Monday, December 31, 2018

కె.ఎన్‌. కేసరి “చిన్ననాటి ముచ్చట్లు”


కె.ఎన్‌. కేసరి “చిన్ననాటి ముచ్చట్లు”




సాహితీమిత్రులారా!

ఈ తరం వాళ్ళకి అంతగా పరిచయం లేని స్వీయచరిత్ర కె.ఎన్‌. కేసరి (18751953) “చిన్ననాటి ముచ్చట్లు”. ఆయన అసలు పేరు కోట నరసింహం. కానీ కేసరిగా ప్రసిధ్ధి చెందారు. ఆయన ముఖ్యంగా వైద్యులు, వ్యాపార దక్షులు, పత్రికా రచయిత, సంపాదకులు. పైగా గొప్ప వితరణశీలి. ఆయన చెన్నపట్నంలో 1899లో “కేసరి కుటీరం”, (ఆయుర్వేద ఔషధాలు తయారు చెసే సంస్థ) ప్రారంభించారు. స్త్రీల వ్యాధులకు పేటెంట్‌ మందులు (లోధ్ర) తయారు చెసి విశేష ధనార్జన చెసారు. అంతటితో ఆగిపోతే మనం ఈనాడు అతన్ని స్మరించుకోం. తన సంపదను మహిళాభ్యుదయం కోసం, దేశహిత కార్యక్రమాల కోసం వినియోగించారు. కాశీనాధుని నాగెశ్వర్రావుగారు “అమృతాంజనం”తో వచ్చిన రాబడితో ఆంధ్రపత్రిక, భారతి ప్రారంభించినట్లే, కేసరి కేసరికుటీరం తరఫున “గృహలక్ష్మి” అనే మాసపత్రిక నిర్వహించారు. గృహలక్ష్మి తరఫున ఆనాటి లబ్దప్రతిష్టులైన స్త్రీమూర్తులను స్వర్ణకంకణంతో సన్మానించారు. ఆ కాలంలోనే సుమారు రెండు లక్షల రూపాయలు తన పేర విద్యాసంస్థలకు ఖర్చు పెట్టారు.

తన చిన్ననాటి విశేషాలను “ముచ్చట్లు” పేరుతో గృహలక్ష్మి, ఆంధ్రజ్యోతి మాసపత్రికల్లో ధారావాహికగా ప్రచురించి 1953లో పుస్తక రూపంలో తెచ్చారు. దాని రెండో ముద్రణ సుమారు అర్ధశతాబ్దం తర్వాత కేసరి కుటీరం శతజయంతి సందర్భంలో విడుదలయ్యింది. తన రచనలో ఆయన 19వ శతాబ్దపు ఉత్తరార్ధం, 20 వ శతాబ్దపు పూర్వార్ధపు నాటి తెలుగు వారి జీవితాన్ని వివరంగా చిత్రించగలిగారు.

కేసరి 1875లో గుండ్లకమ్మ నదీ తీరాన ఉన్న ఇనమనమెళ్ళూరు గ్రామంలో, ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆ ఊరు ఒంగోలుకి ఏడు మైళ్ళు. పుట్టిన ఐదవ నెలలోనే తండ్రిని పోగొట్టుకుని, తల్లి శిక్షణలో పెరిగారు. బట్టలు కుట్టి ఆ తల్లి ఈయన్ని పెంచి పెద్ద చేసింది. ఆరవ ఏట అక్షరాభ్యాసం జరిగింది. ఆ కాలంలో పిల్లలు కొయ్య పలక మీద రాయటం ప్రారంభించేవారు. కొయ్య పలక మీద రాసే ముందు నీలిమందు, దోసాకు పసరులు పట్టించి బాగా మెరుగు పెట్టి, ఎండలో పెట్టేవారు. వాటిపై తెల్ల రాళ్ళ బలపాలతో రాసేవారు. నాలుగైదేళ్ళు చదివిన తర్వాత రామాయణ, భారత పఠనాలు ఆరంభించేవాళ్ళు. అక్కడితో బడి చదువు పూర్తయ్యేది.

కొత్త పిల్లలని బడిలో చేర్చేనాడు పిల్లలందరికీ పప్పు బెల్లాలు పంచేవారు. అయ్యవారికి ఒక వరహా (4 రూపాయలు) మామూలు. అయితే అందరూ ఇవ్వలేకపోయేవాళ్ళు. సంపన్నులు అయ్యవారికి తిండిగింజలు, కూరగాయలు సరఫరా చేసేవాళ్ళు. సహజంగానే అలాంటి పిల్లలని ముద్దుచేసి, పేదపిల్లల మీద బెత్తం ప్రయోగించటం ఆనాటి క్రమశిక్షణ. పాపం కేసరి బాగానే దెబ్బలు తిన్నాడు. ఆరోజుల్లో పేద కుటుంబాల వాళ్ళు పండుగ నాడు, తద్దినం నాడు మాత్రం వరి అన్నం తినేవాళ్ళు. మిగతా రోజుల్లో జొన్నసంకటి, సజ్జసంకటి వగైరా తినేవాళ్ళు.

తన చిన్నతనంలో వైభవంగా జరిగే శ్రీరామనవమి ఉత్సవాలోఒ, శివరాత్రినాడు కోటప్ప తిరునాళ్ళను గురించి వివరంగా తెలియచేశారు. సంక్రాంతి ఆ రోజుల్లో కూడా పెద్ద పండగే. కోడి పందాలు, కోలాటాలు విరివిగా జరిగేవి. పల్లెల్లో జంగం కథ చెప్పేవారు. బాలనాగమ్మ కథ, బొబ్బిలి యుధ్ధం, దేశింగు రాజు కథ, కాంభోజ రాజు కథ బహుళ ప్రచారంలో వుండేవి.

తనని పెంచటానికి తల్లి పడుతున్న అవస్థలు చూడలేక, తన గ్రామంలో వేరే బ్రతుకు తెరువు లేక, ఆయన తన పదకొండవ ఏట కాలినడకన చెన్నపట్నం చేరారు. ఆ రోజుల్లో రైళ్ళు లేవు. ప్రయాణం బండ్ల మీదో, పడవల మీదో! మదరాసు చేరాక ఆయన మరి తిరిగి చూడలేదు. ట్యోఒషన్లు చెప్తూ నెలకి ఐదు రూపాయలు సంపాయించేవారు. తల్లి వంటపనులోఒ, తదితర పనులు చేసి ఇంకొక ఐదు సంపాయించేది. ఆ పది రూపాయల్లో ఇద్దరూ జీవిస్తూ, ఆయన బడిలో చేరి చదువుకున్నారు. ఆచారప్పన్‌ వీధిలో గది అద్దె ముప్పావలా (12 అణాలు).

1889లో టంకశాల వీధిలో హిందూ థియోలాజికల్‌ హైస్కూల్‌ వుండేది. ఆ బడిలో జీతం లేకుండా చదువుకునే వసతి లభించింది. తన తరగతిలోనే ఇంకో కె. నరసింహం ఉండేవారు. అందుకనే ప్రధానోపాధ్యాయుడు శివశంకరపాండ్య ఈయన పేరు “నరకేసరి”గా మార్చారు అర్ధం చెడకుండా. అప్పటినుంచేఎ కోటావారి అబ్బాయి కె. ఎన్‌. కేసరిగా ప్రసిద్ధుడయ్యాడు.

హైస్కూలు విద్య పూర్తయ్యాక ఉద్యోగ ప్రయత్నం చేసారు. అనుకున్న ప్లీడరు గుమాస్తా పని దొరకలేదు. అప్పుడే ప్రారంభమవుతున్న ట్రాం బండి కండక్టరు పని కూడ దొరకలేదు. అంతటితో ఉద్యోగ ప్రయత్నం మానేసి, ఆయుర్వేద వైద్యం నేర్చుకున్నారు. కొంతకాలం పండిత డి. గోపాలాచార్యులుతో కలిసి పని చేసారు. తరువాత ఇద్దరికీ సరిపడక, వేర్వేరు వైద్యశాలలు ప్రారంభించారు. నారాయణ మొదలి వీధిలో “కేసరీ కుటీరం ఆయుర్వేద ఔషధశాల” అని బొగ్గుముక్కతో గోడ మీద రాసి 1899లో ప్రారంభించారు. మిత్రుల సహాయం, వీరి వ్యాపార దక్షత వల్ల వ్యాపారం అభివృద్ధి చెందింది. వ్యాపార విజయానికి కావల్సింది ప్రచారం అన్న విషయం ఆ రోజుల్లోనే ఈయన కనుక్కున్నారు. అప్పుడు మద్రాసులో ఎ. సి. పార్ధసారధినాయుడు గారు నడుపుతున్న పత్రికలో తన వ్యాపార ప్రకటనలు ఇచ్చేవారు.

స్త్రీవ్యాధులకు వీరు తయారు చేసిన “లోధ్ర” విశేషధనార్జనకు కారణమయ్యింది. కొంత తన ప్రచారానికీ, కొంత స్త్రీజనాభ్యుదయానికి ఉపయోగపడుతుందని “గృహలక్ష్మి” మాసపత్రిక (192760) కేసరి కుటీరం తరఫున వెలువడేది. చాలా కాలం పాటు ఆండ్ర శేషగిరి రావుగారు సంపాదకులు. కేసరి మరణంతో ఈ పత్రిక కొంత కాలం కొనవూపిరితో జీవించి, తెలుగు సాహిత్య పత్రికలన్నిటి లాగే కనుమరుగైంది.

తన కాలం నాటి మద్రాసును ఆయన బాగా వర్ణించారు. తను మద్రాసు చేరిన కాలానికి ఇంకా ఎలక్ట్రిక్‌ దీపాలు రాలేదు. వెల్తురు కోసం రాత్రిపోఒట కిరసనాయలు పోసిన తగరపు బుడ్లు వాడేవారు. తరువాత గ్యాస్‌ లైట్స్‌ వాడకం లోకి వచ్చాయి. 1910 నాటికి విద్యుద్దీపాలు వెలిగాయి. ఆ రోజుల్లో మద్రాసులో గుర్రాలను కట్టే పెట్టె బళ్ళు ఉండేవి. ఇవికాక మూడుచక్రాల వింతబళ్ళు ఉండేవి. వీటిని వెనకనుంచి బోయీలు నెట్టేవారు. తర్వాత కొత్తరకం గుర్రబ్బళ్ళు, బొంబాయి కోచ్‌, పాటన్‌ లాండో, డాక్కార్టు బళ్ళు వచ్చాయి. తర్వాత ట్రాం, మోటరు కారు, సిటీ బస్సూ ఇవన్నీ ప్రయాణ సౌకర్యాలు. కేసరికి గుర్రబ్బళ్ళుండేవి. గుర్రాల పెంపకం, అమ్మకం వ్యాపారం ఉండేది.

1884లోనే మద్రాసు మెరీనా బీచ్‌ పేరు పోందింది కానీ, స్త్రీలెవ్వరూ బీచ్‌కి వచ్చేవారు కాదు. 1886లో హార్బరు నిర్మాణం ప్రారంభమయ్యింది. అప్పుడే నిర్మించిన వివిధ భవంతుల గురించేఎ, సమకాలీన వ్యక్తుల గురించేఎ ఆయన వివరంగా రాశారు. కేసరి మాటల్లోనే చేప్పాలంటే, “ఈ 75 ఏళ్ళలో చేన్నపట్నంలో మారినవి మూడే కొళాయిల్లో అపరిశుభ్రమైన నీరు, కూము నది దుర్గంధం, దేవాలయం కోనేళ్ళలో పాచి. మరొకటి ఉందంటారు ప్రముఖ జర్నలిస్టు బీ.ఎస్‌.ఆర్‌.కృష్ణ “దారిన పోతూ తమలపాకులు వేసుకుంటూ, చేతికంటిన సున్నాన్ని కన్పించిన స్తంభానికో, గోడకో పోఒసే దుర్గుణం!”

1914 సెప్టెంబరులో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభ దశలోనే జర్మన్‌ క్రూసర్‌ ఎమ్‌డెన్‌ మద్రాసుపై ఫిరంగుల వర్షం కురిపించింది. ఆ రాత్రి భయంతో జనం వీధుల్లోకి పరుగెత్తారు. (ధైర్య సాహసాలు, తెగువ ఉన్న స్త్రీలను “ఎమ్‌డెన్‌” అని అనటం తెలుగులో వాడుకలోకి వచ్చింది. “ఇంగ్లండుకు రాజధాని లండన్‌, నీ పైన నా ప్రేమ ఎమ్‌డెన్‌” అన్న ఆరుద్ర సరదా పాట విన్నట్టు గుర్తు.)

జీవితంలో కొంచెం స్థిరపడ్డాక కేసరికి మేనమామ కూతురుతో పెళ్ళయ్యింది. అత్తవారి ఊరు చదలవాడ. మద్రాసులో తన కొత్త కాపురం గురించి, పక్క వాటాలో తమిళ దంపతుల జీవిత విధానం గురించీ ఎంతో వివరంగా ఒక అధ్యాయంలో చెప్పారు. తమిళుల జీవన శైలి, వారి పోదుపరితనం, కష్టపడి పనిచేసే స్వభావం తెలుగు వారు నేర్చుకోవాలని వారి ఆకాంక్ష.

వారి గ్రామం ఇనమనమెళ్ళూరు వెళ్ళాలన్నా, అత్తవారి ఊరు చదలవాడ వెళ్ళాలన్నా రైలు సౌకర్యంలేని రోజుల్లో ప్రయాణం పడవల్లోనే. ఈ తెరచాప పడవలు కొత్తపట్నం రేవు చేరటానికి పది పన్నెండు రోజులు పట్టేది. బకింగ్‌హామ్‌ కెనాల్‌ ద్వారా ప్రయాణం. అనువైన స్థలంలో పడవలు కట్టేసి, భోజనం ఏర్పాట్లు చేసుకునే వారు.

మొదటి భార్య నిస్సంతుగా చనిపోయాక, ఆయన తన నలభై మూడో ఏట, కేరళలో త్రిచూర్‌కి చెందిన ఒక నంబూద్రి యువతి మాధవిని వివాహం చేసుకున్నారు. ఆమె కూడా ఆయుర్వేద వైద్య నిపుణురాలు. ఈయనకు చేదోడు వాదోడుగా వుండి, వ్యాపారాభివృద్ధికి తోడ్పడింది. కేరళపుత్రులందరూ వాళ్ళ ప్రాంత సౌందర్యాన్ని మైమరచిపోయి పోగుడుకోవటం మనందరికి అనుభవమే. ఈ కేరళ అల్లుడు కూడా కేరళ సౌందర్యాన్ని తనివితీరా వర్ణించాడు. కేరళలోని నంబూద్రీలు, నాయర్లు, మాతృస్వామిక వ్యవస్థ, వారి ఆహారంలో ప్రత్యేకతలు, అక్కడి రమణీయత అంతా చక్కగా రాశారు.

ఆ రోజుల్లో వారికి మద్రాసులో, ట్రిచూరులో బెంగుళూరులో స్థిరాస్థులుండేవి. సంపదతో పాటు వేషభాషల్లో, జీవిత విధానంలో, డాబు, దర్పం చోటు చేసుకున్నాయి. ఇంతలో తనతరం వాళ్ళందరిలాగే కేసరిమీద కూడా మహాత్ముని ప్రభావం పడింది. ఆ ప్రభావం వల్ల వారి వేషభాషల్లో మార్పే కాకుండా, తన సంపదలో కొంత భాగమైనా జనహితానికి ఖర్చు చేయాలనే సత్సంకల్పం కలిగింది. అంతకు ముందు నుంచీ కేసరికి వీరేశలింగం, కేతా రామశాస్త్రి, ఉన్నవ లక్ష్మీనారాయణ గార్లతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. వారి పేరున ఇప్పటికీ చెన్నైలో విద్యాసంస్థలు నడుస్తున్నాయి.

తన జీవిత వివరాలేకాక తనకాలం నాటి జానపదకళా రూపాలు, అప్పటికి బాగా ప్రాచుర్యంలో ఉన్న ధార్‌వాడ్‌ నాటక సమాజాలు, తర్వాత బొంబాయి నుంచి దిగిన పార్శీ నాటక ప్రదర్శనలు వివరంగా వర్ణించారు. తొలినాటి తెలుగు నాటకకర్తలు, మహానటులు, ధర్మవరం, కోలాచలం , కందాళై శ్రీనివాసన్‌ తదితరుల ప్రస్తావన కూడా వీరి జీవిత చరిత్రలో ఉంది.

ఈ “ముచ్చట్లు” తర్వాతి తరం పాఠకులను విశేషంగా ఆకర్షించింది. ఇది కేవలం ఒక గొప్ప వ్యక్తి స్వీయచరిత్ర మాత్రమే కాదు. సుమారు నూరేళ్ళ క్రితం దక్షిణ భారత దేశంలో సామాజిక పరిస్థితులను గురించి స్పష్టంగా తెలియజేసే గ్రంథం. ఐతే “ముచ్చట్లు” సాంఘిక చరిత్ర పాఠ్య పుస్తకం కూడా. ఒక మిత్రుడన్నట్లు ఈ పుస్తకం ఎన్నో కాపీలు ముద్రించి తెలుగు తెలిసిన వారందరికీ పంచాలి. ఇంత జనాదరణ ఉన్న పుస్తకం ఏభై ఏళ్ళలో రెండే ముద్రణలు పోందటం (రెండు వేల కాపీలు) పుస్తకప్రచురణలో మన వెనుకబాటుతనం తెలియజేస్తోంది.
----------------------------------------------------------
రచన: శొంఠి రామారావు, శొంఠి సావిత్రి, 
ఈమాట సౌజన్యంతో

Sunday, December 30, 2018

సంగీతరావుగారి చిన్ననాటి సంగతులు


సంగీతరావుగారి చిన్ననాటి సంగతులు




సాహితీమిత్రులారా!

మన దేశపు శాస్త్రీయ సంగీత సంప్రదాయం చాలా పురాతనమైనది. ఎంత పాతదో సరిగ్గా చెప్పలేం కూడా. ఎప్పటికప్పుడు ట్రెండ్‌ని బట్టి మారనిదే క్లాసికల్‌ కళ. పాతకాలపు సంగీతం ఎలా ఉంటుందో వినాలని మనలో కొందరికి ఉంటుంది కాని ఇరవయ్యో శతాబ్దం మొదలయిన తరవాత గాని గ్రామొఫోన్‌ రికార్‌డ్లు తయారు కాలేదు. అంతకు మునుపటి సంగీతం గురించి చదువుకోవలసిందే. శాస్త్రీయసంగీతాన్ని అభిమానించడం తెలుగు “ఫాషన్‌” కాదు. అందుచేత త్యాగరాజు తెలుగువాడేనని చెప్పుకోవడం మినహా మన తాతలు తాగిన నేతుల వాసన మనకు తెలియదు. 1906 ప్రాంతాల మద్రాసులో జరిగిన ఒక కచేరీ గురించి యాభై, అరవై ఏళ్ళ కిందట శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారొక వ్యాసం రాశారు. దానివల్ల మనకు అప్పటి సంప్రదాయం గురించి కొంత తెలుస్తుంది. కొందరికి పాతచింతకాయ పచ్చడి ఇష్టం. అయితే ఈ రోజుల్లో ఏడాది కిందటి సినిమా పాటలు విని పాతబడిపోయాయిలే అనుకునేవాళ్ళూ ఉన్నారు. సంగీతరావుగారి వంటి అనుభవజ్ఞులతో మాట్లాడినా, వారి జ్ఞాపకాల గురించి చదివినా తెలుగువారి సంగీతసాంప్రదాయం గురించి మనకు కొంత తెలుస్తుంది. కొందరు ప్రముఖ రచయితలు ఇటువంటి పాత తరం కళాకారుల గురించి వ్యాసాలు రాశారు కాని అందులో వివరాలకన్నా రచనాశైలీ, కవిత్వధోరణీ ప్రముఖంగా అనిపించింది. మనలో కొందరు సంగీతం పాడేవారూ, నేర్చుకుంటున్నవారూ, ఆసక్తితో వినేవారూ మరికొన్ని విశేషాలు తెలుసుకోగోరే అవకాశం ఉంది. ఆ భోగట్టా పోగుచెయ్యడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం.

1920లో జన్మించిన సంగీతరావుగారి తండ్రి పట్రాయని సీతారామశాస్త్రిగారూ, తాతగారైన పట్రాయని నరసింహశాస్త్రిగారూ గాత్రసంగీత విద్వాంసులే. ఉత్తరాంధ్రలోని సాలూరు వాస్తవ్యులైన నరసింహశాస్త్రిగారి జననం 1872లో జరిగింది. ఆయనకు గురువు మధురాపంతుల పేరయ్యశాస్త్రిగారు. తంజావూరులో సాధన చేసిన పేరయ్యశాస్త్రిగారి కంఠం తేజోమయమైనదనీ, ఆయన రాగం, తానం, పల్లవి పాడితే ధీరోదాత్తనాయకుని వీరత్వాన్ని స్ఫురింపజేసేదనీ సంగీతరావుగారి చిన్నతనంలో పెద్దవాళ్ళు చెప్పుకునేవారు. పేరయ్యశాస్త్రిగారికి చాలా ఆత్మగౌరవం ఉండేదట. తన కచేరీలో ఎవరో ప్రభుత్వోద్యోగి ముందు కూర్చుని బాతాఖానీ వేస్తూంటే సహించలేక పాడడం ఆపేశారట. ఆ రోజుల్లోనూ కొందరు “పెద్దవాళ్ళ” బుద్ధులు ఇప్పటిలాగే ఉండేవని ఈ సంఘటన వల్ల తెలుస్తోంది. పేరయ్యశాస్త్రిగారి శిష్యులు పగటిపూట వారాలు చేసుకుని రాత్రిళ్ళు గురువుగారింటో భోజనం చేసేవారట. ఇవన్నీ పంతొమ్మిదో శతాబ్దం చివరిరోజుల సంగతులు.

తరవాతి కాలంలో సంగీత కచేరీలు గాయకుడూ, వయొలిన్‌, మృదంగం, ఘటం, వీలున్నప్పుడు కంజీరా వగైరాల మధ్య (సంగీతరావుగారు అన్నట్టుగా) బల పరాక్రమ ప్రదర్శనలుగా అవతారాలెత్తాయి. కల్చర్‌ తక్కువా ఎంటర్‌టెయిన్‌మెంట్‌ ఎక్కువా అనుకోవచ్చు. ప్రతి కచేరీలోనూ పది, పదిహేను ఐటమ్‌లు పాడడం అనే పద్ధతి 1920 ప్రాంతంలో అరియక్కుడి రామానుజ అయ్యంగార్‌ మొదలుపెట్టాడని అంటారు. అప్పటికి జమీందార్లూ, రాజాలూ “కలాపోసన” చేసే యుగం సిటీల్లోనైనా ముగిసింది. మద్రాసులో మధ్యతరగతి తమిళ బ్రాహ్మణ కుటుంబాలు ఎక్కువగా నివసించే మైలాపూరు, తిరువళ్ళిక్కేణి (ట్రిప్లికేన్‌) మొదలైన ప్రాంతాల్లో సంగీత సమాజాలు ఎక్కువగా ఉండేవి. తరుచుగా కచేరీలకు హాజరయేవారికి ఫలానా గాయకుడు పాడిన ఫలానా కీర్తన ఇష్టం. అతని కచేరీ జరిగినప్పుడల్లా అవే పాడమని చీటీలు పంపేవారట. గంటసేపు ఒకే రాగం “పీకడం” నచ్చనివారిని మెప్పించడానికి అరియక్కుడి అటువంటి “ఫర్మాయిష్‌”లకు అంగీకరించేవారట. ప్రతిసారీ ఆ పాటలే పాడతాడన్న నమ్మకంతో జనం వచ్చేవారట. ఈ విధంగా గాయకుడికి “మార్కెట్‌” పెరగడం గమనించిన ఇతరులు కూడా ఇదే పద్ధతిని అనుసరించారు. హిందూస్తానీ సంగీతం మాత్రం ఫ్యూడల్‌ రాజదర్బారుల లక్షణాలని కోల్పోకుండా మనోధర్మాన్ని అనుసరించే పద్ధతిలోనే ముందుకు సాగింది.

పాత కర్ణాటక సాంప్రదాయంలో రాగం, తానం, పల్లవి ప్రధానాంశాలుగా ఉండేవని సంగీతరావుగా రంటారు. ఆలాపన నాలుగంచెలుగా సాగేది. పోటీతత్వం ఉండేదికాదు. పక్క వాద్యాలుగా వీణ, వేణువు ఉపయోగించేవారు. (డా.బాలమురళీకృష్ణ చిన్ననాటి ఒక ఫొటోలో కుర్రవయసులో ఉన్న బాలమురళి పక్కన కంభంపాటి అక్కాజీరావుగారు వీణను నిలువుగా పట్టుకుని కూర్చుని ఉన్నారు). కచేరీలలో సంగీత త్రిమూర్తులుగా పేరుపొందిన త్యాగరాజు, దీక్షితర్‌, శ్యామశాస్త్రి రచించిన కీర్తనలను పాడడం ఆనవాయితీ అయింది. అంతకు ముందు రోజుల్లో పేరయ్య శాస్త్రిగారి శిష్యులు ఆ నాటికి ప్రచారంలో ఉన్న ప్రాథమిక సంగీత రచనలన్నిటినీ కంఠస్థం చేసుకుని, రాగాలాపన, స్వరకల్పనలలో ప్రావీణ్యం సంపాదించేవారనీ, వివిధ రీతులలో పల్లవి పాడడం నేర్చేవారనీ సంగీతరావుగా రంటారు. తరవాతి కాలంలో త్యాగరాజ కీర్తనలు ప్రచారంలోకి వచ్చాయి.

తన పితామహుడి గురువైన పేరయ్యశాస్త్రిగారితో బాటుగా సంగీతం నేర్చుకున్న ద్వివేదుల లక్ష్మణశాస్త్రి, కన్నడశాస్త్రి అనే సోదరుల ద్వయం త్యాగరాజ కీర్తనలు నేర్చుకోవడానికని సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రిగారి వద్ద కొన్నాళ్ళు శిష్యరికం చేశారని సంగీతరావుగా రన్నారు. ఇది కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లిలో జరిగిందట. దక్షిణామూర్తి శాస్త్రిగారు తంజావూరు వెళ్ళి, త్యాగరాజుకు స్వయానా శిష్యుడైన మానాంబుచావడి వెంకటసుబ్బయ్య వద్ద సంగీతం నేర్చుకున్నారు. దక్షిణామూర్తి శాస్త్రిగారికి అంధుడైన శరభశాస్త్రి అనే వేణు విద్వాంసుడు సహాధ్యాయి. వీరిద్దరూ కలిసి సాధన చెయ్యడానికని అప్పటికే వృద్ధుడైన వెంకటసుబ్బయ్యగారు త్యాగరాజ కీర్తనల గ్రంథాన్ని దక్షిణామూర్తి శాస్త్రిగారికి ఇచ్చారట. తరవాత అది ద్వివేదుల సోదరులకు అందింది. ఆ విధంగా దక్షిణామూర్తి శాస్త్రిగారి ద్వారా తొలిసారిగా తెలుగువారు త్యాగరాజ కీర్తనలు నేర్చుకోగలిగారు. పారుపల్లి రామకృష్ణయ్యగారికి సహాధ్యాయులైన ఈ ద్వివేదుల సోదరుల్లో లక్ష్మణశాస్త్రిగారు క్షీరసాగర శయనా, చక్కని రాజమార్గము, నగుమోము మొదలైన త్యాగరాజ కీర్తనలు మొదటగా కచేరీల్లో అద్భుతంగా పాడారట. కాని, ఆయన ఎక్కువ కాలం జీవించలేదనీ, ఆయన సోదరుడు కన్నడశాస్త్రిగారి కచేరీ మాత్రం చిన్నతనంలో తాను విన్నాననీ, కాంభోజి రాగంలో ఒక పద్యం చాలా చక్కగా పాడినట్టు గుర్తుందనీ సంగీతరావుగా రన్నారు.

ఆ రోజుల్లో ఏదైనాసరే గురుముఖతః నేర్చుకోవాలనే శ్రద్ధ సంగీత విద్యార్థులకు ఉండేది. తాతగారైన పట్రాయని నరసింహశాస్త్రిగారి గురించి సంగీతరావుగా రొక విషయం చెపుతారు. కీర్తనల కోసమని శాస్త్రిగారు మద్రాసు వెళ్ళారట. అక్కడి ఊరేగింపుల్లో సన్నాయి వాయిస్తున్నప్పుడు కీర్తన, డోలు “తని” ఆవర్తనం పూర్తయితే కాని ఊరేగింపు ముందుకు కదలదు. ఒక ఊరేగింపులో నంజుండయ్య అనే నాదస్వర విద్వాంసుడు భైరవి రాగంలో వాయించిన అద్భుతమైన పల్లవి వినగానే శాస్త్రిగారు ఊరేగింపు పూర్తయేదాకా ఆగి, ఆ విద్వాంసుడికి అక్కడే సాష్టాంగపడి అతని దగ్గర ఆ పల్లవి నేర్చుకున్నారట. తాను కప్పుకుని ఉన్న పండిత శాలువాను గురుదక్షిణగా ఇచ్చేశారట. తాతగారి వెంట చిన్నతనంలో హాజరయిన భజనలూ, సంగీత కార్యక్రమాల్లో తులసీ దళములచే అd ¶మాయామాళవగౌళ కీర్తన తరుచుగా వినబడేదనీ, అప్పటికే సరళీస్వరాలు నేర్చుకున్న తనకు అందులో స్వరకల్పన చెయ్యబుద్ధయేదనీ సంగీతరావుగారికి జ్ఞాపకం. ఆ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లలకు సంగీతం నేర్పేవారు కాదు. సంగీతరావుగారి బంధువర్గంలోనూ అంతే.

వాగ్గేయకారుడైన శ్యామశాస్త్రిని పోటీలో ఎదిరించిన కేశవదాసు అనే విద్వాంసుడు వాసావారి వంశస్థుడేననీ, బొబ్బిలి సంస్థానంలో ఉండేవాడనీ సంగీతరావుగారి అభిప్రాయం. వాసావారు ఎన్నో తరాలుగా సంగీతంలో పేరుపొందినవారు. బిలహరి, కల్యాణి, లలిత, నవరోజు మొదలైన రాగాల్లో వారి స్వరపల్లవులు ప్రసిద్ధమైనవట. నవరోజు రాగంలో పెద్ద కీర్తనలు తక్కువ గనక ఒక రేడియో ప్రసంగంలో ప్రొఫెసర్‌ బులుసు సాంబమూర్తిగారు నవరోజు రాగపరిచయం చెయ్యగా ద్వారం వెంకటస్వామినాయుడుగారు అందులో స్వరపల్లవి వాయించారట. వీటి రచయిత వాసా అప్పయ్య గారట. ఈయనకి సాంబయ్య, కృష్ణమూర్తి అని ఇద్దరు కొడుకులు వీణ విద్వాంసులు. సాంబయ్యగారికి సంతానం లేక తమ్ముడి కొడుకు వెంకటరావును దత్తత తీసుకున్నాడు. ఆదిభట్ల నారాయణదాసుగారు కొంతకాలం ఈ వాసా సాంబయ్యగారికి వీణలో శిష్యుడు. వాసా వెంకటరావుగారు తరవాతి కాలంలో విజయనగరం సంగీత కళాశాలలో వీణ టీచరుగా పనిచేశాడు. ఆయన కొడుకే ప్రసిద్ధ వీణ విద్వాంసుడైన వాసా కృష్ణమూర్తి. ఇదొక తెలుగు సంగీత కుటుంబం. బొబ్బిలి వీణలు గొల్లపల్లిలో తయారయేవట. సర్వసిద్ధి అప్పలస్వామి వీణలకు మంచి పేరుండేది. ధర సుమారు 30 రూపాయలు.

ఆ రోజుల్లో బొబ్బిలిలో అల్లంరాజుల బాలం గారని ఒక మంచి హార్మోనిస్టు ఉండేవారట. పదేళ్ళ వయసులో సంగీతరావుకు సంగీతం నేర్పిన గురువు ఆకొండి నారాయణశాస్త్రిగారు. ఈయన వీణను నిలువుగా పెట్టి వాయించేవాడట. ఈయన హార్మోనియం కూడా వాయిస్తూ బాలం గారితో పోటీపడుతూ ఉండేవాడట. హార్మోనియం మీద తిల్లానా నోటితో అక్షరాలు పలికినట్టుగా వాయించేవాడట. బొబ్బిలి గర్‌ల్స్‌ స్కూలులో సంగీతం మేస్టరుగా పనిచేసిన నారాయణశాస్త్రిగారు అదేదో సంగీతకళాశాల అన్న స్థాయిలో పది ఫిడేళ్ళూ, పది వీణలూ, హార్మోనియం, సరంజామాతో నిర్వహించేవాడట. బొబ్బిలి రాజా, రాణీ “పూజా మహల్‌”లో అర్చన చేసిన తరవాత శాస్త్రిగారి వీణ కచేరీ జరిగేదట. అప్పుడప్పుడూ ఇలాంటి సమావేశాల్లో కుర్రవాడైన సంగీతరావుచేత గాత్రం పాడించి శాస్త్రిగారు స్వయంగా వీణ పక్కవాద్యం వాయించేవాడట. ఆయన రచించిన ఒక నవరాగమాలికను చాలా ఏళ్ళ తరవాత మద్రాసు మ్యూజిక్‌ అకాడమీవారి పండిత సదస్సు డిమాన్‌ స్టేషన్‌లో సంగీతరావు పాడి వినిపించారు. కాలగర్భంలో కలిసిపోతున్న కొన్ని సంగీత రచనలూ, పద్ధతుల గురించి మనకు నామమాత్రంగానైనా తెలియాలంటే ఇటువంటి అవకాశాలు సంగీతరావు వంటి గారి వంటివారికి తరుచుగా కలిగించాలి. ఇటీవల సుజనరంజని వెబ్ పత్రికలో డా. వింజమూరిఅనసూయాదేవిగారు తన చిన్నతనంలో తూమరాడసంగమేశ్వరశాస్త్రిగారి వీణ కచేరీకీ, ఆదిభట్లనారాయణదాసుగారి హరికథాకూ హాజరయిన సంగతులు రాశారు. ఇటువంటి అనుభవాల గురించి ఈ తరంవారుపరోక్షంగానైనా తెలుసుకోవడం చాలా అవసరం.
---------------------------------------------------------
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, 
ఈమాట సౌజన్యంతో

Saturday, December 29, 2018

ఆచంట జానకిరామ్”సాగుతున్న యాత్ర”


ఆచంట జానకిరామ్”సాగుతున్న యాత్ర”





సాహితీమిత్రులారా!

తెలుగులో స్వీయ జీవిత చరిత్రల్ని గ్రంధస్థం చేయటం కందుకూరి వీరేశలింగంతో ప్రారంభమైంది. “తెలుగు భాషలో స్వీయచరిత్ర వ్రాయబూనుట కిదియే ప్రథమ ప్రయత్నం,” అని వారే రాసేరు. ఇందులో ఆయన మొదటి వాడైనా, రెండో వాడైనా వారి జీవిత చరిత్ర ఒక విధంగా ఆంధ్రదేశపు సాంఘిక చరిత్ర అనటం మాత్రం నిర్వివాదాంశం. వీరేశలింగం గారి శిష్యుడు రాయసం వెంకటశివుడు తన ఆత్మకథ 1933 లో ప్రచురించేరు. అలాగే చిలకమర్తి వారు. ప్రస్తుతం లభ్యం కాని వల్లూరి సూర్యనారాయణ (18661933) గారి స్వీయచరిత్ర సూర్యనారాయణీయం. వీరు హేతువాది అని, అదే దృక్పథంతో మన పురాణగాథలని విమర్శించేరని తెలుస్తోంది. ఇంకొక విలక్షణ స్వీయకథనం “నా ఎఱుక”, “హరికథా పితామహుడగు ఆదిభట్ల దాసు సాహిత్యం,సంగీతం సరితూచిన త్రాసు,” అని శ్రీశ్రీ కీర్తించిన ఆదిభట్ల నారాయణదాసు గారిది.

ఎంత సామాజిక స్పృహ లేని రచయితైనా ఎంతో కొంత తన సమకాలిక జీవితం చిత్రించకుండా ఉండలేడు. అయితే జీవిత చరిత్ర ఒక్కొక్కరూ ఒక్కోలా రాస్తారు. ఉయ్యాల రోజుల్నుంచీ ముసలితనం వరకూ కొందరు సృజిస్తే, తమ కాలం నాటి సామాజిక నేపధ్యం, జీవితంలోని మధురక్షణాలు ఎంపిక చేసి జ్ఞాపకాల రూపంలో అందించటం మరో పద్ధతి.

వీరేశలింగం లాంటి సాంఘిక విప్లవకారుల, టంగుటూరి ప్రకాశం లాంటి రాజకీయ నాయకుల రచనలకు భిన్నంగా వారి వారి అనుభవాల్ని పంచుకున్నవి బుచ్చిబాబు “అంతరంగ కథనం”, ఆచంట జానకిరామ్‌ “సాగుతున్న యాత్ర”, సంజీవ దేవ్‌ స్వీయ కథనత్రయం “తెగిన జ్ఞాపకాలు”. శ్రీశ్రీ కూడా తన జ్ఞాపకాలు “అనంతం” లో గ్రంధస్థం చేసినా, అవి వేర్వేరు సమయాల్లో రాయటం వల్ల దాంట్లో పొందిక ( coherence) లేదు.

* * *
జీవిత కథా సాహిత్యంలో ఆనాటి నుండీ ఈనాటి వరకూ మేము ఎన్నిక చేసేది ఆచంట జానకిరామ్‌ జ్ఞాపకాలు. తన మొదటి జ్ఞాపకం అతని మాతృమూర్తి మరణం గురించి “నాకు నాలుగేళ్లప్పుడు మా అమ్మను గోదావరి తల్లికి వప్పచెప్పి ఆ రాత్రి రాత్రే నదిని దాటి విజ్ఞేశ్వరం వస్తున్నాము రహదారి పడవలో. మాఘమాసం పౌర్ణమి వెన్నెలైనా, ఆకాశమంతా ఎందుచేతనో ఒక వింత వూదా రంగుతో నిండి ఉంది. నక్షత్రాలు మెరిసిపోతున్నయి. గాలి లేదు. సర్వమూ నిశ్శబ్దము. అప్పుడు లక్ష కెరటాల మీద తేలిపోతున్న చంద్రబింబంకేసి చూస్తూ వున్న నా కళ్ళ ఎదుట ఆ కెరటాల మీద మా అమ్మ కనిపించింది. తెల్లని జరీచీరె, బంగారపు వడ్డాణ్ణము, చేతులకి వంకీలు, మెళ్లో కంటె, కాసుల పేరు, చెవులకు బావిలీలు, ముక్కున అడ్డబాస, చెంపలకు చేర్చిదువ్విన నల్లని తలకట్టు, పెద్ద అరకాసంత కుంకుమ బొట్టు.”

1957 లో కాబోలు వీరి జ్ఞాపకాలు ధారావాహికగా ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చాయి. అవన్నీ సంగ్రహపరచి “నా స్మృతి పథంలో”(1957), “సాగుతున్న యాత్ర” (1963) ప్రచురితం అయ్యాయి. ఆ జ్ఞాపకాలు ఆంధ్రప్రభలో ధారావాహికగా వస్తున్న రోజుల్లోనే అవి పాఠకులను విపరీతంగా ఆకర్షించాయి. “స్మృతి పథాల జానకిరామ్‌” గా తన్ని అందరూ గుర్తిస్తున్నారని వారే తెలియజేశారు.

జానకిరామ్‌ తన రచనల కన్నా ప్రసిద్ధుడు. గొప్ప సౌజన్యమూర్తి, స్నేహశీలి, సౌమ్యుడు, భావుకుడు. తెలుగు, ఇంగ్లీషు, సంస్కృత భాషల్లో పండితుడు. ఈ భాషల్లోనే మంచి కవిత్వాన్ని చదివి ఆస్వాదించిన రసికుడు. తను ఆస్వాదించిన దాన్ని పది మందికి పంచి ఇవ్వగల్గిన ప్రతిభావంతుడు. అందుకే వారి రచన సాహిత్య ప్రియులందరినీ బాగా ఆకట్టుకుంది.

జానకిరామ్‌ గత శతాబ్దం మొదట్లో జన్మించారు. తండ్రి ఆచంట లక్ష్మీపతి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, సంఘ సంస్కర్త. వారి పెంపకంలో జానకిరామ్‌కి ఉత్తమ సంస్కారం అబ్బటంలో ఆశ్చర్యం లేదు. రాజకీయ, సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కుటుంబం అవటం వల్ల ఆ ప్రభావాలన్నీ ఇతని మీద ఉన్నాయి. చిన్నప్పట్నించీ సమకాలిక మహావ్యక్తుల పరిచయ భాగ్యం లభించింది. వీరేశలింగం, గురజాడ, ఉన్నవ లాంటి సంస్కర్తలు, రచయితలు తన తండ్రితో ఇష్టాగోష్టి జరుపుతున్నప్పుడు వినే అదృష్టం కలిగింది.

ఆయన బాల్యం అంతా మద్రాసులో గడిచింది, అడయార్‌ లో. మొదటి యుద్ధం రోజుల్లో కొంత కాలం మదనపల్లిలో విద్యాభ్యాసం. ఆ రోజుల్లోనే అక్కడ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ గా ఉన్న జేంసు కజిన్సు శిష్యరికం. కజిన్సు జానకిరామ్‌కి చిత్ర కళలో అభిరుచి కల్పించారు. వారి సాంగత్యంలో తనెన్నో విషయాలు నేర్చుకున్నానని జానకిరామ్‌ తెలియజేశారు. తనకి దువ్వూరి రామిరెడ్డి, అడవి బాపిరాజు గార్లను పరిచయం చేసింది కూడా కజిన్సే. ఆ రోజుల్లోనే హోమ్‌ రూల్‌ నాయకులు అనీ బిసెంట్‌ అరండేల్‌ ల ప్రభావం పడింది. మదనపల్లి లో ఉండగానే అక్కడికి వచ్చిన రవీంద్రుడ్ని దగ్గరగా చూసే భాగ్యం కలిగింది. అడయార్‌ లో బి. ఎస్సీ. అయ్యాక వారు కొంత కాలం విజయనగరంలోనూ, బెంగుళూరు ఇండియన్‌ ఇంస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ లో రసాయన శాస్త్ర పరిశోధనలు చేశారు. బెంగుళూరు లో ఉన్న రోజుల్లో హరిన్‌ చట్టోపాధ్యాయ, ఆయన భార్య కమలాదేవి దంపతులతో స్నేహం కలిసింది. హరిన్‌ తో స్నేహం జీవితాంతం కొనసాగింది. ఇద్దరూ కలిసి కృష్ణశాస్త్రి పద్యాలు ఇంగ్లీషులోకి అనువదించేవారట.

ఆ రోజుల్లో కృష్ణశాస్త్రి “కృష్ణపక్షం” పద్యాలు, నండూరి వారి ఎంకిపాటల తో తెలుగు సాహితీ ప్రపంచం మారు మ్రోగి పోతోంది. అదే సమయంలో వెంకట పార్వతీశ్వర కవుల “ఏకాంత సేవ” వెలువడింది. “ఏకాంతసేవ” కావ్యం జానకిరామ్‌ని ఎక్కువగా ప్రభావితం చేసింది. “ఎన్నోవేల పుస్తకాలు చదివాను ఇంగ్లీషు తెలుగు భాషల్లో. అవన్నీ ఒకెత్తూ, ఏకాంతసేవ కావ్యం ఒక ఎత్తు,” అని వారు తెలియచేశారు.

బెంగుళూరు రిసర్చి జీవితం తర్వాత ఇన్స్యూరెన్సు కంపెనీ కార్యదర్శిగా బెజవాడ కేంద్రంగా పెట్టుకుని తిరిగారు. ఆ రోజుల్లోనే ఆయనకి ఆంధ్రప్రదేశ్‌ లోని కవి పండితులందరితో పరిచయం, స్నేహం పెరిగాయి.ఉద్దండులైన కవులు, గాయకులు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, అన్నిరంగాల్లోని నిష్ణాతులతో మైత్రి ఏర్పడ్డమే కాక వారి ప్రేమానురాగాలు పొందారు. ఆ రోజుల్లోనే బసవరాజు అప్పారావు తో పరిచయం. కవి స్వంత గొంతుకలో “వంటిగా ఉయ్యాలలూగితివా నా ముద్దు కృష్ణా” అనే పాట “లేపనైనా లేపలేదే” అనే గీతాలు విన్నారు. ఆ తర్వాత ఈ పాటలు టంగుటూరి సూర్యకుమారి ఆలాపించారు. అలాగే కృష్ణశాస్త్రి, వేదుల, అబ్బూరి, చలం ల తో ప్రగాఢ మైత్రి ఏర్పడింది. విశ్వనాథం, దుర్గాబాయి, కమలా దేవి లాంటి మిత్రులే కాకుండా, తన కుటుంబంలో పిన్ని రుక్మిణమ్మ, మేనబావలు రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నా జానకిరాం మాత్రం ఉద్యమానికి ప్రేక్షకుడిగా, మిత్రుడిగా ఉండిపోయారు. 1935 భారతదేశం లో రేడియో ప్రసారాలు ప్రారంభమైన కొత్తలోనే వీరు రేడియో సంస్థలో ఉద్యోగంలో చేరారు. రేడియోలో పని చేసే రోజుల్లో వీరికి బుచ్చిబాబుతో పరిచయం, స్నేహం పెరిగాయి. బుచ్చిబాబు తన నవలకు మొదట పెట్టిన పేరు “ఏకాంతం”. దానికి “చివరకు మిగిలేది” అనే భావయుక్తమైన పేరు పెట్టటమే కాకుండా మంచి ముఖచిత్రం కూడా సూచించారు. ఆ ముఖచిత్రమే “పల్లవి” వాళ్లు వేసిన బుచ్చిబాబు కథల సంపుటాలకు ముఖచిత్రంగా ఉంది.

జీవితంలో అర శతాబ్దం గడిచేక వారు ఈ జ్ఞాపకాల పరంపరను నెమరువేసుకున్నారు. దానికి ముఖ్య ప్రేరణ నార్ల వారు. నేపధ్యంలో మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు. తన అనుభవాల పరంపర కొంపెల్ల జనార్దన రావుకు అంకితం చేశారు. ఆచంట జానకిరామ్‌ జ్ఞాపకాలు మూడు దశాబ్దాల సాంస్కృతిక చరిత్ర. ఈ విలక్షణమైన రచనల ప్రత్యేకత ఏమిటంటే తను నేపధ్యంలో ఉండి, తను పరిచయం చేస్తున్న మిత్రులను, ఘటనలను, highlight చెయ్యడం. చలం గారి మాటల్లో చెప్పాలంటే “దాంట్లో charm ఏమిటంటే అతని అనుభవాన్ని ఎంతో భద్రంగా ఇన్నేళ్లు, after events కి influence కాకుండా, isolate చేసి, sterilize చేసి produce చెయ్యటం.” ఒక్క మాటలో చెప్పాలంటే, పాత జ్ఞాపకాలన్నింటినీ deep freeze లో భద్రం చేసి, ఒక్క సారి defrost చేసి తాజాగా మనకందించడం. ఒక వ్యక్తి తన జీవితకాలంలో అంత మంది సమకాలికులైన ప్రతిభామూర్తులను కలుసుకోగల్గడం, వారి ప్రేమానురాగాలను పొందగల్గడం గొప్ప విషయం.

తన అరవై ఏళ్ల జీవితానుభవాన్ని మనతో పంచుకుంటూ జానకిరాం అంటారు కదా, “జీవితం ఒక రన్నింగ్‌ రేస్‌. అందరికీ మొదటి, రెండు, స్థానాలు రావు కదా. అందుచేత ఫలమెలా పరిణమించినా మనం పట్టించుకోకూడదు. ఏది చేసినా బాగా మనస్సు పెట్టి చెయ్యాలి. మనిషికీ మనిషికీ మరి కాస్త అన్యోన్యత ఉండాలి…’దొంగలున్నారు జాగ్రత్త ‘ అని హెచ్చరిక వినగానే మనం జేబులు గట్టిగా పట్టుకుని ఈ పక్క, ఆ పక్క ఉన్న ప్రయాణీకుల వైపు సందేహిస్తూ చూడడం మానుకోవాలి.”

అతని అలవాట్లు చాలా మట్టుకు పాశ్చాత్య పద్ధతి లోనివే. తనే చెప్పుకున్నట్లు అతని ధ్యేయం తన చుట్టూ ఉన్న వారిని సంతోష పెట్ట్టటం. ఒక సారి బొంబాయి లో అతనికి ఆపరేషను జరిగింది ఆపరేషనైన నాల్గవ రోజు తనకి ‘మెట్రో’ సినిమాలో “Tarzan of the Apes” సినిమాకి నాలుగు టిక్కట్లు కావాలని వాళ్లక్కగారికి పురమాయించారు. నాలుగు టిక్కట్లెందుకంటే తనకు సేవ చేసిన నర్సులకివ్వటానికి. వాళ్లు ఆ సినిమా చూసి వచ్చి చూపించిన సంతోషం చూసి, “మనుషుల్ని సంతోషపెట్టటం ఎంత సులువో” అనుకున్నారట.

జానకిరామ్‌ది ప్రధానంగా సౌందర్య దృష్టి. గాంధీ గారు రవీంద్రనాథ్‌ టాగూరును కల్సుకున్నప్పుడు ఆ సమావేశాన్ని సత్యం సౌందర్యం కలుసుకోవడం అన్నారు. బహుశా టాగూరు సౌందర్య దృష్టే వారి అభిమాని జానకిరామ్‌ది కూడా. బుచ్చిబాబేమో వీర్ని, “సౌందర్యం కోసం సౌకర్యం త్యాగం చెయ్యగల సాధకుల ఆప్తుడు, కళాజీవి”, అని అభివర్ణించారు. తన ఇంటికి తిరిగి వచ్చి దోసెడు పారిజాతాలు గుమ్మం దగ్గర ఉండటం చూసి,జానకిరామ్‌ వచ్చి వెళ్లారని తెలిసింది అన్నారో మహిళా జర్నలిస్టు. అంటే ఆయన వ్యక్తిత్వమే పారిజాత పరిమళం అయ్యిందనేగా?

జానకిరామ్‌ రచించిన గొప్ప పుస్తకాలు ఈ తరం పాఠకులకు అందుబాటులో లేవు. సాహితీప్రియులెవరైనా జానకిరామ్‌ రచనలు అందంగా ముద్రించి ఈ తరం వారికి అందేట్లు చూడాలి. ఎందుకంటే ఈ రచనలు చదవటం ఒక మధురానుభవం. పరిపూర్ణ జీవితం గడిపి జానకిరామ్‌ తొంభై పైబడిన తర్వాత కీర్తిశేషులయ్యారు. ఆయనే రాసినట్లు “అపరిమితానందానుభూతి ఎంత ఉత్కృష్టమైనదైనా అది అనిత్యమేగా!”
----------------------------------------------------------
రచన: శొంఠి రామారావు, శొంఠి సావిత్రి, 
ఈమాట సౌజన్యంతో

Friday, December 28, 2018

విమర్శాదర్శము


విమర్శాదర్శము





సాహితీమిత్రులారా!

ప్రపంచంలో ప్రతి సజీవభాష కాలానుగుణంగా తనకు కావలసిన విమర్శకులను తయారుచేసుకొంటూనే వుంది.కవిత్వంలాగే విమర్శ కూడా అతిసహజం.. అది స్వభావానికి సంబంధించినది.పండితులందరూ కవులూ విమర్శకులు కాలేరు, కానీ సిసలైన విమర్శకుడు పండితుడై తీరతాడు.విమర్శకుడు ఎగబాకే ఎత్తులకు,తరచి చూసే లోతులకు పాండిత్యమన్నది అల్పవిషయం.నరనరాన వివేచన,సదామేలుకొని వుండే రసహృదయం..ఇవీ విమర్శకుడిని పట్టి ఇచ్చే గుణాలు.రసహృదయం కవిలక్షణం భావసౌకుమార్యానికి సంబంధించినది..దీనికి స్త్రీ సంకేతం.వివేచన పండిత లక్షణం..అది భావ పటుత్వానికి సంబంధించినది..దీనికి పురుషుడు ప్రతీక. ఈ రకమైన స్త్రీపురుషుల మేలుకలయికే విమర్శకు వన్నె తెచ్చేది..ఈ అర్థనారీశ్వరత్వమే విమర్శకుడిని  అజరామరం చేసేది.ఏది తప్పినా అణాకాణీలకు ఆశపడి శివుడిలా నటించే పగటివేషగాడవుతాడు..ఆబోరు దక్కదు..

ఎవడు విమర్శకుడు?

వివేచన,రసహృదయం ఉన్న ప్రతి ఒక్కడు విమర్శకుడైపోతాడా? కాదనే సమాధానం విమర్శ స్వభావానికి సంబంధించినది..అది కవిత్వం లాగే ఒక జ్ఞానసాధన లేదా జీవితవిధానం..కావున కేవలం పుస్తకాల పురుగులు , యూనివర్శిటీ పండితులు విమర్శకులైపోరు..మనసా వాచా నమ్మినదాన్ని ఆచరించే నిజాయితీ ,స్వ పర భేదాలు లేని నిష్కల్మష వర్తన ,సాహిత్యానికి కట్టుబడి ఉండటం,రాతలో నిర్మొహమాటం, నిష్కర్ష..ఇవీ స్థూలంగా విమర్శకుడి లక్షణాలు..సూక్ష్మంగా ఆలోచిస్తే నమ్మిన దాన్ని ఆచరించే నిజాయితీ నుండే మిగిలినవన్నీ పుట్టుకొస్తున్నాయి.నిజాయితీ లేని వాడు..సాహిత్యరంగంలో  నియ్యోగప్ప్రభువు రామప్పంతులుగానో,లేదా నెపోలియన్‌ ఆఫ్‌ ఆంటి నాచ్‌ గిరీశంగానో మిగిలిపోయే ప్రమాదం ఉంది.

మన విమర్శక త్రయం

మనకు కవిత్రయంలా విమర్శకత్రయం ఉంది.రాచమల్లు రామచంద్రా రెడ్డి ,రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ ,అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు..వీరు ముగ్గురు సాహిత్యంలో భిన్న కాలాల్లో వచ్చినా నిజాయితీగా తాము నమ్మినదాన్ని శషభిషలు లేకుండా నిష్కర్షగా వ్యక్తం చేశారు.

రా.రా

రా.రా మార్క్సిజాన్ని మనసా వాచా నమ్మిన వాడు.కానీ ఒక సిద్ధాంతంగా దాని పరిమితులను చక్కగా ఎరిగిన వాడు కాబట్టే ,ఎక్కడా పాఠకులతో ఇనుపగుగ్గిళ్ళు నమిలించలేదు.ఎవరికి ఇవ్వవలసిన గౌరవాన్ని వారికిచ్చాడు.తనతో భావసారూప్యం గల శ్రీ .శ్రీ ,కొ .కు ల దగ్గరే ఆగిపోకుండా తిలక్‌ , చలాల లోతులను తరచి చూశాడు. విలువైన విషయాలు వెల్లడించాడు.భావసారూప్యం గల మహీధర,రావిశాస్త్రి రచనల్లోని లోపాలను క్షమించి వదిలివేయలేదు.రచయిత మేల్కొలపవలసింది హృదయాన్ని కానీ..బుద్ధిని కాదు అంటూ మహీధర రచనల్లో దోషాన్ని నిష్కర్షగా చెప్పాడు.అలాగే రావిశాస్త్రి వర్ణనా లౌల్యాన్ని ఎత్తిచూపాడు..శ్రీ శ్రీ లోని తాత్వికాంశని నిరూపించినా ,తిలక్‌ సౌకుమార్యాన్ని ప్రశంసించినా ,గురజాడ ,కొ .కు ల అభ్యుదయ చింతనను కీర్తించినా ,మహీధర,రావిశాస్త్రి శిల్పదోషాలను బట్టబయలు చేసినా వాటి వెనుక ఉన్నది జీవితంలోని ఒక నిజాయితీ.. శ్రమించి ప్రోది చేసుకొన్న అభిరుచి పట్ల నిబద్ధత.అందుకే ఈనాటికీ ఆయనకు సాహిత్య గౌరవాన్ని ఆపాదించేది.

రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ

సంప్రదాయ పండితుడు..సంగీతంలో ధురీణుడు..భాషా కోవిదుడు..ఈ మాత్రం చాలు ఆయన రూపు కట్టించడానికి.సంప్రదాయాన్ని విమర్శించడానికి ఇవేవీ ఆయనకు అడ్డు కాలేదు..సరికదా ఉపకరించాయి.సాంప్రదాయికులందరూ బహిష్కరించిన వేమనను మహాకవిగా నిరూపించడానికి ఆయన చేసిన సాహిత్యోపన్యాసాలు విజయనగర శిల్ప కళలా చెక్కు చెదరలేదు.అప్పటి సంప్రదాయ పండితుడిలా అనాలోచితంగా ప్రతి ప్రాచీన కవినీ ఆకాశానికెత్తే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు.చక్కగా వివేచించి తన హృదయాన్ని తాకిన దాన్నే కవిత్వమన్నాడు.రాయలనాటి రసికత మీద మక్కువ పెంచుకొన్నా ,మనుచరిత్రలోని మొత్తం పద్యాల కన్నా ,రాయల మరణాంతరం అల్లసాని పెద్దన చెప్పిన ” ఎదురైనచో..మదకరీంద్రము డిగ్గి..” పద్యం లోనే రసస్ఫూర్తి,కవితావేశం ఉన్నాయని కుండ బద్దలు కొట్టాడు.అలాగే నాచన సోమనాథుని కన్నా పలు భావగతులను తేటతెల్లం చేసే ఎఱ్ఱన కవిత్వం ఎలా మేటి కాగలిగిందో వ్యతిరేకతలకు జడవకుండా తన తీర్పును వెల్లడించాడు.స్వానుభూతి లేక శాస్త్రవాసనచే రథంలాగే వారినుద్దేశించి వంకాయ తన వంటికి పడుతుందా లేదా అన్న విషయాన్ని ఎవరో చెబితే తెలుసుకోవడం కాదు స్వయంగా ఆరగించి తెలుసుకోవాలి అని చురక అంటించాడు.

అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు

తర్క సంగ్రహం రాసిన అన్నంభట్టు ఆంధ్రుడే అని సంబరపడటం తప్ప తర్క సంపన్నంగా ఈయనలా విమర్శ రాసిన వారు అరుదు.నవద్వీపంలో కావ్యతర్క శాస్త్రాలను వల్లె వేసిన దిట్ట.అలా అని నవీన పద్ధతులు ఎరుగని వాడేమీ కాదు.తన విమర్శ గ్రంథానికి సంస్కృతాంధ్రాంగ్లాలలో పీఠికలు రాసుకొన్నారు..ఇంత హంగామా చూశాక ఈయన పాతనంతా తలకెత్తుకొని ఊరేగుతారని భావించవచ్చు ..అటువంటి చాదస్తాలు ఏవీ ఆయనకు అంటలేదు..నన్నయాదులనుండి భావకవిత్వందాకా వచ్చినది కవిత్వమే కాదుపొమ్మన్నాడు.(వేమన దీనికి మినహాయింపు)చారిత్రకంగా దారితప్పాము సరళమైన తెలుగు ఛందస్సుల్లో రాసుకోక,ఎందుకీ ఏనుగుమోత అని వాపోయాడు.. చివరికి తనే పూనుకొని ముత్యాలసరాలు కూర్చడం ఆరంభించారు..పలనాటి చరిత్రను పటుసుందరంగా పరిష్కరించి విపులపీఠిక సంతరించిపెట్టారు..పలు విషయాల్లో ఆయనతో ఏకీభవించని వారు కూడా ఆయననుండి స్ఫూర్తిపొందుతారు..

నిలువెల్ల నిజాయితీ..ఎదురీదే సాహసం..ఉమాకాన్తులకు పెట్టని ఆభరణాలు..

నేటి విమర్శకుల్లో ఏమి లోపించింది ??

అభిరుచి !! అతి చవగ్గా అంగట్లో దొరికే సరుకు కాదు..జీవితానికీ,విలువలకూ సంబంధించినది.పట్టుమని పదిభాషల్లో కవిత్వాలను ,విమర్శలను చదివి సార సంగ్రహణ చేయకుండానే మేము విమర్శకులమని,పథనిర్దేశకులమని జబ్బ చరచుకొనే కూపస్థమండూకాలను నిత్యమూ చూస్తూనే ఉన్నాము.దోషరహితంగా రాయడంతోటే వీరి పాండిత్యం సరి.దొంగలు పడ్డ ఆరు నెళ్లకు కుక్కలు మొరిగినట్టు,అడపా దడపా నాలుగు వ్యాసాలు వెలిగించి గడియకో పేరు చెప్పే సిద్ధాంతిలా భూమండలం బద్దలు చేశాము అనుకొనే వారి సంఖ్య తక్కువేమీ కాదు.నిజాన్ని అబద్దం,అబద్దాన్ని నిజం చేసే కన్యాశుల్కంలోని బైరాగే చాలా నయం.దూలానికి,ద్వారానికి తేడా తెలియని కవిత్వ మాయాబజారులో తెచ్చి పడేశారు..మన విమర్శక సిద్ధులు అదీ ఖేచరీ గమనమ్మీద..ఇప్పుడు ఏది కవిత్వమో ఏది అకవిత్వమో బోధపడక కవులు, పాఠకులు గగ్గోలెత్తిపోతున్నారు.

ఏది పాండిత్యం ??

పాండిత్యాన్ని నైఘంటుకార్థంలోనే తీసుకొనే వెంకటేశాలతో మనకు పేచీ లేదు. అంతకు మించి ఎదగనందుకు  జాలి తప్ప.పాండిత్యమన్నది స్వభావానికి సంబంధించినది..వుట్టి పుస్తక పాండిత్యం కాదు..దాన్నే కబీర్‌ నిరసించాడు

“పోథీ పఢి పఢి జగ్‌ మువా పండిత్‌ బయా న కోయ్‌
ఢాయీ అక్షర్‌  ప్రేమ్‌ కా పఢేసు పండిత్‌  హోయ్‌  ”

ప్రేమను,హృదయాన్ని పెంపొందించుకొమ్మంటున్నాడు..భారతంలోని ప్రశస్త రత్నాల్లో ఒకటైన విదురనీతిలోను ఈ తరహా పాండిత్య చర్చ విపులంగా వుంది.. స్వభావాన్ని,సమాజాన్ని తేటతెల్లం చేసే ఒక నిజాయితీ..ప్రేమతో నిండిన పాండిత్యం..శుష్క  వాగ్ధాటి కాదు. మన విమర్శకత్రయంలో ఈ పాండిత్యమే మనసుకు ఆహ్లాదం  కలిగించేది..దృష్టికి పదును చేకూర్చేది.. తతిమ్మా కాలేజి పాండిత్యాలవల్ల ఒరిగేదేమీ లేదు..తైల నష్టం తప్ప !!

విమర్శకుడు కవి కానవసరం లేదు

మనభాషలోని మహావిమర్శకులు ముగ్గురూ కవులు కారు..దాని వల్ల వారి విమర్శలకు వచ్చిన లోపం లేదు.కవి కాలేక విమర్శకుడు అన్న వాదం చాలా పాతది..విమర్శ వల్ల ఒక కావ్యం అంతరిస్తుంది అన్న వాదంలాగే..కావున గణించనవసరం లేదు.. “వంకాయ కూర బావుందో లేదో చెప్పడానికి వంటవాడు కానవసరం లేదు “అని ఇటువంటి సందర్భంలోనే శ్రీ శ్రీ చమత్కరించాడు.

కరేబియన్‌ కవి డెరిక్‌ వాల్కాట్‌ కవి కవిత్వం గూర్చి రాయకూడదంటాడు.. ఆ రాతలు ఆత్మ సమర్థకాలని ఆయనకు గట్టినమ్మకం..అది అలా ఉండనిస్తే పో ,బ్రాడ్‌ స్కీ , పాజ్‌ లాంటి మహాకవులు గొప్ప విమర్శలు వెలయించారు.వారు కలం పట్టకపోతే ఎన్నో సత్యాలు మరుగున పడిపోయేవి..వారి కవితా శక్తి విమర్శనాపాటవానికి దోహదపడిందే తప్ప ద్రోహం చేయలేదు..మన తెలుగు లో ఇస్మాయిల్‌ ,శ్రీ శ్రీ ఇదే కోవకే చెందుతారు

కొత్తపాతల మేలుగలయిక

మన విమర్శకులకు తెలిసిన విషయాలు రెండు నింద , స్తుతి(కవులకు అదే వర్తిస్తుంది,ఏదో సామెత చెప్పినట్టు తల్లి చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా ?) ఆధునికులు విధిగా నన్నయాదులను నిందించి పరవశిస్తే ,సాంప్రదాయికులు ఆధునికులలో తప్పులెన్నుతారు.రెండు వాదాలు అతివాదాలే.మధ్యే మార్గం ఏర్పరచు కోవలసిందే.. నిందాస్తుతుల వల్ల సత్యం వెలికిరాదు..

ప్రాచీన కవిత్వాలు ఏ భాషలోనైనా శ్రమకోర్చి ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిందే..ఆంగ్లకవిత్వాన్ని తీసుకొంటే ఛాసర్‌ కాలం నాటి స్పెల్లింగ్‌ , ఉచ్ఛారణ వేరు.కాబట్టి , ఆధునిక స్పెల్లింగ్‌ కు అనుగుణంగా తిరగరాసి కొత్తపాఠకులకు సుబోధకం చేయడం జరుగుతూనే ఉంది..మన భాషలో వ్యవహారం  ఇంత సులువుగా లేదు.  ప్రతి పదార్థ తాత్పర్యాలు లేదా కావ్యాన్ని వచనంలో తిరగరాయడం.ఈ రెండూ కావ్యం అందాన్ని పూర్తిగా అందించలేవు..ఈ లోపు ప్రాచీన కావ్యాల పట్ల గుడ్డి వ్యతిరేకత ,అభిమానం మంచివి కావు.హేతుబుద్ధి ,రసహృదయాలతో అంచనా వేయాలి దేన్నైనా !!

భారతానువాదంలో నన్నయ్య భారతాన్ని పలువురు పలురకాలుగా భావిస్తున్నారు అని నిండుగా ఒక సీస పద్యంలో వర్ణించాడు.నన్నయకు లేని పేచీ ఇతరులకు ఉండ నవసరం లేదు..భారతాన్ని మహేతిహాసంగా భావించి గౌరవం ఇవ్వవలసిందే..

గ్రీకులోను ,ఇటాలియన్‌ లోను ఏ భాషలోను ఇంత గొడవ లేదు.ఆధునికులైన ఒడిస్సస్‌ ఎలిటస్‌ ,సెఫెరిస్‌ ,కవాఫీ ల గొప్పతనం తెలుసుకోవాలంటే  వారిని ప్రాచీన గ్రీకు కవులు శాఫో ,హోమర్‌ ల తో పోల్చనవసరం లేదు.అలాగే డాంటే గొప్పతనం తెలుసుకోవాలంటే ఇటీవలి కాలపు ఇటాలియన్‌ కవి మొంటాలే తో పోల్చ నవసరం లేదు.అసలు ఎవరూ అలా ఆలోచించరు..కవిత్వం  చారిత్రకంగా ఎలా పరిణమించింది అన్న ఏకైక దృష్టితో చర్చిస్తారే తప్ప.పది తరాల కవులను ఒక గాటన కట్టేసే పనులు ఏ దేశంలోనూ ఎవరూ చేయరు.

సాకల్యంగా పరిశీలించిన పిమ్మట విమర్శకుడు పెంపొందించుకోవలసింది.. సమన్వయ దృష్టి అని తేలుతుంది..అంతేగాక అనేక కపాలాలను పరిశీలించి మానవ పరిణామాన్ని విశదీకరించే శాస్త్రజ్ఞుడిలా విమర్శకుడికి కావలసినది నిరపేక్ష దృష్టి.అది నిజాయితీగా జీవితానికి ,సాహిత్యానికి కట్టుబడటం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది..వైయక్తిక స్థాయి దాటి ఎదగలేని వారు సమన్వయ కర్తలు కాలేరు.
-----------------------------------------------------------
రచన: తమ్మినేని యదుకులభూషణ్, 
ఈమాట సౌజన్యంతో

Thursday, December 27, 2018

తెలుగు భాషకి భవిష్యత్తులేదా?


తెలుగు భాషకి భవిష్యత్తులేదా?




సాహితీమిత్రులారా!

విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లనో, కాలేజీల్లో పండితులనో, మీరుగనక ఈమధ్యకాలంలో పలకరించి ఉంటే తెలుగు భాష ఎవ్వడికీ అక్కరలేనిదయ్యింది, తెలుగు భాషకి తెలుగు దేశంలోనే భవిష్యత్తు లేదు, తెలుగు భాష చచ్చిపోతున్నది, దాని బాగోగులు చూసే దిక్కులేదు, ప్రభుత్వానికీ పట్టదు, ప్రజలకంతకన్నా పట్టదు ఈ బాపతు విలాపాలు తప్పకుండా వినే ఉంటారు. అందాకా ఎందుకు? కాస్తోకూస్తో తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళు, లేదా అమెరికావచ్చి నాలుగు డాలర్లు వెనకేసుకున్న తరువాత అమాంతంగా తెలుగుమీద మమకారాన్ని ఉవ్వెత్తుగా యానాంలో ఉప్పెనల్లా పెంచేసుకున్నవాళ్ళు, అదే! డాక్టర్లో, ఇంజనీర్లో, ప్రొఫెసర్లో, ఎవరినైనా పలకరించి చూడండి సరిగ్గా ఇదే ధోరణి. తెలుగు భాషకి అరిచిచచ్చినా ఏ విధమైన భవిష్యత్తూ ఎక్కడా లేదు, మనం ఏదో “విప్లవాత్మక” మైన చర్య వెంటనే తీసుకోకపోతే మనభాష, “ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌” అని ప్రపంచప్రఖ్యాతి పొందిన మన మాతృభాష, పూర్తిగా చచ్చిపోతుంది అని ఒహటే గోల. చచ్చేదాన్ని పట్టుకొని వేళ్ళాడడం వెర్రితనం అనే వాళ్ళుకూడా లేకపోలేదు. వాళ్ళు పైకి అనరు, ఈ మమకారవాదులు గొంతుపిసికి చంపేస్తారనో, “ఆంధ్ర ద్రోహీ” అని దండోరా వేస్తారనో, భయం.

నిజం చెప్పద్దూ! నేను కూడా, మూడేళ్ళక్రితం వరకూ తెలుగు భాష చచ్చిపోతూన్నదనే భావనలో ఉన్నాను. చాలా భయపడి పోయాను కూడాను. అందుకని, తెలుగుని పునరుద్ధరించాలని ఏ వార్షిక సంతర్పణలో ఏ యాక్టర్‌ నోట విన్నా, ఏ సావనీరులో చదివినా విపరీతంగా బాధ పడిపోయేవాడిని. మనసు కుమిలి పోయేది. అయితే, మూడేళ్ళక్రితం నాకు జ్ఞానోదయం అయ్యింది.

మే నెల. రోహిణీ కార్తె. తలమాడ్చేసే మండుటెండలు. బట్టతలైతే చెప్పక్కర్లేదు, తలమీద చర్మం కరిగించేసే ఎండలు. దానికి తోడు నోరు పిడచగట్టుకు పోయేట్టు గాడుపులు. ఆ సీజన్‌ లో ఏలూరు వెళ్ళాం, నా బాల్యస్నేహితుడు సత్యం, నేనూ కలిసి. వెళ్ళిన రెండు రోజుల తరువాత ఏదో స్వచ్ఛంద సంస్థకి డిమాండు డ్రాఫ్ట్‌ పంపించాలసి వచ్చింది. పేరయ్యకోనేరు స్టేటుబ్యాంక్‌ బ్రాంచ్‌ ఆఫీసు కెళ్ళాం, మా ఇళ్ళకి దగ్గిరేకదా అని. (మెయిన్‌ ఆఫీసుకి జనం వెళ్ళడం మానేశారని కాబోలు, ఆ బ్రాంచ్‌ ఈ మధ్య మూసేశారట!) అక్కడ అందరితోపాటు లైనులో నించున్నాం.

అదేమి ఖర్మమో కాని, కష్టమర్లు పడగాపులు పడేచోట సీలింగు పంఖాలు వుండవు, ఉన్నా అవి తిరగవు. కష్టమరులు అంటే ప్రభుత్వంవారి నిఘంటువులో కష్టపడాలసిన మరులు అని కాబోలు. కటకటాల వెనకాల కూచున్న బ్యాంకు పనివారి నెత్తిమీద ఒక్కక్కడికీ ఒక్కక్క పంఖా! గట్టిగా “రయ్‌ రయ్‌ ” అంటూ మోతపెడుతూ తిరిగేస్తుంటాయి, బాబుగారు ఎలట్రీ ఇచ్చిన కొద్ది ఘడియలూనూ! చెమటలో తడిసిపోయిన ఒక అరఘంట తరువాత నా ఛాన్సు వచ్చింది. కటకటాల వెనకున్న పెద్దమనిషికి చెప్పాను, నా పని గురించి. ఆయనగారు ఒక ఊదా రంగు కాగితం ఇచ్చి “ఇది పూర్తి చేసుకు రా,” అని గసిరాడు. అక్కడే నిలబడి ఆ కాగితం చదవడం మొదలెట్టా. వెనకాల నించున్నాయన తన నుదిటిమీద చెమట నా మొహం మీదకి దులుపుతూ, నన్ను మోచేత్తో ఎడంపక్కకి తోసేస్తున్నాడు. పక్కకి తప్పుకున్నామో,లైనులో మన పొజిషను పోయినట్టే! మొదటిరోజు మొదటి ఆట సినిమా టికెట్ల కోసం పడే యాతన కన్నా అన్యాయం!

ఆయనగారి తోపిడి భరించలేక, పక్కకి జరిగా. మరి తప్పదుగా! ఈ కాగితంలో పూర్తిచెయ్యాలసిన వివరాలు మూడు భాషల్లో అచ్చు కొట్టారు. హిందీలో, తెలుగులో, దానికింద ఇంగ్లీషులోనూ! తెలుగులో రాసింది బెంగుళూరు లో అచ్చుకొట్టారేమో, తెలుగు అక్షరాలూ గుర్తుపట్టేట్టు లేవు. పోనీ, ఇంగ్లీషులో వున్నది చదువుదామనుకుంటే, అదీ అంతత మాత్రమే. ఇంగ్లీషు అచ్చులు ఏవీ సరిగా అచ్చవలేదు. నాకేమో మన రాజభాషలో బూతులు తప్ప ఇంకేవీ రావు, సరిగదా, ఆ దేవతల లిపి అసలే రాదు. వెనకాల గుమ్మందగ్గిర నించున్న మా సత్యంతోటి గట్టిగా అరుస్తూ అన్నాను, ” ఒరేయ్‌ ఈ కాగితం నేను చచ్చినా పూర్తిచెయ్యలేను. కాస్త, ఈ హిందీలో ఏడిసింది చదివి, పూర్తిచెయ్యి.” సత్యం, కేవలం రాజభాష మాత్రమే మాట్లాడే చోట కొన్నేళ్ళు ఉన్నాడు లెండి.

ఈ లోగా, నా బాధ అర్థం అయినట్టుంది, ఆపద్భాంధవుడిలాగా లేచి వచ్చాడు, ఒక పెద్దమనిషి, బ్రాంచ్‌ మేనేజర్‌ సీటులోంచి. ఎ. బి. చౌదరి అని ఆయన కూర్చున్న సీటు కెదురుగా బల్ల మీద నేమ్‌ ప్లేట్‌ ఉంది. ఆయనే ఎ.బి. చౌదరి గారయి ఉంటాడు. పేరేదయితేనే! నన్ను రక్షించడానికి వచ్చిన విష్ణుమూర్తి, ఆయన. ” మీరు ఇలా లోపలికి రండి సార్‌” అన్నాడు, ఆయన. మేమిద్దరం దబ దబ లోపలికి వెళ్ళాం. ఆయన బల్ల ఎదురుగా కుర్చీల్లో చతికిలబడ్డాం. పైన పంఖా తిరుగుతూన్నదేమో, “అమ్మయ్య” అంటూ సేదదీర్చుకున్నాం.

” మీది ఈ ఊరు కాదను కుంటా!” అన్నాడు ఆయన చిరునవ్వు నవ్వుతూ. వెంటనే నేను అందుకోని, “లేదండీ! మేము ఈ ఊరు వాళ్ళమే. దిబ్బ మీద హైస్కూల్లో చదువుకున్నాం కూడానూ!” అన్నాను, తడుముకోకుండా. మా సత్యం తలూపాడు, అవును, నిజమే అన్నట్టు. “ఆ కాగితం ఇల్లా ఇవ్వండి. నేను పూర్తి చేసిపెడతా,” అని అనంగానే గజేంద్ర మోక్షంలో పద్యాలు గట్టిగా పాడేద్దామనిపించిది. వెంటనే, ఆయనకి ఆ కాగితంతో పాటు డబ్బులుకూడా ఇచ్చేశాను. ఒక పదిహేనునిమిషాల తరువాత రసీదు తెచ్చి ఇచ్చాడు, మహానుభావుడు. “మా ఊళ్ళో వి. వి. చౌదరి మీకు ఏమవుతాడు?” అని అడుగుదామని, నాకు నోటి దాకావచ్చింది. కానీ వెంటనే తట్టింది, చౌదరి, శాస్త్రి, రెడ్డి, ఇవన్నీ కులం గుర్తులనీ, రావు లాగా ఎవడుపడితే వాడు తగిలించుకోటానికి అవి విభక్తిప్రత్యయాలు కావనీ! అంతే కాదు, ఆయనేమన్నా అనుకుంటాడేమోనని ఊరుకున్నా. థాన్క్స్‌ చెప్పి వెళ్ళబోయేముందు, ఆయన్ని ఆడిగాను, ” ఏమండీ, మాది ఈ ఊరుకాదేమోనన్న అనుమానం మీకు ఎందుకు వచ్చింది? మేము వేసుకున్నా బట్టలా?” ఆయన వెంటనే, “మీరు ఏమీ అనుకోకపోతే చెప్పుతా. మీబట్టలు కాదు. నిజం చెప్పాలంటే, మీ ఫారిన్‌ బట్టల కన్నా మోడర్న్‌ బట్టలు ఇక్కడ మాకాలేజీ కుర్రాళ్ళు వేసుకుంటారు. మీరు తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు. అందుకని అన్నాను, మీరు ఈ ప్రాంతం వాళ్ళు కారా అని” అన్నాడు. అక్కడ నవ్వేసి ఊరుకున్నా.

ఆ తరువాత నాతెలుగు గురించి ఆ చౌదరి గారు అన్నది తలచుకుంటే సిగ్గేసేసింది. ఆయన అన్నమాటలకి అసలు అర్థం ఏమిటి? మనం మాట్లాడే తెలుగు, ఇప్పుడు, ఇక్కడి జనానికి తెలుగు కాదన్నమాట. అది తాతలనాటి తెలుగన్న మాట. సత్యాన్ని అడిగా. ఏరా! మనం మాట్లాడే తెలుగు అంత అన్యాయం అంటావా, అని. నీ తెలుగు స్వచ్ఛంగా ఉన్నది అన్నాడు గానీ ఛండాలంగా ఉన్నది అని ఆయన అనలేదుగదురా? అని ఓదార్చాడు. నిజం చెప్పద్దూ! వాడికీ కొంచెం అనుమానంగానే ఉన్నది. సాయంత్రం రాజుగారిని అడుగుదాం లే అని ఊరుకున్నా. ఇంట్లో మా తమ్ముడి కూతురు ని అడుగుదామనిపించింది కానీ, అది నన్ను ఎక్కడవేళాకోళం పడుతుందో అని ఊరుకున్నా. దానికి తెలుగులో బంగారు పతకంకూడా వచ్చింది, ఎం.ఎ. పరీక్షల్లో.

సాయంత్రం ఐదు కొట్టంగానే, రామా అండ్‌ కో గేటు దాటి, రాజు గారి ఇంటికి బయలు దేరా. ఇంకెవ్వరూ అక్కడ చేరక ముందే, ఆయన్ని నా తెలుగు గురించి అడుదామని. గేటు దాటంగానే రోడ్డు కుడిపక్కన సిమెంట్‌ స్తంభాల పైన కట్టిన సినిమా పోస్టర్లు, ఇవ్వాళ నన్ను ఆకర్షించాయి. ఆ పోస్టర్లు చాలారోజులనుంచీ ఉన్నాయి, ఎందుకో ఇవ్వాళ వాటిని చదువుదామనిపించింది. ఓ ఇరవై సినిమాపోస్టర్లున్నాయి, వరసగా. ఆ సినిమాల పేర్లు చదవడం పూర్తికాకముందే, చౌదరి గారు నా తెలుగు గురించి అన్న మాట నిజమేనేమో అన్న అనుమానం దృఢపడడం మొదలయ్యింది. ఒక్క సినిమా పేరుకూడా, మనకి అవగతమైన పరిథిలో లేదు. వరసగా చదివాను పేర్లు, గట్టిగా పైకి చదివినట్టున్నా, ఓ ఇద్దరు ఖద్దరు పెద్దమనుషులు నాకేసి ఎగాదిగా చూస్తూ మరి వెళ్ళారు కూడాను. అయినా సరే! మళ్ళీ మళ్ళీ చదివాను సినిమాల
పేరులన్నీ. చెప్పద్దూ!

ఇదీవరస!

ఎదురింటి మొగుడుపక్కింటి పెళ్ళాం, పరవాలేదు అది తెలుగేగదా అనుకుంటే, దాని పక్కనే ఉన్న పోస్టర్లు, ఆవిడ మా ఆవిడే!, ప్రేమకు వేళాయె రా!, ప్రేమించుకుందాం రా, అని. పోస్టరులన్నిటిమీదా అర్థనగ్నంగా పంచరంగుల్లో అమ్మాయిల బొమ్మలూ! చూడాలని ఉంది అని ఒక సినిమా పోస్టరు, దానిపక్కనే వినాలని ఉంది అని మరో పోస్టరు. ఇదేదో సినిమా పేర్లకి పోటీ పడుతున్నట్టు. పోటీ అన్నాను కదూ! కొంచెం ముందుకెడితే, ఊరికి సోగ్గాడు, ఊరికి మొనగాడు అని మరో రెండు
సినిమాలు. అక్కడితో అవలేదు. వాటిపక్కనే, యముడే నామొగుడు అని ఒక కొత్త సినిమా. దానికి పోటీగా కాబోలు, యముడికి మొగుడు. అక్కడితో ఆగలే! అత్తకి యముడుఅమ్మాయికి మొగుడు, హలో! యమా హలో! ఐ లవ్‌ యూ! అని సినిమాలు. మనకేమో మల్లేశ్వరి, పాతాళభైరవి, బంగారుపాప, పెద్దమనుషులు, భాగ్యరేఖ, పెళ్ళిచేసిచూడు, సీతారామకల్యాణం, భక్త పోతన, జడగంటలు, ఇల్లాటి పేర్లు అలవాటాయె! మరి ఇప్పటి సినిమాల పేర్లు మళ్ళీ చదవాలని అనిపించదూ, చెప్పండి. దీనికి తోడు, ఇంగ్లీషు నుంచి డబ్బు చేసిన సినిమాలు. నాకు తెలిసిన సినిమా, టైటానిక్‌ దాని తెలుగు డబ్బింగు, మేటినీ కూడా ఆడుతోంది, ప్రతిరోజూ! అప్పుడు నిజమేననిపించింది. మనకి సాహిత్యరంగంలో జోరుగా జరుగుతున్న విప్లవాలే కాదు; సినిమారంగంలో అంతకన్నా జరూరుగా వచ్చేస్తున్న వింత పరిణామాలు కూడా తెలియవూ, అని.

తిన్నగా, రాజుగారింటికెళ్ళాను. ఆయన ఏమీ అనకముందే, మనం టైటానిక్‌ తెలుగులో చూడాలి ఇవ్వాళ అన్నాను. “ఛ ఛ,” అన్నాడు ఆయన. “పైగా మీకు ఇల్లాటి చెత్త కోరిక పుట్టిందేమిటీ?” అన్నాడు. అని, ఊరుకుంటే బాగుండేది. “మీకు తెలుసో తెలియదో, ఈ మీ అమెరికా చెత్త సినిమా టైటానిక్‌ ఇండియాలో రెండే రెండు భాషల్లోకి డబ్బు చేశారు, హిందీ, తెలుగు! అరవంలోకి గాని, మళయాళంలోకి గాని, కన్నడంలోకిగాని, కనీసం బెంగాలీలోకి గాని, దీన్ని డబ్బు చెయ్యలేదు. వాళ్ళకి బాగా తెలుసు, డబ్బింగు చెత్త చూసి డబ్బు తగలేసుకునే జనం ఎక్కడున్నారో!” అంటూ ముగించాడు. ఇంత ఉపోద్ఘాతం తరువాత ఆయనతో చెప్పదలచుకోలేదు, ఎందుకు నేను ఆ సినిమా చూద్దామని అన్నానో.

మర్నాడు, మంగళవారం. ఎవ్వరికీ చెప్పకండా, మధ్యాన్నం తెలుగు టైటానిక్‌ మ్యాటినీ ఆట చూడటానికెళ్ళాను. అబ్బ! రిజర్వుడు క్లాస్‌ కి కూడా పెద్ద లైను. మొత్తం హాలు నిండిపోయింది. చాలామంది కాలేజీ పిల్లలు వచ్చారు, క్లాసులు ఎగ్గొట్టేసి! సినిమా మొదలయ్యింది. సినిమాహాలు కొత్తది. ఎయిర్‌ కూల్డ్‌ హాలు. సరౌన్డ్‌ సౌండుట. ఆ నేపథ్య సంగీతమ్‌ మోతెక్కి పోయి, చెవుడొచ్చినంత పని అయ్యింది. ఒక్క మాట అంటే ఒక్క మాట తెలుగు మాటలే ఒక్కటి కూడా సరిగ్గా బోధపడలేదు. నాపక్కన కూచున్న అబ్బాయిని సిగ్గు విడిచేసి మరీ అడిగేశా, తనకి అర్థం అవుతున్నదా అని. “మాటలకోసం ఎవడొస్తాడుసార్‌ అమెరికన్‌ సినిమాకి?” అన్నాడు. అదీ పాయింటే! ఇది డబ్బింగు లోపమేమో అని సర్దుకున్నా!

ఇంటికి వెళ్ళుతూవుంటే, అమోఘమైన ఐడియా వచ్చింది. మా అమ్మాయికి చెప్పి తెలుగు సినిమా విడియోలు తెప్పించి చూద్దామని. “సడెన్‌ గా మీకు తెలుగు సినిమాలు చూద్దామని ఎందుకు అనిపించిందీ?” అని అడిగింది. నాకు చెప్పక తప్పలేదు. బ్యాంక్‌ చౌదరి గారి కథ చెప్పాను. “పెదనాన్నా! ఆ విడియోల్లో బొమ్మలు సరిగా ఉండవు. అలికేసినట్టుంటాయి. మీకు కావలసింది మాటలేగా. మన ఇంట్లో బోలెడు టేపులున్నాయి. మాటలున్నవి, పాటలున్నవీనూ! పాటలు వినండి. బాగుంటాయి,” అని, దబ దబా టేపులు పెట్టిన సూట్‌ కేసు తెచ్చింది. ఆ పెట్టెలో రెండు వందల పైచిలుకు టేపులున్నాయి.

ఒక్కక్క టేపూ తీసి చూశా. సినిమాలపేరులు, పాటల మొదటిచరణాలూ రాసి కూడా ఉన్నాయి. అయితే వినడం ఏమంత తేలిక కాదు. “పాటల్లో మాటలు తెలియాలంటే, ఒక్కొక్క టేపూ పదిసార్లన్నా వెనక్కి తిప్పాలి,” అని నసుగుతూ ఉంటే, మా అమ్మాయి అందుకొని, “మన పక్కింటి సుదర్శనం గారి అబ్బాయి, నీకు సాయం చేస్తాడు, టేపు రికార్డరు తో! అతను నిరుడు తెలుగు బి. ఎ. ప్యాస్‌ అయ్యాడు. ఇక్కడ లోకలు తెలుగు పేపర్లో పని చేస్తున్నాడు,” అని అంది.

మర్నాడు సుదర్శనంగారి అబ్బాయి వచ్చాడు. పిచ్చాపాటీ మాట్లాడుకున్నాం. తెలుగు లో బి.ఎ. కదా అని, అతన్ని అడిగా! బాబూ! నీకు విశ్వనాధ గారి గురించి
ఏమన్నా తెలుసా, చదివావా, అని. “ఓ! కానీ ఆయన, మరీ క్లాసు సినిమాలు తీస్తాడు సార్‌ నంది బహుమానం అల్లాంటి వాటికోసం. మామూలు వాళ్ళకి ఆయన
సినిమాలు నచ్చవ్‌” నేను నోరు మూసుకున్నా. పాపం అతను టేపులు నాతో పాటు విని, సుమారు రెండువందల పైచిలుకు పాటలు రాసిపెట్టడానికి సాయం చేశాడు.

మచ్చు తునకలు, మీకు కొన్ని మాత్రమే “వినిపిస్తా!”

కిరాయి కోటిగాడు సినిమాలోంచి

కూడబలుక్కొని కన్నారేమో మీయమ్మా మాయమ్మా
మీయమ్మ నా అత్తో నా అమ్మ నీ అత్తో
నీ అత్త నా అమ్మో నా అత్త నీ అమ్మో… మంచి రిదిమ్‌ ఉన్నది కదూ!

మరి ఇదివినండి. అదిరిపోయే అంత్యప్రాస కోసం.

అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ముద్దు
అమ్మమ్మో ఇద్దూ అథరాల తొలిముద్దు చూడాలని ఉంది అన్న సినిమా లోది.

ప్రేమికుడు నుంచి

మండపేట మలకపేట నాయుడుపేట పేటరప్‌
అచ్చంపేట కొబ్బరిమట్ట….. అని ఊళ్ళపేరులు చెప్పితే,

ఖైదీ నెం 786 లో

తోటకూర గోంగూర కొత్తిమీర కరేపాకు
బొమ్మిడాయిలు పీతలు పిత్తబరికెలు … కూరగాయలు, జంతువులూ! కాదేదీ కవిత కనర్హం అన్నాడు కదూ మహాకవి!

రౌడీ అల్లుడు లో

లవ్‌ మీ మై హీరో చలాకిముద్దు ఇస్తా రారో
కుషీగ కౌగిట్లొ మారో ఇంగిలీషు, రాజభాష కలిపేసి.

పోనీ శుభాకాంక్షలు అని పేరుగదా, ఈ సినిమాలో పాటలు విందామనుకుంటే,

ఓ పోరీ పానీ పూరీ బొంబాయి నారీ నువ్వే లే నా టాబూ టాబూ టాబూ
లౌలీగా స్నానం చేస్తూ కిస్మీ అంటే షేకైపోదా గ్లోబూ గ్లోబూ గ్లోబూ
చైనీసు లోటసు నీవూ టొమేటా సాస్‌ నేనూ
ఇది ఫాస్ట్‌ ముద్దుల కాలం టైం వేస్ట్‌ చేయుట ఘోరం…

ఇదిగో, దాని బాబులాంటి పాట, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో నించి.

పాపరా పాప్‌ టపరా టప్‌
ఊపరా ఊప్‌ షేప్రా షేప్‌.. . అంటే అర్థం ఏమిటో!

అల్లాంటిదే మజాకాకి మరోక్కటి! రిక్షావాడు సినిమా నుంచి. ఇది తారక స్థాయి కాబోలు!

చాక్‌ చిక్లెట్‌ షాక్‌ చాక్లెట్‌ జాం జాం జాక్పాట్‌
టిట్‌ ఫర్‌ టాట్‌ షూట్‌ యట్‌ సైట్‌ స్వీట్‌ ఆఫ్‌ ఫిట్‌

రూపుతేరా మస్తానా నీకు డేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
కాటేసుకుందామే గిల్లీ కజ్య్జా
వాటేసుకోరాద ముద్దూ ముజ్య్జా
దగ్గిరయితే సిగ్గు పుట్ట దూరమైతే అగ్గిపెట్టె
ఇద్దరైతే నిద్దరయితా
హద్దుపేరా హద్దు పెట్ట ముద్దుమీద ముద్దు పెట్ట
అదరై అల్లరట్టా…

అదేసినిమాలోది, మరో కవిత.

నీ పెట్ట నాపుంజుని ముద్దెట్టుకోనా
నీపుంజు నాపెట్టని జోకొట్ట పోనా
చిక్కావె చేతుల్లో చెమ్మచేకోడీ
మోతెక్కిపోవాల చేసెయ్యి దాడీ
కౌగిట్లొ కరగాల నీలో నాలో వేడీ…

రిక్షావాళ్ళు ఇంత చవకబారుగా ఎక్కడ ఎప్పుడు మాట్లాడు తారు? రిక్షా సంఘాలు ఎందుకూరుకున్నాయో, ఆ యూనియన్‌ నాయకులకే తెలియాలి!

యముడికి మొగుడు అన్న సినిమాలో పాట వినండి.

అందం ఇందోళం అథరం తాంబూలం
అసలే చలికాలం వయసే జలపాతం… ఇది పోస్ట్‌ మోడర్న్‌ పాట కాదని ఎవరన్నా అనగలరా? ఒప్పుకోరూ? మరి రావోయి చందమామ లోది, ఈ పాట కనీసం అల్ట్రా మోడర్న్‌ అని అన్నా ఒప్పుకుంటారా లేదా?

నాకోసమె ఎల్లోరాలు నాకోసమె మంజీరాలు నాకోసమె ఎన్నో అందాలు
నాకోసమె చైనా వాలు నాకోసమె కొడైకనాలు నాకోసమె ఎన్నో అందాలు
అర్జంటుగా చూడాలి చిత్రాలు ఇంకా ఆనందమె రావాలి నాఇంటి వంక
హలో హలో హలో హలోహో…..

మరికొన్ని ప్రేమ కవితలు, ఇదే బాణీలో …

మెకానిక్‌ అల్లుడు లో

గుంతలకిడి గుండమ్మో గుండెల్లో గుబగుబ
చింతపిక్కల చిట్టెమ్మో షోకంతా లఫ టఫ…

బావగారు బాగున్నారా! సినిమా లోది, ఈ కింది పాట.

ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబు అదిరింది
అంకుల్‌ పుత్రుడా హలో అల్లుడా వరసే కుదిరిందీ, అని చెప్పితే, దాని తలదన్నింది, రౌడి ఇన్స్పెక్టర్‌ లో కవిత.

పాపా పాపా పండిస్తావా మాపటివేళకి ముద్దిస్తావా
వారెవా యెస్సయ్యో పరేషాన్గుందయ్యో

ప్రేమించుకుందాం రా అన్న సినిమాకి పేరుకి తగినట్టుగా ఈ పాట,

మేఘాలే తాకిందీ హాయ్‌ హై లెస్సా
నవరాగంలో పలికిందీ మోనాలీసా…,

జగదేక వీరుడు అతిలోకసుందరి లోది, వినండి.

అబ్బనీతియ్యనీ దెబ్బ ఎంతకమ్మగావుందిరోయబ్బ
వయ్యారాల వెల్లువ వాటేస్తుంటె వారెవ్వా
పురుషులలోన పుంగవా పులకింతొస్తే ఆగవా?

దీన్ని మించింది, అల్లుడా మజాకా సినిమాలో,

చిన్న పాపకేమో చీరకాస్త చిన్నదాయరా
పెద్దపాపకేమో పైటకాస్త పెద్దదాయెరా
చూడలేకపోతున్నా ఆగలేక చస్తున్నా…

అని వాడు చస్తూంటే, చూడండి అడివిరాముడు హీరోయిన్‌ ఏమంటున్నదో!

ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె అరె
కోకెత్తుకెళ్ళింది కొండగాలి
నువ్వు కొంటే చూపు చూస్తుంటే చలీ చలీ…

ఇక వరసగా, హలో బ్రదర్‌ , ముద్దుల ప్రియుడు, పెద్దన్నయ్య, చిన్నల్లుడు, తొలిముద్దు సినిమాల నుంచి

కన్నె పిల్లరో కన్నుకొట్టరో ఓ ఓ ఓ
పాలపిట్టరో పైటపట్టరో ఓ ఓ ఓ
బుచ్చిబుచ్చిగా రెచ్చగొట్టరో
రెచ్చరేగితే పిచ్చిపట్టెరో…

నాకేగనక నీతోనె గనక పెళ్ళయితె గనక
త్త త్త త్త త్తర్వాత ఏమిచెయ్యాలి
క్క క్క క్క కాముడిని కాస్త అడగాలి
అయితేగనక కాదన్ను గనక ఓ పెళ్ళీకొడకా
మ్మొ మ్మొ మ్మొ మోజులమోత మోగాలి
గ్గ గ్గ గ్గ గాజుల గోల జరగాలి
ఆహా ఓహో అంటూ ఉంటే వింటున్న వాళ్ళు వేడెక్కి పోవాలి….

ఓ ముస్తఫా నీముద్దబంతి బుగ్గమీద ముద్దు పెట్టనా
దిలేదిల్రుబా నీ కన్నెలేతమొగ్గలన్నీ రాలగొట్టనా
ఓ ముస్తఫా నీముద్దబంతులాటలింక కట్టిపెట్టవా
కిస్కిస్తఫా నీకుర్రకారు కిందినించి కిందపెట్టనా
ఓ యమ్మో ఒళ్ళంతా వయ్యారాలు
వద్దన్నా కవ్వించే సింగారాలు…

కుర్రాడు బాబోయ్‌ కుంపటెట్టినాడు
పిల్లాడు బాబోయ్‌ గిల్లిపెట్టినాడు
పరికిణి పావడ పరువపు ఆవడ రుచిమరిగిన మగడా
విరహపు వీరుడ రసికుల సోముడ విరువకు విరుల జడా
అమ్మాయి బాబోయ్‌ అందమైన పిట్ట
బుజ్జాయి బాబోయ్‌ బుజ్జగించుకుంట
కలిగిన పోకడ వలపుల రాకడ తెలిసెను చెలి గురుడా
నున్నని నీమెడ వెన్నెల మీగడ చెలిమికి చెరుకుగడా…

వన్నెలాడి హే హే గిన్నెకోడి
దమ్ములుంటే కాస్కో కన్నె కేడీ
టింగుటిల్లా ఆవుమల్లా
హుషారు బ్రేక్‌ షేక్‌ డాన్స్‌ లో నా
కథాకళిని నేను మిక్స్‌ చేస్తా
ఇట్‌ ఈజ్‌ చాలెంజ్‌ యువర్స్‌ డాన్సె
ఐ ఆమ్‌ ఎ షోకింగ్‌ డోంట్‌ టేక్‌ చాన్సె
డిస్క్‌ బాబు హేహే రెచ్చిపోకు ఓ డిస్క్‌ బాబు….

ఈ అమెరికా తెలుగువాడు తెలుగుదేశంలో తెలుగు సినిమారంగంలో వస్తూన్న విప్లవ సంచలనం గురించి తెలిసీ తెలియకుండా తెలుగు సినిమాలని విమర్శిస్తున్నాడని సీనియర్‌ రచయితలు, సీనియర్‌ విమర్శకులూ నన్ను ఆడిపోసుకోకముందే, చెప్పితీరాలి. బ్యాంకు చౌదరి గారు మొహమాటం కొద్దీ “మీరు స్వచ్ఛంగా తెలుగు మాట్లాడుతున్నారు,” అన్నాడు. నిజానికి, మీ తెలుగు తాతలనాటి తెలుగు అనీ, అది ఎప్పుడో చచ్చిపోయిందనీ అనడానికి బదులుగా! అందులో సందేహం లేదు, ఒప్పుకోక తప్పదు. సినిమాల సంగతి పక్కన పెట్టండి.

ఇక దిన పత్రికల్లో తెలుగు చూస్తే, సంస్కృత పండితుడు కూడా చదవలేడు, తత్తత్త, మెమ్మెమ్మె అని నట్టుకోకండా చదవలేడు, అదేదో పాటలో లాగా! అర్థం సంగతి సరేసరి! సంపాదకీయాలు ఎవ్వరూ చదవరనే ధైర్యం కాబోలు, చూడండి,

“సంస్కరణల సంస్మరణలతోనే వ్యవస్థీకృత అవ్యవస్థ మటుమాయం కాదు.” “నల్లధన ప్రవాహాల్లో ప్రజాతంత్ర స్ఫూర్తి.”

ఇక మకుటాలు, బైలైనులు గురించి చెప్పక్కర లేదు. “అక్షర రెప రెపలు, ఆశావహ ఫలితాలు.” “పార్లమెంటు పొలిమేరల్లో సెగ, భారత్‌ తొలిబాణం భుగ.” “సంఘర్షణల ఆనవాళ్ళివి, సరిహద్దు ఉద్రిక్తతల సంకేతాలివి.”

మీకూ నాకొచ్చిన సందేహమే వస్తూన్నది కదూ? సినిమాలవాళ్ళు పేపర్లు చూసి పాటలు రాస్తున్నారా? పేపర్ల వాళ్ళు సినిమాలు చూసి వార్తలు రాస్తున్నారా? అని.

కలభాషిణి మాటల్లో సంగీతం, కంకుభట్టు పద్యంలో ఆవేదనా, లేకపోతే వరూధిని విరహ వేదనా, … ఇదే తెలుగు సుమా అని అనుకునే వాళ్ళకి, తెలుగు చచ్చిపోయినట్టే లెక్క! తెలుగుకి భవిష్యత్తు లేదు అని వాళ్ళు అనుకోవడంలో విచిత్రమేమీ లేదు.

నిజం నివురుగప్పిన నిప్పులాంటిది. మీరు ఎన్ని రకాల స్టాటిస్టిక్కుల లెక్కలు కట్టి ఎంతచెప్పండి, ప్రయోజనం లేదు. తొమ్మిది కోట్లజనం ఎడతెరపి లేకండా ప్రతి ముప్ఫై ఆరుగంటలకీ ఒక కొత్త తెలుగు సినిమాని అందులోవచ్చే పాటలనీ మాటలనీ పోషించుతూ ఆనందిస్తూ వుంటే, తెలుగు చచ్చిపోవడం ఏమిటి?

ఇలా విప్లవాత్మకంగా, ప్రగతిపథంలో ముందుకు ముందుకు తోసుకొ పోతూన్న తెలుగుకి ఢోకాలేదు. అది అసలు నిజం. మనం నిశ్చింతగా నిద్ర పోవచ్చు.
----------------------------------------------------------
రచన: వేలూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, December 26, 2018

చంపకోత్పలమాలల కథ


చంపకోత్పలమాలల కథ



సాహితీమిత్రులారా!

జెజ్జాల కృష్ణ మోహన రావుగారి చంపకోత్పలమాలల కథను
ఈ వ్యాసంలో చూడండి-
పరిచయము
తెలుగులోగాని, కన్నడములోగాని చంపకోత్పలమాలలలో వ్రాయబడిన పద్యాలు తెలియని విద్యార్థులు అరుదు అనుటలో అతిశయోక్తి ఏమాత్రము లేదు. ఈ వృత్తాలు ఈ రెండు భాషలలో ఖ్యాత వృత్తాలు. తెలుగులో వీటితోబాటు శార్దూల మత్తేభ విక్రీడితాలను కూడ కవులు ఎక్కువగా వాడినారు. కన్నడ చంపూకావ్యములలో ఈ నాల్గింటితోబాటు స్రగ్ధర మహాస్రగ్ధరలు కూడ వాడబడినవి. తెలుగులో సంస్కృతభాషనుండి మనము దిగుమతి చేసికొన్న వృత్తాలలో ఈ రెండు వృత్తాలనే ఎక్కువగా కవులు వాడినారు. ఉదాహరణకు శ్రీమదాంధ్ర మహాభారతములో చంపకమాల, తరువాత ఉత్పలమాల వృత్తాలలో ఎక్కువగా నున్నవి. ఒక్క పోతన మహాకవి మాత్రమే ఈ వృత్తములకన్న మత్తేభవిక్రీడితమును అధికముగా వాడినాడు. భారతములో నన్నయ గారి మొదటి తెలుగు పద్యము క్రింది ఉత్పలమాలయే.

రాజకులైకభూషణుఁడు, రాజమనోహరుఁ, డన్యరాజతే-
జోజయశాలి, శౌర్యుఁడు, విశుద్ధయశశ్శరదిందుచంద్రికా
రాజితసర్వలోకుఁ, డపరాజిత భూరి భుజాకృపాణధా-
రాజలశాంతశాత్రవపరాగుఁడు రాజమహేంద్రుఁ డున్నతిన్ – (శ్రీమదాంధ్రభారతము, ఆదిపర్వము, 1.3)

ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము ఈ వృత్తాల ఉత్పత్తిని, వికాసమును గురించి చర్చించుటయే. ఈ విషయము ఏదో చూచాయగా తప్ప లాక్షణికులు బాగుగా విపులీకరించలేదు. నా ఆశయము ఈ విషయాలను అందరికీ తెలియజేయుటయే. ఇందులో కొన్ని విషయాలు వేరువేరు గ్రంథాలలో ఉన్నవి. కొన్ని నా ఊహాగానాలు. మరికొన్ని నా పరిశీలనవలన లభించిన ఫలితాలు.

పేరులు
చంపకమాలకు ఎన్నో పేరులు ఉన్నాయి. అవి – చంపకమాల, చంపకమాలిని, చంపకావళి, పంచకావళి, ధృతశ్రీ, శశివదన, సరసి, సిద్ధి, సిద్ధక, చిత్రలత, చిత్రలతిక, రుచిర. సంస్కృతములో రుక్మ(గ్మ)వతీ వృత్తాన్ని చంపకమాల [(UIIUU) (UIIUU)] అని కూడ అంటారు. ఇక ఉత్పలమాలను ఉత్పలమాలిక లేక కామలత అని పిలుస్తారు. అచ్చతెలుగులో చంపకమాలను తుమ్మెదకంటు, పూలపాన్పు అంటారు, ఉత్పలమాలను కలువదండు, పాలబువ్వ అంటారు.

ప్రథమ రచనలు
పింగళఛందస్సులో సరసీవృత్తము గాథా వృత్తముగా పేర్కొనబడినది. పింగళుడు క్రీస్తుశకము రెండవ శతాబ్దమునకు చెందినవాడని పలువురి భావన. కాని సరసికి ఉదాహరణముగా తరువాతి కాలమువాడైన మాఘుని శిశుపాలవధనుండి ఒక పద్యమును ఇందులో మరియు ఇతర గ్రంథములలో ఇస్తారు. కాబట్టి ఈ వృత్తాలు పింగళుని కాలములో ఉండినవో లేవో అన్నది వివాదాంశము. ఏది ఏమైనా చంపకమాలకు మొదటి ఉదాహరణ క్రీ. శ. 700 కు చెందిన మాఘుడు వ్రాసిన పంచ మహాకావ్యములలో ఒకటైన శిశుపాలవధలోని క్రింది పద్యము –

తురగశతాకులస్య పరితః పరమేకతరంగజన్మనః
ప్రమథితభూభృతః ప్రతిపథం మథితస్య భృశంమహీభృతా
పరిచలతో బలానుజబలస్య పురస్సతతం ధృతశ్రియ-
శ్చిరవిగతశ్రియోజలనిధేశ్చ తదాభవదంతరంమహత్ – (మాఘుడు, శిశుపాలవధము, 3.82)

అన్నివైపుల వందలకొలది గుఱ్ఱములచే నిండియున్నది ఆ శ్రీకృష్ణుని సైన్యము. ప్రతి మార్గములో భూభృతులు (రాజులు) పరాజితులయ్యిరి. అది ఎల్లప్పుడు శ్రీయుక్తమైనది. మరలిపోవుచున్న బలరాముని తమ్ముడైన కృష్ణుని సైన్యమునకు, కేవలము ఎప్పుడో ఒక్క గుఱ్ఱమునకు (ఉచ్ఛైశ్రవము) కారణ జన్మమై భూభృతముచే (మంథరపర్వతముచే) తరువబడినట్టి లక్ష్మిలేని సముద్రునికి, ఎంతయో వ్యత్యాసము ఉన్నది. ఇక్కడ రెండు సముద్రాలకు మధ్య నున్న భేదమును మాఘుడు వివరిస్తున్నాడు. ఒక సముద్రము కృష్ణుని సైన్యము, మరొకటి క్షీర సముద్రము.

ఈ పద్యములో ధృతశ్రీ అను పదము కూడ ఉన్నది, అందువలననేమో ఈ వృత్తమునకు ధృతశ్రీ అనే పేరు. తరువాత ఈ వృత్తమును రత్నాకరుడు కూడ తన హరవిజయములో 21వ ఆశ్వాసాంతములో వాడియున్నాడు.

నర్కుటకము
ఇక్కడ నా ఊహాగానాన్ని కొద్దిగా మీకు వినిపించాలనే కోరిక కలిగింది. చంపకమాలకు ఇరవైఒక్క అక్షరాలు. ఇందులోని మొదటి 17 అక్షరాల గురులఘువులు కలిగిన వృత్తము మరొకటి ఉన్నది. దానిని నర్దటక, నర్కుటక, అవితథ లేక కోకిలక అని అంటారు. ఈ వృత్తము ప్రాచీన వృత్తములలో ఒకటన్నది నిర్వివాదాంశము. భారవి తరువాతి కాలము వాడైన భట్టికవి నర్కుటకవృత్తపు సృష్టికర్త యని భావన. నర్కుటకమును వరాహమిహిరుడు (ఆరవ శతాబ్దము) బృహత్సంహితలో, కుమారదాసు (ఏడవ శతాబ్దము) జానకీహరణములో వాడెను. ఇది జయదేవ ఛందస్సులో (ఆరవ తొమ్మిదవ శతాబ్దముల మధ్య) ఉదహరించబడినది. తొమ్మిదవ లేక పదవ శతాబ్దమునాటి సంస్కృత భాగవతములోని దశమస్కంధములో 87వ అధ్యాయములో 28 పద్యములు ఈ వృత్తములో గలవు. కుమారదాసు సింహళద్వీపపు కవి, రాజు మాత్రమే కాదు, కవిరాజు కూడ. ఇతనికి కాళిదాసు అంటే ఎంతో ఇష్టము. అతని కవితా ప్రభావమువల్ల జానకీహరణము అనే కావ్యమును వ్రాసెను. అందులోని నర్కుటకవృత్తములోని ఒక పద్యము-

అథ హృదయంగమ-ధ్వనిత-వంశ-కృతానుగమై-
రనుగత-వల్లకీ-మృదుతర-క్వణితైర్లలనాః
తముషసి భిన్న-షడ్జ-విషయీకృత-మంద్ర-రవైః
శయితమబోధయన్ వివిధ-మంగల-గీతి-పదైః – (కుమారదాస, జానకీహరణం, 8.101)

జానకీరఘురాములు రాత్రి ప్రణయకేళికల పిదప నిద్రించిరి.ఉషఃకాలములో లలనలు కొందరు బయట వారికి మేలుకొలుపు పాడుచున్నారు. ఆ వర్ణనయే ఈ పద్యము. ఆ మంగళ గీతాలలో రెండు షడ్జ స్వరాలు వినబడుతున్నాయి. ఒకటేమో హృదయంగమమైన వేణు నాదము, మరొకటేమో మృదువుగా మీటబడుచున్న వీణా నాదము. ఈ వేణు వీణా స్వనములు రెండున్ను విభిన్నమైనను ఒకేమారు మ్రోగించబడుచున్నాయి.

ఈ నర్కుటక వృత్తానికి చివర రెండు లగములను జతచేసినయెడల మనకు శశివదన లభించును. ఇక్కడ మనము ఒక విషయాన్ని గుర్తులో ఉంచుకోవాలి. వేద కాలములో పద్యాలు పండ్రెండు అక్షరాలవరకు మాత్రమే పరిమితము. కాని కావ్యాలలో పొడవైన శార్దూలవిక్రీడితము, స్రగ్ధరల వంటి వృత్తాలలో కవులు వ్రాసినారు. పెద్ద వృత్తాలు చిన్న వృత్తాలను పొడిగించి, ఇతర వృత్తాలతో చేర్చి, తరువాత మార్చి సృష్టించారు. ఇది మనము చదివే జెనెటిక్స్ లాంటిదే. జెనెటిక్స్‌లో కూడ జీన్ డూప్లికేషన్, జీన్ ఫ్యూషన్ వంటివి ఉన్నాయి. అంటే నర్కుటానికి చివర ల-గ-ల-గలను చేర్చినప్పుడు సిద్ధకము సిద్ధిస్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న. ల-గ-ల-గమునే (జ-గ) ఎందుకు చేర్చాలి అని. దీనికి రెండు కారణాలు – (1) జ-గము ప్రమాణికలో (జ-ర-ల-గ) సగము. జ-గము ఒక ఇటుకరాయి (building block) వంటిది. దీనితో ఎన్నియో వృత్తములను నిర్మించవచ్చు (ఉదా. పంచచామరము). (2) జ-గము శ్లోకములోని సరి పాదములలో చివర వచ్చును. జ-గణము నియతము. చివర గురువు సామాన్యముగా నుండును. క్రింద ఒక శ్లోకమును దీనిని నిరూపించుటకై వ్రాసినాను.

వేదన నిండె డెందానన్
మోదము నీయ వేలకో
రాధను వేచితిన్ నీకై
మాధవ రమ్ము నా దరిన్

శ్లోకములో మొదటి నాలుగు అక్షరాలు ఏలాగైనా ఉండవచ్చు. అయినా నేను వాటిని చంపకమాలలోవలె భ-గురుగా తీసికొన్నాను. (భ-ర-ల-గ గణములతో నాగర లేక నాగరక అను ఒక వృత్తము ఉన్నది. ఇది ఎప్పుడు పుట్టినదో తెలియదు.) ఇందులో రెండవ నాలుగవ పాదములో అంత్యాక్షరముల గణస్వరూపము జ-గము. శ్లోకనిర్మాణము ఆ కాలపు కవులకు, లాక్షణికులకు కరతలామలకము. కావున నర్కుటకమునకు చివర జ-గమును చేర్చవలయునను ఊహ సులభముగా జనించి యుండును. అందువలన నా ఉద్దేశము నర్కుటకము ముందు, తరువాత దానికి చేసిన చేర్పులతో సరసి పుట్టినది. నర్కుటకచంపకమాలల బాంధవ్యమును క్రింది పద్యములో చూడవచ్చును –

చంపకమాల – న-జ-భ-జ-జ-జ-ర, యతి (1, 11)
ఎదుటను నున్నచో నెపుడు నెంతయు హృద్యమగున్ సునాదినీ
నదివలె పొంగు మానసము నవ్వుల నందనమౌ సుహాసినీ
వదనమునందు వైభవపు బంగరు వన్నెలతో సులక్షణా
సదమల కాంతితో సతము సౌఖ్య మొసంగు సఖీ సుశిక్షణా

నర్కుటకము- న-జ-భ-జ-జ-ల-గ, యతి (1, 11)
కోకిలకము- న-జ-భ-జ-జ-ల-గ, యతి (1, 8, 14)

ఎదుటను నున్నచో నెపుడు నెంతయు హృద్యమగున్
నదివలె పొంగు మానసము నవ్వుల నందనమౌ
వదనమునందు వైభవపు బంగరు వన్నెలతో
సదమల కాంతితో సతము సౌఖ్య మొసంగు సఖీ

చంపకమాల నర్కుటములతో ఉపజాతి
సంస్కృతములో ఇంచుమించు ఒకే విధమైన వృత్తపు పాదములను చేర్చి ఉపజాతిగా వ్రాసెదరు. ఇంద్రవజ్ర-ఉపేంద్రవజ్రలతో, ఇంద్రవంశ-వంశస్థలతో కూడిన ఉపజాతులు చాల ప్రసిద్ధమైనవి. అదే విధముగా శార్దూలవిక్రీడిత-స్రగ్ధరలతో కూడిన ఉపజాతి కూడ ఉన్నది. చంపకమాల-నర్కుటములతో కూడిన ఉపజాతికి క్రింద ఒక ఉదాహరణ-

చంపకమాల-నర్కుటములతో ఉపజాతి-
వదలకు నన్ను నా చివరి శ్వాసను బీల్చకముందు చేరరా
వదలకు నన్ను నా హృదయ వాంఛల దీర్చగ రా
వదనమునందు నవ్వు లను వంద విరుల్ విరియంగ జేయరా
సదమల ప్రేమభిక్ష నిడి సంగ మొసంగగ రా

శార్దూలవిక్రీడితము – చంపకమాల

శార్దూలవిక్రీడితములో వరుసగా చంపకమాలలోని మొదటి తొమ్మిది అక్షరాలు (ఉత్పలమాలలో మొదటి పది అక్షరాలు), చివరి మూడు అక్షరాలు ఉన్నాయి. శార్దూలవిక్రీడితము అతి ప్రాచీన వృత్తము. ఇది అశ్వఘోషుని కాలమునుండి, భాసుని కాలమునుండి వాడుకలో నున్నది. నర్కుటకము, చంపకమాల శార్దూలవిక్రీడితపు మార్పులతో, చేర్పులతో పుట్టినదేమో? దీనిని క్రింది పద్యములతో నిరూపించ వీలగును. ఇది ఒక చిన్న ఊహ మాత్రమే. ఈ రెండు వృత్తముల స్వరూపము, అందులోని ఏకత్వము, భిన్నత్వము ఈ రెంటిని చిత్రములో చూడగలరు.

ఉత్పలమాల
మత్తేభవిక్రీడితము శార్దూలవిక్రీడితములోని మొదటి గురువును రెండు లఘువులుగా చేసిన మార్పువలన ఉదయించినది. ఉత్పలమాల చంపకమాల మొదటి రెండు లఘువులను ఒక గురువుగా చేసిన మార్పువల్ల పుట్టినది. మనకు దొరకిన మొట్టమొదటి ఉత్పలమాల కూడ సంస్కృతములో వ్రాయబడినదే. ఆ పద్యము –

పల్లవ రాష్ట్రకూట కురు మాగధ మాళవ చోళ లాట సం-
వల్ల చళుక్య వంశజ మహానృపతిప్రముఖై రధిష్ఠితం
వల్లభ సైన్య మున్నత మతంగ వాజి భయాకుళం జయా-
త్తల్లలనాక్షివారినివహేన సమం సమ్రేన న్యపాతయత్
– కాదలూరు, మండ్య జిల్లా శాసనము, క్రీ. శ. 962

ఇది ఇప్పటి కర్ణాటక రాష్ట్రములో కనుగొనబడిన ఒక శాసన పద్యము. వివిధ దేశాల రాజులను యుద్ధములో పరాజితులను జేసి జయలక్ష్మిని వరించిన రాజును గురించిన వర్ణన ఇందులో గలదు. ఈ పద్యములో కొన్ని విశేషాలను గమనించాలి. పద్యము సంస్కృతమే ఐనా, దీనిపై ద్రావిడ ముద్ర ఉన్నది. నాలుగు పాదాలకు ద్వితీయాక్షర ప్రాస గలదు. సంస్కృతములోవలె పాదాంతములో యతి లేదు. పదాలు ఒక పాదమునుండి మరొక పాదానికి అనాయాసముగా దొరలిపోతుంది. యతి స్థానము వద్ద పదాల విరుపు లేదు. అసలు ఈ పద్యములో యతి స్థానము ఏదో అన్నది కూడ తెలియదు. కాని సంస్కృత వృత్తాలను ద్రావిడ భాషలకు మలచ గలిగే నేర్పు మాత్రము ఇందులో ప్రతిబింబిస్తుంది. చంపకమాలలో గూడ ఒక శాసనము ఉన్నది. అది-

అరి-నృప-వాజి-వారణ-పదాతి-మహాభ్ర-విరామ-మారుతః
వర-కరికార-సుస్థిత-విభా-ప్రవినాశిత-భాను-సన్నిభః
గురుతర-దీన-భాగవత-మానస-మానిత-కల్ప-పాదపః
వర-కరిగల్ల-భూమిప-భుజా-సిరిహాజిధు-విప్రసాదితే
– సాతలూరు శాసనము, క్రీ. శ. 848

ఇందులోకూడ పై పద్యమువలెనే ద్వితీయాక్షరప్రాస గలదు. ఇది గుణకవిజయాదిత్యుని పొగడే శాసనము. శత్రు రాజుల సైన్యమనే పెద్ద మేఘాన్ని తొలగించే పెనుగాలి, రాత్రిని తొలగించే సూర్యుడు, భాగవత జనుల కోరికలను తీర్చు కల్పవృక్షము. అట్టి కరికాల చోళ మహారాజు దోర్దండములకు విజయము సిద్దించుగాక అని దీని అర్థము. మొదటి రెండు పాదములలో యతి కూడ చెల్లుతుంది.

లక్షణములు
చంపకోత్పలమాలల లక్షణములను మొదటగా మనము నాగవర్మ (క్రీ. శ. 990) వ్రాసిన ఛందోంబుధిలో, జయకీర్తి (క్రీ. శ. 1000) వ్రాసిన ఛందోనుశాసనములో చూడగలము.

జయకీర్తి చంపకమాలను గురించి నజభజజజ్రి చిత్రలతికా సతి చంపకమాలికా క్వాచిత్ అనియు, ఉత్పలమాలను గురించి కామలతా భరౌనభభరాల్గితి చోత్పలమాలికా క్వచిత్ అనియు చెప్పినాడు. నాగవర్మ ముద్రాలంకారముతో ఈ వృత్తములకు లక్షణాలను క్రింది విధముగా తెలిపినాడు –

శీతకరానలేంద్రపుర చంద్ర శశాంక హుతాశనర్ లగో-
పేత మొడంబడుత్తుమిరె రుద్రర సంఖ్యెయొళాగె విశ్రమం
సాతిశయోక్తియిందిదు విరాజిసుగుం కవిరాజహంసనిం
భూతళదోళ్ నెగళ్తి వడె దుత్పలమాలె విలోలలోచనే
– నాగవర్మ, ఛందోంబుధి (2.127)

ఓ చంచలాక్షీ, చంద్ర (భ), అగ్ని (ర), ఇంద్ర (న), రెండు చంద్ర (భ), అగ్ని (ర) అధిపతులుగా నున్న గణములు మరియు చివర ల-గము గల్గి పదునొకండవ అక్షరమువద్ద విరుగు విధముగా (12వ అక్షరము యతి) చాల అతిశయము నిండి శోభించుచు భూతలములో కవిరాజహంసలచే ప్రయోగము చేయబడునది ఉత్పలమాల.

త్రిదశ రవీందు భాస్కర గణత్రితయాగ్రదొళగ్ని చెల్వువె-
త్తుదయిపినం త్రయోదశదొళొందిరె విశ్రమణం నిరంతరా-
భ్యుదయ పరంపరం నినగశోకమహీరుహ పల్లవోల్లస-
త్పదయుగె నిచ్చమోదు గడ చంపకమాలెయ నొల్దు లీలెయిం – (నాగవర్మ, ఛందోంబుధి, 2.129)

ఓ అశోకవృక్షపు చిగురుటాకులవలె పాదముల గలిగినదానా, ఇంద్ర (న), సూర్య (జ), చంద్ర (భ), మూడు సూర్య (జ), అగ్ని (ర) అధిపతులుగా నున్న గణములు గలిగి పదుమూడవ అక్షరమువద్ద విరుగు విధముగ (14వ అక్షరము యతి) నిరంతరము అభ్యుదయపరంపరమైన చంపకమాలతో శోభిల్లుము.

రేచన వ్రాసిన కవిజనాశ్రయములో ఈ పద్యముల లక్షణములు ఇలా ఉన్నవి –

భానుసమాన, విన్ భరనభారలగంబులఁ గూడి విశ్రమ-
స్థానమునందుఁ బద్మజయుతంబుగ నుత్పలమాలయై చనున్
– వేములవాడ భీమకవి (రేచన), కవిజనాశ్రయము (102) (పాదాల విరుపు – పద్మజ – నవ బ్రహ్మలు)

నజభజజల్‌జరేఫలు పెనంగి దిశాయతితోడఁ గూడినన్
ద్రిజగదభిస్తుతా బుధనిధీ విను చంపకమాలయై చనున్
– వేములవాడ భీమకవి (రేచన), కవిజనాశ్రయము (107) (పాదాల విరుపు – దిశా – దశ దిశలు)

కన్నడ ఛందస్సులో ప్రసిద్ధమైన మాలావృత్తములు మూడు. తెలుగు లాక్షణికులు చంపకోత్పలముల పేరులను మార్చలేదు. అలాగే తెలుగులో తీసికొన్నారు. కాని మూడవ మాలావృత్తమైన మల్లికామాలకు మత్తకోకిల అని పేరు పెట్టారు. చంపకోత్పలమాలల యతి విషయము ఈ పద్యముల చరిత్రలో ఒకే విధముగ లేదు. ఉత్పలమాలకు రెండు రకములైన యతులను, చంపకమాలకు నాలుగు రకములైన యతులను లాక్షణికులు నిర్ణయించిరి. వృత్తరత్నాకరములో చంపకమాల పాదమును ఏడేసి అక్షరములుగా విరుగగొట్టినారు. చంపకోత్పలమాలల లయ ఒక్కటే. అందువలన యతి స్థానము రెంటిలో ఒకే విధమైన అక్షరముపై ఉండాలి. క్రిందనున్న పట్టిక ప్రకారము పింగళ ఛందస్సులో, ఛందోంబుధిలో యతి ఒక్కటే కాదు. తెలుగులో ఇట్టి భిన్నత్వము లేదు. రెంటిలోను భ-గణములోని గురువే యత్యక్షరము. తెలుగు ఛందస్సులో గురువుపై యతి నుంచుట వాడుక. కావున ఇట్లు యతిని గ్రహించుట సబబుగానే ఉన్నది. క్రింది పట్టికలో యతుల వివరములను తెలిపినాను.

ఆధారము                  చంపకమాల యతి ఉత్పలమాల యతి
పింగళ ఛందస్సు                       12                            12
వృత్త రత్నాకరము                 8,                                15
ఛందోంబుది                               14                            12
కవిజనాశ్రయము                       12                            10

చంపకోత్పలమాలలను కవులు ఎందుకు ఇష్టపడ్డారు?
కవులు ఎక్కువగా చంపకమాలను, ఉత్పలమాలను వాడారంటే దానికి కారణాలు ఉంటాయి. అందులో కొన్ని – (1) వ్రాయుటలో సౌలభ్యము (2) చదువుటకు, వినుటకు ఒక విధమైన ఆనందము, తృప్తి (3) తెలుగు భాష అందాన్ని ఈ పద్యాలు ప్రతిబింబిస్తాయి (4) దేశి ఛందస్సు నడకను జ్ఞప్తికి తెస్తుంది. చంపకమాలలో మాత్రల సంఖ్య 28, లఘువుల సంఖ్య 14/21 (67%), ఉత్పలమాలలో లఘువుల సంఖ్య 12/20 (60%). శార్దూలమత్తేభవిక్రీడితాలలో ఇది 8/19 (42%), 10/20 (50%). లఘువులు ఎక్కువగా ఉంటే పద్యపఠనలో ఒక వేగము కలుగుతుంది. ఈ పద్యముల శ్రవణానందానికి ఇది కూడ ఒక కారణమే. తెలుగు పదాలను విరిచి వ్రాయుటకు ఈ పద్యములలోని గురులఘువుల అమరిక దోహదము కల్పిస్తుంది.

దేశి ఛందస్సులైన కందము, సీసము, ఆటవెలది, తేటగీతులను కూడ కవులు కావ్యాలలో ఎక్కువగా వాడిరి. కందములోని చతుర్మాత్రల గమనము, సీసములోని తూగు, గీతులలోని రామణీయకత చంపకోత్పలమాలలలో కూడ ఉన్నది. అందుకే ఈ మాలావృత్తములను చదువుతుంటే అవి సంస్కృత ఛందస్సు అని మనకు తోచదు. ఈ విశేష విషయమును క్రింద కొన్ని పద్యములతో నేను నిరూపిస్తాను. చంపకోత్పలమాలలకు కొన్ని జాతి దేశి పద్యములకు గల సంబంధ బాంధవ్యములను క్రింది చిత్రములో చూడగలరు.


(1) ఉత్పలమాల – కందము – తేటగీతి
ఉత్పలమాల –
రా మధుసూదనా వడిగ రా వ్యధ దీరు భవమ్ము పూయు నా-
రామములో నిలన్ సరస రాగము పాడుమ చక్కగాను దే-
వా మధురమ్ముగన్ బిలువవా సుధలూర జపింతు పేరు సు-
శ్యామ హరీ స్మృతిన్ విడువజాలను నిన్ శిఖిపింఛధారి నేన్

కందము –
మధుసూదనా వడిగ రా
వ్యధ దీరు భవమ్ము పూయు నారామములో
మధురమ్ముగన్ బిలువవా
సుధలూర జపింతు పేరు సుశ్యామ హరీ

తేటగీతి-
వడిగ రా వ్యధ దీరు భవమ్ము పూయు
సరస రాగము పాడుమ చక్కగాను
పిలువవా సుధలూర జపింతు పేరు
విడువజాలను నిన్ శిఖిపింఛధారి

(2) చంపకమాల – కందము
చంపకమాల-
పిలచిన రాఁడు వాఁడు, తడ వేలకొ, తా నరుదెంచఁ డెందుకో,
చలముల మాఁడినాను, మన సందె వ్యధన్ గరుణించఁడే ననున్,
బలుకుల నాడఁ డేల సిరి వన్నెలతో మురిపించగా, మదిన్
దలచఁడు, నాకు కళ్ళు వఱ దాయె, సఖీ, హరి నన్ను జూడఁడే

కందము –
హరి నన్ను జూడఁడే నా
దరి బిలచిన రాఁడు వాఁడు, తడ వేలకొ, తా
నరుదెంచఁ డెందుకో, మఱి
మఱి చలముల మాఁడినాను, మన సందె వ్యధన్

కరుణించఁడే ననున్, బలు
చిఱు పలుకుల నాడఁ డేల సిరి వన్నెలతో
మురిపించగా, మదిన్ జెఱు-
పరి తలచఁడు, నాకు కళ్ళు వఱ దాయె, సఖీ

(కందమునకు పాదమునకు 32 మాత్రలు గనుక అదనముగా ప్రతి పాదములో నాలుగు మాత్రలను చేర్చినాను. అవి వరుసగా నా దరి, మఱిమఱి, పలు చిఱు, చెఱుపరి.)

(3) ఉత్పలమాల – మధ్యాక్కర
ఉత్పలమాల-
ఎప్పుడు వత్తువో, మఱల నెప్పుడు వత్తువొ నీవు రక్తితో
నిప్పుడు నన్ను వీడకుమ యిప్పుడు నన్నిట నిట్లు యొంటిగా
జెప్పుచు నుండ, ప్రేమ-కథఁ జెప్పుచు నుండగఁ, బోకు దూరమై
నిప్పుల నార్పుమా, యెడఁద నిప్పుల నార్పుమ వేగ స్పర్శతో

మధ్యాక్కర-
ఎప్పుడు వత్తువో, మఱల నెప్పుడు వత్తువొ నీవు
యిప్పుడు నన్ను వీడకుమ యిప్పుడు నన్నిట నిట్లు
చెప్పుచు నుండ, ప్రేమ-కథఁ జెప్పుచు నుండగఁ, బోకు
నిప్పుల నార్పుమా, యెడఁద నిప్పుల నార్పుమ వేగ

(4) ఉత్పలమాల – సీసము
ఉత్పలమాల-
ఉన్నది యొక్కటే యునికి యో హృదయేశ విశాల భూమిలో
నున్నది నీకె యయ్యునికి యొప్పు కదా ప్రతి యొక్క రోజు నా
కున్నది మేధయం దొకటె యూహ నిజమ్ముగ నెల్ల వేళలో
నున్నది నీకె యీ యుఱుకు యూహ నివాళిగ నిత్తుఁ జక్కగా
నున్నది రూపమో యొకటె యుల్లము నందు సదారసోత్సవా
యున్నది నీవె నాయువున కూర్పు నిరంతర మిష్టబాంధవా
నిన్నయు నేఁడు నీ నెఱయు నీడను నుంటిఁ బ్రశాంతి నిండగా
పున్నెము నీవె నా మునుపు పూజల పుష్ప-ఫలమ్ములై యిలన్
బోవగలేను నే మునుల పుణ్యగృహాలకుఁ బోవలేను నే
నీవిట నుండగా విడచి నిన్ ఋషిపూజకు వెళ్ళలేను నేఁ
గావున చెప్పుమా రథము కట్టకు లక్ష్మణ రాదు సీత, ని-
ర్జీవము లైన ప్రాగ్దిశలు సీత నుడుల్ విని తెల్లబోయెనే!

సీసము-
ఉన్నది యొక్కటే యునికి యో హృదయేశ
    యున్నది నీకె యయ్యునికి యొప్పు
నున్నది మేధయం దొకటె యూహ నిజమ్ము
    యున్నది నీకె యీ యుఱుకు యూహ
యున్నది రూపమో యొకటె యుల్లము నందు
    నున్నది నీవె నాయువున కూర్పు
నిన్నయు నేఁడు నీ నెఱయు నీడను నుంటి
    పున్నెము నీవె నా మునుపు పూజ

తేటగీతి-
మునుల పుణ్యగృహాలకుఁ బోవలేను
విడచి నిన్ ఋషిపూజకు వెళ్ళలేను
రథము కట్టకు లక్ష్మణ రాదు సీత
దిశలు సీత నుడుల్ విని తెల్లబోయె

చంపకోత్పలమాలలలో ఇన్ని దేశి పద్యాలను వ్రాయవీలగును. అందుకే ఈ వృత్తములను చదివేటప్పుడు ఒక్కొక్కప్పుడు కందమో, సీసమో లేక తేటగీతియో, మధ్యాక్కరయో అనే భ్రమ కలుగుతుంది. బహుశా ఇందుకే కాబోలు ఈ మాలావృత్తాలపై ఆంధ్రులకు ఎక్కువ మక్కువ.
మాలావృత్తములు – మాత్రాఛందస్సు – సంపఁగి
స్వయంభూఛందస్సు కర్త అన్ని వృత్తాలను మాత్రావృత్తాలుగా వివరిస్తాడు. చంపకమాల (సిద్ధకము) పాదమును అతడు తొమ్మిది మాత్రాగణములుగా (ఏడవది చతుర్మాత్ర, మిగిలినవి త్రిమాత్రలుగా) వివరించాడు. అతడు చెప్పిన మాత్రల అమరిక తీరు ఇలాగుంటుంది- III IU IU III UI IU IIU IU IU. కాని నాకేమో ఇది అంతగా నచ్చ లేదు. చంపకోత్పలమాలలను మాత్రా ఛందస్సుగా ఎలా వివరించవచ్చునో అన్న విషయాన్ని గురించి నేను ఆలోచించగా నాకు అది క్రింది విధముగా సాధ్యమగునని అనిపించింది- II(U)II UIU IIIU IIU IIUI UIU. అనగా ఈ వృత్తాలలో ప్రతి పాదములో వరుసగా ఒక చతుర్మాత్ర, రెండు పంచమాత్రలు, మరలా ఒక చతుర్మాత్ర, రెండు పంచమాత్రలు. అంటే పాదమును రెండు 14 మాత్రల చిన్న పాదములుగా విపులీకరించవచ్చు. యతి చంపకమాలకు పండ్రెండవ అక్షరము, ఉత్పలమాలకు పదునొకండవ అక్షరము (అనగాయిది మామూలు యతికి పిదప అక్షరము). ఇట్టి జాతి పద్యమునకు సంపగి (చంపకమునకు సరిపోయే తెలుగు పదము) అని పేరుంచాను. అన్ని చంపకోత్పలమాలలు ఈ మాత్రాఛందస్సు కావు. పదాలను ఆయా మాత్రా గణములుగా విరిచినప్పుడు మాత్రమే ఈ మాత్రాఛందస్సు సాధ్యము. క్రింద ఉదాహరణలు-

ఉత్పలమాల గణములతో ఒక సంపఁగి-
సంపఁగి పూలతో సరములన్ _సరసా రచియింతు నీకు నేన్
సొంపుగఁ బాడనా స్వరములన్ _సుధగా మనసార నీకు నేన్
వంపులఁ జూడవా తనువులో _వరదా గ్రహియించి కాన్కగా
నింపుగఁ జేరరా తలపులో _నిలయే దివియౌను వేడ్కగా

చంపకమాల గణములతో ఒక సంపఁగి-
కనులకుఁ బండుగై కనగ రా _కలయే నిజమౌను ముద్దుగా
మనసుకు విందుగా మనగ రా _మహిలో మన కేమి వద్దుగా
విను మిక నాకు యీ బ్రదుకులోఁ _బ్రియమౌ నిధి యెల్ల నీవెగా
ననయము నాకు యీ వలపులో _నజరమ్మగు ప్రేమ నీవెగా

అక్షరయతికి బదులు ప్రాసయతిని ఉంచి సంపగిని వ్రాసిన, వినుటకు సొంపుగా ఉంటుంది. క్రింద అట్టి పద్యము ఒకటి –

చంపకమాల గణములతో ప్రాసయతితో ఒక సంపఁగి-
ముదముల బంతి యిం దలసెనే _నిదురా యిటు రావె మెల్లగా
కదలుచు సవ్వడుల్ సలుపకే _పదవే చిఱుగాలి చల్లగా
పెదవులఁ దాకవే శశికళా _మృదువై పసిపాప నవ్వగా
సదమల తారకా వెలుగుతో _హృదయమ్మును నింపు దివ్వెగా

నాకు నచ్చిన మాలావృత్తాలు
నాకు ఎన్నో చంపకోత్పలమాలలు ఇష్టము. అన్నిటిని ఇక్కడ చెప్పుట కష్టము. అయితే నాకు నచ్చిన ఒక రెండు పద్యాలను ఇక్కడ చెప్పాలి. ఇవి నాకు మాత్రమే కాదు, పండితులకు, పామరులకు ప్రియమే. ఇంటిలో కన్నడము మాటలాడుతూ, బడిలో తమిళము చదివిన మా నాన్నగారు యిట్టి పద్యాలను కంఠస్థము చేసి రాత్రిపూట నిద్ర పోయే ముందు వల్లించేవారు!

ఉత్పలమాల-
నల్లనివాఁడు, పద్మనయనంబులవాఁడు, కృపారసంబు పైఁ
జల్లెడువాఁడు, మౌళిపరిసర్పితపింఛమువాఁడు, నవ్వు రా-
జిల్లెడుమోమువాఁడొకఁడు చెల్వల మానధనంబుఁ దెచ్చె నో
మల్లియలార, మీ పొదల మాటునలేఁడు గదమ్మ చెప్పరే – (పోతన భాగవతము, దశమస్కంధము, 1010)

చంపకమాల-
అటఁ జని కాంచె భూమిసురుఁ డంబర-చుంబి-శిరస్సరజ్ఝరీ-
పటల-ముహుర్ముహుర్లుఠదభంగ-తరంగ-మృదంగ-నిస్వన-
స్ఫుట-నటనానుకూల-పరిఫుల్ల-కలాప-కలాపి-జాలమున్
గటక-చరత్కరేణు-కర-కంపిత-సాలము శీత-శైలమున్ – (పెద్దన, మనుచరిత్రము, 2.3)

ప్రవరాఖ్యుడు హిమాలయ పర్వతమును చేరిన పిదప అక్కడ చూచిన దృశ్యాలను ఈ చంపకమాల వివరిస్తుంది. ఆకాశాన్నంటే పర్వతాలు, ఆ కొండ కొనలనుండి ప్రవహించే సెలయేళ్ళు. అవి పారేటప్పుడు అందులో ఎక్కడచూచినా అలలే. ఆ అలలు చేసే చప్పుడు మృదంగ నాదములా ఉన్నది. దానితో సరిపోయేటట్లు పురివిప్పి నెమళ్ళు నాట్యమాడుతున్నాయి. అక్కడ ఉండే వృక్షాలను ఆడ ఏనుగులు తమ తొండములచే కదలిస్తున్నాయి.

ముగింపు
ఈ వ్యాసాన్ని భారతములోని నన్నయ పద్యముతో ప్రారంభించాను. అదే భారతములోని అరణ్య పర్వమునందలి రెండు పద్యాలతో దీనిని ముగిస్తాను. ముందు ఈ రెండు పద్యాలను ఈ కవులిద్దరు ఈ నవీన యుగములో పుట్టి ఉంటే ఎలా వ్రాసేవారో అనే నా ఊహను క్రింద ఇస్తున్నాను

శారద రాత్రులు, నీరవ రాత్రులు — — పున్నమి రాత్రులు, వెన్నెల రాత్రులు
మిక్కిలి వెలిగెడు చుక్కల సరములు — — ఎక్కువగా గల చక్కదనమ్ములు
తెల్లని కలువలు ఎల్లెడ జిమ్మెడు — — తావుల దెచ్చెను చల్లని గాలులు
మిలమిల మెరిసెడు మిన్నది మిన్నగ — — పొడి జేసిన కప్పురముల పుప్పొడి
(నాలుగు మాత్రలు)

అరుణ రంజితమైన అమలినాంబరమందు
కిరణముల వెల్లువలు రాగమయ రవికాంతి
రమణముగ విరిసినవి రమ్యమగు కమలములు
కలహంస కలరవము, సారస సుకూజితము
భ్రమరముల సవ్వడులు ధ్వనియించె ధరణిపై
శరదుదయ కాలములు పరమ సంతోషిణులు
(ఐదు మాత్రలు)

నన్నయభట్టు హంసగీతి ఈ ఉత్పలమాల. ఇది దినాంతాన్ని వర్ణిస్తుంది.
శారదరాత్రు లుజ్జ్వల లసత్తర తారకహారపంక్తులన్
జారుతరంబులయ్యె, వికసన్నవ కైరవగంధబంధురో-
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క-
ర్పూర పరాగ పాండురుచిపూరములం బరి(ర)పూరితంబులై
                                                           – నన్నయ, భారతము, అరణ్యపర్వము (4.141)

ఎఱ్ఱాప్రెగడ కోకిలగానము ఈ చంపకమాల. ఇది ఉషఃకాలాన్ని వర్ణిస్తుంది.
స్ఫురదరుణాంశు రాగరుచిఁ బొంపిరివోయి నిరస్త నీరదా-
వరణములై, దళత్కమల వైభవ జృంభణ ముల్లసిల్ల, ను-
ద్ధురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ సెలంగఁగాఁ
గరము వెలింగె వాసరముఖంబులు శారదవేళఁ జూడగన్
                                                           – ఎఱ్ఱాప్రెగడ, భారతము, అరణ్యపర్వము (4.142)
----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, December 25, 2018

తెలుగు సాహిత్యంలో హాస్యపాత్రలు


తెలుగు సాహిత్యంలో హాస్యపాత్రలు




సాహితీమిత్రులారా!

కన్యాశుల్కం నాటకం వచ్చేవరకు తెలుగువాడికి హాయిగా నవ్వుకోవడం తెలియదని మా గురువు డా॥ శ్రీపాద కృష్ణమూర్తి తెగేసి చెప్పారు. అది నిజమే. గిరీశం నించి బైరాగి దాకా అందరికీ గొప్ప వాగ్ధోరణి ఉంది. దాదాపు పదమూడు దశాబ్దాలుగా కన్యాశుల్కం పాత్రలన్నీ తెలుగువాళ్లని నవ్విస్తూ బతికేస్తున్నాయి. అసలు మన వాళ్లు కూడబలుక్కొని విజయనగరం కూడలిలో మధురవాణి శిలా విగ్రహం నిలబెట్టడం తెలుగుజాతి కనీస ధర్మం అన్నాడొక పెద్దమనిషి. కన్యాశుల్కంలో పాత్రలన్నీ లౌక్యంతోనో, ఆగ్రహంతోనో, అమాయకత్వంతోనో ప్రవర్తిస్తూ నాటకాన్ని నడిపిస్తారు. వెంకటేశం… గిరీశం మధ్య జరిగే ఓ సంభాషణను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

‘‘మీ వల్లొచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే…’’ పాఠం ఎప్పుడూ చెప్పని గిరీశానికి చురకేస్తాడు వెంకటేశం.

వెంటనే గిరీశం… ‘‘ఇది బేస్‌ ఆన్గ్రాటిట్యూడ్‌. నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్‌…’’ అంటూ గొప్పగా చెప్పుకుంటాడు.

కాంతం పాత్రని సృష్టించి, కాంతం కథలు రాసిన మునిమాణిక్యం నరసింహారావు, ‘గురజాడది శబ్దాశ్రయ హాస్యం,’ అన్నాడని ఆరుద్ర, ముళ్లపూడి మునిమాణిక్యాన్ని ఏకి పడేశారు. ముళ్లపూడి వెంకటరమణ గిరీశాన్ని చెన్నప్పటం తీసుకొచ్చి సినీ మాయ మీద లెక్చర్లిప్పించి, గరజాడ కీర్తిలో వాటా దండుకున్నారు.

‘‘నేను, శ్రీశ్రీ రోజూ అయిదు నిమిషాలు కన్యాశుల్కం మాట్లాడుకుని ఆనక సొంత విషయానికొస్తాం,’’ అనేవారు ఆరుద్ర. అంటే సంభాషణ చాలావరకు కన్యాశుల్కంలోని సంభాషణలతోనే సాగేదన్నమాట. తరువాత కూడా చాలామంది కన్యాశుల్క ప్రియులు అందులోని మాటల్నే దాఖలు చేసేవారు. ఇప్పటికీ అలాంటివారు అడపాదడపా తగుల్తుంటే ఆశ్చర్యంగా చూస్తుంటాం.

ఆధునిక కాల్పనిక సాహిత్యంలో పుట్టిన హాస్యపాత్రల్ని పరామర్శించే ముందు కాస్త వెనక్కి వెళ్దాం. సృష్టితో పాటు పుట్టిన హాస్య పౌరాణిక పాత్ర నారద మహర్షి. ఆయన తంపులమారి, కలహభోజనుడు. రాక్షసులకి, దేవతలకి, దేవునికి, భక్తునికి, అమ్మవారికి, అయ్యవారికి మధ్య అగ్గి రాజేస్తాడు. అయినా అది చినికి చినికి గాలివానై, లోకకల్యాణానికి దారితీస్తుంది. నారద మహర్షి చాలామందికి గర్వభంగాలు చేయించాడు. సతీ లీలావతికి ఆశ్రయం ఇచ్చి, హిరణ్యకశిపుడికి గర్భశత్రువుతో నరకం చూపించాడు. సత్యభామతో, మీరజాలగలడా, నా యానతి అని నాట్యం చేయించి సత్యవతిని దానంగా స్వీకరించి, చివరకు భలే మంచి చౌకబేరము అంటూ కృష్ణమూర్తిని నడివీధిలో అమ్మకానికి పెట్టాడు. సత్యభామ కన్ను తెరిపిస్తాడు. కృష్ణ తులాభారంలో సూత్రధారి నారద మహర్షి. మన పురాణాల్లో నారదుడు నడిపించిన రక్తి, ముక్తి, భక్తి కలగలసిన కథలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటికీ సూత్రధారి నారుదలవారే. నారదుడంటే హాస్యం. నారదుడంటే విశ్వశాంతి!

మరో హాస్యస్ఫోరక పౌరాణిక పాత్ర వసంతకుడు. కథా నాయకునికి కూరిమి చెలికాడు. నాయికా నాయకుల మధ్య రాయబారం నడుపుతాడు. నాయకుడు సాక్షాత్తూ దేవుడే అయినా గులాబీరెమ్మతో చెమ్కీచెండుతో చిన్న వేటు వేస్తాడు.

రాధాకృష్ణ నాటకంలో ఒక మంచి ఉదాహరణ ఉంది. ఒక సందర్భంలో వసంతకుడు తన బాధను వ్యాకరణంలోకి మార్చుకుని, ‘‘స్వామీ ఉంగరము తాము ధరించి, ముద్దు ఆమె కొసంగి, టుగాగమము మాత్రము నాకు దయచేసితిరి,’’ అని వాపోతాడు. వ్యాకరణరీత్యా ముద్దుGఉంగరము వెరసి ముద్దు టుంగరము అవుతుంది. ఇది చమత్కారంతో సాధించిన సరస శృంగారభరిత హాస్యం. ఇవి పానుగంటివారి పలుకులు. వసంతు కుని నోటి వెంట సందర్భోచితంగా వెలువడి స్వాతిముత్యాలుగా తెలుగువారికి అందాయి.

పానుగంటి సాక్షి వ్యాసాలు అప్పట్లో చాలా ప్రసిద్ధి. అందు లో జంఘాలశాస్త్రి ముఖ్య భూమిక. ఆయన రచనల్లో ‘కంఠా భరణము, వృద్ధవివాహము’ ప్రసిద్ధాలు. సాక్షి వ్యాసాల్లో కాలా చార్యుణ్ణి వర్ణిస్తూ, ‘‘…ఈతని తల పెద్దది. గుండ్రటి కనులుండు టచే, ముక్కు కొంచెం వెనుకాడుటచే, మొగము గుండ్రముగా నుడుటచే నీతడు నరులలో బుల్‌డాగ్‌ జాతిలోనివాడు. ఈతడు మాట్లాడినా మొఱిగినట్లుండును,’’ అని నవ్విస్తారు.

చిలకమర్తి లక్ష్మీనరసింహం గణపతి నవల్లో ఒక మేధకుని పాత్రని సృష్టించారు. గణపతి ప్రహసనంగా రూపొంది గణపతి పాత్ర ప్రాచుర్యంలోకి వచ్చింది. అమాయకత్వాన్ని దాటిపోయి జడ్డితనం కనిపిస్తుంది గణపతి పాత్రలో. నాజూకుతనం ఏమాత్రం లేని మొరటుపాత్రగా, వగరు హాస్యంగా మిగిలింది. భమిడిపాటి కామేశ్వరరావు మోలియార్‌ నాటకాలను తెనిగించారు. ఆయన హాస్యంలో నవ్యత కనిపిస్తుంది. కానీ గుర్తుండిపోయే సజీవ పాత్రలు మనముందు నిలిచి నవ్వించే భాగ్యం లేకపోయింది. మొక్కపాటి నరసింహశాస్త్రి సృష్టించిన బారిష్టర్‌ పార్వతీశం పాత్ర ఇప్పటికీ తెలుగువారి మనోఫలకంపై తారట్లాడుతూనే ఉంది. నిజానికి అవి ఆయన స్వానుభావాలే చాలావరకు. మొక్కపాటి వ్యవసాయశాస్త్రం అభ్యసించడానికి లండన్‌ వెళ్లారు. చివరంతా లేకుండానే తిరిగి వచ్చారు. తన అనుభవాలను కథలు కథలుగా వినిపించి నవ్విస్తుంటే, ఈ నవ్వుల్ని గ్రంథస్తం చేయరాదా అని సాటి కవిమిత్రులు సూచించారు. మొదటి భాగం అలా వచ్చి తెలుగునేలను నవ్వుల్లో ముంచెత్తింది. కొంతకాలానికి పార్వతీశం రెండోభాగం రాశారు. ఇందులో సహజత్వం పాలు తగ్గి కల్పన పాళ్లు ఎక్కువైంది. చాపల్యం నశించక మూడోభాగానికి కంకణం కట్టుకున్నారు. రచయిత పార్వతీశాన్ని పూర్తిగా పూనేశాడు. అందుకే ఎక్కడ ఆరంభించాలో కాదు ఎక్కడ ఆపాలో తెలియాలని విజ్ఞులంటారు.

మళ్లీ ఒక్కసారి వెనక్కి వెళ్తే, తెనాలి రామకృష్ణుడు, ఆయన పేరు మీద వచ్చిన చమత్కార కథలు గుర్తుకు వస్తాయి. వరాన్నీ, శాపాన్నీ ఏకకాలంలో అందుకుని వికటకవిగా వాసికెక్కాడు. ఆయన తెనాలి రామకృష్ణుడని కొందరు, కాదు రామలింగడని కొందరు అంటారు. ఆయన రచనల్లో హాస్యం కనిపించదు. కానీ ఆయన జీవితంలో చాలా హాస్యం వినిపిస్తుంది. ‘కుంజర యూధంబు దోమకుత్తుక జొచ్చెన్‌,’ సమస్యను క్షణ కాలంలో రెండు విధాలుగా పూరించిన ప్రతిభాశాలి. చాలా హాస్య కథలను రామకృష్ణుని పరంగా చెబుతుంటారు. ఆ రోజుల్లో రాజుగారి కొలువులో ఆస్థాన విదూషకులుండేవారు. వారి పని తమ చమ త్కార భాషణతో రాజుని, సభని రంజింపజేయడమే. ఉత్తర భారతంలో బీర్బల్‌ పేరు పలు హాస్యకథల్లో వినిపిస్తుంది. మన జానపద కళారూపాల్లో ఎన్నో హాస్యపాత్రల సృష్టి జరిగింది. ప్రాచీన మైన తోలుబొమ్మలాటలో జుట్టుపోలిగాడు, కేతిగాడు, బంగారక్క తమ సంభాషణలతో నవ్వించడమే కాదు తమకు ఉదారంగా కానుకలివ్వని వారిపై విసుర్లు కూడా వుండేవి. అయితే వారి హాస్య సంభాషణలు విచ్చలవిడిగా ముతకగా ఉండేవి. అయినా ఇప్పటికీ ‘కేతిగాడు’ అనే మాట మనం తరచూ వాడుతూనే వుంటాం. ఇక జానపద కళారూపాలుగా వాటినే నమ్ముకుని జీవించేవారు కొందరుండేవారు. గాంధోళిగాడు, కొమ్మదాసరి, పగటి భాగవతులు, పిట్టలదొర` వీరంతా గడప గడపకూ వచ్చి వినోదపరచి యజమానుల ఆదరణను చూరగొనే వారు.

1950వ దశకంలో ఒక కొత్త తరం రచయితలు వచ్చారు. అప్పటిదాకా పల్లెల్లో తిరుగుతున్న కథలు బస్తీలకు, నగరాలకు వచ్చాయి. ముళ్లపూడి వెంకటరమణ చెన్నపట్నం నేపథ్యంలో దిగువ మధ్యతరగతి జీవితాలను అక్షరచిత్రాలుగా మలిచారు. పైకి వెళ్లాలన్న ఆశ, ఇంకా పడిపోతామేమోననే భయం క్షణక్షణం మధ్యతరగతిని వేధిస్తూ ఉంటుంది. రమణ జనతా ఎక్స్‌ప్రెస్‌ కథలో కథ కంటే పాత్రలే ముఖ్యపాత్ర వహిస్తాయి. పక్కింటి లావుపాటి పిన్నిగారు, రాధాగోపాళాలు, అప్పారావు, ప్రైవేటు మాస్టారు వీళ్లంతా ఒక ఎత్తయితే బుడుగు, సీగాన పెసూనాంబ మరో ఎత్తు. బుడుగు భాషని కూడా ప్రత్యేకంగా తెలుగు చెట్టుకి రమణ అంటుతొక్కారు.

‘బుడుగు’ గమ్మత్తులు కోకొల్లలు. వాటిల్లోంచి ఒకటి… ఇది బుడుగు సొంత బాధ. ‘మాస్టార్లకసలు తెలివుండదు. ఒక మేస్టారేమో కుడివైపు మెలి పెడతాడు. ఇంకొన్నాళ్లకి కొత్త వాడొ స్తాడు కదా? వాడేమో ఎడమవైపు మెలి పెడతాడు. ఇలా అవుతే చెవి పాడైపోదూ? అందుకనీ ఎటేపు మెలిపెట్టాలో కొత్త మేష్టరు ముందుగా పాత మేష్టరును కనుక్కుని రావాలి. లేదా మనలాంటి పెద్ద మనిషినడగాలి. ‘నేనేం చిన్నపిల్లాణ్ని కాదు అంటే అమ్మ వినదు. కుర్రకుంకా అంటుంది. ‘బుడుగు బొబ్బ పోసుకుందు గాని లాఅమ్మ,’ అనీ ‘బువ్వ పెత్తనా బులుగూ’ అని అంతే నాకు ఎంత అవమానం. చెపితే వినరూ…’

ఇక మునిమాణిక్యం వారి ‘కాంతం’ మాటల తూటాలకు మారుపేరు. ఒకరోజు భర్త, ‘మీ చెల్లెలు ఒక కోతి, మీ అక్కయ్య మరో కోతి. తోకలు మాత్రం లేవు,’ అని ఎగతాళి చేస్తే, ‘మీ చెల్లెళ్లకు ఆ లోటు లేదు,’ అని అంటుంది కాంతం తడుము కోకుండా! మరోసారి కాంతాన్ని భర్త పిలిచి, ‘నా కలం కనపడట్లేదు వెతికి పెట్ట,’మంటే… వంటగదిలోంచి, ‘నాకు అట్లకాడ కనిపించ డంలేదు. కాస్త వెతికి పెట్టండ,’ని తిరుగు సమాధానమిస్తుంది. ఇంకోసారి, ‘నేను ఒట్టి తెలివి తక్కువాడిననా నీ అనుమానం,’ అని అడిగిన భర్తతో, ‘అహహ అనుమానమేమీ లేదు. గట్టి నమ్మకం,’ అని బల్లగుద్ది చెబుతుంది. ఇలాంటి సన్నివేశాలెన్నో ‘కాంతం కథల్లో’ మనల్ని నవ్విస్తాయి.

రా.వి.శాస్త్రి తన రచనల్లో పలికిందంతా బంగారం చేశారు. అది హాస్యమా అంటే` చదివేటప్పుడు హాస్యంలానే ఉండేది. తరువాత కంటతడి పెట్టించేవి అందులోని వాక్యాలు, పాత్రలు… అడ్డబుర్ర, రక్తాలు నవ్విస్తూనే వెంటాడే పాత్రలు. ఆరుద్రని ఒక అభిమాని, ‘మీరు ఇన్ని గొప్ప రచనలు చేశారు కాని గుర్తుండి పోయే ఒక పాత్రని కూడా తెలుగువారికి ఇవ్వలేదెందుకని,’ అని అడిగితే, క్షణం కూడా ఆలోచించకుండా, ‘నేనుండగా వేరే పాత్ర లెందుకని ఆ పనిలో తల పెట్టలేదు,’ అని జవాబు చెప్పారట.
-----------------------------------------------------------
రచన: శ్రీరమణ, 
ఈమాట సౌజన్యంతో

Monday, December 24, 2018

తెలుగు సాహిత్యంలో మళ్ళీ క్షీణయుగం మొదలవుతోందా?


తెలుగు సాహిత్యంలో మళ్ళీ క్షీణయుగం మొదలవుతోందా?




సాహితీమిత్రులారా!

32 సంవత్సరాల క్రితం శ్రీ శ్రీ షష్ఠిపూర్తి సందర్భంగా వచ్చిన ఒక కరపత్రం తెలుగు సాహితీ లోకంలో సంచలనం సృష్టించింది. ‘రచయితలారా మీరెటువైపు?’ అని రచయితలనీ, మేధావులనీ నిలదీసి రచయితలు ఎటువైపుండాలో, ఏ విలువలకోసం నిలబడాలో తెలియచెప్పింది. దానితో తెలుగు సాహిత్యంలో ఒక కొత్త యుగం మొదలయ్యింది.

మళ్ళీ ఇన్నాళ్ళకు తెలంగాణ టైగర్స్‌ పేరుతో మరొక కరపత్రం తెలుగు సాహితీ లోకంలో సంచలనం సృష్టిస్తోంది. ‘రచయితలారా ఖబడ్దార్‌’ అని రచయితలనీ, మేధావులనీ బెదిరిస్తోంది. సభ్య ప్రపంచంలో వినబడవనుకున్న మాటలతో స్త్రీవాద రచయితలనూ, వారికి మద్దతునిస్తున్న వారినీ దూషించింది. స్త్రీ పురుష సంబంధాల విషయంలో మనం సాధించామనుకుంటున్న ప్రగతంతా ఒఠ్ఠి భ్రమ మాత్రమేననీ, పురుషాహంకారమే అంతర్లీనంగా మన సాంస్కృతిక లక్షణమనీ ఈ కరపత్రం నిరూపించింది. దీనితో తెలుగు సాహిత్యంలో మళ్ళీ మరొక యుగం మొదలవుతోంది.

ఈ రెండు కరపత్రాల మధ్య కాలంలో తెలుగు సాహిత్యం అనేక మలుపులు తిరిగింది. సాహిత్యం,కళలూ కేవలం వినోదంకోసమే కాదు, అవి సమాజ పురోగమనానికి జరిగే కృషిలో భాగమన్న అవగాహన ఈ కాలంలోనే బలంగా ముందుకొచ్చింది. సాహిత్య ప్రయోజనం సమాజ పురోగమనానికి తోడ్పడడమని అంగీకరిస్తే ఏ కాలంలోనైనా సాహిత్యం ఈ ప్రయోజనాన్ని ఎంతమేరకు నెరవేరుస్తోందని ప్రశ్నించుకోవాలి. ఇటీవల వస్తున్న తెలుగు సాహిత్యం ఆ కర్తవ్యాన్ని ఎంతవరకూ నెరవేరుస్తోందని పరిశీలించడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశ్యం.

ఈ మూడు దశాబ్దాల కాలంలోనే తెలుగు సాహిత్యం ఆణిముత్యాలవంటి ఎన్నో రచనలను మనకందించింది. రావి శాస్త్రి, కాళీపట్నం, చెరబండ రాజు, గద్దర్‌ లతో మదలైన ఈ స్రవంతి కొండేపూడి నిర్మల, వోల్గా, సతీష్‌ చందర్‌, ఎండ్లూరి సుధాకర్‌ వంటి బలమైన కొత్త గొంతుకలతో కలిసి మనం గర్వించతగ్గ గొప్ప జీవధారని మన ముందుంచింది.

జీవితంలో నిశ్చలమనుకున్న విలువలూ పద్ధతులూ మన కళ్ళముందు సమూలంగా మారిపోయాయి. మౌలిక విషయాల్లోకి వెళ్ళి పునాదులని కదిల్చే విధంగా కొన్ని ప్రశ్నలు మనముందుకొచ్చాయి. శ్రీ శ్రీ చెప్పిన విధంగా అణగారిన ఆర్తులందరూచారిత్రక యదార్థ తత్వాన్ని ఒక గొంతుకతో చాటించడం మొదలుపెట్టారు.

స్త్రీవాద దళితవాద ఉద్యమాలు అంతకుముందు అభ్యుదయ విప్లవ సాహిత్యాలు భుజాన వేసుకున్న ఈ కర్తవ్యాన్ని మరింత దీక్షగా ముందుకు తీసుకుపోయాయి. బెల్చీ నుంచి చుండూరు దాకా, రూప్‌ కన్వర్‌ నుంచి దాదర్‌ ఎక్స్ప్రెస్‌ దాకా, ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా దానికి స్పందించి రాయ వలిసిన అవసరాన్ని సాహిత్యకారులు గుర్తించారు. దానితో సాహిత్యం నిత్య జీవితంలో మునుపెన్నడూ లేనంతగా భాగమయ్యింది. దినపత్రికల్లో సైతం సాహిత్యమొక అనివార్య అంశమయ్యింది.

ఈ మూడు దశాబ్దాల చరిత్రనొకసారి తలుచుకుంటే ఈ కాలంలోనే సాహిత్యం సమాజంలో నిర్వర్తించాల్సిన పాత్ర గురించి లోతైన పరిశీలన జరిగి నిండైన అవగాహన ఏర్పడింది. తెలుగు సాహిత్య విమర్శా, విశ్లేషణా కూడా ఈ కాలంలోనే బాగా పదునుదేరాయి. ఒక పెద్ద కెరటం అంతకు ముందు వచ్చిన చిన్న కెరటాలనన్నిటినీ తనలో కలుపుకు ముందుకుపోయినట్లే, అంతకుముందునుంచీ వస్తున్న సాహిత్య వారసత్వాన్నంతా తనలో ఇముడ్చుకున్న తెలుగు సాహిత్యం ఈ కాలంలో ఒక బలమైన సాంఘిక శక్తిగా పరిణమించింది.

అయితే రాను రాను తెలుగు వాళ్ళ సాహిత్యం వెర్రి తలలు వేస్తోందా అనిపిస్తోంది. అయిదు సంవత్సరాల క్రితం వరకూ వచ్చిన కొత్త ధోరణులన్నీ ఏదో ఒక కారణం వల్ల తగ్గు ముఖం పట్టినట్లనిపిస్తోంది. రచయితల పరిధి పెరగడానికి బదులు రోజు రోజుకీ కుంచించుకు పోతున్నట్లనిపిస్తోంది. రాజకీయాల్లో వచ్చినట్లే రచయితల్లోకూడా రకరకాల చీలికలు వచ్చి ఎవరికి వారు చిన్న చిన్న వలయాల్లో తిరుగాడుతున్నారు. రచయితలు తమ రచనల వల్ల కాక రక రకాల వివాదాల వల్ల గుర్తింపు పొందుతున్నారు.వివాదాలని పెంచి పోషించేందుకే కొన్ని పత్రికలు పని చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు రకరకాల ఉద్యమాలలో ముందు వరసలో నిలబడిన రచయితలిప్పుడు ఈ వివాదాల ద్వారా మాత్రమే తమ ఉనికిని నిలబెట్టుకోవడం విచారకరం.

ఉద్యమాలు వెనకబడినా వాటి ప్రభావం సాహిత్యం మీద నిలిచి ఉంటుందనుకున్న వారికి నిరాశే మిగిలింది. ఇప్పుడు వస్తున్న సాహిత్యం ఎక్కువగా సైద్ధాంతిక గందరగోళాన్నీ, ఒక రకమైన దారితప్పిన అరాచకత్వాన్నీ ప్రతిఫలిస్తోంది. కష్టజీవికిరువైపులా నిలబడవలసిన కవి ఇప్పుడు మనని మళ్ళీ పాత రాతి యుగపు అంధకారంలోకి తీసుకెడుతున్నాడు. వ్యక్తీకరణలో వైచిత్రికీ, వస్తువులో సంక్లిష్టతకీ, అస్పష్టతకీ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి కవి ప్రజలనుంచి దూరమవుతున్నాడు.

గత పది పదిహేనేళ్ళ కాలంలో మధ్య తరగతి జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. గ్లోబలైజేషన్‌ ప్రభావం ముఖ్యంగా నగరాల్లో పట్టణాల్లో నివసించే మధ్య తరగతి కుటుంబాలమీద ఎక్కువగా పడింది. ఇవన్నీ ఇటీవల వస్తున్న కథల్లోనూ, కవితల్లోనూ ప్రతిఫలిస్తున్నాయి. అయితే స్వాతంత్య్రం వచ్చాక వచ్చిన మార్పులని కొడవటిగంటి, కాళీపట్నం వంటి రచయితలు విశ్లేషించినంత నిశితంగా ఇప్పుడు వస్తున్న మార్పులని ఇప్పటి రచయితలు విశ్లేషించలేకపోతున్నారు. ఇప్పటి రచయితలు ప్రతిభలో కొ. కు., కా.రా. ల కేమాత్రం తీసిపోరు. మరెందువల్ల ఈ తేడా కనబడుతోందని ప్రశ్నించుకుంటే ఒకటే సమాధానం దొరుకుతుంది. అప్పుడు వాళ్ళ వెనక ఒక బలమైన ఉద్యమం, ఒక సంస్థ ఉండేవి. ఇప్పుడవి లేవు.

పైన చెప్పిన రెండవ కరపత్రం ప్రస్తుత సాహిత్య లోకాన్ని పట్టి పీడిస్తున్న దారుణ క్షయ వ్యాధికి నిదర్శనం. ఎవరో అనామకులు రాసిన కరపత్రమైతే దాన్నొక కలుపుమొక్కకింద కొట్టిపారెయ్యొచ్చు. కానీ దీన్ని రాసినట్లుగా చెప్పబడుతున్న రచయితలందరూ లబ్ధప్రతిష్ఠులే. కొద్దో గొప్పో ప్రగతివాద ముద్ర ఉన్న వారే. ఇందులో వాడినవి కేవలం అసభ్య పదజాలంతో కూడిన దుర్భాషలే ఐతే అది వాళ్ళలో మిగిలి ఉన్న భూస్వామ్య సంస్కృతి అవశేషాలని సరిపెట్టుకోవచ్చు. కానీ, అందులో వాళ్ళు చిత్రించిన లైంగిక హింస కానీ, మానవ సంబంధాల విషయంలో వాళ్ళు సూచనప్రాయంగా చెప్పిన సంగతులుగానీ చూస్తే ఇది కేవలం మేధావులలో పెరుగుతున్న పతనావస్థ మాత్రమే కాదు, అత్యంత విచారకరమైన సాంస్కృతిక తిరోగమనానికి ఇది నాందిఅనుకోవలసి వస్తుంది. దురదృష్టమేవిటంటే ఇటీవల ఆంధ్ర భూమి పత్రికలో వచ్చిన ‘సామ్యవాద వటవృక్షం కూలిన వేళ ’ అన్న వ్యాసాన్నిబట్టి చూస్తే ఈ కరపత్ర రచయితలకి మన ‘మేధావి’ వర్గంలో గట్టి మద్దతే ఉన్నట్లుంది.

తెలంగాణా ఉద్యమం ఇవాళ ఇటువంటి దుర్మార్గపు చర్యలకు సాకుగా పనికిరావడం విచారకరం. ఇదే ధోరణి ఇటీవల వస్తున్న సాహిత్యంలో కూడా ప్రతిఫలించడం గమనార్హం. ఈ మధ్య ఆంధ్ర ప్రభ వార పత్రికలో వచ్చిన‘రాజయ్య రాకపోయె’ కథ చూస్తే అందులో తెలంగాణా ఉద్యమ నేపథ్యాన్ని స్త్రీ వ్యతిరేకతని చాటడానికి సాకుగా వాడడం జరిగింది. ఈ కథా రచయిత కూడా కథకుడిగా కొంత పేరున్న వాడే. ఇతని కథలు ఉన్నతమైన సాహితీ విలువలని ప్రతిపాదించే ప్రజా సాహితి వంటి పత్రికల్లో సైతంఅచ్చయ్యాయి.

అలాగే ఇటీవల వార్త పత్రికలో ‘గయ్యాలి గంప’ పేరుతో ఒక కవిత వచ్చింది. దీన్ని రాసిన కవి పేరు ప్రచురించలేదుగానీ, ఇందులో కూడా స్త్రీలను అవమాన పరిచే విధంగా వర్ణన జరిగింది. ‘నా బాస తెల్వలేక తిమ్మిరయ్యె తైతక్క’ అన్న పంక్తినిబట్టి ఇదికూడా ‘రాజయ్య రాకపోయె’ ఒరవడిలోనే వచ్చిందనుకోవాలి. బహుశా 3040 సంవత్సరాలక్రితం ఇటువంటి కవిత వస్తే అంత ఆశ్చర్యపడవలసిన పనిలేదు. కానీ, స్త్రీవాద ఉద్యమం బలంగా స్థాపించిన విలువల నేపథ్యంలో స్త్రీలను ఎగతాళి చేసే ఇటువంటి కవిత ఆశ్చర్యాన్నే కాక బాధని కూడా కలిగిస్తోంది.

సరైన అవగాహన లేకపోవడం వల్లనో, పరిస్థితులను సరిగ్గా అధ్యయనం చేసే ఓపికలేకో, చాలా మంది రచయితలు ప్రపంచంలో వస్తున్న పరిణామాలను సాహిత్యంలో సరిగ్గా ప్రతిఫలించలేకపోతున్నారు. ఒకప్పుడు లోతైన పరిశీలనా, అవగాహనా చూపిస్తూ శక్తివంతమైన రచనలు చేసిన ఎందరో రచయితలు ఇప్పుడు నిరుత్సాహకరమైన కథలూ కవితలూ రాస్తున్నారు. దూరదర్శన్లో వచ్చే సర్కారీ సాహిత్యానికేమాత్రం తీసిపోని విధంగా కార్గిల్‌ యుద్ధం గురించీ, ప్రపంచీకరణగురించీ రాస్తున్నారు. ముఖ్యంగా మతోన్మాదం గురించీ, స్త్రీల సమస్యల గురించీ ఇటీవల వస్తున్న రచనలు కొన్ని మనని కనీసం 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెడుతున్నాయి.

గుజరాత్‌ లో సమాజం సిగ్గు పడాల్సిన విధంగామనుష్యులని ఊచకోత కోస్తే ఆ విషయం మన సాహిత్యంలో దాదాపు ప్రతిఫలించనే లేదు. శివా రెడ్డివలీ గుజరాతీ మీద రాసిన ‘అమర్య్తం’ కవితని మినహాయిస్తే నాకు కనబడినంత వరకూ తెలుగు సాహిత్యంలో గుజరాత్‌ అల్లర్ల ప్రస్తావనే రాలేదు. ఉద్యమాల ప్రభావం అంతగా లేని ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి వచ్చిన ‘కౌసర్‌ బానో కీ అజన్మీ బేటీ ’ వంటి కవిత తెలుగులో రాకపోవడం విచారకరం.

ఇతర సమస్యల మీద కూడా ఇటీవల వస్తున్న రచనలలో ఉండవలసిన పదునుగానీ నిజాయితీగానీ కనబడడంలేదు. కొద్దో గొప్పో నిబద్ధత ఉన్న రచయితలు సైతం విషయాన్ని ఛాయామాత్రంగా స్పృశిస్తూ చవకబారు తెలుగు సినిమాల్లోకనిపించే విధంగా అసహజమైన పరిష్కారాలను చూబిస్తున్నారు. లేకపోతే ఉద్యమాల వైఫల్యాలను అసమగ్రమైన అవగాహనతో చిత్రించి తమలో ఉన్న నిరాశని నడుస్తున్న చరిత్రకంటగడుతున్నారు.

ఈ తిరోగమనానికి తగ్గట్లుగా తెలుగు సాహిత్యానికి మునుపున్న విధంగా పత్రికల్లో ఆదరణ లభించడం లేదు. ఒకప్పుడు కనీసం నాలుగు మాస పత్రికలూ, ఏడో ఎనిమిదో వార పత్రికలూ, నాలుగు దినపత్రికలూ సాహిత్యానికి ప్రాముఖ్యాన్నిచ్చేవి. ఈ mainstreamపత్రికలే కాకుండా కేవలం సాహిత్యం కోసమే నడిచే పత్రికలూ, ఉద్యమాల నేపథ్యంలో వచ్చిన కొన్ని రాజకీయ పత్రికలూ ఉండేవి. రచయితలకి తమ రచనలు ప్రచురించుకోవడానికి బోలెడన్ని అవకాశాలుండేవి. ఇప్పుడు భారతి, యువ వంటి పాత తరం పత్రికలే కాకజ్యోతి, ఆంధ్ర జ్యోతి, ఉదయం వంటి పత్రికలు కూడా మూత పడ్డాయి. ఇంకా నడుస్తున్న ఆంధ్ర ప్రభ వంటి పత్రికల్లో కూడా ఇదివరకు కనిపించే మంచి సాహిత్యం ఇప్పుడు కనిపించడం లేదు. ఈ ఖాళీని ఇటీవల వస్తున్న internet పత్రికలు కొంతవరకూ పూరిస్తున్నా వీటి పరిథి బహుకొద్దిమంది పాఠకులకే పరిమితమవుతోంది. ఈ మాధ్యమం తెలుగు పాఠకలోకానికింకా అందుబాటులో లేకపోవడంతో మంచి సాహిత్యాన్ని నిలుపుకోవడంలో ఈ పత్రికల పాత్ర ప్రస్తుతానికి తక్కువే.

ఇప్పుడొస్తున్న సాహిత్యంలో కొన్ని మంచి రచనలు లేకపోలేదు. వస్తువు విషయంలో గానీ, వ్యక్తీకరణలో గానీ, తెలుగు రచయితలు ఇదివరకటికన్నా గాఢతనూ, పరిపక్వతనూ సాధించారు. మూస పోసినట్లు కాకుండా భిన్న కోణాల్లోంచి జీవితాన్ని చూడడం చూపించడం ఇటీవలి రచనలలోనే ఎక్కువ కనబడుతోంది. Post Modernism , magic realismవంటి ధోరణుల ప్రభావం తెలుగు సాహిత్యం మీద కొంత మేరకు పడి మనకు కొంత మంచి సాహిత్యాన్నిచ్చింది. అలాగే వ్యక్తిగత అనుభవాలనూ, అనుభూతులనూ కథల్లోనూ కవిత్వంలోనూ బలంగా చిత్రించడం ఇటీవల బాగా ఎక్కువగా కనబడుతున్న పరిణామం. అనుభూతివాదులు ఎప్పట్నుంచో ఈ ధోరణిలో రాస్తున్నా, 90వ దశకం వచ్చే వరకూ దానికి తగినంత గుర్తింపులేదు. వైయక్తిక అనుభవాలను తమ సిద్ధాంతాలకు వాహకంగా దళిత స్త్రీవాద సాహిత్యకారులు వాడడం వల్ల వాళ్ళ సాహిత్యంలో ఒక గాఢత, ఒక చిక్కదనం కనబడ్డాయి. అందువల్లే ఇవాళ ఈ తరహా సాహిత్యానికి ఒక కొత్త ప్రాముఖ్యత ఉంది.

అయితే సామాజిక ఆచరణలో ఒక భాగంగా సాహిత్యాన్ని పరిశీలిస్తే ప్రస్తుత తెలుగు సాహిత్య రంగం ప్రస్తుత రాజకీయ రంగం లాగే అగమ్యగోచరంగా కనబడుతోంది. ఇప్పుడొస్తున్న తెలుగు సాహిత్యమంతా ఒక విధమైన cynical నిరాశతో నిండి ఉంది. ఎక్కడో ఒక చోట కొంత ఆచరణశీలమైన సాహిత్యం వచ్చినా, అది రకరకాల వత్తిడులకు గురయి మౌలికమైన చోదక శక్తిని కోల్పోతోంది.

ఇవాళ ఒక కథా సంకలనం కానీ కవితా సంకలనం కానీ వస్తే అందరూ ముందు చూసేది అందులో మంచి కథలు గానీ కవితలు గానీ వచ్చాయా అని కాదు. అందులో దళిత కథలెన్ని, తెలంగాణా కవితలెన్ని, వగైరా లెక్కలు కట్టడం ముఖ్యమైన విషయమైపోతోంది. ఎవరైనా ‘చుట్టూరా ఉన్న చీకటిని తిడుతూ కూచునే బదులు ఒక చిన్న దీపాన్ని వెలిగిద్దామని’ ప్రయత్నిస్తే వాళ్ళ నిజాయితీని శంకిస్తూ వాళ్ళ వెనక ఏవో నిగూఢమైన ఉద్దేశ్యాలున్నాయని అంటగడుతున్నారు. ఏటేటా కథా సంకలనాలని ఎంతో ఓర్పుతో తీసుకొస్తున్న నవీన్‌, శివశంకర్‌ వంటి వాళ్ళకు సైతం ఇటువంటి ఇబ్బందులు తప్పడంలేదు.

ఇదే క్షీణయుగం లక్షణమైతే మన సాహిత్యంలో మళ్ళీ క్షీణయుగం వస్తున్నట్లే. ఈ క్షీణయుగంలోంచి బయటికి తీసుకెళ్ళే renaissanceరావాలంటే మళ్ళీ ఎలాంటి ఉపద్రవం రావాలో. ఎన్ని కరపత్రాలు రావాలో.
----------------------------------------------------------
రచన: నందివాడ ఉదయ భాస్కర్, 
ఈమాట సౌజన్యంతో