Saturday, September 30, 2017

రైలుబండిలో వైతాళికులు - 5


రైలుబండిలో వైతాళికులు - 5




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........


"పతితులార 

భ్రష్టులార

దగాపడిన తమ్ములార

ఏడవకండేడవకండి

వచ్చేశాయ్, విచ్చేశాయ్

జగన్నాథ

జగన్నాథ

జగన్నాథ రథచక్రాల్

వచ్చేశాయ్, విచ్చేశాయ్......"

                        అని శ్రీశ్రీ కంఠం రైలు పెట్టి మార్మోగింది.

    అంతా బిక్కు బిక్కుమంటూ నిశ్శబ్దంగా చూస్తున్నారు.

    "ఏమిటయ్యా - మా టికెట్లుగాని నీ జేబులో వున్నాయా? 
      అంతలా భరోసా యిస్తున్నావ్ " 
      అని సూటిగా అడిగారు విశ్వనాథ.

    "ఇతరేతర కారణాల వల్ల నేనేమీ చెప్పదల్చుకోలేదు"
      ముక్తసిరిగా అన్నారు శ్రీశ్రీ-

    టి.టి.ఇ. మాత్రం గేటు వైపు జారుకున్న గణపతిశాస్త్రిగారిని నిలదీశాడు.

    టికెట్ కోసం చెయ్యి జాపగానే - టికెట్లవాడి అరచెయ్యి సాగదీసి నవ్వబోతూ 
"అరెరె... వండర్ ఫుల్...ఇది చెయ్యి కాదు...అయ్యా తమరు నమ్మాలి - నేను తిరిగొచ్చేప్పటికి మీరిక్కడ వుండరు.. ఆ రేఖ మహత్యం అలాంటిది"- గణపతిశాస్త్రి గారు లౌక్యానికి టి.టి.ఇ.పడిపోయాడు. కొంచెం సిగ్గుపడి చెయయి వినయంగా అందించాడు. శాస్త్రిగారు ఏకధాటిగా వున్నవీ లేనివీ చెప్పి టికెట్ గండం తప్పుకున్నారు.

    శ్రీశ్రీ వంతు వచ్చింది. టికెట్ లేదు. పైగా అందరికీ భరోసా ఇవ్వడం కూడాను. ఇదంతా గమనించి -

    "ఎవరు మీరు?" అన్నాడు టి.టి.ఇ.వాడు.

    "భూతాన్ని

    యజ్ఞోపవీతాన్ని

    వైప్లవ గీతాన్ని నేను -"

    "కవిత్వంలో దేనికి? తెలుగులో చెప్పరాదుటయ్యా? అన్నారెవరో.

    "నేను శ్రీశ్రీని. ఈశతాబ్దం నాది"

     "కావచ్చు. కాని ఈ రైలు శ్రీ సర్కారువారిది" -  అన్నాడు టి.టి.ఇ.

     "మొన్నటి దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపింది. ఇప్పుడు దాన్ని నేను నడుపుతున్నాను......"

     "అవచ్చు. కాని ఈ రైళ్లని ఇండియన్ రైల్వేస్ వారు నడుపుతున్నారు"

    ఔను నిజం, ఔను సుమా నీవన్నది నిజం నిజం

        అనేసి సీటుమీద కూచుని, నిట్టూర్చి మళ్లీ హరీస్ఛట్టో లోకి వెళ్ళిపోయారు.

    తనంతట తానే ఎదురుపడి "నేనేమోనూ...సారీ. ఐ యామ్ మిస్టర్ నరసింహశాస్త్రి మొక్కపాటి ఆఫ మొగల్తూర్ - ఆథర్ ఆఫ్ బారిష్టర్ పార్వతీశం దిగ్రేట్.... "అని టి.టి.ఇ.కి ఘ్టిగా షేక్ హ్యాండిచ్చి పరిచయం చేసుకున్నారు.
    
     "తర్వాణి అన్నం, ఆవకాయ, మంచినీళ్ళు, మరచెంబు పంటి కిందికి వుంటాయని మామిడి తాండ్ర, జంతికలూ తెచ్చుకున్నాను. బట్ టికెట్ ఫర్గాటెన్..."

(శ్రీరమణ పేరడీలు నుండి...........)

Friday, September 29, 2017

రైలుబండిలో వైతాళికులు - 4


రైలుబండిలో వైతాళికులు - 4




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి........



విశ్వనాథకి చెయ్యి జాపి-

      "టికెట్ సార్...."

       "లేదు"

         "లేదా... ఇందాక ఎక్కడో వుందన్నారు?"

           "ఔను. అంటాను.

              అల నన్నయకు లేదు తిక్కనకు లేదు"

   "వాళ్ల సంగతి సర్లెండి. మీ సంగతి చెప్పండి.. పైగా మీరెవరో పెద్దమనిషిలా వున్నారు...."

వి.స.గారు వాని వంక విసవిసా చూసి

"నన్ను నెఱుగరో తెలుగునాట మీరు
విశ్వనాథ కులాంబోధి విధుని బహు వి
చిత్ర చిత్ర ధ్వని బహువిచ్ఛిత్తి మన్మ
హాకృతి ప్రణేత సత్యనారాయణ కవి-"

అని కంఠమెత్తి పాడారు.

      "పదగుంఫన మమోఘము....." అని వాఖ్యానించారెవరో - బహుశా కాటూరి వారే కావచ్చు.

   టి.టి.ఇ. అందుకేమీ రియాక్ట్ కాలేదు.

   పక్కన నిలబడండి అన్నట్టు సైగచేసి కాటూరి వారిని సమీపించాడు

   కాటూరి వారు మౌనంగా పింగళి వారిని చూపించారు

   "ఇదేం పద్ధతిగా లేదు. ఎంత జంటకవులమైనా, జవాబు కలుసే చెప్పాలా ఏమిటి?  ఈ క్లిష్టసమయంలో నా మీద భారం మోపకండి... మీరే చెప్పండి ఆ సంజాయిషీ ఏదో....."
చుట్ట తియ్యకుండా "ఉహు....ఉహు. ..."అనడం తప్ప కాటూరి వారి జవాబు లేదు.

    టి.టి.ఇ.కి ఇదేదో ఓ ముఠా అనీ, టికెట్ లేని ట్రావెలర్స్ అని అర్థమైపోయింది-

     అసలే లాలిత్యం - ఆపైన భయం - బాపిబావ మెలికలు తిరిగి పోతున్నారు - పక్కన నిలబడి.

    "టికెట్ ప్లీజ్...." అనగానే బాపిరాజు నీటి చిమ్మెన ఒక్కతూరి పైకెగసినట్టు ఇట్లు ఆరంభించిరి-

    "బెజవాడ నుండి కాకినాడ పోర్టు స్టేషనుకు టికెట్టు కొని యుంటిని..
నేను రూపాయి నాణెము ఇవ్వగా టిక్కెట్టుయున్నూ మూడణాలన్నర తిరిగి ఇచ్చినాడు. అతడిచ్చిన టిక్కెట్టు రెండంగుళముల మువ్వీసము పొడవు, అంగుళము బైన ఆరువీసముల వెడల్పూ, రెండు నూళ్ల మందమునూ, అరతులము బరువున్నూ కలిగి యుండెను. దానిపై ఏడు అంకెయు, దానికి ముందు రెండు సున్న వున్నవి. మొదటి అంకె అయిదు తదుపరి నాలుగు వున్నది. తెలుపు పసుపు కలివేత వర్ణములో కుడి అంచు పై భాగమున నల్లని చార కలిగియుండెను. చీనా దేశములో జలవర్ణ చిత్రములను ఇదే కొలతలు గల ఫలకములపై చిత్రించు నాచారము కలదు. ఇట్టి వానిని మినియేచరు చిత్రకళ అని వ్యవహరింతురు...."

   "మహాప్రభో! నన్ను వదిలెయ్యండి" అని గావుకేక పెట్టి టి.టి.ఇ. అవతలి వైపుకి నిష్క్రమించినాడు.

   "నీ శైలికి గొంత శక్తియున్నది"- అని విశ్వనాథ బాపిబావని అభినందించిరి.

   "రేపు సాహితీ సమితి సమావేశంలో - మన సభ్యులకు రైళ్లలో, బస్సులో, లాంచీలో, రేవు పడవలో టికెట్ కొనే అగత్యం వుండరాదని ఒక తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదింపజేసి. వాటి నకళ్లు తీసి సర్కారు వారికి సమర్పిస్తాను...." సభాపతి హోదాలో హుకుం జారీ చేశారు శివశంకరస్వామి.

   "రేపటి సంగతి సరే... ఇప్పటి మాటేమిటి?"

   "అసలింతకీ మన రుక్మీనాథం ఏమైపోయినట్టు..."

   టి.టి.ఇ. వచ్చే స్టేషన్ లో దిగిపోవాలని నిష్కర్షగా చెప్పేశాడు.

   అంతా గందర గోళంగా వుంది - కవులలో కలకలం.

   "కర్మఫలము అట్లున్నపుడు ఒక యూరి కరణము మరియొక ఊరి కాపు కాక తప్పదు. మనము రుక్మిణీనాథమును నమ్మితిమి. మనిషి మనిషిని నమ్మును. లేనిచో మానుని నమ్మునా? నమ్మడు. నమ్మక మనగానేమి? అది యొక మానసిక ప్రవృత్తి నమ్మకము 
వేరు. విశ్వాసము వేరు. సమాజము - అనగా మనుషుల గుంపు. ఇందు కొందరు అంజనీ బుత్రులు కొందరు ఆషాడభూతులు. అతడు నమ్మిన బంటు. ఈతడు కాదు. అది మనకు తొలుతగా తెలియునా తెలియును. తెలియదు. ఇదియొక చమత్కారము........."

    "చస్తుంటే సంధ్యమంత్రమని - నడుమ మీ మధ్యాక్కరలా..."
అని పింగళివారు వారించారు.

(శ్రీరమణ పేరడీలు నుండి .............)

Thursday, September 28, 2017

రైలుబండిలో వైతాళికులు - 3


రైలుబండిలో వైతాళికులు - 3




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.........

        ఉన్నట్టుండి కమ్మని అత్తరు వాసన గుప్పున తగిలింది. అందరూ
ముక్కుపుటాలెగరేసి పైకి చూశారు

     అప్పర్ బెర్త్ మీద కూచున్న కృష్ణశాస్త్రి గారు అత్తరులో దూది తడిపి వైనంగా టిక్కెట్లకి రాస్తున్నారు - ఎంకిపాట హమ్ చేస్తూ.

అది గమనించిన విశ్వనాథ నవ్వు ఆపుకుని - "అన్నట్టు మన టిక్కెట్లెక్కడ" - అన్నారు.

    "రుక్మిణీనాథం దగ్గర వుంటాయ్"- అన్నారు కాటూరి వారు చాలా నిర్లక్ష్యంగా చుట్టనోటితో -

    "ఉంటాయ్ - అని వూహించడం కాదు - వున్నవా? - అది ముఖ్యం - అడుగో రంకు మొగుడల్లే టిక్కెట్లవాడు రానే వస్తున్నాడు".

    ఇంతలో టి.టి.ఇ. "టికెట్ సార్ టికెట్" అంటూ వచ్చాడు.

     "మాటలోనే వచ్చారు....వెయ్యేళ్లు..మా రుక్మీణినాథం దగ్గర వున్నాయి."

     "ఆయనెక్కడ.."

     "ఇప్పటిదాకా ఇక్కడే వున్నారండీ..ఇప్పుడే వస్తాడు.".శి.శి.స్వామి వారికి కోపం ఇంకా తగ్గలేదు.

     అప్పర్ బెర్త్ మీద కూచున్న కృష్ణశాస్త్రి గారిని "సార్ మీరు దిగిరండి. 
టికెట్ ప్లీజ్.. "అన్నాడు.

దిగిరాను దిగి రాను

దివి నుంచి భువికి

దింపి వేతురు గాక

నాకేటి వెరపు -

ఆన్నారు కృష్ణశాస్త్రి గంభీరంగా -

   ఏమీ అర్థంగాని టిక్కెట్లవాడు "తమరెవరు? ఎక్కడికి వెళ్ళాలి?" అన్నాడు
టిక్కెట్ల కోసం చెయ్యి జాపి.

   నా నివాసమ్ము తొలుత గంధర్వలోక

   మధుర సుషమా సుధాగాన మంజువాటి

   ఏ నొక వియోగ గీతిక.

   అనగా విని, కాలము వ్యర్థపుచ్చ నిచ్చగించక. టిక్కెట్లందుకొనుచు
ఆ కవికి టి.టి.ఇ. నిట్లనియె
-
   "టికెట్ ప్లీజ్"
   
   కృష్ణశాస్త్రి గారు చహల్ తో లాల్చీ జేబులో చెయ్యిపెట్టి ఘుమ ఘుమ
లాడుతున్న రెండు టికెట్లని అందించారు. టి.టి.ఇ. ముక్కులెగరేసి అదోలా ఆయన వంక ఓసారి చూసి-
    "ఈ రెండో టికెట్ ఎవరిది" అన్నాడు

   " నా ఊర్వశికి..."

    "వేరీజ్ షీ...."

    "ఎదలోపలి యెదలో, నెమ్మదిలో, జీవిత రహస్యమార్గమ్ములలో"
    .........

    కింద నున్న కురుమెళ్ల వెంకట్రావు గారు గురువుగారి హటం చూసి
కంగారు పడ్తున్నారు. దిగిరండి అంటే దిగిరాను అంటున్నారు. ఆయనకి అంతా అయోమయంగా ఉంది.

    సంధ్యవసాన
    సమయమున నీప సాదప శాఖికాగ్ర
    పత్ర కుటిలముల లోపల వసించు
    ఇరుల గుసగుసల్ వానిలో నిపుడునపుడు..

     టి.టి.ఇ. అయోమయంలో పడి "అయ్యా ఏమిటి వారనేది" అని కురుమెళ్ల వారిని అడిగారు.
    "...ఏదియొ అపూర్వ మధుర
     రక్తి స్ఫురియించుగాని అర్థమ్ము కాని
     భావగీతమ్ములవి....-"

     అని కురుమెళ్లవారు సమర్థించి చెప్పారు. ఆ రెండో టికెట్టు నా కోసం తీసుకున్నారని కూడా నచ్చ చెప్పారు. పొయిట్రీ వదిలేసి లెఖ్ఖ సరిపెట్టుకున్నాడు టి.టి.ఇ.
    
      "...కాదు..కాదు. ఇతనికి కాదు... ఇది నా ఊర్వశికే

            నిదురలో స్వప్నాల కదలికే బరువైన

            కలలెల్ల కనులిచ్చి కాల్చు నా గతియేమి!"
   
     అని దేవులపల్లి వాదిస్తే-

     "అయ్యా... మధ్యలో దింపేస్తే నా గతి ఏమిటో ఆలోచించండి" ప్రాధేయ పూర్వకంగా వారించారు వెంకట్రావుగారు.

     టిక్కెట్లవాడు ఇదంతా గమనించి దేవులపల్లి వంక జాలిగా చూసి వూరుకున్నాడు.   


(శ్రీరమణ పేరడీలు నుండి........)

Wednesday, September 27, 2017

రైలుబండిలో వైతాళికులు - 2


రైలుబండిలో వైతాళికులు - 2




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.........


   గంభీర వాతావరణం ఆవరించింది. రైలు పెట్టెలో పరిస్థితి గమనించిన పిలకా గణపతి శాస్త్రి గారు - వున్నట్టుండి ఒక్కసారి కళ్లు పెద్దవి చేసి బోలెడు ఆశ్చర్యం నటిస్తూ.........
    
   "ఆహా... ఏమి బిస... ఏమి బిస.... ఆ యొక్క రాక్షసబొగ్గుతో ఇంతమందినీ లాక్కుని ఈ విధంగా ఛుకు....ఛుకు...ఛుకు మని అలుపూ సొలుపూ లేకుండా పరుగెత్తడం వుంది చూశారూ... అరెరెరె... ఏమాశ్చర్యం...... ?"అని అందరివైపు నోరు తెరచి చూశారు.


    అప్పుడే వస్తున్న జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ఆశ్చర్యప్రకరణమంతా విని-

"మనవాళ్ళు మామూలు తోటకూర తిని మహాకావ్యాలు రాసేస్తుండగా లేంది- బొగ్గుతో రైలు నడవడంలో ఆశ్చర్యం ఏముంది లెండి.." అన్నారు సౌమ్యంగా ఉత్తరీయాలు వున్నవాళ్లూ, లేనివాళ్లూ కూడా ఒక్కసారి బుజాల మీద చేతులు వేసుకున్నారు.

    తల్లావఝుల శివశంకరస్వామి నీటుగా సింగిల్ సీటు మీద రైల్లో కూడా నేను సభాపతినే అన్నట్టు కూర్చున్నారు ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న భంగిమలో...

    జలసూత్రం ఓ క్షణం ఆగి "రైలు పట్టాల్ని చూస్తుంటే మా సభాపతిగా గారి కవిత్వం జ్ఞాపకమొస్తుంది. నాకు - అడ్డంగా వేసిన బద్దీలు నిక్కచ్చిగా కొలిచి తూచి వేసినట్టుంటే ఆయన పద్యపాదాల్లాగూ, క్రమంగా  వుంటాయి. ప్రతి ఎనిమిదింటికీ దూరం తగ్గించి కాస్తంత దగ్గరగా నాలుగు బద్దీలుంటాయి చూశారూ - సీసపద్యం కింద ఎత్తుగీతి లాగు - సమాసాల కంకరరాళ్లు సరేసరి - అటూ ఇటూ కొలిచి కొట్టిన మార్జిన్లు లాగు ఇనుప కమ్మీలు.. స్వామి వారి పద్యాలని తెచ్చి పొడుగ్గా పేర్చుకుంటూపోతే రైలు పట్టాలే సుమండీ... "అనేసి మెరుపులా మాయమైపోయారు.

    "ఉపమ బేషుగ్గా వుంది..." అని ముక్తకంఠంతో అక్కడ వున్న వారందరికీ అనాలనిపించింది. కాని తమాయించుకున్నారు.

    శివశంకర స్వామి వారు మాత్రం గొంతు పెగలనంతగా వుక్రోషించారు. వుపాయం తోచక వూరుకున్నారు.

    అలక్ష్య లక్ష్య లక్షణంగా పైజమా పైచొక్కా వేసుకుని నామార్గం వేరన్నట్టు ఇవతల కక్ష్యలో కూచుని హరీస్ ఛట్టో చదువుకుంటున్న శ్రీశ్రీ స్వామివారి వంక ఓ చూపు చూసి కళ్లద్దాలు సవరించుకున్నారు. అంతా నిశ్శబ్దం. వాతావరణం దిగులుగా వుంది. 

     ఇంతలో ఏపిల్...ఏపిల్...పావలా అని గుక్క తిప్పుకోని 
కేకతో పళ్లబ్బాయ్ కంపార్ట్ మెంట్ లోనికి వచ్చాడు.

     ఆ సమయంలో పళ్లబ్బాయ్ పెద్ద ఆసరా అయ్యాడు అందరికి - 
అప్పట్లో భావకవిత్వం బ్రేక్ త్రూ అయినట్టు-

"కొంటే బాగుంటుంది" - అన్నారు పింగళి.

"తింటే మరీ బాగుంటుంది" - అన్నారు కాటూరి.

    "జంట కవిత్వం బానేవుంది... అయితే నేను కొనాల్సిందేనా... అంటూ"
ఎంపిక చేసి పది పళ్లు బేరం చేశారు విశ్వనాథ-

    "మిగిలితే మాత్రం నాకొకటి ఇవ్వండి" అన్నారు గణపతిశాస్త్రి

    విశ్వనాథ వారు తలొకటి పంచి తనొకటి నోటికి తగిలించారు. 
పక్క క్యూలోంచి శ్రీశ్రీ బుసకొట్టిన శబ్దం చేసి "ఏపిల్ బూర్జువా వ్యవస్థకి
ప్రతీక... " అన్నారు.

    "అయితే మీరు జామిపళ్లు తప్ప తినరా ఏమిటి ఏప్ అంటే వానరము. ఏపిల్స్ ని నేను హనుమత్ప్రసాదంగా తింటూ వుంటాను.. " విశ్వనాథ ఏపిల్ నముల్తూ అన్నారు.

   మరోసారి హూంకరించి ఛట్టోలోకి వెళ్లిపోయారు శ్రీశ్రీ.  

(శ్రీరమణ పేరడీలు నుండి ...........)

Tuesday, September 26, 2017

రైలుబండిలో వైతాళికులు - 1


రైలుబండిలో వైతాళికులు - 1




సాహితీమిత్రులారా!

నవయుగ వైతాళికులు అందరూ ఒకేచోట తారసపడడం చాలా అరుదైన సంఘటన. అందరూ కలసి రైలు ప్రయాణం చేయడం మరీ అపూర్వం. అట్లాంటి సంఘటనని వూహించి రాయటానికి ప్రయత్నించాను. వారిపట్ల నాకు గల గౌరవాభిమానాలే 

దీనికి ప్రేరణ. పాఠకులు సహృదయంతో స్వీకరించ ప్రార్థన.



రైలు బయలు దేరింది.
రైలు పెట్టి నవయుగ వైతాళికులతో కిటకిటలాడుతూంది.
విశ్వనాథ, కాటూరి, పింగళి, దేవులపల్లి, శ్రీశ్రీ, పిలకా, మొక్కపాటి, శివశంకరశాస్త్రి, జలసూత్రం........ వీరందరితో బోగి కళకళలాడుతోంది.
రైలు మెల్లమెల్లగా వేగం అందుకుంటోంది.
ఆంధ్రసరస్వతి పల్లకిలో ఊరేగుతున్నట్టుంది.
రైలు ఊగుతూ సాగుతోంది.
తెలుగు పలుకులు ఊయలలూగుతున్నట్టుంది.
రైలు వేగం అందుకుంది.
విజ్ఞాన సర్వస్వం పుటలు రెపరెపలాడినట్లయింది.


                             *  * * 
     కిటికీ పక్కసీటులో దుడుకు మీసాలు, ఎర్రటి రూపం దిట్టమైన అంచున్న ఖద్దరు పంచె సిల్కు లాల్చీతో కాటూరివారు కూర్చున్నారు. పక్కన వెడ్లపు మూతి వున్న సీసాలో చుట్టబెట్టిన పొగాకు కాడలు - సరిజోడుగా అగ్గిపెట్టి- సన్నగా, పొడుగ్గా సనాతన తాళపత్ర గ్రంథంలా వున్న విశ్వనాథవారు ఎదురు సీటులో కూర్చుని కాటూరి వారిని శ్రద్ధగా గమనిస్తున్నారు.
    ఆయన పొగాకు కాడ తీసి, వైనంగా పాయి చీల్చి, చుట్ట చుట్టే పనిలో త్రికరణ శుద్ధిగా లీనమైపోయారు.
    "మీకు పాయలు తీయడమే వచ్చు... మా బాపి బావకి జడవేయడం కూడా వచ్చు.. "
కొంటెగా అని-

రావోయి! సిన్నవాడ
మావాడ
ఆడివోరి సిన్నవాడ
రావోయి సిన్నవాడ-

అంటూ పాడడం ఆరంభించారు విశ్వనాథ.
పిలుపుపాట వింటూనే బాపిరాజుగారు అవతల వింగ్ లోంచి వచ్చారు.
కళహంస కదలి వచ్చినట్టు......

"ఇంతకీ నిర్వాహకులు సరసులేనా..... ఓ శాలువా ముక్కయినా 
   కప్పుతారంటారా....".-జనాంతికంగా అన్నారు విశ్వనాథ.

"ఏమో?దండల వరకూ శ్రీపాద హామీ పడ్డాడు కదా... వెళ్తోంది కాకినాడ
కనుక లంకపొగాకు పుష్కలం... ఇక మిగతావంటారా.... మన ప్రాప్తం
- వారి దయ...."

                     చుట్టపొగలోంచి కాటూరి వారు వదలిన మాటలివి
    నొసలు కదిలించారు పింగళి లక్ష్మీకాంతం గారు. త్రాసుముల్లులా
నొసటనున్న గీరునామం కదిలించి కొంచెం ఆవేశధోరణిలో "అయినా మనం వెళ్తోంది మంగపతి గారింట్లో పెళ్ళికి. వీరమ్మపెళ్ళిలోనే నారిగాడికి వొడక సోగని - ఈ పెళ్ళివంకన వారి నెత్తిన సాహితీసమితి యావత్తూ దిగిపోయి సర్వసభ్య సమావేశం పూర్తి చేసుకోవాలని గదా బయలుదేరాం - ఊరికేపెట్టే అమ్మ నీ మొగుడు బంతిన పెట్టమన్నట్టు.... ఇంకా శాలువాలూ, సన్మానాలూ కూడానా... "అన్నారు పింగళి.

        "నిర్వాహకులు సరసులేనా.... అన్నాను. దానికింత కంఠశోష ఏల?"
అన్నాడు విశ్వనాథ. పింగళి వారిచ్చిన జవాబు తనకేనని గ్రహించి.

  "కాకినాడ పౌరుల ఔదార్యాన్ని శంకించనక్కరలేదు. ప్రతిభకి వారెప్పుడూ పట్టం కడ్తారు....నేనెన్నడూ అక్కడ నుంచి శాలువా లేకుండా రాలేదు మరి..."  అప్పర్ బెర్త్ మీంచి దేవులపల్లివారి గళం పలికింది - కిందనే ఉన్న కాటూరివారి వైపు చుట్టకోసం చెయ్యి చాపుతూ అన్నారాయన.
   "ప్రతిభ మాట ఎలా వున్నా - ప్రాంతీయాభిమానం కొంత అఘోరిస్తుంది కదా..." - విశ్వనాథ వారి విసురు.

(శ్రీరమణ పేరడీలు నుండి...........)

Monday, September 25, 2017

విశ్వం గీస్తున్న గీతలు


విశ్వం గీస్తున్న గీతలు




సాహితీమిత్రులారా!


అనుభవాన్ని అనుభూతిలోకి, 
అనుభూతిని అక్షరంలోకి
అందంగా అనువదించగల అనుభవశాలి
అరిపిరాల విశ్వం గారు. భాషలో ప్రాచీనత
తొంగి చూచినా భావనలో నవ్యత పొంగులు 
వారుతుంది. వీరి వచనకవితలలో రవీంద్రుని 
గీతాంజలి ఛాయా మాత్రంగా కనిపిస్తుంది-

గులాబి వర్ణన-



ఏ అచ్చర కన్నె మధురాధరాల నుండి

తొణికిన హసిత తరంగానివి?

ఏ సంకల్ప సిద్ధుని ఫలించిన

కోరికవో నువ్వు?



నా గుండె అంచున కరుడుగట్టిన

వాంఛలు చెమ్మగిలినై, నీ రాకతో

నా యౌవనపు మైకపు జీరల్ని

సిరలుగా, అనురాగ ప్రస్తారం చేసే
                        నువ్వు

చీలిన పారిజాతపు గుండెవా?
                గులాబివా?

ముగ్ధమైన స్నిగ్ధమైన

జాలినీ కాంక్షనూ

ఎదలోపలి పొరల్లో రేపే

నులివెచ్చని వసంత జాగృతిలా

అపూర్వ మధుజ్వాలా కీలికలా

విరిసిన తరుణారుణ లతాంతమా!

ఏ ప్రకృతి శిల్పి కుంచెకొసవో చెప్పు
.........................
.........................

       సంజె మబ్బు నీడలో
    
      గులాబి విచ్చుకున్నప్పుడు

      అసంఖ్యాక రక్తాశ్రులు

      ఘనీభవించిన చప్పుడు.

Sunday, September 24, 2017

కృష్ణశాస్త్రీయం


కృష్ణశాస్త్రీయం




సాహితీమిత్రులారా!


నెమలి జాతీయ విహంగంగా నిర్ణయించిన సందర్భాన కవి సమ్మేళనం 
జరిగితే వారి వారి కవితలు ఎలా ఉంటాయి అనే ఊహకు రూపకల్పనే
ఈ పేరడీ


గంధర్వ లోకంలో కవితా విపంచిపై వియోగగీతాలు ఆలపించే కవి 
దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి గారు. అయిదు దశాబ్దాల క్రితం భావ
కవికి నిర్వచనంగా నిలిచారు. ఆంగ్లేయుల కాల్పనికవాదం. తెలుగు
వారి మెళుకువలు, లలిత లలితమైన పదజాలము శాస్త్రి గారి స్వార్జితాలు.
వారి గీతిక ఇలా విన్పిస్తుంది.



శిశిర శిశిర బందు

మధుర వేదన రగిలి

సోలియున్నది మనసు

చూపకే నీ వింత సొగసు

ఏలనే నీ కంత అలుసు

కరిమబ్బు మేనితో
        స్వామి వచ్చే వేళ

చివురాకు జొంపాల
        పురివిప్పి యాడేవు

భ్రమసి పోతివో యేమొ
        అలసి పోదువొ యేమొ

బృందావనమ్మెల్ల
        నీ మాటె, నీ ఆటె

ఏ నాటి పుణ్యమో
        ఏ నోముల ఫలమొ


(శ్రీరమణ పేరడీలు నుండి .....)

Thursday, September 21, 2017

మల్లంపల్లి చరిత్ర సమీక్ష


మల్లంపల్లి చరిత్ర సమీక్ష




సాహితీమిత్రులారా!




చరిత్ర పరిశోధనే ఆహారంగా, నిద్రగా స్వీకరించి, చరిత్రగతులు దిద్దిన 
మల్లంపల్లి సోమశేఖర శర్మగారి సమీక్ష చారిత్రకంగానే వుంటుంది. 
శిలల భాషలు తెలుసు ఆయనకు, చాకిబండలనుకున్న 
వాటిని శాసనాలుగా చదివిన దిట్ట.

   పిచ్చిప్రేమ అనెడి ఛాయాచిత్రమును క్షుణ్ణముగా పరిశీలించినచో మనకనేక చారిత్రక అంశములు బయల్పడుననుట నిస్సందేహము.
ఇందలి ప్రదేశములు ఇప్పటి ఆంధ్రరాష్ట్రము(అనగా పూర్వపు త్రిలింగము)లోని భాగసరిహద్దు గ్రామ ప్రాంతములు.
     చిత్రములో కథాగమనము ననుసరించి విఫల మనోరథయైన నాయిక నిర్జన ప్రదేశంలో గల బావిలో దుమికి ఆత్మహత్యకు తలపడుతుంది. ఇక్కడ మనము సూక్ష్మముగా పరిశీలించవలసియున్నది. ఆ బావిచుట్టూ ప్రాకారమువలె 
శిలానిర్మితమైన బొడ్డు గలదు. దాని నిర్మాణక్రమమును బట్టి చూడగా అది బౌద్ధశిల్పమును ప్రతిబింబించుచున్నది. క్రీస్తుశకం 11వ శతాబ్దికి చెందిన గంగరాజయ్య(గంగప్ప నామాంతరము)త్రవ్వించి యుండవచ్చునని కొందరు 
చారిత్రక పరిశోభకులు అభిప్రాయ పడుతున్నారు. అతని కుమారుడు దాహదాహ దూషణడు. తండ్రి త్రవ్వించిన జయాశయములలో పూడికలు తీయించినట్టు ఒక తామ్రశాశనము ద్వారా వెల్లడవుతున్నది. ప్రమోదూత నామ సంవత్సరము మాఘ శుద్ధ దశమి ఆదివారం నాటికి దాని నిర్మాణము పూర్తి అయినదనియు కొండవీటిలో లభించిన దానశాసనము స్పష్టపరచుచున్నది. గంగరాజయ్య ప్రపితామహుడైన బావికాచార్యులు వాస్తుశిల్పిగా ఆ కాలమున ప్రఖ్యాతి బడసినాడు. అతడు సింహాచలము, సత్రయాగ మొనరించినట్టు అగ్రహారముల దానమొనరించినట్లు సనదులు లభించినవి. అతడు క్రీస్తుశకం 1162 ప్రాంతములో జలనిధి కొలువున ఆస్థాన జ్యోతిష్కుడు. వెలనాటి బ్రాహ్మణుడు. ఇతనిది వసిష్టస గోత్రము. దీనికి సంబంధించిన పరిశోధన విపులముగ జరగవలసివున్నది.

(ఇది చిత్ర సమీక్షా అంటే అంటే మరి - చరిత్ర విను. చెప్పనిది అడగకు.)

(శ్రీరమణ పేరడీలు నుండి......)

మహాకవి గురజాడ జన్మదిన శుభాకాంక్షలు


మహాకవి గురజాడ జన్మదిన శుభాకాంక్షలు




సాహితీమిత్రులకు
"మహాకవి" గురజాడ వేంకట అప్పారావు గారి 
156 జన్మదిన శుభాకాంక్షలు
జననం - 21-09-1862 

Tuesday, September 19, 2017

సోమరాజు రంధి


సోమరాజు రంధి




సాహితీమిత్రులారా!



గులాబి పువ్వు కవితా వస్తువుగా సాగిన వచనకవితా పేరడీ-
రా.వి.శాస్త్రి గారి నవలలో, పాత్రో గారి నాటికలలో
ప్రవేశ పెట్టిన శైలిని వీరి కవితలలో జొప్పించారు.
విశాఖ ప్రాంతపు మాండలికాలలో తొలిగా
కవితలల్లిన ఘనత రంధి సోమరాజుగారికి దక్కుతుంది.
అన్నీ అవే అయితే వెగటించే ప్రమాదం వుంది.
అక్కడక్కడ అప్పుడప్పుడైతేనే ఆ టెక్నిక్ అందగిస్తుంది.


సందె మబ్బుల్ని

తునకలుగా తురిమి

ఇంద్ర ధనుసు

తొడిమ సేసి

దొంతర్లల్లే

పేర్చినట్టుంది

యిచ్చిన గులాబి

          పొద్దుటేల
         
          గులాబి మీన
         
          తొంగున్న

         మంచు సుక్క

          అమ్మ వొడిలో

         జోగిన

         సిట్టి పాపాయి నాగుంది

బుల్లి సిగలో

గులాబి యెట్టుకుంటే

సిమ్మ సీకటిలో

గోరంత దీపం

యెట్టి నట్టుంటాది

         బుల్లి పెదాలు ఇప్పితే

         గులాబి ఇరిసినట్టుంటాది

         సొట్టలడిన బుగ్గలు

         రేపు ఇచ్చే గులాబి

         మొగ్గల్నాగుంటాయ్


బారెడు పొద్దేళ

మాంసపు ముక్కని

ముక్కెట్టి

యెనక్కి తగ్గింది

మాయదారి

వూర కాకి

(శ్రీరమణ పేరడీలు నుండి....)

Monday, September 18, 2017

పఠాభి ఫన్ చాన్ గమ్


పఠాభి ఫన్ చాన్ గమ్




సాహితీమిత్రులారా!


గులాబి పువ్వు కవితా వస్తువైతే ఆయా
రచయితల
వచన కవితా రచన ఎలా సాగుతుంది
                                       - అనే  పేరడీ అంశం

అచ్ఛందంగా కవిత్వం వ్రాస్తే ఆయుక్షీణమని 
నమ్ముతున్నరోజులలో నిర్భయంగా పద్యాల 
నడుములు విరగదన్నినవాడు తిక్కవరపు పఠాభిరామిరెడ్డి గారు. 
మంచి పనివాడు మాత్రమే కాదు. వచన కవితలలో అనేకానేక 
సర్కస్ ఫీట్లు చేసి చూపిన జోకర్
వారి శైలి-

లాబీలో వుదయాన విర్సిన గులాబీ
ఈవినింగ్ మెరీనాలో మెర్సిన రోజీ లిప్ దోయివలె తోచున్
రోజా వుషోదయంబున ఫ్రెష్ గా వుంటే
రోజీ నైట్వేళ ట్రిమ్ గా విన్ డును

డ్రీమ్ గరల్ పేర్లల్ గా చూచు జనం కేసి
డీమ్ ఫ్లవర్
ని
ట్టి
ని
లు
వు
గా
 చూస్ తుంది.
స్కైలోకి రోజాని పల్కరించన్ గాని
నేను రోజీని మాత్రం "కుచలప్రశ్నల్"

అడుగుతాన్రోజూ

లతాంగి కోరికల్

సాయంత్రానికి వాడిపోవున్


రోజా పూ

రోజీ వాడును వుదయానికి

మొగాడి వాడికలో


(శ్రీరమణ పేరడీలు నుండి.....)

Sunday, September 17, 2017

ఆంధ్ర మహా కృష్ణుడు


ఆంధ్ర మహా కృష్ణుడు



సాహితీమిత్రులారా!



జాతీయ పుస్తక సంస్థవారి ఆదానప్రదాన కార్యక్రమంలో అనేక యితర ప్రాంతీయ భాషల్లో కథలు తెలుగులోకి వచ్చాయి. హిందీ, బెంగాలీ భాషల్లోని కథలు కొన్ని ఇదివరకే తెలుగులోకి వచ్చినా, అన్ని ప్రాంతాల కథలూ విరివిగా ఇప్పుడిప్పుడే తెలుగులోకి వస్తున్నాయి.

ఏ భాషలోనుంచి వచ్చినా ప్రాంతీయ వాసనలు,
వాతావరణం కన్పిస్తూనే ఉంటుంది. వేర్వేరు భాషల 
నుంచి అనువదింపబడు కథల నడకలు ఎలా వుంటాయి. - 
అనేది యీ పేరడీ అంశం-

పదహారణాల తెలుగు రచయిత మల్లాది రామకృష్ణశాస్త్రి
గారి శైలిలో ఈ పేరడి--

"స్వామిశాస్త్రీ! యింకా తావళం దగ్గరే వున్నావుషోయ్?" తాంబూలం
నవుల్తూ చేసంచీతో వంటింటి గుమ్మంలో ఆగాడు అవధాని.

   "మా పాలేరు గుమ్మడిపండుని గుమ్మంలో దొర్లించి వేళ్ళాడే్మో
ననుకున్నాను. నువ్వటోయ్ అవధానీ లోపలికి రా!" అరసున్నాలాగా
వోరగా చూశాడు స్వామిశాస్త్రి.

   "నువ్వు లేవూ - ఊడగొట్టిన నాగటిదుంపలాగా. ఈ చమత్కారాలకేం గాని తొందరగా ఆవుపోసన పడుదూ"

  " కూర్చో అన్నయ్యా" అంటూ కామేశ్వరమ్మ గోడవార పీటతీసి వాల్చింది. తావళం బొట్టు పెట్టి - హరివేణం వుద్ధరిణ సర్దుబాటు చేశాడు. ధోవళీముడి వొదులుచేసి ఆసనశుద్ధిగా కూర్చున్నాడు స్వామిశాస్త్రి

   "ఇవ్వాళ మీ చెల్లెలు మెట్ట గోంగూర పుఠం వెట్టింది పప్పులో కలగలిపి
రవ్వంత వెన్న నాలిక్కి రాసుకుంటే మాంచి వనరుగా వుంటుంది. ఓ పట్టు పట్టరాదూ?"

   "ఆ అదొక్కటే తక్కువ. శాస్త్రులూ! కోర్టు వ్యవహారమంటే గోంగూర కాదు. ఆబ్దికాలన్నా ఆగుతాయేమోగాని కచ్చేరీలో వాయిదాలు ఆగవు"

   జడ్జిగారైతే మాత్రం చెయ్యి తిప్పకుండా యెట్లా జరుగుతుందిష? మీరు నిదానంగానే కూర్చోండి" అంటూ కామేశ్వరమ్మ వుసిరికాయంత వెన్న మారు వడ్డించి నాలుగు అన్నం మెతుకులు కప్పి మరీ వెళ్ళింది లౌక్యంగా

   "అయినా నిన్ని ఫాయిదా యోముందిలే భోజనం మీద నీకింత ప్రీతే లేకపోతే ఆనాడు చివుకులవారింటో వారమూ నిలిచేది. పది పన్నాల వేదమూ అబ్బేది!" నిట్టూర్పుగా అన్నాడు అవధాని

   "ఇప్పుడేం పోయింది లెద్దూ"

   "ముష్టి అగ్రహారం పోయింది అంతేగా"

   "కాలం వస్తే యేదీ ఆగదనుకో, తెల్లవాడికి రాజ్యంపోలా? అవధానీ! ఈ పోచుకోలు కబర్లకేంగాని గోంగూరలో నాలుగు అనపకాయ ముక్కలు పడేస్తే దాని రుచి దానిదే!గోగాకులో కాకరకాయ కూడా బాగానే పొసగుతుంది గుర్తుంచుకో!"

   "ఇవన్నీ నాకెందుకు .... ఆనక బోనెక్కి ఈ ముక్కలే జడ్జీగారికి చెప్పు"


(శ్రీరమణ పేరడీలు నుండి...)

Saturday, September 16, 2017

ఆషామాషీ వడగళ్లు


ఆషామాషీ వడగళ్లు




సాహితీమిత్రులారా!



అణువులో అనంత విశ్వాన్ని దర్శించగలవారు మాత్రమే ఫీచర్ వ్రాసి నెగ్గగలరు. అల్ప విషయంపై అనల్పంగా చర్చించగల చతురత వుండాలి, తెలుగుదేశంలో అలాంటివారు ఎందరో వున్నారు. వారిలో కొందరి ఫీచర్ రచనలను అనుకరిస్తూ యీ పేరడిలో....

కృష్ణానది పుష్కరాలు వచ్చినపుడు - ఒక్కొక్కరి కలం కదలికలు 
ఎలా వుంటాయో ఊహించి ఈ పేరడీ రాయడం జరిగింది.

అసలు వడగళ్ళు రావూరివారి వడగళ్ళకి స్వరూప స్వభావాల్లో
సారూప్యం లేదు. ఇవి కరిగిపోని రుచిగల వడగళ్ళు.

ఆనాడు కృష్ణాపత్రికలో అందిన మసాలా గుగ్గిళ్ళు.
తర్వాత అవే ఆషామాషీ లోకి పరకాయ ప్రవేశం చేసినై.
రెండు పుష్కరాలకు పైగా  వ్రాస్తున్నా రావూరు వెంకట
సత్యనారాయణగారి పాళీ నిగ్గుతేలిందేగాని రవ్వంతైనా
అరిగిపోలేదు. వారి సున్నిత హాస్యధోరణి చిరులాస్యానికి
ప్రాణదాత.

కొంప కొల్లేటిసంత

      "ముందుగా చెప్పి వచ్చేది తిథి. చెప్పకనే దిగేది అతిథి. తిథినీ
అతిథినీ కూడ ఆదరించడం గృహస్థ విథి" - అని మల్లినాథ 
సూరిగారు అంటే "తిథులూ విధులూ ఏమోగాని ఈ అకాల పుష్కరం
నా పాలిట అధిక మాసమై కూర్చున్నది. సరిగంగ స్నానాలకోసం
సకుటుంబంగా చుట్ట పక్కాలంతా దిగితే కొంప కొల్లేటిసంత కాక 
ఏమౌతుంది?" అని వాపోయాడు బంధులోకం ప్రాప్తించిన ఒక పెద్దమనిషి.

        ఒక బ్రతక నేర్చినవాడు తీర్థం సాకుతో పిల్లా మేకతోసహా ఒక గృహస్తు
యింట తిష్ట వేశాట్ట. పిన్నిగారూ, బాబాయిగారూ వరసలు పెట్టి పిలుస్తుంటే, 
కాబోలునంటే కాబోలునని చాలా మర్యాద చేశారట విడిది దిగిన దంపతులు. 
శ్రావణ భాద్రపదాల బాపతని తేలేసరికి కొంక గుండమైందిట. "తీర్థానికి వచ్చిన 
వారికి యింత ప్రసాదం పెట్టామన్న తృప్తికంటే రుణభారం అధికమైందని "
విలవిల్లాడాడు ఆ గేస్తు.


కూసేవాడు మేసేవాడు

పుష్కర పర్వదినం కదా ప్రేత తృప్తికోసం తర్పణులు విడుద్దామంటే-
పురోహితుల గిరాకీ పెరిగిపోగా, వాళ్ళంతా చెట్లెక్కి కూర్చున్నారట.
"కూసేవాడికి పది, మేసేవాడికి అయిదు ఇచ్చుకోవాల్సి వచ్చిం "- దని
ఒక మిత్రుడంటే నాకు బోధపడింది కాదు. తర్వాత చెప్పాడు భాష్యం. 
కూసేవాడంటే మంత్రం చెప్పేవాడనీ, మేసేమాడంటే భోక్త అనీ. 
పోనీ అంత కష్టంగా వుంటే మానెయ్యకపోయారా అంటే "పితృ దేవతలు 
నక నక లాడరుటండీ మళ్ళీ పన్నెండేళ్ళకు కదా పాపం "అని జాలి
ప్రదర్శించాడు.

(శ్రీరమణ పేరడీలు నుండి...)

Friday, September 15, 2017

ఆస్థాన కవి ప్రేమలేఖ


ఆస్థాన కవి ప్రేమలేఖ




సాహితీమిత్రులారా!



ఉర్దూ పారశీక భాషలు తెలిసిన ఆస్థానకవి దాశరథి.
ఆయాభాషల్లోని శృంగార రసాన్ని ఇంకించుకున్న 
కొద్దిమందిలో దాశరథ్ ముఖ్యులు. అంగారం,
శృంగారం కలిసికట్టుగా కవిత చెప్పగల దాశరథి
గారి ప్రేమలేఖ వూహామాత్రంగా.......

       మంచెమీద నుంచి పరిగపిట్టల్ని కసిరే
చానా!
    విసిరే వడిసెలలో రాళ్లు పెట్టావో పూలే 
తురిమావో తెలియదుకాని దెబ్బతిన్న నా గుండె
విలవిల లాడుతోంది. గూపులు వేసే చూపులు 
అలుపు వచ్చి మంచె మీదే ఆగిపోయాయి.
ఏ విసురులో నైనా నీ గుండెను గిరాటు వేస్తావనే
ఆశతో మంచె దగ్గరే పొంచి వున్నాను.
    నిన్ను చూడగానే అనుకున్నాను - ఏ పారశీక
కవో వూహించి రచించిన గజల్ వి నువ్వే అయివుంటావని.
ముషాయిరాలోంచి తప్పించుకు వచ్చిన కవిత పాదపంక్తివైనా 
అయివుండాలి. ఒక్కసారి మధుమాసం విలాసంగా నా గుండె 
గుమ్మంలో పల్లకీ దిగిన అనుభూతి కోటి పారిజాతాలు 
మానసోద్యానంలో ఘల్లున వెల్లివిరిసిన అనుభవం. అవి 
ఒంటరిగా మోయలేనంత బరువు.
     కవితాగారం గల యీ షరాబు, నేడు నా మ్రోల గోరంత 
ప్రేమను అర్థిస్తున్న గరీబు. సఖీ!నీవు సాకివి, నీ కన్నులు 
మధుపానపు గిన్నెలు, నాఎద కారవాన్ సరాయి. అయితే 
యిక నేను నవాబునే సుమీ!
     నికుంజం వుంది. ఒత్తిల మెత్తని పూలపాన్పూ వుంది. 
గుండె నిండుగ ప్రేమ సుధారసమున్నది. నీవు కూడా వుంటే 
చెలీ!యిక లేనిదేమున్నది రూపు రేఖలు పసిగట్టాను గాని 
నీ విలాసమే తెలియకున్నది రాణీ!

(ఇంతకీ ఆ విలాసవతి విలాసం తెలియదు యీ కవిగారికి, 
ఇక జవాబు ప్రసక్తి యేల)

(శ్రీరమణ పేరడీల నుండి......)

Wednesday, September 13, 2017

శ్రీ శ్రీ - లోని వింతేమిటి?


శ్రీ శ్రీ - లోని వింతేమిటి?




సాహితీమిత్రులారా!


ఈ చిత్రమేమిటో చూడండి-
శ్రీ శ్రీ అని వ్రాయబడిన చిత్రంలోని
వింతేమిటో గమనించండి-


పరిశుద్ధ రచన


పరిశుద్ధ రచన




సాహితీమిత్రులారా!

సర్వశ్రీ అనే అభ్యుదయ కవి తన వచన కవితా సంపుటికి
పీఠిక వ్రాయండని ఒక క్రైస్తవ మతాచార్యుని కోరినపుడు 
వారి శైలి యిలా సాగుతుంది....

సహోదరుడైన సర్వశ్రీ గ్రంథము మిక్కిలి కొనియాడతగినదై యున్నది.
పాపుల యొక్కయు, జీవితము యొక్కయు, దేశము యొక్కయు నిజమైన 
విషయములు యిందు వ్రాయబడియున్నవి. ఈలాగున వుత్తమ గ్రంథములను 
రచించుటవలన సహచరులకు మిక్కిలిగా మేలు చేసినవాడు అగుచున్నాడు. 
మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును. నీతిని విత్తువాడు శాశ్వతమైన 
బహుమానము నొందును. ఇట్టి వ్రాతలు వ్రాయువాని తల మీదికి దీవెనలు వచ్చును.
ఈ లాగున యీ యొక్క గ్రంథమును ప్రకటించుట వుత్తమమై యున్నది.

(బైబిలు శైని అనుకరించుటడానికే యిది వ్రాయబడినది.)

(శ్రీరమణ పేరడీలు నుండి-)

Tuesday, September 12, 2017

ముక్తా గుచ్ఛ బంధం


ముక్తా గుచ్ఛ బంధం




సాహితీమిత్రులారా!

ముక్త అంటే ముత్తెము
గుచ్ఛము - గుత్తి
ముత్తెములతో కూర్చిన గుత్తి
ఈ బంధము-
వీటిలో రకాలున్నాయి.
ఈ క్రింది శ్లోకము ఒక రకానికి చెందిన
ముక్త గుచ్ఛబంధానికి ఉదాహరణ
ఈ శ్లోకము తిరుమల బుక్కపట్టణం అణ్ణయదేశిక
విరచిత చిత్రమాలికా నందలిది.

శ్రీధరం ధరాధరారి సోదరం దయాదరం
రంజితామరం ముద్గా సదావదాన్య శేఖరం
రంజదంఘ్రి కింకిణీ రవాయితాగమ స్వరం
జయామి మానసే వదానతేందు శేఖరమ్

దీనిలో ధ,ద,రం,శే,ఖ,రం,జ - అనేవి ఆవృత్తాక్షరాలుగా
ఉపయోగించడం జరిగింది.

      రా          యా
శ్రీరారిసోరం
   రం          రం 
ఇది మొదటి పాదంలోని అక్షరాల బంధనం
నిలువుగా ఉన్న పట్టీలో రెండవ పాదం నిలపడం జరిగింది
మూడవ పాదం పట్టీలో మొదటి వరులో కూర్చబడింది
నాలుగవ పాదం పట్టీలో చివరి వరుసలో కూర్చబడింది గమనించగలరు.
బంధం శ్లోకం చూస్తూ చదవడం వలన
సులువౌతుంది.


Monday, September 11, 2017

నారాయణ కల్పవృక్షమ్


నారాయణ కల్పవృక్షమ్




సాహితీమిత్రులారా!

(విశ్వనాథ సత్యనారాయణగారు జీవించి వుండి ఆరుద్ర గారి షష్టిపూర్తి ఉత్సవానికి సందేశం పంపివుంటే ఇట్లా వుండవచ్చు.)

    భాగవతుల శంకరశాస్త్రి. ఇది కొందరికి తెలియును, కొందరికి తెలియదు. ఆరుద్ర. ఇది మిక్కిలి బ్రసిద్ధము. ఆరుద్ర యనునది యొక నక్షత్రము. పుష్యమాసములో వచ్చెడి ఆరుద్ర నక్షత్రము శైవులకు బర్వదినము. పరమేశ్వరుడు కైలాసము నుండి దిగి వచ్చునని వారి నమ్మిక. ఆ రోజు ద్వారదర్శనము చేయుదురు. కొందరు కొన్ని పేర్లు ధరించుటచే అవి ఖ్యాతి బడయును. కొందరు వాసికెక్కిన బేర్లు ధరించి ఖ్యాతి గడింతురు. మా ప్రాంతములో విశ్వనాథ నాగభూషణమని యొకడున్నాడు. వాని తాత ముత్తాతలు మెట్టసేద్యములో దిట్టలు. వీనికి అదికూడ అబ్బినది కాదు. జులాయిగా తిరుగుచుండెడివాడు. అయినను ఇంటిపేరుచే గొంత ప్రాచుర్యము పొందినాడు. ఫలానా నాగభూషణము మీ దాయాదియా అని పలువురు నన్ను ప్రశ్నించుచుండెడివారు. అతడు మా శాఖవాడు కూడ కాదని నేను నిజము చెప్పెడివాడను. కొందరికి యిట్టి వరములు అయాచితముగా లభించును.

    ఆరుద్ర అభ్యుదయవాదినని చెప్పుకొనును. కాదనుటకు నావద్ద నిదర్శనములు లేవు. అయినచో అయివుండవచ్చును. కాకపోయినచో మాత్రము ప్రమాదమేమి? ఇతను గడ్డము పెంచును. ఆనాడు జులపాలు పెంచుటను భావకవులు ఆచారము జేసిరి. నేను ఏ వాదమునకూ జెందను. నావాదము నాది. నచ్చినవారికి యది వేదము, లేనివారికి లేదు. వారికి జుత్తు బెంచుట అవశ్యకమని తోచినది. కవియైనవాడు మేధను బెంచుకొనుట ముఖ్యమని నాకుదోచును. ఏది ముఖ్యమో ప్రాజ్ఞులు గ్రహింతురు గాక.

    త్వమేవహమ్... అని యొకటి వ్రాసినాడు. సినావాలి యని మరొకటి వ్రాసినాడు. ఇవి సంస్కృతకావ్యములు గావు. పచ్చి ఆధునిక వచన కవితల కూర్పు పచ్చియనిన జ్ఞాపకము వచ్చును. ఆరుద్ర పైలాపచ్చీసు యని కూడ ఒకటి రచించినాడు. ఈతడు రైలుబండిని మానవ జీవితమునకు ముడిపెట్టి ఒక కవిత అల్లినాడు. అందు జీవుని వేదన కొంత స్ఫురించును. భావకవితయునూ వున్నది. ఓ కూనలమ్మ యను మకుటములో బద్యములు గిలికినాడు. అవి మిక్కిలి చమత్కారముగా నుండును. అసలు చమత్కారమే యితని మతమని తోచును. ఒక చోట నేనితనికి గురుతుల్యుడనని బేర్కొన్నాడు. నా రచనలు గొన్నింటిని చదివి, యెట్లు వ్రాయకూడదో తెలిసికొంటినని చమత్కరించినాడు. ఏమైననేమి?  ఆ "ఎఱుక" యేదో నా వల్లనే కలిగినది కదా అజ్ఞానము తొలగించిన వాడు గురువు, సముద్రమున ఆణిముత్యములు ఉండును. నత్తగవ్వలు ఉండును. వారి వారి బ్రాప్తము ననుసరించియు, వారి వారి పూర్వజన్మ సుకృతమును బట్టియు అవి లభించును అతని "ఊహ" యట్లున్నది. అతని కదియే ప్రాప్తమని భావింతును.

    ఆరుద్ర పరిశోధకుడు, అని కొందరు చెప్పగా వినియుంటిని. నాలుగు దశాబ్దములుగా చెన్నపట్టణములో నివాసము యుంటూ తెనుగు సాహిత్యము, తెను జీవనము ఇత్యాది అంశములపై నితడు మిక్కిలిగా వ్యాసములు వెలువరించినాడు. జైనము గురించి ఇతనికి గొంత తెలియును.

    ప్రస్తుతాంశము షష్ట్యబ్దిపూర్తి అరువది సంవత్సరములు నిండుట యీ వేడుక అయినచో ఆరుద్రకు అరువది నిండినవా లేదు. భాగవతుల శంకరశాస్త్రికి అరువది నిండియుండవచ్చును. ఆరుద్ర పుట్టినది తరువాతగదా మరి ఆరుద్రకు అరువది యెక్కడివి కనుక యీ షష్ట్యబ్ది పూర్తి భాగవతుల శంకరశాైస్త్రికే గాని ఆరుద్రకు కాదు, ఔను. ఇది యొక చమత్కారము.

(ఆరుద్ర షష్టిపూర్తి సందర్భముగా ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసినది. తర్వాత ఉత్సవ నిర్వాహకులు అభినందన సంచిక వేస్తుంటే శ్రీరమణ పేరడీ వుండితీరాలి అని ఆరుద్ర గారే చెప్పారట. ఈ సావనీర్ కి శ్రీ బి.యన్.ఆర్.కృష్ణ, బెజవాడ గోపాలరెడ్డి గారలు సంపాదక్వం వహించారు.)

(శ్రీరమణ పేరడీల నుండి...)

Sunday, September 10, 2017

బాపుగారికి కవిసామ్రాట్ విశ్వనాథ అభినందన


బాపుగారికి కవిసామ్రాట్ విశ్వనాథ అభినందన




సాహితీమిత్రులారా!


బాపు గారు రాజాలక్ష్మి పౌండేషన్ అవార్డు తీసుకుంటున్న సందర్భంగా
తమ ఆశీస్సులు పంపమని విశ్వనాథ సత్యనారాయణ గారిని కోరితే-
వారు పంపే అభినందనలు లేదా అభిప్రాయం ఎలా ఉంటుందో
ఊహిస్తే - ఆ ఊహకి అందిన వివరం ఇది.

        కొందరు తామ్రపత్రములిచ్చి సమ్మానించెదరు. ఒకడు సన్మాన పత్రముతో సరిపెట్టును. మరియొకడు శాలువా గప్పును. ఇది గుడ్డిలో మెల్ల. మరి కొందరు ధనమిచ్చి సత్కరించెదరు. ఇట్టి వారు యోగ్యులు. కనుక రాజాగారు యోగ్యులు. బిరుదులు, పొగడ్తల వలన బ్రాప్తించు బ్రయోజనమేమి శూన్యము. అట్టివి యెన్నైనను బుక్కెడు కొర్రలు కాజాలవు. నాకు లౌక్యము తెలియదు. సత్యము జెప్పుట నా మతము.  తిభగలవారినిట్లు గౌరవించుట లోకశ్రేయ మగును. ఇతన్ని బరామర్శింతుము ఇతడు యనగా బాపు. అది యతని కలము పేరు. ఇతడు చిత్రకారుడు కనుక కుంచెపేరు యనవలె. అతని అసలుపేరు యేమో? వుండును.మనకు తెలియదు. కవి అక్షరములలో రచనసేయును. చిత్రకారుడనువాడు రేఖలతో, వర్ణములతో సేయును. ప్రయోజనము భావవ్యక్తీకరణ. రససిద్ధి.ఈతడు జిత్ర రచన యందేగాక చలనచిత్ర రంగమున దర్శకునిగా గూడ కొంత కీర్తి నార్జించినాడు. ఆ రంగమున కీర్తితోబాటు ధనము కూడా మిక్కిలిగా యార్జించవచ్చునని కొందరు జెప్పగా వినియుంటిని. సినిమాలోకము గురించి బొత్తిగా నాకు తెలియదు. గూడవల్లి రామబ్రహ్మము ఇట్టివారితో లోగడ కొంత పేరు ప్రఖ్యాతులు  బడసినాడు. మేమిద్దరమూ ఒక ఊరివారమగుటచే నాకాపాటి  తెలిసినది.

రమణయని వొకడున్నాడు. ముళ్ళపూడి వారు. ఇతని సహపాటి
వీరిద్దరూ మంచి స్నేహితులని నాకు తెలియును. స్నేహమనగానేమి?
ఇది యొక అనుబంధము. అవగాహన దానికి ఆలంబన. రెండు
జీవుల సమైక్య వేదన. జీవి యనగా ప్రాణి. అయినచో ప్రతి బ్రాణి 
స్నేహము చేయునా చేయును. చేయదు - రాజేశ్వరరావని నాకు 
తెలిసిన యొకడున్నాడు. కలకత్తాలో జంతు శాస్త్ర మభ్యసించి
బ్రస్తుతము సర్కారులో కార్యదర్శిగా నున్నాడు- జంతుశాస్త్రము 
జదివినవానికి కార్యదర్శి బదవి యిచ్చుట ఏమి ఏమో అతడందులకు
అర్హుడని బైవారికి తోచివుండిననది. అతనికి పక్ేషిశాస్త్రము గూడ 
కొంత తెలియును. పక్షులలో మైత్రి స్వభావము మెండుయని 
అతడొక పర్యాయము చెప్పినాడు - అతని భార్య రూపసి. పేరు కల్యాణి.
కల్యాణి యని యొక అశ్వజాతి గలదు. ఆ జాతి గుఱ్ఱము వేగమునకు
 బెట్టినది బేరు.
       చూచితిరా ఈ వైచిత్రి? ఆమె సంగీతజ్ఞుని భార్య యగుచో మనకు కల్యాణిరాగము జ్ఞప్తికి వచ్చును. ఈతడు జంతుశాస్త్రవేత్త యగుటచే గుర్రము మనసున దోచినది. దీనిని స్పురణ అందుము. అదియొక మానసిక యవస్థ. అవస్థ యనగా స్థితి. అయినచో నిట్టి స్థితి..
(అదండీ పరిస్థితి)
                                                                                (ఆంధ్రజ్యోతి వారపత్రిక 3-12-82)

(శ్రీరమణ పేరడీల నుండి)

కవిసామ్రాట్టుని జయంతి శుభాకాంక్షలు


కవిసామ్రాట్టుని జయంతి శుభాకాంక్షలు




సాహితీమిత్రులకు
శ్రేయోభిలాషులకు
తెలుగులో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత
విశ్వనాథ సత్యనారాయణ గారి జన్మదిన శుభాకాంక్షలు


ఉక్తివైచిత్రికి నుపదయై త్రిథయై
                           భాషామతల్లికి బాసటాయె
సూక్తి సంపదకు ప్రస్తుతిపాత్రమై తెల్గు
                          తఱి తీపికిని సంస్థానమాయె
రక్తి గట్టిన కథారాజమ్ముగ సజీవ
                          పాత్రలకును తానె పాత్రమాయె
ముక్తిదాయిని యంచు ముదమార ప్రజలకు
                          దారి జూపగ మార్గదర్శియాయె
అట్టి కల్పక కావ్యంబు నాంధ్రులకిడి
హరిహరాద్వైత తత్వంబు నాంధ్రభూమి
పాదుకొల్పిన యట్టి యభ్యుదయవాది
మధుర హృదయుండు మన విశ్వనాథు కాడె
                                                              - విశ్వనాథత్రిశతి


Saturday, September 9, 2017

పాత్రికేయుని ప్రేమవార్త


పాత్రికేయుని ప్రేమవార్త



సాహితీమిత్రులారా!

వృత్తిరీత్యా జర్నలిస్టులు కొన్ని పదాలకు అలవాటుపడి
ఆ పరిధిలోనే ఉండిపోడం తప్పనిసరి అవుతుంది.
ఏ విషయాన్నయినా తేల్చి చెప్పకపోవడం తమ మీద
బాధ్యత పెట్టుకోకుండా జాగ్రత్తపడడం వారి విధినిర్వహణలో
ఒక భాగం కనుక ప్రేమలేఖలోనూ అదే ధోరణి...........

ప్రేయసికి ఒక విజ్ఞప్తి

                                                                                                                    విజయవాడ జులై 1
శ్రీమతి / కుమారి విజయలక్ష్మి గారికి,

       ఇటీవల లబ్బీపేట ప్రాంతంలో సాయంత్రం సుమారు ఆరు గంటల వేళ మిమ్మల్ని చూడటం తటస్థించింది. ఎర్ర చుక్కల తెల్లచీర కట్టుకున్న మీరు ఆరోజు చాలా అందంగా వున్నట్లు నేను భావించలేక పోలేదు. మీరు డాక్టరుగారి రెండో అమ్మాయని అభిజ్ఙవర్గాల
ద్వారా తెలియవచ్చింది.
      కాగా మిమ్మల్ని చూసినప్పటినుంచి మనసు పరిపరి విధాల పోతోంది. ఇది ఒక వేళ ప్రేమభావన అయినా కావచ్చు. 
   పోతే నా వివాహం చేయాలనే ధృఢ సంకల్పంతో మా తల్లిదండ్రులు ఉన్నట్లు, 
అందుకుగాను వారు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఇటీవల వెల్లడైంది. కనుక, మీకు ఆమోదయోగ్యమైతే అద్యతన భావిలో మన వివాహం జరుగగలదన్, ఇది విఫలం 
కాబోదని ఆశిస్తున్నాను. అన్యధా భావించడానికి ఆస్కారం లేదు కాబట్టి మీరు మీ 
అభిప్రాయాన్ని నిష్కర్షగా తెలుపగలరని విశ్వసిస్తున్నాను.

(ప్రేమ సఫలమైందా ఆమె జవాబు రాసిందా అనే విషయాలకు 
వచ్చేవారం వార్తల్లో చూడాల్సిందే.)

(శ్రీరమణ పేరడీలు నుండి)

Thursday, September 7, 2017

శివశివ రాతి రాతి శ్రితజీవన


శివశివ రాతి రాతి శ్రితజీవన




సాహితీమిత్రులారా!


ఈ గూఢచిత్ర పద్యం చూడండి-

శివశివ రాతి రాతి శ్రితజీవన జీవన యాత్మ యాత్మ బాం
ధవధవ రాజిరాజిత పదావర దావర ధీరధీర దీ
నవనవ సంతసంతత సునందన నందన భాను భాను గౌ
రవరవ కాండకాండద నిరంజన రంజన కాయకాయజా
                                                                              (సారంగధరీయము - 4-123)

శివ - శుభమైన, శివరాతి - శంకర ఆప్తుడగు కుబేరుని వంటి,
రాతి - ఈవినిగలవాడా, శ్రితజీవన - ఆశ్రితులకు జీవనమైనవాడా,
జీవ - బృహస్పతివంటి, నయ - నీతియుక్తమైన, ఆత్మ -
బుద్ధిగలవాడా, ఆత్మబాంధవ - ప్రాణస్నేహితులైన,
ధవరాజి - రాజసముదాయముచేత, రాజిత - ప్రకాశింపబడిన,
పదా - స్థానముగలవాడా, వరదా - కోర్కెల నిచ్చువాడా,
వర - శ్రేష్ఠమైన, ధీర - పర్వతమువంటి, ధీర - ధైర్యముగలవాడా,
దీనవన - దీనజనులనే అరణ్యమునకు, వసంత - వసంతునివంటివాడా,
సంతత - నిరంతరమును, సునందన -
మంచి సంతానముయొక్క, నందన - సంతోషముగలవాడా,
భాను - సూర్యుని వంటి, భాను - కాంతులుగలవాడా,
గౌరవ - గురుత్వమైన, రవ - ధ్వనులయొక్క, కాండ -
సముదాయమునందున, కాండద - మేఘమువంటివాడా,
నిరంజన - దోషరహితమైన, రంజన - రంజించునట్టి,
కాయ - శరీరము నందున, కాయజా - మన్మథునివంటివాడా

ఇది అర్థకాఠిన్యం కారణంగా గూఢచిత్రంగా చెప్పబడుతున్నది.

Tuesday, September 5, 2017

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు


ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు



సాహితీమిత్రులకు,
శ్రేయోభిలాషులకు,
ఉపాధ్యామిత్రులకు
భారతరత్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి,
ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు


Monday, September 4, 2017

సిప్రాలి - శ్రీ.శ్రీ.


సిప్రాలి - శ్రీ.శ్రీ.




సాహితీమిత్రులారా!


సిప్రాలి అనే శ్రీ.శ్రీ. కావ్యము
పేరును ఎలాసూచించారో చూడండి-

ఇందులో మూడు రకాల కవితలున్నాయి.

1. సిరిసిరిమువ్వలు

2. ప్రాసక్రీడలు

3. లిమఋక్కులు