Thursday, July 11, 2019

రాజులలో సుల్తాను: విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం


రాజులలో సుల్తాను: విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం



సాహితీమిత్రులారా!

“నీకు నచ్చిన ఆహారం భుజించు, పరులకు నచ్చిన దుస్తులు ధరించు.”

                                                                                                            – అరబిక్ సామెత

విజయనగర సామ్రాజ్యాన్ని రాబర్ట్ సూవల్ (Robert Sewell) తన ఎ ఫర్గాటెన్ ఎంపైర్ (1900) పుస్తకంలో “మహమ్మదీయుల దండయాత్రలకు ఎదురొడ్డి నిలిచిన హిందూ కోటగోడ”గా వర్ణిస్తూ ఆ సామ్రాజ్య చరిత్ర పునర్నిర్మాణానికి నాంది పలకడంతో, ఈ వర్ణన ఒక స్వయంసిద్ధసత్యంగా చరిత్రకారుల్లో స్థిరపడిపోయింది. తుంగభద్రా నదీ తీరంలో తమ రాజధాని కేంద్రంగా సుమారు 140,000 చదరపు మైళ్ళ విస్తీర్ణం గల రాజ్యాన్ని విజయనగర రాజులు మూడు తరాలు – 14వ శతాబ్దం మధ్య నుంచి 17వ శతాబ్దం మధ్య వరకూ – సమర్థవంతంగా పాలించారు. సూవల్ ఈ సమర్ధతని భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని విరామం లేకుండా జరుగుతున్న మహమ్మదీయుల ప్రయత్నాలకు ఒక సహజమైన ప్రతిచర్యగా అభిప్రాయపడ్డాడు.

గత శతాబ్దాలలో దక్షిణ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన హిందూ రాజ్యాలు 14వ శతాబ్ద్యారంభంలో మహమ్మద్ బిన్ తుగ్లఖ్ దండయాత్రలతో ముక్కలుగా విడిపోయాయి. ఎప్పుడైతే ముష్కరులైన ఆక్రమణ దారులు కృష్ణా నదీ తీరాన్ని సమీపించారో, బలహీనమైన ఈ చిన్న రాజ్యాలు భయంతో కూడిన తొందరపాటుతో కూటమిగా ఏర్పడి, దండయాత్రల నుండి రక్షణ కలిగించే శక్తి ఉన్నట్టుగా అప్పటికి కనిపించిన విజయనగర సామ్రాజ్యం నీడలోకి చేరారు. ఈ విధంగా ఆ పాత రాజ్యాలన్నీ మాయమైపోయి, వీరులైన విజయనగర రాజులు రెండున్నర శతాబ్దాల పాటు దక్షిణభారతానికి ఏకైక రక్షకులైనారు – ఇదీ సూవల్ అభిప్రాయం.

కాలక్రమేణా ఈ అభిప్రాయబలం కొంచెం తగ్గినా సూవల్ చేసిన ప్రతిపాదన దక్షిణభారత దేశపు చరిత్రకారుల సాంస్కృతిక చరిత్ర నిర్మాణపు పోకడలపై తన ప్రభావాన్ని ఇప్పటికీ చూపిస్తూనే ఉంది. అయితే, 14 – 17 శతాబ్దాల మధ్య కాలంలో దక్షిణ భారత చరిత్రను కేవలం హిందూ – ముస్లిం ఘర్షణగా పరిమితం చేసే వర్ణన తప్పనీ, ఆ కాలంలో హిందూ ముస్లిం రాజ్యాలు ఒకరితో ఒకరు మాత్రమే కాకుండా తమలో తాము సైతం పోట్లాడుకునేవారనీ కొత్త పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి. విజయనగర సామ్రాజ్యాన్ని ‘దక్షిణ భారత దేశంలో ఇస్లాం వ్యాప్తిని అరికట్టి హిందూ సంస్కృతిని పరిరక్షించడం ప్రధానోద్దేశంగా’ ఏర్పడిన సామ్రాజ్యమని, ఇప్పటికీ చరిత్రకారులు కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇందువల్ల అంతర్లీనంగా కొన్ని అపోహలు ఏర్పడుతున్నాయి.

ముఖ్యంగా, మొదటిది – విజయనగర సామ్రాజ్యపు ఆవిర్భావమూ, మనుగడల చారిత్రక విశిష్టతను కేవలం హిందూ సంస్కృతి పరిరక్షణ అనే సంకుచిత దృక్పథానికి పరిమితం చేయడం; ఈ కాలంలో సనాతన హిందూ సంస్కృతీ సాంప్రదాయాలు ఏ మార్పూ లేకుండా తరువాతి తరాలకు సంక్రమించాయని నమ్మడం. ఇక రెండవది – దక్షిణ భారతదేశంలో హిందూ సంస్కృతి తన పరిశుద్ధతను నిలబెట్టుకోగలిగిందనీ, ఇస్లాం సాంప్రదాయాల ప్రభావంతో ఉత్తరభారత దేశపు హిందూ సంస్కృతిలా మలినం కాలేదని నమ్మడం.

ఈ వ్యాసం ద్వారా నేను ఈ నమ్మకాలని ప్రశ్నిస్తూ, విజయనగర సంస్కృతిపై నిజానికి ఇస్లాం సంస్కృతీ సాంప్రదాయాల ప్రభావం ఎంతగానో ఉన్నదనీ, తద్వారా ఎంతగానో మార్పు చెందిందనీ ప్రతిపాదిస్తున్నాను. విజయనగర రాజుల విశాల దృక్పథం, లౌకిక వ్యవహారశైలి గురించి, ఆ రాజ్యపాలనా వ్యవస్థపై ఇస్లాం సంస్కృతిక ప్రభావం గురించి తెలుసుకోవాలంటే, విజయనగరాన్ని మత ప్రాతిపాదికన ఏర్పడ్డ రాజ్యంగా గుర్తించకూడదు. అంతే కాక, పర మత సంస్కృతీ ప్రభావాలతో వచ్చే అన్ని మార్పులను దుర్ఘటనలుగా, వినాశహేతువులుగా కాక ఏ సంస్కృతికైనా సహజమైనవిగానూ, ఆ సంస్కృతికి వినూత్న జీవాన్నీ ఇచ్చేవి గానూ గుర్తించాలి. కేవలం అప్పుడే విజయనగర సామ్రాజ్యపు కాలం దక్షిణ భారత చరిత్రలోనే ఒక ఉత్తేజభరితమూ, విభిన్నమూ అయిన కాలంగా మనం గ్రహించగలం.

ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిశోధనలలో, విజయనగర సామ్రాజ్యపు రాజకీయ మంత్రాంగం, సైన్య నిర్వహణ, పరిపాలనా యంత్రాంగం లాంటి అంశాలలో ఇస్లాం సాంప్రదాయపు ధోరణులను చరిత్రకారులు మరింతగా గుర్తిస్తున్నారు. ఉదాహరణకి, విజయనగరపు కాలం నాటి స్థూపాలలో కనిపించే ఇస్లాం శిల్ప శైలి అందరూ గుర్తించినదే. కానీ, ఈ సాంస్కృతిక మార్పులను కేవలం చెదురు మొదురు సంఘటనలుగా కాక, దక్షిణ భారత దేశపు సాంస్కృతిక వ్యవస్థను సమూలంగా మార్చివేస్తున్న ఒక విస్తారమైన ప్రభావంలో భాగాలుగా ఎవరూ గమనించి నిర్వచించకపోవటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ ప్రస్ఫుటమైన, విస్తారమైన ప్రభావాన్నే నేను ఈ వ్యాసంలో ఇస్లామీయకరణ (Islamicization) అని పిలుస్తున్నాను.

ఇస్లామీయకరణలో భాగంగా ఒక ముఖ్యమైన మార్పు విజయనగరపు రాజాస్థానపు దుస్తులలో వచ్చింది. అప్పటిదాకా ప్రాచుర్యంలో ఉన్న దక్షిణ భారత దేశపు సాంప్రదాయపు దుస్తుల వైఖరి, పధ్నాలుగు, పదిహేను శతాబ్దాలలో పూర్తిగా తొలగిపోయి, ఇస్లాం దేశాలలో వాడే వస్త్రాల ఆధారంగా వచ్చిన ఒక కొత్త వైఖరి – కబాయి అని పిలవబడే ఒక పొడుగాటి అంగీ (అరబీ ‘కబా’), కోలగా ఉండి జరీతో అలంకరించబడి కుళ్ళాయి అని పిలవబడే తలపాగా(టర్కీ, పర్షియా దేశాల ‘కులా’ ఆధారంగా) – ఆ స్థానే చోటు చేసుకుందనీ నేను ఈ వ్యాసం ద్వారా నిరూపించదలిచాను. అంతే కాక, ఈ మార్పు కేవలం విజయనగర రాజుల మోజు ముచ్చట్ల వల్ల వచ్చిన మార్పు కాదనీ, ఇది అప్పటి రాజకీయ మంత్రాంగం ఉద్దేశ పూర్వకంగా చేసిన ఒక వ్యూహాత్మకమైన మార్పు అని నేను నమ్ముతున్నాను. రాజాస్థానపు వేషధారణలో ఈ మార్పు, రాజకీయ పరిభాషలో మార్పులకు సమాంతరంగా జరిగింది. ఇందుకు ఒక చక్కటి ఉదాహరణ, ఈ సమయంలోనే విజయనగర రాజులు స్వీకరించిన బిరుదు – హిందూరాయసురత్రాణ (హిందూ రాజ సుల్తాను). ఈ విధంగా, విజయనగర రాజులు తమ వేషభాషల్లో ఇస్లామీయకరణ ద్వారా చూపెట్టిన మార్పులు ఎంతో వ్యూహాత్మకమైనవి, ప్రస్తుతం చరిత్రకారులు వారికి ఆపాదిస్తున్న అల్పమైన ఉద్దేశాలకంటే చాలా లోతైనవి, అర్థవంతమైనవి.

విజయనగర రాజుల వస్త్రధారణ వైఖరిలో వచ్చిన మార్పులు పరిశీలించడం ఈ వ్యాసపు ముఖ్యాంశం. ఐతే, ఇది ఆ కాలపు దుస్తుల చరిత్ర మీద ఆసక్తితో కాకుండా, విజయనగర సామ్రాజ్యంలో ఇస్లామీయకరణానికి ఒక సూచికగా పరిశీలిస్తున్నాను. విజయనగరపు రాజుల కాలం నాటి దుస్తుల ఆనవాళ్ళు కూడా దొరకనప్పటికీ, ఆ కాలపు వర్ణచిత్రాలలోనూ, ఆ రాజుల గురించిన సాహిత్యంలోనూ మనకు ఎన్నో వివరాలు దొరుకుతాయి. వీటి ద్వారా దుస్తుల వివరాలే కాకుండా, ఆ దుస్తుల వాడుక వెనక గల ఆంతర్యాన్ని కూడా తెలుసుకోగలం. అంతే కాక, వాస్తు పద్ధతుల్లో ఇస్లామీయకరణ రుజువులతో సహా మన ముందు ఉన్నా వాటి వివరాలు వేషభాషల వర్ణనలంత విస్తారంగా సాహిత్యంలో నమోదు కాలేదు. ఇందువల్ల, విజయనగర సామ్రాజ్యంలో ఇస్లామీయకరణ తెచ్చిన సాంస్కృతిక మార్పులను మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఆ కాలపు వస్త్రధారణలో మార్పులను విశ్లేషించడం మరింత ఉపయోగపడుతుంది.

ఇస్లామీయకరణ: ఒక సాంస్కృతిక మార్పు
విజయనగర రాజాస్థానపు దుస్తుల గురించి చర్చించే ముందు, నేనిక్కడ ప్రతిపాదిస్తున్న ఈ ఇస్లామీయకరణ వెనక ఉన్న సిద్ధాంత సూత్రాలను ఒక్కసారి విశదీకరించడం అవసరం. ప్రాథమిక స్థాయిలో ఈ సాంస్కృతిక మార్పును ఇలా నేను నిర్వచిస్తున్నాను.

ఇస్లామీయకరణ మత సంబంధమైన మార్పును కాక ఒక రాజకీయమైన మార్పును సూచిస్తుంది. అప్పటికే ప్రబలి వున్న ఇస్లాం సంస్కృతిలో పాలు పంచుకోడం ద్వారా రాజ్యాధికారాన్నీ, స్వయంప్రపత్తినీ నిలబెట్టుకోడానికి రాజులు తెచ్చుకున్న మార్పు ఇది.

ఈ మార్పు వేషభాషలు, అలంకరణల వంటి లౌకిక స్థాయిలో జరిగినదే. ఇస్లామీయకరణ అని నేనంటున్నది మతానికి ఏ మాత్రమూ సంబంధించినది కాదు. ప్రత్యేకించి విజయనగర సామ్రాజ్యం గురించిన చర్చలో ఇది స్పష్టం. ఎందుకంటే తమ రాజకీయ జీవనంపై ఎంత ఇస్లాం నాగరిక ప్రభావం ఉన్నప్పటికీ, ఆ కాలంలో ఏ రకమైన మత మార్పిడులు లేదా మత సమ్మేళనం జరిగినట్లు దాఖలాలు లేవు.

ఇస్లామీయకరణ అన్న ఈ పదాన్ని నేను సంస్కృతీకరణ (Sanskritization) అన్న పద అర్థానికి దగ్గరగా వాడుతున్నాను. భారతదేశ భాషలపై సంస్కృత భాష ప్రభావం ఎలా వుందో, ఇస్లామీయకరణ కూడా భారతీయ సంస్కృతిపై అదే రకమైన ప్రభావాన్ని చూపించింది. ఈ రెండు మార్పులూ భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను సమూలంగా నిర్మూలించి ఆ స్థానే వచ్చినవి కావు. ఇవి అప్పటికే అస్తిత్వంలో ఉన్న భాషలు, ఆచార వ్యవహారాలు అదనంగా సంతరించుకున్న స్వభావసిద్ధమైన మార్పులు అని మనం గ్రహించాలి.

హిందూ – ముస్లిం మతాల మధ్య ప్రస్తుతం నెలకొని వున్న రాజకీయ వాతావరణం దక్షిణ ఆసియా చరిత్రను సంకలిస్తున్న ఈ శతాబ్దపు చరిత్రకారులపై ఎంతో ప్రభావం చూపిస్తున్నది. ఈ కాలంలో, ఈ ఇస్లామీయకరణ తరహా ప్రతిపాదనలు కూడా ఇప్పటిదాకా ఎవరూ చేయకపోడం ఆశ్చర్యం కలిగించేది కాకపోయినా, కొట్టొచ్చేట్టుగా కనపడే విషయం. ఒక్క మార్షల్ హాడ్జ్‌సన్ (Marshall G.S. Hodgson) పరిశోధనలలో తప్ప ఇటువంటి ప్రతిపాదనలు మరెక్కడా కనపడలేదు. హాడ్జ్‌సన్ విజయనగర సామ్రాజ్యాన్ని తన వ్యాసాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. 1970లో ప్రచురించిన ఒక వ్యాసంలో, “పదహారవ శతాబ్దికల్లా, తూర్పు దేశాల కిరస్తానీ, హిందూ, తేరావాద బౌద్ధ మతాల ప్రజానీకం అంతా కూడా ఇస్లాం సాంస్కృతిక ప్రపంచపు పరిధుల్లోకి వచ్చేశారు. ఇస్లాం సాంస్కృతిక ప్రభావం హిందూ విజయనగరం, నార్మన్ సిసిలీ వంటి సర్వ స్వతంత్ర రాజ్యాలపై కూడా పడింది” అని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో, అవిశ్రాంతంగా విస్తరిస్తున్న ఇస్లాం నాగరికత ప్రభావానికి లోనైన ఎన్నో రాజ్యాలలో విజయనగర సామ్రాజ్యం ఒక ముఖ్యమైన సమాజమని హాడ్జ్‌సన్ చేసిన పరిశీలన కూడా గమనించదగ్గది. ఈ పరిశీలన నొక్కి చెప్తున్నది ఏమిటంటే ఇస్లాం సాంస్కృతిక ప్రభావానికి స్వచ్ఛందంగా లోనైనవి స్వతంత్ర రాజ్యాలనీ, ఏ ఖలీఫాకో సామంతులు కారనీ. ఈ ప్రభావం మత ప్రభావం కాదనీ, ఇది లౌకిక లేదా ఐహిక స్థాయిలో వచ్చిన మార్పు అని కూడా తెలుస్తుంది.

హాడ్జ్‌సన్ ఈ మార్పును ప్రత్యేకించి చూపడం కోసం ఇస్లామిక (Islamic) అన్న విశేషణాన్ని మత సంబంధమైన విషయాలకు మాత్రమే వాడుతూ, మతంతో సంబంధం లేకుండా ముస్లిం సమాజాలలోనూ, ముస్లిములు కాని సమాజాల్లోనూ కూడా కనిపించే ఇస్లాం నాగరిక సంస్కృతిని నిర్వచించడానికి కొత్తగా ఇస్లామీయక (Islamicate) అన్న విశేషణం సృష్టించాడు. ఈ పదం ఇస్లామీయక చరిత్రకారులకు ఎంతోకాలంగా పరిచయం ఉన్నా, మతమౌఢ్య భావజాలం సిద్ధాంతాలకీ రాజకీయాలకీ మధ్యనున్న సరిహద్దు చెరిపివేయడం వల్ల దక్షిణ ఆసియా చరిత్రకారులకు తెలియకుండా పోయింది. మతధర్మ సహిత ఇస్లామీకరణకూ, మతధర్మ రహిత ఇస్లామీయకరణకు ఉన్న భేదం చాలా ముఖ్యమైనది. అందువల్ల ఈ వ్యాసంలో నేను హాడ్జ్‌సన్ నిర్వచనం ప్రకారమే ఇస్లామీయకరణ అని ఉపయోగిస్తాను. అందువల్ల, నేను విశ్లేషిస్తున్నది సాంస్కృతిక సంబంధమైనదని స్పష్టమౌతుంది.

కబాయి – కుళ్ళాయి
విజయనగర సామ్రాజ్యపు దుస్తులలో ఇస్లామీయకరణకు ఒక చక్కటి దృష్టాంతం విరూపాక్షాలయంలో (లేపాక్షి, అనంతపురం జిల్లా) 1530ల కాలం నాటి ఒక వర్ణచిత్రంలో ఉంది. ఆలయపు నాట్యమండపం లోకప్పు మీద ఉన్న ఈ చిత్రంలో కొంతమంది రాజాస్థానీకులు వీరభద్రునీ, భద్రకాళినీ పూజిస్తున్నట్టు ఉంటుంది. ఈ చిత్రంలో ఇంచుమించు అందరూ ఒకే రకమైన దుస్తులు ధరించి ఉంటారు – తెల్లని పొడుగైన కబాయీ అంగీ, పొడుగ్గా కోలగా ఉన్న కుళ్ళాయి జరీ టోపీ. ఈ కాలానికే చెందిన ఎన్నో చిత్రాలలో ఈ దుస్తులు మనకు కనిపిస్తాయి కానీ, ఈ లేపాక్షి చిత్రంలో ఉన్నంత వివరంగా మరెక్కడా ఉండవు.


కబాయీ, ~1530 లేపాక్షి చిత్రం
కుట్టిన తీరులో కబాయి ఒక పొడుగైన అంగీలా కనిపిస్తుంది. చేతులు కొంచెం బిగుతుగా కుట్టివున్నాయి. అంగీ పొడుగు మారుతూ ఉంది, కొందరికి మోకాళ్ళ వరకే ఉన్న అంగీ, మరికొందరికి మడమల దాకా ఉంది. దీనికి కారణమేదో తెలియకపోయినా, పొట్టి కబాయీలు ధరించిన వారు సేవకులుగా, లేదా కింద తరగతి ఆస్థానీకులుగా ఈ చిత్రం ద్వారా ఊహించవచ్చును. అంగీ మెడ వెడల్పుగా, మెడ కప్పు సన్నటి పట్టీలా వెనకకు మడతపెట్టబడి ఉంది. అంగీ నిలువునా ముందు భాగంలో చీలిక ఉండి బొత్తాములు కుట్టినట్టుగా ఉంటుంది. ప్రతీ కబాయి ఒకే రకమైన తెల్లటి సాదా గుడ్డతో కుట్టినట్టుగా ఉంది. నడుము దగ్గర బిగుతుగా కట్టుకున్న దట్టీ మాత్రమే విభిన్నమైన రంగులలో ఉంది.


కుళ్ళాయి, ~1530 లేపాక్షి చిత్రం
లేపాక్షి చిత్రంలో కనిపిస్తున్న కుళ్ళాయి, కోలగా పొడుగ్గా ఉంది. ఈ టోపీ ఒకటిన్నర తలల పొడుగుతో, గుండ్రటి పైఅంచుతో సన్నటి పొడుగైన త్రిభుజాకారపు పొన్నుగుడ్డలను పక్క పక్కనే పేర్చి కుట్టబడి. టోపీ కింది అంచులకు ఏ విధమైన అంచు లేకుండా నేరుగా ఉంది. అయితే చిత్రంలో ప్రముఖులుగా కనిపించే ఇద్దరి కుళ్ళాయిలకు మాత్రం, టోపీ పైనుంచి రెండు జరీ పేలికలు వేలాడుతున్నాయి (వీరిద్దరూ విరూపాక్ష ఆలయ నిర్మాణకులైన వీరన్న, విరుపన్నలని సమాచారం – అను.). కుళ్ళాయి మీద జరీ, పొన్నుగుడ్డల అంచులకు పరిమితమై ఉంది. ఈ చిత్రంలో రెండు రకాల జరీ అల్లికలను మనం గమనించవచ్చు. ఒకటి మూడు రెక్కల కలువుపూలు, ఆకులు కలిగిన తీగ నమూనాతో ఉంటే రెండవది రెండు గోళాల మినారు లాంటి జ్యామిత్తిక ఆకృతితో ఉంది.

లేపాక్షి చిత్రం ద్వారా మనకు ఎన్నో విలువైన వివరాలు లభించినా, కబాయిల ముడిగుడ్డ, ఏ సందర్భాలలో ఇవి ధరించారో తెలిసే వివరాలు లభించవు. విజయనగరాన్ని దర్శించిన విదేశీ యాత్రికుల వ్రాసిన యాత్రానుభవాలలో ఈ వివరాలు ముబ్బడిగా దొరుకుతాయి. విజయనగర కాలం నాటి దక్షిణ భారత దేశపు వేషభాషలు, వ్యవహార సాంప్రదాయాల గురించి ఎంతో విలువైన సమాచారం, స్థానిక చరితల్లో కన్నా ఎక్కువగా, అరబీ, పర్షియా, చీనీ, పోర్చుగీసు, ఇటలీ సందర్శకుల పుస్తకాల్లో దొరుకుతుంది (బహుశా దైనందిన జీవితంలో భాగమైన అంశాలను జనసామాన్యమైనవిగా భావించి స్థానిక సాహిత్యకారులు వాటిపై శ్రద్ధ చూపకపోయి ఉండవచ్చు). నిజానికి ఈ యాత్రా చరితలను ప్రాథమిక జాత్యధ్యయన శాస్త్ర వ్యాసాలుగా భావించవచ్చు. అటువంటి కొన్ని చరితల ఆధారంతో ఈ దుస్తుల గురించి మరికొంత విశ్లేషణ సాధ్యమౌతుంది.

పదిహేను, పదహారవ శతాబ్దాలలో విజయనగరంపై రాయబడిన విదేశీ చరితలన్నిటిలోనూ కూడా మహారాజు, అతని ఆస్థానీకులు అందరూ పొడుగైన అంగీలు ధరించినట్టుగా ఉంది. అయితే, ఆ అంగీ వర్ణన వారికి పరిచయమైన దుస్తుల పోలికలతో ఉండటం కద్దు. ఉదా: 15వ శతాబ్దిలో విజయనగర రాజు దేవరాయ రాయలను దర్శించిన అబ్దుల్ సమర్‌ఖండీ (Abd Al-samarqandi; 1422-46) మహారాజు ‘కాబా’ను పోలిన అంగీ ధరించాడని వర్ణించాడు. రాజు వేసుకున్న అంగీ పల్చగా పావడాలా ఉన్న చొక్కాలా ఉందని వర్తెమా (Ludovico di Varthema; 1502-08), పొట్టిలంగా చొక్కా కలిపి కుట్టిన బజురిని పోలి వుందని న్యూనెజ్ (Fernao Nunez; 1535-37) వర్ణించారు. డొమింగో పేస్ (Domingo Paes; 1520-22) వీరిలో మొదటిగా కబాయి అన్న పదం వాడి, అది నూలు, పట్టు, జరీ ముడిగుడ్డ నుండి కుట్టినదిగా వర్ణించాడు. (ఇది బహుశా అప్పటికే కన్నడ భాషలో ఉన్న పదమయి వుండవచ్చు.) సెసారొ ఫెడెరిచి (Caesaro Federici ~1750) తెలుపే కాకుండా సిందూరపు రంగు కబాయీలనూ, ముఖ్మల్, సన్న పట్టు, డమాస్కు పట్టు, తదితరమైన గుడ్డల నుండి కుట్టబడినవిగా, కబాయి గుడ్డ రకమూ, నాణ్యతా ధారకుని స్థాయి, స్తోమతలపై ఆధారపడి ఉన్నవిగా వివరించాడు. రాజు ధరించిన కబాయి సాధరణంగా మేలిమి పట్టుతో కుట్టబడి గులాబీపూల ముగ్గు బంగారు జరీతో ఉండేవని పేస్, న్యూనెజ్ చరితల్లో ఉన్నది. చివరిగా, ఈ కబాయి వినియోగం పరిమితమని కూడా ఈ చరితల్లో నమోదు చేయబడింది.

వర్తెమా తన చరితలో స్పష్టంగా కబాయి సంపన్న వర్గాల వారు మాత్రమే ధరించేది గానూ, సామాన్యులు అర్ధనగ్నంగా కేవలం మొలగుడ్డతో మాత్రమే ఉండేవారనీ పేర్కొన్నాడు. సంపన్నుల దుస్తు అయినప్పటికీ, కబాయి ధారణ కేవలం విజయనగరం, దాని సామంత రాజాస్థానాల వరకే పరిమితమయింది. ఇందుకు భిన్నంగా మిగిలిన దక్షిణ భారత రాజ్యాలలో, ముఖ్యంగా విజయనగరం నుంచి స్వతంత్రంగా ఉన్న సముద్ర తీరగత రాజ్యాలలో, సాంప్రదాయ హిందూ వస్త్ర ధారణే కొనసాగింది. అబ్దుల్ రజాక్, 1440లలో కాలికట్‌ను పాలించిన సమ్మూతిరిప్పాడ్ వంశస్థ రాజులు మిగతా హిందువల మల్లేనే అర్ధ నగ్నంగా ఉన్నారని రాశాడు. వాస్కో డ గామా (Vasco Da Gama; 1460-1524)చరితల్లో కూడా ఇదే విధంగా ‘గౌరవనీయులైన హిందువులు’ నడుము వరకూ అనాచ్ఛాదితంగా ఉండి, కింది శరీరాన్ని మేలిమి నూలు బట్టతో కప్పుకునేవారని ఉన్నది. చీనీ ముస్లిం సందర్శకుడు మా హుఆన్ (Ma Huan, 1433) కొచిన్, కుయిలోన్, సిలోన్, చివరికి ముస్లిముల సంఖ్య ప్రధానమైన మాల్దీవులలో కూడా ఇదే రకమైన వస్త్రధారణ గమనించినట్టుగా తన జ్ఞాపికలలో రాసుకున్నాడు.

తలకట్టు గురించి ఈ చరిత్రకారులందరూ ఇంచుమించుగా ఒకటే విధంగా వర్ణించారు. విజయనగర రాజులూ, రాజాస్థానీకులూ జరీ టోపీలు ధరించేవారని, ఇది ఖచ్చితంగా కుళ్ళాయి అని, ఈ వర్ణనలలో తెలుస్తుంది. వెర్తెమా “రాజు ధరించిన కుళ్ళాయి రెండు జానల పొడుగున్నది” అని వర్ణిస్తే, కృష్ణదేవరాయలను (1509-29) దర్శించిన పేస్, “రాయలు తన తలపై గెలీసియన్ కిరీటమును పోలిన టోపీ ధరించినాడని” వివరించాడు. రాజాస్థానీకుల కుళ్ళాయిలు కబాయిల్లాగానే రకరకాల తానులనుంచి కుట్టబడినట్టుగా ఈ చరితల్లో ఉన్నది. పేస్ ముఖ్యంగా కేవలం పురుషులే కాక, రాణివాస పరిచారికలు కూడా ఇవి ధరించేవారని, వీరి కుళ్ళాయిలపై ముత్యాలతో కుట్టిన పూల అలంకారాలు ఉండేవని పేర్కొన్నాడు. ఈ కుళ్ళాయిల తయరీలో కూడా వాడిన గుడ్డ, నాణ్యత ధరించేవారి స్థాయీ స్తోమతలపై ఆధారపడిందిగా మనం ఊహించవచ్చు.

ఈ కబాయి, కుళ్ళాయి విజయనగర రాజుల కాలానికి దక్షిణ భారతంలో ఎవరికి తెలియని వస్త్ర విశేషాలు. నిజానికి, విజయనగర రాజులు వీటిని స్వాగతించి ధరించటం, అప్పటిదాకా ఉన్న రాజాస్థాన వస్త్రధారణా నియమాలకు విరుద్ధంగా తీసుకున్న ఒక విప్లవాత్మక చర్యగా చెప్పక తప్పదు. కబాయీకి ముందు రోజుల్లో, దక్షిణభారత రాజాస్థానీకులు అనాచ్ఛాదితమైన చాతీతో ఉండేవారు. తమ పైశరీరాన్ని కేవలం ఒక నలు చదరపు అంగవస్త్రంతో కప్పుకునేవారు. ఇదే విధంగా, కుళ్ళాయికి ముందు కుట్టిన టోపీల ఉనికి ఎక్కడా లేక, రాజులు సాధారణంగా రత్నఖచిత స్వర్ణ కిరీటాలు ధరించడమూ, రాజాస్థానీకులు తలపాగా చుట్టుకోడమూ సాంప్రదాయంగా ఉండింది. ఈ సాంప్రదాయం విజయనగర సామ్రాజ్యం అప్పటికే ఇస్లామీయ సమాజాల్లో ప్రాచుర్యమైన ఆహార్యాన్ని గ్రహించి తమకు అనువుగా దిద్దుకున్నది. అరబీ ‘కబా’, పర్షియన్ ‘కులా’ లకు, విజయనగరపు కబాయి, కుళ్ళాయిలకు మధ్య వున్న సారూప్యతలే ఇందుకు నిదర్శనం.

పై వివరణ వల్ల విజయనగర సామ్రాజ్యపు రాజాస్థానపు దుస్తులైన కబాయి, కుళ్ళాయి ఇస్లామీయ సమాజాల నుండి వచ్చిన సాంస్కృతిక మార్పులని విశదం అవుతుంది. వెంటనే, ఈ సంప్రదాయం ఖచ్చితంగా ‘ఎప్పుడు’, ‘ఏ విధంగా’ విజయనగర సంస్కృతిలో భాగమయింది అనే ప్రశ్న తలెత్తడం సహజం. కానీ, ఇక్కడ నేను అంతకంటే మౌలికమైన ప్రశ్నను పరామర్శించదలిచాను: విజయనగర రాజులు తమ వస్త్ర సాంప్రదాయంలో ఈ మార్పులు ‘ఎందుకు’ తెచ్చుకున్నారు?

హిందూ రాజులలో సుల్తాను
విజయనగరాన్ని మొదటగా పాలించిన సంగమ వంశ రాజు మొదటి బుక్కరాయల గురించిన ఒక శాసనంలో (1352) అతని స్వీయవర్ణన ఈ విధంగా ఉంది: “సుసంపన్నుడు, మహా మండలేశుడు, శత్రు రాజ దండకుడు, మాట తప్పెడి రాజులను కఠినంగా శిక్షించేవాడు, హిందూ రాజులలో సుల్తాను, ప్రాక్పశ్చిమ సాగరాలకు ఇంద్రుడు, శుభాన్ని కలిగించే వీరుడు” (ఉజ్జాయింపుగా చేసిన అనువాదం. -వాగనర్). ఈ లిఖిత శాసనం విజయనగర రాజుల ‘హిందూరాజులలో సుల్తాను’ అన్న వాడుకకు మొదటి తార్కాణం. చిన్న చిన్న మార్పులతో ఈ బిరుదు వాడుక షుమారు 250 సంవత్సరాలు బుక్కరాయల వారసులలో, తదుపరి విజయనగరాన్ని పాలించిన రాజ వంశాలలో 17వ శతాబ్దం మొదటి దాకా కొనసాగింది.

ఎందరో చరిత్రకారులు ఈ బిరుదుని విశ్లేషించకుండా, వారి వ్యాసాల్లో కేవలం ఉటంకించారు. ఉదాహరణకి, వసుంధర ఫిలియోజట్ (Vasundhara Filliozat, 1973), “ఈ పదం (హిందూరాయసురత్రాణ) క్లిష్టమైనది. పరిశోధకులకు చిక్కును కలిగిస్తుంది. సంస్కృతంలో గానీ, కన్నడంలో గానీ ఈ పదానికి సంతృప్తి కలిగించే అర్థ వివరణ దొరకదు. సురత్రాణ అన్న పదం ముస్లిం బిరుదు అయిన సుల్తానుకు సంస్కృత తత్సమంగా స్వీకరించక తప్పదు. సురతాలు అన్న పదం ఇదే విధంగా కన్నడ భాషలో సుల్తానుకు తత్సమం అవాలి. కేవలం ఈ విధంగానే ఈ పదానికి ఒక సరి అయిన అర్థం వస్తుంది. బహుశా, ఈ బిరుదు బుక్కరాయనికి ఇరుగు పొరుగు ముస్లిం రాజులు ఇచ్చినదిగా భావించవచ్చు”, అని అభిప్రాయపడింది. నాకు తెలిసినంతలో ఈ పదానికి అర్థాన్ని వివరించడానికి ప్రయత్నించిన ఒకే ఒక చరిత్రకారుడు హెర్మన్ కుల్కే (Herman Kulke, 1985) ఇలా రాస్తాడు: “ఈ పదానికి సరి అయిన అర్థం గోచరించదు. బహుశా ఇది విజయనగర రాజులు సాటి రాజులలో తమ ఏకఛత్రాధిపత్యాన్ని ప్రకటించడం కోసం ముస్లిం రాజులనుండి తీసుకున్న ఒక పోలిక కావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి”. ఈ రకమైన నిర్వచనంతో కుల్కే ఈ బిరుదుని ఒక సంగతమైన పదంగా గ్రహించినట్లు తెలుస్తుంది. అంటే సుల్తాను అన్న పదాన్ని ఏ రకమైన సామాజిక సాంస్కృతిక ప్రకరణం లేకుండా వాడిన పదంగా, విజయనగర రాజులు తాము సుల్తానులమని ప్రకటించడం లేదనీ, ముస్లిం పాలకులలో సుల్తానుల హోదాతో సమానమైన హోదా హిందూరాజులలో తమకుందని చెప్పుకోడం వారి ఉద్దేశంగా అనిపిస్తుందనీ కుల్కే వివరణ.

అయితే కుల్కే వివరణకు లొంగని కొన్ని అంశాలున్నాయి. మొదటి అంశం: ఈ వివరణ మొదటి బుక్క రాయలిని ఒక విరోధాభాసమైన స్థితిలో పెడుతుంది. ఒక పక్క హిందూరాజులలో సుల్తానునని చెప్పుకుంటున్నా, ఆ శాసనంలోని మిగతా బిరుదులు అతని సామంత రాజు హోదాలో మాత్రమే నిలబెడతాయి. ఒకరిద్దరు మినహా, సంగమ వంశ రాజులందరూ వారిని వారు మహా మండలేశ్వర, ఓఢియ అని గౌరవించుకున్న వారే కానీ, రాజాధిరాజ, రాజపరమేశ్వర వంటి రాచరికపు బిరుదులను రెండవ హరిహరరాయల కాలందాకా (1377-1404) ఎవరూ స్వీకరించలేదు. కానీ హిందూరాయసురత్రాణ అన్న బిరుదు అప్పటికే కనీసం ఐదు శాసనాల్లో లిఖించబడి ఉన్నది. రెండవ అంశం: బుక్కరాయలి కాలం నాటివే అయిన ఇంకొక రెండు శాసనాలలో హిందూరాయ అన్న విశేషకాంశ లేకుండా అతను కేవలం సుల్తానుగా పొగడబడి ఉన్నాడు. ఇలా హిందూరాయ అన్న విశేషకం లేనప్పుడు ఈ బిరుదు కుల్కే నిర్వచనం ప్రకారం సుల్తానుకు సంగతమైన, సమానధర్మ పదంగా ఎలా అవగలదు? అందువల్ల, ఈ పదానికి వేరొక వివరణ అవసరం తప్పనిసరిగా ఉంది.

నేను ఈ విధంగా ప్రతిపాదిస్తున్నాను: సుల్తాను, హిందూరాజుల్లో సుల్తాను – ఈ రెండు బిరుదులు ఉపమానాలుగా కాక మాటకు మాటగా, ముఖ్యార్ధంగానే వాడబడ్డాయి. అంటే విజయనగర రాజులు తమని తాము సుల్తానులుగానే ప్రకటించుకున్నారు: అయితే ఈ సుల్తానత సాపేక్షికమైన రాచరికపు హోదాకు సంబంధించింది కాదు. ఇది సుల్తానులకున్న ఇస్లామీయ సాంస్కృతిక దృక్పథం ఆధారమైనది. ముఖ్యంగా, హిందూరాజుల్లో సుల్తానును అని ప్రకటించుకున్న రాజుకు ఇస్లామీయ నాగరిక రాజకీయ సమాజంతో పరిచయమున్నది అని, ఇందువల్ల మిగతా రాజులనుంచి ఈ రాజు భిన్నమైనవాడు అని ఈ బిరుదు సూచిస్తుంది. విజయనగర సామ్రాజ్యపు తొలినాళ్ళకే, ఉత్తరభారత దేశం చాలా వరకు ఢిల్లీ సుల్తాను పాలనలో ఉంది. దక్షిణ భారతంలో విజయనగరానికి సరిహద్దుల్లో ఉన్న గుల్బర్గా, బీదార్ (బహమనీ రాజులు, 1347-1527), అహ్మద్ నగర్ (1490-1636), బిజాపూర్ (1489-1686), గోల్కొండ (1512-1687) రాజ్యాలన్నీ, చిన్న చిన్న ముస్లిం రాజుల ఆధీనంలో ఉన్నాయి. అందువల్ల ముస్లిం రాజ్యాలతో కేవలం హిందూ సాంప్రదాయ ధోరణుల్లో రాజ్యాధికారపు ఔరసత్వాన్ని ప్రకటించుకోడం, అంటే రాజుగా తన అధికారాన్ని సాటి రాజులు చట్టబద్ధమని ఒప్పుకొనేలా చేయడం, సరిపోదు. ఈ పరిస్థితుల్లో విజయనగరపు రాజుల చట్టబద్ధతకి ముస్లిం రాజుల అంగీకారం కూడా తప్పనిసరి అయింది. విజయనగరపు రాజులు కేవలం హిందూ ఔరసత్వపు ధర్మాలనే కాక, ఇస్లామీయ ఔరసత్వపు ధర్మాలు కూడా చట్ట సమ్మతమని అంగీకరించగలిగినప్పుడే ఇది పరస్పర సాధ్యం అవుతుంది. ఈ అంగీకారానికి హిందూ రాజుల్లో సుల్తాను అన్న బిరుదు ఒక సంకేతం అవుతుంది.

ఇక్కడ ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి: ఈ కాలం నాటికే, వాణిజ్యపు ఎల్లలు దక్షిణ భారత దేశాన్ని దాటిపోయాయి. నైరుత కర్ణాటక తీరపు భత్కల్ రేవు ద్వారా దక్షిణ చైనా నుంచి పర్షియన్ అఖాతం, ఎర్ర సముద్రపు అంచుల దాకా విస్తరించి ఉన్న ఒక అతిముఖ్య వాణిజ్య రహదారిలో విజయనగరం ఒక ప్రధాన భాగమయింది. దక్షిణ అరేబియా తీరంలో ఆడెన్ నుంచీ, పర్షియన్ అఖాతపు ముఖద్వారం వద్ద ఉన్న హోర్ముజ్ నుంచీ, విజయనగరం తన అతి ముఖ్యమైన మారకాన్ని – మేలిమి జాతి యుద్ధాశ్వాలను – భత్కల్ రేవుకు దిగుమతి చేసుకుని, అక్కడినుంచి విజయనగరం చేర్చేవారు. తమ సైనికావసరాలకు ఇలా దూర తీర వాణిజ్యంపై ఆధారపడిన విజయనగర రాజులకు ఆ ప్రాంతాల రాజ్యాలపై ఆసక్తి ఉండి ఉండాలని అనుకోవడం సహజం. అనుకున్న విధంగానే, ఇరాన్, మధ్య ఆసియాలను పాలిస్తున్న తిమురిద్ వంశ రాజు, సమకాలికుడు అయిన షా రుఖ్ దూత మలబార్ తీరపు కాలికట్ నగరానికి దౌత్యకార్యంపై వచ్చినప్పుడు, రెండవ దేవరాయ రాయలు (1422-46) తన ఆహ్వానాన్ని పంపి సంబంధాల పెంపు కోసం ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో, హిందూరాజుల్లో సుల్తానును అని చెప్పుకోడం, హైందవ పరిభాషను దాటి, ఇస్లామీయ పరిభాషతో సంపర్కం ద్వారా తన రాచరికపు హోదాను వారికి అర్థమయ్యేలా ప్రకటించుకోడం కోసం అయివుండాలి.

{విజయనగర యుద్ధాశ్వాల వాణిజ్యంలో భత్కల్ రేవు పోషించిన ప్రముఖ పాత్రను సంజయ్ సుబ్రహ్మణ్యం (Sanjay Subrahmanyam) తన వ్యాసాల్లో విపులంగా చర్చించాడు. ఈ వ్యాసాలలో విజయనగరం ఒక విశ్వజనీన దృక్పథం కలిగిన నగరంగా గోచరిస్తుంది. పోర్చుగీసు వారి ప్రతిఘటనను తోసిరాజని, 1530ల దాకా కూడా భత్కల్ రేవు నుండి దక్షిణ అరేబియాకు వాణిజ్య నౌకల రాకపోకలుండేవి. 1570 నాటికి భత్కల్ క్షీణించింది; ఇందుకు కారణం, గోవా కేంద్రంగా పోర్చుగీసు వారు చూపుతున్న ఆధిక్యత కన్నా, విజయనగర సామ్రాజ్యం అప్పటికే అంతరిస్తుండడం ముఖ్య కారణం (సం.సు., 1990).}

ఈ పరిశీలన సబబు అయిన పక్షంలో, విజయనగర సంస్కృతిలోకి ఇస్లామీయ కబాయి, కుళ్ళాయిలు సహజంగానూ, తప్పకుండానూ ప్రవేశించడానికి గల రెండు కారణాలను గుర్తించవచ్చును. ఒకటి – కబాయిని ఎంచుకోడంలో ఇస్లామీయ, హైందవ సాంప్రదాయ వేషధారణలో ఉన్న తేడా. ఇస్లామీయకరణకి ముందు హైందవ ధర్మం ప్రకారం, శరీరం మానవుని అస్తిత్వంలో ఒక విడదీయరాని భాగం. మనిషి లోపలి గుణ స్వరూపానికి ఒక బాహ్య సంకేతం. ఈ సాంస్కృతిక సందర్భంలో దుస్తుల ప్రయోజనం శరీరాన్ని కప్పడం, అంటే దాచిపెట్టటం కాదు. దుస్తుల ప్రయోజనం శరీరాన్ని ప్రదర్శించడం, శరీరాకృతికి అనుగుణంగా చుట్టుకొని, శరీరాన్ని బహిరంగపరచటం అవుతుంది.
{ప్రాచీన హిందూ కావ్యమూ, శిల్పమూ దేహం గురించిన ధ్యాసలోనే నిమగ్నమైనట్టు కనిపించడం వెనక కారణం ఇదే – శరీరాన్ని ప్రదర్శించడం ద్వారా, ఆ శరీరం కలిగివున్న మానవుని గుణగణాలను విస్పష్టంగా సూచించడం కోసమే. బాణుడి కావ్య కథానాయకుడైన హర్షుని వర్ణన ఈ పరిశీలనకు ఎన్నో సమంజసమైన ఉదాహరణలిస్తుంది. ఉదా: “వైరి సైన్య ఘట్టనకు అదరక అడ్డుకోగల్గిన అతని విశాలమైన వక్షస్థలము, ధృఢత్వముచే అతని వలువలలో ఇమడలేక (ఆకాశమే హద్దు అయినట్లుగా) వేన వేల ఏనుగులు దంతములతో కుమ్మగా వచ్చిన కాఠిన్యము తొలగించలేని నునుపుదనముతో, స్ఫటిక శిఖరముతొ భాసించు కైలాసము వలే నుండెను”. గుప్త బుద్ధుని చిత్రంలో, బుద్ధుడికి కలిగిన జ్ఞానోదయాన్ని సౌష్టవశుద్ధి గలిగిన అవయవాకృతి ద్వారా ప్రదర్శించడం, ఈ పరిశీలనకు ఒక శైల్పిక ఉదాహరణ.}

ఈ హైందవ ధర్మానికి, ఇస్లాం సంప్రదాయం పూర్తి విరుద్ధమైనది. ఇస్లాం మత ధర్మం ప్రకారం అనాచ్ఛాదిత శరీరం లజ్జాపూరితమైనది. దుస్తులు శరీరాన్ని నగ్నత్వం లేకుండా కప్పుకోడానికి దేవుడు ఇచ్చినవని చెప్పబడింది*. కేవలం దుస్తులు శరీరాన్ని కప్పడమే కాకుండా, అవయవాకృతిని బహిర్గతం చేసేట్టుగా బిగుతుగా ఉండకుండా ఒదులుగా కూడా ఉండాలి. శరీరాన్ని పూర్తిగా కప్పుకోవలసిన ఈ ధార్మిక అవసరం, పొడుగాటి అంగీలూ, బురఖాలూ, ఇతర ఇస్లామీయ సాంస్కృతిక చిహ్నాలైన దుస్తులతో చక్కగా తీరుతుంది.

*{ఈ ధర్మం ఖుర్’ఆన్ ద్వారా చెప్పబడింది: “ఆదాము బిడ్డలారా, మేము మీ కోసము, మీ నగ్నత్వమును కప్పుకొనుటకై ఈ ఉడుపులను సృష్టించినాము” (7.27). రియాద్ అల్-సాలిహిన్ అన్-నవా’వీ హడిత్ సంకలనంలో “దుస్తులు, వాటి ముడి పదార్థము, వాటి రంగులు” అనే వ్యాసాంశానికి ముందుమాటగా ఉండటం ద్వారా, ఇస్లామీయ సంప్రదాయంలో ఈ ప్రకరణ యొక్క విశిష్టత మరింత తేటతెల్లమవుతుంది (ఖాన్, 1975).}

వస్త్ర ధారణా ధర్మాలలో ఉన్న ఈ మౌలికమైన విబేధం వల్ల దక్షిణ హిందూ రాజుల కొద్దిమాత్రపు దుస్తులు, ఇస్లామీయ సుల్తానులకు లజ్జావిహీనంగా, అనాగరికంగా అనిపించగలవు. అంతే కాకుండా, హిందూ రాజులలో సుల్తానుగా, ఇస్లామీయ సుల్తానులకు పరిచయం చేయబడినప్పుడు, ఇస్లామీయ సాంప్రదాయం ప్రకారం వేషధారణ రాజుకు గౌరవాన్ని కలిగిస్తుంది. ఈ కారణం వల్లనే, విజయనగర రాజాస్థానంలో కబాయి వాడుక సంస్థాగతమైందని నా అభిప్రాయం. తిమురిద్ కాలపు ఒక ముఖ్యమైన పర్షియా చరిత్ర పుస్తకం, అబ్దుల్ సమర్‌ఖండి రాసిన మత్లా-ఇ సా’దయఁ వ మజ్మాఁ-ఎ-బహ్రెయన్, నా అభిప్రాయాన్ని నిజమని రుజువు చేస్తుంది.

అబ్దుల్ రజాక్ సమర్‌ఖండి (Abd Al-razzaq Al-samarQandi; 1413-82), తిమురిద్ రాజు షా రుఖ్ ఆస్థానంలో ఉన్నతోద్యోగి. 1442లో కాలికట్ సమ్మూతిరి రాజుల ఆహ్వానం మేరకు భారతదేశానికి దౌత్యవేత్తగా పంపబడ్డాడు. కాలికట్లో దిగగానే, స్థానికులు ఈ పర్షియా దౌత్యవేత్తకి చాలా వింతగా కనిపించి ఇబ్బంది పడ్డాడు. మనుషులూ రాక్షసులూ కాని వారిలా ఉన్నారనీ, పీడకలలు తెచ్చేట్లున్నారని కవితాత్మకంగా వర్ణించాడు. సమర్‌ఖండికి ఇంత ఇబ్బంది కలిగించిన విషయం ఏమిటో స్పష్టంగానే తెలుస్తుంది, అది; శరీరాన్ని చాలా తక్కువగా కప్పుతున్న హిందూ దుస్తుల పోకడ. “నగ్నంగా నల్లగా, కొల్లాయి గుడ్డలు నడుము చుట్టూ మాత్రం కప్పుకుని ఉన్నారు. రాజులు కూడా ఈ రకమైన దుస్తులే వేసుకున్నారు. రాజుకీ, బిచ్చగాడికీ తేడా తెలియదు” అని రాశాడు. అంతే కాక అక్కడ ఉన్న ముస్లిం వర్తకులను, “చక్కనైన అరబీ సాంప్రదాయపు దుస్తులు ధరించి, సంబరాలలో మునిగి” వున్నవారిగా వర్ణించడంతో, ఇస్లామీయ ప్రభావం తెలుస్తుంది. అంతే కాక, సమర్‌ఖండికి కాలికట్ రాజాస్థానం నుంచి ఆదరమైన స్వాగతం లభించలేదు. షా రుఖ్ వ్రాసిన లేఖను చదివినప్పుడు కూడా ఏ ఉత్సుకతనూ రాజు చూపలేదని చెప్పుకున్నాడు. ఆ రాయబారం అలా పేలవంగా ముగిసిపోయేదే. కానీ, కాలికట్ కన్నా చాలా విశాలమైనది, బలమైనది అయిన విజయనగర సామ్రాజ్యపు రాజాస్థానం నుండి ఆహ్వానం అందడం ఆ దౌత్యకార్యాన్ని ఒక మలుపు తిప్పింది.

రెండవ దేవరాయ రాయలికి తిమురిద్ దౌత్యవేత్త కాలికట్ విచ్చేసినట్లు తెలియగానే, అతనికి ఆహ్వానం పంపించాడు. సమర్‌ఖండి విజయనగరం చేరగానే అతనికి రాయల రాజాస్థానం ఘన స్వాగతం పలికింది. కాలికట్‌ను ఎంత మొక్కుబడిగా, నిస్తేజంగా వర్ణించాడో, విజయనగరాన్ని అంతే ఉత్సాహంగా, గొప్పగా, చాలా వివరంగా సమర్‌ఖండి వర్ణించాడు. “విజయనగరానికి ఒక ఉత్తముడు, సమర్ధుడు అయిన రాజు ఉన్నాడు. విజయనగర ప్రజలకు ప్రపంచంలోనే సాటి లేరు” అని పేర్కొన్నాడు. రాయలు, తిమురిద్ దౌత్యవేత్తని తన ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు. తిమురిద్ పాదుషా మాకు దూతని పంపడం సంతోషకరమైన విషయం అని గౌరవం చూపించాడు. వారానికి రెండు సార్లు రాజుతో ఏకాంతంగా సంభాషించే వీలుతో పాటు, చక్కటి వసతి, ఉదారమైన భత్యమూ కల్పించాడు. షా రుఖ్ గురించి ఎన్నో వివరాలు అడిగి మరీ తెలుసుకున్న రాయలు, సమర్‌ఖండికి ఎంతో మర్యాదపూర్వకంగా అనిపించాడు. అన్నిటికంటే ముఖ్యంగా, విజయనగరపు రాజు నగ్నంగా హిందువులా కాకుండా, మేలిమీ జేతూనీ పట్టుతో నేసిన అంగీ ధరించి శరీరాన్ని పద్ధతిగా కప్పుకుని వున్నాడని సమర్‌ఖండి రాసుకున్నాడు. ఇలా సాంప్రదాయ బద్ధంగా దుస్తులు ధరించిన రాజు షా రుఖ్ తో పోలికకు తగినవాడు. ఆ రకంగా తిమురిద్ రాయబారి చేరవలసిన చోటికే చేరి, ‘హిందూ రాజులలో సుల్తాను’ను కనుక్కోగలిగాడు.

ఇస్లామీయ సాంప్రదాయాలను గౌరవించడం వల్ల విజయనగర రాజాస్థానంలోకి కబాయి వచ్చినా, దాని వాడుక మరింతగా వేళ్ళూనడానికి ఇంకో కారణం ఇస్లామీయ సంప్రదాయమైన ఖిల్’ఆత్ – రాజులు రాయబారుల ద్వారా ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం. ఈ సంప్రదాయం, రెండు రాజ్యాల మధ్య దౌత్య సంబంధాలని నిర్ధారిస్తుంది. ఖిల్’ఆత్ లో సామాన్యంగా దుస్తులు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ దుస్తులు ఆ రాజాస్థానపు దుస్తులను పోలి అత్యంత ఖరీదైనవి, మేలిమి నాణ్యత గలవీ అయివుంటాయి. ఈ రకమైన ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయం ఎప్పటినుంచో హిందూ సాంప్రదాయంలో వుంది. అయితే, విజయనగర రాజుల కాలపు వాడుకలో ఇది ఇస్లామీయ సాంప్రదాయానికి చేరువయింది. పట్టుపంచలు, సుగంధ ద్రవ్యాలు, రత్న హారాలు, తాంబూలం ముఖ్యంగా ఉండే హైందవ సాంప్రదాయం కొంచెం మరుగై, పట్టుపంచల స్థానే మేలిమి పట్టుతో నేసిన కబాయి, తలపాగాల స్థానే కుళ్ళాయి వచ్చి చేరాయి. విజయనగర సైన్యంలో టర్కీ యోధుల దళాలు, వాణిజ్యంలో అరేబియా, పర్షియా మారకులు, ఇరుగు పొరుగు ముస్లిం రాజ్యాల దౌత్యవేత్తలు, విజయనగర ప్రజానీకంలో ప్రధానభాగమైన ఈ కాలంలో ఈ మార్పు మరింత ప్రస్ఫుటంగా రాజాస్థాన సాంప్రదాయంగా మారడంలో అనౌచిత్యమేమీ లేదు.

ఇక్కడ క్లుప్తంగా కబాయి, కుళ్ళాయిల ప్రాధాన్యాన్ని తెలిపే రెండు పుస్తకాలని పరామర్శిస్తాను. ఒకటి, కృష్ణదేవరాయల పాలనను (1509-29) వివరించే 16వ శతాబ్దపు రాయవాచకము. ఈ పుస్తకంలో కబాయి, కుళ్ళాయిలు బహుమతులుగా ఇవ్వబడినట్లు ఎన్నో సన్నివేశాలున్నాయి. మొదటిది, రాయలు తన మహామంత్రి సాలువ తిమ్మరుసుకు ఏడు బహుమతులు (ఉచిత సప్తాంగము – కబాయి కుళ్ళాయి తాళి చౌకట్లు పీతాంబరం గంధ కస్తూరి తాంబూలాదిగా) ఇచ్చి సన్మానించాడు. అలానే, తన ఆస్థాన కవులైన, ముక్కు తిమ్మన, అల్లసాని పెద్దనలకు కూడా ‘కుళ్ళాయి కబాయి తాలి చౌకట్లు పేరులు కోకటాకులు’ ఇచ్చి సత్కరించాడని రాయవాచకం చెప్తుంది. ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం, సాంప్రదాయకంగా నిర్వచింపబడిన ఉచిత సప్తాంగంలో తలపాగా (శిరోవేష్ఠి), పైపంచ (అంబరం) స్థానే కబాయి, కుళ్ళాయి రావడం. రెండవ పుస్తకం, పోర్చుగీసు రాయబారి డొమింగో పేస్ రాసిన చరిత్ర. ఈ పుస్తకంలో లో పేస్ కనీవినీ ఎరుగని రాజ ఔదార్యంతో పాటుగా తన దేశ దౌత్యవేత్త క్రిస్తొబావ్ దె ఫిగైరేదోకి జరిగిన రాచమర్యాదలను విపులంగా వర్ణించాడు. దౌత్యవేత్తకు రాజు, నాణ్యతలో తన దుస్తులనే పోలివున్న కబాయి, కుళ్ళాయిలని, ఇతర ఉద్యోగులకు పట్టుతో నేసిన శాలువాలు బహుకరించాడని పేర్కొన్నాడు. పోర్చుగీసు దౌత్యవేత్తకు ఒక హిందూ రాజు, ఇస్లామీయ సాంప్రదాయపు దుస్తులు బహుకరించడం, విజయనగర రాజాస్థానంలో కబాయి, కుళ్ళాయి స్థానాన్ని తెలుపుతోంది. ఈ విధంగా, ఇస్లామీయ సాంప్రాదాయాన్ని హైందవ సాంప్రాదాయంతో అనుసంధించడం ద్వారా విజయనగర సామ్రాజ్యం విస్తారమైన ఇస్లామీయ ప్రపంచంలో వారితో సమానమైన దౌత్య సంబంధాలని నెలకొల్పుకొని, తనను పటిష్ఠం చేసుకోగలిగింది.

రాజాస్థాన వస్త్రధారణ: నియమాలలో వ్యత్యాసం
విజయనగర రాజాస్థానంలోకి కబాయి, కుళ్ళాయి ఏ రకంగా చొచ్చుకొని పోయాయో ఇప్పటి దాకా నేను వివరించాను. అయితే, నా ఉద్దేశం ఇవి హైందవ సాంప్రదాయ వస్త్రాలను పూర్తిగా తొలగించాయని ఎంతమాత్రమూ కాదు. నిజానికి, విజయనగర రాజాస్థానీకులు, కులీనులు చాలా సందర్భాల్లో హిందూ సంప్రదాయాన్నే తమ వస్త్రధారణలో పాటించేవారని ఎన్నో సాంస్కృతిక చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు ప్రశ్నలు తలెత్తుతాయి: 1. ఈ రెండు సాంప్రదాయాలలో రాజాస్థానీకులు ఎప్పుడు ఏ సాంప్రదాయాన్ని పాటించేవారో తెలుసుకోగలమా? అంటే, వేసుకున్న దుస్తులను బట్టి ఆ సామాజిక సందర్భాన్ని నిర్వచించగలమా? 2. స్థానిక చరిత్రలోనే కనిపించే ఈ ఆధారాలకీ, కబాయీ కుళ్ళాయీ వాడుక అన్ని సందర్భాలలోనూ ఏకరీతిగా ఉండేదన్న అభిప్రాయాన్ని సూచిస్తున్న విదేశీ చరిత్రకారుల సాహిత్యాధారాలకీ సమన్వయం ఎలా సాధించడం?

ఈ సందిగ్ధం తొలగించుకోడం కోసం, ఒక ముఖ్యమైన దృశ్య ఆధారాన్ని పరిశీలిస్తాను. ఈ చిత్రపఠం 17వ శతాబ్దం ద్వితీయార్థానికి చెందిన మదురై రాజాస్థానాపు చిత్రపఠం గా భావిస్తారు. గుడ్డపై రంగుల అద్దకంతో వేసిన ఈ చిత్రం పారిస్‌లో అసోసియేషన్ ఫర్ ది స్టడీ అండ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ఏషియన్ టెక్స్‌టైల్స్(AEDTA – Association pour l’etude et la documentation des textiles) వారి సేకరణల్లో ఉంది. పదిహేను, పదహారవ శతాబ్దాల నుంచి ఏ ఆధారమూ లేకపోయినా, మదురై రాజాస్థానం విజయనగరం తర్వాత అధికారంలోకి వచ్చిన వాటిలో ముఖ్యమైనది, కాల రీత్యా చాలా దగ్గరైనదీ కావడంతో, ఈ చిత్రపఠం మనకు ప్రత్యేకాసక్తిని కలిగిస్తుంది. ఈ చిత్రం ద్వారా, విజయనగర రాజాస్థాన వస్త్రధారణా నియమాలలో వ్యత్యాసాలున్నాయనే కాక, వాటి వెనక వున్న సామాజిక సందర్భాన్ని కూడా ఈ చిత్రం సూచనప్రాయంగా తెలియజేస్తుంది.


మదురై రాజ్య కాలపు చిత్రం, 17శతాబ్ది
ఈ చిత్రం రెండు భాగాలుగా ఉంది. రాజప్రాసాదంలో ఒక కులీనుని విలాస కార్యకలాపాలను ఒక కథగా వర్ణిస్తున్నదిగా ఉంది. చిత్రం పైభాగం మొదటి ఘట్టంలో అతను మంగళవాద్యాలు వాయిస్తున్న స్త్రీలు వెంట రాగా అంతఃపురం లోకి ప్రవేశిస్తున్నాడు. రెండవ ఘట్టంలో ఇంకొక గదిలో ఒక శృంగార సమావేశంలో ఉన్నాడు. చివరగా మూడవ ఘట్టంలో రాజప్రాసాదంలో తన సహచరితో ఆసీనుడై, బైట జరుగుతున్న ఒక ఊరేగింపును చూస్తున్నాడు. ఈ ఊరేగింపు మొదట్లో ఛత్రితో అశ్వారోహకుడు, బహుశా యుద్ధం నుంచి తిరిగివస్తున్న రాజకుమారుడో, సైన్యాధ్యక్షుడో ఉన్నాడు. ఇక్కడ ముఖ్యంగా మనకు కనిపించేది, ఈ ఇద్దరు రాచరీకుల దుస్తులలో ఉన్న వ్యత్యాసం. అశ్వారూహుడైన వ్యక్తి కబాయి ధరించివున్నట్లు స్పష్టంగా తెలుస్తుండగా, రాజప్రాసాదంలోని వ్యక్తి అనాచ్ఛాదితమైన చాతీతో, ధోవతీ, కండువా ధరించి ఉన్నాడు. ఈ వ్యత్యాసాల ద్వారా ఈ చిత్రపఠం వస్త్రధారణలో ఏ నియమాన్ని సూచిస్తున్నది?

ఈ ఇద్దరు కులీనులూ ఒకే భవన ప్రాంగణంలో ఉన్నా, వీరిరువురి కలాపాలలో బేధం ఉంది. ఒకరు ఆంతరంగిక, విశ్రాంత కలాపాలలో ఉండగా, ఇంకొకరు, సైనిక కవాతులో ఉన్నాడు. జాన్ ఫ్రిట్జ్ (John Fritz, 1984) పదకోశాన్ననుసరించి ఈ విభిన్న కలాపాలను నేను నైవాసిక, ఔద్యోగిక సందర్భాలుగా గుర్తిస్తాను. ఈ చిత్రపఠం ఆధారంగా విజయనగరంలో హైందవ సాంప్రదాకమైన దుస్తులు నైవాసిక కార్యకలాపాలకు, ఇస్లామీయ సాంప్రదాయపు దుస్తులు ఔద్యోగిక బాధ్యతలకి సబబైనవిగా భావించినట్టు తెలుస్తున్నది.

ఈ నైవాసిక, ఔద్యోగిక విభజన వెనుక అంతర్లీనంగా చిరపరిచితమైన, మౌలికమైన ద్వంద్వత కనిపిస్తుంది. అది దేశీయంగా కనీసం ఐదు, ఆరు శతాబ్దాల కాలం నుండి బహిరంగ, అంతరంగ సామాజిక సందర్భాల మధ్య గీయబడిన విభజన రేఖ. ఈ ద్వైదీభావం తెలుగుతో సహా అన్ని ద్రావిడ భాషల్లో నైఘంటికమైంది. తమిళ భాష జంట పదాలైన అకం (అంతరంగిక, గార్హస్తిక) పురం (బహిరంగ, జన సాధారణ) ఇందుకు చక్కని ఉదాహరణ. ఈ ద్వైదీభావం ప్రాచీన తమిళ కావ్య సాహిత్యాన్ని వర్గీకరించడానికి, అర్థం చేసుకొనేందుకు కూడా ఎంతగానో తోడ్పడింది.

{ఏ. కే. రామానుజన్ (A. K. Ramanaujan; 1985, 86) తమిళ సాహిత్యంలో ఈ ద్వంద్వతని వికరణాత్మకంగా ప్రేమ (అకం) – యుద్ధము (పురం) అన్న భావాలలో ఎంతో విపులంగా వివరించాడు. అంతే కాకుండా అకం-పురం వర్గీకరణ ఆధారంగా కన్నడ జానపద సాహిత్యాన్ని ఆకళింపు ఎలా చేసుకోగలమో స్పష్టంగా తెలియ పరిచాడు. ఈ సందర్భాన్ని అతను, “ఈ ద్వైదీభావం ఒక వ్యక్తికీ సమాజానికి మధ్యనున్న విభజన కాదు. ఇది ఒక మనిషి ఆంతరంగిక జీవనానికి, పురజీవనానికీ మధ్య గీసుకున్న గీత. తన కుటుంబంతో నాలుగు గోడల మధ్య ఏకాంత జీవనావరణానికి, అంతకంటే విస్త్రుతమైన ఉమ్మడి కుటుంబము, కులము, వర్గము, సమాజము వంటి ఆవరణాలకు మధ్య చేసుకున్న విభజన”గా గుర్తిస్తాడు.}

ఈ నిర్వచనం ద్వారా, మదురై చిత్రపఠంలోని నైవాసిక, ఔద్యోగిక సందర్భాలని అకం – పురం సామాజికాలుగా చప్పున గుర్తించగలం. అందువల్ల, రాజప్రసాదంలో, ఏకాంతంగా స్త్రీ సాహచర్యంలో ఉన్న వ్యక్తి హైందవ సంప్రదాయపు దుస్తులలో ఉండగా, భవనం వెలుపల అశ్వారూఢుడై, సైనికుల మార్బలంతో చుట్టడి వున్న యోధుడు ‘పురం’ కార్యకలాపాలకు అనుగుణంగా కబాయీ ధరించి వున్నాడు. ఈ చిత్రం ద్వారా మనకు విజయనగర సామ్రాజ్యంలో కూడా హైందవ, ఇస్లామీయ సాంప్రదాల దుస్తులు కలివిడిగా వాడబడేవని తెలుస్తున్నది. అంతే కాక విదేశీ దౌత్యవేత్తలు, చరిత్రకారులు తమ రచనల్లో ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడానికి కారణం కూడా సులువుగానే బోధపడుతుంది – రాజాస్థానంలో పుర సందర్భాలలోనే వారి సమావేశాలు కొనసాగేవి కాబట్టీ, రాజాస్థానీకులు తమ నివాసాలలో ఏ దుస్తులు ధరించారో వారికి తెలిసే అవకాశం లేదు కదా!
ఇస్లామీయకరణ – సంస్కృతీకరణ

చివరిగా, ఇస్లామీయకరణ మరింత నిడివైన సిద్ధాంతంగా వేరే చారిత్రక సందర్భాలను కూడా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే పనిముట్టుగా మార్చే ప్రయత్నం చేస్తాను. ఇస్లామీయకరణని నిర్మాణాత్మకంగా సంస్కృతీకరణ అనే చిరపరిచితమైన ఇంకొక సామాజిక మార్పుతో పోల్చి వాటి మధ్య గల స్వరూప సాన్నిహిత్యాన్ని బేరీజు వేయడం ద్వారా ఈ ప్రయత్నాన్ని మొదలు పెడతాను.

1952లో మొదటిసారి ఎం. ఎన్. శ్రీనివాస్ (M. N. Srinivas; 1916-99), సంస్కృతీకరణ (Sanskritization) అన్న పదాన్ని ప్రవేశపెట్టాడు. అప్పటినుంచీ ఈ పదం సముచితమా కాదా అన్న వివాదం కొనసాగుతూనే ఉంది. అందుకు తోడుగా ఈ పదం భిన్న రూపాంతరాలలో, ఒకదానికొకటి సంబంధం లేనివిగా కనిపించే అనేక ప్రక్రియలలో వాడబడింది. కానీ, కుల్కే (1976) చెప్పినట్టు గానే, ఈ పదానికి ఆధారమైన మౌలిక సిద్ధాంతాన్ని ఎవరూ ప్రశ్నించినట్టు కనపడదు. శ్రీనివాస్ తన మౌలిక సిద్ధాంతంలో, తదుపరి చర్చల్లో ప్రధాన పాత్ర కల్గిన రెండు పార్శ్వాలను ఎత్తిచూపాడు. ఈ రెండు పార్శ్వాలు, ఇస్లామీయకరణతో పోలికకు ఉపయోగపడేవిగా కనిపిస్తాయి. ఒకటి, సంస్కృతీకరణని నిమ్న వర్గాల ప్రజలు సమాజంలో పై స్థాయికి ఎదగడం కోసం, అనుభవసిద్ధంగా తెచ్చుకున్న మార్పుగా శ్రీనివాస్ నిర్ధారించాడు; రెండు, ఈ స్థానికమైన కట్టుబాట్లు, ఆచారాలను తృణీకరించి వాటి స్థానే ఉత్కృష్టమైన ధర్మంగా భావించబడే సంస్కృత సంస్కృతిలో ఆచార వ్యవహారాలను అనుకరించటం ద్వారా ఈ మార్పు జరిగిందని చూపించాడు. ఈ మార్పులో మొదట ముఖ్యమైనవిగా కనిపించినవి బ్రాహ్మణ కులస్తుల ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలుగా శ్రీనివాస్ (1952లో) ప్రకటించాడు. అయితే, తర్వాత వ్రాసిన పరిశోధనా వ్యాసాలలో సంస్కృతీకరణ, బ్రాహ్మణులను అనుకరించడం మాత్రమే కాదని, ఈ మార్పు బ్రాహ్మణత్వపు పరిథికి వెలుపల కూడా విస్తారంగా జరిగిందనీ ప్రకటించాడు.

శ్రీనివాస్ వాదనలో మరొక ముఖ్యమైన సవరింపు మేరియాట్ (McKim Mariott) 1955లో చేశాడు. ఈ సవరింపు ద్వారా సంస్కృతీకరణ, శ్రీనివాస్ అభిప్రాయపడినట్టు స్థానిక సాంప్రదాయాలను సమూలంగా తుడిచిపెట్టి ఆ స్థానే వచ్చింది మాత్రమే కాదనీ, సంస్కృత సంస్కృతి నుంచి వచ్చిన సాంప్రదాయాలతో పాటుగా స్థానిక సంప్రదాయం కూడా కొనసాగిందనీ మేరియాట్ నొక్కి వక్కాణించాడు. (ఉదా: పల్లెల్లో గ్రామదేవతల మండపాలలో సంస్కృత దైవాలను కూడా ప్రతిష్ఠించటం. కాని పక్షంలో సంస్కృత సాంప్రదాయంలో స్థానిక దేవతలను దర్శించటం, అంటే, గ్రామ దేవతను సంస్కృత దైవానికి ఒక అవతారంగా, ఒక అంశగా పునర్వచించుకోవడం).

విస్తరణలో, నుడికారంలో తేడాలు ఎన్ని వున్నా, మౌలికంగా ఒక రాజ్యాధికారి ప్రపంచ పటం మీద తన అధికారం గుర్తింపబడటం కోసం చేసుకున్న ఇస్లామీయకరణకూ, ఒక చిన్న సామాజిక వర్గం తమ వర్గ స్థాయిని ఉమ్మడిగా సమాజంలో పైమెట్టుకు చేర్చడం కోసం తమ ఆచార వ్యవహారాలు, దైవ మందిరాలలో చేసుకున్న సంస్కృతీకరణకూ, పెద్దగా వ్యత్యాసముందని నేను భావించను. ఈ రెండు చర్యల్లోనూ, ఒక స్థానిక సంప్రదాయం వాడుకలో విస్తారమైన పరాయి సంప్రదాయపు శాదృశ రూపంతో వినిమయింప బడుతున్నది. అంతే కాక ఈ రెండు పద్ధతులలో కూడా ఈ మార్పు ఆ వర్గ (రాజ్య) పురోగమనానికి, అభివృద్ధికీ తోడ్పడేదిగానే ఉంది. ఆసక్తి కలిగించే ఇంకొక విషయం, ఈ మార్పుల వలన స్థానిక సమాజం మరింత విస్తారమైన, విశ్వవ్యాప్తమయిన సాంస్కృతిక సమాజంతో సంభాషించే ఆస్కారం ఏర్పడింది. ఆఖరుగా, విశ్వవ్యాప్త సంస్కృతి, సంప్రదాయాల ప్రభావంతో వచ్చిన మార్పుల వల్ల స్థానిక సంస్కృతి మరింత విశ్వజనీనమయే అవకాశం లభించింది.

ఇంత స్వరూప సాన్నిహిత్యం వున్న ఈ రెండు సంస్కరణల మధ్య చెప్పుకోదగ్గ బేధం ఒక విషయంలో ఉంది. అది, సంస్కృతీకరణ ప్రధానంగా మతధార్మిక సంబంధమైన సందర్భాలలో – సంస్కృత పూజా విధానాలు, కర్మకాండలు, తదితర ఆచారాలు అనుసరించడం ద్వారా జరిగినది. ఇస్లామీయకరణ ఇందుకు భిన్నంగా, లౌకిక రాజకీయ సందర్భాలలో – రాజాస్థానీకుల వేష భాషలు, బిరుదులు తద్వారా, తన ప్రభావాన్ని చూపింది. ఇస్లామీయకరణ యొక్క ఈ లౌకిక స్వభావాన్ని, ప్రత్యేకించి దక్షిణ ఆసియా చరిత్ర పరిశోధకులు గుర్తించడం, గుర్తుంచుకోవడం ఎంతో అవసరం. ఇస్లాం మత ప్రచారానికీ, ఇస్లామీయ సంప్రదాయాల ప్రభావానికి ఉన్న ఈ వ్యత్యాసాన్ని గుర్తించలేక పోవడంతో ఏర్పడిన అపోహ విజయనగర చరిత్రను విశ్లేషించటంలో జరుగుతున్న తప్పిదాలకు కారణ భూతమవుతూనే వున్నది. ఈ అపార్థానికి ఒక విపులమైన ఉదాహరణను ప్రస్తావించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను:

ఇంతకు ముందే చెప్పినట్లుగా హిందూరాయసురత్రాణ అన్న పదానికి కుల్కే “ముస్లిం రాజులలో సుల్తాను వంటి హోదా కలిగిన హిందూ రాజు” గా భాష్యం చెప్పాడు. ఈ భాష్యాన్ని కుల్కే హరిహర బుక్క రాయలిద్దరూ ఒకప్పుడు ఇస్లాం మతాన్ని స్వీకరించారనే ఒక చారిత్రక వాస్తవాన్ని వమ్ము చేయటానికి అనుకూలమైన ఆధారంగా వాడుకున్నాడు. కుల్కే చెప్పిన కథానుక్రమంలో, హరిహర బుక్క రాయలు మొదట వోరుగల్లు రాజైన కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థాన ఉద్యోగులు. ఢిల్లీ సుల్తాను వరంగల్లును ఆక్రమించుకున్న తరువాత, భావి విజయనగర సామ్రాజ్యానికి చేరువలో ఉన్న కంపిలికి పారిపోయారు. కంపిలి కూడా ఢిల్లీ సుల్తాను వశమయినప్పుడు, వీరిద్దరూ సుల్తానుకు బందీలుగా ఢిల్లీలో ఉన్నప్పుడు ఇస్లాం మతానికి మార్పిడి చేయబడ్డారు. అందుకు ఈనాముగా వారిని దక్కను భూమిలో తలెత్తుతున్న తిరుగుబాటును అణచడానికి సుల్తాను పంపించాడు. అయితే, దక్కను చేరగానే, రాయలిద్దరూ, ఇస్లాం మతాన్ని విసర్జించి, తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొని, హిందూ రాజ్యంగా విజయనగరాన్ని స్థాపించారు.

ఈ విధంగా చెప్పి, “హరిహర బుక్క రాయలిద్దరూ, ఇస్లాం తీసుకున్న పక్షంలో అప్పటి రాజకీయ పరిస్థితుల ప్రకారం సుల్తాను అన్న పదాన్ని హిందూ సందర్భంలో వాడగలిగే ప్రసక్తి ఎంతమాత్రమూ లేదు. ఇస్లాం నిజంగానే స్వీకరించినట్లైతే, ఈ అవమానాన్ని వారిద్దరూ ఒక రహస్యంగానే ఉంచి కాలగర్భంలో మరుగున పడేట్టుగా చూసుకునేవారు. అలా జరగకపోవడం, హరిహర బుక్క రాయలిద్దరూ ఇస్లాం స్వీకరించారన్నది ఒక కట్టుకథగా, ఒక వదంతిగా నిరూపిస్తున్నది” అని కుల్కే తన వాదనను సమర్ధించుకున్నాడు.

కుల్కే వాదనలో గమనించదగ్గ లోపాలు రెండు. ఈ లోపాలు రెండూ కూడా ఇస్లాం మతధర్మ ప్రచారానికీ, ఇస్లామీయకరణకూ గల తేడాను గుర్తించడంలో కుల్కే వైఫల్యాలని చెప్పక తప్పదు. అవి:

1. సుల్తాను అన్న పదం రాచరికార్థంలో కాక మతపరమైన సహజార్ధంగా కుల్కే భావించాడు. ఈ భావనకు ఊనికనిచ్చే ఆధారాలు ఏమీ లేకపోగా సుల్తానుకి ఏ రకమైన మత పరమైన సంబంధం లేదని గమనించగలం. మధ్యకాలిక ఇస్లాం రాజ్యాంగపు ఒక విశిష్టత ఏమిటంటే రాజకీయ, సైనిక అధికారాలను సుల్తానుకు కట్టబెట్టి, మతపరమైన, ప్రార్ధన, బోధలు, మత గ్రంథ విశ్లేషణ తదితరమైన బాధ్యతలపై కలిఫాకు సంపూర్ణాధికారాన్ని ఇవ్వడం (లూయీస్, 1988).

{ఇక్కడ తప్పక ప్రస్తావించవలసిన అంశ ఒకటున్నది: కుల్కే సమీక్ష 20వ శతాబ్దపు చారిత్రకులైన, సూవల్, నీలకంఠ శాస్త్రి, వేంకటరమణయ్య తదితరుల వ్యాఖ్యానాల కలగూరగంప. ఈ వ్యాఖ్యానాలు పరస్పర సంబంధం లేని 14న శతాబ్దపు ఇబ్న్ బట్టూతా, బార్నీ వ్రాసిన పర్షియన్ చరిత్రలు, రాజకాలనిర్ణయము, విద్యారణ్యశకము వంటి సంస్కృత చారిత్రక గ్రంధాలు మాత్రమే కాక కన్నడ జనపద గాధలైన కుమారరామనచరితె, బళ్ళారాయనయుద్ధ తదితర మూలాలనుంచి సంగ్రహించబడి, ప్రస్తుత సామాజిక మతమౌఢ్య మనోభావాలకు వత్తాసు పలికేవిధంగా కలుపు చేయబడినవి. సంస్కృత గ్రంధాలన్నిటిలోనూ హరిహర బుక్క రాయలను పేరుపెట్టి ప్రస్తావించి, ప్రతాపరుద్రుని ఆస్థానానికి, ఆపై కంపిలరాయని ఆస్థానానికీ జోడిస్తాయి. కానీ, ఇవే కాక పర్షియా చరిత్ర పుస్తకాలలో కూడా, కంపిలరాయని ఢిల్లీ సుల్తాను జయించిన సందర్భపు వర్ణనలో ఎక్కడా ఈ రాయల సోదరుల ప్రస్తావన కనపడదు.}

2. ఈ రెండవ లోపం మరింత సమస్యాత్మకమైనది. ఇది కుల్కే ఈ కథను ఒక మతమార్పిడికి సంబంధించిన కథగా చూడడం. ఖచ్చితంగా ఈ కథ మతాంతరపు సంఘటన కాదు. ఈ కథకు మూలాధారాలైన సంస్కృత మాతృకలు – రాజకాల నిర్ణయము, విద్యారణ్య కాలజ్ఞానము – రెంటిలోనూ మతాంతర ప్రస్తావన లేదు. ఈ మాతృకల ప్రకారం, హరిహర బుక్క రాయ సోదరుల విశ్వాసానికి (సత్యసంధతకు) సంతుష్టుడై సుల్తాను కర్నాటక్లో కొంత భాగాన్ని రాయలకు బహుమతిగా ఇచ్చాడు. సుల్తానుచే ఆ విధంగా ఆదేశించబడిన (ఆజ్ఞాప్త) ఆ సోదరులు, తమకివ్వబడిన భూభాగాన్ని సంతోషింగా పాలించుకున్నారు. ఈ గ్రంధాలలో ఈ సన్నివేశాన్ని వర్ణించిన తీరు, వాడిన భాష, ఈ సంఘటనను మతధర్మ పరిథిలో కాకుండా, రాజకీయ పరిథిలో స్పష్టంగా నిలుపుతుంది. అందువల్ల, ఈ ఘట్టాన్ని ఒక బలవంతపు మతమార్పిడిలా (మతధర్మ పరిథికి లోబడినట్టిది) కాక, సంగమ వంశ రాజుల విజయనగర స్థాపన, సుల్తానుకు వారి సేవల ప్రతిఫలంగా భావించవలసి వుంటుంది. ఈ నిష్కర్ష విజయనగర సామ్రాజ్యాన్ని “ముస్లిముల దండయాత్రలకు ఎదురొడ్డి హిందూ ధర్మ పరిరక్షణకు పెట్టని కోటగోడై నిలిచినది”గా మతతత్వ విశ్వాసాల ఆధారంగా వచ్చే భావనలకి కంటగింపుగా ఉండచ్చునేమో కానీ, ఇస్లామీయకరణ ద్వారా పరివర్తనం చెందుతూ పురోగమించిన విజయనగర సామ్రాజ్యానికి చక్కగా ఇముడుతుంది. కుల్కే వాదనలు చెప్పబూనినట్లు ఈ కథ సంగమ వంశ రాజుల ‘హిందూరాయసురత్రాణ’ అన్న ప్రయోగాన్ని వివాదగ్రస్తం చేయదు సరికదా, హిందూ రాజులలో సుల్తాను అన్న ఆ విశేషణపు పూర్తి అర్థాన్ని మనకు తేటతెల్లం చేస్తుంది.

{నాకు తెలిసినంత వరకూ, 14వ శతాబ్దపు బార్నీ, ఇబ్న్ బట్టూతాల వైనంలో మాత్రమే మతమార్పిడి ప్రస్తావన కనిపిస్తుంది. ఇబ్న్ బట్టూతా, కంపిలరాయ నగరంలోకి జొరబడి సుల్తాను సైన్యం రాయ కంపిలుని పదకొండు కుమారులతో సహా పుర ప్రజానీకాన్ని బందీలుగా తీసుకుందని, వారిని ఇస్లాం మతానికి మార్చి, సుల్తాను వారికి ఆమిర్ హోదా నిచ్చాడని స్పష్టంగా పేర్కొన్నాడు. బార్నీ, ఇంత వివరంగా కాకపోయినా, మతమార్పిడి జరిగిందని చెప్తూ మతభ్రష్టత్వ ప్రస్తావన చేస్తాడు. కన్యా నాయక్ బంధువులలో ఒకరిని సుల్తాను కంపిలకు పంపినపుడు అతను ఇస్లాం నుంచి మతంతరం చెంది తిరుగుబాటు చేసినట్టు, తత్ఫలితంగా కంపిల హిందువుల చేజిక్కినట్టూ బార్నీ తన వృత్తాంతంలో రాసుకున్నాడు.}

చివరిగా, పూర్వాధునిక భారత చరిత్రను కేవలం హిందూ-ముస్లిం మతాల సంఘర్షణగా మాత్రమే కాక అంతకంటే విస్తారమైన సాంస్కృతిక మిథశ్చేష్టగా భావించినప్పుడే ఆ కాలపు చరిత్ర లోతునూ, గొప్పదనాన్నీ పూర్తిగా అర్థం చేసుకోగలం. మతధార్మిక ప్రభావం తప్పకుండా ఈ సహచర్యలో ఒక పాత్ర వహించింది. కానీ అది ఏకపాత్ర కాదు; ప్రధానమైన పాత్ర అంతకన్నా కాదు. ఈ పరిశీలనకు అనేక పరిశోధనల ఫలితాలు ఊనికనిస్తున్నాయి. కానీ, తీవ్రవాద మత శక్తుల పడికట్టు ప్రచారాల ప్రభావం వల్ల ఈ విషయం మరుగున పడుతున్నది. ఈ ప్రచారాన్ని, పూర్వాధునిక భారత చరిత్రను, ఆ కాలంనాటి జనజీవనంలోని సంక్లిష్టతలని పరిపుర్ణంగా అర్థం చేసుకోగలగడం ద్వారానే అడ్డుకోగలం. ఈ దిశగా, వాస్తవిక, సాంస్కృతిక, కళారూపాల ఆధారంగా పరిశోధనలు కొనసాగించాలి. విజయనగర రాజాస్థాన వస్త్రధారణ గురించిన ఈ నా ప్రయత్నం ఆ దిశలో ఒక మార్గదర్శకమైన ముందడుగు అవుతుందని ఆశిస్తున్నాను. ఈ పరిశోధన ద్వారా విజయనగర రాజాస్థానపు దుస్తులలో ఇస్లామీయకరణ ప్రభావం ఒక విశ్వవ్యాప్తమైన ప్రక్రమంలో భాగం అని మనం గ్రహించవచ్చును. ముఖ్యంగా, ఈ ఇస్లామీయ ప్రభావం, ముస్లిం దండయాత్రల బలవంతపు ఫలితం కాదనీ, కొందరు క్రియాశీల వ్యక్తులు ఒక నూతన ప్రపంచ పరిణామక్రమంలో తమ ఉనికిని నిలుపుకొని వృద్ధి చేసుకోడానికై, ఉద్దేశపూర్వకంగా తెచ్చుకున్న వ్యూహాత్మక మార్పు అని విశదమవుతున్నది.
------------------------------------------------------
రచన: మాధవ్ మాౘవరం,
మూలం: ఫిలిప్ బి వాగనర్,
ఈమాట సౌజన్యంతో

No comments: