Tuesday, May 23, 2023

అవధాన కవితా సరస్వతి - రాళ్ళబండి కవితా ప్రసాద్

 అవధాన కవితా సరస్వతి - 

రాళ్ళబండి కవితా ప్రసాద్  




సాహితీమిత్రులారా!


 21- మే న అవధాన కవితా సరస్వతి  " *కీ.శే.రాళ్ళబండి కవితా ప్రసాద్* గారి జయంతి సందర్భంగా వారిని స్మరిస్తూ చిరు వ్యాసం.....

                                                    *ఐ.చిదానందం*

--------------------------------------------------------------------

సహజంగా తాము ఆధునికులం అనీ భావించే కొందరు కవులు సంప్రదాయం అంటే అసహ్యించుకుంటారు. అదేదో గొంగళిపురుగును చూసీనట్లుగా చూస్తారు. కానీ ఆధునికం అనే మోజు తగ్గాక అందరు సంప్రదాయం అనుసరించాలిసిన వారే. ఎందుకంటే అతి ఆధునికం మేడిపండు లాంటిది. నిజానికీ సరిగ్గా అర్దం చేసుకుంటే సంప్రదాయం ఒక అందమైన సీతాకొకచిలుక. అలాంటి సంప్రదాయం దారి తప్పిన కాలం ఆధునికం. ఆధునిక కాలం లో సంప్రదాయం గా  ముఖ్యంగా అవధాన విద్యలో మంచి ప్రయోగాలు చేసిన కవి రాళ్లబండి వెంకట కవితా ప్రసాద్ గారు.

                                రాళ్లబండి కవితా ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణ జిల్లా గంపలగూడెం మండలం నెమలి లో 21 మే 1961 లో జన్మించారు. ఎన్నో పదవులకు అలంకారంగా వున్న వీరూ వృత్తిరీత్యా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ తో వీడదీయనీ అనుబంధం కలదు.వీరు చిన్నప్పటి నుంచే అష్టావధాన వ్యస్తాక్షరి ప్రజ్ఞలు అలవరుచుకొని ఎన్నో వందల అవధానాలు జయప్రదంగా నిర్వహించారు. ఆనాటి కాలంలోనే కాదు ఏనాటి కాలం లోనైనా అవధానం అనేది అంత సులువు కాదు. పేరు మోసిన మహా మహా పండితులకు సైతం ఇదీ కొరకుడుబడని విద్యయే. ఒక విధంగా చెప్పలంటే కొందరు సరస్వతి పుత్రులకు మాత్రమే ఇదీ సాధ్యం. అలాంటి  అవధానవిద్యలో రాణించడమే కాదు కొత్త కొత్త ధోరణులు ప్రవేశపెట్టారు.  అలాగే అవధానం లో సత్వాదానం ; నవరస అవధానం వంటి వివిధ అవధాన ప్రయోగాలు చెసారు రాళ్లబండి.

                      ఈ కిష్టమైన అవధాన విద్య పై సిద్దాంత వ్యాసాలు చాలా తక్కువగానే వచ్చాయనీ తెలుస్తుంది. ప్రధానమైన వాటిని చూస్తే...

1) తెలుగులో అవధాన ప్రక్రియ(1977- ఏయూ)- కే.కృష్ణమూర్తి

2) తెలుగులో అవధాన శిల్పం (1972-ఓయూ)- జే.బాలత్రిపుర సుందరి

3) తెలంగాణ కవులు అవధాన వికాసం(1997-ఓయూ) - జి. రఘు రాములు. 

                    వీటన్నింటి మధ్య రాళ్లబండి గారు సమర్పించిన సిద్దాంతం వ్యాసం 

" అవధాన విద్య - ఆరంభ వికాసాలు " (2006- ఓయూ) ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఆచార్య మసన చెన్నప్ప గారు పర్యవేక్షణలో వచ్చిన ఈ సిద్దాంత వ్యాసంలో అవధానుల గురించి సేకరించిన విషయాలు ; అవధానం పై చెప్పిన విషయాలు ఎన్నెన్నో పద్యాలున్నా ; ఎన్నో చెప్పదగిన విషయాలున్నా సిద్దాంత వ్యాసంకు తగిన విషయాలు తగిన పద్య రత్నాలను సమీకరించుకోవడం. అవధాన విద్య లో మెలుకువలు ; జాగ్రత్త లు సూచించడం వంటివి ఒక పరిశోధకుడిగా ; అవధానిగా ; విమర్శకుడిగా రాళ్ళబండి గారి విదగ్దతను ఈ సిద్దాంత వ్యాసం చాటి చెప్పుతుంది.

                    వీరి ఇతర రచనల విషయం కు వస్తే మరుగుపడుతున్న పద్య సంస్కృతి పైకి లేపి వెన్నుగా నిలుపుతు వీరు రాసిన రచన 

" పద్య మండపం ". ఇందులోని పద్యాలు వీరి కవితా శక్తీకీ ధారణ శుద్దికీ నిదర్శనాలు. విశేషమేమిటంటే ఇందులో చెప్పబడిన పద్యాలు చాలా వరకు రాళ్లబండి గారు ఆశువుగా చెప్పినవే.

           " పచ్చ పచ్చని కొండ! పసిడికాంతుల కొండ

             ఆర్తుల హృదయాల కండదండ

             సురులు తిరుగు కొండ

             ఝరులు పారేడు కొండ

             పురుషోత్తముని కాళ్ళ పూలదండ "

                    అంటూ అన్నమాచార్యులను తలపిస్తూ భక్తి తో రాసిన రచన " సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ " కాలం ఇప్పుడు చంధస్సు తప్పిన పద్యము అనీ చెప్పే వీరు వచన కవిత్వం లో కూడా తమ ప్రతిభను ప్రసరిస్తూ " ఒంటరి పూల బుట్ట " అనే కవితా సంపుటి వెలువరించారు. వీరి కవితలో కొన్నీ కవితలు చూస్తే...

                "  మొగ్గల్ని తుంచుకుంటూ

                   పోయేవాడికీ పూల సౌందర్యం

                   ఏలా దర్శనం అవుతుంది "            ( 1 )

                 " పురుగు నెత్తి మీదా

                   కిరీటాలున్న రాజ్యంలో

                   నేలంతా

                   చెదలు పాలిస్తాయి "                     ( 2 )

                 " నేను పువ్వును ప్రేమించాను

                   పరిమళమాయ్యాను

                   చేపను ప్రేమించాను

                   జలతరంగంమయ్యాను

                   పక్షిని ప్రేమించాను

                   పాటనై గాలిలో విహరించాను

                   మనిషి ని ప్రేమించాను

                   కన్నీటి చుక్కన్నెనాను "                 ( 3 )

                " జీవితాన్ని అంతగా ప్రేమించిన వాడికీ

                  మృత్యువొక మామూలు మాట

                   ప్రేమనే జీవితంగా భావించిన వాడికి

                  చావోక అర్ధం లేని పదం

                  అస్సలు జీవించడం అంటేనే

                  మృత్యువును ప్రేమించడం "           ( 4 )

                                 ఇలా వీరి ఒక్కోక్క కవిత ఒకో రంపపు కోత. కవిత్వం ఎంత భావోద్వేగం ; ఎంతటి సృజన వుంటుందో వీరి కవిత్వం చదివితే మనకు అర్ధం అవుతుంది.

                                   ఇలా సరళమైన భాషలో అల్ప అక్షరాలో అనల్ప అర్ద కవిత్వం రాసిన వీరి సాహిత్యం ను వ్యాఖ్యనిస్తే అదీ ఒక మంచి గ్రంధమవుతుంది. అవధాన రారాజుగా పేరొందిన వీరి సాహిత్యం పై ప్రస్తుతం పరిశోధన జరుగుతుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షులు మా ఆచార్యులు" డా.సూర్య ధనుంజయ్" గారి పర్యవేక్షణ లో మా పీజీ సీనియర్ విద్యార్థి మిత్రులు " యడవల్లి సైదులు "గారు  " రాళ్లబండి కవితా ప్రసాద్ గారి జీవితం సాహిత్యం" పై సమగ్ర పరిశోధన   చేస్తున్నారు.

                              పద్యాన్ని ధార శుద్దిగా ప్రవచించే శబ్దార్ద భావ శుద్ది పొందిన కవి రాళ్ళబండి కవితాప్రసాద్. వీరు జీవితాన్ని మన్నించారు.కాలాన్ని ప్రేమించారు.కవిత్వాన్ని ఆరాధించారు. రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు 15 మార్చ్ 2015 లో పరమపదించారు. 

చివరిగా వారి కవితతోనే ముగిస్తూ....

                     " గడియారం

                       కాలం ఆత్మకథ చెప్పదు

                       సౌందర్యం

                       ప్రేమ కావ్యానికి కవర్ పేజీ కాదు

                       అలాగే కాలాన్ని ప్రేమించే మనిషికీ

                       మృత్యువు కూడా

                       చివరి మజిలీ కాదు "

                                             * ఐ.చిదానందం *

                                         తెలుగు రీసెర్చ్ స్కాలర్ 

                                      ఉస్మానియా యూనివర్సిటీ 

                                     చరవాణి - 8801444335

No comments: