Saturday, June 2, 2018

ధరభుజగైణసింహములఁ దద్గణ


ధరభుజగైణసింహములఁ దద్గణ



సాహితీమిత్రులారా!

తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసం లోనిదే
ఈ పద్యం-

ధరభుజగైణసింహములఁ దద్గణవేణ్యవలోకనద్వయో
దరములకోడి వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులన్ గుహాం
తరములఁ బూన నిక్కఁ దిన డాఁగ స్రవింపఁగ నూర్పులూర్ప స
త్వరముగ నేఁగి నీడఁ గని తత్తఱ మందఁగఁ జేసి తౌ చెలీ.

ఇది చాగంటి శేషయ్యగారు 1951లో ప్రకటించిన ఆంధ్రకవితరంగిణిలో (సంపుటం 8; పుట 39) తెనాలి రామకృష్ణుని చరిత్రలో, ‘చాటుపద్యమణిమంజరి నుండి యుద్ధృతము’ అని ఉదాహరించిన పద్యపాఠం. ఇది చాటుపద్యమని పేర్కొంటూనే, శేషయ్యగారు “ఈ పద్యము మనకు లభ్యము కాని యేకందర్పకేతువిలాసములోనిదో యై యుండునని నాయభిప్రాయము” అని కూడా సూచించారు. 1951లోనే అచ్చయినవే, ఆంధ్రకవితరంగిణి మరికొన్ని ప్రతులలో ‘దరభుజగైణసింహముల’ అన్న పాఠం కూడా ఉన్నది. అది సవరణ పాఠమై ఉంటుంది.

పద్యార్థాన్ని పరిశీలిద్దాము. కావ్యనాయిక అందాన్ని ఆమె చెలికత్తె మెచ్చుకొంటున్నదని తెలుస్తూనే ఉన్నది. అయితే, పద్యం ముమ్మొదటను ఉన్న ‘ధర’ అన్న ఉపక్రమణికకు అర్థం లేదు. అది, ఈ భూమియందు అని అర్థం చెప్పుకొని కేవలం పాదపూరకమని సరిపుచ్చుకోవటానికి వీలులేని స్థానంలో ఉన్నది. ధర భుజగైణసింహములన్, అన్నది కర్మార్థకమైతే, దానికి ‘ఓడి’ మొదలైన ధాత్వర్థాలతో ఫలాశ్రయత్వం లేదు. తత్+గణ అన్నప్పుడు ఆ ‘గణ’ శబ్దానికి అర్థం లేదు. అన్వయం లేదు. అంతకంటె, దరభుజగైణసింహముల అన్న పాఠం మేలు. ‘స్రవింపఁగ’ అన్న పదానికి పద్యంలో అన్వయం లేదు.

వేటూరి ప్రభాకరశాస్త్రిగారి చాటుపద్యమణిమంజరికి 1988లో వెలువడిన తృతీయ ముద్రణ ప్రతిలో ఈ పద్యపాఠం ఈ విధంగా ఉన్నది:

దరభుజగైణసింహములఁ దద్గతవేణ్యవలోకనద్వయో
దరముల కోడి వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులన్ గుహాం
తరములఁ బూన నిక్కఁ దిన డాఁగ స్రవింపఁగ నూర్పులూర్ప స
త్వరముగ నేఁగి నీడగని తత్తఱ మందఁగఁ జేసి తౌ చెలీ.

ఇందులోనూ మొదటి పాదంలో ‘తత్+ గత’ అన్నదానికి అన్వయం లేదు. మూడవ పాదంలో ‘స్రవింపఁగ’ అని ఉన్నదానికి అర్థాన్వయాలు రెండూ లేవు. ‘స,త్వరముగ నేఁగి’ అన్న క్త్వాంత దళానికి కారకాన్వయం కనబడదు. మొదటి పాదంలో ‘తద్గళ’ అన్న పాఠాన్ని స్వీకరిస్తే, నిర్దేశకార్థాన్ని నాయికా సంబుద్ధితో అన్వయింపవలసివస్తుంది. అదీ కుదరదు.

పై ఇద్దరికంటె మునుపే, 1893లో శ్రీ గురుజాడ శ్రీరామమూర్తిగారు తమ కవిజీవితములు (పు.241)లో చూపిన పాఠం:

దర, భజ, గేణ, సింహములు తద్గళ, వే, ణ్యవలోకనద్వయో
దరముల కోడి, వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులం గుహాం
తరముల పూన నిక్క, తిన డాఁగ, స్రవింప, నిటూర్పులూర్చ స
త్వరముగ నేఁగి నీడఁగని తత్తరమందఁగఁ జేసి తౌ చెలీ.

ఇందులోనూ పైని పేర్కొన్న దోషజాతం ఉండనే ఉన్నది. కాగా, మూడు పాఠాలలోనూ మూడవ పాదంలో యతి తప్పింది. గుహా(న్త)రముల – (డాఁ)గ అన్నప్పుడు అనుస్వారసంబంధ యతి చెల్లదు. కనుక దోషం. భుజగేణసింహములు అన్నచోట అపసంధి. పద్యంలో అర్థాన్వయం ఎలాగూ లేదు.

పై మూడు పాఠాలలోని దోషాలను సవరిస్తే, రామలింగకవి పద్యం ఈ విధంగా ఉంటుంది:

దర, భుజ, గైణ, సింహములు త్వ ద్గళ, వే, ణ్యవలోకనద్వ, యో
దరముల కోడి – వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులన్ గుహాం
తరములఁ – బూన, నిక్కఁ, దిన, దాఁగ; భ్రమింపఁగ, నూర్పు లూర్ప, స
త్వరముగ నేఁగ, నీడఁ గని తత్తరమందఁగఁ జేసి తౌఁ జెలీ!

‘తద్గళ’ అన్న నిర్దేశానికి అర్థం లేదు. చెలికత్తెను సంబోధిస్తున్న మాట కాబట్టి – త్వత్ + గళ అని ఉండాలి. ‘డాఁగ’ అన్నప్పటి యతిదోషం దాఁగ అని సవరించుకొంటే సరిపోతుంది. అది ‘స్రవించటం’ కాదు – ‘భ్రమించటం.’ స్రవింపఁగ అన్నదానిని భ్రమింపఁగ అని దిద్దుకోవాలి. లేకపోతే పద్యార్థం బోధపడదు.

పద్యభావం ఇది: ఓ చెలీ! లోకంలో ఉపమానద్రవ్యములైన 1) దర (శంఖము) 2) భుజగ (పాము) 3) ఏణ (జింక) 4) సింహము అన్నవి వరుసగా నీయొక్క 1) గళ (కంఠము) 2) వేణి (జడ) 3) అవలోకనద్వయ (కనుగవ) 4) ఉదరములకు సాటిరాలేక – అంటే, దరము గళానికి, భుజగము వేణికి, ఏణము కన్నుగవకు, సింహము ఉదరానికి సాటి కాలేకపోయాయి. ఆ అవమానభారం వలన –

దరము గళమునకున్ ఓడి – వారిధిపదంబులన్ పూనన్; భ్రమింపఁగన్.
శంఖము గళానికి ఔపమ్యలోపం వలన సముద్రతలంలో తలదాచుకొనవలసి రాగా; భ్రమింపఁగన్ = తిరుగుళ్ళు పడగా (శంఖం నీటిలో భ్రమింపవలసిరావటం – కొట్టుమిట్టుకులాడుతుండటం అని ఒక అర్థం; తిరుగుళ్ళు అంటే శంఖానికి దక్షిణావర్తము, వామావర్తము అని భేదాలేర్పడటం అని మరొక అర్థం).

భుజగము వేణికిన్ ఓడి – పుట్టలన్ నిక్కన్; ఊర్పులు + ఊర్పన్.
పాము ఆమె జడకు సాటిరాలేక పుట్టలలో నిక్కవలసిరాగా (అనగా, తలదాచుకొనవలసిరాగా), ఊర్పులు + ఊర్పన్ = చేసేది లేక నిట్టూర్పవలసి ఉండటం (బుసలుకొడుతూ ఉండిపోవటం).

ఏణము అవలోకనద్వయమునకున్ ఓడి – పూరులన్ తినన్; సత్వరముగన్ ఏఁగన్.
జింక ఆమె కన్నుల వంటి అందమైన కన్నులు తనకు లేవన్న అవమానంకొద్దీ పూరి మేయవలసిరాగా (దురవస్థకు లోనయిందని భావం), ఆ బెదురు కారణాన పరుగులు తీయవలసిరాగా.

సింహము ఉదరమునకున్ ఓడి – గుహాంతరములన్ దాఁగన్; నీడఁ గని తత్తరమున్ + అందఁగన్.
సింహము ఆమె నడుము వంటి సన్నని నడుము తనకు లేనందువల్ల (ముఖం చెల్లక, సిగ్గుతో) గుహాంతర్భాగంలో దాగి ఉండేట్లుగా, తన నీడను చూసి తానే భయపడేట్లుగా.

ఒనర్చితివి = చేశావు. ఔన్ = అవును, ఇది నీకే తగును – అని ప్రశంసార్థం.
పద్యంలో క్రమాన్వయం సార్థకంగా ఉండటం వల్ల ఇది యథాసంఖ్యమనే అలంకారం. మెడ, జడ, కన్నులు, నడుము అన్న నాలుగు ఉపమేయవస్తువుల శోభాతిశాయిత వల్ల శంఖము, పాము, జింక, సింహము అన్న వస్త్వంతరాలను అణగింపజేశాడు. ఇది మీలనము అనే అలంకారమని కావ్యాలంకారసంగ్రహంలో భట్టుమూర్తి. ఇది పద్యంలోని అలంకారశోభ. తెనాలి రామలింగకవి వర్ణనానైపుణికి, పద్యరచనాకౌశలికి, అతివిస్తారమైన వ్యుత్పత్తిగౌరవానికి, అనల్పకల్పనాశిల్పానికి, చిత్తవిస్తారరూపమైన చమత్కృతధోరణికి నిదర్శకాలైన పద్యాలివి. దురన్వయాలను సరిచేసి సమన్వయించుకొంటే విశేషార్థాలు వెల్లడవుతాయి. మహాకవుల శబ్దసాగరం ఎంత లోతైనదో తెలిసివస్తుంది.
----------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు
ఈమాట అంతర్జాల మాసపత్రిక సౌజన్యంతో

No comments: