Sunday, March 17, 2019

అలుసవుతోన్న అమ్మ భాష


అలుసవుతోన్న అమ్మ భాష




సాహితీమిత్రులారా!

భాష అనేది మనిషి తన మనసులోని భావాన్ని ఎదుటి వారికి తెలియజేయడానికీ లేదా సమాచారాన్ని ఒక చోటి నుంచి మరోచోటికి చేరవేయడానికీ ఉపయోగపడే ఒక సాధనం. ఈ భాష ఒక నదీ ప్రవాహం లాంటిది. నది, తను పుట్టినచోట బయలుదేరి అనేక ప్రాంతాలగుండా ప్రవహిస్తూ దారిలో అనేక ఖనిజ లవణాలనూ, మలినాలూ మొదలైన పదార్థాలను తనలో ఇముడ్చుకుంటూ సముద్రంలో కలిసిపోయినట్టే, భాషకూడా పుట్టిన తరువాత ఒక తరం నుంచి మరో తరానికీ, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికీ ప్రవహిస్తూ అనేక మార్పులకూ చేర్పులకూ లోనవుతూంటుంది. భాష మన ఆలోచనలకు ఓ రూపాన్నిస్తూ, తద్వారా మన సంస్కారాన్నీ, సామాజిక స్థాయినీ ప్రతిబింబిస్తుంది. భాష ఒకవైపు సమాజాన్ని ప్రభావితం చేస్తూనే మరోవైపు అనేక ప్రభావాలకు లోనవుతుంది. ప్రస్తుతం తెలుగుభాషను ప్రభావితం చేస్తున్న కొన్ని అంశాలనూ, అవి మన భాషపై ఆదరణ తగ్గడానికి ఏ రకంగా కారణమవుతున్నాయన్న వివరాలనూ ఇక్కడ చర్చిస్తాను. దానితోపాటు నాకు తోచిన కొన్ని పరిష్కార మార్గాలను కూడా సూచిస్తాను.

కారణాలు
సహజ సిద్ధమైనవి: దేశ కాలమాన పరిస్థితులను బట్టి ప్రతి భాషలోనూ మార్పులు వస్తాయి. ఇప్పటి తెలుగు భాషకూ కొన్ని తరాల ముందరి తెలుగు భాషకూ తేడా ఉన్నట్టే కాలంతో పాటుగా వచ్చే మార్పులు ఇవి. ఈ మార్పులు సహజ సిద్ధమైనవి. క్రొత్త పదార్థాలనూ, ప్రక్రియలనూ, యంత్రాలనూ, విషయాలనూ కనుగొంటున్న కొద్దీ వాటికి సంబంధించిన పదాలు కూడా భాషలో చేరుతూ ఉంటాయి. రైలు, బస్సు, పంట్లాం, ఇంటర్నెట్‌ వగైరా విరివిగా వాడబడేవి ఇతర భాషలనుంచి తెలుగులోకి వచ్చిన పదాలకు ఉదాహరణలు. వీటికి సంబంధించిన అనువాదాలు కృతకంగా ఉండడంతో పరభాషల నుంచి వచ్చిన పదాలే ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటాయి. అదేవిధంగా భారతీయ భాషల నుంచి ఆంగ్లంలోకి వెళ్ళిన పదాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటికి ఉదాహరణలు మంత్ర, గురు, నిర్వాణ, యోగ అనే పదాలు. ఈ రకమైన సహజ సిద్ధమైన మార్పులను ఎవరూ ఆపలేరు.
ఆర్థిక పరమైనవి: ఆర్థిక శాస్త్రంలోని ఓ ముఖ్యమైన అంశం ఉత్పత్తికీ వినియోగానికీ ఉన్న అవినాభావ సంబంధం. వినియోగం ఎక్కువగా ఉన్నప్పుడు సరఫరా కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం ఆంగ్లభాష తెలిసిన వారికి ఉపాధి అవకాశాలు ఎక్కువా, తెలుగు మాత్రమే వచ్చిన వారికి తక్కువా కాబట్టి తెలుగు భాష నేర్చుకోవలసిన అవసరం తగ్గుతోంది. ప్రతివారూ తమ పిల్లలకు తెలుగు భాషను నేర్పించడంలో కన్నా, ఇంగ్లీషు, స్పానిష్‌, ఫ్రెంచ్‌, జెర్మన్‌ వగైరా భాషలను నేర్పించడంలోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారన్న విమర్శ ఉన్నా ప్రతి ఒక్కరి మనుగడకూ మంచి ఉద్యోగం అవసరం కాబట్టి ఉపాధి అవకాశాలను బట్టే భాషాజ్ఞానం కూడా ఏర్పడుతోంది. ఏ భాషకైనా అవసరం పెరిగినప్పుడు, దానిపై అభిమానం పెరుగుతుంది. అభిమానం పెరిగినప్పుడు ఔన్నత్యం దానంతటదే వస్తుంది. తెలుగు భాష యొక్క అవసరం తగ్గడం ప్రస్తుత సమస్యకు ఒక ముఖ్య కారణం.
విద్యాపరమైనవి: వైద్య, సాంకేతిక, వ్యవసాయ శాస్త్రాలూ మొదలైన శాఖల్లో ఉన్నత విద్యంతా ఆంగ్ల మాధ్యమంలోనే సాగుతోంది. దీనివల్ల, ఒక స్థాయి దాటిన తరువాత విద్యలో తెలుగు వాడకం తగ్గుతోంది. అదీకాక, తెలుగు కాకుండా ఇతర భాషలను పాఠ్యాంశాలుగా ఎన్నుకునే వీలుతోబాటు, తెలుగులో మార్కులు తక్కువ వస్తాయన్న కారణంగా తెలుగు నేర్చుకునే అవకాశం తగ్గుతోంది.
సామాజిక పరమైనవి: ఏ కారణం చేతోగానీ మన తెలుగు వారికి మాతృభాషలో సంభాషించడం పెద్ద నామోషీ. పొరుగింటి పుల్లకూర రుచి మనకు తెలిసినట్టుగా వేరెవరికీ తెలియదేమో అందుకే తెలుగువారు తెలుగులో తప్ప వచ్చీ రాని మరే భాషలోనైనా సంతోషంగా సంభాషిస్తారు. మన భాషపై మనకున్న చిన్న చూపువల్లో, ఇతర భాషల్లో మాట్లాడ్డం గొప్ప విషయంగా భావించడం వల్లో మన భాష మనవల్లే అలుసవుతోంది.
సాంకేతికాభివృద్ధి: దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం మన దేశంలో వచ్చిన కేబుల్‌ టీవీ మన సంస్కృతిని బాగా మార్చేసింది. ఒకానొకప్పుడు వారానికొకసారి ప్రణయ్‌రాయ్‌ చదివే ‘వరల్డ్‌ దిస్‌ వీక్‌’ వార్తాంశాల్లో తప్ప మనకి కనబడని ఎన్నో విషయాలు అనునిత్యం మన కళ్ళ ముందుంటూ బయటి ప్రపంచంపై మనకున్న అవగాహనను బాగా పెంచేశాయి. అంతేకాక దూరదర్శిని కారణంగా పుస్తక పఠనం బాగా తగ్గిపోయింది. టెలిఫోన్లు, ఈ – మెయిల్స్‌ వల్ల అందరిలోనూ ఉత్తరాలు రాసే అలవాటు బాగా తగ్గిపోయింది. ఏ భాష మనుగడకైనా వినడం, మాట్లాడడం, చదవడం మరియు రాయడం అనే నాలుగంశాలు చాలా ముఖ్యం. సాంకేతికాభివృద్ధి కారణంగా తెలుగు చదవడం, రాయడం అనే అంశాలు బాగా దెబ్బతిన్నాయి.
ప్రపంచీకరణ: ఆర్థిక, సాంకేతికాభివృద్ధుల కారణంగా విదేశాల్లో అవకాశాలు పెరుగుతూ, విదేశాల్లోని అవసరాలు మన దగ్గరకు వస్తూ ప్రస్తుతం ప్రపంచమంతా వసుధైక కుటుంబంలా తయారవుతూ, ఒకే భాషా, ఒకే సంస్కృతి అన్నట్టుగా మారుతోంది. ప్రపంచీకరణ వల్ల ప్రపంచం అంతా మనకు దగ్గరవుతోండగా, మన భాష మాత్రం మనకు దూరమవుతోంది. భాషాసంస్కృతులు ఒక దానితో ఒకటి ముడిపడి ఉంటాయి కాబట్టి మారుతోన్న మన సంస్కృతితో బాటుగా మన భాషకూడా మారుతోంది.
ఒకప్పుడు భాషలో వచ్చే మార్పులకు కొన్ని తరాలు పడితే, ఈ ఆధునిక యుగంలో ఒక్క తరంలోనే ఎన్నో మార్పులను చూస్తున్నాం. భవిష్యత్తులో తెలుగు మాట్లాడే వారి సంఖ్యలో పెద్దగా మార్పు రాకపోవచ్చు కానీ తెలుగును రాసే లేదా చదివే వారి సంఖ్య మాత్రం క్రమంగా తగ్గిపోతోందన్నది అందరూ గమనించవలసిన విషయం. మార్చలేనీ, మార్చకూడనీ విషయాల గురించి మనం ఏమీ చెయ్యలేకపోయినా వ్యక్తిగతం గానూ, వ్యవస్థాపరం గానూ భాషాపరి రక్షణకై మనం చేపట్టవలసినవి కొన్ని ఉన్నాయి. అందులో కొన్ని:

సంస్కరణ అన్నది ముందు వ్యక్తిలోనూ తరువాత వ్యవస్థలోనూ జరగాలి. తెలుగులో మాట్లాడ్డం చిన్నతనంగా భావించకుండా, ఘనమైన చరిత్ర ఉన్న ఒక ఉన్నత భాషను మాట్లాడ గలుగుతున్నందుకు ప్రతి తెలుగువాడూ గర్వించాలి. తేనెలూరే తెలుగు భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదించి, ఆనందించడం ఒక వరంగా భావించాలి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆత్మావలోకనం చేసుకోవాలి.
అందరూ పుస్తక పఠనాన్ని అలవరచుకోవాలి. అది మెదడుకు మంచి వ్యాయామాన్నిచ్చే ప్రక్రియ. మంచి సాహిత్యం దొరకడం లేదని సాకు చెప్పకుండా, మనం ఆదరిస్తే మంచి ప్రతికలూ, నవలలూ అవే వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అనేక రకాల వ్యాపకాలూ, వినోద సాధనాలూ, దూరదర్శనీ ఉన్నా అమెరికా లాంటి దేశాల్లో పుస్తక పఠనం ఇంకా బాగానే కొనసాగుతోంది. కారణం, సాహితీ విలువలు తగ్గకుండా ప్రచురణలు రావడం.
ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలోనూ, కనీసం ఇంటర్మీడియట్‌ వరకూ తెలుగును తప్పనిసరి పాఠ్యాంశంగా చెయ్యడమే కాక కళాశాలా, స్నాతకోత్తర విద్యల్లో కూడా ఏదో ఒక స్థాయిలో తెలుగును పాఠ్యాంశంగా చెయ్యాలి. అంతేకాకుండా సంస్కృతం, హిందీలతో పోల్చినప్పుడు తెలుగులో తక్కువ మార్కులు వస్తాయన్న అపప్రధ కూడా పోవాలి. ప్రశ్నకు తగిన జవాబు రాసినప్పుడు అర్హమైన మార్కులను వెయ్యాలి. ర్యాంకులనేవి ప్రతిభకు ప్రమాణాలుగా మారిపోయి, ఒకటి రెండు మార్కుల్లోనే భవిష్యత్తంతా మారిపోతున్న ఈ రోజుల్లో సరిగా మార్కులు రాని తెలుగు భాషను ఎంచుకోవడానికి విద్యార్థులు సుముఖత చూపించరు. విద్యావిధానమే భాషను విద్యార్థులకు దూరం చేయకుండా తగిన చర్యలు తీసుకుని, తెలుగు భాషలో పరీక్షా విధానాన్ని సరిచెయ్యాలి.
అనేక ప్రభుత్వ మరియు ఇతర ప్రవేశ లేదా పోటీ పరీక్షల్లో తెలుగు భాషకు సంబంధించిన పరీక్షలను కూడా చేర్చాలి. ఉన్నత విద్యకూ, ఉపాధికీ తెలుగు అవసరం అయినప్పుడు అందరూ తప్పని సరిగా నేర్చుకుంటారు.
భాష విషయంలో పత్రికల పాత్ర తక్కువేమీ కాదు. చదువుకునే రోజుల్లో కేవలం తరగతి పుస్తకాలు మాత్రమే చదువుతాము. దిన, వార, మాస పత్రికలను జీవితాంతం చదువుతాము. కాబట్టి పత్రికలలో వాడే భాషా, ప్రచురితమయ్యే అంశాలూ మన మీదా మన భాషమీదా ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. నిత్యం చదివే అనేక విషయాల్లో ఆంగ్ల పదప్రయోగం వల్ల వాటికి ప్రత్యామ్నాయ తెలుగు పదాల ఉనికి దెబ్బతింటోంది. వార్తా పత్రికల్లోనూ, ఇతర పత్రికల్లోనూ ఉన్నత భాషా ప్రమాణాలను పాటిస్తూ తద్వారా భాషాభివృద్ధికి దోహదం చెయ్యాలి. అలాగే మంచి సాహితీ విలువలున్న శీర్షికలనూ, భాషకు సంబంధించిన వ్యాసాలనూ ప్రచురించాలి.
చలన చిత్రాల్లోనూ, దూరదర్శినిలోనూ ఆంగ్లభాషా వినియోగాన్ని బాగా తగ్గించాలి. వ్యాపార ప్రకటనల్లో కూడా తెలుగు వాడకాన్ని ప్రోత్సహించాలి. ఒకప్పుడు చలన చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాదుకు రావడానికి మన రాష్ట్రప్రభుత్వం అనేక రాయితీలను ఇచ్చింది. అలాగే, నిర్దేశించిన దాని కన్నా ఎక్కువ శాతం చిత్రనిర్మాణం కనుక రాష్ట్రానికి బయట జరిగితే అధిక పన్నులు వసూలు చెయ్యడం లాంటివి జరిగేవి. అదేవిధంగా మోతాదుని మించి ఆంగ్లభాషా ప్రయోగం జరిగిన చిత్రాలపై పన్నులు వెయ్యడమో, రాయితీలు తగ్గించడమో చేసి తెలుగుభాషా వినియోగాన్ని ప్రోత్సహించాలి. దూరదర్శినీ, చలనచిత్రాల ప్రభావం భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్ర దేశంలో చాలా ఉంది కాబట్టి ఈ మాధ్యమంలో చేసే ముఖ్య సంస్కరణలు భాషాభివృద్ధికి తోడ్పడతాయి.
ఏ సాంకేతిక పరిజ్ఞానం అయితే భాషపై దుష్ప్రభావం చూపించింది అనుకున్నామో, దాన్నే భాషాభివృద్ధికి వాడుకోవాలి. దూరదర్శినిలో వచ్చే కార్యక్రమాల ప్రభావం ఎదిగే పిల్లలపై బాగా ఉంటుంది. కాబట్టి పిల్లలను ఆకట్టుకునే విధంగా మంచి కార్యక్రమాలను రూపొందించాలి. ఉదాహరణకు, అమెరికాలో ‘డోరా ది ఎక్స్‌ ప్లోరర్‌’, ‘బ్లూస్‌ క్లూస్‌’, ‘బార్నీ’ లాంటి కార్టూన్‌ మరియు ఇతర కార్యక్రమాలకు ఎంతో ప్రాచుర్యం ఉంది. వినోదం రూపంలో ఉన్న విద్యా కార్యక్రమాలు ఇవి. తెలుగులో అలాంటి పాత్రలు లేవు. ఇతర దేశాలకు మన ప్రతిభను అరువిచ్చిన తెలుగువారు స్వంతగడ్డపై ప్రయోజనానికి కూడా అదే పరిజ్ఞానాన్ని వాడాలి. ప్రజల మనసులను హత్తుకునే విధంగా కార్టూను పాత్రలను స్పష్టించి, ప్రసార కార్యక్రమాలు రూపొందించి. వాటిద్వారా తెలుగు భాషనూ, ఇతర విద్యాంశాలనూ బోధించాలి.
ఈ విధంగా వ్యిక్తి గతంగానూ, సమాజ, ప్రభుత్వ పరంగానూ తీసుకోగలిగిన చర్యలెన్నో తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడతాయి. ఇవన్నీ కష్టమైనవీ, క్లిష్టమైనవీ, ఖర్చుతో కూడుకున్నవీ కావు. మానసిక వికాసానికి తోడ్పడే పుస్తక పఠనంలో కష్టమేముంది? తెలుగు పరీక్షల్లో మార్కులు సరిగా వెయ్యడంలో క్లిష్టతేముంది? రాసే వార్తల్లోనూ, తీసే చిత్రాల్లోనూ, చేసే ప్రసారాల్లోనూ తెలుగు వాడడానికి ఖర్చేముంది? కావలసిందల్లా ఒక్క క్షణం ఆగి ఆలోచించడం. ప్రజలూ, ప్రభుత్వమూ, వినోద ప్రసార మాధ్యమాలూ ఒక్క క్షణం ఆలోచించి, చిన్న నిర్ణయం తీసుకుంటే చాలు. ఆ చిన్న నిర్ణయమే అంతులేని ప్రభావాన్ని చూపి కొద్ది సంవత్సరాల్లోనే తెలుగుభాషకు పునర్వైభవాన్ని ఇస్తుందని నా ప్రగాఢ విశ్వాసం.

అమ్మ భాషను అలుసు చెయ్యకుండా దాని అభివృద్ధికి ప్రతి ఒక్కరం కృషి చేద్దాం.*
--------------------------------------------------------
రచన: సురేంద్ర కె. దారా, 
ఈమాట సౌజన్యంతో
--------------------------------------------------------
అదనం-
ఇంటి భాషంటే ఎంత చులకనో!

భాషను కేవలం కొన్ని కులాల వాళ్ళే పుట్టించారు. వివిధ కులాల వాళ్ళు వాళ్ల వృత్తుల్ని బట్టి, అవసరాలను బట్టి పదాలను పుట్టిస్తూ, వాడుతూ ఉండటం వల్ల ఆ భాష అభివృద్ధి చెందుతుంది. అన్ని పదాలూ మాగ్రంథాల్లోనే ఉన్నాయనే అహంకారం పనికిరాదు. అన్ని కులాల వాళ్ల భాషనూ, వాళ్ళు వాడే పదాల్నీ నిజాయితీగల భాషా శాస్త్రజ్ఞుడు గుర్తిస్తాడు, గౌరవిస్తాడు, గ్రంథంస్తం చేస్తాడు. కొన్ని కులాల వాళ్ళ భాషనూ, వాళ్ళువాడే పదాలను అపహాస్యం చేస్తూ, నీచంగా భావిస్తూ, అసలు గ్రంథాల్లోకి ఎక్కత గని భాషగా చిత్రీకరిస్తూ, భాష సంపన్నం కాకుండ గతంలో అడ్డుతగిలారు. అలా అడ్డుతగిలే పని ఈనాటికీ చేస్తూనే ఉన్నారు. మన పల్లె భాషను గౌరవించుదాం. మన పక్కెలు, జెల్లలు, గెడ్డలు, మదుములు, పరసలు, పరజలు,… ఇంకా నీచమని భావించి మన సంస్కృతాభిమాన పండితులు వదిలేసిన తెలుగు పదాలన్నీ తెలుగు నిఘంటువుల్లోకి ఎక్కిద్దాం. కొల్లేరు ప్రక్షాళన కార్యక్రమం ఎలా జరుగు తుందో చూద్దామని వెళ్ళిన విలేఖరులకు అక్కడి ప్రజలు ఎన్ని రకాల చేపలు, పక్షులపేర్లు చెప్పారో చూడండి: మట్టగిడస, కర్రమోను, బొమ్మిడయి, శీలావతి, గొరక, ఇంగిలాయి, జెల్ల, బొచ్చె, జడ్డువాయి, చేదు పరిగె, కొరమీను, వాలుగ, పండుకప్ప, గండి బొగడ, కొయ్యంగ, మునుగపాము, గడ్డు గాయి, చామరాయి, పొట్టిదిలాసు, కట్టినెరసు, బుడపార, చాకరొయ్య, గడ్డికొయ్య, మాల తప్పడలు, ఏటిజెల్ల, మార్పులు, పల్లెంకాయ, పాలజెల్ల, పారాటాయి….. పరజ, గూడ, ఆసాబాతు, కళాయి, చేతన బాతు, నల్లముక్కులు, సముద్రపుచిలుక, నత్తకొట్టుడు…. భాషాసమృద్ధే స్వతంత్రతా భీజం అన్నారు నెహ్రూ. పై పదాలన్నీ తెలుగు పదాలు కావా? వృత్తి పదకోశాల్లోకి ఎక్కించడానికి గతంలో కొంత ప్రయత్నం చేశారు. ఏడదికి సగటున 5 కొత్త యూనివర్శిటీలు ఏర్పడుతున్నా ఇండియాలో 7 శాతం మించి పి.జి స్థాయికి చేరటం లేదు. దానికి కారణం పేదరికం కాదు, ఇంగ్లీషు భాషపై పట్టులేకపోవటమేనని రాష్ట్ర ఉన్నత విద్యాచైర్మన్‌ కె.సి రెడ్డి అన్నారు. (ఆంధ్రజ్యోతి 18-10-2005) అంటే ఇంగ్లీషు భాష మీద పట్లులేకపోతే మన దేశంలో ఏ వ్యక్తీ, అతనికి ఎంత జ్ఞానం, విజ్ఞానం ఉన్నప్పటికీ ఉన్నత విద్యలోకి ప్రవేశించలేడన్నమాట. ఇంగ్లీషొస్తేనే జ్ఞాని, విద్యావంతుడు. ఇంగ్లీషు రాకపోతే అజ్ఞాని, అనాగరికుడు అని మనమే నిర్ధారించు కుంటున్నాం. ఇంగ్లీషే అన్నింటికీ మూలం అన్నట్లుగా మారింది పరిస్థితి. తెలుగును ప్రాచీన భాషగా ప్రకటించాలని అన్ని పార్టీలవాళ్లా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కేంద్రానికి పంపారు. కోర్టుకు గూడ వెళ్ళారు. కొద్దిరోజులకే జార్జిబుష్‌ హైదరాబాద్‌ రావటం, సివికాన్‌ వ్యాలీలో ఉన్న ప్రతి ముగ్గురు భారతీయ ఉద్యోగుల్లో ఒకరు ఆంగ్లప్రదేశ్‌కు చెందిన వారేనని తేల్చటం, దిల్‌కుష్‌ అతిథి భవనంలో అమెరికా వెళ్ళ టానికి వీసాలిచ్చే కేంద్రం పెడతామనటం, మన మధ్యతరగతి కుటుంబాలన్నిటికీ ఇంగ్లీషు ఉచ్చు బిగించిపోవటం చకచకా జరిగి పోయాయి. మరోసారి తాజాగా తెలుగుతల్లి సాక్షిగా ఉద్యోగాల కోసం మన పెద్దలు మోకరిల్లారు; ఇలా ఆంగ్లాన్ని స్తుతించారు: ఆంగ్లమేరా జీవితం- ఆంగ్లమేరా శాశ్వతం ఆంగ్లమే మనకున్నది- ఆంగ్లమేరా పెన్నిధీ ఆంగ్లమును ప్రేమించు భాయీ- లేదు అంతకు మించి హాయీ ||ఆంగ్ల|| తెలుగును విడిచీ- ఆంగ్లము నేర్చీ అమెరికా పోదామూ- బానిసలవుదామూ డాలర్లు తెద్దామూ ||తెలుగు|| అంటూ పాటలు కూడ పాడుతున్నారు.

తెలుగుకంటే ఇంగ్లీషెందుకు ముద్దో కారణా లతో సహా వివరిస్తున్నారు:
1. తెలుగులో పెద్దగా విజ్ఞాన సాహిత్యం లేదు. తెలుగు భాషా దురభిమానం ప్రదర్శించటం తప్ప మన పాలకులు, పండితులు మన భాషలో పాలనను పెద్దగా ప్రోత్సాహించటం లేదు. తెలుగులో చదివితే ఉద్యోగాలూలేవు.

2. పెద్ద కులాలవాళ్ళు, ఆస్థిపరులు ఇంగ్లీషులో చదువుకుంటూ, పేదకులాల వాళ్ళకు ఇంగ్లీషు చదువులు దక్కకుండ చేయటానికి తెలుగు భాషా ఉద్యమాలు చేయిస్తున్నారు.

3. నిర్భంద చట్టాలతో తెలుగుభాషను తేవా లని చూసినా, పారిభాషిక పదజాలం యావత్తూ సంస్కృతమయం చేస్తూ, పండి తులు తెలుగుభాషను తెలుగువాళ్ళకు రాకుండా చేస్తున్నారు. తెలుగు చదువు కృత్రిమమై ఇంగ్లీషు చదువే సులువుగా ఉంటోంది.

4. దేశం మొత్తానికీ కలిపి ఒకే లిపిలేదు. మరో రాష్ట్రం వెలితే దుకాణాల బోర్డులపేర్లు చద వాలన్నా ఇంగ్లీషు రావాల్సిందే. హిందీ కూడ అందరికీ రాదు. ఆంగ్ల లిపి పిల్లలకు సుల భంగా వస్తుంది.

5. యవ్వనం వచ్చాక బాల్యావస్థకు తిరిగి వెళ్ళగలమా? ఇంగ్లీషొచ్చాక తెలుగెందుకు? ఆధునిక ప్రామాణిక తెలుగు భాష వచ్చాక ఎవరైనా ఇంటి భాషను కోరుకుంటారా? ఆంగ్ల పాలనలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన మన తెలుగుజాతి మళ్ళీ తిరిగి తెలుగుకు పరిమితమై కుంచించుకుపోవాలా? పడ్డచన్ను లెత్త బ్రహ్మవశమే?

6. కంప్యూటర్‌కు ఆంగ్లం అవసరం. ఇంగ్లీషు రానివాళ్ళు ఎందుకూ పనికిరాని వాళ్ళవుతారు. మనం విశ్వమానవులం. అధునాతన విశ్వ చైతన్యాన్ని అందిపుచ్చుకోవాలంటే తెలుగును బలిచేసైనా ఇంగ్లీష్‌ నేర్వాలి.

7. అప్పడగా బోయిందీ అదీ ఒక తప్పా? ఇప్పుడు తెలుక్కొచ్చిన ముప్పేమీలేదు. మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుళ్ళతో తెలుగు సంస్కృతికొచ్చే నష్టం ఏంటట? భాషోద్య మాలతో ఎందుకీ గోల? ఇదంతా ప్రాంతీయ దురభిమానంతో చేస్తున్న వేర్పాటువాదం. ఆంగ్లం వల్ల అధికారం, అధికారం వల్ల భాగ్యం కలుగుతాయి.

ఇక మనం తెలుగువాళ్ళం అనీ, మన తెలుగును రక్షించుకుందాం అనీ పోరాడే తెలుగు వీరులు చెప్పే సమాధానాలు ఏమిటి?:

1. మాతృభాషను కాపాడుకోవటం భాషా దురభిమానం ఎలా అవుతుంది? అలాగయితే ఇంగ్లీషువాళ్ళది భాషా సామ్రాజ్యవాదం కాదా? సొంతభాష కంటే మనకు ఇంగ్లీషే గొప్పగా కనబడటం బానిస మనస్తత్వం కాదా?

2. మన పాలకులు, అధికారులు డబ్బు సంపాదించటానికి మాత్రమే ఆంగ్ల విద్యను ప్రోత్సహించటం పడుపు కూడు తినటంతో సమానం. అత్యధిక జనాభా మాట్లాడేభాషను నాశనం చేస్తూ పరాయిభాషకు పట్టం గట్టడం అంటే పరస్త్రీ ముందు భార్యను అగౌరవ పరచటం లాంటిది. ఇది భాషా వ్యభిచారం, అనైతికం, అసహజం, తెలుగు జాతి ప్రజల హక్కుల ఉల్లంఘన

3. మన భాషను రక్షించుకోవాలంటే నిర్భంద చట్టాలు ఉండల్సిందే. ఇంటి భాషకు సైతం చోటు కల్పిస్తూ పారిభాషక పదజాలం మనం సమకూర్చుకోవాలి. ఇంగ్లీషుకంటే తెలుగే సుళువుగా వస్తుంది. మన లిపిని కంప్యూ టర్‌కు అనుకూలంగా మార్చుకోవాలి. అవసరమయితే ఆంగ్లలిపినే తెలుగుభాషకు వాడుకుందాం.

4. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లమంది తెలుగు వాళ్ళున్నారు. 110 దేశాలకంటే మన తెలుగు నేల పెద్దది. ఎన్నో యూరోపియన్‌ దేశాల భాషలు తెలుగుకంటే చిన్నవే. వాటికున్న గౌరవం మర్యాదకూడ తెలుగుకు రాదా? మనల్ని మనమే కించపరచుకోవటం ఏమిటి?

5. తెలుగు పనికిమాలిన భాషా? దెబ్బ తగిలితే మమ్మీ అని కాకుండ అమ్మా అని ఎందు కరుస్తారు? వచ్చీరాని ఇంగ్లీషు నడమంత్రపు సిరిలాంటిది. బాల్యంలో తీరని కోరికల్ని యవ్వనంలోనైనా తీర్చుకోవాలి గానీ ఆంగ్ల ప్రావీణ్యం అనే యవ్వన గర్వంతో బాల్యాన్ని మరిచి, తల్లిభాషను అధోగతికి దిగజార్చటం ఏరుదాటాక తెప్ప తగలేసే లక్షణం.

6. మన సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, విద్య, పరిపాలన మన భాషలోనే ఉండలి. కంప్యూటర్‌ కోసం తెలుగును బలి పెట్టటం ఎలుకలున్నాయని ఇంటిని తగులబెట్టడంతో సమానం. కంప్యూటర్‌నే తెలుగులోకి వంచుతాం. ఎన్నో భాషల గ్రంథాలు ఇంగ్లీషు లోకి అనువదించుకున్నారు. అవసరం అటు వంటిది.

7. ఇక్కడ చదివి ఎక్కడికో వెళ్ళి సేవలు చేసే మనస్తత్వం స్వజాతికి ద్రోహం చెయ్యడమే. తెలుగులోనే ఇంజనీరింగు, వైద్యశాస్త్రాలు చదివి తెలుగు ప్రజలకే సేవచేయగలిగితే మన భాషతో పాటు మన జాతి వికసిస్తుంది గదా? మీ భోగ భాగ్యాల కోసం తెలుగు ప్రజలందర్నీ ఇబ్బందు లకు గురి చేస్తారా? వారి మీద మోయలేని భారం మోపుతారా? వారి భాషను నాశనం చేసి వాళ్ళను మూగవాళ్ళుగా చేస్తారా? మాతృ భాషకు ప్రాథంమిక విద్యలోకూడ స్థానం లేకుండ చేసే వాళ్ళది ఇంటి కూడు తిని ఎవరి వెంటో పడే తత్వం కాదా? ఇది ప్రజాద్రోహం కాదా? మాతృభాషాతృణీకారం మాతృదేవీ తిర స్కారం అన్నారు మహాత్మాగాంధీ. మాతృ భాష సరిగా నేర్చుకోని వాళ్ళకు ఇతర భాషలు కూడ సరిగా రావు అన్నారు జార్జి బెర్నార్డ్‌షా. మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంఘ్వీ ఇలా అన్నారు: మాతృమూర్తికి ఎంతటి గౌరవం ఇస్తామో మాతృభాషకు అంతటి సమున్నత స్థానం దక్కాలి. నేను తల్లితో సమానంగా తల్లిభాషనూ గౌరవిస్తాను. అందరూ మాతృభాషలో మాట్లాడండి. న్యాయ స్థానాల్లో వాదనలు కార్యకలాపాలు ఆంగ్లంలో కొనసాగడమేంటి? ఇంకా ఎంతకాలం ఈ దారుణం? న్యాయస్థానాల్లో వ్యవహారాలు సామాన్యుడి భాషలో కొనసాగినపుడే సామాన్యుడికి న్యాయం అందివ్వగలం. (అమ్మనే మరుస్తారా! ఈనాడు 27-2-2006)

అమ్మభాషను మనవాళ్ళు మరచిపోతుంటే ఫ్రాన్సు నుండి పెద్దాపురం వచ్చి బుర్రకథల మీద, తెలుగుభాష మీద పరిశోధన చేస్తున్న డాక్టర్‌ డానియల్‌ నెగర్స్‌ ఇలా అంటున్నారు: తెలుగునేల మీద విదేశీ భాషలు నేర్చుకో డానికి సీఫెల్‌ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి గానీ, తెలుగుపై మక్కువతో వచ్చే విదేశీయు లకు తెలుగు నేర్పే సంస్థ ఏదీ ఇక్కడ కనిపించ లేదు. అమెరికా పలుకుబడి, ఆంగ్లభాష ప్రపంచంలోని అన్ని భాషాసంస్కృతులకు నష్టం కలిగిస్తోంది. ప్రపంచీకరణ పేరుతో ప్రతి ప్రాంతానికీ ఈ ప్రమాదం విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో రెండువేల భాష లున్నాయి. మరో వందేళ్ళు ప్రపంచీకరణ దాడి ఇలాగే కొనసాగితే 200 భాషలే మిగులు తాయి. భాషల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవ అవసరం. ఫ్రెంచి, తెలుగు భాషలు దాదాపు ఒకే సమయంలో సాహిత్య భాషలుగా పరణతి చెందాయి. అయితే ఫ్రెంచిభాషను ప్రపంచంలో ఎక్కడయినా నేర్చుకునే వీలుందికానీ తెలుగును తెలుగు నేలపై నేర్చుకోవడమే కష్టంగా ఉంది. ఎంతో ప్రాచీనమైన తెలుగుభాష ఉనికిని కాపాడు కోవాలి. ఆంగ్లభాషను రుద్దడం వల్ల భాషల మధ్య ఘర్షణ తప్పదు. (ఆంధ్రజ్యోతి 22-2-2006) ప్రపంచంలోని అన్ని భాషల కంటే ఎక్కువగా ఆంగ్లభాషలో 7,90,000 పదాలున్నాయట. వాటిలో 3లక్షల పదాలు సాంకేతికమైతే, 4,90,000 పదాలు వాడుకలో ఉన్నాయట. అయితే భాషాశాస్త్రజ్ఞుల లెక్కప్రకారం ఏ ఒక్కరూ తమ జీవితకాలంలో 60వేలకు మించి రాయడంలోకానీ, చదవడంలో కానీ ఉపయోగించలేరట. అంటే అరవై వేల అవ సరమైన పదాలను రాయడంలో, చదవ డంలో ఉపయోగిస్తూ ఉంటే భాషను సజీవంగా కాపాడుకోవచ్చు.

మెదక్‌ జిల్లా రాయికోడు మండలం షంషుద్దీన్‌ పూర్‌ గ్రామనివాసి ఏర్పుల కమలమ్మ 50 రకాల విత్తనాలు సాగుచేసి సరఫరా చేస్తోం దట. విత్తనాల పేర్లు చూడండి: తైదలు, ఉలవలు, సజ్జలు, పచ్చజొన్నలు, తోక జొన్నలు, తెల్లమల్లెజొన్న, ఎర్రజొన్న, బుడ్డ జొన్న, అత్తకోడళ్ళ జొన్న, నల్లతొగరి, ఎర్రతొగరి, తెల్లతొగరి, అనుములు, కొర్రలు, బొబ్బర్లు, పెసర్లు, వడ్లు, తెల్లనువ్వులు, ఎర్రనువ్వులు, గడ్డినువ్వులు, పుంట్లు, శనగలు, ఆవాలు, తెల్లకుసుమ, ధనియాలు, వాము, బటాని, సిరిశనగ, మిరప, కోడిసామలు, పల్లీలు, గోధుమ, సాయిజొన్న, నల్లకుసుమ, అవశలు, లంకలు, సిరిశనగ. (వార్త 6-3-2006) ఈ తెలంగాణా తల్లికి ఏమి ఇంగ్లీషొచ్చు? అయినా ఈ తెలుగు నేల తల్లులు ఎన్నో వందల ఏళ్ళనుండి మొక్కల పేర్లు, విత్తనాల పేర్లు మక్కువగా గుర్తు పెట్టుకొని వ్యవ సాయం నడపలేదా? ఇంగ్లీషు, లాటిన్‌ పదాల కిచ్చిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత మన తెలుగు పదాలకు కూడ ఇవ్వలేకపోవటానికి కారణం ఏమిటి? మనం మనకి అర్థం కాకపోయినా, ఇంగ్లీషు వాళ్ళకు అర్థం కావాలి. ఈ బాబులు దేశంలో భారతీయులంతా ఒకరికొకరు అర్థం కావాలంటే ఇంగ్లీషే మంచిదనే నిర్ణయాని కొచ్చారు. బాషాప్రయుక్త రాష్ట్రాలన్నీ ప్రత్యేక దేశాలుగా అంటే మొగలులు, బ్రిటీష్‌ వాళ్ళు రాకముందున్నట్లుగా ఉంటే ఎవరిభాషకు వాళ్ళు పట్టం గట్టేవాళ్ళే. ఇప్పుడది సాధ్యంకాదు కాబట్టే మన భాషలకు ఇంగ్లీషు సారథ్యం వహిస్తోంది.

తెలుగు భాషకు మూలపురుషులు ఎవరు? యానాదులు. తెలుగుభాషను నిత్యమూ వాడుతూ బ్రతికిస్తున్నది ఎవరూ? వివిధ కులవృత్తుల్లో ఉన్న శ్రామికులు, గ్రామీణులు. అరవైవేలు కాదు దాదాపు 3 లక్షల పదాలు వీళ్ళంతా కలిసి వాడుతున్నారు. వీళ్ళందరూ వాడుతున్న పదాలలో చాలా వరకూ వివిధ పదకోశాల్లోకి ఎక్కాయి. ఇంకా రక్షించు కోవాల్సిన పదజాలం ఎంతోఉంది. మాటకు ప్రాణము వాడుక. వాడుక ఎప్పుడు జరుగు తుంది? మన పంచాయితీలు, న్యాయ స్థానాలు, అసెంబ్లీ అన్నీ తెలుగులో నడిచి నపుడు. కనీసం మన పిల్లలకు ప్రాథంమిక విద్య అయినా తెలుగులో అందించినప్పుడు. ప్రైవేట్‌ స్కూళ్ళు తెలుగు నేర్పవు.

మార్కుల కోసం కళాశాల విద్యార్ధులు సంస్కృతం రెండోభాషగా తీసుకుంటున్నారు. సంస్కృత పరీక్షలో జవాబులు తెలుగు, ఇంగ్లీషు లిపుల్లో దేంట్లోనైనా రాయొచ్చట. మార్కులు బాగా వేస్తారట. హిందీ పరీక్షకైతే 20 మార్కులు తెచ్చుకున్నా పాస్‌ చేస్తున్నారు. మరి ఈ రకం రాయితీలు, ప్రోత్సాహకాలు మన తెలుగు భాషకే ఇవ్వవచ్చుగదా? కర్నాటకలో కన్నడ మాతృభాషకాని వాళ్ళైనా సరే కన్నడాన్ని మూడో భాషగానైనా చదవాల్సిందేనట. మరి మన రాష్ట్రంలో? కర్నాటకలో కన్నడం లేకుండ హైస్కూలు విద్య పూర్తికాదు. పైగా 15శాతం మార్కులు కన్నడానికి ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. తమిళనాడులో ఎనిమిదవ తరగతిదాకా తమి ళాన్ని ఒక భాషగా నిర్భందం చేశారు. కోయ, గోండు, కొలామి, ఆదివాసి, ఒరియా, సవర, బంజారా, కొండ, కువి మొదలైన గిరిజనులకు వారి మాతృభాషల్లోనే మన రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ముద్రించి బోధిస్తోంది. ఇదే పని తెలుగు పిల్లలకు కనీసం అయిదో తరగతి వరకు నిర్భందం చేస్తే బాగుంటుంది. ప్రైవేట్‌ స్కూళ్ళమీద కర్నాటక, తమిళనాడు ప్రభు త్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయో మన ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించాలి. భాషను సాహిత్యానికీ కవిత్వానికీ పరిమితం చేస్తే భాషతోపాటు దాన్ని మాతృభాషగా కలిగిన వారుకూడ వెనుకబడిపోతారు. భాషను ఉపాధితో ముడిపెట్టండి అన్నారు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌.

గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29ని తెలుగు భాషా దినోత్సవం గానూ, కాళోజీ జయంతి సెప్టెంబరు 19ని తెలుగు మాండ లిక భాషా దినోత్సవం గానూ జరుపుకుంటు న్నాము. ఇంటిభాస ఎసుంటిదైనా మందే కదా? ఆదరిచ్చుదాం. ఇంపుగా నేరుద్దాం. ఇంగిలీసు నేర్చుకోటల్లా? అట్టా.

నూర్‌బాషా రహంతుల్లా

No comments: