Tuesday, September 11, 2018

షష్ఠ్యంతములు


షష్ఠ్యంతములు



సాహితీమిత్రులారా!

పరిచయము
తెలుగు కావ్యాల ప్రత్యేకతలలో షష్ఠ్యంతములు అనేది ఒకటి. ప్రాచీన కావ్యములలో సామాన్యముగా ఇష్టదేవతాస్తుతి, సుకవి ప్రశస్తి, కుకవి నింద, కృతి కర్త, కృతి భర్తల వంశ వివరణ, కావ్యోద్దేశము, మొదలగు విషయాలను చదువుతాము. కథాప్రారంభమునకు ముందు షష్ఠ్యంతములు ఉంటాయి. షష్ఠ్యంతములనగా పద్యాలు షష్ఠీ విభక్తితో అంతమయ్యే పదాలతో నిండి ఉంటాయి.

నేను ఈ వ్యాసాన్ని కొన్ని గొప్ప గుణములున్న రసికులైన పాఠకుల ఆనందానికై రాస్తున్నా. దానిని ఇలా వివరించవచ్చు – కవిత్వములో కుతూహలము ఉన్న వారికి, కొత్త భావాలలో ఆసక్తి గలవారికి, వినయసంపన్నులకు, మృదువైన హృదయము గలవారికి, మంచి కవులను పోషించువారికి, కళామృతమును ఆహారముగా భుజించువారికి అని. ఈ భావాలను ఒక షష్ఠ్యంతముగా రాస్తే అది ఇలా ఉంటుంది –

కవనకుతూహలులకు, నభి-
నవ భావరసోత్సుకులకు, నయవినయులకున్,
నవనీతహృదయులకు, స-
త్కవిపోషకులకుఁ, గళామృతాహారులకున్

కవులు తమ కావ్యాలను ఏ దైవానికో లేక ఏ మహారాజుకో అంకితము చేస్తారు. అప్పుడు ఆ కృతిభర్తపరముగా ఈ షష్ఠ్యంతములు చెప్పబడుతాయి. కాని కొన్ని వేళలలో ఈ పద్యాలు గ్రంథముయొక్క శ్రోత నుద్దేశించి కూడ అల్లబడుతాయి. వీటికి మధ్య గల భేదాన్ని వడ్లమూడి గోపాలకృష్ణయ్యవంటి విమర్శకులు వివరముగా ప్రస్తావించారు.

సామాన్యముగా ఈ షష్ఠ్యంతాలు పై పద్యమువలె కందపద్యాలు. కావ్యారంభములో కథకు ముందు షష్ఠీ విభక్తి పదములతో కనిపించే పద్యాలకు మాత్రమే ఈ ప్రత్యేకమైన షష్ఠ్యంతము అనే పేరును వాడుతారు. ఆశ్వాసాంత పద్యాలు తరచుగా సంబోధనా ప్రథమావిభక్తిలో ఉంటాయి. కాని కొన్ని ద్వితీయా విభక్తిలో లేక షష్ఠి విభక్తిలో కూడ ఉంటాయి. అట్టి దానిని ఒకటి మీకు తరువాత పరిచయము చేస్తాను. బహుశా నన్నెచోడునితో ఆరంభమైన ఈ షష్ఠ్యంతములను రాసే పద్ధతిని సుమారు గడచిన శతాబ్దపు పూర్వభాగమువరకు కవులు అనుసరించారు. కావ్యాల, ప్రబంధాల రచనపై ఆసక్తి, ఆదరణ తగ్గిన తరువాత మిగిలిన నియమాలతోబాటు ఇది కూడ అంతరిచిపోయింది.

విభక్తి
షష్ఠ్యంతాలను గురించిన వివరాలను తెలిసికొనడానికి ముందు షష్ఠీవిభక్తినిగురించి కొద్దిగా తెలిసికోవాలి. తెలుగు భాషలోని విభక్తుల అమరిక తీరు సంస్కృతములోవలెనే ఉందని చెప్పాలి. అందుకేనేమో కేతన ఆంధ్రభాషాభూషణములో ఇలా చెప్పాడు –

తల్లి సంస్కృతంబె యెల్ల భాషలకును
దానివలనఁ గొంత గానబడియెఁ
గొంత తాన కలిగె నంతయు నేకమై
తెనుఁగు బాస నాఁగ వినుతి కెక్కె
                          – కేతన, ఆంధ్రభాషాభూషణము (14)
(అన్ని భాషలు సంస్కృతమునుండి పుట్టాయి. కొంతవరకు దానివలన, కొంతవరకు తనకు తానే, ఇలా ఈ రెండు ఒకటై తెలుగు భాషగా పరిణమించి ప్రసిద్ధి కెక్కినది.)

సంస్కృతములా తెలుగు కన్నడములలో కూడ ఎనిమిది విభక్తులు ఉన్నాయి. విభక్తి (వి + భజ్ + తి) అంటే వేరు చేయుట లేక విభాగము చేయుట అని అర్థము. విభక్తి అంటే విశిష్ఠమైన సంయోగము అని కూడ అర్థము ఉంది. పదముల అర్థమును విభక్తి ప్రత్యయములతో చక్కగా అవగాహనము చేసికొనుటకు వీలగును. కేతన అంటాడు –
“అనంతరంబ విభక్తులు చెప్పెదఁ బ్రథమయుఁ ద్వితీయయుఁ దృతీయయుఁ జతుర్థియుఁ బంచమియు షష్ఠియు సప్తమియు సంబోధనంబు నన నెనిమిది తెఱంగుల విభజింపఁబడుటం జేసి విభక్తులనంబరఁగె. చేయువాడు ప్రథమయుఁ, జేయంబడునది ద్వితీయయు, నుపకరణంబు తృతీయయుఁ, జేయించుకొనువాఁడు చతుర్థియుఁ, బాయుటకున్బట్టయినది పంచమియు, నొడయండు షష్ఠియు, నునికిపట్టు సప్తమియు, సమ్ముఖంబు సేయునది సంబోధనంబునగు.”
– కేతన, ఆంధ్రభాషాభూషణము (68)
సంస్కృతములోని ఎనిమిది విభక్తులు ఆంగ్లములోని క్రింది విభక్తులతో సరిపోతాయి –
ప్రథమా విభక్తి – nominative case, ద్వితీయా విభక్తి – accusative case,
తృతీయా విభక్తి – instrumental case, conjunctive case, చతుర్థీ విభక్తి – dative case, పంచమీ విభక్తి – ablative case, షష్ఠీ విభక్తి – possessive case,
సప్తమీ విభక్తి – locative case, సంబోధనా ప్రథమా విభక్తి – denominative case.

షష్ఠియా లేక చతుర్థియా?
తెలుగులో కూడ ప్రథమాది విభక్తులు ఉన్నా, వాటి ఉపయోగములో కొద్దిగా తేడా ఉంది. ఉదాహరణకు తెలుగులో తృతీయావిభక్తి ప్రత్యయాలు చే, తో. సంస్కృతములో వీటికి ఒకే ప్రయోగము. కాని తెలుగులో చే ప్రత్యయానికి బదులు తో ప్రత్యయాన్ని ఉపయోగించలేము. చే ప్రత్యయము ప్రేరణార్థకము, తో ప్రత్యయము సహార్థకము. కొన్ని సమయములలో తృతీయావిభక్తి ప్రత్యయము చే, పంచమీవిభక్తి ప్రత్యయము వలన ఒక్కటే. ఈ విషయము ఎందుకు చెప్పుతున్నానంటే తెలుగు విభక్తుల అమరికలో ఒకే విధమైన తీరు, తర్కశాస్త్రబద్ధత లేదు.

తెలుగులో షష్ఠీవిభక్తి ఉపయోగము కొద్దిగా అసాధారణమైనది. మిగిలిన ద్రావిడ భాషలలో ఆంగ్లములోని dative case చతుర్థీ విభక్తి. కాని తెలుగులో చతుర్థీవిభక్తి ప్రత్యయాలు కొఱకు, కై, షష్ఠీవిభక్తి ప్రత్యయాలు కి, కు, లో, యొక్క. కేతన కి, కులను చతుర్థీ విభక్తిగా పరిగణిస్తాడు. ఈ విషయం క్రింది పద్యములో చక్కగా సందేహములేక విదితమవుతుంది –

కరి వచ్చెన్, గరి నెక్కెను,
గరిచేతం జచ్చెఁ , గరికిఁ గవణమువెట్టెన్,
గరి వలననుఁ, గరికుంభము,
కరియందు మదాంబుధార కడు బెడఁ గయ్యెన్
                                    – కేతన, ఆంధ్రభాషాభూషణము (98)
(ఏనుగు వచ్చెను, ఏనుగును ఎక్కెను, ఏనుగుచేత చంపబడెను, ఏనుగుకు ఆహారమును ఇచ్చెను, ఏనుగువలన, ఏనుగు కుంభము, ఏనుగునందు మదపు దార చాల ఆశ్చర్యకరమును కలిగించునదై యుండెను.)

షష్ఠీ విభక్తి ప్రత్యయములైన కి, కులు ఆంగ్లములోని dative caseకు సమానము. ఇక పోతే యొక్కను మాత్రమే సంబందార్థములో వాడుట సబబు. కాని యొక్క ప్రత్యయాన్ని విగ్రహవాక్యాలలో తప్ప సామాన్యముగా మనము తెలుగులో వాడము. రాముని బాణము అంటే చాలు, రామునియొక్క బాణము అని అనరు. ఒక అనే పదము యొక్క ఐనదని చారిత్రకుల ఊహ. సంబందార్థరూపమైన షష్ఠీ విభక్తిని శేష షష్ఠి అంటారు. రామునికి కొడుకులు అన్నప్పుడు కి ప్రత్యయము యొక్క ప్రత్యయముతో సమానము, ఇక్కడ కి శేష షష్ఠిగా వాడబడినది. లో ప్రత్యయమును నిర్ధారణ షష్ఠి అంటారు. స్త్రీలలో సీత పతివ్రతారత్నము అన్నప్పుడు లో ప్రత్యయము నిర్ధారణ షష్ఠి. జాతి, గుణ, క్రియా, సంజ్ఙలను ఆధారముగ చేసికొని ఒక వర్గమును మరొకదానినుండి వేరు చేయడమే నిర్ధారణ షష్ఠి. కి, కు ప్రత్యయాలు సంప్రదానార్థక ప్రత్యయాలు. ఈ కి, కులు మారకుండ అన్ని ద్రావిడ భాషలలో ఒకే విధముగా నున్నవి – తమిళము – కు, క్కు, కన్నడము – కె, క్కె, గె, మలయాళము – క్కు, తుళు – కు, గు, తోడా – క్, గ్, కురుఖ్ – గె, బ్రాహుయి – కె. చతుర్థిలోని కై అనునది కు, ఐల సంధి అని భావన. దీనికి నిదర్శనముగా నన్నయ వాడిన కై (కు+ఐ), కునై (కున్+ై) అనే ప్రత్యయాలను చూపుతారు –
అనఘ మా మామ శకుని నాకై కడంగి (నన్నయ, భా – సభా, 2.174) ఇందులో యతి అ అక్షరానికి కై యందలి ఐ అక్షరానికి చెల్లుతుంది.
శ్రీకైవల్యపదంబు జేరుటకునై (పోతన, భాగ, 1.1)
ఈ విషయాలు ఇంత వివరముగా ఎందుకు చెప్పాలంటే, షష్ఠీవిభక్తి యందలి కి, కుల పాత్ర సంప్రదానార్థముగా చతుర్థీవిభక్తిలోని కై వంటిదే. హిందీలో ద్వితీయా, చతుర్థీ విభక్తులకు కో అనే ప్రత్యయాన్నే వాడుతారు. తెలుగు మరియు ఇతర భాషలలో విభక్తులకు ప్రథమ, ద్వితీయ, ఇత్యాదులైన పేరులుంచడం వలన కలిగే సందిగ్ధాలను, సందేహాలను దూరం చేయాలంటే, విభక్తుల కారక నామములను (కర్త్రర్థక, కర్మార్థక, ఇత్యాదులు) ఉంచితే బాగుంటుందేమో.

ఓనమాలు – షష్ఠ్యంతాలు
సంస్కృతములో ఆయ అన్నది చతుర్థీవిభక్తి ప్రత్యయము. దీని అర్థము కి, కుల వలెనే. మనము అ,ఆలు నేర్చుకొనే వేళలో ఓనమాలు రాస్తాము కదా, అందులో ఓనమా అనేది ఓం నమశ్శివాయకు రూపాంతరము. ఓం నమశ్శివాయ, ఓం నమో నారాయణాయ వంటి బీజమంత్రాలు, సంధ్యావందన సమయములో చెప్పే కేశవాయనమః, ఇత్యాదులు, అష్టోత్తరనామశతములలో, సహస్రనామములలో ఉచ్చరించబడే దేవుని పేరులు (శ్రీకృష్ణాయనమః, ఇత్యాదులు) చతుర్థ్యంతములే. వీటి అర్థము శివునికి నమస్కారము, నారాయణునికి నమస్కారము, కేశవునికి నమస్కారము, శ్రీకృష్ణునికి నమస్కారము. కావున కి, కులు షష్ఠీ విభక్తి ప్రత్యయములైనా అవి చతుర్థీవిభక్తి స్థానములోనే ఉన్నాయి. కన్నడములో, తమిళములో ఇవి చతుర్థీవిభక్తి ప్రత్యయాలే.
కావ్యాలలో షష్ఠ్యంతాలు రాయాలనే ఆలోచన ఎలా వచ్చిందో కానీ, శాసనాలలో ఈ ప్రయోగము ఉన్నది. యుద్ధమల్లుని బెజవాడ శాసనములోని (క్రీ. శ. 898) రెండవ పద్యము (మధ్యాక్కర) నందలి మొదటి పంక్తి “పరఁగంగ బెజవాడఁ గొమరసామికి భక్తుడై గుడియు”, ఇందులో కి అనే షష్ఠీ విభక్తి వాడబడినది. కరీంనగర్ శాసనములో (క్రీ. శ. 1170) లో ఒక షష్ఠ్యంత కంద పద్యము గలదు. అది –

వర మంత్రకూట పురమున
వరదునకు జగజ్జనానువందిత చరణాం-
బురుహున కాచంద్రార్క
స్థిరముగ గుడి వృత్తి నిల్పితిన్ త్రినయనకున్
                                  – కరీంనగరం శాసనము (దక్షిణము)
(ప్రశస్తి గాంచిన మంత్రకూటపురములో ఉండే వరదునికి, లోకమునందలి జనులచే వందించబడిన పదకమలాలు గలవానికి, ముక్కంటికి, శాశ్వతముగా ఉండేటట్లు గుడి కట్టినాను.)

నన్నయభట్టు శ్రీమదాంధ్రమహాభారతములో షష్ఠ్యంతాలను వాడలేదు. కథను ప్రారంభించడానికి ముందటి పద్యము “సారమతిం గవీంద్రులు ప్రసన్నకథాకలితార్థయుక్తి” (భా, ఆది 1.26). తెలుగులో మనకిప్పుడు దొరికే ఛందస్సుమీది లక్షణ గ్రంథాలలో అతి ప్రాచీనమైనది భీమన ఛందస్సు అనబడే రేచన కవిజనాశ్రయము. ఈ పుస్తకము నన్నయ తరువాతి కాలముదని చాలమంది ఊహ. ఇందులో రెండవ అధ్యాయములోని మొదటి పద్యము షష్ఠ్యంతమే –

పరమాత్మ ముఖారుణ సర-
సిరుహ వినిర్గత సమస్త సిద్ధాక్షర పం-
క్తి రసావహ మృదుపద సుం-
దరతర కృతి రచన లీవుతను దయ మాకున్
                                 – రేచన కవిజనాశ్రయము (2.1)
(పరమాత్ముని ఎర్రని ముఖకమలమునుండి వెలువడిన సిద్ధాక్షరముల వరుసలు రసములతో నిండిన మృదు పదముల సౌందర్యాన్ని మాకు దయతో నీయుగాక.)

నన్నెచోడుని మొదటి షష్ఠ్యంతము
కవిరాజశిఖమణి నన్నెచోడుని కుమారసంభవములో మనము మొట్టమొదట షష్ఠ్యంతములను చూడగలుగుతాము. కొందరు ఈ మహాకవి నన్నయకు పూర్వుడని, మరి కొందరు తిక్కనకు తరువాతివాడని తలుస్తారు. కాని అధికులు ఇతడు నన్నయతిక్కనలకు మధ్యకాలపు వాడని అనుకొంటారు. నన్నయ షష్ఠ్యంతాలను వ్రాయలేదు కాబట్టి నన్నెచోడుడే ఈ పద్ధతికి సృష్టికర్త అని చెప్పవచ్చు. ఇతడు తన గురువైన జంగమ మల్లికార్జునునకు పరమాత్ముడైన మల్లికార్జునునకు అభేదభావము కల్పించి ఈ కావ్యమును అతని ప్రీతికొరకు రచించెను. అతనికే అంకితము చేశాడని కొందరు, అతనిని శ్రోతగా మాత్రమే భావించాడని కొందరు చెబుతారు. ఏది ఏమైనా ఇందులో కథాప్రారంభమునకు ముందు అష్టమూర్తియైన శివస్వరూపునిపై ఎనిమిది షష్ఠ్యంతములను నన్నెచోడుడు కంద పద్యాలుగా రాశాడు. దానికి ముందు గల ఈ వచనము కూడ షష్ఠ్యంతమే. “… సద్భక్త జనాత్మాలోకనైక హేతుభూతుం డగుట మునిజనముఖమణిముకురుండైన జంగమ మల్లికార్జున దేవునకు -” (మంచి భక్తుల మనోదృష్టులకు ముఖ్యమైన కారణమైనవాడగుట, మునుల ముఖాలకు అద్దమువంటి వాడైన మల్లికార్జున దేవునికి). తెలుగు సాహిత్యమునందలి మొదటి షష్ఠ్యంతము –

శ్రీకంఠమూర్తి, కమల-
శ్లోకున, కనఘునకు, మితవచోనిధికి, సుధీ-
లోకస్తుతునకు, విజ్ఞా-
నాకారున, కమితమతికి, నచలాత్మునకున్
                          – నన్నెచోడకవి, కుమారసంభవము (1.59)
(శివరూపునికి, అమలకీర్తికి, పాపములేనివానికి, మితభాషికి, పండితులచే పొగడబడువానికి, విజ్ఞానాకారునికి, అసీమ మేధాశక్తికి, నిశ్చలమైన వానికి)

తిక్కన కాలము
తిక్కన ఆంధ్రమహాభారతములోని పదిహేను పర్వాలు మాత్రమే గాక నిర్వచనోత్తరరామాయణాన్ని కూడ రచించెను. అందులో కథకు ముందు షష్ఠ్యంతాలు లేవు. కాని సీసపద్యపు తరువాతి ఆటవెలది పద్యపు సరిపాదములు ముఖవికాసమునకు, జనవిభునకు అనే పదాలతో అంతమవుతాయి. కాని ఇది మనకు పరిచితమైన షష్ట్యంతము కాదు. కాని పంచమాశ్వాసాంతములో షష్ఠ్యంతములు రెండున్నాయి. అందులో ఒకటి –

పరిజనపద్మమిత్రునకు, బాఠకమిత్రున, కన్యసైన్య వి-
స్ఫురణలతాలవిత్రునకు, సుందరగాత్రున, కిందిరామనో-
హరసుభగాతపత్రునకు, నంబుజనేత్రునకుం, బ్రమోదని-
ర్భరధరణీకళత్రునకు, రాజితగోత్రున కిజ్జగంబునన్
                                                 – తిక్కన, నిర్వచనోత్తరరామాయణము (5.142)
(సేవకులనే తామరపూవులకు సూర్యునివంటి వానికి, వైదికుల స్నేహితునకు, శత్రుసైన్యాలనే తీగలకు గొడ్డలివంటి వానికి, మంచి శారీరము గల వానికి, లక్ష్మీదేవియొక్క మనోహరమైన సిరుల గొడుగు గలవానికి, వనజనయనునకు, ఆనందముతో ఉండే విశాలమైన భూమికి రాజైనవానికి, గొప్ప వంశములో పుట్టినవానికి, ఈ జగతిలో …)
కాని తిక్కన భారతమునందలి విరాటపర్వములో కథకు ముందు ఐదు షష్ట్యంతములను కందపద్యములుగా రాశాడు. వాటిలో మొదటిది –

ఓంకారవాచ్యునకు, నన-
హంకార విరూఢ భావనారాధ్యునకున్,
హ్రీంకారమయ మనోజ్ఞా-
లంకారోల్లాస నిత్య లాలిత్యునకున్
                            – తిక్కన, భారతము, విరాటపర్వము (1.32)
(ఓంకారతత్వము తెలిసినవానికి, అహంకారము లేమిచే వృద్ధియైన భావనలచే పూజింపబడినవానికి, హ్రీంకారముతో నిండి సుందరమైన అలంకారాలతో ఉల్లాసముగా ఎల్లప్పుడు లలితముగానుండు వానికి)

ఇక్కడ మరొక విషయాన్నిగురించి చెప్పాలి. మొల్ల రామాయణములో షష్ఠ్యంతాలు లేవు. ఇది ఆమె బహుశా తిక్కన కాలము నాటిదని చెప్పడానికి ఒక నిదర్శనమని నేననుకొంటాను. తిక్కన సమకాలీనుడు, తిక్కనపై గౌరవము గురుత్వము కలిగి ఉన్న కేతన దశకుమారచరిత్రమును తిక్కనకు అంకితము చేసినాడనే చెప్పవచ్చు. ఈ కవి ఎనిమిది కంద పద్యములను షష్ట్యంతములుగా రాసి పిదప ఒక శార్దూలవిక్రీడితమును, కందమును, మాలినిని కూడ షష్ఠ్యంతములుగా రాశాడు. అందులోని శార్దూలవిక్రీడితమును క్రింద ఉదహరిస్తున్నాను –

తేజోరాజిత సర్వలోకునకు, భూదేవాన్వయాంభోజినీ-
రాజీవాప్తున, కాగమప్రథితకర్మప్రస్ఫురత్కీర్తికిన్,
బూజాతర్పితరాజశేఖరునకున్, బుష్పాస్త్రరూపోపమా-
రాజన్మూర్తికి, దోషదర్పదమనారంభైకసంరంభికిన్
                                       – కేతన, దశకుమారచరిత్రము (1.102)
(జగత్తులో అమిత తేజస్సుతో ప్రకాశించువానికి, బ్రాహ్మణకులశేఖరునకు, వైదికకర్మలచే అధికమైన కీర్తి గడించినవానికి, పూజింపబడిన ప్రభుశ్రేష్ఠునికి, మన్మథునివంటి రూపముగల వానికి, దోషదర్పములను నాశనము చేసినవానికి)

షష్ఠ్యంతములు కందపద్యములు మాత్రమేనా
పోతన తన భాగవతమును శ్రీరామునికి అంకితము చేసి అతని పరముగా నాలుగు షష్ఠ్యంతములను ఉత్పలమాలలో అల్లాడు. ఇక్కడ మరొక విశేషము ఏమంటే పోతన భాగవతాన్ని రామునికి అంకితము చేసినా షష్ఠ్యంతములను కృష్ణునిపరముగ రాసినాడు. అందులో మొదటిది –

హారికి, నందగోకులవిహారికిఁ, జక్రసమీరదైత్య సం-
హారికి, భక్త దుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో-
హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా-
హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితా ప్రహారికిన్
                                                 – పోతన, భాగవతము (1.27)
(మాలను ధరించినవానికి, నందగోకులములో విహారము జేయువానికి, శకటాసురుని, తృణావర్తుని చంపినవానికి, భక్తుల ఆర్తిని తీర్చువానికి, గోపికాసుందరుల మనస్సును హరించినవానికి, దుష్టుల సంపదలను దొంగిలించినవానికి, గోకులములో పాలను, నేతిని భుజించువానికి, పూతనను చంపినవానికి)
బహుశా ఈ పద్యము దాశరథీవిలాస కర్తయైన క్రొత్తపల్లి లచ్చయ్యను ప్రేరేపించిందేమో, అతడు కూడ తన షష్ఠ్యంతములలో ఇట్టి ఉత్పలమాలనే రాసియున్నాడు –

హారి కిరీట చారుమణిహారికి, సన్నివహారికిల్బిషా-
హారికి, దుష్ట సర్ప ఫణి హారికి, నాశ్రిత పూరుష ప్రతీ-
హారికి, వేంకటాచలవిహారికి, వార్ధిసుతాసతీ మనో-
హారికి, భక్తదోష పరిహారికి, నాస్యసరోరుహారికిన్
                                     – క్రొత్తపల్లి లచ్చయ్య, దాశరథీవిలాసము (1.66)
(అందమైన కిరీటము, రత్నమాలను ధరించిన వానికి, శత్రుసమూహముల పాపములను నాశనము జేసినవానికి, దుష్టుడైన కాళియుని పడగ నెక్కిన వానికి, ఆశ్రితులను కాపాడువానికి, వేంకటాచలవిహారికి, క్షీరసముద్రరాజతనయ భర్తకు, భక్తుల తప్పులను మన్నించువానికి, చంద్రునివలె ముఖముగల వానికి)
పెంగలూరి వేంకటాద్రి వ్రాసిన భువనమోహినీవిలాసము అనే ద్విపద ప్రబంధములో షష్ఠ్యంతములు ఐదు ద్విపదలలో గలవు. అందులో చివరివి –

నూత్నైకకోటి భానుప్రభాదివ్య
రత్నకిరీటాభి రామశీర్షునకు
లాలిత జంబూఫల శ్యామలునకు
కేలిమై వేంకటగిరి నాయకునకు
                     – పెంగలూరి వేంకటాద్రి, భువనమోహినీవిలాసము
(సూర్యకోటి సమప్రభలతో కూడిన రత్నకిరీటము దాల్చిన మనోహరునికి, నేరేడుపండు రంగువానికి, శ్రీవేంకటేశ్వరునకు)

షష్ఠ్యంతాల అంత్య దశ
1915 ప్రాంతములో అడవి సాంబశివరావు, నందగిరి వేంకటప్పారావు వ్రాసిన జగన్నాథీయములో కథను ఆరంభించుటకు ముందు షష్ఠ్యంతములకు బదులు షష్ఠీ విభక్తితో కూడ అన్ని విభక్తులను ఉపయోగించి ఎనిమిది కంద పద్యములు (ఉదాహరణకావ్యములోవలె) గలవు. ఇది నిజముగాఒక కొత్త పంథాయే. పోతుకూరి కాశీపతి అవధానులు సారంగధరీయము అనే త్ర్యర్థి కావ్యమును (పార్వతీకళ్యాణము, తారాశశాంకము, సారంగధరుని కథ) 1933లో ప్రచురించారు. ఇందులో వీరు ఐదు కందపద్యములను షష్ఠ్యంతములుగా వ్రాసినారు. కాని గడచిన శతాబ్దములో మహాకవిగా ఖ్యాతి గడించిన శ్రీరామాయణకల్పవృక్ష రచయిత విశ్వనాథ సత్యనారాయణ షష్ఠ్యంతములను తన గ్రంథములో ఎందుకో వ్రాయలేదు.

ఈ వ్యాసాన్ని ముగించేముందు కొన్ని ప్రసిద్ధ కవుల షష్ఠ్యంతములను ఇచ్చి ముగిస్తాను-

వ్రజ గజగమనా లోలున,
కజగర వర జఠర వారణాభీలునకున్,
సుజనైక కృపాళునకున్,
గుజనవిఫాలునకు, మదనగోపాలునకున్
                           – కంకంటి పాపరాజు, ఉత్తరరామాయణము (పీఠిక, 51)
(వ్రజయువతులయం దాసక్తిగలవానికి, కొండచిలువ కడుపులో ఏనుగువంటివానికి, మంచివారిపై దయ జూపువానికి, దుష్టులను తునిమినవానికి, మదనగోపాలునికి)

అవిరళ వితరణా విద్యా
నవ రాధేయునకు, సజ్జన విధేయునకున్,
గవితాస్త్రీ లోలునకున్,
ఖవిటంక నటద్యశోబ్ధి కల్లోలునకున్
                             – అల్లసాని పెద్దన, మనుచరిత్ర (పీఠిక, 45)
(దానములో మరొక కర్ణునికి, బుధజనవిధేయునికి, కవితాకన్యకయం దాసక్తిగలవానికి, ఆకాశపుటంచులలో కీర్తి సముద్రపుటలలుగలవానికి)

మాచాంబా నందనునకు,
వాచాగోచర వివేక వైయాత్యునకున్,
వాచాల విబుధ గంగా
వీచీ గంభీర వాక్య విన్యాసునకున్
                                  – శ్రీనాథుడు, హరవిలాసము (పీఠిక, 33)
(మాచాంబ కుమారునికి, గొప్ప వాగ్వివేకముగల వానికి, వాచాలుర గంగావీచికలకు గంభీరముగా ప్రత్యుత్తరము నొసగు రచనాశీలికి)

నవనీత మృదుల హృదయున,
కవనీతల భాగ్యదేవతాభ్యుదయునకున్,
భువనాదర భవనాదర
కవనాదర సత్కవిప్రకర సదయునకున్
                             – మండపాక పార్వతీశ్వరకవి, శ్రీకృష్ణాభ్యుదయము (షష్ఠ్యంతము 4)
(వెన్నవాంటి మెత్తని హృదయముగలవానికి, భూమియొక్క సంపదను అభివృద్ధి జేయువానికి, ఇంటా బయట మన్నన పొందినవానికి, కవిత్వమును ఆదరించి మంచి కవులకు దయ జూపువానికి)

మగటిమి కంబమున నిలిచి
జగజెట్టన కనకకసిపుఁ జంపి బుడుతనిన్
దగఁ జదలు కాపురుసు లె-
న్నగఁ బ్రోచిన వేల్పుగొండ నరసింగనికిన్
                       – నళ్లంతిఘల్ చక్రవర్తుల లక్ష్మీనృసింహాచార్యులు,
                          అచ్చతెనుగు కుబ్జాకృష్ణవిలాసము (1.56)
(గొప్ప శౌర్యముతో జగజ్జెట్టిగా స్తంభమున నిలిచి హిరణ్యకశిపుని చంపి కుత్సితులు నలుగగా చిన్నవాడైన ప్రహ్లాదుని బ్రోచిన నరసింహస్వామికి)

మర్దిత కాళియఫణికిఁ, గ-
పర్దభృదజ బింబితాచ్ఛ పదనఖ ఘృణికిన్,
దోర్దండ శార్ఙ్గకిణి, కఘ
కర్దమ దినమణికి, దనుజ కరివర సృణికిన్
                              – శ్రీకృష్ణదేవరాయలు, ఆముక్తమాల్యద (పీఠిక, 47)
(కాళియుడనే నాగాన్ని మర్దించినవానికి, శివునిచే, బ్రహ్మచే వందించబడినవానికి, భుజములపై శార్ఙ్గమును మోయుటచే కలిగిన ముద్ర గల వానికి, పాపపంకిలమును ఎండజేసే సూర్యునికి, రాక్షస గజములకు అంకుశమువంటి వానికి)

వేంకటగిరి నాయకునకుఁ,
బంకజభవజనకునకును, బరమాత్మునకున్,
శంకరవరమిత్రునకుఁ, గ-
లంకవిరహితునకు, మోక్షలక్ష్మీపతికిన్
                           – తరిగొండ వేంకమాంబ, శ్రీవేంకటాచలమాహాత్మ్యము (1.36)
(వేంకటాచలపతికి, బ్రహ్మ తండ్రికి, పరమాత్మునికి, శివుని మిత్రునికి, అకళంకునికి, మోక్షలక్ష్మి ఒడయనికి)
ముగింపు
ఓనమాలకు, కేశవనామములకు, అష్టోత్తరశతనామములకు, సహస్రనామములకు అనుకరణగా ప్రారంభమైన షష్ఠ్యంతరచనా పద్ధతి సుమారు ఎనిమిది శతాబ్దాలు అవిచ్ఛిన్నముగా కావ్యములలో కొనసాగింది. ఇరవైయ్యవ శతాబ్దములో ఆరంభమైన నవ కవిత అనే పెనుగాలిలో ఎన్నో పద్ధతులు కొట్టుకొని పోయాయి. అందులో షష్ఠ్యంతాలు కూడ ఒకటి. ఇప్పుడు దీనిని చమత్కారముకొరకై ఎప్పూడైనా ఎవరైనా రాస్తారు, అంతే. మరుగుపడిన ప్రాచీన తెలుగు సాహిత్యపు సౌందర్య ఖనులలో షష్ఠ్యంతము ఒకటి.
-----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: