Thursday, April 25, 2019

ఇతిహాసాలు, ఆదర్శాలు: ఆరు జానపద వీరగాథలు


ఇతిహాసాలు, ఆదర్శాలు: ఆరు జానపద వీరగాథలు




సాహితీమిత్రులారా!

ఉపోద్ఘాతం
భారతదేశంలో మౌఖిక ఇతిహాసాలు (Oral epics) ప్రాచుర్యంలో ఉండేవని చాలాకాలంగానే సాంప్రదాయ సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారికి తెలిసినా, వారు ఈ వాఙ్మయం మీద శ్రద్ధాసక్తులతో దృష్టి నిలిపింది గత కొన్ని సంవత్సరాలలోనే. పల్నాటి చరిత్ర పైన రోగెయ్‌ర్ (Roghair, 1982), కొంగునాటి చరిత్ర గురించి బెక్ (Beck, 1982) క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రచురించిన విపులమైన వ్యాసాలు ప్రత్యేకించి ఈ మార్పుకు కారణం. ఈ అధ్యయన పరంపరకు కొనసాగింపుగా భావిస్తూ నేను రాస్తున్న ఈ వ్యాసానికి మూలాధారాలు కేవలం తెలుగునుంచే తీసుకున్నాను. కానీ, ఈ వ్యాసంలో నేను ప్రస్తావించిన పరిశీలన పద్ధతులు, ఇతర భాషా ప్రాంతాల మౌఖిక సారస్వతాన్ని కూడా ఆకళింపు చేసుకునేందుకు దోహదపడతాయి.


ఈ వ్యాసపు ఆంగ్లమూలం – ఎనదర్ హార్మొనీ:
న్యూ ఎస్సేస్ ఆన్ ఫోక్‌లోర్ ఆఫ్ ఇండియా.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రచురణ
సంపా. ఎ. కె. రామానుజన్, స్టూవర్ట్ బ్లాక్‌బర్న్
(వ్యాస సంకలనం, బర్కిలీ 1986)
తెలుగునాట ఎంతో ప్రాచుర్యం ఉన్నప్పటికీ, ఈ రకమైన సాహిత్యానికి తెలుగులో ప్రత్యేకంగా ఒక పేరు లేదు. ఇతర భారతీయ భాషల్లో కూడా లేదు. సంస్కృత పదమైన ఇతిహాసం (Epic) ఈ సాహిత్యాన్ని నిర్వచించడానికి ఇంచుమించుగా సరిపోయే పదం. చెప్పబడే చరిత్రం ఏదైనా దానిని కథ అని అనడమే తెలుగులో ఆనవాయితీ. ఆ కథనానికి ఐతిహాసిక స్థాయి (Epic Status) ఉన్నదా లేదా అన్నది ఈ కథ అన్న పదం గుర్తించనీయదు. కానీ ఒక భేదాన్ని తెలుగు శ్రోతలు విస్పష్టంగా చూపిస్తారు. ఆ భేదం కథలో ‘నిజం’ ఎంత? అనే శ్రోత నమ్మకంపైన ఆధారపడి ఉంటుంది. కొన్ని కథలు నిజంగా జరిగినవి అని, కొన్ని కథలు కట్టు కథలు అనీ శ్రోతలు నమ్ముతారు. వస్తుసేకరణ కోసం నేను తిరిగిన ప్రాంతాలన్నిటిలోనూ ఇది నాకు అనుభవంలోకి వచ్చిన విషయం. సాధారణంగా కథ అయిపోగానే అనే “కథ కంచికి, మనం ఇంటికి” అనే ముక్తాయింపు ఈ తేడా చూపించడానికి వాడతారు. ఇందులో పుణ్యక్షేత్రమైన కంచి ప్రస్తావన ఎలా వచ్చిందో నాకు ఆధారాలేమీ దొరకలేదు. ఆ వాక్యం బహుశా, కట్టు కథలలా ఎక్కడికో వెళ్ళిపోకుండా, నిజమైన కథలు శ్రోతలతోనే నిలిచిపోతాయనే భావాన్ని తెలిపేందుకు వాడతారేమో.

మౌఖిక సాహిత్యం మాటల్లో కథలుగా చెప్పుకునేది, పాటలలాగా (బుర్రకథలు ఇత్యాదివి) పాడుకునేదిగా రెండు పద్ధతుల్లో ఉంది. ఈ వ్యాసంలో నేను వాటిని జానపద కథలు (Folk tales) అని, ఇతిహాస లక్షణాలు ఉండి పాడుకోబడే కథనాలని వీరగాథలు (Folk epics) అని విడమర్చి ప్రస్తావిస్తాను.

జానపద కథలు కల్పితాలే అని సమాజంలో అన్ని వర్గాలవారు భావిస్తారు. అందుకు ప్రతిగా వీరగాథలన్నీ చారిత్రక వాస్తవాలే అని ఏకాభిప్రాయంగా ఎక్కడా కనపడదు. సమాజంలో ఏదైనా కథనాన్ని ‘తమది’గా అనుకున్న ఒక వర్గం మాత్రమే ఆ కథకు చారిత్రక విలువని ఆపాదించుకుంటుంది. కానీ అది ఇతర వర్గాలలో కేవలం కథగానే చూడబడుతుంది. ఉదాహరణకి బాలనాగమ్మ కథ. బుర్రకథ రూపంలో ఎంతో ప్రసిద్ధమైన ఈ కథను శ్రీకాకుళం జిల్లా వీరభద్రాపురంలో నా కోసంగా కొందరు ఆడవారు పాడి వినిపించారు. వారందరూ బాలనాగమ్మ కథ నిజంగా జరిగిందనే నమ్ముతారు. కానీ, ఆ శ్రోతల్లోనే ఉన్న మగవాళ్ళకు ఇది కేవలం కట్టు కథ మాత్రమే. ఒక కథపై వారికున్న విశ్వసనీయత ఆ కథతో వారు ఎంత మమేకం చెంది వుంటారు అనే అంశంపై ఆధారపడి ఉంటుందని నేననుకుంటున్నాను. ఒకే కథనం, అందులో తమకు నచ్చిన నడతను చూసుకొన్నవారికి నిజంగానూ, లేనివారికి కట్టు కథగానూ కనిపించడం కద్దు.

చారిత్రక వాస్తవాల నకళ్ళు ఉన్నంత మాత్రాననే కాకుండా ఏదైనా కథ ‘తమ’దైన ప్రాపంచిక దృక్పథాన్ని కూడా కలిగి వున్నప్పుడే, ఒక కులం, లేదా సామాజిక వర్గం ఆ కథని వీరగాథగా భావిస్తుంది. ఇందుకు ఉదాహరణ సర్వాయి పాపడి కథ. సర్వాయి పాపడు తక్కువ కులానికి చెందిన బందిపోటు. మొఘల్ కాలపు దస్తావేజుల్లో ఒక బందిపోటు ప్రస్తావన ఉంది. ఈ కథలో కనిపించే ప్రదేశాలు నిజంగానే ఉన్నాయి. ఇలా వాడి సాహసాలను వివరించే ఈ కథలో చారిత్రక వాస్తవాలు కూడా కనిపిస్తాయి. సర్వాయి పాపడి పుటక, జీవితం, మరణం ఇవన్నీ కూడా ఇతర జానపద కథానాయకులకు మల్లేనే ఉంటుంది. ఈ కథకు ఉండవలసిన అన్ని ఐతిహాసిక లక్షణాలూ ఉన్నాయి.అయినా కూడా, సర్వాయి పాపడి వృత్తాంతాన్ని వీరగాథలా కాకుండా కేవలం ఒక జానపద కథగానే శ్రోతలు భావిస్తారు. ఈ కథను పాడేవారు కూడా వినేవారి ఆనందం కోసం మాత్రమే ఈ కథను పాడతామని నాకు స్పష్టం చేశారు. ఏ కులం వారు ఈ కథను ‘తమది’గా చేసుకోనప్పటికీ, విద్యాధికులైన సాహిత్యవేత్తలు కొందరు, సర్వాయి పాపడిని ముస్లిం రాజుల పీడనకు ఎదురొడ్డిన ఒక గొప్ప హిందూ వీరుడిగా పునర్నిర్వచించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలకు తగినంత వత్తాసు దొరికితే, ఈ జానపద కథ ‘నిజ’త్వాన్ని సంతరించుకొని, కొంతకాలంలో ఐతిహాసిక స్థాయికి చేరుకునే అవకాశం లేకపోలేదు.

ఒక కథను వీరగాథగా మల్పించడానికి, చారిత్రక వాస్తవికతను జోడించి ఆ కథను యదార్థంగా చేయడం ఎంత ముఖ్యమో, ఒక చారిత్రక సంఘటనని కేవలం కట్టుకథగా మార్చి చూపడానికి, ఆ చారిత్రక వాస్తవాన్ని పూర్వపక్షం చేయడం అంతే ముఖ్యమైన ప్రక్రియగా మనం గమనించాల్సి వుంటుంది. మనదేశంలో తరచూ జరిగే వాదనల్లో ఒకటి, రామాయణ మహాభారతాలకు చారిత్రక సత్యత ఉన్నదా, అనేది. శోధన ద్వారా చరిత్రను నిర్థారించే దృక్పథం వున్న శాస్త్రజ్ఞులు, పురావస్తు తవ్వకాలలో దొరికిన నాణాలు, పనిముట్లు, ప్రాచీన శిలాశాసనాలు తదితరమైన రుజువుల ఆధారంగా కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడు జరిగిందనో, జరగలేదనో, రామాయణంలోని లంక ఇప్పటి శ్రీలంక అనో, కాదనో – ఇలా వాదిస్తారు. అయితే ఈ నిదర్శనలు కేవలం చారిత్రక పరిశోధనకు సంబంధించినవిగానే మిగిలిపోవు. మనదేశంలో వార్తాపత్రికలు తరచూ, పురావస్తు అన్వేషణలో బయటపడే సాక్ష్యాల సమాచారాన్ని ఐతిహాసిక దృక్పథంతోటే ప్రచురిస్తాయి. పురావస్తు పరిశోధన ఫలితాలను రామాయణం, మహాభారతం వంటి కావ్యాల ఐతిహాసికతను నిర్ధారించడానికో, నిరాకరించడానికో ఉపయోగపడే ముఖ్యమైన ప్రమాణాలుగా భావించడం వల్లనే వార్తాపత్రికలు వాటికంత ప్రాముఖ్యత నిస్తాయి.

అలాగే, సాంప్రదాయ వాదాన్ని ఎదురించే ఆధునిక కవులు, వ్యాసకర్తలు ఈ ఇతిహాసాలను పుక్కిటి పురాణాలుగానే భావిస్తారు, ఆ అభిప్రాయాన్నే బలంగా వినిపిస్తారు. గజేంద్ర మోక్షంలో ఏనుగు, మొసలి మధ్య పోరాటం, సమాజంలోని పీడితుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు, పాలక వర్గం ప్రచారం చేసే ఒక అబద్ధంగా శ్రీశ్రీ వాదించాడు.(ఇది జరిగిన కథ కాదని / ఎవరో కల్పించినదని/ ఇంచుక యోచించగల వాడెవడైనా గ్రహిస్తాడు – సదసత్సంశయం కవితలో.) ఆయన పాఠకులకు భాగవత పురాణం ఒక కట్టు కథ మాత్రమే. కానీ సాంప్రదాయ హిందువుల దృష్టిలో గజేంద్ర మోక్షం నిజంగా జరిగిన సంఘటన. వారికందులో ఏ సంశయము లేదు. ఒక ఇతిహాసపు స్థాయి, అది ఎంత నిజం అనే నమ్మకం పైన ఆధారపడి ఉందని ఇక్కడ గ్రహించవలసిన సంగతి.

ఒక కథనం ఇతిహాసమా, కాల్పనికమా అనేది ఆ కథనానికి నిజత్వాన్ని ఆపాదించడం, లేదా లేకుండా చేయడం మీద ఆధారపడింది కాబట్టే ఇతిహాసాలు మనదేశంలో ఆదర్శాల (Ideology) వ్యాప్తికి వాడుకోబడుతున్నాయి. ప్రత్యేకించి తెలుగు వంటి భాషలలో, సామాజిక వర్గాలు ఈ కథలని ‘తమ’విగా వాటిని సొంతం చేసుకోవడం వల్ల, జానపద ఇతిహాసాల (లేదా వీరగాథల) విషయంలో ఈ వాడుక మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీరగాథలతో కూడి కొన్ని పండగలు, జాతరల వంటి సంప్రదాయాలు ఉండటం, ఆ ప్రత్యేక సందర్భంలో ఆ వీరగాథను ప్రదర్శించే హక్కు కొంతమంది కళాకారులకే ఉండటం ఒక ఇతిహాసాన్ని ఒక వర్గం తమ కులచరిత్రగా చూపుకోటానికి మరింతగా సహకరిస్తాయి. ఒక ఇతిహాసం చారిత్రక సత్యంగా భావించబడి, దాని ఆధారంగా ఆచార వ్యవహారాలు ఎప్పుడైతే దైనందిన జీవితంలో చోటు చేసుకుంటాయో, అప్పుడు ఆ ఇతిహాసం ఆ సామాజిక వర్గాన్ని మరింతగా ప్రభావితం చేస్తుంది. ఆ వర్గానికి సమాజంతో ఉండే లావాదేవీలు, అంతర్గత సంబంధాలు, సంప్రదాయాలు ఇత్యాది స్వభావాలని ఆ ఇతిహాసం నియంత్రిస్తుంది.

ఒక ఇతిహాసపు సంఘటనలు యదార్థమని, అందులోని పాత్రలు నిజమైనవే అని నమ్మినప్పటికీ, ఐతిహాసిక కథనంలో మార్పులు చోటు చేసుకుంటూనే వూంటాయి. ఇవి కేవలం వీరగాథలని పాడేవారు తమ ప్రతిభతో కథనానికి చేసిన చేర్పుల వంటివి కావు. ఈ మార్పులు మరింత లోతైనవి. అవి ఏ సామాజిక వర్గమైతే ఆ ఇతిహాసాన్ని ‘తమ’దిగా అనుకుంటున్నదో, ఆ వర్గపు ఆదర్శాలలో వచ్చిన మౌలికమైన మార్పులు ఇవి. అంటే కాలక్రమేణా ఆదర్శాలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇతిహాసం కూడా మారుతూ వుంటుంది. మనదేశంలో ఇతిహాసాలు ఇప్పటికీ ఈ విధంగానే సృష్టించబడుతున్నాయి, నిర్మూలించబడుతున్నాయి కూడా. లిఖిత ఇతిహాసాలు, మౌఖిక వీరగాథలు రెంటిలోనూ ఈ మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అందువల్ల వాటి మధ్య వున్న తేడా కూడా అక్కడక్కడా చెరిగిపోతున్నది. జానపద వీరగాథలు క్రమంగా లిఖిత ఇతిహాసాలుగా పరిణమించడం, లిఖిత ఇతిహాసాలలోని కథనాలు జానపద వీరగాథలుగా అవతరించడం ఇందువల్లనే.

ఈ ఐతిహాసిక పరిణామాన్ని పరిశీలించటం కోసంగా నేను మొదట ఆరు జానపద వీరగాథలని, వాటిని తమవిగా అనుకునే సామాజిక వర్గాల గురించి చర్చిస్తాను. ఆపైన ఆ వీరగాథల ఐతిహాసికతలో వచ్చిన మార్పులు, ఎలా ఆ వర్గపు సిద్ధాంతభావాలలో వచ్చిన మార్పులని ప్రతిఫలిస్తున్నాయో వివరిస్తాను. ఇందుకోసంగా నేను తీసుకుంటున్న వీరగాథలు ఇవి: 1. పల్నాటి కథ; 2. బొబ్బిలి కథ; 3. కాటమరాజు కథ; 4. కన్యకా అమ్మవారి కథ; 5. సన్యాసమ్మ కథ; 6. కామమ్మ కథ.

జానపద వీరగాథలు
కథనపు వైఖరి ఆధారంగా ఈ వీరగాథలను త్యాగచరితలు, వీరచరితలు అనే రెంటిగా విడగొట్టవచ్చును. వీరచరితలు యుద్ధభూమిలో మరణించే మగవారి చుట్టూ, త్యాగచరితలు ఆత్మాహుతి చేసుకునే ఆడవారి చుట్టూ అల్లబడ్డాయి (ఎలాగో తర్వాత వివరిస్తాను.) ముందుగా ఈ కథల గురించి క్లుప్తంగా చెప్తాను.

పల్నాటి కథ ఇద్దరు సవతి బిడ్డల మధ్య నడిచే పోరుని వర్ణిస్తుంది. ఒక కూటమికి నాయకురాలు విధవ అయిన నాగమ్మ, రెండవ కూటమికి వీరుడైన బ్రహ్మనాయుడు నాయకుడు. ఇతను అలుగురాజుకు మంత్రి. మరణశయ్యపైన ఉన్న రాజు తన ఇద్దరు భార్యలకు పుట్టిన ముగ్గురేసి పిల్లల బాధ్యత బ్రహ్మనాయుడికి అప్పచెప్పి చనిపోతాడు. ఈ ఆరుగురు పిల్లలలో పెద్దవాడైన నలగామరాజుకి పట్టాభిషేకం చేస్తాడు బ్రహ్మనాయుడు. కానీ త్వరలోనే, నాగమ్మ నలగామరాజుని తన గుప్పిట్లోకి తెచ్చుకుని, తమ్ముడైన పెద్దమలిదేవరాజు నుంచి విడగొడుతుంది. బ్రహ్మనాయుడు రాజ్యాన్ని రెండు ముక్కలు చేసి, పెద్దమలిదేవరాజుని రాజుగా చేసి తన సంరక్షణలో ఉంచుకుని రాజ్యభారాన్ని తను మోస్తుంటాడు. నాగమ్మ, బ్రహ్మనాయుడి మధ్య వైరం చివరికి ఒక కోడిపందెంలో ముగుస్తుంది. పందెంలో ఓడిన బ్రహ్మనాయుడు రాజుతో సహా ఏడేళ్ళు దేశం వదిలి వెళ్ళవలసి వస్తుంది. ఆపైన నలదేవరాజు, నాగమ్మ ప్రబోధంతో, రాజ్యాన్ని తిరిగి పెద్దమలిదేవరాజుకి ఇవ్వననడంతో యుద్ధానికి సిద్ధమౌతారు. కానీ, యుద్ధసన్నాహాలు జరుగుతుండగా నాగమ్మ, నలగామరాజు అర్థ రాజ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని రాయబారం పంపుతుంది. కాని, బ్రహ్మనాయుడి కొడుకైన బాలచంద్రుడి ప్రతీకార వాంఛ వల్ల సంధి విఫలమౌతుంది. యుద్ధంలో రెండువైపులా ఎందరో చచ్చిపోతారు. నాగమ్మ పారిపోతుంది. బాలచంద్రుడు కూడా మరణిస్తాడు. ఇలా ఎన్నో మలుపులు తిరిగి కథ ముగుస్తుంది.

యాదవుల గురించిన కాటమరాజు కథ కూడా ఇలాగే కొంచెం క్లిష్టమైన కథ. కథ. పశువులు కాచుకునే వీరిని గొల్లవారు అని కూడా అంటారు. మహాభారతకాలం నుంచీ యాదవులు శ్రీకృష్ణుని వంశం వారని చెప్పుకుంటారు. కథానాయకుడైన కాటమరాజు తన విస్తారమైన పశుగణానికి గ్రాసం కోసం చోళ రాజు నల్లసిద్ధి భూముల్లో గడ్డిని పశువులు యదేచ్ఛగా మేసేటట్టుగా, అందుకు ప్రతిగా వాటికి పుట్టిన దూడలని చోళరాజు కిచ్చేటట్టుగా ఒప్పందం కుదుర్చుకుంటాడు. నల్లసిద్ధి వెలయాలైన కుందవాదేవి కాటమరాజుకీ నల్లసిద్ధికీ మధ్య వైరానికి కారణం. ఆమె పెంపుడు చిలకను యాదవులు బాణంతో చంపడం వల్ల ఆమె యాదవుల గోవులని చంపమని స్థానికులని రెచ్చగోడుతుంది. తమ గోగణం కోసం వన్యప్రాణులని చంపుతున్న యాదవుల మీద వారప్పటికే కోపంతో ఉన్నారు. వారి చర్య వల్ల కాటమరాజు తన కప్పం చెల్లించనంటాడు. కరువు కాటకాలవల్ల భూములు బీడు పోతాయి. ఒప్పందాన్ని మాటకు మాటగా తీసుకున్న కాటమరాజు తన పశువులని వరిచేలలోకి వదులుతాడు, అదీ గడ్డే కాబట్టి. అలా మొదలైన స్పర్థ యుద్ద్ధంగా మారి, ఎందరో యాదవ వీరులు ప్రాణాలు పోగొట్టుకోడంతో ముగుస్తుంది.

తమ భూములని రక్షించుకోవడం కోసం వీరులు ప్రాణాలర్పించడం అనే సూత్రం బొబ్బిలి కథలో కూడా కనిపిస్తుంది. వెలమ కులస్థులకు చెందిన ఈ కథకి సందర్భం 18వ శతాబ్ది లో బొబ్బిలి, విజయనగర సంస్థానాల మధ్య కలిగిన వైరం. ఫ్రెంచి సేనాని బుస్సీ చర్యల వల్ల ఈ రెంటి మధ్యా శత్రుత్వం మరింత ప్రబలుతుంది. క్షత్రియుడైన విజయనగరపు సంస్థానాధీశుడు బుస్సీని కలిసి బొబ్బిలి రాజుని ఓడించడానికి సహాయం అడుగుతాడు. రాజుకి లోబడిన మధ్యవర్తుల కుతంత్రంవల్ల బుస్సీ వెలమ కులస్తుడైన బొబ్బిలి రాజు రంగారావుని కోట తమకు ఆధీనం చేసి వెళ్ళాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. రంగారావుకి ఇది తీవ్రమైన అవమానంగా అనిపించి ఎదురు తిరుగుతాడు. ఫ్రెంచి, విజయనగర సైన్యాలు బొబ్బిలి కోటను ముట్టడిస్తాయి. కోటను కాపాడుకుంటూ వెలమ వీరులందరూ మరణిస్తారు. వారి ఆడవారు మంటల్లోకి దూకి ఆత్మాహుతి చేసుకుంటారు.

ఈ కథలకు విరుద్ధంగా ముందు చెప్పబోయే మూడు త్యాగచరితలలో ప్రధాన పాత్ర స్త్రీ. ఆమె ఆత్మాహుతి చేసుకోవడం, ఆ తర్వాత ఆమె దైవంగా పూజించబడడం ఈ చరితల్లోని అంతస్సూత్రం.

కన్యకా అమ్మవారి కథా స్థలం, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పట్టణం. ఆ ఊరి కోమటి నాయకుడు కుసుమశ్రేష్టి కూతురు కన్యక. అపర సౌందర్య రాశి. ఒకరోజు ఆ ప్రాంతపు రాజు పెనుగొండ వస్తాడు. కోమటి వారంతా రాజుకు సత్కారాలు చేస్తారు. హారతి ఇవ్వడానికి వచ్చిన కన్యకను చూసి రాజు మోహిస్తాడు. తనకిచ్చి వివాహం చెయ్యకుంటే పెనుగొండపై దండెత్తి ఆమెను చెరబడతానని కోమటివారికి చెప్పిస్తాడు. కులపెద్దలందరూ సమావేశమౌతారు. విషయం తెలిసిన కన్యక వివాహానికి పెద్దలు ఒప్పుకున్నారనీ, కానీ పెళ్ళిపనులకు సమయం పడుతుందనీ రాజుకు వర్తమానం పంపుతుంది. రాజు ఊరి బయట కొండలలో మకాం వేసి వుంటాడు, కన్యక తన కులపెద్దలకు, ఆత్మాహుతి చేసుకుందామన్న తన నిర్ణయం చెప్తుంది. తనతో పాటు ఎవరు అగ్నికి ఆహుతి కాదలచుకున్నారో అడుగుతుంది. అందుకు సిద్ధమైన నూట ఇద్దరు గోత్రీకుల కుటుంబాలనుంచి భార్యాభర్తలని ఎంచుకుని, యువతీ యువకులకు కులాన్ని వృద్ధిచేయడానికి ఒదిలిపెడుతుంది. మిగతా గోత్రీకులందరిని కులం నుంచి వెలివేస్తుంది.

రాజుకి అనుమానం వచ్చి సైనికులని, ఆలస్యానికి కారణం కనుక్కోమని పంపుతాడు. వారు తిరిగిరాకపోవడంతో తనే దండెత్తుతాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోతుంది. పెద్ద పూడికలో వ్రేల్చిన మంటలో కన్యక తదితరులు ఆహుతి అయిపోతారు. చనిపోయేముందు కన్యక, కోమటివారిలో మేనరికాలు ఎవరు కూడా ఏ కారణం చేతనైనా కాదనకూడదనీ, కోమటి వారి ఆడపిల్లలకు తన పేరు పెట్టుకోవాలని ఆదేశిస్తుంది. పరపురుషులు మోహించకుండా వారి ఇళ్ళలో ఆడపిల్లలు అందవిహీనంగా పుడతారనీ, తనను మోహించిన రాజు ఊరిలోకి అడుగుపెట్టగానే చచ్చిపోతాడని, పెనుగొండ తన తర్వాత వారికి ఒక పెద్ద పుణ్యక్షేత్రం అవుతుందనీ చెప్పి మంటలోకి దూకుతుంది.

సన్యాసమ్మ కథ ఆమె పుట్టుకతో మొదలవుతుంది. గాజులమ్ముకొనే కాపు దాల్నాయుడు, భార్య చనిపోగానే పిల్లలని ఒదిలేసి వేరే వివాహం చేసుకుంటాడు. సన్యాసమ్మను ఆమె అన్న రామినాయుడు ఎంతో ప్రేమతో పెంచుతాడు. ఆమెకు మేనత్త దాలమ్మ కొడుకైన చెంచన్నతో పెళ్ళి జరిగిన తర్వాత పెద్దమనిషి కాని కారణంగా పుట్టింట్లోనే ఉంటుంటుంది. ఒకరోజు రామినాయుడు దూరాభారం పోవలసి వచ్చి తన భార్య పాపమ్మకు ఇల్లు అప్పచెప్పి వెళతాడు. సవతి తల్లి కొడుకుతో సన్యాసమ్మ ఎద్దులపోటీలు చూడటానికి వెళ్ళడంతో సవతి తల్లి చేతిలో చీపురు దెబ్బలు తింటుంది. తన తప్పేమీ లేదని, అదే నిజమైతే దెబ్బలు కొట్టినవారికే తగులుతాయనీ సన్యాసమ్మ అంటుంది. ఆమె చెప్పినట్టే సవతి తల్లి ఒంటిమీద వాతలు తేలతాయి. ఆ తర్వాత, సన్యాసమ్మ అత్తవారింటికి చేరుతుంది. చెంచన్న, ఇంగ్లీషు చదువులు చదువుకొని, ఉద్యోగం వెతుక్కుంటూ మద్రాసుకి వెళతాడు. మేనత్త, ఆడపడుచు చేతుల్లో సన్యాసమ్మ ఎన్నో కష్టాలు పడుతుంది. తన మీద పడేసిన బండెడు చాకిరీని తన సత్యవతి కావడంతో వచ్చిన శక్తితో సకాలంలో చేస్తూ ఉంటుంది.

ఇదిలా ఉండగా, సన్యాసమ్మ మరిది అయిన అప్పన్న, ఆమెకు తన తల్లి తిండి పెట్టడం లేదని గమనించి, తాగమని పాలు ఇస్తాడు. ముందు సందేహించినా, సన్యాసమ్మ ఆ పాలు సగం తాగుతుంది. ఇంతలో అప్పన్న సన్యాసమ్మ గదిలోనుంచి రావడం చూసిన అత్త, సన్యాసమ్మను వేశ్య అని నిందిస్తుంది. అంతతో విరక్తి చెందిన సన్యాసమ్మ గది తలుపులు మూసుకొని చాప మీద పడుకొంటుంది. భర్త ఎక్కడున్నాడో వెతికి తీసుకొని రమ్మని తన ఆత్మను పంపిస్తుంది. ఆ ఆత్మ మద్రాసులో చెంచన్నను కలిసి ఇంటికి రమ్మని చెప్తుంది. చెంచన్న వచ్చి సన్యాసమ్మను అత్తవారి ఆరళ్ళనుంచి దూరంగా తీసుకుపోతానని చెప్తాడు. వేరు కాపురం పెట్టుకోడానికి ఆస్తి పంపకం చేయమని అన్నను అడుగుతాడు. అన్న ఇవ్వకపోగా, చెంచన్నను అవమానించడంతో, అది భరించలేక అతను ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ వార్త విన్న సన్యాసమ్మ, మరిది అప్పన్నతో కలిసి మద్రాసుకు వెళుతుంది. ఈస్టిండియా అధికారులని సతికి అనుమతి నివ్వమని కోరుకుంటుంది. అందుకు ఒప్పుకోని అధికారులు ఆమెను జైలులో ఉంచినా ఆమె విచిత్రంగా తప్పించుకుంటుంది. ఆ తర్వాత ఆమె అధికారులకు ఎన్నో మహిమలు చూపించడంతో వారు సతీ సహగమనానికి ఒప్పుకుంటారు. అప్పన్నకు పసుపు కుంకుమలు కానుకగా ఇచ్చి సన్యాసమ్మ భర్తతో పాటు చితిలో కాలిపోతుంది.

ఆఖరుగా, కామమ్మ కథ. బెస్తకుటుంబంలో పుట్టిన కామమ్మ, కరువులో తలితండ్రులు చనిపోతే, మేనమామ దగ్గర ప్రేమతో పెరిగి, తనకు వరసైన మారయ్యను పెళ్ళాడుతుంది. మారయ్య మద్రాసులో ఈస్టిండియా కంపెనీలో సైనికుడిగా చేరతాడు. ఏడేళ్ళు గడుస్తాయి. ఉద్యోగం చాలించుకొని ఇంటికి తిరిగొస్తున్న మారయ్య జబ్బు చేసి చచ్చిపోతాడు. అది విన్న కామమ్మ సతికి సిద్ధమౌతుంది. భర్త దేహాన్ని ఒక గదిలో ఉంచి తాళం వేసి కాకినాడ కలెక్టరు దగ్గర సతికి అనుమతి కోసం వెళుతుంది. మధ్యలో ఒక లోతైన కాలవ దాటవలసి వచ్చినప్పుడు, తను జాలరి కాబట్టి, తనకు అక్క వరస అయిన గంగానది కృపతో కామమ్మ కాలవ దాటుతుంది. తనతో వచ్చిన మగవారికి కాలవ దాటడానికి రెండు పడవలని చేసిస్తుంది. ఆమె అర్జీ విన్న బ్రిటీషు అధికారి, బెస్తకులపు ఆడవారు రెండో పెండ్లి చేసుకోవచ్చనీ, చేసుకొమ్మనీ సలహా ఇస్తాడు. తననీ, తన కులాన్నీ అవమానించాడని కామమ్మ అతణ్ణి నిందిస్తుంది. ఏడు రోజులు నిద్రాహారాలు లేకుండా ఆమె జైలులో ఉండగా, ఆ అధికారి మారయ్య శరీరాన్ని దహనం చేయమని ఆజ్ఞాపిస్తాడు. అది తెలిసిన కామమ్మ, శరీరాన్ని వదిలి, ఆత్మగా మద్రాసులోని పై అధికారి కలలో కనపడుతుంది. అతను అడిగిన మహిమలన్నీ చూపించి, సతికి అనుమతి తీసుకొని కాకినాడ తిరిగి చేరుకుంటుంది. కాకినాడ కలెక్టరు పేర్పించిన చితిలో, బంధుబలగాల సమక్షంలో, భర్తతో పాటుగా కాలిపోతుంది.

ఈ కథల్లో ఉన్న ముఖ్యమైన తేడాలను మనం గమనిస్తే, వీరచరితల్లో కథానాయకులు మగవారు అనీ, త్యాగచరితలు ప్రధానంగా ఆడవారి గురించి అనీ తెలుస్తుంది. వీరచరితల్లో వైరం తమ కులానికే చెందినవారితోనో, లేదా సమకులస్తులతోనో ఉంటుంది. త్యాగచరితల్లో సంఘర్షణ పరాయి అధికారపు చొరబాటు వల్ల వస్తుంది. వీరచరితల్లో ఘర్షణ భూమి కోసం, రాజ్యం కోసం అయితే, త్యాగచరితల్లో అది కులపు మానమర్యాదలు నిలపడం కోసంగా ఉంటుంది. అంతే కాకుండా వీరచరితల్లో నాయకులు భుజబలంతో పోరాడితే, త్యాగచరితల్లో కథానాయికలు తమ మానసిక స్థైర్యంతో, తమ సంకల్పంతో, తమ ఆత్మార్పణ ద్వారా కష్టాలకు ఎదురొడ్డుతారు. వీరులు యుద్ధంలో శత్రువులను కడతేర్చడమో, వారి చేతిలో చావడమో చేస్తారు. నాయికలు ఆత్మాహుతి ద్వారానో, శాపగ్రస్తలయ్యో మరణిస్తారు. వీరచరితలు నాయకులు మరణించడం, వారికోసం మిగిలినవారి రోదనలతో ముగిసి దుఃఖాంతమవుతాయి. త్యాగచరితల్లో వైరులు ఓడిపోవడమే కాకుండా, ఆ కులం వారు వృద్ధి చెంది సమాజంలో మరింత గౌరవం పొందుతారు.

వీరగాథల కులప్రసక్తి
ఈ వీరగాథల్లో ప్రతి ఒక్కటి ఏదో ఒక కులం లేదా ఒకే స్థాయి కులాల ప్రాపకంలో ఉన్నవి. ఇంతకుముందే చెప్పినట్టు ఈ వీరగాథలను అనుసరిస్తూ నిజ జీవితంలో ఉన్న కార్మిక సంప్రదాయాలు (జాతరలు, పండగల వంటివి) ఆయా కులాల వారు ప్రత్యేకంగా జరుపుకునేవిగా ఉంటాయి. ఈ సందర్భాలలో ఈ వీరగాథలు ప్రదర్శించడానికి కళాకారులు కూడా ప్రత్యేకమైన హక్కు కలిగివుంటారు. ఉదాహరణకి, పల్నాటి జాతరలో ఈ వీరగాథ ప్రదర్శించేవారిని ‘వీరవిద్యావంతులు’ అని పిలుస్తారు. వీరు సాధారణంగా మాల కులస్తులై ఉంటారు. ఈ జాతరలో పాల్గొనే ‘ఆచారవంతులు’ తెలగ, కమ్మ, వెలమ తదితర భూస్వామ్య కులాలవారై ఉంటారు. అదేవిధంగా కాటమరాజు కథను ప్రతి యేటా గంగజాతరలో ప్రదర్శించడానికి యాదవులు, ‘కొమ్ములవాళ్ళు’గా పిలవబడే మాదిగ కులం వారిని మాత్రమే ఆహ్వానిస్తారు.

ఈ వీరగాథలని ‘తమవి’గా స్వంతం చేసుకోవడంలో తేడాలున్నాయి. పల్నాటికథతో మమేకం కావడం కేవలం ఆ నేలకు సంబంధించినది. ‘ఈ వీరులు మా పల్నాటి గడ్డపై పుట్టి, ఇక్కడే పోరాడి మరణించినవారు’ అన్న భావన ఇది. అలాగే, బొబ్బిలి కథ ‘మా బొబ్బిలి వెలమ రాజులది’ అన్న అభిప్రాయం వల్ల దానిని కేవలం బొబ్బిలి నేలకే కాక వెలమ కులానికి కూడా అనుబంధంగా మనం గమనిస్తాం. ‘బొబ్బిలి పులి’ అని ఆ ప్రాంతపు వెలమ కులస్తులని పొగుడుకోవడం ఒక ఆనవాయితీ. కాటమరాజు కథ, కన్యకా అమ్మవారి కథ ప్రత్యేకించి కులానుబంధంగా మాత్రమే గుర్తించబడ్డవి. ఈ విషయం కన్యకా అమ్మవారి ద్వారా మనకు చక్కగా తెలుస్తుంది. వలస పోయిన కోమటి కులస్తులు కన్యక కథనీ, ఆ అమ్మవారినీ వారివెంట తెచ్చుకున్నారు. వారు స్థిరపడ్డ ప్రతీ పట్టణంలోనూ (తుర్పు కోస్తాలో మరీ ముఖ్యంగా) కన్యక అమ్మవారి గుడి ఉండటం ఇందుకే. ఆ అమ్మవారి కథను ప్రాచుర్యంలోకి తెచ్చింది, అందుకు దోహదపడింది కూడా కోమటివారే. ఈ కులస్తులు అధికంగా ఉన్న పెనుగొండలో ప్రతీ యేటా కన్యక అమ్మవారి పండగ జరుగుతుంది. ఇందుకు భిన్నంగా సన్యాసమ్మ, కామమ్మ కథలను ఏ కులాలవారూ ప్రత్యేకించి ‘తమది’గా చేసుకోలేదు. ఈ కథలకు సంబంధించి జాతరలు, పండగల వంటి సంప్రదాయం లేదు; అధికారికంగా ప్రదర్శించే హక్కు ఉన్న కళాకారులంటూ లేరు. ఈ కథలు తెలిసిన ప్రాంతాలలో ఎక్కువమంది ఇతర కులస్తులై ఉండి ఈ కథలని వారివిగా అనుకోలేకపోవడం ఇందుకు మూల కారణం.

ఈ వీరగాథల అంతఃసూత్రాలకి, వాటిని ఆచరించుకునే సామాజిక వర్గాలకూ మధ్య ఏదైనా సంబంధం ఉందా అని పరిశీలించడం ప్రయోజనకారిగా ఉంటుంది. ఈ కులాలు, వర్గాల గురించిన శాస్త్రీయ అధ్యయనం ఇప్పటికి మనకు లేదు. ఈ విషయంలో ఎడ్గర్ థర్స్‌టన్ (Edgar Thurston) వ్రాసిన ‘దక్షిణ భారతదేశపు కులాలు, తెగలు’ అన్న పుస్తకమే మనకు మూలాధారం. ఈ పుస్తకంలోని వివరాలు, క్షేత్రీయంగా నేను సేకరించిన వివరాల ఆధారంగా ఈ వీరగాథలకు చెందిన కులాల గురించి నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. ఈ కులాలను ప్రధానంగా భూస్వాములు, వ్యాపారులు అన్న రెండు వర్గాలుగా విభజించవచ్చు. ఈ విభజన బెక్ 1972లో ప్రతిపాదించిన ‘ఎడమచేతి / కుడిచేతి’ కులాలకు సమీపంగా ఉన్నది. తమిళులలో ఉన్నంత స్పష్టంగా మనకు తెలుగులో ఈ వర్గీకరణ లేకపోయినా, ఆచార వ్యవహారాలు, ఆదర్శాలు, కుల ప్రవర్తన ఆధారంగా తెలుగునాట కూడా నిమ్నకులాలు ఇలానే విడిపోయి ఉండేవని తెలుస్తుంది. భూమిని ఆస్తిగా కలిగివున్న వారు కుడిచేతి కులాలవారు; వర్తక వ్యాపారాలు చేసేవారు ఎడమచేతి కులాలవారు.

ఒకనాటి ఆంధ్రదేశంలో భూస్వాములు రాజకీయబలం వున్నవారు. ధాన్యం పండించేవారిగా వీరికి సమాజంలో చాలా ప్రాధాన్యత ఉండేది. క్షత్రియ రాజుల హోదాతో సమానమైన యాజమాన్య హోదా వీరికుండేది. వీరి పెద్దరికాన్ని వీరి పొలాలలో పనిచేసే నిమ్నకులాలవారందరూ గుర్తించేవారు, వారి అధికారాన్ని ఒప్పుకునేవారు. వీరు, బ్రాహ్మణులు ఈ యజమానుల సేవలో వుండేవారు. బ్రాహ్మణులు యజ్ఞయాగాదులు, పౌరోహిత్యం తదితర దైవకార్యాలు చేసేవారు. కేవలం పూజాపునస్కారాలే కాకుండా వార్తాహరులుగానూ, లేఖకులుగానూ, సలహాదారులుగానూ కూడా బ్రాహ్మణులు పనిచేసేవారు. ఐతే, పౌరోహిత్యం కేవలం బ్రాహ్మణులకే ప్రత్యేకమైన విధి కాదు. జాతరలలో వీరగాథల నిర్వహణ మాలలు చేసేవారు. అంకాళమ్మవారిని కొలవడం గొల్లల పనిగా ఉండేది. అంటే, జంతుబలి ఆచారంగా ఉన్న జాతరలు, గ్రామదేవతల పూజల ఆచరణ నిమ్నకులాల కర్తవ్యంగాను, సంస్కృత దేవతల పూజలు బ్రాహ్మణుల ఆధ్వర్యంలోను, వుండేవి.

ఈ విధంగా, సమాజంలోని అధికారక్రమంలో భూస్వామి అయిన యజమాని – బ్రాహ్మణులతో సహా ఇతర కులాలన్నిటికన్నా – పైమెట్టులో ఉండేవాడు. వీరులైన రాజులు తమ రాజ్యాలను కాపాడుకొన్నట్టుగా, తమ భూమిని కాపాడుకోడం తమ ధర్మంగా భావించడం వల్ల తమ నాయకత్వాన్ని ప్రతిబింబించే నాయుడు (నాయకుడు), రాజు (రాజ) వంటి బిరుదులు ఈ యజమానులు పెట్టుకున్నారు. శత్రువుకి తలదించడం కన్నా యుద్ధభూమిలో మరణించడాన్ని ఆశించడం, ధైర్యసాహసాలతో పరాక్రమవంతులై వుండి, వంశగౌరవాన్ని కాపాడుకోవడం – ఇలాంటి క్షత్రియ ఆదర్శాలనే వీరు కూడా గౌరవించి ఆచరించేవారు. ఆ ఆదర్శాలే మగవారికి ఉండవలసిన విలువలు. తమ కుటుంబాలలోని స్త్రీలు, తమ భూమి, గౌరవాల లాగానే కాపాడుకోవలసిన వస్తువులు.

కేవలం భూస్వాములే కాకుండా సమాజంలో ఇంచుమించు అందరూ ఈ భావాలను ఆదర్శ ప్రవర్తనకు చిహ్నాలుగా అంగీకరించారు. యజమానికి పనిచేసే నిమ్నకులాల పురుషులు వీరత్వాన్ని, వారి స్త్రీలు పాతివ్రత్యాన్ని అలవర్చుకున్నారు. పిరికివాడైన పురుషుడిని, అధిపత్యం చెలాయించే స్త్రీని, సమాజంలో అందరూ అసహ్యించుకునేవారు. అయితే కొన్ని మినహాయింపులు లేకపోలేదు. ఉదాహరణకు, పండితులైన బ్రాహ్మణులకు వీరత్వం ఆదర్శం కాదు. అలాగే వేశ్యాకులాలకు చెందిన ఆడవారికి పాతివ్రత్యం ఆదర్శనీయం కాగల వీలు లేదు. అయితే ఈ మినహాయింపులు సంఘంలో వారి వారి విలువని తక్కువ చేశాయి. భూస్వామ్యం కోసం పోటీ పడని కారణంగా సమాజం అంగీకరించిన ఈ ఆదర్శాలకు విడిగా వాణిజ్యకులాలవారు నిలబడి, స్వతంత్ర భావాలను వారికి ఆదర్శాలుగా మలచుకోగలిగారు.

ఈ నేపథ్యంతో, వీరగాథలనీ, వాటికి అనుబంధంగా వున్న కులాలనీ మనం పరిశీలించవచ్చును. పల్నాటి కథను తమ ఆదర్శాలకు ప్రతీకగా తీసుకున్నది తెలగ, వెలమ, కమ్మ కులాలవారు. వీరందరూ పారంపర్యంగా భూస్వాములు. భూమితో ఉన్న బలమైన అనుబంధం ఈ కులాల కట్టుబాట్లలో, నమ్మకాలలో, కనిపిస్తుంది. వారు వాడే సామెతలు, చెప్పే సూక్తుల ద్వారా వారి భాషలో తెలుస్తుంది. స్త్రీలకు భిన్నంగా కనపడాలనే తాపత్రయం వారి ఆహార్యం ద్వారా అర్థం అవుతుంది. మీసం పెంచడం పౌరుషానికి ప్రతీక. గంభీరమైన ఆంగికవాచికాలను అలవర్చుకోవడం, తమ ఇండ్లలో ముందు వైపు గదులు, లోగిలి మగవారి వ్యవహారాలకు ప్రత్యేకంగా అమర్చుకోవడం ఈ పురుషాదర్శాల వల్లనే. ఆడంగి అనడంకన్నా హీనమైన నింద లేదు. మీసంలేని మగవాడు, గాజులు తొడుక్కున్నాడు, పెళ్ళాం మాట వినేవాడు – ఇలాంటి హేళన వెంటనే దాడికి రెచ్చగొట్టేది.

ఈ కులాల స్త్రీలు భూమితో సమానంగా భావించబడినవారు. వాళ్ళ సంరక్షణ ద్వారా కులగౌరవాన్ని, మర్యాదను కాపాడుకొనే బాధ్యత మగవారిది. పునర్వివాహాలకు ఆ సమాజంలో చోటు లేదు. కన్య కాకముందే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు జరిగేవి. ఆడవారి శీలత, భూమి సారవత్వానికి సాటిగా భావించేవారు. కులస్త్రీల గౌరవం ఇంటి నాలుగు గోడల మధ్యనే కానీ బాహ్యప్రపంచంలో కాదు. పెళ్ళికాని ఆడవారు, విధవలు పదిమందిలో కనిపించడం అమర్యాద. విధవలని వెలయాలితో సమానంగా పరిగణించేవారు. ముండ అన్న నిందావాచకం ఇద్దరినీ సూచిస్తుంది.

కాటమరాజు కథని తమదిగా భావించే గొల్లలు పశువుల కాపరులు. క్షత్రియులతో సమానంగా చూపుకోవలసినప్పుడు యాదవులుగా తమని చెప్పుకుంటారు. పశుసంవర్ధన వీరి ప్రధాన వ్యాపకం కావడంతో వీరికి భూమితోటి అనుబంధం తక్కువ. భూస్వామ్య కులాలకన్నా సులభంగా వలస పోగల వీరు భూమిని పశుగ్రాసానికి అవసరమైనదిగానే తప్ప వేరే అనుబంధంతో చూడరు. వీరికి నీటితోటి అనుబంధం ఎక్కువ. నిజానికి వీరి కులదేవత గంగానది, గంగమ్మతల్లిగా కొలవబడుతుంది. కాటమరాజు కథలో కరువుతో నీటి కొరత ఏర్పడడం, తద్వారా యుద్ధం జరగడం, వారు నీటికిచ్చే విలువను సూచిస్తుంది. ప్రధానంగా పశుపోషకులైనప్పటికీ యాదవులు వీరత్వాన్ని కూడా ఆదర్శంగా కొలిచేవారు. గొల్ల స్త్రీలకు పునర్వివాహం చేసుకునే అనుమతి లేదు. కానీ, అవివాహిత యువతులు, విధవలు, అమర్యాదతో చూడబడలేదని దొరికిన ఆధారాల వల్ల తెలుస్తుంది. మిగతా కులాలలోలా కాకుండా, భర్త చనిపోయినప్పుడు గాజులు తీసివేసే ఆచారం గొల్లస్త్రీలలో లేదని థర్స్‌టన్ పేర్కొన్నాడు.

గాజులకాపుల కులంతో కూడుకొన్నది సన్యాసమ్మ కథ. కాపులు అన్న పేరు జనసామాన్యం కొరకు వాడుకున్నా, వారిలో వారు సంబంధాలు కలుపుకోడానికి వారి అసలు కులాన్ని గుర్తించుకుంటారు. గాజుల అమ్మకం ఈ కులపు మగవారి వృత్తి. సాంప్రదాయకంగా స్త్రీలకు పరిమితమైన ఇంటి వెనక గుమ్మం దగ్గరికి వచ్చి గాజులు అమ్ముతారు. వీరే కాకుండా, కాపులు అన్న కులంలో మగవారు, మగపని ఆడపని అన్న తేడాను అంతగా గమనించరు. ఈ కులాలలోని మగవాళ్ళు వంట చేయడం, ఇళ్ళు శుభ్రం చేయడం, పిల్లలని ఆడించడం లాంటి పనుల్లో పాలు పంచుకుంటారు. కొందరు కాపు కులస్థులని పరిశీలించి థర్స్‌టన్ ఇలా అంటాడు:

“వ్యవసాయం మినహా మిగతా విషయాలలో ఆడవారు ప్రముఖమైన పాత్ర వహిస్తారు. ఇందుకు కారణంగా ఒక కథ చెప్పుకుంటారు. కాపులు అయోధ్య నుండి వలస వచ్చినప్పుడు వారి వెంట ఆడవారు ఎవరూ లేరు. వాళ్ళకి భార్యలనిమ్మని దేవుళ్ళని వారు వేడుకున్నారు. పాండవులకు అక్రమసంతానంగా పుట్టిన ఆడవాళ్ళని పెళ్ళి చేసుకోమని వారికి దేవుళ్ళు చెప్పారు. వడ్లు దంచడం, అంట్లు తోమడం, నీళ్ళు తేవడం లాంటి ఇంటిపనులు వాళ్ళకోసం చేసి పెట్టేటట్టూ, వాళ్ళదే పైచేయిగా ఉండేటట్టు కాపులు ఒప్పుకున్న తరవాతనే ఆ ఆడవాళ్ళు పెళ్ళికి ఒప్పుకొన్నారు.”

కామమ్మ కథ బెస్త కులస్తుల కథ. ప్రధానంగా జాలరులైన వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో పల్లకీ మోసేవారి గానూ, కిరాయి సైనికులు గానూ పని చేశారు. వీళ్ళల్లో ఆస్తిపరులు వ్యవసాయం చేపట్టినప్పటికీ, రైతుకూలీగా ఎవరికీ పనిచేసేవారు కాదనీ థర్స్‌టన్ గమనిస్తాడు. వాళ్ళ ఇళ్ళల్లో పూజా పునస్కారాలకి బ్రాహ్మణులని, సాతానీలని (అబ్రాహ్మణ వైష్ణవ పూజారులు) వినియోగించుకునే వారని, బ్రాహ్మణ సాంప్రదాయాలని అనుకరించే వారని థర్స్‌టన్ రాశాడు. ఈ బ్రాహ్మణ ఆచారాలు అనుసరించడానికి పూర్వం ఈ కులంలో వితంతు పునర్వివాహం ఉండేదనీ, ఇప్పుడు లేకపోవడానికి కారణం ఈ మార్పే కారణమని మనకు తెలుస్తుంది.

వ్యాపారస్తుల కులంతో ముడి పడిన త్యాగ చరిత్రకు చక్కటి ఉదాహరణ చెందిన కన్యకా పరమేశ్వరి కథ. కోమటి వారు భయస్తులనీ, పిసినారి వారనీ, గానూ, గోప్యంగా ఉంటారనీ, నమ్మదగిన వాళ్ళు కారనీ, అందవిహీనులనీ, గౌరవ మర్యాదలకన్నా వారికి లాభం మీదే దృష్టి అనీ, సమాజంలో వారి మీద హేళనతో కూడిన అభిప్రాయాలు ఉన్నాయి. ప్రాచుర్యంలొ ఉన్న ఎన్నో సామెతలు, పిట్టకథల వల్ల ఈ విషయం రూఢి అవుతుంది. ఒక కోమటోణ్ణి కొడితే, నీకు దమ్ముంటే నా పక్కింటోణ్ణి కొట్టు, అప్పుడు చెప్తా అంటాడని ఒక సామెత. తనంతగా తాను ఎదురు తిరగలేక పక్కింటివాడి మీదకు ఉసి గొల్పుతాడని అర్థం. కోమటి సాక్ష్యం అంటే గోడమీది పిల్లి వాటంగా ఎటూ తేల్చకుండా చెప్పేది, ఎటన్నా తేలిస్తే రెండోవైపు వారేం చేస్తారో అన్న భయంతో. రెండు వర్గాల వారికి అనువుగా కోమటి తెలివిగా సాక్ష్యం చెప్తాడనీ, ఆ రకంగా తన లాభం ఏ ఒక్క వర్గం వల్లా తగ్గకుండా చూసుకుంటాడనీ లోకోక్తులున్నాయి. కోమటి వారి గొంతు కర్కశంగా ఉంటుందని, నల్లగా, అసహ్యంగా ఉంటారనీ, చురుకుగా ఉండరనీ, బానపొట్ట ఉంటుందనీ, వీరు అవమానించబడతారు. కోమటి స్త్రీల గురించి ఇంచుమించు ఇంత అపహాస్యంగానే మాట్లాడుకుంటారు. గొల్ల కులస్తులలో లాగానే ఈ కులంలో కూడా పునర్వివాహానికి అనుమతి లేకపోయినా, కోమటి స్త్రీలు మిగతా వ్యవసాయిక కులాల స్త్రీల కన్నా, వారి కులంలో ఎక్కువగానే గౌరవించబడతారు.

సమాజంలో ఇలా చిన్నతనంతో చూడబడడంతో, కోమట్లు తమ బలహీనత కూడా ఒక బలంగా చూపించుకునే ప్రయత్నం చేసుకున్నారు.. భూస్వామ్య కులాలకి వీరత్వం ఎలా చిహ్నమయిందో, కోమటి వారు త్యాగాన్ని అలా తమ ఆదర్శ చిహ్నంగా చేసుకున్నారు. హిందూ సమాజంలో బలానికి రెండు ప్రతీకలు కనిపిస్తాయి. ఒకటి పరాక్రమంతో తోటివారిపై ఆధిపత్యం పొందడం; రెండు, ఆ పరాక్రమాన్ని తమ మీదనే చూపించుకొని ఆత్మ త్యాగం చేసుకోవడం, అందువల్ల వచ్చిన దివ్యత్వంతో ప్రపంచం మీద పట్టు సాధించడం. కోమటి వారంత స్వచ్ఛన్నంగా ఇతర కులాల వారి కథలు ఈ ప్రతీకను ప్రదర్శించక పోయినప్పటికీ, విపత్కర పరిస్థితుల్లో వారు ధైర్యం తెచ్చుకొనేది వారి స్త్రీల ఆత్మ త్యాగాల కథలు వారికిచ్చే మనోబలంతోనే.
స్త్రీ పురుష పాత్రల పరావర్తం
తమ ఆదర్శాలకు ఊనికగా వ్యవసాయ కులాలు, వ్యాపార కులాలు ఏర్పరుచుకున్న ప్రతీకలు వేరు వేరని మీరు గమనించే వుంటారు. భూస్వామ్య కులాలలో వీరోచితులైన మగవారు, వారి రక్షణలో ఇంటిదాపులో ఒదిగివుండే ఆడవారు ఆదర్శానికి, ఔచిత్యానికి నమూనాలు. వ్యాపార కులాలలో స్త్రీలు త్యాగశీలతకు, ఆత్మస్థైర్యానికి ప్రతీకలు, మగవారి ప్రవర్తన కేవలం సాధారణం. ఈ వ్యత్యాసమే ఈ జానపద ఇతిహాసాలలో కూడా మనకు కనిపిస్తుంది.

పల్నాటి కథలో వెలమ దొర బ్రహ్మనాయుడు ఒక గొప్ప వీరుడు, పుణ్య స్వభావి. కానీ, అందరూ ప్రముఖంగా మెచ్చుకొనేది, అతని కొడుకు బాలచంద్రుడిని. వయసులో చిన్నవాడైనా తన పరాక్రమం నిరూపించుకోవటం కోసం తండ్రినే ఎదురించి యుద్ధానికి వెళ్ళిన వీరుడు. ఈ వీరస్వభావమే, రాజసేవకులుగా మసలిన తక్కువ కులాల మగవారికి కూడా ఆదర్శమైంది. పల్నాటి కథలో మాల కుల యోధుడు కన్నమదాసు, కాటమరాజు కథలో బ్రాహ్మణుడైన తిక్కన పాత్రలు ఇందుకు ఉదాహరణ. ఈ వీరోచిత స్వభావం వారినుంచి సమాజం ఆశించలేదు కానీ, ఇది మినహా వారికి వీరులుగా నిరూపించుకోవడానికి వేరే మార్గం లేదు.

వీరుడిని ఎంత గౌరవిస్తారో ఈ ఇతిహాసాలలో, భీరువుని, స్త్రీకి లొంగిపోయిన మగవాడిని అంతే అవమానంగా చూస్తారు. పల్నాటి కథలో నలగామరాజు ఇలాంటివాడు. తన రాజ్యపాలన పుర్తిగా నాయకురాలు నాగమ్మ చెప్పుచేతల్లో చేసినవాడు. కాటమరాజు కథలో బ్రాహ్మణ సైనికుడు తిక్కన ఇంకో ఆసక్తి కలిగించే ఉదాహరణ. తిక్కన యుద్ధానికి వెళతాడు కానీ శత్రు సైన్యాన్ని చూడగానే ధైర్యాన్ని కోల్పోతాడు. యుద్ధభూమి నుంచి పారిపోయి వచ్చిన అతన్ని అందరూ ఎగతాళి చేస్తారు. ఇంటికి రాగానే భార్య అతనికి ఆడవారికి లాగా సపర్యలు చేస్తుంది. అతని స్నానానికి అడ్డుగా చీర కడుతుంది. ఒంటికి పులుముకునేందుకు పసుపు ముద్ద పెడుతుంది. తిక్కన తల్లి కూడా కొడుక్కి అన్నంలోకి విరిగిపోయిన పాలు పోస్తుంది. యుద్ధభయంతో వెన్ను విరిగిన తిక్కనను చూసి అతనిలాగే భయపడిన ఆవులు కాటు పోయిన పాలనిచ్చాయని చెబుతుంది. ఈ అవమానాలు తట్టుకోలేని తిక్కన తిరిగి యుద్ధభూమికి వెళ్ళి వీరోచితంగా పోరాడి ప్రాణాలు పోగొట్టుకుంటాడు. అతని చితిలో అతని భార్య ఆనందంగా దూకుతుంది.

భర్తలు, కొడుకులకు వెన్నుదన్నుగా ఉండి, అతని వీరత్వాన్ని ప్రోత్సహించడం, చనిపోయిన తరవాత వారితో చితిలోకి దూకడం ఈ జానపద ఇతిహాసాలలో స్త్రీలకు అమితాదర్శమైన ప్రవర్తన. మగవారిలా ప్రవర్తించే స్త్రీ అమితంగా ద్వేషించబడుతుంది. బ్రహ్మనాయుడి ప్రత్యర్థి నాయకురాలు నాగమ్మ అలాంటి స్త్రీ. ఆమె విధవ, గొడ్రాలు కూడా కావడం ఆమె వైపరీత్య ప్రవర్తనకి సూచికలు. ఆమె కుట్ర కుతంత్రాల వల్ల చివరికి రాజ్య నాశం, కుటుంబ నాశం రెండూ జరుగుతాయి.

ఈ కథలకి పూర్తి వ్యతిరేకం త్యాగప్రధానమైన ఇతిహాసాల లోని పాత్రలు. సన్యాసమ్మ కథలో మగ పాత్రలు ఆమె తండ్రి దాల్నాయుడు, అన్న రామినాయుడు, మొగుడు చెంచన్న, మరిది అప్పన్న. వీరిలో దాల్నాయుడు పల్లెత్తు మాట అనడు. తన కూతురు కష్టపడుతున్నా కూడా ఏమీ అనడు. చెంచన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయినవాడు, ఏడేళ్ళ తరవాత తిరిగివస్తాడు కానీ ఆత్మహత్య చేసుకున్నవాడు. భూస్వామ్య ఇతిహాసాలలో ఆత్మహత్య పిరికిపందల లక్షణం. అన్న రామినాయుడు కూడా తల్లిలా సన్యాసమ్మని సాకినవాడనే ఇతిహాసం మనకు చెబుతుంది కానీ వేరేరకంగా చూపదు. ఆమెకు జడలు వేయడం, బొట్టూ కాటుకతో సింగారించడం కూడా రామినాయుడే చేస్తాడు కానీ అతని భార్య పాపమ్మ చేయదు. చివరికి సన్యాసమ్మ వెళ్ళిపోతున్నప్పుడు రామినాయుడు ఆడదానిలా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. రామినాయుడు ఇలా స్త్రీ సహజమైన ప్రవర్తన చూపిస్తే, అతని భార్య పాపమ్మ పురుషబద్ధమైన లక్షణాలు చూపిస్తుంది. పిల్లను చూసుకోమని చెప్పినప్పుడు, ఇంటి ఆజమాయిషీలో తనకు కుదరదని ఆమె అంటుంది. ఇలా స్త్రీ పురుష పాత్రలు వాటి స్వభావాలకి విరుద్ధంగా ప్రవర్తించడం, ఈ జానపద వీరగాథలు పాడేవారు ప్రత్యేకంగా ఎత్తి చూపరు. ఈ వైరుధ్యాన్ని చాలా సామాన్యమైన విషయంగానే వివరిస్తారు.

ఈ సన్యాసమ్మ కథలో అప్పన్నది మరింత విచిత్రమైన పాత్ర. సన్యాసమ్మ ఏమీ తినలేదని తెలిసి అతను ఆమెకు పాలు తీసుకొని ఆమెకు ఇస్తాడు. ఆమె సగం తాగి అతనికిస్తుంది. అప్పన్న ఆ ఎంగిలి పాలు తాగుతాడు. కేవలం భర్త ఎంగిలి భార్య మాత్రమే తింటుంది. అది భర్త ఆధిపత్యానికి నిదర్శనం. ఈ సాంప్రదాయం అగ్రవర్ణాల వివాహాలలో కనిపిస్తుంది. దేవుడికి పెట్టిన ప్రసాదం దేవుడి ఎంగిలి. కానీ అది అందరికీ పూజనీయం. అప్పన్న సన్యాసమ్మ ఎంగిలి పాలు తాగడం ఆ మగ పాత్రకు ఇతిహాసం ఆపాదించిన స్త్రీత్వం. సన్యాసమ్మ ఆత్మత్యాగం చేసేముందు అప్పన్నకి పసుపు, కుంకుమ బహుమతిగా ఇస్తుంది. ఇవి స్త్రీత్వానికి చిహ్నాలు. పురుషులు ఎవరూ స్వీకరించరు. వీరచరితల్లో ఇవి ఇవ్వబోవడం, లేదా తీసుకోవడం మొగవారికి తీవ్రమైన అవమానం. కానీ త్యాగచరితల్లో వీటికి ఏ విశిష్టత ఇవ్వబడలేదు.

గౌణేతిహాసాలు
కట్టుదిట్టంగా మార్పుకు వీలులేని సమాజంలా పైకి కనిపించినప్పటికీ, భారతీయ సమాజం లోలోపల నిరంతరంగా మార్పు చెందుతూనే వున్నదని పరిశీలకులు ముందునుంచీ గమనించినదే. ఇలా, ఒక ప్రాంతపు ప్రధానమైన కులం లేదా వర్గంలో చేజేసుకున్న మార్పులని సంస్కృతీకరణ (Sanskritization), పాశ్చాత్యీకరణ (Westernization) వంటి సిద్ధాంతాలకు అన్వయించి, వివరించడానికి సాహితీవేత్తలు ప్రయత్నిస్తారు. ఈ వ్యాసంలో ఇప్పటిదాకా నేను ఉదహరిస్తున్న కులాలన్నీ కూడా సమాజంలో మార్పులను తెచ్చుకున్నవి. ఇందుకు మొదటి దాఖలా ఇప్పటిదాకా మౌఖికంగానే ప్రచారంలో ఉన్న ఈ వీరగాథలు లిఖిత సాహిత్యంగా రూపాంతరం చెందడంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయా కులాలతోనే ఇప్పటికీ అవినాభావంగా ఉండి, ఈ రూపాంతరాలు వారిలో వచ్చిన సామాజిక మార్పులను ప్రతిఫలిస్తుంటాయి. ఇలా మౌఖికేతిహాసాల రూపాంతర సాహిత్యాన్ని గౌణేతిహాసాలు (Secondary epic) అని పిలుస్తూ, వాటి లక్షణాలని నేను ఇక్కడ వివరిస్తాను.

గౌణేతిహాసాల లక్షణాలు ప్రధానంగా నాలుగు: 1. జానపదేతిహాసపు కృతికర్తగా ఒక రచయిత పేరును తథ్యం చేయడం, 2. వాటికి సంస్కృత పద్ధతిలో నామకరణం చేయడం, 3. జాతరలు, పండగలలో జానపదులను కాకుండా ఈ గాథల ప్రదర్శనకు చదువుకున్న వారిని అధికారికంగా ప్రదర్శించే హక్కు ఉన్న కళాకారులుగా ప్రోత్సహించడం, 4. ఈ ఇతిహాసాల స్త్రీ పాత్రలలో మార్పులు చేయడం.

నేను పైన పేర్కొన్న ఆరు వీరగాథలు ప్రధానంగా మౌఖిక ఇతిహాసాలు అయినప్పటికీ వాటన్నిటికీ లిఖిత రూపాంతరాలు వున్నాయి. వీటిలో కొన్నిటికి జతచేసి రచయిత పేరు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు కేవలం గౌణేతిహాసంగా మాత్రమే మనకు లభ్యమవుతున్న కన్యక కథ మినహా ఇతర వీరగాథలు మౌఖిక సారస్వతంగా ఇప్పటికీ నిలిచే వున్నాయి.

అక్కిరాజు ఉమాకాంతం తాళపత్రాల ఆధారంగా పల్నాటి కథలో ఒక భాగాన్ని పరిష్కరించి, కర్తృత్వం శ్రీనాథుడికి ఆపాదించడంతో సాహితీవేత్తలకు ఈ విషయంలో ఆసక్తి మెండయింది. తాళపత్ర ప్రతులు, ప్రచురిత పాఠాలను పరిశీలించి జానపద కళాకారులు, కాటమరాజు కథ ప్రదర్శనలో శ్రీనాథుడిని మూల రచయితగా పేర్కొనడాన్ని ప్రస్తావించిన తంగిరాల వెంకట సుబ్బారావు పరిశోధన వల్ల ఇలా కర్తృత్వాన్ని ఆపాదించడం ముందునుంచీ ఉన్నదనీ, వాటిని ప్రదర్శించే జానపద కళాకారులకు కూడా తెలుసనీ తెలుస్తుంది. బొబ్బిలి కథ రెండు రకాల ప్రచురణలలో మనకు దొరుకుతుంది. ఒక ప్రతిపై రచయితగా పెద్దాడ మల్లేశం పేరు కనిపిస్తుంది; రెండవ ప్రతి రచయిత పేరు లేనిది.

కన్యక కథ పరిస్థితి వేరు. ఈ కథకు ఎన్నో ప్రతులున్నాయి. ఈ కథ స్కందపురాణంలో భాగంగా రెండు సంస్కృత ప్రతులు, భాస్కరాచార్యుడు వ్రాసినట్టుగా చెప్పబడే తెలుగు గ్రాంథికభాషలో వ్రాసిన ఇంకో ప్రతి వున్నాయి. సంస్కృత ప్రతి 1950లో పెనుగొండలో, శ్రీవాసవకన్యకాపురాణము అన్న పేరుతో ప్రచురించబడింది. భాస్కరాచార్యుడి తెలుగు ప్రతి పేరు వైశ్యపురాణము, ప్రస్తుతం అలభ్యం. ఆ పైన 20వ శతాబ్దికి చెందిన ఎందరో కవుల రూపాంతరాలు కూడా వున్నాయి. ముఖ్యంగా 1956లో సత్యనారాయణ గుప్తా, 1968లో వెంకటస్వామి గుప్తా, వ్రాసిన వాటిలో ఇతిహాస కథకు ముందు వెనుక విపులంగా ఉపోద్ఘాతం, పీఠికలు ఇవ్వబడ్డాయి. కోమటి వారు, ప్రత్యేకించి విద్యాధికులు, ఈ లిఖిత రూపాంతరాలనే ప్రామాణికంగా భావిస్తారు. వైశ్య సాహిత్యవేత్తల తెలుగు రూపాంతరాలకు మూలం ఈ సంస్కృత ప్రతులే కావడం ఇందుకు నిదర్శనం. అప్పట్లో వీరికి పూజారులుగా, ఈ కథను ప్రదర్శించిన మైలారు కులస్థుల ద్వారా ఈ కథకు ఒక మౌఖిక రూపాంతరం ఇంకా ఉన్నదని తెలుస్తుంది. (ఈ విషయాన్ని సత్యనారాయణ గుప్తా తన ప్రతిలో నిర్ధారించడమే కాకుండా అందులోంచి ఎన్నో వాక్యాలు ఉదహరిస్తాడు కూడా.) మైలారపు వారిని తమ ఆచారవ్యవహారాలలో వినియోగించుకోవడం కోమటి వారు మానిన తర్వాత, ఈ రూపాంతరం మరుగున పడిపోయింది. ఇప్పటికీ ఈ కథను ప్రదర్శించే మైలారు గాయకులు లిఖిత రూపాంతరాన్ని దాని స్థానంలోకి తెచ్చుకున్నారు.

సరైన ఆధారాలు లేని కారణంగా మౌఖిక జనపదాలు లిఖిత సారస్వతంగా ఏ పరిస్థితుల్లో మార్పు చెందాయో కేవలం ఊహించగలం. శ్రీనాథుడో, ఇంకొక మహా కవో ముందుగా వ్రాసిన కథ ఆ తరువాత జానపదంగా రూపాంతరం చెంది ఉండవచ్చనే వాదనను పక్కకు పెడదాం. అప్పటికీ పల్నాటి కథను, కాటమరాజు కథను మహాకవులకు ఆపాదించడానికి, కన్యక కథ విషయంలో జరిగినట్టు జానపద సాహిత్యాన్ని సమూలంగా తుడిచేస్తూ సంస్కృత ప్రతులు ప్రాచుర్యంలోకి రావడం వెనుక కారణాలను విశ్లేషించడం ఆసక్తికరంగానే వుంటుంది. ఎందుకు బొబ్బిలి కథకు అజ్ఞాత కవి వ్రాసిన తాళపత్ర ప్రతి ఉన్నది? ఎందుకు సన్యాసమ్మ, కామమ్మ కథలకు తాళపత్ర ప్రతులు లేవు? అవి ఇప్పటికీ కేవలం జాతరలలో, దారిపక్క అమ్మే చవుకబారు ప్రచురణలలోనే, ఏ రచయిత పేరూ లేకుండా మాత్రమే ఇవి దొరుకుతాయి?

నాకు ప్రత్యేకించి ఆసక్తి కలిగించినది ఇది: ఈ వీరగాథలు లిఖిత సాహిత్యంగా మార్పు చెందటం, వాటికి కృతికర్తలని ఆపాదించటం వెనుక ఏ రకమైన ఆదర్శాల వ్యాప్తి కారణమయింది? ఈ విషయం గురించి తెలుసుకోవడానికి నేను చాలామంది జానపద కళాకారులతో ముచ్చటించాను. పల్నాటి కథ, కాటమరాజు కథ ప్రదర్శించే వారు చదువుకున్నవారు. వీరి దగ్గర ఈ కథల తాళపత్ర ప్రతులు వున్నాయని ఆరాధ్యుల పిచ్చయ్య, సుబ్బారావు తమ పరిశోధనకు సేకరించిన వివరాల ద్వారా తెలుస్తుంది. కానీ బొబ్బిలి కథ పాడే ఒక పాటగాడు చదువుకున్నవాడే అయినా అతని దగ్గర లిఖిత ప్రతి ఏదీ నాకు దొరకలేదు. సన్యాసమ్మ కథ, కామమ్మ కథ నాకోసంగా పాడిన కళాకారుడు చదువు రాని వాడు కావడంతో ఈ కథలు ప్రచురణలో ఉన్నాయని కూడా అతనికి తెలియదు.

పల్నాటి కథను ప్రస్తావిస్తూ రోగెయ్‌ర్ లిఖిత ప్రతికి, అది ప్రదర్శించే పద్ధతికి మధ్య ఎంతో వ్యత్యాసం వుందని పేర్కొన్నాడు. నేను రికార్డు చేసుకున్న కాటమరాజు కథ, బొబ్బిలి కథ కూడా పుస్తకాల పాఠానికంటే ఎంతో తేడాగా వున్నాయి. కన్యక కథ ఒక్కటే దీనికి మినహాయింపు. పోతే, దారిపక్క అంగళ్ళలో దొరికే పుస్తకాలైన సన్యాసమ్మ, కామమ్మ కథలు మౌఖిక సాహిత్యానికి చాలా దగ్గరగా ఉన్నాయి.

మౌఖిక సంస్కృతిలో రాతప్రతికి మనకు విస్మయం కలిగించేటంతటి సాధికారత ఉంది. (లిఖిత సంస్కృతులలో గాయకులకు ఉన్న ప్రత్యేకత వంటిదే ఇది.) ఇప్పటికీ, సాంప్రదాయులు పుస్తకాలని కాలితో తాకరు. వాటిని సరస్వతీ దేవితో సమానంగా గౌరవిస్తారు. పొరపాటున పుస్తకం అది ఏదైనా సరే, కాలికి తగిలితే వెంటనే కళ్ళ కద్దుకుంటారు. ఇలాంటి సంస్కృతిలో జానపద కళాకారుడికి తన తాళపత్ర ప్రతి పూజనీయం, ప్రామాణికం కావడంలో ఆశ్చర్యం లేదు. ఆ లిఖిత ప్రతి అతని ఇతిహాసానికి ఒక చట్టబద్ధమైన హోదాను కలగజేస్తుంది. క్రతునిర్వాహకుడిగా, ప్రదర్శకుడిగా ఈ కళాకారుడు రెండు పాత్రలు పోషిస్తాడు. క్రతువులో అతనికతనే అధికారి. అతని వాక్కు దేవి వాక్కు. (పల్నాటి కథలో అంకాళమ్మ దేవత వాక్కులా.) కానీ, ఒక ప్రదర్శకుడిగా, అతని హోదా పరిమితమైంది. అతనికి పోటిగా సంస్కృత రూపాంతరాలు వున్నాయి; విద్యాధికులైన అగ్రవర్ణాల ప్రదర్శకులు వున్నారు. కావ్యానికి ఉన్న గౌరవం కవి వల్ల వచ్చేది. వ్యాసుడు, వాల్మీకి వంటి కవులు దివ్యదృష్టి గల బ్రహ్మర్షులు. ఈ స్థితిలో లిఖిత ప్రతి ఆధారంగా లేని ప్రదర్శన కేవలం పుక్కిటి పురాణం గానే భావించబడుతుంది.

పల్నాటి కథ, కాటమరాజు కథ తాళపత్రాలు గమనిస్తే రెండు రకాల కృతికర్తలు కనిపిస్తారు. ఒకరు శ్రీనాథుడు, రెండవ వారు అంతగా పేరులేని రచయితలు. వీళ్ళ పేర్లు పీఠికలోనో ఆశ్వాసాంత గద్య లోనో కనిపిస్తాయి. అనేక సందర్భాలలో ఇవి లిఖిత రూపాంతరాన్ని నేర్చుకున్న జానపద ప్రదర్శకుల పేర్లుగా తెలిసిపోతుంది. కాకపోయినప్పటికీ వాళ్ళు సాదాసీదా రచయితలే. వారి గురించి గొప్ప గొప్ప కథలేమీ ప్రచారంలో ఉండవు. కానీ, శ్రీనాథుడి హోదా వేరు. కావ్యసంప్రదాయంలో మనకు అతను గొప్ప కవుల్లో ఒకడిగా మాత్రమే తెలుసు. కానీ జానపద సారస్వతంలో అతను మహా మహిమాన్వితుడు. కాటమరాజు కథ శ్రీనాథుడికి ఆపాదించిన వైనం గురించి ఒక పాటగాడు తంగిరాల సుబ్బారావుకి చెప్పిన కథ చూడండి:

శ్రీనాథుడు పల్నాటి వీరభాగవతం అనే గ్రంథాన్ని పాడుకునేందుకు వీలైన పద్ధతిలో రచించాడని యాదవులకు తెలిసి, వారు ఆయన దగ్గరికి వెళతారు. మాకు కాటమరాజు చరిత్ర రాసి పెట్టినట్టయితే మేము మీకు ఒక తూము బంగారు వరహాలు సమర్పించుకుంటామని ప్రాధేయపడతారు. శ్రీనాథుడు ఎంతో కష్టపడి యాదవభారతం పూర్తిగా రచిస్తాడు. కానీ యాదవులు అతి తెలివితో మాట మారుస్తారు. తూము అంటే గొడ్డలిలో కర్ర గుచ్చే కన్నం అని కూడా అర్థం ఉండడంతో, యాదవులు గొడ్డలి తూములో పట్టేటన్ని వరహాలు మాత్రమే ఇస్తారు. పట్టరాని కోపంతో శ్రీనాథుడు తాను వ్రాసిన తాళపత్ర ప్రతిని నదిలోకి విసిరివేస్తాడు. యాదవులు నదిలోకి దూకి ఎవరికి దొరికిన తాళపత్రాలు వారు తిరిగి పట్టుకొస్తారు. తాళపత్రాల వరుస ఏదో వాటిమీద లేకపోవడంతో ఏది మొదలో, ఏది చివరో, ఏది దేని తర్వాత వస్తుందో యాదవులకు తెలియదు. అంతే కాకుండా ఎలా పాడుకోవాలో కూడా ఆ పత్రాల మీద రాసిపెట్టి లేదు. యాదవులు కోపంతో వెళ్ళిపోతున్న శ్రీనాథుడి వెంటపడి, తాళపత్రాల వరుస చెప్పమని, కనీసం రాగం చెప్పమని ప్రాధేయపడతారు. పోగా పోగా తల్లి చేతిలో దెబ్బలు తిని ఏడుస్తున్న ఒక పిల్లాడిని చూసి, శ్రీనాథుడు కోపంతో “మీ చరిత్ర ఏడుస్తూ పాడుకోండి” అంటాడు. ఆ మాట అమాయకులైన యాదవులు యధాతథంగా ఆచరిస్తారు.

ఇలాంటి కథే అక్కిరాజు ఉమాకాంతం తెలియజేసినట్టు, రోగెయ్‌ర్ తన పల్నాటి కథ గురించిన పరిశోధనలో వివరిస్తాడు.

సంభోగ లాలసతో ఆరోగ్యం చెడగొట్టుకున్న శ్రీనాథుడు పల్నాటికి పోతాడు. అక్కడ చెన్నకేశవుడు కలలో కనిపించి పల్నాటి వీరుల కథ వ్రాయమని సూచిస్తాడు. ఆరోగ్యం బాగా లేని కారణంగా ఏడుగురు రాయసగాళ్ళని పెట్టుకొని, శ్రీనాథుడు రెండు నెలలలో పల్నాటి చరిత్ర పూర్తి చేస్తాడు. వెంటనే శ్రీనాథుడి ఆరోగ్యం కుదుటపడుతుంది కానీ మళ్ళీ అతను పెడదోవ పడతాడు. చెన్నకేశవుడు కోపంతో అతనికి కలలో కనిపించి అతని రచన అంటరానివారైన మాల, మాదిగ వారి చేతులలో పడుతుందని శపిస్తాడు. అందుకు బాధపడ్డ శ్రీనాథుడు తన ప్రతిని నదిలోకి విసిరేస్తాడు. ప్రవాహంలో ఆ తాళపత్రాలను మాల మాదిగలు చూసి సేకరిస్తారు.

ఇదే కథ పల్నాటి చరితం పాడేవారి దగ్గర విన్నట్టు రోగెయ్‌ర్ ధృవపరిచాడు. ఒక్క తేడా, ఆ కథలో వ్రాయసగాళ్ళు లంబాడీ తెగకు చెందిన వారు కావడం. ఈ కథలు ఈ చరిత్రల మూలాధారాన్ని మహిమాన్వితుడైన బ్రాహ్మణ కవికి అంటగట్టినప్పటికీ, వాటి పుట్టుక మాత్రం వాటిని వ్రాసుకొని, పాట కట్టుకున్న నిమ్నకులాల వారితోనే జత చేస్తాయి. ఈ చరిత్రల్లో వీరుల లాగానే, ఈ బ్రాహ్మణ కవి కూడా ఏదో ఒక తప్పు చేయడం, దానికి ప్రాయశ్చిత్తంగా చేసే పని ద్వారా ఒక ఉన్నతమైన స్థాయిని అందుకోవడం ఇక్కడ ఆసక్తి కలిగిస్తుంది. మహర్షి కావడానికి ముందు వారికి ఏదో ఒక కళంకం ఆపాదించడం ముందునుంచీ ఉన్నదే. మహాకవి కాకమునుపు వాల్మీకి అడవి దొంగ. మహాభారతం వ్రాసిన వ్యాసుడు పెళ్ళికి పూర్వం ఒక బెస్త యువతికి పుట్టినవాడు. చెన్నకేశవుడు కలలో కనిపించక పూర్వం, శ్రీనాథుడిది కూడా ఇదే స్థితి. కుదుటపడ్డ ఆరోగ్యాన్ని మళ్ళీ తన బలహీనతతో చెడగొట్టుకున్నవాడు; తన తొందరపాటు వల్లనే తన రచనని పోగొట్టుకున్నవాడు. కాటమరాజు కథలో అతని తప్పిదం గొల్లవాళ్ళ కుయుక్తిని గమనించలేకపోవడం. (తూము కొలత అందరికీ పరిచయమే అయినా, గొడ్డలి కున్న రంధ్రాన్ని తూము అని అనడం ఏదో కులానికి, వృత్తికి సంబంధించిన పర్యాయ పదం. అది ఇతరులకు తెలిసే వీలు అంతగా లేదు.)

ఈ రెండు కథలలోనూ ప్రధానంగా కనిపించేది ప్రతులు నదిలోకి విసిరి వేయబడడం. ఇది అనాదిగా వస్తున్న ప్రతీక. పవిత్రమైన జ్ఞానం పోగొట్టుకుని మాత్రమే తిరిగి పొందగలం. వేదాలు కూడా ఇలానే పోగొట్టుకోబడ్డాయి. సోమకుడు దొంగిలించి పాతాళంలో దాచిన వేదాలు మళ్ళీ విష్ణువు వద్దకు చేరతాయి. తమిళ కథనాలలో వేదాలు గుడికి వెళ్ళి తమను తాము పరిశుద్ధం చేసుకుంటాయి కూడా. అంతే కాదు, ఈ పవిత్ర జ్ఞానం పూర్తిగా కాకుండా కేవలం అరకొరగానే మానవులకు లభిస్తుంది. ఈ రచనలు విసిరివేయబడినవి పుణ్యనదులలో; నదులు సజీవమైన మౌఖికసాంప్రదాయానికి మారు రూపాలు. ఈ చరిత్రలలో అసంపూర్ణతను, నదిలో నుంచి వాటిని రక్షించిన వారికి వాటిపై సాధికారతను, ఈ ప్రతీకలు సూచిస్తాయి.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏ తాళపత్ర ప్రతిలోనూ పూర్తి కథ వుండకపోవడం. ఏ ప్రతిలో కూడా ఒకటీ లేదా రెండు ఘట్టాల కంటే ఎక్కువగా లేవని సుబ్బారావు, లక్ష్మీకాంతం తెలియజేస్తారు. పల్నాటి చరిత్ర పాడేవారు కూడా పూర్తి కథ పాడరని రోగెయ్‌ర్ చెప్తాడు. పాటగాళ్ళు, ఒక రాత్రి ప్రదర్శన గానో, రెండు రాత్రులకు గానో, పల్నాటి చరిత్రలో కొన్ని ఘట్టాలను మాత్రమే ఎన్నుకొని ప్రదర్శిస్తారు. (పూర్తి చరితను, ఒక్కో ఘట్టాన్ని కూడా కథగానే సంబోధిస్తారు.) ఈ కథలను ప్రచురించిన సంపాదకులు, తాళపత్రాలలో కథను మార్చలేదు కానీ, వాటిని సంకలించినప్పుడు ఏ కథ ముందు, ఏ కథ వెనుక అనే నిర్ణయం చేశారు. కథ చదివేటప్పుడు సంపూర్ణత కోసం, ఒక మొదలు, తుది ఉందని అనిపించడం కోసం చేసిన ఈ అమరిక వల్ల మౌఖికసాహిత్యం, లిఖిత సాహిత్య లక్షణాలను సంతరించుకుంది. గౌణేతిహాసాల పుట్టుకకి ఈ లక్షణాల మార్పు ముఖ్యకారణం.

అయితే ఈ మార్పు కొత్తదేమీ కాదు. తాళపత్ర ప్రతులలో కూడా మనం గమనించవచ్చు. ప్రదర్శించేటప్పుడు, ఒక్కో ఘట్టం ఒక సంపూర్ణమైన కథ. పాటగాడు ముందుగా కథకు ముందు జరిగిన కథను క్లుప్తంగా పరిచయం చేయడం ద్వారా కథలోకి దారి తీస్తాడు. ఈ పరిచయం, ఆ ప్రదర్శనకు స్వయంప్రతిపత్తిని ఇస్తుంది. లిఖిత ప్రతులలో ఈ పద్ధతికి భిన్నంగా కవి చెప్పుకునే ఉపోద్ఘాతం కనిపిస్తుంది. ఇందులో కవి, తన జీవిత చరిత్రను, తనను కావ్యం రాయడానికి ప్రేరేపించిన సంఘటనలను, కావ్యసంగ్రహాన్ని వివరిస్తాడు. మౌఖికేతిహాసాలలో ప్రదర్శకుడి పరిచయం సాధించే సంపూర్ణత, లిఖితేతిహాసాలలో కవి ఉపోద్ఘాతం సాధిస్తున్నదని స్పష్టపడుతోంది. అందువల్ల ఆధునిక పరిష్కర్తలు, తరతరాలుగా మౌఖిక సారస్వతం, లిఖిత సారస్వతంగా మారుతున్న స్రవంతిలో కేవలం పాలు పంచుకుంటున్నారు, తెలిసో తెలియకో, భాషలోనూ, కథన లక్షణాలలోనూ మార్పులకు కారణమవుతున్నారు.

ఈ మార్పుకి ఉదాహరణ గౌణేతిహాసాల పేర్లలో కనిపిస్తుంది. పల్నాటి కథగా జానపదంలో పిలవబడే కథ, ప్రచురణలో ‘పల్నాటి వీర భాగవతము’గా మారింది. శ్రీనాధుడిని ఆదర్శంగా తీసుకున్నానని చెప్పుకున్న రచయిత ఒకరు తన కాటమరాజు కథ రచనకు ‘యదు శాస్త్రము’ అని పేరు పెట్టాడు. కన్యక కథలో ఈ ఉదాహరణ మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భాస్కరాచార్యుడికి ఆపాదించిన రచన ‘శ్రీ వాసవీ కన్యకా పురాణము’ కాగా, జానపద ప్రదర్శకులు ‘కన్యక అమ్మవారి కథ’ అని సంబోధిస్తారు.

గౌణేతిహాసము అనే భావన పుట్టుకకు, ఒక కొత్త రచయిత, ఒక కొత్త పేరు అనే రెండు లక్షణాలు మౌలికమైనవి. భాషలో వచ్చే మార్పులు కాలక్రమేణా వచ్చే మార్పులు. అవి రచయిత విద్వత్తు మీద, పెట్టిన పేరుకు సరిపోయే విధంగా రచనను మార్చుకోవడం మీదా ఆధారపడినవి. ఈ మార్పులు కన్యక కథలో పూర్తిగానూ, పల్నాటి, కాటమరాజు కథల్లో కొంత మటుకు కనిపిస్తాయి. అలాగే బొబ్బిలి కథలో నామమాత్రంగా కనిపించే ఈ మార్పులు సన్యాసమ్మ, కామమ్మ కథలలో మనకు కనిపించవు.

కన్యక కథను తమదిగా చేసుకున్న కోమటి కులస్తులు వైశ్య వర్ణార్హత కోరుకున్నవారు. (భారతీయ చాతుర్వర్ణ వ్యవస్థలో భాగంగా.) ఆ ఆదర్శానికి బ్రాహ్మణీయత అవసరమైంది. ఈ అవసరం బ్రాహ్మణ మహర్హి అయిన భాస్కరాచారుడితో తీరింది. మైలారు కులస్థుల వల్ల ఈ అర్హత వారు పొందలేరు. అందువల్ల, కోమటివారు సంస్కృత కావ్యాన్ని ప్రమాణంగా చేసుకున్నారు; మైలారు పూజారులను తిరస్కరించారు. ఈ మార్పు వల్ల మౌఖిక సాహిత్యం పూర్తిగా మరుగున పడిపోయి, దాని స్థానే ఆ సాహిత్యపు గౌణేతిహాసపు రూపం ప్రాచుర్యం లోకి వచ్చింది.

ఈ సంస్కృత గౌణ రూపంతరం, కన్యక కథను ఎన్నో రకాలుగా మార్చివేసింది. అందులో మొదటిది, కాల స్వరూపం. జానపదులకు కాలం ఒక పొడుగైన గీత లాంటిది. దానిపై ఋతువులు, సంఘటనలు ఒక వరుసలో వస్తూ వుంటాయి. జానపద కథలలో కాలం తరిగిపోదు. జననం నుంచి మరణానికి, తిరిగి జననానికి సాగిపోతూ వుంటుంది. ఇందుకు విరుద్ధంగా పురాణాలలో కాలం వర్తులమైనది. క్రమేణా క్షీణిస్తూ అది కలియుగానికి చేరుతుంది. కన్యక కథ గౌణ రూపం సృష్టి, ప్రతిసృష్టి, మన్వంతరం, వంశం, వంశానుచరిత అనే ఐదు లక్షణాలు కలిగి ఈ పురాణ కాలక్రమంలో చూపించబడింది. ఈ క్రమంలో, కన్యక కుటుంబం ఒక ఫలానా మన్వంతరంలో వుంటారు. ఈ కథ చెప్పబడే చోటు దేవలోకానికి మారుతుంది. గంధర్వుడు ఒకడు, వైశ్య యువతిని మోహిస్తాడు. కానీ ఆ యువతి అతనితో వివాహం నిరాకరిస్తుంది. గంధర్వుడు వైశ్యులను శపించడంతో వారు భూలోకంలో జన్మించి అగ్ని ప్రమాదంలో నాశనమౌతారు. ప్రతిగా గంధర్వుడిని ఒక దౌర్భాగ్యపు జీవితం గడిపి హీనమైన మరణం పొందే మానవుడిగా పుట్టమని శపిస్తారు. భూమిపై పుట్టడానికి విముఖత చూపిన వైశ్యులను, వర్తక వ్యాపారాలతో సమాజంలో సుస్థిరత తేవడం కోసం వారు వెళ్ళక తప్పదని దేవతలు ఆదేశిస్తారు. అలా భూమి పైకి వచ్చిన వైశ్యులు చివరిలో అగ్ని ద్వారా శివ సాయుజ్యం పొందుతారు. గంధర్వుడు రాజు గానూ, వైశ్య యువతి కన్యక గానూ పుట్టిన తరువాత ఇదే కథ భూలోకంలో మళ్ళీ జరుగుతుంది.

రెండవ మార్పు, కన్యక పాత్ర నేపథ్యానిది. జానపద ఇతిహాసంలో కన్యక కథానాయిక. తన ఆత్మాహుతి చేసుకోవడం, వైశ్య కులపు మగవారిని తనతో పాటు ఆత్మత్యాగం చెయ్యమనడం, వైశ్యకులస్తులు పాటించవలసిన ఆచార వ్యవహారాలు నిర్దేశించడం, పెనుగొండను రాజు నుంచి కాపాడడం – ఇలా అన్ని నిర్ణయాలు ఆమె స్వయంగా తీసుకుంటుంది. గౌణరూపాంతరంలో కూడా కన్యక కథానాయికే. కానీ, ఇందులో ఆమె పార్వతీదేవి అవతారం. సర్వజ్ఞుడైన కవి, బ్రాహ్మణుడైన భాస్కరాచార్యుడు ఆపత్కాలంలో వైశ్యులకు ఆసరాగా నిలుస్తాడు. తన దివ్యదృష్టితో అంతా తెలిసిన వాడై, అత్మాహుతి ప్రయత్నాలలో ఉన్న వైశ్యులకు, రాజుకి కాలయాపన చేసే ఉపాయాన్ని చెప్తాడు. తద్వారా, కన్యక కోమటి కులానికి ప్రతినిధిగా మరుగున పడిపోయి, బ్రాహ్మణీయతతో పార్వతి అవతారంగా వెలుగులోకి వచ్చింది.

దేవతాకన్య – పతివ్రత
కన్యక పాత్ర నేపథ్యంలో వచ్చిన మార్పు, జానపద వీరగాథల గౌణ రూపాంతరాలు ప్రభావితం చేసిన మార్పులలో భాగం. అవివాహిత అయిన కన్య త్యాగచరితలలో ప్రధానంగా కనిపిస్తుంది. ఆ కన్యను వివాహిత స్త్రీగా చూపబూనడం భూస్వామ్య ఆదర్శాలకు అనుగుణమైన ఔచిత్యం. సంస్కృతంలో కన్యక అంటే అవివాహిత యువతి, అక్షతయోని, కుమారి. జానపద ప్రదర్శకులు సన్యాసమ్మను సత్యవతి – నిజం మాత్రమే పలికేది – అని కన్యగా సంబోధిస్తారు. ఈ కథలన్నీ కథానాయిక శీలసంపదను ఆధారం చేసుకున్నవి. ఎన్నిరకాలుగా ఎవరు ప్రయత్నించినా ఆమె తన శీలాన్ని ఎప్పటికీ పోగొట్టుకోదు, వివాహమైనప్పటికీ శీలవతిగానే ఉండే ఈ పాత్ర, భర్త మరణంతో దేవతగా అవతరిస్తుంది. తన శీలసంపద ఇచ్చిన మహత్వ శక్తి వల్ల ఆ దేవత తనకు హాని చేయబోయిన వారిని శిక్షిస్తుంది.

పితృస్వామ్య సమాజాల నుంచి వచ్చిన సాహిత్యంలో స్త్రీత్వం మీద భయము, అపోహలతో కూడిన ఆరోపణలు కనిపిస్తాయి. మగవారికి రెండు రెట్లు ఆహారం, ఆరు రెట్లు శృంగారం ఆడవారికి అవసరం అని ఒక సంస్కృత ఆర్యోక్తి. మగవారు రతిలో వీర్యాన్ని కోల్పోతారు. ఆడవారు ఆ వీర్యాన్ని సంగ్రహిస్తారు. సుమతీ శతకం మగవారు, గుఱ్ఱాలు రతి వల్ల, ఆడవారు రతిలేమి వల్ల ముసలితనం పొందుతారని చెప్తుంది. మగవాడు కానివాడు స్త్రీ అని భావిస్తారు. అందువల్ల నంపుంసకులని ఆడవారిగా సంబోధిస్తారు. కానీ, జానపద వీరగాథలలో స్త్రీలు ఇందుకు భిన్నంగా కనిపిస్తారు. శీలం వీరికి ప్రధానం. మగవాడితో కలవడం ద్వారా స్త్రీలు తమ శీలాన్ని, తద్వారా తమ ప్రభావాన్ని పోగొట్టుకుంటారు. అందువల్లనే దేవతగా మారడానికి శీలం ప్రధానమైనది. ఆ కన్యాత్వపు మహిమ వల్లనే వారు దేవతలుగా శపించిగలిగేది, దీవించగలిగేది.

దేవతాకన్యకు ఎంతో విరుద్ధమైనది పతివ్రత. ఈమె తన భర్తకు తన జీవితాన్ని అంకితం చేయడం వల్ల శక్తి కలిగినది. భర్త ఎటువంటి వాడైనప్పటికీ – వృద్ధుడైనా, కురూపి అయినా, కోపిష్టి అయినా, దరిద్రుడయినా – మనసా, వాచా కర్మణా అతనినే పూజిస్తూ ఉండేది పతివ్రత. కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, శయనేషు రంభా… అని సంస్కృత శ్లోకం పతివ్రతల లక్షణాలను సూచిస్తుంది. పురాణాలలో కనపడే పతివ్రతలు — సీత, సావిత్రి, దమయంతి, అనసూయ — అందరూ కూడా కష్టాలను ఎదుర్కొని తమ పాతివ్రత్యం నిరూపించుకున్నవారే. సీత అగ్నిప్రవేశం చేసింది; నలుడు జూదంలో రాజ్యం కోల్పోయిన తర్వాత దమయంతి కష్టాలు పడింది; సావిత్రి యముడి నుంచి తన భర్తను దక్కించుకుంది; అనసూయ, నగ్నంగా తమకు భోజనం పెట్టమని అడిగి తనకు పాతివ్రత్య పరీక్ష పెట్టిన దేవుళ్ళను పసి పిల్లలుగా మార్చింది. ఇక్కడ ముఖ్యంగా గమనించదగింది ఒకటుంది. ఈ పతివ్రతలకు మానావాతీత శక్తి కేవలం వారి పాతివ్రత్యానికి ప్రమాదం వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఇతర పరిస్థితులలో వారు అబలలు గానే కనిపిస్తారు.

దేవతాకన్య వివాహమైన తరవాత కూడా అక్షతయోని గానే మిగిలిపోతుంది; పతివ్రత తన భర్తకు మాత్రమే అంకితమయింది. తన శీలానికి ఆపద వాటిల్లినప్పుడు దేవతగా అవతరిస్తుంది కన్యక; శీలాన్ని పతికే అర్పించి అతనికంటే ముందు మరణించి దేవత అవుతుంది పతివ్రత. దేవతాకన్య శపించగలదు, దీవించగలదు; పతివ్రత తన శీలానికి ప్రమాదం వచ్చినప్పుడే శపించగలదు. దేవతాకన్య తన కులానికి కొత్త ఆచారాలు ఏర్పరచగలదు; పతివ్రత కులగౌరవాన్ని, ఆచారాలని కేవలం సంరక్షిస్తుంది. స్థూలంగా ఇవి దేవతాకన్యకు, పతివ్రతకు ఉన్న తేడాలు.

కన్య పాత్ర స్వభావాన్ని మార్చి పతివ్రతకు దగ్గరగా చూపడంలో కాల క్రమేణా త్యాగ చరితల ఆదర్శాలలో వచ్చిన మార్పు కనిపిస్తుంది. కన్యక అమ్మవారి జాతరలో వచ్చిన మార్పు ఒకటి ఇక్కడ ప్రస్తావిస్తాను. అది కన్యకను పెనుగొండ ఆలయపు దేవుడు, శివుడి రూపమైన నాగరేశ్వర స్వామికి ఇచ్చి కళ్యాణం చేయడం. మంగళ సూత్రం కన్యక మెడలో అలంకరించడం ద్వారా, ఆమె శివుడి భార్య పార్వతిగా, ఒక పతివ్రతగా చూడబడుతుంది.

గత కొన్ని దశాబ్దాలలో కోమటి వారి ఆదర్శాలలో వచ్చిన మార్పులు కన్య్క కథను మరింతగా మార్చివేశాయి. విద్యా ఉద్యోగాలను ఆశించడం, కవులుగా, పండితులుగా సాహిత్య సృష్టి చేయడం, ఇత్యాది వ్యవహారాలతో కోమటి వారు బ్రాహ్మణులకు దీటుగా నిలవాలని ఆశించారు. దోమ వెంకటస్వామి గుప్తా అటువంటి ఒక పండితుడు, కవి. అంతే కాకుండా పంచాంగ కర్త కూడా కావడంతో ముహూర్తాది విషయాలలో తన కులం వారికి సలహాలు ఇచ్చేవాడు. గుప్తా వంటి పండితులందరూ, కన్యకాపురాణములో బ్రాహ్మణీయ ప్రభావాన్ని పునఃపరిశీలించారు. గుడిలో పూజచేసే బ్రాహ్మణ అర్చకులు కన్యకను ఆ పేరుతో కాకుండా, రాజరాజేశ్వరిగా సంభోధిస్తారని, బ్రాహ్మణ అర్చకులు గుడిలో ప్రసాదం తాము స్వయంగా తినరనీ, కేవలం భక్తులకు పంచుతారనీ, గుడిలో వేదం చదవరు, ఉపనయన ఆచారం ఉన్నప్పటికీ గాయత్రి మంత్రాన్ని కోమటి వారికి నేర్పరనీ గుప్తా గమనించాడు. కోమటి భక్తులు ఒక సందర్భంలో గుడిలో పురుషసూక్తం పఠిస్తే బ్రాహ్మణులకు నచ్చలేదని గుప్తా ఆరోపించాడు.

ఇతర కోమటి పండితులు కూడా కన్యక కథను పరిశోధించి కన్యకకు శివుడితో వివాహం జరగలేదని స్పష్టం చేశారు. కన్యక కుమారి గానే మిగిలిపోయింది కాబట్టి ఆమె ఆదిశక్తి అవతారం. చారిత్రక ఆధారాలు చూపించి భాస్కరాచార్యుడి పాఠాంతరం తరవాతి కాలంలో చేర్చినది అని ఆక్షేపించారు. కన్యక తన కులంలో స్త్రీలు ఎవరూ అందంగా జన్మించరని శాపం పెట్టడాన్ని కూడా వారు ఆక్షేపించారు. అలాగే వైశ్య యువతిని వాడు ఎటువంటి వాడైన సరే కేవలం బావకే ఇచ్చి పెళ్ళి చేయాలన్న నియమాన్ని కూడా వారు ఖండించారు. మేనరికపు వివాహాలు కులానికి హాని చేస్తాయని వారు నమ్మారు, అటువంటి అనర్థం కలిగించే నియమాలు, అందవిహీనులుగానే పుట్టాలనే శాపాలు తమ కుల దేవత ఎప్పటికీ పెట్టివుండదనీ వాదించారు.

ఇందుకు వ్యతిరేకంగా, పల్నాటి, కాటమరాజు కథల కర్తృత్వం శ్రీనాధుడికి ఆపాదించినప్పటికీ ఆ కథల్లో చెప్పుకోదగ్గ మార్పులేమీ చోటు చేసుకోలేదు. సమాజంలో పైకి త్వరగానే ఎదిగినందువల్ల ఈ కథల గౌణేతిహాసాలలో చాలా కొద్ది మార్పులే జరిగాయి. ఈ రకమైన మార్పు కొంతలో కొంత కాటమరాజు కథలో కనిపించడానికి కారణం గొల్ల కులపెద్దల ప్రయత్నాల ద్వారా అర్థం చేసుకోవచ్చును. ఆ పెద్దల్లో ముఖ్యుడైన ఆరాధ్యుల పిచ్చయ్య, తన కులస్తులను వైదీక ఆచారాలను పాటించమని ఉద్బోధించేవాడు. కాటమరాజు కథకు పాఠాంతరాలు ప్రచురించడంలో ఎంతో ముఖ్యపాత్ర వహించాడు. ఆ ప్రచురణల ముందుమాటలో విద్యావిహీనులైన కొమ్ముల వాళ్ళు కథను భ్రష్టు పట్టించారని వాదించాడు. కాటమరాజు కథ పూర్వకవి విరచితమనీ అందువల్ల అందులో దోషాలు లేవనీ బలంగా అభిప్రాయపడ్డాడు.

బొబ్బిలి కథకు దొరుకుతున్న రెండు ప్రచురణలలో, ఒకటి రెండవదానికంటే సంగ్రహమైనది. మొదటి ప్రతి మల్లంపల్లి సోమశేఖర శర్మ 1956లో పరిష్కరించి ప్రచురించడంతో వెలుగు లోకి వచ్చింది. రెండవది జాతరలలో, దారి పక్క అంగళ్ళలో పెద్ద బొబ్బిలిరాజు కథ అన్న పేరుతో అమ్మే చిత్తు ప్రతి. ఇందులో బొబ్బిలి, విజయనగరం రాజుల మధ్య కోడిపందెం జరిగినట్టు ఒక కథ వుంది. పల్నాటి కథ నుంచి ప్రభావితమైనట్లు స్పష్టంగానే తెలుస్తుంది. ఇది సమీప ప్రాంతాలలో ఉండే జానపద ఇతిహాసాలు పరస్పరం ప్రభావితం చేసుకుంటాయన్న వాదనకు బలాన్నిస్తుంది. అయినప్పటికీ ఈ రెండు ప్రచురణలకీ, మౌఖిక పాఠాంతరానికి పెద్దగా తేడా కనిపించదు.

బొబ్బిలి సంస్థానపు పెద్దలు మౌఖికమైన వీరగాథకు గానీ, లిఖిత ఇతిహాసానికి కానీ అంతగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. బ్రిటీషువారి ప్రాబల్యంలో వారు క్షత్రియుల హోదాను, పాశ్చాత్య జీవన విధానాన్ని కోరుకుని ఆచరించారు. వారి ప్రోత్సాహంతో ప్రచురణకు నోచుకున్న పాఠాంతరాలలో ముఖ్యమైనది దిట్టకవి నారాయణ కవి 18వ శతాబ్దంలో వ్రాసిన రంగరాయ చరితము. జానపద వీరగాథలు ఇప్పటికీ ప్రదర్శిస్తున్నా, వెలమ కులస్తులు ఈ కవి విరచిత గౌణసాహిత్యాన్ని ఎక్కువగా ఆదరిస్తారు. సన్యాసమ్మ, కామమ్మ కథలతో మమేకమైన కులాలు, ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవడంతో తమ కథల్లో వారు ఆదర్శంగా పెట్టుకున్న స్తోమత వారికి అందుబాటులోకి రాలేదు. ఈ కథలకు లిఖిత ప్రతులు లేకపోవడం వీరి ఆర్థిక, సామాజిక బలహీనత వల్లనే అనిపిస్తుంది. బొబ్బిలి, సన్యాసమ్మ, కామమ్మ కథలు 18వ శతాబ్దానికి చెందినవి కాగా పల్నాడు, కాటమరాజు, కన్యక కథలు ఎంతో పురాతన కాలం నుంచీ వున్నవి. ఒక వీరగాథ ఇతిహాసంగా మారడానికి ఎంతో కాలం పడుతుంది.

ముగింపు
ఈ వ్యాసంలో ఉదహరించిన ఆరు వీరగాథలలోనూ కథలో ప్రధాన పాత్ర మరణానికి భయపడదు. అయితే ఆ పాత్రలు మరణాన్ని ఎలా అహ్వానించాయి అన్న అంశం ఆధారంగా ఈ కథలను వీరచరితలు, త్యాగచరితలుగా వేరు చేయగలం. ఒక్కొక్క చరితకు ప్రత్యేకమైన పాఠకులు, పాత్రధారులు ఉండటం వల్ల ఈ చరితలను ఆ ప్రత్యేక కులం లేదా వర్గపు జీవన విధానానికి అనుసరణగా గమనించాలి. కాలక్రమేణా ఒక కులపు ఆదర్శాలలో వచ్చిన మార్పులను ఆ కులాలు ఆచరితల్లో ప్రతిఫలించుకున్నాయి. ఈ కథలు ఇతిహాసాలుగా పేర్కొనడానికి కారణం, కథ నిడివి, ప్రదర్శనా పద్ధతి, వంటి కావ్య లక్షణాల వల్ల కాదు. సమాజంలో ఒక వర్గపు ఆదర్శాలు, ఆకాంక్షలలో చారిత్రకంగా వచ్చిన మార్పులకు నిలువుటద్దంలా నిలవడం వల్ల ఈ వీరగాథలు ఇతిహాసాలుగా గౌరవించబడుతున్నాయి. ఈ ఇతిహాసాలను తమవిగా భావించే ఆ కులాలవారికి ఇవి నిజంగా జరిగిన సంఘటనలు. ఇవి వారికి కథలు కావు. ఒక కథకు నిజత్వం రావడానికి ఆ కథను తమదిగా చేసుకున్న కులం తమ ఆదర్శాలను అందులో వ్యక్తం చేసుకోవడం ద్వారా ఈ విధంగా తోడ్పడుతుంది.
-------------------------------------------------------
రచన: మాధవ్ మాౘవరం, 
మూలం: వెల్చేరు నారాయణరావు,
ఈమాట సౌజన్యంతో

No comments: