Friday, November 30, 2018

సినిమా పాటల్లో హాస్యం


సినిమా పాటల్లో హాస్యం



సాహితీమిత్రులారా!

“హాస్యం” అంటే నవ్వు పుట్టించేది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడో ఒకప్పుడైనా ఏదో ఒకటి చేసో అనో ఉద్దేశపూర్వకంగానో ఉద్దేశ్యం లేకుండానో అందరూ హాస్యం పుట్టిస్తారు. ఐతే ఎందువల్లనో గాని మనం అంటే ముఖ్యంగా తెలుగువాళ్ళం సంభాషణల్లో మాటల్తోటీ చేతల్తోటీ హాస్యాన్ని చూపించగలం గాని సాహిత్యం దగ్గరికి వచ్చేసరికి మాత్రం మూతులు బిగించేస్తాం. వెయ్యేళ్ళ మన సాహిత్యాన్ని భూతద్దాల్తో వెదకాలి హాస్యాన్ని కనిపెట్టాలంటే. అప్పటికీ అది హాస్యమని అవతలి వాళ్ళని ఒప్పించటానికి మనమే కితకితలు పెట్టాల్సొస్తుంది బహుశా.

ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకున్న అసలైన ప్రజాసాహిత్యాన్ని, అంటే సినిమా పాటల్ని, హాస్యదృష్టితో చూద్దాం.

సాహిత్యంలో లానే సినిమా పాటల్లో కూడా హాస్యాన్ని వెదికిపట్టుకోవటం మామూలు విషయం కాదు. ఐతే తొలితరం సినిమాల వాళ్ళు ఈ పని కాస్త సులువు చెయ్యటానికి ఒకో సినిమాలో ఎన్నో హాస్య పాత్రల్ని పెట్టి వాటి చేత కొన్ని పాటలు కూడా పాడించేవాళ్ళు. ఇక హాస్యజంటలు ఉంటే వాళ్ళకు పాట లేకుండా ఉండేది కాదు. రానురాను డబ్బుతో పాటుగా సినిమాలో ఉన్న సీన్లనీ డైలాగుల్నీ పాటల్నీ కూడా హీరోలే కొట్టెయ్యటంతో మలితరం సినిమా పాటల్లో హాస్యం కోసం వెతక్కతప్పదు. అన్నట్టు ఈ మధ్య సినిమాల్లో హాస్యపాత్రలకి మాటలు కూడా కరువై పోయి కేవలం యాక్షన్‌ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టుకోవటం, కొరుక్కోవటం, గుడ్డలు చించుకోవటం లాటివి మాత్రం మిగుల్తున్నాయనుకోండి అది వేరే విషయం.

నాకు గుర్తున్నంత వరకు తొలితరం హాస్యపాటలు సువర్ణసుందరిలో “ఏరా మనతోటి గెలిచే వీరులెవ్వరురా”, గుణసుందరిలో “కొడితే కొత్వాలె కొట్టాలి”, పాతాళభైరవిలో “వినవే బాల నాప్రేమ గోల”, యిలాటివి. ఐతే ఆ కాలపు పాటల్లో పెద్దగా హాస్యం కనిపించదు నాకు. “ఆంజనేయుడికి అన్నదమ్ములం, భీమసేనుడికి పెద్ద కొడుకులం” అనేది అప్పట్లో నవ్వు తెప్పించిందేమో గాని యిప్పుడు కాదు. అసలు అప్పటి సినీకవులు పాటల్లో హాస్యం చొప్పించటానికి పెద్దగా ప్రయత్నం చేశారా లేదా అనేది నాకెప్పుడూ అనుమానమే.

పనిగట్టుకుని హాస్యాన్ని పాటల్లోకి ప్రవేశపెట్టినవాడు కొసరాజు రాఘవయ్య చౌదరి. అంతే కాకుండా ఆయన హాస్యాన్ని social commentaryకి కూడా బాగా వాడుకున్నాడు. ఈయన రాసిన “సరదా సరదా సిగరెట్టు” అనే పాట ఇలాటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగింది. దీన్లో చివరి చరణం నాకు పూర్తిగా గుర్తులేదు గాని దాన్లో పొగతాగితే “ఊపిరితిత్తుల కేన్సర్‌ కిదియే కారణమన్నారు డాక్టర్లు” అని ఒక పాత్ర అంటే రెండో పాత్ర వెంటనే, “కాదన్నారులే పెద్ద యాక్టర్లు” అని అప్పట్లో పెద్దపెద్ద యాక్టర్లు సిగరెట్ల advertisements ఇవ్వటం, సినిమాల్లో సిగరెట్లు తాగటాన్ని glamorize చెయ్యటం, మీద విసిరిన మంచి చెణుకు. ఆ తర్వాత మళ్ళీ మొదటి పాత్ర “థియేటర్లలో పొగతాగటమే నిషేధించినారందుకే” అంటే రెండో పాత్ర “కలెక్షన్లు లేవందుకే” అని చాలా సునిశితమైన joke వెయ్యటం ఈ పాటకి గొప్ప హంగుని తెచ్చిపెట్టింది. అలాగే పేకాట గురించిన పాట “అయయో చేతులొ డబ్బులు పోయెనే, అయయో జేబులు ఖాళీ ఆయెనే” అనేది కరుణ, హాస్యం కలగలిసి మెరిసిన పాట. ఆ పాట చివరగా అంతా పోయాక కూడా, “గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చు, మళ్ళీ ఆడి గెల్వవచ్చు, ఇంకా పెట్టుబడెవడిచ్చు, ఇల్లు కుదువబెట్టవచ్చు, ఛాన్సు తగిలితే ఈ దెబ్బతొ మన కరువు తీరవచ్చు” అంటూ జూదగాళ్ళ సైకాలజీని అద్భుతంగా పట్టుకుంటుంది. అంతటితో ఆక్కుండా, “పోతే?” అనే సందేహం, దానికి “అనుభవమ్ము వచ్చు” అనే తిరుగులేని సమాధానం ఈ పాటలో రక్తినీ సూక్తినీ ముక్తాయించటానికి పనికొచ్చినయ్‌. ఇలాటిదే మరో పాట “భలే ఛాన్సులే భలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే” అనేది. దీన్లో అత్తమామల ఆస్తికోసం ఇల్లరికపు అల్లుళ్ళు ఎలాటివైనా భరిస్తారనే విషయాన్ని కళ్ళక్కట్టినట్టు చూపిస్తూ “జుట్టు పట్టుకుని బైటకీడ్చినా చూరుపట్టుకుని వేలాడి, దూషణభూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలిచేవాడికి భలే ఛాన్సులే” అనటం కూడా చక్కటి ప్రయోగం. ఈ కోవలోదే మరో పాట “చవటాయను నేను వట్ఠి చవటాయను నేను” అనేది. దీన్లో జనానికి, దేశానికి నష్టం కలిగించే పన్లు చేసేవాళ్ళే నిజమైన చవటలని చూపించటం జరిగింది. ఉదాహరణకి ఒక పాత్ర “బడా బడా టెండర్లను పాడి ప్రాజెక్టులు కట్టించాను, వరద దెబ్బకు కొట్టుకుపోతే మళ్ళీ టెండరు పాడాను, చవటాయను నేను వట్ఠి చవటాయను నేను” అంటుంది.

మొత్తం మీద ఇలాటి పాటల్లో ఒక వంక సున్నితమైన హాస్యాన్ని రుచిచూపిస్తూ మరో వంక దురాచారాల్ని, దురలవాట్లని చమత్కారం, అవహేళన మేళవించి ఎత్తిచూపటం జరిగింది.

ఐతే 70ల్లో హాస్యపాటలకి మరో ఉపయోగం కనిపెట్టారు. అది రెండర్థాల్ని చొప్పించటం. “ఎక్కు మావా బండెక్కు మావా, ఎక్కి కూచోని బండి తొక్కు మావా”, “ఓరోరి పిల్లగాడా వగలమారి పిల్లగాడా, నీ ఉరకలు ఊపులు చూస్తుంటే ఉండలేకపోతున్నారా”, “ఇరుసులేని బండి ఈశ్వరుని బండి” ఇలాటి పాటలు అప్పట్లో చాలానే వచ్చాయి. ఐతే హాస్యంలో కొంత పచ్చిశృంగారాన్ని చొప్పించటం అంతకు ముందు లేకపోలేదు. తోలుబొమ్మలాటల్లో కేతిగాడు, బంగారక్క పాత్రలు ఎప్పట్నుంచో ఉన్నవే. అలాగే కాకినాడ నుంచి ఎన్నో ప్రైవేట్‌ రికార్డులు ఇలాటివి వచ్చినయ్‌. ఇక చింతామణి నాటకంలో సుబ్బిసెట్టి, శ్రీహరి పాత్రల పోటాపోటీ పచ్చిశృంగార సంభాషణలు అందరూ విన్నవే. ఐతే సినిమాల్లో విచ్చలవిడిగా రెండర్థాల పాటల్ని హాస్యం పేరుతో వాడటం అప్పుడే మొదలయ్యింది.

కాని 70ల్లోనే అప్పలాచార్య చేసిన కొన్ని ప్రయోగాల్ని చెప్పుకుతీరాలి. ఒకటి ఇల్లుఇల్లాలు అనే సినిమాలో “వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయం చెబుతాను అసలు విషయం చెబుతాను” అనే పాట. బహుశా తెలుగులో ఇలాటి పాట మరోటి లేదనుకుంటాను. మంచి సస్పెన్స్‌, హాస్యం, చమత్కారం అన్నీ సమపాళ్ళలో కలబోసిన పాట ఇది. అలాగే, పూర్తి హాస్యం కోసం రాసిన మరోపాట “ఆకాశం నుంచి నాకోసం వచ్చావా, పొంగే అందాల మిఠాయిపొట్లం తెచ్చావా” అనేది. దీన్లో చాలా గమ్మ్తౖతెన పోలికలు వాడటం జరిగింది. ఉదాహరణకి, “నీ జడపిన్ను నా తలరాతకు పెన్ను, నీ సిగపువ్వు బుజబుజరేకుల లవ్వు, నీ చిలిపి బిడియం అమృతంలో కూరిన వడియం, నీ పెదవులు రెండు నా ముక్కుకు దొండ పండ్లు” అనే చరణంలో ఉన్న ఉపమానాలు ఎప్పుడూ ఎక్కడా విన్నవి కావు. 70ల్లో వచ్చిన మరో ప్రయోగం హిందీలో బాగా హిట్‌ అయిన పాటల ట్యూన్లకి తెలుగులో హాస్యపాటలు రాయటం.

ఇక 80ల్లోకి వస్తే హాస్య నటులకి ప్రాధాన్యత తగ్గిపోయింది. దాంతో పాటే హాస్య పాటలనేవి దాదాపుగా కనుమరుగయినయ్‌. ఈ కాలంలో హాస్యపాట కాకపోయినా దాన్లో ఉన్న పచ్చిశృంగారం కారణంగా హాస్యపాటగా పెద్ద పేరు తెచ్చుకున్నది “సూడుపిన్నమ్మా పాడు పిల్లడు పైన పైన పడతనంటడు” అనేది. అలాగే తమిళ తెలుగుతో హాస్యం పుట్టించటానికి ప్రయత్నం చేసిన ఒక పాట “నీ అమ్మవాడు నాకోసం ఈనివుంటాడు నా బాంబువాడు నీకోసం కని ఉంటాడు” అనేది.

90ల్లో మళ్ళీ social commentaryగా హాస్యానికి కొత్త ఊపిరి కనిపించింది. “బోటనీ పాఠముంది మేటినీ ఆట వుంది దేనికో ఓటు చెప్పరా” అనేది బహుశా ఈ వరసలో మొదటిదనుకుంటాను. అక్కణ్ణించి ఇలాటి పాటలు ఓ మాదిరిగానే వచ్చినయ్‌. ఉదాహరణకి “భద్రం బీ కేర్‌ఫుల్‌ బ్రదరూ, భర్తగ మారకు బాచిలరు”, “బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తూ, ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్‌ అయ్యేటట్టు”, “క్లాసు రూములొ తపస్సు చేయుట వేస్టురా గురూ, బైట ఉన్నది ప్రపంచమన్నది చూడరా గురూ, పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరూ” ఇవన్ని ఇలాటి పాటలు. ఇక “ఓ పనై పోతుంది బాబూ”, “క్యాచీజ్‌ హై” లాటి కేచీ phraseల్ని తీసుకుని వాటి చుట్టు తమాషా ఐన పాటల్ని అల్లటం కూడా జరిగింది. మొత్తం మీద పోయిందనుకున్న తెలుగు సినిమా హాస్యగీతం మళ్ళీ బతికొచ్చినట్టుంది.

చివరగా నేను గమనించిన ఒక విషయం చెప్పి ముగిస్తాను. అదేమిటంటే, సినిమాల్లో చాలా trends హాస్యంతో మొదలై అక్కణ్ణించి mainstream లోకి పాకటం అనేది. మొదటి సారిగా పాటల్లో స్టెప్పులు వెయ్యటం చేసింది రేలంగి అని మనందరికీ తెలిసిందే. అప్పట్లో హీరో హీరోయిన్లు ముళ్ళపూడి మాటల్లో “ఒకరికొకరు కూతవేటు దూరంలో నిలబడి పాటలు పాడుకునేవాళ్ళు” హీరోయిన్‌ ఏదో డాన్స్‌ లాటిది చేస్తూ చేతులు ఊపుతూ మొక్కల్లో తిరుగుతుంటే హీరో ఏం చెయ్యాలో తోచక ఇకిలిస్తూ నిలబట్టమో నడవటమో చేసేవాడు. రేలంగితో మొదలైన స్టెప్పులు ఇప్పుడు ఎక్కడికి చేరాయో ఎవరికీ వివరించి చెప్పక్కర్లేదు. అలాగే మొదట్లో హాస్యపాత్రల్ని మనకి పరిచయం చెయ్యటానికి “ఏరా మనతోటి గెలిచే వీరులెవ్వరురా” లాటి పాటల్ని వాడేవాళ్ళు. ఆ తర్వాత అది హీరోలు కొట్టేసి తెరమీదికి రావటమే ఒక పాటతో రావటం మొదలెట్టారు “ఎవరికీ తలవంచకు ఎవరినీ యాచించకు” దగ్గర్నుంచి కొత్త చిరంజీవి సినిమాల దాకా ఈ ఆచారం బలపడిపోవటం చూశాం. ఇక రెండర్థాల పాటలు ఇవీ హాస్యంతో మొదలై ఇప్పుడు హీరోహీరోయిన్ల మామూలు యుగళగీతాల కిందికి evolve అయినయ్‌. అలాగే, రెండు పాత్రలు పాటల్లో తిట్టుకోవటం అనేది హాస్యపాటల్తోనే మొదలు. “మంగమ్మా నువ్వు ఉతుకుతుంటే అందం, అబ్బ వేశావె బంధం” అని ఒక పాత్ర అంటే “రాజూ నిన్ను బండకేసి రాస్తా, రాతిబండకేసి రాస్తా” అని రెండో పాత్ర తొడలు చరిచి యుద్ధానికి బయల్దేరటం హాస్యగాళ్ళు చేస్తే, “ఒలమ్మీ తిక్క రేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా” అనో, “ఓసోసి పిల్లకోడి పెట్టా నా ఒయ్యారి పావురాయి పిట్టా” అనో హీరోహీరోయిన్లు పాడుకోవటం చూశాం. “ఏమిటి ఈ అవతారం, ఎందుకు ఈ సింగారం” అని అప్పట్లో ఓ హాస్య పాత్ర చేత అనిపిస్తే, “కాళ్ళగెజ్జి కంకాళమ్మా, కాళ్ళకి గజ్జెలు ఎక్కడివమ్మా” అని హీరో చేత పాడించారు ఆ తర్వాత. ఇలా, మొత్తం మీద కొత్త trends హాస్యంగా మొదలై హీరోలకి పాకటం, లేకపోతే హీరోలు వాటిని లాగేసుకోవటం నా దృష్టిలో ఒక విచిత్రమైన సత్యం. ఈ దృష్టితో చూస్తే, ఇప్పుడు హాస్యగాళ్ళు చేస్తున్న వెర్రిమొర్రి పనుల్ని ఇంకొద్ది కాలంలో హీరోహీరోయిన్లు చెయ్యబోతున్నారన్నమాట. భవిష్యత్తు కళ్ళ ముందు కనపడటం అంటే ఇదే!
----------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు, 
ఈమాట సౌజన్యంతో 

Wednesday, November 28, 2018

అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం


అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం



సాహితీమిత్రులారా!

ఒకనాడు తెలుగునాట ప్రతి తల్లీ తన చిన్నారి ముద్దుబిడ్డ అన్నం తినడానికి మారాం చేస్తుంటే ఆ బుజ్జిని చంకలో వేసుకుని ఆరుబయటికి వచ్చి చంద్రుణ్ణి చూపించి
“చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే కోటిపూలు తేవే
బండెక్కి రావే బంతిపూలు తేవే
వెండి గిన్నెలో వేడిబువ్వ తేవే
అన్నిటినీ తెచ్చి మా పాపాయి కివ్వవే”
అని పాడుతూ అన్నం తినిపించే మధుర సన్నివేశం ప్రతి ఇంటా నేత్రానందాన్ని, హృదయానందాన్ని కలిగించేది. అయితే అంత చక్కటి పాటను రాసింది తాళ్ళపాక అన్నమాచార్యులని ఎవరికి తెలుసు? పాట ప్రజల్లోకి వెళ్ళినంతగా కవి వెళ్ళలేదు. అయినా పాట బతికిందీ అంటే కవి బతికినట్లే లెక్క.

పసిపిల్లల్ని ఉయ్యాలతొట్టెలోనో, కాళ్ళమీదనో పడుకోబెట్టి పాడే ఈ కింది జోలపాట కూడా అన్నమాచార్యులదే
“జో అచ్యుతానంద జోజో ముకుంద
లాలి పరమానంద లాలి గోవింద”

ఈ విధంగా ప్రజల నాల్కలపై నాట్యమాడే విధంగా, ప్రజలు పాడుకుని పరవశించటానికి అనువుగా, నిరక్షరాస్యుల్ని గాయకుల్ని చేసే విధంగా, జానపద కళారీతుల్ని ప్రతిబింబించేలా కీర్తనలు రాసి ప్రజాకవి అయ్యాడు అన్నమయ్య.

తాళ్ళపాక అన్నమాచార్యులు కడప జిల్లా రాజంపేట తాలూకా తాళ్ళపాక గ్రామంలో జన్మించాడు. 1408లో జన్మించిన అన్నమయ్య తెలుగులో మొట్టమొదటి వాగ్గేయకారుడు మనకు తెలిసినంతవరకు. పదహారో ఏటనే వేంకటేశ్వరుని సాక్షాత్కారం పొందిన “పదకవితాపితామహుడు”. అన్నమయ్య మొత్తం 32వేల సంకీర్తనలు రాసాడని తెలుస్తున్నా 12 వేలు మాత్రమే దొరికాయి.
“హరి యవతారమీతడు అన్నమయ్య
ఆకసపు విష్ణుపాదమందు నిత్యమై ఉన్నవాడు
భావింప శ్రీవేంకటేశు పాదములందె వున్నవాడు”
అని అన్నమయ్యను అతని పుత్రపౌత్రులు కీర్తించడంలో అతిశయోక్తిలేదు.

“ఏ వేల్పు సర్వేశ్వరుడే వేల్పు పరమేశు
డే వేల్పు … ఘనము
ఆవేల్పు తిరువేంకటాద్రి విభుడు”
అంటూ తన్మయత్వంతో తనివి తీరా తెలుగు వారి ఇలవేల్పు అయిన వేంకటేశ్వరస్వామి దివ్యమంగళ స్వరూపాన్ని నోరారా వర్ణించిన తెలుగుతల్లి ముద్దుబిడ్డ అన్నమయ్య.

తనకు ముందున్న పురాణ, కావ్య పద్ధతుల్ని కాదని సరికొత్త రీతిలో సంకీర్తనా సాహిత్యాన్ని సృష్టించిన సాహితీతపస్వి అన్నమయ్య. ” If angels are asked to speak, they will speak in poetry ” అన్నట్టుగా తెలుగు కవిత్వానికి ఒక అపరదేవతామూర్తిగా అవతరించాడు అన్నమయ్య.
అతడు ఆడిన మాటెల్ల అమృతకావ్యమైంది.
పాడిన పాటెల్ల పరమగానమైంది.
ప్రతి కీర్తననీ మధురభక్తితో అలౌకికజగత్తులో రచించి ఆ సౌగంధికపుష్పాల్ని దేవదేవుని పాదాలకు సమర్పించాడు అన్నమయ్య. అన్నమయ్య కీర్తనల్లో పెళ్ళిపాటలు, జోలపాటలు, గొబ్బిళ్ళపాటలు, ఏలపాటలు, సంవాదపాటలు, తుమ్మెదపాటలు, కోలాటపుపాటలు, సువ్విపాటలు, చిందుపాటలు, తందానపాటలు.. ఇలా ఎన్నో రకాలున్నాయి. కీర్తనల్లో గల విషయాన్ని బట్టి భక్తిపాటలు, శృంగారకీర్తనలు, వేదాంతకీర్తనలు, సాంసారికకీర్తనలు, వేడుకపాటలు,.. మొదలైన విధంగా కూడా విభజించవచ్చు. ఏ విభజనకీ లొంగని పాటలూ ఉన్నాయి, అన్ని రకాలకూ చెందిన పాటలూ ఉన్నాయి.

వివిధ జానపద గేయ లక్షణాల్ని ఆకళింపు చేసుకోవటం
భగవంతునితో మమేకం చెందటం
లోకపరిశీలనాశక్తిని కలిగి ఉండటం
వాడుక భాషకు ప్రాముఖ్యత ఇవ్వటం
జీవిత తత్వ్తాన్ని విడమరిచి చెప్పటం
ఇవీ అన్నమయ్య కీర్తనల గొప్పతనానికి మూలకారణాలు. పాందిత్యప్రదర్శనలు, భాషాభేషజాలు లేని నిసర్గరామణీయకతకి ఇతని కవిత్వం నిలువుటద్దం.

అన్నమయ్య పెండ్లిపాటలు చాలా ఉన్నాయి. వాటిల్లో గంధం పాటలు, బంతులాటపాటలు, వధూవరుల పాటలు, నలుగు పాటలు మొదలైనవి ఉన్నాయి. పెళ్ళిలో ప్రతి సంఘటనా వినోదాన్ని కలిగించేదే. జీవితంలో ఒక్కసారే జరిగే పెళ్ళీనాటి ముచ్చట్ల గురించి అన్నమయ్య “విడియో” తీసి చూపించాడు. తెలుగువారి సాంఘిక ఆచారాలకి ఈ పాటలు సాక్ష్యాలుగా నిలుస్తాయి.
“పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత
పెడమరలి నవ్వేటి పెండ్లికూతురు
పేరుకల జవరాలె పెండ్లికూతురు, పెద్ద
పేరుల ముత్యాలమెడ పెండ్లికూతురు..”
అంటు అలవేలు మంగ అలంకార వైభవాన్ని, హావభావ విలాసాల్ని అన్నమయ్య వర్ణించినా కొంచెం అటూ ఇటూగా తెలుగువారింటి పెళ్ళికూతుర్నే దృష్టిలో పెట్టుకున్నాడు.

కృష్ణుడికీ కొండలరాయనికీ అభేదం పాటిస్తూ గొబ్బిళ్ళ పాటలు రాశాడు. మార్గశిరమాసం. బాలికలు గుమ్మాల ముందు గొబ్బిళ్ళు పెట్టి వాటి చుట్టూ గుండ్రంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ నాట్యభంగిమలో పాడే ఈ పాట అత్యంత మనోహరం
“కొలనిదోపరికి గొబ్బిళ్ళో యదు
కులస్వామికిని గొబ్బిళ్ళో

కొండగొడుగుగా గోవుల కాచిన
కొండొక శిశువుకు గొబ్బిళ్ళో
వెండిపైడి యగు వేంకటగిరిపై
కొండలయ్యకును గొబ్బిళ్ళో”
ఇందులో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోపకులను రక్షించిన విధం సూచించబడింది. “కొండొక”, “వెండిపైడి”, “కొండలయ్య” వంటి తెలుగుదనం ఉండనే ఉంది.

తానే ఒక నాయికయై భగవంతునితో విరహం అనుభవిస్తున్నట్టు ఏలపాట రాశాడు అన్నమయ్య. సుదీర్ఘంగా సాగే ఏలపాట మధురభక్తికి పరాకాష్ట. అన్నమయ్య
“వేడుకుందామా వెంకటగిరి వేంకటేశ్వరుని..
ఆమటి మ్రొక్కుల వాడే ఆదిదేవుడే వాడు” అంటూ మనల్ని కూడ తన జట్టులో కలుపుకుంటాడు. మనతో నడిచివచ్చి అలిపురి, తలయేరు గుండు, మోకాళ్ళ ముడుపు మొదలైన వాటిని అక్షరీకరించి చూపిస్తాడు.
“అదివో అల్లదివో శ్రీహరివాసము”
“కొందలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు”
వంటివి ప్రచారం పొందటానికి కారణం ఛాందసమైన భక్తితత్వం కాదని గ్రహించాలి జీవనతత్వాన్ని బోధించే భక్తితత్వం ఆ కీర్తనల్లో ఉంది. వైరాగ్యచింతనతో, తాత్వికదృక్పథంతో, నిర్మలమైన ఆరాధనాభావంతో రాయటం వల్లనే అతని తలపులు తెలుగు వాడి మోక్షగృహానికి తలుపు లయ్యాయి.

సంవాదపాటలు ఎన్ని రాసినా
“రావే కోడల రట్టడి కోడల
పోవె పోవె అత్తయ్య పొందులు నీతో చాలును
రంకెలు వేయుచు రాజులెదుట నీవు
కొంకుగొసరు లేని కోడల
పంకజముఖి నీవు పలుదొడ్డ వారిండ్ల
అంకెల దిరిగేవు అత్తయా”
అనే అత్తాకోడళ్ళ సంవాదపు పాట అన్నమయ్య లోకజ్ఞతని చాటి చెప్తుంది.

సువ్వి పాటలు అన్నమయ్య కీర్తనల్లో విశేషమైనవి. ఇవి దంపుడు పాటల కిందికి వస్తాయి. ధాన్యం దంచేటప్పుడు శరీరక్లేశాన్ని పోగొట్టుకోవటానికి “ఇస్‌” అనే ధ్వన్యనుకరణ శబ్దమే వేగంగా దంచుతూ అన్నప్పుడు ఆ ఊపులో “సువ్‌” అన్నట్టు వినిపిస్తుంది. అందుకే ఇలాటి పాటల్ని సువ్వి పాటలన్నారు. వీటికే “రోకటిపాటలు” అనే పేరు కూడా ఉంది.
“సువ్వి సువ్వి సువ్వి సువ్వని
సుదతులు దంచెదరోలాల
వనితలు మనసులొ కుందెన చేసిటు
వలపులు తగనించో లాల
కనుచూపులనెడి రోకండ్లను
కన్నెలు దంచెద రోలాల..”
అనే సరసమైన పాటలతో పాటు మధురభక్తి భావాలు గల సువ్వి పాటలూ వున్నాయి.

అన్నమయ్య 15వ శతాబ్దిలోనే అభ్యుదయ భావాలు గల పరమయోగి. వృత్తిపనుల్ని గౌరవించాలన్నాడు. కులభేదాలను, అంటరాని తనాన్ని నిరసించి బ్రాహ్మణుడూ, చండాలుడూ అంతా సమానులే అని ఎలుగెత్తి చాటి “బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే” అని బోధించిన జ్ఞాని అన్నమయ్య.
“ఎక్కువ కులజుడైన హీనకులజుడైన
నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు
ఏ కులజుడేమి యెవ్వడైన నేమి
ఆకడ నాతడే హరి నెరింగిన వాడు”
అనటంలో అన్నమయ్య విశాలదృక్పథమే కాదు, మానవుడే మాధవుడన్న మహనీయసూక్తి దాగి ఉంది.

అన్నమయ్య కీర్తనల్లో ఉన్న మరొక గొప్పదనం వర్ణనావైభవం. శృంగారవర్ణనలు, వైరాగ్యవర్ణనలు, ప్రకృతివర్ణనలు, జీవితవర్ణనలు, .. అనేకం ఉన్నాయి. దేవదేవుని సౌందర్యాన్ని, అలమేలుమంగ విలాసాన్ని తనివితీరా వర్ణించాడు. జ్యోతిషశాస్త్రంలో చెప్పబడ్డ పన్నెండు రాసులు ఉపమానాలుగా గ్రహించి
“ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి..” అంటూ అద్భుతంగా వర్ణించాడు.

అన్నమయ్య కవితా వైభవం అతని భాషలో ఉంది. “ఏటిలో పైరు”, “నీళ్ళు నమలు”, “జలధిలో వానలు,” “వరదం గలిపిన చింతపండు”, “పిండంతే నిప్పటికి” వంటివి ఎన్నో పలుకుబడులు. సామెతలు, సూక్తులు ఆహ్లాదం కలిగిస్తాయి. “చాంగుబళా,” “జాజర”, “తందనాన,” “పురే”, వంటి విశేషణాలు వినూత్నంగా ఉండి గానానికి ఊతం ఇస్తాయి. తెలుగుభాషలో గల స్వఛ్ఛమైన భావసంపదకీ, సహజమైన తెలుగుదనానికి అన్నమయ్య కీర్తనలు నెలవులు.  “వెన్నెలకు కొలలేదు”, అన్నమయ్య కీర్తనకి వెలలేదు.
----------------------------------------------------------
రచన: వి. సిమ్మన్న, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, November 27, 2018

నా రామాయణం


నా రామాయణం




సాహితీమిత్రులారా!

అనగా అనగా ఒకరోజు. ఆ రోజున శ్రీరాములవారు అయోధ్యలో కొలువు చేస్తున్నారు. ప్రతిరోజూ కొలువు చెయ్యడం ఆ నాటి ప్రభుధర్మం. ఆచారం. అప్పటి రోజుల్లో కొలువు చెయ్యడం అంటే, ప్రజల ఈతి బాధలు  విని, ఓదార్చి,వారిని మన్నించి, వాళ్ళ  అవసరాలకి ఆదుకోవడం. అంతే కానీ, “కొలువు,” అంటే ఇప్పుడు తెలుగుదేశంలో రాజకీయవేత్తలు పాటించే అర్థం కాదు. ఇప్పుడు, మంత్రిగారు కొలువు తీర్చి కూచున్నారు అంటే, అసలు అర్థం ఇది మస్తుగా లంచాలు మింగి, బ్రేవ్‌ మని త్రేన్చి, ఆ  రూపాయలన్నీ, నల్ల బజారులో తెల్ల డాలర్లు గా  మార్చి, అమెరికాలోనో, సింగపూరు లోనో,మేనల్లుళ్ళ పెళ్ళాల పేరిటో, మేనకోడళ్ళ మొగుళ్ళ పేరిటో బ్యాంకుల్లో దాచుకోవడం అని!

శ్రీరాములవారి, ఈ కొలువుకి ముందే, అప్పటికే, ఎవడో దారినపోయే దానయ్య సీతమ్మవారి శీలాన్ని శంకించడం, రోడ్డుమీద తాగుబోతు వాగుడు వాగడం జరిగింది. శ్రీరాములవారు,  ఆవిడని గంగానది ఆవలిగట్టున అడవుల్లోకి పంపించడం కూడా అయిపోయింది. సీతమ్మ తన శీలాన్ని,లంకలో అగ్నిపరీక్ష అయిన తరువాత కూడా, తిరిగి మరోసారి శంకించినందుకు కృద్ధురాలై, శపథం చేసి తల్లి భూదేవి వడిలోకి చేరుకోవడం అన్నీ జరిగిపోయాయి.వాల్మీకి గారు నెత్తీనోరూ మొత్తుకుంటూ, చెప్పుతూనే వున్నారు; సీతమ్మ శీలం శంకించవద్దని. అయినా,  ప్రజల మాటని, అది అపవాదయినా సరే! తోసిపుచ్చి
రాజ్యపాలన కొనసాగించడం ఇప్పుడు “లాలూ” మంత్రులకి చెల్లుతుందేమోగానీ, ఆ  రోజుల్లో  నిజాయితీవున్న రాజులకి చెల్లేది కాదు.  అప్పటి ప్రభువులకి అది ఆనవాయితీ కూడా కాదు.

సీతమ్మ రసాతలంలోకి వెళ్ళిన మరుక్షణం నించీ రాములవారి మనసు మనసులో వుండేది కాదు.  భూదేవి తన ముద్దుల బిడ్డని తాను  తీసుకోపోయిన రోజు నుంచీ శ్రీరాములవారికి పరధ్యాన్నం బాగా పెరిగిపోయింది. అందుకే అన్నారు; మానసిక బాధ భరించడం మానవులకే కాదు, దేవుడికైనా తప్పదూ, అని.

ఆరోజు శ్రీరాములవారు మామూలుగా సభలో రత్నఖచిత సింహాసనం మీద కూచున్నారు. ఆయన ఎడమపక్కన సింహాసనం  ఖాళీ! శ్రీరాముల వారి కుడిపక్కన యధావిధిగా లక్ష్మణ స్వామి నించొని వున్నాడు. దేవర వారి పాదాల దగ్గిర హనుమంతుడు “మరా మరా మరా…” అంటూ ధ్యానం చేస్తూ తలవంచుకొని కూచున్నాడు. అందరికీ అలవాటయిపోయిన మళయాళ రాజు రవివర్మగారి బొమ్మలా ముద్దొచ్చేట్టు ముచ్చటగా కనిపించటల్లేదు,ఈకొలువు. కొలువులో ఏదో చెప్పలేని వెలితి!  నిజం చెప్పాలంటే, అదేదో లోపించినట్టే ఉన్నది!!

ఆ రోజున ఒక వింత జరిగింది. మామూలుగా శ్రీరాములవారి ఎడమచేతి ఉంగరపువేలి మూడో కణుపుకి,  ప్రేయసి కన్నా ఘట్టిగా హత్తుకోపోయి  వుండే పెళ్ళినాటి వజ్రపుటుంగరం,  ఎందుకో, చటుక్కున జారి క్రింద పడి పోయింది. అదే! పెళ్ళిరోజున బంగారు పానకపు  బిందెలోనుంచి  శ్రీరాములవారు సీతమ్మచేతిని ముద్దుగా గిల్లేసి మరీ తీసుకున్న ఉంగరం! సీతమ్మని తలచుకుంటూ శ్రీరాములవారు ఆ వజ్రపుటుంగరాన్ని కుడిచేత్తో పరధ్యాసగా వేలిచుట్టూ అటూ ఇటూ తిప్పడం మూలంగా కాబోలు; ఉంగరం బిగువు కాస్తా తగ్గి సడలిపోయి వుండాలి! ఈ ఉంగరం భూమిమీద పడడం, అది ఒక  సన్నటి బొక్క చేసుకుంటూ సరసరా భూమిని దొలుచుకుంటూ భూమిలోకి జఱ్ఱున జెఱ్ఱిలా చొచ్చుకో పోవడం; అంతా ఒక్క క్షణంలో
జరిగిపోయింది. సీతమ్మ దగ్గిరకే తాను కూడా వెళ్ళీపోయిందేమో అన్నట్టుగా!

శ్రీరాములవారు వెంటనే హనుమంతుడిని పురమాయించారు “నా ఉంగరం క్రిందపడి  భూమిలోకి దొలుచుకో పోయింది. నువ్వు వెంటనే వెళ్ళి నా ఉంగరం వెతికి తీసుకో రావాలి,”  అని.

హనుమంతుడు అవసరమయితే నలుసంత చిన్న కోతిగానన్నా మారగలడు.లేదా, కావాలంటే, వింధ్య పర్వతమంత పేద్ధ కోతిగా కూడా  మారి పోగలడు. అది ఆయనకున్న వరం.

శ్రీరాములవారి ఆజ్ఞ!  హనుమంతుడు వెంటనే చిన్న నలుసంత కోతిగా మారిపోయి ఆ చిన్న బొక్కలోనుంచి తనూ దూసుకో పోయాడు. పోయి పోయి పోయి తిన్నగా పాతాళలోకం లో పడ్డాడు. అక్కడ బోలెడుమంది అమ్మాయిలున్నారు.వాళ్ళు ఈ బుల్లి నలుసంత కోతిని చూసి,  బుగ్గలమీద వేలేసుకొని,  “చూసావుటే! ఈ చోద్యం! ఈ చిన్న బుల్లి కోతిని?  ఎక్కడో పైనుంచి కింద పడ్డది. దీనిని, మన భూతాలరాజుగారికి కూర, పప్పు, పులుసూతో పాటు నంచుకోడానికి వడ్డిద్దాం,” అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ  హనుమంతుడిని పట్టుకొని, కంచంలో పెట్టి పాతాళభూతాల రాజు దగ్గిరకి తీసుకో పోయారు.

అక్కడ పాతాళంలో హనుమంతుడు అలా ఉండగా… ఇక్కడ భూలోకంలో వశిష్ఠుడు, బ్రహ్మదేవుడు, ఇద్దరూ  జంటగా అయోధ్యలో శ్రీరాముల వారి కొలువుకి వచ్చారు. ఒచ్చి, “చూడు శ్రీరామా! మేమునీతో చాలా రహస్యంగా కొన్ని విషయాలు మాట్లాడాలి. మేము నీతో మాట్లాడబోయే విషయాలు మరెవ్వరూ వినకూడదు.మనమధ్య ఈ సంభాషణ పూర్తి అయ్యేవరకూ ఎవ్వరూ లోపలకికూడా రాకూడదు. ఒకవేళ ఎవరన్నా పొరపాటుగానైనా సరే, మన రహస్య సంభాషణలకు భంగం కలిగిస్తే, వాళ్ళని నీవు వెంటనే వధించవలసి వస్తుంది!  మరి నీకు ఈ షరతు సమ్మతమేనా?” అని అడిగారు.  శ్రీరాములవారు వెంటనే, “అట్లాగే కానీయండి,” అని ఒప్పుకున్నారు. మరి హనుమంతుడు లేడు కదా! అందుకని, లక్ష్మణుడిని సింహద్వారం  దగ్గిర కాపలా పెట్టి, “లోపలికి పురుగునికూడా రానీయవద్దు,” అని హెచ్చరించారు.

లక్ష్మణుడు పెద్దగుమ్మం దగ్గిర కాపలాకున్న కొద్ది ఘడియల తరువాత, విశ్వామిత్రమహర్షి వచ్చి, “నేను వెంటనే రాముణ్ణి చూడాలి. ఇది చాలా ముఖ్యం. రాముడెక్కడ?” అని గద్దించాడు. తెలియనిది ఏమున్నది గనక? ఆయన గారికి అసలే ముక్కుమీద కోపం. లక్ష్మణుడు అతివినయంగా మహర్షికి నమస్కరించిన తరువాత చేతులుకట్టుకొని చెప్పాడు “లోపలికి ఇప్పుడు ఎవరూ పోవటానికి వీలు లేదు. శ్రీరాముల వారు ఎవరితోనో రహస్యంగా మంతనాలు చేస్తున్నారు. తమరు మరోసారి రావడం మంచిది,” అని ప్రాధేయ పడ్డాడు. విశ్వామిత్రుడు వెంటనే, “రాముడికి నాతో చెప్పకూడని రహస్యం ఏముంటుంది? నేను ఇప్పుడే లోపలికి వెళ్ళితీరాలి,” అని అన్నాడు. లక్ష్మణుడు, “నేను అన్నగారిని అడిగి, ఆయన అనుజ్ఞ తీసికోనిదే ఎవ్వరినీ లోపలకి వెళ్ళనీయలేను,” అని అన్నాడు. “అయితే తక్షణం లోపలికి పోయి రాముడికి చెప్పు, నేను వచ్చానని,” అని విశ్వామిత్రుడు మళ్ళీ గద్దించాడు. “రాముల వారు బయటికి వచ్చేవరకూ నేనే కాదు; ఎవ్వరూ లోపలికి పోరాదని నాకు మరీ మరీ చెప్పారు. అందుచేత మీరు కాస్సేపు ఓపికపట్టి వేచి ఉండండి,”  అని లక్ష్మణుడు అనంగానే, విశ్వామిత్రుడు తోకతొక్కిన తాచులా బుసకొడుతూ,”నువ్వు వెంటనే రాముడికి నేను వచ్చినట్టు చెప్పకపోతే, నేను అయోధ్య బూడిద పాలు కావాలని శపిస్తా! తరువాత నీ ఇష్టం” అంటూ బెదిరించాడు.

లక్ష్మణుడికి విశ్వామిత్రుడిని గురించి తెలియనిది ఏమున్నది గనుక! ముందు నుయ్యి, వెనకగొయ్యి అన్నట్టుగా ఇరకాటకంలో పడ్డాడు. “నేను లోపలికి పోతే, శ్రీరాముడు నన్ను వధించాలి. నేను లోపలికి పోకపోతే,ఈ కోపిష్టి మహానుభావుడు అయోధ్యలో పురుగుకూడా లేకండా బూడిద చేస్తాడు. దేశంలో అందరి మేలు కోసం నేను మరణించడమే మేలు,” అని తనలోతాను తర్కించుకొని, లక్ష్మణుడు లోపలికి వెళ్ళాడు.

“ఏమిటి విశేషం?” అని శ్రీరాములవారు ప్రశ్నించారు. “విశ్వామిత్ర మహర్షి, బయట పెద్దగుమ్మం దగ్గిర ఉన్నారు,” అని లక్ష్మణుడి సమాధానం.”వెంటనే వారిని లోపలికి పంపించు,” అని శ్రీరాముని ఆదేశం. విశ్వామిత్రుడు లోపలికి వచ్చాడు. వశిష్ఠుడు, బ్రహ్మ శ్రీరామునితో చేస్తున్నరహస్య సంభాషణలు అప్పటికే పూర్తి అయ్యాయి.వాళ్ళు శ్రీరాముడితో చెప్పిన  మాటల సారాశం ఇది “రామా! నీవు  కర్మానుసారిగా, ఈ భూలోకంలో చెయ్యవలసిన పని అంతా పూర్తి అయ్యింది. నీవు ఇక ఈ మానవావతారం చాలించి మళ్ళీ దేవతల్లో చేరవలసిన సమయం వచ్చింది. ఈ విషయం చెప్పడానికే మేము సురలోకం నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక మేము శలవు తీసుకుంటాము.”

వాళ్ళిద్దరూ వెళ్ళంగానే, లక్ష్మణుడు, “అన్నా! రామా! నువ్వు ఇప్పుడు నా శిరస్సు ఖండించాలి,” అని అన్నాడు. అందుకు శ్రీరాముడు,”లక్ష్మణా! నీ అపరాథం ఏమీ లేకుండా నీ శిరస్సు ఖండించడం దేనికి? బ్రహ్మ,వశిష్ఠులవారూ, వచ్చిన పని ఎప్పుడో పూర్తి అయ్యింది,” అని అన్నాడు.లక్ష్మణుడు, “శ్రీరామా! నీవు ఆడిన మాట తప్పని వాడవని అందరికీ తెలుసు. నేను నీ తమ్ముడిని గనుక నీవు నన్ను వధించడానికి వెనుదీయడం ధర్మం కాదు. శ్రీరాముడు మాటతప్పినాడన్న మాట, ఆ కళంకం, నా మూలంగా నీకు రాకూడదు. నీవు నీభార్యనే తిరిగి అడవులకు పంపినది మాట నిలబెట్టుకోవడం కోసమే కదా? నువ్వు ఇప్పుడు నన్ను శిక్షించక వదిలితే, నన్ను నేనే శిక్షించుకోవాలి. అనుజ్ఞ ఇవ్వు అన్నా! శలవు,” అని చెప్పి తను సరయూ నదికి వెళ్ళి మునిగి మరి తిరిగి కనిపించకుండ అంతర్థానం అయ్యాడు. లక్ష్మణుడు, శేషుని అవతారం! తన దేహం చాలించవలసిన సమయం వచ్చిందని తనకి తెలుసు!

లక్ష్మణుడు అట్లా దేహత్యాగం చేసిన తరువాత, శ్రీరాములవారు,లవకుశులకు పట్టాభిషేకం చెయ్యడానికి కావలసిన ఏర్పాటులన్నీచెయ్యమని విభీషణుడికి, సుగ్రీవుడికి, మిగిలిన ముఖ్య అనుచరులందరికీ చెప్పి,తనుకూడా సరయూ నదికి పోయి తన మానవ తనువు చాలించాడు.

ఇది ఇలా ఉండగా, హనుమంతుడు ఇంకా పాతాళలోకంలోనే ఉన్నాడు. మరి,తను, శ్రీరాములవారి ఉంగరం తేవాలిగదా! అది రామాజ్ఞ గదా!!  అక్కడే, ఆ పళ్ళెంలో కూచొని, “మరా మరా మరా…” అంటూ రామనామం జపిస్తూనే ఉన్నాడు.

భూతాలరాజు హనుమంతుడిని అడిగాడు
“నువ్వు ఎవడివి? ఇక్కడికి ఎందుకు వచ్చావు?”
“నేను హనుమంతుడిని. శ్రీరాముని సేవకుడిని.”
“సరే! మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు?”
“నాదేవుడు రాముడి ఉంగరం గోతిలో పడి తిన్నగా ఇక్కడకి వచ్చింది. నాకు ఆ ఉంగరం ఇచ్చేస్తే, నేను నాపాలిటి పెన్నిధి రాముడి సన్నిధికి వెంటనే వెళ్ళిపోతాను,” అని హనుమంతుడు చెప్పాడు.

భూతాలరాజు పాతాళభైరవుడికన్నా భీకరంగా నవ్వి, “ఇదిగో! ఈ పళ్ళెం చూడు. ఇందులో ఉంగరాలన్నీ రాములవార్ల ఉంగరాలే! మరి నీ రాముడి ఉంగరం వెతికి తీసుకొని నువ్వు పైకి పోవచ్చు,” అన్నాడు మీసాలు మెలిపెట్టుకుంటూ!

బోలెడు ఉంగరాలతో నిండివున్న ఆ బంగారు పళ్ళెం చూసి, హనుమంతుడు బేజారెత్తి పోయాడు. “ఈ పళ్ళెంలో కొన్ని వేల ఉంగరాలున్నాయి. అన్నీచూడటానికి ఒకే మాదిరిగా ఉన్నాయే! వీటిలో నా రాముడి ఉంగరం ఏదో నాకు తెలియటల్లేదు,” అంటూ, బుఱ్ఱ గోక్కున్నాడు.

భూతాలరాజు అన్నాడు “చూడు! ఈ పళ్ళెంలో ఎన్ని ఉంగరాలున్నాయో,అంతమంది రాముళ్ళు ఉన్నారు. నువ్వు భూలోకానికి వెళ్ళేటప్పటికీ, నీ రాముడు తన అవతారం చాలించేసి ఉంటాడు. ఒక్కొక్క రాముడూ తన మానవావతారం చాలించడానికి ముందుగా ఆ రాముడి ఉంగరం నా పాతాళలోకానికి వస్తుంది. ఆ ఉంగరాలన్నీ జాగ్రత్తగా దాచి ఉంచడం నా పని, నా బాధ్యత! ఇక నువ్వు భూలోకానికి పోవచ్చు,” అని ముగించాడు.

హనుమంతుడు భూమి పైకి వచ్చాడు. అప్పటినించీ, మళ్ళీ రాముని అవతారం కోసం ఎదురుచూస్తూ “మరా మరా మరా…” అని ధ్యానంలో మునిగిపోయాడు, కిష్కింధాపురిలో ఓ కొండమీద!!

కథ కంచికీ, మనం ఇంటికీ!!
*** *** **

నేను తిరిగి నా భాషలో చెప్పిన పైపాతకథ; దాని అసలు కథా కమామీషు క్లుప్తంగా ఇది

హిందీలో ఒక జానపదకథగా ప్రచారంలో ఉన్న కథ పైకథ అని విస్కాన్‌సిన్‌ విశ్వ విద్యాలయంలో పనిచేస్తున్న శ్రీమతి కిరిణ్‌ నారాయణ్‌,చికాగో విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేసిన ఎ.కె. రామానుజన్‌ గారికి చెప్పింది. ఆయన, “మూడువందల రామాయణాలు,” అన్న వ్యాసంలో ఈ కథ ముచ్చటించి, కిరిణ్‌ నారాయణ్‌ కి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ వ్యాసం చదివాక, నేను “నా వాల్మీకిని,” ముఖ్యంగా నా వాల్మీకి ఉత్తరాకాండనీ, మళ్ళీ మళ్ళీ చదువుకున్నా! మీ వాల్మీకికీ, నా వాల్మీకికీ ఎన్నో తేడాలుండచ్చు. నా వాల్మీకి నా వాల్మీకే! మీ ఋషులు మీ వాళ్ళు; నా ఋషులు నా వాళ్ళు! మీకు కాలపురుషుడూ, దూర్వాసుడూ ఇష్టమయితే, వాళ్ళగురించే రాసుకోండి. అసలు విషయాన్ని పక్కకి నెట్టకండి.

పోతే, రాముడు, సీత, దశగ్రీవుడు, హనుమంతుడూ, రామాయణకథలో ముఖ్యపాత్రలు. సరిగా వినండి. ముఖ్య పాత్రలు. ఈ ముఖ్య పాత్రలని వాడుకొని ముచ్చటగా మరెన్నో రామాయణ కథలు చెప్పుకోవచ్చు. అయితే, ముఖ్య పాత్రలకున్న పరిధులు తోసిపుచ్చి, కొత్త కొత్త పరిధులు కల్పించి కథలు చెప్పడం మొదలుపెడితే, అసలు కథకే ముప్పు. ఉదాహరణకి ఈ నానుడి చూడండి

“కుక్క కాటుకి చెప్పు దెబ్బ,” అని అందరికీ తెలుసు; అది అందరూ రాసే పద్ధతి.పోతే, కొత్త కథకుడు కొత్తదనం కోసం, “చెప్పుదెబ్బే కదా! కుక్కకాటుకి,” అని రాస్తే, అసలు నానుడి అర్థం మొత్తంగా తిరకాసు కాలేదు. అంతకి మితిమీరి, కవిగారి లైసెన్స్‌ అనుకుంటూ, చెప్పుకుక్కకి కాటుదెబ్బ అనో, చెప్పుకాటుకి కుక్కదెబ్బ అనో రాసి మురిసిపోతే, వాక్యం దెబ్బతినదు గానీ, అసలు ఆ నానుడి అర్థం దెబ్బ తింటుంది గదా! మరి ఆ నానుడికి ఉన్న సొంపు ఏం కావాలి? అందుకని,రామాయణంలో ముఖ్య పాత్రల పేరులు వాడుతూ, కొత్తదనం కోసం రామాయణాలు రాస్తే, అందులో కొన్ని రామాయణాల కథలు కొందరికి ఇంపు; మరికొన్ని రామాయణాల కథలు అందరికీ అనింపూ అవడం సహజమేగా!

నా ఈ రామాయణం కథ నాకు సొంపు.
ఇతి.
----------------------------------------------------------
రచన: వేలూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో(2000 July)

Monday, November 26, 2018

స్మైల్ పద్యం మళ్ళీ చదివిన తరవాత


స్మైల్ పద్యం మళ్ళీ చదివిన తరవాత



సాహితీమిత్రులారా!

స్మైల్ చచ్చిపోయాడని పత్రికలన్నీ చెప్పాయి. స్నేహితులందరూ చెప్పారు. వ్యావహారికంగా నాకీ సంగతి తెలుసు. కానీ లోపల్లోపల నాకు ఆ మాట మీద నమ్మకం లేదు. స్మైల్ చచ్చిపోలేదు. రాజమండ్రి వెళ్ళగానే అతను నాకు కనిపిస్తాడు. లేదా నేను వొచ్చానని చెప్తే, హైదరాబాదు వొచ్చి నన్ను పలకరిస్తాడు, ఎప్పటికి మల్లే నవ్వుతూ. ఈమాట వ్యావహారికంగా నిజం కాదు, కానీ నా లోపల లోపల నిజం. స్మైల్‌ని తలుచుకున్నప్పుడల్లా అనిపించే నిజం. స్మైల్ పద్యాలు మళ్ళీ మళ్ళీ చదువుతుంటే అనిపించే నిజం.

1991లో, “రమించేసుకున్నాం కదా – ప్రపంచం కావాలిప్పుడు” రచన మొదటి సంచికలో పడింది. నేనావేళ హైదరాబాదులో వున్నాను. అది చదవగానే స్మైల్‌కి ఫోన్ చేశాను (అతనప్పుడు హైదరాబాదులో వుండేవాడు) “నువ్వు ఇంట్లో ఉంటావా? నీతో మాట్లాడాలి” అని. నిజానికి మాట్లాడవలసింది ఏవుంది? నీ పద్యం బాగుంది, చాలా చాలా బాగుంది అని చెప్పడం తప్ప. ఆ పద్యం రాసిన కవిని చూడాలనే కోరిక తప్ప.

స్మైల్‌ని కలుసుకున్నాను. మేడ మెట్లెక్కడం పూర్తి కాకముందే అతన్ని చూసి – ఉత్సాహంగా పలకరిస్తూ “నీ పద్యం బాగుంది” అని మళ్ళీ మళ్ళీ చెప్పాను. కవిపొగడ్తను ప్రోత్సహించే స్వభావం కాదు స్మైల్‌ది అని, అతని మొహం చూస్తుంటే గుర్తొచ్చింది. అతను నవ్వుతూ “అదేముంది లేండి” అని సర్దేసి మామూలు సంభాషణలోకి మాటలు మార్చేశాడు. అప్పుడు అతనితో చెప్పడానికి వీలుపడని మాటలు ఇప్పుడు రాస్తున్నాను, చదివి ఏమనుకుంటాడో.

ఒక కవి పద్యం మీద అభిప్రాయం చెప్పడానికి ఆ కవి ఎదురుగా లేకపోవడం ఒకరకంగా ఉపకారమేనేమో. శారీరకంగా, మానసికంగా, ఆ కవి పరోక్షంగా వుండడం, చెప్పే విషయం కూడా, కొంత గోప్యంగా, బహ్వర్థకంగా ఉండడం – మనసులో మాట తిన్నగా పైకి చెప్పడానికి ఉపకరిస్తుంది. భాషే నిజానికి మాటల్ని కప్పుతుంది. అంతకన్నా తేలిగ్గా కప్పుతుంది – అప్రత్యక్షత.

భవభూతి తన శ్లోకాన్ని కాళిదాసు అభిప్రాయం కోసం పంపితే, ఆ మహాకవి ఆ శ్లోకం చూసి ఏమీ అనకుండా వూరుకున్నాడట. ఆ శ్లోకం పట్టికెళ్ళిన సేవకుడు చాలాసేపు ఎదురు చూసి తిరిగి వెనక్కి వెళ్ళి, “కాళిదాసుగారు తమ శ్లోకం చదువుకున్నారు గానీ ఏమీ చెప్పలేదయ్యా” అని భవభూతితో విన్నవించుకున్నాడట.

“ఏమీ అనలేదా! శ్లోకం సంగతి సరే, నువ్వు అక్కడ వున్న సమయంలో ఆయన ఏమీ మాట్లాడలేదా?” అని భవభూతి అడిగాడట – ఆత్రంగా.

“నేనక్కడ ఉన్న సమయంలో ఒక దూతి వచ్చి ఆయనగారి ప్రియురాలు పంపిన తాంబూలం ఆయనకి ఇచ్చారండి. ఆయన అది వేసుకొని, మీ పద్యం చదువుతూ ‘కొంచెం సున్నం ఎక్కువయింది’ అన్నారండీ” అని చెప్పాడు సేవకుడు.

భవభూతి పంపిన శ్లోకం ఇది:

కిమపి కిమపి మందం మందమాసక్తి యోగా
దవిరల కపోలం జల్పతో రక్రమేణ
అశిథిల పరిరంభ వ్యాపృతైకైకదోష్ణో
రవిదిత గతయామా రాత్రి రేవం వ్యరం సీత్

భవభూతికి వెంటనే భోధపడింది – తన శ్లోకంలో ఒక సున్నా ఎక్కువగా ఉందనీ, అది తీసేస్తే శ్లోకం ప్రశస్తంగా ఉంటుందనీ.

‘రాత్రి రేవం వ్యరం సీత్’ అనే శ్లోకపాదంలోంచి సున్నా తీసేస్తే ‘రాత్రి రేవ వ్యరం సీత్’ అయింది. దాంతో ఆ శ్లోకం కావ్యత్వాన్ని పొందిందని భవభూతి సంతోషించాడట.

ఇది చాలా సున్నితమైన పద్యం. ఉత్తర రామ చరిత్రలో చాలా సున్నితమైన సందర్భం లోనిది. రాముడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అడివిలో – సీతతో ఏకాంతంగా గడిపిన అపురూప సన్నివేశాన్ని. సీతారాములు మామూలు నాయికా నాయకులు కారు. వాళ్ళ ప్రణయం మామూలు స్త్రీ పురుషుల మధ్య ప్రేమలా ఉండదు.

అసలు ప్రణయమే సున్నితమైనది. అందులోనూ శారీరకమైన కలయిక ఇంకా సున్నితమైనది. ఏ మాత్రం మాటమీరినా అది మోటుబారిపోతుంది. మోటుమాటలు మానేసినా మోటుబారిపోతుంది. మాట విలువ తెలిసి ఏ సందర్భంలో ఏ అక్షరం వాడాలో చూసి వాడే సమర్థుడైన కవికి మాత్రమే ఇంత సున్నితమైన సందర్భాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం.

స్త్రీపురుషుల శరీరాల కలయిక ప్రత్యక్షంగా చెప్పకుండా, ప్రణయాన్ని చాటుచేసుకునే అలవాటు సినిమా దర్శకులకి ఉన్నట్టే, కవులకీ ఉంది. కానీ ఎట్ట ఎదురుగా వర్ణించగల వాళ్ళు కొద్ది మంది అయినా ఉన్నారు: భవభూతి, అన్నమయ్య, పెద్దన్న, స్మైల్.

స్త్రీపురుష సంయోగసమయం సకల జగత్ప్రకృతీ పరమ సమస్థితిలో వుండే సమయమని, దానికి అవాంతరం కల్పించడం దుర్మార్గమనీ భారతీయ కవుల విశ్వాసం.

ఎందే డెందము కందళించు రహిచే నేకాగ్రతన్‌ నిర్వృతిం
జెందుం కుంభగత ప్రదీపకళికాశ్రీ దోప నెందెందు పో
కెందే నింద్రియముల్‌ సుఖంబు గను నా యింపే పరబ్రహ్మ, “మా
నందో బ్రహ్మ” యటన్న ప్రాఁజదువు నంతర్బుద్ధి నూహింపుమా

అన్న మాటలు వరూధిని మాటలుగా పెద్దన్న గారు చెప్పిన రహస్యం ఇది. రతిసమయంలో మనసు కుండలో పెట్టిన దీపంలా – గాలి తాకిడికి నిరంతరం కదిలే దీపంలా క్షణక్షణం రకరకాల చిత్రవృత్తులకు లోను కాకుండా – సుఖం పొందుతుంది. ఆ స్థితిని సరియైన మాటల్లో చెప్పగలిగితే తప్ప – అసలు ఏమాటా వాడలేని కవీ, తప్పు మాటలు వాడే కవీ ఒక్కలాంటి అసమర్థులే.

వాల్మీకికి తీవ్రమైన విషాదం కలిగి నిషాదుణ్ణి శపించిన సంఘటన ఒక్కసారి గుర్తు చేసుకోండి. రెండు పక్షుల్లో ఒకదానిని సంయోగ సమయంలో చంపడం నిషాదుడు చేసిన ఘోరం. వాల్మీకికి అడివి కొత్త కాదు – నిషాదుడికి పక్షుల్ని చంపడం తప్పు కాదు. కానీ, ఈ పక్షిని ఆ నిషాదుడు సమయం కాని సమయంలో చంపాడు. వాల్మీకిని కలచివేసినది అది.

ఇంత సున్నితమైన సర్వ ప్రాణి సహజమైన విషయాన్ని అంత సున్నితంగానూ చెప్పిన ఇద్దరు కవుల పద్యాలని చూద్దాం. ఒకరు – అల్లసాని పెద్దన్న. రెండవ కవి – స్మైల్.

వరూధిని మోహించిన ప్రవరుడు వెళ్ళిపోయాడు. అంతకు ముందు వరూధినిని మోహించి ఆమె చేత తిరస్కరించబడిన గంధర్వుడు ఇదే అదననుకొని ప్రవరుడి వేషం వేసుకుని వచ్చాడు. ప్రవరుడే వచ్చాడనుకుంది వరూధిని. రతి సమయంలో నిజస్వరూపం వొస్తుంది. అంచేత తన మాయ నిలవదని గంధర్వునికి తెలుసు. [ఈమాట అందరికీ నిజమే. రతి సమయంలో నిజ స్వరూపం అందరికీ వొస్తుంది]. అందుకని మాయాప్రవరుడు ఒక నియమం పెట్టాడు. ఆ సమయంలో వరూధిని కళ్ళు మూసుకోవాలి అని. కానీ ఆ నియమం రతి పారవశ్యంలో వరూధిని కళ్ళు మూసుకోవడం దానంతట అదే నెరవేరిందట [ఆలాపగతిఁ జొక్కు నఱమోడ్పుఁ గనుదోయి రతిపారవశ్య విభ్రమముఁ దెలుప అని వరూధిని గురించి పెద్దన్న గారు అంతకు ముందే చెప్పారు].

వరూధిని మాయాప్రవరుల కలయికని పెద్దన్న గారు చెప్పిన పద్యం చూద్దాం:

సహసా నఖంపచ స్తనదత్త పరిరంభ
        మామూల పరిచుంబితాధరోష్ఠ
మతిశయప్రేమ కల్పిత దంత సంబాధ
        మగణితగ్లాని శయ్యానిపాత
మతివేల మణిత యాచ్ఞార్థ గల్లచపేట
        మతిదీన వాక్సూచితాత్మవిరహ
మంకుర త్పులక జాలావిద్ధ సర్వాంగ
        మానంద కృతహారవాననాబ్జ

మాక్రమక్షీణ నుతివర్ణ మానిమీలి
తాక్ష మాస్విన్న గండ మాయత్త చేష్ట
మాస్తిమిత భూషణారవ మావధూటి
ప్రథమసురతంబు గంధర్వ పతిఁ గరంచె.

ఈపద్యం మొదలు పెట్టిన తరువాత ఎక్కడా ఆగదు. ఒక సమాసం మరొక సమాసంతో విడదీయరాకుండా కలిసిపోయి ప్రతి సమాసం ‘ఆ’ తో మొదలైనా అంతకు ముందున్న సమాసపు చివరి ‘మ’ కారంతో భాగమై పోయి, సంధి విడదీయడానికి గాని, మాట విడమర్చడానికి గాని అవకాశం ఇవ్వదు. పైగా ఈ పద్యం అంతా బోలెడు బహువ్రీహి సమాసాలతో పొట్లాలు కట్టినట్టు, అరలు అరలుగా పొరలు పొరలుగా దొంతర్లు పెట్టినట్టు గాఢంగా కలిసి పోయి వుంటుంది. ఈ నిర్మాణంలో వున్న శబ్ద చాతుర్యం మీకు బోధపడిందనే అనుకుంటాను. ఇది కలయికను చెప్పే పద్యం – అందుకని ఈ వేగం.

జాగ్రత్తగా విప్పండి. ఇందులో ప్రతి సమాసాన్ని. ప్రతి సమాసమూ బహువ్రీహి కాబట్టి ఆ మాటలకి మించిన కథని గూఢంగా చెపుతుంది. అర్థం పైకి బాహాటంగా తెలిసిపోదు. అర్థాన్ని గుట్టుగా దాచుకోడంలో బహువ్రీహికి మించిన సమాసం లేదు. ఇంత చిక్కగా బహువ్రీహుల్ని అడ్డు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నా – విప్పి చూస్తే ఏదీ దాచరు పెద్దన్న గారు.

ఇందులో బహువ్రీహులు మొదట్లో పొడుగ్గా వుంటాయి. సహసా నఖంపచ స్తన దత్త పరిరంభము – ఆమూల పరిచుంబితాధరోష్ఠము – అని. చివర్లో ఆనంద కృత “హా” ర వాననాబ్జము దగ్గరికి వొచ్చేసరికి – పద్యం ఇంకా వేగం పుంజుకుంటుంది. ఆ తరువాత వచ్చే బహువ్రీహులు ‘ఆక్రమక్షీణ నుతివర్ణము’ ‘ఆనిమీలితాక్షము’ ‘ఆస్విన్న గండము’ ‘ఆయత్త చేష్టము’. ఒకదానినొకటి తరుముకొస్తున్నట్టుంటాయి. చివర్లో ఈ వేగం ఎందుకో నేను వివరంగా చెప్పక్కర్లేదు.

ఇప్పుడు ఈ పద్యాన్ని ప్రతిపదం సావకాశంగా దాని అర్థాన్ని భావిస్తూ మళ్ళీ చదవండి. అది ప్రబంధ కాలం. సమాసాలకీ, వర్ణనలకీ పేరు మోసిన కాలం. ఇది పదాడంబరం అని ఆధునికులు కట్టమంచి రామలింగారెడ్డి గారి అనుయాయులు తీసిపడేసే కాలం. కొంచెం ఆ ఊహల్ని పక్కకి పెట్టి ప్రతి పదం చెప్పే విశేషం భావించండి. ఇది వర్ణనలా కనిపిస్తుంది. ప్రబంధంలో కథని వర్ణనలు మింగేస్తాయన్న మాట నిజమేననిపిస్తుంది. కాని ఇది వర్ణన కాదు. వర్ణనలా కనిపించే కథనం. బొమ్మ కట్టడానికి వీలయిన అచల వస్తువుని కళ్ళముందు నిలబెట్టే పద్యం కాదిది. నిరంతరం చలన గమ్యమైన శరీరాల కదలికల సన్నివేశాల కథ ఇది. అతి సూక్ష్మమైన, సున్నితమైన కలయికల అనుభవాల దొంతరల గమనం ఇది. ఇది నిశ్చల చిత్రం కాదు. ప్రతి క్షణం మారిపోయే అనుభవాల ప్రవాహం.

కాలం మారింది. మాటలు మారాయి. అనుభవాలు చెప్పే గొంతుక మారింది. ఇప్పుడు స్మైల్ రాసిన పద్యం చదవండి.

రమించేసుకున్నాం కదా
ప్రపంచం కావాలిప్పుడు –

వూరికినే గది చుట్టూ చూస్తా
నా బూతులు మా మూలుగులు
అర్థం పర్థం లేని మా మాటలు
గోడ మీద ఆ రెండు బల్లుల్లా
అంటుకుపోయి అలా అలా కదుల్తున్నట్టు –
నవ్వొస్తుంది.
సీలింగ్ ఫ్యాన్ స్టీల్ కంట్లో
నా అర్ధ నగ్న శరీరం మసగ్గా గిరగిరా –

ఆవిడ
గోడవైపుకు తిరిగి చీర కట్టుకుంటూ –
ఛాతికే తప్ప
వీపుకేం సిగ్గుండదేమో వీళ్ళకి
నవ్వొస్తుంది.

ప్రేమించేసుకున్నాం కదా
ప్రపంచం కావాలిప్పుడు

యుగయుగాలుగా గాలికి తెరిచే వుంచినట్టు
గది తలుపుల్ని కాస్త దోరగా తోసి
కిటికీల్ని బార్లా తీసి
ఆకాశాన్ని వెలుగు వాసనల్నీ గదిలోకి
ఆహ్వానించి
తల దువ్వుకుంటోందావిడ –
అద్దంలోంచి అలవోగ్గా చూస్తూ.

ముసిముసి నవ్వుల్లో తేలుతున్న
లంగరేసిన పడవే ఆవిడ

తల దువ్వుకుంటోంది
ఏం జరగనట్టు
అసలేం జరగనట్టు
సెలవుల మధ్యాహ్నపు ఆటల్లో పిల్లల
అల్లరి యేం విన్పించనట్టు
అసలేం జరగనట్టు

(రచన ప్రారంభ సంచిక – 1991)

చివరిదాకా చదివిన తరవాత ఒకసారి ఆఖరి ఆరు పంక్తులూ మరో సారి చదవండి – చిట్టచివరి పంక్తిమీద మరీ దృష్టి పెట్టి.

అసలేం జరగనట్టు

ఇది గొప్ప ముసుగు. నిజంగా జరిగిందేదో మరీ వివరంగా చూపించే ముసుగు. ఇప్పుడు ఒక్కొక్క పంక్తీ వెనకనించి చదువుకుంటూ వెళ్ళండి.

లంగరేసిన పడవే ఆవిడ

అంతకుముందు నదీవేగంతో అనుభవాల నైరంతర్యంతో ప్రవహించే ఆవిడ ఇప్పుడు లంగరేసిన పడవ. పడవ తీరాన్ని చేరాక లంగరేస్తారు. కాని ఇంకా నీటి తాకిడికి పడవ ఊగుతూనేవుంటుంది. గతనిమిషాల జ్ఞాపకాల తాకిడికి ఊగుతున్నది శరీరం. ముసిముసి నవ్వుల్తో తృప్తిగా జ్ఞాపకాలు శరీరాన్ని అంటిపెట్టుకుని ప్రవహిస్తూనే ఉన్నాయి.

తలదువ్వుకుంటోందావిడ
అద్దంలోంచి అలవోకగా చూస్తూ

చిక్కు పడిపోయుంది జుట్టు. ఆ చిక్కులకేసి చూస్తున్నప్పుడు ఆ చిక్కులజుట్టుకి కారణమయిన మొగాడు అద్దంలో కనిపిస్తున్నాడు. అతన్ని అలవోకగా చూస్తోందావిడ. అలా చూస్తున్న ఆవిడ మొహాన్ని అద్దంలోంచి అతనూ చూస్తున్నాడు. ఇంతవరకూ ఒకర్నొకరు ఎదురెదురుగా ప్రత్యక్షంగా చూసుకున్నారు. ఇప్పుడు ఒకర్నొకరు అలా చూసుకోరు. పరోక్షంగా కనిపించడం ఇప్పుడు విశేషం. మనసుల్లో జ్ఞాపకాల్లాగా అద్దంలో ప్రతిబింబాలు.

ఇంతవరకూ మూసిన తలుపుల వెనకాతల వున్న ప్రపంచం ఇప్పుడు ఎదురుగుండా రావచ్చు. తలుపులు తీసే వున్నాయి కదా. ఇందాకా కాస్సేపటి క్రితం అవి మూసివున్నాయని వీళ్ళిద్దరికే తెలుసు. ప్రపంచం అవి ఎప్పుడూ తెరిచేవున్నాయని అనుకోవాలి. ఈ రహస్యమే మొత్తం పద్యాన్ని అందరికీ చెప్పనట్టు చెప్పే గుట్టు. కళ్లు మూసుకున్నప్పటి సంతోషాన్ని కళ్లు తెరుచుకున్నాక ఇంకా స్పష్టంగా అనుభవానికి తెచ్చినట్టు.

వెనక్కి వెళ్లి చదువుతున్న కొద్దీ ప్రతి పంక్తీ కథలో ప్రతి పొరనీ మరీ వివరంగా చెప్తుంది – బండగా, సున్నితంగా, నిస్సిగ్గుగా, గోప్యంగా. బండగా అని ఎందుకన్నానంటే ఆ చరణంలో మాటలు చూస్తే మీకే తెలుస్తుంది. ఆ బండమాటలు నిజానికి సున్నితమైన మాటలు. అన్నమాచార్యుల మనమడు, చినతిరుమలాచార్యులు, అన్నమయ్య సంస్కృతంలో రాసిన సంకీర్తన లక్షణం తెలుగులో చెబుతున్నానంటూ ఒకచోట ఈ కింది పద్యం రాశాడు.

పదములు శృంగారవధూ
మృదుమధుర మనోజ్ఞ వాక్యమిశ్రములైనన్
విదితార్థ గ్రామ్యోక్తులు
పదిలముగాఁ బొంకమెఱిఁగి పలుకగఁ జెల్లున్

గ్రామ్యోక్తులు అంటే స్మైల్ తన పద్యం మొదట్లో రాసిన మాటల్లాటివి.

పద్యం మొత్తం పైకి చూస్తే కవి మనస్సులో జ్ఞాపకాల దొంతర. కాని నిజానికి మనకి పబ్లిగ్గా చెప్తున్న రహస్యాల పరంపర.

కాలం మారినా, మాటలు మారినా కవిత్వం మారదు. పెద్దన్నలో, అన్నమయ్యలో, స్మైల్‌లో ఉన్న సామాన్యలక్షణం మంచి కవిత్వం.
------------------------------------------------------
రచన: వెల్చేరు నారాయణరావు, 
ఈమాట సౌజన్యంతో

Sunday, November 25, 2018

బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు


బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు




సాహితీమిత్రులారా!

రావి కొండలరావు నటుడు, దర్శకుడు, రచయిత. నాటకం, సినీమా, టీవీ, పత్రికలు, ఇలా అన్ని రంగాలలోనూ విశేష అనుభవం ఉన్నవాడు. మిమిక్రీ కళాకారుడు. ప్రతి రంగంలోనూ నైపుణ్యం, పేరు ప్రఖ్యాతులూ గడించిన వాడు. ఎటువంటి భేషజాలూ లేకుండా 75 ఏళ్ళు దాటిన వయసులో కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో క్రియాశీలంగా ఉంటూ జీవిస్తున్న వ్యక్తి. నిరాడంబరంగా, కలుపుగోలుగా ప్రవర్తించే సజ్జనుడు. ఆయన రచనలూ, నటనా అన్నీ చదువుకోవడానికీ, తిలకించ డానికీ హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. మనసును కలవరపెట్టే రచనా, ఒళ్ళు గగుర్పొడిపించే నటనా ఆయన ధోరణికి సరిపడవు. ఆయన రాసిన నాటికలూ, నాలుగైదు వందల సినిమాలకు రాసిన సంభాషణలు (స్క్రీన్‌ప్లే) ఆయన సుదీర్ఘ కృషిని సూచిస్తాయి. 1958లో ‘శోభ’ చిత్రంతో మొదలైన ఆయన సినీ నటనకు ఈమధ్యనే 50 ఏళ్ళు నిండిన సందర్భంగా ముంబయి, విజయవాడ తదితర నగరాల్లో ఆయనకు ఘనసన్మానాలు జరిగాయి.

రావి కొండలరావుగారు పుట్టినది సామర్లకోటలో. వారి తండ్రిది పోస్టుమాస్టరు ఉద్యోగం కనక తరుచుగా బదిలీలు అవుతూ ఉండేవి. ఆ కారణంగా ఆయన పాఠశాల చదువు కాకినాడలో మొదలై, అనేక ఊళ్ళలో కొనసాగింది. ఆయనకు అన్నయ్యలైన ఆర్.కె.రావు, రావి చలం (ఈయన జంషెడ్‌పూర్ నాటకరంగంలో ప్రసిద్ధుడు) ల ప్రభావం ఆయన మీద ఉండేది. కొండలరావు పదేళ్ళ లోపు వయసులో స్కూలు నాటకాల్లో వేసినపుడు ఆయన తండ్రి ఏమీ అనలేదుగాని బైటి సమాజాల్లో ఆడినప్పుడు మాత్రం సహించేవారు కారట. ఆయన చిన్నప్పుడు ఒకసారి తండ్రికి తెలియకుండా ఒక అన్నయ్య ఒక నాటికలో కొండలరావు చేత ఆడపాత్ర వేయించారట. ఆ ప్రదర్శనకు తండ్రి హాజరవుతాడని వాళ్ళకి తెలియదు. కొడుకును గుర్తుపట్టని తండ్రి స్టేజికేసి చూస్తూ పక్కనున్న వ్యక్తితో “వీడెవడో బాగానే చేస్తున్నాడే?” అన్నాడట. అప్పుడా పక్కనున్నాయన “అదేమిటండీ వాడు మీవాడేగా?” అన్నాట్ట. అంతే! పెద్దాయన ఉగ్రుడైపోయి స్టేజి మీదికి వెళ్ళి కొడుకు విగ్గు పట్టుకుని పీకేసి, కొట్టి, వీధులవెంట తరిమాడట. ప్రేక్షకులు ఇదేదో ‘కొత్త పాత్ర ప్రవేశం’ అని కూడా అనుకున్నారట. అప్పటికి ఆయన వయసు పదేళ్ళే.

తండ్రిగారి చివరి పోస్టింగు శ్రీకాకుళం కావడంతో కుటుంబం అక్కడే స్థిరపడింది. అన్నయ్య ఏకపాత్రాభినయంలో చిన్న చిన్న సహాయపాత్రలు వెయ్యడం, కన్యాశుల్కంలో వెంకటేశంగా నటించడం, చిన్నచిన్న కథలు రాయడం వగైరాలన్నీ కొండలరావు పిన్నవయసు ముచ్చట్లు. తండ్రిగారు చనిపోయాక నాటకాల్లో వెయ్యడానికి అడ్డు తొలగినట్టయింది.

స్కూల్లో ఉన్నప్పుడే కొండలరావుకు ఆరెస్సెస్ (R.S.S.) అభిమానం ఉండేది. గాంధీజీ హత్యానంతరం హిందూమహాసభ తదితర సంఘాల మీద విధించిన ఆంక్షలకు నిరసన తెలుపుతున్న ఇతర కుర్రాళ్ళతో బాటుగా అతన్నికూడా పోలీసులు అదుపులోకి తీసుకుని మూణ్ణెల్లు రాజమండ్రి జైలులో ఉంచారు. అదొక అద్భుతమైన పరిణామానికి అనుకోకుండా దారితీసిందని కొండలరావు అంటారు. చదువుకోవలసి రావడం వగైరాలేవీ లేకపోవడంతో టీనేజిలో ఉన్న కొండలరావుకు జైలు లైబ్రరీలో తెలుగు సాహిత్యం చదివేందుకు మంచి అవకాశం దొరికింది. ఆధునిక కథకుల్లో ప్రసిద్ధులందరి రచనలూ అతనక్కడ చదివి, అర్థం చేసుకుని ఆనందించాడు. ఆ విధంగా అతనికి స్వయంగా రచనలు చేసేందుకు తగిన స్ఫూర్తి లభించింది. కొడవటిగంటి కుటుంబరావు తదితరుల కథలు ఆదర్శంగా భావించి చేసిన ప్రయత్నాల ఫలితంగా చక్రపాణి నడిపిన యువ పత్రికలో 1949లో అతని కథ ఒకటి అచ్చయింది. దానితో ఉత్సాహం పెరిగింది.

ఆ ఊపుతో అతని చిన్న కథలూ, నాటికలూ అచ్చులో రాసాగాయి. కాలేజి లెక్చరర్ల ప్రోత్సాహంతో వారి అవసరార్థం అతను రాసిన ‘స్వయంవరం’ అనే స్త్రీ పాత్ర లేని నాటికను అందరూ మెచ్చుకున్నారు. వారిలో దాడి గోవిందరాజులు నాయుడు వంటి పెద్దలుకూడా ఉన్నారు. ఆయన జిల్లా జడ్జి, నటుడు కూడా. ఆ తరవాత కొండలరావు ‘కుక్కపిల్ల దొరికింది’ నాటిక రాశారు.

ఇంతలో, మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్ ఉద్యోగానికి అభ్యర్థులను విశాఖపట్నంలో ఇంటర్వ్యూ చేస్తున్నారని తెలిసి కొండలరావు కూడా వెళ్ళారు. శ్రీశ్రీ,, ఆరుద్ర మొదలైనవారు లోగడ పనిచేసిన పత్రిక అది. సబ్ఎడిటర్ ఉద్యోగానికి కొండలరావు ఎంపికయ్యారు. 1956లో మద్రాసులో ఆరు నెలలపాటు ఆనందవాణి ఆఫీసులో కూర్చుని వచ్చిన కథలని చదివి, వాటిలో మంచివాటిని ఏరిపెట్టడమే ఆయన పని. ఆఫీసులోనే ఉద్యోగం, నివాసం కూడా. కానీ, పత్రిక ఎక్కువకాలం నడవలేదు. అంతకుముందు 1948లో మద్రాసు వెళ్ళినప్పుడు ‘బాల’ పత్రికలో బొమ్మలు వేస్తున్న బాపూతోనూ, ముళ్ళపూడి వెంకటరమణతోనూ పరిచయం ఏర్పడింది. అప్పటికి అందరూ నిక్కర్లు వేసుకునే వయసువాళ్ళే.

ఆనందవాణి ఆఫీసుకి ఆంధ్రపత్రిక ఆఫీసు దగ్గరలోనే ఉండేది. కొండలరావుకి అందులో పనిచేస్తున్న కొడవటిగంటి కుటుంబరావు, నండూరి రామమోహనరావు, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి మొదలైనవారితో పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడే పిలకా గణపతిశాస్త్రి, తిరుమల రామచంద్ర తదితరులను కలుసుకున్నారు. ఆంధ్రపత్రికలో కొండలరావు కథలు కొన్ని అచ్చువేశారు. ఇవికాక తెన్నేటి సూరి నిర్వహిస్తున్న భారతి పత్రికలో ‘స్వయంవరం’, ‘కుక్కపిల్ల దొరికింది’ నాటికలు రెండూ అచ్చవడంతో కొండలరావుకు కొత్తవారిని కలుసుకున్నప్పుడల్లా స్వపరిచయం సులువయింది. ఒక సందర్భంలో ఆరుద్రకు ఎవరో పరిచయం చేసినప్పుడు తాను ఫలానా అని చెప్పగానే ఆరుద్ర వెంటనే “‘కుక్కపిల్ల దొరికింది’ రాసినది మీరేకదా” అంటూ పక్కనే ఉన్న తన ఇంటికి తీసుకెళ్ళారట.

‘కుక్కపిల్ల దొరికింది’ నాటిక అచ్చవగానే చాలా ప్రజాదరణ పొందింది. నేను మద్రాసులో స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే (1957 ప్రాంతాలలో) ఆ నాటిక మా స్కూల్లో ప్రదర్శించారు. సులువుగా చెప్పగలిగిన డైలాగులతో, సున్నితమైన హాస్యంతో అది అందరికీ నచ్చిన హాస్యనాటిక. 1961లో మద్రాసు చిల్డ్రన్స్ థియేటర్లో ఈ నాటికను కొండలరావుగారే స్వయంగా వేశారు. అందులో నౌకరు కుర్రాడుగా నటించిన చాకులాంటి అబ్బాయి అందర్నీ ఆకర్షించాడు. అతనే రాజబాబు. త్వరలోనే అతను సినిమాల్లో బిజీ కమెడియన్‌గా స్థిరపడడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు.

ఆంధ్రపత్రికలో కొండలరావుకు ఉద్యోగం మటుకు రాలేదు. ఎందుకంటే ఒక్క ముళ్ళపూడి వెంకటరమణగారిని తప్ప డిగ్రీ లేనివారినెవరినీ వారు తీసుకునేవారు కాదు. అందుకని కొండలరావుకు అక్కడ అవకాశం లభించలేదు. ఆయన కొన్నాళ్ళు రమణగారింట్లో ఉన్నారు. అంతకు ముందు ఒకసారి 1954లో హైదరాబాదులో కొండలరావు ప్రఖ్య శ్రీరామమూర్తి రాసిన ‘కాళరాత్రి’ నాటకంలో నటించినప్పుడు సినీరచయిత డి.వి.నరసరాజుగారు జడ్జిగా వచ్చారు. ఆంధ్రనాటకపరిషత్తు నిర్వహించిన ఆ ప్రదర్శనలో జె.వి.సోమయాజులు, రమణమూర్తి తదితరులు కూడా నటించారు. కొండలరావు ఆ పరిచయాన్ని పురస్కరించుకుని నరసరాజుగారిని మళ్ళీ 1956లో మద్రాసులో కలుసుకున్నారు. ఆయన సిఫార్సు ద్వారా కొండలరావుకు పొన్నలూరి బ్రదర్స్‌వారి సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది.

అంతకుముందే కొండలరావు కొన్నాళ్ళు కేరళ వెళ్ళి, ఒక మలయాళం సినిమాకు డబ్బింగ్ డైలాగులు రాసివచ్చారు. అయితే తెలుగు సినిమాల్లో పనిచెయ్యడం అదే మొదటిసారి. స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో పని తక్కువగా ఉండడంతో దర్శకత్వం వహిస్తున్న కమలాకర కామేశ్వరరావు కొండలరావును తనకు అసిస్టెంటుగా కూడా పని చెయ్యమని పిలిచారు. ఎన్.టి.రామారావు, అంజలీదేవి, రమణారెడ్డి తదితరులు నటిస్తున్న ఒక సన్నివేశంలో ఒక డాక్టరు పాత్ర అయోమయంగా నటించాలి. మామూలుగా డాక్టరు పాత్రలు వేసే ఒకతను అలా చెయ్యలేక తడబాటుపడి, కొండలరావునే వేసెయ్యమని ప్రాధేయపడ్డాడు. ఆ విధంగా కామేశ్వరరావు సలహాతో శోభ సినిమాలో కొండలరావు సినీనటుడుగా తొలిసారి కనబడ్డాడు.

ముద్దుకృష్ణ సహకారంతో కొన్ని సినిమాల్లో సహకార దర్శకుడిగా అవకాశాలొచ్చాయి. ఆ తరవాత ‘పూజాఫలం’ వంటి సినిమాల్లో బి.ఎన్.రెడ్డిగారితో పనిచేసే అవకాశాలొచ్చినప్పటికీ ఆయన పెట్టే ఆంక్షలు కొండలరావుకు ఇబ్బందికరంగా ఉండేవి. అప్పటికి ఆయనకు రాధాకుమారితో వివాహం అయింది. జరుగుబాటు కోసం ఇద్దరూ తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. పని ఉన్నా లేకపోయినా డబ్బింగ్ వగైరాలకు తమ ఆఫీసు నుంచి ఎక్కడికీ వెళ్ళరాదని రెడ్డిగారు కోప్పడేవారు. అందుచేత ఆయనతో కష్టమనిపించేది. కొండలరావు బి.ఎన్. గారి ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు పైన హాలులో తన బృందంతో నాలుగిళ్ళ చావిడి నాటకం రిహార్సల్సు వేసుకునేవారట; బి.ఎన్. దానికి అనుమతించడమేకాక కొత్తగా హీరో వేషానికని వచ్చిన చంద్రమోహన్‌ను నాటకం రిహార్సల్సు చూసి నటనలో మెళుకువలు నేర్చుకోమనికూడా చెప్పేవారట.

‘నర్తనశాల’ తీస్తున్నప్పుడు కమలాకర కామేశ్వరరావు మళ్ళీ కొండలరావును పిలిచారు. రంగారావు, రామారావు, సావిత్రి తదితరులకు సెట్టు మీద సన్నివేశాన్ని వివరించడం, డైలాగులు చెప్పించడం కొండలరావు పని. మహాభారతం పద్యాలకు వాళ్ళు అర్థాలు అడుగుతారని ఆయన ముందురోజునే రచయిత సముద్రాల సీనియర్‌తో కూర్చుని పద్యాల అర్థాల వివరాలు తెలుసుకునేవారు. నాలుగు పేజీల డైలాగ్‌ని రంగారావు అవలీలగా అర్థం చేసుకుని, గుర్తుంచుకుని చెప్పేవారని కొండలరావు అన్నారు. అటువంటి మహానటులతో పనిచెయ్యడం మరుపురానిదని ఆయన ఇప్పటికీ అంటారు.

సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవస్థలు పడేకంటే వేషాలే వెయ్యరాదా అని ముళ్ళపూడి వెంకటరమణ అనేవారట. ఆ విధంగా ఆదుర్తి తీసిన ‘దాగుడుమూతలు’ సినిమాలో ఒక డాక్టరు వేషం లభించింది. దాని తరవాత రామారావు వంటి పెద్దనటులతో తనకున్న పరిచయాల ద్వారా క్రమంగా చాలా సినిమాల్లో వేషాలు వెయ్యసాగారు. ఒక సందర్భంలో పి.పుల్లయ్య తీసిన ‘ప్రేమించి చూడు’లో అవకాశం వచ్చింది. దీన్ని గురించి కొంత కథ జరిగింది. తక్కిన వ్యాపకాలు ఎన్ని ఉన్నా కొండలరావు హాస్య ప్రియత్వం ఏ మాత్రం తగ్గలేదు. శ్రీకాకుళంలో తన చిన్నప్పటి తెలుగు మేస్టరు మిమిక్రీని ఆయన అందరికీ వినిపిస్తూ ఉండేవారు. మద్రాసులో మా ఇంట్లోనూ, బాపూ, రమణలున్న ఇతర ఇష్టాగోష్ఠుల్లోనూ ఇది తప్పక జరిగే వ్యవహారం. నాటక, సాహితీ రంగాల్లోని స్నేహితులేకాక చాలామంది సినీప్రముఖులు అది విని ఆనందించేవారు. ఇదెంతవరకూ వెళ్ళిందంటే ఆ రోజుల్లోనే ఆసక్తి పట్టలేక ఆరుద్ర శ్రీకాకుళం దాకా వెళ్ళి సదరు మాస్టార్ని కలుసుకుని మరీ వచ్చారు. ఎవరి మాటా వినిపించుకోకుండా, దబాయింపు ధోరణిలో “సాయ్‌లెన్స్” అని కేక పెట్టే తెలుగు మేస్టరుది ఒక వింత స్వభావం.

ఈ వైఖరి కలిగిన పాత్రగా ముళ్ళపూడి వెంకటరమణ ప్రేమించిచూడులో నాగేశ్వరరావు తండ్రి పాత్రకు డైలాగులు రాశారు. పి.పుల్లయ్యకు ఈ నేపథ్యమేమీ తెలియదు. రమణ మాట విని ఆయన కొండలరావును తన ఆఫీసుకు పిలిపించి, మొదటిసారిగా చూస్తూనే “గెటవుట్” అని కేకలేశారట. “ఇంత చిన్నవాడివి నాగేశ్వరరావుకు తండ్రిగా నువ్వేం పనికొస్తావు” అని పంపేశారట. రమణ సిఫార్సు చేసినట్టు తెలిసి కుటుంబరావుగారు కూడా కొండలరావును తనతో మళ్ళీ తన పాత మిత్రుడైన పుల్లయ్య దగ్గరికి తీసుకెళ్ళి, “ఇతని మిమిక్రీ నువ్వు చూడలేదు, నా మాట విని అతనికా వేషం ఇయ్యి” అని గట్టిగా చెప్పాకగాని పుల్లయ్య సరేననలేదట. చిత్రం రిలీజయాక ఆ కామెడీ పాత్ర అందరికీ నచ్చింది.

తక్కిన సినీనటుల్లాగా కాకుండా కొండలరావు తన నాటక, సాహితీరంగాల కృషిని విడిచి పెట్టలేదు. కుటుంబరావుగారి ద్వారా కొండలరావుకు చందమామవారి విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్‌గా ఉద్యోగం వచ్చింది. విజయచిత్రలో పాఠకుల ప్రశ్నలకు ఆయన జవాబులు రాసేవారు. ఒక పాఠకుడి ప్రశ్న: నా ఫోటో విజయచిత్రకు ముఖచిత్రంగా వేస్తే ఎలా ఉంటుంది? కొండలరావుగారి జవాబు: మీ ముఖంలా ఉంటుంది! అంతకుముందు ఆయన జ్యోతి మాసపత్రిక సంపాదకవర్గంలో ఉండేవారు. వివిధ పత్రికల్లో కథలూ, వ్యాసాలూ, సెటైర్లూ, నాటికలూ రాశారు. వాటి వివరాలు కింద చూడవచ్చు.

ఆయన హాస్యధోరణి ఎలాంటిదంటే కథ కంచికి అనే నాటికలో పాత్రల పేర్లు ఇవి: (అన్నమో) రామచంద్ర, (అరచేతిలో) వైకుంఠం, (ఆబాల) గోపాలం, (వల్లకాట్లో) రామనాథయ్య, (లోగుట్టు) పెరుమాళ్ళు, (నీతి) చంద్రిక వగైరా. ఆయన రాసి, దర్శకత్వం వహించిన నాలుగిళ్ళ చావిడి, పట్టాలు తప్పిన బండి, ప్రొఫెసర్ పరబ్రహ్మం మొదలైన నాటకాలు బాగా ప్రజాదరణ పొందాయి. పొట్టి ప్రసాద్, కాకరాల, నాగరాజారావు తదితరులు ఆయనకు మంచి సహనటులు. రాధాకుమారికి ముఖ్య పాత్రలుండేవి. ఒకవంక సినిమాపత్రిక పనులు చూస్తూ, రచనలు చేస్తూ, సినిమాలూ, నాటకాల్లో పాత్రలు పోషిస్తూ ఆయన నిత్యమూ బిజీగా ఉండేవారు. మద్రాసులో ఆయన నాటకాలు చూసిన దర్శకులు సినిమా వేషాలకు పిలిచేవారు. పట్టాలుతప్పిన బండిలో కాకరాలను చూశాకనే ఆయనకు బి.ఎన్.గారి ద్వారా రంగులరాట్నంలో అవకాశం వచ్చింది.

1974లో రామనవమి సందర్భంగా మేము బొంబాయిలో నడిపిన తెలుగు సాహిత్యసమితి అనే సంస్థ తరఫున కొండలరావుగారిని ప్రొఫెసర్ పరబ్రహ్మం నాటకం వెయ్యడానికి ఆహ్వానించాం. యవ్వన గుళికలవంటి వాటిని కనిపెట్టేందుకు ఒక నడివయసు పరిశోధకుడు చేసే విఫలప్రయత్నాలను గురించిన ఆ హాస్యనాటకం బ్రహ్మాండమైన జనాదరణ పొందంది. మద్రాసు నుంచి వచ్చిన కొండలరావు గారి బృందం మంచి నాటకాన్ని సమర్థవంతంగా ప్రదర్శించడమే కాక మాకున్న పరిమిత ఆర్థిక స్థోమతను సహృదయతతో అర్థం చేసుకుని మాతో సహకరించడం మేమెన్నటికీ మరిచిపోలేదు. అందులోని డైలాగులనూ, హాస్యసన్నివేశాలనూ మా మిత్రబృందం ఎంతో కాలంపాటు గుర్తు చేసుకుంటూనే ఉండేవాళ్ళం.

ఎవరినీ ప్రాధేయపడకుండా కేవలం నాటకానుభవంవల్ల కొండలరావు, రాధాకుమారి గార్లకు సినిమాల్లో వేషాలు దొరుకుతూ ఉండేవి. తరవాతి కాలంలో ఆయన చందమామ-విజయావారి భైరవద్వీపం సినిమాకు కథారచన, నిర్మాణనిర్వహణ చేశారు. సినిమా రంగం చరిత్ర గురించి ఇప్పటికీ ఎన్నో మంచి వ్యాసాలు రాస్తున్నారు. టీవీలో గొల్లపూడి మారుతీరావు గిరీశంగా కన్యాశుల్కం నాటకానికి దర్శకత్వం వహించారు. ఈ రోజుల్లో సినిమా పద్ధతులు తనకు సరిపడవనీ, కథ, స్క్రిప్టు, పాత్రపోషణ వగైరాలమీద ఎవరికీ శ్రద్ధలేదనీ అన్నారు. నాటకాల్లో ఆసక్తి ఉన్న మిత్రులతో కలిసి ఇప్పటికీ క్రియాశీలంగా ఉన్న కొండలరావు, రాధాకుమారిగార్ల ఉత్సాహం ఆదర్శప్రాయం అనిపిస్తుంది.

రాధాకుమారిగారు ఆయనకు అన్నివిధాలా తగిన సహచరి. నటిగా ఎంతో ప్రతిభ కలిగిన నటీమణి. నేటికీ సినిమా, టీవీ, నాటకరంగాల్లో బిజీ ఆర్టిస్టు. ఆమె జన్మించినది విజయనగరంలో. స్త్రీలు ఎక్కువగా నాటకాల్లో వేషాలు వెయ్యని ఆ రోజుల్లోనే తన చిన్నతనంలో నటిగా కృషి మొదలుపెట్టారు. క్రమంగా ప్రొఫెషనల్ ఆర్టిస్టుగా అనేక సాంఘిక, పౌరాణికాల్లో నటించసాగారు. ఇక చదువు వెనకబడక తప్పలేదు. ఆమెకు సహనటులు జె.వి.సోమయాజులు, రమణమూర్తి, కొండలరావు మొదలైనవారు. అప్పటికే ఆమె ఉత్తమనటిగా బహుమతులు తెచ్చుకుంది. ఆమెకు సినిమా ఉత్సాహం కూడా కలిగింది. అప్పటికే కొండలరావు సినిమాల్లో వున్నారు గనక ముందు డబ్బింగ్ చెప్పడం నేర్చుకోవటానికి ఆమెను మద్రాసు పిలిపించారు. అప్పట్లో ఆయన సహకార దర్శకుడుగా ఉన్న ‘ముగ్గురు వీరులు’ సినిమాలో ఒక ముఖ్యపాత్రకి ఆమె డబ్బింగ్ చెప్పింది. త్వరలోనే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చాలా చిత్రాల్లో ఆమెకు అవకాశాలు రాసాగాయి. కొండలరావు ఇంట్లోనే ఆమె తన తండ్రిగారితో వుండేది. అభిరుచులూ, వ్యాపకాలూ ఒకటే కావడంతో కొండలరావు, రాధాకుమారి ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు.

రాధాకుమారి నటించిన నాటకాలు చూసిన సినీప్రముఖులు ఆమెకు చిత్రాలలో అవకాశాలు ఇవ్వసాగారు ఆమె తొలి చిత్రాలు: తేనెమనసులు, దాగుడుమూతలు. తర్వాత గయ్యాళి పాత్రలు, సాధు పాత్రలు చాలా చిత్రాల్లో వేశారు. అయితే కొందరు ఇతర సినీకళాకారుల్లాగా వీరిద్దరూ తమ సంస్కారాన్ని మరిచిపోలేదు. అందుకనే నాటకాలు వెయ్యడం మానలేదు. ఆమె దాదాపుగా 400 సినిమాల్లో వేశారు. ప్రస్తుతం 5, 6 సినిమాల్లో పాత్రధారణ చేస్తున్నారు. ఇటీవల ‘ఒకరికి ఒకరు’ ‘చందమామ’ చిత్రాల్లోని ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. ఓ పక్క టీవీ సీరియల్స్, ఇంకోపక్క సినిమాలూ, నాటకాలూ – నిత్యం బిజీగానే వున్నారు.

ప్రస్తుత కాలంలో తెలుగు నాటకరంగం పరిస్థితి గురించి బాబ్జీలు అడిగినప్పుడు కొండలరావుగారు చెప్పినది ఇది.

“టిక్కెట్ కొనుక్కుని చూసే ప్రేక్షకులు లేకపోవడం వల్ల తెలుగు నాటకం ఈ పరిస్థితుల్లో వుంది. ‘కమిట్మెంట్’ లేని ప్రేక్షకులూ ‘కమిట్మెంట్’ లేని నాటకరంగం. ఇదీ పరిస్థితి. మిగిలిన రాష్ట్రాల నాటకరంగాలతో అసలు పోలికే లేదు. నంది నాటకోత్సవాలకి విరగబడి జనం వస్తారు. రవీంద్రభారతి నిండిపోయి బయట కూడా స్క్రీన్స్ పెట్టవలసి వస్తుంది. ఒక రూపాయి అయినా టికెట్ పెట్టండి అని ఎంత చెప్పినా వినరు. టికెట్ పెడితే రారండీ అంటారు. వచ్చినవాళ్ళే చాలు అన్నా వినరు. ఇటీవల ‘పడమట గాలి’ అనే నాటకం వేసినప్పుడు యాభైమంది ఆర్టిస్టులు, హాల్లో పదిమంది ప్రేక్షకులు, ఇదీ పరిస్థితి. నాటకం మీద అధారపడి బతకడం కుదరదు. ప్రొఫెషనల్ నాటకం కుదరదు. ఎమెచ్యూర్స్ మంచి నాటకాలే వేస్తున్నారు. ఎస్ వీ శేఖర్ రేపూ ఎల్లుండీ రెండు రోజులు ఇక్కడ తమిళ్ నాటకాలు ఆడుతున్నాడు. రెండు నాటకాలు. వెళ్ళి చూడండి. హౌస్ ఫుల్ అవుతాయి రెండురోజులూ. మెడ్రాస్ లో ఇరవై దాకా సభలున్నాయి. అందులో మెంబర్లుంటారు. ప్రతీ నెలా ఫీజు కడతారు. వాళ్ళకోసం ప్రతీ నెలా ఏదో వొక ప్రోగ్రాం వుంటుంది. ఆటో, పాటో, నాటకవోఁ. మెంబర్లు కాని వాళ్ళు టికెట్ కొనుక్కుని వెళ్తారు. ఇక్కడ మెంబర్లుగా చేరినా ఫీజు కట్టరు. రారు.”

తెలుగు నాటకరంగం పరిస్థితిని గురించి చాలామంది పెద్దలు చాలానే రాశారు. అది ప్రస్తుతపు తెలుగువారి సంస్కారాన్ని సూచిస్తుంది. ఏది ఏమైనప్పటికీ పట్టువదలని విక్రమార్కుళ్ళా కొండలరావుగారి వంటి కళాకారులు మాత్రం తమ వంతు కృషిని చేస్తూనే ఉన్నారు.

రావికొండలరావు రచనలు (ఇవన్నీ విశాలాంధ్ర బుక్‌హౌస్ తదితర దుకాణాల్లో దొరుకుతాయి):

రావి కొండలరావు నాటకాలు
రావి కొండలరావు కథలు
రావి కొండలరావు నాటికలు
బ్లాక్ అండ్ వైట్ (సినిమా వ్యాసాలు – నంది అవార్డ్ పురస్కృత)
మల్లీశ్వరి నవలా రూపం
మాయాబజార్ నవలారూపం
షావుకారు నవలారూపం
హ్యూమరథం – 1
హ్యూమరథం – 2 (సినిమావారిలోని చమత్కారాలు)
(సి) నీతి చంద్రిక (సినిమా సెటైర్)
అన్నీ అడ్డంకులే (సినిమా సెటైర్)
చిత్తూరు వి.నాగయ్య (జీవిత చరిత్ర)*
నేనూ – నా దర్శకులు (అక్కినేని)*
(* వాళ్ళు చెప్పగా రావి కొండలరావు రాసినవి)
-----------------------------------------------------------
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, 
ఈమాట సౌజన్యంతో 

శ్రుతిమించిన రాగం


శ్రుతిమించిన రాగం



సాహితీమిత్రులారా!

ఒకప్పుడు శాస్త్రీయ సంగీతం కానిదంతా (జానపద సంగీతం తప్ప) లలిత సంగీతమే అనే భావన ఉండేది. అందులో భావగీతాలూ, సినిమా పాటలూ అన్నీ భాగంగా ఉండేవి. ఈనాడు అలా అనలేము. మనకు (అక్కర్లేకపోయినా) నిత్యమూ వినబడుతూండే సంగీతంలో ” లాలిత్యం ” ఏమాత్రం ఉండటంలేదు. గతంలో డా. బాలాంత్రపు రజనీకాంతరావు గారి వంటి సంగీత ప్రయోక్తలు రేడియో ద్వారా తెలుగులో మంచి కవితలకి సంగీతం కట్టి ప్రజలకు వినిపించారు. లలిత సంగీతం గురించీ, తన అనుభవాలను గురించీ రజనీగారు ఆసక్తికరమైన వ్యాసాలు కూడా రాసారు. రేడియో సంగీతం జనప్రియం కాకముందే మరొకవంక సినిమా పాటలు సామాన్య ప్రజల జీవితాల్లోకి చొచ్చుకుపోయి జన సంస్కృతిలో ఒక ముఖ్యభాగమైపోయాయి. ఆ సంగీతంలో ఎంత వ్యాపార ధోరణి ఉన్నప్పటికీ సినిమా పాటల్లో ఉండే “శక్తి వంతమైన ” సంగీతం ముందు, రేడియో సంగీతం కొంచెం నీరసంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందుకు కొంత కారణం సినీ ఆర్కెస్ట్రాలో ఉండే హార్మొనీ! వీటన్నిటికీ దూరంగా శాస్త్రీయ సంగీతం ఆనాడూ,  ఈనాడూ కూడా నిలిచే ఉంది. ఈనాడు లలిత కళలకు కూడా ప్రజాస్వామిక ధోరణి అబ్బింది కనక, శాస్త్రీయ సంగీతం నేర్చుకోదలచిన వారికి ఏ అర్హతలూ ఉండనవసరం లేదు. కేవలం ఆసక్తీ, ఓపికా, వ్యవధీ ఉంటే చాలు. ఆపైన గురువు గారికి నేర్పూ, ఓపికా ఉండాలి.

ఈనాడు మనకెన్నో రకాల సంగీతం, ఎన్నో పోకడలూ వినిపిస్తున్నాయి. ఫ్యూజన్‌ (  Fusion ) సంగీతం అని ఒక కొత్తపేరు వినిపిస్తోంది. నిజానికి మనం రోజూవినే సంగీతం అంతా ఫ్యూజన్‌ అనే చెప్పాలి. మన దేశపు సినిమా పాటలన్నీ దాదాపుగా శాస్త్రీయ సంగీతపు రాగాలమీద అధారపడినవే! మరి తేడా ఎక్కడుంది? శాస్త్రీయ సంగీతం రాగాల మయం. అందులో సాహిత్యం ఉన్నా, పెద్దపీట రాగానిదే. ఎందరో మహానుభావులు,జగదానంద వంటి కీర్తనల్లోని చరణాలకు త్యాగరాజు గారు ముందు స్వరం కట్టి, తరవాత వాటికి సరిపోయే సాహిత్యం రాసాడని మా నాన్న గారూ, నేనూ అనుకొనేవారం.జయంతసేన రాగంలో ఆయన రాసిన ” వినతాసుత వాహన ” అనే కీర్తనకూడా కొన్ని సినిమా పాటల పద్ధతిలో ముందు ట్యూన్‌ కట్టినట్టుగా అనిపిస్తుంది. అందులో పల్లవికి స్వరాలు ” మగసా సగమా పదసా పమపా మగసా సనిదా దసగమపాపా ” అనిఉంటే వాటికి సరిపోయే మాటలు ” వినతా సుతవా హనశ్రీ రమణా మనసా రగసే వించెద రామా ” అన్న పద్ధతిలో విరుగుతాయి. సాహిత్యం కన్నా స్వరాల గురించి త్యాగరాజు ఎక్కువ శ్రద్ధ చూపాడనడానికి ఇలాంటివెన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ వంటి మేధావి కూడా ఇటువంటి అభిప్రాయాన్నే ఒక వ్యాసంలో వ్యక్తం చేసారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, శాస్త్రీయ సంగీతపు “గొడవ” అంతా ప్రధానంగా రాగాల గురించేనని చెప్పడానికి.

లలిత సంగీతం అలా కాదు. ఇందులో సాహిత్యమే ముఖ్యం. సాహిత్యపు భావానికి, రాగ భావం తోడైనప్పుడు పాట ఇంకా రాణిస్తుంది. ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఎస్‌ రాజేశ్వర రావు ఖమాస్‌ రాగంలో జావళీల ఫక్కీలో ఎన్నో పాటలు చేసారు. కాని, విప్రనారాయణలో భానుమతి పాడిన ” నను విడనాడకురా ” అనే పాటకన్నా, చరణదాసిలో సుశీల పాడిన జావళీ కన్నా, మల్లీశ్వరిలోని ” ఎందుకే నీకింత తొందరా ” అనేపాటే జనాదరణ పొందింది. ఇందుకు కారణం దేవులపల్లి వారి రచనే! శ్రీశ్రీ, దాశరధి, నారాయణ రెడ్డి వంటి కవులు సినీగీతాలు రాసి సినిమాల్లో సాహిత్యపు విలువల్ని పెంచారు. ఈరోజుల్లో సినిమా పాటలు బాగుండక పోవటానికి కారణం చెత్త సాహిత్యమే! ఈనాటి కవులకు శక్తి లేదని కాదు. దంపుళ్ళ చప్పుడువంటి తాళమే పాటకు ముఖ్యమనే భావన బలపడింది. ముందు లయ ప్రధానమైన ట్యూన్‌ తయారవుతుంది.దానికి తరవాత మాటలు అతికిస్తారు. ప్రపంచంలో ఇతరత్రా వస్తున్న సామాజిక మార్పులవల్లనో ఏమోగాని, ఎవరు ఏం చెప్పినా వినదగినదేదీ లేదనే భావం పెరుగుతోంది. అందువల్ల పాట అంతా తెలుగువారు తయారు చేసినప్పటికీ, అది ” అరవ” పద్ధతిలోనే సాగుతుంది. పాత సినిమా పాట మాత్రం ఏది విన్నా అందులో తెలుగుదనం కనిపిస్తుంది.

తెలుగు సినిమాపాటలలో మనవాళ్ళు వాడినవన్నీ దాదాపు హిందూస్తానీ రాగాలే! ఇది తక్కిన దక్షిణభారత సినిమా పాటలకు కూడా చాలావరకు వర్తిస్తుంది. ముఖ్యంగా రాజేశ్వరరావు, పెండ్యాల, ఘంటసాల సంగీతదర్శకత్వం నిర్వహించిన సినిమాల్లో ” మెలొడీ ” పాటలన్నీ ఇటువంటివే ! ఆమాటకొస్తే, భీంపలాస్‌ (అభేరి) రాగంలో హిందీ సినిమా పాటలు అతి తక్కువ. తెలుగులో కొల్లలు. నీలిమేఘాలలో, మేఘమాల, ఊరుకోవే మేఘమాలా, ఇలా తెలుగు మేఘాలన్నీ భీంపలాస్‌ మీదుగానే సాగినట్టనిపిస్తుంది. భాగేశ్వరీలో ” నీ కోసమె నే జీవించునది “, ” అలిగితివా సఖీ ప్రియా “, ” రారా కనరారా “, శుద్ధ సారంగ్‌ లో ” ఎవరో అతడెవరో (వెంకటేశ్వర మహత్మ్యం)”,  తిలక్‌ కామోద్‌ లో ” అలిగినవేళనె చూడాలి “, కేదార్‌ లో “నీ మధు మురళీ గాన లీల “, పట్‌ దీప్‌ లో ” కన్నుల దాగిన అనురాగం”, ” నీ అడుగులోన అడుగువేసి నడువనీ”, జైజవంతిలో ” మనసున మనసై “, ఇలా ఎన్నో పాటలున్నాయి. ఆది నారాయణ రావు వంటి సంగీత దర్శకులకు హిందూస్తానీ రాగాలే మక్కువ. కర్ణాటకంలో మోహన రాగాన్ని పోలినది హిందూస్తానీలో భూప్‌ రాగం. రాగ లక్షణం దృష్య్టా ఆది నారాయణ రావు చేసిన ” ఘనా ఘన సుందరా ” అనే పాట భూప్‌ రాగమే! మోహన కాదు.

“శుద్ధ కర్ణాటక రాగాల్లో లైట్‌ సాంగ్స్‌ చెయ్యలేమా ? ” అన్న సమస్య నన్ను చాలా కాలం వేధించింది. ఎన్నో సంవత్సరాలుగా ఘంటసాల గారికి సహాయ సంగీత దర్శకుడిగా పనిచేసి, ప్రస్తుతం కూచిపూడి నృత్యనాటకాలకు సంగీతం సమకూరుస్తున్న సంగీత రావుగార్ని ఈ మాటే అడిగాను. తాను నాటకాలకు సంగీతం కడుతున్నప్పుడు ఉపదేశం, భక్తి వంటి భావాలను వ్యక్తం చెయ్యటానికి తప్ప కర్ణాటక రాగాలు తనకు అంతగా ఉపకరించలేదని ఆయన అన్నారు. శాస్త్రీయ సంగీతంలో ” పట్టు ” ఉంది. శాస్త్రీయ సంగీతం నచ్చని వారికి అందులో ఎబ్బెట్టుగా ఉండేది ఇదే! ఎటొచ్చీ హిందూస్తానీ సంగీతం పాడుతున్నప్పుడు అప్పుడప్పుడు పట్టు విడిచి మెలొడీ ప్రధానంగా పాడినా ఎవరూ తప్పు పట్టరు. నవాబుల ఆస్థానాల్లో ఆదరణ పొందిన సంగీతమది. అందుకని ” ఈస్తటిక్స్‌ ” పాలు ఎక్కువ. దేవాలయాల్లో మారుమ్రోగిన కర్ణాటక సంగీతంలో మాత్రం బాలమురళీకృష్ణ వంటి వారు కాస్త మధురంగా పాడితే సనాతనులు విరుచుకుపడుతూ ఉంటారు. శాస్త్రీయసంగీతమంటే మాధుర్యం మాత్రమే కాదని ఎవరైనా ఒప్పుకొంటారు. కాని, ” మధురంగా ఉండనిదే శాస్త్రీయ సంగీతం ! ” అన్న పద్ధతిలో ఛాందసంగా వాదించే వారివల్లనే కర్ణాటక సంగీతానికి అంత ప్రాచుర్యం రాలేదని నేననుకొంటాను. అది కర్ణాటక సంగీతంలోని లోపం కాదని అందరూ తెలుసుకోవాలి.

కానీ, కర్ణాటక రాగాలు భావయుక్తంగా పాడిన సంధర్భాలు కొన్నయినా ఉన్నాయి. కరుణశ్రీ రాసిన కొన్ని పద్యాలను ఘంటసాల రంజని, ముఖారి వంటి రాగాలలో స్వరపరచి అద్భుతంగా పాడారు. అందులో శాస్త్రీయతకు ఏమాత్రం రాజీ పడలేదు. ఎంతో మధురంగా కూడా ఉంటుంది. నాకు తెలిసినంత వరకూ ఇటువంటి ప్రక్రియ మరెవరూ చెయ్యలేదు. ప్రముఖ సినీ దర్శకుడు బి. ఎన్‌ రెడ్డి గారికి ” ఆనంద భైరవి ” రాగమంటే ఇష్టమట. “స్వర్గ సీమ ” సినిమా నాటినుంచీ  ప్రతిసినిమాలోనూ కనీసం ఒక పాట కర్ణాటకరాగంలో చేయించుకొంటూ వచ్చారు. “బంగారు పాప ”  సినిమాలో ” తాధిమి తకధిమి తోల్‌ బొమ్మా ” పాటఒక ఉదాహరణ ( మరపురాని మరొక చక్కని గాయకుడు ” మాధపెద్ది సత్యం ” పాడారీ పాటను).ఎటొచ్చీ “భాగ్య రేఖ ”  లో పెండ్యాల చేసిన ” నీవుండేదా కొండపై ” అనే పాట ఎంత తియ్యగా ఉంటుందంటే అది ఆనంద భైరవి అని నాకు వెంటనే తట్టలేదు. ” బంగారు పంజరం” లో రాజేశ్వరరావు చేసిన “మనసే మారేరా” అనే పాట కూడా అంతే! ఈ పాటల్లో సంగీత దర్శకులు సాంప్రదాయమైన ” రాగ పట్టు” ను బుద్ధిపూర్వకంగా విడిచి పెట్టారు. శాస్త్రీయ పద్ధతిలో ” ఆనంద భైరవి  ” ఎలా ఉంటుందో తెలియాలంటే, “మిస్సమ్మ”  సినిమాలో ” శ్రీ జానకీదేవి సీమంత మలరే” లేదా ” పలుకే బంగార మాయెరా” అనే రామదాసు కీర్తన వినండి. తేడా తెలుస్తుంది.

శాస్త్రీయ రాగాలను గుర్తించటానికి సినిమా పాటలతో మొదలు పెట్టటం చాలా తేలికైన పని. టివీలో మహామహోపాధ్యాయ డా. నూకల చినసత్యనారాయణ వంటి విద్వాంసులు ఇలాటి కొన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వహించారు. రాగాలు, స్వరాలూ గుర్తు పట్టి శాస్త్రీయ సంగీతంలోకి ” దొడ్డిదారిన” ప్రవేశించడం తప్పేమీ కాదు. ఎందుకంటే తిన్నగా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటానికి ప్రయత్నించే వారికి కొందరు సంగీతం మేస్టార్లు అప్రయత్నంగా సంగీతం అంటే ఏవగింపు కలిగిస్తారు. సినిమా పాటలు వినేవారు అభిమానం కొద్దీ వింటారు. శాస్త్రీయ సంగీతాన్ని మాత్రం కేవలం గౌరవంకొద్దీ నేర్చుకోవడం మెదలుపెడతారు. వారికి ఏ బాలమురళి పాటో నచ్చినా తాము ఆ స్థాయిని అందుకోవటానికి చాలా కాలం పడుతుందని వారికి త్వరలోనే తెలిసిపోతుంది. అలాంటివారికి యూజర్‌ ఫ్రెండ్లీ పద్ధతి బావుంటుంది.

శాస్త్రీయ సంగీతం అంటే అభిరుచి పెరగడానికి కొంత సమయం పడుతుంది. బాలమురళి వంటి గాయకుడి గొంతు మధురంగా ఉంటుంది కనక వెంటనే నచ్చుతుంది. వోలేటి వెంకటేశ్వర్లు, ఎం. డి. రామనాధన్‌
మధురై మణి వంటి గాయకుల సంగీతం అద్భుతంగా ఉంటుందని ” పామరులకు” వెంటనే అనిపించక పోవచ్చు. మన దేశపు శాస్త్రీయ సంగీతంలోని ముఖ్య లక్షణాలు సాంప్రదాయం మాత్రమే కాక హృదయం, మేధస్సు కూడా! ఇవి అర్ధం అయినప్పుడు సంగీతం ఎంతో బాగుంటుంది. సంగీతానికి టైం డైమెన్షన్‌ ఒక్కటే అని మా నాన్నగారు అంటుండే వారు. అది నిజమే! శాస్త్రీయ సంగీతంలో ముఖ్యంగా మనో ధర్మసంగీతంలో ” ఏం అన్నాడు ” అనేది ఎంత ముఖ్యమో ” ఎప్పుడు అన్నాడు “, ” అంతకుముందు ఏం అన్నాడు ” అనేవి కూడా అంత ముఖ్యమే. మంచి ఉపన్యాసంతో ఆకట్టుకొనే వాడిలాగా సంగీతకారుడు కూడా సైకలాజికల్‌ మొమెంట్‌ ఎటువంటిదో తెలిసినవాడై ఉంటాడు. సంప్రదాయం, వ్యక్తి గత ప్రతిభ రెండూ ఉన్నవాడే రాణిస్తాడు. మరో ముఖ్య విషయం ఏమంటే, వినే వారికి శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉండనక్కరలేదుగాని,పరిచయం మాత్రం ఉండి తీరాలి. అది విని ఆనందించడానికి ఓపిక ఉండాలి. అది చెరకుగడ నమిలినట్టుగా చాలాసేపు నమిలే వస్తువు. దానితో పోలిస్తే సినిమా పాటలు పెప్పర్మెంటు లాగా నోట్లో వేసుకొని కరకరా నమలవచ్చు.

సినీసంగీతంలో మన దేశపు రాగాలూ పాశ్చాత్య సంగీతపు కార్డ్‌ ( chord ) లూ కలిసి ఉంటాయి. ఇదే మనకు తొలి ప్యూజన్‌. రాగంపై ఆధారపడి లయబద్ధంగా నడిచే సినిమా పాటకు తబలా వంటి వాయిద్యాలతోబాటు గిటార్‌, పియానో వంటి వాయిద్యాలమీద అదే లయతో chords  వాయిస్తూ ఉంటారు. ఇందులో సామాన్యంగా మూడుస్వరాలు కలిసి మోగుతాయి. పాట ఆ క్షణంలో ఏస్వరంమీద నిలిస్తే దానికి తగిన ధఫలషన  మోగుతుంది. Chord లోని స్వరాల మధ్య స,గ,ప అనే పరస్పర సంబంధం ఉంటుంది. ఈ మూడు స్వరాలూ పాడుతున్న రాగానికి చెందినవే అయిఉండాలి. ఇది పాటకు అందాన్నీ, బరువునూ ఇస్తుంది. “ముద్దబంతి పూవులో…” అనే పాటను గిటార్‌ లేకుండా వింటే బోసిగా ఉన్నట్టు అనిపిస్తుంది.

లలిత సంగీతంలో మంచి రచన ఉండి దానికి తగిన ట్యూన్‌ జత పడితే chord లతో పరిపూర్ణంగా అనిపించే ఆర్కెస్ట్రా మరింత అందాన్ని ఇస్తుంది. పాత సినిమా పాటల్లో ఇవన్నీ సమకూరడం వల్లనే ఈనాటికీ యువతరానికి నచ్చుతున్నాయి. హిందీ సినిమా పాటల్లో కూడా ఇదే పరిస్థితి. 195060ల మధ్య కాలం మన దేశపు సినిమా పాటలన్నిటికీ స్వర్ణ యుగమే అనిపిస్తుంది. అంతకు ముందు కె. ఎల్‌. సైగల్‌ వంటి గొప్ప గాయకులున్నా నౌషాద్‌ వంటి అతిగొప్ప సంగీత దర్శకులు వచ్చి ఆర్కెస్ట్రేషన్‌  మెరుగు పరచి ఇతరులకు మార్గ దర్శకులైన తరవాతనే సినిమా పాటలు రాణించటం మొదలు పెట్టాయి.

సినిమా పాటలో గాయకుడికీ సంగీత దర్శకుడికీ వచ్చినంతగా కవికి పేరు రాకపోవచ్చు. సంగీతం ఆకర్షించినంతగా కవిత్వం ఆకర్షించక పోవడమే ఇందుకు కారణం. సాహిత్యానిదే పైచెయ్యి కావాలని హిందీ సినీరచయితా,మహాకవి అయిన సాహిర్‌ లూధియానీ పట్టుపట్టేవాడట. ఆయనతో ఎక్కువగా పని చేసిని రోషన్‌ సంగీత దర్శకత్వంలోని పాటలన్నిటిలోనూ సాహిత్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ట్యూన్‌, సాహిత్యాన్ని మరుగుపరచదు. తెలుగులో ఒక్క దేవులపల్లివారి పాటలు మాత్రం రాజేశ్వర రావు చేసిన ట్యూన్‌ల ధగధగలను కూడా అధిగమించి మనని అలరిస్తాయి.

రచయితకూ సంగీత దర్శకుడికీ పొత్తు కుదరటం చాలా ముఖ్యం. ఇది హిందీ పాటల్లో ఎక్కువగా ఉండేది.పైన చెప్పిన సాహిర్‌రోషన్‌ ద్వయంలాగే షకిల్‌నౌషాద్‌ లూ, శైలేంద్ర హస్రత్‌ జైపూరీ,శంకర్‌ జైకిషన్‌ వంటి ద్వయాలు ఉండేవి. ట్యూన్‌ ముందు చేసి పాట రాయించారో పాటకు ట్యూన్‌ కట్టారో తెలియనంత అన్యోన్యత ఉండేది ఆ పాటల్లో. పాటను రచయిత ముందు ఒక లయలో రాసినా సంగీత దర్శకుడు మార్చెయ్యగలడు. ఉదాహరణకు “నీలిమేఘాలలో గాలికెరటలలో …” అనే పాట జంపె (తాళం పేరు) నడకలో సాగినా ట్యూన్‌ మాత్రం చతురశ్రంలోనే చేసారు. ఇలాంటి ఉదాహరణలు హిందీలోనూ కనిపిస్తాయి. ట్యూన్‌ ఎటువంటిదైనా డబ్బింగ్‌ పద్ధతిలో అద్భుతమైన  రచనలు చేసినవారు శ్రీశ్రీ, ఆరుద్రలు. ఉదాహరణకు శ్రీశ్రీ రాసిన “జోరుగా హుషారుగా …” అన్న పాట మొత్తమంతా లయను బట్టి ఒక గురువు వెంట ఒక లఘువు వచ్చేటట్టు సాగుతుంది. ఇది శ్రీశ్రీ భాషలో చెప్పాలంటే అనితర సాధ్యం.

బాగా పాడితే ఏసంగీతమైనా బావుంటుంది.. కొన్నేళ్ళక్రితం బొంబాయిలో ఉస్తాద్‌ విలాయత్‌ఖాన్‌ సితార్‌ కచేరీకి ఉత్సాహంతో వెడుతున్న నాతోబాటు ” ఏమిటో ఆ వింత చూద్దాం” అని సంగీతంతో ఏమాత్రం పరిచయంలేని పధ్నాలుగు మంది మిత్రులు వచ్చి చివరిదాకా కూర్చొని అద్భుతంగా ఉందని అన్నారు. గొప్ప కళకు దివిటీ పట్టి చూపించక్కరలేదు అనడానికి ఇది మంచి ఉదాహరణ.
----------------------------------------------------------
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, 
ఈమాట సౌజన్యంతో

Saturday, November 24, 2018

అసామాన్య సంగీతదర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్


అసామాన్య సంగీతదర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్



సాహితీమిత్రులారా!
సినిమాపాటలు ప్రపంచంలో మనదేశానికి ప్రత్యేకం. వాస్తవికత దృష్య్టా సినిమాల్లో అసలు పాటలుండాలా అన్న చర్చను పక్కన పెడితే సినిమాలతో సంబంధం లేకుండా పాటలు శాశ్వతంగా ప్రజల మనసుల్లో నిలిచిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జానపద, లలిత, శాస్త్రీయ సంగీతాల బలమైన ప్రభావం మొదటినుంచీ మన ప్రజల హృదయాల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉండడం వల్లనే పాటలకు సినిమాలు వాహకంగా పనిచేశాయని అనుకోవాలి. ఇదంతా వినేవారి దృక్పథం. ఇక చిత్రనిర్మాణంలోని ఆర్థిక సమస్యలనుబట్టి చూస్తే సినిమా అనేది బోలెడు డబ్బు పోసి తీసే కదిలే బొమ్మ కనుక కథను సందర్భోచితంగా రక్తి కట్టించడమే సంగీతపు పరమార్థంగా నిర్మాతలు భావించబడడంలో ఆశ్చర్యంలేదు. సినిమాలు పాతబడిపోయి, నటీనటులు out of fashion అయిపోయిన తరవాత కూడా సినీసంగీతం జనాదరణ పొందుతోందంటే అందుకు కొంతవరకూ nostalgia కారణం అనుకున్నప్పటికీ ముఖ్యకారణం ఆ సంగీతంలో ఉండే “శాశ్వత” విలువలే అని ఒప్పుకోవాలి.

1921లో పుట్టి 1952లో మరణించిన సి.ఆర్‌.సుబ్బరామన్‌ తొలి సినీ సంగీతదర్శకులలో చాలా గొప్పవాడు. కొన్ని దశాబ్దాల కిందట సినీసంగీతం గురించిన తన వ్యాసంలో ఘంటసాల ప్రముఖ సంగీతదర్శకులను ప్రస్తావిస్తూ మొదటగా పేర్కొన్నది సుబ్బరామన్‌నే. తెలుగువారికి చిరపరిచితాలైన దేవదాసు, లైలామజ్నూ వగైరా చిత్రాల పాటలు ఆయన ప్రతిభకు మచ్చు తునకలు మాత్రమే. ఇటీవల ఈ వ్యాస రచయిత సుబ్బరామన్‌తో పనిచేసిన ఒక వేణు విద్వాంసుణ్ణి కలుసుకుని సేకరించిన కొన్ని విశేషాలు తెలుసుకోదగినవి. వీటిలో కొన్ని వ్యక్తిగతమైనవి.

1940లలో సినీరంగంలో పేరుపొందిన దక్షిణాది సంగీతదర్శకులు వి.నాగయ్య, ఎస్‌.రాజేశ్వరరావు, ఎస్‌.వి.సుబ్బయ్య నాయుడు, జి.రామనాథన్‌, ఘంటసాల, పెండ్యాల తదితరులు. ఒక్కొక్కరూ ఒక్కొక్క నిర్మాణ సంస్థలో పనిచేసేవారు. సినిమాలూ, నటీనటులూ పైకి రావడానికి సంగీతం చాలా దోహదం చేస్తుందనే గుర్తింపు ఆ రోజుల్లో మొదలయింది. నాటకాల్లో

పద్యాలూ, పాటల కోసం ఎగబడినట్టే జనం సినిమా పాటలు వినసాగారు. ఆ కాలంలో తారాజువ్వలా ఎగసినవాడు సుబ్బరామన్‌. సినిమా అనే కొత్తరకం ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎలాంటి సంగీతం అవసరమో ఆయన అతి త్వరలోనే గుర్తించినట్టు కనబడుతుంది.

సుబ్బరామన్‌ తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువాడు. మదురై సమీపంలోని చింతామణి ఆయన స్వస్థలం. ఆయన మొదట ఎవరివద్ద సంగీతం నేర్చుకున్నాడో తెలియదుగాని ఒక self-taught genius అని అందరూ అనుకునేవారు. 1940లలో మద్రాసుకు వచ్చి ఆయన మొదట్లో His Masters Voice ఆర్కెస్ట్రా నిర్వాహకుడుగా పనిచేశారు. ఆరోజుల్లో సినిమాపాటలను రికార్డులుగా విడుదల చెయ్యడానికి సినీ గాయకులు మద్రాసులో జెమినీ స్టూడియో సమీపంలో ఉన్న HMV సంస్థలో సినీ ఆర్కెస్ట్రాతో కాకుండా అక్కడి ఆర్కెస్ట్రాతోనే మళ్ళీ పాడవలసివచ్చేది. ఆ తరవాత ఆయన స్వతంత్రంగా తమిళంలోనూ, తెలుగులోనూ సంగీతదర్శకత్వ బాధ్యతలు చేపట్టి, ఎనలేని కీర్తినీ, ప్రజాదరణనూ పొందారు.

ఆయనకు బాగా తాగుడు అలవాటుండేది. దేవదాసు చిత్రనిర్మాణంలో ఆయన ఒక వాటాదారు. ఆయనతో వివాహేతరసంబంధం ఉన్న ఒకావిడ ద్వారా సహనిర్మాతలు 1952లో ఆయనకు విష ప్రయోగం చేసి చంపించారన్న వదంతి ఆ రోజుల్లో వినిపించింది. రికార్డింగ్‌ పూర్తిచేసి మధ్యాహ్న భోజనానికి తన షెవ్రొలెట్‌ కారులో దర్జాగా వెళ్ళిన ఆయన శవాన్ని ఆ సాయంత్రమే, అదే కారులో తేవలసి వచ్చిందట. ఆయన మృతిచెందిన కొద్దిగంటల్లోనే శవాన్ని హడావిడిగా మదురైకి తరలించి అంత్యక్రియలు చేశారని విన్నప్పుడు అనుమానం బలపడుతుంది కాని ఆధారాలేవీ లేవు. ఆ తరవాత ఆస్తి విషయంలో ఆయన భార్యకూ, ఆయన తండ్రికీ మధ్య గొడవలు కూడా తలెత్తాయట. ఆయన కుమారుడు కణ్ణన్‌ నేటికీ సినీ పరిశ్రమలో ఉన్నారట. శంకర్‌గణేశ్‌ ద్వయంలో ఇటీవల మరణించిన శంకర్‌ సుబ్బరామన్‌కు తమ్ముడు. గట్టిగా ముప్ఫై రెండేళ్ళు కూడా బతకని సుబ్బరామన్‌ ఆ కొద్ది సంవత్సరాల్లోనే మరపురాని కృషి చేశారు.

సుబ్బరామన్‌ గొప్పతనం తెలుసుకోవటానికి ఒక్కవిషయం చాలు. ఆయనకు సహాయకులుగా పనిచేసినవారంతా తరవాత గొప్ప సంగీతదర్శకులయారు. వారిలో ముఖ్యులు ఘంటసాల, విశ్వనాథన్‌, రామమూర్తి, సుసర్ల దక్షిణామూర్తి (వయొలిన్‌ వాయించేవారు), ఆర్‌.ఎస్‌.గోవర్ధనం, సుబ్రహ్మణ్యం (మేండొలిన్‌) రాజు, లింగప్ప తదితరులు. వీరిలో ఘంటసాల తాను అప్పటికే సంగీతదర్శకుడైనా సుబ్బరామన్‌తో సహకరించడం విశేషం. తాను సుబ్బరామన్‌ వద్ద సంగీతం నేర్చుకున్నానని పి.లీల అన్నారు. తెలుగు సినిమాలో పాడేందుకు తొలి అవకాశంలైలా మజ్నూలో మాధవపెద్ది సత్యం, సుసర్ల దక్షిణామూర్తిలకు వారిద్దరూ కలిసి పాడిన “మనుచుగా తా ఖుదా తోడై” ద్వారా లభించింది. సినీ నేపథ్య సంగీతం రీరికార్డింగ్‌ జరుగుతున్నప్పుడు తెరమీద చిత్రం చూస్తూ సుబ్బరామన్‌ “ఆశువుగా” పియానో మీద వాయించేవారని ఈమధ్య ఒక టీవీ ఇంటర్వ్యూలో విశ్వనాథన్‌ చెప్పారు. అలా ఆయన వాయిస్తున్నప్పుడు వెంట వెంటనే స్వరాలు నోట్‌ చేసుకునే పని తానూ, రామమూర్తి, గోవర్ధనం, లింగప్ప చేసేవారమని ఆయన అన్నారు. ఆ రోజుల్లో సుబ్బరామన్‌ చాలా డబ్బు ఖర్చుపెట్టి మద్రాసులోని అత్యుత్తమమైన వాద్యబృందం నిర్వహించేవారట.

దేవదాసు సుబ్బరామన్‌ విషయంలో కూడా విషాదాంతమే. ఆ పాటల ప్రజాదరణను ఆయన చూడడం జరగనేలేదు. నిర్మాతలతో ఘర్షణ ఆయనకు ప్రాణాంతకమే అయింది. సుబ్బరామన్‌ ఒకసారి తాను ఏర్పాటుచేసిన రికార్డింగ్‌కు ఘంటసాల రాలేదని అలిగి “ఓ దేవదా” వగైరా పాటలన్నిటినీ మొదట్లో పిఠాపురంచేత పాడించారట. ఆ తరవాత రాజీ కుదిరి “కుడి ఎడమైతే,జగమే మాయ” వగైరాలు రికార్డు చేశారట. వ్యక్తిగత స్పర్ధలవల్ల జరిగినవే అయినా ఇవన్నీ సుబ్బరామన్‌ వ్యక్తిత్వాన్ని సూచించే విషయాలు. దీన్ని బట్టి సుబ్బరామన్‌ కల్పనాశక్తి ఎంతటి వేగంతో పరుగులు తీసేదో, ఇతరులపట్ల ఆయనకు ఓర్పు ఎంత తక్కువగా ఉండేదో తెలుస్తుంది. క్రియేటివ్‌ కళాకారుడి రెస్ట్‌లెస్‌నెస్‌ ఆయనలో ఎక్కువగాఉండేదేమో. ఆయన అద్భుతంగా పాడి, హార్మోనియం వాయించే వారట. పచ్చనిచాయతో, ఎప్పుడూ తాంబూలం నములుతూ అందర్నీ నవ్వుతూ పలకరించేవారని మా నాన్న(కుటుంబరావు)గారు నాతో అనేవారు. అన్నట్టు “ఓ దేవదా” యుగళగీతం తానే పాడాననీ, నిర్మాతతో గొడవల వల్ల కె.రాణి పేరు వేశారనీ జిక్కీ ఒకసందర్భంలో చెప్పారు. ఆ పాటలో ముందు “ఓహోహో” అన్నది మాత్రం రాణి. అది తరవాత తెచ్చి, అతికించినట్టుగా కాస్త వేరు శ్రుతిలో వినిపిస్తుంది.

సంగీతం విషయంలో సుబ్బరామన్‌ ప్రతిభ అపూర్వం, అసామాన్యం. అకాల మరణం చెందకుండాఉంటే ఎస్‌.రాజేశ్వరరావు వంటి గొప్ప సంగీత దర్శకులకు ఆయన గట్టిపోటీగా నిలిచేవా రనడంలో సందేహంలేదు. కర్ణాటక రాగాలపై ఆయనకు ఉన్న అధికారం పి.లీల, ఎమ్‌.ఎల్‌. వసంతకుమారి కలిసి “మన మగళ్‌” చిత్రానికి పాడిన “ఎల్లాం ఇన్బ మయం” అన్న ఒక్క పాట వింటే తెలిసిపోతుంది. అందులో సింహేంద్రమధ్యమం, మోహన, దర్బార్‌, హిందోళం వంటి రాగాల మాలికలో స్వరకల్పన అద్భుతంగా అనిపిస్తుంది. అదే సినిమాలోని సుబ్రహ్మణ్యభారతి పాట “చిన్నం జిరు కిళియే”లో కూడా కాఫీ, మాండ్‌ మొదలైన రాగాల మెలొడీ అనుపమానమైనది. ఈ పాట ఎంత బావుంటుందంటే ఎమ్‌.ఎల్‌.వసంతకుమారి, వీణ విద్వాంసుడు చిట్టిబాబు తమ కచేరీల్లో చివర దీన్ని వినిపించేవారు. సినిమాపాటలకు అటువంటి గౌరవం దక్కడం చాలా అరుదు. దేవదాసులోని మువ్వగోపాల పదం “ఇంత తెలిసి యుండి” ఖరహరప్రియతో మొదలైన అందమైన రాగమాలిక. సుబ్బరామన్‌ రిహార్సల్‌కు వచ్చిన పి.లీల, ఎమ్‌.ఎల్‌.వసంతకుమారి తదితరులు ఆయన ముందుకు వచ్చే సాహసం లేక రమ్మని పిలిచేదాకా వెనకాలే కూర్చునేవారట.

తొలి రోజుల్లో సినిమా పాటలకు “catchiness” సమకూర్చిన ప్రతిభ నిస్సందేహంగా సుబ్బరామన్‌దే. ఆయన దరువుల్లోనూ, స్వర ప్రస్తారంలోనూ “సాహసం” కనబడుతుంది. ఒకే పాటలోనే కల్పన అంతులేకుండా సాగిపోతూ ఉంటుంది. ఉదాహరణకు 1949లో రిలీజైన లైలా మజ్నూలో “విరి తావుల లీల” అనే ఘంటసాల, భానుమతి పాడిన యుగళ గీతం ఇప్పుడు వింటే కాస్త “పాత”గా అనిపిస్తుందేమో కాని పాట వేగం తగ్గకుండానే మెలొడీ వినిపిస్తుంది. ఢోలక్‌ ప్రధానంగా వినిపించే ఈ పాటలో చరణాల ట్యూన్‌ గుర్రంలా పరుగులు తీస్తుంది. అదే చిత్రంలోని ఘంటసాల, భానుమతి పాడిన “చెలుని గని” అనే పాట తరవాత దేవదాసులోని “చెలియ లేదు” పాటకు పూర్వ రూపంలా అనిపిస్తుంది. Waltz దరువు మీద సాగే ఈ పాట పల్లవిలో “ఓబో” వాయిద్యం పై వినబడే

counter melody ఎంతో అందమైనది. లైలా మజ్నూలోనే “మనుచుగా తా ఖుదా తోడౖె” అనే పాటలో “ముస్లిం” సంగీతం వినబడుతుంది. అందులో ఘంటసాల చరణం అందుకోగానే అది పాడుతున్నది “హీరో” అని తెలిసిపోతుందంటే అది గాయకుడి, సంగీత దర్శకుడి ప్రతిభ కూడా. ఈ పాటలో ఎంతో డ్రామా ఉంది. భానుమతి పాడిన “్రపేమే నేరమౌనా”లో తాళగతి ఆగి, నడిచే తీరు అప్పట్లో కొత్తే. అద్భుతమైన భావోద్వేగానికి మరొక ఉదాహరణ భానుమతి పాడిన “నిను బాసి పోవుదాన”. ఈ డ్రమెటిక్‌ లక్షణం దేవదాసు పాటల్లో కూడా చాలా మటుకు వినిపిస్తుంది. ఘంటసాల, భానుమతి పాడిన “దివ్య ప్రేమ” అనే పాటలో భానుమతి “కలలే నిజమాయె” అంటున్నప్పుడు ఎంతో అందమైన నాజూకు గమకం వినిపిస్తుంది. సుబ్బరామన్‌ది అంతటి గొప్ప ఊహ.

దేవదాసులో సుబ్బరామన్‌ ఒక్క పహాడీ రాగాన్ని వివిధ భావాలకూ, సన్నివేశాలకూ వాడుకున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. “ఓ దేవదా, పల్లెకు పోదాం, అందాల ఆనందం” వంటివి ఉత్సాహ భరితాలు. “చెలియ లేదు”లో విషాదం. “తానే మారెనా” మరో రకం. “కల ఇదనీ” వకుళాభరణం, మాయామాళవగౌళ రాగాలతో రూపొందినది. ఈ పాటలన్నిటిలోనూ మధ్యలో వచ్చే “బిట్స్‌” పాటను ఎంతగానో హైలైట్‌ చేస్తాయి.

చండీరాణిలో విశ్వనాథన్‌, రామమూర్తి పూర్తి చేసిన “ఓ తారకా” అనే పాటలో చరణం నడక సుబ్బరామన్‌ ట్రేడ్‌మార్కే. సుబ్బరామన్‌ది ప్రధానంగా ట్యూన్‌ కట్టే ధోరణి. తక్కినవాటిని ఆయన లక్ష్యపెట్టినట్టు కనబడదు. సాహిత్యం ట్యూన్‌కు లోబడవలసిందే. అందువల్లనే తొలిరోజుల్లో సముద్రాల(సీ) రాసిన చాలా పాటల సాహిత్యం అంత గొప్పగా అనిపించదు. తెలుగు సంగీతదర్శకులైన ఘంటసాల, రాజేశ్వరరావు, పెండ్యాల తదితరులు సాహిత్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారు.

1950, 60, 70లలో సినిమారంగం మార్పులుచెంది బలం సంతరించుకున్నాక తక్కిన శాఖలతోబాటు సంగీతంకూడా మారుతూ వచ్చింది. దీని సత్ఫలితాలను తక్కినవారిలాగా చవి చూడకుండానే సుబ్బరామన్‌ కాలంచేశారని తలుచుకున్నప్పుడు సంగీతాభిమానులకు బాధ కలుగుతుంది. సుడిగాలిలా వచ్చి సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించి అకస్మాత్తుగా నిష్క్రమించిన సుబ్బరామన్‌ శకం పూర్తయి యాభై సంవత్సరాలు దాటినా ఆయన సదా స్మరణీయుడే.
----------------------------------------------------------
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, 
ఈమాట సౌజన్యంతో 

Friday, November 23, 2018

సాహితీ చమత్కారాలు


సాహితీ చమత్కారాలు



సాహితీమిత్రులారా!

బ్రహ్మకి కూడా నింద తప్పదా! “కవి నిరంకుశుడు” అన్నారు. అతనికి కోపం వస్తే వారూ వీరూ అనే తారతమ్యం వుండదు. కవికి ఆ స్వతంత్రత వుంది. క్రీ.శ. 1550 తర్వాత తెలుగు దేశాన్ని గోల్కొండ నవాబు ఇబ్రహీం కులీ కుతుబ్‌షా పరిపాలించాడు. ఇతను సాహిత్యపోషకుడు. ముఖ్యంగా తెలుగు కవిత్వాన్ని ఆదరించిన వాడు. అద్దంకి గంగాధర కవి రచించిన “తపతీసంవరణోపాఖ్యానం” కావ్యాన్ని కూడా అంకితం తీసుకున్న వాడు. కవులు అతనిని “ఇభరాముడు”, “మల్కిభరాముడు” అనేవారు. ఇతని సాహిత్య పోషణతో పాటు దానగుణం కూడా ప్రశంసార్హంగా వుండేది. అర్థులకు కల్పవృక్షమట! షట్చక్రవర్తుల కోవలోని వాడట! అటువంటి మల్కిభరాముడు పరమపదించాడు. చాలా మంది దిగులుచెంది వుంటారు. కానీ ఒక కవి తన దిగులును ఆవేశంగా మార్చుకుని ఇలా బ్రహ్మని దెప్పిపొడిచాడు

“రార విధాత యోరి వినరా తగురా తలకొట్లమారి ని
స్సారపు లోభిరాజులను జంపక మల్కిభరామ భూవరున్‌
చారు యశోధనున్‌ సుగుణి జంపితి వర్థుల కేమి దిక్కురా
చేరిక నింత రాజుల సృజింపగ నీ తరమా వసుంధరన్‌”

“ఓయీ బ్రహ్మా, ఇటు రా! నేను చెప్పేది విను. నువ్వొక తలకొట్లమారివి. నిస్సారవంతులైన, లోభులైన రాజుల్ని చంపాలి గానీ రాజశ్రేష్టుడు, మంచి కీర్తి సంపద గలవాడు, సుగుణవంతుడు ఐన మల్కిభరాముణ్ణి చంపావేమిటయ్యా! ఇక యాచకులకు దిక్కెవరు? భూమిలో మళ్ళీ ఇంతటి మహారాజుల్ని సృష్టించటం నీ తరం ఔతుందా?”

బ్రహ్మను ఇలా వ్యాజపరంగా ( ironical ) నిందించడం కవులకి అలవాటే. శ్రీనాథుడు కూడా “ఇంత అందమైన దానిని రాట్నం వడికే దానిగా చేసావేమిటయ్యా?” అని బ్రహ్మని ఆడిపోసుకున్నాడు. బ్రహ్మకు ఐదు ముఖాలుండేవనీ శివుడు కోపంతో ఒక శిరస్సును నరికివేశాడనీ అప్పటినుంచీ చతుర్ముఖుడైనాడనీ ఒక కథ వుంది. అందుకే  “తలగొట్లమారి” అన్నాడు కవి. కోపంలో, సరసంలో, యుద్ధంలో “రా కొట్టడం” సముచితమని కవుల సిద్ధాంతం. అందుకే బ్రహ్మను పట్టుకుని “రార, వినరా, తగురా” అనేశాడు. ఇంతకీ మల్కిభరాముడ్ని పొగడటానికి బ్రహ్మని నిందించ వలసి వచ్చింది. ఆత్మీయులు, ప్రాణసమానులు, కావలసిన వారూ పోయినప్పుడు హృదయం కలత చెందుతుంది. ఆవేదన ఉబికివస్తుంది. అప్పుడు ఈ రకమైన భావనలు వెలువడతాయి!

నాకు నేనే సాటి!

సంస్కృతాంధ్ర కవుల్లో చాలా మంది తమ గొప్ప గురించి చెప్పుకొన్నవారే! కాకపోతే కొందరు వినయంగా చెప్పుకొంటారు, ఇంకొందరు అహంకారంతో గర్వంతో చెప్పుకొంటారు. కవిపండిత లోకంలో అదొక అలంకారం కూడా!

18వ శతాబ్ది నాటి అడిదము సూరకవి ఇలా (సొంత డబ్బా?) చెప్పుకొన్నాడు

“గడియకు నూరు పద్దెములు గంటము లేక రచింతు, తిట్టగా
తొడగితినా పఠాలు మని తూలిపడుం గులశైలరాజముల్‌
విడిచి యనుగ్రహించి నిరుపేద ధనాధిప తుల్యు చేతు నే
నడిదము వాడ! సూరన సమాఖ్యుడ! నాకొకరుండు సాటియే?”

ఈ సూరకవి గొప్ప పండితుడే. లక్షణ గ్రంథాలు కూడా రాశాడు. అయితే “తిట్టుకవి” అనిపించుకున్నాడు. శాపం పెట్టగల సమర్థుడట!

గడియకు వందపద్యాలు చెప్పే సామర్య్థం తనకి వుందన్నాడు. అదికూడా గంటం (కలం) తో కాదు ఆశువుగా spontaneous  గా చెప్తాడట. గడియ అంటే ఇరవైనాలుగు నిమిషాలు. ఇరవైనాలుగు నిమిషాలలో వందపద్యాలు చెప్తాడట! ఇలా వేగంగా చెప్పిన వారు చాలామంది వున్నారు. తిట్టడం మొదలు పెడితే కులపర్వతాలే కూలిపోతాయట! ఇతనికా శక్తి వున్నట్టు తెలిపే చాటు పద్యాలున్నాయి. అంతేకాదు మంచి కూడా అంత తీవ్రంగానే వుంది. అనుగ్రహిస్తే, సహాయం చెయ్యాలనిపిస్తే నిరుపేదని సంపన్నుడిగా చేస్తానని ఘంటాపథంగా చెప్పాడు. “నేనడిదము వాడను” అనటంలో అంతరార్థం వుందన్నారు. అడిదము అంటే కత్తి అనే అర్థం వుంది. కాబట్టి సూరకవి కత్తి లాంటి వాడన్నమాట! ఇతని కవిత కత్తిలా పదునైనది.మాట కూడా పదునైనదే. కత్తిని మంచికీ వాడవచ్చు, చెడుకీ వాడవచ్చు. అలాగే సూరకవి రెండింటికీ ఉపయోగిస్తాడు. నాతో సాటి ఎవరున్నారు? అని ” extra ” గా మాట్లాడాడనుకోండి. ఇలా పెద్దవాళ్ళు అంటే దానికి “పాండిత్య వీరం” అని పేరుపెట్టారు. ఏమైనా ఈ పద్యం ఒకనాటి కవితా ప్రపంచాన్ని, కవుల స్వభావాన్నీ, శక్తినీ వెల్లడిస్తోంది.
---------------------------------------------------------
రచన: ద్వానా శాస్త్రి, 
ఈమాట సౌజన్యంతో 

Thursday, November 22, 2018

తెలుగు సినిమాలు స్త్రీ


తెలుగు సినిమాలు స్త్రీ



సాహితీమిత్రులారా!

తెలుగు సినిమాకు సంబంధించిన వరకు స్త్రీ పాత్రల చిత్రీకరణలో పెద్దగా వైవిధ్యమేమీ కనపడదు. అన్నీ మూసపోసిన పాత్రలే. ప్రతి స్త్రీ పాత్ర కూడ స్త్రీల మీద మరింత బురద చల్లేందుకు, మరింత హాని చేసేందుకు ఉద్దేశింపబడినట్లే కనిపిస్తుంది. అడపా, దడపా కొద్దిగా వైవిధ్యం కనిపించినా అది చెప్పుకోదగినది కాదు. స్త్రీలందరూ ఒక్కటే కాదు అంటూ ఉద్యమాలు, వాదాలు గొంతెత్తి అరుస్తున్నా, తెలుగు సినిమా చెవికి అవి చేరడం లేదు. సాంఘికంగా, రాజకీయంగా అణగదొక్కబడిన వర్గాల స్త్రీలను ఎలా చూపిస్తున్నారన్న విషయాన్ని కాసేపు పక్కనపెట్టి (దాని గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది) “స్టాండర్డ్‌” స్త్రీపాత్రలు అంటే అగ్రకుల, మధ్యతరగతి స్త్రీపాత్రల వైపు ఒక్కసారి చూద్దాం.

గృహహింస / సాంసారిక హింసను మగవాడి పౌరుషంగా, ఆడదాని సహనంగా చిత్రీకరించి ఆకాశానికెత్తేయడం తెలుగు సినిమాకు మొదట్నుంచీ ఉన్న గుణమే. నాటి “లక్ష్మమ్మ కథ” నుండి ఈనాడు విడుదలవుతున్న సినిమాల వరకు అన్నీ ఒకే విషయాన్ని రకరకాలుగా చెబుతున్నాయి, చూపిస్తున్నాయి. కాకపోతే ఈ మధ్య విడుదలవుతున్న సినిమాలు ఈ విషయాన్ని చెప్పడంలో కొత్తపుంతలు తొక్కుతున్నాయి. దీనికి ఓ ఉదాహరణ 2000 సంవత్సరంలో విడుదలయిన ఓ శతదినోత్సవ సినిమా. ఇప్పటిదాకా కేవలం కన్నీళ్ళు, త్యాగాలు, పశ్చాత్తాపాలతో నిండిపోయిన గృహహింస ఈ సినిమాలో “జనరంజకమైన” హాస్యంగా మారిపోయింది. ఇంత గొప్ప భావవిప్లవం బహుశా ఏ ఉద్యమమూ సాధించలేదేమో! తాగుబోతు భర్త భార్యని మాటిమాటికీ చెంప ఛెల్లుమనిపిస్తోంటే అది హాస్యం! విసిగి పోయిన భార్య ఎదురుతిరిగి కసాయిభర్తను చావబాదితే అదీహాస్యమే! తరతరాలుగా శిరోధార్యంగా భావిస్తూ ఊరేగిస్తున్న దిక్కుమాలిన బానిసత్వాన్నే ఇక్కడ వినూత్నరీతిలో ప్రదర్శించారు / బోధించారు.

తోటి మనిషిని చితకబాదడాన్ని కూడా నవ్వు పుట్టించేలా చిత్రీకరించిన సినిమా మేకర్స్‌ది సెన్సాఫ్‌ హ్యూమరా? సినిసిజమా? సినిమాను చాలా శక్తివంతమైన ఆయుధంగా వాడుకోవచ్చని, ప్రేక్షకుల దృష్టికోణంలో విపరీతమైన మార్పును తీసుకురావడానికి ఉపయోగించుకోవచ్చని ఈ సినిమా మరోసారి ఋజువు చేస్తుంది. ఇంతకాలం కన్నీళ్ళు తెప్పించి, కాసులవర్షం కురిపించడానికి ఉపయోగపడిన హింస ఈ సినిమాలో నవ్వులు పుట్టించి, విజయం సాధించడానికి దోహదపడింది. నాలుగు కుటుంబాల కథలో మూడు కుటుంబాలు దాదాపు ఒకేలాగా ఉంటాయి. దిగువ మధ్యతరగతి, చాలీ చాలని జీతాలు, మగవారి వ్యసనాలు, అహంభావాలు, భార్యాభర్తల మధ్య పోట్లాటలు, చివరకు భార్య నోరు మూసుకోవడం / మూయించడం. నాలుగో కుటుంబంలో మాత్రమే ఉద్యోగం చేసే భార్య, భర్త, సహజీవనం, పొదుపు వగైరా, వగైరా. కానీ, కాస్త జాగ్రత్తగా చూస్తే ఆ మూడు కుటుంబాలకూ, ఈ నాలుగో కుటుంబానికీ పెద్దగా తేడా ఏమీ కనిపించదు.

ఈ మూడు కుటుంబాల్లో ఏ భర్తకూ భార్య పట్ల గౌరవం లేదు, ఆపేక్షా లేదు. కాకపోతే వాళ్ళు ఆ “లేనితనాన్ని” వెలిబుచ్చే విధానం లోనే తేడా అంతా. తాగుబోతు పాత్ర భార్యను బూతులు తిడుతూ, కొడుతుంది. మరో పాత్ర భార్యను ఏమేవ్‌, ఒసేవ్‌, అది, ఇది అని సంబోధిస్తూ వుంటుంది. ఇంకో పాత్రేమో భార్యను తిట్టకుండా, కొట్టకుండానే మానసిక హింసకు గురిచేస్తుంది. స్త్రీ ఉద్యోగం చేయడం నేరమో, ఘోరమో అన్నట్లు సాగుతుందీ సినిమా అంతా. ఆ అభిప్రాయం సమాజంలో లేదని కాదు కానీ అలాటి అభిప్రాయాలున్న వాళ్ళు ప్రధానపాత్రలయితే, వాళ్ళ అభిప్రాయాలను ఖండించే ప్రయత్నం సినిమాలో లేకపోతే, ఆ అభిప్రాయాలను బలపరిచినట్లే. భార్యను పురుగు కంటే హీనంగా చీదరించుకుని, తానో సింహంలా పొంగిపోయేవాళ్ళు, తనను ప్రేమించి గౌరవించే భార్యను చితకబాది మోర విరుచుకుని తిరిగే వాళ్ళు ఈ సినిమాలో హీరోలు. పోనీ చివర్లో వీళ్ళలో మార్పేదయినా వచ్చిందా అంటే అదీ లేదు. రెండున్నర గంటలు నానా తిట్లు తిట్టి, దౌర్జన్యం చేసి, కించపరిచి, సినిమా చివర్లో లాంఛనప్రాయంగా భార్యలతో సర్దుకుపోయే పాత్రలు, అప్పుడు కూడా తప్పు ఆడవాళ్ళ మీదే తోసేసి హాస్యాన్ని రేకెత్తిస్తే అది ఎంత ప్రమాదకరమైన ధోరణి! “లక్ష్మమ్మ కథ” లాంటి సినిమాలు ఎన్ని ప్రాణాలు బలితీసుకున్నాయో విన్నాము. అయితే అలాంటి సినిమాల కంటే కూడా ప్రమాదకరమైనది ఈ ధోరణి. ఇలాంటి సినిమాలు నేరుగా స్త్రీల హత్యలకు, ఆత్మహత్యలకు దారితీయక పోవచ్చు కానీ ఆలోచనాధోరణిలో, ప్రవర్తనలో చాపకింద నీరులా మార్పులు తీసుకువచ్చి స్త్రీల పట్ల హింసను పెంచగలవిలాటి సినిమాలు. హాస్యం ముసుగులో హింసని అందంగా జీవితంలో భాగంగా చేయగల సినిమా. చిట్టచివరకు స్త్రీ కూడా ఉద్యోగం చెయ్యాలనుకోవడం తప్పేనని, ఇంట్లోనే స్వర్గం ఉందని, ఉద్యోగం చేయడం ్‌ చేయాలనుకోవడం భర్తను కించపరచడమేనని, అతని శక్తిసామర్య్థాలను శంకించడమేనని అర్థం చేసుకుని భార్య అనే పాత్రలో అందంగా ఇమిడిపోయి ఆనందంగా బానిసత్వం నెరపమనే సందేశం ఇవ్వడమే ఇలాటి సినిమాల పరమార్థం.

మగవాళ్ళను ఉత్సాహపరచి, వాళ్ళ ప్రతిచర్యనూ ప్రోత్సహించి, ఆడవాళ్ళం సర్దుకుపోదాం రమ్మని హితబోధ చేస్తుంది మరో చిత్రరాజం. ఒకరినొకరు ఎంతో గాఢంగా ప్రేమించుకునే(?) భార్యాభర్తలు, పిల్లలు పుట్టాక భార్య పట్ల భర్త అనాసక్తత, మరో అమ్మాయి ప్రవేశం, ప్రియురాలికి గుణపాఠం, భార్యకు మందలింపు, భర్తకు బుజ్జగింపు ఇదీ ఈ సినిమా వ్యవహారం!

భార్య ఎప్పుడూ చక్కగా అలంకరించుకొని, భర్తకు సకలసేవలు అందిస్తూ, అతని చుట్టూ తిరుగుతూ, అతనికి తన పట్ల ఆకర్షణ తగ్గిపోకుండా జాగ్రత్తపడాలని ఈ సినిమా సందేశం. ఇవన్నీ చేయని భార్య బ్రతుకు అన్యాయమైపోతుందని, భర్త చేజారిపోతాడని నొక్కి వక్కాణిస్తుందీ సినిమా. పెళ్ళయిన తర్వాత, వయసు మీద పడ్డాక, మగవాడిలో కూడ మార్పులొస్తాయని, పెరుగుతున్న బాధ్యతలు, తరుగుతున్న ఆరోగ్యం కారణంగా జీవనశైలిలో మార్పులు జరుగుతాయని మచ్చుకైనా ఆలోచించని సినిమా ఇది. ఏ పరిస్థితిలో భర్త మరో స్త్రీ వైపు ఆకర్షింపబడినా స్త్రీలదే (భార్య, ప్రియురాలు) తప్పని నిరూపించే ప్రయత్నమే ఈ సినిమా. మగవాడిది పసివాడి మనస్తత్వమని ప్రతిపాదిస్తూ, అతని పట్ల ఎంత శ్రద్ధ వహించాలో, ఎంత జాగ్రత్తగా అతన్ని కాపాడుకోవాలో భార్యలకు తెలియజెప్పే వింత ఆలోచనే ఈ సినిమా. ఈ సంఘటనల్లో మగవాడి తప్పేమీ లేదా అంటే లేదనే అంటుందీ సినిమా. నిర్లక్ష్యం చేయడం భార్య తప్పు; ప్రలోభపెట్టి దగ్గరవడం మరోస్త్రీ తప్పు. అక్కడక్కడా భార్యకూ, “నేనూ మీలాగా చేస్తే!” లాటి డైలాగులున్నా, మొత్తం మీద తప్పులన్నీ ఆడవాళ్లమీద వేసేసి కాలరెత్తుకు తిరిగే కథానాయకుడిని నెత్తికెక్కించుకునే సినిమా ఇది. హీరోయిన్‌ మరోస్త్రీ దగ్గరకు వెళ్ళి బ్రతిమాలటాలు, భర్తను సంస్కరించుకునే ప్రయత్నాలు ఇంతకు ముందు సినిమాల్లో కూడ ఎన్నో కనిపించాయి. అయితే ఈ సినిమాలో మరో మలుపు కనిపిస్తుంది.

భాషను ఎంతగా గాయపరిచేలా వాడుకోవచ్చో కూడ నిరూపిస్తుందీ సినిమా. మరోస్త్రీకి బుద్ధి చెప్పే ప్రయత్నంలో ముగ్గురు మగవాళ్ళు ఒకరి తరవాత ఒకరు ఆమె భర్తలుగా ప్రవేశిస్తారు. ఇదంతా భార్య సుగుణాలను ఋజువు చేసి, మరోస్త్రీని దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో భాగం. స్త్రీపురుష సంబంధాలలో, ఆ సంబంధాలకు సంబంధించిన అభిప్రాయాలలో ఎన్నో వాదాలు, వివాదాలు చోటు చేసుకుంటున్న రోజుల్లో కూడ ఒక స్త్రీని ఆమె పూర్వసంబంధాల ఆధారంగా కించపరచడం ఎంత అన్యాయం! అందుకు వాడబడ్డ భాష కుంచించుకుపోయేలా చేసే పదాలు. “ఒకటో మొగుడు, రెండో మొగుడు, మాజీ మొగుడు, కాబోయే నాలుగో మొగుడు” అంటూ ఒక స్త్రీ మనసును, జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని కుళ్ళబొడిచేలా అవహేళనగా వాడబడిన ఆ పదాలు కేవలం పదాలు కాదు, మనస్తత్వాలకు అద్దాలు.

ఈ సినిమాలో కూడ హాస్యం పేరిట జుగుప్సాకరమైన సంభాషణలే. “సెవెన్‌ ఇయర్‌ ఇచ్‌”ను దురదగా అనువాదం చేసి దానికి కారణాలు, ఫలితాలు అన్నీ ఎగతాళిగా వివరించే ప్రయత్నం చేస్తుందీ సినిమా. తెలుగు సినిమా చరిత్రలో ఇలాటి సినిమాలేమీ కొత్త కాదు, అరుదూ కాదు. అయితే సమాజంలో లోతుగా పాతుకుపోయిన దురభిప్రాయాలను రూపుమాపే ఉత్సాహం, ఉద్దేశ్యం లేకపోగా వాటిని మళ్ళీ మళ్ళీ మనసుకు హత్తుకునేలా ఉపయోగించడం దారుణం.

వివాహవ్యవస్థను ఆకాశానికెత్తే ప్రయత్నం ఒక ఎత్తయితే, అనుక్షణం స్త్రీ ఆ బంధాన్ని వెయ్యికళ్ళతో ఎలా కాపాడుకోవాలో హెచ్చరించే ప్రయత్నం మరో ఎత్తు. వివాహబంధంలో అభద్రత ఉందన్న విషయాన్ని నిర్వ్దంద్వంగా చెప్పే ప్రయత్నం లేకపోగా ఆ అభద్రతకు స్త్రీనే బాధ్యురాలిగా చెయ్యటమే ఇలాటి సినిమాలను తీర్చిదిద్దుతోంది. సమాజం స్త్రీపై రుద్దిన బాధ్యతలను ఇంకా ఇంకా బలవత్తరం చేసి, స్త్రీని మానసికంగా బంధిస్తాయి ఇలాటి సినిమాలు. సమాజాన్ని ప్రతిబింబిస్తున్నాం అని గప్పాలు కొట్టే దర్శకనిర్మాతలు ప్రతిబింబించేది ఏ సమాజమో అర్థం కాదు.

తెలుగులో చూడదగిన సినిమాలు వస్తున్నాయా, వాటి గురించి ఇంత చర్చ అవసరమా అని కొట్టిపారెయ్యవచ్చు. స్పష్టమయిన ఆలోచనలు, స్థిరమయిన అభిప్రాయాలు, బలమయిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఇలాంటి సినిమాల ప్రభావం నుండి తప్పించుకోవచ్చు. అయితే సినిమాయే ప్రధాన కాలక్షేపంగా, సినిమా వలన ఎంతో ప్రభావితమయ్యే వాళ్ళే మన సమాజంలో ఎక్కువ. ఇలాంటి సినిమాలు అలాంటి ప్రేక్షకులలో తమ అభిప్రాయాలను నాటుతున్నాయి, బలంగా వేళ్ళూనుకునేలా చేస్తున్నాయి. ఇదీ రాజకీయమే. ప్రేక్షకులే ఓటర్లయిన ఈ ఎన్నికలలో సినిమా విజయమే నిర్మాత, దర్శక, రచయితలకు అధికారాన్నిచ్చి అలాంటివో, ఇంకాస్త “ప్రగతి” సాధించినవో సినిమాలు మళ్ళీ మళ్ళీ తీసేలా చేస్తుంది.

***
ఇలాంటి సినిమాలు ఓ వైపుంటే, భరించలేనంత సెంటిమెంటలిజమ్‌ను రుద్దుతున్న సినిమాలు మరోవైపు. అశ్లీలత, హింస కంటె ఈ సెంటిమెంటలిజమ్‌ మరీ భయంకరమైనది. మంగళసూత్రం, మట్టెలు, నల్లపూసలు, పసుపు, కుంకుమ లాంటి సింబల్స్‌ను ఎంతవరకు వాడుకోవచ్చో అంతవరకూ వాడుకుంటున్నారు. ఈ సింబల్స్‌ వివాహబంధానికి మారుపేరన్న ప్రచారం తెలుగుసినిమాల్లో ఎప్పటినుంచో జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్య వస్తున్న సినిమాలలో ఈ ధోరణి మరింత ముందుకు వెళ్ళిందనే చెప్పాలి. భర్తను, వివాహబంధాన్ని పోగొట్టుకోవడమో లేదా కాపాడుకోవడమో ఇతివృత్తంగా ఎన్నో సినిమాలను తీసిన ఓ దర్శకుడు ఈ విషయంలో కొత్తపుంతలు తొక్కాడు. స్త్రీ అంటే తనకు ఎంతో గౌరవమని, స్త్రీని చులకనగా చూపించలేనని చెప్పే ఈ దర్శకుడు ఇంతకు ముందు చర్చించిన సినిమాలోని “మరోస్త్రీ” పాత్రను అంత అవహేళనగా ఎలా సృజించాడో అర్థం కాదు. ఈయనే దర్శకత్వం వహించిన మరో సినిమాలో కథానాయిక విడాకుల తంతు కూడ వివాహం లాగానే జరగాలంటుంది, ఆహ్వానపత్రాలతో సహా. ఇందులో ఉచితానుచితాల విషయం ఎలా వున్నా, ఆమె మెడలోని మంగళసూత్రం తీసేయాలని బయలుదేరిన హీరోకు ఆమెలో దైవత్వం కనిపించడం సెంటిమెంటలిజమ్‌కు పరాకాష్ట. డబ్బు పట్ల దురాశతో భార్యను, మరోస్త్రీని మోసగించడానికి, ముంచేయడానికి కూడ వెనుకాడని వ్యక్తిని మంగళసూత్రం మార్చేస్తుందా? వ్యక్తుల కంటె, బంధాల కంటె చిహ్నాలకే విలువనిస్తూ గ్లోరిఫై చేస్తున్న పద్ధతి ఖచ్చితంగా మారాలి. ఒకవేళ పైన చెప్పిన సంఘటనను ఒప్పుకున్నా, తన మీద ప్రేమతో కాదు తన మెడ లోని నగ మీద భయంతోనో గౌరవం తోనో వివాహబంధాన్ని తెంచుకోలేదన్న నిజం ఏ స్త్రీకైనా ఎంత బాధాకరం!

ఇలాంటి సినిమాలన్నీ కూడ స్త్రీలకు ఒకటే ఉద్బోధిస్తాయి అణగదొక్కే సంప్రదాయానికి కట్టుబడమని, అణగదొక్కబడమని. వ్యక్తిత్వం గురించి, స్వాతంత్య్రం గురించి మాట్లాడే స్త్రీపాత్రలను నెగెటివ్‌గా చూపించడం సమకాలీనతను, సమాజాన్ని ప్రతిబింబించడమా? స్త్రీ జీవితంలో వస్తున్న మార్పులు, ఆమె ఎదుర్కొంటున్న సమస్యలు, మారుతున్న జీవనశైలి వీటన్నిటినీ ఏ మాత్రం చూపిస్తున్నాయి? పెరుగుతున్న బాధ్యతలతో సతమతమవుతూ ఓ వైపు, నింగినందుకోవాలన్న ఆశయాలతో ఉప్పొంగిపోతూ మరోవైపు వెలిగిపోతున్న 21వ శతాబ్దపు స్త్రీమనోభావాలకు అద్దం పట్టే ప్రయత్నం నిజంగా జరుగుతోందా?

మహిళాసంఘాలను కించపరచడం, స్వేచ్ఛ అన్న పేరెత్తితే విచ్చలవిడితనం అన్న ముద్ర వేయడం, వ్రతాలు నోములను భారతీయస్త్రీ ప్రథమకర్తవ్యంగా మనముందు నిలపడం ఇవీ తెలుగుసినిమా సాధించిన విజయాలు. సమాజం నుండి పాత్రలను తీసుకోవడం కన్నా సమాజానికి ప్రమాదకరమైన సిద్ధాంతాలను సరఫరా చేస్తోంది తెలుగుసినిమా.
----------------------------------------------------------
రచన: సునీతారాణి, 
ఈమాట సౌజన్యంతో

Saturday, November 17, 2018

మహాభారతం ఏం చెప్తుంది? ఒక కొత్త కోణం


మహాభారతం ఏం చెప్తుంది? ఒక కొత్త కోణం



సాహితీమిత్రులారా!


“పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా” అన్నట్టు మనమూ పుడుతున్నాం, ఏదోలా బ్రతికేస్తున్నాం, చచ్చిపోతున్నాం. అంతకు మించి ఆలోచించలేకపోతున్నాం.

ఎప్పుడేనా తీరిక దొరికి, “ఏమిటీ జీవితం? దీని ప్రయోజనం ఏమిటి? దీని గమ్యం ఏమిటి?” అనే ప్రశ్నలు వస్తే, సమాధానాలు సిద్ధంగా ఉంచారు మన మహర్షులు.
రామాయణం, మహాభారతం అనే రెండు మహేతిహాసాలను కూడ వారు మనకు ప్రసాదించారు. వీటిలో రామాయణం వ్యక్తిని కుటుంబానికి తగిన వ్యక్తిగా తీర్చిదిద్ది, ఆదర్శవంతమైన కుటుంబజీవనానికి మార్గదర్శకమవుతోంది. మహాభారతం మానవుణ్ణి సమాజానికి తగిన వ్యక్తిగా తీర్చిదిద్ది, సాంఘికజీవనానికి
మార్గదర్శకమవుతోంది. మహాభారతం మనకు ఇస్తున్న సందేశాన్ని, ఆ వెలుగులో మనం మన జీవితాల్ని ఎలా నడుపుకోవాలి అనే అంశాల్ని ప్రస్తుత వ్యాసంలో ముచ్చటించుకొందాం.

ఏ కాలంలో ఐనా, ఏ సమాజంలో ఐనా ఎక్కువమంది మానవుల జీవిత లక్ష్యం సంపాదించుకోవడం, అనుభవించడం ( to earn and enjoy ) అనేది ఒక్కటే అనిపిస్తుంది.

సంపాదించే వాటిని సంపదలు (అర్థము) అనీ, అనుభవించేవాటిని కోరికలు (కామము) అనీ మన పెద్దలు వ్యవహరించారు.

అయితే, ఏవి సంపదలు? కోరికలు ఎలా ఉండాలి? వాటిని ఏ విధంగా తీర్చుకోవాలి? అనే విషయాలకు సంబంధించి భారతీయులకూ తక్కిన ప్రపంచానికీ ఎంతో తేడా ఉంది.

డబ్బు ( money) ఒక్కటి ఉంటే చాలు దానిని ఎలా సంపాయించినా సరే; మనస్సు ముచ్చటపడేవి తీర్చుకోగలగడం దాని ప్రయోజనం; అలా తీర్చుకోవడం వల్ల  కలిగే అనుభవమే సుఖం ఇది అభారతీయమైన భావన. దీనినే మన పెద్దలు “మ్లేఛ్ఛభావన” అన్నారు. ఇప్పటివారు దీనిని పాశ్చాత్యభావన ( western concept) అంటున్నారు. భారతీయ భావన ఎంత సనాతనమో బహుశ ఇదీ అంత పురాతనమే.

I am the master of my SELF  సర్వ జీవుల హృదయాధిపతిగా వెలుగొందుతున్న ఈశ్వరస్వరూపమే “నేను”; నాకంటూ ప్రత్యేకించి కోరికలు ఉండటం, ఉందకపోవడం అనేది లేదు; శరీరం కూడ కావాలని నా ఇష్ట ప్రకారం నేను తెచ్చుకున్నదీ కాదు, నేను వద్దనుకుంటే పోయేదీ కాదు; అది నాకు ప్రసాదింపబడింది కాబట్టి దానిని నిలుపుకోవడం, నిర్వహించుకోవడం నా కర్తవ్యాలు. అందుకోసమే శరీరధర్మాన్ని ( biological needs) మన్నిస్తాను గాని, శరీరధర్మమే నా పరమార్థం కాదు; నాకంటూ ఒక ప్రవృత్తి (స్వభావం innate nature ) ఉంది; ఆ ప్రవృత్తికి తగిన పనిని ఎంచుకుని సమాజరూపంగా ఉన్న వాసుదేవుణ్ణి (the all-pervading consciousness ) సేవించినట్లయితే, నా శరీరపోషణ వేరే ప్రయత్నం అక్కరలేకుండా దానంతటదే సాగిపోతుంది; ప్రకృతిలోని సర్వ శక్తులతో ఒక విధమైన అనుసంధానం సిద్ధిస్తుంది; అప్పుడు “నేను” ఒక  వ్యక్తిగా కాక సమష్టిగా జీవించడం మొదలౌతుంది; అందువల్ల కలిగే తృప్తి అలౌకికమైన ఒక సుఖానుభూతిని ఇస్తుంది; ఆ అలౌకికానుభూతినే “ఆనందం” అంటారు; ఈ ఆనందం డబ్బుతో దొరికేది కాదు హృదయగతమైన ఈశ్వరభావన (ఐశ్వర్యం)తో మాత్రమే అందుకోగలిగేది; ఇందుకు స్వఛ్ఛమైన ప్రేమ ఒక్కటే సాధన, సాధనమూను! ఇదీ సనాతనమైన భారతీయ భావన.

ఇంక మహాభారతం విషయానికి వస్తే, స్థూలంగా కథ ఇది

ధృతరాష్ట్రుని కుమారులు నూరుగురు వారే దుర్యోధనాదులు. వారిని కౌరవులని కూడ అంటారు. పాండురాజు కుమారులు అయిదుగురు ధర్మజ భీమార్జున నకుల సహదేవులు వీరిని పాండవులు అంటారు. పాండురాజు వేటకు వెడుతూ రాజ్యభారాన్ని ధృతరాష్ట్రుడికి అప్పగించిపోయాడు. దురదృష్టవశాన తిరిగిరాలేదు. పాండవులను వెంటబెట్టుకుని కుంతీదేవి మాత్రం తిరిగివచ్చింది. ధృతరాష్ట్రుని కొడుకులు వాళ్ళని నానా హింసల పాలు చేశారు. ఎలాగైనా వాళ్ళని వదిలించుకుని రాజ్యం మొత్తం దక్కించుకొందామని చూశారు. ఆఖరియత్నంగా లక్క యిల్లు ఏర్పాటుచేసి, అందులో వాళ్ళని బూడిద చేద్దామని చూశారు. పాండవులు ఎలాగో ప్రాణాలతో బయటపడ్డారు. ద్రుపదుని కుమార్తెను పరిణయమాడి, ఆ వియ్యం వల్ల మరింత బలపడ్డారు. ధృతరాష్ట్రుడు పాండవులు అక్కడే ఉంటే తనకు, తన బిడ్డలకు ప్రమాదమని గుర్తించి, వాళ్ళను హస్తినకు రప్పించి, ధర్మజుని యువరాజుగా చేశాడు. అంతేకాదు, ఖాండవప్రస్థానికి రాజుగా కూడా చేశాడు. అంతటితో పాండవులు విజృంభించి, తమ బలపరాక్రమాలు ప్రదర్శించి, నాలుగు దిక్కులూ జయిమ్చి, మహావైభవంగా రాజసూయం నిర్వహించి, సార్వభౌములుగా సుప్రతిష్టితులయ్యారు. పాండవుల వైభవం దుర్యోధనుడికి సహింపరానిదయ్యింది. వాళ్ళని ఎలాగైనా సరే ప్రాభవశూన్యులుగా చేయాలని సంకల్పించాడు. శకుని సహాయంతో మాయద్యూతంలో ఓడించి, నిండుసభలో ద్రౌపదినీ, పాండవులనూ అవమానించాడు. మళ్ళీ అనుద్యూతంలో ఓడించి, వాళ్ళను పన్నెండేళ్ళూ అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యండని పంపేశాడు. కిమ్మనకుండా నియమపాలన చేసి, మా రాజ్యం మాకివ్వండని పాండవులు ధృతరాష్ట్రుడికి కబురంపారు. కనీసం అయిదుగురికీ అయిదూళ్ళిచ్చినా సరిపెట్టుకొంటామన్నారు. దుర్యోధనుడు ససేమిరా ఇయ్యనన్నాడు. వాడిసూదిమొన మోపినంత మేరనయినా తనంత తానుగా ఇవ్వననీ, కావాలంటే యుద్ధం చేసి గెలుచుకోండనీ తేల్చి చెప్పాడు. మరింక గత్యంతరం లేకపోయింది. పద్ధెనిమిది అక్షౌహిణుల సేనతో పద్ధెనిమిది దినాలు మహాఘోరంగా కురుక్షేత్ర సంగ్రామం నడిచింది. రక్తం వరదలై పారింది. రాజ్యం పీనుగుపెంటలయింది. స్త్రీబాలవృద్ధులు మినహా మహాజనసంక్షయం జరిగిపోయింది. పునఃప్రతిష్ఠితుడై ధర్మరాజు మరో ముఫ్ఫై ఆరేళ్ళు పృధ్వీపాలనం చేసి, పరీక్షిత్తుకు పట్టం కట్టి, మహాప్రస్థానానికి తరలివెళ్ళిపోయాడు.

పైకి చూడటానికి మహాభారత యుద్ధం దాయాదుల మధ్య రాజ్యం కోసం జరిగిన పోరాటంగా కనబడుతుంది. సూక్ష్మదృష్టితో పరికిస్తే, వారి మధ్య అలాటి వైరం లేదని తెలుస్తుంది. నిజానికి  ఇక్కడున్నది ఏకపక్ష వైరం. పాండవులు కౌరవుల్ని ద్వేషించారనటానికి ఆధారాలు లేవు. అంతేకాదు, ఘోషయాత్ర మిషతో పాండవుల్ని అవమానించటానికి వచ్చి, ఆపదలో చిక్కుకున్నప్పుడు ధర్మరాజు వారిని రక్షింపజేశాడు. అలాగే, గోగ్రహణ సమయంలో అర్జునుడు సమ్మోహనాస్త్రం వేసి కౌరవుల్ని మూర్ఛ పొందించినప్పుడు వారందర్నీ వరుసపెట్టి నరికివేసే అవకాశం వచ్చినా, ఆ మాటే తలపెట్టక గోవుల్ని మాత్రం విడిపించుకుని వచ్చాడు. శ్రీకృష్ణుని కౌరవసభకు రాయబారిగా పంపేటప్పుడు కూడా సహదేవుడూ, ద్రౌపదీ తప్ప తక్కిన నలుగురు సోదరులూ కౌరవుల పట్ల తమకు ద్వేషం లేదనీ, ఏదో విధంగా వారితో రాజీ చేసుకుని సఖ్యంగా ఉండటానికే సిద్ధంగా ఉన్నామనీ తెలిపారు. సహదేవుడు కూడా సంధి కుదర్చవద్దనలేదు అన్యాయం చేసిన వాడు దుర్యోధనుడైతే వాడిని మనం బ్రతిమాలడం ఏమిటి? సంధి అవసరం వాడికి గాని మనకేమిటి? అన్నదే అతని ఎదిరింపు. ద్రౌపది విషయానికి వస్తే, ఆమె తనకు కురుసభలో జరిగిన పరాభవాన్ని గుర్తు చేసి, తన భర్తలు ప్రతీకారం మాట తలపెట్టకుండా, రాజ్యం గురించే రాజీ మాటలు ఆడితే ఉపయోగం ఏముంటుంది? కౌరవులు మర్యాదగా రాజ్యం ఇస్తారా బతికిపోతారు, లేదూ, తనకు చేసిన అవమానానికి తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించింది అంతే!

మరయితే, యుద్ధానికి మూలకారణం ద్రౌపదికి కురుసభలో జరిగిన పరాభవం అనుకుందామా? సంప్రదాయజ్ఞుడైన విశ్వనాథ వంటి విమర్శకునితో సహా ఎందరో పరిశోధకులు అలానే భావించారు “ద్రౌపది లేనిచో వారి వైరమింత తీవ్రరూపము దాల్చెడిది కాదు. ద్రౌపదీ వస్త్రాపహరణమే కౌరవపాండవ వైరభావమునకు శిఖరము వంటిది. విరోధములుండవచ్చును. ఒకరికొకరపకారములు చేసికొనవచ్చును. ఈ విరోధము స్త్రీమానభంగ హేతుక మైనప్పుడు దాని వెట్టదనము తట్టరానిదిగా నుండును. ఈ సర్వ వైర వృక్షమునకు ద్రౌపది మూలకందముగా గన్పించుచున్నది. ఆమెను బలాత్కారముగా దుశ్శాసనుడు చీరలొలుచుట, నామెను తన తొడ మీద గూర్చుండు మని దుర్యోధనుడు సన్న చేయుట చేత, భీముడు ప్రతిజ్ఞలు చేసెను. అందుచేత ద్రౌపదియే యీ మహావైర వ్యూహమునకు నడిబొడ్డుగా గన్పించుచున్నది…”          (నన్నయగారి ప్రసన్న కథా కలితార్థయుక్తి, ప్రథాన కథ విశ్వనాథ సత్యనారాయణ)

కానీ, మహాభారత కథను జాగ్రత్తగా గమనిస్తే, ద్రౌపదికి కురుసభలో జరిగిన పరాభవానికి ప్రతీకారంగా భారతయుద్ధం జరగలేదు. దుర్యోధనుడు పాండవులు అడిగిన రాజ్యభాగం గానీ, కనీసం అయిదూళ్ళు గానీ ఇచ్చి ఉన్నట్లయితే యుద్ధప్రసక్తే ఉండేది కాదు. యుద్ధం వరకూ వ్యవహారాన్ని లాగిందీ, ” .. ఎవరైన సంగ్రామమునన్‌ జయంబు గొని రాజ్యము సేయుట నిశ్చయించితిన్‌…” అని ముందుగా యుద్ధం ప్రకటించిందీ దుర్యోధనుడే. యుద్ధం అనివార్యం అని తేలిన తర్వాత, పాండవుల పౌరుషాగ్నిని ప్రజ్వరిల్లజేయడానికి మాత్రమే ద్రౌపది పరాభవం పనికొచ్చింది.

మరయితే, మహాభారత యుద్ధానికి అసలు కారణం ఏమిటి?

నా దృష్టిలో, మంచీ చెడూ, పెద్దంతరం చిన్నంతరం ఎరుగరానీయనంతటి దుర్యోధనాదుల మిడిసిపాటు!
ఆ మిడిసిపాటుకు మూలం వారి భౌతికసంపత్తీ (అర్థం), సుఖభోగేఛ్ఛా (కామం)!

భౌతికసంపదలు సంపాదించిన కొద్దీ సంపాదించాలనిపిస్తాయి. ఎంతగా సంపాదించినా తృప్తినియ్యవు. పైగా తమకు మాత్రమే అవి సొంతం కావాలనీ, ఇతరులకు ఎవ్వరికీ అంతటి సంపదలు ఉండరాదనీ అనిపిస్తుంది కూడా. వీటి గురించే, “.. ఆశాపాశము తా కడున్‌ నిడుపు, లేదంతంబు రాజేంద్ర..” అని భాగవతంలో వామనుడు బలిచక్రవర్తితో చెప్పాడు. దుర్యోధనుడు కూడా “ధర్మజుని సంపదలు, వైభవం చూసి నీవు అసూయ పడకు, నీకు వాని కంటె అయిదురెట్లు ధనసంపద ఉంది. అతడు చేసిన యజ్ఞం కంటె పెద్ద యజ్ఞం చెయ్యి” అని చెప్పిన తండ్రితో

“పరమ సుఖోపాయంబున
పర సంపద సేకొనంగ బడునేని నరే
శ్వర! యంతకంటె మిక్కిలి
పురుషార్థం బెద్దియుండు భూనాథులకున్‌ ” (ఆం.మ.భా. సభా2142)

“.. కాన పాండవశ్రీ యుపేక్ష్యంబు కాదు… దాని నెవ్విధంబున నైన నపహరింప వలయు నట్లు గాని నాడు నా హృదయతాపంబున కుపశమంబు గా” దన్నాడు.

అంటే, దుర్యోధనుడి ఏడుపు తనకు సంపద లేదని కాదు, ధర్మజునికి ఉందని మాత్రమే అని స్పష్టపడుతోంది. అంతే కాదు, దాన్ని ఏ విధంగానైనా సరే సొంతం చేసుకోవడమే పురుషార్థం అని కూడా సిద్ధాంతీకరించాడు.

ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలు. అర్థకామాలు ధర్మబద్ధమైనట్లయితే మోక్షానికి అర్హత వస్తుందని పెద్దలు చెబుతారు.

కానీ, దుర్యోధనుడు భారతీయమైన అలాంటి భావనకి భిన్నంగా ఎలాగైనా సరే పరధనాపహరణం చెయ్యడమే తన జీవితాశయంగా భావించాడు. అదీ అతని పతనానికి కారణం. జూదమూ, యుద్ధమూ ఒక్క లాంటివే దుర్యోధనుడు జూదంలో జయమే ముఖ్యం గాని ఎలా జయించామన్నది కాదని పలికించాడు శకుని చేత. కానీ కురుక్షేత్ర యుద్ధంలో తాను ఓడిపోతున్నప్పుడు మాత్రం న్యాయాన్యాయాలు గుర్తుకు వచ్చాయి అతనికి. తనకొక నీతీ, ఎదుటివాడికొక నీతీ అంటే ఎలా కుదురుతుంది? తాను ధర్మమనీ, న్యాయమనీ నమ్మినదానికి తానైనా కట్టుబడి ఉండాలి కదా! ధర్మజుని పంతం అదే “నీ నియమానుసారం ఎలా ఆడమంటే అలా ఆడాను జూదం; నీవు గెల్చానన్నావు, నేను ఓడానన్నావు, ఒప్పుకున్నాను పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒక యేడాది పాటు అజ్ఞాతవాసం చెయ్యాలన్నావు సరేనన్నాను సక్రమంగా నిర్వర్తించాను; మరి నీ మాట ప్రకారమే ఆ తర్వాత నా రాజ్యం నాకు ఇవ్వాలి గదా! ఎందుకివ్వవు? మాటకోసమైనా నీ చేతుల మీదుగా నువ్వు ఎంతో కొంత కనీసం అయిదూళ్ళయినా మా అయిదుగురికీ యియ్యి సరిపెట్టుకుంటాం నీ జోలికి రాము” అన్నాడు. ధర్మం అన్న పదానికి విస్తృతమైన మహార్థాలు ఎన్నో ఉన్నాయి. ధర్మరాజు వాటి ప్రసక్తి లేకుండా “నువ్వు ధర్మం అనుకున్న దాన్నే నేను అంగీకరిస్తాను, కనీసం దాన్నైనా నువ్వు పాటించు, నీ మాట నిలబెట్టుకో!” అని అడిగాడు దుర్యోధనుణ్ణి. సంపదల్ని పూజించే దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు గాని మాట నిలుపుకోవాలనుకోలేదు. అదీ అతను చేసిన ధర్మభంగం.

పరమ వైరాగ్య సంపన్నుడైన ధర్మరాజుకు రాజ్యం దేనికసలు? క్షాత్రధర్మం ప్రకారం కావాలనుకున్నాడే అనుకుందాం, మహా పరాక్రమవంతులైన నలుగురు సోదరులు గల అతను దుర్యోధనుణ్ణి ప్రాధేయపడవలసిన అవసరం ఏముంది? అతను ఎక్కడ ఉంటే అక్కడే మహావైభవం కదా! సామ్రాజ్యమూ, సంపదలకు అతను ఎలా అంటుకోలేదో (అంటుకుంటే జూదానికే రాడు; వచ్చినా పోగొట్టుకోడు కదా!) అవమానాలకూ, లేమికీ కూడా అలాగే అంటుకోలేదు. అన్నిటా, అందర్లోనూ అతను చూసింది తనలో ఉన్న దైవాన్నే! కనుకనే, దుర్యోధనుడి పట్ల ప్రేమా, జాలీ తప్ప ద్వేషం లేదు ధర్మరాజుకి. సంధికోసం ప్రాకులాడాడంటే, యుద్ధం చెయ్యటం చేతకాకనా? జయించలేమనే భయం వల్లనా? స్వజన హననానికి మనస్సు రాక! అంతే!

మంచితనాన్ని చేతకాని తనంగా భావించి, కయ్యానికి కాలుదువ్వితే సిద్ధపడక తప్పదు గదా క్షత్రియప్రవృత్తి గలవాడికి? ఆనాడు జూదానికి రమ్మన్నప్పుడు కిమ్మనకుండా ఎలా వచ్చాడో ఈనాడూ అలానే  యుద్ధానికి వచ్చాడు ధర్మరాజు.

హతశేషులైన ధృతరాష్ట్రుడు గానీ, గాంధారి గానీ ఏమనగలరు? ఎవరిని నిందించగలరు? ఆనాడు విదురుడు చెబితే విన్నాడా? భీష్మాదులు చెబితే చెవికెక్కిందా? ఆకరుగా పరమదయాళుడైన పరమేశ్వరుడు రాయబారిగా వచ్చి చెబితే తలకెక్కిందా? తన లోభం, తన మోహం తనను కట్టికుడిపాయని సరిపెట్టుకోవలసి వచ్చింది ఆ గుడ్డిరాజుకి. పాపచింతనా, అధర్మభీతీ గల గాంధారి మాత్రం కృష్ణుడి మీద నెపం వేసి ఏడ్చుకోగలిగింది.

కాబట్టి, “అర్థకామాలు కాదు జీవిత పరమార్థం; ధర్మం అని ఒకటుంది దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తే అర్థకామాలు వాటంతటవే సిద్ధిస్తాయి; నా మాట వినండి; భౌతికమైన అర్థకామాల కేసి పరుగులు తీస్తే కౌరవులకు పట్టిన గతే పడుతుంది ఎవరికైనా” అని ఘోషిస్తూ వ్యాసభగవానుడు మహాభారతేతిహాసాన్ని లోకానికి ప్రసాదించాడు. ఆయన మాటలివి

“ఊర్వ్ధ బాహోర్విరౌమ్యేష న కశ్చిదపి శృణోతిమే
ధర్మాదర్థశ్చ కామశ్చ స కిమర్థం న సేవ్యతే (సంస్కృత భారతం స్వర్గా 575)

(ధర్మం వల్లనే అర్థకామాలు సిద్ధిస్తున్నాయే, ఆ ధర్మాన్ని సేవించండని చేతులెత్తి ఆక్రోశిస్తున్నా నా మాట ఎవరూ పట్టించుకోరేం?)

జనమేజయ మహారాజుకు భారతగాథను వినిపించిన వైశంపాయన మహర్షి కూడా ఆ కథను కేవలం ఒక చరిత్రగా కాక పురుషార్థసర్వస్వంగా పేర్కొన్నాడు.

“ధర్మేచార్థేచ కామేచ భరతర్షభ!
యది హాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్‌ క్వచిత్‌ ” (ఆది 6253)

(ధర్మార్థ కామ మోక్షాల విషయంలో ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉంది. ఇక్కడ లేనిది మరెక్కడా లేదు అని నిష్కర్ష.)
-----------------------------------------------------------
రచన: వాడవల్లి చక్రపాణిరావు, 
ఈమాట సౌజన్యంతో