Showing posts with label చిత్రకవితాశతకం. Show all posts
Showing posts with label చిత్రకవితాశతకం. Show all posts

Saturday, February 17, 2018

భర్గా శతకం


భర్గా శతకం




సాహితీమిత్రులారా!



కపిలవాయి లింగమూర్తిగారి
దుర్గాశతకాన్ని గురించి
ముందు తెలుసుకున్నాం-
ఇప్పుడు రెండవదైన
భర్గా శతకం గురించి వివరంగా తెలుసుకుందాం-
దుర్గా శతకం ఆటవెలదులతో ప్రతిపద్యం
ఒక అలంకారంలో మొత్తం శతకమంతా
దుర్గ అవతారాన్ని అష్టాదశ శక్తిపీఠాలను
దుర్గ తత్వాన్ని మొదలైన అంశాలతో
కూర్చగా భర్గా శతకం శివుడు యతీశ్వరుడు
కావున యతిశతకంగా ఆయన లీలలతో
కూర్చారు. ఇందులోని విషయం
ఈశ్వరుని గురించైతే ప్రతి దానిలో
ఛందస్సుకు సంబంధించి యతులకును
గురించిన లక్ష్యగ్రంథంగా కూర్చారు.
ఉమాదేవిని(దుర్గను) ఆటవెలదిలో స్తుతించగా
శివుని గీతపద్యాలలోని మరోరకమైన తేటగీతిని
శివస్తుతికి వాడారు. దీనిలో 120 పద్యాలను కూర్చాడు.
దీనిలో ఛందోవిషయంగా-
యతిగవేషణం - 22 పద్యాలు
వ్యంజనాక్షర విరతులు - 35 పద్యాలు
ఉభయవళులు - 35 పద్యాలు
ప్రాసయతులు - 28 పద్యాలు
మొత్తం    - 120 పద్యాలు

స్వరయతి -

మృత తత్వంబు నీయది, ది పురుష
త్మరూపంబు నీయది, ఐంద్రవినుత
ఐంద్రజాలికుడవు నీవు కలాప
పనిషదర్థమవు నీవు భవ భర్గ - 01


వ్యంజనాక్షర యతి -

కంతు కడగంట గాల్పడే కాయికముగ
కాలఫణినైన దాల్పడే కైవసముగ
కైపు విసమైన నిల్పడే గౌరవముగ
కౌశికీపతి నినుమది నునె  భర్గ   - 23

ఉభయవళులు-

చలజా వల్లభా యస్మజ్ఞత మది
లచి యిడుముల నిడ కస్మ దార్తి బాపి
దుకొనవయ్య నే యుష్మదంఘ్రి యుగము
నెపుడు నమ్మితి నను భవదీయు భర్గ     - 58







Thursday, February 15, 2018

దుర్గా శతకం


దుర్గా శతకం




సాహితీమిత్రులారా!



"కపిలవాయి లింగమూర్తి"గారు
చేసిన "దుర్గా శతకం"
చిత్రకవిత్వంలో చెప్పదగినది.
నిజానికి జంట శతకాలు
దుర్గ - భర్గ శతకాలు అని
కూర్చారు. మనం ఇక్కడ కేవలం
దుర్గ శతకాన్నే చెప్పుకుంటున్నాము.
ఒకవైపు దుర్గకు సంబంధించి
మరోవైపు అలంకారాలను వివరించడం
ఇందులోని చిత్రం. సంస్కృతంలో
కూర్తబడిన భట్టీ రావణవధ తదితర
కావ్యాల్లో ప్రధానకథ ఒక అర్థంగాను
మరో అర్థంలో వ్యాకరణం ఉండేవిధంగా
కొన్ని కావ్యాలున్నాయి. వాటికోవలో
ఈ శతకం ఒకవైపు దుర్గగురించి
మరోవైపు ఒక్కొక పద్యం ఒక్కొక అలంకారంగా
కూర్చారు కపిలవాయి లింగమూర్తిగారు.
ఇంకా వివరాల్లోకెళితే
తెలంగాణాలోని ఉమామహేశ్వర క్షేత్రంలోని
ఉమాదేవి త్రిపురసుందరి కనుక
అలంకారశతకంలో ఆమె సౌందర్యలీలలు
వర్ణిస్తూ ఆటవెలది స్త్రీ కావున అవ్నీ
ఆటవెదులుగానే కూర్చారు.
దుర్గ నవదుర్గ కావున నవ సంఖ్య వచ్చే విధంగా
వాటిని కూర్చారు.
ఇందులో వారు 109 పద్యాలను కూర్చారు.
దుర్గ అంగ వర్ణన             - 40 పద్యాలు
అష్టాదశ శక్తిపీఠ వివరం  - 18 పద్యాలు
అవతార కథనం              - 09 పద్యాలు
దుర్గ తత్వము                  - 19 పద్యాలు
అభ్యర్థనము                      - 23 పద్యాలు
                                              --- ------------
మొత్తం -                             109 పద్యాలు
                                              ------------

మొదటి పద్యం - అంగవర్ణనలో చూడండి-

అతసి కుసుమ కాంతి నవరాజితా సుమ 
చ్ఛవిని బొలుచు నీవు శివుని గూడి
గంగతోడనున్న కాళిందివలె నొప్పి
తివి మనోహరముగ నవని దుర్గ

ఇది ఉపమాలంకారంలో ఉన్నది.

అష్టాదశ శక్తిపీఠము వివరము లోని పద్యం -

లంకయందు నీవు శాంకరివనుపేర
వెలసితీవు భక్తసులభ - అయిన
లంక యిమిడినట్టి లవణాబ్దియందు నీ
యశము నిముడ జాలదయ్యె దుర్గ   - (41)

ఇది అధికాలంకారంలో ఉంది

అవతారకథనంలోని పద్యం-

విధిని వేధ వెట్టు మధుకైటభులఁబట్టి
నలిచినావు గుమిలి వలెనె యింక
శంబరాదు లెంత జగతి మహామాయ
వైన నాడు నీకు నవని దుర్గ  -  (59)

ఇది అర్థపత్తి అనే అలంకారంలో ఉంది.

ఈ విధంగా 109వ పద్యం -

సుఖమునిచ్చు సిరులు సుదతి మనోహరి
యరయకాపురంబె యవని స్వర్గ
మైననేమి బ్రతుకు లంగనాపాంగ చం
చలములగు గదమ్మ జగతి దుర్గ - (109)

ఇది విరుద్ధరససమావేశము అనే అలంకారంలో ఉంది.
ఇలాగా 109 పద్యాలు నూటతొమ్మిది అలంకారాల్లో కూర్చిన
ఈ కవిగారు ఎంతైనా అలంకారప్రియులకు అలంకారాలతో
విందు చేయించినారు. చాల చిన్న చిన్న మాటలతో కూర్చిన
ఈయనకు భాషపైనగల పట్టునకు నిదర్శనము.



Friday, February 2, 2018

సన్యాస శతకం


సన్యాస శతకం



సాహితీమిత్రులారా!


"సన్యాసమే మేలురా" అనే మకుటంతో
వ్రాయబడిన శతకం ఈ సన్యాసశతకం.
అయితే ఈ శతకానికి ఒక ప్రత్యేకతవుంది.
అదేమిటంటే ఒకే కవి దీన్ని వ్రాయలేదు.
నల్గొండజిల్లా మిర్యాలగూడకు చెందిన
ముడుంబ కృష్ణమాచార్యులు, సూలూరు 
శివసుబ్రహ్మణ్యం, కాటేపల్లి లక్ష్మినరసింహమూర్తి
అనే మిత్రులు వరుసగా పాదైక రచనా నియమంతో
ఒకే రాత్రిలో కూర్చారు. ముగ్గురు ఒకచోట కూర్చొని
తలా ఒక పాదం చొప్పున మూడు పాదాలు చెప్పాక
నాలుగవ పాదం పద్యం మొదలు పెట్టిన కవి పూర్తిచేస్తాడు.
ఈ క్రమంలో రెండవ పద్యాన్ని ఇంకొకరు, మూడవ
పద్యాన్ని మరొకరు మొదలుపెడతారు. పద్య ప్రారంభించిన
వాడు తను చెప్పదలచుకొన్నది మిగతా ఇద్దరికి వివరిస్తాడు.
వాళ్ళు ఆ విషయాన్నే అతని శైలిలో తమవంతుపాదాలను
పూర్తి చేస్తారు. అయితే ఇక్కడ మరో ప్రత్యేకత వుంది అదేమంటే
ఆ కవులకు ఇదే తొలిరచన.

ఈ శతకంలో నవనాగరికత వ్యామోహం వల్ల సమాజం
ఎదుర్కొంటున్న దుష్పరిణామాలను వివరించి, తమ
ఆవేదనను ఈ కవులు సన్యాసమే మేలురా
అనే మకుటంతో వెల్లడి చేశారు.
ఇందులో మద్యపానం చేసి వాహనాలు నడిపేవారిని(32),
మామూళ్లని డబ్బులు దోచుకునేవారిని(22),
మన్మథవికారంతో వేశ్యవాటికలకు పోయేవారిని(61)....
చూసి ఈ కవులు సన్యాసమే మేలని తీర్మానించారు.
బీపీ పెంచుకొని, రోషావేశులై ఇతరులను తూలనాడేవారిని
గురించి ఈ సన్సాస కవులు ఇలా పేర్కొన్నారు(74)లో.

రుధిరా పీడన పీడితుల్, తమ మనోరుద్రాంగణంబందు దా
మధిరావేశమునం జరించుచున్ నైజాపత్యముం దూలగా,
నధమోత్కంపము మీర, జిత్తములు నిత్యంబుం గృషింపగ, దో
ష ధురాబాధితముం బొనర్తు రకటా సన్యాసమే మేలురా

జంటకవులెలా చెబుతారో కవిత్వాన్ని ఇప్పుడెవురూ చూడలేదు.
కానీ ఇలాంటి పద్ధతిలో కవిత్వం చెప్పడం కొంతవకు కాదు
పూర్తిగా ప్రత్యేకం మరియు ప్రశంసనీయం.
ఈ శతకం 1992లో ప్రకటించబడింది.

(విషయ సమాచార సేకరణ - 
కె.వి.రమణాచారి, పద్యకవిత్వం - వస్తువైవిధ్యం) 

Monday, January 29, 2018

నరహరి శతకం


నరహరి శతకం



సాహితీమిత్రులారా!



మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట తాలూకాలోని మామిళ్ళపల్లిలో
ఉన్న నృసింహస్వామి ఆలయం ఎంతో పురాతనమైంది.
ఇక్కడున్న నృసింహస్వామిని స్తుతిస్తూ విద్యాశాఖలో వివిధ 
పదవులు నిర్వహించిన మొలగర రంగారావుగారు నరసింహ శతకం
1991లో రచించారు. తెలుగులో శతకమంతా ఒకేప్రాసగల
శతకాలు చాలానే వున్నాయి. కాని పేరును(నామ)ప్రాసగా
శతకం కూర్చారు రంగారావుగారు. మొదటి పద్యంలో నకార ప్రాసం,
రెండవ పద్యంలో ర(రేఫము) కార ప్రాసం, మూడవ పద్యంలో
హ కార ప్రాసం, నాలుగవ పద్యంలో ఇత్వరేఫము(రి) ప్రాసంగా
కూర్చారు. అంటే ఒకసారి నరహరి అని పూర్తికావటానికి 4 పద్యాలు
కావాలి. అలా 108 పద్యాలకు నరహరి నామం 27 మార్లు ఆవృత్తమౌతుంది. 
ఇలాంటి శతకాలు చాల తక్కువగా ఉన్నాయి.
ఇలాంటి శతకం భువనగిరి విజయరామయ్యగారు కూర్చినట్లు
చూచిఉన్నాను. ఇంకా కొందరు కూర్చి ఉండవచ్చు.
ఇక్కడ మానవ సహజనైజాన్ని తెలిపే 83వ పద్యం చూద్దాం-

మోహ విలగ్న చిత్తగతి మూర్ఖుడు గూలు నిరంతరాఘ సం
దోహ మహాహ్రదంబున ననూహ్యగతిన్ దనమేలుకైన య
య్యీ హ లొకింత గైకొనడికే విధి? నిన్ మది నూను? దుష్ట దం
భాహత బుద్ధియై నకట, మామిళపల్లి నృసింహ! యో! ప్రభూ!

(కె.వి.రమణాచారి గారి పద్యకవిత్వం - వస్తువైవిధ్యం నుండి)

Thursday, December 15, 2016

సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్


సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్



సాహితీమిత్రులారా!


శ్రీ విజయనగర సంస్థానాధీశుడు,
మహాపండిత నిత్యగోష్ఠీనిరంతరుడు,
అయిన శ్రీమదానందగజపతీ సార్వభౌముడు
ఒకరోజు పండితులందరికి ఒక సమస్యనిచ్చి
ఈ మకుటంతో ఒక శతకం వ్రాయవలసినదగా
పండితులందరికీ ఆజ్ఞాపించాడు -
ఆ సమస్య-
సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్

దీనికి అనేకమంది తమ ప్రజ్ఞాప్రాభవాలతో శతకాలను వ్రాశారు.
కాని ఈ శతకాలన్నీ భూపతికి చేరి పరిశీలించే లోపే
ఆయన కాలవశమ్మున చిక్కి కీర్తిశేషులైనారు.

అందులో శ్రీవిజయనగరమహారాజావారి
కళాశాలలో సంస్కృత పండితుడు అయిన 
శ్రీభాగవతుల లక్ష్మీనారాయణ శాస్త్రిగారు
సత్యవ్రతి శతకాన్ని వ్రాశారు.
కానీ ఇది వ్రాసిన సుమారు 40 సంవత్సరాల
తరువాత 20-03-1929న శ్రీభాగవతుల లింగమూర్తి గారిచే
ముద్రింపించబడెను.

ఇది చిత్రకవితాశతకం దీని విశేషాలు-

ఈ శతకానికి కవిగారే టిప్పణము వ్రాశారు.
ఇందులోని అన్ని పద్యాలు కందపద్యాలే.
ఏకప్రాస శతకం ఇది.
శతకమంతా - కార ప్రాసతో సాగింది.

ఇందులో శతకప్రారంభంలో
రెండు పద్యాలు ఉన్నాయి అవి-
సరస్వతీ, శంకరుల ప్రార్థనలు.

వాణీవీణా విలస
త్పాణీ ఘ్రాణజిత గంధఫలి భారతి బ్ర
హ్మాణీ హరిమధ్యమ క
ల్యాణీ మద్రసన తుదమెలంగుము కరుణన్

కనకహార్యశరాస రాసభవిపక్షాజిహ్మగా జిహ్మగా
వనిపస్ఫారగుణా గుణాకర కరవ్రాతా ధరీపూత పూ
న యాదిత్యముఖగ్రహా గ్రహపతీం ద్వర్చిష్మదుస్రాంచితా
నన నాళీకుసుమా సుమాంబకవపుర్నా శంకరా శంకరా

అని శబ్దాలంకారసమన్వితంగా ప్రార్థించారు శంకరుని.

ఈ శతకం మొత్తం అన్ని పద్యాలు ఏదో ఒక ప్రత్యేకతతో ఉన్నాయి.
83వ పద్యం ఏకాక్షరిగాను
84వ పద్యం సనాళ షోడశదళ పద్మబంధంగా కూర్చారు.
ఇక్కడ ఏకాక్షరి పద్యాన్ని చూద్దాం-

ఋత తిత ఊత్తు త్తీతా
తతేతి తాతేత తాత తత్తై తత్తా
తత తుత్తా తతి తుత్తిన్ 
సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్

ఇందులో త - అనే హల్లు ఒకటే
ఉపయోగించి కూర్చబడినది.
మరియు  ఇందులో నాలుగవ పాదము
అన్ని పద్యములకు
మకుటంగా ఉన్నందున
అది ఒకే వ్యంజనము
ఉండనవసరములేదు.

ఋత - సత్యమనెడు, తితఉ - జల్లెడచేతను,
ఇత - పొందబడిన, ఆతత - విస్తారియగు,
ఇతి - జ్ఞానము చేతను, తాత - తండ్రివంటి
పరమేశ్వరుని యొక్క, ఇత - పొందబడిన,
తాత - దయచేతను, తత్తైతత్తా - అది ఇది
అనే భేదభావముచేత కలిగిన, తత - అధికమగు,
తుత్తాతతి - బాధ సమూహమును,
తుత్తిన్ - కొట్టుటచేతను,
సత్యవ్రతికి సంతసమొసగును.

పదార్థశోధనముచే గలిగిన జ్ఞానముచేతను,
ఈశ్వరజ్ఞానము చేతను, సంసార దుఃఖము
తొలగుననియు అందుకు సత్యము మూలమని
తాత్పర్యము.

ఈ విధంగా భాగవతుల లక్ష్మీనారాయణ శాస్త్రిగారు
చిత్రకవితా సమన్వితంగా శతకాన్ని రచించారు.