Wednesday, February 20, 2019

సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు


సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు





సాహితీమిత్రులారా!


అ త్యలఘుక్రియానిపుణుఁడై, ధరణీతలమేలు విక్రమా
దిత్యు సభాస్థలంబునఁ బ్రతిష్ఠితుఁడై, ఘన ధీ సమగ్రతన్
సత్యవతీతనూభవుని జాడఁ బ్రసిద్ధికి నెక్కి నవ్య సా
హిత్యమునన్ సుబంధు సుకవీంద్రుఁడు బ్రస్తుతి గన్నవాఁ డిలన్.

ఘనతరమనీష న మ్మహాకవివరుండు
ప్రతిపదశ్లేష గద్యప్రబంధ మ త్యు
దారగతిఁ జెప్పె ‘వాసవదత్త’ యనఁగ;
నార్యు లా కథఁ గడు చోద్య మనిరి సభల.

అని వక్కలంక వీరభద్రకవి తన వాసవదత్తా పరిణయంలో (1-28,29) నోరారా కొనియాడిన అపురూపమైన గద్యప్రబంధం సుబంధుని వాసవదత్తా కథ. సంస్కృతసాహిత్యంలో సాటిలేని మేటి రచన. తెలుగువారికి ఎంతో ప్రీతిపాత్రమైన అద్భుతావహ మహాకృతి. ఈ పద్యాలలో సుబంధుని వ్యక్తిత్వమహత్త్వాన్ని, ఆయన మహనీయకవితాగుణాలను ఆవిష్కరిస్తున్న మాటలలో (i) అ త్యలఘుక్రియానిపుణుఁడై – అన్న ప్రకర్షోక్తి మూలాన వీరభద్రకవికి లక్షణగ్రంథాలలో ప్రసక్తింపబడిన సుబంధుని సాహసకథలతో పరిచయం ఉన్నదని, (ii) ధరణీతలమేలు విక్రమాదిత్యు సభాస్థలంబునఁ బ్రతిష్ఠితుఁడై – అన్న ఉగ్గడింపు వల్ల కొంత చరిత్రపరిశీలన చేసినవాడని, (iii) సత్యవతీతనూభవుని జాడఁ బ్రసిద్ధికి నెక్కి – అనటం వల్ల వేదవ్యాసమహర్షి వలె (వ్యాసోచ్చిష్టం జగత్సర్వమ్) కవి-పండిత-విద్యార్థి-విద్యాధికలోకంలో సుబంధుని ప్రభావ పరిధి సువ్యాప్తమని, (iv) ఇలన్ ప్రస్తుతి గన్నవాఁడు – అనటం మూలాన సుబంధుని ప్రస్తుతించిన సంస్కృతాంధ్రకవుల రచనలను ఆయన చూసి ఉంటాడని, (v) నవ్యసాహిత్యమునన్ – అన్న నిర్దేశిక వల్ల సుబంధుని వాసవదత్తా కథకు అనువాదంగా తెనాలి రామకృష్ణకవి రచించిన కందర్పకేతు విలాసం సంగతి ఆయనకు తెలిసి ఉండవచ్చునని – వ్యక్తవిశేషపరంపరను మనము దర్శింపవచ్చును. ఆ విధంగా ఆదికాలం నుంచి సంస్కృతాంధ్రకవులందరికీ గురుస్థానీయుడై, కావ్యకథాకథనంలో అమోఘమైన శిల్పకల్పనకు ఆదర్శప్రాయుడైన ఆ మహాత్ముడు సుబంధుని ప్రశస్తిని గురించి, ఆయన కృతిరత్నాన్ని గురించి, తెలుగు కవులపై ఆయన ప్రభావాన్ని గురించి సాహిత్యవిమర్శకుల దృష్టికి రాని కొన్ని కొత్త వెలుగులను పరిచయం చేయాలని ఈ వ్యాసోద్దేశం.

నైపథ్యావతరణిక
సంస్కృతంలో గద్యప్రబంధనిర్మాణానికి ప్రాతిపదికమైన కృషిచేసిన మహాత్ములలో సుబంధుడొక స్వప్రకాశచైతన్యోపలక్షణుడు. కాళిదాసానంతరయుగీనులలో ఆయన వాక్పరిస్పందనైపుణ్యానికి వశంవదులు కాని మహాకవులు లేరంటే అతిశయోక్తి కాదు. క్రీస్తుశకం 150 నాటి రుద్రదాముడు గుజరాతు రాష్ట్రంలోని జునాఘడ్ పర్వతశ్రేణిలోని తనగిర్నార్ (పురాణాలలో పేర్కొనబడిన రైవతక పర్వతం) శాసనంలో ఉదాత్తమైన కవిత్వరచనకు లక్షణాదర్శప్రాయంగా నిర్వర్ణించిన …స్ఫుట లఘు మధుర చిత్ర కాన్త శబ్దసమ యోదా రాలఙ్కృత గద్య శైలికి సాహిత్యశాస్త్రంలో మనఃస్ఫూర్తిగా పేర్కొనదగినవాడు ఆయనే. స్ఫుట = సువ్యక్తమైన, లఘు = బిందువులో సింధువు వలె అల్పాక్షరాలలో అనల్పమైన అర్థాన్ని ఇమిడ్చికొన్న, మధుర = నిసర్గ రమణీయమైన, చిత్ర = అద్భుతావహమైన, కాన్త = సౌందర్యగుణయుక్తమైన, శబ్దసమయ = సందర్భోచిత శబ్దసంపదను కలిగిన, ఉదార = గంభీరమైన, అలఙ్కృత = కావ్యాలంకరణశీలితమైన, గద్య = పాదరహిత కవితాబంధమైన గద్యము అను పేరిటి రచనకు ఉదాహరణీయమైన కూర్పు – అని ఆ వాక్యార్థం.

దీనికి సమస్కంధంగా క్రీస్తుశకం 1150 నాటి పృథ్వీధరాచార్యుడు తన వస్తువిజ్ఞానరత్నకోశం 73వ సూత్రంలో నిర్వచించిన ‘పరిభావితం సత్యం మధురం సార్థకం పరిస్ఫుటం పరిమితం సుమనోహరం విచిత్రం ప్రసన్నం భావానుగతమ్’ అన్న వాక్యలక్షణానికీ మేలైన నిదర్శనం ఆయన రచనమే. పరిభావితమ్ = బహుముఖీన భంగీభణితి కలిగిన, సత్యమ్ = యథార్థజ్ఞానవిషయకమైన, మధురమ్ = రసానుభవికులకు చర్వితచర్వణ మూలాన ఉదయించే ఒకానొక తీయదనంతో కూడిన, సార్థకమ్ = అర్థవంతమైన, పరిస్ఫుటమ్ = విశదమైన శబ్దవృత్తిని కలిగిన, పరిమితమ్ = వర్ణ్యాంశమునకు తగినంత వర్ణనను కలిగిన, సుమనోహరమ్ = హృద్యమైన, విచిత్రమ్ = నిర్మాణరీతుల యొక్క వైవిధ్యము వల్ల మెచ్చుగొలిపేది అయిన, ప్రసన్నమ్ = విస్పష్టమైన అర్థవత్తచే ప్రసాదగుణము కలిగినదైన, భావానుగతమ్ = అవ్యాప్తి, అతివ్యాప్తి మొదలైన దోషములు లేక కవి మనోగతాన్ని, పాత్ర మనోధర్మాన్ని అనుసరించే శబ్దరచన కలది – అని భావం.

రుద్రదాముడు, పృథ్వీధరాచార్యుడు కలలు గన్నట్లు శైలీగతమైన ఆరభటీవృత్తికి యోగరూఢిపరంపరాగర్భంగా ఒక కొత్తదనాన్ని సంతరించి, ఓజోగుణప్రధానమైన గౌడీరీతిలో శ్లేషయమకానుప్రాసలను నల్లేరు మీది బండినడక లాగా నిరాఘాటంగా నడుపుకొనిపోగల సుబంధుని వంటి కవులు సంస్కృతంలోనే కాదు, ఏ భాషలోనైనా నూటికీ కోటికీ ఒక్కరయినా ఉండరు. సూదిమొనకంటె కొంచెం విపులమైన ఇతివృత్తాన్ని స్వీకరించి, కేవలం కథాకథనంలోని సత్త్వసంపద మూలాన రసభావనైరంతర్యాన్ని సాధించి, కావ్యమంతటినీ సర్వాకర్షణీయంగా తీర్చిదిద్దటం సాహిత్యంలో నిజంగా ఆయనకే చెల్లింది. దానికితోడు లోతైన బహుశాస్త్రవిషయపరిజ్ఞానం, నాలుగంచుల లోకజ్ఞత – ఆ మహాత్ముని అంతఃప్రజ్ఞకు మెరుగులుదిద్దాయి. వీనుమిగిలిన ఆత్మవిశ్వాసంతో –

సరస్వతీదత్తవరప్రసాద శ్చక్రే సుబన్ధు స్సుజనైకబన్ధుః
ప్రత్యక్షరశ్లేషమయప్రబన్ధం విన్యాసవైదగ్ధ్యనిధి ర్నిబన్ధమ్.

(సహృదయులందరికీ ఏకాశ్రయుడు, చదువులతల్లిచే ప్రసాదింపబడిన అభీష్టసిద్ధి కలవాడు, శబ్దార్థముల కూర్పునేర్పుచే మహాపాండిత్యనిధిగా పేరెన్నిక గన్నవాడు అయిన సుబంధుడు ప్రత్యక్షరశ్లేషమయమైన వాసవదత్త అను పేరిటి ఈ ప్రబంధాన్ని నిబంధించాడు.)

అని తన కథాముఖంలో (శ్లో.13) ప్రకటించుకొన్నాడు. ఆ అపూర్వ భణితివిశేషానికి ముగ్ధులైన కవులు ఆ రోజుల్లో –

జీయా ద్గద్యసుధాధున్యాః సుబన్ధుః ప్రభవాచలః
య ద్భఙ్గాశ్లేష మాసాద్య భఙ్గః కవిభి రాశ్రితః.

(భంగాశ్లేషమనే వైశిష్ట్యవశాన గొప్ప గొప్ప కవులకు కూడా భంగపాటు నొదవించే గద్యము అనే అమృతప్రవాహానికి ఉదయపర్వతమైన సుబంధు మహాకవి కలకాలం జీవించాలి గాక!)

అంటూ నిండుమనస్సుతో మెచ్చుకొన్నారు[1]. క్రీస్తుశకం 12వ శతాబ్ది నాటి ఉదీచ్య హంస లక్ష్మణుని సూక్తిసంగ్రహం లోని 35వ శ్లోకం ఇది. అట్లాగే,

కవీనా మగలద్దర్పో నూనం వాసవదత్తయా
శక్త్యేవ పాణ్డుపుత్త్రాణాం గతయా కర్ణగోచరమ్.

(కర్ణునికి వాసవదత్తమైన (ఇంద్రుడిచ్చిన) శక్తి అనే అస్త్రవిశేషం లభించిన వార్త చెవిసోకినంతనే కౌరవుల ముందు తమ శక్తి ఇకపై పనికిరాదని పాండుకుమారులకు దర్పభంగమైనట్లుగా – సుబంధుని ‘వాసవదత్త’లోని శబ్దార్థశక్తివిషయం శ్రవణగోచరమైనంతనే మహాకవులమనుకొనేవారి ప్రావీణ్యదర్పమంతా వదలిపోయింది.)

అని ఉన్న మహాకవి భట్టబాణుని హర్షచరిత (1-11) లోని ప్రసిద్ధమైన ప్రశంసావాక్యాన్ని క్రీస్తుశకం 1258 నాటి జల్హణుడు తన సూక్తిముక్తావళిలో (54-వ శ్లోకం) ఉదాహరించాడు. జల్హణునికి నాలుగైదు పుష్కరాల మునుపే, కవిరాజసూరి బిరుదాంకితుడైన మాధవ భట్టు తన రాఘవపాండవీయ ద్వ్యర్థికావ్యం అవతారికలో (1-4):

సుబన్ధు ర్భట్టబాణశ్చ కవిరాజ ఇతి త్రయః
వక్రోక్తిమార్గనిపుణా శ్చతుర్థో విద్యతే న వా.

(వక్రోక్తిమార్గంలో నేర్పరులం సుబంధుడు, బాణభట్టు, నేనున్నూ; మా ముగ్గురి తర్వాత మరొకడంటూ ఉంటాడో! ఉండడో!)

అని – వక్రోక్తిమార్గనిపుణులలో సుబంధుణ్ణి ముమ్మొదటిగా పేర్కొని చెప్పిన ప్రాతిభోక్తి నలుగురికీ తెలిసినదే. దీనినే మరికాస్త పొడిగించి చాళుక్య సోమదేవుని ఆస్థానకవి విద్యామాధవుడు తన పార్వతీరుక్మిణీయ ద్వ్యర్థిలో (చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలోని 11606 సంఖ్య గల వ్రాతప్రతి) పైముగ్గురితోపాటు తన పేరును కూడా కలుపుకొని,

బాణః సుబన్ధుః కవిరాజసంజ్ఞః విద్యామహామాధవపణ్డితశ్చ
వక్రోక్తిదక్షా కవయః పృథివ్యాం చత్వార ఏతే న హి పఞ్చమోఽస్తి.

(ఈ భూమండలంలో వక్రోక్తిమార్గంలో సర్వసమర్థులైనవారు బాణభట్టు, సుబంధుడు, కవిరాజు అన్న పేరుగలిగిన మాధవభట్టు, ఆ తర్వాత విద్యామహామాధవుడున్నూ. వీళ్ళు నలుగురే తప్ప అయిదోవాడు మరొకడు లేడు.)

అని ప్రగల్భించాడంటే, సుబంధుని కీర్తి ఆ రోజులలో ఎటువంటి విద్వత్కవులను, మహాపండితులను సైతం ఆకర్షించిందో అర్థమవుతుంది.

వాసవదత్తా కథాసంక్షేపం
సుబంధుని వాసవదత్తా కథా కథిత కథంత ఇది: చింతామణి మహారాజు కొడుకు కందర్పకేతుడు. ఒకనాటి తెల్లవారుజామున కలలో ఒక లోకోత్తరసౌందర్యరాశి సాక్షాత్కరించి అతని మనసు దోచుకొంటుంది. తెల్లవారగానే అతను మకరందుడనే తన ప్రియసఖుణ్ణి వెంటబెట్టుకొని ఊరుపేరులు తెలియని ఆమె కోసం గాలిస్తూ, రోజంతా ప్రయాణించి వింధ్యాద్రిని చేరి అక్కడొక చెట్టు క్రింద నడుము వాల్చేసరికి – కొమ్మల మీద వాలిన శుకశారికలు మాట్లాడుకోవటం వినిపిస్తుంది.

కుసుమపురాధిపతి శృంగారశేఖరుని కుమార్తె వాసవదత్త వంటి అందగత్తె మూడు లోకాలలోనూ లేదట. యుక్తవయసు వచ్చిన తర్వాత తండ్రి ఆమెకు వివాహం చేయదలిచి, స్వయంవరణాన్ని ప్రకటించాడట. దేశదేశాల నుంచి వచ్చిన రాకుమారులలో ఏ ఒక్కరూ ఆమెకు నచ్చలేదట. ఆ మునుపటి రోజే ఆమెకు రాత్రి కలలో కందర్పకేతుడనే అందగాడు కనిపించాడట. ఆమె అతనికి తన ప్రేమను వెల్లడిస్తూ ఉత్తరం వ్రాసి, తమాలిక అనే ప్రియశారిక ద్వారా అతనికి పంపించిందట.

అదృష్టవశాన అదే చెట్టుమీద వాలిన తమాలిక – ఆ మాటలను శ్రద్ధగా వింటున్న నవయౌవనుడే కందర్పకేతుడని గుర్తించి, అతనికి లేఖను అందించి, కుసుమపురానికి తీసుకొనివెళ్తుంది. అక్కడొక దివ్యసౌధంలో నాయికా నాయకులు కలుసుకొంటారు. కాని, అదే రోజున శృంగారశేఖరుడు వాసవదత్తను విద్యాధర రాజకుమారుడు పుష్పకేతునికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకొంటాడు. ప్రేమికులిద్దరూ మకరందుని ఎప్పటికప్పుడు వర్తమానాలు కనుక్కొంటుండమని రాజధానిలోనే ఉంచి, మనోజవమనే మాయాశ్వాన్నెక్కి వింధ్యాద్రికి వెళ్తారు. రాత్రంతా వారికి ఏకాంత ప్రణయలీలలతో గడిచిపోతుంది.

తెల్లవారేసరికి వాసవదత్త నిద్రలేచి, ప్రియునికి ఫలాదులను తేవటానికి అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఘోరయుద్ధం చేస్తున్న ఆటవికసైన్యాల మధ్య చిక్కుకొంటుంది. ఆమె అందానికి ముగ్ధులై వారు తమ కలహం మాట మరిచి ఆమె వెంటపడతారు. వాసవదత్త ఒక యోగసిద్ధుని ఆశ్రమంలో తలదాచుకోబోతుంది. ఆటవికులు ఆశ్రమంలోకి జొరబడి కనబడినదల్లా చిందరవందర చేస్తారు. ఆ దురాగతానికి కారణం ఆమేనని మండిపడి ముని ఆమెను శిలామూర్తివి కమ్మని శపిస్తాడు. ఆ తర్వాత ఆమె దీనోక్తులకు మనస్సు కరిగి, ప్రియుని స్పర్శ సోకితే శాపమోక్షం కలుగుతుందని అనుగ్రహిస్తాడు.

కందర్పకేతుడు మేలుకొన్నాక వాసవదత్త కనబడకపోయేసరికి దరిదాపుల వెతికి వెతికి నిరాశచెంది ఆత్మహత్య చేసుకోబోతాడు. ఆకాశవాణి అతనిని వారించి, ప్రేయసీ పునస్సమాగమం సిద్ధిస్తుందని చెబుతుంది. కొంతకాలానికి వింధ్యాటవులలో తిరుగుతూ అతను ప్రియురాలి శిలామూర్తి ఉన్నచోటికి వచ్చి, ఆ మూర్తిని కౌగిలించుకొని, తన స్పర్శతో ప్రాణం వచ్చేట్లు చేస్తాడు. ఇద్దరూ ఒకరికొకరు జరిగిన కథనంతా చెప్పుకొంటారు. అంతలో మకరందుడు కూడా అక్కడికి చేరుకొంటాడు. ముగ్గురూ కుసుమపురానికి తిరిగివస్తారు. కథ సుఖాంతమవుతుంది.

సుబంధుని వాసవదత్త ఆఖ్యాయికా? కథా?
సుబంధుని రచనను వాసవదత్తా కథ అని ఇప్పుడందరూ వ్యవహరిస్తున్నారు కాని, నిజంగా ఆ కావ్యానికి సుబంధుడు పెట్టిన పేరేమిటో మనకు స్పష్టంగా తెలియదు. నాయికా నామధేయాన్ని పురస్కరించికొని వాసవదత్త అని మాత్రమే పెట్టాడేమో! సంస్కృతంలోని ఆలంకారిక గ్రంథాలలో ఆఖ్యాయిక, కథ అన్న ప్రక్రియలకు ఒక సర్వసమ్మతమైన వ్యవస్థ అంటూ ఏర్పడిన కాలాని కంటె ఈ రచన పురాతనమైనది కావటం మూలాన, ఆ ఆఖ్యాయికా–కథారూపాల లక్షణవిషయమై లాక్షణికులలో ఏకాభిప్రాయం లేనందువల్ల – ఒకప్పుడు దేశంలో దానికి వాసవదత్తా ఆఖ్యాయిక, వాసవదత్తా కథ, వాసవదత్తా చంపువు, అని రకరకాల ప్రక్రియల పేరిట వ్యవహారం ఉండినట్లు కనబడుతుంది. లేక మూడూ మూడు వేర్వేరు కాలాల నాటి రచనలో. ఎవరికి నచ్చినట్లు వారు నిర్దేశించటమే గాని, సమగ్రమైన అవగాహన ఇంకా ఏర్పడని రోజులవి. వ్రాతప్రతుల లేఖకులు కూడా ఈ సందిగ్ధావస్థకు లోనుగాక తప్పలేదు. కొందరు దీనిని ఆఖ్యాయిక అనీ, మరికొందరు కథ అనీ పేర్కొన్నారు. పుణేలో ఉన్న భండార్కర్ ప్రాచ్య పరిశోధనాలయంలోని 463/1987-91 సంఖ్య గల ఒకానొక తాళపత్రప్రతి విలేఖకుడు గ్రంథాంతంలో ‘ఇతి మహాకవి సుబన్ధువిరచితా వాసవదత్తాఖ్యాయికా’ అన్నాడు. ఆయన దృష్టిలో వాసవదత్త ఆఖ్యాయిక అన్నమాట. గుజరాతు భావనగర్ ప్రజాగ్రంథాలయం వారి వర్ణనాత్మక సూచికలను బట్టి అక్కడున్న కాగితపు ప్రతులలో, వాసవదత్తాభిధానాఖ్యాయికా, వాసవదత్తాభిధానా ఆఖ్యాయికా అన్న నిర్దేశాలున్నాయి. పాటణ (అహమ్మదాబాదు) జైన గ్రంథభాండాగారంలోని 10698 సంఖ్య గల వ్రాతప్రతి తుదను మహాకవి ‘సుబన్ధుకృతా వాసవదత్తా కథా’ అనీ; 13045 సంఖ్య గల మరొక వ్రాతప్రతి అంతంలో ‘సుబన్ధుకవి విరచితా వాసవదత్తా కథా’ అనీ; 13020 సంఖ్య గల వ్రాతప్రతి లోని నారాయణ దీక్షితుని వాసవదత్తాఖ్యాయికా టీక చివర మహాకవి ‘సుబన్ధురచితా వాసవదత్తాఖ్యాయికా సమాప్తా’ అనీ సమాపక వాక్యాలున్నాయి. తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయంలో ఉన్న 4012 సంఖ్య గల వ్రాతప్రతి చివర సుకవి సుబన్ధువిరచితా వాసవదత్తాఖ్యాయికా హృద్యగద్యమయీ అని ఆఖ్యాయిక పేరున్నది. భువనేశ్వర్‌లో ఉన్న ఒరిస్సా రాష్ట్ర పురావస్తుసంగ్రహాలయంలోని L/94 (b) – 169 సంఖ్య గల ప్రతి అంతంలో ‘ఇతి మహాకవి సుబన్ధుకృతా వాసవదత్తా నామాఖ్యాయికా’ అని ఆఖ్యాయిక పేరున్నది. జైసల్మేరు జినభద్రసూరి జైన జ్ఞానభండార లిఖితగ్రంథ సంచయంలోని 348 సంఖ్య గల ప్రతి చివర ‘ఇతి మహాకవి సుబన్ధువిరచితా వాసవదత్తా నామ కథా సమర్థితా’ అని ముగించారు. దేశంలో ఇప్పటి వరకు లభించిన సుబంధుని వాసవదత్తా కావ్యం వ్రాతప్రతులలో మనకు తెలిసి అన్నిటికంటె ఇదే అత్యంత ప్రాచీనమైన ప్రతి. విక్రమ సంవత్సరం 1207లో (అంటే, క్రీస్తు శకం 1151) వంగరాజు గోవిందచంద్రుని కోసం తత్కోశాధికారి కాయస్థ యశోధరుడు వ్రాయించిన ఆస్థానీ ప్రతి దీనికి ఆధారమని అందులో ఉన్నది. గోవిందచంద్రుడంటే మనదేశంలో నాథ సంప్రదాయానికి మూలపురుషుడైన గోరక్షనాథుని వద్ద మహాజ్ఞానదీక్షను స్వీకరించి ప్రసిద్ధురాలైన రాణీ మయనామతి గారి కొడుకన్నమాట. వంగదేశం లోని సంస్కృత విద్యావ్యాప్తికి, గ్రంథసంపాదనాభిలాషకు నిదర్శనగా ఈ గోవిందచంద్రుని కాలంలో యశోధరుని సేకరణలోని గ్రంథాలకు ప్రత్యంతరాలు మనకు క్రీస్తుశకం 15వ శతాబ్ది దాకా లిఖితమైనవి అక్కడక్కడ ఇప్పటికీ కనబడుతుంటాయి. ప్రకృతానికి మాత్రం, వ్రాతప్రతులలో ప్రచురమైన ఆఖ్యాయిక అన్న పేరుతోపాటు క్రీస్తుశకం 12వ శతాబ్ది నాటికే దేశంలో సుబంధుని వాసవదత్తకు కథ అన్న వ్యవహారం కూడా ఉండేదన్న చారిత్రికసత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి.

వ్యాఖ్యాతృ పరంపర
ఇంతవరకు వ్రాతప్రతులలోని వ్యవహారభేదాన్ని వివరించాను. సుబంధుని వాసవదత్తకు ఏర్పడిన ప్రచారం వల్ల తద్భావోద్దీపకంగా వ్యాఖ్యానాలను వెలయించిన విద్వద్రచయితల మతంలోనూ ఈ కథ–ఆఖ్యాయికా ప్రక్రియల ద్వైధీభావం సందేహాస్పదంగానే కనబడుతున్నది. ఎవరికి తోచినది వారు చెప్పటమే గాని, ఒక నిర్దిష్టలక్షణాన్ని పాటించినట్లు కనబడదు. ఈ వ్యాఖ్యాతలలో కొందరు ప్రముఖుల నిశ్చయాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఈ వ్యాఖ్యలన్నీ అచ్చై వెలుగులోకి వచ్చిన విశేషాలు కావు గనుక – కొంత వివరంగా చెప్పవలసివస్తున్నది:

1. వాసవదత్తా వ్యాఖ్యాయిక: క్రీస్తుశకం 11వ శతాబ్దికి అనంతరీయుడైన త్రివిక్రముని రచన ఇది. ఆయన ‘ఇయం వాసవదత్తాఖ్యాయికా వ్యాక్రియా స్ఫుటమ్, త్రివిక్రమేణ క్రియతే మేధావికులజన్మనా’ (శ్లో.2) అని తన వాసవదత్తాఖ్యాయికలో దీనిని ఆఖ్యాయిక అన్నాడు. అయితే, 1880లో ఎ.సి. బర్నెల్ లండన్‌లో ముద్రించిన తన A Classified Index to the Sanskrit MSS in the Palace at Tanjore లోని 162-a సంఖ్య వద్ద దీనిని విక్రమర్ధి కవి రచించిన వ్యాఖ్య అని పేర్కొన్నాడు. ప్రస్తుతం తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయంలో ఇదే లిఖితప్రతి 4020 అన్న సంఖ్యతో ఉన్నది. అందులో ఇది త్రివిక్రముని రచనమనే ఉన్నది. బర్నెల్ చూచిన ప్రతి ఇప్పుడు తంజావూరులో లేదో, లేక ఆయన పొరపాటున త్రివిక్రమునికి బదులు విక్రమర్ధి అని వ్రాశారో చెప్పలేము. బరోడా ప్రాచ్యవిద్యాసంస్థలోని 700-2/6900-b, 9990-b, 9996-a అన్న సంఖ్యలు గల ప్రతులు మూడింటిలోనూ ఈ వాసవదత్తా వ్యాఖ్యాయిక పేరు త్రివిక్రముడనే ఉన్నది. ఒకవేళ బర్నెల్ పేర్కొన్న విక్రమర్ధి కృతమైన వాసవదత్తా వ్యాఖ్యాయిక బయటపడినా, వ్యాఖ్యాయిక అన్న శీర్షికను బట్టి అందులోనూ ఆఖ్యాయిక అన్న నిర్దేశమే ఉండి ఉంటుంది.

2. వాసవదత్తా సర్వంకష: క్రీస్తుశకం 1250 ప్రాంతాల నారాయణ దీక్షితుడు వ్రాసిన విషమపద టీక ఇది. ఆయన తన వ్యాఖ్య ప్రారంభంలో ‘సుబన్ధురచితస్యాస్య శ్లిష్టార్థస్య విశిష్టతా, శిష్టావృతస్య పుష్టస్య బన్ధువ త్క్రియతే మయా’ అనీ; వ్యాఖ్య చివరను ‘ఇతి శ్రీ నారాయణదీక్షిత విరచితాయాం వాసవదత్తా టీకాయాం చతుర్థః ప్రఘట్టకః సమాప్తః’ అనీ అన్నాడే కాని, తన ఉద్దేశంలో వాసవదత్త ఆఖ్యాయికా ప్రక్రియో, లేక కథా ప్రక్రియో స్పష్టంగా ఏ సంగతీ చెప్పలేదు. అయితే, భండార్కర్ సంస్థలోని 567/1891-96 సంఖ్య గల వ్రాతప్రతి అట్టమీద, ఆ గ్రంథాలయం వారు అచ్చువేసిన వర్ణనాత్మక సూచిలోనూ ఈ వాసవదత్తా సర్వంకష వాసవదత్తా కథకు వ్యాఖ్య అని పేర్కొనబడి ఉన్నది. పీటర్ పీటర్సన్ 1892 నాటి తన Catalogue of the Sanskrit MSS in the Library of his Highness the MaharŒja of Ulwar లో ఉదాహరించిన నారాయణ దీక్షితుని వాసవదత్తా సర్వంకషను వాసవదత్తా ఆఖ్యాయికకు వ్యాఖ్య అని పేర్కొన్నాడు. వ్యాఖ్యాత స్వయంగా చెప్పకపోయినప్పటికీ ఏర్పడిన వైరుద్ధ్యాలివి.

3. వాసవదత్తా విదగ్ధవల్లభ: భండార్కర్ ప్రాచ్య పరిశోధనాలయంలో 464/1887-91 అన్న సంఖ్యతో క్రీస్తుశకం 1350కి మునుపటి ఒకానొక పేరు తెలియని వ్యాఖ్యానకర్త కూర్చిన విదగ్ధవల్లభ అనే వ్యాఖ్య ఉన్నది. దాని ముగింపు వాక్యంలో ఇతి శ్రీ విదగ్ధవల్లభా నామ వాసవదత్తాఖ్యాయికా పఞ్జికా అని ఆఖ్యాయిక పేరున్నది.

4. వాసవదత్తా కథార్థం: ఇది క్రీస్తుశకం 1300 ప్రాంతాల రచింపబడిన మహావిద్వాంసుడైన సర్వరక్షితుని వ్యాఖ్యానం. శీర్షికను బట్టే ఈయన దృష్టిలో వాసవదత్త కథ అని చెప్పవచ్చును. 1894లో ఎం. ఎం. స్టెయిన్ తన Catalogue of the Sanskrit Manuscripts in the Raghunatha Temple Library of His Highness the Maharaja of Jammu and Kashmir గ్రంథం 81వ పుటలో దీనిని ఉదాహరించారు.

5. వాసవదత్తా వ్యాఖ్య: క్రీస్తుశకం 1550 నాటి సర్వచంద్రుని వాసవదత్తా వ్యాఖ్యలో (చూ. లండను ఇండియా ఆఫీసు వారి సంచయంలోని 543.996 సంఖ్య గల సంస్కృత లిఖిత ప్రతి) ప్రత్యేకించి కథాఖ్యాయికల ప్రస్తావన లేకపోయినా, పైని పేర్కొన్న సర్వరక్షితుని వాసవదత్తా కథార్థం ఇందులో ఉదాహరింపబడి ఉన్నందువల్ల ఆయన ఉద్దేశంలోనూ వాసవదత్త కథ అనే అనుకోవాలి.

6. వాసవదత్తా తత్త్వదీపిని: ఇది 14-15 శతాబ్దుల నడిమి కాలం నాటి వ్యాఖ్యాతృశిరోమణి జగద్ధరుడు నిర్మించిన విశిష్టమైన వ్యాఖ్య. పరిమాణంలో చిన్నదైనా ప్రమాణదృష్ట్యా చాలా గొప్ప రచన. ఈ జగద్ధరుని గురించిన వివరాలేవీ ఎక్కువగా అచ్చులో లేనందువల్ల, ఈ వాసవదత్తా తత్త్వదీపిని ఇంకా అచ్చు కానందువల్ల – ఈయనను గురించి కొన్నైనా విశేషాలను చెప్పుకోక తప్పదు. ఈయన మహావ్యాఖ్యాతగా పేరెన్నిక గన్న నరపతి మిశ్రునికి సన్నిహిత బంధువు. నరపతి మిశ్రుడంటే, కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలానికి అభిజ్ఞానశాకుంతల టిప్పణిని రచించిన సుప్రసిద్ధుడు. స్వరోదయము అన్న వేదాంతశాస్త్ర ప్రకరణగ్రంథానికి జగజ్జ్యోతిర్మల్లుడు సమకూర్చిన సుప్రసిద్ధమైన దీపికా వ్యాఖ్యకు మునుపే నరపతి జయచర్య అన్న వ్యాఖ్యను సంతరించిన మహావిద్వాంసుడు. ఇందులోని విషయం, తెలుగులో క్రీస్తుశకం 1340 నాటి గణపనారాధ్యుడు రచించిన స్వరశాస్త్రము లోని విషయం ఒకటే. తెలుగు సాహిత్యచరిత్రకారులు గుర్తింపలేదు. నరహరి మిశ్రుని పెదతండ్రి శ్రీదత్త మిశ్రుడు. గొప్ప ధర్మశాస్త్రవేత్త. ఆయనకు ఆవసథిక మహామహోపాధ్యాయుడని ప్రసిద్ధి. వీరంతా మైథిల బ్రాహ్మణులు. శ్రీదత్త మిశ్రుని రచనలలో ఆచార చంద్రిక (దీనికే ఆచారాదర్శం అని మరొక పేరు) ప్రసిద్ధికి వచ్చింది. క్రీస్తుశకం 1640లో దామోదర గౌరీపతి దీనిపై ఆచారాదర్శబోధినీ వ్యాఖ్యను వ్రాశాడు. శ్రీదత్త మిశ్రుని సమయ ప్రదీపం, ఆవసథ్యాధాన పద్ధతి, వ్రతసారం, శ్రాద్ధకల్పం, సామవేదచ్ఛందోగాహ్నికం, మొదలైనవి నేటికీ నిలిచి ఉన్నాయి. సామవేదచ్ఛందోగాహ్నికాన్ని అధికరించి శ్రీదత్త మిశ్రునికి బంధువో కాదో తెలియదు కాని, సమకాలికుడే అయిన భావనాథ శంకర మిశ్రుడు ఛందోగాహ్నికోద్ధారం అనే వ్యాఖ్యానాత్మకమైన అనుబంధాన్ని కూర్చాడు. శ్రీదత్త మిశ్రుని రచనలలోపితృభక్తి చాలా పేరెన్నిక గన్నది. దీనిని ముందుంచుకొని తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు తెలుగులో పితృయజ్ఞము అనే గంభీరమైన శాంతరసకావ్యాన్ని రచించారు. దశరథుని మరణవార్తను విన్న శ్రీరామచంద్రుడు సరయూ నదీతీరాన పితృతర్పణకృత్యాన్ని నిర్వహించటం ఇందులోని ప్రధానేతివృత్తం. ద్వైతపరిశిష్టంలో కేశవుడు శ్రీదత్త మిశ్రుని ఛందోగాహ్నికం లక్షణసూత్రాలను ప్రమాణీకరించాడు. నరహరి మిశ్రుని మాతామహుడు సిద్ధరసార్ణవమనే రసతత్త్వాన్ని ఆవిష్కరించే ఆయుర్వేదగ్రంథానికి వ్యాఖ్యాత అయిన సురగణ రసధరుడు. రసధరుని అన్నగారు స్మృతిమంజరీ కర్త రత్నధరుడు. ఈ రత్నధరుని కొడుకే ధర్మాధికరణిక మహామహోపాధ్యాయుడని పేరుగన్న వ్యాఖ్యాతృసార్వభౌముడు శ్రీ జగద్ధర మిశ్రుడు. ఈయన రచనలలో దేవీ మాహాత్మ్య టీక, సుప్రసిద్ధమైన భగవద్గీతా ప్రదీపం, ఇంకా మాలతీమాధవ టీక, మేఘసందేశ రసదీపిక, వేణీసంహార టీక, సరస్వతీకంఠాభరణ టీక మొదలైనవి మాత్రమే వెలుగులోకి వచ్చాయి. సంగీత సర్వస్వము కూడా తనదేనని (మదుక్తం సఙ్గీతసర్వస్వమ్) సరస్వతీకంఠాభరణ టీకలో పేర్కొన్నాడు కాని ఆ గ్రంథం లభింపలేదు. సుబంధుని వాసవదత్తకు ఆయన రచించిన తత్త్వదీపినీ వ్యాఖ్య వ్రాతప్రతి బరోడా ప్రాచ్యవిద్యా సంస్థలో 698/10783 అన్న సంఖ్యతో ఉన్నది. ఏకాగ్నిదాన పద్ధతిని నిర్మించిన నాగేశ్వర శ్రీదత్త మిశ్రుడు కూడా మైథిల బ్రాహ్మణుడే, వీరికి సమకాలికుడే కాని, ఆయనకు జగద్ధరుని కుటుంబంతో సంబంధం ఉన్నట్లు లేదు. లోకోత్తరమైన జగద్ధరుని వ్యాఖ్యానకళావైభవం మాలతీమాధవ సరస్వతీకంఠాభరణ టీకాదులలో వలె అతిసంక్షిప్తమైన ఈ వాసవదత్తా తత్త్వదీపినిలో ప్రస్ఫుటింపకపోయినా – ఆయన సహృదయతకు, వైదుష్యానికి నిదర్శకమైన మేలి రచనమిది. బరోడా ప్రతిలో వాసవదత్తాఖ్యాయికా టీకా అని ఉన్నదానిని బట్టి ఈయన దృష్టిలో వాసవదత్త ఆఖ్యాయిక అన్నమాట. సుప్రసిద్ధుడైన శివరామ త్రిపాఠి తన వాసవదత్తా కాంచనదర్పణంలో జగద్ధరుని ఈ తత్త్వదీపినీ వ్యాఖ్యను ఉదాహరించాడు.

7. వాసవదత్తా తత్త్వకౌముది: క్రీస్తుశకం 1470కి పూర్వుడైన పండిత రామదేవ మిశ్రుని వ్యాఖ్య ఇది. ఈయన కథా? ఆఖ్యాయికా? అన్న పరిశీలనను చేయలేదు. ‘కృత్యాదిని సజల జలదశ్యామం పీతవాసస మచ్యుతమ్, నన్దసూనుం నమస్కృత్య తన్యతే తత్త్వకౌముదీ’ అని మాత్రం చెప్పి వదిలివేశాడు. కాని, వ్యాఖ్యలో ఒకచోట ఈ కథలో అని ప్రయోగించిన సందర్భాన్ని బట్టి వాసవదత్త కథ అన్న దృష్టి కలవాడేమో అనిపిస్తుంది. థియొదొర్ ఔఫ్రెట్ 1864లో ప్రకటించిన Catalogus Codicum Sanscriticorum Bibliothecae Boleinaeలో 2434 సంఖ్య గల ఆరోపం వద్ద ఈ వ్యాఖ్య ఉనికిని గురించి పేర్కొన్నాడు. పెక్కు గ్రంథాలయాలలో ఇప్పటికీ దీని ప్రతులు లభిస్తున్నాయి.

8. వాసవదత్తా టీక: క్రీస్తుశకం 15వ శతాబ్ది ఉత్తరార్ధంలో వైద్య నరసింహ సేనుడు (శ్రీ గురుచరణామ్భోజం ప్రణమ్య పిత్రోః పదం వైద్యః, వాసవదత్తా టీకాం కరోతి నరసింహః) వాసవదత్తను ఆఖ్యాయిక అన్నాడు. ఈ టీక అచ్చయినట్లు తెలుస్తున్నది కాని, నాకింతవరకు దొరకలేదు.

9. వాసవదత్తా టిప్పణకం: విఖ్యాత విద్వన్మణి భానుచంద్ర గణి రచించిన ఈ వాసవదత్తా టిప్పణకంలో ‘పూర్వామ్నాయా త్స్వబుద్ధేశ్చ భానుచంద్రేణ ధీమతా, వ్యాఖ్యా వాసవదత్తాయాః కథాయాః క్రియతే స్ఫుటా’ (శ్లో.2) అని కథానిర్దేశం స్ఫుటంగా కనబడుతుంది. భానుచంద్రుడంటే – చరిత్ర విద్యార్థులకు సుపరిచితుడే – మొగలు పాదుషా అక్బరుకు (క్రీ.శ.1542-1605) జైనధర్మరహస్యాలను, కల్పోక్త శ్రీ సూర్య సహస్ర నామావళిని బోధించిన మహోపాధ్యాయుడు. ‘ఇతి పాతసాహ శ్రీ అకబర సూర్యసహస్రనామాధ్యాపక శ్రీ శత్రుఞ్జయ తీర్థకర మోచనాద్యనేక సుకృతవిధాయక మహోపాధ్యాయ శ్రీ భానుచన్ద్రగణి విరచితం వాసవదత్తా టిప్పనకం’ అని గ్రంథాంతగద్యలో సగర్వంగా చెప్పుకొన్నాడు. అబ్-ఉల్ ఫౙల్ తన ఆయినీ అక్బరీలో చక్రవర్తికి రాజధర్మాన్ని నేర్పి శాంతిపథంలో నడిపించిన గురుత్రయంలో ప్రముఖునిగా ఈయనను ప్రశంసించాడు. ఇందులో కథ అన్న నిర్దేశంతోపాటు ఈ కథాప్రక్రియకు లక్షణం కూడా చెప్పబడి ఉండటం విశేషం.

10. వాసవదత్తా వివరణం: అద్భుతావహమైన ఈ వ్యాఖ్యను రచించినది భానుచంద్ర గణి శిష్యుడు సిద్ధిచంద్ర గణి. జహంగీరు పాదుషా (క్రీ.శ. 1569-1627) చేతుల మీదుగా ఖుష్ ఫహమ్ (కుశాగ్రబుద్ధి) అన్న బిరుదాన్ని అందుకొన్న విన్నాణి. ఆచార్యోపజ్ఞకమైన కథానిర్దేశాన్నే ఈయన కూడా చేశాడు. ఈ గురుశిష్యుల వ్యాఖ్యల లిఖితప్రతులు దేశమంతటా దొరుకుతున్నాయి.

11. వాసవదత్తా పంచిక: పాట్నాలో ఉన్న ప్రభుత్వ ప్రాచ్య పరిశోధనా సంస్థ వారు 1993లో ప్రకటించిన Catalogue of Mithila Manuscripts (ద్వితీయ సంపుటం) లోని 141వ పుటలో శృంగార గుప్తుని వాసవదత్తా పంచిక పేర్కొనబడి ఉన్నది. దీని ప్రత్యంతరం భండార్కర్ ప్రాచ్య పరిశోధనాలయంలో ఉన్నది (వ్రాతప్రతి సంఖ్య 186/1875-76). ఇందులో శృంగార గుప్తుడు ‘కథాం వాసవదత్తాఖ్యాం సుబన్ధు ర్యాం మహాకవిః, వ్యధాత్ శృఙ్గారగుప్తోఽస్యాః కరోతి లఘుపఞ్చికామ్’ అని వాసవదత్తను కథగా పేర్కొన్నాడు.

12. వాసవదత్తా చూర్ణిక: జైపూరు లోని మహారాజా సవై (రెండవ) మాన్ సింగ్ పురావస్తుసంగ్రహాలయంలో ఉన్న వాసవదత్తా చూర్ణిక ప్రత్యాదిని ‘నిన్దాస్తుతిపరత్వేన వీరశృఙ్గారయో ర్ద్వయోః, వ్యాఖ్యాసే చూర్ణికా కాశ్చి త్సుబన్ధో ర్ద్యూతవర్ణికా’ అనీ; గ్రంథాంతగద్యలో ‘ఇతి శ్రీ మీమాంసకవర్య భట్ట మాధవసుత ప్రభాకర కృతం వాసవదత్తాయాం దూతీసంవాద ఆఖ్యాయికా వివరణమ్’ అనీ ఉల్లేఖాలున్నాయి. వాసవదత్తా టిప్పణసార కర్త రంగనాథుడు ఉదాహరించినందువల్ల ఈ ప్రభాకరభట్టు క్రీ.శ. 1685 కంటె పూర్వుడని ఊహించటమే తప్ప కాలనిర్ణయానికి పనికివచ్చే వ్యాహృతులేవీ ఆయన వ్యాఖ్యలో లేవు. దీనికొక మంచి ప్రతి 709/12508 సంఖ్యతో బరోడా ప్రాచ్యవిద్యా సంస్థలో ఉన్నది. ఈయనది ఆఖ్యాయికా మతమే అని స్పష్టం.

13. వాసవదత్తా టిప్పణసారం: పూనా లోని భండార్కర్ ప్రాచ్య పరిశోధనాలయంలో దీని వ్రాతప్రతి 566/1891-1895 అన్న వరుస సంఖ్యతో ఉన్నది. వ్యాఖ్యాత పేరు రంగనాథుడు. ఈయన ఆఖ్యాయికా కథాది సంజ్ఞలను పేర్కొనక, ‘య త్సన్దిగ్ధ మతిశ్లిష్టం క్లిష్టం చామూలభాషితం, తద్బోధార్థ మసౌ యత్న స్తేన ప్రీణాతు మే హరిః’ అనీ; ‘ఇతి రఙ్గనాథోద్ధృతో వాసవదత్తా టిప్పణసారః’ అని మాత్రమే వ్రాసి ఊరుకొన్నా, ఈ వ్యాఖ్యలో ఉదాహరింపబడిన ప్రభాకర భట్టు వాసవదత్తా చూర్ణికను బట్టి ఈయన మనోగతమూ ఆఖ్యాయికేనని ఊహింపవచ్చును.

14. భువనార్థచంద్రిక: క్రీస్తుశకం 16-18 శతాబ్దుల మధ్య దేవనాథ వాసుదేవుడు రచించిన ఈ భువనార్థచంద్రికా వ్యాఖ్యలో ‘విఖ్యాతాఖ్యాయికా వ్యాఖ్యా మాఖ్యాతు ర్మమ కో గుణః, నాధికార్థప్రవేశ శ్చే న్నాసదర్థస్య చ క్షయః’ (అవతారిక: శ్లో. 13) అని ఆఖ్యాయికా నామాంకనం కనుపిస్తుంది. ఈ వ్రాతప్రతి బరోడా కేంద్రీయ సంస్థాన ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో కొస ఊపిరితో కొట్టుమిట్టుకలాడుతున్నది.

15. వాసవదత్తా వివరణం: తంజావూరు మహారాజా సర్ఫోజీ సరస్వతీ మహల్ గ్రంథాలయంలో కర్తృనామవిరహితంగా ఉన్న ఒక వాసవదత్తా వివరణం కృత్యాదిని –

శ్రీమత్త్రైపురపాదపఙ్కజరజఃపాణ్డూకృతాఙ్గాకృతి
శ్చక్రే గూఢపదార్థమోహనభృతేః ప్రీత్యై సతా మాదరాత్
కావ్యే వాసవదత్తకే వివరణం సంక్షేపతః శ్రీమతాం
లోకఖ్యాతవినోదనైకరసికః సౌభాగ్యలీలాశ్రయః. (వ్రాతప్రతి సం. 4021; శ్లో. 1)

అనీ, గ్రంథాంతంలో ‘ఇతి మహాకవి సుబన్ధువిరచితా ఆఖ్యాయికా’ అని, ఆఖ్యాయికా సంజ్ఞే కనబడుతుంది.

16. వాసవదత్తా దర్పణం: మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలోని (డి.12419), (డి.12419) సంఖ్యలు గల వ్రాతప్రతులలోనూ, బరోడా ప్రాచ్యవిద్యా సంస్థలోని (699/6909b) సంఖ్య గల వ్రాతప్రతిలోనూ ఉన్న తిమ్మయసూరి వాసవదత్తా దర్పణ వ్యాఖ్యలో సుబంధుని రచన ఆఖ్యాయిక అని ఉన్నది.

ఇవిగాక,

17. రామనాథుని వాసవదత్తా వ్యాఖ్య (చూ. బరోడా ప్రాచ్యవిద్యా సంస్థ వారి గ్రంథాలయం వారి సంస్కృత ప్రతుల వర్ణనాత్మక సూచిక),

18. కాశీరామ వాచస్పతి రచించిన వాసవదత్తా టీక (చూ. 1904 లో అచ్చయిన లండను ఇండియా ఆఫీసు లైబ్రెరీ వారి సంస్కృత లిఖిత గ్రంథ వర్ణనాత్మక సూచిక, సంపుటి VII: పుట 1556),

19. కర్త పేరు తెలియని వాసవదత్తా స్థూలతాత్పర్య వ్యాఖ్య (చూ. లండను ఇండియా ఆఫీసు లైబ్రెరీ వారి సంస్కృత లిఖిత గ్రంథ వర్ణనాత్మక సూచిక, సంపుటి VII: పుట 1558),

20. కర్త పేరు తెలియని వాసవదత్తా సూక్ష్మదర్శన (చూ. 1918లో అచ్చయిన మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారం వారి సంస్కృత వ్రాతప్రతుల వర్ణనాత్మక సూచి – సం. XXI, పుట 8331) మొదలైన వ్యాఖ్యలలో ఈ భేదప్రభేదాలు చర్చకు రాలేదు.

21. తెలుగులో ప్రామాణిక వ్యాకరణచ్ఛందోలాక్షణికగ్రంథమైన అప్పకవీయానికి వ్యాఖ్యగా కూచిమంచి వేంకటరాయకవి రచించిన సుకవిమనోరంజనము అవతారికలో (1-53) ఆయనకు పూర్వుడైన కూచిమంచి (ఐదవ) తిమ్మకవిని గురించి ఒక పద్యం ఉన్నది:

త్రైదశ భాషాకావ్యము
మోద మలర సరసహృత్కుముదచంద్రిక నా
నాదిగ వాసవదత్తా
కాదంబరు లెసఁగఁ దిమ్మకవి రచించెన్.

అని. ఈ పద్యార్థం స్పష్టంగా బోధపడనందువల్ల, ఈ కూచిమంచి (ఐదవ) తిమ్మకవి సరసహృత్కుముదచంద్రిక అన్న పేరుతో సుబంధుని వాసవదత్తకు, భట్టబాణుని కాదంబరికి సంస్కృతంలో వ్యాఖ్యలను నిర్మించాడో; లేక, సరసహృత్కుముదచంద్రికనే వాసవదత్తా కాదంబరీ కావ్యాల శైలిలో చెప్పాడని అంటున్నాడో; కాక, సంస్కృతంలో సరసహృత్కుముదచంద్రిక అన్న పేరుతో ఒక మొదట కావ్యాన్ని, ఆ తర్వాత వాసవదత్తా కాదంబరీ సంక్షేపాలనూ వ్రాశాడో తెలుసుకోవాలని కుతూహలం కలిగి ఆ వివరాలకోసం ప్రయత్నం చేశాను. పైని ఉదాహరించిన మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో కనుపించిన వాసవదత్తా దర్పణము వ్యాఖ్యానకర్త తిమ్మయ సూరి ఈ తిమ్మకవి కావచ్చునేమో చూద్దామని వాసవదత్తా దర్పణము యొక్క వ్రాతప్రతిని (డి.12419) చూడగా వాసవదత్తా దర్పణమే సరసహృత్కుముదచంద్రిక కావచ్చునని నిర్ణయించటానికి ఆధారాలేవీ కనబడలేదు. పైగా తిమ్మయ సూరి కుటుంబం వారు తమిళదేశంలో స్థిరపడిన వైదికులు కావచ్చునని, పిఠాపురంలో నెలకొన్న ఆరువేల నియోగులైన కూచిమంచి వారితో ఆయనకు సంబంధం ఉండివుండదని మాత్రం అనిపించింది. ఒకవేళ ఈ కూచిమంచి (ఐదవ) తిమ్మకవి వాసవదత్తకు వ్యాఖ్యానమో, లేక ఆ పేరుగల ఒక కావ్యమో వ్రాసివుంటే, తిమ్మయ సూరి వలె వాసవదత్తను ఆఖ్యాయిక అన్నాడో, లేదా కథ అని నిర్ణయించాడో గ్రంథం దొరికితే గాని చెప్పలేము.

22. వాసవదత్తాస్థ పదనిర్వచనమ్: మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలోని 18894/డి.14363 సంఖ్య గల తెలుగు లిపిలోని ఈ అసంపూర్ణ లిఖితప్రతిని గురించిన విశేషాలు అనేకం ఉన్నప్పటికీ స్థలాభావం వల్ల ఇక్కడ ఇవ్వలేకపోతున్నాను. మొత్తం మీద ఈ పదసంగ్రహం చేసినవారి దృష్టిలో ఇది కథ అన్నది మాత్రమే ఇక్కడ ప్రకరణప్రాప్తార్థం.

ఇదంతా వాసవదత్త వ్యాఖ్యానాలలో ప్రస్తుతీకరింపబడిన సంజ్ఞానక్రమం. ఇరవైరెండు వ్యాఖ్యలలో పదిమంది వ్యాఖ్యాతలు వాసవదత్తను ఆఖ్యాయిక అని, ఏడుగురు కథ అని పేర్కొన్నారన్నమాట.
ముద్రితప్రతుల సంగతి
ఇక ముద్రితప్రతుల విషయానికి వస్తే – బిబ్లియోథికా ఇండికా ప్రచురణగా ఫిట్జెడ్వర్డ్ హాల్ 1859లో అచ్చువేసిన వాసవదత్తా కాంచనదర్పణంలో ఉపర్యుక్త వ్యాఖ్యాత శివరామ త్రిపాఠి (సుబన్ధువర్గబోధాయ సుబన్ధుకవిసత్కృతేః, రమ్యా వ్యాఖ్యా దర్పణాఖ్యా శివరామేణ తన్యతే) దీనిని ఆఖ్యాయికగానే నిర్వచించి వివరించాడు. 1870లో వావిళ్ల రామస్వామిశాస్త్రులు, సరస్వతీ తిరువేంకటాచార్యులు కలిసి పరిష్కరించిన హాల్ ప్రత్యాధారితమైన ఆంధ్రలిపి ముద్రణలో –

శ్రీమతా సుబన్ధునామ్నా మహాకవినా
విరచితేయం
వాసవదత్తాఖ్యా మహాఖ్యాయికా
అని ముఖపత్రం పైని ప్రకటించారు. వాసవదత్త దాక్షిణాత్యపాఠాన్ని వ్రాతప్రతుల మూలాన పునఃపరిష్కరించి, వ్యాఖ్యానాలను రచించిన టి.వి. శ్రీనివాసాచారియార్ 1906 లోనూ; ఆర్.వి. కృష్ణమాచార్యులు 1906 లోనూ తమ పీఠికలలో దీనిని ఆఖ్యాయిక అనే అన్నారు. 1912లో కొలంబియా విశ్వవిద్యాలయం పక్షాన సుబంధుని వాసవదత్తను కృష్ణమాచార్యుల వారి పాఠంతో సరిపోలుస్తూ ప్రధానంగా మధుర సుబ్బాశాస్త్రి పాఠానుసారం సంస్కృతమూలాన్ని ఆంగ్లానువాదసమేతంగా అచ్చువేసిన లూయీ హెర్బర్ట్ గ్రే తమ పీఠికలో లాక్షణికోదితాలను బట్టి ఈ కథ – ఆఖ్యాయిక అన్న ఉభయపక్షాల సారవిచారం చేసి, చివరికి దీనిని కథగా (చూ. పుట 16) నిర్ధారించారు. అప్పటి నుంచి నాగరి లిపి, రోమక లిపి, వంగ లిపి, కన్నడ లిపి ముద్రణ సంపాదకులందరూ గ్రే ప్రతిని అనుసరించి వాసవదత్తా కథ అనే అచ్చువేస్తున్నారు.

ప్రతివిలేఖకులు, వ్యాఖ్యాతలు, ప్రచురణకర్తల సంగతి ఇలా ఉండగా, 1862లో దీనిని తొలిసారి తెలుగు లిపిలో అచ్చువేసిన మధుర సుబ్బాశాస్త్రి మాత్రం –

శ్రీమన్నిఖిలసురేంద్రాదివందితపాదకమల
శ్రీ వాగ్దేవీదత్తవరప్రసాదేన
సుబంధునామ్నా కవికులసార్వభౌమేన
విరచితః వాసవదత్తాఖ్యః చంపూప్రబంధోయం
ధీమతా మర్థపరిజ్ఞానాయ
మధుర సుబ్బాశాస్త్రిణా సంశోధ్య పరిష్కృతః

అంటూ, వాసవదత్త చంపూ ప్రబంధము అనే విలక్షణమైన ఒక సరికొత్త ప్రతిపాదనను చేశారు. ఇది – వాసవదత్త మొదట కథాముఖంలో పదమూడు శ్లోకాలు, కథామధ్యంలోని తత్తదుచితస్థానాలలో ఆరు – మొత్తం మీద ప్రధానమైన గద్యబంధంతోపాటు పంధొమ్మిది శ్లోకాలు కూడా ఉన్నందువల్ల – గద్యపద్యమయం కావ్యం చమ్పూ రి త్యభిధీయతే (విశ్వనాథుని సాహిత్యదర్పణం: 7-336) వంటి లాక్షణికోక్తులను అనుసరించిన సామాన్యాభిప్రాయమే తప్ప కథా-ఆఖ్యాయికల వాదవివాదాలను సూక్ష్మంగా పరిశీలించి చేసిన నిశ్చాయకసిద్ధాంతం కాదని మనము తోసిపుచ్చటం సులభమే కాని – ప్రతిపాదన చేసినది ఆలంకారికశిరోమణీ, చుళుకితసమస్తశాస్త్రజలధీ అయిన సుబ్బాశాస్త్రిగారు కాబట్టి – ఇందులోని యుక్తాయుక్తాలను గురించి నాలుగు మాటలు:

వాసవదత్తా చంపూ విషయ విమర్శ
నిజానికి శాస్త్రిగారి దృష్టిలో ఉండినదో లేదో తెలియదు కాని, వారికంటె శతాబ్దాలకు పూర్వమే – వాసవదత్త అన్న పేరుతో వెలసిన ఒకానొక కృతి చంపూ కావ్యము అన్న ప్రతిపాదనను తొలిసారి చేసినవాడు భోజరాజు. ఆయన తన శృంగారప్రకాశం లోని రసావియోగప్రకాశనప్రకాశమనే (సంపుటి 2: అధ్యా-11, పుట 429) అధ్యాయంలో –

ఆఖ్యాయికైవ సాఙ్కా సోచ్ఛ్వాసా దివ్యపద్యగద్యమయీ
సా దమయన్తీ, వాసవదత్తాది రి హోచ్యతే చమ్పూః

అని ఈ ప్రక్రియానిర్వర్ణనను చేశాడు. అయితే భోజరాజు ఉద్దేశించిన ఈ వాసవదత్త అన్న కావ్యం సుబంధుడు రచించిన ప్రకృతరచనమో – లేక ఆ రోజులలో వాసవదత్తా చంపువు అనేది వేరొకటుండినదో మనమిప్పుడు చెప్పలేము. ఎందుకంటే – నల చంపువు అనే నామాంతరం కలిగిన త్రివిక్రమభట్టు రచన దమయన్తీ కథ ఒకటున్నది. అది చంపూకావ్యమే. నలదమయంతుల పరిణయకథాకావ్యమే. భోజునికి పూర్వరచితం కాబట్టి, పై శ్లోకంలో సా దమయన్తీ, అని ఉదాహరింపదగినదే. ఆ దమయంతీ కథ చంపువుగా పరిగణింపబడినట్లే, సంయోగపృథక్త్వంగా వాసవదత్తా కథ కూడా భోజుని దృష్టిలో చంపువే అని వాదింపవచ్చును కాని – ఏవంవిధ దమయంతీ కథలు, దమయంతీ కథాకావ్యాలు సంస్కృతంలో ఇంకా అనేకం ఉన్నాయి. వీటిలో భోజుడు ఉద్దేశించిన దమయంతీ చంపువు ఏదై ఉంటుందో ఊహించటం చాలా కష్టం. ఒకవేళ ఊహించినా, భోజుడు స్వయంగా ఇది అని చెప్పలేదు కాబట్టి – మనమేదైనా నిర్ణయిస్తే, అది పొగమబ్బుతో నిచ్చెన కట్టినట్లే అవుతుంది. శృంగారప్రకాశంలోని దూతకర్మాధ్యాయంలో కూడా భోజుడు పూర్వానురాగ విషయాన్ని వివరిస్తూ – నాయికానాయకులు ప్రేమసందేశాలకు దూతలుగా పంపతగినవారి జాతులలో దేవ మనుష్య కిన్నర వానర శుక శారికా పారావతాదులతోపాటు హంసలను కూడా చేర్చి, ఈ దమయంతీ కావ్యాన్ని అక్కడ మరొక్కసారి పేర్కొన్నాడు. హైమంతకము, వసంతకము అనే రెండు హంసలు ఆ కథలో నలదమయంతుల మధ్య రాయబారం నడిపినట్లు చెప్పాడు. శృంగారప్రకాశం ప్రతులలో అసంపూర్ణంగా లభిస్తున్న ఆ లక్షణభాగం ఇది:

హంసః –

హైమన్తక వసన్తక దమయన్త్యాం నలోపగమనే యథా –
ప్రసార్య హస్తం నిపుణేన తేన
ధృత స్త … … ధృతవిక్రమేణ
క్రమేణ హంసో దమయన్తికాయాః
సన్దేశకం దివ్యగిరాచచక్ష. (సంపుటి-4: పుట 480)

ఈ సందర్భంలో భోజుడు ప్రత్యేకించి దీనిని చంపూకావ్యమని పేర్కొనకపోయినా, ఉదాహరణను బట్టి వెనుక శృంగారప్రకాశంలోని రసావియోగప్రకాశనప్రకాశాధ్యాయంలో సా దమయన్తీ అని ఉద్దేశించిన దమయంతీ చంపువు ఇదేనని నిశ్చయించటానికి ఆక్షేపం ఉండకూడదు. ఈ హైమంతక వసంతకాలనే హంసల ప్రస్తావమూ ఈ శ్లోకమూ త్రివిక్రమభట్టు రచించిన నల చంపువు అనే నామాంతరం ఉన్న దమయంతీ కథలో లేవు. హైమంతకం దమయంతి ఇంటినుంచి నలుని ఇంటికి, వసంతకం నలుని వద్ద నుంచి దమయంతి వద్దకు ప్రేమరాయబారాలు నడిపాయో, లేక హంసదంపతులుగా రెండూ కలిసివెళ్ళే కథ నడిపాయో మనకు తెలియదు. అందువల్ల, ఇది త్రివిక్రమభట్టు రచనమైన దమయంతీ కథ కంటె అన్యమై, ఈనాడు మనకు తెలియని వేరొక దమయంతీ చంపువు అయినట్లే, భోజుని శ్లోకంలో పేర్కొనబడిన వాసవదత్తా చంపువు కూడా సుబంధుని వాసవదత్త కంటె అన్యమై, ఈనాడు మనకు తెలియని వేరొక వాసవదత్తా చంపువు కావటానికి అవకాశం ఉంది. సుప్రసిద్ధమైన శ్రీహర్షుని నైషధీయ చరితంలోనూ ఈ హంసద్వయోదంతం లేదు. ఈ తీరు దమయంతీ కథాకావ్యాలు సంస్కృతంలో ఇంకా అనేకానేకం ఉన్నాయి. వీటిలో భోజుడు ఉదాహరించిన దమయంతీ కథ ఏదైనదీ కనుక్కోవటం సులభమేమీ కాదు. సంస్కృతంలో ఔఫ్రెట్ తన Catalogus Codicum Sanscriticorum Bibliothecae Boleinaeలో (సంపుటం. 1, ఆరోప సంఖ్య 6595) పేర్కొన్న ఒక దమయంతీ పరిణయం, ఒక దమయంతీ కథ ప్రాక్తనాలన్న ఊహే తప్ప వాటి కర్తృకాలాదులు మనకిప్పుడు తెలియవు. సంకలన గ్రంథకర్తలు, వాఙ్మయచరిత్రకారులు పేర్కొన్న దమయంతీ కావ్యాలు లిఖితగ్రంథసంచయాలలో సూర్యాలోక (సూర్య+ఆలోక) భాగ్యం లేనివి కొన్నీ, అచ్చైనప్పటికీ సూర్యాలోకానికి (సూరి+ఆలోకానికి) నోచుకోక మరుగునపడినవి కొన్నీ ఉన్నాయి. అవిగాక, సోమప్రభాచార్యుని కుమారపాలప్రతిబోధంలో ఉదాహృతమైన ఒక దమయంతీ చరితం, దేవప్రభసూరి పాండవచరిత అవతారికలో ప్రసక్తమైన దమయంత్యుపాఖ్యానం, వినయచంద్రసూరి రచించిన మల్లినాథ మహాకావ్యంలో ప్రస్తావింపబడిన దవదన్తీ చరితం, ఇంకా సోమతిలకసూరి శీలోపదేశమాలా వృత్తిలో ఉదాహరించిన దమయంతీ కథ, జినసాగరసూరి కర్పూరప్రకర టీకలో పేర్కొన్న వేరొక దమయంతీ కథ, శుభశీలగణి రచించిన భరతేశ్వర బాహుబలి వృత్తిలో ఉదాహృతమైన దమయంతీ కథ మొదలైనవి కాలనిర్ణయజిజ్ఞాసువులు పరిశీలింపదగ్గవి. ఇవిగాక – కవీంద్రాచార్యుని దమయంతీ చంపువు, రంగనాథుని దమయంతీ కల్యాణం, అనూహ్యకర్తృకమైన దమయంతీ పరిణయ కావ్యం, జైనగ్రంథాలయాలలో అవిదితకర్తృకమై లభిస్తున్న దమయంతీ ప్రబంధం; ఇంకా నలకథానకం, ఉదయరుచిసూరి శిష్యుడు హితరుచి రచించిన నలచరిత్ర ప్రబంధం, మాణిక్యదేవకవి రచించిన సుప్రసిద్ధమైన నలాయన మహాకావ్యం, నయసుందరకవి రచించిన దమయంతీ కథ అనే నామాంతరంతోడి నలాయనోద్ధారం మొదలైనవి అనేకం ఉన్నాయి.

వీలైనంతలో భోజునికి మునుపటి కృతులను మాత్రమే పరిశీలించాము. వీటిలో కొన్ని భోజునికి అనంతరకాలంలో వెలసినవి అయితే, వాటికి మూలమైన ఏదైనా ఒకానొక దమయంతీ కథ (లేదా చంపువు) భోజునికి ప్రాక్తనకాలపుది ఉండినదేమో, చెప్పలేము. జైనకవులు రచించిన సంస్కృత ప్రాకృతకావ్యాలలో అనేకం పూర్వుల రచనలపై ఆధారపడినవేనని తత్పరిచయం కలిగినవారందరికీ తెలిసిన విషయమే. పైగా, ఈనాడు దొరకనిదో లేక దొరుకుతున్నదో లేక దొరకనున్నదో తెలియని ఒకానొక దమయంతీ కావ్యప్రస్తావం పృథగ్వివక్షగా సుబంధుని రచనను వాసవదత్తా చంపువుగా నిర్ణయించటానికి తోడ్పడదు. దమయంతీ కథ అనబడే నల చంపువును దమయన్తీ అని సంకేతించినట్లే వాసవదత్తా (ఆఖ్యాయిక లేదా కథ) అనబడే సుబంధుని రచనను భోజుడు చంపూ కావ్యంగా సంకేతించినట్లు భావించటానికి వీలులేదని ఇంతకుముందే అనుకొన్నాము. పైగా ఆ దమయన్తీ అన్నది త్రివిక్రమభట్టు రచనమని గాని, ఈ వాసవదత్తా అన్నది సుబంధుని రచనమని గాని భోజుడు సూచింపలేదు. ఇంతవరకు పేర్కొన్న దమయంతీ కథలే గాక హేమచంద్రసూరి నలచరిత్ర ప్రబంధం, ఋషివర్ధనాచార్యుని నలదమయంతీ చరిత్ర, వినయచంద్రసూరి రచించిన మరొక నలదమయంతీ చరిత్ర, హేమచంద్రసూరి అంతేవాసి రామచంద్రుని నలవిలాస నాటకం వంటివి భోజునికి ఒకపాటి ముందువెనుకలలో వెలసినవే ఇంకా ఉన్నాయి. చిత్రరత్నాకర కర్త చక్రకవి రచించిన దమయంతీ పరిణయం చంపువే కాని – అది భోజునికి తర్వాతి కాలపుది. అంతేకాక, భోజుడు పద్యగద్యమయీ అన్నందువల్ల బహుశః అది గద్యప్రధానమైన చంపువు కాదని, పద్యప్రధానమైన చంపువని అనుకోవాలి.

సుబ్బాశాస్త్రిగారు వాసవదత్తా కథను చంపువుగా నిర్ణయించటానికి భోజుని నిర్వచనం ఉపకరింపదని చెప్పటానికి ఇంతదూరం వచ్చాము. ఇదిగాక వారికి వేరేమి ఆధారం ఉండినదీ వివరాలింకా తెలియవలసి ఉన్నది.

ఆఖ్యాయిక-కథ
నిజానికిదంతా లక్షణావగతికోసం మనము వివేకించటమే కాని, స్థూలదృష్టికి మాత్రం ఈ ఆఖ్యాయిక, కథ అన్నవి రెండూ గద్యకావ్యాలే. అక్కడక్కడ కొన్ని శ్లోకాలున్నంత మాత్రాన వీటిని చంపూ కావ్యాలుగా పరిగణించేందుకు తగిన లక్షణవ్యవస్థ లేదు. భోజుడు పద్యగద్యమయీ అన్నందువల్ల పద్యప్రధానమైన కృతి వేరొకటున్నదేమో అని ఇప్పుడే అనుకొన్నాము. పద్య (శ్లోక) ప్రధాన రచనలో వచనం చోటుచేసుకొంటేనే చంపువు అన్నారు కాని, ఎందుచేతనో లాక్షణికులు గద్యప్రధానరచనలో పద్యం (శ్లోకం) ప్రవేశించినా దానిని గద్యకావ్యమనే నిర్దేశించారు. పద్యకావ్యమే అయినా మధ్యమధ్య గతివైవిధ్యంకోసం గద్యాన్ని (వచనాన్ని) చొప్పించాలనీ, గద్యకావ్యంలోనైనా ఒక్కింత పద్యనివేశం అభిలషణీయమనీ, గద్యపద్యాత్మకమైన కావ్యమే తేనెతో కూడిన ద్రాక్షారసం వలె మాధుర్యమయమనీ విశ్వగుణాదర్శంలో (5వ శ్లోకం) వేంకటాధ్వరి –

పద్యం య ద్యపి విద్యతే బహుసతాం హృద్యం విగద్యం న తత్
గద్యం చ ప్రతిపద్యతే న విజహ త్పద్యం బుధాస్వాద్యతామ్
ఆధత్తే హి తయోః ప్రయోగ ఉభయో రామోదభూమోదయం
సఙ్గః కస్య హి న స్వదేత మనసో మాధ్వీకమృద్వీకయోః.

అన్నాడు. పద్యప్రచురమైన రచనలో గద్యం ఉన్నప్పటికీ అది పద్యకావ్యమేనని, గద్యప్రధానమైన రచనలో పద్యం ప్రవేశించినా అది గద్యకావ్యమేనని ఆయన చేసిన ప్రతిపాదనకు వ్యాఖ్యాతలు – ఆ విధమైన విమర్శదృష్టి లేనందువల్ల – ఎటూ వ్యాఖ్యానింపలేదు. గద్యపద్యాత్మికమైన రచనలో పద్యసంఖ్యాతిశాయిత చంపువు – అని ఏ లాక్షణికుడైనా స్పష్టీకరించి ఉంటే బాగుండేది. లాక్షణికులు పేర్కొనకపోయినా కవులు మాత్రం ఈ మాటను గుర్తించి తమ కావ్యాలలో చెప్పనే చెప్పారు. మహాకవి సోడ్ఢలుడు ఉదయసుందరీ కథలో ‘అన్యదేవ కర్పూరమిలితస్య శైత్యం మలయజద్రవ్యస్యాన్యైవ చ హృద్యతా పద్యానుషఙ్గిణో గద్యస్య,’ అని; ధనపాలుడు తన తిలకమంజరిలో ‘అశ్రాన్తగద్యసన్తానా శ్రోతౄణాం నిర్విదే కథా, జహాతి పద్యప్రచురా చమ్పూ రపి కథారసమ్’ (శ్లో.17) అని; సమరపుంగవ దీక్షితుడు తన తీర్థయాత్రాప్రబంధంలో ‘పద్యేషు బాహుల్య మిహ ప్రబన్ధే, మితాని గద్యాని తు’ (శ్లో.1-11) అనీ చంపూ ప్రబంధరచనలో గద్యాల కంటె పద్యసంఖ్యాధిక్యం ఆవశ్యకమని నిర్దేశించారు. లక్షణకర్తలే గాక లక్షణగ్రంథాలకు వ్యాఖ్యానాలను వ్రాసినవారు కూడా ఈ సంగతిని విస్మరించటం ఆశ్చర్యంగా ఉంటుంది. లక్ష్యాలను బట్టి చూస్తే పద్యసంఖ్యాతిశాయితకు తోడు చంపువులో నానావిధచ్ఛందస్సుల నివేశమూ ఒక లక్షణమని భావించాలి.

ఈ విధంగా మనము సుబ్బాశాస్త్రిగారు ప్రతిపాదించిన చంపూత్వాన్ని తిరస్కరించి ఈ కథాఖ్యాయికలను కేవలం గద్యకావ్యప్రభేదాలుగా మాత్రమే పరిగణించినా – ఈ ప్రభేదాల లక్షణ లక్ష్యాల నిరూపణలో మాత్రం ప్రాచీనులైన భామహ దండి రుద్రటాదులు, వారి అనంతరీయులలో ఎవరికీ ఏకాభిప్రాయం కుదరలేదన్న సత్యాన్ని కూడా గుర్తుంచుకోవాలి. లక్ష్యానుసారం వారి వారి నిర్వచనాలను సమన్వయిస్తూ మనము గ్రహింపదగిన లక్షణాలలో ముఖ్యమైనవి ఇవి:

ఆఖ్యాయిక గద్యకావ్యప్రభేదం. ఇందులోని ఇతివృత్తం వాస్తవంగా జరిగిన ఘటనలపై ఆధారపడి ఉండాలి. ఈ సంగతినే ఆఖ్యాయి కోపలబ్ధార్థా అంటూ అమరకోశం (1-6-5) జ్ఞాతకథాపూర్వకమని పేర్కొన్నది. కావ్యాలంకారంలో (1:25-29) భామహుని మతానుసారం కవి స్వతంత్రించి అక్కడక్కడ కొన్ని ఉదంతాలను వర్ణ్యవిషయోద్దీపనకోసం ప్రకల్పించినా, ప్రధానేతివృత్తం మాత్రం యథార్థఘటనలను పురస్కరించుకొని నిర్మింపబడాలి. అవాంతరకథాసన్నివేశాలను ఉచ్ఛ్వాసాలుగా విభాగించాలి. ఇందులో నాయకుడే ప్రధాన వక్త. ఇతివృత్తంలోని ముఖ్యపరిణామాలన్నీ అతడు చెప్పినవే. శృంగార వీరాలు ప్రధానరసాలు. ఇతివృత్తాదిని నాయికానాయకుల వంశవర్ణనం; ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జరిగిన నాయికానాయకుల పరస్పరపరిచయాల తర్వాత వారిమధ్య రాగోదయం వర్ణింపబడాలి. ఆ తర్వాత ప్రతినాయకుడు అపహరించినందువల్లనో, లేకపోతే ఏదైనా శాపవశాననో నాయికా నాయకులకు వియోగం సంభవిస్తుంది. అప్పుడు నాయికానాయకుల విరహం, ఆ తర్వాత నాయకునికి ప్రతినాయకునితో యుద్ధం, అతనిపై నాయకుని విజయం, ఆ పిమ్మట నాయికానాయకుల పునస్సమావేశం చిత్రింపబడాలి. తన ప్రేయసిని విరహకాతరుడైన నాయకుడు ఏ విధంగా దక్కించుకొన్నాడో – ఆ ప్రయత్నక్లేశమంతటినీ స్వయంగా ఆతడేనో, ఆతని ఆత్మీయులో నాయికకు సాకల్యాన వివరించి చెప్పాలి. అవతారికలోనూ, ఎక్కడైనా సూచ్యార్థసూచన చేయవలసి వచ్చినపుడు ఆఖ్యాయికలో వక్త్ర – అపరవక్త్ర అనే ఛందస్సులను ప్రయోగించాలి. ఈ నియమాలన్నీ సంస్కృతంలో రచింపబడే ఆఖ్యాయికలకు మాత్రమే వర్తిస్తాయట.

కథ కూడా గద్యప్రధానమైన రచనమే. అయితే ఇది పూర్తిగా కల్పితేతివృత్తాత్మకం. కథావక్త నాయకునికంటె ఇతరుడై ఉండాలి. ఇతివృత్తవిషయం ఆఖ్యాయికలో వంటిదే. మొదట నాయికానాయకుల వంశానువర్ణనం, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జరిగిన నాయికానాయకుల పరస్పరపరిచయాలు, తర్వాత వారిమధ్య రాగోదయం. ఆ తర్వాత ప్రతినాయకుడు అపహరించినందువల్లనో, లేకపోతే ఏదైనా శాపవశాననో నాయికా నాయకులకు వియోగం, విరహవర్ణన. ఆ తర్వాత నాయక – ప్రతినాయకుల యుద్ధం, నాయకుని విజయం, నాయికానాయకుల పునస్సమావేశం. తన ప్రేయసిని విరహకాతరుడైన నాయకుడు ఏ విధంగా దక్కించుకొన్నాడో – ఆ ప్రయత్నక్లేశమంతటినీ స్వయంగా ఆతడేనో, ఆతని ఆత్మీయులో నాయికకు సాకల్యాన వివరించి చెప్పాలన్న నియమం కూడా ఆఖ్యాయికలో ఉన్నదే. శృంగార వీరాలు ప్రధానరసాలు. కథా హి ఖలు వాక్యవిన్యాసరూపా రమణీయా రసమన్దాకినీ – అంటూ హితోపదేశం (1-9) కథాప్రక్రియను రసోచితవాక్యనిక్షేపం వల్ల రమణీయమని, ప్రసన్నగమనంతో సాగిపోతుంది కనుక రసమందాకిని అని అందంగా నిర్వచించింది.

కథలో ఆఖ్యాయికలో లాగా ఉచ్ఛ్వాసవిభాగం చేసితీరాలన్న పట్టింపు లేదు. ఖండమనో, భాగమనో, అంశమనో, మరొకటనో పేరుపెట్టి పాఠకులకు కథాక్రమపరిగతిలో ఊపిరి పీల్చుకొనే అవకాశాన్ని కల్పింపవచ్చును. భండార్కర్ ప్రాచ్యవిద్యా పరిశోధన సంస్థలో (567/1891-96) సంఖ్య గల ప్రతిలో ఉన్న వాసవదత్తా సర్వంకషా వ్యాఖ్యలో తద్వ్యాఖ్యాత నారాయణ దీక్షితుడు సుబంధుని రచనను మొత్తం నాలుగు ప్రఘట్టకములుగా విభజించాడు. ఈ విభజనను ఆయన స్వయంగా తానై చేశాడో, ఆ విధంగా తన ముందుండిన ఒకానొక వ్రాతప్రతిని చూసి చేశాడో మనకిప్పుడు తెలియదు. తక్కినవారి వ్యాఖ్యలలో గాని, వ్రాతప్రతులలో గాని ఈ విభాగం కనబడదు.

మహాకవులలో సుబంధుడు, దండి, భట్టబాణుడు మొదలైనవారు స్వతంత్రించి ఈ కథా – ఆఖ్యాయికా రచనలో చేసిన ప్రయోగాలను పరిశీలించి, తమ కాలం నాటికి క్రొత్తగా ఏర్పడుతున్న పరిణామాలను గుర్తించి, రుద్రటుడు మొదలైన లాక్షణికులు ఈ నియమాలలో కొన్ని మార్పులను చేశారు. వీరి అభిప్రాయానుసారం ఆఖ్యాయిక కేవలం నాయకుని ఆత్మకథనం వంటిదే కాని, కథలో మాత్రం నాయకుడు గాని, కొంత వేరొకరు గాని సన్నివేశపరిణామాలను వివరింపవచ్చును. వీరి మతానుసారం ఆఖ్యాయికలో ఉచ్ఛ్వాసవిభాగనియమానికి తోడు గ్రంథారంభంలో వస్తునిర్దేశాత్మకమైన ఒక ఆర్యాశ్లోకం, లేదా మంగళాచరణ వస్తునిర్దేశాత్మకములైన రెండు ఆర్యాశ్లోకాలు తప్పనిసరిగా ఉండాలి. గద్యభాగాన్ని మొదలుపెట్టే ముందు కథాసంగ్రహాన్ని పద్యరూపంలో సంక్షేపించాలి. కథలో ఈ నియమజాతం లేదు.

ఆనందవర్ధనుడు కావ్యప్రబేధాలను ప్రస్తావించే సందర్భం వచ్చినపుడు, ‘విషయాశ్రయ మ ప్యన్య దౌచిత్యం తాం నియచ్ఛతి, కావ్యప్రబేధాశ్రయతః స్థితా భేదవతీ సా’ అని ధ్వన్యాలోకంలో (3-7)పరికథ, సకలకథ, ఖండకథ, ఆఖ్యాయిక, కథ మొదలైనవాటిని సరిక్రొత్తగా నిర్వచించాడు. ధర్మార్థకామమోక్షములనే పురుషార్థాలను ప్రకారవైచిత్రితో వర్ణనాత్మకంగా రచించినప్పటిది పరికథ అని, పూర్వోత్తరసంహితను విడిచి కథైకదేశాన్ని వర్ణిస్తే ఖండకథ అని, ఉచ్ఛ్వాసనియమంతో వక్త్రాదిచ్ఛందోయుక్తంగా కూర్చినది ఆఖ్యాయిక అని, అటువంటి నియమజాతం లేనిది కథ అని తన అభిప్రాయాన్ని వివరించాడు. విషయాశ్రయభేదం వల్ల ఇందులో మళ్ళీ ఉపభేదాలున్నాయి. పురాణాలలో విశ్వామిత్ర-త్రిశంక్వాఖ్యానాల వంటివి జ్యౌతిష విషయాలు. భాగవతంలోని పురంజనోపాఖ్యానం వంటివి ప్రతీకాత్మకాలు. విష్ణుపురాణంలోని ఊర్వశీపురూరవుల వృత్తాంతం వంటివి వైదికాలు. ఇక, హరిశ్చంద్ర శ్రీరామ కృష్ణకథాదికాలు ఐతిహాసికాలు. విష్ణు శివ దేవీ దేవతాత్మకములైనవి ఇష్టదేవతా కథలు. మదాలసా రంతిదేవాదికోదంతాలు ఉపదేశాత్మకాలు. విషయాశ్రయభేదం వల్ల ధర్మ కథ, అర్థ కథ, కామ కథ, మోక్ష కథ అని ఏర్పడుతాయని కొందరంటారు. ధర్మ కథలో ఆక్షేపిణి, విక్షేపిణి, సంవేదిని, నిర్వేదిని అని ప్రబేధాలున్నాయి. పాత్రభేదాన్ని ఉపాశ్రయించి దివ్య కథ, మనుష్య కథ, మిశ్ర కథ అని భేదాలున్నాయి. ఇవన్నీ లాక్షణికులకు క్రీడాక్షేత్రాలు.

ఈ లక్షణాలను బట్టి తేలినదేమంటే మొత్తం మీద కథలో స్వతంత్రమైన వాక్యప్రబంధం ముఖ్యమన్నమాట. దీనినే అమరకోశం ప్రబన్ధకల్పనా కథా అని (1-6-6) నిర్వచించింది. ఈ కథాభేదాలు అనేకం ఉన్నాయని లింగాభట్టీయ టీకాసర్వస్వాదివ్యాఖ్యలను అనుసరించి సరస్వతి తిరువేంగడాచార్యులవారి గురుబాలప్రబోధిక అంటున్నది. అవి ఉపరికథ, ఖండకథ, ఉపకథ మొదలైనవి:

౧) పర్యాయేణ బహూనాం యత్ర ప్రతియోగినాం కథాకుశలైః సంస్క్రియతే శూద్రకవ జ్జిగీషుభి రుపరికథా సా తు – సమర్థులచే అనేకమంది నాయకుల కథ ఎక్కడ చెప్పబడుతుందో, అది శూద్రక కథాదుల వలె ఉపరికథ అన్న ప్రభేదం.

౨) గ్రన్థాన్తరప్రసిద్ధం యస్యా మితివృత్త ముచ్యతే విబుధై ర్మధ్యా దుపాన్తతో వా ఖణ్డకథా భానుమత్యాది – అన్యకావ్యాలలో చిత్రితమైనందువల్ల అప్పటికే ప్రసిద్ధమైన కథలోని ఒకానొక భాగాన్ని మాత్రం స్వీకరించి భానుమతీ పరిణయాదులలో వలె ఏకదేశంగా వర్ణించటం ఖండకథ.

౩) య త్రాశ్రిత్య కథాన్తర మతిప్రసిద్ధం నిబద్ధ్యతే కవిభిః చరితం విచిత్ర మన్య త్సోపకథా చిత్రలేఖాది – సుప్రసిద్ధమైన కథాంతరాన్ని గ్రహించి వైచిత్రీపూర్వకంగా నిబంధించిన చిత్రలేఖాదుల వంటిది ఉపకథ.

౪) అ ఙ్కాఙ్కి తాద్భుతార్థా పిశాచభాషామయీ మహావిషయా నరవాహనదత్తాదే శ్చరితం బృహత్కథా భవతి – అంకములు మొదలైన విభాగాలతో చిహ్నితమై, పైశాచ్యాదిభాషలలో అద్భుతావహంగా రచింపబడిన నరవాహనదత్త కథాదుల వంటిది బృహత్కథ అనబడే ప్రభేదం.

ఈ నాలుగవ నియమాన్ని బట్టి కథను సంస్కృతంలోనే గాక ప్రాకృతాపభ్రంశాదికములైన దేశభాషలలోనూ వ్రాయవచ్చునని గ్రహించాలి. అప్పుడు సూచ్యార్థసూచనకు ఆఖ్యాయికలో వలె వక్త్రాపరవక్త్రచ్ఛందస్సులను మాత్రమే ప్రయోగించాలన్న నియమం ఉండదట.

ఏ భాషలో చెప్పినప్పటికీ కథలో యథేచ్ఛగా ఆర్యాచ్ఛందస్సును, తదితరచ్ఛందస్సులను ప్రయోగించే వెసులుబాటొకటి అదనంగా ఉన్నది. దండి కావ్యాదర్శంలో (1:23-28) కథాప్రక్రియలో ఆఖ్యానోపాఖ్యానాదులు కూడా ఉండవచ్చునని అన్నాడు.

కథాప్రక్రియ కేవలకల్పితమన్న పూర్వుల లక్షణాన్ని అంగీకరిస్తూనే, మహనీయులైన రుద్రటాదులు ఇందులోని ఇతివృత్తం శృంగారరసైకప్రధానమని నిర్వచించారు. అంటే, శృంగారేతరములైన రసాల ప్రాధాన్యాన్ని అంగీకరింపలేదన్నమాట. రచయిత లేదా నాయకేతరుడైన ఒక ముఖ్యపాత్ర కథావక్త కావాలన్నది వీరి కాలానికి వచ్చిన మరొక మార్పు. కథలో ఉచ్ఛ్వాసాదివిభాగవిషయమై వీరేమీ ప్రత్యేకించి చెప్పలేదు.

భోజుడు కథలో దివ్యుల యొక్క, దివ్యేతరుల యొక్క ఇతివృత్తం ఉండవచ్చునన్నాడు. విశ్వనాథుడు సాహిత్యదర్పణంలో (6:311-12) భట్టబాణుని హర్షచరితం కథ అని, కాదంబరి ఆఖ్యాయిక అని మళ్ళీ ప్రాచీనుల మతాన్ని అందుకొన్నాడు.

కథాప్రక్రియను గురించి విమర్శకులెవరూ గుర్తింపని మరొక ముఖ్యమైన విశేషాన్ని మహాకవి వామన భట్టబాణుడు తన శబ్దరత్నాకరకోశంలో పేర్కొన్నాడు. ‘కథా నానావిధై ర్గద్యై ర్వస్తువైచిత్ర్యకల్పనా, ఆఖ్యాయి కోపలబ్ధార్థా సోచ్ఛ్వాసా దృఢబన్ధనా’ అన్న (శబ్దరత్నాకరంలోని 1849-1850 సంఖ్యలు గల పంక్తులలోని) ఆయన నిర్వచనానుసారం కథలో నానావిధాలైన గద్యప్రభేదాల ప్రయోగం తప్పనిసరి అన్నమాట. ఇది మునుపటివారెవరూ చెప్పని సరికొత్త సూత్రం. నానావిధప్రభేదాల గతివైవిధ్యం వల్ల గద్యం హృద్యతరంగా భాసిస్తుందన్న ఈ నిర్ణాయకసూత్రం రచయితలకు మార్గదర్శకం. కల్పితకథ అనటానికి మారుగా వస్తువైచిత్ర్యకల్పన అన్నాడు. ఈ వైచిత్రి కావ్యకళకు ప్రాణశక్తులలో ఒకటి. భోజరాజు శృంగారప్రకాశం 27వ అధ్యాయంలో, ‘యా నియమితగతిభాషా దివ్యాదివ్యోభయోపేతా వృత్తవతీ, కాదమ్బరీ లీలావతీవ సా కథా కథితా’ అని గద్యం కావటం వల్ల కథలో గతివైవిధ్యం అంతగా ఉండదని చెప్పిన లక్షణాన్ని ఇది సవరిస్తున్నది.

హేమచంద్రుడు వీరికంటె భిన్నంగా వేరొక దారి తీసి, తన కావ్యానుశాసనంలో (అధ్యా.8; సూ.8) కథ కేవలం గద్యకావ్యమే కానక్కరలేదని, పద్యరూపమైన కథ (పద్యమయీ కథా) కూడా ఉండవచ్చునని అన్నాడు. అందులోని అంతర్భేదాలను వివరించాడు. కథ, కథానకము, కథానిక, అన్న రూపాలను గురించి చెప్పాడు. అంతటితో ఆగక, ఆ తర్వాతి రోజులలో కూర్చిన తన హైమలింగానుశాసనంలో (పు.144) ‘కథానికా కథానకమ్ – ఆఖ్యానం స్త్రియా రూఢః’ అని మరొక్కసారి వీటిని ఆఖ్యానభేదాలుగా నిరూపించాడు.

లాక్షణికులు కల్పించిన ఈ నియమజాతమంతా వట్టి పేరుకే గాని, కవులు మాత్రం రెండు ప్రక్రియలలోని నియమాలనూ యథేచ్ఛగా మలుచుకొన్నారు. ప్రాచీనుల మాటెలా ఉన్నా – 1) ఆర్యాచ్ఛందఃప్రయోగం, 2) ఉచ్ఛ్వాసవిభాగం లేకపోవటం అన్న ముఖ్యమైన కారణాల వల్ల సుబంధుని కృతికి ఆధునికకాలంలో వాసవదత్తా కథ అన్న పేరు ప్రచారంలోకి వచ్చింది.

సుబంధుని వాసవదత్తా కథ గాక సంస్కృతంలో వాసవదత్తా ప్రబంధం అనే వేరొక రచన ఉన్నదా? అని అడగవచ్చును. పిండిప్రోలు లక్ష్మణకవి తన లంకావిజయములో (పీఠిక-17) ‘సరసమనోహరాంచత్ప్రబంధు సుబంధు’ అన్నాడు కదా? అంటే, ఆ ప్రబంధ శబ్దం గ్రంథసామాన్యవాచకమే గాని, ప్రబంధము అనే ప్రక్రియానిరూపకం కాదు. సరసుల మనస్సులకు హత్తుకొనే ఒప్పిదమైన రచన చేసినవాడు అని మాత్రమే అక్కడి అన్వయం. అట్లాగే, సుబంధుని వాసవదత్తా కథ గాక సంస్కృతంలో వాసవదత్తా రూపకము అనే వేరొక రచన ఉన్నదా? అంటే, తూమాటి దోణప్పగారు తమ ఆంధ్ర సంస్థానములు – సాహిత్యపోషణము గ్రంథంలో (246-వ పుట) వక్కలంక వీరభద్రకవి వాసవదత్తా పరిణయం గురించి వ్రాస్తూ, సుబంధుని వాసవదత్త రూపకమునకిది తెలుఁగుసేఁత అని వ్రాసినది పొరపాటే గాని, సంస్కృతంలో సుబంధుని వాసవదత్త అనే పేరుగల రూపకం లేదు.

వాదవివాదాలు
చరిత్రలో అనేకమంది సుబంధులు, దేశమంతటా అనేక వాసవదత్తా కావ్యాలు కానరావటం పెక్కు వాదవివాదాలకు కారణమైంది. క్రీ.పూ. 150 నాటి భగవత్పతంజలి వ్యాకరణ మహాభాష్యంలో అధికృత్య కృతే గ్రంథే అన్న పాణినీయ మూలానికి (4.3.87) వార్తికను వివరిస్తూ సుమనోత్తరా, భైమరథీ కావ్యాలతోపాటు లక్ష్యంగా పేర్కొన్న వాసవదత్తా కావ్యం సుబంధుని రచనేనని సుప్రతిష్ఠిత విమర్శకులు మానవల్లి రామకృష్ణకవి గారు ఊహించారు. KalŒ అన్న ఆంగ్ల పత్రికలో (సం. 1, పుట 70) అచ్చైన ఈ వ్యాసం తెలుగు విశ్వవిద్యాలయం 1986లో ప్రచురించిన Collected Papers of Manavalli Ramakrishna Kavi గ్రంథంలోని కెక్కనందువల్ల దీనికి తగినంత గుర్తింపు రాలేదు. సుబంధుడు క్రీస్తుకు పూర్వంనాటి వాడన్నది వీరి మతం.

మహాభాష్య వివరణను బట్టి సుమనోత్తరా కావ్యాన్ని చదువుకొన్నవారు సౌమనోత్తరికులు, భైమరథీ కావ్యాన్ని చదువుకొన్నవారు భైమరథికులు, వాసవదత్తా కావ్యాన్ని చదువుకొన్నవారు వాసవదత్తికులు అవుతారన్నమాట. ఒకానొక కావ్యాన్ని చదువుకొన్న పాఠకులకు కూడా ప్రత్యేకమైన ఒక పేరుండటం ఆ రోజులలో ఆ కావ్యాలకేర్పడిన ప్రసిద్ధిని సూచిస్తుంది.

భరతుని నాట్యశాస్త్రానికి రామకృష్ణకవిగారే సంపాదించి, పరిష్కరించిన అభినవభారతీ వ్యాఖ్యలో – చంద్రగుప్తుని కొడుకు బిందుసారుని ఆస్థానంలో ఉన్న సుబంధుని నాట్యపార ప్రస్తావం మొత్తం రెండు చోట్ల (చూ. అధ్యాయం 22: శ్లో.45-47లు; అధ్యాయం 27: శ్లో.21) కనబడుతుంది. ఈ నాట్యపార అన్నది రంగస్థలంపైని ప్రదర్శించే ఒక ప్రయోగవిశేషం. చంద్రగుప్తుని కొడుకు బిందుసారుడంటే అది క్రీస్తుకు పూర్వం 320-273 సంవత్సరాల నాటి వృత్తాంతం అన్నమాట.

మహాభాష్యంలో ప్రస్తావింపబడినది ఈనాడు మనము చదువుకొంటున్న వాసవదత్త అని, అది సుబంధుని రచనే అని రామకృష్ణకవిగారి ఊహ. అంతే గాక, కాత్యాయనుని ఆఖ్యానాఖ్యాయికేతిహాసపురాణేభ్యశ్చ అన్న వార్తికకు సమన్వయంగా వాసవదత్తా మధికృత్య కృ తాఽఖ్యాయికా వాసవదత్తా అని ఉన్న పంక్తిని బట్టి ఆనాటి వాసవదత్తికులు చదువుకొన్న ఆ రచన ఆఖ్యాయిక అని కూడా వీరు నిశ్చయించారు.

అయితే, ఆ విధంగా మహాభాష్య రచనాకాలానికి పూర్వమే అంతటి ప్రజాదరణకు నోచుకొన్న ఆ వాసవదత్తాఖ్యాయిక ఇప్పుడేమైనదీ మనకు తెలియదు. అది సౌబంధవం (సుబంధుని కృతి) అవునో, కాదో నిర్ధారించటానికి ఇప్పుడే ఆధారమూ లేదు. ఇప్పుడు దొరుకుతున్న సుబంధుని వాసవదత్తా కథలో మహాభాష్యంలో ప్రసక్తమైన వాసవదత్తాఖ్యాయిక విషయం ప్రస్తావనకు రాలేదు. రెండూ ఒకటే అయితే, ఆ ప్రస్తావన ఉండవలసిన అవసరమూ లేదు. మహాభాష్యానికి పూర్వం వెలసిన ఆ వాసవదత్తాఖ్యాయిక కొంతకాలానికి మార్పుచెంది, ఈనాటి కథారూపంలో లభిస్తున్నదేమో నిర్ధారించి చెప్పటానికి సైతం సాధనాలు లేవు.

భట్టోజీ దీక్షితుని సిద్ధాంతకౌముదికి జ్ఞానేంద్ర సరస్వతి కూర్చిన తత్త్వబోధినీ వ్యాఖ్యలో ‘ఆఖ్యాయికేతి గద్యపద్యరూపో గ్రన్థవిశేషః’ (సూ.1270) అని ఒకచోట, ‘ఆఖ్యాయికా నామ గద్యరూపో గ్రన్థవిశేషః’ (సూ.1467) అని వేరొక చోట – భిన్నభిన్నంగా వ్యాఖ్యాతమై ఉన్నది. పరిష్కరణలోపం వల్ల జ్ఞానేంద్ర సరస్వతి ఉద్దేశమేమిటో స్పష్టంగా తెలుసుకొనే అవకాశం లేకపోయింది. సుబంధుని ఆఖ్యాయికను గూర్చిన ప్రస్తావన అందులో లేదు.

శౌనకీయ బృహద్దేవత సప్తమాధ్యాయంలో సరణ్యూ కథానంతరం ప్రసక్తమైన సుబంధుని కథ (చూ. బృహద్దేవత, 7.83 నుంచి 100 వరకు ఉన్న శ్లోకాలు; ఋగ్వే. 10.58-59) లోని సుబంధుడు – కాత్యాయనుని సర్వానుక్రమణికలో ప్రసక్తుడైన గోపాయనుని కొడుకు సుబంధుడే అయితే, ఆయన మన సుబంధుని వలె రాజాశ్రితుడే కాని, కవి అనటానికి ఆధారాలు లేవు.

మన సుబంధుని కథలోనూ నాయకునికి వాసవదత్త స్వప్నంలో కానరావటమే ఉపక్రమణిక అయినప్పటికీ – ఈ కథకు మహాకవి భాసుడు రచించిన స్వప్నవాసవదత్తం, ప్రతిజ్ఞాయౌగంధరాయణం అన్న రెండు ప్రసిద్ధరూపకాలలోని వాసవదత్త జీవితకథతో ఎటువంటి పోలికా లేదు. సోమదేవుని కథాసరిత్సాగరం; బుధస్వామి బృహత్కథాశ్లోకసంగ్రహం; శూద్రకునిదని చెప్పబడుతున్న అద్భుతావహమైన వీణా వాసవదత్తం; విశాఖదత్తుని అభిసారికా వంచితకం; మాతృరాజ అనంగ హర్షుని తాపస వత్సరాజం; భీమటుని మనోరమా వంచితకం; క్షేమేంద్రుని కావ్యములైన బృహత్కథామంజరి, లలితరత్నమాల; శ్రీహర్షుని రత్నావళి, ప్రియదర్శిక; బౌద్ధవాఙ్మయంలోని సంయుత్తనికాయం, జైనవాఙ్మయంలో మాలాధారి దేవప్రభాచార్యుని మృగావతీ చరిత్ర; హేమచంద్రాచార్యుని త్రిషష్టి శలాకా పురుషచరిత వంటి రచనలలోని కథాప్రణాళికలతో దీనికి సంబంధం లేదు. వీణా వాసవదత్తంలో ఇంద్రుడిచ్చిన వరం వల్ల మగధదేశపు రాజు ప్రద్యోతునికి ఒక కుమార్తె జన్మించినదని, అందువల్ల ఆమెకు వాసవదత్త అని పేరుపెట్టారని ఉన్నది. భట్టబాణుని హర్షచరిత్రలో నుంచి పైని ఉదాహరించిన ‘కవీనా మగల ద్దర్పో నూనం వాసవదత్తయా’ అన్న శ్లేషకు మూలం అదేనని మనము ఊహింపవచ్చును. అయితే సుబంధుడు ఆ విధమైన ప్రస్తావనను చేయనందువల్ల ఆయన రచనతో వాటికి బదరీ బాదరాయణ సంబంధమేదో ఉండి ఉంటుందనుకోవటం కష్టం. భాసుని రచనలో వాసవదత్తకు వీణాగురువుగా కుదురుకొన్న ఉదయనుడు, వాసవదత్త పరస్పరం ప్రేమించుకొని, ఒకరోజు భద్రావతి అనే ఏనుగునెక్కి మగధనుంచి కౌశాంబికి పారిపోతారు. సుబంధుని కథలో వాసవదత్తా కందర్పకేతులు పరస్పరం ప్రేమించుకొని, మనోజవము అనే గుర్రాన్నెక్కి కుసుమపురం నుంచి వింధ్యాద్రికి పారిపోతారు. కుసుమపురమంటే మగధదేశంలోని పాటలీపుత్రం అన్నమాట నిజమే. అంతకంటె ఆ రెండు కథలకు బదరీ బాదరాయణ సంబంధమేదో ఉన్నదనుకోవటం సాధ్యం కాదు. మాతృరాజ ఆనంగ హర్షుని తాపస వత్సరాజములో వాసవదత్త తండ్రి పేరు మహాసేనుడని ఉన్నది. భాసుని రచనలలో (చండ) ప్రద్యోతుడని కనుపిస్తుంది. సుబంధుని కథలో వాసవదత్త తండ్రి పేరు శృంగారశేఖరుడు. సుబంధుని కథలో పద్మావతీదేవి పాత్ర అసలు లేనే లేదు. మహాభారతంలో చంద్రవంశంలో బుధుడు మొదలుకొని జన్మించిన రాజుల నలభైరెండవ తరంలో పాండురాజుకు అర్జునుడు, అర్జునునికి అభిమన్యుడు, అభిమన్యునికి పరీక్షిత్తు, పరీక్షిత్తుకు జనమేజయుడు, జనమేజయునికి శతానీకుడు, శతానీకునికి సహస్రానీకుడు, సహస్రానీకునికి మృగావతియందు ఉదయనుడు అని వంశక్రమం. ఈ ఉదయనుని కథకు, కథాసరిత్సాగర బృహత్కథాశ్లోకసంగ్రహాదులలోని ఉదయనుని కథకు పూర్వాపరాలను నిర్ద్వంద్వంగా నిరూపింపలేము. మహాభారత కథతో శక్తిభద్రుని తాపస వత్సరాజము కొద్దిగా సరిపోలుతుందని చెప్పవచ్చును. సుబంధుని వాసవదత్తా కథలోని వాసవదత్తకు ఈ వృత్తాంతాలతో ఏ మాత్రమూ సంబంధం లేదు. ఇప్పటి వరకు మనకు దొరుకుతున్న ఇటువంటి రచనలలోని ఇతివృత్తకల్పనోదంతం గాని, తత్తత్ప్రభావపరిశీలన గాని సుబంధుని చరిత్రకు, కాలనిర్ణయానికి, ఏతత్కావ్యావగాహనకు పనికిరావన్నమాట.
పూర్వకావ్య ప్రశంసలు
కాగా, సుబంధుడు వాసవదత్తా కథలోని వర్ణనలలో పెక్కుచోట్ల ఉపమాన మూలకం గానూ, శ్లేషవశం గానూ ప్రసక్తించిన కొన్ని గ్రంథనామాలు ఆయన కాలనిర్ణయానికి దోహదం కాగలవని భావించటానికి అవకాశం ఉన్నది. వాటిలో –

1) ఉపనిషత్తు (ఉపనిషద మివ సానన్దాత్మక ముద్ద్యోతయన్తీం),

2) శ్రీమద్రామాయణం (రామాయణేవ సున్దరకాణ్డచారుణా),

3) మహాభారతం (సదా పార్థోఽపి న మహాభారతరణయోగ్యః),

4) పింగళుని ఛందోవిచితి (ఛన్దోవిచితి రేవ భ్రాజమానతనుమధ్యాం),

5) మల్లనాగుని (వాత్స్యాయనుని) కామసూత్రం (కామసూత్ర ఇవ మల్లనాగఘటిత కాన్తారసామోదః),

6) ఉద్యోతకరుని న్యాయవార్తికం (న్యాయస్థితి మి వోద్యోతకరస్వరూపాం),

7) జైమిని సూత్రాలు (జైమిని మతానుసారిణ ఇవ తథాగతధ్వంసినః),

8) అలఙ్కారమ్ అనే సంజ్ఞతో వ్యవహరింపబడిన (బౌద్ధసఙ్గీతి మి వాలఙ్కారప్రసాధితాం) అశ్వఘోషుని సూత్రాలంకారం (లేదా) అసంగాచార్యుని మహాయాన సూత్రాలంకారం – మొదలైనవాటి కాలనిర్ణయాలను బట్టి ఆయన క్రీస్తుశకం నాలుగవ శతాబ్దికి తరువాతివాడని;

9) అభిజ్ఞానశాకుంతలంలో కాళిదాసు ప్రవేశపెట్టిన దుర్వాసుని శాపవృత్తాంతాన్ని (అఫల మివ దుష్యన్తస్య కృతే శకున్తలాపి దుర్వాససః శాప మనుబభూవ అని వాసవదత్తా కథ ముద్రితప్రతులలోని పాఠం; విఫల మేవ దుష్యన్తస్య కృతే దుర్వాసస శ్శాప మనుబభూవ శకున్తలా అని తెలుగుదేశంలోని వ్రాతప్రతులు) పేర్కొన్నందువల్ల కాళిదాసుకు అనంతరీయుడని –

10) సా రసవత్తా విహతా నవకా విలసన్తి చరతి నో కఙ్కః, సరసీవ కీర్తిశేషం గతవతి భువి విక్రమాదిత్యే అని ఉన్న అవతారికా శ్లోకంలోని విక్రమాదిత్యుని మృతిప్రస్తావం వల్ల[2] – రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని (క్రీ.శ. 374-413) అనంతరం – మొదటి కుమారగుప్తుని కాలంలో (క్రీ.శ. 374-413) ఈ కథారచనను చేసి ఉండవచ్చునని –

ఒకపాటిగా విమర్శకులు సుబంధుని కాలాన్ని ఊహించటానికి వీలవుతున్నది.

క్రీస్తుశకం 800(±) నాటి వామనాచార్యుడు తన కావ్యాలంకారసూత్ర వృత్తిలోని అర్థగుణాధికరణంలో అభిధేయ (అంటే అర్థము యొక్క) ప్రౌఢత్వాన్ని (= ఓజస్సు అనే గుణాన్ని) వివరించేటప్పుడు సాభిప్రాయతకు నిదర్శకంగా ఈ శ్లోకాన్ని ఉదాహరించాడు:

సోఽయం సమ్ప్రతి చన్ద్రగుప్తతనయ శ్చన్ద్రప్రకాశో యువా
జాతో భూపతి రాశ్రయః కృతధియాం దిష్ట్యా కృతార్థశ్రమః.

దీనిని బట్టి వామనుని దృష్టిలో మగధదేశాన్ని పరిపాలించిన చంద్రగుప్తమౌర్యుని కొడుకు బిందుసారుని వద్ద (క్రీ.పూ. 320-273) సుబంధుడనే మంత్రి ఉండినట్లు, ఆయన మంత్రిత్వనైపుణి వల్ల, విద్యాధికారిత్వం వల్ల బిందుసారునికి విద్వాంసులందరికీ ఆశ్రయం ఇచ్చేవాడన్న మంచి ప్రసిద్ధి కలిగినట్లు (ఆశ్రయః కృతధియా మి త్యస్య చ సుబన్ధుసాచివ్యోపక్షేపపరత్వాత్ సాభిప్రాయత్వమ్) స్పష్టం.

మహాకవి దండి రచించిన అవంతీసుందరీ కథలోనూ ఈ సుబంధుని ఉదంతం ఉన్నది కాని, ముగింపు శ్లోకం చివరి భాగంలోని పాఠం పూర్తిగా లభింపలేదు.

సుబన్ధుః కిల నిష్క్రాన్తో
బిన్దుసారస్య బన్ధనాత్
తస్యైవ హృదయం బద్ధ్వా
వత్సరాజ …

అంటూ – ఎంతో ఆసక్తికరమైన చోట ఆగిపోయింది. బిందుసారుని కొలువులో ఎన్నో సత్కారాలను అందుకొన్న సుబంధునిపై బిందుసారుడు ఒకరోజు ఏదో కారణం వల్ల ఆగ్రహించి, ఆయనను చెరలో పెట్టాడట. ఎట్లాగో సుబంధుడు చెరనుంచి తప్పించుకొని, మగధదేశం నుంచి పారిపోయి వత్సదేశపు రాజు ఆస్థానానికి వెళ్ళాడట. అక్కడ వత్సరాజు హృదయాన్ని ఆయన ఏ విధంగా ఆకట్టుకొన్నదీ అంతుపట్టకుండా ఈ కథ నిలిచి ఉన్నది.

అవంతీసుందరీ కథలోని ఈ వత్సరాజు వత్సదేశపు రాజైన ఉదయనుడని, ఉదయన బిందుసారులకు వైరం ఏర్పడి, ఇద్దరిలో ఎవరో ఒకరు మరొకరిని చెరపట్టారని, ఈ ఘటన జరిగిన కొంతకాలానికి సుబంధుడు మరణించి ఉండవచ్చునని – లేదా, ఈ ప్రస్తావనతోనే దండి ఈ కథను ఆపివేసి ఉంటాడని ఊహిస్తూ మానవల్లి రామకృష్ణకవిగారు Nṛttapāra అనే వ్యాసంలో –

Dandins fragmentary verse in praise of Subandhu suggests that Bindusāra and Udayana acted together and one imprisoned the other and Subandhu either died leaving the story there or the story really ends with that incident.

– Collected Papers of Manavalli Ramakrishna Kavi, పుటలు 198-9)

అని వ్రాశారు. ఇదికాక, మరొక ఐతిహ్యం కూడా ఉన్నది. సుబంధుడు బిందుసారుని కొలువులో మహాకవిగా గుర్తింపును పొంది హాయిగా ఉన్నాడట. కొంతకాలానికి సాటి కవుల ముందు తనకు జరగవలసిన సన్మానం విషయమై ఏదో పట్టింపు వచ్చి, పంతాలు పెరిగి, రాజు తనవైపు మొగ్గుచూపకపోయేసరికి విఫలమనోరథుడైనాడట. ధీరోద్ధతులకు సహజమైన కీర్తికాంక్షను కలిగి ఉన్నప్పటికీ – ఎవరికీ తలవంచే స్వభావం లేని స్వతంత్రుడు కాబట్టి, నానాటికీ పెరుగుతున్న రాజు ఐశ్వర్యమదాన్ని, అతనికి తనయెడ పొడచూపిన ఉపేక్షాభావాన్ని సహింపలేక – మగధదేశాన్ని విడిచి వత్సరాజు ఆస్థానానికి వెళ్ళాడట. అక్కడ వత్సరాజును తన వైదుష్యంతో మెప్పించి, అయిదు అగ్రహారాలను బహుమతిగా పొంది, అక్కడే స్థిరపడి, కొంతకాలానికి వత్సరాజు చెల్లెలిని పెళ్ళిచేసుకొన్నాడట.

ఈ కథను వింటుంటే మనకు భాస మహాకవి రచించిన స్వప్నవాసవదత్తంలో వత్సదేశానికి రాజైన ఉదయనుడు శత్రురాజు చేతిలో ఓడిపోయి, లావాణకంలో భార్య వాసవదత్త అగ్నిదగ్ధ అయిన మిథ్యావార్తను విన్న కొంతకాలానికి యౌగంధరాయణుని సాచివ్యనైపుణి వల్ల మగధ రాజు దర్శకుని చెల్లెలు పద్మావతీదేవిని పెండ్లాడిన కథ జ్ఞాపకానికి వస్తుంది. ఈ రెండు కథలకూ గల వింత పోలిక గమనింపదగినదే. సుబంధుడు మగధరాజు వద్ద సాచివ్యనైపుణికి పేరుపొందినవాడు. రాజుతో వైరం ఏర్పడి – మగధదేశాన్ని విడిచి, వత్సదేశానికి వెళ్ళి రాజు చెల్లెలిని వివాహం చేసుకొన్నాడు. ఉదయనుడు వత్సదేశపు రాజుగా ఉంటూ, పరిస్థితులు తారుమారైనాక యౌగంధరాయణుని మంత్రిత్వం వల్ల మగధదేశానికి వెళ్ళి రాజు చెల్లెలిని వివాహం చేసుకొన్నాడు.

మగధలో ఉండగా సుబంధుడు వత్సరాజ చరిత్రను నాటకంగా మలిచి, తన్మూలంగానో మరేదో కారణాననో బిందుసారునితో వైరం ఏర్పడి, ఆ చోటు విడిచి వత్సదేశానికి వెళ్ళాడని ఇంకొక ఐతిహ్యం.

సంస్కృతంలో సముద్రగుప్త చక్రవర్తి రచించిన కృష్ణచరిత కావ్యంలో ఇటువంటిదే, మరొక ఐతిహ్యం కనబడుతుంది. అందులోని రాజకవయః అన్న విభాగంలో (రాజకవులు – అంటే రాజులైన కవులు అని కాదు; రాజాశ్రయాన్ని పొందిన కవులు అని అక్కడి ప్రాకరణికార్థం) ప్రసక్తమైన సుబంధుని చరిత్రాధికరణం ఈ ఐతిహ్యానికి ఉపబలకం. అందులోని శ్లోకాలివి:

జయ త్యయం పూర్ణకలః కవికీర్తిసుధాకరః
అకలఙ్కో రసామ్భోధి ముద్వర్తయతి య స్సదా.

వ్యాహారసౌష్ఠవ ముదారరసం మహార్థం
య న్నాటకం సురభిగర్భితనాటకం చ.

త ద్వత్సరాజచరితం మృదుభావహారి
కృత్వా సుబన్ధు రభవ త్కృతినాం వరేణ్యః.

బిన్దుసారస్య నృపతేః స బభూవ సభాకవిః
కిం తు సేహే న తద్గర్వం తిరశ్చక్రే చ తాం సభామ్.

ఉరగాభే నృపే తస్మిన్ క్రుద్ధే బన్ధమితం(?) కవిమ్.
సరస్వతీ ముమో చాథ తం దేశం సోఽత్యజ త్తథా.

విద్వాన్ జయీ వత్సరాజో దృష్ట్వా వైదుష్య ముత్తమమ్
పఞ్చగ్రామాన్ దదౌ తస్మై నిజాం భగినికాం తథా.

ఇందులో పేర్కొనబడిన సుబంధుని వత్సరాజ చరితమే అభినవగుప్తుడు తన నాట్యశాస్త్ర వ్యాఖ్యలో ఉద్ధరించిన వాసవదత్తా నాట్యపార కావచ్చునని ఒక ఊహ. ఆ పక్షాన వామనుడు కావ్యాలంకార సూత్రవృత్తిలో ఉదాహరించిన ‘సోఽయం సమ్ప్రతి చన్ద్రగుప్తతనయః’ అన్న శ్లోకం దీని అవతారిక లోనిదే అయివుంటుంది. ఇది కూడా ఊహే.

Poona Orientalia పత్రికలో (సంపుటి X, పు.88) సి.ఆర్. దేవధర్ ఈ శ్లోకగాథ శూద్రకుడు రచించిన వత్సరాజ చరితం లోనిదని ఊహించారు. అయితే శూద్రకుని పేర ఈ వత్సరాజ చరితమనే రచన ఉన్నదనటానికి గాని, ఈ శ్లోకం అందులోనిదని ఊహించటానికి గాని ఆధారాలను చూపలేదు. నాకున్న పరిమితపరిధిలో ఎంత ప్రయత్నించినా శూద్రకుని ఆ వత్సరాజ చరితం గాని, దానినుంచి ఉదాహరణలు గాని నాకేవీ దొరకలేదు. శూద్రకుని వీణా వాసవదత్తంలోనూ వత్సరాజ చరితను గురించిన సమాచారం లేదు. శూద్రకుని మృచ్ఛకటిక రూపకం (4-26) లో ‘ఉత్తేజయామి సుహృద్భ్యః పరిమోక్షణాయ యౌగన్ధరాయణ ఇ వోదయనాయ రాజ్ఞః’ అని ఆర్యకోదంతంలో ఉన్న వాక్యాన్ని బట్టి శూద్రకుని దృష్టిలో ఉన్నది సుబంధుని వాసవదత్తా కథకు సంబంధించిన వృత్తాంతం కాదని చెప్పవచ్చును. దేవధర్ వ్యాసాన్ని బట్టి ఆ అభిప్రాయంపై ఎటు వ్యాఖ్యానించడానికీ వీలులేకుండా ఉన్నది.

శ్రీహర్షుని రత్నావళి (2-3) లోని ‘లోకే హారి చ వత్సరాజచరితమ్’ అన్న వాక్యం కూడా శూద్రకుని రచనకు వర్తిస్తుందో, భాసుని రచనను సూచిస్తున్నదో స్పష్టంగా తెలియటం లేదు. వ్యాఖ్యాతలు చెప్పలేదు. కౌటల్యుని అర్థశాస్త్రం (9-7) లోని ‘దృష్టా హి జీవతః పునరావృత్తి ర్యథా సుయాత్రోదయనాభ్యామ్’ అన్న ప్రస్తావన విషయమూ అంతే. భాస సుబంధుల కంటె మునుపే ఉదయనుని కథ, వాసవదత్త కథ ఏదో ఒక రూపంలో దేశమంతటా ప్రచారంలో ఉండినవని మాత్రం దీనిని బట్టి ఊహించటానికి వీలవుతున్నది. దామోదర గుప్తుని కుట్టనీ మతంలో ప్రస్తావింపబడిన వాసవదత్త ఉదయనుని ప్రేయసి కాబట్టి ఆయన దృష్టిలో ఉండినది కూడా సుబంధుని రచన కాదన్నమాట.

1926లో శ్రీ బాలమనోరమా సీరీస్ పక్షాన మద్రాసులో అచ్చైన శక్తిభద్రుని ఆశ్చర్యచూడామణి నాటకం పీఠికలో ఆచార్య కుప్పుస్వామిశాస్త్రి శక్తిభద్రుని మరొక రచన అయిన ఉన్మాద వాసవదత్త నిజానికి భాసుని పేరిట లభిస్తున్న ప్రతిజ్ఞా యౌగంధరాయణము అని వ్రాశారు. వారే మరొక వ్యాసంలో శక్తిభద్రుని ఉన్మాద వాసవదత్తమే సుబంధుడు రచించినదిగా పేర్కొనబడుతున్న వత్సరాజ చరితము అనికూడా వ్రాశారు. శక్తిభద్రుని ఆశ్చర్యచూడామణిలో ఆయన ఉన్మాద వాసవదత్తమును రచించిన ప్రస్తావాన్ని తప్పించి వేరేమీ వివరాలు లేవు. కుప్పుస్వామిశాస్త్రి ఆ రోజులలో భాసుని పేరిట వెలసిన రచనలన్నీ భాసునివి కావని, అవన్నీ వేర్వేరు రచయితల కృతులని నమ్మినవారు. అందువల్ల వారి అభిప్రాయంపై ఎటు వ్యాఖ్యానించడానికీ వీలులేకుండా ఉన్నది.

బిందుసారునిచే అవమానింపబడి కారాగృహం పాలైన కవికి సరస్వతి ప్రత్యక్షమై ఆయనను చెర విడిపించినదని, ఆ తర్వాత ఆయన మగధ రాజ్యాన్ని వదిలిపెట్టి కౌశాంబిలో వత్సరాజును ఆశ్రయించి రాజభగినిని పెళ్ళిచేసుకొన్నాడని పైన సముద్రగుప్తుడు కృష్ణచరితంలో చెప్పిన విషయాలన్నీ నేటి మన వాసవదత్తా కథా రచయిత అయిన సుబంధునికంటె పూర్వుడైన మరొక సుబంధునికి అనువర్తిస్తే, భగవత్పతంజలి వ్యాకరణ మహాభాష్యంలో పేర్కొన్న వాసవదత్తాఖ్యాయికా రచయిత అయిన సుబంధునితో ఆ ఇద్దరికీ గల అన్వయం ఏమిటన్నది ఇంతవరకు చిక్కుముడి వీడలేదు.

ఇతర కృతిప్రస్తావనలు
దీనికితోడు వాసవదత్తా కథలో సుబంధుడు ప్రవేశపెట్టిన అనేక పాత్రల పేర్లు, కథావశాన సందర్భింపబడిన వివిధ పౌరాణికవృత్తాలు నిర్నిమిత్తాలు కావని; ఆనాడు ప్రసిద్ధికి నోచుకొన్న పెక్కు గ్రంథాల పేర్లను ఇందులో సాభిప్రాయంగా నెలకొల్పడం జరిగిందని చాలా రోజులుగా విమర్శకలోకంలో ఒక అభిప్రాయం ఉన్నది. ఇదికూడా వాదవివాదాలకు లోనయింది కాని, కవి కాలనిర్ణయానికి దోహదం కాగల బలీయఃప్రమాణం ఇది. కలలో కందర్పకేతునితో సమావేశం సిద్ధించిన తర్వాత వాసవదత్త ఆయన పొందుకోసం విరహవేదనను పొందే సన్నివేశం ఒకటున్నది. నాయకుని యెడబాటు వల్ల కలిగిన శరీరతాపాన్ని భరింపలేక ఆమె తన చెలికత్తెలను పేరుపేరునా పిలిచి శైత్యోపచారాలు చేయమని కోరుతుంది. ఆ విధంగా ఆమె చెలికత్తెలను పేరుపేరున పిలిచినప్పుడు – సంబుద్ధ్యంతాలుగా వచ్చిన ఆ పేర్లన్నీ ఆనాటికే కాలగర్భంలో అంతరించిపోయిన ఎన్నో మహాకృతుల నామధేయాలు కావచ్చునన్న విశ్వాసం సమంజసమే అనిపిస్తుంది. అందుకు రెండు ఉదాహరణలు:

౧) ‘విలాసవతి! విలాసయ మయూరకిశోరకమ్’ అన్నప్పడు విలాసవతి ఒక చెలికత్తె పేరు. ఈ విలాసవతి ఒక కావ్యం పేరట. విశ్వనాథ కవిరాజు సాహిత్యదర్పణంలో నాట్యరాసకానికి ఉదాహరణగా – ‘సన్ధిచతుష్టయవతీ యథా విలాసవతీ’ (6-285a) అని ఉదాహరించాడు. ఆ విలాసవతీ నాట్యరాసకంలో పంచసంధులలో నాలుగు సంధులు మాత్రమే ఉన్నాయట. అంతటి మహాలాక్షణికుడు ఉదాహరించిన ఈ విలాసవతి కావ్యం ఇప్పుడు దొరకటం లేదు. సుబంధుని కాలంలో ఉండివుంటుంది.

౨) ‘వహతీవ హతీ రనఙ్గలేఖే! స్మరసాయకానాం తవ వపు రలసమ్’ అన్నప్పటి అనంగలేఖ ఇంకొక చెలికత్తె పేరు. ఇదికూడా ఒక కావ్యమే. రుయ్యకుని అలంకారసర్వస్వానికి కూర్చిన తన విమర్శినీ వ్యాఖ్యలో జయరథుడు వాక్యార్థగతమైన అసమస్తపదాశ్రిత పునరుక్తవదాభాసాన్ని వివరిస్తూ, అందుకు నిదర్శనగా ‘ఇ త్యనఙ్గలేఖాయాం హస్తివర్ణనే’ అని ఈ అనంగలేఖలోని ఒక ఏనుగు వర్ణనను ఉదాహరించాడు. ఆ వర్ణనను బట్టి అనంగలేఖ ఒక అద్భుతావహమైన గద్యకావ్యమని ఊహింపదగి ఉన్నది. ఇప్పుడు దొరకటం లేదు.

౩) ‘చపలే, చిత్రలేఖే! లిఖ చిత్రే చిత్తచోరం జనమ్’ అన్నప్పటి చిత్రలేఖ కూడా వాసవదత్తా శైత్యోపచార సన్నివేశంలో వచ్చిన ఒక చెలికత్తె పేరు. ఈ చిత్రలేఖ ఒక నాటికా విశేషమని భోజుడు శృంగారప్రకాశంలో పేర్కొన్నాడు. ఉషానిరుద్ధుల పరిణయగాథలో ఉషకు ప్రాణసఖి అయిన చిత్రలేఖను ప్రధానీకరించి చెప్పిన కథావిశేషమని ఊహించాలి. ఆ పేరుతో ఉన్న ఒక అప్సరోవనితను గూర్చి నాటకీకరించి చెప్పేందుకు అనువైన గాథలేవీ పురాణాలలో అగపడవు. అందువల్ల ఆ చిత్రలేఖను అధికరించిన రచన కాకపోవచ్చును. ఏది యేమైనప్పటికీ భోజరాజు పేర్కొన్న ఆ నాటిక ఇప్పుడు దొరకటం లేదు. సుబంధుని కాలంలో ఉండివుంటుంది.

ఇటువంటివే – కాంతిమతి, లవంగవతి, రాగలేఖ, వసంతసేన, మదనమాలిని, మదనమంజరి, తరంగవతి మొదలైన పేర్లన్నీ ఆ శైత్యోపచార సన్నివేశంలోని సుబంధుని సాభిప్రాయకథనంలో చెలికత్తెల పేర్లుగా చక్కగా ఒదిగిపోయాయి. ఇవన్నీ ఒకనాడుండి, ఇప్పుడు లుప్తమైపోయిన కావ్యాల పేర్లే. వీటిలో చివరిది తరంగవతి క్రీస్తుశకం 72 నాటి హాలమహారాజు ఆస్థానానికి వన్నెతెచ్చిన మహాకవి శ్రీపాలితుని రచన. ‘ప్రసన్నగమ్భీరపథా కథాఙ్గమిథునాశ్రయా, పుణ్యా పునాతి గఙ్గేవ గాం తరఙ్గవతీ కథా’ అని ధనపాలుడు దీనిని తన తిలకమంజరిలో ప్రశంసించాడు. ఇందులోని మదనమంజరి గుణాఢ్యుని బృహత్కథలో ప్రసక్తింపబడిన నరవాహనదత్తుని భార్య మదనకంచుకకు సంస్కృతరూపమని, అది ఒకనాటి కావ్యవిశేషం కావచ్చునని Indian Kavya Literature (సంపుటం-2, పుట 243) లో ప్రఖ్యాత వాఙ్మయైతిహాసికులు వార్డెర్ అభిప్రాయపడ్డారు. ఆ రచనలేవీ ఇప్పుడు దొరకటం లేదు.

అందువల్ల – సుబంధుని కావ్యరచనాసామగ్రిలో ఒక్క వాక్యమైనా సార్థకం కానిదంటూ ఉండదని, కథలోని ప్రతి ఒక్క సన్నివేశాన్ని, ప్రతి ఒక్క వాక్యాన్ని, ప్రతి ఒక్క పదాన్ని, ప్రతి ఒక్క అక్షరాన్ని పట్టి పట్టి చదివితేనే గాని అంతరార్థం బోధపడదని గ్రహించాలి.

ఈ విధంగానే ఇందులో అక్కడక్కడ కేవలం ప్రస్తావవశాన స్మరింపబడిన –

1) ఉషా పరిణయం (ఉషా మి వానిరుద్ధదర్శనసుఖామ్),

2) కార్తవీర్యార్జునుని కథ (కార్తవీర్యో గోబ్రాహ్మణపీడయా పఞ్చత్వ మాసీత్),

3) కువలయాశ్వ చరిత్ర (లేదా, మదాలసా చరిత్ర) (కువలయాశ్వో నాశ్వతరకన్యా మపి పరిజహార, అశ్వతరకన్యా మివ మదాలసామ్),

4) తపతీసంవరణోపాఖ్యానం (సంవరణో మిత్రదుహితరి విక్లబతా మగాత్),

5) తారాశశాంకం (తారా మివ గురుకలత్రోపశోభితామ్),

6) ధూమోర్ణా వృత్తాంతం (విఫల మేవ ధూమోర్ణాస్వయంవరార్థాగతదేవగ్రహగన్ధర్వసహస్రేషు ధర్మరాజ మకాంక్షత),

7) నలదమయంతీ కథ (నలం కలి రభిభూతవాన్),

8) నహుష చరిత్రం (నహుషః పరకలత్రదోహదీ మహాభుజఙ్గ ఆసీత్),

9) మేనకాఖ్యానం (మేనకానఖమార్జనశిలాశకల ఇవ మధుచ్ఛత్రచ్ఛాయామణ్డలోదరే),

10) సుభద్రార్జునుల కథ (పార్థ ఇవ సుభద్రాన్వితః),

మొదలైన ఇంకా అనేకసంఘటితాలన్నీ ప్రాస్తావికములైన పురాణప్రసిద్ధకల్పనలు కావని, పూర్వం ఒకప్పుడు రచింపబడిన కావ్యపరంపర నుంచి ఉద్ధృతములై ఉండవచ్చునని చిరకాలంగా విమర్శకలోకంలో ఏర్పడి ఉన్న అభిప్రాయాన్ని కూడా కాదనలేము. ఈ విధంగా ఇదొక అపూర్వమైన వేద పురాణ కావ్య వ్యాకరణ న్యాయ మీమాంసాది విజ్ఞానసర్వస్వమని చెప్పదగి ఉన్నది.

సుబంధుడు కూడా దండి – మాఘ – భవభూతి – భారవి మహాకవుల వలె దాక్షిణాత్యుడు. వాసవదత్తా కథలో ‘రశనాబన్ధో రతికలహేషు’ అని ఒకచోట శ్లేషలో శ-స లకు అభేదం పాటింపబడి ఉండటం వల్ల, అటువంటివే ఇంకా మరికొన్ని ప్రయోగాల మూలాన, ఆయన వంగదేశీయుడని హాల్, మన్మోహన్ ఘోష్ వంటి పండితులు ఊహించారు. 1941లో ప్రఖ్యాతవిద్వాంసులు ఆచార్య ఆర్.జి. హర్షే Subandhus Home అన్న తమ వ్యాసంలో ఈ ఊహలను తిరస్కరించారు. రతివేళ నాయికానాయకులు రసనా బంధమును (సంపుటక చుంబనంలో ప్రేయసీప్రియుల నాల్కలు రెండూ కలిసినప్పటి జిహ్వాబంధవిశేషమని వాత్స్యాయన కామసూత్రం), రశనా బంధమును (నాయిక తన ప్రియుని చేతులను పర్యంకానికి రజ్జువుతో బంధించినప్పటి పురుషాయిత కేళివిశేషం) పాటిస్తారన్నది శ్లేషమూలకమైన వర్ణ్యాంశం. అయితే శబ్దకోశాలలో రసన, రశన అన్న రెండు పదాలకూ నాలుక, రజ్జువు అన్న రెండర్థాలూ పేర్కొనబడి ఉన్నాయి. అందువల్ల ఇది శ-స ల అభేదపరిపాటికి గాని, కవియొక్క వంగదేశీయతకు గాని నిదర్శకం కాదని చెప్పవచ్చును.

శఫరము అన్న మీనవిశేషద్యోతమైన శబ్దాన్ని శఫరీ అన్న స్త్రీలింగానికి మారుగా సుబంధుడు పుంలింగంలో ప్రయోగించటం కూడా ప్రాంతసూచకమని కొందరు విమర్శకు లూహించారు. అదీ సరికాదు. శఫరీ-శఫరాలు రెండూ రూపాంతరాలు. ‘శఫరీ శఫరోఽపి చ’ అని ఆ రెండింటినీ పర్యాయాలుగా వంగదేశీయుడే అయిన మథురేశుని శబ్దరత్నావళి పేర్కొంటున్నది. ‘ప్రోష్ఠీ తు శఫరీ ద్వయోః’ అని అమరకోశంలోనూ ఉన్నది. జాలరులు వల విసిరి దీనిని లోతుగలిగిన నదీసముద్రాలలోనూ, అంతగా లోతులేని గుంటలలోనూ కూడా పట్టుకొంటారని వర్ణనలున్నాయి. ‘అగాధజలసఞ్చారీ వికారీ న చ రోహితః, గణ్డూషజలమాత్రే తు శఫరీ ఫర్ఫరాయతే’ అని వరరుచి నీతిరత్నం (శ్లో.10). శఫరము నల్లరంగులో అందంగా కొనలుదేరి ఉండటం వల్ల దానిని నాయికల కాటుక కన్నులతో పోలుస్తారు. నేత్రశఫరం అని శృంగారతిలకం (శ్లో.1). ‘గతదీప్తిగభస్తిమాలినో, విలుఠద్వీచిషు బిమ్బ మమ్బుధేః, శఫరాః పలఖణ్డశఙ్కయా, రసనాభి ర్లిలిహు ర్ముహు ర్ముహుః’ అని గంగాదేవి మధురావిజయం (7-13). కాంతానయనాలకు శృంగారతిలక మధురావిజయాలలో వలె ఉపమానకల్పనలో శఫరికి ఙీష్ ప్రత్యయాన్ని లోపింపజేయటం కవిసమయసిద్ధమే. ఈ ‘శఫరము అనే చేప పరిమాణంలో చాలా చిన్నదనే గాక, పెద్దదని కూడా కవిప్రయోగాలున్నాయి. పెద్దది కనుకనే నాయిక కన్నులతో పోల్చటం జరిగింది. ‘నేత్రశఫరం’ అన్న దళానికి “చపలస్వభావ లోచన మహామీనంబు” అని పాండురంగ మాహాత్మ్యంలో (5-270) రామకృష్ణకవి అనువాదం. అందువల్ల శఫరము అనే చేపతోడి ఔపమ్యం ఒక్క వంగదేశానికి మాత్రమే సీమితమైన ఉక్తివిశేషమని నిరూపించటం సాధ్యం కాదు.

సుబంధుడు మాళవ దేశీయుడని ఆధునిక పరిశోధకుల విశ్వాసం. సుబంధుడన్న పేరు ఇప్పటికీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వాడుకలో ఉన్నది. ఆకాశమనే పైరుపొలంలో తారకలు తెల్లగోధుమ గింజలలా ఉన్నాయని (తారకా శ్వేతగోధూమశాలినో నభఃక్షేత్రస్య) ఒకచోట వర్ణించాడు. రేవా నది ఒడ్డున కాటుకపిట్టలు జతకట్టి ఉండటాన్ని చూసి ఆ చోట స్వర్ణనిధికోసం త్రవ్వకాలు సాగించే ఆటవికులను (కణాటీరమిథున మైథునదర్శనోపజాత నిధిగ్రహణకౌతుక కిరాతశత ఖన్యమానతీరయా రేవయా) ఒకచోట వర్ణించాడు. కథాస్థగితమైన ఒకానొక వర్ణనను బట్టి కవి నివాసస్థలాన్ని నిర్ధారించటం అసమంజసమైనప్పటికీ – ఆయన అవంతీ రాజ్యంలో క్షిప్రానది ఒడ్డున జీవించినవాడని నేటికీ అక్కడ ప్రచారంలో ఉన్న ఐతిహ్యాన్ని కాదనలేము. కావ్యమంతటా మనకు విశదప్రకాశంతో కానవచ్చే వింధ్యపర్వత వర్ణనలను, నర్మదా నదీ వర్ణనలను, లాట దేశ కుంతల దేశ కర్ణాట దేశ కేరళ దేశ ప్రస్తావికలను, ఇంద్రియానుభవనీయమైన మాళవకాంతల సౌందర్యచిత్రణను, ఆంధ్రదేశంలోని శ్రీశైల మల్లికార్జునస్వామి ప్రశంసను (శ్రీపర్వత ఇవ సన్నిహిత మల్లికార్జునః) చదువుతున్నప్పుడు కవి దాక్షిణాత్యపరిచయం కలిగిన మాళవ దేశీయుడని అనిపిస్తుంది.

మాఘుడు, బాణభట్టు, దండి మొదలుగా గల మహాకవుల రచనలలో సుబంధుని సన్నుతులతోపాటు స్పష్టమైన భావానువాదాలు, శబ్దానుసరణలు ఎన్నో ఉన్నాయి. అవి ఆనాటి సుబంధుని మహాప్రభావాన్ని కన్నులకు కట్టే దీపస్తంభాల వంటివి. అతిసంక్షిప్తమైన ఈ ప్రథమపరిచయంలో సుబంధుడు బాణునికి తర్వాతివాడని కొంతమంది సాహిత్యచరిత్రకారులలో ఉన్న అభిప్రాయం సరికాదని మాత్రం చెప్పుకొని, ఆ విషయాన్ని గురించి కావ్యవిమర్శకు ఉపక్రమించినప్పుడు మరింత విపులంగా మరొకప్పుడు చర్చించుకొందాము. సంధానగ్రంథాలలో వాక్పతిరాజు, మంఖకవి, రాజశేఖరుడు, భోజప్రబంధ రచయిత బల్లాలసేనుడు సుబంధుని స్మరించిన శ్లోకాలు విద్యార్థులకు ప్రాతరనుసంధేయాలు. విశ్వగుణాదర్శంలో వేంకటాధ్వరి సుబంధుని స్మరించిన పంక్తి (ఖ్యాతా శ్చాన్యే సుబన్ధ్వాదయ ఇహ కృతిభి ర్విశ్వ మాహ్లాదయన్తి) నలుగురికీ తెలిసినదే. ఇక, ఆంధ్రుడైన రామచంద్రభట్టు తన రోమావలీ శతకంలో (ఇది ఇంకా అముద్రితం; కాంకరోలీ (రాజస్థాన్) లోని సరస్వతీ భండార లిఖితపుస్తక సంగ్రహాలయంలోని వ్రాతప్రతి (66/12) నుంచి ఈ శ్లోకాన్ని ఉదాహరిస్తున్నాను. పండిత దుర్గాప్రసాద – కాశీనాథ పరబ్ మహాశయులు 1891లో కావ్యమాలా సంగ్రహంలో అష్టమగుచ్ఛంగా 135-155 పుటలలో అచ్చువేసిన కవీంద్రకర్ణాభరణ కావ్యకర్త విశ్వేశ్వరపండితుని రోమావలీ శతకం వేరొకటున్నది; అది దీనికంటె ఆధునికం) మహాకవి సుబంధుని ప్రాచీనునిగా గుర్తించి, సాక్షాత్తూ వ్యాసభగవానుని సరసను నిలిపి సంకీర్తించిన శ్లోకం:

వ్యాస స్యాదికవేః సుబన్ధువిదుషో బాణస్య చాన్యస్య వా
వాచా మాశ్రితపూర్వ పూర్వవచసా మాసాద్య కావ్యక్రమమ్
అర్వాఞ్చో భవభూతి భారవిముఖాః శ్రీ కాలిదాసాదయః
సఞ్జాతాః కవయో వయం తు కవితాం కే నామ కుర్వీమహి.

ఆదికవులు వాల్మీకి వ్యాసమహర్షులు. ఆ తర్వాత లౌకికులలో మహావిద్వాంసుడు సుబంధుడున్నాడు. ఆ తర్వాత బాణుడు. కవులంటే నిజంగా ఆశ్రయింపతగిన కవులు వీళ్ళు. అర్వాచీనులలో కాళిదాసు, భవభూతి, భారవి మొదలైనవాళ్ళు. వీళ్ళందరూ ఉండగా చెప్పుకోవటానికి కవులమంటూ మాలాంటివాళ్ళం కూడా ఉన్నాం. వీళ్ళ కావ్యక్రమాన్ని చూసిన తర్వాత మా కవితా ఒక కవితే? అని, అందంగా అన్నాడు. (వివిధకవుల పేర్లను తత్తత్కాలానుసారం పేర్కొనటంలో పొరబడ్డాడు కాని, ఎంతైనా మన తెలుగువాడు, వ్యాసుని తర్వాత సుబంధుని తలచుకొన్నాడు కదా! మీరు చదువుతారు కదా అని ఈయన శ్లోకాన్ని ఉదాహరించాను.)
ఆంధ్ర మనీషుల భావానువృత్తి
ఈ విధంగా సంస్కృత సారస్వతోపవనమంతటా విశాలమహావటవృక్షసదృక్షంగా విస్తరిల్లిన సుబంధుని మహారచన తెలుగువారిని అమితంగా ఆకర్షించటంలో ఆశ్చర్యమేముంటుంది? ఆంధ్రకవులు నన్నయ్యగారి కాలంనుంచి సుబంధుని వాసవదత్తా కథా పరిజ్ఞాతలేనని అసంఖ్యేయంగా ప్రయోగాలను ఉదాహరింపవచ్చును. నన్నయ్యగారి శ్రీ మహాభారత భాగధేయం వాల్మీకి వ్యాస శూద్రక కాళిదాస మయూర భారవి భట్టనారాయణాది మహాకవిభావదీధితిబంధురమై, ప్రాకృత తమిళ కర్ణాటాది భాషా సాహితీ నిష్ణాతృత్వపరిచాయకమై పరిఢవిల్లింది. భట్టబాణుని కాదంబరీ కావ్యకథాదిని ‘అతిచిరకాలలగ్న మతిక్రాన్త కునృపతిసహస్రసమ్పర్కకలఙ్క మివ క్షాలయన్తీ యస్య విమలే కృపాణధారాజలే చిర మువాప రాజలక్ష్మీః’ అని ఉన్న శూద్రక రాజవర్ణనమే, ఇతరస్థలానుగత తద్విశేషణాలతో –

రాజకులైకభూషణుఁడు రాజమనోహరుఁ డన్యరాజతే
జోజయశాలి శౌర్యుఁడు విశుద్ధయశశ్శరదిందుచంద్రికా
రాజితసర్వలోకుఁ డపరాజితభూరిభుజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుఁడు రాజమహేంద్రుఁ డున్నతిన్. ఆది (1-3)

అని భారతాదిని తెలుగులో అవతరించింది. తెలుగు విమర్శకులు గుర్తింపలేదని ఈ విషయాన్ని ప్రాస్తావికంగా ప్రస్తావించాను. భట్టబాణుని కాదంబరీ హర్షచరిత్రల వలెనే సుబంధుని వాసవదత్తా కథ అన్నా నన్నయ్య గారికి ప్రాణం. భట్టబాణుని హర్షచరిత్రను చదువుకొన్నప్పుడు అందులో ఉన్న వాసవదత్తా కావ్యప్రశంసను చూడకుండా ఉండరు కదా. చూచిన తర్వాత దానిని చదివేందుకు ప్రయత్నం చేయకుండా ఉండరు కదా. సుబంధుని మహారచనను చదువుకొని ప్రతిభావ్యుత్పత్తులకు మెరుగులు దిద్దుకొన్నాక, అవకాశం వచ్చినప్పుడల్లా మనోహరములైన ఆయన కర్పూరపు పలుకులను నన్నయ్యగారు తమ కవితలో పరిమళింపజేశారు. వాసవదత్తా కథలో వాసవదత్త కందర్పకేతుని స్వప్నంలో దర్శించి, స్వప్నంలోనే అతని వివరాలను తెలుసుకొన్న తర్వాత (సా స్వప్నే ఏవ నామాదిక మశ్రౌషీత్), ఓహో! ఇంతటి దివ్యతేజోమయమూర్తిని బ్రహ్మదేవుడు సృజింపగలడని తెలిసివుంటే – దమయంతి ఆనాడు నలునికోసం అడవుల వెంబడి నానా అగచాట్లూ పడేదే కాదు కదా (వృథైవ దమయన్తీ నలస్య కృతే వన(వాస)వైశస మవాప) అని విరహవేదన పాలైన సన్నివేశంలో సుబంధుడు –

(సపది) పరిజనప్రయత్నా ద్గృహీతజీవా (సతీ) క్షణ మతిశిశిర ఘనసార రసానుకూలనిమ్నగా పులినే క్షణ మతితుహిన మలయజరస సరిత్పరిసరే క్షణ మతి(లోహిత కనకారవిన్ద కదమ్బ)పరివారిత సరస్తటీ చన్దనవిటపిచ్ఛాయాసు క్షణ మనిలోల్లాసిదలేషు కదలీకాననేషు క్షణం కుసుమ(ప్రవాల)శయ్యాసు క్షణం నలినీదలప్రస్తరేషు క్షణం తుషారసఙ్ఘాతశిశిరిత శిలాతలేషు పరిజనేన నీయమానా …, ముగ్ధే! మదనమఞ్జరి! సిఞ్చ చన్దనోదకేన. – వాసవదత్తా కథ (దాక్షిణాత్య పాఠం)

అనన్తరం పరిజనప్రయత్నోచ్ఛ్వసితజీవితా చ, క్షణ మతిశిశిర ఘనసార రజోనిమ్నగాకూలపులినే, క్షణ మతితుహిన జడ మలయజరసః సరిత్పరిసరే, క్షణ మరవిన్దకానన పరివారిత సరస్తటవిటపిచ్ఛాయాసు, క్షణ మనిలోల్లాసితదలేషు, కదలీ కాననేషు, క్షణం కుసుమ(ప్రవాల)శయ్యాసు, క్షణం నలినీదలప్రస్తరేషు, క్షణం తుషారసఙ్ఘాతశిశిరిత శిలాతలేషు పరిజనేన నీయమానా, ముగ్ధే! మదనమఞ్జరి! సిఞ్చ చన్దనోదకేన.- వాసవదత్తా కథ (ఔత్తరాహ పాఠం).

అని వ్రాసిన పంక్తులు మనోమయకోశంలో ముద్రితమై ఆయన –

నలదమయంతు లిద్దఱు మనఃప్రభవానలబాధ్యమానులై
సలిపిరి దీర్ఘవాసరనిశల్ విలసన్నవనందనంబులన్,
నలినదళంబులన్, మృదుమృణాళములన్, ఘనసారపాంసులం,
దలిరుల శయ్యలన్, సలిలధారలఁ, జందనచారుచర్చలన్.

అన్న హృద్యమైన పద్యాన్ని ఆంధ్రావళికి కంఠమణిహారంగా ప్రకాశింపజేశారు. సుబంధుడు వివిధసన్నివేశాలలో కుసుమపురంలో శీతవేళ ప్రవృద్ధములైన కర్పూరసురభిళరజోనిమ్నగాతోయాల చెంత మేటవేసిన ఇసుకతిన్నెలను, ప్రవాహసరిత్పరిసరాలను, అరవిందదీర్ఘికాపరివారితములైన సరస్తట తరుచ్ఛాయలను వర్ణించిన దళాలను ఒక్కచోటికి తెచ్చి, గంధమాదనపర్వతసానువుల వద్ద గంధర్వులు, సురలు, సిద్ధులు, సాధ్యులు, అప్సరసలు సంచరించే ఎంతో అందమైన నందనవనీపరిసరాలను ప్రవేశపెట్టాడు. నన్నయగారి పద్యాన్ని సుబంధుని మూలంతో సరిపోల్చినప్పుడు –

నలినీదల ప్రస్తరేషు – నలినదళంబులన్.
అరవింద కదంబ – మృదు మృణాళములన్.
ఘనసార రజః – ఘనసార పాంసులన్.
కుసుమ(ప్రవాల)శయ్యాసు – తలిరుల శయ్యలన్.
సిఞ్చ చన్దనోదకేన – చందన చారుచర్చలన్.

ఇత్యాదుల శబ్దసాదృశ్యం స్ఫుటవ్యక్తమే. నన్నయ్యగారిపై సుబంధుని ప్రభావాన్ని నిరూపించేందుకు ఇంత సుదీర్ఘంగా వివరింపవలసివచ్చింది. నన్నయ్యగారి కాలానికి వాసవదత్తా కథకు ఔత్తరాహ – దాక్షిణాత్యపాఠాలు ఇంకా ఏర్పడలేదని భావింపవలసి ఉంటుంది. లేదా, శ్రీనాథునికి వలె ఆయనకు కూడా కావ్యాల ఉత్తరదేశపు ప్రతులు కూడా అందుబాటులో ఉండినవేమో! అనుకోవాలి. అన్నిచోట్లా ఆయన అనువాదం ఔత్తరాహప్రతులకే సన్నిహితంగా ఉన్నది. వాసవదత్త తన చెలికత్తె మదనమంజరిని సిఞ్చ చన్దనోదకేన (గంధపు నీళ్ళు చల్లు!) అని శైత్యోపచారాన్ని కోరిన సంస్కృతవాక్యమే ఇందులో చందన చారుచర్చలన్ అన్న దళంగా రూపుదిద్దుకొన్నది. ఇంకా,

కేతకీ కానన నిపతిత ధూళీనికురుమ్బజాత సైకత సుఖోపవిష్ట తరుణసురమిథున నిధువనలీలా పరిమలసాక్షి కూలోపనయా.
ఆన్దోలితకుసుమకేసరే కేశరేణుముషిరణిత మధుకర రమణీనాం రమణీనామ్.
అనిలోల్లాసితదలేషు.

ఇత్యాదిగా సుబంధునికి ప్రీతిపాత్రమైన శబ్దజాలమే నన్నయ్యగారి కరకమలాలలో –

దళితనవీనకందళకదంబకదంబక కేతకీ రజో
మిళిత సుగంధబంధురసమీరణుఁ డన్ సఖుఁ డూఁచుచుండఁగా
నులియుచుఁ, బూవుగుత్తు లను నూయెల లొప్పుగ నెక్కి యాడె ను
ల్లలదళినీకులంబు మృదులధ్వనిగీతము విస్తరించుచున్. (ఆరణ్య: 3-137)

అని ప్రసన్నసరస్వతీకంగా తీర్పునొందింది. ఇదే విధంగా తిక్కనగారి నిర్వచనోత్తర రామాయణంలోనూ, ఎర్రనగారి లక్ష్మీనరసింహ పురాణంలోనూ వాసవదత్తా కథలోని పదబంధాలు తరంగప్రతిబింబన్యాయంగా సాక్షాత్కరిస్తూనే ఉంటాయి. నలదమయంతు లిద్దఱు రచనతో తెలుగు పద్యశిల్పంలో నన్నయ్యగారు ప్రవేశపెట్టిన సప్తమ్యంతనామమాలాబంధానికి సమ్మోహితుడైన చిమ్మపూడి అమరేశ్వరుడు తన విక్రమసేనములో –

అలరుల పాన్పులం, దలిరుటాకుల సెజ్జల, హర్మ్యవేదికా
తలములఁ, దీవయిండ్ల, సికతాశయనంబుల ము న్వియుక్తిమై
నలదురి వందు కందువల నప్పటి కప్పటి కింపుఁ బెంపఁ, గో
ర్కులు తనివారి, వేడ్కపడఁ గూడిరి వేడుకతోడ దంపతుల్.

అని ప్రకారాంతరాన్ని కల్పించాడు. సుబంధుని రచనను రమణీయ శృంగారకావ్యంగా కన్నడంలోకి అనువదించిన చతుర్భాషాచక్రవర్తి నేమిచంద్రుడు కూడా నలదమయంతు లిద్దఱు పద్యశిల్పంలో నన్నయ్యగారు ప్రవేశపెట్టిన రసోద్దీప్తినిమిత్తకారణపరంపరావర్ణనకు వశంవదుడై తన లీలావతీ ప్రబంధం (1-96)లో ప్రకరణోచితంగా దానిని అనుసంధింపక తప్పలేదు. కర్ణాటాంధ్రకవుల ఈ పరస్పరాధారాధేయభావం ఆదికాలం నుంచి క్రీ.శ. 16-వ శతాబ్ది వరకు కొనసాగుతూవచ్చిన సంగతి వాఙ్మయవిద్యార్థులకు కొత్తేమీ కాదు. నేమిచంద్రుని పద్యం –

లళనె యరాతనం బయసి నోడలొడం మదనాగ్నిదాహ మ
గ్గళిసదె మాణదెందు కృపె యిం పడెదం బిది చంద్రబింబమం,
మళయజమం, మృణాళకుళమం కొళనం, లతికాగృహంగళం
తళిర్గళనెందొడందమనదేవొగళ్పిం కవితావిలాసనా.

అని. సుబంధుని అనిలోల్లాసితదలేషు అన్న దళాన్ని కేతకీకానననిపతితధూలీనికురుంబతో మేళవించి నన్నయ్యగారు కేతకీరజోమిళితసుగంధబంధురసమీరణుఁడు (అన్ సఖుఁడు) ఊఁచుచుండగా అని తెనిగించినట్లే, నేమిచంద్రుడు అనిలాందోళితపాదపాగ్రవిగళత్పుష్పోత్కరం అని లీలావతీ ప్రబంధం (5-19)లో కన్నడీకరించుకొన్నాడు. కన్నడాంధ్రసాహిత్యాల తులనాత్మక పరిశీలన చేయగోరిన విద్యార్థులకు ఉపకరించే విషయాలివి. నన్నయ్యగారు నలదమయంతుల విరహోద్దీపన క్షోభక విభావాలుగా సుందర నదీనదారామవస్తువిస్తరాన్ని పరికరింపజేసినట్లే, మహాకవి జక్కన తన విక్రమార్క చరిత్రము (4-227) లో విదర్భరాజతనయా విక్రమార్కుల సంభోగశృంగారానికి ఉద్దీప్తికారకాలుగా ప్రకృతిదృశ్యాలను ఈ సప్తమ్యంతనామమాలికతో చిత్రించి తానూ ఒక భంగ్యంతరాన్ని అందంగా అవతరింపజేశాడు:

సంపూర్ణ పూర్ణిమా సాంద్ర చంద్రాతపవిలసిత శశికాంతవేదికలను
మంజరీ సంజాత మకరందనిష్యంద మాకంద మాధవీ మండపముల
శృంగారవన మహాశృంగార మణిశృంగ హాటకశైల శృంగాటకముల
సంఫుల్ల హల్లక సహవాస వాసనోజ్జ్వల దీర్ఘ దీర్ఘికా సైకతముల

గగనగంగాతరంగిణీ గంధవాహ
బంధురోదగ్ర (?) సౌధాగ్రభాగములను
నవనవోల్లాస రతికళానైపుణములఁ
బ్రతిదినంబు రమించిరి పతియు సతియు.

అని. నన్నయ్యగారి అనువక్త లిద్దరూ విప్రయోగాన్ని సంసర్గవర్ణనగా మార్చివేసినా, నన్నయ్యగారి పద్యశిల్పాన్ని మాత్రం యథావిశేషంగా పరిగ్రహించిన విషయం స్పష్టమే. సుబంధుడు వాసవదత్తా విరహవర్ణనలో – కర్పూరికే! పాణ్డురయ కర్పూరధూలిభిః పయోధరభారమ్ – అని విరహిణీ శైత్యోపచారానికి తొలిసారి కావించిన ఈ కర్పూరధూళియొక్క ధవళిమా శీతలిమల ప్రస్తావం సంస్కృతంలో చాలామంది కవులను ప్రభావితం చేసింది. ప్రియునితో క్షణమాత్రమైనా వియోగాన్ని సహింపలేని ప్రేయసీమణుల భావాతిశయోపవర్ణనకు దోహదం కాగలిగింది. దీనిని చదువుతున్నప్పుడు విద్యార్థులకు –

కణ్ఠే మౌక్తికమాలికాః స్తనతటే కార్పూర మచ్ఛం రజః
సాన్ద్రం చన్దన మఙ్గకే వలయితాః పాణౌ మృణాలీలతాః
తన్వీం నక్త మియం చకాస్తి తనునీ చీనాంశుకే బిభ్రతీ
శీతాంశో రధిదేవతేవ గలితా వ్యోమాగ్ర మారోహతః.

కర్పూరామ్బునిషేకభాజి సరసై రమ్భోజినీనాం దలై
రాస్తీర్ణేఽపి వివర్తమానవపుషః స్రస్తస్రజి స్రస్తరే
మన్దోన్మేషదృశా కి మన్యదభవ త్సా కాప్యవస్థా తదా
యస్యా శ్చన్దన చన్ద్ర చమ్పకదలశ్రేణ్యాది వహ్నీయతే.

వంటి శ్లోకాలు గుర్తుకు రావటం సహజమే. సుబంధుని వాక్యాన్ని అనుసరించి ఎవరో ప్రాచీనుడైన చాటుకవి శిశిరఋతువేళ దిశాంగనా శీతకిరణులకు నాయికానాయకత్వాన్ని ఆరోపించి (దిగ్వనిత నాయిక, చంద్రుడు ఆమెపై మరులుగొన్న నాయకుడు అన్నమాట), కర్పూరధూలిధవలద్యుతిపూర ధౌత, దిఙ్మండలే శిశిరరోచిషి తస్య అంటూ పదార్థానుసరణకౌశలంతో వృత్తాంతనిరూపణం చేయగా, నన్నయ్యగారు ఆరణ్యపర్వం (4-142) లో ఉభయశబ్దానుసరణ కావిస్తూ శరత్కాలపు రాత్రులను వర్ణించిన అద్భుతావహమైన పద్యం ఇది:

శారదరాత్రు లుజ్జ్వలలసత్తరతారకహారపంక్తులం
జారుతరంబు లయ్యె వికసన్నవకైరవగంధబంధురో
దార సమీరసౌరభముఁ దాల్చి సుధాంశువికీర్యమాణ క
ర్పూర పరాగ పాండురుచిపూరము లంబరపూరితంబులై.

అని. ఇందులో సంస్కృతంలోని శిశిరరోచులు తెలుగులో శారదరోచులుగా, సంస్కృతంలోని కర్పూరధూలి తెలుగులో కర్పూరపరాగంగా, సంస్కృతంలోని ధవలద్యుతిపూరం తెలుగులో పాండురుచిపూరంగా, సంస్కృతంలోని కర్పూరధూలిధవలద్యుతిపూర ధౌత దిఙ్మండలే అన్నది తెలుగులో కర్తృవ్యపదేశంతో సుధాంశువికీర్యమాణ క, ర్పూర పరాగ పాండురుచిపూరము లంబరపూరితంబులై శరత్కాలపు రాత్రివేళలకు వచన ప్రక్రమాది భేదం లేకుండా సార్థకంగా అన్వయిస్తున్నది. ఏకకర్తృకాలైన అనేక క్రియలున్నప్పుడు ప్రధానక్రియ తిఙంతంలో ఉండి, మిగిలిన అప్రధానక్రియలు శతృ శానజంతాలుగా ఉండవచ్చుననే సంస్కృత వాక్యనిర్మాణపద్ధతిని తెలుగుకు అనువర్తించి నన్నయగారిందులో ఒక సూత్రనిర్దేశాన్ని కూడా చేసి ఉన్న సంగతి కూడా గమనార్హం.

ఇక, శ్రీనాథుని విషయానికి వస్తే – సంస్కృత ప్రాకృత వాఙ్మయాలలో ఆ సకలవిద్యాసనాథుడు అధ్యయనింపని కావ్యతల్లజం కాని, శాస్త్ర వ్యాఖ్యాన ప్రకరణగ్రంథం కాని, చదివినది చదురనిపించినప్పుడు ఎదలో పదిలంగా పొదివికొని అదును పదునులు చూసి ప్రయోగింపని భణితివిశేషం కాని – ఉండదనే చెప్పవచ్చును. జీవితచరమసంధ్యావేళ శివరాత్రిమాహాత్మ్యం అవతారికలోని పూర్వకవినామసంకీర్తన పద్యంలో సింహావలోకిత కృతజ్ఞతాపూర్వకంగా బంధుర గాంభీర్యబంధు సుబంధు (1-12) అని సంస్మరించడమే గాక, పదే పదే ఆయన పదబంధాలను తన కవితలో అనుసంధించుకొన్నాడు. అందునా ప్రత్యేకించి వింధ్యాచల రేవానదీ వర్ణనాపూర్ణమైనందువల్ల కాబోలు, సుబంధుని రచన కాశీఖండ రచనాకాలంలో శ్రీనాథునికి వాచోవిధేయమై జిహ్వాగ్రనర్తినిగా ఉండేదని ఊహింపవచ్చును. కొన్ని శబ్దానువాదాలు నాసికేతోపాఖ్యానం (1-18)లో దగ్గుపల్లి దుగ్గన అన్నట్లు, ఆయన పూర్వకవిముఖ్య విరచితాపూర్వ కావ్య,భావ రససుధా చర్వణప్రౌఢతకు ప్రత్యక్షర ప్రత్యక్షసాక్ష్యాలుగా నిలుస్తాయి.

వాసవదత్తా కథ:

కామకలాకలాప చారు సున్దరీసున్దర స్తనకలశ ఘుసృణధూలిపరిమలామోదవాహీ –

కాశీఖండం:

ఈ క్షోణిన్ నినుఁబోలు సత్కవులు వేరీ! నేఁటి కాలమ్మునన్
దాక్షారామ చళుక్యభీమవర గంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయ గంధసార ఘుసృణ ద్వైరాజ్యభారంబు న
ధ్యక్షించుం గవిసార్వభౌమ! భవదీయప్రౌఢసాహిత్యముల్. (1-14)

మూలంలోని కుసుమపురారామ యువతీస్తనకలశఘుసృణధూళిపరిమళం కృతిభర్త వీరభద్రారెడ్డి శృంగారభావనను సాంద్రతరీకరించి శ్రీనాథుని ప్రౌఢసాహిత్యానికి దాక్షారామ కామినీ వక్షోజద్వయ గంధసార (చందనం) ఘుసృణ (కుంకుమ పువ్వుల) ద్వైరాజ్యభారాన్ని అప్పగించింది. రాజు కంటె కవిరాజు భోగం ద్విగుణీభూతం అయిందే కాని, గుణీభూతం కాలేదు.

ఆ మాటకు వస్తే, కుసుమపురారామంలోని ఈ కుంకుమ పువ్వుల సువాసన అంతకు మునుపే సామర్లకోట కుమారారామంలో వీచింది, చూడండి:

భీమేశ్వర పురాణం:

శ్రీఖండ ఘుసృణ మకరీ
రేఖాలంకార సుందరీ స్తనయుగ పా
ళీ ఖచిత భుజాంతరవిభ
వాఖండల! బెండపూడి యన్నామాత్యా! (2-1)

అని. సుబంధుని కాలానికింకా దేశంలో యోషామణుల భూషణాధ్యాయంలో శరీరంపై పత్రభంగ రచనల కొత్తవెలుగులు ప్రసరింపలేదు. సుబంధుని కాలానికి తర్వాత అవతరించిన ఈ పత్రభంగ చిత్రవిలేఖనాలను భట్టబాణాదుల రచనలలో చదువుకొన్న శ్రీనాథుడు తన కాలంనాటి పద్ధతులను కూడా పరిశీలించి – మూలంలోని సున్దరీ స్తనకలశ ఘుసృణ మాత్రాన్ని శ్రీఖండ (చందనంతోనూ) ఘుసృణ (కుంకుమ పువ్వులతోనూ దిద్దిన) మకరీ, రేఖా అలంకార (మొసలి రూపుగల రేఖలతోడి చిన్నెలున్న) సుందరీ స్తనయుగపాళిగా చిత్రిక పట్టాడు.

ప్రత్యక్షర శ్లేషవిన్యాస వైదగ్ధ్యనిధి అయిన సుబంధుని శ్లేషలలోనూ కొన్నింటిని గ్రహించి శ్రీనాథుడు తన కావ్యాలలో సందర్భవిదర్భంగా మార్చుకొన్న సన్నివేశాలున్నాయి:

వాసవదత్తా కథ: హరివంశై రివ పుష్కరప్రాదుర్భావ రమణీయైః.

భీమేశ్వర పురాణం: హరివంశంబునుం బోలె బలభద్ర ప్రద్యుమ్నానిరుద్ధ పురుషోత్తమాధిష్ఠితంబును. (3-18)

వాసవదత్తా కథ: సుధర్మా మివ స్వచ్ఛన్దస్థితకౌశికామ్.

భీమేశ్వర పురాణం:సుమనోవర్గంబు వలన సుధర్మాస్థానంబును. (1-110)

మొదలైనవి. సుబంధుడు హిరణ్యకశిపు రివ శమ్బరకులాశ్రయః అని చేసిన వింధ్యాద్రివర్ణనలోని శ్లేషాంశాన్ని పరిగ్రహించి సుబంధుని అనుకర్తలలో ప్రముఖీనుడైన వామనభట్టబాణుడు తన వేమభూపాలచరితం (పు.10) లో దానిని నృసింహలీలేవ ప్రథిత హిరణ్యకశిపుక్షయా అంటూ అద్దంకి పురవర్ణనకు ప్రసక్తింపజేశాడు. వామనభట్టబాణుని మాటెలా ఉన్నా, వేమభూపాలుని పైని గౌరవాతిశయం గల శ్రీనాథుడు భీమేశ్వరపురాణంలో ఆ వర్ణననే ముందుంచుకొని, నృసింహలీలాడంబరంబునుం బోలెఁ బ్రథితహిరణ్యకశిపుక్షయంబును (1-110) అని దానినే ఉన్నదున్నట్లు తెలుగుచేశాడు. శ్రీనాథుని ఈ శ్లేషాశ్లేషం మనసుకెక్కిన తెనాలి రామలింగకవి తన ఉద్భటారాధ్యచరిత్రము (1-16) లో కృతిపతి ఊరదేచయ్యకు మంత్రిపదవి నిచ్చిన నాదిండ్ల గోపరాజుకు అనువర్తింపజేసి – వరవిక్రమప్రౌఢి నరసింహుఁ డయ్యు నెపుడు హిరణ్యకశిపు స్ఫురణఁ గాంచి – అని అందంగా గుర్తుచేసుకొన్నాడు. వక్కలంక వీరభద్రకవి ప్రధానంగా శ్రీనాథ రామలింగ కవుల రచనలను చదువుకొన్నవాడు కాబట్టి, ఆ రెండింటినే కాబోలు ఆదర్శాలుగా ముందుంచుకొని తన వాసవదత్తా పరిణయం (1-171) లో కథానాయకుడైన కందర్పకేతుని తండ్రి చింతామణిమహారాజును వర్ణించే సందర్భంలో –

నరసింహమూర్తి యగు నా
కరుణాభరణుఁడు హిరణ్యకశిపుక్షేత్రా
దర దానగరిమ సదయ
త్వరిత ప్రహ్లాద దృష్టతా విస్ఫూర్తిన్.

అని ఆ శ్లేషనే మరికొంత కొమ్మలకు రెమ్మతొడిగాడు. మొత్తానికి కవులు నలుగురూ సుబంధునికి ఋణగ్రస్తులే అన్నది మనకు ప్రకృతార్థం.

ఇటువంటిదే, అంధకారనిర్వర్ణనసమయంలో సుబంధుడు ప్రవేశపెట్టిన రవిరశ్మిభస్మితనభోవన మషీరాశి రివ అన్న ఔపమ్యాన్ని గ్రహించి సూర్య శతకంలో మయూరుడు జ్యోత్స్నాంశాకర్షపాణ్డుద్యుతి తిమిరమషీశేషకల్మాషమ్ (శ్లోకం-26) అని జగచ్చిత్రాన్ని విలేఖింపగా, చిన్నారి పొన్నారి చిఱుఁతచీఁకటి చాయ యసలుకొల్పిన మషీరసము గాఁగ అని కాశీఖండం (1-23) లో మయూరునే అనుసరించిన శ్రీనాథుని అనుకూజితం.

సుబంధుని మూలానికి శ్రీనాథుడు కావించిన ప్రకృష్టమైన శబ్దానువాదానికి ఇంతకంటె మేలైన ఉదాహరణం మరొకటున్నది. వాసవదత్తా స్వయంవరప్రకటనకు మునుపు సుబంధుడు ఆమె మనోగతానికి ఉద్దీపకంగా వీచిన మలయానిలాన్ని వర్ణిస్తూ –

కన్దర్పకేలి సమ్పల్లమ్పట లాటీలలాటతట నికట ధమ్మిల్ల మల్లికామిలిత పరిమలసమృద్ధ మధురిమగుణః, కామకలాకలాప చారు సున్దరీసున్దర స్తనకలశఘుసృణధూలి పరిమలామోదవాహీ, రణరణకరసిత కాన్త కున్తలీ కున్తలోల్లాసన సఙ్క్రాన్త పరిమలమిలితాలిమాలా మధురతార ఝఙ్కార ముఖరిత నభస్తలః … – వాసవదత్తా కథ : దాక్షిణాత్య పాఠం

కన్దర్పకేలీ సమ్పల్లమ్పట లాటీలలాటతటలులితాలకధమ్మిల్లభార కుసుమపరిమలసమృద్ధ మధురిమగుణః, కామకలాకలాపనిపుణ కర్ణాటసున్దరీసున్దర స్తనకలశయుగలఘుసృణధూలిపటల పరిమలామోదవాహీ, రణరణసితాపరాన్త కాన్త కాన్తకున్తలీ కున్తలోల్లసిత సఙ్క్రాన్త పరిమలమిలితాలిమాలా మధురఝఙ్కార రవ ముఖరిత నభస్తలః … – వాసవదత్తా కథ : ఔత్తరాహ పాఠం

అని చిత్రించిన లలిత శృంగారదృశ్యమే, కాశీఖండంలో (1-92) రేవానది ఒడ్డున నారదమహర్షి దర్శించిన వింధ్యప్రాంతీయ వర్ణనచ్ఛందమై –

దరవికచ వకుళ కురవక
పరిమళ సంభారలోల బంభరమాలా
పరిషజ్ఝంకారధ్వని
తెరువరులకు మన్మథప్రదీపన మొసఁగున్.

అంటూ రూపాంతరితమయింది. కందర్పకేళిలంపటలైన లాటీలలామలను, కర్ణాటీసుందరీమణులను, అపరాంతకాంతలను సుబంధుడు ప్రస్తావింపగా, ‘తెరువరులకు మన్మథప్రదీపన మొసఁగున్’ అని శ్రీనాథుడు దానిని వ్యంగ్యంగా మార్చివేశాడు. పరిమలమిలిత అలిమాలా మధురతర ఝఙ్కార ముఖరిత నభస్తలః అన్న శబ్దమాధురికి వశంవదుడై, తాను కూడా పరిమళ సంభారలోల బంభరమాలా, పరిషత్ ఝంకారధ్వని అని పర్యాయానువర్తన చేశాడు. శ్రీనాథునికి ఆభిమానికాలైన ఇంకా ఎన్నో ప్రయోగాలు – జాగ్రత్తగా పరిశీలిస్తే, అనేకం సుబంధునివే అని గ్రహింపగలము. ఒక విధంగా శ్రీనాథుడే సుబంధునికి అనువాద సర్వస్వామ్యానుభవికుడు (Copy Right holder) అని చెప్పవలసి ఉంటుంది. సుబంధుడు సరస్వతీదత్తవరప్రసాదః అని తనను గూర్చి తాను చెప్పుకొంటే, దానినే శ్రీనాథుడు శృంగారనైషధంలో (1-13) బ్రాహ్మీదత్తవరప్రసాదుఁడవు అని కృతిపతి మామిడి సింగనార్యుని రౌచిక ప్రశంసితంగా అనువర్తించుకొన్నాడు. ప్రతిరోజూ చేతిలో సుబంధుని వాసవదత్తా కథ పుస్తకాన్ని పట్టుకొని, పాఠక్రమాన్ని వ్యాఖ్యానాలతో సంవదించుకొంటూ, తరచు సుబంధుడు ఆ సందర్భంలో అట్లా అన్నాడు, సుబంధుడు ఈ సందర్భంలో ఇట్లా అన్నాడు అని అందులో నుంచి మంచి మంచి కల్పనలను, తనకు నచ్చిన పదభావాలను తరచుగా ఉదాహరిస్తుండే యువకవిని చూసి – మహాపండితుడైన సింగనామాత్యుడు ఆ సుబంధుని ప్రాతిభోక్తిని అతనికే అన్వయించి చెప్పాడని మనము ఊహించుకోవాలి. అంత ఉద్ధతుడైన కవీ ఆ సుబంధుడు పెద్దలముందు తలవంచి, సుబన్ధు స్సుజనైకబన్ధుః అని తన వినయాతిశయాన్ని సూచిస్తే, గౌడ డిండిమభట్టవిజేత శ్రీనాథుడు కూడా అదే ధోరణిలో తన విద్వద్విధేయతను ప్రకటీకరించాడు. వినయవిధేయ శ్రీనాథ నామధేయ అని హరవిలాసంలోనూ, సుకవిజనవిధేయ శ్రీనాథ నామధేయ అని భీమేశ్వరపురాణంలోనూ, సుకవిజనవిధేయ శ్రీనాథ నామధేయ అని కాశీఖండంలోనూ ఆశ్వాస సమాపనగద్యలలో నిలిపి సుబంధురచితం పట్ల తనకు గల శ్రద్దధానతను చెప్పకనే చెప్పాడు. సుబంధు శ్లేషాధ్వనీనులలో ప్రథమగణ్యుడైన వామన భట్టబాణుడు కూడా తన వేమభూపాల చరితంలో –

ప్రతికవిభేదనబాణః కవితా తరు గగనవిహరణమయూరః
సహృదయలోకబన్ధు ర్జయతి శ్రీ భట్టబాణకవిరాజః. (శ్లో.6)

అని సుబంధుని దళాన్ని తులసీదళం వలె కన్నులకద్దుకొన్నాడు. సుజనైకబన్ధుః – సహృదయలోకబన్ధుః అన్నవి బంధువులే కదా.

సుబంధుడు అతిమనోహరంగా ప్రత్యక్షీకరించిన వసంతకాలాగమన కాథికతకు ముగ్ధుడై శ్రీనాథుడు తన భీమేశ్వరపురాణంలో దక్షారామంలో వసంతర్తువేళాసుమనోహరదృశ్యాలను సవ్యాఖ్యంగా తెలుగుచేసిన ఉదంతం ఆయన అనువాద దక్షతకు మరొక మేలైన ఉదాహరణ. సుబంధుడు కోమల మలయమారుతోద్భూత చూతప్రసవ సరసాస్వాద కషాయకంఠ కలకంఠ కుహరిత భరిత సకలదిఙ్ముఖః అని రూపుకట్టించిన పదచిత్రాన్ని అంతకు మునుపే మూలాతిరిక్తంగా శృంగారనైషధంలో ‘దమయంతీవిరహవర్ణనావసరాన లీలోద్యానంబునందు సరస రసాలకోమలకిసలయాస్వాదన కషాయకంఠ కలకంఠ కామినీ కుహూకారకోలాహలపంచమంబు వీతెంచిన’ (2-13) అని అనువదించి ఉండటం మూలాన, భీమేశ్వర పురాణాన్ని తెలుగుచేసేటప్పుడు కిసలయరసజిగ్రహిషా, వ్యసనాకుల పిక కుహూభవత్పంచమమై, (వసన్తకాల ఆజగామ) కుసుమ సమయావతారము, త్రసమింగము జగము ముంచె రాగాంబునిధిన్ (3-102) అంటూ కొంత సూక్ష్మంగా దానిని కుదించివేశాడు. ఈ రాగాంబునిధి కూడా సుబంధుని గుండెలలో ఉబికినదే మరి. ఇక్కడే కాక, సుబంధుడు వేరొక సందర్భంలోనూ ఈ రాగసాగర ప్రయోగాన్ని మరింత అందంగా చేశాడు. వాసవదత్తా ముఖసౌందర్యాన్ని అభివర్ణిస్తూ, ఆమె అధరపల్లవాన్ని రాగసాగర విద్రుమశకలేన ఇవ అధరపల్లవేన ఉపశోభమానాం అని ఆయన ఉపమింపగా, ఆ పోలికను మెచ్చిన భట్టబాణుడు, రాగసాగరతరఙ్గాభ్యా మి వోద్గతాభ్యాం విద్రుమలతాలోహితాభ్యా మధరాభ్యాం అంటూ కాదంబరీ సౌందర్యనిరూపణకు దానిని వినియోగించుకొన్నాడు. శ్రీనాథుడు వసంతఋతుసమాగమాన్ని కన్నులకు కట్టే శోభనసమయంలో ఆ రాగాంబునిధిని తెలుగునేలకు మళ్ళించాడు. ఆ పైని, మధుమదముదిత కామిని గణ్డూషసీధుసేక పులకితవకులః ప్రతిదిశ మశ్లీలప్రాయ గీయమాన శ్రవణోత్సుక ఖిఙ్గజనప్రాయ ప్రారబ్ధ చర్చరీ గీతాకర్ణన ముహ్యదనేక పథికశతః అని సుబంధుడు చేసిన పౌరకాంతావర్ణనను ముందుంచుకొని –

జాదర! జాద! రంచు మృదుచర్చరిగీతులు వారుణీ రసా
స్వాద మదాతిరేకమునఁ జంద్రిక కాయఁగ దక్షవాటికన్
వేదుల మీఁదటం గనకవీణలు మీఁటుచుఁ బాడి రప్సరల్
మోద మెలర్పఁగా భువనమోహనవిగ్రహు భీమనాథునిన్.

అని భీమేశ్వర పురాణంలో (5-103) భాషాంతరీకరించాడు. మూలంలోని అశ్లీలప్రాయ సాహిత్యరచనతో ఉన్న చర్చరీ గీతాలు భీమేశ్వరస్వామి సన్నిధానంలో అనౌచిత్యాపాదకాలు కాగలవని గ్రహించి, వారుణీ రసా, స్వాద మదాతిరేకమున అని దానిని మదాతిరేకతలో అంతర్భవింపజేశాడు. మధుమదముదిత లైన లౌకికస్త్రీలను అప్సరోవనితలుగా మార్చి, వారుణీ రసా, స్వాద మదాతిరేకతను మాత్రం ఉన్నదున్నట్లు కన్నులకు కట్టాడు. హర్షేఽప్యామోదవ న్మదః (నామలింగానుశాసనం), మదో గర్వే హ ర్షేభ దానయోః (విశ్వప్రకాశం) ఇత్యాది ప్రమాణాల వల్ల మదమంటేనే హర్షం గతార్థమైనందువల్ల (మదీ హర్షే అని ధాతుపాఠం) ముదితలు అనే పునరుక్తిని తొలగించి, దాని అతిరిచ్యతను మాత్రం వాచ్యం చేశాడు. ఎటొచ్చీ శృంగారప్రియుడే కనుక మూలంలోని ప్రకాశ్యార్థాన్ని విడిచిపెట్టలేక, జాదర! జాద! రంచు మృదు చర్చరిగీతులు అన్న మాటతో ఆ తీక్ష్ణతను తొలగించి – అతీక్ష్ణతను (మృ ద్వతీక్ష్ణే చ కోమలే అని హైమకోశం) విశేషకంగా నిలిపి, అశ్లీలప్రాయ చర్చరీ గీతలలోని అసభ్యతను సంస్కరించివేశాడు. అసలు చర్చరీ గీత లక్షణంలోనే అతివేలమైన శృంగారప్రకాశం ఉన్నందువల్ల మద్యపానము అనే హేతూద్ధారంతో దానిని సమర్థించాడు. ఈ విధంగా మరొక్కసారి సుబంధునియెడ తనకు గల అభిమానాన్ని జ్ఞాపకం చేశాడు.

ఇవికాక, వాసవదత్తా కథలోని చంద్రబింబానువర్ణన భాగాన్ని శ్రీనాథుడు స్వీయేచ్ఛానుసారంగా తెలుగుచేసిన పద్యఖండాలు భీమేశ్వర పురాణంలో కమనీయంగా అమరాయి:

వాసవదత్తా కథ: ప్రాచీకుమారీ లలాటతటఘటిత కుఙ్కుమతిలకబిన్దౌ.

భీమేశ్వర పురాణం: ప్రథమసంధ్యాంగనా ఫాలభాగంబునఁ జెలువారు సిందూరతిలక మనఁగ. (2-49)

వాసవదత్తా కథ: కనకదర్పణ ఇవ ప్రాచీవిలాసిన్యాః.

భీమేశ్వర పురాణం: కైసేసి పురుహూతు గారాపు టిల్లాలు పట్టిన రత్నదర్పణ మనంగ. (2-49)

మొదలైనచోట్ల ఈ అనువాదం మూలాతిశాయికంగా ఉన్నది. ప్రాచీకుమారి అనటం కంటె ప్రథమసంధ్యాంగన అన్నందువల్ల కల్యాణాంగత్వం ప్రస్ఫుటమై సౌభాగ్యాతిశయం ధ్వనిస్తున్నది. దర్పణానికి రత్న సువర్ణాదుల ధర్మావబోధకత్వం సుప్రసిద్ధమే కాని, ప్రాచీవిలాసిని అన్నప్పటి కంటె పురుహూతు గారాపు టిల్లాలు అనటం వల్ల అనువాదంలో దంపతీ శృంగార భావానురక్తి, తెలుగు నుడికారపు సొంపు అందంగా కొలువుతీరాయి. సుబంధుని మూలంలోనే –

అనన్తరం… శ్వేతాతపత్ర మివ మకరకేతోః… స్ఫాటికలిఙ్గ మివ గగనమహాతపసస్య… పుణ్డరీక మివ గగనగామిగఙ్గాయాః… భగవా నుడుపతి రుజ్జగామ

అని ఉన్న రూపణను స్వీకరించి, అపహ్నావారోపాలతో శ్రీనాథుడు చెప్పగా (భీమ. 2-42) నలుగురి గుండెల్లో గుడికట్టుకొన్న పద్యం ఇది:

కాదుకా దుదయాద్రి కనకకూటం బిది, డంబైన పానవట్టంబు గాని
కాదు కా దిది సుధాకరపూర్ణబింబంబు, కాశ్మీర శంభులింగంబు గాని
కాదుకా దుదయరాగప్రకాశం బిది, నవకుంకుమాలేపనంబు గాని
కాదు కా దిది కళంకచ్ఛటారించోళి, పూజచేసిన కల్వపువ్వు గాని

యనఁగ సప్తార్ణవములు మి న్నందికొనఁగఁ
జంద్రకాంతోపలంబులు జాలువాఱ
నసమశరసార్వభౌము ముత్యాలగొడుగు
విధుఁడు విశ్వంబు వెన్నెల వెల్లిఁ దేల్చె.

ఇందులో శ్వేతాతపత్ర మివ మకరకేతోః – అసమశరసార్వభౌము ముత్యాల గొడుగు; పుణ్డరీక మివ – పూజచేసిన కల్వపువ్వు; స్ఫాటికలిఙ్గ మివ – కాశ్మీర శంభులింగంబు అన్నవి స్వచ్ఛానువాదాలు. తక్కినదంతా స్వేచ్ఛానువాదం. శ్రీనాథుని ఈశ్వరార్చనకళాశీలానికి పట్టిన ముత్యాల గొడుగిది. ఆయన కాదుకా దుదయాద్రి కనకకూటం బిది, డంబైన పానవట్టంబు గాని అని చంద్రునికి ఉదయపర్వతం పానవట్టమై గోచరించిన కల్పనను పురస్కరించుకొని మహాకవి ధూర్జటి పెంపుచేసి, తన కాళహస్తిమాహాత్మ్యములో అద్భుతావహమైన ఈ పద్యాన్ని వ్రాశాడు:

ఉదయగ్రావము పానవట్ట, మభిషేకోదప్రవాహంబు వా
ర్ధి, దరధ్వాంతము ధూపధూమము, జ్వలద్దీపప్రభారాజి కౌ
ముది, తారానివహంబు లర్పితసుమంబుల్ గాఁ దమోదూరసౌ
ఖ్యదమై శీతగభస్తిబింబశివలింగంబొప్పెఁ బ్రాచీదిశన్.

అని. సూక్షపరిశీలన కావిస్తే శ్రీనాథుని ఇతరకృతులలోనూ సుబంధుని వాసవదత్తా కథ నుంచి లెక్కలేనన్ని అనువాదాలు కనుపిస్తాయి:

వాసవదత్తా కథ: జరత్తరుకోటర కుటీర కుటుమ్బినికౌశికకులే.

కాశీఖండం: జరత్తరుకోటర జఠరలుఠత్. (2-148)

వాసవదత్తా కథ: శేఫాలికా శిఫావివర విస్రబ్ధవర్తమానగౌధేయరాశినా.

కాశీఖండం: శేఫాలికా కుసుమకేసరరజఃప్రసరధూసర వాసరకర కరవ్రాతంబును. (2-148)

వాసవదత్తా కథ: కులిశశిఖర ఖరనఖరప్రచయ ప్రచణ్డ చపేతపాటిత మత్తమాతఙ్గ.

కాశీఖండం: ఉగ్రతర శరభ చటుల చపేటపా[?టి]త మోహిత రోహితంబును. (2-148)

వంటివి ఆంతరతమ్యాలు అనేకం కనబడతాయి.కాశీఖండం ముద్రితప్రతులలో ‘ఉగ్రతర శరభ చపేట పాత’ అని ఉన్నచోట అర్థావగతి ప్రకారం సుబంధుని మూలాన్ని అనుసరించి, ‘ఉగ్రతర శరభ చటుల చపేట పాటిత’ అని సరిదిద్దుకోవాలి. వాసవదత్తా కథను కన్నడంలోకి అనువదించిన మహాకవి నేమిచంద్రుడు తన లీలావతీ ప్రబంధంలో ఈ వాక్యాన్ని స్వీకరింపలేకపోయిన లోపాన్ని పూరించటానికో ఏమో గాని, ఆ తర్వాత చెప్పిన అర్ధనేమి పురాణం (3-47) లో దీనిని నేమినాథుని ప్రథమజన్మవృత్తాంతవేళ కల్పనకు పురస్కరించుకొన్నాడు:

గిరి గురు చపేట పాటిత
కరియం హరికొండు కీఱి పాఱువు దరుణా
త్యరుణ తను తరుచరేంద్రం
శరధిగె కర్బిట్టవెత్తి పాఱువ తెఱదిం.

అని. కన్నడ వాఙ్మయాభిమానులు గుర్తింపవలసిన అంశం కనుక ఇక్కడ పేర్కొన్నాను. నేమిచంద్రుడు గురు చపేట పాటిత మత్తమాతఙ్గః అన్న దళాన్ని ఉన్నదున్నట్లు గురు చపేట పాటిత కరియం అని కన్నడీకరించాడు.

ఇక, శ్రీనాథానంతరయుగీనులలో సుబంధుని స్మరించిన మహాకవులలో అరుణాచల పురాణ కర్త పెదపాటి సోమనాథుడు, విక్రమార్కచరిత్ర నిర్మాత జక్కన స్మరణీయులు. ఆయన పదసంపదను, ఊహల పోహళింపును సంస్కృతంలో నుంచి సగౌరవంగా అనువదించటమే గాక, ‘సకల నిపీత నిశాతిమిరసంఘాత మతితనీయ స్తయా సోఢు మసమర్థే ష్వివ కజ్జలవ్యాజా దుద్వమత్సు’ అన్న భావానికి

బహుళ జలప్లవమాన
ద్రుహిణాండము చెమ్మ యుఱికి రూక్షార్కవిభా
రహితతఁ గాటుకపట్టెను
రహి చెడి యన నంధతమసరాసులు బెరసెన్.

అంటూ మనుచరిత్రలో (3-18) చిత్రిక పట్టిన అల్లసాని పెద్దనగారు అవతారికలో ‘వచశ్శుద్’ కోసం సుబంధుని ప్రస్తుతించారు. శ్రీనాథుడు వాసవదత్తా కథలోని ‘కున్తలీ కున్తలోల్లాసన సఙ్క్రాన్త పరిమల మిలితాలిమాలా మధురతరఝఙ్కార ముఖరితనభస్తలః’ అన్న సుబంధుని చిత్రశిల్పానికి ఆకర్షితుడై కాశీఖండంలో (1-92):

దరవికచ వకుళ కురవక
పరిమళసంభారలోల బంభరమాలా
పరిషజ్ఝంకారధ్వని
తెరువరులకు మన్మథప్రదీపన మొసఁగున్.

అని అనువదించిన పద్యాన్నే ఆదర్శంగా నిలుపుకొని పెద్దన్నగారు ప్రవరుడు హిమవన్నగోపాంతభూములపై అడుగుపెట్టిన (2-6) సన్నివేశంలో –

ఉల్లలదలకా జలకణ
పల్లవిత కదంబముకుళ పరిమళలహరీ
హల్లోహల మదబంభర
మల్లధ్వను లెసఁగ విసరె మరుదంకురముల్.

అని హృద్యంగా ఆవిష్కరించాడు. సుబంధుడు కుంతలదేశకాంతలు తమ వేణీబంధాలలో ముడిచిన పువ్వుల సువాసనకు మత్తెక్కిన తుమ్మెదలని వ్యంజింపజేయగా, శ్రీనాథుడు విరిసిన పొగడ విరులూ గోరింట పూవుల సుగంధానికి లోగిన తుమ్మెదల మదోన్మాదం బాటసారులకు కామోద్దీపకం అయిందని వింధ్యవర్ణనలో ఆ వ్యంజనను మరింత మోహకంగా తీర్చిదిద్దాడు. పెద్దన గారు అలకానదీ జలకణాల చల్లని స్పర్శతో విప్పారి ప్రియునితో సమాగమానికి ఉన్ముఖంగా ఉన్న నాయిక వలె భాసించిన కడిమిపూమొగ్గపై మరులుగొన్న గండుతుమ్మెదల మధుర ఝంకారనాదాన్ని మోసికొనివస్తున్న పిల్లగాలులను వర్ణించి వరూధినీ మనోగతానికి ఉద్దీప్తిని ప్రతిపాదించారు. అంతతితో తనివితీరనందువల్ల కాబోలు, మళ్ళీ ఆ భావాన్నే తీసికొని –

బహురత్నద్యుతిమేదురోదర దరీభాగంబులం బొల్చు ని
మ్మిహికాహార్యమునం జరింతు మెపుడుం బ్రేమన్ నభోవాహినీ
లహరీ శీతలగంధవాహపరిఖేలన్మంజరీ సౌరభ
గ్రహణేందిందిర తుందిలంబు లివి మత్కాంతారసంతానముల్.

అని ఆ మదోన్మత్తభ్రమరికలను వరూధిని వచోమణిసంహతిలో (2-45) ప్రకాశింపజేశారు. పిండిప్రోలు లక్ష్మణకవి తమ లంకావిజయ ద్వ్యర్థికావ్యంలో (పీఠిక 1-17) ‘సరసమనోహరాంచత్ప్రబంధు సుబంధు’ అని సవిశేషంగా పేర్కొనటంతో తృప్తిచెందక, కథావశాన ఒకచోట – 1) సీతాదేవిని విడిచిపెట్టమని విభీషణుడు అన్నగారికి హితోపదేశం చేసిన సందర్భంలోనూ 2) లంకాపరిత్యాగం చేయమని కవి తనకు ప్రతికూలుడైన దమ్మనకు బోధించిన సందర్భంలోనూ –

బాణుని, భారవిన్, ఘనసుబంధుని, నా భవభూతి, గీ
ర్వాణపదంబులం గొనినవారిఁ ద దన్యుల విందుమే కదా!

అని (2-115)లో శ్లేషవశాన ఏకత్రించి మరొక్కసారి ఆయన పేరును తలచుకొన్నారు. పద్యార్థం ఇది: భారవిన్ = కాంతికి సూర్యుని వంటివానిని, ఘనసుబంధుని = గొప్పవారైన మంచి చుట్టాలు కలిగినవానిని, ఆ భవభూతిన్ = ఆ పరమేశ్వరుని దయచే సర్వైశ్వర్యాలు కలిగినవానిని, గీర్వాణపదంబులన్ = సర్వదేవతాస్థానములను (వారి అధికారాలను), కొనినవారిన్ = అపహరించినవారిని, బాణునిన్ = బాణాసురుని వంటి, తత్+అన్యులన్ = ఇంకా ఇతరులను గురించి, విందుమే కదా = (తప్పులు చేసి పతనమైనవారిని గురించి) వింటున్నాము కదా – అని విభూషణుడు సీతాదేవిని శ్రీరామునికి అర్పింపమని రావణునితో అంటున్నట్లుగా రామాయణపరమైన అర్థం. గీర్వాణపదంబులన్ = సంస్కృతభాషలో వెలసిన అన్ని పదాలను, కొనినవారిన్ = స్వీకరించినవారిని (ప్రయోగించినవారిని), బాణునిన్ = కాదంబరీ హర్షచరితాది బహుళకృతులను రచించిన భట్టబాణుడనే పేరుగల మహాకవిని, భారవిన్ = కిరాతార్జునీయ కావ్యనిర్మాత అయిన భారవి మహాకవిని, ఘనసుబంధునిన్ = వాసవదత్తా కథను రచించి గొప్పవాడని పేరుగడించిన సుబంధుడనే మహాకవిని, ఆ భవభూతిన్ = ఉత్తరరామచరిత మహావీరచరిత మాలతీమాధవ మహాగ్రంథాలను వినిర్మించిన భవభూతి మహాకవిని, తత్+అన్యులన్ = ఇంకా వారికంటె ఇతరులైన మహాకవులు ఎంతమందిని గురించో, విందుమే కదా = (గొప్ప గొప్ప కవులను గురించి, వారి మహిమలను గురించి) వింటున్నాము కదా – అని పిండిప్రోలు లక్ష్మణకవి యొక్క లంకా మాన్యాన్ని దమ్మన అపహరించినప్పుడు – ఆ చేసిన తప్పును సరిదిద్దుకోమని దమ్మనతో అతని తమ్ముడు భద్రయ్య రావణునికి విభీషణుని వలె హితోపదేశం చేస్తూ – అటువంటివారితో పెట్టుకోవద్దని లక్ష్మణకవి గొప్పదనాన్ని గురించి వర్ణించే సందర్భంలో అర్థం.

ఇక్కడ కూడా వాసవదత్తా కథలోని ‘సుబన్ధు స్సుజనైకబన్ధుః’ అన్న దళమే శ్లిష్టార్థమై ‘ఘనసుబంధుని’గా (గొప్ప చుట్టాలు కలిగినవానిగా అని, లేదా – గొప్పవారందరూ ఈయన మా బంధువు అని గర్వంగా చెప్పుకొనేంత గొప్పవానిగా) అవతరించిన విషయం గమనింపదగినదే.

ఇవి గాక, సుబంధుడు ఛందశ్శాస్త్రంలోని వృత్తనామాలను కథార్థానికి అన్వయిస్తూ సందర్బానుసారం చమత్కారికగా చెప్పిన – యశ్చ కుసుమవిచిత్రాః వంశపత్త్రపతితాభిః సుకుమారలలితాభిః పుష్పితాగ్రాభిః శిఖరిణీభిః ప్రహర్షిణీభి ర్దర్శితానేకవృత్తవిలాసః – అన్నదానిని మూదలించి కట్టా వరదరాజు శ్రీరంగమాహాత్మ్యం దశమాశ్వాసంలోనూ, అహోబిలపండితుడు కాళిందీకన్యా పరిణయం (1-56) లోనూ, గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం (1-2) లోనూ; ఈషద్భేదంతో కొరవి గోపరాజు సింహాసన ద్వాంత్రిశిక (5-54) లోనూ అనుకృతులను వ్రాశారు. కావ్యకథావశాన వనవర్ణనకు, నాయికా సౌందర్యవర్ణనకు, ఇతరప్రతీకలకు ఈ వృత్తనామాలను ప్రకృతాప్రకృతంగా పరికరింపజేసిన కవులు ఇంకా ఎందరో ఉన్నారు.

ఇక, ప్రబంధకవులలో సాహిత్యరసపోషణకు, కోమలపదలీలకు సాటిలేని ‘వాణీ గురుత్వ మహత్త్వ ఖని’ అని పేరుపొందిన రామరాజభూషణుని వలె సుబంధుని రచనను స్వాయత్తీకరించుకొని, స్వతంత్రవ్యక్తిత్వాన్ని సంతరించుకొన్న తెలుగు కవి వేరొకరు లేరనే చెప్పవచ్చును. శ్లేషవిన్యాసవైదగ్ధ్యనిధిత్వంలో సుబంధునికి సాటిరాగలిగి, ఆధ్యాత్మికభావసౌగంధ్యం వల్ల సుబంధునికంటె మేటి కాగలిగిన మహాత్ముడు ఆయన. శ్లేషమూలకాలైన ఉత్ప్రేక్షా రూప కాతిశయోక్తులకు, శ్లేషానుప్రాణితములైన వివిధాలంకారాల సంసృష్టికి, అనర్ఘమైన వస్తుధ్వనికి ఆలవాలమైన ఆయన కవితావ్యక్తి బాణసుబంధుల మహాప్రభావం మూలాన అనన్యసాధ్యమైన అర్థగౌరవాన్ని సంతరించుకొన్నది. సుబంధుడు బీజమాత్రాలుగా నిలిపిన మహార్థాలను ఆయన శాఖోపశాఖలకు విస్తరింపజేసి వసుచరిత్రమనే కల్పవృక్షాన్ని రసజ్ఞుల హృదయాలలో చిరత్నంగా నిక్షేపించాడు. నాయికానాయకుల ప్రథమసమావేశం నాడు ఉపనిషద మివ సానన్దాత్మక ముద్యోతయన్తీం వాసవదత్తాం దదర్శ అని సుబంధుడు ప్రవేశపెట్టిన పవిత్రమైన ఆర్షోపమానం వసుచరిత్ర (2-14) లో భక్తాగ్రేసరుడైన రామరాజభూషణుని అమృతలేఖినిలో ప్రాణకళను దిద్దుకొన్నది:

వీనుల విందై యమృతపు
సోనల పొందై యమందసుమచలదళినీ
గానము క్రందై యా రవ
మానందబ్రహ్మమైన నధిపతి పల్కెన్.

అంటూ అమలోదాత్తంగా రూపొందింది. సుబంధుడు కందర్పకేతునికి వాసవదత్త శ్రుతిశిరస్సీమంతమైన బ్రహ్మవిద్యోపనిషత్తు వలె ఆనందపరబ్రహ్మస్వరూపిణియై కానవచ్చినట్లు వర్ణింపగా – రామరాజభూషణుడు వసురాజుకు భ్రమరీగానసమానమైన గిరికయొక్క అమృతగానం ఆనందపరబ్రహ్మస్వరూపమై వినవచ్చినట్లుగా చిత్రీకరించాడు. చిమ్మచీకటిలో మిలమిలలాడుతున్న తారకలను సుబంధుడు ‘వియదమ్బురాశిఫేనస్తబకా ఇవ’ అని ఉపమింపగా, ‘పెల్లుబ్బు నిర్లు పెన్వెల్లి నెల్ల పదార్థములు మనఁ బొడము బుద్బుదము లనఁగ’ అని రామరాజభూషణుడు ఉత్ప్రేక్షించాడు. ఆయన కవితాసరస్సులో విహరించేవారికి ఇటువంటి చిత్రౌపమ్యాలు తామరతంపరగా అగుపించటంలో ఆశ్చర్యం ఉండదు.

ఈ విధంగా ఆంధ్రదేశంలో అవిరళప్రచారానికి నోచుకొన్న సుబంధుని మహనీయకృతికి ప్రప్రథమాంధ్రానువాదాన్ని వెలయించిన గౌరవం క్రీస్తుశకం 1560 ప్రాంతాల తెనాలి రామలింగకవికి దక్కింది. ఆ తర్వాత దీనిని క్రీస్తుశకం 17వ శతాబ్ది నాటి వక్కలంక వీరభద్రకవి, 1899లో రొద్దము హనుమంతరావు తెలుగుచేశారు.

వాసవదత్తలోని కథాంశం చిన్నదయినా, కావ్యమంతా అడుగడుగున అచ్చెరువు గొలిపే విద్వత్కర్ణరసాయనవర్ణనాపూర్ణంగా రూపుదిద్దుకొంది. ఊపిరి సలుపనీయని కథనవేగంతో సుబంధుడు రౌచికులకు మెచ్చుగొలిపే వినూత్నమైన శైలిని కదనుతొక్కించాడు. అది పూర్తిగా కవి స్వీయకపోలకల్పితమే కాని అన్యాధారితం కాదని విమర్శకులు నిశ్చయించారు. అత్యంత ప్రామాణికమైన The Sanskrit Drama in its Origin, Development, Theory and Practice గ్రంథంలో ఎ.బి. కీథ్ దీనిని స్వతంత్రకృతి అనే నిర్ధారించారు. వస్తువిస్తారం అంతగా లేకపోయినా అరమరిక లేని దృశ్యీకరణకౌశలం, తనకు బోధ్యమానమైన సమస్తాన్నీ పాఠకులకు అందజేయాలనే అహమహమిక మనకు సమ్మోహకంగా ఉంటాయి. రాజాస్థానాలను అద్ధావాగ్విబుధం కావించే ఆ మహారచన మనోమందిరంలో సుప్రతిష్ఠితమైనాక, కావ్యసుఖసంగమలీలకు ఉత్సహించే తెనాలి రామలింగకవి వంటివారు ఆంధ్రీకరణకు ఉత్సవించటం సహజమే. సుబంధుని రచన అత్యంత సంక్షేపరూపం కాబట్టి రామలింగకవి దానిని సమకాలిక ప్రబంధోచితమైన ప్రణాళికతో తన ఇతరకావ్యాలలో వలె హృద్యమైన సంవాదకల్పనతో నానాపాత్రప్రవేశనిష్క్రామకంగా విస్తరింపజేసి ఉంటాడు. మూలంలో గృహీతోన్ముక్తంగా పొడమిన భావసంపుటికి రసవదర్థవిస్తారంతో సౌభాగ్యాన్ని అలవరించి ప్రబంధానికి ఇంపుసొంపులను కూర్చివుంటాడని ఊహింపవచ్చును. కథానాయకుడైన కందర్పకేతుడు వాసవదత్తను కలలో చూసి, ఆమెకోసం చింతామగ్నుడైనప్పుడు అతని ఇష్టసఖుడు మకరందుడు అక్కడికి వచ్చి అతని పరధ్యానానికి కారణమేమిటో చెప్పమని అడుగుతాడు. అప్పుడు కందర్పకేతుడు మకరందునికి తన చిత్తస్థితిని వివరించిన సన్నివేశంలోని మాటలివి:

…(కథ మపి స్మరప్రహారపరవశః పరిమితాక్షర మువాచ). వయస్య! దితి రివ శతమన్యుసమాకులా భవతి సజ్జనచిత్తవృత్తిః. నా య ముపదేశకాలః పచ్యన్త ఇ వాఙ్గాని. క్వథ్యన్త ఇ వేన్ద్రియాణి. భిద్యన్త ఇవ మర్మాణి. నిస్సర న్తీవ ప్రాణాః. ఉన్మూల్యన్త ఇవ వివేకాః. న ష్టేవ స్మృతిః. త దధునా యది త్వం సహపాంసుక్రీడిత సమదుఃఖసుఖోఽపి తదా మా మనుగచ్ఛ…

ఈ భాగానికి రామలింగకవి అనువాదం ప్రసన్నపదబంధంతో గంభీరార్థనిగుంఫితంగా అలరారింది. పూర్వాపరాలను ఎంతో జాగ్రత్తగా గమనిస్తే గాని ఇది అనువాదమని గుర్తించటం కష్టం. ఆ పద్యాన్ని చూడండి:

అ క్కమలాక్షిఁ గన్గొనినయప్పటి నుండియు నేమి చెప్ప! నా
కెక్కడఁ జూచినన్ మదనుఁ, డెక్కడఁ జూచిన రోహిణీవిభుం,
డెక్కడఁ జూచినం జిలుక, లెక్కడఁ జూచినఁ గమ్మగాడ్పు, లిం
కెక్కడ వెట్ట యోర్వఁగల నీ విరహానల తాపవేదనన్.

ఇది పెదపాటి జగన్నాథకవి సంకలనించిన ప్రబంధరత్నాకరము ద్వితీయాశ్వాసంలో 95వదిగా ఉదాహరింపబడి ఉన్నది. మూలంలో నిస్సర న్తీవ ప్రాణాః (ప్రాణాలు పోతున్నట్లుగా ఉన్నది), క్వథ్యన్త ఇవ ఇన్ద్రియాణి (ఇంద్రియాలు ఆర్చుకుపోతున్నట్లుగా ఉన్నాయి), భిద్యన్త ఇవ మర్మాణి (లోలోపల చీల్చివేస్తున్నట్లుగా ఉన్నది) – ఇత్యాదిగా వివక్షిత అన్యపరవాచ్యమైన అభిధామూలధ్వని తెలుగులో ఎక్కడఁ జూచినఁ గమ్మగాడ్పులు, ఎక్కడఁ జూచిన రోహిణీవిభుండు, ఎక్కడఁ జూచినం జిలుకలు అని కవినిబద్ధమైన వక్తృప్రౌఢోక్తిసిద్ధ – అర్థమూల – అలంకారధ్వనిగా సుసంస్కృతమై వన్నెమీరుతున్నది. ఎంతో జాగ్రత్తగా పరిశీలించితే గాని –

నిస్సర న్తీవ ప్రాణాః – ఎక్కడఁ జూచినఁ గమ్మగాడ్పులు
క్వథ్యన్త ఇవ ఇన్ద్రియాణి – ఎక్కడఁ జూచిన రోహిణీవిభుండు
భిద్యన్త ఇవ మర్మాణి – ఎక్కడఁ జూచినం జిలుకలు

వంటివి సమసంస్కృతాలుగా తెలుగుచేయబడినవని ప్రథమదృష్టికి స్ఫురించటం కష్టమే కాని, విరహోద్వేజనం వల్ల గాడ్పులకు ప్రాణభంజకత్వం, చల్లదనాన్ని ప్రసాదించే రోహిణీవల్లభునికి క్వథనగుణం, శ్రుతిసుభగాలైన చిలుక పలుకులకు కఠోరత అన్నవి ఉపాలంభనవిషయాలై ఆక్షేపతిరస్కృతాలు కావటం ప్రసిద్ధమే కదా. రోహిణీవల్లభాది స్మరణం విరుద్ధకార్యోద్భావమైన ఇంద్రియక్వథనంగా పరిణమించటం ఇక్కడ అనువాదంలోని విశేషం. మూలంలో కేవలానుభవనీయమై నిర్విశేషంగా ఉన్న కథనాన్ని అననురూపసంసర్గాత్మకం చేసి విరోధాన్ని గర్భీకరించటం మూలాన ప్రబంధార్థం వ్యంగ్యవ్యంజకతను సంతరించుకొన్నది. పద్యాంతంలో ఇం, కెక్కడ వెట్ట యోర్వఁగల నీ విరహానల తాపవేదనన్ అన్న వినిర్దేశం వల్ల అంతవరకు గమ్యమానంగా ఉన్న విరూపకార్యోత్పత్తి వాచ్యమై, మూలానికి వ్యాఖ్యానప్రాయంగా అమరింది. విరహావస్థాలోలుడైన నాయకునికి సత్త్వత్యాగాన్ని చిత్రించి ధీరోదాత్తతకు భంగాన్ని కలిగించటానికి మారుగా ప్రియావియోగజనితమైన దైన్యాన్ని అన్యాపదేశవచోరూపాన వ్యజ్యమానం చేయటమే సముచితంగా ఉన్నది.

ఈ పద్యరచనావేళ రామలింగకవి మనస్సులో అనంతామాత్యుని భోజరాజీయంలో సంపాతి నరేంద్రుని కుమార్తె పుష్పగంధి వసంతకాలం రాగానే చెలికత్తెలతో ఉద్యానవనంలోకి అడుగుపెట్టిన సన్నివేశం మనస్సులో ఉన్నది కాబోలు. వర్ణ్యవిషయం వేరయినా, పద్యాల ఎత్తుగడ ఒకటే.

అనంతుని పద్యం –

ఎక్కడఁ జూచినం జిలుక, లెక్కడఁ జూచినఁ గోకిలమ్ము, లే
చక్కటిఁ జూచినన్ సమదషట్పదసంఘము, లెందుఁ జూచినం
జొక్కపు శారికల్ ఋతువు సొంపు నుతింప వశంబె! పువ్వుఁదే
రెక్కిన పంచసాయకుఁడు యెద్దెసఁ జూచిన న వ్వనంబునన్.

అని. తంజావూరులో ఉన్న ప్రబంధసారశిరోమణిలోనూ (అక్కడి పద్యసంఖ్య 236), మానవల్లి రామకృష్ణకవి ప్రకటించిన ప్రబంధమణిభూషణములోనూ (అందులోని పద్యసంఖ్య 251) ఎవరు రచించినదో, ఏ కావ్యంలోనిదో తెలియని ఇటువంటిదే, పద్యం ఒకటున్నది:

ఎక్కడఁ జూచినం జిలుక, లెక్కడఁ జూచినఁ గోకిలంబులు,
న్నెక్కడ నైనఁ బుష్పముల నేఁచి సుడిన్ భ్రమియించు తుమ్మెదల్,
వెక్కసమయ్యె నామని సవిస్తరసంపద నేమి చెప్పుదున్!
ఱెక్కలతేజి పుప్పొడులు రేఁగి వసంతము లాడె నయ్యెడన్.

ఈ రెండు పద్యాలలోనూ వసంతఋతువు సౌభాగ్యమే వర్ణ్యవిషయం. అంతేకాక రెండింటిలోనూ మొదటి పాదం ఏకరూపంగానే ఉన్నది. విషయవిభేదంతోపాటు రామలింగకవి రచనలోని ధ్వన్యధ్వన్యతను కూడా చూడవచ్చును. ఈ ముగ్గురు కవుల పద్యశిల్పానికి ఆద్యప్రకృతి శ్రీనాథుని భీమేశ్వర పురాణంలో (3-23) కనబడుతుంది:

ఎక్కడఁ జూచినన్ సరసి, యెక్కడఁ జూచిన దేవమందిరం,
బెక్కడఁ జూచినం దటిని, యెక్కడఁ జూచినఁ బుష్పవాటికం,
బెక్కడఁ జూచినన్ నది – మహీవలయంబున భీమమండలం
బెక్కడ? నన్యమండలము లెక్కడ? భావన చేసి చూచినన్.

అగస్త్యుడు వేదవ్యాసుని మనఃఖేదాన్ని అనునయింపగోరి గోదావరీతీరాన నెలకొన్న భీమమండలం మహిమను అభివర్ణించిన ఈ పద్యశిల్పాన్ని మనస్సులో ప్రతీకగా నిలుపుకొన్న రామలింగకవి కందర్పకేతు విలాసానికి మునుపే చెప్పిన తన ఉద్భటారాధ్య చరిత్రలో సైతం ప్రమథేశ్వరుడు వారాణసీ పుణ్యక్షేత్రంలోని విశ్వేశ్వరాలయాన్ని సందర్శించిన ఘట్టంలో దీనినే అనుసరించాడు:

ఎక్కడఁ జూచినం బ్రమథు, లెక్కడఁ జూచిన యోగిమండలం,
బెక్కడఁ జూచినన్ ఖచరు, లెక్కడఁ జూచిన సిద్ధయౌవతం,
బెక్కడఁ జూచినన్ సుకృతు, లెక్కడఁ జూచిన మూర్తితోడఁ బెం
పెక్కిన వేదముల్ గలిగి యెల్ల సమృద్ధులఁ దేజరిల్లుచున్.

ఈ విధంగా సుబంధుని వాసవదత్తా కథకు యథావదనువాదం కావటం వల్ల, పద్యపు పోకడను బట్టి పైని ఉదాహరించిన అ క్కమలాక్షిఁ గన్గొనినయప్పటి నుండియు నేమి చెప్ప! అన్న పద్యం తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసంలోనిదే అని నిశ్చయింపబడుతున్నది.

ఇదే సన్నివేశంలో తెనాలి రామలింగకవికి తర్వాత సుబంధుని రచనను ఆంధ్రీకరించిన వక్కలంక వీరభద్రకవి తన వాసవదత్తా పరిణయము (1-231) లో కొంచెం ఇంచుమించుగా చేసిన అనువాదం కూడా పరిశీలింపదగినదే:

కన్నులఁ గట్టినట్ల పొడకట్టెడుఁ గన్నియ చిన్నెలెల్ల నా
కన్నియు; నేమనం దగు హృదంతరతాపము దీఱఁ గూర్మితో
న న్నలినాయతాక్షి మధురాధరబింబసుధారసంబు నా
కెన్నటికైనఁ గల్గు నొకొ? యీ జననంబునకున్ ఫలంబుగన్.

ఈయనకు రామలింగకవి వలె శబ్దచిత్రాలపై అంతగా అభిమానమూ, ఆ విధమైన సౌందర్యదృష్టీ లేనందువల్ల కథాకథనాన్ని ప్రధానంగా పెట్టుకొని కావ్యాన్ని త్వరితగతిని లాగివేశాడు. ప్రత్యేకించి చదివినప్పుడు బాగున్నట్లే ఉంటుంది కాని, మహాకవి రచనతో పోల్చిచూసినప్పుడు మాత్రం సాటిరాదనిపిస్తుంది.

(ఇంకా ఉంది)

జ్ఞాపికలు
1. జీయా ద్గద్యసుధాధున్యాః సుబన్ధుః ప్రభవాచలః
య ద్భఙ్గాశ్లేష మాసాద్య భఙ్గః కవిభి రాశ్రితః.

భంగాశ్లేషమనే వైశిష్ట్యవశాన గొప్పగొప్ప కవులకు కూడా భంగపాటు నొదవించే గద్యము అనే అమృతప్రవాహానికి పుట్టుగొండ అయిన సుబంధు మహాకవి కలకాలం జీవించాలి గాక! అని స్థూలార్థం.

భఙ్గాశ్లేషం వల్ల – అంటే మూడర్థాలు:

౧) భఙ్గ+ఆశ్లేషం = భంగు అనే మత్తుమందును సేవిస్తే కలిగేటటువంటి (తత్సంబంధయుక్తి వలని), భఙ్గః = స్వస్థతా భంగరూపమైన పారవశ్య సిద్ధి. భఙ్గో వీచిషు విఖ్యాతో భఙ్గో జయవిపర్యయః, భఙ్గో భేదే రుజాయాం చ భఙ్గా శస్యం శణాహ్వయమ్ అని ధరణిదాసుని ధరణికోశం.

౨) భఙ్గమంటే జలనిర్గమం, ఆశ్లేషమంటే తత్సంబద్ధత. భఙ్గాశ్లేషం = మహాప్రవాహం ముంచెత్తివేస్తున్న భావం మూలాన, భఙ్గః = జలదరింపు. భఙ్గ ఉత్కలికావలిః అని హర్షకీర్తి శారదీయ నామమాల. భే దోర్మి భక్తి కౌటిల్య భీషు భఙ్గః స్త్రియాం శణే, వేగః ప్రవాహ జయయోః అని మంఖ కవి మంఖకోశం.

౩) భఙ్గ+ఆశ్లేషం ఆసాద్య = సభంగ అభంగాది శ్లేషల పొందిక వల్ల కావ్యార్థం పూర్ణానుభవానికి రానందువల్ల కలిగే (వాచః కాఠిన్య మాయాన్తి భఙ్గాశ్లేషవిశేషతః అని త్రివిక్రమ భట్టు నల చంపువు (1-16) లో వ్రాసిన శ్లోకాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి), భఙ్గః = భంగపాటు. భఙ్గ స్తరఙ్గే భేదే చ రుగ్విశేషే పరాజయే, కౌటిల్యే భయ విచ్ఛిత్త్యోః అని హేమచంద్రుని అనేకార్థసంగ్రహం.

గద్యము అనే పాదనియమరహితమైన కావ్యబంధముతోడి మెచ్చితీరవలసిన రసప్రవాహానికి (అసలు గద్యము అంటేనే మెచ్చవలసినది అని అర్థం) పుట్టుగొండ అయిన సుబంధుని కవితలో రసమాధురిని గ్రోలిన కవులకు భంగు అనే మత్తుమందును సేవిస్తే కలిగే పారవశ్యసిద్ధి; సమాసభూయిష్ఠమైన సుబంధుని గద్యస్రవంతి ఉరవడికి మహాప్రవాహం ముంచెత్తివేస్తున్న భావం మూలాన కవులకు (= జలపక్షులకు అని మరొక అర్థం) మేనంతా గగుర్పాటు; ఒక పట్టాన లొంగని కఠినమైన శ్లేషల వల్ల మాటిమాటికి అర్థాలు వెతుక్కోవలసివచ్చి సభలలో సాటివారి ముందు భంగపాటు అని – మొత్తం మీద ప్రకృతాప్రకృతంగా మూడర్థాలు స్ఫురిస్తున్నాయి.

పీటర్ పీటర్సన్ 1887లో ప్రకటించిన Third Report of Operations in search of Manuscripts in the Bombay Circle (పుట-35; అనుబంధం పుట-55) ఆధారంగా – 1912 లో మహావిద్వాంసులు లూయీ హెచ్ గ్రే మూలసమేతమైన తమ అనువాదం Vasavadatta, A Sanskrit Romance of Subandhu పీఠిక (పు.42) లో ఈ శ్లోకాన్ని లక్ష్మణుని సూక్తావళి లోనిదిగా ఉదాహరించారు.

2. సా రసవత్తా విహతా నవకా విలసన్తి చరతి నో కఙ్కః
సరసీవ కీర్తిశేషం గతవతి భువి విక్రమాదిత్యే.

విక్రమాదిత్యుడు భూమిని విడనాడినందువల్ల లోకంలో అసలు రసవత్త అనేదే లేదని (రసవత్త అంటే రసమును = నీటిని కలిగిఉండటమనీ, శృంగార వీరాది రసవంతమై ఉండటమనీ రెండర్థాలు. విక్రమాదిత్యుడు (విక్రముడు అనే సూర్యుడు) అస్తమించినందువల్ల లోకం నీరస (రసము లేక) నిర్జీవమైనదనీ, లోకంలో వీరరససిద్ధులు లేకపోయారనీ భావం); చరతి నో కఙ్కః = నీరు లేనందువల్ల తదర్థమై కొంగలు రావటం లేదనీ, కం = ఒకానొక బలవంతుని, కః = ఒకానొక బలవంతుడు, నో చరతి = భక్షించటం లేదనీ (శత్రురాజ్యాలను మట్టుపెట్టగల శక్తిమంతులైన రాజులు లేరనీ); సరసుల విషయం కీర్తిశేషం అయిందనీ – అంటే ఇప్పుడు సరసులైనవారు లేరని, కీర్తి అంటే బురద అనే అర్థం కూడా ఉన్నది కనుక – ఒకప్పుడు తీర్థ జలాశయాలుండిన చోట ఇప్పుడు బురదగుంటలు మిగిలాయనీ (సమస్తం క్షీణోన్ముఖం అయిందని) ఇందులో శ్లేషార్థాలు కనబడుతున్నాయి. ఇవిగాక కఙ్క శబ్దం వృష్ణివంశ మహారథులను సూచిస్తున్నదని, విరాటరాజు కొలువులో ధర్మరాజు గైకొన్న ప్రచ్ఛన్ననామానికి జ్ఞాపకమని చమత్కారపరంపరను వ్యాఖ్యాతలు ఊహించారు.
-------------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: