Wednesday, December 30, 2020

కాళిదాస కృత అశ్వధాటీ స్తోత్రం -1

 కాళిదాసకృత అశ్వధాటీ  స్తోత్రం -1





సాహితీమిత్రులారా!


కాళిదాస కృత అశ్వధాటీ స్తోత్రం

లోని మొదటి శ్లోకం

చేటీ భవన్నిఖిల ఖెటీ కదంబవన వాటీషు నాకి పటలీ

కోటీర చారుతర కోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా |

పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీమగాధిప సుతా

ఘోటీఖురాదధిక ధాటీముదార ముఖ వీటీరసేన తనుతామ్ || 1 ||


ఇక్కడ  అధ్యయన భారతి - శివపరివారం వారి వీడియోలో

దీని అర్థము తదితర అంశాలను ఆస్వాదించండి -



Monday, December 28, 2020

"కంప్యూటర్ తల్లి" దండకం

  "కంప్యూటర్ తల్లి" దండకం




సాహితీమిత్రులారా!

గరికపాటి నరసింహారావు వారి

"కంప్యూటర్ తల్లి" దండకం

ఆస్వాదించండి -



Saturday, December 26, 2020

ప్రేయసీ - ప్రియుల సంభాషణ

 ప్రేయసీ - ప్రియుల సంభాషణ




సాహితీమిత్రులారా!



 ప్రేయసి - ప్రియుల సంభాషణ చూడండి

ప్రాణప్రేయసి! మా పిబంతు పురుషా:  పిత్తజ్వరవ్యాకులా:
నానావల్లిజలం విలంబితఫలం పానే విషాదప్రదమ్

తత్తై: కిం క్రితాం చిక్సకపతే! ముగ్దే సుఖం సేవ్యతాం
సద్యస్తాపహరస్సుధాధికతర:  కాంతాధర: కేవలమ్
                                                          (లోలంబరాజీయమ్)

ప్రియుడు-  ప్రాణప్రేయసి! మా పిబంతు పురుషా:  పిత్తజ్వరవ్యాకులా:
                   నానావల్లిజలం విలంబితఫలం పానే విషాదప్రదమ్
                   తత్తై: 

                (ఓ ప్రియురాలా పురుషులకు పైత్యజ్వరం వచ్చి బాధపడుతున్నపుడు
                  అనేకరకాల మూలికలతో తయారుచేసినది, ఆలస్యంగా ఫలితాన్నిచ్చేది,
                  త్రాగేప్పుడు వగరుగా ఉండి చికాకు కలిగించేది. అయిన కషాయాన్ని తాగవద్దు)

ప్రేయసి -   కిం క్రితాం చిక్సకపతే! 
                (అయితే వారేం చేయాలి?)
ప్రియుడు -                                               ముగ్దే సుఖం సేవ్యతాం
                    సద్యస్తాపహరస్సుధాధికతర:  కాంతాధర: కేవలమ్ 

                   (ఏమీలేదు. వెంటనే తాపాన్ని హరించేదీ, అమృతంకంటే ఎక్కువ రుచిగా
                     ఉండేదీ అయిన తన ప్రియురాలి అధరామృతం ఆస్వాదిస్తే చాలు.
                     వెంటనే అతని పైత్య జ్వరం నిమ్మళిస్తుంది)

Friday, December 25, 2020

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు

 ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు




సాహితీమిత్రులకు

శ్రేయోభిలాషులకు

ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు


ఈ సందర్భంగా విష్ణుసహస్రనామస్తోత్రం 

ఆకర్ణించండి-



Wednesday, December 23, 2020

రఘువీరగద్యం చారిత్రక వ్యాసం

 రఘువీరగద్యం చారిత్రక వ్యాసం




సాహితీమిత్రులారా!



*రఘువీర గద్య*

శ్రీవైష్ణవ ఆచార్యపురుషులలో వేదాంతదేశీకులవారు

(క్రీ.శ. 1268-1369) సుప్రసిద్ధులు.వీరు కవితార్కిక కంఠీరవ,

సర్వతంత్రస్వతంత్ర మొదలయిన చాలా బిరుదాలు కలిగిన

వారు ,శతాధిక గ్రంథకర్తలు.

దేశికులవారు- కాంచీపురంలోనేగాక తిరువహీంద్రపురం

అనే చోటకూడచాలాకాలంనివసించారు.తిరువహీంద్రపురంలో

దేశికులవారు నివాసంగా ఉండిన తిరుమాళిగ నేటికీ దర్శన

మిస్తుంది.దేశికులవారి జీవిత, సాహిత్య అద్భుత చరిత్రలతో

తిరువహీంద్రపంరానికిచాలాసన్నిహితసంబంధాలుఉన్నాయి.

అలాగే దేశికులవారు రచించిన *రఘువీరగద్య* కు 

తిరువ హీంద్ర పురానికీ చాలాసంబంధం ఉంది.

తమిళనాడులోని సౌత్ ఆర్కాట్జిల్లాలోకడలూరుకు5కి.మీ.

దూరంలో తిరువహీంద్రపురం ఉంది.ఇది శ్రీవైష్ణవుల నూట

ఎనిమిది దివ్యతిరుపతులలో ఒకటి.ఇక్కడి మూలవరులు

దైవనాయకన్.ఈ దివ్యతిరుపతిలో సీతారామలక్ష్మణహనుమ

దాలయం ఉంది.ఇక్కడ వెలసిన శ్రీరామునికి రఘువీరుడని

కూడా వ్యవహారం. ఈ రఘువీరుని గురించే దేశికులవారు

గద్యను రచించారని దొడ్డయాచార్యులు అనే పూర్వపండిత

కవి తెలియజేశారు.

శ్రీరామానుజులవారు శ్రీరంగ,శరణాగతి,వైకుంఠ గద్యలను

రచించారు. వీటిలో శ్రీరంగగద్యరచనకు దేశికులవారు 

ప్రస్పందించి,ప్రేరితుడై రఘువీరగద్యను రచించారని పరిశోధక

పండితులు చెప్తారు.దేశికులవారి రచనల ఆవిర్భావానికి ఒక

అద్భుతమైన సంఘటన నేపథ్యంగా ఉండడం విశేషం. 

రఘు వీర గద్యకూడ *ప్రత్యేక లయలో* ,శైలిలో రచించబడడానికి

కారణాలు పూర్వపండితులు గ్రంథస్థం చేశారు. డిండిమభట్టు

అనే పండితకవి కంచుఢక్కను(బిరుదచిహ్నంగా)కలిగి ఉం టాడు.

ఆయన ఒకపర్యాయం తిరువహీంద్రపురంలో ఉన్న

దేశికులవారి సన్నిథికి వెళతారు.అపుడు దేశికులవారు

శ్రీరంగ గద్యరచనకు ప్రేరితులై రఘువీరగద్యను రచించే ఉద్దే

శంతో ఉంటారు.ఆ విషయం డిండిమభట్టుకు తెలుస్తుంది.

భట్టుగారు దేశికులవారితో- "అయ్యా ! నేను ఈ ఢక్కను మోగిస్తాను.

ఆ శబ్దానికి అనుగుణంగా మీరు గద్యకవనం చెప్పండి.

అప్పుడు మీ ప్రతిభ తెలుస్తుంది"అంటాడు.దానికి

దేశికులవారు ఆమోదించారు.డిండిమభట్టు శాస్త్రపద్ధతికి

మారుగా, సరస్వతికే కొంగొత్తతాళం నేర్పగలిగే రీతిలో, ఢక్కా

వాద్యాన్ని మోగిస్తారు.దేశికులవారు ఆఢక్కావాద్య శబ్దానికి

అనుగుణంగా రఘువీరగద్యను ఆశువుగా చెప్తారు. ఇది

పరంపర జనశ్రుతిగ వస్తున్న విషయం.దేశికులవారి రఘు

వీరగద్య అంటే అమితమైన ఇష్టమని తెంబైరాజగోపాలస్వామి

వారు అనే విద్వత్పండితులు ఒకచోట రాశారు.

తిరువహీంద్రపురంలోదేవనాయకన్బ్రహ్మోత్సవ సందర్భాన

శ్రీవైష్ణవ పండితస్వాములు ఈ గద్యను అద్భుతమైన ప్రత్యేక

శైలిలో గానం చేయడం ఈ సందర్భాన స్మరణీయం.

దేశికులవారు రఘువీరగద్యను "మహావీరవైభవం"అని

పేర్కొన్నారు.రచనలు మూడు విధాలు.అవి-పద్య రచనలు,

గద్య రచనలు,పద్య గద్యాత్మక రచనలు.ప్రస్తుత రచన గద్య

రచన.గద్యలలో చూర్ణికాది భేదాలు ఉన్నాయి.

రఘువీరగద్యలోశ్రీరాముడు,ధర్మవీర,దానవీర,దయావీర,

యుద్ధవీర,శరణాగతరక్షకవీరునిగా దర్శనమిస్తారు.శ్రీవాల్మీకి

రామాయణంలోని ఏడు కాండలలోని వివిధగుణాలను వెల్ల

డించే నవ్య,భవ్య,దివ్య స్తోత్రం రఘువీరగద్య.సంక్షిప్త సుదీర్ఘ

సమాస భూయిష్ఠంగా రఘువీరుని మథుర శబ్దాలతో,నియ

మాక్షరాలతో, ఒక విధమైన నవ్యమైన లయబద్ధంగ సాగు

తుంది హృద్యంగా రఘువీరగద్యం.

రఘువీర గద్యలో "జయ జయ మహావీర"అని 1నుండి

20వరకు ఉన్నమాటలు బాలకాండకు,21నుండి25 వరకు

అయోధ్యకాండకు,26నుండి41వరకు అరణ్యకాండకు,42

నుండి46 వరకు కిష్కింధకాండకు,47సుందరకాండకం,48

నుండి77వరకు యుద్ధకాండకు,78నుండి 98 వరకు ఉత్తర

కాండకుసంబంధించినవిషయాలను చెప్పారు దేశికులవారు.

మొత్తం 95 వచనాలు సంబుద్ధిగా ఉన్నాయి.

దేవతలకోరికమేరకువైకుంఠంనుంచిదిగివచ్చి

శ్రీమన్నాయరాయణుడు కౌసల్యా దశరథులకు జన్మించడం,

వసిష్ఠ విశ్వామిత్ర భరద్వాజ వాల్మీక మసర్షుల ప్రస్తావనలు,

గుహుడు,శబరి, జటాయువు,కాకాసుర,హనుమాన్,సుగ్రీవ,

విభీషణుల ప్రస్తావనలు,లవకుశులు రామాయణగానం చేయడం,

శ్రీరాముడు తిరిగివైకుంఠంవంటి రామకథలోని సుప్రసిద్ధ ప్రధాన విశేషాలు

రఘువీర గద్యలో రామసంబంద్ధిగా చెప్పారు దేశికులవారు.

రఘువీరగద్యకు రంగాచార్యులు అనే పూర్వవిద్వత్కవి పండితులు 

మణిప్రవాళంలో వ్యాఖ్య సంతరించారు. రఘు వీరగద్య *జయ* శబ్దంతో 

ప్రారంభ మవుతుంది.కనుక *రఘువీర గద్య వ్యాఖ్య* కు 

*జయవ్యాఖ్య* అనే పేరు ఉండడం స్మరణీయం.


--------------------------------------

శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులు

Monday, December 21, 2020

చదరంగం గళ్ళలో అన్ని గింజలు పడతాయా!

 చదరంగం గళ్ళలో అన్ని గింజలు పడతాయా!





సాహితీమిత్రులారా!


ఈ కథను ఆస్వాదించండి

చదరంగం ప్రియుడయిన ఒక రాజు వద్దకు ఒక వేద పండితుడు వచ్చాడు.ఆ పండితుడు అతన్ని ఒక ఘనపనస చదివి ఆశీర్వదించాడు.

అప్పుడు ఆ రాజుగారు "ఏమయ్యా! పండితా! ఈ వేదపనసలు ఎవరైనా నేర్చుకుని చదవవచ్చు!

చదరంగం ఆడడానికి సహజమైన తెలివి కావాలి. నాతో కేవలం ఒక 20 ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు! అప్పుడు నువ్వడిగిన కోరికను నెరవేర్చుతాను." అన్నాడు.

అప్పుడు ఆ పండితుడు "రాజా! నాకు చదరంగం వస్తుందని కాదు గానీ, మిమ్ములను సంతోషపరచడానికి ఆడతాను" అంటూ రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు.

రాజు గారూ ఆటను చివరి వరకూ కొనసాగిద్దాం! అన్నాడు.కానీ ఆ పండితుడు "రాజా! ఆటను ఇక్కడితో ఆపడం నాకు క్షేమమూ - గౌరవం కూడా!

రాజు గారితో 20 ఎత్తుల వరకు ఆడగలిగాను అని గొప్పగా చెప్పుకోవచ్చు! " అంటూ సున్నితంగా తిరస్కరించాడు.

"సరే! పండితా! నీ తెలివిని గుర్తించాను. మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నేరవేర్చుతాను.చెప్పు! " అన్నాడు రాజుగారు.

మహారాజా! చదరంగంలో 64 గడులు ఉంటాయి కదా!

ఒక గడిలో ఒక గింజ -

రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు గింజలు -

మూడవ గడికి మళ్లి రెట్టింపు 4 గింజలు -

నాలుగవ గడికి మళ్లి రెట్టింపు 8 గింజలు -

.... ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు! అదే మహాప్రసాదం." అంటూ ఆ పండితుడు వెళ్లిపోయాడు.

రాజు సరే ! అని ఆ పని మంత్రికి పురమాయించాడు.

ఆ పండితుని వెంట మంత్రి గారు కూడా వెళ్లి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు.

తిరిగి వచ్చిన మంత్రితో రాజుగారు "పండితుడడిగాడు కదా .. మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు.. మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు.. తర్వాత8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు..

‘అయితే ఏముంది.. చదరంగంలో ఉన్నదంతా 64 గళ్లేగా.. ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు.. వెఱ్ఱి పండితుడు.. గింజలకు గింజలు రెట్టింపు చేసుకు పోయినా ఎన్నివస్తాయి..? ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది..’

‘అలా తీసెయ్యకండి మహారాజా !.. ఆ పండితుడేమీ వెర్రిబాగులవాడు కాదు.. ’

‘ఎందుచేత..?’ అన్నాడు రాజుగారు.

‘లెక్క కట్టి చూసుకుంటే.. ఆ పండితుడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!’

‘ఎందుకు..? ఆశ్చర్యపోతూ అడిగాడు మహారాజు

ఎన్ని ధాన్యపు గింజలో మన గణికులు గంటలకొద్ది లెక్కించి చెప్పిన సంఖ్యను ఆ పండితుడు వేదగణితం ద్వారా క్షణంలో చెప్పేసాడు మహారాజా ! అంతే కాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆశువుగా ఒక చంపకమాల పద్యం కూడా చెప్పాడు.

‘అలాగా.. ఏమిటా పద్యం..?’

‘ఇదుగో.. వినండి మహారాజా !’

శర శశి షట్క చంద్ర శర సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ

ధర గగనాబ్ధి వేద గిరి తర్క పయోనిధి పద్మజాస్య కుం 

జర తుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి 

స్తర మగు రెట్టికగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్

పద్యం విన్న మహారాజు ‘దీన్లో తేలిన లెక్కెక్కడుంది..? అంతా బాణాలూ, చంద్రులూ, ఆకాశం, అంబుధి,కొండలు తప్ప..’

‘అదే మహారాజా ! మనదేశ పండితుల మేధ.. సంక్షిప్తంగా అల్పాక్షరములతో అనల్పార్థసాధకంగా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..’

‘సరే… సరే.. విప్పి చెప్పు..’

‘ఈ పద్యంలో లెక్కచిక్కు విడిపోవాలంటే మనపూర్వుల సంఖ్యాగణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతిశక్తులను సంకేతాలుగా ఏర్పాటు చేసుకున్నారు..

ఈ పద్యంలో

శర, సాయక, - అనే పదాలకు అర్థం బాణాలు అని .( మన్మథుని పంచసాయకములు) ఇక్కడ ఆ రెండు పదాలు 5 సంఖ్యను సూచిస్తాయి. 

గగన, వియత్ - 0

(ఆకాశం గగనం శూన్యం)

శశి, చంద్ర, తుహినాంశు -1 

(చంద్రుడొకడే భూమికి )

షట్కము - 6 

రంధ్ర - 9 

(నవరంధ్రాలు)

నగ, గిరి, భూధర - 7 

అగ్ని - 3 

(మూడగ్నులు; గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని,ఆహవనీయాగ్ని)

అబ్ధి, పయోనిధి - 4 

వేద -4

(చతుర్వేదములు)

తర్క - 6

( షట్ తర్కప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి’)

పద్మజాస్య - 4 

(పద్మజుడు బ్రహ్మ, చతుర్ముఖుడు)

కుంజర - 8

(అష్ట దిగ్గజములు)

ఇవీ ఇందులోని అంకెలసంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే..’

శర శశి షట్క చంద్ర శర

5 1 6 1 5

సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ

5 9 0 7 3

ధర గగనాబ్ధి వేద గిరి

7 0 4 4 7

తర్క పయోనిధి పద్మజాస్య కుం

6 4 4 

జర తుహినాంశు సంఖ్యకు ని

8 1

జంబగు తచ్చతురంగ గేహ వి

స్తర మగు రెట్టికగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్

అంకెలు లెక్కించెటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం .. ‘అంకానాం వామతో గతిః’ -

కుడినుంచి ఎడమకు చేర్చి చదువుకోవాలి..

అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య.

1,84,46,74,40,73,70,95,51,615

ఒకకోటి 84లక్షల 46వేల 74కోట్ల 40 లక్షల73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615

ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం.ఇక ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే,

ఒక ఘనమీటరు విస్తృతిగల గాదెలో దాదాపు ఒకటిన్నర కోటి గింజలు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే,

4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు దాదాపుగా 12,000 ఘనకిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..

పేర్చుకుంటూ వెళితే 300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు.. అంటే భూమికి సూర్యునికి ఉన్నదూరానికి రెట్టింపు.

పోనీ లెక్కపెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంటే

సెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి 58,495 కోట్ల సంవత్సరాలు..

అదీ సంగతి…

వేదపండితులతో వేళాకోళం తగదు మహారాజా !…నిజానికి అతడు చదివిన గణపనస కూడా లెక్కలకు ,ధారణ శక్తికి సంబంధించినదే ! ఎంతో ధారణ శక్తి - పాండిత్యం - సాధన ఉంటేకానీ గణాపాటి కాలేరు. అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించపరిచారు. ఇప్పుడు ఏం చేయడం ? మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది .

అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకులనుండి ఎవ్వరు కూడా ఇప్పటివరకు మాట తప్పలేదు. 

ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవలో ఆ పండితున్నే అడుగుదాము. అని ఆ పండితున్ని పిలిపించి క్షమించుమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏం చేయాలో చెప్పుమన్నాడు .

ఆ పండితుడు" రాజా ! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము. ధాన్యం బదులుగా అవును ఇవ్వండి చాలు !" అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు.

-----------------------------------------------------------------------

-శ్రీమాన్  వైద్యం వేంకటేశ్వరాచార్యులు వారి సౌజన్యంతో

Saturday, December 19, 2020

వచనంలో పద్యాలు

 వచనంలో పద్యాలు



సాహితీమిత్రులారా!

ఈ గల్పిక. చదవండి. 

నవ్యతా రాగం 

జ్వాలారావుకు అన్నితీర్ల పనులూ చాలా మహత్తున్న యజ్ఞాలే. వేసట లేని సాధకుడనీ, చాలా నిఖార్సైన చాలూ, లోకజ్ఞత వున్న ధీరుడు అనీ లోలోపలే గొప్పగా పోలుస్తారు అతణ్ని. కాని ఇది చెప్తూ దీవెనిచ్చేది కొందరు అయితే సదా ఎదురు దాడులు చేసి ఛిఛీ అనేది కొందరు. అతడో నిషేధిత వితండుడనీ, అహమున్నవాడనీ నిరసన చూపుతారు. పనినే సిరిగా తలచే మహా ధురంధరుడయినా ఇలా బహువిధాల అపప్రథలే లభించినాయతనికి. కారణం అతని ఆధునికత్వపు కాంక్ష. ఎప్పుడూ అతనికి కొత్తకొత్త విషయాలు, విచేష్టలు నచ్చుతై. అసంగతపు ప్రవర్తనే అతనికా అగచాటును తెచ్చినట్టు వ్యాహృతి చెబుతారు కొందరు. మహీస్థలి పైన ఇలాంటి కొందరుండాలండీ. ఒక పాతరీతిని తెగట్టం కూడ ఓ ధైర్యమే.

జ్వాలారావుకు కావ్యలేఖనములో సామర్థ్యముందండి. కానీ లోలోపల పాతకాలపు విధాన్నెంతో అసహ్యించుకుంటూ లోతైన అపేక్షతో పదును పెడ్తూ రాసినాడండి. ఓ సారైతే మన పాత వ్యాకరణ అంశాల్నే త్యజిస్తూ తనే ప్రారంభించిన నవ్య వ్యాకరణ స్వారస్యాన్ని దట్టించి బాగా రాశాడు. పురాణ పండితులు ఏకంగా విరోధించి తిట్టారండీ. అయినా మరింత కసితో టాటోటు లేకుండ ఇంకా రాశాడు. ఇలాంటి వాళ్లకు సరిగ్గా ప్రాభవం రాదు. జాల్వారే కొత్తదనాలు ఆయనకు చాలా ఇష్టదైవాలు.

జ్వాలారావంతటితో అలా నిలిచిపోలా. గాన మేధావి లాగా రాగాలను పాడినాడు శ్రుతితో. కానీ యధారీతిలో చెలరేగాడని ఇక్కడా గొడవలే చేశారు సంగీత శాస్త్రులు. శాస్త్రం ఒకసారి సూత్రనియమాల్తో రూఢి అయ్యాక అర్మిలితో గైకొని ఇంపుతో, నిరతితో మెచ్చాలి, నచ్చాలి. జాబిలిలా దాన్నొక గొప్ప ఆస్తి వలె భావిస్తూ వరించాలి జ్వాలారావూ! అని గోల చేసి అటతాళంలో నిలేశారు. జ్వాలారావస్సలు వాళ్ల మాటలను విన్లా. సూటిగా ధాటిగా ఊరూరా తన నవ్యరాగ రవళీ హోమాన్ని వేల్చాడు. ఈ రారాజేం పస లేని బేల మనిషా? రవ్వంత కూడా బెదర్లా. పాపం అతడెన్ని సార్లు నవతారాగాన్ని మ్రోగించినా శాపాల్నే, పరితాపకారక నిరాశా నిస్పృహల్నే ఫలంగా పెట్టింది ప్రశస్తమైన మన లోకం. ఎందుకీ లోకమిట్లా పాడైందని బాధతో, కలతతో ఠారెత్తిపోయాడు.

ఈ జ్వాలారావొకసారి స్కూల్ తరఫు మ్యాగ్ జైన్ వారి సంపాదకత్వం లైట్ గా నెరిపాడు. అప్పుడతడుత్సాహాన్ని తెచ్చేసుకుంటూ లోకౌచితి అప్రధానమని దాంట్లో నూతనత్వాన్ని ధారాళంగా కలిపేసినాడు. ఎడిటోర్యల్ పేజి ఆఖర్న వచ్చేలా స్థిరపర్చినాడు. అది చూసేశారు సాహిత్యపీఠంలో మన్నిక గన్న పండితులు. కంఠాలన్ని చిట్లేవిధంగా లౌడ్ గా అరిచేసి చాల చెలరేగారండి. ఏం చేసినా జ్వాలారావు తనెంచుకున్న నవతత్త్వాన్నస్సలే వీడలా. 

ఈ రకమైన ప్రేరణ మరీ అధికం అయినట్టి కొందరుంటారు. మరట్టివారి నిబిడార్తికి, తృష్ణకు, కౌశలానికీ వారి అమేయ చాతురికి వందన చేసి మనేది ఎందరంటారు? మితం కదా. కటకటా. మరి దీనికి ఏం ఉపాయమో! 

ఇందులోని మొదటి వాక్యాన్ని ముందుగా పరిశీలిద్దాం. ఆ వాక్యంలోని ఒక్కొక్క అక్షరానికి మాత్రలు వేసుకుంటూ పోతే అది ఇలా ఉంటుంది.

జ్వాలారా (UUU) = మ గణం

వుకుఅ (IIU) = స గణం

న్నితీర్ల (IUI) = జ గణం

పనులూ (IIU) = స గణం 

చాలామ (UUI) = త గణం

హత్తున్న (UUI) = త గణం

య (U) = గ గణం (ఏకాక్షర గణం). 

వీటన్నిటినీ వరుసగా పెట్టి చూస్తే, మ స జ స త త గ వస్తుంది. మొదటి అక్షరమైన ‘జ్వా’ కూ 13 వ అక్షరమైన ‘చా’ కూ యతి మైత్రి కుదిరింది. కాబట్టి ఇది శార్దూల పద్య పాదం. ఇట్లా గల్పిక చివరిదాకా మాత్రలు వేసుకుంటూ పోతే, ఒకటి తర్వాత ఒకటి ఛందోబద్ధమైన పద్యాలు వస్తాయి. వాటిలో గణాలు, యతి, ప్రాస అన్నీ సరిపోతాయి. ఈ గల్పికలో వరుసగా శార్దూలము, చంపకమాల, చంపకమాల, శార్దూలము, శార్దూలము, శార్దూలము, మత్తేభము, శార్దూలము, శార్దూలము, శార్దూలము, శార్దూలము, ఉత్పలమాల పద్యాలు వస్తాయి.

--------------------------------------------------------

ఎలనాగ గారి ముఖపుస్తకం నుండి

Thursday, December 17, 2020

చిత్రకావ్యం-బంధకవిత్వం (గ్రంథపరిచయం)

 చిత్రకావ్యం-బంధకవిత్వం (గ్రంథపరిచయం)





సాహితీమిత్రులారా!

ఆశు,మధుర,చిత్ర, విస్తరకవిత్వంలో చిత్రకవిత్వం ఒకటి.

ప్రపంచంలో దాదాపు అన్నిప్రసిద్ధ భాషలలోనూ చిత్రకవిత్వం

ఉంది.అయితే సంస్కృతంలో ఉన్నంత చిత్రకవిత్వం ఇతర

భాషలలో మృగ్యం. అలంకారగ్రంథాలలో దండి కావ్యాదర్శం నుంచీ నేటిదికా

బంధకవిత్వం వివిధ ప్రాంతాలనుంచీ, వివిధ కాలాలలో వివిధ పండితుల 

కలాలనుంచి వెలువడుతూ నే ఉంది.

ప్రస్తుతం"చిత్రకావ్యమ్"అనేరచనలోఉండిన చిత్రబంధాలను

గురించి నామమాత్రంగా తెలుసుకుందాం.

ముందుగా "చిత్రకావ్యం" రచించిన కవివర్యుని గురించి

సంక్షిప్తంగా--

"చిత్రకావ్యం"ను రచించినమహాకవివర్యులు శ్రీమాన్.ఉ.వే.

శ్రీరామభద్రాచారియర్.వీరికి శ్రీరామభద్రకవి అని కూడా 

వ్యవహారం. వీరి జన్మస్థలం 'కోయంబత్తూ రు'కు సమీపానగల

"సుందపాలయం". శ్రీమాన్ రామభద్రాచారియర్ కాలం క్రీ.శ.1840-1904.

సుందరపాలయం ఆకాలంలోపండితులకునిలయం. శ్రీమాన్

ఆచార్యులవారు తమ జన్మస్థలంలోనే విద్యలను అభ్యసించి,

సంప్రదాయ విద్యాభ్యాసంకోసం శ్రీరంగం వెళ్లినారు. అక్కడ

'అహోబిలమఠవారి శ్రీమత్ ఆండవాన్ వారి ఆశ్రమం'లో చేరినారు.

శ్రీమత్పెరియాండవాన్ స్వామివారి సన్నిధానంలో

సంప్రదాయసాహిత్యాన్ని అధ్యయనం చేసినారు.శ్రీస్వాముల

వారిసన్నిధానంలోని "అష్టదిగ్గజవిద్వన్మహాకవిపండితవర్యు" లలో

 వీరుకూడా ఒకరుగా విరాజిల్లినారు.అక్కడ ఎనిమిది సంవ త్సరాలు ఉండి, 

ఆతర్వాత "సుందపాలయం" స్వస్థలానికి తిరిగి వేంచేసినారు.

శ్రీమాన్ శ్రీరామభద్రాచారియర్ స్వామివారు బహుగ్రంథ

ప్రణేత.వీరు రచించిన గ్రంథాలలో "చిత్రకావ్యం"ఒకటి.

"చిత్రకావ్యమ్"గ్రంథం చెన్నపట్టణంలోని మైలాపూర్ నుండి క్రీ.శ.1892వ సంవత్సరంలోప్రచురితం

-:గ్రంథంలోని బంధాల పరిచయం:-

"చిత్రకావ్యమ్" రెండు పరిచ్ఛేదాలుగా విరచితం. ప్రథమ

పరిచ్ఛేదంలో24ప్రకరణాలుఉన్నాయి.ద్వితీయపరిచ్ఛేదంలో

10ప్రకరణాలు ఉన్నవి.

ప్రస్తుతం బంధపరిచయం మాత్రమే చేయాలనుకోవడం

వల్ల ద్వితీయ పరిచ్ఛేదంలోని బంధనామాలను వరుసగా

తెలుసుకుందాం.

ద్వితీయ పరిచ్ఛేదంలోని బంధప్రకరణాలు

పదికూడా వరుసగా సంప్రదాయానుసారంగా ఉండడం 

స్మరణీయం.

ఇక ఆయా ప్రకరణాలలోని బంధానుక్రమణిక---


చిత్రకావ్యమ్

ద్వితీయ పరిచ్ఛేదః

1.పంచాయుధ బంధ ప్రకరణమ్

1.సుదర్శన బంధః

2.శంఖ బంధః

3.గదా బంధః

4.ఖడ్గ బంధః

5.శార్జ్గ బంధః

2.చక్రబంధ ప్రకరణమ్

1.చతురర చక్రబంధః

2.చతురర చక్రబంధః(మరొకటి)

3.విశృంగాటక చక్రబంధః

4.ద్విచతుష్క చక్రబంధః

5.(కవినామవిషయనామాంక)చక్రబంధః

6.గురునామ,కర్తృనామ,విషయనామాంకిత చక్రబంధః

3.తృతీయం మంత్రప్రకరణమ్

1.ద్వాదశాక్షర గోరథబంధః

2.అష్టాక్షర ఢక్కాబంధః

3.షడక్షర ఉలూఖలబంధః

4.పంచాక్షర భృంగారకబంధః

4.చతుర్థభాగః -ఉపకరణబంధ ప్రకరణమ్

1.చిత్రాందోలికాబంధః

2.సాధారణాందోళికాబంధః

3.సవితాన మంచబంధః

4.సాధారణ మంచబంధః

5.డోలాబంధః

6.సాధారణ ఛత్రబంధః

7.ముక్తాసరచ్ఛత్రబంధః

8.చామరబంధః

9.తాలవృంతబంధః

10.ధ్వజబంధః

11.ముక్తాహారబంధః

5.పంచమం సేనాంగ బంధప్రకరణమ్

1.(సాధారణ)రథబంధః

2.మహారథబంధః

3.గజబంధః

4.తురగబంధః

5.పదాతిబంధః

6.(మరొకటి)పదాతిబంధః

6.షష్టం ఆయుధబంధప్రకరణమ్

1.ఖడ్గబంధః

2.కఠారిబంధః

3.గజబంధః

4.కుంతబంధః

5.పరశుబంధః

6.చాపబంధః

7.శరబంధః

8.ఖేటబంధః

9.క్షురికాబంధః

10.అసిబంధః

7.సప్తమం గోమూత్రికాబంధః

1.(సాధారణ)గోమూత్రికాబంధః

2.సమానవృత్తపాదానులోమప్రతిలోమ గోమూత్రికాబంధః

3.సమానవృత్తపాదానులోమ గోమూత్రికాబంధః

4.భిన్నవృత్తార్థానులోమ గోమూత్రికిబంధః

5.భిన్నవృత్తార్థానులోమ గోమూత్రికాబంధః

6.భిన్నవృత్తపాదానులోమ ప్రతిలోమ గోమూత్రికాబంధః

7.భిన్నవృత్తార్థానంలోమ ప్రతిలోమ గోమూత్రికిబంధః

8.అష్టమం నాగబంధ ప్రకరణమ్

1.కుండలిత ఏకనాగబంధః

2.(సాధారణ)నాగబంధః

3.చతుర్నాగబంధః

4.ద్వినాగబంధః

5.అష్టనాగబంధః

6.కృష్ణసర్పబంధః

7.వాసుకీద్వినాగబంధః

9.నవమం పద్మబంధ ప్రకరణమ్

1.కుముదబంధః

2.పంచదళ పుండరీకబంధః

3.అష్టదళ పద్మబంధః

4.అష్టదళ నీలోత్పలబంధః

5.(కవినామాంకిత)అష్టదళపద్మబంధః

6.మహాష్టదళపద్మబంధః

7.(మరొకరకం)కవినామాంకిత అష్టదళపద్మబంధః

8.కవినామాంకిత అష్టదళపద్మబంధః(రేఖాభేదః)

9.విషయనామాంకిత అష్టదళపద్మబంధః

10.ద్వాదశదళపద్మబంధః

11.షోడశదళపద్మబంధః

12.ద్వాదశదళ నళినీబంధః

13.విలక్షణ చతుర్దళ పద్మబంధః

14.పంచదళ ఉత్పలబంధః

15.షోడశదళకమలబంధః

16.ద్వాత్రింశద్దళ కమలబంధః

17.స్థలకమలబంధః(మెట్టతామర) 

10.దశమం సంకీర్ణబంధప్రకరణమ్

1.ఊర్ధ్వపుండ్రబంధః

2.ఘంటాబంధః

3.కరకబంధమ్

4.పుష్పహారబంధం

5.పురుషబంధః

6.నారీబంధః

7.హంసబంధః

8.మయూరబంధః

9.మురజబంధః

10.అంగదబంధః

11.గుచ్ఛబంధః

12.కంఠాభరణబంధః

13.మత్స్యబబంధః

14.వృశ్చికబంధః

15.గోపురబంధః

16.బృందావనబంధః

17.అర్ధభ్రమకబంధః

18.సర్వతోభద్రబంధః

19.చతురంగే తురంగబంధః

20.హలబంధః

21.వీణాబంధః

22.నిశ్శ్రేణికాబంధః

23.తులాబంధః

24.నవవర్షక జంబూద్వీపబంధః

25.దీపస్తంభబంధః

26.వృక్షబంధః

27.ఘటికాబంధః


చిత్రకావ్యంలోని మొత్తంబంధాలు-

1.నారాయణస్య పంచాయుధబంధాః 05

2.చక్రబంధాః 06

3.మంత్రబంధాః 04

4.భోగోపకరణబంధాః 11

5.సేనాంగబంధాః 06

6.ఆయుధబంధాః 10

7.గోమూత్రికాబంధాః 07

8.నాగబంధాః 07

9.పద్మబంధాః 17

10.సంకీర్ణబంధాః 26

మొత్తం ... ... 100


వందబంధాలు అందమైన సముచిత చిత్రాలతో,

సందర్భోచితమైన వ్యాఖ్యానంతో,

శ్రీమాన్ శ్రీరామభద్రాచారియర్ స్వామివారు రచించిన

చిత్రకావ్యమ్

చదివితే

బంధకవిత్వాభిమానులలో అద్భుతరసాన్ని ఆవిష్కరిస్తుంది.

- శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యుల సహకారంతో

Tuesday, December 15, 2020

యద్దనపూడి సులోచనారాణి గారి ఇంటర్వూ

 యద్దనపూడి సులోచనారాణి గారి ఇంటర్వూ




సాహితీమిత్రులారా!


వనిత టీ.వి.లో ప్రసారమైన

యద్దనపూడి సులోచనారాణి గారి ఇంటర్వూ

ఆస్వాదించండి-



Sunday, December 13, 2020

కపిలవాయి వారి శబ్దచిత్రం - 3

 కపిలవాయి వారి శబ్దచిత్రం - 3





సాహితీమిత్రులారా!






కపిలవాయి లింగమూర్తిగారి

ఆర్యా శతకం నుండి

ఈ పద్యం గమనించండి -


ఆశా దీర్ఘము హ్రస్వము

భాసిల్లును దృష్టియెట్లు బరగెడునుసుమీ

దోషములు లేక నుండగ 

వేషంబుల లోకమిద్ది వినుమా యార్యా!


సంస్కృతంలో ఆశ(కోరిక) దీర్ఘాంతము

దీర్ఘం - గొప్పది, పొడవైనది

దృష్టి - చూపు ఇది హ్రస్వం పదం

హ్రస్వం - పొట్టిది, చిన్నది.


సంస్కృతంలో ఆశాశబ్దం దీర్ఘాంతం, దృష్టిశబ్దం హ్రస్వాంతం.

ఈ శబ్దాలకు తగినట్లు బ్రహ్మదేవుడు మనిషికి ఆశను దీర్ఘంగాను

దృష్టిని చాల చిన్నగాను చేశాడు. ఇదొక విచిత్రమైత పరిస్థితి కాబట్టి

ఈ స్థితిలో లోకంలో ఆశాపరుడు దోషరహితుడుగా ఉండటం కష్టం.

 అందుచేత మనిషి ఆశకుపోక ఒకకొడికి నిలిచి త్యాగబుద్ధి కలిగి ఉండాలి

- అని భావం

Friday, December 11, 2020

పాము, వెన్నెల, బూది, నాపగను దాల్చు వేల్పు

 పాము, వెన్నెల, బూది, నాపగను దాల్చు వేల్పు





సాహితీమిత్రులారా!

గూఢచిత్ర పద్యం గమనించండి-

పాము, వెన్నెల, బూది, నాపగను దాల్చు

వేల్పుటిల్లాలు సైదోమగ విడిదిఁగన్న

మీన్నపావడ గలకన్నె మిన్నఁగన్న

కన్న దొరసామి సిరిమిమ్ముఁ గాచుగాత!


పాము, వెన్నెల, బూది, ఆపగ(నది) లను

ధరించు దేవుడు ఈశ్వరుడు, ఆయన భార్య పార్వతి,

ఆమె తమ్ముడు మైనాకుడు, అతడు విడిదిగా తీసుకున్నది

సముద్రం, ఆసముద్రం పావడాగా ఉన్న కన్నె భూదేవి,

భూదేవి కన్న కుమార్తె సీతాదేవి, ఆమె భర్త శ్రీరామచంద్రుడు.

ఆయన మీకు ఐశ్వర్యములను ఇచ్చి రక్షించుగాక!

Wednesday, December 9, 2020

కాకానన భూభూ మమకాకార రమా మా

 కాకానన భూభూ మమకాకార రమా మా




సాహితీమిత్రులారా!

సజాతీయమైన ఒక వర్ణమునకు ఆ వృత్తి

కలిగిన యమకములో ఒక రకమని దానికి

సజాతీయవర్ణనిరంతరయమకమని అంటారు

లక్ష్మీసహస్రములోని ఈ ఉదాహరణ గమనించండి-


మదనార్తావృత్తము-

కాకానన భూభూ మమకాకార రమా మా

కా కావవ రా రామమఘాఘాతతపాపా

కాకానననానాకక కా కాక కమా మా

కా కాగగ వే వేరఱ గాఁ గానన జేజే


అర్థం -

కాకాసురుని బ్రతికించినదానా

భూమినుండి పుట్టినదానా(సీతా రూపమున)

నా దుఃఖములను పూర్తిగా ఖండించుదానా

లక్ష్మీ తల్లీ

విష్ణుపత్నీ రక్షింపవా

రాముని గూర్చిచేయుయజ్ఞములందు పాపములను

విరివిగా(యజ్ఞవిధ్వంసకులను) రక్షింపనిదానా

చెడ్డవైన అడవులందు అనేకములైన దుఃఖములు కలదానా

సీతారూపమున దుర్గమారణ్యముల కష్టములను అనుభవించినదానా

మా ప్రయత్నములకు ఆటంకములు రానీయకుము


మా యొక్క తాపము అడ్డగింపడునట్లుగా

శీఘ్రముగా భేదభావము నశించునట్లుగా

రమ్ము నమస్కారము


ఇందులో ప్రతి అక్షరము పునరుక్తమైనది కావున దీన్ని

సజాతీయవర్ణనిరంతరయమకమని అంటారు


Monday, December 7, 2020

తలదీయ క్షుద్రదేవత జనించు

 తలదీయ క్షుద్రదేవత జనించు




సాహితీమిత్రులారా!



చ్యుతచిత్రం చూడండి-


పక్షివర్యుండు పరగుఁబంచాక్షరముల

వాని తలదీల క్షుద్రదేవతజనించు

దాని తలదీయఁ దక్యెడ జానుమీఱు

దాని తలదీసి చూడఁగా దనరు నృపతి


ఈ పద్యంలో ఐదు అక్షరాలుగల పక్షిపేరు కనుక్కోవాలి

ఆ పక్షి పేరులోని మొదటి అక్షరం తీసివేయగా క్షుద్రదేవత అవుతుంది.

దాని మొదటి అక్షరం తీసివేయగా తక్కెడ వస్తుంది

దాని మొదటి అక్షరం తీసివేయగా నృపతి వస్తుంది

మరి ఆ పక్షిపేరేమో చెప్పండి -


సమాధానం - కపోతరాజు


                  కపోతరాజు(పావురం)

                   క  పోతరాజు

                    పోతరాజు(క్షుద్రదేవత)

                     పో  తరాజు

                       త రాజు(తక్కెడ)

                        రాజు

                          రాజు(నృపతి)





Saturday, December 5, 2020

కపిలవాయి వారి శబ్దచిత్రం -2

 కపిలవాయి వారి శబ్దచిత్రం -2




సాహితీమిత్రులారా!


కపిలవాయి లింగమూర్తిగారి

ఆర్యా శతకంలోని శబ్దచిత్రం చూడండి-


జవరాలి యందునుంగల

వివరాలు వరాలురాలు విరసంబైనన్

తవులుసుమి రాలు చెలువుడు

మివుల రసికుడైన గాక వినుమా యార్యా!


దీనిలో జవరాలు అనే పదంనుండి జ తీసివేస్తే వరాలు,

వరాలు పదంనుండి వ తీసివేస్తే రాలు అవుతాయి.

అంటే జవరాలు లో వరాలు, రాలు రెండూ ఉన్నాయి.

ఆమె చెలువుడు అనుకూలుడైతే అతనికి వరాలు లభిస్తాయి.

అలా కాకుండా దుష్టుడాయెనా రాలు మాత్రం తగులక తప్పవు.


జవరాలు, వరాలు, రాలు -  మొదటి అక్షరం తీసివేస్తే 

ఒకదానినుండి మరొకటి వస్తున్నాయికదా అందువల్ల 

ఇది శబ్దచిత్రంలో ఒకభాగం అయిన చ్యుత చిత్రమౌతుంది.

Thursday, December 3, 2020

కపిలవాయి వారి శబ్దచిత్రం

 కపిలవాయి వారి శబ్దచిత్రం





సాహితీమిత్రులారా!


కపిలవాయి లింగమూర్తిగారి

ఆర్యా శతకంలోని శబ్దచిత్రం చూడండి-


నిజముగ వాకొనగా న

క్కజముగ గలవాడె కలవాడు కాని యన్యుడున్

అజుడును నభవుండును కా

యజుడైనను లేని వాడే యనుమా యార్యా!

కలవాడు - ఉన్నవాడు, స్థతిమంతుడు.

వాకొనగా - చెప్పగా, వకారం తీసికొనగా.


కలవాడు అనే పదంలో -కారాన్ని తీసివేస్తే కలడు.

కలడు అనే సామాన్యార్థం మిగులుతుంది.

కాని వ్యతిరేకార్థంగాని మరొకటిగాని మిగలదు.

ఇది ఇందులోని చమత్కారం


ఇక లక్ష్మిలేనివారిలో అజుడు అభవుడు,

కాయజుడు అనే వారిని పరిశీలించిన

అజుడన్నా, అభవుడన్నా  పుట్టనివాడు

అనే అర్థం. పుట్టినాడు ప్రపంచంలో

ఎలాగూ ఉండనే ఉండరు.


శ్రీ శబ్దానికి లక్ష్మి అనేకాక సరస్వతి,

పార్వతి అనే అర్థాలు కూడా ఉన్నాయి.

కాబట్టి వారులేనపుడు అవాక్కై - బ్రహ్మ,

అర్థశరీరుడై శివుడు

ఉన్నా లేనివారే అవుతారు.


ఇక మన్మథుడో ఎపుడో సశరీరంగా ఉన్నా

శివుని కంటి మంటకు భస్మమై యిపుడెలాగూ

అనంగుడైనాడు.

కాబట్టి లక్ష్మీకటాక్షం లేనపుడు

ఇక్కడ ఉదాహరణగా చెప్పబడిన

బ్రహ్మవంటి సృష్టకర్త, శివునివంటి సర్వజ్ఞుడు,

మన్మథునివంటి రూపవంతుడు

కూడ లేనివారికిందికే లెక్క - అని పద్య తాత్పర్యం

Tuesday, December 1, 2020

పద్యమంతా గురువులే

పద్యమంతా గురువులే




సాహితీమిత్రులారా!

కవిత్వం వ్రాయడమే కష్టం అందులోనూ

సర్వ లఘువులుగాని

సర్వగురువులుగాని

వ్రాయడం కొంత కష్టంతో కూడినది.

ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలోని

సర్వగురు వచనాన్ని చూడండి-

ఇందులో అన్నీ గురువులే లఘువులులేవు అని

గ్రహించగలరు. చూడండి-


ఆవేశం దాశ్చర్యారూఢాత్మాం 

భోజాతోద్యత్కందర్పాటోపస్ఫాయన్నా

రాచస్తోమ శ్రేష్ఠోద్బోధాదీనాం 

చ ద్చోధానైపుణ్య ప్రౌఢి 

శ్రీ నారీరత్నం బిట్లూహించెన్   (447)

చూచారుకదా ఇందులో ఏవైనా

లఘువులున్నాయేమో గమనించండి. 

Sunday, November 29, 2020

ప్రేయసీ - ప్రియుల సంవాద పద్యం

 ప్రేయసీ - ప్రియుల సంవాద పద్యం




సాహితీమిత్రులారా!



ప్రేయసి  ప్రియుల మాటలు ఎంత సరసంగా ఉంటాయో 

చెప్పడానికి ఈ శ్లోకం చూస్తే తెలుస్తుంది. 

ఇది చాటుధరాచమత్కారసారమనే దానిలోనిది.

శ్లో. కఠిన కుచౌ తవ బాలే, చటుల చకోరాక్షి తావకే నయనే
     కుటిల సుకే శ్యలకా స్తే మిథ్యావాదిన్లతాంగి తవ మథ్యమ్


ప్రేయసి - కఠిన! (ఓ కఠినుడా!)
ప్రియుడు - కుచౌ తవ బాలే 
(ఓ బాలికాతిలకమా నీకుచములు కఠినముగాని నేనుగాదు)
ప్రేయసి - చపల! (ఓ చపలస్వభావం కలవాడా!)
ప్రి - చకోరాక్షి తావకే నయనే
(ఓ చకోరమువంటి కన్నులు గలదానా! నీకను్నలే చపలములు నేనుగాదు.)
ప్రే.- కుటిల! (వంకర నడతగలవాడా!)
ప్రి.- సుకే శ్యలకా స్తే 
(మంచి వెంట్రుకలుగలదానా! నీముంగురులే కుటిలములు నేనుగాదు)
ప్రే.- మిథ్యావాదిన్! (కల్లరీ!, మిథ్యను పలికేవాడా!)
ప్రి. - లతాంగి తవ మధ్యమ్ 
(తీగెవలె సన్ననిశరీరంగలదానా! నీ నడుమే మిథ్య(కల్ల) నేను కాదు)

ఇది ఒకనాటి సంవాదం


Friday, November 27, 2020

రెండు ప్రశ్నలకు సమాధానము ఒకటే

 రెండు ప్రశ్నలకు సమాధానము ఒకటే





సాహితీమిత్రులారా!


పొడుపుపద్యంలో పాదానికి రెండు ప్రశ్నలున్నాయి

రెండిటికి ఒకేసమాధానం కనిగొనాలి గమనించండి-


రాజులకెటువంటి రత్నముల్ ప్రియమయ్యె

రాయలే చెట్లవి కరులుమ్రింగు

నీశ్వరుఁడెవ్వాని నెచ్చోట ధరియించు

జారుఁడే ప్రొద్దునెవ్వారిఁగోరు

నెన్నెన్ని దినములకుకేతెంచు పున్నమ

జనయిత్రి పుత్రియేజాడఁదోఁచు

బంధువులేయెడ బలసియేతెంతురు

యీతగాఁడెందున భీతిఁజెందు

నన్నిటికి, జూడనైదేసి యక్షరములు

తిఱిగిచదివిన నాపేరె మఱలవచ్చు

రెండుప్రశ్నలకొక్కటేరీతినుండు

సమ్మతిగఁజెప్ప భావజ్ఞచక్రవర్తి


దీనిలో ప్రతి పాదంలో రెండు ప్రశ్నలున్నాయి

వాటికి ఒకటే సమాధానం 5 అక్షరాలలో ఉండాలి

మరియు 

ఎటు చదివినా ఒకలాగే ఉండాలి

ఇవి షరతులు-

మరి సమాధానాలు

రాజులకెటువంటి రత్నముల్ ప్రియమయ్యె

రాయలే చెట్లవి కరులుమ్రింగు

సమాధానం- వెలగలవె  

నీశ్వరుఁడెవ్వాని నెచ్చోట ధరియించు

జారుఁడే ప్రొద్దునెవ్వారిఁగోరు

సమాధానం- నెలతలనె 

నెన్నెన్ని దినములకుకేతెంచు పున్నమ

జనయిత్రి పుత్రియేజాడఁదోఁచు

సమాధానం- నెలనెలనె  

బంధువులేయెడ బలసియేతెంతురు

యీతగాఁడెందున భీతిఁజెందు

సమాధానం-నెగడగనె


Tuesday, November 24, 2020

యజుర్వేదంలోని ప్రశ్నోత్తర చిత్రం

 యజుర్వేదంలోని ప్రశ్నోత్తర చిత్రం



సాహితీమిత్రులారా!



చిత్రకవిత్వంలో ప్రశ్నోత్తరచిత్రం ఒకటి

ఇక్కడ యజుర్వేద మంత్రాలలోని 

ప్రశ్నోత్తరచిత్రాన్ని చూద్దాం.

ప్రశ్నలు ఒక శ్లోకంలో  సమాధానాలు మరో శ్లోకంలో

ఇవ్వబడ్డాయి గమనించండి-

క స్వి దేకాకీ చరతి క ఉ స్వి జ్జాయతే పున:
కిగ్ం స్విద్ధిమస్య భేషజం కిం వావపనం మహత్ 

                                                             (యజు. 23-9)
ఇందులో ప్రశ్నలు మాత్రమే ఉన్నవి.  ప్రశ్నలు-
1. క స్వి దేకాకీ చరతి?
    ఒంటరిగా తిరిగునదేది? (ఏ గ్రహం చుట్టూ తిరుగనటువంటిది)
2.   క ఉ స్వి జ్జాయతే పున:?
      నలువైపులా తిరుగునదేది?
3. కిగ్ం స్విద్ధిమస్య భేషజం? (చలికి మందేది)
4. కిం వావపనం మహత్ ?
    విత్తనము మొలకెత్తుటకు అన్నిటి కంటె పెద్ద క్షేత్రమేది?


ఈ ప్రశ్నలకు ఈ మంత్రంలో  సమాధానాలు ఉన్నవి.

సూర్య ఏకాకీ చరతి చంద్రమా జాయతే పున:
అగ్నిర్ హిమస్య భేషజం భూమిరావపనం మహత్

                                                              (యజు. 23-10)
జవాబులు -
1. సూర్య ఏకాకీ చరతి  (సూర్యుడు దేనిచుట్టూ తిరుగడు)
2. చంద్రమా జాయతే పున: (చంద్రుడు నలువైపులా తిరుగుతుంటాడు)
3. అగ్నిర్ హిమస్య భేషజం (చలికి మందు వేడి(అగ్ని))
4. భూమిరావపనం మహత్
    విత్తనములు మొలకెత్తుటకు అన్నిటి కంటె పెద్దక్షేత్రం భూమి

వేదంలో విజ్ఞాన బీజాలు గ్రంథం నుండి

Sunday, November 22, 2020

విభక్తి గూఢము

 విభక్తి గూఢము




సాహితీమిత్రులారా!



ఒక పద్యం లేక శ్లోకంలో  విభక్తిని మరుగు

పరచిన దాన్ని విభక్తిగూఢము అంటారు.

దీని ఉదాహరణగా ఈ శ్లోకం చూడండి-


పాయా న్మా మురసావితః శ్రియమునా రాధ్యాం ప్రపద్యేత మాం

కోవా న స్థిర మశ్నుతే శమధనో2 ప్యాలోకితో జాతుచిత్

వేదాంతై ర్వినుతాంఘ్రయే న కి ముతశ్శ్రేయోనతిం తన్వ తాం

సేవా మో రచయామి మానస సదా భక్త్యా పహా వాదరమ్


దీనిలో సప్త విభక్తులు- ప్రథమావిభక్తి నుండి సప్తమీవిభక్తి వరకు

ఉన్న 7 విభక్తులు గూఢం చేయబడినవి. అవి తెలియాలంటే

ముందుగా శ్లోకాన్ని పదవిభాగాలుగా చేసుకోవాలి-

పదవిభాగం-

పాయాత్, మాం, ఉరి, అసే, ఇతః, శ్రియం, ఉనా,

ఆరాధ్యాం, ప్రపద్యేతమాం, కరి, వా, న, స్థిరం, అశ్నుతే,

శం, అధనః, అపి, ఆలోకితః, జాతుచిత్, వే, దాంతైః,

వినుతాంఘ్రయే, న, కిమ్, ఉతః, శ్రేయః, నతిం,

తన్వతాం, సేవాం, ఓః, రచయామి, మానస, సదా,

భక్త్యా, ఆవహ, ఔ, ఆదరమ్.


దీనిలో లక్ష్మీ వాచకమైన ఉ - శబ్దం యొక్క ఏడు విభక్తులు

సంధిమూలంగా దాగిఉన్నాయి.

ఓ మనసా, లక్ష్మి యందు ఎల్లపుడు ఆదరాన్ని కలిగి ఉండమని

కోరే శ్లోకం ఇది.

ఉరసాపాయాత్, వేదాంతైః, సేవామో, భక్త్యావహౌ

మొదలైన చోట్ల అపార్థ భ్రమ కలిగించే విధంగా

శ్లోకం కూర్చబడింది.

ఉ - శబ్దానికి క్రమంగా 7 విభక్తులలో రూపాలు-

ఉః, ఉం, ఉనా, వే, ఓః, ఓః, ఔ - అని ఉంటాయి.

శ్లోకంలో ఉరసా అనే చోట ఉః - అనే ప్రధమ(కర్త) గుప్తము.

శమధనః - లో శం అనే ద్వితీయ(కర్మ) గుప్తమైంది.

యమునా రాధ్యాం - లో ఉనా - తృతీయవిభక్తి(కరణం) గుప్తం.

శ్రియముతః - లో ఉతః - అనే చోట పంచమీ(అపాదానం) గుప్తం

పంచమ్యర్థంలో తసిల్ ప్రత్యయం - సేవామోరచయామి - అనే చోట

ఓః - అని షష్ఠి గుప్తము, భక్త్యావహౌ - అనే చోట ఔ - అనే సప్తమీ గూఢంగా ఉంది.


ఈ లక్ష్మి నన్ను కాపాడుగాక,

శివునిచే పూజింప దగిన లక్ష్మిని

నేను ఆశ్రయిస్తున్నాను.

ఆమె కటాక్షానికి పాత్రుడైన

ఏ దరిద్రుడు సంపదను పొందడు

దాంతులైన మునులచే నమస్కరించబడు

లక్ష్మి వలన వారికి శ్రేయస్సుకలుగుటలేదా

ఓ మనసా........ లక్ష్మి యందు ఆదరము

కలిగి ఉండుము. ఆమెకు సేవ చేస్తాను-

శ్లోక భావం.

Friday, November 20, 2020

ముక్కుతో పలుకని పద్యం

 ముక్కుతో పలుకని పద్యం





సాహితీమిత్రులారా!



ముక్కుతో పలికే అక్షరాలను

అనునాసికాలు అంటారు

ఙ,ఞ,ణ,న,మ - అనేవి అనునాసికాలు

ఇవిలేకుండా పద్యం వ్రాస్తే ముక్కుతో పనిలేదు

వాటిని నిరనునాసికాలు అంటాం.

ఇక్కడ నిరనునాసిక చంపువు అనే కావ్యం నుండి

ఒక ఉదాహరణ చూద్దాం-

లక్ష్మణుడు శూర్పనఖకు ముక్కుచెవులు కోసిన తర్వాత

అన్న అయిన రావణుని దగ్గరకు వెళ్ళి 

ఈ విధంగా చెప్పిందట


హా! హా! రాక్షస దుష్పరిభవగ్రస్తస్య ధిక్ తే భుజా

విద్యుజ్జిహ్వువిపత్తిరేవ సుకరా క్షుద్రపప్రతాప త్వయా

ధ్వస్తాపత్రప పశ్య పశ్య సకలైశ్చక్షుర్భిరేతాదృశీ

జాతా కశ్యచిదేవ తాపసశిశోఃశస్త్రాత్తవైవ స్వసా

                                                                          (నిరనునాసిక చంపువు - 2)

ఓ రాక్షసరాజా! నీకు నీ 20 చేతులకు అవమానం, 

దయనీయమైంది నీ శౌర్యం, నీ 20 కళ్లతో బాగా చూడు

ఆ మునికుమారుని కత్తి నీ సోదరికి ఎంత బాధాకరమైన 

అవమానం కలిగించిందో (ముక్కు చెవులు కోసివేయబడినాయి)


ఈ పద్యంలో ఒక అక్షరమైనా ముక్కుతో పలుకుతుందేమో చూడండి.


Wednesday, November 18, 2020

నాలుక కదలని పద్యం

 నాలుక కదలని పద్యం





సాహితీమిత్రులారా!

ఒక పద్యంకాని శ్లోకంకాని నాలుక కదలకుండా పలికే అక్షరాలతో

కూర్చితే దాన్ని "అచలజిహ్వ" అంటారు.

"ఆయలూరు కందాళయార్య" విరచిత "అలంకారశిరోభూషణే "

శబ్దాలంకారప్రకరణంలోనిది ఈ శ్లోకం.

చూడండి నాలుక కదులుతుందేమో!


భవభామా భావగాహ బహుభామా మవాభవ

మమ భోభవభూమావ భవభూపా వభూమహ 


(పార్వతీదేవి యొక్క హృదయమందు చేరినవాడా(శ్రీరామనామ రూపంతో

ఆమె హృదయమందున్నవాడు) అధిక తేజస్సంపన్నుడా! సంసారగంధ గ్రహితుడా

శ్రీ భూవల్లభా! సంసార మండలంలో కలిగిన పాపాధిత్యాను నశింపచేయువాడా!

నన్ను రక్షించు)

Monday, November 16, 2020

గూఢచతుర్థి(పాదగోపనము)

 గూఢచతుర్థి(పాదగోపనము)





సాహితీమిత్రులారా!



పాదగోపనము అంటే ఒక పద్యంలోని పాదాన్ని మిగిలిన

పాదాలలో గోపనం చేయడం. అది మొదటిపాదమైతే

ప్రథమపాదగోపనము అని, రెండవపాదమైతే 

ద్వితీయపాదగోపనమని, మూడవపాదమైతే 

తృతీయపాదగోపనమని, నాలుగవపాదమైతే

గూఢచతుర్థి అని అంటారు.

ఇక్కడ మనం గూఢచతుర్థిని 

కొడవలూరు రామచంద్రరాజుగారి

మహాసేనోదయం అనే గ్రంథంనుండి 

తీసుకొని వివరించుకుంటున్నాము.-

వనజసమాననేత్రక కృపాజలధీశ సరస్తవ క్షమా
హననదురాసదార్ధిప్రణతా సమరోన్నత సాదరాశయా
మునిమహనీయలాలసవిభూత్యభిసేవన ధూర్తభంజనా
జనకజశస్తమానసప్రసన్న దయామయ సత్యవర్తనా

మొదటి మూడు పాదాలలో గోపన
పరచిన అక్షరాలను కలుపగా నాలుగవపాదము వస్తుంది. అంటే నాలుగవ పాదము గోపనము లేక గూఢపరచినది.

వనజసమాననేత్రక కృపాజలధీశ సరస్తవ క్షమా
హననదురాసదార్ధిప్రణతా సమరోన్నత సాదరాశయా
మునిమహనీయలాలసవిభూత్యభిసేవన ధూర్తభంజనా

ఈ మూడు పాదాలలో చివరిదైన
నాలుగవ పాదం గూఢంగా ఉంది
ది ఎలా తెలుసుకోవాలంటే
మొదటి పాదంనుండి ప్రతి మూడవ
అక్షరం తీసుకుంటే 4వపాదం వస్తుంది

వనసమానేత్ర కృపాలధీ సరస్తవ క్షమా
హనదురాదార్ధిప్రణతా మరోన్నత సారాశయా
మునిహనీలాలవిభూత్యభిసేన ధూర్తభంజనా

ఆ అక్షరాలన్నీ కలుపగా

జనకజశస్తమానసప్రసన్న దయామయ సత్యవర్తనా -
అని ఏర్పడుతుంది.
పూర్తి పద్యం క్రింద చూడండి-

వనసమానేత్ర కృపాలధీ సరస్తవ క్షమా
హనదురాదార్ధిప్రణతా మరోన్నత సారాశయా
మునిహనీలాలవిభూత్యభిసేన ధూర్తభంజనా
జనకజశస్తమానసప్రసన్న దయామయ సత్యవర్తనా

Saturday, November 14, 2020

కానక గన్న సంతానంబు

 కానక గన్న సంతానంబు




సాహితీమిత్రులారా!



అయ్యలరాజు రామభద్రుని
రామాభ్యుదయములోని ఈ పద్యం చూడండి-
ఇది రాముడు అరణ్యమునకు పోవు సందర్భములో
దశరథడు బాధతో పలికిన పలుకులు ఎంత చమత్కారంగా
చెప్పబడినవో గమనింపుడు.

కానక గన్న సంతానంబు గావున
        గానక గన్న సంతానమాయె
నరయ గోత్ర నిధానమై తోచుగావున
        నరయ గోత్ర నిధానమయ్యె నేడు
ద్విజకులాదరణ వర్ధిష్ణుడు గావున
        ద్విజ కులాదరణ వర్ధిష్ణుఁడయ్యె
వివిధాగమాంత సంవేద్యుండు గావిన 
        వివిధాగమాంత సంవేద్యుఁడయ్యెఁ
గటగటా దాశరథి సముత్కట కరీంద్ర
కట కలిత దాన ధారార్ధ్ర కటక మార్గ
గామి, యెటు సంచరించు, నుత్కట కరీంద్ర
కటకలిత దాన ధారార్ధ్ర కటకతటుల

                            (రామాభ్యుదయము -5-12)

ఈ పద్యంలో ముందు భాగం తరువాతి భాగం
ఒకలానే కనిపిస్తూ అర్థభేదంకలిగి ఉన్నాయి.
1. కానక గన్న సంతానంబు - కలుగక కలిగిన సంతానము,
                                           అడవికొరకే కన్నసంతానము.
2. గోత్రనిధానము - వంశమునకు మూలమైనది,
                             కొండలు నివాసముగా గలది
3. ద్విజకులాదరణ వర్ధిష్ణుడు - బ్రాహ్మణ కుమును పోషించువాడు,
                                              పక్షిసముదాయమును పోషించువాడు.
4. వివిధాగ మాంత సంవేద్యుఁడు - బహువిధ వేదాంతములవలన తెలిసుకొనదగినవాడు,
                                                 బహువిధ వృక్షములనడుమ తెలిసుకొన దగినవాడు

5. సముత్కట కరీంద్ర .... కటక మార్గ
                     ఏనుగుల మదజలముచే తడిసిన పురములకేగువాడు,
                     ఏనుగుల మదజలముచే తడిసిన కొండవాలులుగల త్రోవలందు సంచరించువాడు
ఈ విధంగా రెండర్థములను ఆలోచిస్తూ దు:ఖిస్తున్నాడు దశరథుడు.