Wednesday, November 20, 2019

కన్యాశుల్కం — గురజాడ అద్భుతసృష్టి


కన్యాశుల్కం — గురజాడ అద్భుతసృష్టి




సాహితీమిత్రులారా!

ఆధునిక సాహిత్యానికి వేగుచుక్క గురజాడ.కొత్తపాతల మేలుకలయికతో తెలుగువారి మత్తువదల గొట్టిన భావ విప్లవకారుడు గురజాడ.తనకి అవసరమైన సాహిత్యాన్ని ఆ తరమే సృష్టించుకొంటుందన్న సూక్తికి “కన్యాశుల్కం” ప్రత్యక్షనిదర్శనం. సాంఘిక నాటకాలు, స్వతంత్ర నాటకాలు, సామాజిక సమస్యగల నాటకాలు లేని లోటును “కన్యాశుల్కం” పూరించింది.

కన్యాశుల్కం నాటకం 1897 లో ప్రచురించబడింది. అంతకు ముందే 1892 లో విజయనగరంలో ప్రదర్శింపబడింది. కొద్ది మార్పులతో రెండవ ముద్రణ పొందింది.
అప్పట్లో విజయనగరం ప్రాంతంలో కన్యాశుల్కం ఆచారం బాగా ఉండేది. రాజావారు చేసిన సర్వే వల్ల ఏటా దాదాపు 344 బాల్యవివాహాలు జరిగేవని తెలుసుకొన్న గురజాడ కలత చెందగా “కన్యాశుల్కం” అనే ఒక గొప్ప సాంఘిక నాటకం మనకి లభించింది.

గురజాడ కన్యాశుల్కం గొప్పనాటకం నిరూపించే అంశాలు
1. వస్తువు,
2. పాత్రపోషణ,
3. హాస్యం, అధిక్షేపం,
4. సంభాషణలు,
5. భాష.

వస్తువు
కన్యాశుల్కం తెలుగుజీవనాన్నీ, వాతావరణాన్నీ,మనుషుల శ్వాసనిశ్వాసాల్నీ, ఆంతరిక వ్యధల్నీ, భ్రష్టు పట్టిన మానవస్వభావాల్నీ ఆవిష్కరించే మొదటి సాంఘిక
నాటకం.  ఆనాటి హేయమైన మానవ నైజాలూ,జీవచ్ఛవాల్లాంటి బాలవితంతువులూ, సారామత్తులో ఉండే బైరాగులూ, దొంగ సాక్షులూ, వేశ్యలూ, లాయర్లూ, … నాటి సంక్షుభిత సమాజ సమగ్ర స్వరూపాన్ని గురజాడ ఫొటో తీసి మన ముందుంచారు.

ఈ నాటకంలోని కధావస్తువు ” సంఘసంస్కరణ”కి ఉద్దేశించింది. అందులో ముఖ్యాంశాలివి.  చిన్న పిల్లల్నిముసలివాళ్ళకిచ్చి పెళ్ళిచేయడం,వేశ్యావృత్తి హైన్యత స్త్రీల దుస్థితి, పెద్ద మనుషులుగా చెలామణీ అయే కుహనామేధావులు.

ఐదేళ్ళకే బాలికలకి పెళ్ళిచేసేవారు. ఈ అన్యాయాన్నిఎత్తి చూపారు గురజాడ. పసిపిల్లల్ని కాలం గడిచినవాళ్ళకిచ్చి పెళ్ళిచేస్తే వైధవ్యం రాక తప్పదు. బాలవితంతువులుగా జీవితం వెళ్ళబుచ్చవల్సిందే. ఈ నాటకంలో అగ్నిహోత్రావధాన్లు తన చిన్న కూతురిని లుబ్ధావధాని కివ్వడంలో ప్రేమ లేక కాదు ధనాశ వల్లనే. ఎందుకంటే తన కొడుక్కి కూడా డబ్బు ఖర్చు లేకుండా పెళ్ళి చెయ్యాలనుకుంటాడు కాబట్టి.

కన్యాశుల్కం తీసుకోవడంలో ఉచితానుచితాలూ,న్యాయాన్యాయాలూ లేవు.అభం శుభం తెలియని ఆడపిల్లకి అమానుషంగా పెళ్ళి చెయ్యడం వెనుక ఉన్నది ధనవ్యామోహం వీటిని గురజాడ వెల్లడించారు.

పెద్ద మనుషులుగా, విద్యావంతులుగా నటిస్తూ,ఆదర్శాలకీ ఆచరణలకీ పొంతనలేని వ్యక్తుల్ని గురజాడ చూసి “గిరీశం” “రామప్పంతులు” వంటి పాత్రల్నికధలో పొందు పరచారు. మోసాలు, అబద్ధాలు,సొంతడబ్బా, ఎలాగో అలా పబ్బం గడుపుకోవడాలు …. వీటిని నాటక వస్తువులో ఉపాంగాలుగా చేసారు. “ఆధునికత” పేరుతో ఇంగ్లీషు చదువుపై గల వ్యామోహాన్ని వ్యక్తం చేసారు. ఈ నాటకంలోని వస్తువు మన సంస్కృతీరుగ్మతను హెచ్చరిస్తూ సంఘ సంస్కరణ ఎంత అవసరమో వెల్లడిస్తుంది.

ఈనాటి వాళ్ళకి కన్యాశుల్కంలోని వస్తువు పాతది.అందులోని ప్రధాన సమస్య అయిన కన్యాశుల్కం ఈనాడు లేనేలేదు. చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు కూడా లేవు. కన్యాశుల్కం స్థానంలో వరకట్నం వచ్చింది. వేశ్యలకి చదువు,  తెలివి, సంపద పోయి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా ఈనాటికీ ఈ నాటకం జనాదరణ పొందడానికి కారణం, ఈ నాటకాన్ని ఒక “సజీవసాహిత్య ప్రక్రియ”గా గురజాడ రూపొందించడమే. ఆయనలోని కళాప్రతిభ కూడా ఒక ముఖ్యకారణం. పాత్రల తీరుతెన్నులు,సంభాషణల్లోని నైపుణ్యం, నాటకాన్ని సజీవం చేసాయి.”గిరీశం” పాత్ర నాటకానికి పుష్టి కలిగించింది. హాస్యం అన్ని కాలాల్లో అందరూ ఆనందించేటట్టు పోషింపబడింది. ఈ రోగిష్టి సమాజం, మనసు పుచ్చిన మనుషు లున్నంతవరకూ ఈ నాటకం నిలుస్తుంది. నిలిచి శస్త్ర చికిత్స చేస్తుంది కూడా. ఈ నాటకం ఆధునిక నాటకసాహిత్యానికి “విఙ్ఞాన సర్వస్వం” వంటిది. ఈ నాటకాన్ని ఒక సాంఘిక అధిక్షేప నాటకమని గాని, సాంఘిక ఇతిహాస నాటకమని గాని అనవచ్చు.

పాత్రపోషణ
ఏ నాటకానికైనా ఇతివృత్తానికైనా ప్రాణాలు పాత్రలే. ఈ నాటకంలోని పాత్రలు  సజీవంగా ప్రకాశిస్తూంటాయి. ఒక పాత్ర మరొక పాత్రతో పోటీ పడుతూంటుంది. ఇవి మన సమాజంలో మనకు కనుపించే పాత్రలే. రామప్పంతులు వంటి దగాకోరులు, స్వార్ధపరులు, గిరీశంలాంటి బడాయి కోరులూ మాటకారులు, అగ్నిహోత్రావధాన్లులాంటి ధనాశాపరులు, సంస్కర్తలకి కూడా బుద్ధి చెప్పగల మధురవాణి వంటి సమయోచిత ప్రఙ్ఞగల స్త్రీలు నేటి సమాజంలో అడుగడుగునా కన్పిస్తారు. ఇంతటి వైవిధ్యం, సహజత్వం గల పాత్రపోషణ వల్ల నాటకం సజీవంగా నిలిచింది.

సర్దేశాయి తిరుమల రావు గారు “కన్యాశుల్క నాటకకళ” అనే విమర్శలో నాటకంలోని పాత్రల్నిరెండు వర్గాలుగా విభజించారు మంచి పాత్రలూ, చెడ్డ పాత్రలు. మనిషిలోని మంచిచెడ్డల మేలుకలయిక మంచితనంగానూ, చెడ్డమంచిల కీడుకలయిక చెడ్డతనంగానూ తెలిపారు.  మధురవాణి, బుచ్చమ్మ, కరటక శాస్త్రి, సౌజన్యారావు పంతులు పాత్రలు మంచివి. గిరీశం,  రామప్పంతులు, అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్లు చెడ్డపాత్రలు. సుబ్బి రంగస్థలంపైకి రాని “నాయిక” వంటిది. సుబ్బిని రంగం మీదకి తీసుకురాకపోవడానికి కారణం ప్రేక్షకుడిలో సెన్టిమెంటాలిటీ పుట్టకుండా చెయ్యడాని కనిపిస్తుంది.కన్నీళ్ళు వెక్కిళ్ళూ కనుపించనీయకూడదని నాటక  కర్త ఉద్దేశ్యం కావచ్చు. ఇంకా ఇతర పాత్రలున్నాయి. కొందరన్నట్టు అసలు నాటకంలో కనుపించని పాత్ర గురజాడ. “సామూహిక పాత్రీకరణ” అంటే, పాత్రశీలానికి ఒక్క పాత్రను గాక, రెండుగాని అంతకంటె ఎక్కువగాని పాత్రలని ప్రతినిధులుగా నిలబెట్టే విధానం కన్యాశుల్కంలో కనుపిస్తుంది.ఇందుకు ఉదాహరణలు అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్ల పాత్రలే. గురజాడ గొప్పదనానికి ఇదొక నిదర్శనం.

ఈ నాటకాని ప్రసిద్ధి తెచ్చిందీ, అందరినీ ఆకర్షించిందీ గిరీశం పాత్ర. ఇది నాయక పాత్ర కాకపోయినా నాటకమంతా పరచుకొంది. నాటకం మొదలు, ముగింపూ ఈ పాత్రతోనే కాబట్టి రచయిత ఈ పాత్రవిషయంలో ఒక ఆద్యంతసమత పాటించాడనవచ్చు. గిరీశంవల్ల రచయిత ఏ ప్రయోజనాన్ని ఆశించాడు? ఇది కేవలం ఒక హాస్య పాత్రా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి మనలో. నాటకంలో గిరీశం చాలాపనులు చేసినట్టు కనుపించినా, ఆ పనులవల్ల ఏ ప్రయోజనం,మార్పూ కనుపించదు.

గిరీశం సమాజంలోని దొంగ పెద్ద మనుషులకి ప్రతీక.మాయమాటల్తో పబ్బం గడుపుకోవడమే గాని, ఇతనికి ఒక సిద్ధాంతం, ఆశయం ఉన్నట్టు కనుపించవు. స్వప్రయోజనం కోసం ఇతరులకి కష్టాల్నితెచ్చిపెట్టడానికి కూడా వెనుకాడడు. తాను చేసే ప్రతిపనీ అన్యాయమని తెలిసే చేస్తాడు. వేడుకొని, భయపెట్టి, నవ్వించి, ఏడిపించి,ఏడ్చి ఇతరుల్ని తన దారిలోకి తిప్పుకోగల లౌక్యుడు. నాటకంలో జరిగే సంఘటలపై వ్యతిరేకంగా  వ్యాఖ్యానించే గిరీశం పాత్ర సాంఘిక, సాంస్కృతిక ప్రయోజనాల్నిఆశించి గిరజాడ సృష్టించి ఉండవచ్చు. “డామిట్‌ ! కధ అడ్డం తిరిగింది” అంటూ నాటక రంగం నుంచి నిష్క్రమించినా సమాజంలో కనుపిస్తూ నేటికీ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే ఉన్నాడు.

ఈ నాటకంలోని రెండవ ముఖ్య పాత్ర “మధురవాణి”. ఈ పాత్రలో అసాధారణత, పరిణామం,శీఘ్రప్రగతీ కన్పిస్తాయి. మొదట్లో సామాన్య వేశ్యగా కన్పించే మధురవాణి, నాటకం ముగిసేసరికి గొప్ప మనిషిగా కనబడుతుంది. ఇది గురజాడ ఇంద్రజాలం. రామప్పంతులు తన బుగ్గ గిల్లినప్పుడు, “మొగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి. తాకవద్దంటే చెవిని బెట్టరు గదా” అని మందలించడంలోనే ఆమె మనసు అర్ధమవుతుంది.

వ్యక్తి స్వాతంత్య్రాన్ని, పట్టుదలను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కోల్పోని గుండె నిబ్బరం గలది. విమర్శనాఙ్ఞానం,విశ్లేషణ కలది. ఎదుటి వాళ్ళగురించి ఆలోచిస్తుంది. తృతీయాంకంలో రామప్పంతులు పైన పటారం లోన లొటారం అని పసిగడుతుంది. ఇతర వేశ్యలు ధనం గుంజాలని చూస్తూంటే, మధురవాణి తనని ఉంచుకున్నవాడు బాగు పడాలనీ, అదే తనకు ఎక్కువ గొప్పనీ చెబుతుంది.ఆమె సంస్కారవతి.దురాచారాల్ని సహించదు. కన్యావేషంలో ఉన్నశిష్యుణ్ణి లుబ్ధావధానికి కట్టబెట్టి, సుబ్బి పెళ్ళి  తప్పించడంలో ఆమె వ్యూహాశక్తి మనకి తెలుస్తుంది. కరటక శాస్త్రితో “వృత్తి చేత వేశ్యని గనక చెయ్యవలసిన చోట ద్రవ్యాకర్షణ చేస్తాను గాని మధురవాణికి దయాదాక్షిణ్యాలు సున్న అని తలిచారా?” అనడం ప్రత్యక్షర సత్యం. నాటకం చివర కరటక శాస్త్రిని జైలు నుంచీ,లుబ్ధావధానిని మరణ శిక్ష నుంచీ తప్పిస్తుంది. “ఆహా! ఏమి యోగ్యమైన మనిషి” అని రామప్పంతులు కూడా అనకుండా ఉండలేక పోతాడు. అయితే నాలుగో అంకంలో “నీకు సిగ్గులేదే లంజా!” లాంటి మాటలు ఈ పాత్రచేత అనిపించడం సబబుగా లేదు.

ఆరవ అంకంలో మధురవాణి సంఘం మీద దాడి చేస్తుంది. స్త్రీస్వాతంత్రోద్యమానికి మధురవాణి పాత్ర నాందిగా చెప్పవచ్చు. పొరుగువారికి సాయపడుతూ, ఈ పాపపు లోకంలో కూడా మంచి ఉందని నిరూపించిన త్యాగజీవి మధురవాణి. ఈ పాత్ర ఒక్కక్క సారి నాటక పరిధిని దాటిపోయి విశ్వరూపాన్ని చూపిస్తుంది.

డబ్బు గడించి దానిపై వ్యామోహం లేకుండా ప్రేమకోసం పరితపించే పాత్ర మధురవాణి. “కాపు మనిషినై పుట్టి  మొగుడి పొలంలో వంగ మొక్కలకూ, మిరప మొక్కలకూ దోహదం చేస్తే యావజ్జీవం కాపాడే తన వాళ్లైనా ఉందురేమో” అనుకోవటంలో పాత్రలో పరివర్తన కనుపిస్తుంది. దీన్ని గురజాడ హఠాత్తుగా కాక క్రమంగా వచ్చిన మార్పుగా చిత్రించడంలో తన కళాప్రతిభ, సహజత్వం చూపించారు.

మిగిలిన పాత్రల గురించి
రామప్పంతులు పాత్ర చాలా ఆసక్తికరమైనది. ఇతను నిశిత దృష్టికలవాడు. “నమ్మిం చోట చేస్తే మోసం, నమ్మం చోట చేస్తే లౌక్యవూఁను” అనే సూక్ష్మబుద్ధి ఉంది. అయినా మధురవాణి వ్యూహంలో చిక్కుకుపోయాడు. ఇతను ఎవళ్ళెక్కువ డబ్బిస్తే వాళ్ళ పక్షం. ఒక మాటమీద నిలబడడు.

అగ్నిహోత్రావధాన్లు వేద వేత్త, అమాయక బ్రాహ్మణుడు,ధనాశాపరుడు, సనాతనాచారాలున్నవాడు.

సౌజన్యారావు న్యాయవాది . వివిధ స్వభావాలున్నమనుషుల్ని చూసినవాడు. వ్యవహారాన్ని నేర్పుగా చక్కబెట్టే ప్రవృత్తి గలవాడు. మొదట్లో గిరీశం పెద్ద మనిషని నమ్మినా, విషయం తెలిసాక, అతన్ని “గెట్‌ అవుట్‌ “అంటాడు. మధురవాణి వ్రతం సౌజన్యా రావుని పెద్దవాడిగా నిలిపిందా? లేక సౌజన్యా రావు ప్రవర్తన మధురవాణిని మంచిదానిగా చేసిందా అనిపిస్తుంది.

ఇకపోతే తనకు తానుగా చెడు చెయ్యని లుబ్ధావధాని, మంచి స్వభావంగల కరటక శాస్త్రి, తండ్రికి బుద్ధి చెప్పే పాత్రలో మీనాక్షి.. ఇలా ఎన్నో.మొత్తం మీద కొన్ని లోపాలున్నా పాత్ర పోషణా నైపుణ్యం కన్యాశుల్కం సజీవంగా నిలబడడానికి దోహదం చేసింది.

హాస్యం – ఎత్తిపొడుపు
కన్యాశుల్కం అనగానే హాస్యం గుర్తొస్తుంది. నాటకంలో పాత్రలే ఒకరికిఒకరు పేర్లు పెట్టుకొని హాస్యమాడుకున్నారు.గిరీశం అగ్నిహొత్రావధానిని “అగ్గిరావుఁడ” న్నాడు. కరటక శాస్త్రి “మూర్ఖపగాడ్దె కొడుక” న్నాడు. గిరీశాన్ని రామప్పంతులు “గిర్రడు” “బొట్లేరు” అని కొట్టిపారేశాడు. అగ్నిహోత్రావధాన్లు కూడా గిరీశాన్ని “హనుమాన్లు”గా ఆట పట్టించాడు. మధురవాణి దృష్టిలో రామప్పంతులు,లుబ్ధావధాని లొట్టిపిట్టలు. లుబ్ధావధాని పెళ్ళి ముసలి మనువు కాబట్టి హాస్యాన్ని కల్గిస్తుంది.  మధురవాణి ఇంట్లో రామప్పంతుల్నీ, గిరీశాన్ని పూటకూళ్ళమ్మ చీపురుతో కొట్టడం,గిరీశం లుబ్ధావధానికి వ్రాసిన లేఖ,గిరీశంవెంకటేశాల సంభాషణలూ మొదలైనవి హాస్యాన్ని పుట్టించాయి. రామప్పంతులు “నాకు యింగిలీషే వస్తే దొరసాన్లు నా వెనకాల పరిగెత్తరా?” అన్నప్పుడు, మధురవాణి లుబ్ధావధానిని “ఓ పన్ను కదిలిందా? కన్నుకు దృష్టి తగ్గిందా?, చూడండి మీ కండలు కమ్మెచ్చులు తీసినట్టు యెలా వున్నాయో” అన్నప్పుడూ నవ్వుకుంటాం.

సంఘంలోని కొన్ని లోపాల్ని ఎత్తిచూపడం కోసం గురజాడ హాస్యాన్ని ఆయుధంగా వాడాడు. ఉదాహరణకి, గిరీశం “లెక్చర్లు ఎంతసేపూ సిటీల్లోనే గాని పల్లెటూళ్ళలో ఎంతమాత్రం పనికిరావు”  అంటాడు. అలాగే ” నీ మాస్టరుకు నన్ను చూస్తే గిట్టదు. అందుచేత నిన్ను ఫెయిల్‌ చేసాడు గానీ..”  అనడం గూడా. “పొగత్రాగని వాడు దున్నపోతై పుట్టున్‌”, “మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే!” అన్నప్పుడు సరదాగా నవ్వుకుంటాం. అలాగే, “సత్యం చ మే, ధర్మం చ మే” వంటి వేద మంత్రాలకు “చేగోడిం చ మే” లాంటి పేరడీలు హాస్యస్ఫోరకాలు.

సంభాషణలు
సంభాషణలు భాష ఈ నాటకానికి జవజీవాలు. తెలుగు పలుకుబడులతో, పాత్రోచిత భాషతో, వ్యంగ్యంతో, హాస్యంతో సంభాషణల్ని నడిపించిన గురజాడ ప్రతిభ అసామాన్యం. “నా దగ్గర చదువుకున్న వాడు ఒహడూ అప్రయోజకుడు కాలేదు. పూనా డక్కన్‌ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది ఇలెవెన్‌ కాజెస్‌ ఫర్ది డీజనరేషన్‌ ఆఫ్‌ ఇండియాను గూర్చి మూడు గంటలు వక్క బిగిన లెక్చరిచ్చేసరికి ప్రొఫెసర్లు డంగై పోయినారు” వంటి మాటలు గిరీశం పాత్రపోషణకు బలాన్నిచ్చాయి. గిరీశం సంభాషణలు తెలుగు వాళ్ళ నోళ్ళల్లో సామెతలుగా నిలబడిపోయాయి. ” మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్‌, “డామిట్‌ కధ అడ్డం తిరిగింది” లాంటివి సాక్ష్యాలు.

పూటకూళ్ళమ్మని గురించి “మీరుండగా వెధవెలా అవుతుంది” అనడం, కన్య వేషంలోని కరటక శాస్త్రి శిష్యుణ్ణి గురించి “ఈ కన్నెపిల్ల నోరు కొంచెం చుట్ట వాసన కొడుతోంది” అనడం లాంటి వాటి ద్వారా మధురవాణి సంభాషణా నైపుణ్యాన్ని చూపించాడు గురజాడ. “వీళ్ళమ్మా శిఖా తరగా! ప్రతిగాడిద కొడుకూ తిండిపోతుల్లాగా నా ఇంట జేరి నన్ననే వాళ్ళే! తాంబూలం ఇచ్చేశాను, ఇహ తన్నుకు చావండి” అన్న వాక్యం నేటికీ ప్రజల్లో వినబడడమే గురజాడ సంభాషణల్ని నడిపిన చాతుర్యానికి నిదర్శనం.

భాష
కన్యాశుల్కం వాడుకభాషలో రాయబడ్డ మొదటి సాంఘిక నాటకం.ఒక్క వాడుక భాషేకాక, మాండలికాలు, పాత్రోచిత ప్రయోగాలూ కూడా ఉన్నాయి. కళింగాంధ్ర మాండలికాలకు ఉదాహరణలు “చెప్పాను కానా?”, “నా ఆబోరుండదండీ”, “గుంటవెధవ”, “కనిష్టీబు”,”నాను ఉంది”,  “అనాడీ చేస్తున్నారు”, “వగుస్తున్నారు”, “కొసాకి విను” మొదలైనవి.

పాత్రోచితంగా అగ్నిహోత్రావధాని “మానా! మానులా వున్చానంచావూ? గూబ్బగల గొడతాను.” వెంకమ్మ “మీకు మాత్రం అబ్బిమీద ప్రేఁవ లేదా యేవిషి?” గిరీశం “నేనే దాని హజ్బన్డై ఉంటే నిలబడ్డపాట్ననీ తండ్రిని రివాల్వర్తో షూట్‌ చేసి ఉందును.”

మాట్లాడే భాషకి చాలా దగ్గరగా ఉన్న పదాల్ని ప్రయోగించి సహజత్వానికి అద్దం పట్టాడు గురజాడ. ఉదాహరణకి,సాన్దీ, యవరో, జంఝప్పోస, సమ్మంధం, నాలుగ్గింజలు మొదలైనవి ఇలాంటివే. “కుంచం నిలువుగా కొలవడానికి వీలులేనప్పుడు,తిరగేసైనా కొలిస్తే నాలుగ్గింజలు నిలుస్తాయి”,  “ఒపీనియన్స్‌ అప్పుడప్పుడు చేన్జి చేస్తూంటేగాని పొలిటీషియన్‌ కానేరడు” వంటి కొత్త సూక్తులు కనిపిస్తాయి.

మానవత్వాన్ని చాటి చెప్పి, మానవుడిని క్రియాపరునిగా ప్రేరేపించగల శక్తి గలది ఉత్తమ సాహిత్యమైతే, “కన్యాశుల్కం” ఉత్తమ సాహిత్యరూపం. ఉదాత్తమైన నాటకం. తెలుగు వాడు గర్వించదగ్గ నాటకం.
--------------------------------------------------------
రచన: ద్వానా శాస్త్రి, 
ఈమాట సౌజన్యంతో

No comments: