Monday, January 30, 2023

ఉత్పలమాలలో మరో రెండు పద్యాలు

 ఉత్పలమాలలో మరో రెండు పద్యాలు




సాహితీమిత్రులారా!


తెలుగువెలుగులో రామన మాస్టర్, బెంగుళూరు వారు కూర్చిన

గీతకందగర్భ ఉత్పలమాల గమనించండి-

ఉ. మా తెలుగే కదా వరము మాకిల తీయని భాషయన్న, యీ

మా తెలుగే సదా పలుకు మాటల తేనెల పాలవెల్లి కా

గా,తెలుగందు మా ఘనత కైతల కన్నియ కాంతులెన్నొ, తా

నే తలపై యికన్ తెలుగు నేలల మానుడి తేజరిల్లునే

ఈ ఉత్పలమాలనుండి ఒక తేటగీతిని విడదీస్తే.

మా తెలుగే కదా వరము మాకిల తీయని భాషయన్న, యీ

మా తెలుగే సదా పలుకు మాటల తేనెల పాలవెల్లి కా

గా,తెలుగందు మా ఘనత కైతల కన్నియ కాంతులెన్నొ, తా

నే తలపై యికన్ తెలుగు నేలల మానుడి తేజరిల్లునే



తే. వరము మాకిల తీయని భాష యన్న

పలుకు మాటలు తేనెల పాలవెల్లి

ఘనత కైతల కన్నియ కాంతులెన్నొ

తెలుగు నేలల మానుడి తేజరిల్లు

ఆ ఉత్పలమాలలో ఒక కందము కూడా దాగుంది 

మా తెలుగే కదా వరము మాకిల తీయని భాషయన్న, యీ

మా తెలుగే సదా పలుకు మాటల తేనెల పాలవెల్లి కా

గా,తెలుగందు మా ఘనత కైతల కన్నియ కాంతులెన్నొ, తా

నే తలపై యికన్ తెలుగు నేలల మానుడి తేజరిల్లునే.

కం. తెలుగే కదా వరము మా

కిల తీయని భాషయన్న యీ మా తెలుగే

తెలుగందు మా ఘనత కై

తల కన్నియ కాంతులెన్నొ తానె తలపై


Friday, January 27, 2023

షడర చక్రబంధం

 షడర చక్రబంధం





సాహితీమిత్రులారా!

గణపవరపు వేంకటకవి కృత 

శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము

లోని షడర చక్రబంధం ఇది -

శార్దూలవిక్రీడితవృత్తం

సత్యాకల్పక ప్రస్ఫుటా శరభిదాచారా విశంక క్రమా

మత్యావిష్కృత బంధురాదరణ భూమాజన్తు కూటాశ్రితా

దిత్యావేంధన ధర్మసారతరమూర్తీముత్కరాద్రిక్షమా

మాత్యుల్లాసపదా మహావిదితధామా సాధుతారక్షమా-861

అర్థం:-

సత్యాకల్పక=సత్యభామపాలిటి కల్పవృక్షమా!(సత్యకు పారిజాతకల్పవృక్షాన్ని తెచ్చిఇచ్చిన కల్పవృక్షం), శరభిదాచార=బాణాలతో భేదిల్లజేయడం అనే విద్యలో, విశంకక్రమా=నిశ్శంకం,నిరాటంకంఅయిన పరాక్రమం/విజృంభణం కలిగినవాడా!,మతి+ఆవిష్కృత=అంతరంగం(మది)లోఆవిష్కృతం అయినవాడా!, బంధురాదరణభూమా=అపారంగా ఆదరించేబుద్ధి కలవాడా!, జంతుకూట+ఆశ్రిత=ప్రాణి(పశు)సమూహంచేత ఆశ్రయించబడినవాడా!, దిత్యావేంధన=దితి కుమారులయిన రాక్షసదుర్మార్గులను  అగ్నిలా దహించేవాడా!, ధర్మ సార రత మూర్తీ=వేదధర్మంపట్లగాఢాభినివేశంకలవాడా (ధర్మస్వరూపా!), ముత్+కర=ఆనందదాయకమూ,అద్రి=పర్వతంలా నిశ్చలమూఐన,క్షమా=తాలిమికలవాడా!,మా=లక్ష్మీదేవికి, అత్యుల్లాస=బాగా ఉల్లాసం కలిగించేవాడా, మహావిదిత=బాగ గొప్పగా ప్రసిద్ధికెక్కినవాడా!, ధామా=నివాసం/కాంతికలవాడా!(శ్రీహరిధామంగాతిరుమల సుప్రసిద్ధం), సాధుతారక్షమా=సజ్జనులను తరింపచేయడంలో సమర్థుడా!

భావం:- 

సత్యభామపాలిటికల్పవృక్షమా!బాణవిద్యలో ఆరితేరినవాడా! తలచేవారి మదిలో మెదిలేవాడా!అపారదయామయా!ప్రాణులచేత ఆశ్రయించబడినవాడా!దుష్టంలయిన రాక్షసులను దహించేవాడా!ధర్మస్వరూపా!ఆనంద దాయకా! కొండన్నా! సిరికి ఉల్లాసం కలిగించేవాడా!సంప్రసిద్ధమైన తిరుమలవాసా! సజ్జన సంరక్షకా!

*విశేషాలు:-* నరశార్దూలస్మరణశార్దూలవృత్తంలోచేయడం సముచితం.చక్రధారిస్తుతి షడరచక్రబంధంలోచేయడం బాగు.

ఈ బంధచిత్రంలో వెలుపలనుంచి మూడవవలయంలో- *కవి వేంకటాద్రి అనీ,  ఆరవవలయంలో ప్రబంధరాజము*

అనీ  కవిపేరూ కావ్యంపేరూ ఉంది.

ఈ పద్యానికి ఇదివరలో అర్థతాత్పర్యాలు లేవు. వేదంవారి సంపాదకత్వ1977ప్రతిలో పద్యం మొదటిపాదంలో ప్రస్ఫుట బదులు 'పస్పుట' అని అచ్చుతప్పు.బంధచిత్రంలో

ఆరవ వలయంలో కావ్యంపేరులోని మొదటి అక్షరం *ప* అని ముద్రితం కావడం సంపాదకుల నిర్లక్ష్యానికి పతాక. మిగతా చోట్ల అచ్చుతప్పులు కొల్లలు.కనీసం కావ్యంపేరైనా

సరిగా పరిశీలించని సంపాదకత్వం.   పద్యంలోని మూడవపాదం ప్రారంభంలో  *దిత్యావేంధన*

అనే పాఠాన్ని *దిత్యౌఘేంధక* వ్యాకరణ పండితులు సవ రించినారు. అలా సవరించడంవల్ల బంధచిత్రం మూడవ వలయంలో  *కవిఘేంకటాద్రి* అని ఏర్పడి కవిపేరుకు

భంగం వాటిల్లుతుంది. అది పరిశీలించక వ్యాకరణపండితులు రసజ్ఞతను వదలి వస్త్రమూల్య విచారణ చేసినారని తెలుపడా నికి బాధగా ఉంది.      పద్యంలోని మూడవపాదంలో *జంతు* అనే పదం ఉంది.ఆ పదంలోని *జ* అక్షరంబంధ చిత్రంలో కావ్య నామాన్నిసూచించే ఆరవవలయంలోని  *ప్రబంధరాజము* లో *జ* . కనుక జంతు పదాన్ని జన్తు అని రాయడం జరిగింది.

           వేంకటాద్రీశా!గోవిందా!గోవింద!              

        వైద్యంవేంకటేశ్వరాచార్యులు వారి సౌజన్యంత

Wednesday, January 25, 2023

విష్వక్సేనుడు ఎవరు?

  విష్వక్సేనుడు ఎవరు?




సాహితీమిత్రులారా!



శ్రీమన్నారాయణుడి సర్వసైన్యాధిపతి విష్వక్సేనులవారు.  విష్ణువు ద్వారపాలకులు లో ఒకరైన చండుడు అనే అతడు విష్ణు నియమనాన్ననుసరించి రాక్షస సంహారం చేసి దేవతలను రక్షించాడు. అందుకు మెచ్చిన విష్ణువు అతనికి సర్వసైన్యాధిపత్యాన్ని అనుగ్రహించారు. ఆయనకు నాలుగు చేతుల్లో శంఖం,చక్రం,వేత్రము(బెత్తము) తర్జని ముద్రతో(చూపుడువేలితో బెదిరిస్తూ) వుంటారు. ఆయన భార్యలు సూత్రవతి, జయా, పద్మధరా అని ముగ్గురు చెప్పబడతారు. ఆయన - విష్ణు అవతారాలను సైతం ఎప్పుడు ఎక్కడ ఏకాలానికి జరగాలో నిర్ణయిస్తారని అంటారు. వీరు మహాలక్ష్మి కి ప్రధాన శిష్యులు, నమ్మాழ்వార్ కి ఆచార్యులు. కనుక మనం ఆచార్య పరంపరలో మనకు ఆచార్యులుగా పూజింపబడతారు.  వీరికి విష్ణు ఆలయాల్లో జయవిజయులు దాటాక ఉత్తరానికీ ఈశాన్యానికీ మధ్యలో దక్షిణాభిముఖంగా ఒక సన్నిధి ప్రత్యేకంగా వుంటుంది. వీరికి విష్ణు నివేదితమైన పదార్థాన్నే నైవేద్యంగా సమర్పించాలి.   వేరేదీ వీరు స్వీకరించరు.

*శ్రీశభుక్తశేషైకభోజనాయ నమః*

అని వీరికి ఒక నామమున్నది. విష్ణు నివేదిత పదార్థంలో నాలుగో వంతు వీరికి నివేదించాలి.  వీరి సన్నిధి తిరుమల ఆలయం లో హుండీ పక్కన ఉత్తరద్వారం ప్రాకారం లో చిన్నగా బయటకు కనిపించకుండా వుంటుంది. తిరుచానూరులో లో స్పష్టంగా కనబడుతుంది. 

విష్వక్సేనులు నిత్యసూరి. అయినప్పటికీ వారు భూమిపై అవతరించినప్పుడు సువర్చలా వరుణుల సంతానంగా తులామాసం, శుక్లపక్షంలో పూర్వాషాఢానక్షత్రంలో అవతరించారు.

2. *కుంతల*  అనే అప్సరస,  దూర్వాసుడి శాపం వలన కిరాత జన్మ పొందింది. ఆమెను వీరబాహువనేవాడు వివాహం చేసుకున్నాడు. వారి కుమార్తె *సువర్చల* అనే కన్య.

ఆమెను *వరుణుడు* వివాహమాడాడు. వారి సంతానమే 

*విష్వక్సేనుడు* --  

ఆవిధంగా భూమిపై అవతరించారు విష్వక్సేనుడు. ఆయన తిరుమల పై విష్వక్సేన తీర్థం వద్ద తపస్సు చేసి శ్రీనివాసుని అనుగ్రహం తో వారికి సైన్యాధిపతి అయినారు.

*సువర్చలాసుతన్యస్త సేనాపత్య ప్రదాయనమః*

అని శ్రీనివాసునికి అష్టోత్తరశత నామస్తోత్రంలో ఒక పేరున్నది. అలాగే వేంకటేశ సహస్రనామం లో

*సౌవర్చలేయవిన్యస్త రాజ్యకః*

అని ఇంకొక నామం వున్నది.  ఇది అవతారం విశేషం.  

3. *కుముదాక్షుడు* అనేవాడు  విష్ణుగణాధ్యక్షులలో ఒకడు. అతనికి సింహాద సంహారం సమయంలో సైన్యాధిపత్యాన్నిచ్చి అతని ద్వారా సింహాదుని సంహరించారు శ్రీనివాసుడు. అందుచేత *కుముదాక్షగణశ్రేష్ట సేనాపత్య ప్రదాత* అనే నామం శ్రీనివాసునికి కలిగింది.: 

*🌟తిరునక్షత్ర తనియన్:*

*తులాయాం గతే దినకరే పూర్వాషాఢా సముద్భవమ్ |*

*పద్మా పదాంబుజాసక్త చిత్తం విష్వక్సేనం తమాశ్రయే||*

 *🌅నిత్యం తనియన్ 😘

 *శ్రీరంగచంద్రమస మిందిరయా విహర్తుం విన్యస్యవిశ్వచిదచిన్నయనాధికారమ్ |*

 *యోనిర్వహత్య మనిశ మంగుళిముద్రయైవ*

*సేనాన్యమన్య విముఖః తమిహాశ్రయామహ||*

 శ్రీరంగనాథుని శ్రీరంగనాయకితోపాటుగా దేవనందనోద్యానమునందు యువరాజువలే విహరించుటకు వీలు కల్పించి లోకముల ఆలనాపాలనలు అత్యంత అద్భుతముగా శ్రీరంగనాథుని ముఖోల్లాసార్థమై నిర్వహించు విష్వక్సేనుడను విష్ణుసైన్యాధిపతిని అన్యులనాశ్రయింపనివాడనై సేవింతును.

(R P ఆచార్యుల వారు అనుగ్రహించిన  విషయం)

వైద్యం వేంకటెశ్వరాచార్యులవారి సౌజన్యంతో

Monday, January 23, 2023

శృంగార భాగవతం - రుక్మిణీకల్యాణము

 శృంగార భాగవతం - రుక్మిణీకల్యాణము

     




సాహితీమిత్రులారా!


 రుక్మిణీ మనోగత వితర్కం రమణీయం. ఒక ముగ్ధ నాయిక సందిగ్ధావస్థ  కామెప్రతీక.

సందేహాలెన్నో(10.1723)   ఆమె మనసును తుమ్మెదల గుంపులాముసురుకున్నాయి.

ఆమెకు దైవచింతనకూడా మొదలయింది(10.1724).ఆ తర్వాత

 పద్యపంచకం(10.1726నుండి1729,1731)లో వితర్క విషాదౌత్సుక్య దైన్య త్రాసాది భావాలు 

అయోగ విప్రలంబ శృంగార రస పుష్టికి దోహదించాయి.ఆమె మనస్సా గరం

 అల్లకల్లోలమయింది.ఆ విషాదంలో జాగరం అరతి అన్నీ

శ్రీకృష్ణ నిరీక్షణానికే  లక్షింపబడినాయి.కందర్ప పరీకల్పితో

ద్వేగ జన్యమైన చింతా విశ్వాస దైన్య స్తంభాది భావాలతో

రుక్మిణి విరహతప్త(10.1727)అయింది.ఈ మనః కంపం

వల్లనే ఆమెకు అశ్రుపాతం కృశతాదులు కలిగాయి.

అందు వల్లనే పరితప్త హృదయంతో ఆమె సర్వశృంగార కళల్నీ

పరిత్యజించింది. ఎడబాటును సహించలేక ఆమె చలించి

పోయింది.సుకుమారంగా ,మెల్లగా వీస్తున్న చల్లగాలికి ఆమె

దూరంగా తొలగిపోయింది.మత్తెక్కిన తుమ్మెదలు ఝంకా

రాలతో తిరుగుతూ  ఉంటే,పక్కకు వెళ్లిపోయింది.కోయిల

కూతకు కోపగించుకుంటుంది.రామచిలుకలనుంచి ముద్దు

మాటలు పుట్టుకొస్తూంటే మదనవేదనతో ఉలికి పడింది. వెన్నెల వేడికి

 అలసిపోతుంది.చిరుమామిడికొమ్మల లేత నీడలకు దూరంగా పోతుంది.  

       ఇలా సర్వజన సంతోష సంధాయకాలైన ప్రకృతి ప్రణయగీతాలూ ప్రకృతిగత రసరమ్య దృశ్యాలూ అన్నీ

రసానంద దాయకాలయినాయి.అయోగ శృంగార పుష్టికి

పోతన చేసిన రసవత్కల్పనం రుక్మిణీ విరహవర్ణనం.

      రుక్మిణీ ప్రథమ వీక్షణంలోని శ్రీకృష్ణ సౌందర్య వర్ణనంవల్ల

అయోగశృంగారం సంభోగశృంగారంగా ధ్వన్యమాన మయింది

మూలంలో  *దదృశేచ్యుతం* (10.53-55)అనే వాక్య లేశం పోతన అనువాదంలో పూర్తిగా  

ఈ కింది రసరమ్య పద్యంగా వృద్ధిచెంది విభావముఖంగా శృంగార రస సూచితం

కావటం పరమౌచిత్యం-

కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖున్ కంఠీరవేంద్రావ ల

గ్ను నవాంభోజ దళాక్షు జారుతర వక్షున్ మేఘ సంకాశ దే

హు నగారాతి గజేంద్రహస్త నిభ బాహున్ జక్రి బీతాంబరున్

ఘన భూషాన్వితు గంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్

       రుక్మణీ సౌందర్యం విభావంకాగా వీరులైన రాజులు ఏక

పక్షంగా వేగంగా విభ్రాంతులుకావడం అనుభావం.

అది రసాభాసం.వారి విభ్రాంతి మూలంగా 

వారు దర్శించిన రుక్మీణీ స్వరూపం స్మరణీయం.

ఆమె వీరమోహిని.వారు విభ్రాంతాత్ములు. 

రస నిర్వహణలోని రహస్యాలు ఇలాంటివి

పోతనలో ప్రత్యేకించించి గుర్తించవలసి ఉంటుంది.

    ఇలా శృంగార రసోజ్జీవంలో తాండవమాడుతూ  రుక్మిణీ

కల్యాణ కథ పోతన్న శృంగార రసనిర్వహణ చాతురికి నికషో

పలమై నిలిచింది.

    కల్యాణ హృద్యపద్యం-

ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతో హారిణిన్ మాన వై

భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాం

ధవ సత్కారిణి బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్

సువిభూషాంబర ధారిణిన్ గుణవతీచూడామణిన్ రుక్మిణిన్

                                                                                  -భాగవ 10.1784

           

        కమ్మని పద్యాలందించిన బమ్మెరవారి పాదారవిందాలకు వందనాలతో

సమర్పణ-వైద్యంవేంకటేశ్వరాచార్యులు 

Saturday, January 21, 2023

పంచపాషాణ పద్యాలలో మరొకటి

 పంచపాషాణ పద్యాలలో మరొకటి




సాహితీమిత్రులారా!



పంచ పాషాణా లలో ఇది మరొక పద్యం 

భండనభీమ నిన్నెదిరి పారక నిల్చిన శాత్రవుల్ బృహ 

న్మండలపుండరీక హరి,నాకనివాసులు పారియున్ బృహ 

న్మండల పుండరీక హరినాక నివాసులు చచ్చియున్ బృహ 

న్మండల పుండరీక హరినాక నివాసులు చిత్ర మెన్నగన్

అర్థము:--భండనభీమ =యుద్ధమునందు శత్రువులకు భయము గలిగించు వాడా!, 

నిన్ను,ఎదిరి =ఎదిరించి 

పారక=వెన్నిచ్చి పరుగెత్తక, నిల్చిన శాత్రవుల్ =పగవారు 

బృహ=గొప్పవైన, మండల =గుండ్రములైన,

పుండరీక=వెల్లగొడుగుల తోడ, హరి=గుఱ్ఱము మీద, 

నాక=సుఖముగా, ని-మిగుల వా=తిరుగుటకు 

ఆస=స్థానమైన,పారియున్ =పారిపోయియు, 

బృహత్ = గొప్ప, మండల=ఒక రకమైన పాములకు,

పుండరీక=పులులకు, నాక =అడవి నేలలందు, 

ని=పోయిన, వాసులు =కట్టుబట్టలు గలవారై యుందురు.

చచ్చియున్=చనిపోతే,బృహ=విశాలమైన, మండల=ఎర్రనైన, 

పుండరీక=కమలముల వంటి. హరి=సూర్యుని యందు 

నాక=వైకుంఠ మందును నివాసులు=ఉండువారు.

ఓ! భండనభీమా!యుద్ధములో నిన్నెదిరించి పరిగెత్తి పోక నిలిచి పోరాడి తాళలేక గుర్రాలమీద పరిగెత్తి పోయి  పుట్టగొడుగులు, పాములు,పులులు గల అడవిలో కట్టు బట్టలతో తిరుగుచుందురు.యుద్ధములో చనిపోయిన వారు సూర్యమండలము లేక వైకుంఠమునందు చేరుదురు.ఎలా చనిపోయినా వీరమరణం పొంది స్వర్గలోకాన్ని చేరుతారు.అని భావము    

( బృహన్మండల పుండరీక-దగ్గరే నానార్ధకమైన శ్లేష!1అడవులపాలవుతారు 2 పారిపోక యెదిరిస్తే వీరమరణంపొంది సూర్యమండలాన్ని అధిగమించి నాకలోక సుఖాలననుభవిస్తారని భావం! ఇదోగమ్మత్తు!)  

Thursday, January 19, 2023

క- గుణితక్రమ పద్యం

 క- గుణితక్రమ పద్యం



సాహితీమిత్రులారా!



క- గుణితక్రమ పద్యం పద్యంలోని పదాలు/సమాసాలు

వరుసగా   తలకట్టు,  దీర్ఘం,  గుడుసు, గుడు సుదీర్ఘం   ఇలా  

గుణితక్రమంలో  రచించడం ఒక చిత్రరచన.

గద్వాల విద్వత్కవి కాణాదం పెద్దన

సోమయాజి అధ్యాత్మరామాయణంలో

చంద్రోదయవర్ణనం " -క- గుణితంలో "

రచించినాడు. 

ఆ పద్యం-----

చ.'క'మలవిరోధి,  'కా'మజయ- కారి, 'కి'రద్యుతి, 'కీ'ర్తనీయుడున్

    'కు'ముదహితుండు, 'కూ'టమృగ- గోప్త, 'కృ'తాంతుడు, 'క్లు'ప్తసత్కళా

    క్రముడును, 'కే'శవేక్షణము-  'కై'రవణీశుడు,'కో'కభేదనా

     గమనుడు,'కౌ'ముదీకరుడు,- 'కం'ధిభవుండుదయించెతూర్పునన్

                                                                                 ---సుందరకాండ,31పద్యం

వైద్యం వేంకటెశ్వరాచార్యులవారి సౌజన్యంతో

Sunday, January 15, 2023

ప్రబంధరాజవేంకటేశ్వర విజయ విలాసం: ముద్రాలంకారాలు

 ప్రబంధరాజవేంకటేశ్వర విజయ విలాసం:  ముద్రాలంకారాలు

          



సాహితీమిత్రులారా!



ప్రబంధరాజంలో ముద్రాలంకార చమత్కారవిశేషాలు వివిధ పద్యాలలో

దర్శనమిస్తాయి. ప్రస్తుతార్థాన్ని  ఇచ్చే  పదంచేత సూచ్యార్థ సూచనం  ఉంటే  ముద్రాలం కారం.

సూచ్యార్థం అంటే సూచింప దలచిన అర్థం.

1.అర్ణవ దండకం: ప్ర.రా.వేం.వి.విలాసంలో 148వ పద్యం

అర్ణవదండకం.ఈదండకంలో శ్రీవేంకటే శ్వర స్వామివారు 

"సంసార ఘోరార్ణవో త్తారణా" అని స్తుతించబడినాడు.  

ఈ దండకం పేరు _అర్ణవ_దండకం.దండక భేదం పేరును సూచ్యార్థంగా ప్రయోగిం

చినాడుకవిగారు,కనుక ఇది ముద్రాలంకారం.

2.మత్తేభవిక్రీడిత:  జలక్రీడాభివర్ణన సందర్భంగ కవిగారు--

మ.వనజాతాక్షియురోజకుంభములతో వర్తించురోమావళీ

   ఘన హస్తస్థితిలో గన న్మకరికల్ ఘర్మాంబులన్ దోcగ జా

   ఱిన గస్తూరిమదంబుతోcదళుకుమీ ఱెన్ హార పద్మాభతో

   మనముప్పొంగcగడిగ్గెcదత్సరసికిన్ మత్తేభవిక్రీడితన్

మత్తేభవిక్రీడిత పద్యంలో హృద్యంగాసూచ్యార్థం చేయడం ముద్రాలంకారం.

3.వనమయూర:

అబలలకు తలవెంట్రుకలు జారి కటిసీమను కప్పివేసినవి జలకేళిలో

వనమయూరాల వలె తాండవం చేస్తున్నారని ముద్రాలంకారంగా 'వనమయూర'  వృత్తంలో వర్ణించినారు కవిగారు, కవిగారు----

వనమయూర వృత్తం:

చండగతి పెన్నెఱులు- జారి కటిసీమన్

మెండుకొని గప్ప కడు- మీఱి జలకేళిన్

దాండవము సల్పెడు వి-ధంబునను నీటై

యుండి రబలల్  వనమయూరముల  రీతిన్

4.ఉత్పలమాల:

  ఉ.ఏమని యెంచవచ్చుc బ్రస- వేషు శరాసన తాపవేదనన్

     వేమఱుcగుందుచో సఖులు-వేగ బ్రఫుల్ల సరోజమాలికా

    స్తోమము మేనcదాల్ప నవి- తోడనె కంది విచిత్ర భంగియై

    భామ యురోజసీమc గను- పట్టెను నుత్పలమాలికా కృతిన్

             భామలపై మన్మథుడు పూల బాణాలు వేసినాడు. అవి సరోజమాలి కలవలె ఆమె మేన ఉన్నాయి. అయితే అవి  కందిపోయి  "ఉత్పలమాల" ఆకృ కృతిలో కనిపించినవి. ఉత్పలమాలిక

పద్యంలో ఉత్పలమాలాకృతి చెప్పడం సూచ్యార్థం,కనుక ఇదిముద్రాలంకారం.

5.మానినీ

    నిబ్బరమైనది నెక్కొను వేదన- నిల్పదలంపుచు నేర్పులచే

    నబ్బురమంద రయానకొనర్చిన- వన్నియు నిష్ఫల మౌచును బో

    నుబ్బిన కాcకకు నోర్వక ఱెప్పల- బొయ్యన వ్రాల్చుచు నుస్సురనన్

    గబ్బి సఖుల్ తటకాపడి మానిని గన్గొని పల్కిరి కర్జముగాన్

ఒక మానిని వేదనను నిల్పుచేయాలని ఆమె సఖులు  ప్రయత్నించినారు. ఈ

విషయాన్ని   _మానిని_   వృత్తంలో చెప్పడం ముద్రాలంకారం.

6.మత్తకోకిల:

 కాంతలు శోభనగాథలను మత్తకోకిల రీతులుగా అందరూ జతగూడి పాడి నారని మత్తకోకిల పద్యంలో చెప్పట

ముద్రాలంకారం.ఆ పద్యం -----

మత్తకోకిల

గానవైఖరినందు కొందరు- కాంత లయ్యెడc జేరి సో

బానయంచొక పాటcబాడగ- బాడినంతనె వింతయై

గానుపింపcగc బూర్వశోభన  గాథలెల్లను మీఱcగా

మానినుల్ కవగూడి పాడిరి- మత్తకోకిల రీతులన్

7.ఆటవెలది  

వింగళించి"యాటవెలcది" చందంబున

కోపులందుమీఱి యేపుతోన

మిత్రగణములతి విచిత్రతంబై కొన

దైవగణము లెదురcదారసించె.

ఆటవెలది అని పద్యం పేరునుపేర్కొన డమే కాక మిత్రగణాలు,దైవగణాలూ

పేర్కోవడం చిత్రం. 

8.భాస్కరవిలసిత :

పంకజదళనిభలోచన- శంకాభావమునిహృదయ- సతతవిహారా

కుంకుమ మృగమద సాంకవ- పంకోరస్థలకృతపద- వననిధి కన్యా

లంకృత మణిగణభూషణ- యం కీకృతమృదుగతిమరు- దసితశరీరా

వేంకటగిరివర రుచ్య క- లంకా భాస్కరవిలసితలగదరి హస్తా

పై పద్యంలోరెండు కందపద్యాలుకూడ గర్భితం.పద్యనామం నాలుగవపాదం

చివరన ఉంది,ముద్రాలంకారం. చమత్కారంగ పద్యనామం  కూడ   వర్ణిత  భావంలో   పొదగడం 

ముద్రాలంకారం.ఇదొక చిత్రకవితా  విశేషంగ కూడ పండితవర్య కథనం.

ప్ర.రా.వేం.వి.విలాసంలో ఎనిమిది ముద్రాలంకారాలు ఉన్నాయి.

                      

వైద్యంవేంకటేశ్వరాచార్యులు సౌజన్యంతో

Friday, January 13, 2023

బమ్మెరపోతన భాగవతం- అలంకార సౌందర్యం శ్లేషాలంకారం

  బమ్మెరపోతన భాగవతం-

అలంకార సౌందర్యం శ్లేషాలంకారం





సాహిమిత్రులారా!



కేవలం ప్రకృతాలకుకానీ,కేవలం అప్రకృతాలకుకానీ

శబ్దమాత్ర సామ్యం ఉంటే శ్లేష అంటారు.

పోతన భాగవతంలో  శ్లేష  అద్భుతమైన రూపాలలో దర్శన మిస్తోంది.

సంస్కృతంలోని కాదంబరీ గద్యలోని శ్లేషను పోలిన

గద్యను   బమ్మెరవారు  నైమిశారణ్య   వర్ణనసందర్భాన హృద్యంగా రచించినారు.

                       నైమిశారణ్యవర్ణనము

వ.మధువైరి మందిరంబునుం బోలె మాధవీమన్మథ మహితంబై.

అర్థం:

      1.మధువనే రాక్షసుడిని చంపిన విష్ణువు యొక్క మందిరంలా మాధవి(లక్ష్మితో)మన్మథునితో ఉంది నైమిశం.

      2.మాధవి అంటే గురివిందచెట్టు,మన్మథ అంటే వెలగ

చెట్టు-ఈ చెట్లుకలిగి ఉంది నైమిశం.

వ.బ్రహ్మగేహంబునుంబోలె శారదాన్వితంబై

అర్థ:

      1.బ్రహ్మదేవుని సత్యలోకంలా సరస్వతిదేవితో కూడు కున్న దై.

      2.శారదాన్వితంబై, శారదా=ఏడాకుల అరటిచెట్టు,పచ్చపెసర.

వ.నీలగళసభా నికేతనంబునుంబోలె వహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమవతీ కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత జటిపటల మండితంబై

అర్థం:

     1.నల్లని కంఠంగల మహేశ్వరుని సభామండపంవలె

వహ్ని=అగ్ని,వరుణ=వరుణుడు,సమీర=వాయువు,చంద్ర=

చంద్రుడు,రుద్ర=ఏకాదశరుద్రులు,హైమవతీ=పార్వతి,కుబేర=కుబేరుడు,వృషభ=నంది,గాలవ=గాలవుడు,శాండిల్య=శాండిల్యుడు,పాశుపత=పాశుపతదీక్షపొందినవారు,జడ=జడలు  పెంచినవారి,  పటల=గుంపులతో, మండితంబై=ప్రకా శించినదై. 2.వహ్ని=చిత్రమూలం,వరుణ=ఉలిమిరిచెట్టు,సమీరణ=మరువం,చంద్ర=పెద్ద ఏలకి,రుద్ర=రుద్రాక్ష,హైమవతి=తెల్లవస(కరకచెట్టు),కుబేర=నందివృక్ష,వృషభ=అడ్డసర,గాలవ=లొద్దుగచెట్టు,శాండిల్య=మారేడుచెట్టు,పాశుపత=శ్రీవల్లి,జటి=జడలతీగెల,పటల=సమూహంతో,మండితంబు ప్రకాశిస్తోంది.

వ.బలభేది భవనంబునుంబోలె నైరావతామృత రంభాగణికాభి రామంబై

అర్థం: బలభేదివనంబునుంబోలె- దేవేంద్రుని సౌధంవలె                

 1.ఐరావత=ఐరావతమనే ఏనుగుతో, అమృత=సుధతో, రంభా=రంభ మొదలయిన,గణిక=(దేవ) వేశ్యలతో, అభిరా మంబై=మనోహరమై.                                       2.ఐరావత=నారింజ,అమృత=ఉసిరిక,రంభ=అరటి,గణిక=అడవిమొల్ల,మొదలైనవాటితో మనోహరమై.  

వ. మురాసుర నిలయంబునుంబోలె నున్మత్త రాక్షసవంశ సంకులంబై

అర్థం:                                                  

 1.మురాసురు డనే రాక్షసంని నివాసంవలె--  ఉన్మత్త=బాగామదించిన,రాక్షస=రక్కసుల,వంశ=కులంతో,సంకులంబై=కూడినదై.                            2.ఉన్మత్త=ఉమ్మెత్త,రాక్షస=నల్లకచోర,వంశ=వెదురు మొదలైనవాటితో కూడినదై.  

వ.ధనదాగారంబునుంబోలె శంఖ పద్మ కుంద ముకుంద సుందరంబై

అర్థం:

1.ధనదాగారంబునుంబోలె=కుబేరుని నిలయంలా--

   శంఖ,పద్మ,కుంద,ముకుందమొదలయిన నవనిధులతో మనోహరమై,                                     2.శంఖ=బోరపుష్పి,పద్మ=తామర,కుంద=మొల్ల,ముకుంద=కుందురుష్కమనే గంధపుచెట్లతో సుందరంగా ఉన్నదై.

వ.రఘురామ యుద్ధంబునుంబోలె నిరంతర శరానల శిఖా బహుళంబై

అర్థం:                                              

1.రామచంద్రుని యుద్ధంలా-- 

శర=బాణాలయొక్క,అనలశిఖా=అగ్నిజ్వాలలతో,బహుళంబై

2.శర=రెల్లు,అనలశిఖా=శక్రపుష్పిఅనేవాటితోనిండినదై.

వ.పరశురాము భండనంబునుంబోలె నర్జనోద్భేదంబై

అర్థం:భార్గవరాముని యుద్ధభూమిలా-

 1.అర్జునోద్భేదనంబై=కార్తవీర్యార్జునుని చీల్చినదై,          

 2.కార్తవీర్యార్జునోద్భేదనంబై=భూమిని చీల్చుకుంటూవచ్చే పొదలు కలదై.   

వ.దానవ సంగ్రామంబునుంబోలె నరిష్ట జంబ నికుంభ శక్తి యక్తంబై.

అర్థం:  రాక్షసయుద్ధంలా-                                     

 1.అరిష్ట=అరిష్టుని,జంభ=జంభుని,నికుంభ=నికుంభుని,  శక్తియుక్తంబై=శక్తులతో కూడుకున్నదై.            2.అరిష్ట=వేము,కుంకుడు,జంభ=నిమ్మ,నికుంభ=దంతిట్టు     శక్తులతో. 

వ.కౌరవ సంగరంబునుంబోలె ద్రో ణార్జునకాంచనస్యందన కదంబ సమేతంబై

అర్థం: కౌరవ(కురుక్షేత్ర) యుద్ధంలా-

1ద్రోణ,అర్జున,కాంచనరథాల సమూహంతో కూడినదై.

2.ద్రోణ=తుమ్మిచెట్టు,అర్జున=ఏఱుమద్దిచెట్టు,కాంచన=సంపెంగ,స్యందన=తినాసవృక్ష,కదంబ=కడిమిచెట్టు మొదలైన

వాటితో కూడుకున్నదై.

వ.కర్ణు కలహంబునుంబోలె మహోన్నత శల్య సహకా రంబై

అర్థం: కర్ణుని కయ్యంలా-

 1.గొప్పవాడైన శల్యుని సహకారం కలిగినదై.

 2.మహోన్నతశల్య=పెద్దమంగచెట్లూ,సహకారంబై=తియ్య

   మామిడిచెట్లూ కలదై.

వ.సముద్ర సేతుబంధనంబునుంబోలె నల నీల పన సా ద్యద్రి ప్రదీపోతంబై

అర్థం:రామసేతువులా-

1.నలుడు,నీలుడు,పనసుడు మొదలైనవారుతెచ్చిన  కొండ లచే ప్రకాశించేది.

2.నల=వట్టివేరు,నీల=నీలిచెట్టు,పనస=పనసచెట్టు,కొండలు

    మొదలైనవి ప్రకాశిస్తున్నదై.

వ.భర్గు భజనంబునుంబోలె నానాశోక లేఖా ఫలితంబై

అర్థం:                                           

1.ఈశ్వరునిగురించి చేసే భజనలా-                     

అశోక=నాశన(దుఃఖ)రహితమైన,నానా= అనేక,లేఖాఫలితంబై=అక్షర ఫలాలు కలదై.

2.నానా అశోక.... =అనేక ఫలాలుగల అశోక వృక్షాల వరుసలు కలదై.

వ.మరుని కోదండంబునుంబోలె బున్నాగ శిలీముఖ భూషితంబై

అర్థం:                                                                       

1.మన్మథుని విల్లువలె పున్నాగ పుష్పబాణాలు కలదై

2.చెఱకు,తుమ్మెదలతో ఉన్నదై.

       భాగవతంలో శ్లేషాలంకారయుక్తమైన పద్యాలుకూడా

పోతనగారు అక్కడక్కడా మెరుపులా హృద్యంగా దర్శింప

జేసినారు.మచ్చునకు-

        సీ. పున్నాగ!కానవే- పున్నాగ వందితు,

              తిలకంబ!కానవే- తిలక నిటలు,

            ఘనసార!కానవే-ఘనసార శోభితు,

               బంధూక!కానవే-బంధు మిత్రు,

             మన్మథ!కానవే-మన్మథాకారుని,

               వంశంబ!కానవే-వంశధరుని,

              చందన!కానవే-చందన శీతలు,

                కుందంబ!కానవే-కుంద రదను,

          తే. ఇంద్రభూజమ!కానవే-ఇంద్ర విభవు,

              కువలవృక్షమ!కానవే-కువల యేశు,

              ప్రియక పాదప!కానవే-ప్రియ విహారు,

              అనుచు కృష్ణుని వెదకి రయ్యబ్జముఖులు.

                                                -౧౦పూ,౧౦౦౯

గోపకాంతలు వనంలో శ్రీకృష్ణుని  వెదకుతూ   ఆయా  వృక్షా

లను కృష్ణసంబంధితమైన పదాలతో సంబోధిస్తారు. ఇదీ ఈ

పద్యంలోని హృద్యమైన చమత్కార శ్లేష.

  పున్నాగశబ్దానికి పున్నాగవృక్షమనీ,పురుష పుంగవుడనీ

వేరు వేరు అర్థాలు ఉన్నాయి.అలాగే తిలక , ఘనసార , బం

ధూక , మన్మథ , వంశ , చందన , కుంద , ఇంద్ర , కువల ,

ప్రియక  అనే పదాలు ఆయా వృక్షాలకుగల పేర్లు. వరుసగా

ఫాలతిలకం,పరాక్రమం,సద్బంధుడు,మన్మథాకారత్వం,వేణువు,గంధం, మొగ్గలవంటి దంతసౌందర్యం,ఇంద్రవైభవం,ధరాధి

నాథత్వం, ప్రియవిహారం-అనే విశేషణాలు వాటికిగల రెండవ

అర్థాలు.

       ఈ శ్లేష చేత శ్రీకృష్ణుని రూపగుణ లావణ్య విశేషాలను

వర్ణిస్తూ  ఆయా  వృక్షాలను కృష్ణునికోసం ఆరా తీశారు గోప

కాంతలు.ఇది గోపికలకు వృక్షాలతోగల సాహచర్యంతోపాటు,

వారికి శ్రీకృష్ణునిపైగల ప్రేమనూ సువ్యక్తం చేస్తోంది. ఇదొక

మధురానుభూతిని కలిగించే అందమైన శ్లేష. ఈ శ్లేషలో

పోతన్నగారి ఈ పద్యకృతిలో హృద్యచమత్కృతి కన్పిస్తాయి.

వైద్యంవారి సౌజన్యంతో....

Wednesday, January 11, 2023

ద్విపద కందగుప్తం

    ద్విపద కందగుప్తం

         



సాహితీమిత్రాలారా!



కందపద్యంలోనే ద్విపద గుప్తంగ ఉండే రచనను  

ద్విపదకందగుప్తం అంటారు.అంటే కందపద్యం ద్విపద లక్షణంకూడ కలిగిఉంటుంది. 

          ఈ  కింది కంద ద్విపద గణాది లక్షణాలను నిశితంగ పరిశీలిస్తే 

ద్విపద కందగుప్త రచనలో ఉండే కిటుకు తెలుస్తుంది.


క.కలువలదొర మానికముల

   దళంపు తలపుల నెపుడును-దగలోగొనగన్

   గల తరగల పాలకడలి

   చెలంగు చెలువుని నిను గొలి-చెద లోకమునన్.

పై కందంలో గుప్తమైన

ద్విపద:

కలువలదొరమాని-కములదళంపు

తళుకులనెపుడును-దగ లో గొనగను

గల తరగల పాల-కడలి చెలంగు

చెలువుని నిను గొలి-చెదలోకమునన

     పై పద్యం గణపవరం వేంకటకవి రచించిన 

"ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసం"(143)లో ఉంది.

                         

వైద్యంవేంకటేశ్వరాచార్యులుగారి సౌజన్యంతో

Monday, January 9, 2023

చమత్కార పద్యం

 చమత్కార పద్యం





సాహితీమిత్రులారా!



దురాశా దుర్దశా చేతి ద్వే భార్యే మే పతివ్రతే

దురాశా పురతోయాతి, దుర్దశా మాం న ముంచతి.

ఒక వ్యక్తి తన మిత్రుడితో దిగులుగా  యిలా అంటున్నాడు. 

మిత్రమా! నాకు యిద్దరు భార్యలోయ్ అని.

అయితే ఇంకేమి యిద్దరి పెళ్లాలతో హాయిగా వుండవచ్చు గదా! అన్నాడు ఆ మిత్రుడు.

వారిద్దరూ పతివ్రతలే.నోయీ. అన్నాడు మొదటివాడు. ఇంకా మంచిది. నిన్నుతప్ప 

మరెవ్వరి గురించీ ఆలోచించరు కదా! అదృష్ట వంతుడివి. మిత్రుడి కితాబు.

ఒకరు ముందు నడుస్తున్నారు. అన్నాడు మొదటివాడు.అంటే 

నీకు కష్టం కలుగకుండా దారిలో ముళ్ళూ అవీ లేకుండా దారి  శుభ్రం చేస్తుందన్నమాట. 

మిత్రుని స్వా౦ తనం.

రెండోభార్య నన్ను వదిలి పెట్టదు. అంటే నీవెంటే ఉంటుందన్నమాట మరీ మంచిదికదా

ఇంతకీ నీ బాధేమిటి?వాళ్లెవరు?వారి పేర్లేమిటి? మిత్రుడడిగాడు.

ఒకామె దురాశ,రెండో భార్య దుర్దశ. దురాశ ఎప్పుడూ నాకన్నా ముందు వెళుతూ వుంటుంది. 

దుర్దశ నన్ను వెన్నంటే 

వుంటూంది. అదీ అతగాడి బాధ. దురాశ ఉన్నవాడిని దుర్దశ వదలదు. అనేదే ఇందులో చమత్కారం. ఆశ మనిషికి 

అవసరమే కానీ దురాశ పనికి రాదు. లభించిన దానితో తృప్తి పడాలి. అంతే కానీ  

యింకా ఎక్కువ కావాలనుకుంటే మిగిలేది దుర్దశే అని చమత్కారంగా చెప్తున్నాడు కవి 

ముఖపుస్తకం నుండి.....

Friday, January 6, 2023

సెల్లుతల్లి

 సెల్లుతల్లి




సాహితీమిత్రులారా!



ఈనాడు మన సెల్లు ఉపయోగం

గురించి ఒక కవి కూర్చిన గేయం గమనించండి-


            అక్షర సరస్వతీ!

                శబ్దభారతీ!!

                     వాగ్దేవీ!

       ఒకప్పుడు నీనిలయం మస్తకం

        ఒకప్పుడు నీనిలయం పుస్తకం,

         తల్లే!ఇపుడు నీ నిలయం సెల్లే,

                అక్షరనిలయం సెల్లే,

                  శబ్దనిలయం సెల్లే!

                         అందుకే

          _తల్లీ!నిన్నుదలంచి పుస్తకము_

                    _చేతంబూనితిన్_

                   అనేవాళ్లం ఇప్పుడు,

      సెల్లూ! నిన్నుదలంచి ఎల్లపుడు నా

             చేతం దాల్చితిన్ నీవు నా       

    యుల్లంబందున నిల్చి జృంభణముగా

            ఉక్తుల్ సుశబ్దాలు శో

    భిల్లంబల్కుము సెల్లుతల్లి! నినునే

               ప్రీతిన్ కరంబందున్ 

   ఫుల్లాబ్జాక్షి! ధరించి మ్రొక్కెదను సం

            ప్రీతిన్, జగన్మోహినీ!!

                   అంటున్నాం

                   జై సెల్లు తల్లీ!

                   జైజై సెల్లుతల్లీ!!

సాహిత్యసంస్థానాలు ముఖపుస్తకం నుండి-

Wednesday, January 4, 2023

మొదటి రథబంధకర్త తిరుమంగై ఆళ్వారులే

 మొదటి రథబంధకర్త తిరుమంగై ఆళ్వారులే




సాహితీమిత్రులారా!

మొదటి రథబంధకర్త తిరుమంగై ఆళ్వారులే

అనే వ్యాసాన్ని శ్రీమాన్ వైద్యం వేంకటెశ్వరాచార్యులు

కూర్చారు దాన్ని ఇక్కడ ఆస్వాదించండి-



Monday, January 2, 2023

చతురంగ బంధం (తమిళ్)

 చతురంగ బంధం (తమిళ్)




సాహితీమిత్రులారా!

తమిళంలోని చతురంగ బంధం

ఆస్వాదించండి-