Thursday, March 2, 2023

బాలసరస్వతి తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసాచార్యస్వామి

 బాలసరస్వతి తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసాచార్యస్వామి




సాహితీమిత్రులారా!


           ఆత్మకూరు సంస్థాన విద్వత్పండితకవివర్యులు

              బాలసరస్వతి తిరుమల బుక్కపట్టణం

                  శ్రీనివాసాచార్యస్వామివారు

                        (1863-1919)

****************************************

        శ్రీనివాసాచార్యులవారు శా.శ.౧౭౮౫ దుందుభి,చైత్ర- బహుళ నవమి నాడు(క్రీ.శ.1863) జన్మించినారు. వీరి

తిరునక్షత్ర తనియన్:

   శ్రీమద్దుందుభి చైత్రకృష్ణనవమీ పుచ్ఛే ధనిష్ఠర్షగే

   క్ష్మాపుత్రే శశినాసమం మకరగే మేషంగతే పూషణి,

   మందేచైవ తులాంశగే సతితులా లగ్నేవతీర్ణో౭జని

   శ్రీమాన్ బాలసరస్వతీ బిరుదభాక్ శ్రీశ్రీనివాసో గురుః .

పరమపదం: శా.శ.౧౮౪౧ సిద్ధాద్రి ఫాల్గుణ శుద్ధ చతుర్దశి

    ( క్రీ.శ.1919)

     శ్రీమద్రామానుజ సిద్ధాన్త నిర్ధారణ సార్వభౌమ, సర్వతంత్ర

స్వతంత్ర ,కవితార్కికకంఠీరవ, శ్రీమద్రాజాధిరాజగురుసార్వభౌ

మేత్యాది బిరుదవిభ్రాజితమగు శ్రేష్ఠమైన ఆచార్యపురుషవంశ

మున  ఉద్భవించి,గజ  తురగ  ఛత్ర  చామరాందోళికా దివా ప్రదీప  శ్రీకాహళ  గౌరవ  

కాహళ మకరతోరణ  మయూర చ్ఛత్రాది గౌరవభాక్కులు "శ్రీమాన్ బాలసరస్వతీ శ్రీనివాసాచా

ర్యులవారు.     వీరు శఠమర్షణగోత్రీయులు.అపరవేదాన్తదేశిక శ్రీనివాసాచా ర్యులవారి(సురపురం)  

వంశీయులు.  వీరి  జనని  శేషాంబ, జనకుడు బుచ్చివేంకటాచార్యులు.వీరు ఆత్మకూరు సంస్థాన

ఆస్థాన ప్రధాన విద్వత్పండిత కవివర్యులుగ విరాజిల్లినారు.

    వీరు తన పదకొండవ ఏట తండ్రిదగ్గర సాహిత్యాది

గ్రంథాలను పూర్తి చేసి సంస్కృతాంధ్రాలలో కవిత్వం చెప్పడా నికి ప్రారంభించినారు.పదహారవఏట మైసూరులో శ్రీరంగనాథ

బ్రహ్మతంత్రపరకాలస్వామివారి దగ్గర తర్కవేదాన్తాలను అభ్య

సించారు.అక్కడే సజ్జయంతాతాచార్యులవారిదగ్గర ప్రాకృతాది

భాషలను నేర్చుకున్నారు.మైసూరు మహారాజా చామరాజేం

ద్రులవారు ఆచార్యలవారి ప్రతిభా పాండిత్యాలకు అబ్బురపడి

"బాలసరస్వతి" బిరుదంతో సత్కరించారు.శ్రీనివాసాచార్యుల

వారు కాశీలో స్వామిశాస్త్రిగారి దగ్గర అద్వైతవేదాన్తాన్ని,కైలాస

చంద్రశిరోమణి భట్టాచార్యుల దగ్గర న్యాయశాస్త్ర క్రోడాలనూ

జగదీశవిరచిత జాగదీశినీఅభ్యసించినారు.ఆ తర్వాత నవద్వీ   పాలలో  మీమాంసాశాస్త్రాన్నీ  ఆపోశనం  పట్టారు. నవద్వీప

పండితమండలివారు  ఆచార్యులవారికి  "తర్కతీర్థ"  బిరుద ప్రదానం చేసినారు.

   శ్రీనివాసాచార్యులవారు దర్భాంగ,జోథ్పూర్,బుందీదత్తియా,

గ్వాలియర్,కోటాంజరీ,ఇందూరు,ధారానగర్,జమ్మూ,కాశ్మీర్,

మొదలయిన  ఉత్తరభారత  సంస్థానాలలోనూ,   మైసూరు, బళ్లారి,కడప , పెనుగొండ ,తాడిపత్రి , ప్రొద్దుటూరు ,మద్రాసు,

బనగానిపల్లి మొదలయిన దక్షిణాది ప్రాంతాలలోనూ అనేక

శాస్త్రార్థవాదనలు,ఘంటాశత కవనాలు చేసి సరస్వతీ అవతా రులుగ కీర్తి గడించినారు. సమకాలీన సంస్కృత విద్వత్కవి

పండితులలో యావద్భారతదేశాన వీరి పేరు ఎరుగనివారు

ఆనాడు లేరనడంఅతిశయోక్తికాదని నాటిపండితుల రచనలు తెలియజేస్తున్నాయి.

   ఆచార్య బిరుదురాజురామరాజుగారు శ్రీనివాసాచార్యుల వారిని గురించి(పాటిబండ మాధవరాయ షష్టిపూర్తిసన్మాన సంచికలోని) ఒకవ్యాసంలో   "తిరుపతివేంకటకవులు ఆత్మ కూరు సంస్థానమునకు పోయి తదాస్థాన విద్వాంసులయిన

శ్రీనివాసాచార్యులతో   తలపడి  శాస్త్రవాదమున నోడిపోయిరి.

తిరుపతివేంకటకవులు తెలుగులో  శ్రీనివాసాచార్యులకన్న

మిన్నలైనను,సంస్కృతమున నాశుకవిత్వమును చెప్పుట

యందును, సమస్త  శాస్త్రవైదుష్యమునందును  శ్రీనివాసా చార్యులవారే మిన్నలు. ఆ వాస్తవమెరుగని కొందరు ఇటీవల

పత్రికలందును  గ్రంథములందును  శ్రీనివాసాచార్యులే పరా భూతులైనట్లు వ్రాయుట సత్యదూరము.కీర్తిశేషులను గురిం చిన సత్యాసత్యములు తెలియక,తెలిసికొన ప్రయత్నించక

సాహసోక్తులకుఆధునికులుపూనుకొనరాదని సప్రశ్రయముగ

కోరుచున్నాను" అని తెలిపినారు.ఆచార్య బిరుదురాజు రామ రాజుగారు ఈ వ్యాసాన్ని "మరుగునపడినమాణిక్యాలు" ,

"చరిత్రకెక్కని చరితార్థులు" అనే తమ వ్యాస సంపుటాలలో

కూడా చేర్చడం స్మరణీయం.

      రచనలు:శ్రీనివాసాచార్యులవారి ముద్రితాముద్రిత గ్రం థాలు అనేకం.వాటిలో అధికశాతం ఆత్మకూరు సీతారామ భూపాలుగారు ముద్రింపించారు, కాగా,అముద్రిత రచనల  కాగితప్రతులు  బాలసరస్వతిగారి మనుమడూ, నాకు  గురుతుల్యులూ, ఆత్మీయులూ అయిన  శ్రీమాన్ కవితార్కిక సింహాచార్యులవారి తిరుమాళిగలో భద్రముగాఉండేవి(ఇప్పటి  పరిస్థితి తెలియదు).తెలియవచ్చినంతలో బాలసరస్వతిగారి

రచనలు-

       వీరశైవ శిరస్తాడనం,        దుర్విగ్రహనిగ్రహం,

       నంజరాజచంపూకావ్యం,   తత్త్వమార్తాండప్రభాపటలం,

       కిరీటివేంకటాచార్యవిజయవైజయన్తీనాటకం,

       రాజవంశరత్నావళి(ఆత్మకూరు రాజులు, తెలుగు)

       రాజవంశరత్నావళీ(           ,,         ,సంస్కృతం)

       లక్ష్మీసరస్వతీ దండకావళీ,

       శ్రీ కురుమూర్తి శ్రీనివాస స్తోత్రావలీ,

       లక్ష్మీధ్యానసోపానం  ,శ్రీనివాసధ్యానసోపానం,

       శ్రీనివాస పంచాశత్, లక్ష్మీ పంచాశత్

       అష్టభాషలలోనూ కురుమూర్తిస్వామిస్తుతులు,

       ముకుందమాలా - తొలితెలుగువ్యాఖ్యానం,

       శ్రీకురుమూర్తి శ్రీనివాస సుప్రభాత స్తోత్రం

       స్తోత్రజాలం మొదలయిన రచనలు చాలా ఉన్నవి.

             శ్రీనివాసాచార్యులవారు ఘంటాశతగ్రంథాలను

అనర్గళంగా, అత్యాశువుగా, అష్టభాషలలో సమర్థవంతంగ

వివిధ సంస్థానాదులలో చెప్పినారు.తెలియవచ్చినంతలో

కాలానుక్రమంగా వారి ఘంటాశతగ్రంథకవనాలు-

              మైథిలీకల్యాణం: మిథిలారాజధాని దర్భాంగ

సంస్థానంలో ప్రభువు లక్ష్మీధరసింహగారి కాలాన క్రీ.శ.

1866అక్టోబర్8వతేదీనాడు అష్టభాషలలో చెప్పిన ఘంటా

శతకం ఇది.ఇక్కడి సంస్థాన విద్వత్ప్రభువు,విద్వద్వర్యులు

ఆచార్యులవారికి "కవితార్కికసింహ" బిరుదప్రదానం చేశారు.

ఈ బిరుదనామమే ఆచార్యులవారి పౌత్రునకు'కవితార్కికసిం

హాచార్య' అని పెట్టారు.    

              రుక్మిణీకల్యాణం: దీనికి భైష్మీపరిణయం అని

కూడా నామాంతరం. ధారానగర సంస్థానంలో తత్ప్రభువు

రాజేంద్రసింహ మరియు విద్వత్పండితమండలి సమక్షాన

చెప్పిన ఘంటాశతకం ఇది. ఈ ఘంటాశతగ్రంథ కవనం

క్రీ.శ.1888జనవరి2వ తేదినాడు చెప్పబడింది. ఈ సంస్థానంలో పండితులు బాలసరస్వతిగారిని శ్లోకాలలో

"కువలయామోదకర ద్విజరాజ"అంటూ శ్లేషలో ప్రశంసించి

నారు.

              దమయంతీస్వయంవరం:ఈ ఘంటాశతగ్రంథ

కవనం బళ్లారిలోచెప్పినారు.ధర్మవరంకృష్ణమాచార్యులవారు

ఈ ఘంటాశతావధాన  సభకు  అధ్యక్షులు. ఈ అవధానం 1895 డిశంబరు 31 నాడు జరిగింది.

               లేఖినీ,గంగాభివర్ణనం:ఆత్మకూరు సంస్థానంలో

ఆచార్యులవారికీ తిరుపతివేంకటకవులకూ సాహితీభండనం

జరిగింది.ఆసందర్భాన ఘంటాశతగ్రంథంగా లేఖినినీ గంగాభి

వర్ణననూ  చేయాలని  పండితులు కోరగా  ఘంటాశతగ్రంథ కవనంలో చొరవలేని తిరుపతికవులు మౌనం వహించగా

శ్రీనివాసాచార్యులవారు ఘటికాంతరాళంలో 15శ్లోకాలు

కలాన్నిగురించీ, 50 వసంత తిలకాలు‌ గంగను గురించీ

చెప్పారు.ఈ.  ఘంటాశతకం   క్రీ.శ.1887  మార్చిలో           ఆత్మకూరులో జరిగింది.

              వజ్రనాభచరితం: ప్రొద్దుటూరు పురప్రముఖులు,

విద్వాంసుల సమక్షంలో 1901 సెప్టంబరు 8వ తేదీనాడు

చెప్పబడిన ఘంటాశత గ్రంథం ఇది. సభాధ్యక్షులుగా విద్వత్సంపన్నుడూ డిస్ట్రిక్ట్ మున్సిఫ్ అయిన బ్రహ్మశ్రీ

సి.సుబ్రహ్మణ్య అయ్యర్ గారు ఉన్నారు.

               ధూమశకటం:కడప పట్టణంలో1902 మార్చి

5వ తేదీనాడు విద్వత్సభలోఈ ఘంటాశతావధానంజరిగింది.

పురాణాంశాలయితే అలవోకగా చెప్పగలడని ఈ అంశాన్ని

ఇచ్చినారు. అయినా బాలసరస్వతిగారు నిర్ణీతసమయానికి

ముందే తమ శతావధానాన్ని పూర్తి చేశారు.

               సముద్రమథనం:1903మార్చి 20 తేదీనాడు

మద్రాసులోని పచ్చయ్యప్పకళాశాల సభాభవనంలో పుర ప్రముఖులు,సుప్రసిద్ధపండితుల సమక్షంలో జరిగిన

అవధానం ఇది. ఈ అవధానాల గురించి అలనాటి ప్రముఖ

ఆంధ్ర,ఆంగ్ల పత్రికలు విశేషంగా వార్తలను ప్రచురించాయి.  అవన్నీ నేను (ఈ వ్యాసకర్తను) సేకరించాను. 

                 బాలసరస్వతిగారి  ఘంటాశతావధానాలను

ఆ నాటి సంప్రసిద్ధ ఆయుర్వేదవైద్యులు పండిత డి.గోపాలాచా ర్యులవారు 1903లో ఆనంద ముద్రణాలయం-మద్రాసులో

ముద్రింపించినారు.

                 బాలసరస్వతివారు తమ అవధానసభలలో

అవధానాన్ని నిర్ణీత వ్యవధికన్నా చాలాముందుగానే అత్యాశువుగ  ముగించేవారట.సభలో ఉండిన ప్రముఖుల

కోరికమేరకు ఆధ్యాత్మి, విశిష్టాద్వైత, వేదాన్తాదులను గురించి

అనర్గళంగ ఉపన్యసించేవారు.సభలో  వివిధరంగాలలో ఉద్దండ పండితులైనవారు తర్క,మీమాంసా,సాంఖ్య, వేదాం తాలలో కొ్న్ని సందేహా లను వెలిబుచ్చి ఆచార్యులవారి నుండి సముచిత సమాధానాలను రాబట్టి, బహువిధాలుగ

బాలసరస్వతిగారిని ప్రశంసించేవారు. ఇవన్నిటికీ ఆ నాటి

పత్రికలు సాక్ష్యం పలుకుతున్నాయి.

            సమకాలీన సంస్కృతపండితులలో ఏనోట విన్నా

ఆచార్యులవారి ఘంటాశతావధానాల చర్చనే ఉండేదని నాడు కొందరు చెప్పిన మాటలు అక్షరంగా దర్శనమిస్తున్నాయి.

           బ్రహ్మామృతవర్షిణీ సభ:      శ్రీనివాసాచార్యులవారు

"బ్రహ్మామృతవర్షిణీసభ" అనే పేరున ఒక సంఘాన్ని స్థాపించి

నారు.దానికి  బాలసరస్వతిగారు అధ్యక్షులుగ,  వనపర్తి సంస్థాన ప్రధానవిద్వాంసులు ఆచార్యరంగాచార్యులవారు

ప్రధానకార్యదర్శిగ,గద్వాలసంస్థానం పేపలి చక్రవర్తి కొండమా

చార్యులుగారు నియత సభాకార్యదర్శిగ ఉన్నారు. "బ్రహ్మామృత వర్షిణి" పత్రిక శ్రీకురుమూర్తి శ్రీనివాస ముద్రాక్షర

శాల,శ్రీమదరచింతాత్మకూరుసంస్థానంలో ముద్రతమైనవి ఒకటి రెండు ప్రస్తుత వ్యాసకర్త దగ్గర ఉన్నవి.

        బ్రహ్మామృతవర్షణి సభవారు ఆత్మకూరుసంస్థానంలోనే

గాక (పాత )పాలమూరుజిల్లాలోనేగాక, రాయలసీమ ప్రాంతంలో కూడ అనేక సభలు సమావేశాలు నిర్వహించి

విద్యార్థులకు పరీక్షలుకూడా జరిపి విశిష్టాద్వైతాన్ని, ధర్మ ప్రచారాన్ని చేసేవారు.ప్రథమకక్ష్యకు పాఠ్యగ్రంథాలుగా

సారావళీ సహిత శ్రీభాష్యం,పరమతభంగ సహిత శ్రీమద్రహస్య త్రయసారః అనేవాటిని పెట్టేవారు.ఉత్తీర్ణులయినవారికి25,

మధ్యములకు20,అధమస్థాయివారికి15రూపాయలు పారితోషికంగా ఇచ్చేవారు.ద్వితీయకక్ష్యకు పాఠ్యగ్రంథాలుగ

శ్రీభాష్యం-ప్రథమాధ్యాయం , జిజ్ఞాసాదర్పణః,షష్ఠీదర్పణః.

ప్రథమ,ద్వితీయ,తృతీయస్థానం పొందిన విద్యార్థులకు

రూ15/-,రూ12/-, రూ10/-పారితోషికం. తురీయకక్ష్యకు

పాఠ్యాంశం-నీళాస్తుతి,స్తోత్రజాలం,హరి,గుణదర్పణః,సిద్ధాన్త

చిన్తామణి. పారితోషికం-రూ5/-,రూ3/-,రూ2/-ఇచ్చేవారు.

                       నిర్దిష్టమైన ప్రణాలికతో శ్రీవైష్ణవాన్ని  ప్రచారం చేసిన విద్వత్పండితులు బాలసరస్వతిగారు.

                         సంస్కృత భారతి కృతిరత్నహారంలో

చోటుచేసుకున్న విద్వద్రత్నం మ.న.జిల్లా సంస్థానసంజనిత

రత్నంకావడం మనందరకూ గర్వకారణం.

                          బాలసరస్వతిగారి మరుగునపడిన కృతిరత్నాలన్నీ  ఒకచోటగుదిగుచ్చి హారంగా అందించవలసి ఉంది.

                      

వైద్యం వేంకటేశ్వరాచార్యులు వారి సౌజన్యంతో

No comments: