Wednesday, July 31, 2019

తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – ఐదవ భాగం


తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – ఐదవ భాగం




సాహితీమిత్రులారా!

పదిహేడవ రోజు
మన బలగాలు యుద్ధానికి బయల్దేరినయ్. తమ్ముళ్లు, కర్ణుడు పక్కన నడవగా నీ కొడుకు ఆర్భాటంగా కదిలాడు. అప్పుడు కర్ణుడు తన రథాన్ని దుర్యోధనుడి రథం దగ్గరికి నడిపించి అతనితో “ఈరోజు యుద్ధంలో నేను అర్జునుణ్ణి చంపబోతున్నా. అతన్నెలా చంపాలో రాత్రంతా బాగా ఆలోచించి ఒక పథకం తయారుచేశా. మా ఇద్దర్ని పోల్చి చూస్తే దివ్యశరజాలాల్లో నాకతను ఉజ్జీ. దృఢత్వంలో, లాఘవంలో నాకన్నా తక్కువ. దూరంగా వున్న వాటిని ఛేదించటంలో కూడ వెనకే. సౌష్టవరేఖలో సమానుడు. ధైర్యం, శౌర్యం, భుజబలంలో చాలా తక్కువ. ఐతే అతని దగ్గర గాండీవం వుంది. నా దగ్గర విజయం అనే ఒక గొప్ప విల్లుంది. విశ్వకర్మ ఇంద్రుడి కోసం దాన్ని తయారుచేశాడు. అతను దాంతో అనేకమంది రాక్షసుల్ని జయించాడు. దాన్నతను పరశురాముడికిస్తే దాంతో అతను ఇరవయ్యొక్క సార్లు తిరిగి రాజుల్ని చంపాడు. నామీది ప్రేమతో అతనా ధనుస్సుని నాకిచ్చాడు. అది గాండీవంతో సమానం. అతనికి అక్షయతూణీరాలు, అగ్ని ఇచ్చిన అవధ్యాలైన గుర్రాలున్నయ్, ఐనా పర్లేదు, అదో పెద్ద విషయం కాదు. నాతో పాటు బళ్లకొద్ది ఆయుధాలు తెస్తా, గట్టి గట్టి రథాల్ని, దిట్టమైన గుర్రాల్ని దగ్గర్లో వుంచుతా. ఇకపోతే అతనికి సారథి కృష్ణుడు. కృష్ణుడి మూలానే అర్జునుడు అంతగా పరాక్రమించ గలుగుతున్నాడు. మనవైపు సారథ్యంలో శల్యుడు కృష్ణుడితో సమవుజ్జీ అంటారు, పైగా శల్యుడికి కృష్ణుడికన్నా అశ్వజ్ఞానం ఎక్కువ. కనక ఎలాగైనా నువ్వు శల్యుణ్ణి నాకు సారథిగా చేశావంటే చాలు, ఇంక నా యుద్ధకౌశలం ఏమిటో చూపిస్తా” అని తన ఆలోచనని సమగ్రంగా వివరించాడు.

అది విని ఆనందించాడు దుర్యోధనుడు. శల్యుణ్ణి తప్పకుండా సారథిని చేస్తానని మాట ఇచ్చాడు. ఇద్దరూ కలిసి శల్యుడి దగ్గరికి వెళ్లారు. దుర్యోధనుడతనికి భక్తితో నమస్కరించాడు. అతన్ని బాగా పొగిడాడు. “ఇవాళ మనం అర్జునుణ్ణి చంపబోతున్నాం. నువ్వందుకు కర్ణుడికి సాయం చెయ్యాలి. భీష్మ ద్రోణులు పోయాక సన్నగిల్లిన బలగాల్తోనే నేను యుద్ధం కొనసాగిస్తున్నానంటే అది నిన్నూ, కర్ణుణ్ణీ చూసుకునే. కాబట్టి నువ్వితనికి సారథ్యం వహించి నన్ను కరుణించు” అని వేడుకున్నాడు.

ఆ మాటలకి పట్టరాని కోపంతో ఊగిపోయాడు శల్యుడు. కళ్లు కెంపెక్కినయ్. కనుబొమలు ఉగ్రంగా కదిలినయ్. మొహాన చెమటలు పట్టినయ్. “నాకింత నీచపు పని చెప్పటం నీకు న్యాయం కాదు. మూర్థాభిషిక్తుడైన రాజు ఒక సూతసుతుడికి సూతుడిగా వుండటమా? ఐనా ఇతను నాకన్నా బలవంతుడా? తల్చుకుంటే నేనొక్కణ్ణే పాండవులందర్నీ చంపి నీకు రాజ్యం ఇవ్వగలను. ఈ కర్ణుడు నాలో పద్నాలుగో వంతు వుండడు, ఇతనికి నేను సారథినా? నీకు నా సంగతి సరిగా తెలీక ఇలా అన్నట్టున్నావ్, తెలిసే కావాలని అవమానిస్తుంటే చెప్పు, నేను హాయిగా మా వూరికి తిరిగిపోతా” అని బయల్దేరాడతను.

దుర్యోధనుడు సాంత్వనవచనాల్తో అతనికి సర్దిచెప్పటానికి ప్రయత్నించాడు. “రథికగుణాల్లో కర్ణుడు అర్జునుడి కన్నా మిన్న, అశ్వహృదయంలో నువ్వు కృష్ణుడి కన్నా గొప్ప. మనం అర్జునుడికి పోటీగా కర్ణుణ్ణి అనుకున్నాం. కృష్ణుడి కన్న గొప్పవాడివి నువ్వు తప్ప సారథ్యానికి సరైన వాళ్లు ఇంకెవరున్నారు?” అంటే శల్యుడు “ఇంతమందిలో నన్ను కృష్ణుడి కన్నా గొప్పవాణ్ణని చెప్పి నాకు ఆనందం కలిగించావ్. కనక ఇతనికి సారథిగా ఉండటానికి ఒప్పుకుంటున్నా. ఐతే ఒక్క మాట, సారథ్యం చేస్తూ నాకు తోచిన మాటలు విచ్చలవిడిగా మాట్లాడతా, దాన్ని మాత్రం ఎవరూ తప్పు పట్టకూడదు” అని తన షరతు చెప్పాడు. కర్ణుడి వంక చూశాడు దుర్యోధనుడు. “అలాగే కానిద్దాం” అని చెప్పి, శల్యుడితో “ఒప్పుకుంటున్నా” అన్నాడు.

దుర్యోధనుడికి ఇంకా అతను మనసు మార్చుకుంటాడేమోనని అనుమానం వుండి మార్కండేయ మహాముని తన తండ్రికి చెప్తుంటే తను విన్న త్రిపురాసుర సంహారకథని శల్యుడికి వినిపించాడు. రథిక, సారథులు చాతుర్యంలో సమానులు కావటం మహాసంగ్రామాల్లో ఎలా అవసరమో వివరించాడు. మహాదేవుడి మేరురథానికి బ్రహ్మ సారథ్యం ఎలా అవసరమైందో అలా కర్ణుడికి శల్యసారథ్యం అవసరమని ఉద్ఘాటించాడు. అది విన్న తర్వాత శల్యుడు తృప్తిచెందాడు.

అంతతో ఊరుకోక దుర్యోధనుడు శల్యుడి మరో సందేహాన్ని కూడ తీర్చటానికి పూనుకున్నాడు. “భార్గవరాముడు దివ్యాస్త్రాల కోసం ఎంతోకాలం పరమేశ్వర తపస్సు చేశాడు. అతనికి శివుడు ప్రత్యక్షమై అశుచులైన వాళ్లకి ఈ దివ్యాస్త్రాలు వశం కావు, కనక నువ్వు పరమశుచివైనప్పుడే వీటిని పొందగలవు అంటే దానికా పరశురాముడు తనకెప్పుడు అంతటి శుచిత్వం వస్తుందో అప్పుడు వచ్చి అస్త్రాల్ని దయచెయ్యమని శివుణ్ణి ప్రార్థించాడు. ఆ భార్గవరాముడు తిరిగివెళ్లి నియమనిష్టాపరుడై శివానుష్టానంలో లీనమై వుండగా కొన్నాళ్లకి దేవతలు రాక్షసుల ఉపద్రవాలు పోగొట్టమని అడగటానికి శివుడి దగ్గరకు వచ్చారు. ఆయన భార్గవుణ్ణి పిలిచి దివ్యాస్త్రాలిచ్చి వాటితో రాక్షసుల్ని జయించమని పంపాడు. అతనలాగే చేసి వచ్చాక ఆనందించి పరమశివుడు ఆ అస్త్రాల్ని అతనికి ధారపోశాడు. ఆ భార్గవరాముడు తర్వాత తన ప్రియశిష్యుడైన కర్ణుడికి ఆ దివ్యాస్త్రాలిచ్చాడు. ఇతను హీనకులజాతుడైతే అంతటి మహానుభావుడు శివానుగ్రహంతో పొందిన దివ్యాస్త్రాల్ని అలా ఇచ్చేవాడా? పైగా కర్ణుడి ముఖవర్ఛస్సు, సహజ కవచకుండలాలు అతను ఉత్కృష్టయోని జాతుడని చెప్పటం లేదా? కనక అతని జననం గురించి నీకెలాటి అనుమానమూ వద్దు, అతను తప్పకుండా ఉన్నతవంశజుడే” అని నచ్చజెప్పాడు. “నువ్వు సారథివైతే రథికుడి కన్నా అధికుడైన సారథి వున్న రథం ఔతుంది మీది, నువ్విలా ఒప్పుకోవటం నాకు చాలా ఆనందం కలిగించింది” అని అతన్నింకా పొగిడి సంతోషింపజేశాడు.

శల్యుడతన్ని కౌగిలించి సారథ్యానికి సిద్ధమయాడు. కర్ణుడు తన సారథిని పంపి దృఢమైన రథాన్ని తెప్పించాడు. దానికి పురోహితుడు పూజలు చేశాడు. కర్ణుడు రథానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి శల్యుణ్ణి రథం ఎక్కమని కోరితే అతను చెంగున ఎగిరి నొగలెక్కి కూర్చున్నాడు. అతని వెనకనే కర్ణుడూ రథారోహణం చేశాడు.

కళ్లపండగ్గా కనిపించారు కర్ణ శల్యులు దుర్యోధనుడికి. “భీష్ముడు అర్జునుణ్ణి, ద్రోణుడు భీముణ్ణి చంపుతారని ఎన్నో ఆశలు పెట్టుకున్నా, అలా జరగలేదు. నువ్వైనా ఆపని చేసి నాకు ఆనందం కలిగించు, వాళ్లూ వీళ్లూ అని లేకుండా శత్రువులందర్నీ మట్టుబెట్టు” అని కర్ణుణ్ణి ఉత్సాహపరిచాడు. శంఖ భేరీ నాదాల మధ్య శల్యుడు రథాన్ని ముందుకు కదిలించాడు. ఆవేశంగా కర్ణుడు “నా బాణాల ధాటికి బెంబేలెత్తిపోయి పాండవులు దిక్కుతోచక పరిగెత్తటం ఇప్పుడు చూద్దువుగాని” అన్నాడతనితో. శల్యుడికది నచ్చలేదు “ఎందుకీ గాలిమాటలు? అఖిలశస్త్రాస్త్ర కోవిదులు, భుజబలసంపన్నులు, ఇంద్రుణ్ణైనా గెలిచేవాళ్లు పాండవులు. వాళ్లనిప్పుడింత చులకనగా మాట్టాడుతున్నావ్ గాని గాండీవజ్యా నినదంతో నీచెవులు బద్దలౌతుంటే, భీముడి గదనుంచి రాలే నిప్పుల్తో కళ్లు మిరుమిట్లు గొలుపుతుంటే అప్పుడు భయంతో నీనోరు మూతబడుతుందిలే. భీమార్జునులు విజృంభించి మన సేనా నివహాన్ని చించిచెండాడుతుంటే అప్పుడు నీనోట్లోంచి ఎలాటి మాటలొస్తాయో చూస్తాగా” అని దెప్పిపొడిచాడు. ఆమాటలు వినపడనట్టు నటించాడు కర్ణుడు.

కర్ణుణ్ణి చూసి మన సైన్యాలు కేరింతలు కొట్టినయ్. అతను పాండవుల్ని చంపి జయం చేకూర్చబోతున్నాడని అంతా ఆశపడ్డారు. అదంతా చూసి కర్ణుడికీ పరమోత్సాహం కలిగింది. “ఇప్పుడు యుద్ధానికి ఇంద్రుడే వచ్చినా గడ్డిపోచ కింద పోరాడతా, నాకు వీళ్లెంత? భీష్మ ద్రోణుల్ని చంపామని విర్రవీగుతూ వచ్చే అర్జునుడు, మిగిలిన పాండవుల్ని ఒళ్లంతా తూట్లు పొడిచి యుద్ధం ఎలా చెయ్యాలో నేర్పిస్తా. భార్గవరాముడిచ్చిన ఈ రథం, దివ్యాస్త్రాల మహిమ ఏమిటో అర్జునుణ్ణి చంపి అందరికీ చూపిస్తా. కురురాజు ఋణం తీర్చుకుంటా” అన్నాడు గర్వంగా.

శల్యుడు ఊరుకోలేదు. “ఎవరన్నా వింటే ఈ కర్ణుడేమిటి ఇంత అవివేకి అంటారు, మెల్లగా మాట్టాడు. యుద్ధాల్లో నీ పనితనం, అర్జునుడి గొప్పతనం ఇదివరకు ఎవరూ చూడలేదా? అతను అద్భుత విక్రముడని, నువ్వు పౌరుషహీనుడివని జనానికి తెలీదా? రాత్రి వేళ వచ్చి తలపడి పోరి మగతనం పోగొట్టుకున్న అంగారపర్ణుడి కంటె, ఘోషయాత్రలో దుర్యోధనుణ్ణి చెరబట్టి పరువు పోగొట్టుకున్న చిత్రసేనుడి కంటె, ఖాండవవనాన్ని రక్షించుకోలేక సిగ్గుతో తిరిగిపోయిన ఇంద్రుడి కంటె, మాయాకిరాతుడై పంది కోసం పోరి భంగపడ్డ పరమశివుడి కంటె గొప్పవాడైన వీరుడెవడన్నా అర్జునుణ్ణి మించిన పోటుగాణ్ణంటే అర్థం వుంది గాని మన్లాటి వాళ్లు అలాటి మాటలనటం నోటిదురదే ఔతుంది. దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు, నువ్వు, అశ్వత్థామ, కృపుడు అంతా కలిసి ఉత్తరగోగ్రహణం నాడు పడ్డపాట్లు మర్చిపోయావా? అర్జునుడి బాణాలు ఇంతలోనే తుప్పుపట్టాయా? అప్పుడైతే సిగ్గులేకుండా పారిపోయావ్. కనీసం ఇప్పుడు గట్టిగా నిలబడి పోరతానని ఒట్టేసుకో. అతని చేతిలో చచ్చినా కనీసం వెనకడుగెయ్యకుండా అర్జునుడితో యుద్ధం చేశావన్న పేరన్నా మిగుల్తుంది” అని బాగా తగిలించాడతనికి.

కర్ణుడు కోపాన్ని దిగమింగుకుని “మేం ఇద్దరం హోరాహోరీగా పోరాడేప్పుడు చూసి చెబ్దువు గాని మాలో ఎవరు శక్తివంతులో” అంటే అలాగే చేస్తానని ఊరుకున్నాడు శల్యుడు. రథాన్ని కదిలించమని కర్ణుడంటే మనసేనల మధ్యలోకి తీసుకొచ్చాడు శల్యుడు. కర్ణుడు మన సేనలందర్నీ కేకేసి పిలిచి “మీలో ఎవరు నాకు ముందుగా ఇదుగో అర్జునుడని చూపిస్తారో వాళ్లు కోరుకున్న కోరికలు తీరుస్తా. అంతేకాకుండా కృష్ణార్జునులిద్దర్నీ చంపాక వాళ్ల ఆభరణాలు కూడ వాళ్లకే ఇస్తా. అందరూ జాగ్రత్తగా అర్జునుడి కోసం చూస్తూండండి” అని ప్రకటించి శంఖం పూరిస్తే దుర్యోధనుడు పరమానందభరితుడయాడు. మన బలంలో నిస్సానాది తూర్యధ్వనులు మిన్నుముట్టినయ్.

శల్యుడు పరిహాసపు నవ్వుతో కర్ణుణ్ణి చూస్తూ “అర్జునుణ్ణి చూపించమని వాళ్లనీ వీళ్లనీ అడగటం, చూపించినందుకు ధనాలు ఇవ్వటం ఎందుకు – ఇప్పుడే అతనే నీదగ్గరికి వస్తాడులే. అంత డబ్బెక్కువైతే ఏవన్నా సత్యార్యాలకి వాడొచ్చుగా? పైగా కృష్ణార్జునుల్ని చంపుతానని బీరాలు కూడానా? ఎక్కడన్నా నక్క వెళ్లి సింహాల్ని చంపటం చూశామా? ఏమైనా దుర్యోధనుడికిచ్చిన మాట ప్రకారం అతని మంచి కోరి నీకు సలహా చెప్తున్నా, కోపం తెచ్చుకోకు. బుద్ధిగా చుట్టూ బోలెడంత సైన్యాన్నుంచుకుని గాని అర్జునుడి మీదికి వెళ్లకు” అని ఉచితసలహా పడేశాడు.

దానికి కర్ణుడు “ఇలాటి మాటల్తో నా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీద్దామని చూస్తున్నావ్, అది ఇంద్రుడంతటి వాడి వల్లే కాదు, నీలాటి వాళ్ల మాట చెప్పాలా?” అని అధిక్షేపించాడు. దానికి శల్యుడు “నేను చెప్పే బుద్ధులు నీకేం ఎక్కుతయ్ లే! అర్జునుడి చేతిలో చావుదెబ్బలు తింటున్నప్పుడు బుద్ధిమంతుడివౌదువు గాని. అర్జునుడితో సమానమనుకునే నువ్వు సింహం మీదికి దూకే జింకవి, మదపుటేనుగుతో తలపడే కుందేలువి, పులితో పెట్టుకునే కుక్కవి, గరుత్మంతుడి అంతుచూద్దామనుకునే పామువి” అని అగ్ని మీద ఆజ్యం పోశాడు.

కోపంతో కర్ణుడి కళ్లెర్రబడినయ్. “గుణహీనుడివి నీకు గుణవంతుల గుణాలెలా తెలుస్తయ్? అర్జునుడి సంగతి నాకు తెలుసు గాని నీకేం తెలుసు? నేనెంతో కాలం నుంచి దాచి పూజిస్తున్న దివ్యాస్త్రం ఒక ఇనపబాణం నా దగ్గరుంది. అది శత్రువుని జయించి తీరుతుంది. దాంతో ఒకడు, పరశురాముడిచ్చిన భార్గవాస్త్రంతో మరొకడు – ఇలా కృష్ణార్జునులిద్దరూ నా అస్త్రాలకి బలికాబోతున్నారు. యుద్ధం గురించి నీకేం తెలుసు? అదీగాక పాపపుదేశం మద్రదేశం నీది. చిన్నపిల్లల్నడిగినా చెప్తారు నువ్వు నీచుడివి, కుటిలుడివి, స్నేహితులకి అపకారం చేసేవాడివని. వావివరసలు లేకుండా ఆడా మగా ఎవరుబడితే వాళ్లతో తిరుగుతారు, పాలకన్నా ముందే కల్లు తాగే జాతి నీది. ఎవరెవరికో పుట్టి ఎప్పుడూ కల్లులో మునిగితేలే మీకు మంచీ చెడూ ఎలా తెలుస్తయ్, మంచిమాటలెలా వస్తయ్? నేను గదతో నీ తల పగలకొట్టకముందే ఇక్కణ్ణుంచి బయల్దేరు” అని గద్దించాడు.

శల్యుడు తాపీగా, “నీ మంచి కోరి చెప్పే మాటలు నీకు చెవి నాటటం లేదు. ఐనా చెప్పటం నా బాధ్యత, చెప్తా. ఇప్పుడో చిన్న కథ విను. విన్నాక నా సలహా పాటించావా మంచిది, లేదా అంతకన్నా మంచిది. ఒక ద్వీపాన ధర్మవర్తి అనే రాజు పట్టణంలో ఒక వైశ్యుడున్నాడు. చాలా ధనవంతుడు, దానశీలి. అతనికి అనేకమంది కొడుకులు. ఓ కాకి ఆ పిల్లలు పడేసే ఎంగిళ్లు మెక్కి బాగా బలిసింది. వాళ్లూ దాంతో ఆడుకుంటూ దాన్ని పొగిడితే అది నిజమేననుకుని కనపడ్డ పక్షులన్నిటి కంటే తనే గొప్పదాన్నని గర్వంతో తిరుగుతుంది. ఒకనాడు ఓ హంసల గుంపు అక్కడికొస్తే పిల్లలు కాకితో “నిన్ను మించిన పక్షి ఈ ప్రపంచంలో లేదు, ఈ హంసల్తో పోటీపడి వాటినోడించు” అంటే ఆ బుద్ధిలేని పిల్లల మాటలు ఆ మూర్ఖపు కాకి నిజమేననుకుని వెళ్లి పందానికి రమ్మని ఆ హంసల్ని పిలిచింది. అవి విరగబడి నవ్వి “మానస సరోవరంలో విహరిస్తూ ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎంతదూరమైనా సునాయాసంగా ఎగిరి వెళ్లే మాతో కాకివి నీకు పోటీ ఏమిటి?” అన్నయ్. కాకి మాత్రం ఏమాత్రం తగ్గకుండా “నేను రకరకాలుగా ఎగురుతా, మీరు నాకో లెక్కా?” అని చులకన చేసింది. “సరే ఐతే ఆ సముద్రం మీదుగా నేరుగా ఎగురుదాం పద” అని ఒక హంస దాంతో పందానికి బయల్దేరింది. మిగిలిన కాకులు వద్దని వారిస్తున్నా ఆ బలిసిన కాకి హంసతో పోటీగా సముద్రం మీద ఎగిరింది.

హంస మెల్లగా నేరుగా వెళ్తుంటే కాకి రకరకాల చేష్టలు వెయ్యటం మొదలెట్టింది. హంస చుట్టూ చక్కర్లు కొట్టటం, దాన్ని కవ్వించటం చేస్తుంటే మిగిలిన కాకులు ఇదీ బాగానే వుందే అని కేరింతలు కొడుతూ హంస ఓడిపోయిందని అరవటం మొదలెట్టినయ్. దాంతో హంస ఉత్సాహం పుంజుకుని ఎగురుతుంటే కాకి దాన్ని అందుకోలేక రొప్పటం మొదలెట్టింది. ఇంకాసేపటికి కాకి నీళ్లలోకి పడిపోయే స్థితికి వచ్చి పళ్లబిగువున మునక్కుండా చావుబతుకుల్లో వుండి బుద్ధితెచ్చుకుని హంసని వేడుకుంటే ఆ హంస కనికరంతో దాన్ని లేపి తన బుజమ్మీద వేసుకుని ఒడ్డుకి తెచ్చి దించింది. “ఇంకెప్పుడూ కొవ్వెక్కి ఇలాటి బుద్ధిలేని పందాలకు పోవద్ద”ని హంసలు దానికి బుద్ధిచెప్పి ఎగిరిపోయినయ్.

ఆ కోమటి కొడుకుల ఎంగిళ్లు తిని బలిసి తన బలం ఏమితో మర్చిపోయిన కాకిలాటి వాడివి నువ్వు. అవతలి వాళ్ల బలం తెలీక ముందుకి దూకుతున్నావ్. ఇది పొరపాటు. వాళ్లతో తలపడగలవాళ్లని వాళ్లమీదికి పంపు, నీకు తగ్గవాళ్లని నువ్వు చూసుకుని వాళ్లతో యుద్ధం చెయ్యి, పేరు తెచ్చుకో” అని వినిపించాడు.

“కృష్ణార్జునుల సంగతి నాకు పూర్తిగా తెలుసు. తెలుసుకునే వాళ్లతో యుద్ధానికి సిద్ధమయ్యా. ఐతే ఒక్క విషయం మీకందరికీ చెప్పాలి” అని చుట్టూ వున్న వాళ్లకి వినపడేట్టు ఇలా చెప్పాడు – “నాకున్న లోపాలల్లా రెండు; ఒకటి పరశురాముడి శాపం, రెండోది బ్రాహ్మణ శాపం. అవి లేకుంటేనా, ఎవరూ నాముందు ఆగరు. నేను అస్త్ర విద్య కోసం మహేంద్రగిరిలో వున్న పరశురాముడి దగ్గరికి వెళ్లినప్పుడు నా కులమేమిటని అడిగితే బ్రహ్మాస్త్రం సంపాయించాలని బ్రాహ్మణుణ్ణని అబద్ధం చెప్పా. ఆయన నాకు బ్రహ్మాస్త్రంతో సహా అనేక దివ్యాస్త్రాలిచ్చాడు. ఒకరోజు ఆయన నా తొడ మీద తలపెట్టి పడుకుని నిద్రపోతున్నప్పుడు ఒక విచిత్రమైన పురుగు నా తొడని తొలవటం మొదలెట్టింది. కదిల్తే గురువుగారికి నిద్రాభంగం ఔతుందని నేను రక్తం పారుతున్నా బిగబట్టి కూర్చున్నా. ఆయన నిద్రలేచి ఆ రక్తం చూసి నా ధైర్యానికి ఆశ్చర్యపడి నువ్వు బ్రాహ్మణుడివి కాదు, ఎవరివని గద్దిస్తే తప్పక నిజం చెప్పా. ఆయన మండిపడి కపటంతో నువ్వు తీసుకున్న బ్రహ్మాస్త్రం అవసరానికి నీకు గుర్తు రాదు, చావు సమయంలోనే అది గుర్తుకొస్తుంది; నీకాపద వచ్చినప్పుడు భార్గవాస్త్రం కూడ నీకు తోచదు పో అని శపించాడు.

అలాగే ఒకసారి నేను అస్త్రవిద్యని అభ్యాసం చేస్తుండగా అనుకోకుండా ఒక బాణం ఒక గోవుని చంపింది. అప్పుడు దాని యజమాని అది హోమధేనువు పెయ్య అని మహాక్రోధంతో చావుబతుకుల సంగ్రామ వేళ నా రథచక్రం కుంగుతుందని, ఎవరిని చంపటానికి నేను ప్రయత్నిస్తున్నానో వాళ్ల చేతిలో చస్తానని శపించాడు. ఎన్ని విధాలుగా బతిమాలినా, ఆశలు చూపించినా వినకుండా వెళ్లిపోయాడు.

ఏమైనా, ఇప్పుడు బ్రహ్మాస్త్రం, భార్గవాస్త్రం రెండూ గుర్తుకొస్తున్నయ్, కాబట్టి కృష్ణార్జునుల్ని చంపటానికి ఇదే సరైన సమయం. విలుకాడైనవాడి జీవితానికి సాఫల్యత మేటివిలుకాడని పేరు తెచ్చుకున్న గాండీవితో తలపడటంలోనే వుంది. ఆ అర్జునుణ్ణి ఢీకొని ముప్పుతిప్పలు పెట్టే భాగ్యం నాకు దొరకబోతుంది, ఇంకా ఆలస్యం ఎందుకు అతని మీదికి పద” అని ఆదేశించాడు కర్ణుడు.

అది విని శల్యుడు లోలోపలే ఆనందించాడు. తన మాటల ప్రభావం కర్ణుడి మీద బాగానే పనిచేసిందని, దానివల్లనే అర్జునుడి చేతిలో చావు తప్పదని నిశ్చయించుకుని అందుకు కారణం మాత్రం తను అర్జునుడికి తక్కువ కావటం కాదు, శాపాల వల్ల అని అందర్నీ నమ్మించటానికే ఆ విషయాలు అంత పెద్దగా అందరికీ వినిపించాడని అర్థం చేసుకున్నాడు. ఐతే కర్ణుడతని మనోభావాన్ని తనూ అర్థం చేసుకున్నట్టు “నువ్వేదో నన్ను భయపెట్టి అర్జునుణ్ణి గెలిపిద్దామని చూస్తున్నట్టున్నావ్, నాముందు ఆ పప్పులుడకవ్. దుర్యోధనుడు నీకిచ్చిన మాట వల్ల నువ్వేమన్నా భరిస్తున్నా గాని లేకుంటే నీ కారుకూతలకి ఈపాటికే నీ తల నరికేవాడిని. నికృష్టపు కథలు చెప్పి నా మనసు విరిచే ప్రయత్నం మానుకో. కృష్ణార్జునుల్ని నేనెలా జయిస్తానో చూడు” అంటే శల్యుడు “ఉన్నమాట చెప్తా విను, వెయ్యిమంది కర్ణులు వచ్చినా అర్జునుణ్ణి గెలవలేరు” అని వడ్డించాడు. కర్ణుడికి ఒళ్లు మండిపోయింది. “ధృతరాష్ట్రుడి దగ్గర గోష్టిలో ఒక వృద్ధబ్రాహ్మణుడు చెప్తుంటే విన్నా. బాహ్లిక దేశం వాళ్లు గోమాంసం నంచుకుంటూ మద్యపానం చేసి నగ్నంగా నోటికొచ్చినట్టు మాట్టాడుకుంటూ తిరుగుతారని. ఆ బాహ్లికులు నీకు స్నేహితులు. మీ మద్రదేశం వాళ్లు కూడ అవినీతిలో బాహ్లికుల కన్నా నాలుగాకులు ఎక్కువే చదివారని విన్నా. కాబట్టి నోరు మూసుకుని కూర్చో” అని గద్దించాడతన్ని.

శల్యుడు ఊరుకోలేదు. “నీ మొనగాడితనం గురించి ఇదివరకు భీష్ముడు చెప్పింది గుర్తు తెచ్చుకో. అన్ని విధాలుగా ఆలోచించి నిన్ను వట్టి అర్థరథుడివని లెక్కకట్టాడు కదా? పైగా అధములైన వాళ్లకి ఇతరుల తప్పులు కనపడతయ్ గాని సొంత తప్పులు కనపడవన్నట్టు మీ అంగదేశం వాళ్లు డబ్బుల కోసం స్నేహితుల్ని చుట్టాల్ని మోసాలు చేస్తారు, భార్యల్నైనా సరైన ధర వస్తే అమ్మేస్తారు. అట్లాటి వాళ్ల రాజువి నువ్వు. నువ్వు ఇతరుల లోపాల గురించి మాట్టాడితే ఎలా? ఐనా ఏ దేశంలోనైనా మంచి వాళ్లుంటారు, చెడ్డ వాళ్లూ వుంటారు అంతేగాని మంచిదేశం, చెడ్డదేశం అని వుండవ్. బుద్ధిలేని మాటలెందుకు?” అని బదులిచ్చాడు. ఇదిచూసిన దుర్యోధనుడు వచ్చి ఇద్దరినీ బతిమాలి మైత్రి చేశాడు.

ఒకపక్క త్రిగర్త సైన్యాలు అర్జునుణ్ణి చుట్టుముట్టినయ్. దుర్యోధనుడు మనపక్షంలో దొరలందర్నీ యుద్ధానికి ఉత్సాహపరిచాడు. అశ్వత్థామ కూడ నిరాయుధుడైన తన తండ్రిని నీచంగా చంపిన ధృష్టద్యుమ్నుణ్ణి చంపేవరకు కవచం తియ్యనని ప్రతిజ్ఞ చేశాడు. మన వాళ్లందరూ ఉత్సాహంగా కేకలు వేసి శంఖాలు పూరించారు.

దుర్యోధనుడు గజసైన్యంతో భీముణ్ణి ఢీకొన్నాడు. కర్ణుడు ఉగ్రరూపంతో ధర్మజుడి మీదికి వెళ్లాడు.

ధృతరాష్ట్రుడికో సందేహం కలిగింది. “కర్ణుడు అర్జునుడితో తలపడతాడనుకున్నా. ఇలా ధర్మరాజుతో పోరటం ఎలా జరిగింది? అర్జునుడు అడ్డుపడి అతన్ని ఆపి తనే కర్ణుడితో ఎందుకు పోరాడలేదు?” అనడిగాడు. సంజయుడు ఇలా చెప్పుకొచ్చాడు.

అసలు యుద్ధం మొదలు కాకముందు కర్ణుడు పన్నిన వ్యూహాన్ని చూసి ధర్మరాజు అర్జునుడితో “చూశావా కర్ణుడి వ్యూహం ఎంత పటిష్టంగా వుందో? అదలా వచ్చి మనబలం మీద పడితే తట్టుకోవటం కష్టం. అలా జరక్కుండా ఆపే వ్యూహాన్ని నువ్వు తయారుచెయ్” అని పురమాయించాడు. దానికి అర్జునుడు “ఇక్కడ ముఖ్యమైన పని కర్ణుణ్ణి చంపటం. అది నాకు కష్టం కాదు, చేసి చూపిస్తాగా” అని భరోసా ఇచ్చాడు. ధర్మజుడు ఆనందించి “బాగుంది, ఐతే నువ్వాపని చెయ్. భీముడు దుర్యోధనుడితో, నకులుడు వృషసేనుడితో, సహదేవుడు సౌబలుడితో, శతానీకుడు దుశ్శాసనుడితో, సాత్యకి కృతవర్మతో, ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామతో ద్రౌపదేయులు, శిఖండి కలిసి మిగిలిన ధార్తరాష్ట్రుల్తో, నేను కృపుడితో తలపడదాం” అని తన ఆలోచన చెప్తే అలాగేనని అర్జునుడు వెళ్లి మిగిలిన వాళ్లందరికీ చెప్పి వచ్చాడు.

రెండు సైన్యాలు ముందుకురికినయ్. అర్జునుడు కర్ణుడున్న చోటికి బయల్దేరాడు. ఐతే దార్లో అతన్ని సంశప్తకసైన్యాలు అడ్డుకున్నయ్. ప్రాణాల్ని లెక్కచెయ్యకుండా చుట్టుముట్టి పోరాడసాగినయ్. అదిచూసి కర్ణుడు పాంచాలబలాల మీదికి దూకాడు. దుర్యోధనుడతనికి సాయంగా నిలిచాడు. చేది సైన్యాలు పాండవ సైన్యాల్ని మట్టుబెట్ట సాగినయ్. కర్ణుడు పాంచాల సైన్యాల్ని పీనుగుపెంటలు చేశాడు. విచిత్రరథప్రచారాల్తో తిరుగుతూ కనిపించిన బలగాలన్నిట్నీ తన బాణాలకి బలిచేశాడు. అంతలో ధర్మరాజు కేతనం కనిపిస్తే అటు బయల్దేరాడు కర్ణుడు.

అతనికి ధృష్టద్యుమ్నుడు తన సైన్యంతో అడ్డుపడ్డాడు. పాంచాలబలాలు అతన్ని దాటుకుని వెళ్లి కర్ణుడితో తలపడినయ్. అతను అప్పటికప్పుడే భానుదేవ, చిత్రసేన, సేనాబిందు, తపన, శూరసేనులనే పాంచాలరాజుల్ని చంపాడు. ఇంకా ముప్పైమంది దొరల్నీ యముడి దగ్గరికి పంపాడు. అతని చక్రరక్షకులు సుషేణ సత్యసేనులు, కొడుకు వృషసేనుడు మరో ఇరవైమూడు మంది కొడుకులు అతనికి తోడుగా సమరకౌశలాన్ని చూపిస్తుంటే ముందుకు సాగాడు కర్ణుడు. ధృష్టద్యుమ్న, శిఖండులతో పాంచాలసైన్యం, సాత్యకి, నకుల సహదేవులు, భీముడు తోడుగా పాండవబలాలు అతన్ని అడ్డుకున్నయ్. అదిచూసి దుర్యోధనుడు దుశ్శాసన శకునుల్తో కలిసి కర్ణుడికి తోడుగా వచ్చి నిలిచాడు.

కర్ణుడి కొడుకులు భీముడితో తలపడ్డారు. వాళ్లలో సుషేణుడు ఒక భల్లంతో భీముడి విల్లు తుంచి ఏడు నారసాలు వక్షాన నాటి పెద్దగా అరిచాడు. భీముడు ఉగ్రుడై ఇంకో విల్లు తీసుకుని వాడి వింటిని విరిచి ఇరవై ఏడు బాణాలు వాడి ఒంటికి నాటాడు. కర్ణుడు కమ్ముకుంటే అతన్ని డెబ్భైమూడు ఉబ్బువాలాల్తో వారించి అతని కొడుకు సత్యసేనుడు దగ్గరికొస్తే వాడి గుర్రాల్ని, సూతుణ్ణి, విల్లుని, జెండాని విరిచి ఒక కత్తిబాణంతో వాడి మెడ నరికాడు. ఇంక భీముడు విజృంభించి కనిపించిన వీరులందర్నీ విళ్లు తుంచి, రథాల్ని నుగ్గుచేసి వీరవిహారం చేస్తుంటే అతనికి మళ్లీ సుషేణుడు కనిపిస్తే వాడి వెంటపడి ఒక గట్టినారసం వేస్తే దాన్ని కర్ణుడు మద్యలోనే ఖండించాడు. ఇంకోసారి అలాటి బాణమే వేస్తే దాన్నీ కర్ణుడు తుంచాడు.

ఇంతలో నకులుడు సుషేణుడికి ఇరవై అమ్ముల్తో గాయాలు చేశాడు. కోపంతో సుషేణుడు తొమ్మిది బాణాలతని ఒంటికి నాటి విల్లు విరిచి అరిస్తే నకులుడింకో విల్లు తీసుకుని వాడి వింటిని విరిచాడు. వాళ్లలా ఘోరయుద్ధం చేస్తుంటే వృషసేనుడు సాత్యకితో తలపడ్డాడు. సాత్యకి మూడుబాణాల్తో సారథిని, ఒక భల్లంతో వింటిని, ఏడస్త్రాల్తో గుర్రాల్ని చంపి, ఒక కాండంతో కేతనాన్ని విరిచి మూడు బాణాలతని రొమ్మున నాటాడు. మూర్ఛపడి లేచి వృషసేనుడు వాలూ పలకా తీసుకుని వస్తే అవీ నుగ్గుచేశాడు. ఇలా విరథుడు, నిరాయుధుడు ఐన వృషసేనుణ్ణి దుశ్శాసనుడు తన రథం మీద ఎక్కించుకుని తీసుకుపోయాడు. మరో రథం తీసుకుని తిరిగివచ్చి తండ్రికి తోడుగా నిలిచాడు వృషసేనుడు.

కర్ణుడు సాత్యకి మీదికి కదిల్తే ద్రౌపదేయులు, ధృష్టద్యుమ్నుడు సాత్యకికి సాయంగా కర్ణుడితో తలపడ్డారు. ఐతే కర్ణుడు తన బాణపరంపరల్తో వాళ్లందర్నీ ముంచెత్తి వాళ్లకి దిక్కుతోచకుండా చేశాడు. వాళ్లు దైన్యంగా చూస్తుంటే ధర్మరాజు మీదికి కదిలాడు కర్ణుడు. సాత్యకి, శిఖండి వచ్చి అతన్ని అడ్డుకున్నారు. కాని కర్ణుడి ధాటికి నిలవలేకపోయారు వాళ్లు. దావాగ్నిలా కర్ణుడు పాండవసైన్యాల్ని కాల్చాడు. వాళ్ల సైన్యంలో మేటిదొరలంతా నోటమాట రాక చూస్తూ నిలబడ్డారు.

ధర్మరాజు కర్ణుడి మీద బాణవర్షం కురిపించాడు. ఐతే అతను నవ్వుతూ వాటిని మధ్యలోనే తుంచాడు. ధర్మజుడి విల్లు సగానికి విరిచి తొంభై వాడిబాణాల్తో అతని కవచాన్ని భేదించాడు. మణిమయాభరణాల్తో సుందరమైన అతని శరీరాన్ని రక్తమయం చేశాడు. ఐనా రాజధర్మానికి బద్ధుడై ధర్మరాజు కదలకుండా నిలబడి సమరం సాగించాడు. వేగంగా ఒక శక్తిని కర్ణుడి మీద విసిరితే అతను దాన్ని ఏడు భల్లాల్తో ఖండించాడు. ధర్మరాజు నాలుగు తోమరాలు వేసి అతని వక్షాన్ని చేతుల్ని గాయపరిచాడు. కర్ణుడు క్రూరంగా అతని సారథిని చంపి, జెండా కూల్చి పదునైన బాణాల్తో నొప్పించాడు. సాత్యకి, శిఖండి తిరిగొచ్చి అతన్ని వారించబోయారు కాని అతను వేగంగా వాళ్ల రథాలు, విళ్లు విరిచి శరీరాలకి బాణాలు నాటి గాయాలు చేసి మళ్లీ ధర్మరాజుని అనేక బాణాల్తో నొప్పించాడు.

ఆ ధాటికి నిలవలేక రథాన్ని తనే తోలుకుంటూ ధర్మజుడు పారిపోబోతుంటే కర్ణుడతని వెంటబడి ఆపాడు. “నీకు ధర్మాధర్మాలు తెలుసునంటారే మరి క్షత్రియుడివే ఐతే ప్రాణాల మీది తీపితో ఇలా పారిపోతావా? బ్రాహ్మణుడిలా యాగాధ్యయనాలు చేసుకోపో. నేనుగాబట్టి వదిలేస్తున్నా గాని మరెవరైనా ఐతే చచ్చేవాడివి, కృష్ణార్జునులెక్కడున్నారో వెదుక్కుని వాళ్ల దగ్గరికి పో” అని కుంతికిచ్చిన మాట వల్ల చంపకుండా వదిలేశాడతన్ని.

ధర్మరాజు అవమానంతో ఖిన్నుడై వెనక్కి తిరిగాడు. అతనితో పాటే వాళ్ల సైన్యాలు కూడ వెనక్కి మళ్లినయ్. మనవాళ్లు సంతోషంతో కేకలు పెట్టారు. భేరీమృదంగ వాద్యాల్తో మన సైన్యం చిందులేసింది. ఇదిచూసి ధర్మరాజు తన వాళ్లందర్నీ పెద్దగా అరిచి పిలిచి యుద్ధం ఆపొద్దని బతిమాలాడు. అప్పుడు వాళ్లు కొంత ధైర్యం తెచ్చుకుని వెనక్కి తిరిగివస్తే మనబలాలు మళ్లీ తలపడినయ్. భీముడు విజృంభించి మన సేనల్ని కలగించాడు. ధర్మరాజు పరాభవాన్ని చూసి సాత్యకి, శిఖండులతో “నేను చూస్తుండగానే ఆ దుష్టదుర్యోధనుడికి ప్రీతి కలిగించటానికి కర్ణుడు మన రాజుని అవమానించాడు. మీకు ధర్మరాజుని అప్పగిస్తున్నా, జాగ్రత్తగా చూసుకోండి, ఈ పూట నేనో కర్ణుడో తేలిపోవాలి” అని అప్పగింతలు చెప్పి సింహనాదం చేస్తూ కర్ణుడి మీదికి బయల్దేరాడు.

అలా వస్తున్న భీముణ్ణి గమనించాడు శల్యుడు. “చూస్తున్నావా, భీముడు మహాకోపంతో మనమీదికొస్తున్నాడు. ఇతనికి కోపం వస్తే ముల్లోకాల్నీ లెక్కచెయ్యడు. అభిమన్యుడు, ఘటోత్కచుడు మరణించినప్పుడు కూడ రాని కోపం ఇప్పుడొచ్చిందితనికి. ఇది నీ భుజబలం చూపించాల్సిన సమయం” అని కర్ణుణ్ణి హెచ్చరించాడు. కర్ణుడు కూడ “ఔను, భీముడు మహాపరాక్రమశాలి. వందమంది కీచకుల్ని ఒక్కడే కడతేర్చిన వాడు. బలాఢ్యుడని ప్రపంచఖ్యాతి పొందినవాడు. ఐనా నాకితనో లెక్క కాదు. కాకుంటే అర్జునుణ్ణి చంపటమే నా లక్ష్యం కనక ఇతన్ని చంపను, మరీ గాయపరచను” అని తన ఆలోచన చెప్పాడతనికి. శల్యుడు రథాన్ని భీముడికెదురుగా తిప్పాడు. కర్ణుడు భీముణ్ణి బాణవర్షంలో ముంచేశాడు. అదేసమయంలో వేగంగా అతని విల్లు విరిచి అతని శరీరానికి తూటు పొడిచేలా ఒక మార్గణాన్ని వేశాడు. భీముడింకో విల్లు తీసుకుని కర్ణుడి వక్షాన్ని అనేక బాణాల్తో కొట్టి అరిచాడు. వెనక్కి తగ్గకుండా కర్ణుడు బలంగా ఇరవై ఐదు నారాచాలేశాడు. అవి భీముడి కవచాన్ని చించుకుని అతని శరీరం నుంచి దూసుకుని వెళ్లి భూమిలో దిగబడినయ్.

భీముడి కోపం కట్టలు దాటింది. ఒక ఉగ్రభల్లాన్ని విసిరేస్తే అదో కులిశం లాగా వెళ్లి కర్ణుడి వక్షాన్ని మోదితే అతను చచ్చినట్టు రథమ్మీద మూర్ఛపడ్డాడు. మనసైన్యాలు గగ్గోలు పెట్టినయ్. భీముడు తన రథాన్ని కర్ణుడి రథం దగ్గరికి తెచ్చాడు. “ఈ నీచుడి నాలిక తెగ్గోస్తా” అని చురకత్తి తీసుకుని కర్ణుడి రథం మీదికి దూకబోతుంటే శల్యుడతన్ని వారించాడు – “ఇది మూర్ఛే, వీడు చావలేదు. నువ్వీ స్థితిలో నాలిక్కోశావంటే మాత్రం చావటం ఖాయం. ఇతన్ని చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, నువ్వు చంపితే అతని పరిస్థితేమిటో ఆలోచించు” అని.

భీముడు శాంతించి “నువ్వన్నది నిజమే మామా, వీడు ధర్మజుణ్ణి అవమానించాడనే కోపంలో అర్జునుడి ప్రతిజ్ఞ విషయం మర్చిపోయా. గుర్తు చేసి చాలా మంచిపని చేశావ్. తొందరపడి ఇప్పుడు వీడి నాలిక్కోస్తే చచ్చేవాడు. అప్పుడు అర్జునుడు ఏమన్నా చేసుకోవచ్చు, అలా ఐతే కృష్ణుడు, ధర్మరాజూ కూడ ఉండరు. నీ మూలాన ఇంత ప్రమాదం తప్పింది, నీ ఆజ్ఞ శిరసావహిస్తా” అని తన ప్రయత్నం మానుకున్నాడు. సంతోషంగా శల్యుడు రథాన్నక్కడి నుంచి దాటించాడు.

కర్ణుడలా పడేసరికి దుర్యోధనుడు తన తమ్ముల్ని వేగంగా భీముడి మీదికి పంపాడు. వాళ్లు భీముణ్ణి చుట్టుముట్టారు. అతను వాళ్ల అనుచరులు ఐదువందల యాభై మంది వీరరథికుల్ని అప్పటికప్పుడు చంపి ఒక భల్లంతో శ్రుతవర్మ శిరాన్ని ఖండించి నేలపడేశాడు. రెండు బాణాల్తో వికటుణ్ణి, సముణ్ణి చంపాడు. ఒక తీవ్రనారాచంతో క్రాథుణ్ణి కూల్చాడు. అనేకబాణాలేసి నందోపనందుల్నిద్దర్నీ ఒకేసారి చంపాడు. ఇలా నీకొడుకులు ఆరుగురి చావుతో మిగిలిన వాళ్లు పారిపోయారు.

కర్ణుడప్పటికి తేరుకుని భీముడితో మళ్లీ తలపడ్డాడు. ఇద్దరూ నానా నారాచాల్తో ఘోరంగా పోరారు. కర్ణుడు భీముణ్ణి పది బాణాల్తో నొప్పించి అతని విల్లు విరిచాడు. భీకరమైన గదని విసిరాడు భీముడు. దాన్ని దార్లోనే ఖండించాడు కర్ణుడు. మరో విల్లు తీసుకుని భీముడు విజృంభిస్తే కర్ణుడతన్ని పది అస్త్రాల్తో కొట్టాడు. భీముడు కోపంతో ఓ గట్టి నారసాన్నతని వక్షానికి సూటిగా వేస్తే అదతని ఒంట్లోంచి దూసుకుపోయి బయటికొచ్చింది. రోషారుణ నేత్రాల్తో కర్ణుడు వందబాణాలతని మీద కురిపించి విల్లు విరిచి గుర్రాల్ని కూల్చాడు. భీముడు సంరంభంగా ఒక పెద్ద గద చేతబట్టి కిందికురికాడు. అది చూసి దుర్యోధనుడు పదివేల ఏనుగుల్ని అతని మీదికి పురిగొల్పాడు. భీముడు మహోత్సాహంతో వాటిని వాటి మీదున్న యోధుల్ని మట్టుబెట్టి పన్లో పనిగా మూడు వేల మంది ఆశ్వికుల్ని కూడ నేల పడేసి వీరవిహారం చేశాడు. ఐదువందల మంది శకుని వైపు రథికులు వస్తే వాళ్లని రథాల్తో సహా నుగ్గుచేశాడు. శకుని మూడువేలమంది యవనదేశీయులైన ఆశ్వికుల్ని ముందుకు పంపితే వాళ్లనీ తన గదకి బలిచేశాడు. ఇలా గదపండగ చేసుకుని మరో రథం ఎక్కి మన సైన్యం మీద పడ్డాడు భీముడు.

మరోవంక కర్ణుడు ధర్మరాజుతో తలపడ్డాడు. అతని ధాటికి ఆగలేక ధర్మరాజు సతమతమౌతుంటే సారథి రథాన్ని దాటేశాడు. వదలక కర్ణుడు వెంటబడితే భీముడు వేగంగా వచ్చి అతన్ని అడ్డుకున్నాడు. కర్ణుడి దెబ్బకి భీముడు కూడ అవస్థ పడుతుంటే సాత్యకి సాయంగా వచ్చి భీముణ్ణి దాటుకుని వెళ్లి కర్ణుడితో కలబడ్డాడు. ఇద్దరూ ఒకరికొకరు తగ్గకుండా రణం సాగించారు. కృపుడు, సౌబలుడు, కృతవర్మ, అశ్వత్థామ కర్ణుడి పక్కల నుంచి పాండవసేనని ఢీకొంటే మనబలాలు ఉప్పొంగినయ్. అలాగే పాండవ వీరుల లాఘవాన్ని చూసుకుని వాళ్ల సేనలూ ఉత్సాహంగా యుద్ధం చేసినయ్. దుమ్మూ ధూళీ మధ్యాన్న సూర్యుడిని కప్పేసినయ్. ఎవరికి వారు వాళ్ల పేర్లూ బిరుదులూ అరిచి చెప్పుకుంటూ యుద్ధం చేస్తున్నారు. ఆకాశం బద్దలయ్యేలా సింహనాదాలు వినపడుతున్నయ్.

ఇంకోచోట అర్జునుడు త్రిగర్త, కోసల, నారాయణ యాదవ బలాల్తో పోరాడుతున్నాడు. త్రిగర్తాధిపతి సుశర్మ పది అస్త్రాల్తో అర్జునుణ్ణి, మూడు బాణాల్తో కృష్ణుణ్ణి కొట్టి మరో బాణంతో జెండాని కదిలించాడు. కేతనం మీదున్న ఆంజనేయుడు ఆర్చాడు. దాంతో సంశప్తకులంతా మహోత్సాహంతో అర్జున రథాన్ని చుట్టుముట్టారు. రథం కదలటానికి కూడ చోటు లేకుండా చుట్టుకున్న ఆ సైన్యాన్ని కృష్ణుడు మునుకోలతో, కాళ్లూ చేతుల్తో కొడుతుంటే కురచబాణాల్తో అర్జునుడు చెల్లాచెదురు చేశాడు. అలా కొంచెం ఊపిరి పీల్చుకునే అవకాశం రావటంతో అర్జునుడు చిరునవ్వు నవ్వి కృష్ణుడితో “రథం కదిలే సందు కూడ ఇవ్వకుండా శత్రువులిలా చుట్టుముడితే రాచపుటక పుట్టినవాడెవడైనా వాళ్లని చంపకుండా వదుల్తాడా? నా ప్రతాపం ఇప్పుడు చూపిస్తా చూడు” అంటూ నాగాస్త్రం ప్రయోగిస్తే అది సంశప్తకుల కాళ్లు కదలకుండా బంధించింది. అతను బాణవర్షంలో ముంచి వాళ్లని ఊచకోత కోశాడు. అది గమనించిన సుశర్మ వెంటనే గరుడాస్త్రం వేసి ఆ కట్లూడదీశాడు. మళ్లీ వాళ్లు అర్జునుడి మీదికి దూకారు. సుశర్మ ఒక నిశితాస్త్రంతో అర్జునుడి వక్షాన్ని కొడితే అతనికి మూర్ఛవచ్చి రథమ్మీద చతికిల పడ్డాడు. సుశర్మ దెబ్బకి అర్జునుడు చచ్చాడని మనసైన్యంలో కోలాహలం చెలరేగింది.

అంతలో తేరుకున్నాడు అర్జునుడు. కాలాంతకుడిలా విజృంభించాడు. అతని బాణాలకి సుశర్మ బిత్తరపోయాడు. అర్జునుడు ఇంద్రాస్త్రం వేస్తే దాన్నుంచి అనేక రకాల ఆయుధాలు బయటికి వచ్చి పదివేల మంది సంశప్తక యోధుల్ని చంపినయ్. చావగా మిగిలిన పధ్నాలుగు వేలమంది ఒకరినొకరు పురిగొల్పుకుని అర్జునుడి మీదికి దూకితే అతను విక్రమించి వాళ్లతో తలపడ్డాడు.

అదిచూసి ఇతర చోట్ల పాండవబలాల్తో పోరుతున్న మనసైన్యం కూడ నీరసపడితే కృతవర్మ, కృపుడు, అశ్వత్థామ, కర్ణుడు వాళ్లకి ధైర్యం చెప్పి ఉత్సాహపరిచారు. కృపుడు పాంచాల బలాల్తో పోరుతుంటే శిఖండి అతనితో తలపడ్డాడు. కృపుడతని గుర్రాల్ని, సూతుణ్ణి చంపాడు. శిఖండి వాలూ పలకా తీసుకుని కిందికి దూకి కృపుడి మీదికి వెళ్లాడు. అతనికి సాయపడకుండా ధృష్టద్యుమ్నుణ్ణి కృతవర్మ, ధర్మరాజుని అశ్వత్థామ, భీముణ్ణి కర్ణుడు అడ్డుకున్నారు. కృపుడు శిఖండి పలకని ముక్కలు చేశాడు. ఐనా తగ్గక అతను కేవలం కత్తితోనే కృపుడి మీదికి దూకితే అతను అనేక బాణాలు అతని శరీరాన నాటాడు. ఇంతలో సుకేతుడనే పాంచాల రాకుమారుడు కృపుడితో తలపడ్డాడు. కృపుడు సునాయాసంగా కత్తివాతి బాణంతో వాడి తలని నరికి కిందపడేశాడు.

ధృష్టద్యుమ్నుడు కృతవర్మని మూడుచెరువుల నీళ్లు తాగించాడు. కృతవర్మ అతని మీద అనేకాస్త్రాలు వేస్తే ధృష్టద్యుమ్నుడు సైంధవవధ రోజు ద్రోణుడి రథానికి తన రథాన్ని తగిలించినట్టు కృతవర్మ రథానికి అతి దగ్గరగా తన రథాన్ని పోనిచ్చి కత్తి తీసుకుని అతని మీదికి దూకాడు. కృతవర్మ గద పుచ్చుకున్నాడు గాని దాన్ని విసిరే స్థలం లేక గబాల్న రథం మీంచి దూకి పరిగెత్తాడు. అది గమనించని ధృష్టద్యుమ్నుడు రథమ్మీద అతను కనపడక సారథి కంఠాన్ని ఖండించాడు. అది తను కాదు కదా అని సంతోషించి కృతవర్మ ఇక్కడ ఇక్కడ అని కేకేసి తనెక్కడున్నది చెప్తే ధృష్టద్యుమ్నుడు తన రథం మీదికి తిరిగెళ్లి అతని మీద బాణాలెయ్యబోతే మరో రథికుడొచ్చి కృతవర్మని త్వరితంగా ఎక్కించుకుని యుద్ధభూమి బయటికి దాటించాడు.

దుర్యోధనుడు నకుల సహదేవుల్తో పోరుతూ వాళ్లని వివిధాస్త్రాల్తో బాధించాడు. వాళ్లిద్దరికీ కాలం దాపరించిందనుకున్నా రందరూ. ధృష్టద్యుమ్నుడు వాళ్లకి అడ్డంగా వచ్చి దుర్యోధనుడితో తలపడ్డాడు. దుర్యోధనుడొక నారసాన్ని అతని నుదుటికి నాటాడు. దాంతో అతను తీవ్రోద్రేకంతో నీ కొడుకు విల్లు తుంచి, గుర్రాల్ని సారథిని చంపి, జెండాని విరిచాడు. నీకొడుకు శక్తిని వేస్తే దాన్ని తుంచాడు. కత్తి తీసుకుంటే దాన్ని తునకలు చేశాడు. గద పట్టుకుంటే దాన్నీ ముక్కలు చేశాడు. అలా ఆయుధాలన్నీ ఐపోయిన దుర్యోధనుణ్ణి అతని తమ్ముడు దండధారుడు తన రథం ఎక్కించుకుని దూరంగా తీసుకెళ్లాడు.

అది చూసి కర్ణుడు ధృష్టద్యుమ్నుడి మీదికి దూకాడు. ఐతే సాత్యకి అతన్ని వదలకుండా వెంటపడ్డాడు. అలా కర్ణ ధృష్టద్యుమ్నులకి ఘోరసమరం ఐంది. కనిపించిన అనేకమంది పాంచాల వీరుల్ని కర్ణుడు కడతేర్చాడు. మరోచోట అర్జునుడు సంశప్తక బలాల్ని చెల్లాచెదురు చేసి కాంభోజసైన్యాల్ని అల్లకల్లోలం చేశాడు. యవన, శక సైన్యాలు కమ్ముకుంటే వాటిని అనేకాస్త్రాల్తో కలగించి రక్తం ఏరులు పారించాడు. అప్పుడా అర్జునుడి సమరకౌశలాన్ని చూడటానికి పదివేల కళ్లున్నా చాలవు! అలా పోరాడుతున్న అర్జునుణ్ణి చెయ్యెత్తి పిలిచాడు అశ్వత్థామ. “నేను నీకు అతిథిననుకో. నాకు నీతో యుద్ధం కావాలి. ఇవ్వగలవా?” అనడిగాడు. కృష్ణుడు రథాన్ని అతనివైపుకి మళ్లించాడు. “దుర్యోధనుడికి నీ ఋణం తీర్చుకుందువు గాని, అర్జునుడి బాహుబలం ముందు ఆగి నిలబడు చూద్దాం” అని కృష్ణుడంటే అలాగే అని అతను ఆరు బాణాల్తో కృష్ణుణ్ణి, మూడు బాణాల్తో అర్జునుణ్ణి కొట్టాడు. అర్జునుడతని విల్లు విరిస్తే దృఢమైన ఇంకో విల్లు తీసుకుని వాళ్లని బాణవర్షంలో ముంచెత్తాడు.

అతని దెబ్బకి వాళ్లిద్దరూ బిత్తరపోయారు. కాళ్లూ చేతులూ ఆడకుండా అతనలా బాణాలు కురుస్తుంటే అర్జునుడు నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. కృష్ణుడు తేరుకుని “నీ చేతుల్లో చేవ చచ్చిందా, గురువు కొడుకని వీడి మీద కోపం తెచ్చుకోవటం లేదా? వాడి చేతిలో నువ్వోడావంటే ఎంత అవమానమో ఆలోచించు” అంటే కోపం తెచ్చుకుని అర్జునుడు “ఏదో కొన్ని బాణాలు చకచకా వేస్తే వాడు గెలిచినట్టేనా? ఇప్పుడు చూడు” అని భల్లాల్తో అశ్వత్థామ బాణాల్ని తుంచి ఒకే దెబ్బలో అతని విల్లు, ఛత్రం, కేతనం విరిచాడు. అతను శక్తి తీస్తే దాన్ని, గద వెయ్యబోతే దాన్నీ కూడ ముక్కలు చేశాడు. ఇంతలో అంగ, వంగ, నిషాద, కళింగ బలాలు అర్జునుడి మీదికి దూకినయ్. అశ్వత్థామ తెప్పరిల్లి మరోవిల్లు తీసుకుని బాణవర్షం సాగించాడు. “తెగులు కనపట్టం తోటే నాశనం చెయ్యాలి, ఊరుకుంటే తరవాత ముప్పు; వీడి సంగతి ఇప్పుడే చూడు” అని కృష్ణుడు బోధిస్తే అర్జునుడు విజృంభించి అశ్వత్థామ తల, కంఠం, చేతులు, రొమ్ము, కాళ్లు అన్నింటా బాణాల్తో కప్పి, గుర్రాల పగ్గాలు తెంచితే అవి రథాన్ని లాక్కుని దూరంగా పరిగెత్తినయ్. ఉసూరుమంటూ అశ్వత్థామ తిరిగొచ్చి కర్ణుడి దగ్గరికి వెళ్లాడు.

ఇంతలో దండధారుడనే మగధరాజు మదపుటేనుగునెక్కి పాండవబలమ్మీదికి వెళ్తుంటే కృష్ణుడు చూసి “ఈ దండధారుడు కూడ భగదత్తుడి లాటి వాడు,ముందు వాణ్ణి చంపి మిగిలిన పన్లు చూసుకుందాం” అంటే అలాగే నని అటువైపుకి కదిలాడు అర్జునుడు. దిగ్గజంలా మాగధుడి ఏనుగు పాండవసైన్యాన్ని నుగ్గుచేస్తుంటే అర్జునుడు రథాన్ని ఇంకా వేగంగా పోనివ్వమని కృష్ణుణ్ణి తొందరపెట్టాడు. అలా వెళ్లి అర్జునుడు దండధారుడితో తలపడితే వాడు తన ఏనుగు మీది నుంచి అర్జున రథాన్ని, సారథిని, రథిని అమ్ములతో కప్పేశాడు. మహాక్రోధుడై కిరీటి వాడి బాహువుల్ని నరికి తలని కూడ తుంచి కింద పడేశాడు. అదిచూసి వాడి తమ్ముడు దండుడు అతని మీద తోమరాలు విసురుతుంటే అర్జునుడు వాడి తలనీ నరికాడు. అలాగే మాగధ సైన్యం మీదికి దూకి వాళ్ల ఏనుగుల్ని చెండాడుతుంటే ఆ సైన్యాలు చెల్లాచెదురైనై.

అంతకుముందు కర్ణుడు పుళింద, బాహ్లిక, టేంకణ, ఆంధ్ర, భోజ సైన్యాల సాయంతో పాండవబలాల్ని మోదుతుంటే మలయధ్వజుడనే పాండ్యరాజు ఆ సేనల్ని అడ్డుకున్నాడు. అతను తననెవరన్నా భీష్మ ద్రోణుల్తో సమానుడంటే ఒప్పుకోడు, కృష్ణార్జునులు తనకు ఎక్కువని నమ్మడు. మహా భుజశాలి. అతను మన సేనల్ని చీకాకు పెడుతుంటే అశ్వత్థామ “సామాన్య సైన్యాన్ని బాగానే చంపుతున్నావ్ గాని నాతో తలపడి చూడు” అని పిలిస్తే అంతకన్నానా అని ఆనందంగా మలయధ్వజుడతనితో యుద్ధానికి పూనుకున్నాడు. ఇద్దరూ భీకరంగా యుద్ధం చేశారు. అశ్వత్థామ అతని మీద తొమ్మిది బాణాలేస్తే మలయధ్వజుడు వాటికి ప్రతిశరాలు వేశాడు. ఐదు విరిగినయ్ కాని మిగతా నాలుగూ అతని గుర్రాల్ని చంపినయ్. అతని పరివారం ఇంతలో అతనికి మరో రథం తెస్తే అది ఎక్కి వాయవ్యాస్త్రంతో అశ్వత్థామ చక్రరక్షకుల్ని చంపాడు. అశ్వత్థామ కూడ అతని సహచరుల్ని, గుర్రాల్ని, సారథిని చంపి రథాన్ని నుగ్గుచేశాడు. ఐనా వెనక్కి తగ్గకుండా మలయధ్వజుడు శస్త్రాస్త్రాలు ప్రయోగిస్తూ యుద్ధం చేశాడు. అశ్వత్థామ సరదాగా అతనితో ఇంకొంచెం సేపు యుద్ధం సాగించాడు. ఇంతలో మలయధ్వజుడొక ఏనుగునెక్కి దాన్ని అశ్వత్థామ మీదికి తోలి ఒక తోమరాన్ని విసిరాడు. దాని దెబ్బకి అతని శిరోభూషణం రాలి కింద పడింది. తోక తొక్కిన తాచులా అశ్వత్థామ వాడి పక్కనున్న ఆరుగుర్ని చంపి ఏనుగు తుండం నరికి పాండ్యుడి పాదాలు, చేతులు, తల తీవ్రభల్లాల్తో కోశాడు. వాడి సైన్యాలు పరిగెత్తినయ్. దుర్యోధనుడు వచ్చి అశ్వత్థామని మెచ్చుకుని పొగిడాడు.

భీముడు పరుగున వచ్చి ఆ బలాల్ని నిలిపి మన సైన్యం మీద దూకాడు. మన సైన్యం చెల్లాచెదురౌతుంటే కర్ణుడొచ్చాడు. అశ్వత్థామ అతనికి సాయంగా నిలిచి చాలామంది పాంచాలదొరల్ని చంపాడు. దూరాన్నుంచి మలయధ్వజుడి చావు చూసిన కృష్ణుడు అక్కడ భీమాదులు కర్ణుడితో తలపడటం చూసి మనం కూడ వెళ్లటం మంచిదంటే అర్జునుడు సరే నన్నాడు. వాళ్లలా వెళ్తుండగా అశ్వత్థామ ధృష్టద్యుమ్నుణ్ణి కేకేసి పిలిచి “నికృష్టుడా, అర్జునుడిక్కడికి రాకముందే నీ అంతు చూస్తా, పారిపోకుండా నిలబడు” అంటే “నీ తండ్రి తల కోసిన కత్తి నీకోసం సిద్ధంగా వుంది, నీకూ అదే గతి పట్టిస్తా రా” అని అతనూ బదులిచ్చాడు. ఇద్దరూ ఘోరంగా పోరాడారు. ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామ విల్లు విరిస్తే అతను వెంటనే మరోటి తీసుకుని అతని సూతుడు, గుర్రాల్ని చంపి కేతనాన్ని గొడుగుని విరిచాడు. అతను శక్తినెత్తితే దాన్ని, గద వెయ్యబోతే దాన్నీ నుగ్గుచేశాడు. వాలూ పలకా తీసుకుంటే వాటినీ తుంచి అతనికి శరీరాన బాణాలు నాటాడు. ఐనా అతను నిబ్బరంగా వుంటే ఆశ్చర్యపడి అశ్వత్థామ వింటిని విసిరేసి తళతళలాడే కత్తితో కాలినడకన అతని మీదికి బయల్దేరాడు.

కృష్ణుడు అర్జునుడితో “ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామకి చిక్కాడు. అతన్ని కాపాడాలి” అని తొందరచేస్తే అర్జునుడక్కడినుంచే అశ్వత్థామ మీద బాణాలు కురిపిస్తూ అక్కడికి బయల్దేరాడు. అశ్వత్థామ ఆ ధాటికి తట్టుకోలేక వెనక్కి తిరిగి తన రథం ఎక్కి అర్జునుడితో తలపడ్డాడు. ఈలోగా సహదేవుడు ధృష్టద్యుమ్నుణ్ణి తన రథం ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అర్జునుడి నిశితబాణానికి అశ్వత్థామ తూలితే అతని సారథి రథాన్ని దూరంగా తోలుకుపోయాడు. పాండవబలాలు కేరింతలు కొట్టినయ్.

ఒక పక్క కర్ణుడు, మరో పక్క సంశప్తకులు తనతో పోరాడాలని సిద్ధమౌతుంటే ముందు సంశప్తకుల పని చూద్దామన్నాడు అర్జునుడు. కర్ణుడు పాంచాలసేనల మీదికి పోయాడు. అతనా సేనలో గగ్గోలు పుట్టిస్తుంటే ధర్మరాజు, భీముడు, ధృష్టద్యుమ్నుడు అడ్డుపడ్డారు. అతను విజృంభించి వాళ్లందర్నీ ముప్పుతిప్పలు పెట్టాడు. నీ కొడుకులు ధర్మరాజుని పట్టుకుందామని ప్రయత్నించారు గాని భీముడు, సాత్యకి అది సాధ్యం కానివ్వలేదు. అప్పుడు భీముడు ఉగ్రరూపంతో మన సైన్యం మీద పడి చెండాడాడు. అతని దెబ్బకి మన చతురంగబలాలు తలో దిక్కు పారిపోయినయ్. ఇదంతా చూసి కృష్ణుడు అర్జునుడికి చెప్తే అతను మనమూ అక్కడికి వెళ్దాం అన్నాడు.

దుర్యోధనుడు భీముణ్ణి నిలవరించి అతనితో తలపడ్డాడు. కర్ణుడతనికి సాయంగా వచ్చాడు. పాంచాల దొరలు భీముడికి తోడుగా వచ్చారు. ఇరుపక్షాలు ఉత్సాహంగా సమరం చేసినయ్. భీముడు దుర్యోధనుడి సారథిని చంపి గుర్రాలని మోదితే అతను రథాన్ని తోలుకుంటూ యుద్ధభూమికి దూరంగా వెళ్లాడు. అశ్వత్థామ పెద్ద సైన్యసహాయంతో అర్జునుణ్ణి ఢీకొన్నాడు. అర్జునుడతని మీద దివ్యాస్త్రాలు వేస్తే అతనూ వాటిని ప్రయోగించి ఉపసంహరించాడు. అశ్వత్థామ వేసిన మూడు ఉగ్రబాణాలు అర్జునుడి కుడి భుజాన దూరినయ్. ఐనా అతను లెక్కచెయ్యకుండా యుద్ధం చేశాడు.

దుర్యోధనుణ్ణి కవలలు ఢీకొన్నారు. అతనికి సాయంగా వచ్చి కర్ణుడు దివ్యబాణాల్తో పాండవసైన్యాన్ని మట్టుబెడుతున్నాడు. ధర్మరాజు వాళ్లని కూడగట్టి కర్ణుడితో తలపడ్డాడు. కర్ణుడతని మీద అనేక బాణాలేసి ఒక నారసాన్ని అతని రొమ్ముకి నాటాడు. ఆ దెబ్బకి ధర్మరాజు చతికిలపడి రథాన్ని దూరంగా తీసుకుపొమ్మని సారథికి చెప్పాడు. వాడలాగే చేశాడు. ఐతే అతను వెళ్లకుండా కౌరవబలాలు అడ్డుపడితే కేకయపాంచాల బలగాలు వాటిని తాకినయ్. కర్ణుడు మాత్రం వదలకుండా ధర్మరాజు వెంటపడ్డాడు. భీముడు దుర్యోధనుణ్ణి ఆపి అతనితో తలపడ్డాడు. ధర్మరాజు శిబిరానికి పోతుంటే వెనకనుంచి కర్ణుడతని మీద బాణాలు కురిపించాడు. దగ్గర్లో ఉన్న నకులసహదేవులది చూసి కర్ణుడికి అడ్డు తగిలారు. అతను నకులుడి విల్లు విరిచి గుర్రాల్ని చంపితే అతను సహదేవుడి రథం ఎక్కాడు.

కర్ణుడు ఆ ముగ్గురితోనూ పోరుతూ అందరికీ గాయాలు చేస్తుంటే శల్యుడతన్ని వారించి “ఎందుకు నీకు ధర్మరాజు మీద అంత కోపం? ఇప్పుడు నువ్వతన్ని చంపితే అర్జునుడొచ్చి నిన్నూ కౌరవుల్నీ అందర్నీ నాశనం చేస్తాడు. అర్జునుణ్ణి చంపితేనే దుర్యోధనుడికి రాజ్యం దక్కేది. అటుచూడు, అక్కడ భీముడి చేతిలో దుర్యోధనుడు ఇప్పుడే చచ్చేట్టున్నాడు. అతన్ని కాపాడుకోలేకపోతే ఇక్కడ నువ్వు ఎవర్ని చంపీ ఉపయోగం లేదు, ఆలోచించుకో” అన్నాడు. కర్ణుడు కూడ అటు చూసి దుర్యోధనుడు చిక్కుల్లో ఉన్నట్టు గమనించి అతన్ని రక్షించటానికి బయల్దేరాడు. నకుల సహదేవుల్తో కలిసి తన శిబిరానికి వెళ్లాడు ధర్మరాజు.

అది విన్న ధృతరాష్ట్రుడు కుమిలిపోయాడు. “నా కొడుకు భీముడికి చాలకపోవటం ఏమిటి, కర్ణుడలా చేతికి చిక్కిన ధర్మరాజుని ప్రాణాల్తో వదిలెయ్యటం ఏమిటి? ఎంత బుద్ధితక్కువ పని చేశాడా కర్ణుడు?” అని వాపోయాడు. సంజయుడు తన కథనాన్ని కొనసాగించాడు.

అలా ధర్మరాజు యుద్ధభూమి నుంచి తిరిగెళ్లి మంచం మీద మేనువాల్చాడు. ఒంటికి గుచ్చుకున్న బాణాల్ని లాగించాడు. ఐతే అతని హృదయవేదన మాత్రం క్షణక్షణం పెరిగిందే తప్ప తగ్గలేదు. విషణ్ణవదనుడై నకులసహదేవుల్ని భీముడి దగ్గరకి వెళ్లమని పంపేశాడు.

అక్కడ అశ్వత్థామ అర్జునుణ్ణి ముప్పుతిప్పలు పెడుతూ యుద్ధం చేస్తున్నాడు. చివరికి అర్జునుడు విసుగుతో కూడిన కోపంతో అతని గుర్రాల్ని బాణాల్తో కొట్టి వాటి పగ్గాలు తెంపితే అవి రథాన్ని యుద్ధభూమి నుంచి దూరంగా లాక్కెళ్లినయ్. మనబలాలు చెల్లాచెదురైనై, వాళ్ల బలాలు ఉప్పొంగినయ్. నీ కొడుకు కర్ణుడి దగ్గరికెళ్లి “నీ భుజసంపద చూపించటానికి ఇదే సమయం. ఎన్నో దివ్యాస్త్రాలున్న నీలాటి వాడి రక్షణలో కూడ మన సైన్యం ఇలా బెంబేలెత్తటం సమంజసం కాదు” అంటే రాధేయుడు వీరోద్రేకంతో శల్యుడితో “ఇప్పుడు నేను కృష్ణార్జునుల్ని, భీముణ్ణి మట్టుబెట్టబోతున్నా, సారథ్యంలో నీ ప్రతిభ చూపించు” అని తన ధనుస్సు “విజయా”న్ని చూసి “నీ ముందు గాండీవం ఓ లెక్కలోదా?” అని మన సైన్యాన్ని ఆపి నిలిపి శత్రుసైన్యం మీద భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు.

ఆ భార్గవాస్త్రం అనేక శరాల రూపంలో వెళ్లి పాండవసైన్యాన్ని నాశనం చేసింది. గుర్రాల నెత్తురు, భటుల శరీరావయవాలు, రథాల ముక్కచెక్కలు అన్నీ కలిసి భీభత్సాన్ని సృష్టించినయ్. శత్రుసైన్యాలు చెల్లాచెదురై వెనక్కి తిరిగి పరిగెత్తినయ్. మనవాళ్లు వాళ్ల వెంటబడి దొరికిన వాళ్లని దొరికినట్టు నరుకుతుంటే కర్ణుడు మహోత్సాహంతో బాణవృష్టి కురిపిస్తూ తరిమాడు. పాండవ సైన్యం కృష్ణార్జునుల దగ్గరికి పరిగెత్తింది.

అశ్వత్థామతో ఘోరరణంలో అలిసిపోయిన అర్జునుడు నీరుగారి పోయాడు. కృష్ణుడితో అన్నాడూ “కర్ణుడు వీరవిక్రముడై విజృంభించి యుద్ధం చేస్తున్నాడు, చూస్తున్నావా! అతన్ని తేరి చూడాలంటేనే భయం వేస్తుంది. తొందరపడి అతనితో పోరాడి ఓడిపోవటం కంటె నేర్పుగా పక్కదారి చూసుకుని ప్రాణాలు నిలుపుకోవటం మేలు. బతికుంటే ముందు ముందైనా గెలిచే అవకాశం వుంది” అని. కృష్ణుడు భీముడి వైపు చూశాడు. ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, ద్రౌపదేయులు కలిసి కర్ణుడితో తలపడితే భీముడు తమ సైన్యాన్ని నిలవరించి తను కౌరవ సైన్యాన్ని నుగ్గుచెయ్యటం మొదలెట్టాడు. “ఇప్పటికి కర్ణుణ్ణి వీళ్లు ఆపుతారు, అలిసిపోయిన అర్జునుడు కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు” అనుకుని రథాన్ని భీముడి వైపుకి నడుపుతూ కృష్ణుడు “ఇందాక నువ్వు అశ్వత్థామతో పోరేప్పుడు ధర్మరాజు కర్ణుడితో యుద్ధంలో కష్టపడుతున్నట్టు కనిపించాడు. అతనికేవన్నా గాయాలయాయేమో చూసి ఆ తర్వాత మనం వచ్చి కర్ణుడి సంగతి చూద్దాం” అన్నాడు. అన్న కర్ణుడి చేతికి చిక్కాడన్న మాట వినగానే అర్జునుడికి గుండె కలుక్కుమంది. చుట్టూ చూస్తే ధర్మరాజు కనిపించలేదు. ఆదుర్దాగా భీముడి దగ్గరికి వెళ్లి అతన్నడిగితే జరిగింది చెప్పాడు. “అయ్యయ్యో, భీష్మ ద్రోణుల్తో మడమ తిప్పకుండా నిలబడి పోరినవాడు ఇప్పుడిలా కర్ణుడి చేతిలో భంగపడాల్సొచ్చిందా” అని బాధపడి భీముడితో “నువ్వెళ్లి ఆయన ఎలా వున్నాడో చూసి రా, అందాకా వీళ్ల సంగతి నేను చూస్తా” అంటే భీముడు “అలాటి పని నీకు సరిపోతుంది గాని నేనిప్పుడు రణరంగం విడిచివెళ్తే ఓడిపోయి పారిపోయా ననుకుంటారందరూ. నువ్వే వెళ్లు” అన్నాడు.

కృష్ణార్జునులు ధర్మరాజుని చూడటానికి బయల్దేరారు. కృష్ణుడు త్వరితంగా గుర్రాల్ని నడిపి ధర్మరాజు శిబిరానికి చేర్చాడు. ఇద్దరూ లోనికి వెళ్లి ధర్మరాజు కుశలంగానే వుండటం చూసి సంతోషించారు. ధర్మరాజు వాళ్లిద్దర్ని చూశాడు. కర్ణుణ్ణి చంపి ఆ మాట తనకి చెప్పటానికి వచ్చారనుకున్నాడు. దిగ్గున లేచి కూర్చున్నాడు. “సురలకైనా అలివి కాని వీరాగ్రణి కర్ణుణ్ణి మీకెలాటి ఆపదా కలక్కుండా చంపి వచ్చారు, మిమ్మల్ని ఏం పొగడగలను? నా మనస్సులో వున్న బాధంతా ఇప్పుడు తీరిపోయింది. ఇందాక నాతో యుద్ధంలో మనవాళ్లంతా చూస్తుండగా వాడు నా కేతనాన్ని చించి, సూతుణ్ణి గుర్రాల్ని చంపి నా ఒళ్లంతా తూట్లు పొడిచి గాయాలు చేశాడు. భీముడి చేతిలో దుర్యోధనుడు చావుబతుకుల్లో వున్నాడని నన్ను వదిలి అటు పోతే బతుకు జీవుడా అని నేనిటు వచ్చా. ఏమైనా, గడిచిన పదమూడేళ్లుగా కర్ణుణ్ణి తలుచుకుని నాకు కునుకు పట్టలేదు. భీష్ముడి చేత గాని, ద్రోణుడి చేత గాని పడని అవమానం వాడి చేత పడ్డాను నేను. మన కష్టాలన్నిటికీ మూలం వాడు. అలాటి వాణ్ణి వాడి కొడుకులు చుట్టాలు చూస్తుండగా నీకెలాటి గాయాలూ కాకుండా చంపగలిగావంటే వీరుడివంటే నువ్వే. ఎలా చంపావ్ వాణ్ణి, భల్లంతో తల నరికావా, రొమ్మున గొప్ప నారసాన్ని నాటి చంపావా?” అని తేలికపడ్డ మనస్సుతో పట్టలేని ఆనందంతో పొగిడుతూ అడిగాడు ధర్మరాజు.

అర్జునుడు అవాక్కయ్యాడు. “నేను సంశప్తకుల్తో పోరుతుంటే అనేకమంది రథికుల్ని తీసుకుని అశ్వత్థామ వచ్చి తలపడ్డాడు. ఎన్ని విధాలుగా పోరినా వదలక అతని బాణవర్షంలో మా ఇద్దర్నీ ముంచి ఎక్కడ ఏం వుందో కనపడనంతగా కప్పేశాడు. చివరికి ఎంతో కష్టం మీద అతన్ని వొదిలించుకుని నీ కోసం చూస్తే నువ్వు కనపడలేదు. భీముడు తప్ప మనవాళ్లెవరూ కర్ణుడి ముందు నిలబడ్డ వాళ్లు లేరు. నీ గురించి అడిగితే భీముడు ఇక్కడికి వచ్చినట్టు చెప్పాడు, నీ క్షేమం చూసి వెళ్దామని వచ్చాం, ఇక వెళ్లి కర్ణుడి అంతు చూస్తాం” అని చెప్పాడతను.

తననుకున్నట్టు కాక కర్ణుడు చక్కగా బతికేవున్నాడని తెలిసే సరికి ధర్మరాజుకి ఒళ్లు మండిపోయింది. “యుద్ధంలో చావటమో పక్కకి తొలిగిపోవటమో సరైనవే గాని ఎంత గాయాలైనా ఇలా పారిపోయి రావటం కాదు. వచ్చి అందరికీ చులకనయ్యా నేను. నువ్వూ ఏం తక్కువ తిన్లేదు. ఇదివరకే నకుల సహదేవులు ఓడారు. ఇంక మనమెవ్వరం యుద్ధానికి తిరిగి వెళ్లక్కర్లేదు. నేరుగా అడవులకి పోదాం పద. లేకపోతే దుర్యోధనుడి దగ్గరికి పోయి యాచిస్తే ఏదన్నా పనిస్తాడేమో చూసుకుందాం. నువ్విలాటి వాడివని ముందే ద్వైతవనంలో చెప్తే అసలింతదూరం తెచ్చి యుద్ధంలో కొడుకుల్ని బంధువుల్ని చంపుకునే వాణ్ణి కాదు కదా! అప్పుడు నేను కర్ణుణ్ణి చంపుతా అని చేసిన నీ ప్రతిజ్ఞ వట్టి మాటేనని తేలిపోయింది. దేవతలిచ్చిన రథం, గుర్రాలు, కపికేతనం ఉన్నయ్. పెద్ద తాటిచెట్టంత గాండీవం వుంది. స్వయాన కృష్ణుడే సారథి. ఇన్నీ ఉన్నా కర్ణుడికి ఓడి ఇలా పరిగెత్తుకొచ్చావంటే ఏమనుకోవాలి? దుర్యోధనుడప్పుడే చెప్పాడు, కర్ణుడు ఎదటపడితే నువ్వు పరిగెత్తుతావని, నేను విన్నానా? ఇప్పుడే గనక అభిమన్యుడో ఘటోత్కచుడో వుంటే నాకింత పరాభవం కలగనిచ్చేవాళ్లా? అసలు నువ్వంటే గడ్డిపోచ కింద లెక్కేసేగా కర్ణుడు నన్నవమానించటానికి వెనకాడంది? ఏ మొహం పెట్టుకుని ఇలా పారిపోయొచ్చావ్? నీ గాండీవం కృష్ణుడి చేతికిచ్చి నువ్వు సారథ్యం చేస్తే అతను ఒక్క క్షణంలో ఆ కర్ణుణ్ణి చంపేవాడు కదా? అసలు కుంతి కడుపున ఎట్లా పుట్టావో నువ్వు?” అని చడామడా తిడుతుంటే –

అర్జునుడు కత్తి దూసి ధర్మరాజుని చంపటానికి లంఘించబోతుంటే అడ్డుకున్నాడు కృష్ణుడు. “ఇక్కడ శత్రువులెవరూ లేరే, ఎందుకీ కత్తులు దుయ్యటం?” అంటే అర్జునుడు “గాండీవాన్ని ఇతరులకియ్యమని ఎవరన్నా అంటే వాళ్ల తల బద్దలు కొడతానని ఇదివరకే ప్రతిజ్ఞ చేసుకున్నా. ఇప్పుడితను ఆ మాట అనటం నువ్వే విన్నావ్, సత్యవ్రతుణ్ణి నేను. నేనేం చెయ్యాలో నువ్వే చెప్పు” అన్నాడు క్రోధంగా. కృష్ణుడు “మతిలేని మాటలు మాట్టాడకు” అని అతన్నదిల్చి “పెద్ద వాళ్ల దగ్గరుండి సేవ చెయ్యనందువల్ల నీకు ధర్మసూక్ష్మాలు తెలీవు. సత్యం ఎప్పుడు ధర్మం, ఎప్పుడు కాదు, అనేది తేలికైన విషయం కాదు. చెప్తా విను. సత్యం, అహింస – ఈ రెండు అత్యుత్తమ ధర్మాలు. ఐతే అహింసతో సత్యాన్ని కాపాడాలి, అవసరమైతే అసత్యంతో నైనా అహింసని కాపాడాలి. ఇలా సత్యరక్షణం కోసం అన్నని చంపుతాననటం ధర్మమార్గం కాదు. ప్రాణహాని వేళ, సర్వధనాలూ పోయే వేళ చెప్పే సత్యం అనృతం, అసత్యమే సూనృతం. నీలాగే కౌశికుడనే వాడొకడు ఒక గ్రామానికి దగ్గర్లో తపస్సు చేసుకునేవాడు. అతను సత్యవ్రతం పట్టి ఎప్పుడూ సత్యమే చెప్పేవాడు. ఒకరోజు కొందర్ని దొంగలు తరుముతుంటే వాళ్లు అతని దగ్గర్లో దాక్కున్నారు. దొంగలొచ్చి కౌశికుణ్ణి వాళ్లెక్కడున్నారని అడిగితే సత్యవాది కనక అతను వాళ్లెక్కడుందీ చూపించాడు, దొంగలు వాళ్లని కొట్టి చంపి వాళ్ల ధనమంతా అపహరించారు. ఆ దోషం వల్ల అతను నరకానికి పోయాడు. కనక హింసకి దారి తీసే సత్యం ధర్మం కాదు. పెద్దలనడిగి తెలుసుకోకుండా మూర్ఖులు అధోగతికి పోతారు. కాబట్టి ఇప్పుడు చెప్పు ఈ అజాతశత్రువుని చంపటం ధర్మమా అధర్మమా?” అని గద్దించాడు.

అర్జునుడు మెత్తబడ్డాడు. “అలాగైతే నాకు అసత్యదోషం అంటకుండా, ధర్మరాజుకి కీడు కలక్కుండా వుండే ధర్మమార్గం ఏదో నువ్వే చెప్పు” అనడిగాడు. ” అతన్ని నువ్విలాటి వాడివి అలాటి వాడివని తిట్టు, అదే చంపటంతో సమానం. ఆ తర్వాత నమస్కారం చేసి ప్రసన్నుణ్ణి చేసుకో” అని బోధించాడు కృష్ణుడు. అర్జునుడికి ఆ ఆలోచన నచ్చింది. ధర్మరాజు నుద్దేశించి “శత్రుమూకల్ని నేలమట్టం చేసే మహాబాహుబలుడు భీముడు నన్నంటే అర్థం వుంది గాని పిరికిపందవై పారిపోయొచ్చిన నీకు నన్ను తిట్టే అర్హత ఎక్కడిది? ఎప్పుడు ఏ యుద్ధంలో నువ్వు ఏం వుద్ధరించావని నన్నిన్ని మాటలన్నావ్? మనకి కౌరవుల్తో వైరం రావటానికి కారణం నీ జూదం. రాజ్యం పోవటానికి, మనందరం అడవుల్లో నానా కష్టాలు పడటానికి అదే కారణం. ఐనా ఐందేదో ఐంది, ఇకనుంచైనా ఇలాటి దుర్బుద్ధితనాలు మాని మేము పౌరుషంతో సంపాయించి తెచ్చింది అనుభవించు. నోటికొచ్చినట్టు మాట్టాడితే పడేవారెవరూ లేరిక్కడ” అని దూషించాడు అర్జునుడు.

అంతలోనే బాధపడి కత్తిని ఒరనుంచి లాగాడు. “మళ్లీ ఏమైంది కత్తి తీశావ్” అని కృష్ణుడంటే “ఈ మహానుభావుణ్ణి ఇంతగా తిట్టినందుకు నాకు ప్రాయశ్చిత్తం తల తెంచుకోవటమే” అని అందుకు సిద్ధమౌతుంటే ఆపి “అందుకు తలతెంచుకోనక్కర్లేదు, ఆత్మస్తుతి చాలు. నిన్ను నువ్వు పొగుడుకోవటం చావుతో సమానం” అని సమాధాన పరిచాడు కృష్ణుడు. అలాగే అని అర్జునుడు గాండీవం చేతబట్టి “పరమశివుడు తప్ప నాతో ఉజ్జీ ఈ మూడు లోకాల్లోనూ లేడు. అన్ని దిక్కులా గెలిచి లెక్కలేనంత ధనాన్ని నీకు తెచ్చి ఇచ్చి రాజసూయం చేయించాను గుర్తుందా? వీరగణాలైన సంశప్తకుల్ని ఏదో కొద్దిమంది తప్ప అందర్నీ పరలోకాలకి పంపించా. నా మూలానే కురుసేన చాలాభాగం హరించిపోయింది” అని చెప్పుకుని వినయంగా ధర్మరాజుకి నమస్కరించి “నేనిప్పుడు పలికిన కారుకూతల్ని పట్టించుకోవద్దు. నీకంటె నాకు పెద్ద ఎవరూ లేరు. నన్ను దీవించి పంపితే వెళ్లి కౌరవసేనని అల్లకల్లోలం చేసి కర్ణుణ్ణి చంపి దుర్యోధనుడికి దుఃఖం కలిగిస్తా. ఇవాళ నేనో కర్ణుడో తేలిపోవాలి” అన్నాడు.

“నా మూలానే మీకందరికీ అనేక కష్టాలు కలిగినయ్. కుటుంబానికింత హాని కలిగించిన నన్ను చంపటమే ధర్మం. నువ్వు కనికరించి వదిలినా నేను అడవులకి పోతా. నాలాటి భీరువు, అసమర్థుడు రాజుగా తగడు. మీరు భీమసేనుడికి పట్టం గట్టండి,” అని లేచి అడవులకి బయల్దేరాడు ధర్మరాజు. కృష్ణుడతన్ని ఆపి ప్రణామం చేస్తూ “అర్జునుడి ప్రతిజ్ఞ విషయం మనకి తెలియదు గనక పొరపాటు జరిగిపోయింది. అందువల్ల ధర్మహాని కలక్కుండా అతను నిన్ను కొన్ని పరుషపు మాటలనాల్సి వచ్చింది. అవి మనసులో వుంచుకోవద్దు. ఈరోజు కర్ణుడి చావు ఖాయం, నన్ను నమ్ము. నీకెప్పుడైతే కోపం తెప్పించాడో అప్పుడే వాడి చావు సిద్ధమై పోయింది” అని అనునయించాడు. దాంతో ధర్మరాజు శాంతుడయాడు. “నేనూ నోరు జారాను, అది పొరపాటే. ఏమైనా సరైన ధర్మాన్ని బోధించి మమ్మల్నిద్దర్నీ కాపాడావ్” అని కృష్ణుణ్ణి స్తుతించాడతను.

అర్జునుడింకా దుఃఖితుడై వుండటం చూసి కృష్ణుడు “అన్న ఆశీస్సులందుకో, మనం వెళ్లి కర్ణుణ్ణి చంపాల్సిన పని వుంది. ఇది విచారానికి సమయం కాదు” అంటే అతను ఏడుస్తూ అన్న పాదాల మీద వాలాడు. ధర్మరాజూ అతన్ని ఆదరంగా కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇద్దరూ కొంచెంసేపు ఏడ్చారు. ఇంతలో కృష్ణుడు పరిజనుల చేత నీళ్లు తెప్పిస్తే ఇద్దరూ ముఖాలు కడుక్కుని స్వస్థులయారు. ధర్మరాజు తమ్ముణ్ణి మళ్లీ కౌగిలించుకున్నాడు. “కర్ణుడి మూలానే ఇదంతా. నన్నెంతగానో అవమానించిన ఆ ధూర్తుణ్ణి నువ్వు వధించివస్తే తప్ప నేను బతకలేను” అన్నాడతను. అర్జునుడు కూడ “వాణ్ణీ వాడి బంధువుల్నీ చంపకుండా నేను తిరిగిరాను, నీ పాదాల మీద ఆన. మీరద్దరూ వాడు చావాలని కోరండి, నేను సాధించి వస్తా” అని బదులిచ్చాడు.

గుర్రాలకి మేత పెట్టించి, నీళ్లు తాగించి రథం సిద్ధం చేసి ధర్మరాజు ఆశీస్సులు తీసుకుని కృష్ణార్జునులు కర్ణవధకి బయల్దేరారు. దార్లో అర్జునుడికి చెమటలు పట్టటం గమనించాడు కృష్ణుడు. “దేవతలకైనా అసాధ్యులైన వాళ్లెందర్నో జయించిన వాడివి నువ్వు. నీకు ఎదురెవరు? భీష్మ ద్రోణుల్ని నీ దివ్యాస్త్రాల్తో ఓడించావ్, అత్యాశ్చర్యకరంగా సైంధవుణ్ణి చంపావ్. నిన్ను మించిన వాళ్లెవరూ లేరు. ఎలాటి సందేహమూ నీమనసులో వద్దు. నీకున్న దివ్యబాణాలు, నీ ధనుర్వేదకౌశలం ఇంకెవరికున్నయ్? కౌరవులేదో కర్ణుడు నీ సరిజోదు అనుకుంటున్నారు గాని, అతనికి చావూ నీకు కీర్తీ తథ్యం. మన భీముడైనా మరెవరైనా విజృంభిస్తున్నారంటే అది నీ అస్త్రాల మహిమ వల్లే. కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ, కర్ణుడు, శల్యుడు – వీళ్లంతా నీచేతిలో చచ్చేవాళ్లే. పోనీ కృపుణ్ణి, అశ్వత్థామని దయతల్చి వదిలేద్దామని నీకనిపిస్తే అలాగే చేద్దాం. మిగిలిన వాళ్లు చావటం మాత్రం తప్పదు. కర్ణుడు మిమ్మల్ని పెట్టిన కష్టాలు గుర్తు తెచ్చుకో. ఆనాడు నిండుకొలువులో ద్రౌపదిని సమర్థుడైన భర్తని మరొకణ్ణి చూసుకోమని వాడన్న మాట మర్చిపోయావా? నేను సంధి చెయ్యటానికి వెళ్తే నన్ను బంధించాలని చూసింది వాడే. వంచనతో అభిమన్యుడి చేతివిల్లు విరిచి ఆ చిన్నబిడ్డ ప్రాణాలు తీయించిన వాడు కర్ణుడే. ఇప్పటికీ అది తలుచుకుంటే మనసు కలుక్కుమంటుంది. అడుగో కర్ణుడు, వాణ్ణి చంపి మనవాళ్లందరికీ ఆనందం కలిగించు” అని అతన్ని ప్రోత్సహించాడు కృష్ణుడు.

అర్జునుడు సమరావేశంతో “నువ్వు నా పక్కనుంటే ఇప్పుడు త్రిలోకాల్నీ జయిస్తా, ఈ కర్ణుడొక లెక్కా?” అని సంరంభంగా ఆదిశేషుడి వంటి తన హస్తంతో కొండలాటి గాండీవాన్నెత్తి నారిసారించి “ఇప్పుడు నా బాణాల దెబ్బల్తో కౌరవులకి వాళ్లు చేసిన దుశ్చర్యల్ని గుర్తుకు తెప్పిస్తా. రాజ్యం ధర్మరాజుకి ఇప్పిస్తా. ఆకాశచారులంతా నా ప్రతాపాన్నే పొగుడుకుంటూ వెళ్లేట్టు చేస్తా. మనవాళ్లంతా నన్ను గౌరవించేట్టు చూస్తా” అని ఆవేశంగా మాట్లాడాడు.

ఈలోగా కర్ణుడి కొడుకొకడు ఉత్తమౌజుడి చేతిలో మరణించాడు. శోకంతో, క్రోధంతో కర్ణుడతని గుర్రాల్ని చంపి కేతనాన్ని విరిస్తే అతను కత్తి తీసుకుని కిందికి దూకి దగ్గర్లో వున్న కృపాచార్యుడి గుర్రాల్ని కూల్చి శిఖండి రథం ఎక్కాడు. విరథుడై కింద పడ్డ కృపుణ్ణి కొట్టటానికి మనసు రాక వదిలేశాడు శిఖండి. అశ్వత్థామ వేగంగా వచ్చి మేనమామని తన రథం మీద ఎక్కించుకుని తీసుకెళ్లాడు.

మరోవంక భీముడు అర్జునుడు ఎంతసేపైనా రాలేదేమిటని వ్యాకులపడ్డాడు. ఒకవేళ ధర్మరాజుకేమైనా ఐందేమోనని సందేహం కలిగిందతనికి. ఐతే యుద్ధభూమిని విడిచి వెళ్లి పరామర్శించే అవకాశం లేకపోవటంతో ప్రస్తుతానికి దుఃఖోపశమనానికి మందు కౌరవుల్ని చంపటమే అని నిశ్చయించుకున్నాడు. తన సారథి విశోకుడితో “ఎదురుగా కౌరవులు ఎవరెవరున్నారో సరిగా చూసుకో, మనకి కావాల్సినన్ని బాణాలున్నయ్యో లేదో చూడు” అంటే అతను “ఎదురుగా ఎవరుంటే ఏం, వాళ్లలో నీ ముందు నిలవగలిగే వాళ్లెవరు? ఇక అస్త్రశస్త్రాలంటావా, ఆరెడ్ల బండి నిండా వున్నయ్. ఐనా నీ గద వుండగా ఇవన్నీ నీకెందుకు?” అని ఉత్సాహపరిచాడతను. ఆదరంగా అతని చేతిని తట్టాడు భీముడు. “ఇప్పుడు నేనీ కౌరవమూకని చేతులతీట తీరేట్టు చెండుతా చూడు. సభలో చేసిన ప్రతిజ్ఞలు తీర్చే సమయం దగ్గరపడింది” అంటూనే దూరంగా కౌరవసేనల కోలాహలం చూసి “మనం మొదలుపెట్టక ముందే కౌరవసైన్యం అటుపక్క కకావికలై పరిగెత్తుతుంది, అర్జునుడటు వచ్చాడా ఏమిటి?” అనడిగాడు.

విశోకుడటు చూసి ఆనందంగా “నిజమే, అదుగో కపిధ్వజం. కౌరవ గజసైన్యాన్ని తరుముతున్నాడు అర్జునుడు. కృష్ణుడి మేనికాంతి, అర్జునుడి కిరీటకాంతి ధగధగలు ఆకాశం నిండుతున్నయ్” అంటే “ఇంత సంతోషకరమైన మాట చెప్పావ్, నీకు వందమంది దాసీల్ని, ఇరవై గుర్రాల్ని, పద్నాలుగు గ్రామాల్నిస్తున్నా” అని చెప్పాడు భీముడు సంతోషంతో పొంగిపోతూ.

గజసైన్యాన్ని కరువు తీరా మర్దించి భీముడున్న వైపుకి బయల్దేరాడు అర్జునుడు. మన బలాలు అతనికి అడ్డుపడి కమ్ముకుంటే పాముపిల్లల్ని పరిహరించే గరుత్మంతుడిలా అతను మన చతురంగబలాల్ని చావుదెబ్బలు కొట్టాడు. ఎదురుగా యుద్ధానికి వువ్విళ్లూరుతూ కర్ణుడి వ్యూహం కనిపిస్తే దాని మీదికి కదిలాడు అర్జునుడు. అదిచూసి భీముడు మహోత్సాహంతో తన ముందున్న మన మొన మీదికి దాడి చేశాడు. దుర్యోధనుడు మనమొనలోని దొరల్ని అతని మీదికి పురిగొల్పాడు కాని భీముడా సైన్యాన్ని నుగ్గుచేశాడు. అప్పుడు నీ కొడుకు శకునిని అతని మీదికి పంపాడు. శకుని తీవ్రంగా అతన్నెదుర్కుని అనేక బాణాలు అతని వక్షాన కొట్టాడు. భీముడవి లెక్క చెయ్యకుండా ఒక క్రూర నారాచాన్నతని మీద వేస్తే గొప్ప లఘువుతో శకుని దాన్ని ఇరవైమూడు అమ్ముల్తో ముక్కలు చేశాడు. భీముడతని విల్లు విరిచాడు. నీ మరిది ఇంకో విల్లు తీసుకుని పదహారు బాణాల్తో అతని వింటిని, కేతువుని విరిచి గుర్రాల్ని, సూతుణ్ణి గాయపరిచాడు. మహాక్రోధంతో భీముడు యముడి నాలిక లాటి శక్తినొకదాన్ని విసిరితే శకుని దాన్ని పట్టుకుని తిరిగి భీముడి మీదికే విసిరేశాడు. అది భీముడి చేతికి తగిలి గాయం చేసింది. భీముడింక సహించలేక ఒక దృఢమైన వింటిని తీసుకుని శకుని విల్లు విరిచి అనేక నిశితాస్త్రాల్తో అతన్ని కొట్టాడు. ఆ దెబ్బకి శకుని చచ్చినట్టు నేలమీద పడ్డాడు. దుర్యోధనుడతన్ని తన రథం మీద వేసుకుని దూరంగా తీసుకెళ్లాడు. మన సైన్యం హాహాకారాలు చేసింది. దొరలు వెనక్కి తిరిగితే భటులూ వాళ్ల కన్నా ముందే పరిగెత్తారు.

కర్ణుడు మన సేనల్ని కూడగట్టి నిలిపి కరూశ, పాంచాల, చేది సైన్యాల్ని కల్లోలం చేయసాగాడు. భీముడు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు, ద్రౌపదేయులు, సాత్యకి అతన్నడ్డుకోవటానికి ప్రయత్నించారు. అలాగే నకుల సహదేవులు కూడ వచ్చి వాళ్లతో కలిశారు. ఐనా క్షణక్షణానికి పెరుగుతున్న ఉత్సాహంతో కర్ణుడు అందరికీ అన్ని రూపులై వాళ్ల బలగాల్ని చించి చెండాడుతూ నెత్తుటి మడుగులు పారించాడు. దూరాన మరోవైపున్న మన సైన్యాన్ని మర్దిస్తున్న అర్జునుడది చూసి ఇక మనం వెళ్లి కర్ణుడితో తలపడదాం అంటే కృష్ణుడలాగే రథాన్ని కదిలించాడు. మహావేగంగా వస్తున్న ఆ రథాన్ని గమనించాడు శల్యుడు. కర్ణుడితో “కపిధ్వజం భీకరంగా ఎగురుతుంటే కృష్ణుడు అద్భుత చాతుర్యంతో నడుపుతుంటే శ్వేతాశ్వాల్తో వెలుగులు చిమ్ముతూ వస్తున్నాడు అర్జునుడు, అటు చూడు. అతనికి అటూ ఇటూ తోడుగా ఎవరూ లేరు. ఒకడే నీతో తలపడటానికి వస్తున్నాడు. మనం తప్ప అతన్నాపే వాళ్లెవరూ లేరిక్కడ” అంటే కర్ణుడు విజయుడి వీరవిక్రమాల్ని, కృష్ణుడి మహత్యాన్ని పొగిడి “అలాటి వాళ్లతో తలపడగలవాణ్ణి నేనొక్కణ్ణే. ఇంతకన్నా కావలసిందేమిటి మన రథం వాళ్లకెదురుగా పోనివ్వు” అన్నాడు ఉత్సాహంగా.

అదిచూసి దుర్యోధనుడు కృప, కృతవర్మ, అశ్వత్థామ, శకునుల్ని పురిగొల్పితే వాళ్లు కర్ణుణ్ణి దాటి వెళ్లి అర్జునుణ్ణి చుట్టుముట్టారు. అర్జునుడు వాళ్లని లెక్కచెయ్యకుండా అందర్నీ అనేక విధాలుగా హింసించి భీముడి దగ్గరికి వెళ్లి అతనికి ధర్మరాజు క్షేమం చెప్పి నువ్వింక కాసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పి మన సైన్యం మీదికి జింకల గుంపు మీద దూకే సింహంలా విజృంభించాడు.

నీ కొడుకులు పదిమంది వేగంగా వెళ్లి అతన్ని చుట్టుముడితే అతను వాళ్ల తురగ, కేతన, సూతుల్ని చెండాడి మెరుగుబాణాల్తో వాళ్ల మెడలు నరికాడు. కౌరవరథికులు తొంభైమంది దాడికి దిగితే అన్నే బాణాల్తో వాళ్లందర్నీ రణభూమికి బలిచ్చాడు. పదమూడువందల మదపుటేనుగుల దళంతో ఆభీరులు మొదలైన మ్లేచ్ఛ సైన్యాలు కమ్ముకుంటే వాళ్ల మీద అనేక బాణాలేశాడతను. ఐనా వాళ్లు ఆగకపోతే భీముడొచ్చి అతన్నాదుకున్నాడు. అప్పటికీ అవి పోకపోతే భీముడు గద తీసుకుని రథం మీంచి దూకి వీరవిహారం చేస్తుంటే అర్జునుడు మరోవంక అంపవర్షం కురుస్తూ గాయాలు కాని చతురంగబలం లేకుండా చూశాడు.

మనసైన్యాలింక నిలవలేక కర్ణుడి రక్షణకి పరిగెత్తితే అతను వాళ్లనాదుకుని అడ్డుపడ్డాడు. నీ కొడుకులు కూడ అతనికి తోడుగా నిలబడ్డారు. అలా మన వ్యూహాన్ని నిలబెట్టి అర్జునుడి మీదికి కదిలాడు కర్ణుడు. అటుపక్క భీముడు కూడ తన రథం ఎక్కి అర్జునుణ్ణి కలుసుకున్నాడు. ఐతే వాళ్లిద్దర్నీ దాటుకుని పాంచాలబలాలు కర్ణుడితో తలపడినయ్. సాత్యకి, ద్రౌపదేయుల్తో పాండవబలాలు కూడ వాళ్లతో జతకూడినయ్.

కర్ణుడు శత్రువీరులందర్ని ముప్పుతిప్పలు పెట్టి కేకయకుమారుణ్ణి బాణానికి బలిచేస్తే వాడి తండ్రి కోపోద్రేకంతో కర్ణుడి కొడుకు ప్రసేనుణ్ణి అతని తండ్రి ఎదుటే చంపాడు. పుత్రశోకం, కోపం కలగలిసి కర్ణుడతన్ని అప్పటికప్పుడే కొడుకు దగ్గరికి పంపేశాడు. ఇంతలో సాత్యకి వేరే గుర్రాల్ని కట్టుకుని వచ్చి కర్ణుడి కొడుకు సుషేణుణ్ణి పట్టుకున్నాడు. వాడి గుర్రాల్ని చంపి ముప్పై నిశితాస్త్రాల్తో వాణ్ణీ పైకి సాగనంపితే కర్ణుడు మహోగ్రుడై ఒక తీవ్రనారసాన్ని సాత్యకి మీద వేస్తే దాన్ని శిఖండి మూడు శిలీముఖాల్తో మధ్యలోనే తుంచి మరోమూడు ప్రదరాల్ని కర్ణుడికి గుచ్చాడు. కర్ణుడు శిఖండి ధనువుని, ధ్వజాన్ని విరిచి ధృష్టద్యుమ్నుడి కొడుకు సుదేవుణ్ణి వాడి తండ్రి ఎదుటే చంపాడు.

పాంచాలరథికులు కర్ణుణ్ణి కమ్ముకున్నారు. వాళ్లని దాటి అర్జునుడతనితో తలపడబోతే అతన్ని దాటుకుని ఉత్తమౌజుడు, జనమేజయుడు, యుధామన్యుడు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు కర్ణుణ్ణి తాకారు. ఐతే అతను ఏమాత్రం తొట్రుపడకుండా వాళ్లందరినీ బాణవర్షంలో ముంచెత్తి కేతువుల్ని, గుర్రాల్ని, సూతుల్ని, ధనుస్సుల్ని, తూణీరాల్ని ముక్కలుముక్కలు చేసి సింహనాదం చేశాడు. ద్రౌపది కొడుకులు అతని మీదికి కదిలారు. వాళ్లు వేసే బాణాల్ని మధ్యలోనే తుంచుతూ అతనికి సాయపడుతున్న దుర్యోధనుడి శరీరాన ఎనిమిది నిశితబాణాలు నాటాడు సాత్యకి. దుర్యోధనుడితో పాటు కర్ణ, కృప, కృతవర్మలు సాత్యకితో పోరారు. ఘోరసమరమైంది.

అప్పుడు దుశ్శాసనుడు భీముడితో తలపడ్డాడు. భీముడు మహోత్సాహంతో దుశ్శాసనుణ్ణి చూసి “నాకు ఇలాటి అవకాశం ఇచ్చి ఆ బ్రహ్మ ఇన్నాళ్లకి దయచూపించాడు. ఆ సభలో నీకున్న బాకీ అంతా వడ్డీతో సహా తీర్చేస్తారా తమ్ముడా” అంటే “సభలోనే కాదు, లక్క యింట్లో చిచ్చు పెట్టటం, నీ అన్న మామ చేతిలో జూదంలో ఓడటంతో మీరంతా అడవుల్లో తిరగటం, చివరికి విరాటుడి కొలువులో దీనంగా బతకటం ఇవన్నీ జగమెరిగిన సత్యాలే. ఐనా యుద్ధానికొచ్చి వృథామాటలెందుకు?” అన్నాడు దుశ్శాసనుడు. భీముడు మూడు భల్లాల్తో అతని కేతనాన్ని, వింటిని, సారథిని నరికి ఒక నారసాన్ని అతని మొహాన నాటాడు. దుశ్శాసనుడు తగ్గకుండా రథం తనే నడుపుకుంటూ ఇంకో విల్లు తీసుకుని పన్నెండమ్ములు భీముడికి నాటాడు. అంతతో ఊరుకోకుండా భీముడి విల్లు విరిచి ఆరమ్ములు సారథికి గుచ్చి ముప్పై బాణాలు భీముడి శరీరానికి కొట్టాడు. భీముడు మరోవిల్లు తీసుకుని ఏభై నిశితాస్త్రాలు దుశ్శాసనుడి ఒంటికి గుచ్చితే అతను భల్లాల్తో గుర్రాల్ని చంపాడు.

విరథుడై ఒక భీకరమైన గద తీసుకుని కిందికి దూకాడు భీముడు. దుశ్శాసనుడి గుర్రాల్ని మోది చంపాడు. భుజబలంతో నీ కొడుకు రథాన్ని ఒక్క తోపున పడేశాడు. ఈలోగా దుశ్శాసనుడొక గట్టి తోమరాన్ని తీసుకుని లాఘవంగా కిందికి దూకి తప్పించుకున్నాడు. ఆ తోమరంతో భీముడి వక్షాన మోదాడతను. పదమూడేళ్లు పడ్డపాట్లు కళ్లముందు కదుల్తుంటే భీముడు వీరావేశంతో గదని అతని మీద విసిరాడు. దాంతో దుశ్శాసనుడు నెత్తురు పారుతుండగా నేలబడ్డాడు. భీముడతని మీద లంఘించి మెడ తొక్కి పట్టి “నువ్వప్పుడు సభలో అన్న మాటలు చాలక ఇప్పుడు నువ్వేమంటావో విందామని వచ్చా, ఏమంటావో అను, వింటా” అని మన సేన వంక చుట్టూ చూస్తే దావాగ్ని వెంటబడితే పరిగెత్తే జంతువుల్లాగా పరిగెత్తారందరూ. నీ సైన్యంలో సమర్థులైన వాళ్లు కూడ ఏమీ చెయ్యటానికి చేతులు రాక అవాక్కులై చూస్తూ నిలబడిపోయారు.

భీముడు దుశ్శాసనుణ్ణి పట్టి పైకెత్తి గిరగిర తిప్పి నేలకేసి కొట్టి కాళ్లతో తన్ని మోకాళ్లతో పొడిచి మొహాన్న పిడిగుద్దులు గుద్ది మెడ తొక్కిపట్టి భీభత్సంగా కుమ్మి “ఇప్పుడు నీ రక్తం తాగబోతున్నా, నీ దిక్కున్న వాళ్లని పిలువ్, ఎవడన్నా ఒచ్చి నిన్ను రక్షిస్తాడేమో” అని కత్తి దూసి అతని మొహం మీద ఝళిపించి ఉగ్రనరసింహుడు రాక్షసుణ్ణి చంపినట్టు దుశ్శాసనుడి రొమ్ము చీల్చి ఎగజిమ్ముతున్న రక్తం దోసిటపట్టి తాగి మొహానికి, ఒంటికి పూసుకుని లేచి చుట్టూ చూశాడు. “తల్లిపాల కన్నా, రకరకాల తేనెల కన్నా, ఖండచక్కెర పాల కన్నా రుచిగా వుందీ రక్తం” అని అరిచి చెప్తుంటే సైన్యాలు భయపడి పరిగెత్తినయ్, కొందరు ఆయుధాలు పారేసి పారుతుంటే మరికొందరు మహాభీతితో మూర్ఛపోయారు. ఒక చేత్తో దుశ్శాసనుడి కాలు పట్టుకుని లేపి చుట్టూ తిప్పుతూ “నేను చేస్తానన్న పనుల్లో ఒకటిప్పుడు పూర్తయింది. ఇక దుర్యోధనుణ్ణి పడేసి తన్నే పని ఒక్కటి మిగిలుంది” అని అతను అరిచి చెప్తుంటే కర్ణుడాదిగా అందరూ బొమ్మల్లా చూస్తూ నిలబడిపోయారు. భీతితో సకలేంద్రియాలు వాళ్ల వశం తప్పినయ్. అర్జునుడు మాత్రం భీముడు ప్రతిజ్ఞ తీర్చకుండా ఎవరన్నా అడ్డుపడతారా అని జాగ్రత్తగా అందర్నీ గమనిస్తూ అలా ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో తృప్తి చెందాడు. ఇంతలో నీ కొడుకులు కవచి, నిషంగి, పాశి, దండధారుడు, ధనుర్గ్రహుడు, నలోలుపుడు, సహుడు, షండుడు, వాతవేగుడు, సువర్చసుడు కలిసి భీముడి మీద అనేక బాణాలేస్తూ కమ్ముకున్నారు. ఐతే పదిభల్లాల్తో అతనా పదిమందినీ చంపాడు.

ఇదంతా చూస్తూ కర్ణుడు వెలవెలబోతూ నిలబడ్డాడు తప్ప ఏమీ చెయ్యలేదు. శల్యుడతనితో “భీముడలా దుశ్శాసనుడి రొమ్ము రక్తం తాగుతుంటే చేతలుడిగిపోయి నిలబడ్డారందరూ. నువ్వు సేనాపతివి, అందర్నీ కూడగట్టి యుద్ధం చేయించటం నీపని. నీకొడుకు వృషసేనుడొక్కడే తేరుకుని పాండవుల మీదికెళ్తున్నాడు. అర్జునుణ్ణి ఢీకొనేపని నీది కదా?” అంటే తెలివి తెచ్చుకుని కర్ణుడు సమరోన్ముఖుడయ్యాడు.

వృషసేనుడు భీముడి మీదికి దూకితే నకులుడడ్డుపడి అతని కేతనం, గొడుగు, విల్లు ఖండించాడు. వృషసేనుడు మరో విల్లు తీసుకుని నకులుడి రథాన్ని, గుర్రాల్ని కూల్చాడు. వాలు, పలక తీసుకుని నకులుడు కిందికి దూకి చుట్టుపక్కలున్న భటుల్ని మట్టుబెట్టాడు. వృషసేనుడు పలక ముక్కలు చేసి కత్తిని నరికి నకులుడికి నారసాలు నాటాడు. దాంతో ధృష్టద్యుమ్నుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, శిఖండి, జనమేజయుడు, సాత్యకి, ద్రౌపదేయులు వృషసేనుణ్ణి చుట్టుముడితే మనవైపు నుంచి కృతవర్మ, కృపుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, శకుని, అతని సోదరులు వెళ్లి వాళ్లతో తలపడ్డారు.

కళింగ గజసేనలు వచ్చి మన వాళ్లని చిక్కుపరిస్తే కృతవర్మ, సుయోధనుడు, శకుని వాటినెదిరించి భీభత్సంగా పీనుగుపెంటలు చేశారు. భీముడు, ఇతర శత్రురథికులు ఆ ముగ్గుర్నీ ఢీకొన్నారు. రణం దారుణం ఐంది. కర్ణుడి వెనక భాగాన గజసైన్యం మీద యుద్ధం చేస్తున్న నకులుడి కొడుకు శతానీకుడి మీద వృషసేనుడు అమ్ములవాన కురిసి ఒక భల్లంతో అతని సారథిని చంపాడు. అదిచూసి భీమార్జునులు వృషసేనుడితో తలపడ్డారు. వృషసేనుడా ముగ్గుర్నీ మూడేసి అమ్ముల్తో కొట్టి ఏడు బాణాలు నకులుడికి గుచ్చి కృష్ణుడి మీద పన్నెండు సాయకాలు వేశాడు. అర్జునుడు వేగంగా మిగిలిన వాళ్లని దాటి వృషసేనుడితో ఎదురుగా తలపడితే వృషసేనుడతని వీపున పది వాడితూపులు గుచ్చి కృష్ణుణ్ణి తొమ్మిది బాణాల్తో కొట్టాడు. క్రోధంతో ముడిబడ్డ కనుబొమల్తో సరభసంగా అర్జునుడతని విల్లు విరిచి బాహువులు నొంచి ఒక క్రూరభల్లంతో తల నరికాడు. అక్కడే వున్న కర్ణుడు శోకవ్యాకులుడై కన్నీళ్లు ధారగా కారుతుంటే అర్జునుడికి ఎదురుగా నిలబడి యుద్ధానికి పిలిచాడతన్ని.

అలా ఇద్దరూ ఎదురుగా నిలబడి యుద్ధం ఆరంభిస్తే మిగిలిన వాళ్లంతా ఆపేసి ఆసక్తిగా వాళ్లనే చూస్తూ నిలబడ్డారు. ఆకాశంలో సుర, పితృ, విద్యాధర, సిద్ధ గణాలు, ఇంద్ర, బ్రహ్మ, మహాశివులు కూడ ఆ యుద్ధం చూడటానికి వచ్చి నిలిచారు. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మకి నమస్కరించి “నరనారాయణులకి అపజయం లేదని ఇదివరకే చెప్పావు, కనక ఇప్పుడీ యుద్ధంలో అర్జునుడే గెలుస్తాడని నిశ్చయించు. కర్ణుడు పుణ్యలోకాలు పొందుతాడు, ఇంతకాలం ఎన్నో కష్టాలు పడ్డ అర్జునుడు కొంతకాలం రాజ్యసుఖాలు అనుభవిస్తాడు” అని కోరాడు. “వీళ్ల జయాపజయాలు మనం నిశ్చయించటం ఎందుకు?” అని బ్రహ్మ సందేహిస్తే శివుడు “దాన్లో తప్పేం వుంది? ఇప్పుడే నిర్ణయిద్దాం, లోకహితార్థం పుట్టిన ఈ మునుల్ని ఇతరులు ధిక్కరించటం లోకహితం కాదు. కాబట్టి నరనారాయణులకి గెలుపు తథ్యం” అని చెప్తే అందుకు బ్రహ్మ కూడ అంగీకరించాడు. ఇంద్రుడా విషయాన్ని అక్కడున్న మునులకి చెప్పి “మీరు కూడ అర్జునుడి విజయాన్నే కోరండి” అంటే వాళ్లూ అందుకొప్పుకున్నారు. దేవతలు దివ్యదుందుభులు మోగించి పుష్పవృష్టి కురిపించారు.

కృష్ణార్జునులు, కర్ణశల్యులు శంఖాలు పూరించారు. సైన్యమంతా నిశ్శబ్దంగా నిలబడింది.

ముందుగా అర్జునుడి కపికేతనం, కర్ణుడి హస్తికేతనం యుద్ధం చేసుకున్నయ్. కపికేతనం గెలిచింది. తరవాత కృష్ణ శల్యులు, కర్ణార్జునులు తీక్షణాలైన చూపుల్తో ఒకర్నొకరు ఢీకొన్నారు. కృష్ణార్జునుల బలం, కర్ణశల్యుల దుర్బలత్వం తేటతెల్లమయినయ్. కర్ణుడు శల్యుడితో “అర్జునుడు నన్ను చంపితే నువ్వేం చేస్తావ్?” అంటే “కృష్ణార్జునులిద్దర్నీ నా బాహుబలంతో ఓడిస్తా” అన్నాడు శల్యుడు. అదే ప్రశ్న అర్జునుడు కృష్ణుణ్ణడిగితే “సూర్యుడు రాలనీ భూమి పగలనీ మేరువే ఒరగనీ కర్ణుడి చేతిలో నువ్వు ఓడేది జరగదు. విధి వక్రించి అక్కడిదాకా వస్తే కౌరవసేన నంతట్నీ నాశనం చేసి ధర్మరాజుకి పట్టం కడతా” అన్నాడు కృష్ణుడు. దానికి అర్జునుడు కూడ “నవ్వులాటకి అన్నా గాని ఈ కర్ణ శల్యుల్ని చంపటం నాకో లెక్కా? ఇవాళ నువ్వు సంతోషవార్తని ద్రౌపదికి, ధర్మరాజుకి చెప్పటం నిశ్చయం” అని బదులిచ్చాడు.

పాండవ సైన్యాలన్నీ అర్జునుడి వెనకా, పక్కలా నిలబడినయ్. అలాగే మన సైన్యాలు కర్ణుడి వెనకా, పక్కలా నిలబడినయ్. కర్ణార్జునులు యుద్ధానికి సిద్ధమౌతున్నారు. అశ్వత్థామ దుర్యోధనుడి దగ్గరికెళ్లి అతని చేతిని తట్టి ఇలా అన్నాడు “భీష్మ ద్రోణులిద్దరూ యుద్ధంలో అర్జునుడి అస్త్రాలకి పడ్డారు. కర్ణుడు వాళ్లని మించినవాడు కాడు. నేను అర్జునుణ్ణి ఆపుతా, నువ్వు కర్ణుణ్ణి నిలుపు. ధర్మరాజుతో సంధి చేసుకో. మిగిలిన పాండవులు అతని మాట దాటరు. కృష్ణుడు కూడ దార్లోకి వస్తాడు. ధర్మరాజు ధృతరాష్ట్రుణ్ణే రాజుని చేస్తాడు, పాండురాజు రాజ్యాన్ని పాండవులు పంచుకుంటారు. బతికుంటే సుఖం, చస్తే ఏమొస్తుంది? ఇప్పుటికైనా సంధి చేసుకోకపోతే ముప్పు తప్పదు. నేనూ కృపుడూ అవధ్యులం కనక నీకు రాజ్యం తెచ్చిపెడతామనుకోకు” అని బోధించాడు. దుర్యోధనుడికది నచ్చలేదు “భీముడు దుశ్శాసనుణ్ణి చంపి ఇక తన రెండో ప్రతిజ్ఞ నెరవేరుస్తానని సిద్ధంగా వుంటే ఇప్పుడా సంధి? ఐనా కర్ణుడు అర్జునుణ్ణి చంపటం ఖాయం, ఈ విషయాలెందుకు?” అన్నాడు.

కర్ణార్జునులు తలపడ్డారు. “అర్జునా, నీ ముందు కర్ణుడెంత? వాణ్ణి భల్లాల్తో కొట్టు, అస్త్రాల్తో నరుకు” అని పాంచాల బలాలు అర్జునుణ్ణి రెచ్చగొడుతుంటే “ఇంకా ఆలస్యం ఎందుకు, చంపు అర్జునుణ్ణి. దాంతో పాండవులు యుద్ధం మానేసి అడవులకి పోతారు, రారాజు ఏకచ్ఛత్రంగా పాలిస్తాడు” అని మనవాళ్లు కర్ణుణ్ణి ప్రోత్సహించారు. పొద్దు వాలుతున్నది. ఐనా ఇద్దరు వీరులూ కాలాంతకుల్లా యుద్ధం సాగించారు. ఒకరినొకరు బాణవర్షంలో ముంచెత్తారు.

అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని సంధించాడు. అగ్నిజ్వాలలు కక్కుతూ ఆ మహాస్త్రం ఆకాశానికెగిసింది. కర్ణుడు ఏమాత్రం అనుమానం లేకుండా వారుణాస్త్రంతో దాన్ని శాంతింపజేశాడు. ఫల్గుణుడు మేఘాస్త్రం వేస్తే అంతా అంధకారమయమైంది. అనిలాస్త్రంతో కర్ణుడా చీకటిని మాయం చేశాడు. భక్తితో మంత్రించి ఇంద్రాస్త్రం వేశాడు అర్జునుడు. మన సైన్యం హాహాకారాలు చేసింది. కర్ణుడు అనేక బాణాల్ని అభిమంత్రించి వేసి దాన్ని శక్తిహీనంగా చేసి అర్జునుడి శరీరాన కొన్ని బాణాలు నాటాడు. పక్కనే ఉన్న భీముడు కోపంతో అర్జునుణ్ణి చూసి “వాడు నీ ఎదుటికొచ్చి నిలబడటమే కాకుండా నీ అస్త్రాలకి బదులిచ్చి నిన్ను గాయపరుస్తున్నాడు. ఇంద్రుడు నివ్వెరబోయి చూస్తుంటే ఖాండవం దహనం చేయించావే, అది గుర్తుకు తెచ్చుకో. వీణ్ణి త్వరగా చంపు. నీ ప్రతిజ్ఞ మూలాన గాని లేకపోతే నేనిప్పుడే నా గదతో వీడికి కపాలమోక్షం కలిగిస్తా” అన్నాడు. కృష్ణుడు కూడ “ఇలా నీ దివ్యాస్త్రాలు కొరగాకుండా పోవటం చూస్తూ మన సైన్యాలు ఏమనుకుంటాయో ఆలోచించావా? కావాలంటే నా చక్రం ఇస్తా, తీసుకుని వాణ్ణి చంపు” అన్నాడు.

నవ్వి అర్జునుడు నిష్టగా బ్రహ్మాస్త్రాన్ని సంధించి వేశాడు. ఐతే కర్ణుడూ అదే అస్త్రంతో దాన్ని శాంతింపజేశాడు. చేసి మూడేసి క్రూరాస్త్రాల్తో అర్జునుణ్ణి, కృష్ణుణ్ణి కొడితే అర్జునుడు తొమ్మిదేసి బాణాల్తో కర్ణుడికి, శల్యుడికి నాటాడు. అర్జునుడు కర్ణుడి అల్లెతాటిని తెంచి అస్త్రాల్తో కొడితే కర్ణుడు తనూ అదే పని చేశాడు. ఇలా ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా యుద్ధం చేస్తుంటే అర్జునుడు కర్ణుడి కవచం చీల్చి బాణాలు గుచ్చితే అతను బాధపడుతూనే యుద్ధం సాగించాడు. అర్జునుడు కర్ణుణ్ణి, అతని చుట్టూ వున్నవాళ్లని శరపరంపరలో ముంచితే కర్ణుడి చక్రరక్షకులు, ఇతర సహాయకులు అందరూ చూస్తున్నారన్న ధ్యాస కూడ లేకుండా పారిపోయారు.

గాయాల్నుంచి కారుతున్న రక్తాన్ని లెక్కచెయ్యకుండా కర్ణుడు పోరుతున్నాడు. గాండీవి పటిష్టమైన బాణాల్తో అతని శరీరాన్ని కప్పేస్తున్నాడు. ఐనా పళ్లబిగువున ఒళ్లుదాచుకోకుండా శ్రమిస్తున్నాడు కర్ణుడు.

అతను అలిసిపోతున్నాడని గుర్తించి దుర్యోధనుడు మన సేనల్ని కేకేసి అర్జునుడి మీదికి పురిగొల్పాడు. ఐతే అవతలి వాళ్లెవరూ యుద్ధం చెయ్యనప్పుడు అలా వెళ్లటం ధర్మం కాదు గనక మన సైన్యంలో భటులు హడావుడి చేసినా దొరలెవరూ కదల్లేదు. దుర్యోధనుడు భారమంతా కర్ణుడి మీదే వేసి ఊరికే చూస్తున్నారని వాళ్ల మీద రుసరుసలాడి అర్జునుడి మీదికి తరలిస్తే అనుమానంగానే అతని మీదికి కమ్ముకున్నారు వాళ్లు. ఐతే అర్జునుడు అమ్ములవాన కురిపిస్తే వెనక్కి పరిగెత్తారందరూ. అర్జునుడి ముందున్న యుద్ధస్థలాన్ని ఖాళీగా ఉంచటం ఓడిపోయినట్టు ఒప్పుకోవటంతో సమానం కనక కర్ణుడొక్కడే మళ్లీ అర్జునుడితో తలపడ్డాడు. ఇద్దరూ దివ్యాస్త్రాల్తో తీవ్రంగా పోరాడారు. అలిసిపోతున్నా పట్టువదలకుండా ఒకరినొకరు గాయపరుచుకోవటానికి అన్ని విధాలుగానూ ప్రయత్నించారు.

తక్షకుడి కొడుకు, తక్షకుడి సోదరుడు ఐరావంతుడి పోషణలో పెరిగిన వాడు, అశ్వసేనుడనే నాగకుమారుడు సర్పముఖాస్త్రంగా కర్ణుడి దగ్గర ఎంతకాలంగానో పూజలందుకుంటూ వున్నాడు. రోషావేశంతో ఆ అస్త్రాన్ని బయటికి తీశాడు కర్ణుడు. అగ్నిజ్వాలలు ఆకాశానికి పాకుతుంటే పాండవసైన్యాలు హాహాకారాలు చేస్తుంటే దాన్ని తన వింటికి తొడిగి అర్జునుడి కంఠానికి గురిపెట్టాడు. ఐతే ఆ గురి సరిగ్గా కంఠానికి కాకుండా కొంచెం పైకి వున్నట్టు గమనించాడు శల్యుడు. అది నెపం పెట్టుకుని కర్ణుడి గురి చెదరగొట్టటానికి “నువ్వు సరిగా గురిపెట్టలేదు, ఇంకోసారి చక్కగా చూసుకుని మళ్లీ గురిపెట్టుకో” అని ఉచితసలహా ఇచ్చాడు కర్ణుడికి. కర్ణుడికి ఒళ్లు మండిపోయింది.”నాకు చెప్పేంత గొప్ప విలుకాడివా నువ్వు? పైగా ఒకే బాణాన్ని రెండుసార్లు తొడిగితే చూసేవాళ్లు నవ్విపోతారు” అని అతన్ని విదిలించి “అర్జునా ఈ దెబ్బతో నీ చావు తథ్యం” అని అరిచి ఆ అస్త్రాన్ని ఒదిలాడు. ప్రచండంగా మండుతూ దూసుకువస్తున్న ఆ నాగాస్త్రం దిశని గమనించి కృష్ణుడు వెంటనే రథాన్ని ఐదంగుళాలు కిందికి తొక్కాడు. ఆ శరం క్షణక్షణం అమితవేగాన్ని పుంజుకుంటూ వచ్చి రమణీయరత్నచ్ఛటల్తో వెలిగే అర్జున కిరీటాన్ని హరించి నేలపడేసింది. చూసేవాళ్లంతా అవాక్కులయారు. అర్జునుడి అతిశయం సన్నగిల్లింది. దిక్పాలకులకైనా భేదించటం అసాధ్యమైన ఆ కిరీటి కిరీటం కర్ణుడి బాణానికి బలయ్యింది. ఇంద్రుడెంతో నిష్టగా తపస్సు చేస్తే పరమశివుడతనికి ప్రీతితో ఇచ్చిన కిరీటం అది. సముద్రంలో దాగిన నివాతకవచులనే రాక్షసులు ఇంద్రుడికి అజేయులైతే అర్జునుడు వెళ్లి వాళ్లని హతమార్చినప్పుడు ఆనందంతో అతనికి ఇంద్రుడిచ్చాడు దాన్ని. అలాటి కిరీటం భగ్గున మండుతూ నేలపాలు కావటం అర్జునుడికి తలవంపైంది.

కిరీటం కోల్పోయిన అర్జునుడి తెల్లజుట్టుతలకి ఒక పాగా గట్టిగా చుట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడతను. ఐతే అతని కిరీటాన్ని హరించిన నాగం తిరిగి అతని ప్రాణాల్ని తియ్యటానికి బయల్దేరింది. కృష్ణుడది గుర్తించి అర్జునుణ్ణి హెచ్చరించాడు. “ఎక్కడిదీ పాము, ఇలా ఎందుకు వెంటపడుతుంది?” అని అర్జునుడడిగితే “మర్చిపోయావా, ఖాండవదహన సమయంలో తన తల్లిని రక్షించుకుని బయటికి తీసుకుపోవటానికి వీడు ప్రయత్నిస్తే నువ్వు బాణం వేశావ్, వాడి తల్లి చనిపోయింది. ఆ పగ తీర్చుకోవటానికి వచ్చిన అశ్వసేనుడు వీడు, మొదటిసారి నిన్ను చంపలేకపోయానని తనంతట తనే నీ మీదికొస్తున్నాడు” అని కృష్ణుడు చెప్పాడు. ఆరు పదునైన భల్లాల్తో ఆ నాగాస్త్రాన్ని సంహరించాడు అర్జునుడు.
తర్వాత కర్ణుడి వైపుకి తిరిగి పది పన్నెండు బాణాలేసి ఒక ఉగ్రనారసాన్ని అతని శరీరాన నాటితే అది కర్ణుడి శరీరాన్ని చీల్చుకుని బయటికి వచ్చింది. దండంతో కొట్టిన పాములా ఉగ్రమూర్తి అయాడు కర్ణుడు. నాగాస్త్రానికి అర్జునుడు చావకపోవటానికి ఆశ్చర్యపోతూనే పన్నెండు వాలాల్తో కృష్ణుణ్ణి కొట్టి తొంభై తొమ్మిది బాణాల్తో అర్జునుణ్ణి గుచ్చాడు. ఇంకొన్ని బాణాల్తో అర్జునుడి వక్షాన్ని కొట్టి కర్ణుడు ఆకాశం అదిరేలా అరిచి అట్టహాసం చేశాడు.

అర్జునుడు వీరావేశంతో గట్టి భల్లాలు వేసి కర్ణుడి కవచాన్ని ముక్కలు చేసి అతని కిరీటాన్ని విరిచి కుండలాల్ని కత్తిరించాడు. తలనుంచి, చెవులనుంచి నెత్తురు కాలవలు కారుతున్నా లెక్కచెయ్యకుండా స్థిరుడై నిలబడి సాయకపరంపరలు ఫల్గుణుడి మీదికి పంపాడు కర్ణుడు. అర్జునుడు వాటిని నరికి నాలుగు వందల బాణాల్తో కర్ణుడి శరీరమంతా రక్తసిక్తం చేశాడు. అంతటితో ఆగకుండా పదునుపెట్టిన గోవుదూడల పళ్లున్న అనేక బాణాల్ని వడివడిగా వేసి సారథిని, గుర్రాల్ని, కేతనాన్ని కప్పేశాడు. గాయాలు శరీరమంతా నిండినా వెనక్కి తగ్గకుండా కర్ణుడు బాణపరంపరలు సారిస్తూ అర్జునుడి శరాల్ని విరుస్తూ చూసేవాళ్లకి విభ్రాంతి కలిగేట్టు రణం కొనసాగిస్తున్నాడు.

పరశురాముడిచ్చిన భీషణమైన భార్గవాస్త్రం కర్ణుడికి కనిపించలేదప్పుడు. అంతలో రథం చక్రం ఒకటి భూమిలో కుంగింది. అలా పరశురామ శాపం, బ్రాహ్మణ శాపం ఒకేసారి తగలటంతో కర్ణుడు బిత్తరపోయాడు. “ధర్మాన్ని రక్షించే వాళ్లని ధర్మం రక్షిస్తుందంటారు. ఆ మాట అబద్ధమని తేలిపోయింది. నావంటి ధర్మపరుడికి ఇప్పుడిలా జరగటం ధర్మమా?” అని ధర్మాన్ని తిట్టిపోశాడు. నాగాస్త్రానికి అర్జునుడు చావలేదనే బాధ కూడ దానికి తోడైంది. విషాదంతో ఇంకా శాపనార్థాలు పెట్టాడు. ఐతే ఒకవంక అర్జునుడి బాణాలు వచ్చి పడుతూనే వున్నయ్ గనక వాటిని ఎదుర్కుంటూ కృష్ణార్జునుల్ని తన బాణాల్తో బాధిస్తూ రణం కొనసాగిస్తున్నాడు.

అర్జునుడు ఆరు విశిఖాల్ని కర్ణుడి ఒంట్లోంచి దూసుకుపోయేట్టు వేస్తే కర్ణుడతని మీద బ్రహ్మాస్త్రం వేశాడు. అర్జునుడు బదులుగా ఇంద్రాస్త్రం వేశాడు. ఐతే బ్రహ్మాస్త్రం ఇంద్రాస్త్రాన్ని నిర్వీర్యం చేసింది. అర్జునుడు విషణ్ణుడయాడు. కృష్ణుడతన్ని ఓదారుస్తూ “కర్ణుడి అస్త్రం ముందు నీది వృథా ఐంది, పర్లేదు మరోటి వెయ్యి” అంటే అర్జునుడూ బ్రహ్మాస్త్రం వేసి దాన్ని ఉపసంహరించాడు.

అర్జునుడి విల్లుతాడు ఊడేట్టు దృఢంగా ఒక బాణం వేశాడు కర్ణుడు. అర్జునుడు త్రుటిలో దాన్ని మళ్లీ అమర్చుకుని కర్ణుడి మీద బాణాలేశాడు. కర్ణుడు వాటిని దార్లోనే తుంచి మరికొన్ని బాణాల్తో అర్జునుణ్ణి కొట్టాడు. కృష్ణుడు కల్పించుకుని “కర్ణుడు నిన్ను కొట్టేవాడా? నీ శరలాఘవం చూపించి వాణ్ణి అంతం చెయ్యి” అని ప్రోత్సహించాడు. ఇంతలో కర్ణుడు మరొక నాగాస్త్రాన్ని రోషంగా మంత్రించి వింటికి తొడిగి వెయ్యబోయేంతలో అదివరకు కుంగిన రథచక్రం అతనికి బాణం వేసే అవకాశం ఇవ్వనంతగా ఇంకా లోపలికి దిగబడింది. రోషవిషాదాల్తో కర్ణుడికి కన్నీళ్లుబికినయ్. రథం దిగి అర్జునుడి వైపుకి తిరిగి “రథచక్రం బాగా లోతుగా దిగబడింది గనక దాన్నెత్తబోతున్నా. ఈలోగా నువ్వు నామీద బాణాలెయ్యకు. రణకోవిదుడివైన నీకు తెలియని ధర్మం కాదు, ఐనా చెప్తున్నా. నీకూ కృష్ణుడికీ భయపడి ఏ మాత్రం కాదు” అన్నాడతను.

దానికి కృష్ణుడు మండిపడ్డాడు. “ఏమిటీ, ఇవాళ హఠాత్తుగా నీకు ధర్మం గుర్తొచ్చిందా? నీ గర్వం, దురభిమానం ఏమై పోయినయ్? పరమధర్మపరులైన పాండవులకి జయం, ధర్మహీనులైన కౌరవులకి చావు తప్పవు. వాళ్లంతా నిద్రలో వున్నప్పుడు లక్క ఇంటికి నిప్పు పెట్టారే, కపటజూదంలో ధర్మరాజు సంపదనంతా దోచుకున్నది చాలక పతివ్రత ద్రౌపదిని నిండుసభలోకీడ్చి పరాభవించారే, వాళ్లు అడవుల్లో వున్నా చంపటానికని ఘోషయాత్ర మిష పెట్టుకుని పోయారే, బాలుడు అభిమన్యుణ్ణి మహారథులు మీరంతా కలిసి చంపారే, వీటన్నిటికీ ముఖ్య కారణం నువ్వు” అని కర్ణుణ్ణి దెప్పిపొడుస్తుంటే ఒక్కో మాటకే అర్జునుడి క్రోధం ఆకాశాన్నంట సాగింది.

ఐనా అతను వేస్తున్న బాణాల్ని వారిస్తూ కర్ణుడు అవకాశం దొరికినప్పుడల్లా అతని శరీరానికి గాయాలు చేస్తూ నొప్పిస్తుంటే ఒక నిశితభల్లంతో కర్ణుడి కేతనాన్ని మధ్యకి విరిచాడు పార్థుడు. అది అందరి యశో బల దర్పాలకి జరిగిన అవమానంగా భావించి మనవాళ్లందరూ హాహాకారాలు చేశారు. క్రూరనారాచాల్ని కృష్ణార్జునుల మీద కురిసి కుంగిన రథచక్రాన్ని పైకెత్తటానికి పూనుకున్నాడు కర్ణుడు.

ఎంతో ప్రయాస మీద చుట్టూ వున్న భూమితో సహా ఆరంగుళాలు పైకి లేచింది చక్రం. అలా రథం కొంత కుదుటపడటంతో రథం ఎక్కి అంతకుముందు వెయ్యటానికి పూనుకున్న నాగాస్త్రాన్ని మళ్లీ సంధించబోయాడు. ఐతే చక్రం మళ్లీ యథాతథంగా కుంగిపోయింది. దాన్నెత్తటానికి కిందికి దూకాడు కర్ణుడు.

కృష్ణుడు మహోత్సాహంగా ప్రోత్సహిస్తుంటే అర్జునుడు అంజలికాకారంలో వున్న భీకరమైన ఒక అస్త్రాన్ని వింటికి తొడిగి “నేనే గనక తపసులో, దానంలో, గురుజనభక్తిలో నియమం తప్పని వాడినైతే ఈ అస్త్రం కర్ణుడి తల తెంచుతుంది” అని తాటిని ఆసాంతం లాగి వదిలాడు. ఆ అస్త్రకాంతికి రోదసీకుహరం అంతా నిండిపోయింది. ఇరువైపుల సైన్యాలు మూర్ఛలో మునిగినయ్. మిరుమిట్లు గొలిపే వెలుగులు విరజిమ్ముతూ ఆ దివ్యాస్త్రం కర్ణుడి శిరస్సు ఖండించింది. అతని సుందరశరీరం నేల మీద పడింది.

అందరూ కళ్లు తెరిచి చూసేసరికి అతని శరీరాన్నుంచి ఒక అద్భుత తేజం బయటికొచ్చి సూర్యబింబంలో కలిసిపోయింది.

అప్పటివరకు కుంగి వున్న రథచక్రం ఎప్పటిలా చక్కగా భూమి మీద నిలబడింది.

పాంచాల సైన్యాలు తూర్యనాదాల మధ్య సంతోషంతో అరిచినయ్. పాండవ సేనలూ ఆనందంతో ఉప్పొంగినయ్.

మృతుడైన రాధేయుణ్ణి చేతుల్తో అంటుకున్నందుకు స్నానం చెయ్యబోతున్నాడేమో అన్నట్టు సూర్యుడు పశ్చిమసముద్రంలోకి మునిగాడు.

రథికుణ్ణి, కేతనాన్ని కోల్పోయి మోడైన రథాన్ని వెనక్కి తిప్పాడు శల్యుడు.

బలీయమైన ఆబోతుని పులి చంపితే పరిగెత్తే పశువుల్లా కౌరవ సేనలు వెనక్కి తిరిగి పరిగెత్తినయ్.

సంతోషంతో దిక్కులు పిక్కటిల్లేట్టు అరిచాడు భీముడు.

దుర్యోధనుడు దుఃఖంలో మునిగి కన్నీళ్లు కార్చాడు.

కృష్ణార్జునులు పాంచజన్య దేవదత్తాలు పూరించారు.

మన సైన్యాలు యుద్ధం కొనసాగించేట్టు కనిపించక అప్పటికిక యుద్ధం చాలించి మర్నాడు తర్వాత విషయాలు చూసుకుందామని శల్యుడు నీకొడుక్కి సలహా చెప్పాడు. అలాగే చేశాడు దుర్యోధనుడు. అందరూ కర్ణుణ్ణి తల్చుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ శిబిరాలకి కదిలారు.

కృష్ణార్జునులు శరీరాలకు గుచ్చుకున్న బాణాల్ని పెరికించి ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ తమ సైన్యాల్ని మళ్లించి శిబిరాలకి బయల్దేరారు. పాంచాల దొరలు ముందుగా ధర్మరాజుని కలిసి దీవనలు పొందారు. కృష్ణార్జునులు, భీమ నకుల సహదేవులు ధర్మరాజుకి నమస్కరించి ఒకరినొకరు కౌగిలించుకున్నారు. కృష్ణుడు ధర్మరాజుతో “నీ కోపమే ఆ కర్ణుణ్ణి చంపింది గాని లేకుంటే ముల్లోకాలొక్కటైనా అతన్ని చంపటం సాధ్యమా? కర్ణుడి చావుతో నీకింక అడ్డు లేదు. యుద్ధం ముగిసిపోతున్నట్టే” అని అభినందించాడు. “నీకు భక్తులైన మాకు జయం కలగటంలో ఆశ్చర్యం ఏముంది? అంతా నీ మహిమేగా! ఈరోజు నేను ఎలాటి విచారాలూ లేకుండా హాయిగా నిద్రపోతా” అని ధర్మజుడతన్ని పొగిడాడు.

తర్వాత పోలికలనికి వెళ్లి చూడాలని వుందని ధర్మరాజు అడిగితే కృష్ణుడందుకు అనుమతించాడు. అనేకమంది కాగడాలు పట్టుకుని దారి చూపుతుంటే బంధుమిత్రుల్తో రథాలెక్కి బయల్దేరాడు ధర్మరాజు. కర్ణుడు, అతని కొడుకుల శవాల్ని చూసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. మళ్లీ కొత్తజన్మ ఎత్తినట్టు భావించుకున్నాడు. కలతలు తీరి యిక సుఖాలు దాపుల్లో వున్నాయని నిట్టూర్చాడు. కృష్ణుడి మహత్యాన్ని, అర్జునుడి కోదండవిద్యావిలాసాన్ని పదే పదే చెప్పుకుంటూ అందరూ వెనక్కి తిరిగారు.
--------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: