Wednesday, April 3, 2019

యథార్థ చక్రం -5


యథార్థ చక్రం -5





సాహితీమిత్రులారా!

నిన్నటి తరువాయి....................

అప్సరసల సౌందర్యమే నందుడి మనస్సులో నిలిచి పోయింది. వారి పొందుకోసం తపో దీక్షలో నిమగ్నమయ్యాడు.

చపలచిత్తమైన మనస్సుని నియంత్రించడం కష్టంగా ఉన్నా కఠోర దీక్ష పాటిస్తున్నాడు నందుడు.

మెల్ల మెల్లగా సుందరి రూపం కనుమరుగవుతోంది నందుడి మనస్సులో ! ఇప్పుడతని ధ్యాస ఆ అప్సరసల వైపు మళ్ళింది.

భార్యా విముఖుడైన నందుణ్ణి చూఇ ఆనందుడు ఆశ్చర్యపోయాడు. అదే విషయం నందుడితోనూ అన్నాడు.

” నీ అకుంఠిత దీక్ష చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఇలా నియమ పాలన చేయడం సామాన్యులకు బహు దుర్లభమైన విషయం! నీవు అవలీలగా ఇలా చేయడం చూస్తే ఈ కుటీరంలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కోపిష్టివాడికి సహనం, లోభికి ధన వ్యామోహ రహితం, కామికులకు బ్రహ్మచర్యం సులభం కావు. నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ”

ఆనందుడి మాటలు విని చిన్నగా నవ్వాడు నందుడు.

ఆనందుడు బౌద్ధ ధర్మం గురించి ప్రస్తావించాడు.

” ఇంధనం వల్ల అగ్ని, జలం తో సాగరం, భోగాల వల్ల విషయ వాసనలు ఎప్పటికీ తృప్తి చెందవు. మనస్సుని నియంత్రించే బ్రహ్మచర్యం వల్ల ఆనందం లభిస్తుంది. అవ్యాజమైన సంతోషం లభిస్తుంది. కోరికలు తుంచివేస్తే నెమ్మ నెమ్మదిగా బంధాలు కూడా వాటంతటవే తెగుతాయి. ఆత్మానందం చేరుకోవడం అప్పుడే సాధ్యం! అప్సరసలకోసం నువ్వు ఈ దీక్ష పాటిస్తున్నావని అందరూ అనుకుంటున్నారు, ఇది నిజమేనా? లేక పరిహాసమా? ”

“అప్సరసల కోసమేనా ఈ దీక్ష” అన్న మాటలు నందుడి మనస్సుని బలంగా తాకాయి. సిగ్గుతో తలవంచుకున్నాడు. ఆనందుడు వెళ్ళాక నందుడు తపస్సులో మనస్సు లగ్నం చేయలేకపోతున్నాడు. ఆనందుడు అన్న మాటలు నిజమేనా? తను అప్సరసలకోసం తపోదీక్ష మొదలుపెట్టినది నిజం. కానీ మెల్ల మెల్లగా మనస్సుని నియత్రించగల ధైర్యం వచ్చింది. ఆనందుడి మాటలు తను అబద్ధం అని నిరూపించగలడు. తనకి ఆ సామర్థ్యం, నియమ పాలన అలవాటయ్యాయి. తనూ జయించగలడు, ఈ విషయవాంచలని. ఒక్కసారి అతని కి జ్ఞానోదయమయ్యింది.
నియమ బద్ధుడై తపోదీక్షలో మునిగి పోయాడు.
రాత్రి పగలూ, ఎండా వానా లెక్క చేయకుండా నందుడు అకుంఠిత దీక్షా బద్ధుడవ్వడం చూసి తథాగతునికి సంతోషం వచ్చి ఓ సారి నందుణ్ణి ప్రశ్నించాదు.

“ప్రియ నందా! సుందరిపైన ఆలోచనలు నీ యోగ దీక్షని భంగపరచడం లేదు కదా?”

” ఓ భగవానుడా! ఈ యోగ దీక్షలో నిమగ్నమైన నా మనసుని సుందరే కాదు..ఈ ప్రపంచంలో ఎవ్వరూ సమీపించలేరు. ఈ యోగంలో ఆత్మానందం ఉంది…ఏదో తెలియని ఒక అనుభూతి శరీరాన్ని, మనసుని దూదిపింజలా చేస్తోంది…ఈ ఆనందం ఇలాగే ఉండాలని నా ఆకాంక్ష! ”

నందుడు మాటలు విని బుద్ధుడూ ఆనందించాడు.

తనంతట తానుగా బౌద్ధ ధర్మాన్ని నందుడికి బోధించాడానికి ఉపక్రమించాడు బుద్ధుడు.



యశోధర వెచ్చి వెళ్ళాక సుందరికి మనో ధైర్యం వచ్చింది. ముందుగా నందుణ్ణి కలవాలి. కానీ నగర వెలుపల బౌద్ధ కుటీరంలోకి తనని రానిస్తారా? భిక్షువులకి తప్ప సామాన్యులకి ప్రవేశం ఉంటుందా? ఇంతకాలం యశోధర ఒక్క సారి కూడా ఆ కుటీరం వైపు వెళ్ళకపోవడం ఆశ్చర్యకరమే! యశోధర సాయంతో తను ఆ కుటీరాన్ని చేరలేదు. మరి నందుణ్ణి కలవడం ఎలా? ఇలా పరి పరి విధాల నందుణ్ణి ఎలా కలవాలా అని ఆలోచిస్తోంది సుందరి.

మహారాణి మాయావతి బుద్ధ కుటీరాన్ని తరచు దర్శిస్తుంది. కనుక ఆమెతో తన గోడు చెప్పుకొని సహాయం అర్థిస్తే?

ప్రస్తుతానికిదొక్కటే మార్గం అనుకుంటూ సుందరి మహారాణి మాయావతి నివాసం వైపుగా వెళ్ళింది.

మాయావతిని చూడగానే సుందరికి ఒక్కసారి దుఖం కట్టలు తెంచుకొచ్చింది. మాయావతి సుందరిని దగ్గరగా తీసుకొని, తల నిమురుతూ అంది.

” నాకంతా తెలుసు బాధ పడకు! సిద్దార్థుడు కారణజన్ముడు. తన తమ్ముడైన నందుణ్ణి సరి అయిన మార్గం వైపు మళ్ళించి మంచిపనే చేసాడు. నువ్వు అంతగా చింతించనవసరం లేదు.
నువ్వు కూడా ఆ బుద్ధుని ప్రవచనాలు వింటే నా మాటలు నిజమని నమ్ముతావు..”

సుందరి ఈ మాటలకి ఒక్కసారి అవాక్కయ్యింది.

“మహారాణీ! మీకు నాకూ, నందుడికీ మధ్య ప్రేమ తెలుసు. మేము ఒకరిని విడిచి మరొకరు ఉండలేని వారమనీ తెలిసి ఇలా అనడం ఆశ్చర్యంగా ఉంది. బుద్ధ భగవానుడంటే నాకూ గౌరవమే! ఆ మహానుభావుడి ప్రవచానాలు కర్ణ ప్రియమే! కానీ నా ప్రియుడ్నే ఆ ప్రవచనాలు నాకు దూరం చేస్తే నేను సహించలేకపోతున్నాను. నా నందుణ్ణి ఎలాగైనా ఒకసారి కలవాలి. దానికి మీ సహాయం కావాలి.”

“నా సహాయం ఎందుకు సుందరీ! నువ్వు ఆ ఆశ్రమమానికి వెళ్ళ వచ్చు! నిన్ను ఎవ్వరూ అడ్డుకోరు..”

“స్త్రీలకి ప్రవేశం లేదు…అని విన్నాను”

“బౌద్ధ భిక్షునిగా అవ్వడానికి స్త్రీలకి కొన్ని నియమాలు ఉన్నాయి కానీ సామాన్యులెవరైనా ఆ ప్రవచానాలు వినవచ్చు. అనేకమంది స్త్రీలు ప్రతీ దినమూ ఆ ప్రవచనాలు విని తమ భర్తలని బౌద్ధం వైపు మళ్ళిస్తూ, భిక్షువులవడానికి దోహదం చేస్తున్నారు…” మాయావతి అంది.

“స్త్రీలందరూ తమ తమ భర్తల్ని భిక్షువులుగా మారుస్తున్నారా? మరి వారి సంసారాలు ఎలా సాగుతాయి?”

“ఆ స్త్రీలే గృహసంవిధాన బాధ్యతలూ నిర్వహిస్తారు..అందులో తప్పేముంది? ”

“తప్పేముందా? ఇది అన్యాయం…భర్తలందరూ భిక్షువులుగా మారితే, స్త్రీలందరూ ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఉండాలా? సంసారం అంటే భార్య భర్తలిద్దరూ కలిసి ఉండాలి. అంతే కానీ ఇలా పెళ్ళయిన ప్రతీ పురుషుడూ సన్యసిస్తే, ఇహ వివాహమెందుకు..ఈ సంతానమెందుకు? అయినా ఇది సృష్టి విరుద్ధం! ప్రతి స్త్రీ పురుషుడుకి దూరంగా ఉంటూ పుట్టిన ప్రతీ మగాణ్ణి ఇలా భిక్షువులుగా మారిస్తే…ఇదంతా ఒక గందరగోళంగా ఉంది…మీరవ్వరూ ఈ విషయాన్ని బుద్ధుడి వద్ద ప్రస్తావించలేదా? ” గట్టిగా అంది సుందరి.

“నీ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు. ఆ తథాగతుడే నీకు సరిగ్గా చెప్ప గల వ్యక్తి. వెళ్ళి కలు…”

సుందరి కోపాన్నంతా అణచుకుంటూ అంది.

“అడుగుతాను. సృష్టి విరుద్ధమైన ఈ సన్యాసం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటని ఆ బుద్ధుణ్ణే సరా సరి అడుగుతాను. నా నందుణ్ణి నాకివ్వమని అర్థిస్తాను.”

అక్కడనుండి బయల్దేరి బుద్ధుడి కుటీరంవైపుగా వెళ్ళింది. దూరంగా రథాన్ని ఆపించి, తన పరివారాన్ని వెనక్కి పంపించి, కుటీర ద్వారం వైపుగా వెళ్ళింది.

కొంతమంది భిక్షువులు సుందరి రాకును గమనించారు. ఆ భుక్షువుల్లో ఒకరు సుందరికి తెలుసు. అతన్ని గుర్తుపట్టింది సుందరి. ఇంతకుముందు అతను రాజాస్థానంలో ప్రముఖ వ్యక్తి.

“బుద్ధ భగవానుణ్ణి కలవాలి..” అంది.

ఆ భిక్షువేమీ మాట్లాడ లేదు. మౌనంగా ఇటు రమ్మన్నట్లు సైగ చేసాడు. సుందరి అతణ్ణి అనుసరించింది.

అతను ఒక కుటీరం వైపు తీసుకెళ్ళాడు. ఒక్కడ తథాగతుడు నందుడికి ప్రవచనాలు బోధిస్తున్నాడు. బుద్ధుదు సుందరి రాకను గమనించాడు కాని నందుడు తల తిప్ప లేదు.

అక్కడే ఉండమన్నట్లు బుద్ధుదు సైగ చేసాడు. వారిద్దరూ ఆగి పోయారు. ప్రవచనాలు మధ్యలో ఆపి బుద్ధుడు సుందరి వైపుగా వచ్చాడు.

దూరాన్నుడి నందుణ్ణి గుర్తు పట్టింది సుందరి.

నందుడు వెనక్కి కూదా చూడకుండా కుటీరంలోకి వెళిపోయాడు.

ఇదంతా చూస్తూ నమ్మశక్యంగా లేదు సుందరికి. నల్లగా నిగ నిగలాడే శిరోజాలతో అత్యంత సుందర రూపుడైన నందుడు, శిరోముండనం చేయించుకొని కాషాయాలు ధరించి…తనని తన రాకని ఏ మాత్రం గమనించకుండా ఉండడం…ఇది కలా..నిజమా!

తను లేనిదే క్షణ కాలం కూడా ఉండలేని నందుడు ఇలా సర్వ సుఖాలు పరిత్యజించి…

సుందరికి దుఖం ముచుకొచ్చింది..నందుడి రూపంకేసి చూస్తూ ఒక్క సారి కళ్ళు బైర్లు కమ్మాయి. ఎప్పటికైన తన నాధుడు తనకు దక్కుతాడు అన్న నమ్మకం ఒక్క సారి కుప్ప కూలిపోయింది.

అచేతనంగా క్రింద పడిపోయింది! పడింది సుందరి కాదు…ఆమే మనో నిబ్బరం…

( ఇంకా ఉంది…)
-------------------------------------------------------
రచన: సాయి బ్రహ్మానందం గొర్తి, 
ఈమాట సౌజన్యంతో

No comments: