Tuesday, January 29, 2019

వేయిపడగలు-గాన్ విత్ ద విండ్: 4. వైరుధ్యం వర్సెస్ వైవిధ్యం


వేయిపడగలు-గాన్ విత్ ద విండ్: 

4. వైరుధ్యం వర్సెస్ వైవిధ్యం






సాహితీమిత్రులారా!

మెలనీ-రెట్ బట్లర్
గాన్ విత్ ద విండ్ రచయిత్రి అత్యంత హృద్యంగా చిత్రించిన అనుబంధం మెలనీ-రెట్ బట్లర్‌లది. పైపైన చూస్తే మెలనీ-రెట్ బట్లర్‌ల స్వభావాలు ఉత్తర, దక్షిణ ధ్రువాలనిపిస్తాయి. వెనకటి వ్యాసంలో చెప్పినట్టు, మెలనీ ప్రశాంతగంభీరంగా ప్రవహించే నది అయితే, రెట్ గల గలా చప్పుడు చేస్తూ ఆర్భాటంగా దూకే జలపాతం. మళ్ళీ పైపైనే చూస్తే రెట్‌ది కళంకిత చరిత్ర అయితే, ఎలా చూసినా మెలనీది నిష్కళంక చరిత్ర. రెట్‌ది స్థిరమైన విలువల మైలురాళ్ళు ఏవీ లేని జీవనగమనం అయితే, ఆయా సందర్భాలలో సడలింపును పాటించినప్పటికీ మెలనీది అలాంటి జీవనగమనం కాగల అవకాశమే లేదు. ఈ తేడాలలోనే ఇద్దరి మధ్యా పోలికలను ప్రస్ఫుటింపజేయడంలో మానవస్వభావవైవిధ్యం పట్ల అపారమైన అవగాహనను, పాత్రనిర్మాణ దక్షతను రచయిత్రి చాటుకుంటుంది. ఈ పోలికలే ఇద్దరి మధ్యా ఒక అపురూపమైన ఆత్మీయబంధాన్ని కల్పిస్తాయి.

ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోడంలోనైనా గొప్ప ఇంగితజ్ఞానాన్ని కనబరచడం, తదనుగుణంగా ఎప్పటికప్పుడు తమ వ్యవహార శైలిని సవరించుకోవడం ఇద్దరి మధ్యా ఒక ముఖ్యమైన పోలిక. ఇద్దరి జీవితం నుంచీ ఇందుకు సంబంధించిన ఉదాహరణలను గత వ్యాసాలలో చూడవచ్చు. నవలలోని మిగిలిన ఏ పాత్రలలోనూ లేనంత ఆలోచనావైశాల్యం ఇద్దరి మధ్యా ఇంకొక పోలిక. మళ్ళీ ఇందులో మెలనీదే పైచేయి. రెట్‌ను కూడా తన ప్రభావపరిధిలోకి తెచ్చుకుని, తన ఆధిక్యం ముందు శిరసు వంచేలా చేయగలిగిన భావవైశాల్యం ఆమెది. వ్యక్తులు, పరిస్థితులపై మానవీయతతో స్పందించడంలోనూ, స్వల్ప పరిచయంలోనే ఎదుటివారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలగడంలోనూ ఇద్దరి మధ్యా అతికినట్టు కుదిరిన మరో రెండు పోలికలు.

బార్బిక్యూ విందులో మెలనీ, రెట్ ఇద్దరూ పాల్గొంటారు కాని, వారిమధ్య పరిచయం, సంభాషణ ఉండవు. ఆ తర్వాత మెలనీని రెట్ చూసేది అట్లాంటాలో సైనికుల సహాయార్థం జరిగిన పార్టీలోనే. అప్పుడు స్కార్లెట్‌తోపాటు మెలనీ కూడా తన పెళ్లి ఉంగరాన్ని విరాళంగా ఇవ్వడాన్ని అతను గమనిస్తాడు. ఆ మరునాడు, రెట్ లాంటి కళంకితునితో నృత్యం చేయడాన్ని ఆంట్ పిటీపాట్ తప్పుపట్టి స్కార్లెట్‌ను మందలించినప్పుడు, మెలనీ జోక్యం చేసుకుని రెట్ చెడ్డవాడంటే తను నమ్మదని, అతను పరిపూర్ణమైన పెద్దమనిషిలా కనిపిస్తున్నాడనీ అంటుంది.

ఈ మాటలు జరుగుతున్న సమయంలోనే రెట్ నుంచి మెలనీకి ఒక కవరు అందుతుంది. దానిని తెరచి చూడగానే మెలనీ కళ్ళు జలజలా వర్షిస్తాయి. అందులో తను విరాళంగా ఇచ్చిన పెళ్లి ఉంగరం, రెట్ రాసిన లేఖ ఉంటాయి. కాన్ఫెడరసీకి మగవాళ్ళ ప్రాణాలు అవసరమైతే కావచ్చు కాని, ఆడవాళ్ళు ప్రాణప్రదంగా భావించే వాటిని కూడా ఇమ్మని అడిగే అవసరం దానికి ఇంకా కలగలేదు. నువ్వు చూపిన సాహసం పట్ల నా గౌరవానికి గుర్తుగా దీనిని స్వీకరించగలవు. నీ త్యాగం వృథా అయిందని అనుకోవద్దు. ఈ ఉంగరం విలువకు పదిరెట్లు చెల్లించి తీసుకున్నాను– అని ఆ లేఖలో ఉంటుంది. అతని అభిమానానికి చలించిన మెలనీ, ‘చూశావా, అతను ఎంత పెద్దమనిషో’నని ఆంట్‌తో అంటుంది. పెళ్లి ఉంగరాన్ని త్యాగం చేయడంతో సహా స్కార్లెట్, మెలనీల వ్యక్తిత్వాల మధ్య తేడాను మెలనీతో తొలి పరిచయంలోనే రెట్ గ్రహిస్తే, అతను పెద్దమనిషన్న సంగతిని మెలనీ గ్రహిస్తుంది. ఎదుటివారిని ఇట్టే అంచనా వేయగల అసాధారణ వివేకంలో ఇద్దరి మధ్యా ఉన్న సామ్యాన్ని ఈ ఉదాహరణల ద్వారా రచయిత్రి ఎంతో నేర్పుతో సూచిస్తుంది. స్కార్లెట్ కూడా రెట్ మనసులో స్థానం సంపాదించుకున్నదే కాని, ప్రస్తుత సందర్భంలో ఒక్క మెలనీ పెళ్లి ఉంగరాన్ని మాత్రమే కొని పంపడం ద్వారా ఇద్దరి మధ్యా వ్యత్యాసాన్ని ఎత్తిచూపడంలో అతను ఏమాత్రం మొహమాటపడడు. స్కార్లెట్ పట్ల అతనిది ఆకర్షణ అయితే, మెలనీ పట్ల అపారమైన గౌరవం.

తొలి పరిచయంలోనే ఒకరిపై ఒకరికి కలిగిన గౌరవభావం రెట్, మెలనీలలో చివరివరకూ అలాగే ఉండిపోయి, పరస్పరాభిమానంగా వికసిస్తుంది. భర్త ఆష్‌లీ సమాచారం కోసం మెలనీ టెలిగ్రాఫ్ ఆఫీసుకు వెళ్ళి అలసటతో స్పృహ తప్పి పడిపోయినప్పుడు, అటువైపు వచ్చిన రెట్ ఆమెను చూసి, గర్భవతి అని గ్రహించి ఇంటికి తీసుకువెళ్లి దింపుతాడు. భర్త సమాచారం కోసం ఇలా కష్టపడవద్దని మందలించి ఆ బాధ్యతను తను తీసుకుంటాడు. ‘నీ గురించి జనం అంత దారుణంగా ఎలా మాట్లాడతా’రంటూ అప్పుడు మెలనీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అతను వెళ్ళిపోయిన తర్వాత, ‘అతని గురించి ఎవరేం చెప్పినా సరే నా ఇంటి తలుపులు అతనికి జీవితాంతమూ తెరచుకునే ఉంటా’యని ఆంట్ పిటీపాట్, స్కార్లెట్‌ల ముందు మెలనీ ప్రకటిస్తుంది. ఆమాటల్లో, పైకి కనిపించే ఆమె స్వభావానికి భిన్నమైన అనుశాసనము, నిష్కర్ష ధ్వనిస్తాయి.

నాటి దక్షిణాది సాంప్రదాయిక సమాజంలో మగవాళ్ళకు, అందులోనూ అవివాహిత పురుషులకు గర్భవతి ఎదురుపడకూడదు. ఆ ప్రస్తావన, అందుకు సంబంధించిన చర్చ మగవారి నోట వినిపించకూడదు. అలాంటి సంకోచాలేవీ లేని రెట్, మెలనీ గర్భవతి అన్న సంగతిని తన ముందు ప్రస్తావించినప్పుడు స్కార్లెట్ సైతం విస్తుపోయి పెద్ద తప్పు జరిగిపోయినట్టు బాధపడుతుంది. యుద్ధం అట్లాంటాలోకి అడుగుపెట్టిన ఉద్రిక్తఘట్టంలో రోజుల బాలెంతగా ఉన్న మెలనీతో కలసి స్కార్లెట్ టారాకు బయలుదేరినప్పుడు, మెలనీని రెట్ ఎత్తుకుని తీసుకెళ్ళి బండిలోకి చేర్చుతాడు. అప్పుడు కూడా స్కార్లెట్ సిగ్గుతో చితికిపోతుంది. కానీ విశేషమేమిటంటే, రెట్‌కే కాదు, మెలనీకి కూడా అది తప్పుగా కనిపించదు. సమయానుకూలంగా స్పందించగల వివేకంలో ఇద్దరికీ గల సామ్యాన్ని వెల్లడించే సందర్భాలలో ఇదొకటి.

ఇతరులతో మాట్లాడేటప్పుడు సాధారణంగా పారుష్యం, అధిక్షేపం, వ్యంగ్యం ధ్వనించే రెట్ గొంతు మెలనీ దగ్గరికి వచ్చేసరి మారిపోతుంది. ఆ గొంతులో గొప్ప గౌరవం, మర్యాద, మన్నన ఉట్టిపడతాయి. టారాకు బయలుదేరిన స్కార్లెట్, మెలనీలతోపాటు బండిలో కొంత దూరం వెళ్ళిన రెట్, ఆ తర్వాత వారిని విడిచిపెట్టి తను సైన్యంలో చేరడానికి నిర్ణయించుకున్నప్పుడు; అతనికీ స్కార్లెట్‌కు మధ్య ఏకాంత సంభాషణ జరుగుతుంది. శత్రువునుంచి ప్రమాదం అన్నివైపులా పొంచి ఉన్న అలాంటి భయోద్విగ్న క్షణాలలో స్కార్లెట్ పట్ల మోహాన్ని పట్టలేక రెట్ ఆమెను ఆలింగనం చేసుకుని చుంబించబోతే స్కార్లెట్ అతని చెంప ఛళ్ళుమనిపించి, ఇంకెప్పుడూ నీ మొహం చూడనంటుంది. నవ్వుకుంటూ అతను అక్కడినుంచి బండి దగ్గరకు వచ్చి, మెలనీని జాగ్రత్తగా చూసుకోమని వాళ్ళతో ఉన్న డార్కీ బాలిక ప్రిస్సీకి(Prissy) చెప్పి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో అతని మాటతీరు మారిపోతుంది.

సాంప్రదాయిక సమాజంలోని మంచినంతటినీ పుణికిపుచ్చుకున్న మెలనీని, ఆమె ప్రాతినిధ్యం వహించే విలువలను సంరక్షించే బాధ్యతను రెట్ తీసుకున్నాడా అన్నట్టుగా వారిరువురి అనుబంధ చిత్రణ ఉంటుంది. యుద్ధానంతర పునర్నిర్మాణ ఘట్టంలో మెలనీ ప్రభావము, ప్రాధాన్యము ఒక్కసారిగా పెరగడం, ఆమెపై మొదటినుంచీ అతనికున్న అంచనాకు తిరుగులేని నిరూపణ అవుతుంది. తను విపరీతమైన మమకారం పెంచుకున్న కూతురు బానీని సాంప్రదాయిక విలువలతో పెంచాలనుకున్న రెట్‌కు మెలనీ ఒక్కతే అందుకు పెద్ద ఆశాకిరణంలా కనిపిస్తుంది. ఈ విషయంలో మనకు సాయపడగలిగింది మెలనీ ఒక్కతే. ఆమెను దూరంగా ఉంచడానికీ, అవమానించడానికీ నువ్వు చేయవలసిందంతా చేశావు. ఆమె పేదరికాన్నీ నాసిరకం దుస్తులనూ ఎత్తిచూపుతూ నా దగ్గర ఎద్దేవా చేయద్దు. అట్లాంటాలో నిక్కమైన, నికార్సైన ప్రతిదానికీ ఆత్మా, కేంద్రస్థానమూ తనే-నని స్కార్లెట్‌తో అంటాడు.

అట్లాంటాలో ఒక మిల్లు, స్టోరు నడుపడంలో శ్రమిస్తూ స్కార్లెట్ ఆరోగ్యం పాడుచేసుకుంటోందన్న కారణంతో ఆష్‌లీకి తెలియకుండా తనే అతనికి డబ్బిచ్చి మిల్లు కొనిపించడంలోనూ మెలనీ పట్ల, ఆమె కుటుంబం పట్ల రెట్ సంరక్షకస్పృహతోనే వ్యవహరించినట్టు కనిపిస్తుంది. ఆ సందర్భంలో మెలనీకి, అతనికి జరిగిన సంభాషణ ఆమె వ్యక్తిత్వానికే కాదు, రెట్ వ్యక్తిత్వంపట్ల ఆమె అవగాహనకూ అద్దం పడుతుంది. తను డబ్బు ఇచ్చిన సంగతి ఆష్‌లీకి తెలియకూడదని రెట్ అన్నప్పుడు, భర్తను తను మోసగించలేనని, అతని వద్ద తనకు రహస్యాలు ఉండవని మెలనీ అంటుంది. అప్పుడు స్కార్లెట్ కోసం ఈమాత్రం చేయలేవా అన్నప్పుడు మెత్తబడుతుంది. మిల్లు యజమానిగా ఆష్‌లీ బాగా డబ్బు సంపాదించవచ్చనీ నీ కొడుకు మంచి యూనివర్సిటీలో చదివి వృద్ధిలోకి వస్తాడనీ అన్నప్పుడు, తల్లి మనసుకు హత్తుకునేలా ఉన్న ఆ మాటల వెనుక గడుసుదనాన్ని చటుక్కున అర్థంచేసుకున్న మెలనీ చిరునవ్వు నవ్వి, ‘పుస్తకం చదివినట్టు నిన్ను చదవగలను.’ అని రెట్‌తో అంటుంది. నీ మంచితనం కొద్దీ నాకు సహాయం చేయాలనుకుంటున్నావు కానీ, నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని. ప్రపంచంలో ఏ ఆడదైనా కోరుకునేవన్నీ నాకు ఉన్నాయి– అంటుంది. ఆ మాటకు రెట్ సమస్థాయిలో స్పందిస్తూ, ‘అవి నీకు ఎప్పుడూ ఉండేలా చూడడమే నేను కూడా కోరుకునేది.’ అంటాడు.

రెట్‌పై మెలనీ ప్రభావాన్ని పతాకస్థాయిలో ప్రదర్శించిన సందర్భం, బానీ దుర్మరణం. తను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురి మరణాన్ని రెట్ తట్టుకోలేకపోతాడు. పిచ్చిపట్టినట్టు అయిపోతాడు. మృతదేహానికి అంత్యక్రియలు జరపడానికి కూడా వీలు లేకుండా మూడు రోజులపాటు గదిలో తన దగ్గరే ఉంచుకుని తలుపులు బిగించుకుంటాడు. ఆ సమయంలో అతన్ని సమీపించడానికి కూడా ఎవరికీ ధైర్యం చాలదు. పరిచారిక మామీ ద్వారా ఈ విషయం తెలుసుకున్న మెలనీ రెట్ ఇంటికి వెళ్ళి గది తలుపులు తీయించి అంత్యక్రియలకు ఒప్పించడమే కాదు; అతని చేత అన్నం తినిపిస్తుంది.

మెలనీ రెండోసారి గర్భవతై, కడుపు పోయి మృత్యుముఖంలో ఉండి స్కార్లెట్‌ను చూడాలనుకున్నప్పుడు రెట్ ఆమెను తీసుకుని మెలనీ ఇంటికి బయలుదేరతాడు. స్కార్లెట్‌కు ఆమె గర్భవతి అన్న సంగతి కూడా అప్పటికి తెలియదు. ‘నీకు తెలుసా? తను కచ్చితంగా నీకు చెప్పి ఉండదు,’ అని రెట్‌తో అంటుంది. ‘ఆమె చెప్పక్కర్లేదు. నేను గ్రహించగలను. గత రెండు మాసాలుగా ఆమె చాలా సంతోషంగా ఉంది. అందుకు మరో కారణం ఏదీ లేదన్న సంగతి నాకు తెలుసు.’ అని రెట్ అంటాడు. ‘కడుపు పోయినంత మాత్రాన చనిపోతారా, నేను చనిపోయానా!’ అని స్కార్లెట్ సందేహం వ్యక్తం చేసినప్పుడు, ‘నీకున్న దారుఢ్యం ఆమెకు లేదు. ఆమె కసలు ఎలాంటి దారుఢ్యమూ లేదు. ఒక్క హృదయం తప్ప ఆమెకు ఇంకేమీలే’దని రెట్ అంటాడు.

మెలనీ మృత్యుముఖంలో ఉన్న ఆ క్షణాలలో అతని మాట తీరే కాదు, మనిషి తీరే మారిపోతుంది. స్కార్లెట్‌ను మెలనీ ఇంటిదగ్గర దింపి తన ఇంటికి తిరిగి వచ్చేసిన రెట్, డైనింగ్ హాలులో ఒంటరిగా కూర్చుండిపోతాడు. కాసేపటి తర్వాత ఇంటికి తిరిగివచ్చిన స్కార్లెట్ వైపు బరువు, అలసట నిండిన కళ్ళతో తదేకంగా చూస్తాడు. ఆ కళ్ళలో ఎప్పుడూ ఉండే వెలుగు లేదు. ఆ ముఖంలో ఎలాంటి భావమూ లేదు. ఎప్పటిలా వెక్కిరింపుగా పెదవి విరవడమూ లేదు. ఆమెవైపు చూసి, వచ్చి కూర్చోమని చెప్పి, ‘ఆమె చనిపోయిందా?’ అని అడుగుతాడు. అతని తీరు స్కార్లెట్‌కు కొత్తగా అనిపించి భయంగొలుపుతుంది. అతని చూపుల్లో ప్రశాంతత, ఒకవిధమైన కారుణ్యమూ తొంగిచూస్తాయి. అతని ప్రశ్నకు ఆమె తల ఊపుతుంది. ‘భగవంతుడు ఆమె ఆత్మకు శాంతి ప్రసాదించుగాక!’ అని భారంగా అన్న అతను, ‘నాకు తెలిసి సంపూర్ణ కారుణ్యం మూర్తీభవించిన ఏకైక వ్యక్తి ఆమె.’ అంటాడు. ఆ మాటతో మెలనీ తనపట్ల చూపించిన ప్రేమాదరాలు గుర్తొచ్చి స్కార్లెట్‌లో దుఃఖం కట్టలు తెంచుకుంటుంది. ‘నువ్వు నాతో ఎందుకు రాలేదు? నేను తట్టుకోలేకపోయాను. నువ్వు నాతో ఉంటే బాగుండేదనిపించింది,’ అంటుంది. ‘నేను అసలే తట్టుకోలేకపోయేవాడి’నంటాడు రెట్. కాసేపు మౌనంగా ఉండిపోయి, ఆ తర్వాత, అతి ప్రయత్నంమీద, ‘ఆమె ఒక మహోన్నత మహిళ!’ అంటాడు. తనలో బాల్యంలోనే అంతరించిందనుకున్న తీవ్రభావోద్వేగం ఒక్కసారిగా ఎగతన్నుకు వచ్చిన ఆ క్షణాలలో ఇదే మాట అతని నోట మరోసారి వెలువడుతుంది.

విశేషమేమిటంటే, మెలనీ-రెట్‌ల మధ్య రచయిత్రి చిత్రించిన అనుబంధం కేవలం వ్యక్తిగతం కాదు; అంతకు మించిన సామాజిక వైశాల్యం దానికి ఉంది. రెట్ పాత్రను ముందునుంచీ మలచిన తీరుతోను, నాటి సాంప్రదాయిక ప్లాంటర్‌ల సమాజంలో అతని స్థానం గురించి మధ్య మధ్య చేస్తూవచ్చిన వ్యాఖ్యలతోనూ కలుపుకుని ఈ ఇద్దరి అనుబంధాన్ని పరిశీలించినప్పుడు దానికిగల సామాజిక పార్శ్వం అర్థమవుతుంది. రెట్ జూదరి, వ్యభిచారి, తప్పుడు పద్ధతుల్లో డబ్బు గడించినవాడు. ప్లాంటర్‌ల సమాజం పెద్దమనిషిగా గుర్తించగల లక్షణం అతనిలో ఒక్కటి కూడా లేదు. కన్నతండ్రితోపాటు ప్లాంట‌ర్‌ల సమాజం మొత్తం అతన్ని వెలివేసింది. తన స్వస్థలమైన చాల్స్‌టన్‌లో తనను ఆహ్వానించే కొంప ఒక్కటీ లేదని అతనే చెప్పుకుంటాడు. అట్లాంటాలోనూ దాదాపు అదే పరిస్థితి. జూదరిగా అతన్ని ఈసడించుకోవడంలోనూ ప్లాంటర్‌ల సమాజంలోని వైరుధ్యాన్ని, డాంబికత్వాన్ని రచయిత్రి అడుగడుగునా ఎత్తిచూపుతుంది. జూదంలో డబ్బు, ఇళ్ళు, భూమి, బానిసలను కోల్పోయిన అన్నో తమ్ముడో తండ్రో లేదా బంధువో లేని కుటుంబం జార్జియా రాష్ట్రం మొత్తంలోనే లేదని, అయినప్పటికీ సమాజం అలాంటి వ్యక్తిని పెద్దమనిషిగానే గుర్తిస్తుందని, అదే రెట్ లాంటి వృత్తిజూదరినైతే అస్పృశ్యుడిగా పరిగణించి వెలివేస్తుందనీ ఒకచోట అంటుంది. యుద్ధరూపంలో వచ్చిపడిన విపత్తు, కాన్ఫెడరేట్ ప్రభుత్వానికి రెట్ అందించిన సేవలూ అడ్డురాకపోతే అట్లాంటాలో కూడా ఒక్కరూ అతన్ని దగ్గరికి రానిచ్చేవారు కారని అంటుంది. అతన్ని ద్వేషిస్తూనే అతని నుంచి సహాయాలు పొందడానికి వెనుకాడని ప్లాంటర్‌ల సమాజంలోని అల్పత్వాన్ని, తన పాపపరిహారంగానే అతను తమకు సాయపడుతున్నట్టు సర్దిచెప్పుకునే ఆత్మవంచననూ పలు సందర్భాలలో కళ్ళకు కట్టిస్తుంది.

మేరీ వెదర్ కూతురు మే బెల్ (May Belle) పెళ్లి ముచ్చట అలాంటి సందర్భాలలో ఒకటి. యుద్ధసమయం కనుక పెళ్లి కూతురు ధరించే తెలుపు శాటిన్ వస్త్రం దొరకని పరిస్థితి వస్తుంది. కాన్ఫెడరసీలో ఉన్న శాటిన్ వస్త్రం మొత్తాన్ని యుద్ధపతాకాల తయారీకి ఖర్చుపెట్టేశారు. ప్లాంట‌ర్‌ల పోరాటం కోసం తలపిన్నులను, బటన్‌లను, అందమైన షూలను త్యాగం చేయడాన్ని గర్వంగా భావిస్తాను కానీ శాటిన్ వస్త్రాన్ని మాత్రం త్యాగం చేయలేనని పెళ్లికూతురు భీష్మిస్తుంది. కాన్ఫెడరేట్ పెళ్లికూతురు ధరించాల్సింది చేనేత వస్త్రమే కానీ శాటిన్ వస్త్రం కాదని, దేశభక్తిని రంగరిస్తూ తల్లి మేరీ వెదర్ ఎంత నచ్చజెప్పినా వినదు.

మెలనీ ద్వారా ఈ విషయం రెట్‌కు తెలుస్తుంది. అతను గజాల కొద్దీ శాటిన్ వస్త్రాన్ని, అందమైన అల్లిక పని కలిగిన మేలి ముసుగును తెప్పించి పెళ్లి కానుకగా ఇస్తాడు. మే బెల్ ఎంత సంతోషిస్తుందంటే దాదాపు అతన్ని ముద్దు పెట్టుకోబోతుంది. వాటి ధర చెల్లిస్తామని మాటవరసకు కూడా అనలేని పరిస్థితి వారిది. యుద్ధసమయంలో అంత ఖరీదైన కానుకను స్వీకరించడం తగదని మేరీ వెదర్‌కు తెలిసినా అడ్డుచెప్పలేకపోతుంది. అంతవరకూ తను తీవ్రంగా విమర్శిస్తూ వచ్చిన రెట్‌ను పెళ్లి విందుకు ఆహ్వానించడం ఆమెకు తప్పనిసరి అవుతుంది. అతన్ని విందుకు ఆహ్వానించడమే అతనిచ్చిన కానుకల కంటే పెద్ద కానుక అని ఆమె అనుకుంటుంది.

అప్పటికే జూదరిగా, వ్యభిచారిగా ముద్రవేయించుకున్న రెట్, కాన్ఫెడరేట్ యుద్ధ ప్రయత్నాలను విమర్శించినవాడిగా, యుద్ధానికి దూరంగా ఉన్నవాడిగా, శత్రువుతో వ్యాపార లావాదేవీలు జరిపేవాడిగా దేశద్రోహి అన్న కొత్త ముద్ర కూడా తెచ్చుకుంటాడు. అయినా కాన్ఫెడరేట్ సైనికుల సహాయం కోసం అతని నుంచి పెద్ద మొత్తాలలో విరాళాలు తీసుకోడానికి ఆ ముద్ర అడ్డు రాదు. దిగ్బంధాన్ని అమలు చేస్తున్న యాంకీ నౌకాదళం కన్నుకప్పి అతను తెప్పించిన సరకుల్ని రెండు చేతులతో అందుకోడానికీ అడ్డు రాదు. కాన్ఫెడరసీ భవిష్యత్తు, యుద్ధరంగంలో పోరాడుతున్న సైనికుల మీద ఎంత ఆధారపడి ఉందో, ఇలా సరకు తెప్పించగల రెట్ ప్రావీణ్యం మీదా అంతే ఆధారపడి ఉందన్న గ్రహింపు కలగడానికి ఎంతో సమయం పట్టదు. యుద్ధసమయంలోనే కాదు, యుద్ధానంతరం కూడా రెట్ నుంచి కాన్ఫెడరేట్‌కు బహుముఖ సాయాలు అందుతూనే ఉంటాయి. అలాగే వ్యక్తుల స్థాయిలో కూడా. కానీ అవేవీ రెట్ మీద ఉన్న రకరకాల ముద్రలను చెరపలేకపోతాయి. అతనికి ఆమోదయోగ్యతను తేలేకపోతాయి.

ఈ నేపథ్యం నుంచి మెలనీ-రెట్‌ల మధ్య చిత్రించిన అనుబంధాన్ని గమనించినప్పుడు, వ్యక్తిగతాన్ని మించి అది సంతరించుకున్న సామాజిక స్వభావం ఎలాంటిదో అర్థమవుతుంది. రెట్‌కీ, అతన్ని వెలివేసిన ప్లాంటర్‌ల సాంప్రదాయిక సమాజానికీ మధ్య మెలనీ ఒక పెద్ద అతుకుగాను, వారధిగానూ మారుతుంది. నిర్ణయాత్మకమైన ఈ యుద్ధ ఘట్టంలో తనూ కాన్ఫెడరేట్ గుండెతో స్పందిస్తున్నదే. దాని విలువలు, విశ్వాసాలు, భావజాలంలో పాలు నీళ్లలా కలసిపోయినదే. పైగా అందులోనూ ఎందరిలోనో లేని నిబద్ధత, శీలసమగ్రత, స్వచ్ఛత ఆమెలో ఉన్నాయి. ఆపైన సాటి వ్యక్తులు ఎందరిలోనో కనిపించని గొప్ప ఇంగితజ్ఞానము, మానవస్వభావవైవిధ్యం పట్ల అపారమైన అవగాహన, అనుకంప ఆమెలో ఎలా ఉన్నాయో ఇప్పటికే పలు ఉదాహరణలతో చెప్పుకున్నాం. ఇంకొకటి చెప్పుకుంటే, తను ఆశ్రయమిచ్చి ఆదరించిన ఆర్చీ(Archie) అనే బండివాడు ఒక సందర్భంలో స్కార్లెట్‌ను తప్పుపట్టినప్పుడు అతనిపై మెలనీ ఆగ్రహిస్తూ అంటుంది: నువ్వు ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే ఇంట్లోంచి పంపేస్తాను. అందులో ఆమె తప్పులేదు. తను చేయాలనుకున్నది ఆమె చేసింది. వాళ్ళు చేయాలనుకున్నది వాళ్ళు చేశారు. ఎవరైనాసరే తాము చేసి తీరాలనుకున్నది చేయవలసిందే. మనందరం ఒకేలా ఆలోచించం, ఒకేలా వ్యవహరించం. మనల్ని బట్టి అవతలి వాళ్ళ ప్రవర్తనపై తీర్పు చెప్పడం తప్పు.

మానవస్వభావవైవిధ్యం పట్ల ఇలాంటి గుర్తింపు, గౌరవమూ; అందుకు కారణమైన విజ్ఞతావివేకాలే ఆమెకు ఔన్నత్యాన్ని కల్పించి అట్లాంటాలోని స్వీయసమాజం మొత్తానికే ఆమెను ఎలా నాయకురాలిగా ప్రతిష్టించాయో చెప్పుకున్నాం. అంతేకాదు, ఆయా వ్యక్తులకు, పరిస్థితులకు అనుగుణంగా కట్టుబాట్లను, విశ్వాసాలను సడలించుకుంటూ స్పందించగల గొప్ప ఆలోచనాస్వాతంత్ర్యాన్ని పై లక్షణాలు ఆమెకు అలవరచాయి. ఆపైన కట్టుబాట్లు, విశ్వాసాల కంటే ఎత్తుపీట మీద మానవీయత, కారుణ్యం వంటి సహజాతాలను ప్రతిష్టించే వెసులుబాటునూ ఆమెకు కల్పించాయి. తనదైన సాంప్రదాయిక సమాజంలో తను విడదీయలేని భాగంగా ఉంటూనే, ఆ సమాజం తాలూకు ఇతరేతర కొలమానాలకు అదనంగా; లేదా వాటిని ఒక్కోసారి అప్రధానం చేస్తూ మానవత్వం, కారుణ్యం వంటి కొత్త కొలమానాలను నిశ్శబ్దంగా, నిరార్భాటంగా స్థాపించడంలో మెలనీ వైశిష్ట్యం కనిపిస్తుంది. ముందే చెప్పినట్టు, ఈ కొత్త కొలమానాల స్థాపనలో ఆమె ధర్మశాస్త్రకర్తలలో మాత్రమే కనిపించే నిష్కర్షను, నిస్సంకోచాన్నీ ప్రదర్శిస్తుంది. రెట్ ఉత్తముడని, పెద్దమనిషి అని తొలి పరిచయం నుంచీ నొక్కిచెప్పడంలో, అతని గురించి ఎవరేమనుకున్నాసరే, నా ఇంటి తలుపులు అతనికి, అతని జీవితాంతమూ తెరిచే ఉంటాయని శాసించడంలో ఇది కనిపిస్తుంది.

రెట్ బట్లర్ ప్లాంటర్‌ల తరగతికి చెందిన జనం మధ్య ఉంటూనే, వారికి దూరంగానూ ఉంటూ వారి స్థితిగతులపై వ్యాఖ్యాత పాత్ర నిర్వహించినట్టే; మెలనీ సాంప్రదాయిక సమాజంలోను, దాని భావజాలంలోను, ఒదిగి ఉంటూనే దానిని అధిగమిస్తూ లోపలినుంచి దానిని సంస్కరించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ వేయిపడగలకు, గాన్ విత్ ద విండ్‌కు గల ఇతివృత్త సామ్యాన్ని మరోసారి గుర్తు చేసుకుంటే, రెండూ పతనోన్ముఖమైన సాంప్రదాయిక సమాజాన్ని, ఆ పతనం నుంచి తమను తాము కాపాడుకోవడం గురించిన పెనుగులాటనే చిత్రించాయి. ధర్మారావు, ఆష్‌లీ సహా రెండు నవలలోనూ ఉన్న ఆయా పాత్రల మధ్య మనం ఇంతవరకూ పరిశీలించిన పోలికలు, తేడాలను అలా ఉంచితే; వేయిపడగల సమాజానికి నాలుగువర్ణాల వ్యవస్థ ఆధారభూమిక అయినట్టుగా గాన్ విత్ ద విండ్ సమాజానికి బానిసల వ్యవస్థ ఆధారభూమిక అయింది. ఈ పోలికల్లోనే రెండింటి మధ్యా ఉన్న అతి కీలకమైన తేడాలలో ఒకటి ఏమిటంటే, వ్యవస్థలో భాగమవుతూనే ఆ వ్యవస్థను అధిగమిస్తూ, దానికి కొత్త కొలమానాలను ఇచ్చి కొత్త ప్రమాణాలను నిర్దేశించిన మెలనీ లాంటి పాత్ర వేయిపడగలులో లేకపోవడం. మెలనీలానే ధర్మారావు కూడా మానవీయ స్పందనలు, కారుణ్యం ఉన్నవాడే. కానీ ఇద్దరిలో తేడా ఎక్కడుందంటే; మానవీయత, భూతదయ ముఖ్యమే కానీ తాను విశ్వసించే చాతుర్వర్ణ్య వ్యవస్థను పరిరక్షించడం ధర్మారావుకు అంతకంటే ముఖ్యం. అదే మెలనీ విషయానికి వస్తే, వ్యవస్థ తాలూకు కట్టుబాట్లను, విశ్వాసాలను, విలువలను పాటించడం ముఖ్యమే కాని; వాటికీ మానవీయతకు, భూతదయకు మధ్య విరోధం ఏర్పడితే మాత్రం ఆమె మొగ్గు రెండో వైపే.

మరో విధంగా చెప్పుకోవాలంటే, వేయిపడగలులోలా సాంప్రదాయిక వ్యవస్థాపరిరక్షణ గురించిన ఆరాటాన్నే ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని గాన్ విత్ ద విండ్‌ను రచించి ఉంటే, అది ఆష్‌లీ నాయకుడిగా ముమ్మూర్తులా మరో వేయిపడగలు అయ్యేది. కానీ మెలనీ పాత్ర (తమ తమ రీతుల్లో స్కార్లెట్, రెట్ బట్లర్‌లు కూడా) ఆ పరిణామాన్ని నివారించి రెండింటి మధ్యా పెద్ద అంతరాన్ని కల్పించింది. మెలనీ పాత్ర ముఖంగా మానవీయతా కోణాన్ని నొక్కి చెప్పడంలో రకరకాల హెచ్చుతగ్గులు, చీలికలు, వివక్షలు, ముద్రలు, ఆధిపత్య ధోరణులతో కూడిన సాంప్రదాయిక వ్యవస్థ స్థానంలో కలుపుగోలు(inclusive) స్వభావం కలిగిన ఉదార వ్యవస్థను లక్షించడం కనిపిస్తుంది.

ఎక్కడైనా సరే, సాంప్రదాయిక వ్యవస్థకు నిచ్చెనమెట్ల స్వభావం ఉంటుంది. ఆధిపత్య స్థానంలో ఉన్నవారు ఆర్థికంగా, సామాజికంగా తమకు కింది స్థానంలో ఉన్నవారిపై, లేదా భిన్న భావజాలాలు, సంస్కృతులు, విశ్వాసాలు, ఆహారపు అలవాట్లు ఉన్నవారిపై, శత్రువులపై రకరకాల ముద్రలు వేయడం, కించపరచడం, తీర్పు చెప్పడం ఉంటుంది. వ్యక్తులలోను, వ్యవస్థలలోను, సంస్కృతీ సాహిత్యాలలోను, అలవాట్లలోను ఉన్న వైవిధ్యాన్ని గుర్తించి గౌరవించే బదులు, వాటి ప్రాతిపదికపై ఎక్కడికక్కడ మనుషులను విడగొట్టి చూడడం ఉంటుంది. వేయిపడగలలోని ధర్మారావు వ్యక్తిగత స్థాయిలో ఉదారుడిగా, మానవతావాదిగా కనిపించవచ్చు. కానీ నిచ్చెనమెట్ల స్వభావం కలిగిన చాతుర్వర్ణ్య వ్యవస్థను మనసావాచా విశ్వసించేవాడిగా మనుషుల్ని విడగొట్టి చూడడం, వైవిధ్యాన్ని గుర్తించకపోవడం, తన సంప్రదాయ సంస్కృతీసాహిత్యాల పట్ల విపరీతమైన ఆత్మోత్కర్షను, ఇతరులకు చెందిన వాటిపట్ల అంతే తృణీకారాన్ని చాటుకోవడం, తీర్పు చెప్పడం అతని ద్వితీయ ప్రకృతిగా నవల అంతటా వ్యక్తమవుతుంది. అన్నింటా ఈ విభజనదృష్టే వేయిపడగల ఇతివృత్త నిర్మాణం మొత్తానికి పునాది అవుతుంది. ఇందుకు సంబంధించిన అనేక ఉదాహరణలను గత వ్యాసాలలో చూడవచ్చు.

పరాయి పాలన కారణంగా తమ సాంప్రదాయిక వ్యవస్థ, విలువలు, వైభవాలూ అంతరించిపోతున్నందువల్ల రచయితలో కలిగిన తీవ్రదుఃఖవిషాదాలనే ఆత్మాశ్రయరీతిలో ఏకోన్ముఖంగా అక్షరబద్ధం చేసిన రచనగా వేయిపడగలను పరిశీలించే ఒక కోణం లేకపోలేదు. అదే సమయంలో సర్వత్రా సాంప్రదాయిక సమాజాలలో ఉండే పైన చెప్పిన లక్షణాలే వేయిపడగలలో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, నవల మొత్తంలో ధర్మారావు చేసింది, ప్రతి విషయంలోనూ ‘మనమూ-వాళ్ళూ’ అన్న తేడా తీసుకొచ్చి తీర్పరి పాత్రను నిర్వహించడమే. మనుషులు, దేశాలు, సంస్కృతులు, సాహిత్యాలు, భాషల మధ్య హెచ్చుతగ్గుల తేడాలను తీసుకురావడమే కాదు, వాటిని ఇలా సిద్ధాంతీకరిస్తాడు: ఆవు చురుకైన జంతువు. బర్రె మందమైన జంతువు. ప్రకృతిలోని యా మాంద్యము దాని రక్తమందున్నది. ద్రవ్యమును బట్టియే గుణము వచ్చినది. వాని రెండింటికీ నవినాభావ సంబంధమున్నది. బ్రాహ్మణుని చూడగానే బ్రాహ్మణుడని తెలియుచున్నది. తుని వైపు క్షత్రియులను చూడుము. వెంటనే క్షత్రియుడని తెలియును… క్రైస్తవుడు క్రైస్తవునివలె కనిపించుచున్నాడు. అది భేదమే. అది వర్ణమే… అందరమొక్కటి యను సిద్ధాంతము పశువులన్నియు నొక్కటియే యను సిద్ధాంతము వంటిది… అట్లే భిన్న వర్ణములందు భేదములున్నవి.

ఇంకా ఆసక్తికరం ఏమిటంటే, సాంప్రదాయిక సమాజాలు ఈ వివక్షకు, విభజనదృష్టికి అనువైన వ్యక్తీకరణను, పదజాలాన్ని, ముద్రలనూ కూడా తమ భాషలలో అభివృద్ధి చేసుకుంటాయి. అవి అలా నిత్యవ్యవహారంలో భాగం కావడంవల్ల ఆ భాషీయులకు తెలియకుండానే వారి చైతన్యంలో ఇంకి సంభాషణల్లో యథేచ్ఛగా దొర్లుతాయి. ‘మాలకూడు’, ‘మాలదానిని’ పెళ్లి చేసుకోవడం గురించి అరుంధతి, ధర్మారావుల మధ్య జరిగిన సంభాషణను కిందటి వ్యాసంలో ఉదహరించుకున్నాం.

కులీనత గురించిన పట్టింపు, తరగతులుగా మనుషుల విభజన; రెట్ బట్లర్ వంటి భిన్న భావజాలాలు కలిగినవారిపై, శత్రువుపై రకరకాల ముద్రలు వేయడంతో సహా ఒక సాంప్రదాయిక సమాజంగా గాన్ విత్ ద విండ్ చిత్రించిన సమాజంలోనూ ఇవే లక్షణాలున్నాయి. తేడా ఎక్కడుందంటే, వేయిపడగలు ఈ లక్షణాల దగ్గరే ఆగిపోగా, గాన్ విత్ ద విండ్ వీటిని దాటి వెళ్ళి విభజన దృష్టి స్థానంలో కలుపుగోలు దృష్టిని స్థాపించడానికి ప్రయత్నిస్తుంది. మెలనీ ముఖంగా జరిగింది అదే. రెట్ బట్లర్‌ను సమర్థించడంలో, వ్యతిరేకులపై ముద్రలు వేసి శీలహననానికి పాల్పడే సాంప్రదాయిక సమాజం తాలూకు ఆధిపత్య ధోరణిని ఆమె నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. డా. మీడ్, మిసెస్ మేరీ వెదర్ చెబుతున్న అన్ని దుర్లక్షణాలు అతనిలో ఉండవని నేను కచ్చితంగా చెప్పగలను. అతను అన్నార్తుల నోటి దగ్గర ముద్ద లాక్కునే మనిషి కాదు. (కాన్ఫెడరేట్‌పై) మనలో ఉన్నంత విధేయతా, దేశభక్తీ అతనికీ ఉన్నాయి– అని ఆంట్ పిటీపాట్‌తో అంటుంది. ఆవేశకావేషాలు నిండిన నాటి యుద్ధ వాతావరణంలో, యుద్ధాన్ని విమర్శిస్తూ దానికి దూరంగా ఉన్న వ్యక్తిని వెనకేసుకురావడంలోనే కాక, తన ఇంటి తలుపులు అతనికి ఎప్పుడూ తెరచుకునే ఉంటాయని ప్రకటించడంలోనూ అసామాన్యమైన తెగింపును, ధిక్కారాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె నైతిక స్థైర్యం నుంచి, శీలస్వచ్ఛతనుంచి పుట్టిన లక్షణాలవి. ఆ క్రమంలో ఆమె, విభజన స్వభావం కలిగిన సాంప్రదాయిక సమాజపు భాషనూ, వ్యక్తీకరణనూ కూడా పరోక్షంగా తోసిపుచ్చుతుంది. శత్రువుతో సహా ఎవరి పట్లా అవహేళన, నింద, న్యూనత ధ్వనించే మాటలను మెలనీ నోట రచయిత్రి ఎక్కడా పలికించకపోవడం, భాష విషయంలో ఆమె కనబరచిన ప్రత్యేక స్పృహను పట్టి చూపుతుంది. ఇంకా చెప్పాలంటే భాషను ప్రజాస్వామికం చేసే ప్రయత్నానికి అది దగ్గరగా ఉంటుంది. ‘మనందరం ఒకేలా ఆలోచించం, ఒకేలా వ్యవహరించం. మనల్ని బట్టి అవతలి వాళ్ళ ప్రవర్తనపై తీర్పు చెప్పడం తప్పు.’ అని మెలనీ అనడంలోనూ వైవిధ్యాన్ని గుర్తించి గౌరవించే ప్రజాస్వామిక స్పృహే కనిపిస్తుంది.

ధర్మారావు వైఖరి ఇందుకు పూర్తి భిన్నం. అతను అధికసంఖ్యాకుల అభిప్రాయం చెల్లుబాటయ్యే ప్రజాస్వామిక వ్యవస్థనే నిరాకరిస్తాడు. ఆ నిరాకరణను సిద్ధాంతీకరించబోతాడు. కాబోయే తన రెండవ అత్తగారు అనసూయకీ (చిన్న అరుంధతి తల్లి), రెండవ మామగారు పశుపతికీ అతనికీ జరిగిన కింది సంభాషణలో అది కనిపిస్తుంది:

అనసూయ:
బాల వితంతువుల సంగతి విచారించకపోయినచో బాల్యమృతులను గూర్చి విచారించరాదా?

ధర్మారావు:
(వ్యంగ్యముగా) చచ్చినవారి సంగతి మాకెందుకు? వారి సంగతి మ్యునిసిపల్ వారికి. మాది మ్యారేజి బ్యూరో, మాకు మిగిలినవి పెండ్లిండ్లు, ప్రేమ. ఇక దేని గురించి మాటాడమందువు? కొన్ని సంగతులు మాటాడినచో రాచరికము వారూరకుండరు. విద్యావిషయము మాకు తెలియదు. వేదాంతము మొదలైన వగమ్యములు. పదార్థవిజ్ఞానశాస్త్రాదు లగాధములు. మిగిలినవి పెండ్లి, ప్రేమ. మా పరిశోధన, శాస్త్రచర్చ, ప్రయోజకత్వము వీని మీద. మా పక్షము గెలుచుననుటకు మా సంఖ్య యెక్కువ. మా వాదన నిజము కనుకనే గెలుచుచున్నది.

అనసూయ:
అందుకు కాదు. మీకు దంభమెక్కువ గనుక గెలుచుచున్నది. యాథార్థ్య మతీతజ్ఞానవిషయము కానీ, యెక్కువమంది చెప్పునది కాదు. గొర్రెల మంద యుండును. ఏనుగులు రెండో, మూడో. గౌరవ మేనుగులకే. ఏనుగు గొప్ప యేమనినచో యేమని చెప్పగలము? అది మనసునకే తెలియును.

ధర్మారావు:
ధర్మము కూడా నట్టిదే. అదియు మనసునకే తెలియును, మన మేనుగుల కిచ్చినంత గౌరవము పాశ్చాత్యు లీయరు. మన ధర్మశాస్త్రముల గతియు నంతే.

పశుపతి:
ఆ శాస్త్రముల గూర్చి మన దేశీయులకే చాలామందికి నమ్మకము లేదు. అవి వ్రాసినవారు మనవంటివారే.

ధర్మారావు:
మన దేశీయులకే నమ్మకము లేదనగా; మన దేశీయులనగా, మన దేశమునందు పుట్టినవారని యర్థము. మనదేశమనగా నాల్గు హద్దులు గల ప్రదేశమని కాదర్థము. ఇచ్చటి మతము, సంఘము, ఆచారములు సర్వమునని యర్థము. ఈ భూఖండమునందు పుట్టినంతలో నొరిగినదిలేదు. మన మతసంఘాచారములయందు పుట్టవలయును. వాడూ మనదేశస్థుడు. ఇంక అవి వ్రాసినవారు మనవంటివారే నంటివి. ఆ మాటలు చాలా తప్పు. వారు మనవంటివారు కాదు. ఒక్కటి చూడు. రాజును నా వంటివాడే యని వీథిలో నిలుచుండి యనుము. ఏమగును? ఊరికి జానెడు బెత్తెడులో నుందువు. ధర్మశాస్త్రకర్తలు మనవంటివారే. వారురి తీయించరుకదా!

అధికసంఖ్యాకుల అనుశాసనం చెల్లే ప్రజాస్వామ్యంపై అవహేళన, వ్యంగ్యం, అక్కసు రంగరించి చేసిన పై వ్యాఖ్యలను అనేక కోణాలనుంచి అర్థంచేసుకోడానికి అవకాశముంది. ఆ అవహేళన వెనుక గొర్రెలమంద పోలికతో అధికసంఖ్యాకులను అజ్ఞానులుగా, అన్ని రకాలుగా అనర్హులుగా జమకట్టి చిన్నబుచ్చే ధోరణి ఉంది. అల్పసంఖ్యాకులైన తాము ఏనుగులమని, జ్ఞానంపై తమదే గుత్తాధిపత్యమనీ చాటుకోవడం ఉంది. అదే సమయంలో ఆ అక్కసులో స్వీయఅస్తిత్వ భయం నుంచి పుట్టే అశక్త క్రోధం కూడా పచ్చిగా బయటపడిపోతోంది. ఆ అస్తిత్వ భయానికి రెండు ముఖాలున్నాయి. మొదటిది, తాము శతాబ్దాలుగా అభివృద్ధి చేస్తూవచ్చిన సాంప్రదాయిక జ్ఞానం మొత్తం అధికసంఖ్యాక ప్రాబల్యం కలిగిన ప్రజాస్వామ్య వ్యవస్థలో తిరస్కృతికి, నిరాదరణకు గురవుతుందన్న భయం. వ్యవస్థలో సమూలమైన మార్పు వచ్చినప్పుడు అలాంటి భయాలు సహజంగా ఉంటాయి కనుక వాటిని కొంత సానుకూల దృష్టితో అర్థంచేసుకునే అవకాశం లేకపోలేదు. అయితే, ఆ అస్తిత్వ భయం తాలూకు రెండవ ముఖాన్ని గమనిస్తే, అందులో సొంత మనుగడకు సంబంధించిన భయం కూడా కనిపిస్తుంది. శతాబ్దాలుగా, బహుశా సహస్రాబ్దాలుగా అన్ని రంగాలలోనూ ఈ దేశ బౌద్ధిక జీవితాన్ని శాసిస్తున్నది, ప్రభావితం చేస్తున్నది తామే కనుక; తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జ్ఞానానికి ప్రజాస్వామ్యంలో ముప్పు వాటిల్లడమంటే నేరుగా తమ మనుగడకు ముప్పు వాటిల్లడమే.

బాల వితంతువుల గురించి మీకెందుకు, ముందుగా బాల్య మరణాలను పట్టించుకొండని అనసూయ అనడంలో వితంతు వివాహాలను నిషేధించే సాంప్రదాయిక అనుశాసనంలో ప్రజాస్వామ్యం జోక్యం చేసుకుని, వాటిని సమర్థిస్తోందన్న అసహనము, అందువల్ల కలిగిన అశక్త క్రోధంతో బాల వితంతువులకు, బాల్య మరణాలకు లేని పోటీని తీసుకురావడమూ కనిపిస్తుంది. పెండ్లిండ్లు, ప్రేమల గురించిన చర్చలకు; విద్య, వేదాంతం, పదార్థవిజ్ఞానశాస్త్రాలకు మధ్య లేని పోటీని తీసుకురావడంలో ధర్మారావులోనూ వ్యక్తమవుతున్నది అలాంటి అసహనమే. జ్ఞానసంబంధ విషయాలలో కూడా ఆధిక్యత-న్యూనత; లేదా మనమూ-వాళ్ళూ అన్న తేడాను తీసుకొచ్చే మనస్తత్వమే ఇక్కడా. ఆపైన అధికసంఖ్యాకుల అభిమతానుసారంగా నడిచే ప్రజాస్వామ్య వ్యవస్థ అన్ని రకాల శాస్త్రాల అభివృద్ధికీ అడ్డుగోడ అవుతుందని, ఆ రెండింటికీ మధ్య ఏదో విరోధం ఉందన్న అపోహ దీని వెనుక ఉంది. నిజానికి తనతో ఏకీభవించని జ్ఞానాన్ని నిషేధించే లక్షణం సాంప్రదాయికతకే ఉంది కానీ ప్రజాస్వామికతకు లేదు. ఉంటే అది ప్రజాస్వామ్యమే కాదు. జ్ఞానాన్ని నిషేధించకపోగా దానిని ప్రజాస్వామ్యీకరిస్తూ విస్తృత ప్రజానీకానికి దానిపై హక్కు కల్పించడంలోనే ప్రజాస్వామ్యపు మౌలికత ఇమిడి ఉంది. ధర్మశాస్త్రాల గతిని తలచుకుని ధర్మారావు బెంగపడడంలోనూ ప్రజాస్వామ్యం పట్ల అతని అనవగాహన వ్యక్తమవుతుంది. ప్రజాస్వామ్యం తనదైన తాత్వికతకు అనుగుణంగా ధర్మశాస్త్రాలను తిరగరాస్తూ కొత్త ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తుందన్న స్పృహ అతనిలో లేదు. భారత ప్రజాస్వామిక రాజ్యాంగరూపంలో అవతరించినది కొత్త ధర్మశాస్త్రమే.

వితంతు పునర్వివాహాలకు చట్టబద్ధత కల్పించడం, బాల్య వివాహాలను నిషేధించడం వగైరాల రూపంలో వ్యక్తిగత ధర్మశాస్త్రాలను దాటి వెళ్ళడంలో ఈ దేశ మెజారిటీ మతస్తులు ఇతరులకు గొప్ప ఒరవడి అయిన సంగతిని స్మరించుకుంటూనే వితంతు పునర్వివాహాలను నిరాకరించడంలో, బాల్య వివాహాలను సమర్థించడంలో వేయిపడగల రచయితకు, నేడు ట్రిపుల్ తలాక్‌ను సమర్థిస్తున్న ఇస్లామిక్ సంప్రదాయవాదులకు మధ్య ఉన్న పోలికను గమనించడానికి ఇతరేతర అభిమానాలు అడ్డు రాకూడదు. దేశీయులనగా ఎవరో వేయిపడగల రచయిత ఇచ్చిన నిర్వచనమూ ప్రస్తుత సందర్భంలో ఆసక్తికరమే. దేశమంటే నాలుగు హద్దులు కలిగిన ప్రదేశం కాదని, ఇక్కడ పుట్టిన ప్రతివాడూ ఈ దేశస్థుడు కాడని, ఇక్కడి మత, సంఘ, ఆచారాలలో పుట్టినవాడే ఈ దేశస్థుడనీ ధర్మారావు అంటున్నాడు. ఈ విధంగా మత, సంఘ, ఆచార ప్రాతిపదికపై ఈ దేశస్థులను విభజిస్తున్నాడు. ఈరోజున రాజకీయ ప్రాబల్యాన్ని తెచ్చుకున్న హిందుత్వ భావజాలం ఈ నిర్వచనం పునాది మీదనే అభివృద్ధిచెందిన సంగతి తెలిసినదే. వందేళ్ల వెనక్కి వెళ్లి చూస్తే, గాంధీ నాయకత్వంలోని స్వాతంత్రోద్యమం తాలూకు భావజాలంతోను, తదనంతర పరిణామాలతోనూ సాంప్రదాయిక సమాజం జరుపుతూవచ్చిన పోరాటం రాను రాను అసమయుద్ధంగా పరిణమించింది. దాంతో అది కలిగించిన తీవ్ర నైరాశ్య, అకర్మణ్యతల పార్స్వాన్నే ధర్మారావు ముఖంగా వేయిపడగలు చిత్రించింది. అయితే, విభజన స్వభావం కలిగిన తనదైన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నమూనాను అమలుచేయడంలో శతాబ్దాల అనుభవం కలిగిన సాంప్రదాయిక సమాజం అంత తేలికగా ఓటమిని అంగీకరించి కత్తి దించే ప్రశ్న లేదు. తన వందల ఏళ్ల అస్తిత్వంలో ఎదుర్కొన్న అనేకానేక పతనోత్థానాలలో ఇప్పుడు జరుగుతున్నది ఒకటి మాత్రమే. గత నూరేళ్ళ కాలంలో తన పునరుత్థానానికి, పునర్వైభవానికి అది ఎంతో పకడ్బందీగా పూర్వరంగాన్ని నిర్మించుకుంటూనే వచ్చింది. అదిప్పుడు ఫలవంతమైంది. వేయిపడగల దృష్ట్యా చెప్పుకుంటే, అందులో చిత్రించిన సాంప్రదాయిక సమాజము, దాని భావజాలము, దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మారావులూ వెనకటి ఆభాస నైరాశ్యం నుంచి, అకర్మణ్యత నుంచి బయటపడి పూర్తి క్రియాశీలతను తెచ్చుకున్నారు. దాని పర్యవసానంగా, విభజన స్వభావం కలిగిన సాంప్రదాయిక సమాజానికీ, కలుపుగోలు స్వభావం కలిగిన ప్రజాస్వామ్య తాత్వికతకూ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా జరుగుతున్న ముమ్మర పోరాటాన్నే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక యవనిక మీద ఈరోజున మనం దర్శిస్తున్నాం. భావజాలంతో సహా తనదైన మొత్తం అజెండాను ఏకపక్షంగా జనం మీద విధించే ప్రక్రియలో విమర్శను, ప్రతిపక్షాన్ని సహించకపోవడం అనేది ఆధిపత్య స్వభావం కలిగిన సాంప్రదాయిక సమాజాల మౌలిక నిర్మాణంలోనే భాగమవుతుంది. రెట్ బట్లర్ రూపంలో ఒక బలమైన ప్రతిపక్షం కాని, మెలనీలా అంతర్గత సంస్కరణకు ప్రయత్నించిన ప్రభావోపేత వ్యక్తిత్వం కలిగిన పాత్రకాని, స్కార్లెట్‌లా జీవితేచ్చకు ప్రతీక అయిన పాత్ర కానీ వేయిపడగలులో లోపించడానికి కారణం అదే.

తమ భావజాలాన్ని వ్యతిరేకించేవారిపై రకరకాల ముద్రలు వేయడంతో సహా; విభజన పూర్వకమైన సాంప్రదాయిక భాష, వ్యక్తీకరణ సహస్రాధిక ప్రమాణంలో బలం పుంజుకోవడం నేటి మన దైనందిన అనుభవం. ఉదాహరణల కోసం గాలించవలసిన అవసరమే లేదు. వేయిపడగల సాంప్రదాయిక సమాజ పునరుత్థానానికి ఇది మరో ప్రత్యక్ష సాక్ష్యం. దేశభక్తి, జాతీయత గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ప్రస్తుత సందర్భంలో గాన్ విత్ ద విండ్‌లో దేశభక్తి గురించిన ప్రస్తావనలు ప్రత్యేకించి ఆసక్తిని కలిగిస్తాయి. దేశభక్తి అంటే తాము పుట్టి పెరిగిన, తమ మనుగడకు దోహదమైన నేలను ప్రేమించడమే నన్న సరళమైన నిర్వచనం ఆష్‌లీ, స్కార్లెట్‌ల మాటల్లో వ్యక్తమవుతుంది. వేయిపడగల సాంప్రదాయిక సమాజం ఇచ్చే నిర్వచనం ఇందుకు భిన్నంగా సంక్లిష్టంగా ఉంటుంది. దాని ప్రకారం, ఈ దేశంలో పుట్టిన ప్రతివాడూ ఈ దేశీయుడు కాదు. ఈ దేశ మత సంఘ ఆచారాలలో పుట్టినవాడు మాత్రమే ఈ దేశీయుడు. దేశీయతను ఇలా విభజించడమంటే దేశభక్తినీ విభజించడమే. పుట్టి పెరిగిన, మనుగడకు దోహదమైన నేలను ప్రేమించడమే దేశభక్తి అన్న సరళ నిర్వచనానికి బదులు, దేశానికి ఒక దేవతారూపాన్ని కల్పించి దానికి మతస్పర్శను ఆపాదించడంసహా మామూలు బుద్ధికి అందనంత ఎత్తుకు తీసుకువెళ్లి సంక్లిష్టం చేయడం మన సాంప్రదాయిక భావజాలంలో కనిపిస్తుంది. ఇదొక్కటే కాదు, సరళమైన ప్రతిదానినీ సంక్లిష్టం చేసే స్వభావం మన సాంప్రదాయిక భావజాలానికి ఉంది. నేడు మన దేశంలో ఇతరుల దేశభక్తిని, జాతీయతాదృష్టిని ప్రశ్నించి ముద్రలు వేస్తున్న తీరును దృష్టిలో ఉంచుకున్నప్పుడు, ‘(కాన్ఫెడరేట్‌పై) మనలో ఉన్నంత విధేయత, దేశభక్తీ అతనికీ ఉన్నాయి.’ అని రెట్ బట్లర్ గురించి మెలనీ అంటూ ముద్రలు వేసే సాంప్రదాయిక ధోరణిని వ్యతిరేకించడం ఆశ్చర్యం గొలిపే యాదృచ్చికతతో ప్రాసంగికతను స్థాపించుకుంటోంది. అంతర్యుద్ధానుభవం అమెరికాలోని దక్షిణాది ప్లాంటర్‌ల సాంప్రదాయిక సమాజాన్ని కలుపుగోలు స్వభావం కలిగిన ప్రజాస్వామికత వైపు అనివార్యంగా నడిపించిందనుకుంటే; అలాంటి యుద్ధానుభవం లేని భారతదేశ సాంప్రదాయిక సమాజం, పడిపోయిన ప్రతిసారీ తిరిగి జవసత్వాలను పుంజుకుని పైకి లేస్తూ తన అస్తిత్వాన్ని ఎప్పటికప్పుడు పొడిగించుకోగలుగుతోందా అన్నది ఆసక్తి గొలిపే ఒక అకడమిక్ ప్రశ్న.

(అయిపోయింది)
----------------------------------------------------------
రచన: కల్లూరి భాస్కరం, 
ఈమాట సౌజన్యంతో

No comments: