Tuesday, September 18, 2018

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె


స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె






సాహితీమిత్రులారా!

ఈ సమస్యను పూరణనను ఏల్చూరివారి పరిశీలనను
ఈ వ్యాసంలో గమనించండి...............

తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధమైన ఉదంతం ఇది: ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల నిండుసభలో మహాకవి ధూర్జటి కావ్యగానం జరిగిందట. నిస్తులమైన ఆ కావ్యమాధురికి విస్తుపోయిన రాయలవారికి ఆ కవిత్వ రసభావాల కూర్పులోని తీయదనానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. విద్యాపరిషత్తులోని విద్వత్సభ్యులను ఉద్దేశించి ఈ పద్యపరిప్రశ్నను అడిగాడట:

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ
యతులితమాధురీమహిమ?”

అని. రాయల వారిచ్చినది చంపకమాల పద్యంలో ఒకటిన్నర పాదాలకు వ్యాపించి, సమస్య వలె కనుపించటంతో ఆయన మనోగతానికి అనుగుణమైన సమాధానం ఏమని చెబితే ఆయనకు నచ్చుతుందో సద్యఃకృతంగా తోచక పరిషత్తులోని పండితులు మౌనంగా ఉండిపోయారట.

అప్పుడు తెనాలి రామకృష్ణుడు లేచి, ‘రాజా! నాకొక పక్షం రోజులు వ్యవధినిస్తే ఈ ప్రశ్నకు తగిన సమాధానం దేవర వారి చిత్తానికి విన్నవించుకొంటాను,’ అని, మొత్తానికి రాయలవారిని సమ్మతింపజేశాడట.

ఆ రోజునుంచి రామకృష్ణుడు కొలువుకు వెళ్ళటం మానివేశాడు. తెల్లవారుజాముననే మారువేషం వేసుకొని ధూర్జటి గారింటికి బయలుదేరటం, ఆయన దినచర్యను కనిపెట్టటం మొదలుపెట్టాడు. ధూర్జటిగారు ప్రతినిత్యం పంచపంచ ఉషఃకాలాన లేచి, కాలకృత్యాలను ముగించుకొని, శివదీక్షకు కూర్చొని ఒకటొకటిగా స్తోత్రనివేదనం, భస్మస్నానం, భస్మధారణం, రుద్రాక్షధారణం, సంధ్యావందనం, లింగార్చనం, ఇష్టదేవతారాధనం, నైవేద్యం, పూజావిధానమంతా పూర్తికాగానే కొద్దిసేపు విశ్రమించి, ఆ తర్వాత భోజనభాజనాదులను ముగించుకొని, ఆస్థానప్రవేశానికి ఆవశ్యకమైన తీరున పండితవేషాన్ని ధరించి కొలువుకు వెళ్ళి వస్తుండటం, ఇంటికి రాగానే మరుసటినాడు సభలో వినిపించవలసిన గ్రంథభాగానికి సమాయత్తమవుతుండటం మూలాన రామకృష్ణుడికి పెద్దగా తనకు పనికివచ్చే ఆచూకీలేవీ పొడచూపలేదు.

పక్షాంతం కావచ్చే సమయానికి – అన్నాళ్ళుగా పడుతున్న శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరై, రాజుగారికిచ్చిన మాట తప్పేట్లున్నదని భయపడుతున్న తరుణంలో రామకృష్ణుడు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ధూర్జటి కొలువు నుంచి తిరిగిరాగానే కొంతసేపు సేదతీరి, మునిమాపు వేళయేసరికి డాబు, దర్పం మీరిన భోగరాయవేషాన్ని ధరించి, ఇంటినుంచి బైటపడి, పదే పదే అటు చూసుకొంటూ ఇటు చూసుకొంటూ – రహస్యంగా నాగవాసం దారి పట్టాడట. రామకృష్ణుడు ఆయనను అనుసరిస్తూ ఆయన ఒక ఇంటిలోకి వెళ్ళాక, బయట ఆ ఇంటి అరుగుమీదే చేతిని తలక్రింద దిండుగా అమర్చుకొని రాత్రంతా అక్కడే తీరికగా విశ్రమించాడట. ధూర్జటి తెల్లవారుజామున తలుపు తెరుచుకొని బయటికి వచ్చి, అరుగుమీదున్న రామకృష్ణుణ్ణి చూసి గుట్టు రట్టయిందని గ్రహించి, ఇక చేసేదేమీ లేక, దైవంమీద భారంవేసి ఇల్లు చేరుకొన్నాడట.

ఆ మధ్యాహ్నం రామకృష్ణకవి పేరోలగంలో అడుగుపెట్టి, రాయల వారిచ్చిన సమస్యను పూర్తిచేశాడట:

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ
యతులితమాధురీమహిమ?” “హా! తెలిసెన్; భువనైకమోహనో
ద్ధతసుకుమారవారవనితాజనతాఘనతాపహారి సం
తతమధురాధరోదితసుధారసధారలు గ్రోలుటం జుమీ.”

అని. ఆ పూరణలోని అంతరార్థం ఎంతో కొంత నలుగురికీ తెలిసినదే కనుక రాయలవారు, రాయలవారిని చూసి సదస్యులు నవ్వారట. చేసేదేమీ లేక ధూర్జటి కూడా నవ్వి తలవంచుకొన్నాడట.

సమస్యలోని పరిశీలనీయాంశాలు
స్మరణోత్సవంగా ఉన్న ఈ కథానకాన్ని ప్రఖ్యాత విమర్శకులు శ్రీ గురజాడ శ్రీరామమూర్తి గారు మొట్టమొదట 1876లో ప్రబంధకల్పవల్లి పత్రికలోనూ, ఆ తర్వాత 1893లో వావిళ్ళ వారు అచ్చువేసిన తమ కవిజీవితములు సంపుటంలో కొద్దిపాటి మార్పుతోనూ ప్రకటించారు. ఒకానొక రోజున కాళహస్తిమాహాత్మ్యాన్ని తెనిగించిన ధూర్జటి అనే కవీశ్వరుడొకడు రాజాస్థానానికి విచ్చేసి, కృష్ణరాయలతో తన గ్రంథాన్ని గురించిన ప్రశంస కావించాడని, అప్పుడు రాయలు ఆ గ్రంథాన్ని తెప్పించి సావధానంగా పరిశీలించాడని, ఆ కవి వాక్చమత్కృతికి ముగ్ధుడై పండితులను, స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ, యతులితమాధురీమహిమ? అని అడిగాడని, ఆయన పాఠం. నేను చిన్నప్పుడు విన్న కథారూపాన్ని నేను ఉదాహరించాను.

పై విధంగా, స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ, యతులితమాధురీమహిమ? అని పద్యంలోని ఒక పాదాన్నో, ఒకటిన్నర పాదాన్నో; లేక రెండు, మూడు పాదాలను సైతమో పృచ్ఛకుడు అన్వయరహితంగానో, అర్ధోక్తిగానో, ప్రశ్నార్థకంగానో నిలిపి, పరిశిష్టభాగాన్ని అర్థవంతంగా పూరించమని ఇచ్చిన అసమాపకవాక్యాన్ని ‘సమస్య’ అంటారు. సాధారణంగా నాలుగవ పాదాన్ని సమస్యగా ఇవ్వటం ఉంటుంది కాని, నిజానికి పృచ్ఛకుడు ఏ పాదాన్నైనా, పద్యంలోని ఎంత భాగాన్నైనా ఇవ్వవచ్చును.

పైని శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చినది ‘సమస్య’ అనుకొంటే, దానికి లాక్షణిక పరిభాషలో, ప్రథమపాదాదిగత కవిజన ప్రతివచనీయము అని పేరు. పద్యంలోని తొలిభాగాన్ని పృచ్ఛకుడు ఇవ్వగా పూరయిత ఆ మిగిలిన భాగాన్ని కొనసాగించి, దత్తార్థాన్ని యథోచితంగా పరిపూర్ణించాలన్నమాట.

‘స్తుతమతి యైన ఆంధ్రకవి’ అన్న విశేషణం
సమస్యను వినగానే మన మనస్సులను ఆకర్షించే ముమ్మొదటి విషయం ధూర్జటిగారిని ఉద్దేశించి కృష్ణరాయల నోట వెలువడిన ‘స్తుతమతి యైన ఆంధ్రకవి’ అన్న విశేషణం. మతి శబ్దానికి – మన్యతే అనయా ఇతి మతిః అని వ్యుత్పత్తి. మన అంటే జ్ఞానం. జ్ఞానము అంటే జీవుడు, ఈశ్వరుడు, జగత్తు అనే భేదభ్రాంతికి అధిష్ఠానమై నిత్యము, స్వయంప్రకాశము, సచ్చిదానందస్వరూపము, అద్వితీయము అయిన బ్రహ్మచైతన్యం. ఆ బ్రహ్మచైతన్యము యొక్క ఎరుక దేని మూలాన కలుగుతుందో – అంటే, ఆ జ్ఞానసాధకమైనది మతి. సత్యాసత్యాల, తత్త్వాపతత్త్వాల వివేకాన్ని కలిగించే నిశ్చయాత్మకమైన వృత్తి అది. ఎవరి మూలాన ఆ జ్ఞానము మనకు కలుగుతున్నదని గ్రహించి కృతజ్ఞతతో స్మరిస్తున్నామో, జ్ఞానమూలుడని సన్నుతిస్తున్నామో, ఆ మహనీయుడే స్తుతమతి.

స్తుతమతి అన్నాడు సరే, ఆంధ్రకవి అనటం దేనికి? ఏమీ, ధూర్జటికి సంస్కృతభాషానిరంకుశమహాప్రభుత్వం అలవడలేదా? రాయలు ఆయన సంస్కృతభాషానిరంకుశమహాప్రౌఢిని గుర్తించనే లేదా? తెలుగు కవులకు సామాన్యమైన అష్టభాషావిశారదత్వం ఆయనకు లేదనే ప్రభువు అభిప్రాయమా? శ్రీకాళహస్తిమాహాత్మ్యములో సంస్కృతాంధ్రాలతోపాటు కన్నడపదాలు సైతం చోటుచేసుకొన్నాయి కదా, బహుభాషాకోవిదుడనేందుకు ఆ నూతనసంవిధానం నచ్చకపోయిందా? సకలవాగ్విశారదుడు అనక, వట్టి తెలుగుకవి అన్న విశేషణంతో సరిపెట్టివేశాడా? సంస్కృత తమిళ కన్నడాదిభాషాకవుల మధ్య కేవలం సంజ్ఞాపనకోసం ఆంధ్రకవి అన్నాడా? అని సందేహించేవారు తప్పక గుర్తింపవలసిన విషయం ఇది.

ఆంధ్రకవి అన్నది రాయల దృష్టిలో ఒక అపురూపమైన గౌరవం. పుట్టినప్పటి నుంచి నేర్చుకొన్న సంస్కృత భారతిని కాదని, అందులో ఎన్ని కావ్యాలనో చెప్పినప్పుడు చెందిన సంతృప్తిని కాదని, ఆమూలచూడంగా అభ్యసించిన ప్రాకృతాలను కాదని, తరతరాలుగా ఇంటిలో నెలకొన్న తుళు వాక్తతిని కాదని, కమనీయమైన కన్నడ కస్తూరిని కాదని, విష్ణుచిత్తీయ తమిళాన్ని కాదని, తనకెంతో ఆభిమానికమైన ఆంధ్రభాషకు పట్టాభిషేకం చేసి, భగవదిచ్ఛానుసారం ఆ భాషలో ఆముక్తమాల్యదా మహాప్రబంధాన్ని విరచించిన రాయల నోట వెలువడిన అనర్ఘమైన గౌరవవాచకం అది. కళింగ జైత్రయాత్రకు బయలుదేరి శ్రీకాకుళంలో విడిదితీరినప్పుడు ఆయనకు రాత్రి కలలో సాక్షాత్కరించిన శ్రీమహావిష్ణువు సైతం ఆయన పలుకు నుడికారంలో, అంధ్ర జలజాక్షుఁడు కదా. ఆ అంధ్రజలజాక్షుడే స్వయంగా ‘అంధ్రభాష యసాధ్యంబె! యందు నొక్క, కృతి వినిర్మింపు మింక మాకుఁ బ్రియంబు గాఁగ’ అన్నాడు కదా. అంతే కాక,

“తెలుఁ గ దేల? యన్న, దేశంబు తెలుఁ; గేను
తెలుఁగు వల్లభుండ; తెలుఁగొ కండ;
యెల్ల నృపులు గొలువ నెఱుఁగవే బాసాడి,
దేశభాషలందుఁ దెలుఁగు లెస్స.”

అని – (1) నేనున్నది తెలుగు దేశం, (2) నేను తెలుగుదేశంలో వెలసి, తెలుగువారిని అభిమానించి, వారి అభిమానాన్ని పొందిన తెలుగు వల్లభుణ్ణి, (3) తెలుగు భాష మధురాతిమధురం, (4) నా మాట సరే, నీ కొలువులోని సర్వరాజన్యులు నానా భాషాభణితులను భాషిస్తుండగా – ఆ దేశభాషలలో తెలుగు లెస్స అని నీకు మాత్రం తెలియలేదా? అని స్వయంగా ఆ భగవంతుడే నాతో అన్నాడు – అని చెప్పుకొన్నాడు కదా, స్వప్నగతమైన ఆ భగవద్వాక్యాన్ని అమిత ప్రీతిపాత్రంగా తన ఆముక్తమాల్యదలో నిలుపుకొన్నాడు కదా, ఆయన దృష్టిలో ఆంధ్రకవి అన్నది అంతటి మహనీయమైన విశేషం అన్నమాట. అంతే కాదు. ఆయనే ఒకప్పుడు నిండుసభలో అల్లసాని పెద్దన గారిని పిలిచి, పెద్దను చేసి, స్వారోచిష మనుసంభవానికి కృతిపతిత్వాన్ని అర్థించినపుడు ఆ మహాకవిని గురించి ఒకదానికంటె ఒకటి ఉత్తరోత్తరబలీయంగా విశేషణాలను పేర్కొంటూ, ‘(1) హితుఁడవు (2) చతురవచోనిధివి, (3) అతులపురాణాగమేతిహాసకథార్థ, స్మృతియుతుఁడవు (4) ఆంధ్రకవితా, పితామహుఁడవు – ఎవ్వ రీడు? పేర్కొన నీకున్’ అని, తనయెడ ఆయనకు గల ఆప్తభావానికంటె, ఆ మహామహుని చతురవచఃకౌశలికంటె, నిఖిలపురాణశాస్త్రకోవిదత్వానికంటె బలీయస్తరంగా ఆంధ్రకవితాపితామహత్వాన్ని సాహితీమేరుశిఖరాగ్రాన అధివసింపజేశాడు కదా. నంది తిమ్మన గారు తనకు పారిజాతాపహరణము కావ్యకుసుమాన్ని ‘పారిజాత, హరణ మను కావ్య మొనరించె నంధ్రభాష, నాదివాకరతారాసుధాకరముగ’ అని సమర్పించినపుడు ఎంతో సంతోషంగా అందుకొన్నాడు కదా. స్తుతమతి యైన యాంధ్రకవి ధూర్జటి – అన్న బిరుదాంకనంలో రాయలకు తెలుగు భాష అంటేనూ, ధూర్జటి గారంటేనూ అంతటి గౌరవం ఇమిడి ఉన్నదన్నమాట.

పాఠాంతరాల క్లిష్టసమస్య
ముద్రితప్రతులలో కృష్ణరాయలు అడిగిన ప్రశ్నకు రెండు మూడు పాఠాంతరాలు కనబడుతున్నాయి. వాటి అర్థచ్ఛాయలలో కొంత వ్యత్యాసం ఉన్నది:

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ
యతులితమాధురీమహిమ?”

అన్నది గురజాడ శ్రీరామమూర్తి గారు చూపిన తొలినాటి పాఠం.

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గెనో
యతులితమాధురీమహిమ?”

అని దీనికే కొద్దిపాటి మార్పుతో పాఠాంతరం ఉన్నది.

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గె నీ
యతులితమాధురీమహిమ?”

అని మరొక పాఠం.

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గెనో
యతులితమాధురీమహిమ?”

అని ఇంకొకటి. ఈ నాలుగు పాఠాలలో అర్థసన్నివేశాన్ని బట్టి మొదటిది, రెండవది ఒక తీరున; మూడవది, నాలుగవది ఒక తీరున ఉన్నాయి. రెండవ దానిలో ‘అతులితమాధురీమహిమ ఏల కల్గెనో?’ అన్నప్పుడు నిజానికి ధూర్జటి రాజసభలో ప్రత్యక్షంగా ఉండవలసిన అవసరం లేదు. ఆయన పరోక్షంలో కూడా రాజు, ధూర్జటి గారి కవిత్వానికి ఇంతటి తియ్యదనం ఎందుకు వచ్చిందో? అని ప్రసంగవశాన అడగటానికి అవకాశం ఉన్నది. మొదటి పాఠం ప్రకారం, స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె – ఈ, యతులితమాధురీమహిమ? అని ప్రశ్నించినపుడు, ‘ఈ’ అన్న నిర్దేశార్థకం అప్పుడే చదువబడిన మధురమైన సన్నివేశంలోని రసప్రతీతికి స్ఫోరకం. భువనవిజయ మహాసభలో కావ్యగానం జరిగినప్పుడు ధూర్జటి కవి సమక్షంలోనే ఆ సంభాషణ సాగినదనుకోవాలి. అందువల్ల ‘ఏల కల్గెనో, యతులితమాధురీమహిమ’ అన్న పాఠానికంటె, ‘ఏల కల్గె నీ, యతులితమాధురీమహిమ’ అన్న పాఠం మెరుగు.

పాఠాన్ని మరికొంత సూక్ష్మంగా విమర్శించి చూద్దాము. ‘ధూర్జటిగారి కవిత్వానికి ఇంతటి తియ్యదనం ఎలా వచ్చింది?’ అని కృష్ణరాయలు ప్రశంసాపూర్వకంగా అడగటం విద్వజ్జనులున్న పరిషత్తులో అది సందర్భోచితమైన ప్రశ్న. స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గెనో, యతులితమాధురీమహిమ? లేదా, స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గె నీ, యతులితమాధురీమహిమ? అనటంలో రాజుకు కలిగిన గౌరవాతిశయం ధ్వనిస్తున్నది. ఆ విధంగా దానిని ప్రథమపాదాదిగతంగా ప్రశ్నించినప్పుడు ధూర్జటిగారి కవిత్వంలో అంతటి తీయదనం ఏ సంస్కారం వల్ల ఉప్పతిల్లిందో కవులు సార్థకంగా వివరింపవలసి ఉంటుంది.

కాని, అందుకు విపరీతంగా, ధూర్జటిగారి కవిత్వానికి ఇంతటి తియ్యదనం ఎందుకు వచ్చిందో? అని కృష్ణరాయలు అడగటం విద్వజ్జనులున్న పరిషత్తులో మెచ్చుకోలుకైన ప్రశ్న అనిపించదు. ‘ఎలా వచ్చిందో?’ అని గాక, కవులు ‘ఎందుకు వచ్చిందో?’ సమాధానం చెప్పాలి. ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ, యతులితమాధురీమహిమ?’ అన్న ప్రశ్నలోనే పరిహాసానికి తగిన పునాది ఉన్నది. అటువంటి సూచన అక్కడ లేదని అనుకోవటం సాధ్యం కాదు. ‘ఎందుకు వచ్చింది?’ అన్న ప్రశ్నలో ఉన్న ఆక్షిప్తి ధూర్జటి వ్యక్తిగతజీవితాన్ని కొంత స్పృశించేదిగానే కనబడుతుంది. అందరికీ తెలిసిన ఆ విధమైన స్వాభావికోదంతాన్ని ప్రసక్తించటం దేనికని కవులు నిరుత్తరంగా ఉండిపోవటం సహజమే. పైగా రాజు ఆ వ్యక్తిగతవిమర్శకు ఎటువంటి సమాధానాన్ని ఎంతవరకు అనుమతించేదీ ఊహించటం కష్టం. ఆ శంకాసంకోచం లేని రామకృష్ణుడు కవి శృంగారవర్తనను వెలిపెట్టడం రాజు ప్రశ్నకు పరిణామస్వరూపమే. అనుమతి తీసికొని పదిహేను రోజులు ఆగి చెప్పినా, అప్పటికప్పుడే సద్యఃస్ఫురితంగా ఆశుగతిని చెప్పినా – రాజు సూచ్యంగా సూచించినదే కనుక, వ్యక్తిగతజీవితాన్ని వెల్లడించే పూరణను వెలికి చెప్పటం భావ్యమే. కానప్పుడు అది నిండుసభలో మహాకవిని నిష్కారణంగా అవమానించినట్లే అవుతుంది. రాజుకు ఎంత మాత్రమూ సమ్మతిలేని కల్పనను ప్రవేశపెట్టినందుకు తదాగ్రహానికి గురికాకనూ తప్పదు.

అందువల్ల కృష్ణదేవరాయలు ధూర్జటికి అవమానాస్పదం కాగల విధంగా సమస్యను రూపొందించి, స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గెనో, యతులితమాధురీమహిమ? అని భువనవిజయ మహాసభలో అడిగి ఉండటం నిజమై ఉండదు. స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గె నీ, యతులితమాధురీమహిమ? అనే అడిగి ఉంటాడు.

రాజు ‘ఏల కల్గె?’ అని ప్రశ్నింపక ‘ఎట్లు కల్గె? అని ప్రశ్నించి ఉన్నట్లయితే, ‘ఎట్లు’ అన్న అవ్యయానికి ‘ఏ ప్రకారంగా’ అన్న అర్థంతోపాటు ‘ఏల కల్గె?’ అన్న ప్రశ్నకూడా అంతర్భావిగా లేకపోలేదు. అయితే, రాయలు ‘ఎట్లు కల్గె?’ అని ప్రశంసాపూర్వకంగా అమితాదరంతో అడిగినప్పుడు అందుకు పూరయితృకవి ఆ మాధురీమహిమ ఎట్లా వచ్చినదీ చెప్పాలి గాని – కేవలం వాక్యపూర్ణతాసంపాదన నిమిత్తం ఆ సందర్భానికి తగని పరిహాసంతో కూడిన సమాధానం చెప్పి ఉండటం భావ్యం కాదు. పరిహాసం పవిత్రతను గుర్తించదని; తెనాలి రామకృష్ణుడు అపహాస్యానికి గాక చమత్కారానికి మాత్రమే ఆ పూరణను చేశాడని – మనము వాదంకోసం అంగీకరించినా, రాజు అపూర్వమైన పారవశ్యాన్ని పొంది తెలుసుకొనగోరిన ‘ఎట్లు కల్గె?’ అన్న ప్రశ్నకు రామకృష్ణకవి చేసిన పూరణలో ఆ మాధురీమహిమ ఏ గురూపదేశలబ్ధంగా, ఏ మహాకృషిసమాసాదితంగా, ఏ జన్మాంతరసంస్కారగతంగా, ఏ భగవద్వరప్రసాదఫలంగా వెల్లివిరిసిందో కవిత్వపరంగా వివరించే సముచితమైన సమాధానం రాలేదని కూడా మనము గుర్తుంచుకోవాలి. అది రాజు స్వస్థితికి, ధూర్జటి సుస్థితికి అనువైన పరిణామం కాదు.

కనుక పద్యపాఠాన్ని మరింత జాగరూకతతో పరిశీలించి అర్థనిర్ణయం చేయాలని వేరే చెప్పనక్కరలేదు. ఆ నేపథ్యంతో ఆలోచించి, తెనాలి రామకృష్ణకవి ప్రతిపాదించిన పద్యార్థం ఏమిటో సరిచూద్దాము.

రామకృష్ణకవి పూరణ
పద్యాన్ని ‘హా! తెలిసెన్’ అన్న ఉపక్రమణికతో మొదలుపెట్టడంతోటే రాజుకు, సదస్యులకు రామకృష్ణకవి చెప్పబోతున్నదేమిటో తెలిసిపోయి ఉండాలి. అయితే, నలుగురూ ఊహించలేని అపూర్వమైన అర్థసంగతితో చెప్పటమే మహాకవి ప్రతిభావిశేషం కదా. అందువల్ల ప్రతీతమైన పద్యార్థాన్ని, ప్రతీయమానమైన అర్థాన్ని పరిశీలిద్దాము:

హా! తెలిసెన్ = అసలు సంగతి తెలిసిందండోయి! అని భావం. ఏమి తెలిసిందో చెప్పబోయే ఆ ఉదంతానికి ‘హా!’ అన్న ప్రతిపదోక్తం ఆశ్చర్యార్థకంగానూ ఉన్నది; ఆక్షేపసూచకంగానూ ఉన్నది. చెప్పబోతున్నది ఆశ్చర్యం వల్ల చేస్తున్న పొగడ్తో, ఆక్షేపణపూర్వకమైన తెగడ్తో ఊహించటం కష్టం.

ఇంతకీ తెలిసిందేమిటి? భువనైకమోహన – భువన + ఏక + మోహన = పధ్నాలుగు భువనాలను ఒక్క తీరున సమ్మోహింపజేసే; ఉద్ధత = ఔద్ధత్యాన్ని వహించిన (గర్వాన్ని కలిగిన); సుకుమార = కోమలులైన; వారవనితా + జనతా = వేశ్యకాంతల; ఘన = అధికతరమైన; తాపహారి = (విరహిజనుల యొక్క) మన్మథతాపార్తిని హరింపజేసేది అయిన; సంతత + మధుర = నిత్యమధురమైన; అధర + ఉదిత = క్రిందిపెదవినుంచి ఉట్టిపడే; సుధారసధారలు = అమృతరసప్రవాహాలను; క్రోలుటన్ + చుమీ = ఆస్వాదించటం వల్లనే సుమండీ! అని.

సాకూతమైన సమాధానం
రాయలు తెలుసుకొనగోరిన రహస్యానికి సమాధానంగా రామకృష్ణకవి చేసిన పూరణ మనోహరంగా ఉన్నది. రాయలు మహాపండితుడు. మాధుర్యౌజఃప్రసాదాలనే కావ్యగుణాలలో ఒకటైన మాధుర్యాన్ని ‘మహిమ’ అన్న విభూతివిస్తారకమైన ఐశ్వర్యభావనతో జోడించి ‘మాధురీమహిమ’ అన్న పదబంధాన్ని సరిక్రొత్తగా సృజించటంలోనే ఆయన పాండిత్యవైభవం వెల్లడయింది. ధూర్జటిగారి కవిత్వాన్ని మనన చేసినకొద్దీ ఆ మాధుర్యం ఊటలువారి ఆయనపైని గౌరవం మరింత మరింతగా పెరుగుతుందని చెప్పటానికి ‘స్తుతమతి’ అయిన ధూర్జటి కవి అన్న నిర్దేశంతో వాక్యోపక్రమం చేశాడు. ‘ఆంధ్రకవి’ అన్న బిరుదాంకనంతో ఆ గౌరవాతిశయాన్ని ఉన్నతోన్నతంగా ధ్రువీకరించాడు. భక్తికవిత్వానికి మాధురీమహిమను ప్రతిపాదించటమూ ఆయనకు గల లక్షణజ్ఞానానికి నిదర్శకంగానే అమరింది.

‘మాధుర్యము’ అంటే – బహుశో యచ్ఛ్రుతం వాక్య ముక్తం వాపి పునః పునః, నోద్వేజయతి యస్మాద్ధి త న్మాధుర్య మితి స్మృతమ్, అని నాట్యశాస్త్ర నిర్వచనం. ఎన్నిమార్లు విన్నా, మళ్ళీ మళ్ళీ విన్నా – మనస్సుకు వైముఖ్యమూ, ఉద్వేజనమూ కలుగకపోగా, తీయదనమే ఊటలువారుతుండటం అన్నమాట. అవ్యాహతం మనః పుంసాం మృదుత్వజనకం తతః, హరత్యన్యపదార్థేభ్యో మధురం వస్తు కీర్తితమ్ – అని దీనినే భావవివేకం పర్యాయోక్తంగా వివరించింది. తాపతప్తమై ఉన్న మనస్సును చల్లబరిచే మహాశక్తి అది. శీతలీక్రియతే తాపో యేన త న్మధురం స్మృతమ్ – అని భావప్రకాశంలో శారదాతనయుడు. ఈ మాధుర్యం కావ్యగుణాలలో ఒకటి. ఈ గుణం లలితకోమలపదావళితో కూడినప్పుడు శబ్దగుణమని, శబ్దార్థం మనసుకెక్కిన తర్వాత కలిగే వైచిత్రితో కూడినప్పుడు అర్థగుణమని నాట్యశాస్త్రవ్యాఖ్యలో అభినవగుప్తుల వారన్నారు. వాక్యరచన కోమలమై విలసిల్లాలి. రసభావం మనను ఆ మధురస్రవంతిలో ముంచెత్తివేయాలి. లలితై రక్షరై ర్యుక్తం శృఙ్గారరసరఞ్జితం, శ్రావ్యం నాదసమోపేతం మధురం ప్రమదాప్రియమ్ – అని సోమేశ్వరుడు మానసోల్లాసంలో చెప్పనే చెప్పాడు కదా. ఇది శబ్దగుణమైనప్పుడు పృథక్పదత్వం (విడివిడి పదాలతో కూడిన సుబోధమైన శైలి) వల్ల కలుగుతుందని కావ్యాలంకారసూత్రవృత్తిలో వామనుడన్నాడు. అనతిదీర్ఘసమాసత్వం (దీర్ఘసమాసాలు లేకపోవటం), స్థాన ప్రయత్నాది సామ్యం వల్ల, అనుప్రాసాది వర్ణవిన్యాసం వల్ల కలిగే శ్రావ్యత అన్నవి దీని లక్షణాలు. ఇది అర్థగతమైనప్పుడు మసృణత్వం, ఉక్తివైచిత్రి వల్ల కలిగే ప్రాణశక్తి దీని లక్షణాలు. అర్థోచితవచోబన్ధో మాధుర్య మభిధీయతే – అని ప్రకాశవర్షుని రసార్ణవాలంకారం. మధురమైన అర్థానికి తగిన మధురమైన శబ్దాన్ని నిబంధించటమే మాధుర్యమనే రసధర్మమని ఆయన ఉద్దేశం. ఆహ్లాదకత్వం మాధుర్యం శృఙ్గారే ద్రుతికారణమ్, కరుణే విప్రలమ్భే తచ్ఛాన్తే చాతిశయాన్వితమ్ – అని మమ్మటుని కావ్యప్రకాశం. మనస్సుకు ద్రుతిని కూర్చే (చిత్తాన్ని ద్రవింపజేసే) హ్లాదనం ద్వారా రసాన్ని ప్రవహింపజేసే గుణవిశేషం ఇది. ఆత్యంతికమైన తీవ్రావేశం కలిగినప్పుడు సైతం తొట్రుపాటు లేని హృదయధర్మం మాధుర్యమని సాహిత్యమీమాంసలో మహాలంకారికుడు మంఖుకుడన్నాడు.

ఇటువంటి లక్షణవిషయాలన్నీ ప్రస్తావనకు రాగలవని తెలిసిన రామకృష్ణకవి తదనుగుణంగానే తన పూరణను నిర్వహించాడు. శృంగార వేదాంతాలను సామ్యభావంతో పరిష్కరించాడు.

రాయలు అడిగిన ప్రశ్న పద్యపూర్వార్ధంలో ఉన్నంత మాత్రాన అది పూర్వపక్షార్థం కాదు. పూర్వపక్షాశ్రయమైన సిద్ధాంతవిరోధకోటి లోనిది కాదు. అది ప్రశంసాపూర్వకమైన వాక్యోపక్రమం. అందువల్ల రామకృష్ణకవి యోగ్యయోగసామర్థ్యంతో, సిద్ధాంతానుకూలమైన తర్కంతో వాస్తవాన్ని నిర్ధారణ చేయవలసివచ్చింది.

రాయలు మాధురీమహిమ ఎట్లు కలిగెను? అని వ్యక్తీకరించినది సందేహం. దానికి హేతువుగా రామకృష్ణకవి అధరసుధారసాస్వాదనను ప్రతిపాదించాడు. ఆ అధరముయొక్క ధర్మవైశిష్ట్యాన్ని అమృతరసస్యందితగా నిరూపించాడు. ‘క్రోలుటన్ చుమీ’ అన్న నిశ్చయంతో అదే అసలు హేతువు అని ముగించాడు.

ఎట్లు కల్గెను? అన్న ప్రశ్నలోనే, ఏల కల్గెను? అన్న మరొక సందేహం కూడా అంతర్భావిగా ఉన్నది కదా. దానికి కూడా సమాధానం చెప్పాలి కనుక శ్లేషానుప్రాణితంగా సాదృశ్యహేతుకమైన అన్యార్థాన్ని నిక్షేపించాడు.

రెండు అర్థాలలో ఏది ప్రధానం? అంటే, ఎవరి సంస్కారాన్ని బట్టి వారు ప్రధానార్థాన్ని గ్రహిస్తారన్నమాట.

తీయదనానికి ఆశ్రయమైనది వారవనిత క్రింది పెదవి. సుధారసధారలు చిప్పిల్లటానికి విషయభూతంగా కవి స్వీకరించిన వస్తువిశేషం అది. ఆ రసాస్వాదనం ధూర్జటి కవిత్వానికి తీయదనాన్ని అలవరించినదని చెప్పటం కవితాత్మకమైన భావన.

భువనైక + మోహన

భువనైకమోహన అన్నప్పుడు రామకృష్ణకవి పూరణలో అర్థాంతరస్ఫురణ కూడా ఉన్నది. ‘మోహనము’ అన్నది మన్మథుని శస్త్రశక్తులలో ఒకటి. ఆ ప్రకారం ‘లోకాలన్నింటిని వశపరచుకొనే మన్మథుని సమ్మోహనశక్తియొక్క ఉద్ధతిని కలిగినప్పటికీ మిక్కిలి కోమలులైన వారవనితల ఘనతాపహారి – సంతతమధురాధరోదిత – సుధారసధారలు’ అని పద్యాన్ని అన్వయింపవచ్చును.

ఘన + తాపహారి, ఘనతా + అపహారి

ఇందాక చెప్పుకొన్న అర్థానికి మారుగా, భువనైకమోహనో, ద్ధతసుకుమారవారవనితాజనతాఘనతాపహారి అన్న సమాసాన్ని పుంలింగంగా గ్రహించి, దానిని ధూర్జటికి అన్వయించి, భువనైకమోహన = ఈరేడు లోకాలను సమ్మోహింపజేసే, ఉద్ధత = ఔద్ధత్యాన్ని వహించిన (గర్వాన్ని కలిగిన); వారవనితాజనతా = వేశ్యాంగనల; ఘనతా + అపహారి = గర్వాతిశయాన్ని పోగొట్టేవాడైన ధూర్జటిగారిచే; (వారవనితల యొక్క) సంతత మధురాధర ఉదిత సుధారసధారలు క్రోలుటన్ చుమీ – అని మరొక అన్వయం కూడా సాధ్యమే.

వారవనితాజనతా ఘనతా + అపహారి అన్న విరుపులో వారవనితా జనతకు అంతకాలమూ ఉన్న ఘనత (పరువు) కూడా ధూర్జటి వాళ్ళ ఇంటికి వెళుతుండటం వల్ల తొలగిపోతుందనే వెక్కిరింత లేకపోలేదు. ఘనతా + అపహారి = ఇటువంటివాడు ఇంటికి వచ్చిపోతూ వాడవదినెలకు ఉన్న పరువును కూడా తీస్తున్నాడన్నమాట.

ఇదీ వ్యంగ్యార్థంలో భాగమే కాని, రామకృష్ణకవికి అనభిమతార్థం కాదు.

ఉద్ధత > ఉద్యత

భువనైకమోహనో, ద్ధతసుకుమార అన్నప్పుడు ‘ఉద్ధత’ అన్న ఆ విశేషణానికంటె ‘ఉద్యత’ అన్న అనుసంధేయార్థం కూర్పబడి ఉంటే పద్యాన్వయం ఇంకా సులభంగా ఉండేది. ప్రతిపాద్యార్థమూ మరింత ప్రశంసనీయంగా ఉండేది.

“…హా, తెలిసెన్! భువనైకమోహనో
ద్యతసుకుమారవారవనితాజనతాఘనతాపహారి సం
తతమధురాధరోదితసుధారసధారలు గ్రోలుటం జుమీ.”

అన్నప్పుడు, భువనైకమోహన = సమస్తభువనాలను ఒక్క తీరున (సౌందర్యాదిభిః ముగ్ధతాకరణే) సమ్మోహింపజేసేందుకు, ఉద్యత = పూనుకొన్న, వారవనితాజనతా = వేశ్యాంగనలయొక్క, ఘన + తాపహారి = (విరహిజనుల) అధికతరమైన మన్మథార్తిని హరింపజేసే, సంతత మధుర = నిత్యమధురమైన, అధర = క్రిందిపెదవినుంచి, ఉదిత = ఉదయించిన, సుధారసధారలు = అమృతరసప్రవాహాలను (ప్రథమకు ద్వితీయార్థం); క్రోలుటన్ + చుమీ = ఆస్వాదించటం వల్లనే సుమండీ!

అని స్పష్టమైన అర్థప్రతీతి సాధ్యమయ్యేది. వ్రాతప్రతులలో అటువంటి పాఠం ఉన్నదేమో పరిశోధించాలి.

పద్యపూరణ: ప్రామాణ్యవివేచన
రాయల కొలువులో ధూర్జటి కవిత ప్రశంసకు పాత్రమై, రాయలు పూరణీయంగా అడిగిన ఈ పద్యపాదం కథ కేవలం జనశ్రుతులలో వినబడే కట్టుకథ కాదని, పద్దెనిమిదవ శతాబ్ది తొలిపాదం నాటికే ఇది ఈ నోట ఆ నోట నాటుకొని ఉన్నదని ధూర్జటి వంశీయుడైన కుమార ధూర్జటి క్రీస్తుశకం 1710 ప్రాంతాల తన కృష్ణరాయ విజయము అవతారికలో (1-29) కృతిభర్త తనతో పలికిన వాక్యంగా గ్రంథస్థం చేసిన విషయాన్ని బట్టి తెలుస్తున్నది:

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు గల్గెనో
యతులితమాధురీమహిమ” నా మును మీ పెదతాత చాల స
న్నుతిఁ గనెఁ గృష్ణరాయల మనోజ్ఞసభన్; విను, మీవు నట్ల – మ
త్కృతబహుమానవైఖరులఁ గీర్తి వహింపుము ధాత్రిలోపలన్!”

ఇందులో కుమార ధూర్జటి కృష్ణరాయల వాక్యాన్ని యథాతథంగా పేర్కొని ఉండటం వల్ల పై కథోదంతమంతా సత్యమేనని భావించటానికి వీలవుతున్నది. కృష్ణరాయవిజయం కృతిభర్త ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు గల్గెనో, యతులితమాధురీమహిమ నా మును మీ పెదతాత చాల స, న్నుతిఁ గనెఁ గృష్ణరాయల మనోజ్ఞసభన్’ అనటం వల్ల కృష్ణదేవరాయలు అడిగినది ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు గల్గెనో, యతులితమాధురీమహిమ’ అనే గాని, ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల గల్గెనో, యతులితమాధురీమహిమ’ అని కాదని వెల్లడవుతున్నది. అయితే, ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు గల్గెనో, యతులితమాధురీమహిమ’ అన్న పాఠానికంటె ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు గల్గె – నీ, యతులితమాధురీమహిమ’ అన్న పాఠం మేలని అనుకొన్నాము. కుమార ధూర్జటి ఈ పాఠభేదాలను గమనించి ఉండకపోవచ్చును. లేదా, ఆ పాఠం తన అవతారిక సందర్భంలో ఇమడదని ఆయన అనుకొని ఉండవచ్చును.

రాజసభలో సమస్యను తెనాలి రామకృష్ణుడు ఒక్కడే పూరించాడో, పరిపరివిధాలైన ఇతరుల పూరణలు కూడా ఉండినవో తెలుసుకోవటానికి ఆధారాలు లేవు.

పద్యరచనా కాలం
ధూర్జటి కృతులుగా మనకు లభిస్తున్నవి మొత్తం రెండు కృతులు. 1. శ్రీకాళహస్తి మాహాత్మ్యము, 2. శ్రీకాళహస్తీశ్వర శతకము. సాహిత్యచరిత్రకారులు వీటి రచనాక్రమం ఇదేనని భావిస్తున్నా, వీటిలో ఏది మొదటిదో, ఏది తర్వాతిదో నిర్ధారించటానికి ప్రకటమైన ఆధారాలు లేవు. రెండింటి రచనాకాలాన్ని నిరూపించే ప్రామాణికమైన ఆధారమేదీ బయల్పడలేదు.

ధూర్జటి కృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవిసమాజంలో ఒకడని కథాశ్రవణమే కాని, అందుకు సమకాలిక చారిత్రికాధారాలేవీ గురజాడ శ్రీరామమూర్తి గారు ఈ కథను చెప్పినప్పుడు వెల్లడి కాలేదు. ఒకానొక రోజున కాళహస్తిమాహాత్మ్యాన్ని తెనిగించిన ధూర్జటి అనే కవీశ్వరుడొకడు రాజాస్థానానికి విచ్చేసి, కృష్ణరాయలతో తన గ్రంథాన్ని గురించిన ప్రశంస కావించాడని, అప్పుడు రాయలు ఆ గ్రంథాన్ని తెప్పించి సావధానంగా పరిశీలించాడని, ఆ కవి వాక్చమత్కృతికి ముగ్ధుడై పండితులను ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ, యతులితమాధురీమహిమ?’ అని అడిగాడని ఆయన కథనం. ధూర్జటి రాయాస్థానంలో లేడని ఆయన కథనం. అయితే, కొండవీటి దండకవిలెలోని అష్టదిగ్గజ కవుల పట్టికలో ధూర్జటి పేరున్నది. ఉన్నది. అదేమంత ప్రామాణికమైన సాక్ష్యం కాదు. విశ్వనాథ స్థానాపతి రాయవాచకంలో ధూర్జటి పేరు లేదు. జనశ్రుతి మాత్రం ఆయన అష్టదిగ్గజకవులలో ఒక్కడనే.

కుమార ధూర్జటి పైని చెప్పిన ‘కృష్ణరాయల మనోజ్ఞసభన్’ అన్న ప్రమాణం గాక, ఆ కుమార ధూర్జటి కొడుకు లింగరాజకవి చెప్పిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యములో ఈ పద్యం ఉన్నది:

“శ్రీకాళహస్తిగౌరీనాథపదపద్మసద్భక్తియుక్తి నిశ్చలతఁ గాంచి
సారసుధాసారసరసోక్తిగుంభనఁ గాళహస్తిమాహాత్మ్య(?మహత్త్వ)కథ నొనర్చి
కృష్ణరాయకిరీటకీలితమణిగణార్చితపదాబ్జద్వయశ్రీ వహించి
యాసేతుకాశీతటావనీఖ్యాతసత్కీర్తివిస్ఫూర్తిఁ జాల వెలసి

ధరణిఁ జెలువొందె నే కవీశ్వరవతంస
రత్న మ మ్మహనీయు, ధూర్జటిసుధీంద్రుఁ
దలఁతు జలనిధివీచికా కలకలాను
కారిభూరికవిత్వవాక్పటిమ గులుక.”

ఇందులో చెప్పినట్లు కృష్ణరాయలు ధూర్జటి పాదాలకు సకిరీటంగా వంగి నమస్కరించిన సందర్భం ఎప్పటిదో లింగరాజకవి వర్ణించలేదు. చెప్పిన సందర్భాన్ని బట్టి మాత్రం ధూర్జటి కృష్ణరాయల ఆస్థానవిద్వాంసులలో ఉన్నాడనే అనుకోవాలి. అయితే కృష్ణరాయల పాలనాకాలానికి సుమారు రెండు శతాబ్దాల తర్వాత ఆయన ఉన్నాడు. ఎన్ని వివరాలను ఎంతవరకు తెలుసుకొన్నాడో చెప్పలేము.

క్రీస్తుశకం 1509 – 1524 సంవత్సరాల మధ్య శ్రీకృష్ణదేవరాయల ప్రాభవం జగద్విదితంగా ఉండిన రోజులలో ధూర్జటి కృతికర్తృత్వం సాగినట్లు కనబడదు. అల్లసాని పెద్దన, నంది తిమ్మనాదులకంటె కొంత ఆలస్యంగా ఆస్థానప్రవేశం చేసి, అక్కడి విలాసాలకు అలవాటుపడి, అదే సమయంలో రాయల కొలువులోని స్థితిగతులను పరిశీలిస్తూ, కావ్యరచనకు ఆవశ్యకమైన సాధనసామగ్రిని సమకూర్చుకొనే ప్రయత్నంలో ఉన్నాడేమో అనిపిస్తుంది. శ్రీకాళహస్తిమాహాత్మ్యము ఆశ్వాసాంతగద్యలో తన కవితాలక్షణాలను ప్రస్తావింపక నిర్విశేషంగా ‘భవపరాఙ్ముఖ ధూర్జటి ప్రణీతంబైన’ అని మాత్రం చెప్పి ఊరుకొన్నాడు. రాయల ఆస్థానంలో ఉన్న తరుణం ఈ భవపరాఙ్ముఖత్వానికి అనుకూలించిన తరుణమై ఉండదు.

శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తుశకం 1509లో రాజ్యానికి వచ్చాడు. 1530 దాకా పరిపాలించాడు. రాజ్యానికి వచ్చింది మొదలు 1516లో కళింగదేశం విజయనగర మహాసామ్రాజ్యంలో విలీనమైనంత వరకు ఘోరయుద్ధాలతో తీరిక లేకుండా ఉన్నాడు. 1517లో నంది తిమ్మన పారిజాతాపహరణమును అందుకొన్నాడు. అందులో భువనవిజయ సభాభవనం ప్రశంస ఉన్నది. ఆ తర్వాత 1519-1520 నాటి అల్లసాని పెద్దన స్వారోచిష మనుసంభవము (మనుచరిత్ర) లోనూ, తదితరకావ్యాలలోనూ ఉన్నది. 1524 ప్రాంతాల రాయల ఆముక్తమాల్యద రచన జరిగింది. 1518లో కొడుకు తిరుమలరాయలు జన్మించాడు. 1524లో ఆ పిల్లవాడి హత్య జరిగింది. 1524 నుంచి 1530 వరకు రాజ్యమంతా కుట్రలతో కూహకాలతో నిండి, తాడును చూసి పామనుకొనే దుఃస్థితిలో జీవచ్ఛవంగా కాలం గడిపాడు. అనుమానంతో తిమ్మరుసును చెరపట్టాడని పాశ్చాత్య చరిత్రకారులు వ్రాసినది నిజమే అయివుంటుంది. భువనవిజయంలో మళ్ళీ కొలువుతీరినట్లు కనబడదు. సంకుసాల నరసింహకవి వంటి కవులు తమ కావ్యాలను రాజుకు అంకితం చేద్దామని నెలల తరబడి వేచి ఉండి, నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోయిన కాలం అది.

1530లో కృష్ణరాయల మరణానంతరం విజయనగర సామ్రాజ్యం కుక్కలు చింపిన విస్తరి అయింది. అప్పటికే తిమ్మరుసు ప్రాభవం అంతరించి అయిదారేళ్ళు దాటింది. కన్నులు పోయాయి. ఆయన చుట్టపక్కాలకూ ప్రాపకాలు తప్పాయి. రోజులు గడవటం కష్టమయింది కాబోలు, 1533లో పాపం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి గుడిలో అంతవరకు అనుభవిస్తుండిన తన ప్రసాదస్వామ్యం హక్కులను సర్వభుక్తంగా తాళ్ళపాక అన్నమాచార్యుల కొడుకు పెద తిరుమలాచార్యులకు అమ్ముకొన్నాడు. ధూర్జటిని ఆదరింపగల స్థితిలో లేడు. ధూర్జటి వేరే రాజులను ఆశ్రయించినట్లు లేదు. కృష్ణరాయల తర్వాత అచ్యుతదేవరాయలు సింహాసనం ఎక్కాడన్నమాటే గాని రాచరికానికే తీరని మచ్చతెచ్చిన పరామకిరాతకుడు. అల్లసాని పెద్దన అంతటివాడు ‘కృష్ణరాయల తోడ దివి కేఁగలేక, బ్రదికియున్నాఁడ జీవచ్ఛవంబ నగుచు’ అని పరితపించిన రోజులవి. ధూర్జటికి ఆ మాత్రపు అదృష్టమన్నా దక్కినట్లు లేదు. జీవచ్ఛవానికన్నా దయనీయంగా గడిపిన రోజులవి. రాజశబ్దమంటేనే అసహ్యం పుట్టింది. ‘ఛీ! జన్మాంతరమందు నొల్లను జుమీ, యీ ‘రాజ’ శబ్దంబు’ అని చీదరించుకొన్నాడు. తన వర్తనపై తనకే పశ్చాత్తాపం ఉదయించింది. శ్రీకాళహస్తీశ్వర శతకంలోని రాజనింద అంతా అక్షరాక్షరం ఆ అచ్యుతరాయలకు వర్తిస్తుంది. అందువల్ల 1535కు దరిదాపుల శతకరచన జరిగినదని పెక్కుమంది విమర్శకుల విశ్వాసం. ఏ సంగతీ నిర్ధారణగా చెప్పలేము. వైరాగ్యం అలవడి, మనస్సును చిక్కబట్టుకోగలిగినట్లు కనబడదు. శతకంలో ‘విరక్తుఁ జేయఁగదవే’ అని స్వామిని పదే పదే వేడుకొన్నాడు. కావ్యం విషయానికి వస్తే, శ్రీకాళహస్తిమాహాత్మ్యములో మనస్సు కొంత నిలకడతో ఉన్నట్లు కనబడుతుంది. విజయనగర సామ్రాజ్యోన్నతి నాడు పొందిన ఆనందపు ఛాయలేవీ అందులో అగుపించవు. అసలు కృష్ణరాయల రాజ్యప్రస్తావనమే లేదు. 1523 – 1524 ప్రాంతాల రచన మొదలై, కృష్ణరాయలకు ఎన్నో ఒడిదుడుకులు ఎదురైన 1525 – 1530ల నడిమి కాలంలో పూర్తయి ఉండవచ్చునని అనిపిస్తుంది. లేక, 1523 నాటికే మొదలుపెట్టాడో. చతుర్థాశ్వాస పర్యంతం అప్పటికి పూర్తయినట్లున్నది. కృష్ణరాయలు అప్పటికింకా స్తిమితంగా ఉన్న 1524 ప్రాంతంలో ఎప్పుడో భువనవిజయంలో తన కావ్యగానం చేసే అవకాశం వచ్చి ఉంటుంది. ఆ గానమాధురికి రాయలు ముగ్ధుడై, ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గె నీ, యతులితమాధురీమహిమ?’ అని ప్రశ్నించటమూ, అప్పుడు తెనాలి రామకృష్ణుడు సమాధానం చెప్పటమూ భావ్యమే.

మరి ఆ కాలంలో తెనాలి రామకృష్ణుని స్థితేమిటి? అప్పటికింకా ‘రామకృష్ణుడు’ కాలేదని, ఇంకా ‘రామలింగడు’ గానే ఉన్నాడని మనకు తెలుసు. క్రీస్తుశకం 1530 ప్రాంతాల ఉద్భటారాధ్య చరిత్రము రచన జరిగింది. అప్పటికి రామలింగడు గానే ఉన్నాడు. 1530 తర్వాత అచ్యుతరాయల సంస్థానంలో ఈ కథాసన్నివేశం జరిగినదని అనుకొన్నా, అప్పటికీ రామలింగడు గానే ఉన్నాడు. 1550 – 65 ప్రాంతాల కందర్పకేతు విలాసము, హరిలీలా విలాసము కావ్యాలను చెప్పాడు. 1560 – 65 లకు నడిమికాలంలో ఎప్పుడో వైష్ణవం పట్ల మొగ్గుచూపాడు. భట్టరు చిక్కాచార్యుల సన్నిధిని సమాశ్రయణం సిద్ధించిన సమయం అది. 1575లో పాండురంగ మాహాత్మ్యము రచన జరిగింది. 1575 – 1580లకు మధ్య ఘటికాచల మాహాత్మ్యము రచన. అప్పటికి డెబ్భై సంవత్సరాలనుకొంటే 1510 ప్రాంతాల జన్మించి ఉండాలి. అప్పటికి ఎనభై సంవత్సరాలనుకొంటే 1500 ప్రాంతాల జన్మించి ఉండాలి. ఎటుచూసినా 1524 ప్రాంతాల ధూర్జటి వంటి మహాకవిపై పరిహాస చంద్రహాసాన్ని ఝళిపించేందుకు 14 కంటె 24 ఏళ్ళ ప్రాయపువాడై ఉండటం సమంజసం. అందువల్ల, 1500 – 1580 అన్నది రామకృష్ణుని జీవితకాలం అన్నమాట.

1524 నాటికి తెనాలి రామకృష్ణకవి ఇంకా తెనాలి రామలింగకవి గానే ఉన్నందువల్ల కథావిషయాన్ని ఇదమిత్థంగా నిర్ధారించేందుకు తగిన సాధనసంపత్తి లేదని కాబోలు, బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు, ‘కృష్ణరాయలు ధూర్జటికవి కవనశక్తినిఁగూర్చి పద్యరూపమునఁ బ్రశ్నింపఁగా నొకకవి పూరించిన పూరణము’ అని ఈ చాటువును కృష్ణదేవరాయల ఆస్థానంలో ‘ఎవరో కవి’ చేసిన పూరణగా తమ చాటుపద్యమణిమంజరిలో (1988 నాటి ముద్రణలో 127-వ పద్యం శీర్షిక) ఉదాహరించారు.

శైవ వైష్ణవ నామాంకనాలలో విభేదం ఉన్నంత మాత్రాన ఈ పద్యపూరణను ఎవరో కవి చేసిన పూరణ అని భావింపనక్కరలేదు. రామలింగకవి శైవుడుగా ఉన్న రోజులలో చేసినప్పటికీ, ఆ తర్వాత ప్రసిద్ధిలోకి వచ్చిన రామకృష్ణ నామాన్ని బట్టి జనులు దీనిని రామకృష్ణకవి రచనగా భావించటం అసంభావ్యమేమీ కాదు.

ఈ పూరణను నిర్వహించిన తర్వాత కొద్ది కాలానికే రామకృష్ణకవి ఉద్భటారాధ్య చరిత్రమును పూర్తిచేశాడు. అందులో తన కవిత్వాన్ని గురించి కృతిపతి ఊరదేచమంత్రి సహజసాహితీమాధురీసంయుతాత్ముఁడవు అని చెప్పినట్లుగా వ్రాశాడు. భక్తాగ్రేసరుడైన బమ్మెర పోతనగారి సహజపాండిత్య కవితావైచిత్రిలోని ప్రాణశక్తి, పరమమాహేశ్వరుడైన ధూర్జటిగారి కవనంలోని భగవన్ముఖీనమాధుర్యలక్షణం మనస్సును లోగొన్నందువల్ల కాబోలు, ఉద్భటారాధ్య చరిత్ర అవతరణికలో ఆ సహజపాండిత్యాన్ని, ఈ సుభగమాధురీమహిమను మేళవించాడని అర్థం. ధూర్జటి గారి అపూర్వమైన ‘మాధురీమహిమ’ ఇంకా ఆయన గుండెలకు హత్తుకొని ఉన్నదన్నమాట.

పద్యభావం: పునరవలోకనం
జాగ్రత్తగా పరిశీలిస్తే రామకృష్ణకవి కృష్ణరాయల ప్రశ్నను అమేయమైన ప్రతిభతో వక్తవ్యానికి అనుగుణంగా మలిచి చెప్పాడని అర్థమవుతుంది. ధూర్జటి కృష్ణరాయల సభలో చదివిన శ్రీకాళహస్తి మాహాత్మ్యము చతుర్థాశ్వాసంలోని మాణిక్యవల్లి కథ ప్రసక్తికి వచ్చిందని, ఆ కథాసంగతమైన ఉదంతాన్ని రామకృష్ణుడు ఉభయార్థద్యోతంగా చమత్కరించాడని తెలుస్తుంది.

దక్షిణదేశంలోని మధురాపురంలో మాణిక్యవల్లి అనే వేశ్యకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు. గణికాజనానికి ఉచితమైన వాతావరణంలో పెంచినా, వారు శివభక్తికి నోచుకొని చిన్ననాడే వైరాగ్యాన్ని అలవరచుకొంటారు. కులవృత్తిని వీడరాదని ఆమె వారికి చెవిలో ఇల్లుకట్టుకొని వారకాంతల విధివిధానాలను నూరిపోస్తుంది. వారు –

“అమృతము గ్రోలు జిహ్వ చవియంచుఁ దలంచునె తేనె? నింటిలో
నమరమహీరుహం బుదయమైన నరుం డవనీశు వేఁడునే?
యమిజనభాగ్యరూప మగు నాదిమతత్త్వముఁ గాళహస్తిదై
వము భజియించు మానసము వారవధూమదసౌఖ్య మెంచునే?”

అని ఆమె పలుకులను తిరస్కరిస్తారు. అమృతాన్ని ఆస్వాదించటానికి నోచుకొన్న నాలుకకు వట్టి తేనె రుచి అవుతుందా? పెరటిలో కల్పవృక్షం నెలకొన్న భాగ్యశాలికి రాజును ప్రార్థింపవలసిన ఆవశ్యకత ఉంటుందా? ఇంద్రియాకర్షణలకు లోనుగాక నిగ్రహం అలవరచుకొన్నవారి పుణ్యవశాన నేలకు దిగివచ్చిన స్వామిని, సర్వతత్త్వాలకు ఆద్యప్రకృతి అయిన శ్రీకాళహస్తిదేవుని పూజించేవారి మనస్సు వారకాంతలతోడి పొందును కోరుకొంటుందా? మేము మాంసలసుఖాన్ని ఆశించే మానవభుజంగులతోడి సౌఖ్యానికి తావీయము. జగన్నాయకుడైన పరమేశ్వరుని సన్నిధికై ఉవ్విళ్ళూరుతున్నాము – అని అంటారు. కుమార్తెల ఆ వైరాగ్యభావనకు వేశ్యమాత ఎంతగానో చింతిస్తుంది. ఆమె ఒత్తిడిని భరింపలేక వారు శ్రీకాళహస్తిక్షేత్రంలో శివుని సన్నిధికి వెళ్ళిపోవాలనుకొంటారు. దారిదొంగలు వారికి అపకారం చేయవచ్చునని సందేహించి ఈశ్వరుడే వారికి మానవరూపంలో సాక్షాత్కరించి శ్రీకాళహస్తికి తీసుకొనివెళ్తాడు. ఆ మోహనక్షేత్రములో వారు నత్కీరుని శతకపద్యాలతో పరమేశ్వరుని సన్నుతిచేస్తూ, అపూర్వమైన పారవశ్యాన్ని పొందుతారు. ఈశ్వరుడు సతీసమేతుడై వారికి ప్రత్యక్షమై తన సన్నిధి రూపమైన పెన్నిధిని వారికి అనుగ్రహిస్తాడు. ఆకాశవాణి వారి భక్తిపారమ్యాన్ని పురజనులకు వినిపించి, శివుని అనుగ్రహానికి నోచుకొన్న ఉదంతాన్ని వివరించి, వారి పేరిట ఆ పుణ్యక్షేత్రంలో మహేశ్వరలింగాలను ప్రతిష్ఠించాలని ఆదేశిస్తుంది.

మహాకవి ధూర్జటి శైవభక్తిపారమ్యానికి, తమిళంలో సీకాళత్తిపురాణంలో ఉన్న స్థూలచిత్రణకు ప్రాణప్రతిష్ఠ చేసిన ఆయన భంగీభణితికి, సాటిలేని మాధురీమహిమకు ఉదాహరణీయమైన కథ ఇది.

వారవనితా జనత – అంటే ఆ మాణిక్యవల్లి కుమార్తెలు. వారి పలుకులు ఎన్నో జన్మల అనుభవతాపాన్ని హరింపజేసే మాధుర్యసుధారసధారలు. శివుని యందలి అఖండాకారమైన అనురక్తి, పరమప్రేమ, సర్వసమర్పణభావం, పారమార్థికత, విషయవాసనల పట్ల అనాసక్తి, తత్ఫలమైన వైరాగ్యం వారికి పుట్టుకతోనే అలవడటం వారి భాగ్యవిశేషం. శివార్చనానియమసంగతి తప్ప వారికి అన్యబంధాలు లేవు. పరమేశ్వరుడు వారి భక్తినిష్ఠను గుర్తించి, సన్నిధిని అనుగ్రహించి, తానే వారి వెన్నంటి నడిచి, తాను స్వయంవ్యక్తుడై వెలసిన పుణ్యక్షేత్రానికి తానే తీసికొని వెళ్ళాడన్న కథను పోలిన కథ సాహిత్యంలో వేరొకటి లేదు. తాము అనునిత్యం సేవించుకొంటున్న ఆరాధ్యదైవతం కనుల మ్రోల నిలిచి తమను ఆత్మాభిముఖంగా నడిపిస్తున్నాడన్న అభిజ్ఞానం లేని ఆ బాలికలు మధురాపురం నుంచి చిదంబర నటరాజు వెలసిన పుణ్యక్షేత్రం దారిని మూడు నాలుగు రోజుల ప్రయాణంలో ఆ ‘ఘనతాపహారి’ యొక్క ‘సంతతమధురాధరోదితసుధారసధారలను’ ఆస్వాదించే మహాపుణ్యానికి నోచుకొన్నారు. జన్మించినది ఆదిగా శివారాధనం తప్ప వేరొకటి యెరుగని ఆ పుణ్యవతుల ఘనతాపహారి = జన్మజన్మల తాపశాంతికర ‘సంతతమధురాధరోదితసుధారసధారలను’ మనోమందిరంలో నిలుపుకొన్న ధూర్జటి పవిత్రవాక్కులకు లౌకికకవుల వాగ్విశేషాలతో ఔపమ్యానికి అందని మాధుర్యమయప్రాణశక్తి అందివచ్చింది. అమోఘమైన ఆ వాగ్ధారలో ఓలలాడిన రాయలవారికి ఆ అతులితమైన మాధురీమహిమ అచ్చెరువు గొలిపింది. తత్పూర్వం ఎన్నడూ యెరుగని పారవశ్యాన్ని పొందాడు.

మహాభక్తురాండ్రైన మాణిక్యవల్లి కుమార్తెలు నత్కీరుని శతకపద్యాలను స్తోత్రం చేసి పరమశివుని సన్నిధిని పొందిన ఈ చతుర్థాశ్వాస కథకు మునుపు తృతీయాశ్వాసంలో సాక్షాత్తు మహాకవి నత్కీరుని కథే ఉన్నది. పాండ్యరాజు కొలువుకు ఒక హరద్విజుడు వచ్చి సుందరేశ్వరస్వామి తనకిచ్చిన పద్యాన్ని చదివి వినిపిస్తాడు. ఒక ప్రియుడు తన ప్రియురాలి ధమ్మిలబంధము యొక్క గంధాన్ని మించిన సుగంధం ఉంటుందా? అని ఒక తుమ్మెదను అడగటం ఇతివృత్తం. నత్కీరుడు హరద్విజుడు చెప్పిన పద్యంలో లోకరీతి, కవిసమయం రెండూ తప్పాయని ఆక్షేపిస్తాడు. అప్పుడు సుందరేశ్వరుడే స్వయంగా వచ్చి సభలో కూర్చొని, అందులో తప్పేమిటో చెప్పమని అడుగుతాడు:

“ఈ రాజన్యుని మీఁద నేఁ గవిత సాహిత్యస్ఫురన్మాధురీ
చారుప్రౌఢిమఁ జెప్పి పంప, విని, మాత్సర్యంబు వాటించి న
త్కీరుం డూరక తప్పువట్టెనఁట, యేదీ! లక్షణంబో? యలం
కారంబో? పదబంధమో? రసమొ? చక్కం జెప్పుఁడీ త” ప్పనన్.

అని అడుగుతాడు. ఆ తర్వాత సాక్షాత్తు సుందరేశ్వరునితోడి వాదంలో పార్వతీ ధమ్మిల్లబంధమైనా సరే, దానికి సహజగంధం ఉండదని తెగవేసి చెప్పిన నత్కీరునికి లౌకిక పాండిత్యగర్వభంగం, ఆ తర్వాత శాపకలనం, తత్కారణాన పశ్చాత్తాపం, పాపవిముక్తికీ మనశ్శాంతికీ పరమేశ్వర పుణ్యతీర్థసేవనం, ఆ తర్వాత అతను శివసాయుజ్యాన్ని పొందిన పర్యంతం తృతీయాశ్వాస కథ కొనసాగుతుంది.

పరమేశ్వరుడు తన కవితలో ‘సాహిత్యస్ఫురన్మాధురీ చారుప్రౌఢిమ’ ఉన్నదని చెప్పినప్పటి ఆ అమోఘమైన సన్నివేశం రాయల వారి మనస్సులో నిలిచిపోయి ఉండాలి. దానినే ధూర్జటి కవితకు అన్వయించి,

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గె నీ
యతులితమాధురీమహిమ?”

అని సదస్యులతో తన ఆనందాన్ని పంచుకొన్నాడు. ఆ మహానందాన్ని, ఆ సన్నివేశం పూర్వాపరాలను గుర్తించిన రామకృష్ణకవి అందుచేతనే భక్తి శృంగారాలను మేళవించి –

“… హా! తెలిసెన్; భువనైకమోహనో
ద్ధతసుకుమారవారవనితాజనతాఘనతాపహారి సం
తతమధురాధరోదితసుధారసధారలు గ్రోలుటం జుమీ.”

అని ఆయన మనోగతాన్ని తన మనోధర్మానుసారం మనోహరంగా పరిపూర్ణించాడు. మహాశివుని భక్తురాండ్రైన పుణ్యాంగనల జీవితగాథను ధూర్జటి నిజోదంతంతో సమన్వయించాడు.

ఈ పూరణను విన్న రాయలు రామకృష్ణకవికి ఏ బహుమానం సమర్పించుకొన్నా అది తక్కువే అవుతుంది.

తన కావ్యోక్తిమాధురికి ప్రాణంపోశాడని నిండుమనస్సుతో ధూర్జటి గారు ఆ రోజు యువకవి శిరస్సుమీద ఎన్ని దీవెనలు కురిపించాడో!

సభవారంతా ఎంత మురిసిపోయారో!
----------------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు, 
ఈమాట సౌజన్యంతో
-

No comments: