర్ణన ద్వారా శివుని రూపాన్ని లీలగా స్ఫురింపజెసిన సందర్భం, ఉత్తరహరివంశంలో మరొకటి ఉంది. పౌండ్రకుని వద్దకు నారదుడు వచ్చినప్పుడు, ఆ నారదుడెలా ఉన్నాడో వర్ణించే పద్యమిది :

ప్రాలేయాంశు మరీచి నిర్మల తనూ భాగంబు కృష్ణాజిన
వ్యాలోలామల యజ్ఞసూత్రములు సంసాసక్త వీణాలతా
లాలిత్యంబు, లలాటికా రుచులు గ్రాలన్నారదుండిచ్చలం
గైలాసంబుననుండి వచ్చె గలహోత్కస్వాంతుడచ్చోటికిన్

ఈ పద్యంలో ప్రస్తావించిన చంద్రకాంతిలా(తో) తెల్లగా వెలుగుతున్న శరీరము, లలాటము చిందే కాంతులు, కైలాసము నుండి విచ్చేయడము – ఇవన్నీ కైలాసం నుండి స్వయంగా శివుడే వచ్చాడా అన్న భావాన్ని స్ఫురింపజేస్తాయి. ఇంతకుముందు పద్యంలో లాగానే ఇందులో కూడా శ్లేష లేదు. ఇక్కడ ఉన్నది ధ్వని! ఇలా వర్ణనలలో సూక్ష్మంగా అంతరార్థాన్ని ధ్వనింప జేసే సందర్భాలు మరికొన్ని ఉన్నాయి. నేను తెలుసుకోలేక పోయినవి ఇంకా చాలానే ఉండి ఉంటాయి! దురదృష్టవశాత్తూ యీ కావ్యానికి విపుల వ్యాఖ్యానమేమీ వచ్చినట్టు లేదు. మల్లంపల్లి శరభయ్యగారు చేసేరని విన్నాను కాని, అది నాకు దొరకలేదు.

పాత్ర నిర్వహణలో కూడా సోమన పాత్ర స్వభావాలని వాచ్యం చెయ్యకుండా సూక్ష్మంగా ధ్వనింపజెయ్యడం గమనించవచ్చు. పాత్ర నిర్వహణలో సోమన చూపించిన సూక్ష్మతకి మంచి ఉదాహరణ పౌండ్రకుని కథ. ఇందులో పౌండ్రకుని పాత్ర ప్రవేశంలో ఉన్న యీ పద్యం చూడండి:

ఇక్కడ బౌండ్రభూపతి వివేకవిహీనత జేవ యెక్కగా
“నెక్కడి వాసుదేవు డిల నేనొకరుండన వాసుదేవుడన్
దక్కినవాడు నందక సుదర్శన శార్ఙ గదాది హేతులన్
స్రుక్కక పట్టినన్, దెసల జుట్టిన నిర్మల కీర్తి పట్టునే!”

పౌండ్రకుని మాటల ద్వారా అతని మూర్ఖత్వం ఎంత వ్యంగ్యంగా బయటపడుతోందో చూడండి! నందకము, సుదర్శనము, శార్ఙము, గద – యీ ఆయుధాలు కృష్ణునికి ఉన్నాయని చెప్పి తనకీ చేయించుకున్నవాడు పౌండ్రకుడు. వాటివల్ల తనే అసలైన వాసుదేవుడనని భావిస్తున్నాడు. కాని వాసుదేవుడని లోకమంతా నిర్మల కీర్తి ఉన్నది శ్రీకృష్ణునికే. అందువల్ల ఇక్కడ పౌండ్రకుడన్న ప్రతి మాట నిజానికి తనకే వర్తిస్తుంది, కృష్ణునికి కాదు. ఆ సంగతి ఆ సభలో ఉన్నవారికందరికీ తెలుసు. పాఠకులుగా మనకి కూడా తెలుసు. తెలియనిదల్లా పౌండ్రకునికి. దీనివల్ల అతనెంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడో అక్కడున్నవాళ్ళకీ, మనకీ కూడా బాగా అర్థమవుతుంది. పౌండ్రకుని స్వభావం మొత్తం ఆ రెండు వాక్యాల్లో ధ్వనింపజేశాడు సోమన! దీనిని dramatic-irony అనవచ్చునేమో!

తాను సూక్ష్మంగా చెప్పదలచుకున్న విషయాన్ని సోమన కథాకథనమూ, రసపోషణ ద్వారా కూడా సాధిస్తాడు. దానికి ఒక ఉదాహరణ నరకాసుర యుద్ధం. దీన్ని మొదట చదువుతున్నప్పుడు నాకొక సందేహం వచ్చింది. యుద్ధానికి శ్రీకృష్ణుడు సత్యభామని ఎందుకు వెంటబెట్టుకు వెళ్ళినట్టు? కనీసం దాని గురించి వాళ్ళ మధ్యనెలాంటి సంభాషణా జరగకపోవడమేమిటి? కథ మొత్తం చదివాక ఆ సందేహం తీరిపోయింది. ఇంతకుముందే వివరించినట్టు, యీ ఘట్టమంతా చదివితే అది సత్యభామ శ్రీకృష్ణుల శృంగార కేళిలానే అనిపిస్తుంది. ఇక అప్పుడు సత్యభామ కృష్ణునితో ఎందుకు వెళ్ళినట్టు, దాని గురించి వాళ్ళ మధ్య ఎలాటి చర్చ జరగలేదేమిటి అనే ప్రశ్నలకి తావే ఉండదు కదా! కథనము, రసపోషనల ద్వారా శ్రీకృష్ణునికి నరకాసుర వధ ఒక శృంగార కేళితో సమానమని సోమన ధ్వనిస్తాడు.

ఇలాగే మరొక కథ కాశీరాజు పంపించిన కృత్యని చంపడం. ఇంతకు ముందు చెప్పినట్టుగా దీని కథనం చాలా విచిత్రమైనది – చాలా భాగం పాచికలాటే! శ్రీకృష్ణుడు సత్యభామతో పాచికలాడుతూ ఆటలో వెనకబడతాడు. ఇంతలో కృత్య ద్వారక పైకి మంటలు చిమ్ముతూ వస్తుంది. ముసలివారు కొందరు వచ్చి శ్రీకృష్ణునికి మొరపెట్టుకుంటారు. దానికి కృష్ణుడిచ్చిన సమాధానం అటు పాచికలాట పరంగా సత్యభామతో అన్నట్టూ అన్వయించుకోవచ్చు, ఇటు కృత్య పరంగానూ అన్వయించుకోవచ్చు! ఈ కథనం ద్వారా కృత్యా సంహారం శ్రీకృష్ణునికి పాచికలాటతో సమానం అన్న ధ్వనిని సోమన సృష్టిస్తాడు.

ఉత్తరహరివంశంలో నాకు కనిపించిన ముఖ్య కవిత్వ లక్షణాలని ఇప్పటిదాకా ఒకటి రెండు ఉదాహరణలతో వివరించాను కదా. అయితే, యీ కావ్యంలో వీటి ప్రాముఖ్యం ఏమిటి, అసలు సోమన యీ కావ్యంలో చెప్పదలచుకున్న పరమార్థం ఏమిటన్నదానిపై నా ఆలోచనలు ఇప్పుడు వివరిస్తాను.

కావ్య ధ్వని
ఆధునిక కవిత్వం లాగానే ప్రాచీన కావ్యాలు కూడా చాలా రకాలు. కొన్ని చదవగానే గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. ఆ కావ్యాలకి అనుభూతే ప్రథానం. దాని వెనక మరేదీ దాగి ఉండదు. పోతన భాగవతం, శ్రీనాథుని కావ్యాలూ దీనికి ఉదాహరణలు. మరి కొన్ని కావ్యాలు చదివినప్పుడు మనకొక అనుభూతి కలుగుతుంది. కానీ అక్కడితో ఆగిపోక, వాటిని మరికొంత లోతుగా చూస్తే అందులో కవి చెప్పాలనుకున్న మరొక అంశమేదో స్ఫురిస్తుంది. అందరికీ ఒకే అర్థం స్ఫురించాలని లేదనుకోండి! మనుచరిత్ర దీనికొక ఉదాహరణ. ఇంకొన్ని కావ్యాలు అర్థమవ్వని అత్యాధునిక కవిత్వం వంటివి. సూటిగా పాఠకుల మనస్సుని తాకే అనుభూతి వీటికి ప్రథానం కాదు. సంక్లిష్టత ప్రథానం. ఇందులో కవి చెప్పదలచుకున్న అంశం ఏమిటన్నది మరింత అస్పష్టంగా ఉంటుంది. ఈ వ్యాసం మొదట్లో చెప్పినట్లు కొన్ని కొన్ని వాక్యాలు ఆ కావ్యాన్ని అర్థం చేసుకోవడానికి కీలకమని అనిపిస్తాయి. దాని బట్టి ఆ కావ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకొక్కరు ఒకో రకంగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఉత్తరహరివంశం ఇలాంటి కావ్యం!

ఒకటి రెండు వాక్యాలని పట్టుకొని ఒక చిన్న కవితని అర్థం చేసుకోవచ్చునేమో కాని ఒక పెద్ద కావ్యమంతటినీ అర్థం చేసుకోవడం సాథ్యమయ్యే పని కాదు. ఆ కావ్య రచన – కథ, కథనం, పాత్ర చిత్రణ, వర్ణనలు – కవి చెప్పదలుచుకున్న అంశాన్ని ధ్వనింపజేయాలి. దానినే కావ్యధ్వని అంటారు. ఉత్తరహరివంశం లోని కావ్యధ్వని గురించి విశ్వనాథ సత్యనారాయణ ‘ఒకడు నాచన సోమన్న’ అన్న పుస్తకాన్ని రాశారు. సోమన స్థాపించాలనుకున్న విషయం విష్ణువు యొక్క పరమస్థితి అని విశ్వనాథ ఆలోచన. పరమస్థితి అంటే అతని పరమాత్మ తత్వమన్నమాట. ఉత్తరహరివంశం లోని కథల సంవిధానము, వాటి కథనము విష్ణు పారమ్యాన్ని ఎలా ధ్వనింపజేస్తున్నాయో ఆ పుస్తకంలో వివరించారు. ముఖ్యంగా నరకాసురుని కథ గురించి, జ్యోతిష పరంగా ఇచ్చిన వివరణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నరకుడు నిజానికి భూమినుంచి విడిపోయిన ఒక గోళమని, అది భూమికి దగ్గరగా వచ్చి దాన్ని నాశనం చేసే ప్రమాదం ఏర్పడినప్పుడు, కాల స్వరూపుడైన విష్ణువు దాన్ని ఛిన్నాభిన్నం చేయడమే నరకాసుర వధ అని కొన్ని ఆధారాలతో వివరించారు.

కాని, విశ్వనాథ ఉత్తరహరివంశం లోని కావ్యధ్వని గురించి ఇచ్చిన వివరణ నాకు పూర్తి సంతృప్తినివ్వలేదు. ఇంకా ప్రశ్నలు మిగిలిపోయాయి. అప్పటికే ఎఱ్ఱన హరివంశం ఉంది కదా. అది విష్ణువుని పరమాత్మునిగా స్థాపించడం లేదా? మళ్ళీ పనిగట్టుకొని సోమన ఎందుకు చెయ్యాలనుకున్నాడు? పోని అనుకున్నా, పోతన భాగవతంలా భక్తి ప్రథానంగా ఎందుకు రచించలేదు? లేదా కావ్యంగా రచించాలనుకుంటే తను గురువుగా భావించే తిక్కనని అనుసరించి కావ్యమంతా నాటకీయ శైలిలో ఎందుకు రచించలేదు? తిక్కనలో లేని సంక్లిష్టత, వక్రత ఎందుకిందులో ప్రవేశపెట్టినట్టు? ఇలా చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. అదిగో సరిగ్గా అప్పుడే యీ వ్యాసం మొదట పేర్కొన్న వాక్యాలు మనసులో నాటుకున్నాయి:

“తమతమ లోనిచూడ్కి దము దార కనుంగొను మాడ్కి నింత గా
లము నిను నీవ చూచితి తలంపున నీవును నేన కావునన్”

ఇవి శివుడు శ్రీకృష్ణునితో అనే మాటలు. భగవంతుడు భక్తునితో చెప్పే మాటలు. తపస్సంటే ఏమిటో చెప్పే మాటలు. తమ లోపలికి తొంగి చూసుకొని, తమని తాము తెలుసుకోవడమే తపస్సంటే. అలా తపస్సు చేస్తే చివరికి ఏమవుతుంది? భగవంతుడే తాను, తానే భగవంతుడన్న పరిపూర్ణ జ్ఞానం కలుగుతుంది. శంకరుల అద్వైత మతం చెప్పేదిదే. అయితే ఇంత లోతుగా ఆలోచించనప్పుడు, శివుడు మాటలు మరోలా అర్థమవుతాయి. శివుడు కృష్ణునితో “నీవును నేన కావునన్” అని అన్నాడు. అంటే శివుడూ కృష్ణుడూ ఒకటే. ఇది శివ కేశవుల అద్వైతం. ఈ మాటల్లో రెండు రకాల అద్వైతాలు మనకి కనిపిస్తున్నాయన్న మాట. పైకి కనిపించేది శివకేశవుల అద్వైతమైతే, మరొక రకంగా చూస్తే కనిపించేది జీవ పరమాత్మల అద్వైతం. నిజానికి యీ రెండూ కూడా ఒకటే. అద్వైత సిద్ధాంతంలోనే శివకేశవులకి అభేదం చెప్పబడింది.

ఉత్తరహరివంశం లోని పరమార్థం ఇదేనని నాకనిపించింది. హరిహరుల అభేదం ద్వారా, అద్వైత మతాన్ని స్థాపించడం నాచన సోమన ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. కావ్యమంతా శ్రీకృష్ణుని కథలే అయినా, ఇందులో చాలా చోట్ల కనిపించే శివుని ప్రసక్తి నా ఆలోచనని బలపరుస్తోంది. కావ్యం మొదట్లోనే బలరాముని గురించిన వర్ణన ఒకటుంది.

పాతాళాధిపుడైన శేషుడు ప్రలంబఘ్నుండు నారాయణ
ప్రీతిం బుట్టిన శంకరుండని జనుల్ పేర్కొన్నచో నంధకో
ద్భూత స్నేహము గామపాలతయు దప్పుం దప్పుగాకేమి ప్ర
ఖ్యాతిం బొందడె పాండురాంగ మహిమన్ హాలాహలస్వీకృతిన్

బలరామునికి శివుడితో పోలిక చెప్పాడు. అదీ ఎంత వక్రతతో చెప్పాడో చూడండి! నారాయణుడు తాను కృష్ణావతారమెత్తుతూ తనకెంతో ప్రీతిపాత్రుడయిన శంకరుని బలరామునిగా జన్మించమన్నాడని ప్రజలు అనుకుంటారట. కాని అలా అనుకుంటే అంధక స్నేహము (అంధకుడు శివుడు చంపిన ఒక రాక్షసుడు, ఇది శివుని పరంగా. అంధకులన్న తెగ యాదవులకు మిత్రులు, ఇది బలరాముని పరంగా), మన్మథునిపై (ప్రద్యుమ్నుడు) చూపిస్తున్న ప్రేమ ఎలా కుదురుతాయి? అది కుదరకపోతే మాత్రమేం. తెల్లని శరీరం కలిగి ఉండడం, హాలాహలాన్ని (బలరాముని విషయంలో నాగలి, శివుని పరంగా విషము) ధరించడం అన్న విషయాలతో ప్రఖ్యాతిని పొందాడు కదా. ఇదీ అర్థం! ఈ సందర్భంలో బలరామ వర్ణన సంస్కృత హరివంశం లోనూ, ఎఱ్ఱన హరివంశంలో కూడా ఉంది. కాని అక్కడ శంకరునితో పోలిక లేదు. ఇది సోమన కోరుండి ప్రత్యేకంగా చేర్చినది.

ఉత్తరహరివంశం కథలలో, రెండిటిలో తప్పించి అన్నిటిలోనూ శివుని పాత్ర కనిపిస్తుంది. శివుడు కనిపించని రెండు కథలూ నరకాసుర వధ, పౌండ్రక వధ. అయితే ఇంతకుముందే వివరించినట్టుగా, నరకాసుర వధలో శ్రీకృష్ణుని వర్ణనలోనూ, పౌండ్రకుని కథలో నారదుని వర్ణనలోనూ శివుడు మనకి సూక్ష్మంగా దర్శనమిస్తాడు. ఉత్తరహరివంశంలోని కావ్య ధ్వని అద్వైతమే అన్నదాన్ని బలపరిచే మరొక దృష్టాంతం హంస డిభకుల కథలో కనిపిస్తుంది. హంస డిభకులు దూర్వాసుని అవమానపరిచడానికి కారణం, అతను గృహస్థాశ్రమాన్ని కాదని సన్యాసాన్ని ప్రచారం చేస్తున్నాడని. ఎఱ్ఱన హరివంశంలో లేని యీ కథని ప్రత్యేకించి సోమన తెలిగించాడు. సన్యాస స్వీకారాన్ని ప్రోత్సహించేది అద్వైత మతమే! అంటే హంస డిభకులు అద్వైత మతాన్ని విరోధించినందుకే కృష్ణుడు వాళ్ళని సంహరించాడని సోమన ఉద్దేశ్యమన్న మాట!

హంస డిభకుల కథలోనూ, బాణాసుర వృత్తాంతంలోనూ శివుని కన్నా శ్రీకృష్ణుడే అధికునిలా కనిపిస్తాడు. కాని తరచి చూస్తే వారిలో బయటకి కనిపించే తారతమ్యాలతో బాటు, మూల తత్వం ఒకటే అన్న విషయం కూడా ధ్వనిస్తుంది. ఈ అంశాన్ని ముందుగా, స్పష్టంగా స్థాపించే కథ శ్రీకృష్ణుడు శివుని గురించి తపస్సు చేసిన కథ. హరిహరుల అభేదాన్ని యీ పద్యం ఎంత అద్భుతంగా రూపుకట్టిస్తోందో చూడండి. ఇది శివకేశవులు ఒకరినొకరు కలుసుకున్నప్పటి దృశ్యం:

ఇత్తెఱగున నయ్యిరువురు
చిత్తముగతి నొడలు గలసి సిద్ధాంత పరా
యత్తులగు మునుల యెఱుకకు
విత్తై చెలువారె జమిలి వేల్పని తెలుపన్

‘జమిలి వేలుపు’ ఎంత చక్కటి తెలుగు పదం! శివకేశవుల పెనవేత, వాళ్ళు ఇద్దరు కాదు ఒకరే అన్న భావాన్ని ‘జమిలి వేలుపు’ (వేలుపులు కాదు, ఒకటే వేలుపు) అనే పదం అద్భుతంగా ధ్వనింపజేస్తోంది. చివరిదైన బాణాసుర వృత్తాంతముతో యీ జమిలి వేలుపు తత్వం పరమావధి సాధించింది. ఎఱ్ఱన హరివంశం విష్ణు పారమ్యాన్ని చాటేదే కాని అద్వైతాన్ని స్థాపించేది కాదు. అయితే, భక్తి ప్రథానంగానో లేక పూర్తి కావ్య శైలిలోనో ఎందుకు రచించలేదు అన్న ప్రశ్న ఇంకా మిగిలుంది. ఇంతటి వైవిధ్యమూ, వక్రత, సూక్ష్మత ఎందుకు తన కావ్యంలో ప్రవేశపెట్టాడు? రస నిర్వహణలో సాధారణ మార్గాన్ని అనుసరించకుండా కలగాపులగంగా ఎందుకు సృష్టించాడు?

ఈ ప్రశ్నలన్నిటికీ నాకు తోచిన జవాబు ఒకటే. సోమన తన కావ్యంలో చెప్పదలచుకున్న పరమార్థానికి అనుగుణంగానే ఇలాటి రచన చేశాడని. అద్వైత మతం శుద్ధ వేదాంతం. జ్ఞాన ప్రథానమైనది. దీనిని అర్థం చేసుకోవాలంటే, అనుభవంలోకి తెచ్చుకోవాలంటే, భక్తి మార్గం సరిపోదు. రసానుభూతికి స్థానం లేదు. ఏ రసమూ, ఏ అనుభూతీ లేని ఒక స్థిర చిత్తం అవసరం. ఈ కావ్యం పాఠకుని మనసుని అలాటి స్థితివైపు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంది. దానికి సహాయపడేవే ఇందులోని వైవిధ్యం, వక్రత, సూక్ష్మత లక్షణాలు. ఎక్కడికక్కడ ద్వంద్వాలని చూపిస్తూ, దానికి శ్రీకృష్ణుడు ఎలా అతీతుడో వర్ణిస్తూ, అద్వైత మతాన్ని స్థాపించాడు సోమన. అందుకే యీ కావ్యంలో ఏ రసమూ నిజానికి రస స్థాయిని చేరుకోదు. చేరుకునే లోపలే పాఠకుని మనస్సుని వేరే వైపుకి మళ్ళిస్తాడు సోమన. ఎలా అయితే ఆధునిక జీవిత సంక్లిష్టతని ప్రతిబింబించడానికి కొందరు కవులు కవిత్వంలో అనుభూతికన్నా సంక్లిష్టతకి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారో, అదే రకంగా క్లిష్టమైన అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించడం కోసం రసం కన్నా వక్రతకీ వైచిత్రికీ, తద్వారా సంక్లిష్టతకీ స్థానమిచ్చాడు సోమన. ఎలా అయితే కొందరు ఆధునిక కవులు దీనికోసం వ్యాకరణాన్ని తోసిరాజన్నారో, అలాగే నాచన సోమన అప్పటికి ప్రాచుర్యంలో ఉన్న రస సిద్ధాంతం వంటి అలంకార శాస్త్రాలని తోసిరాజన్నాడు! కాకపోతే యీ సంక్లిష్టతకి శబ్ద సౌందర్యమనే చక్కెర పూత పూసి మనకీ కావ్యాన్ని అందించాడు.

అయితే అద్వైతమతాధారంగా, పూర్తి కావ్య శైలిలో కూడా కావ్యాన్ని నిర్మించవచ్చు. కొంతవరకూ తిక్కన చేసినది ఇదే. మరి సోమన ఎందుకలా చెయ్యలేదు అన్న అనుమానం ఇంకా పూర్తిగా పోదు. తనలా చెయ్యలేకనా? అలా అనుకోడానికి వీలు లేకుండా, హంస డిభకుల కథని అద్భుతమైన నాటకీయ శైలిలో నిర్మించాడు. కాబట్టి దీనికి వేరే కారణమేదైనా ఉండాలి. నాకు తట్టిన కారణం యిది. అతనీ కావ్యాన్ని ఉద్దేశించిన పాఠకవర్గం వేరు, తిక్కన పాఠక వర్గం వేరు. తిక్కన, కాస్తంత సాహిత్య పరిచయం ఉన్న సాధారణ పాఠకుల గురించి భారత రచన చేస్తే, నాచన సోమన కవులనీ, పండితులనీ, తత్త్వజ్ఞులనీ ఉద్దేశించి యీ ఉత్తరహరివంశం రచించాడనిపిస్తుంది. అలాటి పాఠకులే ఇలాంటి కావ్యాన్ని అర్థం చేసుకోగలరు. మరి కవి తాను ఉద్దేశించిన పాఠకులని యీ కావ్యం ఎంతవరకూ ప్రభావితం చేసిందో మనకి తెలియదు. అయితే నాచన రచనా శైలి చాలామందిని చాలా రకాలుగా ప్రభావితం చేసిందన్నది స్పష్టం. శ్రీనాథుడు, పోతన, తెనాలి రామకృష్ణుడు దీనికి సాక్ష్యం.

ఇక్కడ నేను వివరించిన విషయాలన్నీ, కేవలం ఉత్తరహరివంశం ఆధారంగా నేను చేసిన ఊహలే. వీటికి చారిత్రక ఆధారాలని వెతకడం అవసరం. ఉత్తరహరివంశానికి అవతారిక ఉండి అది మనకి దొరికితే కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరకవచ్చు. తెలుగు పరిశోధకులెవరైనా యీ విషయమ్మీద దృష్టిపెడితే బాగుంటుంది.

ఉపయుక్త గ్రంథములు:

ఉత్తర హరివంశము – నాచన సోమనాథుడు
ఒకడు నాచన సోమన – విశ్వనాథ సత్యనారాయణ
నాచన సోమనాథుడు కావ్యానుశీలనము – నడకుదిటి వీరరాజు పంతులు
ఆంధ్రవాఙ్మయమున నాచన సోమనాథుని కీయదగిన స్థానము – రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ
నాచన సోముని నవీన గుణములు – రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ
ఎఱ్ఱన నాచన సోమనల కవితా తారతమ్య పరిశీలన – ఆచార్య తుమ్మపూడి కోటేశ్వర రావు
హరివంశము – ఎఱ్ఱన
-------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

Thursday, June 27, 2019

కేనాపారా


కేనాపారా




సాహితీమిత్రులారా!

1.

గేజ్ నది దాటి కుట్రపారా పల్లె వైపుగా నడుస్తున్నాను. అటు ఇటు గోధుమపసుప్పచ్చ మట్టి దుబ్బ చేలు. పంటకోతలు ఐపోవచ్చాయి. కుట్రపారా ఇండ్ల పైకప్పుల మీదకెక్కివున్నాడు సూర్యుడు. ఇండ్లల్లోనుంచి పిల్లల్నీ పెద్దల్నీ తొందరపెడుతున్నాడు. పొగమంచు పలచబడింది. టౌనుకి పోయే సైకిళ్ళు ఎదురొస్తున్నాయి. జైరాంజీ పేడతట్టల కావిడి ఎత్తుకుని నన్ను దాటిపోయినాడు. ఉమేశ్ ఈపూట కూడా బడి ఎగ్గొట్టేసినట్టుంది. మేకలను తోలుకుని ఇటే వస్తున్నాడు. వాడు పాటందుకున్నాడు. ఆవుల మంద మూల మలుపు తిరుగుతున్నది. ఊరి ప్రారంభంలో రెండో ఇంటి మట్టిగోడకు వరిగడ్డి కట్టలను మోసే కావిడికర్రలు ఆనించి కూర్చున్న వృద్దులిద్దరూ లేతయెండను అనుభవిస్తూ ఏదో చెప్పుకుంటున్నారు. వీధుల్లోనుండి పిల్లల ఆటా పాటలు వినబడుతున్నాయి. నల్లపొడ కట్టిన ఇంటి పైకప్పుల మీద గుమ్మడిపువ్వులు నవ్వుతున్నాయి.

కుట్రపారాకు పోయే మట్టిబాట దిగి వరిచేను గట్టుమీదకి ఎక్కినాను. గట్టుమీద పాలపిట్ట కూర్చుని ఉంది. కొద్దిగా అవతల నదిగట్టుపైన మట్టిదిబ్బమీద అయిదారుగురు స్త్రీలు మూటలు పక్కన పెట్టుకొని కూర్చొని ఉన్నారు. ‘ఏం ఫోటో తీస్తున్నావ’ని అడిగింది అందులో ఒక స్త్రీ నన్ను.

గట్టుమీద పాలపిట్ట ఎగిరిపోయింది.

దగ్గరగా వెళ్లి వారికి కెమెరా డిస్‌ప్లేలో పాలపిట్టను చూపించాను. ‘ఇంకా ఏమున్నాయో చూస్తామ’న్నారు. సాల్ చెట్లు, ఆకులు, పురుగులు, ఏట్లో కొంగలు, కెమెరాలో ఉన్నవి చూడమన్నాను. “మేమిప్పుడు పోయే అడివిలో ఇట్లాంటివెన్నో ఉంటాయి. అక్కడ నది కూడా ఉన్నది. మాతో వస్తావా?” అన్నది వాళ్ళల్లో ఒక యువతి.


అంటే ఆ స్త్రీలు బయలుదేరింది అడివికి. అడవి పిలిచేది. వెళ్ళటం ఎప్పుడూ వీలుకాలేదు. రానని ఎట్లా అంటాను! అప్పటికప్పుడు వాళ్ళతో ఎట్లా వెళ్ళాలన్న ఆలోచన రాలేదు. నమ్మలేక వస్తానన్నాను. అడవిలో ఇట్లాంటివి ఎన్నో ఉంటాయన్న యువతి ఎప్పుడో నన్ను వాళ్ళ ఊరిలో చూసిందట. ఇప్పటికి కుట్రపారా రెండుసార్లు వెళ్లాను. ఆ ఊరిలో మొట్టమొదట ఎదురయ్యే ఇంట్లో పుష్ప, ఆమె చెల్లెలు సుమిత్రలతో పరిచయం ఉంది నాకు. నావెంట కుట్రపారా అంతా తిరిగి చూపించేది సుమిత్రనే. పుష్ప, సుమిత్రల వదినకు చెల్లెలట ఈమె. పేరు లీల.

మూటలు చంకన పెట్టుకుని వరిచేల గట్లమీద గబగబా నడుస్తూ ఒక దిక్కునుండి ఇద్దరూ, మరో దిక్కునుండి ముగ్గురూ వచ్చి కలిశారు. వచ్చినవారిలో పుష్ప, ఆమె తల్లి కూడా ఉన్నారు. వారివెనక మరొక స్త్రీ పరుగుపరుగున వచ్చింది. చంటిపిల్లవాడితో ఆలస్యమైందన్నది. మిగతా స్త్రీలను అందుకోగలిగినందుకు నవ్వింది. ఆమె పేరు పూర్ణ. ఆ తరువాత మాటల్లో తెలిసింది.

అందరు వచ్చినట్లేననుకున్నారు. మూటలెత్తుకుని అడవి దిక్కు తిరిగారు.

అందరిలో పెద్దవాళ్ళు శాంతాబాయి, కమ్లాదేవి. ఎన్నో ఏళ్లుగా అడివికి పోయి కట్టెలు తెచ్చిన అనుభవజ్ఞులు వాళ్ళు. వారి అడుగులతో అడుగులెయ్యబోయిన నన్ను, ఈమె కూడా వస్తుందా, అన్నట్లు చూశారు. వస్తానంటుందన్నారు లీల, ఆమెతో ముందు నదిగట్టు మీద కూర్చున్న నలుగురూ. శాంతాబాయి, కమ్లాదేవి నన్ను ఇంటికి తిరిగి పొమ్మన్నారు. అడవికి నేను రావొద్దన్నారు. చీకటి పడిపోతుందన్నారు.

ఏఏ కారణాలచేత వాళ్ళు నన్ను వద్దంటున్నారో నేను గ్రహించగలను.


నాకు తెలుసు. ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చిన రోజుల్లో ఒక సాయంత్రం మా క్వార్టరు కిటికీలోనుంచి చూస్తున్న నాకు సాలవృక్షాలకింద వీళ్ళు కనిపించారు. కట్టెల మోపులు చెట్టుకొమ్మలకి ఆనించి నిలబెట్టి ఉన్నాయి. చెట్ల మొదళ్ళమీద కూలబడ్డారు. ఒకరి తలలో ఒకరు పేలు చూసుకుంటున్నారు. ఇంకాస్త నడిస్తే ఊరు. చెట్ల నీడలు సాగి ఉన్నాయి. సాయంత్రపు నారింజ రంగు ఎండ. చెట్లమీద పడుతోంది. కట్టెల మోపులమీద పడుతోంది. ఆ స్త్రీల ముఖాలమీద తృప్తిపడి వెలుగుతోంది. ఒక్కోసారి కట్టెలెత్తుకుని సాలవృక్షాల కిందికి వచ్చేటప్పటికి చీకటైపోయేది. మసకగా ఆకారాలు మాత్రం కనిపించేవి. ఇప్పటికి రెండు వారాలైంది, సాయంత్రంపూట కేనాపారా స్త్రీలు కట్టెల మోపులెత్తుకుని అడవినుంచి వస్తూ నాకు దారిలో ఎదురయ్యారు. రేపు కూడా అడవికిపోతే వారి వెంబడి నేను కూడా వస్తానన్నాను. తెల్లవారుతూనే బయల్దేరతాం ఇక్కడికే వచ్చి ఉండమన్నారు, వాళ్ళతో అడివికి నేను పోవచ్చునన్నారు. మధ్యాహ్నానికి అన్నం బాక్సులో పెట్టుకున్నాను. నీళ్ళ బాటిల్ సంచిలో పెట్టుకున్నాను. కేనాపారా స్త్రీలు చెప్పిన వేళకి వాళ్ళు చెప్పిన కదంబవృక్షం కింద నిలబడి ఎదురుచూసి చూసి నిరాశతో వెనుతిరిగి పోయాను. వాళ్ళంతా చీకట్లోనే వెళ్లిపోయారని ఊళ్లోవాళ్ళు చెప్పారు.

ఈ పూట అడవికి పోయే అదృష్టం ఇట్లా నాకు కలుగుతుందని నేను అనుకోలేదు.

వారంతా మధ్యాహ్నానికి రొట్టెలు మూటల్లో కట్టుకుని వచ్చారు. కెమెరా తప్ప నావి వొట్టి చేతులు. ఇంట్లోనుండి వస్తూ పాలు త్రాగాను. చెట్లెమ్మడి, నదివెంబడి, చేలవెంబడి తిరిగి తిరిగి ఆకలైతేనే ఇంటికి చేరేది నేను. వస్తూ వస్తూ కడుపునిండా అన్నం తినే వచ్చానని, సాయంత్రందాకా నాకు ఆకలి వెయ్యదని చెప్పాను. అన్నం తిని వచ్చానని అబద్దం చెప్పక నాకు తప్పలేదు.

“బాత్ ఓ నహీ హై దీదీజీ. హమారె సాత్ జ్యాదా రోటీ బీ హై. ఇత్నా దూర్ చల్నా ఆప్కో ఆదత్ నహీ హైనా!” (మేమంటున్నది అదికాదు అక్కా. మా దగ్గర రొట్టెలు ఎక్కువే ఉన్నాయి. ఇంత దూరం నడవటం నీకు అలవాటు లేదు కదా!) పుష్ప అన్నది.

“మేడమ్‌జీ, ఆప్ కో కుచ్ హోగా తో?” (మేడమ్‌జీ, నీకెదన్నా జరిగితే?) నడుస్తున్నవాళ్ళ మధ్యలోనుంచి ఎవరో అన్నారు. అడవికి దూరమైనందుకే కదా!

వాళ్ళంతా మాట్లాడుతున్నది ఛత్తీస్‌గఢీ బాష. అందులో హిందీ ఎక్కువగా ఉన్నది. హిందీని నేను అర్థంచేసుకుంటాను. హిందీలో సమాధానం కూడా చెప్పగలను. శాంతాబాయి, కమ్లాదేవి మాట్లాడేది నాకు అర్ధం కానిది లీల, పుష్ప హిందీలో చెప్తున్నారు.

నేను నడుస్తానని వారితో ఎట్లా చెప్పేది? నాకేమీ కాదని ఎలా వివరించను? నా మూలంగా వారు ఎక్కడా ఆగిపోవలసిన పరిస్థితి ఎదురుకాదని నాకు తెలుసు. నేను నడుస్తానన్నాను. మొబైల్ చూపించాను. ‘నా దగ్గరిది ఉన్నది, ఏమన్నా జరిగితే ఇంటికి ఫోన్ చేస్తాను, మీకు భయం లేద’న్నాను. మరో అబద్దం ఆడవలసివచ్చింది. ఫోన్లో బ్యాటరీ ఎంతోసేపు నిలవదు. అడవిలో టెలిఫోన్ సిగ్నల్ కూడా ఉండకపోవచ్చు. అడవిని చూడాలన్న నన్ను కాల్చేస్తున్న ఆశ తప్ప నేను అడవికి పోడానికి నా చేతుల్లో ఏదీ లేదు.


మాటల్లోనే నది దూరమైంది. సాలవనం దాటి నడిచినాము. పత్రపాలివారి వరిచేలు, పత్రపాలి ఇండ్ల గుమ్మాలు దాటి నడిచినాము. గుమ్మాల ముందున్నవారు నిలబడి, కొత్తగా కట్టెలవాళ్ళ నడుమ నడుస్తున్న నన్ను, చేస్తున్న పనులాపి చూస్తున్నారు. అప్పటికే నన్ను తెలిసినవాళ్ళు చిరునవ్వు నవ్వుతున్నారు. పత్రపాలిని దాటేసినాము. అది నడక కాదు, పరుగూ కాదు. పరుగుపరుగున నడక. గట్లకి అలవాటైన అడుగులు.

మొదట తడబడినా వారి వేగాన్ని నా అడుగులు ఎప్పుడో అందుకున్నాయి. శాంతాబాయి, కమ్లాదేవి పరుగూపరుగున ముందుకు నడుస్తూ నన్ను వెనక్కి పొమ్మంటూనే ఉన్నారు ఇంకా.

సుశీల్ కుమార్జీ. పత్రపాలి గ్రామ సర్పంచి, ఎదురొచ్చాడు. మోటార్ సైకిల్ మీద మమ్మల్ని దాటిపోతున్నాడు. నాకు ముందూ వెనకా నడుస్తున్న స్త్రీలను పలకరించాడు. శాంతాబాయి, కమ్లాదేవి సర్పంచిని ఆపి చెప్పారు, నన్ను ఇంటికి వెళ్ళిపొమ్మని చెప్పమని.

ఆయన నన్ను బెహన్‌జీ అని అంటూ “జంగిల్ కో జానా జంగిల్ సే వాపస్ ఆనా కమ్‌సేకమ్ తీస్ చాలీస్ కిలోమీటర్ హోగా. ఏ ఔరత్ లోగోంకో ఆదత్ హై. ఓ లోగ్ రోజ్ జాతే హై. సోచ్ లో. ఆప్ జానా చాహ్తే తో కోయి నహీ రుకేగా…” (అడవికి పోనూ రానూ మొత్తం ముప్పై నలభై కిలోమీటర్ల దూరముంటుంది. వీళ్ళందరికీ అది అలవాటు. వాళ్ళు రోజూ వెళ్తారు. ఆలోచించండి. వెళ్లాలని నీకుంటే నిన్నెవరూ ఆపరు.) అని నవ్వి, బండి నడుపుకుని వెళ్ళిపోయినాడు.

‘అడవికి పోవాలని నీకుంటే నిన్నెవరూ ఆపరు’–ఇంత చల్లని మాట వింటాననుకోలేదు! ఇప్పటిదాకా ఇట్లా నాతో అన్నవాళ్లు లేరు. సుశీల్ కుమార్జీకి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ మాటని, ఆయన్ని నేనెప్పుడూ మర్చిపోను.

పత్రపాలినీ, ముందున్న బడ్‌గాఁవ్‌నీ కలుపుతూ తారు రోడ్డుంది. తారు రోడ్డు కాకుండా వరిచేలల్లోకి మళ్ళినాము. అది అడ్డబాట. గట్లమీద ఏర్పడిన సన్నటి దారి. నడిచీ నడిచీ ఆ స్త్రీల అడుగులు ఎరిగిన బాటలు. ఒకరి వెనక ఒకరు వరిచేల గట్లమీద వారట్లా నడుస్తుంటే ఒక్కొక్కరూ నడుస్తున్నట్టులేదు. ఒక్కటిగా నడుస్తున్నట్టుంది. వరుసలో నేను ముందు నడుస్తున్నాను ఇప్పుడు. నా అడుగులు వారి అడుగులతో సమాన వేగంతో పడుతున్నాయి. నా నడక వారి నడకలో ఒకటయ్యింది.

నాకెవరూ దారి చూపించే అవసరం లేదిప్పుడు. ఎక్కడో రెండు బాటలుగా విడిపోయేచోట నాలుగడుగుల ముందే ఎవరో ఒకరు వెనకనుండి ఎటు తిరగాలో చెప్తున్నారు.

పన్నెండు మైళ్ళ పైన దూరం నడిచాము. పొలాలు దాటాము. అయిదారు పల్లెటూర్లు దాటాము. చుడీపహాడ్ దాటి నడిచాము. కాలువలూ చెరువులూ దాటాము. మెలికలు తిరుగుతూ నడిచాము. రాళ్ళ దారుల్లో నడిచాము. ఎగుళ్లూ దిగుళ్ళలో నడిచాము. చుడీపహాడ్ పక్కన నీళ్ళకుంట పక్కన ఒక్కచోట కొద్దిసేపు ఆగాము. అక్కడ అందరూ పొదల చాటుకి వెళ్లి వచ్చారు.

చుడీపహాడ్ దాటిన తరువాత దారిపక్కన నేలమీద నల్లటి బెర్రీపండ్ల కుప్ప కనిపించింది. ఇట్లాంటిది నేను నదివొడ్డుమీద సాలవృక్షాల క్రింద చూశాను. ఏమిటది అని అడిగాను. ఎలుగుబంటి విసర్జితమన్నది నా ముందు నడుస్తున్న సీమ. నేను ఊహించినది నిజమే. లేదంటే ఎవరు ఈ పండ్లన్నీ అక్కడ కుప్పపోస్తారు! రాత్రివేళల్లో ఎలుగుబంట్లు మా గది అవతల నదిలో దాహం తీర్చుకోడానికి వస్తాయేమో.

కుట్రపారా, పత్రపాలి ఊళ్ళ మధ్యలో, ఆమపారా పోయే దారిపక్కన ఒంటరి బూరుగు మహావృక్షమొకటుంది. దాని కొమ్మలనిండా తేనెపట్లున్నాయి. ఆ చెట్టుకిందికి ఎవరూ పోరు. సాయంకాలాల్లో నేను ఆ చెట్టుకింద గడుపుతుంటాను. అక్కడ కూడా చూశాను ఇటువంటిది. చీకట్లో ఎలుగుబంట్లు సంచరిస్తున్న చోట పగలు నేను తిరుగుతున్నాను!

2.
అడవిలో ప్రవేశించేటప్పటికి సూర్యుడు నడినెత్తిమీదికొచ్చాడు. తెల్లగా ఎండ కాస్తోంది. పైన నీలాకాశం. నీడల్ని దగ్గరకి లాక్కొని మిట్టమధ్యాహ్నపు ఎండను ఆనందిస్తున్నాయి చెట్లు. అప్పుడొకటి ఇప్పుడొకటి పసుపురంగుకి తిరిగిన ఆకులు రాలిపడుతున్నాయి. మధ్యాహ్నపు నిశబ్దాన్ని అనుభవిస్తోంది అడవి. పక్కనే ఎక్కడో దూరంగా మేక మెడలో గంట మోగుతూ ఉంది. నీటి చప్పుడు వినిపిస్తోంది.

నది ఎదురైంది. నడుములోతు మించి పారుతున్నది. రొట్టెల మూటల్ని నడుముకి బిగించి కట్టి, చీరల్ని మోకాళ్ళపైకి చెక్కారు. ఒక చేతిలో చెప్పులు పట్టుకుంటూ నావైపు చూశారందరు. ఇంత లోతు నీళ్లున్న నదిని దాటడం నాకిదే తొలి అనుభవం. ప్యాంటు మోకాళ్ళ దాకా లాగాను. ఒక చేతిలో నా బూట్లు పట్టుకున్నాను. రెండో చేతిలో కెమెరా ఎత్తి పట్టుకున్నాను. ఆ స్త్రీల వెనక నది దాటడానికి నేను సిద్దమయ్యాను. నీళ్ళలో రాళ్ళమీద నా అడుగులు తెలిసినట్లే పడుతున్నాయి.


“జంగిల్ మే ఆప్ క్యా కరోగీ!?” (అడవిలో ఏం చేస్తావు!?) ఇవతలి ఒడ్డుమీద నేను బూట్లు తొడుక్కుంటున్నప్పుడు పూర్ణ అడిగింది. ముదురాకుపచ్చరంగు మీద తెల్లని ఎంబ్రాయిడరీ పువ్వులున్న చీర కట్టుకుంది పూర్ణ. నిండుగా ఆమె నవ్వుతుంటే, ఓనాడు నేను చూద్దామని పోయినప్పుడు చెట్ల తలలనిండా గుత్తులు గుత్తులుగా విరబూసిన సాలపుష్పాలు నవ్వుతున్నట్టుగా ఉంది. అడవిలో ఏం చేస్తాను నేను! ఈ స్త్రీలంతా కట్టెలకోసం వచ్చారు. కట్టెలు ఏరుతారు. అడవికి నేనెందుకొచ్చాను అన్నట్లున్న ఆమె ప్రశ్నకు నేనేమని బదులిచ్చేది? నా ఆలోచనలు ఎప్పుడూ అడవి మీద ఉంటాయని చెప్పేదా? అడవి నన్ను పిలుస్తూ ఉన్నట్టుగా ఉంటుందని చెప్పనా? అడవిలో నాకేంపనని అడుగుతున్నది పూర్ణ!

నగరాల్లో నాకు ఊపిరాడదని, నున్నటి దారుల్లో నా అడుగులు తడబడతాయని, అడవీ ఆ పల్లెటూళ్ళూ తప్ప, చేలూ గట్లూ తప్ప నగరం తెలియని ఈ అమాయకురాలికి ఒక్క మాటలో ఎట్లా వివరించేది?

“తెలియదు,” అన్నాను.

ఆమె నవ్వింది.

నడుముకు కట్టిన రొట్టెల మూటలనట్లానే ఉండనిచ్చినారు. చెప్పులు వేసుకొని తలోదిక్కు చెదిరిపోయారు. వారి దృష్టంతా ఇప్పుడు ఎండిన కట్టెలమీద ఉన్నది. పొదల్లో దొరికినవి, ఎండి, నదిలోకి వంగిన కొమ్మలు విరిచి ఎవరి కుప్పలో వారు జమచేస్తున్నారు. మధ్యమధ్యలో ఓ ఓ అని కేకలు వేస్తున్నారు. మేక మెడలో గంట అందుకే. నాకు అందిన కట్టెలు నాకు అందుబాటులో ఉన్న కుప్పలో వేస్తున్నాను నేను. ఆ ప్రదేశమంతా ఇసుక, గులకరాళ్ళు, అక్కడక్కడా ముళ్ళ పొదలతో ఉన్నది. ఒకదగ్గర తపసిచెట్టు కొమ్మమీద కూకుడు గువ్వలు నాలుగు కబుర్లాడుకుంటున్నాయి. ఏరిన కట్టెలు పక్కన పెట్టి కెమెరా బయటికి తీశాను. వాటికి దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను.

నాక్కొంచం అవతల ‘భైంసా! భైంసా!'(అడవిడున్న! అడవిదున్న!) గుసగుసగా అన్నారు ఎవరో.

ఏది ఏదని మిగతావారు వచ్చి గుమికూడారు. కొమ్మమీద గువ్వలు ఎగిరిపోయాయి. వాళ్ళు చూస్తున్నవైపు చూశాను. నది ఆవల ఎత్తుగా ఉన్న మట్టి దిబ్బమీద రెండు ముర్రాజాతి గేదెలు పడుకొని నెమరువేస్తున్నాయి. తలలు, కొమ్ములొక్కటే కనిపిస్తున్నాయి. వాటిని చూచి అడవి దున్నలనుకున్నారు వీళ్ళు. మామూలు గేదెలను చూసేదే తక్కువ. ఆవులు, ఎద్దులే వాళ్లకుండేది. జంగిల్ భైంసా కాదన్నారు శాంతాబాయి, కమ్లాదేవి. వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకున్నారు. అందరు మళ్ళీ వెనక్కి తిరిగారు.

నేను నిలబడ్డ చోటుకి కొద్దిగా అవతల నిశబ్దంగా పట్టుపురుగు గూడు అల్లుకుంటున్నది. అటు కదలబోయాను. వారటు నాలుగడుగులు వేశారు. నేనిటు నాలుగడుగులు వేశాను. నాకు నాలుగంటే నాలుగడుగుల అవతల పొదపక్కన చెట్ల నీడలో ఆకులమీద సర్రున చప్పుడైంది. అప్పటిదాకా పొదల నీడలో చుట్ట చుట్టుకుని పడుకుని ఉన్నట్టుంది. నిద్రాభంగమై ముందు బుస్సుమని లేచింది నల్లత్రాచు.

ఆ శబ్దానికి అడవి ఉలిక్కిపడ్డట్టైంది.

ఎక్కడివాళ్ళం అక్కడ బిగుసుకునిపోయాము. అది భయమో ఏమిటో తెలియడంలేదు. నేనొక అపూర్వ దృశ్యాన్ని చూస్తున్నట్టు ఉన్నది. పాముల్ని దగ్గరగా చూడాలని ఉంటుంది నాకు. ఆ క్షణం నేనొక కాలసర్పానికి అతి సమీపంలో నిలబడి ఉన్నాను. కళ్ళు కళ్ళూ కలుసుకున్న అనుభూతి. వెనక్కి తిరిగి పొదల్లో కలిసిపోయిందది. ‘కాలానాగ్!’ తేరుకుని అన్నారెవరో. శాంతాబాయి నావైపు చూస్తోంది. నాకేదన్నా ప్రమాదం జరగవచ్చని ఆ క్షణందాకా కలవరపడుతూ ఉందామె. ఆమె కళ్ళు ఇప్పుడు తేటగా ఉన్నాయి. అడవిని కాపాడేది కాలనాగేనని వీరు విశ్వసిస్తారు. అడవిలో అది కనబడటాన్ని పుణ్యం చేసుకున్నట్లు భావిస్తారు. నావల్ల తమకీ దర్శనభాగ్యం కలిగిందన్నారు సీమ, పూర్ణ, అక్కడ నుంచున్న స్త్రీలంతా.

3.
అప్పటిదాకా కూడబెట్టిన కట్టెలనన్నిటినక్కడనే ఉంచారు. అక్కడినుంచి మేము ఇసుక ప్రదేశాన్ని దాటి నది రెండో పాయను చేరుకున్నాము. పెద్ద దూరం కాదు.

కొరియా కేంద్ర పీఠభూమికి పడమరన సోన్హత్ కొండల్లో పుట్టి, గేజ్ నదిగా పేరుపొంది, వీరి గ్రామం కుట్రపారాతోపాటు కేనాపారా, పత్రపాలి, నర్సింగాపూర్, మోదీపారా, దేవరీ పల్లెల అన్ని అవసరాలనూ తీర్చి ఝిన్క్, అటెం వాగులను తనలో చేర్చుకుని, ఇప్పుడు మేమున్న చోటుకి కొద్దిగా ముందు ఈ అడవిలో ప్రవేశించి, రెండు పాయలుగా చీలి, వందమీటర్లు రెండుగా ప్రవహించి, మళ్ళీ ఒక్కటై అడివిదాటి, పట్మ అనే ఊరి దగ్గర హస్‌దేవ్ నదిలో కలుస్తుంది. వీరికది ప్రాణనది. పొద్దున్న నిద్రలేస్తే ఆ నది చుట్టూ తిరుగుతాయి వీరి జీవితాలు.

వారి ఊరినానుకుని పారే ఆ నదే ఈ నదని వీరికి తెలుసా అని నాకు సందేహమే.


నది రెండో పాయ, ప్రవాహాన్ని మేము దాటవలసిన చోట లోతు మరీ ఎక్కువగా ఉన్నది. నా నడుము దాటి ఉండవచ్చు. నాలుగైదు అడుగులు ఆ లోతుని దాటితే ఆ తరువాత ప్రవాహం విస్తరించింది. నేను దాటగలనా అని నా వైపు చూశారు మళ్ళీ. వారందరి వెనక నేను దాటుతానన్నాను.

నది విస్తరించి ప్రవహిస్తున్నచోట నా పాదాల లోతే ఉంది. అడుగున ప్రతి రాయి కనిపించేటంత తేటగా, చల్లగా ఉన్నది నదిలోని నీరు. కుట్రపారా స్త్రీలు కట్టెలేరడంలో పడిపోయారు. ప్రవాహంలో అటు ఇటు నడుస్తున్న నా ప్రాణాలు జివ్వుమన్నాయి చల్లదనానికి. అవతలి గట్టుమీద మూడు కాలిబాటలు కనిపించాయి. అవతలి గ్రామాల నుండి వచ్చేవాళ్ళు, లేదా ఇవతలి వాళ్ళు అటుపోవడం వల్ల ఏర్పడ్డవై ఉంటాయి. కొంచం ముందుకుపోయి కొండను ఒరుసుకుని ప్రవహిస్తున్నది నది. అటువైపు మనిషి దూరలేనంత దట్టంగా ఉంది అడవి. అడవిపక్షుల పాటలేవో వినిపిస్తున్నాయి. తెలియని చెట్లు కొండవాలులో కనిపిస్తున్నాయి. దట్టంగా ఉన్న ఆ అడివిలోకి ఎవరూ అడుగుపెట్టరన్నది పుష్ప.

కట్టెలు కూడినాయి. ఇక్కడ ఏరిన కట్టెలు ఎత్తుకుని ప్రవాహాన్ని దాటి తిరిగి ఇసుక ప్రాంతాన్ని చేరుకున్నాము.

ఇంకా నడుముకే ఉన్న మూటలు విప్పారు. మోపులకు కట్టే తాళ్ళను బైటికి తీశారు. మూడు తాళ్ళను ఎడంగా పరిచి వాటిమీద కట్టెలు పేర్చసాగారు. ఒక్కో కట్టెనీ పేర్చుతూ ఉన్నది పూర్ణ. మెల్లగా చెట్లక్రింద నీడలు అదృశ్యమైనాయి. వచ్చినంత దూరమూ తిరిగి నడవాలి. చీకటి పడేలోగా ఇంటికి చేరుకోవాలి. పైకి చూసిన నాకు సూర్యుడు కనిపించలేదు. మేఘాలు మూసుకొస్తున్నాయి. దారిలో మోపు వదులు కాకూడదు. ఒక్కరు ఆగితే అందరూ ఆగాలి. పండిన ఆకులు రాలుతున్నాయి. గాలి తోసుకొచ్చింది. మట్టివాసననీ మోసుకొచ్చింది. పూర్ణ తన కట్టెలు మోపు కట్టేసింది. శాంతాబాయి, కమ్లాదేవి వారి మోపులు వారు కట్టేశారు. కొత్త కోడలు రాణికి కట్టెలు మోపు కట్టడంలో అనుభవం లేదు. రాణికి పూర్ణ సాయంచేసింది. నలుగురైదుగురూ ఆమెనే పిలిచారు. ఆమె పనిని ఒక ధ్యానంలా చేసుకుపోతుంది. ఆమె ఏది చేసినా అందంగా ఉంటుంది. వాన మొదలైంది. ఆకులమీద టపటపా సన్నటి చినుకులు. మేఘం జరిగింది. ఎండ కూడా తిరిగొచ్చింది.

వాన పెద్దది కాకముందే అడివి దాటిపోవాలన్నది పూర్ణ నావైపు చూచి.

చెప్పులు విడిచి కట్టెల మోపులో దూర్చారు. మూటలు విప్పి ఇంకా తెరవని టిఫిన్ బాక్సులని చిన్నగుడ్డలో కట్టి నడుముకి కట్టుకున్నారు. మూటలు కట్టి తెచ్చిన గుడ్డని మెలితిప్పి తాడులా పేని చుట్టలాగా చుట్టారు. అడవినుండి ఇంటికి తిరుగు ప్రయాణానికి అంతా సిద్దమైంది.

ఎవరి మోపుని వారు ఒక చివర ఒక చేత్తో పట్టుకున్నారు. ఎత్తి చెట్ల కొమ్మలకు ఆనించారు. చుట్టలా మడిచిన గుడ్డని తలమీద కుదురుగా పెట్టుకుని తలని మోపు మధ్యలో ఆనించి రెండో చివరని పైకెత్తారు. కట్టెల మోపులు అందరి తలలమీదకు వచ్చాయి. ఇంత సులువుగా ఇంత బరువుని ఎత్తుకోగలరని నాకెట్లా తెలియలేదు!

నడక మొదలైంది. చినుకులు ఆగిపోయినాయి!

వచ్చిన వైపున కాకుండా ఇంకోవైపు నదిని దాటలనుకున్నారు. అటువైపు నడిచాము. అక్కడ చూస్తే నది లోతు భుజాలను తాకేలా ఉన్నది. లోతు చూస్తానని ముందు కమ్లాదేవి నీళ్ళలోకి దిగింది. మరొక స్త్రీ ఆమెను అనుసరించింది. మేమంతా ఇవతలి ఒడ్డుమీద నిలబడి చూస్తున్నాం. వారిద్దరి భుజాలను తాకాయి నదిలో నీళ్ళు. ఎట్లాగో వాళ్ళు నది దాటగలిగారు. ఇక్కడ నది దాటవద్దనుకున్నారు. అటు చేరినవాళ్ళు ఇటు రాలేదు. వాళ్ళు ముందుకే సాగారు. దారిలో కలుస్తామని కేకేసి చెప్పారు. ఇవతల ఒడ్డుమీద ఉన్న మేమంతా వెనక్కితిరిగాం.

నదిపాయ వెంట ముందుకి నడిచి లోతు తక్కువగా ఉన్న చోట మోపులు దించారు. ఎవరి సహాయం ఎవరూ తీసుకోలేదు. ఏదో చెట్టు కొమ్మనో, మొదలునో చూసుకుని మోపుని కొద్దిగా ముందుకి వంచితే అది నేలను తాకింది. ఏటవాలు చేసి రెండోచివరని కొమ్మకు తాకించడమే. తిరిగి మోపుని ఎత్తుకోవడం ఎంత సులువు!


తిరిగి ఎండకాయడం మొదలైంది. నదిలో చేతులు కడుక్కొని, బండరాళ్ల మీద కూర్చుని రొట్టెలు తిన్నాము. నదిలో పారుతున్న నీటినే తాగారు. దోసిట్లోకి తీసుకొని అదే నీటిని నేనుకూడా తాగాను.

తలమీద బరువుని, బండరాళ్ళమీద అడుగులనీ బ్యాలన్స్ చేసుకుంటూ నదిని దాటారు. ఎత్తు గడ్డలు ఎక్కి పల్లాలు దిగి అడవినీ దాటాము. వారందరి వెనక నడుస్తున్నాను నేను, వారి వేగాన్ని అందుకునే ప్రయత్నం చేస్తూ. ఈసారి వాళ్ళతో సమంగా అడుగులెయ్యడం నావల్ల కావటంలేదు. తలల మీదున్న అంత బరువులతో అంత వేగంగా నడక ఎలా సాధ్యమైందన్నది నేనిప్పుడు స్వయంగా చూస్తున్నాను! కుడిచేయి తలపైకి చేరి మోపుని పట్టుకుంటే, ఎడమ చేతిని మోచేతివద్ద మడుస్తూ ఆడిస్తూ, భూమికి ఆనీ ఆననట్లు వేగంగా, లయబద్దంగా పడుతున్న వారి అడుగులు బరువుని అలకన చేస్తున్నాయి. అది నడకలా లేదు. అడవిపాటకు అడుగులేస్తున్నట్టుగా ఉన్నది. ఆడవి ఇచ్చినది ఎత్తుకుని ఆనందంతో ఇంటికి పరుగు తీస్తున్నట్టున్నది.

ముఖాల్లో చెదరని అదే నవ్వు. ప్రశాంతత.

4.
వర్షం మళ్ళీ అందుకుంది. ఈ సారి పెద్ద పెద్ద చినుకులు. అడవి వెలుపల అక్కడొకటీ అక్కడొక్కటీ ఇండ్లున్నాయి. వారి వ్యవసాయాలున్నాయి. చినుకులు పెద్దవవడంతో ఒక ఇంటి ముంగిట కట్టెల మోపులు దించి చెట్టుకానించి ఆ ఇంటి పంచకిందికి దూరాము. చిన్న పశువులకొట్టం అది. నున్నగా అలికిన నేలమీద మేకపిల్లలు ఆడుకుంటున్నాయి. ఇంట్లోవాళ్ళు బైటికొచ్చి వాన తగ్గేదాకా ఉండిపొమ్మన్నారు. మేకపిల్లల్ని వొళ్లోకి తీసుకుని అందులోనే సర్దుకుని కూర్చున్నాము. వాన ఎప్పటికి తగ్గుతుందన్న ఆందోళన వారి ముఖాల్లో కనపడలేదు. ఇండ్లవద్ద కళ్ళాల్లో వడ్లున్నాయి. వడ్లు తడుస్తాయనీ, కూరగాయల పంటకు నీళ్ళు ఎక్కువవుతాయనో తక్కువవుతాయనో అనుకోలేదు. వానని చూస్తూ కూర్చున్నారు.


ఒకనాడు నేను కొత్తగా కుట్రపారాను చూద్దామని ఆ ఊళ్ళో అడుగుపెట్టినప్పుడు ఇంటి వాకిలి ఊడుస్తూ పుష్ప నాకు కనిపించింది. కేనాపారాలో ప్రాథమిక పాఠశాలకు వచ్చిపోయే పిల్లలను దారిలో కలవడమే తప్ప ఆ ఊరితో నాకింకా పరిచయంలేదు అప్పటికి. ఎవరితోనో పరిచయం జరగకపోదు. ఇట్లానే మిగతా పల్లెలన్నీ నాకు తెలిసింది. ఊరు చూద్దామని వచ్చానంటే ముందు ఇంట్లోకి పిలిచి వద్దన్నా వరిపిండి పకోడీలు చేసిపెట్టి చెల్లెలిని తోడిచ్చి పంపింది. దగ్గరుండి ఊరు చివర బడిదాకా పోయి చూపించమని చెప్పింది. పెండ్లికాని యువతులు ఇద్దరూ. తండ్రి లేడు. ఇంటినానుకుని ఉన్న రెండెకరాల భూమిని వేరుపడి ఉంటున్న అన్న సాయంతో పండిస్తారు. వడ్లు, గోధుమలు, ఆలుగడ్డలు, ఆవాలు, వలిసెలు, కూరగాయలన్నీ పండుతాయి ఆ రెండెకరాల్లో. ఒక్క ఉప్పు కొనుక్కుంటే చాలు. అదే జాగాలో రెండు పెద్ద మామిడిచెట్లున్నాయి. చింతచెట్టుంది, రేగు చెట్టుంది, వెదురు చెట్లున్నాయి. చెట్లనల్లుకుని, ఇంటి పైకప్పునల్లుకుని చిక్కుడు, సొర, గుమ్మడి, నేతిబీర తీగలున్నాయి. ఆవులున్నాయి.

ఒక్క పుష్ప కుటుంబమే కాదు, కుట్రపారాలో ఇండ్లన్నీ, ఆ చుట్టుపక్కల పల్లెలన్నీ ఇంతే.

ఇదిగో ఇప్పుడు అడివినుండి వంటకి ఎండుకట్టెలు ఎత్తుకుపోడానికి వచ్చారు. వరి కోసి, మడులు చేసి, కూరగాయల విత్తనాలు నాటి, కట్టెలకోసం వస్తారు. ఏడాదికి సరిపోయేటన్ని కూడబెడతారు. కూడేదాకా అడవికి వస్తారు. ఒక్క గురువారం అడవికి రారు. ఆ రోజు సంత.

వాన వెలిసింది. లేచి మోపులెత్తుకున్నారు. కొద్దిదూరం నడిచి దారిపక్కన ఇప్పచెట్టు కింద ఆగాము. చిన్నచిన్నరాళ్ళు అక్కడక్కడా వేసి ఉన్నాయి చెట్టు కింద. రోజూ ఆగే చోటనుకుంటాను. రాళ్ళమీద కూర్చున్నాము. ఒక రాయి మీద కూర్చుని బూట్లు విప్పాను. పొక్కులొచ్చి ఉన్నాయి పాదాలు. మూడు కిలోమీటర్లకి మించిన దూరము నేనెప్పుడూ నడవలేదు. కాలిపిక్కల్లో నొప్పిని నేను పైకి అనలేదు.

“ఆదత్ హోజాయేగా దీదీ!” లీల అన్నది. బూట్లు తొడుక్కుని లేచి నిలబడ్డాను. అందరూ లేచారు.


సాయంత్రపు నీరెండలో వరిచేల గట్లమీద వరుసగా నడుస్తున్న మా నీడలు మడులు దాటి సాగిపోయినాయి. ముందు నడుస్తున్న సీమ ఒకచోట మోపు దించి నిలబెట్టింది. మిగతా ఒక్కొక్కరు వచ్చి మోపులు దించి సీమ నిలబెట్టిన మోపుకి ఆనించారు. గూడులాగా తయారైంది. పక్కన కూర్చుని కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. బడ్‌గాఁవ్ దాటింతరువాత పత్రపాలి వచ్చేముందు మరొకచోట ఈ సారి ముందు నడుస్తున్న పూర్ణ కట్టెల మోపు దించి నిలబెట్టింది. దాన్ని పట్టుకుని నిలబడింది. అంతా వచ్చి వారి మోపులు దించి నిలబెట్టి దాన్ని పట్టుకుని నిలుచున్నారు. నిలబడి రెండు నిమిషాలు విశ్రాంతి తీసుకున్నాం.

పత్రపాలి దాటింతరువాత వెనక్కి తిరిగి చూశాను. సూర్యుడు చిరిమిరి కొండల్లోకి దిగిపోయాడు. ఇండ్లు చేరుకుని పిల్లాపాపలతో ఆడుకొని విశ్రాంతి తీసుకుంటే రేపటికి కట్టెలు అడవిలో అతడు సిద్ధంచేసి ఉంచుతాడు.

సాలవృక్షాల క్రింద మా దారులు వేరైన చోట దారి నుండి పక్కకి తొలిగి నవోదయ స్కూలుకు వెళ్ళే బాటలో నుంచున్నాను. నడిచి వచ్చిన వైపు మళ్ళా వెనక్కి తిరిగి చూశాను. అడవి కనబడలేదు. చుడిపహాడ్ మాత్రం మసకగా కనిపిస్తూ ఉన్నది.

“దీదీజీ ఆజ్ కా దిన్ హమ్‌కో బహుత్ అచ్చా లగా! కల్ బీ ఆయేగా క్యా ఆప్?” (ఈరోజు నువ్వు మాతో కలవడం మాకందరికీ చాలా నచ్చింది. రేపు కూడా వస్తావా?) లీల నన్ను దాటిపోతూ అడిగింది.

రేపు రాలేను. కాళ్ళు పుండ్లుపడి ఉంటాయి. ఎల్లుండి గురువారం. సంత రోజు. శుక్రవారం వచ్చి ఇదే సాలవృక్షాల క్రింద వేచి ఉంటానని చెప్పాను.

అడవి నాకింకా కావాలి.

[జయతి లోహితాక్షన్ అనుభవాల సమాహారం అడవి నుంచి అడవికి అన్న పుస్తకంగా వెలువడినది దాని నుంచి ఈ కథనాన్ని అందిస్తున్నాం.]
------------------------------------------------
రచన: జయతి లోహితాక్షన్, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, June 25, 2019

కట్టమంచి వారి “కవిత్వతత్వ విచారం”


కట్టమంచి వారి “కవిత్వతత్వ విచారం”



సాహితీమిత్రులారా!

గత శత వసంతాల తెలుగు సాహిత్య ప్రస్థానాన్ని గురించి ఆలోచించేటప్పుడు మొట్టమొదట మనసులో మెదిలే కొద్దిమంది వైతాళికుల్లో కట్టమంచి రామలింగారెడ్డి గారొకరు. సరిగ్గా వంద సంవత్సరాల క్రితం, అంటే 1899లో రామలింగారెడ్డి గారు 20వ శతాబ్దంలో రాబోయే సాహిత్యానికి దారి చూపారు. 1899లో తన 19 సంవత్సరాల వయస్సులో వారి రాసి ప్రచురించిన “ముసలమ్మ మరణము” తెలుగు కవిత్వంలోకి కొత్త ఆలోచనను ప్రవేశపెట్టింది. నూటికి నూరుపాళ్ళు ఆధునిక కావ్యం కాకపోయినా అది విషాదాంత కథనూ, ఆధునిక ఇతివృత్తాన్నీ తెలుగు కవిత్వంలోకి ప్రవేశపెట్టింది. అదే సంవత్సరంలో రెడ్డి గారు మద్రాసు క్రైస్తవ కళాశాల ఆంధ్ర భాషాభిరంజనీ సంఘం వారి సమావేశంలో కళాపూర్ణోదయాన్ని గురించి ఒక ఉపన్యాసాన్ని చదివారు. అది చిలకమర్తి లక్ష్మీనరసింహం, వేదం వెంకటరాయ శాస్త్రి, దర్భా సుబ్రహ్మణ్యం మొదలైన పండిత ప్రకాండుల మెప్పును పొందింది. ఇంగ్లండులో విద్యాభ్యాసం పూర్తిచేసుకొని తిరిగివచ్చి, మైసూరులో ఆచార్యపదవిలో స్థిరపడిన తర్వాత అంటే 1914లో రామలింగారెడ్డి గారు దాన్ని విస్తృతపరిచి రాసి “కవిత్వతత్వవిచారము” అన్న పేరుతో ప్రచురించారు. ఆ గ్రంథం తెలుగుసాహిత్యాధ్యయనంలో కొత్త వెలుగును ప్రసరింప చేసింది.

19వ శతాబ్దం వరకు తెలుగు సాహిత్యరంగంలో సాహిత్యవిమర్శ లేదు. అంతేకాదు తెలుగులో సంస్కృతానికి భిన్నమైన సాహిత్యసిద్ధాంతం కూడా లేదు. దాదాపు ఏడువందల సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో ఒక యుగాన్నో, ధోరణినో, కావ్యాన్నో పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ ఎవరూ విమర్శ రాయలేదు. కవుల చరిత్రలూ, వ్యాఖ్యానాలూ మాత్రమే సాహిత్యవిమర్శగా చెలామణి అవుతుండేవి. ముఖ్యంగా ఒక కావ్యాన్ని తీసుకొని అందులోని వస్తువునూ, రూపాన్నీ విశ్లేషిస్తూ, వాటి పరస్పర సామంజస్యాన్ని చర్చిస్తూ, ఆ కావ్య ఉద్దేశాన్ని నిరూపిస్తూ విమర్శలు రాసే సంప్రదాయం అప్పటికింకా ప్రారంభం కాలేదు. కవిత్వవిమర్శ మొత్తం కావ్యం ప్రాతిపదికగా కాకుండా ఒక పద్యమో శ్లోకమో ప్రాతిపదికగా సాగుతూ వచ్చింది. ఈ ధోరణికి స్వస్తి చెప్పి ఒక కావ్యాన్ని సమగ్రంగా విశ్లేషించే విమర్శకు రామలింగారెడ్డి గారు “కవిత్వతత్వవిచారం”లో బాటలు వేశారు. అంతేకాకుండా ఒక ధోరణి కవిత్వాన్ని చర్చించి విలువ కట్టే సంప్రదాయాన్ని కూడా వారే ప్రారంభించారు. ఈనాడు ఆబాట ఎంతో విశాలమైంది. ఆ బాటలో ఎందరో సాహిత్యవిమర్శకులు నడుస్తున్నారు. నడుస్తూ ఆ బాటను మరింత విశాలం చేస్తున్నారు.

ఇంగ్లండులో చదువుకుంటున్నప్పుడూ, ఆ తరువాతా రామలింగారెడ్డి గారు అంతవరకూ వచ్చిన పాశ్చాత్యవిమర్శను శ్రద్ధగా అధ్యయనం చేశారు. సమాజానికి, సాహిత్యానికి మధ్య ఉన్న లేదా ఉండవలసిన సంబంధాన్ని అవగతం చేసుకున్నారు. ఆ తరువాతనే వారికి భారతీయ అలంకార శాస్త్రం లోని అసమగ్రత తేటతెల్లంగా అర్థమైంది. రామలింగారెడ్డి గారు ఇంగ్లండులోనూ, ఇతర యూరోపియన్‌ దేశాలలోనూ పారిశ్రామిక విప్లవం సృష్టించిన పరిణామాలను గమనించారు. శతాబ్దులుగా కొనసాగిన ఫ్యూడల్‌ సంస్కృతి పతనం కావటం, దాని స్థానంలో అంతకంటె అభ్యుదయకరమైన బూర్జువా సంస్కృతీ, ప్రజాస్వామ్య భావాలూ ఆ దేశాలలో విస్తరించటం రామలింగారెడ్డి గారిని ఆకర్షించింది. అలాంటి ఫ్యూడల్‌ వ్యతిరేక ప్రజాస్వామ్య భావాలను తెలుగు సాహిత్య విమర్శలోకి ప్రవేశపెట్టాలని వారు “కవిత్వతత్వవిచారం”లో ప్రయత్నించారు. పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతం ప్రభావం అందులో ఉండటం చేత ఆ గ్రంథం అనేక ప్రతివిమర్శలకూ, అపవాదాలకూ గురికావలసి వచ్చింది. ఫ్యూడల్‌ సామాజిక విలువల్ని సాహిత్యంలో పరిరక్షించే ఒక చిన్న పండిత వర్గం వారిని తీవ్రంగా వ్యతిరేకించింది. కాని కొత్తదనం కోసం ఎదురుచూస్తున్న అసంఖ్యాక సాహిత్యాభిమానులు దాన్ని సాదరంగా ఆహ్వానించారు.

రామలింగారెడ్డిగారు “కవిత్వతత్వవిచారం”లో ప్రధానంగా కవిత్వతత్వాన్ని గురించి చర్చించారు. మంచికవిత్వం యొక్క లక్షణాలను చెప్పారు. విజయనగరయుగం తర్వాత తెలుగు కవిత్వం ఎందుకు పతనమైందో, ఎలా పతనమైందో చూపించారు. భారతకవుల్లోనూ, “కళాపూర్ణోదయం”లోనూ ఉన్న గొప్పతనాన్ని చూపించారు. గొప్ప కవిత్వ లక్షణాలుగా వారు భావించే కల్పనాశక్తికీ, కథనానికీ, పాత్రపోషణకూ, నాటకీయతకూ, అంగాంగ సమన్వయానికీ (యూనిటీ) “కళాపూర్ణోదయం” వారికి మంచి ఉదాహరణంగా కనిపించింది. ఆ కావ్యాన్ని కూడా రామలింగారెడ్డి మినహాయింపులు లేకుండా మెచ్చుకోలేదు. ఆరవ ఆశ్వాసంలోని 189వ పద్యం వద్ద కావ్యాన్ని ఆపి ఉండవలసిందన్నారు. పింగళిసూరన్న గారే రాసిన “ప్రభావతీప్రద్యుమ్నం”లోని చవకబారు శృంగారాన్ని తీవ్రంగా విమర్శించారు.

రామలింగారెడ్డిగారి అభిప్రాయం ప్రకారం కవిత్వానికి భావనశక్తి ప్రాణం. “భావనశక్తి అంటే కావ్యంలోని విషయాలు పాఠకుని మనస్సులో ప్రతిబింబించేటట్టుగా ప్రత్యక్షంగా అవతారమెత్తేటట్టుగా చేయగల శక్తి” అని వారే నిర్వచించారు. వ్యాకరణమూ, యతిప్రాసలూ, అన్నీ కుదిరినా భావనాశక్తిలేని పాండిత్యం జీవం లేని ఆకారంలాగా జడంగా కనిపిస్తుందన్నారు. భావనశక్తిలేని కావ్యాలను చదవటం వల్ల “నూనెకు నష్టియే కాని కవితకు పుష్టి లేదు” అన్నారు.

“ఆలోచనలూ, భావాలూ, సంకల్పాలూ” మానవప్రకృతిలోని మూడు ప్రధానాంశాలుగా రామలింగారెడ్డి గారు గుర్తించారు. వీటిలో “భావాలు” భావనాశక్తిని విజృంభింపజేస్తాయని వారు భావించారు. భావాలు లేకుండా కొయ్యల్లాగానో, మహర్షుల్లాగానో నిర్వికారంగా ఉన్నవారు “పద్యాలు” రాయవచ్చునేమో కాని “కవిత్వం” రాయలేరన్నారు.

భారతకవుల తర్వాత ఆలంకారికతే కవిత్వంగా చెలామణి అయిందని రామలింగారెడ్డి గారు భావించారు. మితిమీరిన ఆలంకారికతకు కారణం భావశూన్యత మాత్రమేనని వారు తెగేసిచెప్పారు. తెలుగుకవుల్లో ఈ బలహీనత లేని వారు భారతకవులున్నారు. మన కవుల్లో ఎక్కువమంది పండితులు మాత్రమేననీ వారిలో కార్యోత్సాహమూ, భావప్రాబల్యమూ చాలా తక్కువనీ అన్నారు. అందుచేతనే వారిలో భావనాశక్తి తగినంతగా అభివృద్ధి చెందటానికి అవకాశం లేకుండా పోయిందని రామలింగారెడ్డిగారు “కవిత్వతత్వవిచారం”లో గట్టిగా ప్రతిపాదించారు. అందుచేతనే చాలామంది మన ప్రాచీన కవులు పాండిత్యాన్నీ, ఆలంకారికతనూ ఆశ్రయించారన్నది వారి సిద్ధాంతం. మితిమీరిన పాండిత్య ప్రదర్శనా, ఆలంకారికతా రసదృష్టికి ఎలా ఆటంకాలుగా నిలిచాయో రామలింగారెడ్డి ఈ గ్రంథంలో సోదాహరణంగా నిరూపించారు.

ప్రాచీన అలంకార శాస్త్రం మనదేశంలో కవుల ప్రతిభకు సంకెళ్ళు వేసిందనీ, సాహిత్యం విభిన్నమార్గాలలో వికసించకుండా అడ్డుపడిందనీ రామలింగారెడ్డి గారి నిశ్చితాభిప్రాయం. నాయకులనూ, నాయికలనూ జాతులుగా విభజించిన అలంకార శాస్త్రాల్ని చాలామంది కవులు “అదే వేదమనుకొని, ప్రమాణమను పిచ్చిపట్టి” మానవస్వభావచిత్రణను నిరాదరించారని రామలింగారెడ్డిగారి అభియోగం. వారు కావ్యాలలో పాత్రచిత్రణ సహజంగా ఉండాలన్నారు. పాత్రల మనస్సులలో కలిగే భావోద్రేకాలు చిత్రించాలన్నారు. “పేడివారి తెగకు చెందిన మన వేదాంతులు” మానవుల సహజభావోద్రేకాలకు “మనోవికారా”లన్న పేరుపెట్టి నిరసించారని రామలింగారెడ్డిగారు తీవ్రంగా ధ్వజమెత్తారు.

మన సాహిత్యంలో అతి ఎక్కువగా ఉన్న పునరుక్తినీ, అతి తక్కువగా ఉన్న ఉపజ్ఞనూ మొదటిసారిగా తీవ్రంగా ఖండించిన వారు రామలింగారెడ్డి గారే. సమకాలీన వాస్తవ జీవితాన్ని తిరస్కరించటమూ, అలంకారశాస్త్ర గ్రంథాల ఆధిపత్యాన్ని తెలిసో, తెలియకో అంగీకరించటమూ, జీవితాన్ని గురించి మౌలికంగా ఆలోచించే సాహసం లేకపోవటమూ అందుకు ముఖ్యకారణాలని వారు చెప్పారు. శాస్త్రాలలో అంటే సైన్సుల్లో ఒకరు ప్రతిపాదించిన విషయాన్ని మరొకరు గ్రహించవచ్చనీ, అది పునరుక్తి అనిపించుకోదనీ రామలింగారెడ్డిగారి అభిప్రాయం. కాని సాహిత్యంలాంటి కళల్లో ఆ పద్ధతి పనికి రాదంటారు వారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వారు “ఏలనో మన కవులేనాటికీ రుక్మిణీపరిణయములూ, సుభద్రాపరిణయములూ వ్రాయుచుండిరి. వారు పెండ్లాడి, పెండ్లాడి అలసిపోయి ఉన్నారు. వారికి పింఛను ప్రసాదించకున్న నెంతయు ఘోరము” అని తీవ్రంగా విమర్శించారు.

కావ్యంలో వస్తువూ, రూపమూ రెండూ ముఖ్యమేనని, కథకు సంబంధం లేని వర్ణనలు విసుగును కలిగిస్తాయని, నిర్మాణసౌష్టవం లేని కావ్యం పాఠకుని తాకలేదనీ రామలింగారెడ్డిగారు చెప్పారు. తన సిద్ధాంతాలకు తగిన ఉదాహరణల్ని ఈ గ్రంథంలో చూపించారు.

“కవిత్వతత్వవిచారం” వచ్చిన కాలాన్ని (1914) దృష్టిలో ఉంచుకొని చూస్తే రామలింగారెడ్డి గారి అభిప్రాయాలు విప్లవాత్మకంగా ఉంటాయి. వారికి పూర్వం మన సాహిత్యాన్ని గురించి అంత మౌలికంగా ఆలోచించే సాహసాన్ని ఎవరూ చేయలేదు. కాని ఆ తర్వాత రామలింగారెడ్డిగారు అంతకంటె మరేమీ చేయలేకపోయారు. ఆ కాలంలోనే వచ్చిన భావకవిత్వం కాని, ఆ తర్వాత వచ్చిన అభ్యుదయ కవిత్వం కాని రామలింగారెడ్డి గారిని బలంగా కదిలించలేకపోయాయి. “కన్యాశుల్కం” గొప్పతనాన్ని గుర్తించటమూ, “తృణకంకణం” రాసిన రాయప్రోలును అభినందించటమూ చేశారు గాని ఆ ఉద్యమాల సారాన్ని పట్టుకోలేకపోయారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సుప్రసిద్ధ విమర్శకుడు రా.రా. ఇలా అన్నారు.

“కట్టమంచి వారు ప్రబంధ కవిత్వాన్ని అంతగా చెడతిట్టిపోసినా తెలుగుకవిత్వానికి ఒక దారీ తెన్నూ చూపించలేకపోయారు. తెలుగు కవిత్వానికి ఆయన చేసిన positive contribution ఏమీలేదు. ప్రబంధకవిత్వం 19వ శతాబ్దంలోనే చచ్చింది. ఆ శవానికి అంత్యక్రియలు చేసిన ఘనత మాత్రం రామలింగారెడ్డిగారికి దక్కింది. ఆ తరువాత వచ్చిన భావకవిత్వం దశ ఆయన ఊహకే తట్టలేదు. నిజానికి ఆయనది చారిత్రాత్మకంగా ముందుచూపు కాదు”

రా.రా. అభిప్రాయంలో సత్యం లేదనలేము కాని అది పూర్తి సత్యం మాత్రం కాదు. అంతేకాదు రామలింగారెడ్డిగారు మొదటినుంచీ చివరివరకూ పరమచాదస్తమైన గ్రాంధికభాషనే రాశారు. 1951 వరకు జీవించినా అభ్యుదయ శిఖరాలను కూడా వారు తలెత్తిచూడలేదు. కానీ వారు ప్రబంధ కవిత్వంలోని గతానుగతికత్వం నుంచీ, అలంకారశాస్త్రాల సంకెళ్లనుంచీ, తుఛ్ఛశృంగారం నుంచీ సాహిత్యజిజ్ఞాసువుల దృష్టిని భావనాశక్తి వైపుకూ, వాస్తవిక జీవితం వైపుకూ మళ్ళించగలిగారు. అలా వారు పరోక్షంగా కొత్త కవిత్వానికి దారి చూపారు. ఆ తరువాత వారు ఘనీభవించి పోవటానికి రెండు కారణాలుండవచ్చు.

మొదటిది సాహిత్యం రామలింగారెడ్డి గారికి ప్రధాన కార్యరంగం కాదు. “కవిత్వతత్వవిచారం” ప్రచురించిన కొద్దికాలానికే వారు రాజకీయాల్లో, విశ్వవిద్యాలయ పరిపాలనలో తలమునకలుగా కూరుకుపోయారు. ఇంగ్లీషులో రొమాంటిక్‌ కవితతో, విమర్శతో బాగా పరిచయం ఉన్న రామలింగారెడ్డి గారికి తెలుగులో భావకవుల పట్ల వైముఖ్యం ఉండటానికి అవకాశం లేదు.

రెండవ కారణం సాధారణంగా మానవుడు తాను ఎంతవరకు మారాడో అంతవరకు మాత్రమే మార్పును ఆమోదిస్తాడు. తన్ను దాటి వెళ్ళే మార్పుల్ని ఆమోదించలేడు. ఇది చాలామంది మేధావుల్లో కూడా ఉన్న బలహీనత. బహుశా ఈ బలహీనత రామలింగారెడ్డి గారిలో కూడా ఉందేమో!

“కవిత్వతత్వవిచారం” వచ్చిన కొత్తలో దాని మీద చాలా ప్రతివిమర్శలు వచ్చాయి. కాళూరి వ్యాసమూర్తి శాస్త్రి గారూ, అక్కిరాజు ఉమాకాంతం గారూ, నోరి నరసింహశాస్త్రి గారూ ఆ గ్రంథం మీద విరుచుకుపడ్డారు. వీరెవరూ రామలింగారెడ్డి గారు లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పలేదు. వీరు రామలింగారెడ్డి గారు పాశ్చాత్యసులోచనాలతో తెలుగు సాహిత్యాన్ని చూస్తున్నాడన్నారు. రెడ్డిగారు పెద్ద పెద్ద పదవుల్లో ఉండటం చేత సాహిత్యంలో వారిమాట చెల్లుతోందన్నారు. కానీ కాలం వారిని పక్కకునెట్టి ముందుకు సాగింది. ఆనాడే విశ్వనాథ సత్యనారాయణ గారు “రామలింగారెడ్డి గారు తమ కవిత్వతత్వవిచారము రాసి విమర్శపదాల్లో గొప్ప దృక్పథం కలిగించి నవ్యసాహిత్యానికి కొత్తబోదెలు తవ్వారు” అన్నారు. ఈనాడు చే.రా. వంటి వారు “కాలానికి అవసరమైన విమర్శ కట్టమంచిది. కాలగమనం ఇష్టంలేక అన్నీ తాటాకుల్లోనే ఉన్నాయనే తత్వం ఆయన వ్యతిరేకులది” అంటున్నారు.
----------------------------------------------------
రచన: వల్లంపాటి వెంకట సుబ్బయ్య, 
ఈమాట సౌజన్యంతో

Sunday, June 23, 2019

అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం


అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం





సాహితీమిత్రులారా!

ఒకనాడు తెలుగునాట ప్రతి తల్లీ తన చిన్నారి ముద్దుబిడ్డ అన్నం తినడానికి మారాం చేస్తుంటే ఆ బుజ్జిని చంకలో వేసుకుని ఆరుబయటికి వచ్చి చంద్రుణ్ణి చూపించి
“చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే కోటిపూలు తేవే
బండెక్కి రావే బంతిపూలు తేవే
వెండి గిన్నెలో వేడిబువ్వ తేవే
అన్నిటినీ తెచ్చి మా పాపాయి కివ్వవే”
అని పాడుతూ అన్నం తినిపించే మధుర సన్నివేశం ప్రతి ఇంటా నేత్రానందాన్ని, హృదయానందాన్ని కలిగించేది. అయితే అంత చక్కటి పాటను రాసింది తాళ్ళపాక అన్నమాచార్యులని ఎవరికి తెలుసు? పాట ప్రజల్లోకి వెళ్ళినంతగా కవి వెళ్ళలేదు. అయినా పాట బతికిందీ అంటే కవి బతికినట్లే లెక్క.

పసిపిల్లల్ని ఉయ్యాలతొట్టెలోనో, కాళ్ళమీదనో పడుకోబెట్టి పాడే ఈ కింది జోలపాట కూడా అన్నమాచార్యులదే
“జో అచ్యుతానంద జోజో ముకుంద
లాలి పరమానంద లాలి గోవింద”

ఈ విధంగా ప్రజల నాల్కలపై నాట్యమాడే విధంగా, ప్రజలు పాడుకుని పరవశించటానికి అనువుగా, నిరక్షరాస్యుల్ని గాయకుల్ని చేసే విధంగా, జానపద కళారీతుల్ని ప్రతిబింబించేలా కీర్తనలు రాసి ప్రజాకవి అయ్యాడు అన్నమయ్య.

తాళ్ళపాక అన్నమాచార్యులు కడప జిల్లా రాజంపేట తాలూకా తాళ్ళపాక గ్రామంలో జన్మించాడు. 1408లో జన్మించిన అన్నమయ్య తెలుగులో మొట్టమొదటి వాగ్గేయకారుడు మనకు తెలిసినంతవరకు. పదహారో ఏటనే వేంకటేశ్వరుని సాక్షాత్కారం పొందిన “పదకవితాపితామహుడు”. అన్నమయ్య మొత్తం 32వేల సంకీర్తనలు రాసాడని తెలుస్తున్నా 12 వేలు మాత్రమే దొరికాయి.
“హరి యవతారమీతడు అన్నమయ్య
ఆకసపు విష్ణుపాదమందు నిత్యమై ఉన్నవాడు
భావింప శ్రీవేంకటేశు పాదములందె వున్నవాడు”
అని అన్నమయ్యను అతని పుత్రపౌత్రులు కీర్తించడంలో అతిశయోక్తిలేదు.

“ఏ వేల్పు సర్వేశ్వరుడే వేల్పు పరమేశు
డే వేల్పు … ఘనము
ఆవేల్పు తిరువేంకటాద్రి విభుడు”
అంటూ తన్మయత్వంతో తనివి తీరా తెలుగు వారి ఇలవేల్పు అయిన వేంకటేశ్వరస్వామి దివ్యమంగళ స్వరూపాన్ని నోరారా వర్ణించిన తెలుగుతల్లి ముద్దుబిడ్డ అన్నమయ్య.

తనకు ముందున్న పురాణ, కావ్య పద్ధతుల్ని కాదని సరికొత్త రీతిలో సంకీర్తనా సాహిత్యాన్ని సృష్టించిన సాహితీతపస్వి అన్నమయ్య. ” If angels are asked to speak, they will speak in poetry ” అన్నట్టుగా తెలుగు కవిత్వానికి ఒక అపరదేవతామూర్తిగా అవతరించాడు అన్నమయ్య.
అతడు ఆడిన మాటెల్ల అమృతకావ్యమైంది.
పాడిన పాటెల్ల పరమగానమైంది.
ప్రతి కీర్తననీ మధురభక్తితో అలౌకికజగత్తులో రచించి ఆ సౌగంధికపుష్పాల్ని దేవదేవుని పాదాలకు సమర్పించాడు అన్నమయ్య. అన్నమయ్య కీర్తనల్లో పెళ్ళిపాటలు, జోలపాటలు, గొబ్బిళ్ళపాటలు, ఏలపాటలు, సంవాదపాటలు, తుమ్మెదపాటలు, కోలాటపుపాటలు, సువ్విపాటలు, చిందుపాటలు, తందానపాటలు.. ఇలా ఎన్నో రకాలున్నాయి. కీర్తనల్లో గల విషయాన్ని బట్టి భక్తిపాటలు, శృంగారకీర్తనలు, వేదాంతకీర్తనలు, సాంసారికకీర్తనలు, వేడుకపాటలు,.. మొదలైన విధంగా కూడా విభజించవచ్చు. ఏ విభజనకీ లొంగని పాటలూ ఉన్నాయి, అన్ని రకాలకూ చెందిన పాటలూ ఉన్నాయి.

వివిధ జానపద గేయ లక్షణాల్ని ఆకళింపు చేసుకోవటం
భగవంతునితో మమేకం చెందటం
లోకపరిశీలనాశక్తిని కలిగి ఉండటం
వాడుక భాషకు ప్రాముఖ్యత ఇవ్వటం
జీవిత తత్వ్తాన్ని విడమరిచి చెప్పటం
ఇవీ అన్నమయ్య కీర్తనల గొప్పతనానికి మూలకారణాలు. పాందిత్యప్రదర్శనలు, భాషాభేషజాలు లేని నిసర్గరామణీయకతకి ఇతని కవిత్వం నిలువుటద్దం.

అన్నమయ్య పెండ్లిపాటలు చాలా ఉన్నాయి. వాటిల్లో గంధం పాటలు, బంతులాటపాటలు, వధూవరుల పాటలు, నలుగు పాటలు మొదలైనవి ఉన్నాయి. పెళ్ళిలో ప్రతి సంఘటనా వినోదాన్ని కలిగించేదే. జీవితంలో ఒక్కసారే జరిగే పెళ్ళీనాటి ముచ్చట్ల గురించి అన్నమయ్య “విడియో” తీసి చూపించాడు. తెలుగువారి సాంఘిక ఆచారాలకి ఈ పాటలు సాక్ష్యాలుగా నిలుస్తాయి.
“పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత
పెడమరలి నవ్వేటి పెండ్లికూతురు
పేరుకల జవరాలె పెండ్లికూతురు, పెద్ద
పేరుల ముత్యాలమెడ పెండ్లికూతురు..”
అంటు అలవేలు మంగ అలంకార వైభవాన్ని, హావభావ విలాసాల్ని అన్నమయ్య వర్ణించినా కొంచెం అటూ ఇటూగా తెలుగువారింటి పెళ్ళికూతుర్నే దృష్టిలో పెట్టుకున్నాడు.

కృష్ణుడికీ కొండలరాయనికీ అభేదం పాటిస్తూ గొబ్బిళ్ళ పాటలు రాశాడు. మార్గశిరమాసం. బాలికలు గుమ్మాల ముందు గొబ్బిళ్ళు పెట్టి వాటి చుట్టూ గుండ్రంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ నాట్యభంగిమలో పాడే ఈ పాట అత్యంత మనోహరం
“కొలనిదోపరికి గొబ్బిళ్ళో యదు
కులస్వామికిని గొబ్బిళ్ళో

కొండగొడుగుగా గోవుల కాచిన
కొండొక శిశువుకు గొబ్బిళ్ళో
వెండిపైడి యగు వేంకటగిరిపై
కొండలయ్యకును గొబ్బిళ్ళో”
ఇందులో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోపకులను రక్షించిన విధం సూచించబడింది. “కొండొక”, “వెండిపైడి”, “కొండలయ్య” వంటి తెలుగుదనం ఉండనే ఉంది.

తానే ఒక నాయికయై భగవంతునితో విరహం అనుభవిస్తున్నట్టు ఏలపాట రాశాడు అన్నమయ్య. సుదీర్ఘంగా సాగే ఏలపాట మధురభక్తికి పరాకాష్ట. అన్నమయ్య
“వేడుకుందామా వెంకటగిరి వేంకటేశ్వరుని..
ఆమటి మ్రొక్కుల వాడే ఆదిదేవుడే వాడు” అంటూ మనల్ని కూడ తన జట్టులో కలుపుకుంటాడు. మనతో నడిచివచ్చి అలిపురి, తలయేరు గుండు, మోకాళ్ళ ముడుపు మొదలైన వాటిని అక్షరీకరించి చూపిస్తాడు.
“అదివో అల్లదివో శ్రీహరివాసము”
“కొందలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు”
వంటివి ప్రచారం పొందటానికి కారణం ఛాందసమైన భక్తితత్వం కాదని గ్రహించాలి జీవనతత్వాన్ని బోధించే భక్తితత్వం ఆ కీర్తనల్లో ఉంది. వైరాగ్యచింతనతో, తాత్వికదృక్పథంతో, నిర్మలమైన ఆరాధనాభావంతో రాయటం వల్లనే అతని తలపులు తెలుగు వాడి మోక్షగృహానికి తలుపు లయ్యాయి.

సంవాదపాటలు ఎన్ని రాసినా
“రావే కోడల రట్టడి కోడల
పోవె పోవె అత్తయ్య పొందులు నీతో చాలును
రంకెలు వేయుచు రాజులెదుట నీవు
కొంకుగొసరు లేని కోడల
పంకజముఖి నీవు పలుదొడ్డ వారిండ్ల
అంకెల దిరిగేవు అత్తయా”
అనే అత్తాకోడళ్ళ సంవాదపు పాట అన్నమయ్య లోకజ్ఞతని చాటి చెప్తుంది.

సువ్వి పాటలు అన్నమయ్య కీర్తనల్లో విశేషమైనవి. ఇవి దంపుడు పాటల కిందికి వస్తాయి. ధాన్యం దంచేటప్పుడు శరీరక్లేశాన్ని పోగొట్టుకోవటానికి “ఇస్‌” అనే ధ్వన్యనుకరణ శబ్దమే వేగంగా దంచుతూ అన్నప్పుడు ఆ ఊపులో “సువ్‌” అన్నట్టు వినిపిస్తుంది. అందుకే ఇలాటి పాటల్ని సువ్వి పాటలన్నారు. వీటికే “రోకటిపాటలు” అనే పేరు కూడా ఉంది.
“సువ్వి సువ్వి సువ్వి సువ్వని
సుదతులు దంచెదరోలాల
వనితలు మనసులొ కుందెన చేసిటు
వలపులు తగనించో లాల
కనుచూపులనెడి రోకండ్లను
కన్నెలు దంచెద రోలాల..”
అనే సరసమైన పాటలతో పాటు మధురభక్తి భావాలు గల సువ్వి పాటలూ వున్నాయి.

అన్నమయ్య 15వ శతాబ్దిలోనే అభ్యుదయ భావాలు గల పరమయోగి. వృత్తిపనుల్ని గౌరవించాలన్నాడు. కులభేదాలను, అంటరాని తనాన్ని నిరసించి బ్రాహ్మణుడూ, చండాలుడూ అంతా సమానులే అని ఎలుగెత్తి చాటి “బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే” అని బోధించిన జ్ఞాని అన్నమయ్య.
“ఎక్కువ కులజుడైన హీనకులజుడైన
నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు
ఏ కులజుడేమి యెవ్వడైన నేమి
ఆకడ నాతడే హరి నెరింగిన వాడు”
అనటంలో అన్నమయ్య విశాలదృక్పథమే కాదు, మానవుడే మాధవుడన్న మహనీయసూక్తి దాగి ఉంది.

అన్నమయ్య కీర్తనల్లో ఉన్న మరొక గొప్పదనం వర్ణనావైభవం. శృంగారవర్ణనలు, వైరాగ్యవర్ణనలు, ప్రకృతివర్ణనలు, జీవితవర్ణనలు, .. అనేకం ఉన్నాయి. దేవదేవుని సౌందర్యాన్ని, అలమేలుమంగ విలాసాన్ని తనివితీరా వర్ణించాడు. జ్యోతిషశాస్త్రంలో చెప్పబడ్డ పన్నెండు రాసులు ఉపమానాలుగా గ్రహించి
“ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి..” అంటూ అద్భుతంగా వర్ణించాడు.

అన్నమయ్య కవితా వైభవం అతని భాషలో ఉంది. “ఏటిలో పైరు”, “నీళ్ళు నమలు”, “జలధిలో వానలు,” “వరదం గలిపిన చింతపండు”, “పిండంతే నిప్పటికి” వంటివి ఎన్నో పలుకుబడులు. సామెతలు, సూక్తులు ఆహ్లాదం కలిగిస్తాయి. “చాంగుబళా,” “జాజర”, “తందనాన,” “పురే”, వంటి విశేషణాలు వినూత్నంగా ఉండి గానానికి ఊతం ఇస్తాయి. తెలుగుభాషలో గల స్వఛ్ఛమైన భావసంపదకీ, సహజమైన తెలుగుదనానికి అన్నమయ్య కీర్తనలు నెలవులు.  “వెన్నెలకు కొలలేదు”, అన్నమయ్య కీర్తనకి వెలలేదు.
--------------------------------------------------------
రచన: వి. సిమ్మన్న, 
ఈమాట సౌజన్యంతో

Friday, June 21, 2019

అనువాద కళ నా అనుభవాలు


అనువాద కళ నా అనుభవాలు




సాహితీమిత్రులారా!

(వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు మదనపల్లి కళాశాలలో ఉపన్యాసకులు. కవిగా, కథకుడిగా, సాహితీ విమర్శకుడిగా సుప్రసిద్ధులు. “నవలా శిల్పం”, “కథాశిల్పం” వీరి విఖ్యాత రచనలు. “కథాశిల్పం” ఈ జనవరిలో సాహిత్య ఎకాడమీ అవార్డ్‌ను కూడా పొందింది. ఇంగ్లీషు నుంచి, కన్నడం నుంచి తెలుగులోకి ఎన్నో గ్రంధాలు, కథలు అనువదించారు. తస్లీమా నస్రీన్‌ రచించిన “లజ్జ”, బ్రిటిష్‌ రచయిత ఇ.హెచ్‌.కార్‌ (E.H. Carr) రచించిన “చరిత్ర అంటే ఏమిటి…?” ఆయన చేసిన అనువాద రచనలలో కొన్ని.)

రచన కత్తి మీద సామైతే, అనువాదం రెండు కత్తుల మీద సాము. ఒక భాష వచ్చిన ప్రతీవాడూ రచయిత కాలేడు. అలాగే, రెండు భాషలు వచ్చిన ప్రతీవాడూ అనువాదకుడు కాలేడు. కానీ అనువాదకునికి రెండు భాషలు ” బాగా ” వచ్చి ఉండక తప్పదు. అందులో ఒకటి మాతృభాష. రెండవది దాదాపు కృత్రిమంగా నేర్చుకొన్న ” పరాయి ” భాష. ఎవరైనా మాతృభాషలోకి మాత్రమే అనువాదం చెయ్యగలరని చాలా మంది నమ్ముతారు. ఇందులో సత్యం లేకపోలేదుకానీ, ఈ సిద్ధాంతానికి కొన్ని మినహాయింపులు లేకపోలేదు. అలాంటి మినహాయింపులుగా పి. వి. నరశింహారావు హిందీలోకి అనువాదం చేసిన ” వేయిపడగలు ” నూ, పుట్టపర్తి మళయాళంలోకి అనువదించిన ” ఏకవీర ” నూ, పి. ఎల్‌ రెడ్డి హిందీలోకి అనువదించిన తెలుగు కధలనూ, ఎస్‌ ఎస్‌ ప్రభాకర్‌ ఇంగ్లీషులోకి అనువదించిన తెలుగు కధలనూ చెప్పుకోవచ్చుననుకొంటాను. వీరి అనువాదాలు అంత బాగా ఉండటానికి కారణం బహుశా మనం పరాయి భాషలనుకొంటున్నవి వీరికి మరీ అంత ” పరాయి” వి కాకపోవటమేనేమో !

ఇప్పుడు భాష తెలియటం అంటే ఏమిటో ఆలోచిద్దాం. భాష ఆ భాషను మాట్లాడే ప్రజల సంస్కృతిలో ఒక ప్రధానమైన అంశం. అంతే కాదు ఆ సంస్కృతికి మాధ్యమం కూడా. కాబట్టి రెండు భాషలు తెలిసి ఉండటం అంటే రెండు సంస్కృతులు తెలిసి ఉండటం. రెండు జీవిత విధానాలు తెలిసి ఉండటం. భాషకు జీవం నుడికారం. ఏ భాష నుడికారం, ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిలో నుంచీ, భౌగోళిక పరిస్థితుల్లోంచీ, ఆ ప్రాంత ప్రజల ఆచార వ్యవహారాల్లోంచీ, ఆట పాటల్లోంచీ ఉద్భవిస్తుంది. ఉదాహరణకు, ఎస్కిమో భాషలో రకరకాలైన మంచును సూచించటానికి దాదాపు ఇరవై పదాలున్నాయట. మరాఠీ భాషలో యుద్ధరంగం ఆధారంగా పుట్టిన నుడికారం ఎంతో ఉందిట. ఇంగ్లీషు భాష నుడికారం వారికి ఆటలన్నా,నౌకాయానమన్నా ఉన్న ఇష్టంలో నుంచీ ఎంతో పుట్టింది. మన భాషలో చాలా నుడికారం మన వ్యావసాయక జీవితంలోనుంచీ పుట్టింది. భాషను తెలుసుకోవటమంటే దాని నుడికారం యొక్క మూలాలను తెలుసుకోవటం. వీటిని తెలిసి ఉండటం లేదా తెలుసుకోవాలని ఉండటం అనువాదకుని మొదట అర్హత.

అనువాదకుని రెండవ అర్హత మూలగ్రంధంలోని విషయాన్ని గురించి నిజమైన ఆసక్తి ఉండటం. అందరూ అన్ని విషయాలనూ అనువదించలేరు. ఆసక్తి లేని విషయాన్ని అనువదిస్తే, అది యాంత్రికంగా, నిర్జీవంగా ఉండక తప్పదు. వస్తువుకు సంబంధించిన మరొక ప్రధానమైన అంశం కూడా ఉంది. ఒకే వస్తువును అనేక దృక్పధాలనుంచీ చర్చించ వచ్చు. ఉదాహరణకు భారతీయ తత్వ శాస్త్రాన్ని గురించి గోళ్వాళ్కర్‌ లాగా రాయవచ్చు. రాధాకృష్ణన్‌ లాగా రాయవచ్చు. దేవీ ప్రసాద్‌ ఛటోపాధ్యాయ లాగా రాయవచ్చు. మూలగ్రంధ రచయిత అందులోని విషయాన్ని తనకు నచ్చిన, తాను నమ్మిన భావజాల ధృక్పధం నుంచి చర్చించి వుంటాడు. మూలగ్రంధ రచయిత భావజాల ధృక్పధం మీద కనీసం సానుభూతి కూడా లేకుండా ఆ గ్రంధాన్ని అనువాదం చేయటానికి అంగీకరించకూడదు.

అనువాదం ప్రారంభించటానికి ముందుగానే భాషకు సంబంధించిన కొన్ని క్లిష్టమైన నిర్ణయాలను అనువాదకుడు తీసుకోక తప్పదు.

అనువాదకుడు తాను చేయబోతున్న అనువాదంలో వాడదల్చుకున్న భాషాస్థాయిని గురించి ఒక ఖచ్ఛితమైన నిర్ణయానికి రావాలి. ఒకే భాషను అనేక స్థాయిలలో రాయవచ్చు. ” భాషాస్థాయి ” పదజాలానికి మాత్రమే కాకుండా వాక్యనిర్మాణానికి కూడా సంబంధించిన విషయం. భాషా స్థాయిని గురించి నిర్ణయం తీసుకోటానికి పూర్వం, మూలగ్రంధం విషయాన్ని గురించి, మూలగ్రంధం ఎవరికోసం ఉద్దేశించబడిందో ఆ పాఠకుల్ని గురించీ, అనువాదం ఎలాంటి పాఠకుల కోసం చేయబడుతోందీ వారిని గురించీ, అనువాదకునికి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇది ఇంగ్లీషు నుంచి శాస్త్ర గ్రంధాలను అనువదించేటప్పుడు మరీ చిక్కు సమస్యగా మారుతుంది. దాదాపు ఆరులక్షల పదసంపద ఉన్న ఇంగ్లీషు నుంచి పాతికవేలు వ్యావహారిక పదజాలం కూడా లేని తెలుగులోకి శాస్త్ర గ్రంధాలను అనువాదం చేసేటప్పుడు, అనువాదకుడు అనేక పదాలనూ, పద బంధాలనూ సృష్టించుకోవలసి వస్తుంది. అవి తాను ఎన్నుకొన్న భాషాస్థాయిలో ఉండేలా జాగ్రత్త పడటం కత్తి మీద సాము వంటి క్లిష్టమైన పని.

భాషకు సంభందించిన మరొక ఇబ్బంది కంఠస్వరం. సమర్ధుడైన రచయిత శైలికి ” కంఠస్వరం ” ( Tone ) ఉంటుంది. అది రచయితకూ, విషయానికీ మాత్రమే కాకుండా, రచయితకూ, పాఠకునికీ మధ్య ఉన్న సంబంధాన్నివ్యక్తం చేస్తుంది. గొప్ప గాయకుని గొంతులో ఎన్ని భావాలు పలుకుతాయో, సమర్ధుడైన రచయిత శైలిలో అన్ని భావాలు పలుకుతాయి. అందులో కోపం ఉండవచ్చు, కసి ఉండవచ్చు, హాస్యం ఉండవచ్చు, వ్యంగ్యం ఉండవచ్చు.ఇంకా ఎన్నో భావాలూ, భావమిశ్రమాలూ ఉండవచ్చు.మూలరచయిత కంఠస్వరాన్ని పొరపాటు పడకుండా గుర్తించి దాన్ని లక్ష్య భాషలో వ్యక్తం చేయగలిగిన రంగు, రుచి,వాసన ఉన్న పదాలనూ, వాక్య విన్యాసాలనూ జాగర్తగా ఎన్నుకోవాలి.

వీటికితోడు మూలగ్రంధాన్ని అనేకసార్లు చదివి జీర్ణం చేసుకోవటం, గ్లాసరీని అనువాదం ప్రారంభించటానికి పూర్వమే తయారు చేసుకోవటం, పదప్రయోగస్థాయిని తరచుగా వెనుదిరిగి చూసుకుంటూ ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా సాపు రాసే పనిని తానే స్వయంగా చేయటం, అనువాదకుడు తీసుకోవలసిన మరికొన్ని ఇతర జాగ్రత్తలు. అనువాదకుని చివరి అర్హతను గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సృజనకు భావోద్రేకం, Inspiration అవసరమేమో కానీ అనువాదానికి పరిశ్రమే ప్రాణం. పరిశ్రమ చేసే ఓపిక లేనివాడు మంచి అనువాదకుడు కావటం అసాధ్యం.

అనువాద కళను గురించి ఇంగ్లీషులో కొన్ని మంచి పుస్తకాలు వచ్చాయి. 1791లోనే అలెగ్జాండర్‌ ఫ్రేటర్‌ టైట్లర్‌ అన్న వ్యక్తి “Essays on the principles of Translation ” అన్న గ్రంధాన్ని ప్రచురించాడు. ఆ తరువాత థియొడర్‌ సేవరీ, రెనెటో సోగియోలీ వంటి విద్వాంసులు కొన్ని గ్రంధాలు రాసారు. ఈ శతాబ్దంలో రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పాశ్చాత్యదేశాల్లో భాషాశాస్త్రం ప్రతిష్ట బాగా పెరిగింది. దీని ప్రభావం అనేక పరిసర రంగాలమీద ప్రసరించటం ప్రారంభించింది. జె. సి. కాట్‌ ఫోర్డ్‌ లాంటి భాషాశాస్త్రవేత్తలు ఈ రంగంలో చాలా కృషి చేసారు. అంతవరకూ ” కళ ” అని అందరూ భావిస్తున్నఅనువాదం ” శాస్త్రం ” గా పరిణామం చెందటం ప్రారంభించింది. కంప్యూటర్లను అనువాదాలకు కూడా ఉపయోగించుకోవచ్చునన్న అభిప్రాయం కూడా బలం పుంజుకొంటోంది. కానీ తెలుగులో అనువాదం మీద మంచి గ్రంధాలు ఇంతవరకూ రాలేదు. రా. రా. రాసిన ” అనువాద సమస్యలు “, పత్రికల వారూ, పత్రికారచయితలూ తయారు చేసిన కరదీపికలూ తప్ప తెలుగులో అనువాదాన్ని గురించి సమగ్రమైన, సాధికారమైన గ్రంధం రాలేదు.

000 000 000 000

వాదించుకోవటంలోనూ, అనువదించుకోవటంలోనూ తెలుగు వారు నిష్ణాతులు అని ఎవరో అన్నారు. వాదించుకోవటం మన రాజకీయ వ్యసనమైతే, అనువదించుకోవటం మన సాహిత్య వ్యాసంగం కావచ్చు. వాస్తవానికి తెలుగు సాహిత్యం అనువాదాలతోనే ప్రారంభమైంది. శతాబ్దాలపాటు అనువాదాలతోనే సంతృప్తి పడుతూ వచ్చింది.మన మహా కవుల్లో చాలా మంది కధనూ, కధా నిర్మాణాన్నీ, పాత్రలనూ, వారి మనస్తత్వాలనూ, ప్రాపంచిక దృక్పధాన్నీ, భావాలనూ, ఆలంకారికతనూ, కొంత వరకు శైలినీ మూలగ్రంధకర్తల నుంచి గ్రహించిన గొప్ప అనువాదకులే. అందుకు మనం సిగ్గు పడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. అత్యంత ప్రాచీనమైన సంస్కృత, గ్రీక్‌ ,లాటిన్‌ సాహిత్యాలవంటివి తప్ప ఇతర సాహిత్యాలలో చాలా భాగం అనువాదాలతోనే ప్రారంభమయ్యాయి.

20వ శతాబ్దంలో తెలుగు వారు అనువాదం పట్ల గొప్ప శ్రద్ధను చూపించారు. ప్రేంచంద్‌ , టాగోర్‌ , శరత్‌ ,గోర్కీ, రాహుల్‌ మొదలైన ఎందరో మహా రచయితలు తెలుగువారైపోయారు. 1930లలో అభ్యుదయ సాహిత్యోద్యమంతో ప్రారంభమైన శాస్త్రగ్రంధాల అనువాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంగ్లీషులో తగినంత ప్రావీణ్యం లేని తెలుగు రచయితలు అనువాదాల ద్వారానే ప్రపంచ సాహిత్య ధోరణులనూ, ఆలోచనా ధోరణులనూ ఎంతోకొంతగా అందుకోగలుగుతున్నారు. ” విపుల” వంటి అనువాద కధాసాహిత్య పత్రిక తెలుగులో మాత్రమే ఉందేమోనని నా అనుమానం.

000 000 000 000 000 000 000

అనువాదకుడుగా నా అనుభవాలను గురించి చెప్పేటప్పుడు నన్ను గురించి రెండు మాటలు చెప్పుకోవాలి.

నేను పద్యాలతో రచన ప్రారంభించాను. పద్యాలూ, గేయాలూ మాని కధలు రాయడం ప్రారంభించాను.కధలు రాస్తూనే మూడు నవలలు రాసాను. ఆ తరువాత రచనమీద ఆసక్తి కలిగి చదువుకుంటూ ఉండిపోయినకాలంలో నాకు తెలియకుండానే అనువాదకుణ్ణయ్యాను. 1981లో అనుకుంటాను హైద్రాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ (H.B.T.) ప్రారంభమైంది.దాని ట్రష్టీలలో ఒకరైన సి.కె. గారు అనువాదం చేయించటానికి ఏమైనా మంచి పుస్తకాలు సూచించమన్నారు.నేను సూచించిన రెండు పుస్తకాల్లో E. H. Carr రాసిన What is History ? ఒకటి. H.B.T. వాళ్ళు ఆ పుస్తకాన్ని అనువదింపచేయటానికి తీర్మానం చేసి,అనువాదకుడి కోసం వెదకటం ప్రారంభించారు.కొందరు ఆ పుస్తకాన్ని అనువాదం చేయటం అసాధ్యమన్నారు. మరి కొందరు వృధా అన్నారు. చారిత్రకశాస్త్రం (హిస్టరియోగ్రఫీ) మీద ఆసక్తి ఉండి, ఇంగ్లీషు రాని వాళ్ళు ఎవరూ ఉండరన్నారు. చారిత్రక శాస్త్రం మీద ఆసక్తి ఉండి, ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు మూలగ్రంధాన్ని చదువుకుంటారు గానీ, అనువాద గ్రంధాన్నిచదవరని వాదించారు. మొత్తం మీద What is History ? కి అనువాదకులు దొరకలేదు. ” నువ్వు సూచించావు కదా, నువ్వే చేస్తావా ?” అన్నారు సి. కె. గారు. అంగీకరించాను. సంవత్సర కాలం నా విశ్రాంతి సమయాన్నిఆ అనువాద కార్యానికే వినియోగించాను. అర్ధంకాని విషయాలను తెలిసిన స్నేహితుల వద్ద తెలుసుకొన్నాను.సంవత్సరం తరువాత అనువాదం పూర్తయింది.

అనువాదం జరుగుతుందగా నా దృష్టికి రాని స్పష్టంగా రాని రెండు లోపాలు నా అనువాదంలో కనిపించాయి.మొదటిది మూలగ్రంధ పాఠకులూ, తెలుగు అనువాద గ్రంధం పాఠకులూ ఒకేస్థాయికి చెందిన వారు కాకపోవటం. కార్‌ గ్రంధం కేంబ్రిడ్జి హిస్టరీ సొసైటీలో ఇచ్చిన ఉపన్యాసాల సంపుటం. శ్రోతలందరూ చరిత్ర విద్యార్ధులూ, చరిత్ర ఉపాధ్యాయులూ కావటం చేత కార్‌ చారిత్రక సంఘటనలనూ, తాత్విక సిద్ధాంతాలనూ ఎలాంటి వివరణా లేకుండా ఉటంకిస్తాడు. తెలుగు పాఠకుల్లో తొంభై శాతం మంది కేంబ్రిడ్జి హిష్టారికల్‌ సొసైటీస్థాయి వారు కారు. అందుచేత Foot notes ఇవ్వాలనుకున్నాను. కానీ,ప్రచురణ కర్తలు ససేమిరా వద్దన్నారు. Foot notes ఉన్న పుస్తకాలను సాధారణ పాఠకులు చదవరన్నారు.అందుచేత అనువాదాన్ని ఒక అతి సాధారణ పాఠకుడికీ, ఒక చరిత్ర విద్యార్ధికీ ఇచ్చి, తాము నోట్సు అవసరమని భావించే పదాలకింద గీతలు గీచి పంపమన్నాము. వాటిని సేకరించి రెండు భాగాలుగా విభజించాను.మొదటి వర్గం text లోకి వెళ్ళాల్సిన notes . రెండవ వర్గం గ్రంధం చివర ఇవ్వాల్సిన నోట్సు. ఈ విధంగా కేంబ్రిడ్జి హిష్టరీ సొసైటీ స్థాయి గ్రంధాన్ని సాధారణ తెలుగు పాఠశాల స్థాయికి తీసుకు వచ్చే ప్రయత్నం చేశాను.

రెండవలోపం మరింత ప్రమాదకరమైనది. అనువాదం పూర్తయిన తరువాత మూలాన్నీ, అనువాదాన్నీ మరొకసారి చదివి చూసి దిమ్మెరపోయాను. మూలగ్రంధంలోని tone ను పట్టుకోవటంలో నేను పూర్తిగా విఫలమయ్యాను. మూలంలో హాస్యవ్యంగ్య కంఠస్వరం అనువాదంలోకి రాలేదు. తెలుగు అనువాదంలోని కంఠస్వరం matter of fact గా neutral గా ఉంది. అందుచేత మళ్ళీ సాపు రాశాను. మూలంలోని కంఠస్వరాన్ని తెలుగు అనువాదంలోకి తీసుకు రావటానికి ప్రయత్నించాను. ఇంత శ్రమపడ్డా ” చరిత్ర అంటే ఏమిటి ?” ని వ్యాపార నవల చదువుతున్నంత అశ్రమంగా చదువుకోటానికి వీలుకావటం లేదని కొందరంటుంటారు. వారికి నా సలహా ఒక్కటే మూలగ్రంధాన్ని చదువుకోమని.

” చరిత్ర అంటే ఏమిటి ?” ఇప్పటికి మూడు ముద్రణలు పొందింది. దాదాపు పదివేల కాపీలు అమ్ముడైంది. చరిత్ర విద్యార్ధులు మాత్రమే కాకుండా రచయితలు ఆ పుస్తకాన్ని చాలా శ్రద్ధగా చదివారు.

” చరిత్ర అంటే ఏమిటి ?” మొదటి ముద్రణ ప్రతులు ఆరు నెలల్లో చెల్లిపోయాక వెరె గార్డర్‌ చైల్డ్‌ రాసిన ” What Happened in History ? ” ని తెలుగులోకి తేవాలని నిశ్చయించాం. ఈ రెండు పుస్తకాలూ ఒకసెట్‌ లాగా పరస్పర పూరకాలుగా ఉంటాయని HBT వారు భావించారు. ఈ పుస్తకాన్ని అనువదించటానికి నేను చాలా శ్రమ చేయ వలసి వచ్చింది. ఈ పుస్తకంలో గార్డర్‌ చైల్డ్‌ ఫిజిక్స్‌ , కెమిస్ట్రీ, గణిత శాస్త్రం మొదలైన అనేక శాస్త్రాలు చారిత్రక పరిణామ క్రమంలో ఎలా అభివృద్ధి చెందిందీ వివరంగా చెప్పాడు. ఆ శాస్త్రాలను గురించి నాకు సరైన జ్ఞానం లేకపోవటంచేత, తెలిసిన మిత్రులనుంచి ఆ సిద్ధాంతలను గురించి తెలుసుకొన్నాను. అలాగే పురాతత్వ శాస్త్రంలో ఉపయోగించే విధానాల గురించీ,ముఖ్యంగా కార్బన్‌ టెస్టుల్ని గురించీ తెలిసిన వారి వద్దనుంచీ తెలుసుకొన్నాను.

ఆ తరువాత నేను అనువదించిన సోయింకా నొబెల్‌ బహుమతి అంగీకరణోపన్యాసం నాకు అసంతృప్తినే మిగిల్చింది. ” నల్లవాడు ఈ వేదిక నెక్కకుండా తెల్లవాళ్ళైన మీరు ఎన్ని కుట్రలు పన్నారు. కానీ మీరు ఆపగలిగారా? చూడండి మిమ్మల్ని చీల్చి చెండాడి నొబెల్‌ బహుమతిని అందుకొంటున్నాను ” అన్న సోయింకాకసి బాగా నా అనువాదంలోకి రాలేదనుకుంటాను. సోయింకా ప్రస్తావించిన కొన్నిరెఫరెన్సులు కూడా నాకు అందలేదు. స్త్రీవాద దృక్పధం పై క్రిస్‌ బ్రెజియక్‌ రాసిన ” ప్రపంచచరిత్ర” ను అనువదించినప్పుడు కూడా అందులో వచ్చే కొన్ని పేరడీలు అనువాదం చేయటానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఉదాహరణకు ఈ గ్రంధం ” In the begining there was slime ” అన్న వాక్యంతో ప్రారంభమవుతుంది. అది ” In the begining there was the word ” అన్న బైబిల్‌ లోని St. John వాక్యానికి పారడీ. ఇలాంటి సూక్ష్మాతిసూక్ష్మమైన కొన్ని అందాలు అనువాదానికి అందకుండానే పోతాయి.

అనువాదకునిగా నాకు సంతృప్తి నిచ్చిన గ్రంధం S.G.Sardesai గారి ” Progress and Conservation In Ancient India “. ఆ పుస్తకాన్ని ఒంట బట్టించుకోడానికి దాన్ని అనేక సార్లు చదివాను. ఆ పుస్తకంలో మొదటినుంచీ చివరిదాకా భగభగలాడే సర్దేశాయి గారి కోపాన్నీ, అసహనాన్నీ అనువాదంలోకి తీసుకురాగలనన్ననమ్మకం కలిగిన తరువాత రచన ప్రారంభించాను. వైదిక సాహిత్యాన్నీ, సమాజాన్నీ అభివర్ణించటానికి సర్దేశాయిగారు ఉపయోగించిన ఇంగ్లీషు మాటలకు అసలు రూపాలైన సంస్కృత పదాలను గాలించి పట్టుకొని ఉపయోగించాను. ” ప్రాచీన భారత దేశంలో ప్రగతి, సాంప్రదాయ వాదం” అనువాదంలాగా కాకుండా మూల గ్రంధంలాగా చదివించిందని పెద్దలు అన్నప్పుడు చాలా సంతృప్తి కలిగింది.

ఈ గ్రంధాలు కాకుండా Ralph Fox రాసిన ” The Novel and the People “, R.S.Sharma రాసిన ” Ancient Indian History “, తస్లీమా సమీర్‌ రాసిన ” Lazza ” అన్న పుస్తకాలను కూడా అనువదించాను. వీటిలో మొదటిది నవలా సిద్ధాంతం గురించిన పుస్తకం. మూడవది నవల. వీటిలో “లజ్జ” అనువాదానికి అనువాదం. అనువాదం ద్వారా మూలగ్రంధంలోని శైలిని ఎంత కష్టపడి ఊహించుకున్నా, అనువాదానికి చేసిన అనువాదం అంత సంతృప్తిగా రాకపోవచ్చు. ఇవన్నీ నేను ఇంగ్లీషునుంచి అనువదించిన గ్రంధాలు. వీటికి తోడు, కన్నడం నుంచి ” ఒడలాళ” అన్న నవలికను కూడా అనువదించాను. అది కన్నడంలో చాలా ప్రసిద్ధ నవలిక. దాన్నిరాసిన దేవమారు మహాదేవను “ఒడలాళ మహాదేవ” అని కూడా పిలుస్తారు. ఈ నవలిక అనువాదాన్ని H.B.T. వారు ” బతుకంతా” అన్నపేరుతో ప్రచురించారు. అది ఎవరి దృష్టిని ఆకర్షించినట్టు లేదు. అందుకు కారణం కర్ణాటక, ఆంధ్ర సామాజిక జీవన చైతన్యంలో ఉన్న తేడాలని అనిపిస్తుంది. వారికి బాగా అభ్యుదయకరంగా కనిపించిన పుస్తకం, మనకు మరీ అంత అభ్యుదయకరంగా కనిపించక పోవటమే అందుకు కారణం. ఇది కూడా అనువాదకునికి ఒక పాఠమే. ఒక భాష వారిని ఆకర్షించిన పుస్తకం, మరొక భాషవారిని ఆకర్షించక పోవచ్చు. అందుకు ఒకే విషయానికి సంబంధించిందే అయినా వారి చైతన్య స్థాయిలోని తేడాలు కారణం కావచ్చు. అందుచేత అనువాదకుడు లక్ష్య భాషలను మాట్లాడే ప్రజల నాడిని పట్టుకోవటం చాలా అవసరం.

ఈలోగా అనువాదకుడిగా నేను మరో పాఠం కూడా నేర్చుకొన్నాను. ” Soil and civilization ” అన్న పుస్తకాన్ని పంపుతూ H.B.T. వాళ్ళు దాన్ని అనువదించమని కోరారు. ఆ పుస్తకాన్ని చదివి ఆశ్చర్య పోయాను.జీవావరణానికీ, సంస్కృతికీ ఉన్న సంబంధాన్ని మొత్తం ప్రపంచ చరిత్రను ఆధారంగా చేసుకొని చర్చించిన పుస్తకం అది. ఆ పుస్తకంలోని వస్తువు అర్ధమైందిగానీ ఆ పుస్తకం మొత్తంగా నా నరాలలోకి ఎక్కలేదు. అందుచేత ఆ పుస్తకాన్ని నేను అనువదిస్తే బాగా రాకపోవచ్చు ననిపించింది. సరైన అనువాదకుడు ఎవరా అని అలోచిస్తే తల్లావఝ్జుల పతంజలి శాస్త్రి గారు జ్ఞాపకం వచ్చారు. వారు చరిత్రను చదువుకొన్న వారు.సాంస్కృతిక అధ్యయనాలలో నుంచి పర్యావరణంలోకి వచ్చినవారు. పర్యావరణ కార్యకర్త. కధా రచయిత. ” మీరు ఆ పుస్తకాన్ని అనువాదం చేస్తారా ?” అని అడిగితే వారు సంతోషంగా అంగీకరించారు.ఇప్పుడు అనువాదం సాగుతోంది. రచయితకు కధా వస్తువుతో హృదయ సంవాదం కుదిరినట్టుగా అనువాదకునికి కూడా మూల గ్రంధంలోని విషయంతో హృదయ సంవాదం కుదరాలి. అందరు అనువాదకులూ అన్ని విషయాలనూ బాగా అనువదించలేరు. కొందరు కొన్ని విషయాలను ఇతరుల కంటే మెరుగ్గా అనువదించగలరు. ఈ సత్యాన్నిగుర్తిస్తే అనువాదం కొందరు భావిస్తున్నట్టుగా వృత్తిరచన కాదని అర్ధమౌతుంది.

ఇవి నేను ఇతర భాషల్లోంచి తెలుగులోకి చేసిన అనువాదాలకు సంబంధించిన అనుభవాలు. నేను తెలుగునుంచి ఇంగ్లీషులోకి కూడా కొన్ని అనువాదాలు చేశాను. కొంత కవిత్వాన్నీ, తిలక్‌ , పెద్దిభొట్ల, సింగమనేని, వివిన మూర్తి,వల్లంపాటి గార్ల కధల్ని ఇంగ్లీషులోకి అనువదించి వివిధ పత్రికల్లో ప్రచురించాను. ఆ అనువాద కార్యంలోని అనుభవాలూ, సమస్యలూ వేరు. వాటిని గురించి మరొక సారి మాట్లాడుకుందాం.

మొత్తం మీద అనువాదం రెండు భాషలకూ, రెండు సంస్కృతులకూ మధ్య అక్షరాల వంతెన. ప్రపంచంలోని అన్ని భాషల్నీ, సంస్కృతుల్నీ సర్వ మానవ జీవితానుభవాలనూ, విజ్ఞానాన్నీ ఏకం చేసే విశ్వకుటుంబీకుడు అనువాదకుడు.
----------------------------------------------------------
రచన: వల్లంపాటి వెంకట సుబ్బయ్య, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, June 19, 2019

తెలుగు కవిత్వంలో దళితవాదం


తెలుగు కవిత్వంలో దళితవాదం




సాహితీమిత్రులారా!

సాహిత్యంలో ఏవాదమైనా ప్రారంభమైనప్పుడు, ఆ వాదానికి మూలాలు ఎంతోకాలంగా పరిణమిస్తూ వ్తౖసె. అందుకు కారణం, అన్ని వాదాలకూ పునాదిగా సామాజిక సందర్భాలుండడమే. ఒక సామాజికసందర్భానికి సంబంధించిన పరిణామమే, ఒక వాదంలోని పరిణామానికి నేపథ్యంగా ఉంటుంది. ఇలా గమనించినప్పుడు, 1990ల నుండి తెలుగుకవిత్వంలో ప్రారంభమై, 1995ల నుండి లోతునూ, విస్తృతినీ, సాధించిన దళితవాదానికి సంబంధిన అంశాల్ని, ఆధునిక కవిత్వ ప్రారంభకాలం నించీ గమనించవచ్చు. అయితే, 1990ల దాకా వచ్చిన కవిత్వాన్ని “దళితకవిత్వం” అని మాత్రమే అనగలం. 1990ల నించీ వస్తున్న కవిత్వాన్ని “దళితవాదకవిత్వం” అని పేర్కొనాలి. దళితకవిత్వంలో దళితస్పృహ అన్ని కోణాల్లోనూ కనిపించవచ్చు. కాని దళితవాదకవిత్వం, దళితులు తమకోసం తామే పోరాడి, సమాజంలో తమదైన స్థానాన్ని సాధించుకోవాలనే చైతన్యంలోంచి వచ్చింది. ఒక విధంగా అసమానమైన సామాజిక స్థితిని అలాగే ఉంచి, దళితులకి జరిగిన అన్యాయాల్ని గూర్చి మాత్రమే దళితకవిత్వం చెప్తే, సామాజిక సమానత కోసం జరిగే సంఘర్షణలోంచి దళితవాదం ఉద్భవించింది.

ఒక్కసారి పూర్వ నేపథ్యం వైపు దృష్టి సారిస్తే, ముందుగా దళితస్పృహని కవిత్వంలో చాటిన కవి గురజాడ. ఏ కవుల భావప్రకటనకైనా వారు జీవించిన కాలం, వారి చుట్టూ ఉన్న పరిస్థితులు, భావాల పరిపక్వస్థితి లోని దశలు చాలా ముఖ్యం. అంతేగాని, సరిగ్గా ఈనాడు ప్రచలితంగా ఉన్న ధోరణుల్ని, పూర్వకవుల్ని విశ్లేషించడంలో, అన్వేషించరాదు. ఈదృష్టిలోనే గురజాడ చెప్పిన భావాల్ని గూడా గ్రహించవలసి ఉంది.
“మంచి అన్నది మాల అయితే
మాలనేనగుదున్‌”
ఇది గురజాడ ప్రసిద్ధమైన ఉద్ఘాటన. మంచి, చెడు అంటే కేవలం సౌజన్యం, దుర్మార్గం మాత్రమే కాదు. ఔన్నత్యం, అవరత్వం కూడా ఆమాటల వెనక ధ్వనిస్తుంది. “ఔన్నత్యం, అవరత్వం కులం వల్ల వచ్చేవి కావు; ఔన్నత్యానికి మాల అని పేరు పెడితే నన్ను మాల అనే పిలవండి” అని కవి అభిప్రాయం. అంటే కులం అనేది ఏవిధంగానూ, అవరత్వ, ఔన్నత్యాలకి కొలమానం కాదు అని భావం. గురజాడ భావాన్ని ఆయన కాలపరిమితుల్లోనే గ్రహించవలసి ఉంది.

1933లో రెండు గొప్ప దళితకవిత్వ సంపుటాలు వచ్చినై. ఒకటి మంగిపూడి వెంకటశర్మ రాసిన “నిరుద్ధభారతము”; రెండోది కుసుమ ధర్మన్న రాసిన “హరిజన శతకము”. మంగిపూడి వెంకటశర్మ, ధర్మన్న ఆ కాలపరిమితులలో గాంధీభావాల చేత ప్రభావితులే. గాంధీ, ఏవిధంగా, ఎందుకోసం అస్పృశ్యతను వ్యతిరేకించినా, ఆనాటికి కొంతైనా సంచలనం కలిగించిన అంశమే. మంగిపూడి వెంకటశర్మ, అస్పృశ్యులపై తనకు గల సానుభూతి, సహానుభూతుల వల్ల, ఉద్యమానుకూల లక్షణాల్ని తన కవితారూపానికీ, భాషకీ ఒదిగించగలిగాడు. అంతేగాక, గుండెను కదిలించే భావాల్ని విస్తృతమైన పరిధిలో చెప్పగలిగాడు.
“కాపురంబులు చేయగా చుట్టుగుడిసెలే
కాని లోగిళ్ళు లెక్కకును లేవు
చెలగికట్టంగ మాసిన చింపిగుడ్డలే
కాని వల్వలు కొంచెమైన లేవు
త్రావంగ నూకల జావయు, గంజియే
కాని అన్నమును శాకములు లేవు
సొగసుగా తాల్ప గాజులు, పూసపేరులే
కాని బంగరునగల్‌ లేనెలేవు

పంటపండింపగా నూరివారి చేలె
కాని సొంతంబు లెందును కానరావు
అకట! మా ఘోరదారిద్య్రమొకరికైన
జాలి పుట్టింపదాయెనా శ్రీలులార!

దేవుణ్ణీ, శాస్త్రాల్నీ, హిందూమతాన్నీ కవి విశ్వసించినా, ఆపరిధిలోనే తన కాలానికి అనుగుణంగా, అస్పృశ్యతకి వ్యతిరేకంగా, సంచలనాత్మకమైన కవిత్వాన్ని రాయగలిగాడు. దళితుల్ని మేల్కొలిపే ప్రయత్నం తీవ్రంగా చేశాడు.
“పంచములార! అంతరిత భవ్య గుణోత్కరులార! గర్భితో
దంచిత శక్తులార! అసమర్థులె మీరలు? గొర్రెమందలో?
వంచితమై చరించు నల వ్యాఘ్రకిశోరమురీతి పూర్తిగా
వంచితులైరి, ఆత్మబల వైఖరినెంచుడు, మేల్కొనుండికన్‌”

కుసుమ ధర్మన్న దళితుడు కావడం చేత, ఆయన కవిత్వంలో దళితజీవన వాస్తవికత, ఆవేదన, ప్రతిఘటన తీవ్రత ఇంకా స్పష్టంగా కనిప్తౖిసె.
“మాలవాడని యవమానంబు గావించి
పంచముండని పరువు పారద్రోలి
ఆదిమాంధ్రుడవని సోదిచెప్పిరి గాదె
ఆలకింపుమయ్య హరిజనుండ!”

దళితులు పాలేర్లుగా ఉండగా, రైతులు చేసే దోపిడి గురించి, దళితుల శ్రమను వారు ధనంగా మార్చుకోడం గురించి కుసుమ ధర్మన్న చెప్పిన పద్యాలు ఎంతో దళితస్పృహ కలిగి ఉన్నై. ఆర్థికపరమైన దోపిడిని ఇంత స్పష్టంగా చెప్పిన కవి అప్పుడు మరొకడు లేడు.
“కొల్చు నీకు పిచ్చ కుంచంబుతో తాను
కొల్చుకొనడె పెచ్చుకుంచమునను
దోచుకొనక నీకు దొర యెట్టులగు రైతు..”

“అక్కరైన కొంత అప్పిచ్చి తక్కువ
కూలికెపుడు పనులు గొనుచునుండు
పేదవగుట నిన్ను పీడింపడే రైతు..”

“తెల్లదొరల పైన కళ్ళెర్రగా జేసి
హక్కులడగ జూచు నాగ్రహమున
ప్రక్కనున్న నిన్ను త్రొక్కిపెట్టరె వీరు..”

దళితవేదన దళితస్వరం నుండి వచ్చినపుడే రగిలే వాస్తవికత రూపుదిద్దుకుంటున్న విషయానికి కుసుమ ధర్మన్న మొదటి ఉదాహరణ.

ఇంకా జాలా రంగస్వామి మొదలైన కొందరు దళితస్పృహను విస్తృత పరచగా, మహాకవి జాషువాతో దళితకవిత్వంలో గుణాత్మకమైన మార్పు వచ్చింది. జాషువా, కులం కారణంగా, పేదరికం కారణంగా, తన అనుభవాలను అంతస్స్రవంతిగా చేసి, తన కవిత్వంలో జీవన వాస్తవికత, ఆవేదన, చైతన్యాలతో పాటు ప్రతిఘటన స్వరాన్ని తీవ్రంగా వినిపించిన కవి.
“నిమ్న జాతుల కన్నీటి నీరదములు
పిడుగులై దేశమును గప్పివేయు ననుచు..”

అనగలిగిన కవి జాషువా. కన్నీటిని అగ్నిగా మార్చగల అక్షరశిల్పి, ధిక్కారశీలుడు మహాకవి జాషువా. అయినా ఆయన కాలపరిమితులు ఆయనకీ ఉన్నై. భావతీవ్రతకి తోడు, అద్భుతమైన కవితాశక్తి కూడా కలవాడు కావడం చేత, మొదటిసారిగా ప్రజాకవిత్వానికి పద్యాన్ని వినియోగించి, దళితచైతన్యానికి మార్గదర్శి కాగలిగాడు.

2

సమాజంలో తిరుగుబాట్లు జరుగుతున్నప్పుడు మాత్రమే, దానికి సమాంతరంగా కవితోద్యమాలు కూడా తలెత్తుతై. 1930ల నుండి భారతదేశాన్ని మహోద్యమరూపంతో నడిపింది మార్క్సిస్టుసిద్ధాంతం. 1980దాకా మార్క్సిస్టు ఉద్యమాలు తిరుగులేని విధంగా జరిగినై. ఈ ఉద్యమాల ఆధారంగా మార్క్సిస్టు కవిత్వం అత్యంత విస్తృతంగా సమాజాన్ని ప్రభావితం చేసింది. మార్క్సిస్టు ఉద్యమాలు దళితుల విషయంలోనూ, కులనిర్మూలన విషయంలోనూ ఉదాత్తమైన ఆశయాలతో నడిచినా, దళితచైతన్యాన్ని ప్రధాన స్థానానికి తీసుకురాలేక పోయాయి. ఆర్థిక, రాజకీయ పోరాటాలు మార్క్సిస్టు భావనలో ప్రధానస్థానంలో ఉంటై. 1969లో కంచికచెర్లలో కోటీశు అనే దళితుణ్ణి అగ్రవర్ణాలు సజీవదహనం చేసిన సంఘటన దళితచైతన్యానికి మొదటి సంచలనంగా చెప్పవచ్చు. అయితే, అప్పటికి దళితసంఘటిత శక్తి రూపొందక పోవడం చేత, ఆసంఘటన దళితస్పృహని ఎంతగా రగిలించినా, సమష్టిపోరాటానికి ప్రారంభం కాలేకపోయింది. అప్పటినుంచి క్రమంగా రూపుదిద్దుకుంటున్న దళితస్పృహ, 1980ల లోకి వచ్చేటప్పటికి, నిర్దిష్టమైన సిద్ధాంతాల్ని ఏర్పరచుకోవడం, డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ని స్ఫూర్తిదాతగా తీసుకోవడం, సమష్టి ఉద్యమాల కోసం పురోగమించడం మొదలయింది. “మేకల్నే బలిస్తారు గాని సింహాల్ని కా”దనే అంబేద్కర్‌ మాటలు దళితుల్ని పోరాటం వైపు మరల్చడం ప్రారంభమైంది. వచనకవిత్వంలో ఈ భావాల ప్రతిఫలనం మొదటిసారిగా, బొజ్జా తారకం “నదిపుట్టిన గొంతుక” లో స్పష్టమైన రూపం పొందింది. ఏ సాహిత్యవాదానికైనా, ఒక స్వఛ్ఛమైన, సమగ్రమైన తాత్విక భావధార ఉండాలి. దీన్ని మొదటిసారిగా అందించే ప్రయత్నం చేసింది “నదిపుట్టిన గొంతుక”! బొజ్జా తారకం 80ల నుండే “నలుపు” అనే దళితపత్రికను కూడా నడిపి, దళితచైతన్యాన్ని వ్యాప్తి చేశాడు. 1980ల లోనే ఆయన తెచ్చిన “నదిపుట్టిన గొంతుక”, ఆతర్వాత రాబోయే దళితవాద సాహిత్యానికి వేగుచుక్క.

“నేను అస్పృశ్యుణ్ణి
నా ఒళ్ళంతా మట్టి వాసన
నా బ్రతుకు నిండా వెట్టివేదన
నా కళ్ళనిండా ఎండవేడిమి
ఎండకు ఎండి వానకు తడిసి
బిగుసుకుపోయిన
మర్రి ఊడల్లా నా తల

నన్ను ఊరికి దూరంగా ఉంచారు
మట్టి పిసికి యిటుకలు చేసి
ఇళ్ళు కట్టి యివ్వమన్నారు
ఇంట్లోకి రావద్దన్నారు

చచ్చిన మీ గొడ్డుల్ని
మోసుకుపొమ్మన్నారు
వాటి చర్మం ఒలిచి
చెప్పులు కుట్టమన్నారు
నేను చెప్పులు తొడగకూడదన్నారు

నా గురించి కథలు లేవు
గాధలు లేవు
నాకై కవిత లేదు
నాకు చరిత లేదు

నాలుగువేదాలలోంచి
నాలుగు పాదాల లోంచి
నన్ను తొలగించారు
కట్టలోంచి జారిన కట్టెలా
ఒక్కణ్ణే ఎక్కడో ఎండిపోయాను”

కట్టలోంచి జారిన కట్టెలా ఒక్కడూ ఎండిపోవడమనేది చాలా కొత్త పోలిక. ఈ కట్టె, భవిష్యత్తులో మండుతుందన్న ధ్వనికి అనుగుణమైన ఉపమానం.

3

మార్క్సిస్టు ఉద్యమాలు ఆటుపోట్లకు గురౌతున్న సందర్భంలో, 1985 నుండి శక్తిమంతంగా ప్రచలితమైంది స్త్రీవాదం. ఆతర్వాత ఐదు సంవత్సరాలకు దళితవాదం ఒక ఝంఝలా సర్వవ్యాప్తమైంది. కారంచేడు, నీరుకొండ మొదలైన చోట్ల జరిగిన హింస, దేశవ్యాప్తంగా పెరిగిన దాడులు, పీడన, దళిత ఐక్య సంఘటనకు నేపథ్యంగా నిలిచినై. అంతకుముందు మార్క్సిస్టులుగా ఉన్న చాలా మంది రచయితలు, మేధావులూ దళితవాదంలోకి వచ్చారు. చాలామంది మార్క్సిస్టు వ్యతిరేకులుగా కూడా మారారు. ఈ యిరువర్గాల మేధావుల మధ్య ఆరోజుల్లో అతితీవ్రమైన చర్చలు జరిగినై. ఆచర్చల్లో ముఖ్యమైంది పునాది, ఉపరితలాల్ని గూర్చింది. అన్నిటికీ పునాది ఆర్థికమనీ, మిగిలినవన్నీ ఉపరితలనిర్మాణాలనీ మార్క్సిజం చెప్తుంది. అందువల్ల దళితపీడనకీ అంతిమంగా ఆర్థికమే కారణమని మార్క్సిస్టుల వాదన. అయితే, భారతదేశ పరిస్థితికి, అంతర్జాతీయ వాదాన్ని అనుసంధించరాదనీ, ఇక్కడి పరిస్థితుల్లో దళితత్వం ఉపరితలం కాదనీ, పునాదిగా ఉన్నదనీ దళితవాదులు అన్నారు. అందుకే ధనవంతుడైన దళితుడు కూడా, నిరుపేద యైన అగ్రవర్ణస్థుని చేత తక్కువగా చూడబడతాడనీ, అందుకే ఈ అంశం పునాదిగా చూడాలనీ, కులనిర్మూలన జరిగితే గాని, ఆర్థికమైన దోపిడిని ఎదుర్కొనడం సాధ్యం కాదనీ దళితవాదం చెప్తుంది. ఇంకో అడుగు ముందుకేసి జి. లక్ష్మీనరసయ్య అనే విమర్శకుడు “దేశీయ మార్క్సిజమే” దళితవాదం అన్నాడు. అంటే మార్క్సిజమ్‌ అవసరం ఇక్కడ లేదనీ, దేశీయంగా మార్క్సిజమ్‌ స్థానంలో దళితవాదమే నిలవాలనీ ఆయన అభిప్రాయం. అయితే అంత క్రితం మార్క్సిస్టులుగా ఉండి, దళితవాదులుగా మారిన కొంతమంది అంబేద్కరిజమ్‌ ని ప్రధానంగా భావిస్తూనే, మార్క్సిస్టు దృక్పథాన్ని కూడా కలుపుకోవాలని వాదించారు. సతీశ్‌చందర్‌, భూపతి నారాయణమూర్తి మొదలైన వారు ఇందుకుదాహరణ. భూపతి నారాయణమూర్తి, మార్క్సిస్టు మూలసూత్రాల్నీ, అంబేద్కరిస్ట్‌ భావధారనీ విపులంగా చర్చించి, రెంటి సమ్మేళనం కావాలని “దళితవిముక్తి” అనే సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు. మార్క్సిస్టు నేపథ్యం అంగీకరించిన దళితమార్క్సిస్టు మేధావులు, అన్ని కులాలలోనూ పేదలున్నారు కాబట్టి, మార్క్సిస్టు పోరాటాల్ని సమర్థిస్తూ, దళితవాదం సాగాలని కోరారు. కేవల దళితవాదులు ముందు కులసంబంధమైన పోరాటాలే మొదటిమెట్టు అని వాదించారు. ఏమైనా దళితకవిత్వంలో దళితతత్వమే ప్రధానంగా ఉన్నా, ఆర్థికసమస్యలు కూడా ప్రతిబింబించినై. అయితే, అంతకు ముందు, ఇతరవస్తువుల మీద కవిత్వం రాస్తూ, మధ్యలో కొన్ని కవితలలో తమ వేదనలూ, ప్రతిఘటనలూ చెప్పిన దళితకవులు 1990 దాటిన తర్వాత నిబద్ధకవులయ్యారు. అంబేద్కరిస్టు నేపథ్యాన్ని విస్తృతపరుచుకుంటూ కవిత్వాన్ని కేంద్రీకృత వస్తువుతో రాయడం ప్రారంభించారు. అంతకుముందే వచనకవితా అభివ్యక్తి మార్గాల్లో నైపుణ్యం కల దళితకవులు, నిబద్ధతతో రాసిన కవిత్వం వస్తుశిల్పాల అపూర్వసమ్మేళనమై, అత్యున్నతస్థాయి దళితకవిత్వం వికసించడం మొదలయింది. ప్రజోద్యమమే కవిత్వోద్యమంగా మారిన తర్వాత, ఉద్యమనేపథ్యంతో, అత్యుత్తమ కవిత్వపు విలువలతో, అసంఖ్యాకంగా వచ్చిన కవులు సాహితీపరులందర్నీ ఆశ్చర్యపరిచారు. దళితకవిత్వోద్యమం తెలుగు వారు గర్వించదగిన స్థాయిలో కొనసాగడం జరిగింది.

4

1994, 95 ల నుండి దళితవాదం గూర్చి అతితీవ్రమైన చర్చలు ప్రారంభమైనై. వీటిలో మొదటగా చెప్పుకోవలసింది, అసలు దళితుడు అంటే ఎవరు? అనేది. దళితులంటే, అస్పృశ్యులు, వెనుకబడ్డ కులాల వారు, గిరిజనులు, మైనారిటీలు అందరూ అని బి.యస్‌. రాములు, జి. లక్ష్మీనరసయ్య మొదలైన వారు వాదించారు. అయితే సతీశ్‌ చందర్‌ మొదలైన వారు దళితులంటే తరతరాలుగా అన్ని కులాలకీ దూరంగా ఉంచబడిన అవర్ణులు మాత్రమే అని ఉద్ఘాటించారు. అస్పృశ్యులు కాక మిగిలిన వారిని “బహుజనులు” అని వ్యవహరించడం చేత, వారు దళితులు కావడం కుదరదని కొంతమంది అన్నారు. అగ్రవర్ణాల్ని ఎదుర్కోడానికి అవసరమైన రాజకీయసంఘటనకి “దళితబహుజన సమైక్యత”ను కాన్షీరామ్‌ మొదలైనవారు బలపరిచారు. కాని సాహిత్యం దగ్గరకి వచ్చేటప్పటికి, దళితకవిత్వానికి ఒక ప్రత్యేకమైన అస్తిత్వమిచ్చేది, “అస్పృశ్యత” మాత్రమే. తరతరాలుగా వస్తున్న కవిత్వమంతటికీ కేటాయింపుగా వస్తున్న కవిత్వోద్యమానికి ఒక ప్రత్యేక వస్తువుండాలి. దళితకవిత్వంలో అలాటి వస్తువు అస్పృశ్యత పునాదిగానే ఉంటుంది. ఇది సొంతముద్ర ( identity ) కు సంబంధించిన అంశం. ఈ విషయాన్ని గూర్చి ప్రసిద్ధ మహారాష్ట్ర దళితోద్యమ రచయిత Arjun Dangle  యిలా అంటాడు

“Dalit literature is marked by revolt and negativism, since it is closely associated with the hopes for freedom of a group of people who, as untouchables, are victims of social, economic, and cultural inequality.”

కాబట్టి కవిత్యోద్యమంగా దళితవాదంలోని “దళితుడు”, తరతరాలుగా అస్పృశ్యతావివక్షకు గురైన అవర్ణుడే ఔతున్నాడు.

మద్దూరి నగేష్‌బాబు మొదలైన వారు తెచ్చిన “నిశాని” సంకలనం 1995లో వచ్చిన తర్వాత “దళితభాష” చర్చనీయాంశమైంది. “నిశాని” సంకలనంలో మద్దూరి నగేష్‌బాబు, పైడి తెరేష్‌బాబు, ఖాజా, వరదయ్య అనే నలుగురి కవితలున్నై. తమ శత్రువుని ఎదురుగా నిలబెట్టి తిడుతున్నట్టు రాసే ధోరణి ఈసంకలనంలో ఉంటుంది. ఇలా తిట్టడంలోని తీవ్రతా, కోపావేశమూ, దిగంబరకవిత్వాన్ని తలప్తౖిసె. దిగంబరకవిత్వంలో మాదిరే, “అసభ్యత” కూడా ఈకవితల్లో కనిపిస్తుంది. దీన్ని మొత్తంగా కొందరు వ్యతిరేకించారు. మొత్తంగా కొందరు సమర్థించారు. అసలు అసభ్యత అంటే ఏది, “దళితభాష” అనే దానికి నిర్వచనం ఏది అనే విషయాల మీద ఆసక్తికరమైన చర్చలు వార్తాపత్రికలలో జరిగినై. ఈఅంశాన్ని గూర్చి ఈవ్యాసకర్త అప్పట్లో రాసిన ఒక వ్యాసం (ఆంధ్రభూమి) “అసభ్యత” అనే అంశాన్ని విశ్లేషించింది. అసభ్యత అనే దృక్పథానికి ఎప్పుడూ పరిమితులుంటై. కొన్ని సందర్భాల్లో అది అంగీకరించవచ్చు. కొన్ని సందర్భాల్లో అనుచితం కావొచ్చు. భావతీవ్రతకి సహకరించినప్పుడూ, స్త్రీలను అవమానించేది కానప్పుడూ, మధ్యలో పాఠకుణ్ణి భావధారలోంచి బయటకు తేనప్పుడూ, వాస్తవిక సన్నివేశాన్ని చెప్తున్నప్పుడూ అసభ్యతను అంగీకరించవచ్చు. అలా ఏ ప్రయోజనమూ లేనప్పుడు, రచయిత కోపాన్ని తెప్పించాలనుకున్నప్పుడు అసభ్యత నవ్వు తెప్పిస్తుంది. అత్యాచారానికి గురైన దళితస్త్రీ వేదనను గూర్చి మద్దూరి నగేష్‌బాబు

“మానం అంటే కడుక్కుని సరిపెట్టుకునే దాన్ని
ఈ సినిగిపోయిన రైక ఎక్కణ్ణుంచి తెచ్చుకునేదిరా”

అన్న మాటల్లో, ఒక తీవ్రవేదన సందర్భంలో పైమాటలు అసభ్యత కాకుండా పోతున్నై. కాని “నిశాని” కవులు కూడా ఒక సంచలనాత్మక స్థితిలో ఆ విధంగా రాసినా, తర్వాత వారి ధోరణి మారింది. “బ్రాహ్మణీయ భావజాలం” గలవారికి కోపం తెప్పించేట్టు రాయడం అనే ప్రధానలక్ష్యం కాకుండా, వస్తువైవిధ్యం, ఉద్యమనేపథ్యం, వాస్తవికత, వేదన, అభివ్యక్తి వారికి ప్రధానాంశాలైనై.

దళితభాష అనే ప్రత్యేకశైలి గురించి కొందరు వాదించారు. దళితకవులు రాసే కవితల్లో, జీవనవాస్తవికత గూర్చి చెప్తున్నప్పుడు, దళితులకి చెందిన పదాలు, పదబంధాలూ, నుడికారాలూ రావొచ్చు గాని ఒక ప్రత్యేకశైలి ఉంటుందని చెప్పడం సమగ్రత నివ్వదు. మొరటుపదాల్తో రాస్తేనే అది దళితభాష ఔతుందని కూడా చెప్పలేం. ఎందుకంటే మొరటుదనం గ్రామాల్లో చాలామంది దగ్గర ఉంటుంది. ఐతే, మొత్తం మీద చూసినప్పుడు, దళితబహుజన కవిత్వం వల్ల అచ్చమైన తెలుగు పలుకుబడికీ, నుడికారానికీ వచ్చిన ప్రచారమూ, గౌరవమూ అపూర్వం. సులభంగా రాయడమనే దృష్టి అంతకుముందు అభ్యుదయ, విప్లవ కవిత్వాల్లోనూ ఉంది గాని, కావాలని ప్రయోగించే సంస్కృతపదాలూ, పదబంధాలూ, సమాసాలూ మొదలైన వాటిపట్ల వ్యతిరేకత గానీ, అట్టడుగు వర్గాల్లో సజీవంగా ఉన్న తెలుగుపలుకుబడిని ప్రత్యేకంగా స్ఫూర్తిమంతంగా ప్రయోగించాలనే పట్టుదల గానీ లేదు. దళితకవిత్వం అమోఘంగా ఈలోపాన్ని పూరించింది. దళితజీవన వాస్తవిక సందర్భాలూ, మట్టితనం లోంచి పట్టడమే ఇందుకు కారణం. కత్తి పద్మారావు “ఓనమాలు” కవితలో ఇలా రాస్తాడు

“మాయమ్మ
ఎండిమిరపగాయలు
కాల్సి కాల్సి పచ్చిపులుసు బువ్వ కలిపి
పెట్టినప్పుడు
మా అప్ప
కుండలో, గడ్డిమీద
కుడుములు ఆయిగిలబెట్టి
నానోట్లో కుక్కినప్పుడు
ఎర్రపచ్చడితో
పొలం బువ్వ కలిపి మాయమ్మ
దోసిట్లో పెట్టినప్పుడు
మా అయ్య
పిల్లిమిసర గుత్తి తెచ్చి
బిళ్ళంగోడు ఆడేనన్ను
కేకేసి యిచ్చినప్పుడు
మా జేటి తిరగల్లో కందులు ఇసిరి
ముడిపప్పు నానోట్లో పోసినప్పుడు
ఆకలికి అర్థం తెలియలేదు …”

ఇలాటి భాష మాత్రమే ఈకవులు ప్రతిసందర్భంలో ప్రయోగించారని కాని, భావాన్ని బట్టి సంస్కృతపదాల్ని ఉపయోగించలేదని గాని చెప్పడం నా అభిప్రాయం కాదు. కాని, దళితబహుజనకవిత్వం వల్ల, తెలుగుపలుకుబడికి అంతకుమందు లేని ప్రాచుర్యం వచ్చిందనీ, ఇది దళితకవిత్వపు కొత్త ఉపలబ్ధులలో ( achievements ) ఒకటి అనీ చెప్పడమే నా ఉద్దేశం.

ముస్లిములు దళితులౌతారా అన్న ఒక చర్చ కూడా 1995లో బాగా సాగింది. మొదట్లో ముస్లిమ్‌కవులు దళితులతో కలిసి కవిత్వం రాసి, పుస్తకాల సంకలనాలు వెలువరించారు. ఆకాలంలో కొప్పర్తి “చారిత్రకపీడనలోంచి, అణచివేతలోంచి వచ్చింది దళితకవిత్వం కాగా, మైనారిటీ కవిత్వం అట్లా కాదు … స్వాతంత్య్రం తర్వాత సంఖ్యాపరంగా బాగా తగ్గిపోయిన ముస్లిములు హిందూమతతత్వ ఫలితంగా అభద్రతకు లోనయ్యారు. అయితే ఈ రెండు సందర్భాల్లోనూ హిందూమతతత్వం ప్రధానభూమికను నిర్వహించినంత మాత్రాన, అందుకు వ్యతిరేకంగా వచ్చిన దళితమైనారిటీ కవిత్వాలు ఒకటి కావు”.

కాలం ఈమాటనే ఋజువు చేసింది. తర్వాత ముస్లిమ్‌వాదకవులుగా వేర్పడి, ముస్లింలు “జలజలా” అనే సంకలనం వేశారు.

5

అభ్యుదయ విప్లవ కవిత్వాలకి మార్క్సిస్టు తత్వం నేపథ్యంగా ఉన్నట్లే, దళితకవిత్వానికి అంబేద్కరిజమే నేపథ్యంగా ఉంది. జీవనవాస్తవికతని విస్తృతంగా లోతుగా చెప్పడంతో పాటు, ఒక నిర్దిష్ట భావధార ఉండడం చేత సమగ్రత, సంఘర్షణ, పరిష్కారదృక్పథం, చారిత్రికత, సాంస్కృతికదృష్టి మొదలైన ఎన్నో లక్షణాలు ఈకవిత్వాన్ని పటిష్టం చేశాయి.

దళితకవిత్వంలో స్పష్టంగా రెండు దశలున్నాయి. మొదటిదశ, పౌరాణిక చారిత్రక కథల్లో అగ్రవర్ణాల దుర్మార్గానికి గురయిన పాత్రల్ని ప్రతీకలుగా చేసుకుని, తమ ఆగ్రహాన్నీ, ప్రతిఘటననీ వ్యక్తీకరించిన దశ. శంబుకుడు, ఏకలవ్యుడు, బలి మొదలైన ప్రతీకలు ఎన్నో కవిత్వాల్లో వచ్చినై. అలాగే పౌరాణిక సంఘటనలు కూడా ప్రతీకాత్మకంగా వినియోగించబడినై. “ఒళ్ళు కడుక్కుందాం రండి” కవితలో చిన్ని రాసిన మాటలు
“రెల్లు పొదలో పడ్డ వీర్యం నుండి పుట్టిందెవరు?
ఎవడో మాయగాడిచ్చిన కుండనుండి మొలకెత్తిందెవరు?
గుర్రం రతినుండి ఊడిపడ్డదెవరు?
నాపుట్టుక అసహ్యమైనప్పుడు
పరమ అసహ్యమైన పుట్టుకనుండి
కళ్ళు తెరిచిన దేవుళ్ళను కొలుస్తున్న
మీపుట్టుకనే నేను ఇప్పుడు సవాల్‌ చేస్తున్నాను.”

తరతరాలుగా తలవంచబడి నిలుచున్న దళితుడు, ఒక్కసారి ధైర్యంగా ప్రశ్నించగల సమష్టిశక్తి సమకూరినప్పుడు, తనకు జరిగిన అవమానాలన్నిటినీ తలచి ఆవేదన పడి, తీవ్రమైన కోపం పొంది రాస్తున్నప్పుడు ఈవిధంగా అనడంలో ఆశ్చర్యం లేదు. ఇలాటి కోపతీవ్రత, ప్రతీకాత్మకత మొదటి రెండు మూడేళ్ళలో ఎక్కువగా ఉన్నై. ఆ తర్వాతి దశలో వాస్తవికత, అభివ్యక్తి ప్రధానమైన ధోరణి వచ్చింది. అంటే మొదటి దశలో వాస్తవికత లేదనీ, రెండో దశలో అలాటి ప్రతీకలు అసలు లేవనీ నా అభిప్రాయం కాదు. రెండు దశల్లోనూ స్పష్టంగా కనిపించే రీతుల గూర్చి ఈ విశ్లేషణ.

దళితకవిత్వంలోని వస్తువైవిధ్యమూ, అభివ్యక్తిరీతుల్ని గూర్చి వివరించవలసి ఉంది.

1. దళితకవిత్వం ప్రధానంగా ఆత్మగౌరవానికి సంబంధించిన ప్రశ్నగా రూపొందింది. “నీసంస్కృతి హీనమైంది, నీజాతి నీచమైంది” అని తరతరాలుగా అనిపించుకున్న దళితుని ప్రతిఘటనలో మొదటి దశ “నాసంస్కృతి గొప్పది, నాచరిత్ర గొప్పది” అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించడం, అంతేగాక “నీసంస్కృతి ఏం గొప్పది?” అని ప్రశ్నించడం ఇది దళితకవిత్వంలోని ప్రధాన ధోరణుల్లో ఒకటి. సతీష్‌చందర్‌ “అక్షరశయ్య” కవితలో ఇలా అంటాడు
“నాలుగు పదాలు కలవకూడదన్నదే నిన్నటి వ్యాకరణం
నాలుకనంటిన ఏ అయిదో పదమూ గ్రాంధికం కాలేదు
క్రియల్ని కిందికి తొక్కిన మనువే మహాకవయ్యాడు
భాషా అప్రవీణులారా! ఉలిక్కిపడకండి
మీరు కుదిర్చిన ఛందోబద్ధ కాపురాల్ని కాలదన్ని
పదాలు లేచిపోతున్నాయి
వర్ణక్రమాలు లేని వాడలకు వలసపోతున్నాయి”

చరిత్రలో అణచబడ్డ దళితకవి ఆత్మవిశ్వాసం పైపంక్లుల్లో ఉంది. “నను వరించిన శారద లేచిపోవునే” అన్న మహాకవి జాషువా మాటల్లోని తత్వానికి, యిది ఆధునిక అభివ్యక్తి రూపం.

“దళితధ్వని”లో నాగప్పగారి సుందర్రాజు
“అడుగులు నేర్చుకుంటున్న వారసుణ్ణి
ఓర్పునేర్పుతో అస్త్రవిద్యా వైద్యుణ్ణి
గురుదేవుడు పరుగుపరుగున వచ్చి పాదాలపై వాలి
భిక్షాన్‌ దేహి గురుదక్షిణ అడిగితే
భవిష్యత్తును బంధించి నాబొటనవేలుతో
మహాభారతానికి నాందీవాక్యం రాశాను
అయినా నాలుగు శతాబ్దాల నానగరం
నన్ను గుర్తించలేదు”

ఆత్మగౌరవప్రకటనలో మరో ముఖ్యమైన కోణం, తమకు సంబంధించిన వాటిని ఉదాత్తమైనవిగా చెప్పడం. తమ అనుభూతుల అస్తిత్వాన్ని ఎవరూ తక్కువగా చూడడానికి వీలులేదని నిరూపించడం. తమ అస్తిత్వాన్ని తాము గాఢంగా ప్రేమించడం. ఎండ్లూరి సుధాకర్‌ ఇలా అంటాడు
“సంకటి ముద్దల్లోకి
ఎండుతునకల్ని నంజుకుంటూ
వార్చిన గంజిలోకి మిరపకాయల్ని కొరుక్కుంటూ
అంబలిజుర్రిన కమ్మదనం
ఏ అమృతాని కొస్తుందిరా!”

ప్రబంధనాయిక కన్న దళితస్త్రీ అందమైంది అని సుధాకర్‌ రాసిన కవిత ఆత్మగౌరవప్రకటనలో అత్యుదాత్త స్థాయిలోది.
“ఓ నా చండాలికా
నీ వెండికడియాల కాళ్ళ ముందు
వెయ్యేళ్ళ కావ్యనాయికలు వెలవెలబోతున్నారు
అలంకారశాస్త్రాలన్నీ
నీ పాటిమట్టి మెరుపు ముందు బలాదూర్‌
నా నల్లపిట్టా
నిన్ను వరాంగివనీ, కృశాంగివనీ
లతాంగివనీ మభ్యపెట్టను…
నీనెత్తి మీది యినుపగమేళం
విశ్వసుందరి కిరీటాన్ని సైతం వెక్కిరిస్తోంది…
నా నల్ల కావ్యానికి నిన్ను
నాయికగా ప్రకటిస్తున్నాను”

ఆత్మ గౌరవ, విశ్వాస ప్రకటనలో దళితకవిత్వం వందలాది కోణాల్ని ( dimensions ) ఆవిష్కరించింది.

2. దళితులకు జరిగిన అన్యాయాల్నీ అవమానాల్నీ పేర్కొని, వాటికి ప్రతిస్పందన ఎన్నో విధాలుగా చెప్పడం దళితకవిత్వంలో ప్రబలమైన ధోరణి. 1981లోనే విప్లవకవిగా, విప్లవకారుడుగా ఉన్న సలంద్ర ఈధోరణికి మొదటికవి. “దళితమానిఫెస్టో” అనే కవితని రాశాడు.
“నన్ను
నీ దేవుడి గుళ్ళోకి రావద్దన్నావు
సరే, ఎలాగయితేనేం
నేను నాస్తికుణ్ణవడమే బాగయింది

నన్ను
చదువుకోవద్దన్నావ్‌
చదివితే నాలుక కోసెయ్యమన్నావ్‌
వింటే చెవుల్లో
వేడివేడి సీసపులోహం పోయమన్నావ్‌
సరే, ఎలాగయితేనేం
నువ్వెంతటి మూర్ఖుడివో
నీవెంతటి విశాలహృదయుడివో
నాకు తెలిసిపోవడమే బాగయింది

నన్ను
చచ్చిన శవాల దహన సంస్కారాలే చూసుకోమన్నావు
సరే, ఎలాగయితేనేం
మీ ప్రాణాలని కూడా
ఎలా పాతేయాలో
నాకు తెలవడమే బాగయింది”
యిలా సాగుతుంది కవిత. తమకు ఎలాటి అవమానం జరిగినా, తమపై ఏహింస జరిగినా వెంటనే స్పందించి, తమ పోరాటస్వరాన్ని తీవ్రంగా వినిపించడం దళితకవిత్వంలో చూడగలం. “ఐ” అనే కవి, చుండూరులో జరిగిన దళితహింసకు ప్రతిస్పందిస్తూ “మరోసారి” అనే కవిత రాశాడు. అందులోంచి ఈ పంక్తులు

“హతుడి నిశ్చల నేత్రాలను చూడు
స్తంభించిన విశేషస్వప్నాలు కనిపిస్తాయి
స్వప్నాలు ప్రవహిస్తాయి
బిగిసిన పిడికిళ్ళను చూడు
శత్రుస్థావర రహస్యాలు లభిస్తాయి
రక్తానికి తన స్వభాష తెలుసు
అది తిరుగుబాటు
ఆకాశంలో అనివార్య సూర్యోదయం”.

3. దళితజీవితంలోని విషాదవాస్తవికతలు దళితకవిత్వంలో ఆవిష్కరించబడినాయి. దళితకవిత్వంలోని సాంస్కృతికపార్శ్వం ఈలాటి కవిత్వంతో వెలుగుతోంది. ఈకవిత్వంతో దళితజీవితంలోని వాస్తవాలు తెలియగానే, తెలియని వారి మనస్సులో ఉన్నతసంస్కారం కలుగుతుంది. “వెలివాడ”ని మద్దూరి నగేష్‌బాబు ఇలా వర్ణిస్తాడు
“చాలాకాలం తర్వాత
అమ్మని చూద్దామని బయల్దేరా
బస్సు దిగేసరికి బాగా పొద్దుపోయింది
శీతకాలపు జిగటవెన్నెల
పూరిగుడిశెలపై కప్పిన మృతవస్త్రంలా ఉంది…
దూరంగా ఎక్కడో ఒక కుక్క
హృదయవిదారకంగా ఏడుస్తూ
నడుస్తుంటే నా నేల
బురదచేతుల్తో నన్ను చుట్టేసింది…”

ఇలా దళితజీవితంలోని వాస్తవికవిషాదం ఎన్నో కవితల్లో హృదయాన్ని కదిలిస్తుంది.

4. దళితజీవితంలోని సౌందర్యాన్ని కూడా కొందరు కవులు వినిపిస్తున్నారు. అందులో కత్తి పద్మారావుని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
“బడింటికాడ
గనిసిగడ్డల బండి దిగిందని
ఎడగారోడు గోలపెడితే
బానలో నూకలు చెంగున గట్టి
బేరమాడి బేరమాడి
ఈసెడు కొని
కొసరుగడ్డ మునిపంట కొరికి
పిల్లోడికి నోటికందించినపుడు
పళ్ళకొసల్లో
పూసిందొక నవ్వుపువ్వు”

దళితభాషనీ, దళితజీవితాన్నీ ఎక్కువగా రికార్డు చేస్తుంది కత్తి పద్మారావు కవిత్వం.

5. దళితకవిత్వంలో స్త్రీవేదనల్నీ, ప్రతిఘటననీ వినిపించడం దళితకవితాపరిణామంలో ఒక విశేషం. “చల్లపల్లి స్వరూపరాణి” కవితలు ఈమార్గంలో ఉత్తమమైన వాటిని అందించినై.
“ఇంట్లో పురుషాహంకారం
ఒక చెంప ఛెళ్ళుమనిపిస్తే
వీధిలో కులాధిపత్యం
రెండో చెంప పగలగొడుతుంది”

ఇంకా జి. విజయలక్ష్మి, జె. ఇందిర మొదలైన వాళ్ళు దళితస్త్రీల జీవనప్రతిబింబంగా కవితలు రాస్తున్నారు.

6. దళితకవిత్వం రానురాను, కేవలం కులసమస్యనే కాకుండా, ఇతరసమస్యల్ని కూడా స్వీకరిస్తోంది. కులసమస్య ఒక పరిధి కాగా, ఇతర సమస్యలు సాధారణమైన పరిధి. ఆర్థికాదివిషయాల్లో దళితుని జీవితం, మిగిలిన వర్ణాల పేదవారి జీవితంతో సమానంగానే ఉంటుంది. అలాగే సామ్రాజ్యవాద దురాక్రమణ వల్ల, ప్రభుత్వ వక్రవిధానాల వల్ల పొందే బాధలు అందరికీ ఒకే విధంగా ఉంటై. అందువల్ల దళితకవులు సాధారణసమస్యల్ని కూడా స్వీకరించడం కవితావస్తువుని విస్తృతం చేస్తుంది. ప్రగతిమార్గాన్ని విశాలం చేస్తుంది.

6

దళితకవిత్వం ఒక చారిత్రిక కవితోద్యమం. అగ్రవర్ణ అహంకారంతో పోరాటం తాత్కాలిక అవసరమైనా, కులనిర్మూలన దాని అంతిమలక్ష్యం. సమగ్రమైన తాత్వికనేపథ్యం, సమకాలీన సమస్యాచిత్రణ, వస్తువైవిధ్యం, దళితజీవన వాస్తవికతల్తో పాటు, అత్యుత్తమ కవితాభివ్యక్తి దళితకవిత్వాన్ని మహోజ్వ్జలం చేస్తోంది. ప్రతిఘటన వల్ల రాజకీయపార్శ్వమూ, వాస్తవికత వల్ల సాంస్కృతికపార్శ్వమూ, కవితాభివ్యక్తి వల్ల కళాపార్శ్వమూ, నిండుగా పండించుకుంటున్న దళితవాదం తెలుగుకవిత్వానికి గర్వకారణమైన ఒక ఉద్యమం.
---------------------------------------------------------
రచన: అద్దేపల్లి రామమోహనరావు, 
ఈమాట సౌజన్యంతో