Thursday, May 30, 2019

సాహిత్యంలో చాటువులు - 4


సాహిత్యంలో చాటువులు - 4



సాహితీమిత్రులారా!

జీవితం ఎంత చిత్ర మైనది! ఇలా ఉండాలి అని మనం అనుకొంటాం, కాని ఇలా ఉంచాలి అని భగవంతుడు అనుకొంటాడు” అని పెద్దల నానుడి. ప్రతి వ్యక్తి జీవితంలో మంచి,చెడులు చీకటి,వెలుగుల్లా ఉంటూనే ఉంటాయి. వాటిని అనుభవించి అధిగమించడమే ఉత్తమ లక్షణం. అదృష్టం, దురదృష్టం కూడా పక్కపక్కనే ఉంటాయి. వాటిని మనం తప్పించుకోలేము. ఈక్రింది ఉదాహరణ చూడండి----

“ పాములు ఆడించి జీవనం సాగించే వాడి ఇంట్లో ఒక ముసలి పాము బుట్టలో ఉంటుంది. పాములవాడు అది తనకి ఇంక పనికి రాదని దానికి ఆహారం కూడా ఇవ్వడు. అదినీరసించి, చావుకు దగ్గరలో ఉంటుంది. బలహీనతవల్ల బుట్ట మూత తీసుకొని బయటకు రాలేక పోతుంది. ఇది ఆపాము పరిస్థితి. ఓ రోజు ఒక ఎలుక ఆహారం కోసం ఆ పామున్న బుట్టకి కన్నం పెట్టి అందులో దూరుతుంది. అప్పుడు ఆముసలి పాము నోటివద్దకు వచ్చిన ఆ ఎలుకను భక్షించి కొంచెం బలం పుంజుకొని, ఆ ఎలుక చేసిన కన్నం లోంచే బయటకి వచ్చి హాయిగా వెళ్లి పోతుంది.” ఒక చిన్ని సుభాషితం తెలిపే కథ. ఇక్కడ చనిపో వలసిన పాము అదృష్టం వల్ల బ్రతికింది, దురదృష్టం వల్ల బాగున్న ఎలుక మరణించింది. కనుక విధి వ్రాతను ఎవరు తప్పించుకో లేరు.అన్నది సారాంశం.ఇది వేదాంతం కాదు. జీవిత సత్యం. ఇట్టి విశేషాలను తెలిపే కొన్ని చాటువులని  తెలుసుకొందాం.

చాటు సాహిత్యంలో ‘శ్రీనాధుని’ చాటువులుగా చెప్పబడే కొన్ని పద్యాలు సుప్రసిద్ధాలు. (ఇవి శ్రీనాధుని పేరుతో ఎవరో రచించారని విమర్శకుల అభిప్రాయం.) వాటిలో కొన్ని----

“ మూతిని ముట్టగా వెరతు- ముద్దకు ముద్దకు కూటిలోపలన్
పాతిక పాలు సైకతము – పచ్చడి కొంచెము – ఆది యంతమున్
చూతమటన్న లేదు – మరి సున్నము కన్నను మెత్త నన్నమీ
రాతిరివంటి భోజన మరాతికినైనను వద్దు దైవమా!”

(వివరణ)

“కవిసార్వభౌముడు”గా పేరుగాంచిన శ్రీనాధునికి కూడా కష్టాలు తప్పలేదు. అని పై చాటు పద్యం తెల్పుతుంది. మంచి ఆరు రుచులతో కూడిన భోజనము తినే శ్రీనాధ కవికి, పలనాడు వెళ్లి నపుడు ఒకరి ఇంట రాత్రి పెట్టిన భోజనము ఎంతఅరుచిగా (చెడ్డగా) ఉన్నదో చెపుతూ ఇలాంటి భోజనము శత్రువుకైనా వద్దు దైవమా! అని బాధ పడతాడు. మరి ఆ భోజనం ఎలాఉంది అంటే -----

మూతిని ముట్టగా వెరతు= నోటిలో పెట్టు కోవడానికే భయంగా ఉందిట. పచ్చడి కొంచమే ఉందిట. ఇంకా ‘ఆది’ మొదట్లో వేసే ‘నేయి’, ‘అంతము’ చివరగా వడ్డించే పెరుగు లేక ‘మజ్జిగ’ చూడటానికి కూడా లేవుట! (“తక్రాంతంహి భోజనం” అని శాస్త్రం. తక్రం అంటే మజ్జిగ.) ఇంక సున్నంలా అన్నం చాల మెత్తగా ఉందిట. ఇటువంటి భోజనము, అరాతికి= శత్రువుకైనా వద్దు అని భగవంతుని ప్రార్థించాడుట శ్రీనాధుడు. ఇది ఈ చాటువు యొక్క భావం. ఇక్కడ అప్రస్తుతమైనా శ్రీనాధుడు వర్ణించిన ఆంధ్రుల భోజన పదార్ధాలను కొన్నింటిని తెలుసుకొందాం. కొన్ని ఆంధ్రులకి అంటే మనకే స్వంతం, ఇష్టమైనవి. ( ఈ వివరణ ఇప్పటి వాళ్ళు తెలుసు కొంటారని!)

అన్నం తెల్లగా మల్లెపూవులా మెతుకు మెతుకు అంటుకోకుండా ఉండాలి. అన్నంలోకి వేడి,వేడి కమ్మని నేయి, చక్కని ముద్ద పప్పు, లేహ్యాలు, చోష్యాలు అంటే పచ్చళ్ళు, పులుసులు, ముక్కల పులుసుని ‘దప్పళం’ అనికూడా అంటారు, ఇంకా తోట కూర పులుసు,మజ్జిగ పులుసు, చారు.(సాంబారు,రసం మనవి కావు.)అందులోకి వడియాలు, అప్పడాలు.

కూరలు- వంకాయకూర తప్పని సరి, పనసపొట్టు కూర, తీయ గుమ్మడికూర, కంద,అరటి,పొట్ల, దొండ,దోస, కాకర,బచ్చలి,తోట కూరలు, బెండకాయ వేపుడు. ఆవకాయి,మాగాయి, గోంగూర, కొబ్బరి నూల పచ్చళ్ళు.

పొడులు- కంది పొడి, పెసరపొడి, పప్పుల పొడి, కారపు పొడి.

ఇంక పిండివంటలు –వీటిని భక్ష్యాలు అంటారు. వడలు, ఆవడలు, పెరుగువడలు, జంతికలు,పప్పు చెక్కలు, చేగోణి(డి)లు,ఇవి కారం. ఇక మధురం-అతిరసాలు( అరిసెలు) బొబ్బట్లు, పూర్ణాలు,( వీటిని బూరెలు అనికూడా అంటారు) సొజ్జేఅప్పాలు, అప్పాలు,లడ్లు ( వీటిని మోదకాలు అంటారు) మినప సున్ని ఉండలు, కొబ్బరి ఉండలు, కజ్జికాయలు,మొ// అన్నంతో చేసేవి--క్షీరాన్నం,లేక పాయసం( పయః అంటే పాలు) పుళిహోర, –(పుళి అనగా చింత పండు, హోర అనగా అన్నం.) దీనినే చిత్రాన్నం అంటారు. దధ్యోదనం, (దధి=పెరుగు. ఓదనం=అన్నం.) వెన్ పొంగలి, (తెల్లని ) దీనిని పులగం అని కూడా అంటారు. శర్కర లేక చెక్కర పొంగలి, చివరగా చక్కని, చిక్కని గడ్డ మీగడ పెరుగు. ఇవి కొన్ని మాత్రమే.( ఉల్లి, వెల్లుల్లి నిషేధం.)ఇవి ఆనాటి వంటకాలు. ఇప్పుడు ఇట్టిదే శ్రీనాధుని ఇంకో చాటువు.

“ ఫుల్ల సరోజ నేత్ర! అల పూతన చన్నుల చేదు ద్రావి నా
డల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల? తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన నొక్క ముద్ద దిగ మ్రింగుము! నీ పస కాననయ్యెడిన్”

ఈ చాటువు కూడా శ్రీనాధుడు పల్నాటి సీమలో తనకి పెట్టిన కుభోజనము ను వర్ణించిన పద్యం. శ్రీకృష్ణుని తో చెప్పిన పద్యం.

( వివరణ)
ఫుల్ల సరోజ నేత్ర= వికసించిన తామరపూ రేకుల వంటి నేత్రములు కల శ్రీకృష్ణా! నీవు విషపూరితమైన పూతన అనే రక్కసి పాలు త్రాగేను అని, అడవిలో వచ్చిన దావాగ్నిని మ్రింగేను అని నిక్కేదవేల? గర్వపడతావు ఎందుకు?అదేమీ గొప్పకాదు. ఇక్కడ పల్నాటిలో తింత్రిణీ పల్లవము అంటేచింతాకుతో కలిపి ఉడికించిన బచ్చలి కూర వేసి పెట్టిన జొన్న సంగటి (ఓ రకమైన అన్నం ముద్ద) ఓముద్ద తింటే నీపస(నీ గొప్ప) తెలుస్తుంది. అని అంటాడు. ఇట్టివి శ్రీనాధుని పేరుతో ఉన్న చాటువులు ఎన్నో ఉన్నాయి. వాటిని చదివి ఆనందించండి.
------------------------------------------------------
రచన - ‘విద్వాన్’ తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు, 
సుజనరంజని సౌజన్యంతో

Sunday, May 26, 2019

పురాస్మృతులు


పురాస్మృతులు



సాహితీమిత్రులారా!

దాశరథి కృష్ణమాచార్య గారి
స్మృతులలోని ఒక స్మృతి ఆయన మాటల్లో --

నా అచ్చైన పుస్తకాలలో మొట్టమొదటిది "అగ్నిధార." సాహితీ మేఖల పక్షాన 1949 లో అచ్చైనది. మిత్రులు శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు, శ్రీ పులిజాల హనుమంతరావుగారు ఈ పుస్తకం తొలిముద్రణ చేయించారు. నా సాహిత్యజీవితంలో తొలుదొలుత ప్రోత్సాహమిచ్చిన వారిలో ముఖ్యులు శ్రీరామానుజరావుగారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు వార్షికోత్సవాలకు పిలిచి, కవిసమ్మేళనాలలో పాల్గొనే అవకాశం కలిగించి, కవితా పరిమళాలు దశదిశల వ్యాపించేట్టు చేసిన మిత్రులకు నా కృతజ్ఞతలు.

అగ్నిధార అనేపేరును కొందరు ఆక్షేపించారు. అగ్ని ధారలా ప్రవహిస్తుందా? అన్నారు కొందరు. విద్యుత్తు అగ్నికాదా? అది ప్రవహించదా? సముద్రంలోని బడబ, అగ్నికాదా? అది నీటిలో అన్నివైపులా సాగిపోదా? అయినా అగ్ని ప్రవహించడాన్ని ఊహించండి. అసలు "అగ్నిధార" లోని అగ్ని అన్నపదం దేనికి సంకేతమో ఆలోచించండి. అగ్ని అనేది చైతన్యానికి సంకేతం. ఆ చైతన్యం ఒక మానవుని హృదయంలోనుండి ఇంకొకనిలోకి ప్రవహించి, ఇలా జాతినంతటినీ ఏకసూత్రాన బంధిస్తుంది. ఇలా వాదిస్తుండేవాణ్ణి. తరువాత కొన్నాళ్ళకు ఒక హిందీ పత్రికలో సుమిత్రానందన్‌ పంత్‌గారి కవిత ఒకటి ప్రచురితమైంది. అందులోని ఒకపంక్తిలో "పావక్‌ కే ప్రహాహ్‌ సీ" అన్న ప్రయోగం కనపడింది. అగ్నిధార అన్నమాటకు కడు దగ్గరగా ఉన్న ఆ ప్రయోగం చూచి నేను మరీ ధైర్యంగా వాదించేవాణ్ణి.

ఈ "అగ్నిధార"లోని ఖండికలు చాలావరకు నాజైలు జీవితంలోను, జైలులోనించి వెలువడిన కొత్తలోనూ రాసినవి. నిజాం రాష్ట్రంలో ప్రభుత్వ నిరంకుశత్వం, ప్రజల అగచాట్లు, భారత స్వాతంత్ర్యం, భారత సైన్యాల ప్రవేశం, నైజాం ప్రభుత్వపతనం - ఇవన్నీ నా ఈ రచనకు పునాదులు.

అయితే వీటితోపాటు అంతర్వాహినిగా కొంత శృంగారం వెలువడక పోలేదు. "అంగారం, శృంగారం నీ రచనలో కలగలిసి వుంటాయి" అంటాడు నా బాల్యమిత్రుడూ, ప్రముఖ రచయిత, విమర్శకుడు శ్రీ డి. రామలింగం. ఇది నాలోని ప్రత్యేకత అని అతని అభిప్రాయం, ఈరెండు భిన్నవిషయాలు కలగలసి సాగడం సాధ్యమా? అని కొందరు అనవచ్చు. దానికి ఉదాహరణలు చాలా కవుల్లో చూపుతాను - ముఖ్యంగా నా ఉర్దూకవి మిత్రులలో మఖ్దూం మొహీయుద్దీన్‌ ఎంత విప్లవకవియో అంత శృంగారకవి. అతని "సురేఖ్‌ సవేరా" చూడండి. అలాగే కైఫీ అజ్మీ, సర్దార్‌ జాఫ్రీ మున్నగువారు. సైనికుడు యుద్ధరంగంలో పోరాడుతూకూడా అప్పుడప్పుడూ తన ప్రియురాలి అందమిఅన కళ్ళను తలచుకోవడం అస్వాభావికమా? కానేకాదు. క్రాంతిని ప్రబోధించే ఎందరో కవులు కమ్మని శృంగారం రాశారు. దానికి ఉదాహరణగా నేను ఎన్నో కవితలను చూపగలను. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, కరకు నైజాం సిపాయీలను ఎదిరిస్తూ అరణ్యాలలో తిరుగుతున్నప్పుడున్నూ, జైల్లోనూ - మావూళ్ళో నదికి మంచినీళ్లు తీసుకుపోవడానికి వచ్చే పచ్చని అమ్మాయి, తలపులో మెదలుతుండేది. నేను జైల్లో ప్రవేశించినప్పుడు నా వయస్సు సుమారు ఇరవై. ఆకాశంలోకి తలెత్తి చూస్తే, మేఘాలు అందమైన అమ్మాయిల ఆకారాలు ధరించి, పొంగిన వక్షస్థలాలతో నన్ను కవ్వించడానికి వచ్చేవి. తల దించి జైలు బ్యారకువైపు చూస్తే, నగ్న ఖడ్గం తళతళా మెరుస్తుండగా తుపాకీకి చెక్కి, కవాతుచేసే భటుడు కనిపించేవాడు. వాణ్ణి నరికేసి , లేదా వానిచే నరకబడి, ఆ ఆకాశంలో కనిపించే మేఘభామిని వైపు వెళ్లాలనిపించేది!

నెల్లికుదురు (మానుకోట తాలూకా) గ్రామంలో పోలీసు స్టేషన్‌ నుంచి తప్పించుకుని అడవిలోపడి పరుగెత్తినప్పుడు, గుఱ్ఱాలమీద నలభై మంది సైనికులు నన్ను వెదుకుతూ వెంటాడినప్పుడు, క్షణం ఆగకుండా అరణ్యంలో పరుగెత్తుతుంటే, ఎక్కడో పది గుడిసెలు, చిన్నపల్లె. అక్కడ కాస్తసేపు ఆగి మంచినీళ్లు అడిగితే, ఆప్యాయంగా ముంతతో నీళ్లు అందించిన రైతు పిల్ల ఒయ్యారం, ఆమెకళ్లలోని అమాయికత నన్ను మైమరపించాయి. నిజామాబాదు జైల్లో కిటికీలోంచి చూస్తే, బయట మామిడికొమ్మ చిగిర్చి, పూలుపూస్తే, లక్ష ఉగాదులు ఒక్కసారి హృదయంలో దూకినట్లుండేది.

మహాకవి "ఇక్బాల్‌" రాసిన ఒక విప్లవగీతంలో -

'జిస్‌ ఖేత్‌సె దహ్ఖా\న్‌కు మయస్సర్‌ నహో రోజీ
ఉస్‌ ఖేత్‌కె హర్‌ ఖూషయె గందం కు జలాదో'

'ఏ పొలమున నిరుపేదకు దొరకదొ తిండి
ఆ పొలమునగల పంటను కాల్చేయండి'

అనే పద్యపాదం ఒకటుంది. అది చదువుతున్నప్పుడల్లా హృదయం ఉద్రేకంతో పొంగి పోయేది. కాస్త చల్లబడ్డాక ఆలోచిస్తే, ఆ పొలాన్ని కాపలాకాసే అందమైన అమ్మాయికి ఏ అపకారం జరక్కుండా ఆ పంట తగలబెట్టాలి సుమా! అనేది హృదయం.

ఇలా శృంగార వీరరసాలు కలగలసి నాలో పెల్లుబికేవి. వాటికి తార్కాణం అగ్నిధార. ప్రముఖ దేశభక్తులు, అమృతహృదయులు, కీ॥ శే॥ వట్టికోట ఆళ్వారుస్వామిగారు నాకు నిజామాబాదు జైల్లో కనిపించారు 1948లో. నేనూ, నాతోపాటు మరో ముప్ఫైమంది రాజకీయఖైదీలు వరంగల్లు జైలునుంచి నిజామాబాదు జైలుకు మార్చబడినపుడు అక్కడ అడుగు పెట్టగానే మొట్టమొదట కనిపించిన మిత్రుడు శ్రీవట్టికోట ఆళ్వారుస్వామి. ఆజానుబాహు విగ్రహం, పచ్చని దేహచ్ఛాయ, చిన్నచడ్డీ, చాలీచాలని గీట్లఅంగీ, నెత్తిన చిన్నటోపీతో, నీళ్లపంపు వద్దకు వెళుతున్నా డాయన. హత్యలుచేసి శిక్షలు పొందినవారికిచ్చే దుస్తులు ఆయనకిచ్చారు! అవే తొడుక్కుని ఆయన కాలక్షేపం చేస్తున్నాడు. నేనంటే - ముఖ్యంగా కవులంటే - ఆయనకు ఎక్కడ లేని అభిమానం. స్వయంగా కవిత రాయకపోయినా, కవిత వినాలని, చదవాలనీ ఎంతో కుతూహలం ఆయనకు. విప్లవాత్మకమైన రచన వింటే ఉప్పొంగిపోయేవాడు. జైలు గోడమీద బొగ్గుతో ఈ పద్యం రాశాను ఒకనాడు.

ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్నుబోలిన రాజు మాకెన్నడేని;
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ, కోటిరత్నాల వీణ.

ఈపద్యం కంఠస్థంచేసి తరచు చదువుతూ వుండేవాడు. జైలు అధికార్లు చెరిపినప్పుడల్లా మరోగోడమీద ఆపద్యం ప్రత్యక్ష మయ్యేది. అది నేను రాస్తున్నానని వాళ్ల దురభిప్రాయం. తరువాత ఆళ్వారు రాస్తున్నాడని కనిపెట్టారు. ఆళ్వారూ, నేనూ కలిసివున్న మూడునెల్లూ మూడు గడియల్లా గడిచాయి జైల్లో. తరువాత ఆయన్ను గుల్బర్గా జైలుకు మార్చారు. నేను హైదరాబాదు (చంచల్గూడా) జైలుకి వచ్చేశాను. అకాల మృత్యువు వాతబడిన శ్రీ ఆళ్వారుస్వామి త్యాగమూర్తి నా హృదయ ఫలకంమీద సర్వదా అధిష్ఠించి ఉంటాడు. ఆయనకు మైత్రీచిహ్నంగా ఈచిన్ని పొత్తము అంకితము చేసుకున్నాను. కల్మషాలులేని కమనీయమూర్తి, కరుణ జాలువారే అనురాగమూర్తి ఆళ్వారు. ఆయనను కోల్పోయి మేము ఎలా జీవిస్తున్నామో నాకు ఆశ్చర్యంగా వుంటుంది. అతను లేకుండా జీవించి ఉన్నందుకు నావరకు నేను సిగ్గుపడుతున్నాను. రాతముఖ్యంకాదు, చేత ముఖ్యం, అన్న ఆయన సూక్తి ఎప్పుడూ నా మనస్సులో మెదులుతుంటుంది. నా జీవితంలోకూడా అనుసరణీయమైన సూత్రం అదే.

'అగ్నిధార'ను ఈనాడు పునర్ముద్రించడానికి పూనుకున్న వారు నా మిత్రులు శ్రీచందా రాజేశ్వరరావుగారు. ఇందుకు ప్రోత్సాహమిచ్చిన వారు శ్రీ ం. ఋ. బలరామాచార్యులు, శ్రీ ఫ్. హనుమంతరావుగారలు. పునర్ముద్రింపబడిన ఈనాడు, సుమారు పదిహేనేండ్లనాటి నా జీవితాన్ని, కాలాన్ని స్మృతికి తెచ్చుకుంటే ఆనందవిషాదాలు, శృంగారవీరాలు అహమహమికతో కళ్ళముందు పరుగెత్తుతాయి. మల్లెలూ, మోదుగులూ రెండూ నాకు నచ్చినట్లు శృంగార, వీరరసాలు రెండూ నా హృదయాన్ని పొంగిస్తాయి. ఆ నాటికీ, ఈ నాటికీ ఆ రెండు రసాల రసాలాల ఫలాలను ఆస్వాదించి ఆనందిస్తున్నాను.

ఈ రెండవ ముద్రణకుగూడా పీఠిక వ్రాసి నన్ను ఆశీర్వదించిన శ్రీ దేవులపల్లి రామానుజరావుగారి సహృదయతకు నా జోహారులు.

-- దాశరథి

హైదరాబాదు
26-1-1963


వీరాంధ్రుడా!

పటు బాహాబలురైన ఆంధ్రుల గత
ప్రాశస్త్యముల్‌ వల్లె వే
యుటలో కొన్ని తరాలు దాటినవి; పూ
ర్వోదంతముల్‌ నేటి సం
కటముల్‌ తీర్పవుగాక, నాటి జ్వలితాం
గారమ్ము లీనాటి కుం
పటిలో బూడిద కప్పుకొన్నవి, రగు
ల్పన్‌ లెమ్ము వీరాంధ్రుడా!

ముక్కలు ముక్కలై చెదరి
పోయెనురా! మనజాతి, హూణ భూ
భుక్కుల రాజనీతికి క
వుంగిళు లొడ్డిన 'రాజు' చేతిలో
చిక్కెను కోటిమంది నివ
సించెడి బంగరు తెల్గునేల, నే
డక్కడ తెల్గుటంగనల
ప్రాణము, మానము దక్కకుండెడిన్‌.

నాటి మహాంధ్రరాట్‌ కరక
నత్‌ కరవాల కరాళధార ఈ
నాటికి తెల్గువాని నయ
నమ్ముల తళ్కులు పెట్టుచున్న దా
రాటము జెందుచున్నది, ప
రాజితమైన తెలుంగునేల పో
రాటమునందు గెల్చుకొని
ప్రాజ్య మహావిభవమ్ము లందగన్‌.

ఎత్తిన కత్తి డింపక జ
యేందిర నందిన పూర్వు లాంధ్రరా
హుత్తుల నెత్తురుల్‌ మసలు
చున్నవి తెల్గులగుండెలన్‌; పరా
యత్త మహాంధ్ర సంపద స్వ
య మ్మొనరింపగ పోరు సల్పగా
వత్తురు స్త్రీలు సైతము, కృ
పాణము లెత్తి జయింత్రు శత్రులన్‌.

తుంగభద్రానదీ భంగమ్ము లిరువాగు
లొరసి పారుచు రుచు లరయునపుడు,
కృష్ణవేణీ తరంగిణి నాలుకలు సాచి
ఇరుకెలంకుల 'మజా' లరయునపుడు,
గోదావరీ వీచికా దివ్యహస్తాలు
దరుల రెండిట మన్ను తరచునపుడు
మలయాచలాధూత మధు సుగంధిలవాత
పోతముల్‌ తెలగాణ బొరలునపుడు,

ఇటు విముక్తాంధ్రభూమి తీపెక్కుచుండ
అటు విషాక్తాంధ్రసీమ చేదై జ్వలించు;
ఇటు తెలుగుజాణ ముక్తిసౌహిత్య మూన
అటు తెలంగాణ దాస్య సంకటములోన!

భారతమాత ఈ తెలుగు
పాపని బొజ్జన దాని కాచి దు
ద్వార మహోగ్రదాస్య విష
బాధలు తాను భరించి, నే డిదే
స్వైరత నందగా, తెలుగు
పాపడు వీడు స్వమాతృ భారతీ
స్మేరపతాక చేత గొన
జెల్లదె ఈ తెలంగాణ భూములన్‌?
--------------------------------------------------------
రచన - దాశరథి కృష్ణమాచార్య, 
సుజనరంజని సౌజన్యంతో

Thursday, May 23, 2019

విక్రమోర్వశీయం - 2


విక్రమోర్వశీయం - 2



సాహితీమిత్రులారా!

ఆ లేఖ చదివిన పురూరవుని ఆనందానికి అవధులు లేవు. తన చేతివేళ్ళు చమరుతుంటే 'ఇది నాకు ప్రాణప్రదమైనది.దీనిని నీవు భద్రంగా దాచి ఉంచు' అని విదూషకుడికి ఇచ్చాడు. ఊర్వశి, చిత్రలేఖలు పురూరవుని ముందుకి వచ్చి ప్రణమిల్లారు. కొంత సేపు సరస సల్లాపాలాడుకున్నారు. వేడుకగా ఏవో కబుర్లు చెప్పుకున్నారు. అయితే ఇంతలో దేవదూత వచ్చి 'చిత్రలేఖా! ఊర్వశీ! మీరిద్దరూ తక్షణమే బయలు దేరి స్వర్గలోకానికి రావాలి. భరత మునీంద్రుడు ఇదివరకు ఊర్వశికి నేర్పిన ఆట, ఇప్పుడు ఆడితే చూడాలని మునీంద్రుడు, ఇంద్రాది దిక్పాలకులు వేడుక పడుతున్నారు. వెంటనే రమ్మనమని అమరేంద్రుని ఆఙ్ఞ ' అని వారిని తొందర పెట్టాడు.

ఊర్వశి కన్నీరు కారుస్తూ పురూరవుని విడవలేక, విడవలేక చిత్రలేఖతో దేవదూత తెచ్చిన విమానంలో నాకలోకానికి వెళ్ళిపోయింది. పురూరవుడు నిట్టూర్పులు విడుస్తూ కూర్చున్నాడు. ఊర్వశి అందచందాలను చూస్తూ విదూషకుడు ఆమె లేఖను జారవిడిచాడు. అది గాలికి కొట్టుకుపోయి, లతామండపము సమీపాన గుబురుగా ఉన్న ఒక చెట్టు చాటున దాగి ఉన్న మహారాణి, నిపుణికల దగ్గర వచ్చి పడింది. మహారాణి దానిని చూచింది.

పురూరవుడు మాణవకుని 'ఊర్వశి వ్రాసిన లేఖ ఇలా ఇవ్వు. దానిని చూస్తూ అయినా పొద్దుపుచ్చుతా ' అన్నాడు. దానికి 'ఊర్వశితో పాటు ఉత్తరం కూడా పోయింది ' అని బదులిచ్చాడు. ప్రభువు కోపగించు కున్నాడు. ఇద్దరూ ఉత్తరం కోసం వనమంతా వెదకసాగారు. మహారాజు వ్యవహారమంతా కళ్ళారా చూస్తూనే ఉంది మహారాణి. ఇక ఆమెకు కోపం ఆగలేదు. వెంటనే ఆమె మహారాజు దగ్గరకి వచ్చి 'ఊరకనే ఎందుకు అలా విచార పడుతున్నారు? ఊర్వశి వ్రాసిన లేఖకోసం అలా అల్లల్లాడిపోతునారే? ఇదిగో ఆ లేఖ తీసికోండి ' అని భర్త చేతికి అందివ్వబోయింది. హఠాత్తు పరిణామానికి పురూరవడు నివ్వెరపోయి, నిశ్చేష్టుడై, నిబ్బరపడ్డాడు.

మహారాణి భర్తతో నిష్ఠూరాలాడి నిపుణికతో చరచర అక్కడినుండి వెళ్ళిపోయింది. అది చూచి పురూరవుడు సహించలేక ఆమె వెంటవెళ్ళి ఆమె దారికి అడ్డంగా నిలుచున్నాడు. ఎన్నో విధాల బ్రతిమాలుకున్నాడు. అయినా మహారాణి మనసు చల్లబడలేదు. ఆమె రాజు మాటలు వినిపించుకోకుండా అక్కడ నుంచి గబగబ తన మందిరానికి వెళ్ళిపోయింది. పురూరవుడి పని కుడితిలో పడ్డ ఎలక అయ్యింది.

అంతఃపురం చేరుకున్న రాణికి మనశ్శాంతి చిక్కలేదు. మహారాజుని అవమానించి కష్టపెట్టాను కదాని లోలోపల బాధపడ సాగింది. పశ్చాత్తాప పడుతూ లోలోపల కుమిలి పోయింది. చివరకు ఆమె ఒక నిశ్చయానికి వచ్చింది. 'ప్రియానుప్రసాదం' అనే నోము పట్టాలని అనుకున్నది. ప్రియుడు కోపించి ఉన్నప్పుడు ఆయన కోపం పోగొట్టి వశపరచుకునే వ్రతం అది.

ఇక్కడ ఇలా ఉండగా అక్కడ దేవలోకంలో దేవ సభలో నాత్యమాడడానికి సర్వ సన్నద్దురాలై ఉన్నది ఊర్వశి. సరస్వతీదేవి రచించిన లక్ష్మీ స్వయంవరం అనే నాటకం అది. దానిని నాట్యాచారుడైన భరతుడు ఊర్వశికి నేర్పాడు. అత్యంత రమణీయమైన నాటకం అది. ఊర్వశి అన్యమనస్కురాలై పురుషోత్తమా అనడానికి బదులు పురూరవా అంది. దాంతో నాటకం రసాభాస అయింది. భరత మునీంద్రునికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి 'నీవు క్షమించరాని తప్పు చేసావు. కనుక నీకు దివ్యఙ్ఞానం నశించుగాక! నీకు దేవలోక వాసం లేకుండపోవు గాక!' అని కఠోరంగా శపించాడు.

భరతముని శాపవాక్యాలు విని ఊర్వశి దుఃఖంతో తపించిపోయింది. ఊర్వశిని చూచి దేవేంద్రుడు 'సరే జరిగిందేదో జరిగింది. పురూరవుడు మనకు ఎన్నో ఉపకారాలు చేసాడు. నీవు దిగులు పడకు. ఈ శాపం నీకు మేలే అవుతుంది. నీవు భూలోకం వెళ్ళు. పురూరవునితో కూడి కొంతకాలం సుఖించు. ఆయన వల్ల నీకొక కుమారుడు కలుగుతాడు. ఆ తరువాత అమరలోకం చేరుకుంటావు' అని అనుగ్రహించాడు.

ఊర్వశి లోలోపల సంతోషించింది. భరతముని శాపంతో తనకు పురూరవుని పొందు ప్రాప్తిస్తుందికదా అనుకున్నది. తన చెలి అయిన చిత్రలేఖతో కలసి దేవలోకం నుంచి బయలుదేరింది. ప్రతిష్ఠాననగరానికి వచ్చి పురూరవుని కలసుకున్నారు. చిత్రలేఖ 'మహారాజా! మీరు నిశ్చింతగా ఈమేతో కలసి సుఖించండి. ఎప్పటికీ దేవలోకం గురించి తలచుకోకుండా ఉండేటట్లు మా ఊర్వశిని సుఖపెట్టండి. తమరు శెలవు ఇప్పిస్తే వెళతాను' అని పురూరవునికి ఊర్వశిని అప్పగించి వెళ్ళిపోయింది. ఊర్వశిని తీసుకుని పురూరవుడు అంతఃపురానికి వెళ్ళాడు. తన స్నేహితుని కోర్కె ఎట్టకేలకు నెరవేరినందుకు మాణవకుడు కూడా చాలా సంతోషించి అక్కడినుండి వెడలిపోయాడు.

****************
పురూరవుడు, ఊర్వశి కలసి చాలాకాలం సుఖించారు. అంతఃపుర భవనాలలో, ఉద్యావనాలలో యధేచ్చగా సంచరిస్తూ తనివితీరా రతిక్రీడల తేలియాడారు. ఒకనాడు తనకు అడవులలోనూ, కొండప్రాంతాలలోనూ విహరించాలని ఉన్నట్లు ఊర్వశి పురూరవుడికి తెలియచేసింది. ప్రియురాలి వేడుక తీర్చదలచాడు చక్రవర్తి. రాజ్యపరిపాలనా వ్యవహారాలన్నీ మంత్రులకు అప్పగించాడు. ఊర్వశిని వెంటపెట్టుకుని అరణ్యాలకి బయలు దేరాడు. అలా వారిద్దరూ కైలాస పర్వత ప్రాంతాలలోని గంధమాదన పర్వతం మీద రమణీయ దృశ్యాలు తిలకిస్తూ యధేచ్చగా విహరించసాగారు.

అప్పటివరకు జరిగిన కాలం మంచికాలం. ఊర్వశి పురూరవునితో కూడి సకల సౌఖ్యాలను అనుభవించింది. అంతట ఆమెకు చెడు రోజులు ప్రాప్తించాయి. దురదృష్టం ముంచుకుని వచ్చింది. ఒకనాడు గంగానదీ తీరాన సైకత స్థలాలలో ఒక చక్కని విద్యాధర స్త్రీ విహరిస్తూ ఉండగా పురూరవుడు చూచాడు. అయితే అతని మనస్సులో దుర్బుద్ధి ఏమీలేదు. కాని ఊర్వశికి మత్సరం పుట్టింది. రాజుపై కోపగించుకుంది. పురూరవుడు ఎంతో బ్రతిమాలుకున్నాడు. అయినా ఊర్వశి వినలేదు. భరతుని శాపం వలన ఆమెకు దివ్యఙ్ఞానము నశించింది. వినాశకాలే విపరీతబుద్ధీ అన్నట్లు పురూరవునిపై అలిగి, అక్కడికి దగ్గరలో ఉన్న కుమార వనంలోనికి వెళ్ళింది.

అది ఒక దివ్య వనం. పూర్వం కుమారస్వామి తపస్సు చేసిన ప్రాంతం. తన తపోదీక్షకు ఎవరైనా భంగం కలిగిస్తారేమోనన్న తలంపుతో కుమారస్వామి ఒక కఠోర నియమం పెట్టాడు. 'స్త్రీ ఎవరైనా ఆ వనలో ప్రవేసిస్తే ఒక తీగ అయిపోవుగాక!' అని శపించాడు. దేవ, గంధర్వ, విధ్యాధరాది మగువలందరికీ ఈ శాపం సంగతి తెలుసు. అందువలన ఆ వనంలోకి ఎవరూ వెళ్ళరు. కుమారస్వామి తపస్సు చేయడం వలనే దానికి కుమారవనం అనే పేరు వచ్చింది.

అయితే ఇప్పుడు ఊర్వశి దివ్యఙ్ఞానం కోల్పోయి, మూఢురాలై కుమారవనంలో ప్రవేశించింది. వెంటనే ఆమె ఒక గురిగింజ తీగగా మారిపోయింది. ఊర్వశి ఎటువెళ్ళిందీ, ఏమైనదీ పురూరవుడికి తెలియదు. ఆమె ఎడబాటు భరించలేక ఎంతో విచారించాడు. పిచ్చెక్కినట్లయింది. ఏమీ తోచక వెర్రివాడిలా ఆ అరణ్యప్రాంతంలో తిరగ సాగాడు. అతనికి ఓ రత్నం కనపడింది. అప్పుడు ఆకాశవాణి 'రాజా! ఈ రత్నం తీసుకో. దీని పేరు సంగమనీయం. అది గొప్ప మహిమ కలది. పార్వతీదేవి పాదాల లత్తుక నుండి పుట్టిన దివ్యరత్నం. ఇది దగ్గర ఉంటే అప్పటివరకూ కనిపించకుండా ఉన్న ఇష్టమైనవి ఏదైనా తక్షణం కనిపించి తీరుతుంది' అని పలికింది. పురూరవుడు సంతోషించాడు. ఆ మణి తీసుకున్నాడు. ఎదురుగుండాఉన్న తీగను తాకాడు. వెంటనే ఆ తీగ ఊర్వశిగా మారిపోయింది. వాళ్ల ఆనందానికి అవధులు లేవు.

'ప్రియ సఖుడా! మీరు ఎన్ని భాదలు పడ్డారో అవన్నీ నేను ఙ్ఞాన దృష్టితో చూస్తూనే ఉన్నాను. భరత మునీంద్రుని శాపం వల్ల ఆ ఙ్ఞానం నాకు నశించి ప్రవేశించకూడని ఈ వనంలోకి ప్రవేశించాను అంటూ జరిగినదంతా చెప్పింది. ప్రతిష్ఠాననగరం విడిచి చాలారోజులైంది. మనం నగరానికి వెళ్ళిపోదాం. రండి అని తన మహిమ చేత మేఘవాహనం సృష్టించింది. వారిద్దరూ దాని మీద ఎక్కి సురక్షితంగా ప్రతిష్ఠాననగరం చేరుకున్నారు.

ఊర్వశితో సర్వ సౌఖ్యాలూ అనుభవిస్తూ పురూరవచక్రవర్తి అనేక సంవత్సరాలు రాజ్యపాలన చేస్తున్నాడు. కొంతకాలానికి ఊర్వశి గర్భవతి అయింది. అప్పుడామేకు పూర్వం ఇంద్రుడు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. పురూరవుని వలన ఒక కుమారుని కని తిరిగి దేవలోకానికి రమ్మని ఆయన ఆఙ్ఞ. ఆ విషయం తలచుకుని ఆమె ఒక ఆలోచన చేసింది. రాజును విడిచిపోకుండా ఉండేటట్లు చూడాలనుకుంది.

ఊర్వశికి ఒక చక్కని కుమారుడు కలిగాడు. వెంటనే ఆమె ఆ విషయం రాజుకు తెలియకుండా కుమారుణ్ణి తీసుకుని చ్యవనముని ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ ఆశ్రమంలో ఉన్న సత్యవతి అన్న తాపస స్త్రీకి తన బిడ్డను అప్పగించి మళ్ళీ ప్రతిష్ఠానపురానికి వచ్చింది.

తాపసాంగన అయిన సత్యవతి ఊర్వశి కుమారుణ్ణి తన కన్న కుమారుని వలె అత్యంత గారాబంతో పెంచి పెద్ద చేసింది. చ్యవన మహర్షి ఆ బాలుడికి జరిపించవలసిన సంస్కారాలన్నీ జరిపించి, సకల శాస్త్రాలూ నేర్పాడు. రాజులకు ఉచితమైన ధనుర్విద్య భోధించాడు. ఆ పిల్లవాడు సకల శస్త్రాస్త్ర ప్రయోగాలలో ఆరితేరాడు. ఋషికుమారులతో పాటు అక్కడే ఉంటున్నాడు.

ఒక పర్వదినాన పురూరవుడు ఊర్వశితో కలసి త్రివేణీ సంగమమైన ప్రయాగలో స్నానం చేసి, పూజాదికాలు నిర్వర్తించాడు. తరువాత అలంకార సమయంలో దాసి సంగమనీయమణిని ఒక బంగారు బుట్టలో పెట్టుకుని తెచ్చింది. అప్పుడు అకాశంలో పోతున్న గ్రద్ద ఒకటి ఆ మణిని మాంసముద్ద అని అనుకొని క్రిందకి వాలి దానిని నోట కరచుకుని పోయింది.

ఆ విధంగా ఆ గ్రద్ద చ్యవనముని ఆశ్రమము పైగా పోతున్నది. ఋషికుమారులలో ఉన్న ఊర్వశి కుమారుడు దానిని చూచాడు. వంటనే ధనుస్సును తీసుకుని 'అర్ధనారాచం' అనే బాణంతో దాన్ని గురి చూచి కొట్టాడు. తక్షణమే గ్రద్ద మణితో సహా నేల కూలింది.

పురూరవ చక్రవర్తి మణిని గ్రద్ద తన్నుకు పోయిన సమాచారం విని కంచుకిని పిలిపించి మణిని తీసుకువచ్చే ఏర్పాటు చేయమని ఆఙ్ఞాపించాడు. వెంటనే కంచుకి నగరానికి వెళ్ళి తలారిని పిలిచి రాజాఙ్ఞ తెలియచేసాడు. అంతట తలారి నాలుగు దిక్కులకు మనుషులను పంపి గ్రద్ద కోసం వెతికించాడు. చ్యవనముని ఆశ్రమం వైపు వెళ్ళిన వాడు చచ్చి పడి ఉన్న గ్రద్ద నోట ఉన్న మణిని, దేహానికి ఉన్న బాణాన్ని తీసుకువచ్చి పురూరవుడికి అందచేసాడు.

పురూరవుడు ఆ బాణాన్ని పరిశీలించాడు. దానిమీద చెక్కిఉన్న అక్షరాలను చదివాడు. 'పురూరవ చక్రవర్తికి ఊర్వశి యందు పుట్టిన కుమారుడు ఆయువనే వాని బాణమిది. ఈ శరం శతృవుల ప్రాణాలను అపహరించి తీరుతుంది' అని ఉంది. ఆశ్చర్యచకితుడైనాడు పురూరవుడు.

ఇక్కడ ఇలా ఉండగా అక్కడ చ్యవన మహర్షికి ఆయువు బాణంతో గ్రద్దని కొట్టాడన్న సంగతి తెలిసి, వెంటనే సత్యవతిని పిలచి 'ఋషి ఆశ్రమంలో ఇలాంటి హింసాకాండ తగని పని. ఈ రాకుమారుడు ఆశ్రమ విరుద్దమైన పనులు చేయడం మొదలు పెట్టాడు. ఇక ఇక్కడ ఉండడానికి అర్హుడు కాదు. వెంటనే వీడిని తల్లితండ్రులకు అప్పగించు' అని ఆఙ్ఞాపించాడు. ఆయువును వెంటపెట్టుకుని సత్యవతి ప్రతిష్ఠానపురానికి వెళ్ళింది. పురూరవిదు ఆమెను ఆహ్వానించి సకల మర్యాదలు చేసి, భక్తితో పూజించాడు. సత్య్వతి సంగతులన్నీ వివరంగా తెలియజేసి ఊర్వశీ, పురూరవులకు బాలుని అప్పగించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయింది.

అంతట పురూరవుడు అమితానందంతో బాలుని కైగలించుకుని ముద్దాడాడు. 'దేవేద్రునికి జయంతుడు పుట్టినట్లు నాకీ కుమారుడు కలిగాడు' అని అన్నాడు. దేవేంద్రుడి పేరు వినగానే ఊర్వశికి పూర్వ స్మృతి కలిగింది. వెనుకటి విషయాలన్నీ ఒక్కసారిగా ఆమె మనో వీధిలో మెరిశాయి. ఇక ఈ రాజును విడిచి వెళ్ళవలసి ఉందే అని కన్నీరు కార్చసాగింది. పురూరవుడు ఏమి కారణమని అడిగాడు. ఊర్వశి లోగడ జరిగిన వృత్తాంతమంతా రాజుకు తెలియపరిచింది.

అంతా విన్న పురూరవుడు బరువుగా విశ్వసించాడు. పుత్రుడికి రాజ్యభారం అప్పగించి అరణ్యాలకి పోవాలని సంకల్పించు కున్నాడు. ఈ సంగతి దేవేంద్రుడికి తెలిసింది. పురూరవుడు తపొవనాలకు పోతే దేవతలకు తీరని నష్టం కలుగుతుంది. అందువలన ఇంద్రుడు నారదుడిని ప్రార్ధించాడు. భూలోకానికి వెళ్ళి ఏవిధంగానైనా పురూరవుని ప్రయత్నాన్ని మాన్పించవలసిందిగా ఆ మహర్షిని అర్ధించాడు.

నారదుడు ప్రతిష్ఠానపురం వెళ్ళాడు. పురూరవుడు నారద మహర్షిని సకలవిధ గౌరవ మర్యాదలతో, భక్తి ప్రపత్తులతో పూజించి, సతీసమేతంగా సాష్టాంగ నమస్కారం ఆచరించాడు. అప్పుడు నారదుడు 'మీరిద్దరూ ఎడబాయకుండా ఉండుగాక' అని ఆశీర్వదించాడు. అందుకు వారు సంతోషించారు.

'మహారాజా! నీవి అడవికి వెళుతున్నాట్టు దేవేంద్రుడు విన్నాడు. ఆయనకు తరచుగా నీ సహాయం అవసరం అవుతూ ఉంటుంది. అందువల్ల ఈ నిర్ణయాన్ని మార్చుకోవలసిందిగా నన్ను చెప్పమని నీ వద్దకు పంపాడు. నీ ఇష్టప్రకారం నీవు ఎల్లప్పుడూ ఊర్వశితో కలసి సుఖించవచ్చునని కూడా చెప్పమన్నాడు. కనుక నీవు ఇక ఆ తపోవనాలకు వెళ్లవలసిన పని లేదు' అన్నాడు నారదమునీంద్రుడు.

'మునీంద్రా! నేను దేవేంద్రుని ఆఙ్ఞకు బద్ధుడను. ఆయన చెప్పినట్లు నడుచుకోడానికి సిద్ధంగా ఉన్నాను' అని నారదుడికి తెలియచేసాడు. మహర్షి ఈ విషయం ఇంద్రుడికి తెలియ పరిచాడు. ఇంద్రుడు సంతోషించాడు. పురూరవుడి కుమారుని పట్టాభిషేకానికి అవసరమైన పనులన్నీ చేయవలసిందిగా చెప్పి రంభ, మేనక, తిలోత్తమాది అప్సరసాంగనలను, ఇంకా అనేక అమూల్యమైన కానుకలను భూలోకానికి పంపాడు.

పురూరవుడికి, ఊర్వశికి జన్మించిన ఆయువు రాజ్యపాలన చేస్తున్న కాలంలో ఆ రాజ్యంలో ప్రజలు సకల సౌఖ్యాలూ అనుభవించారు.

(సమాప్తం)
---------------------------------------------------------
రచన - మువ్వల సుబరామయ్య, 
సుజనరంజని సౌజన్యంతో

Wednesday, May 22, 2019

విక్రమోర్వశీయం - 1


విక్రమోర్వశీయం - 1




సాహితీమిత్రులారా!

“కవికుల గురువు కాళిదాసు రచించిన నాటకాలలో విక్రమోర్వశీయం ఒకటి. నాయకుడు పురూరవుడు. నాయిక అప్సరస ఊర్వశి. పురూరవుడి విక్రమం చేత ఊర్వశిని పొందినాడు కాబట్టి ఈ నాటకానికి కవి విక్రమోర్వశీయం అని పేరు పెట్టాడు. పురూరవునికీ, ఊర్వశికీ సంబంధించిన కథలు ఋగ్వేదంలోనూ, విష్ణు, మత్స్య పురాణాలలోనూ, కథాసరిత్సాగరంలోనూ, భాగవతం లోనూ ఉన్నాయి. అయితే ఈ కథలన్నీ ఒక్క తీరుగా లేవు. కాళిదాసు మత్స్యపురాణ కథాక్రమాన్ని అనుసరించాడని 'విల్సన్' గుర్తించాడు. ఈ నాటకంలో పాత్రలు తక్కువ. ఉన్నంతవరకు పాత్రల చిత్రణ కవి చక్కగా చేసాడు.”

శ్రీమన్నారాయణుడి నాభికమలం నుండి బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మ మానసపుత్రుడు మరీచి. మరీచికి కశ్యపుడు జన్మించాడు. కశ్యపునికి అదితి, దితి అని ఇద్దరు భార్యలు. అదితి యందు పుణ్యాత్ములైన దేవతలూ, దితి గర్భాన పాపాత్ములైన దానవులు జన్మించారు. కశ్యపునికి అదితి వలన పుట్టినవాడే వివస్వంతుడు. అతని భార్య సంఙ్ఞ. వారిరువురికీ శ్రాద్దాదేవుడనే కుమారుడు జన్మించాడు. అతనే వైవస్వంతుడన్న పేరుతో వర్తమాన మనువై భూమండలాన్ని పరిపాలించాడు.

వైవస్వంతుడికి చాలా కాలం పిల్లలు లేరు. సంతానార్ధం అతను ఒక యఙ్ఞం చేసాడు. ఆ యాగం చేయించినవాడు వశిష్ఠుడు. వైవస్వతుడు కుమారుడు కావాలని, అతని భార్య కుమార్తె కావాలని కోరుకున్నారు. చివరకు ఇళ అనే చక్కని కూతురు పుట్టింది. వైవస్వతుడు పుత్రిణ్ణి అనుగ్రహించమని కులగురువు వశిస్ఠుడిని వేడుకున్నాడు. అప్పుడు వశిస్ఠుడు హరిని ప్రార్ధించి ఇళకు పుంస్తయం వచ్చేటట్లు చేసాడు. ఆ విధంగా ఇళ మగపిల్లవాడైంది. అతనికి సుద్యుమ్నుడని పేరు పెట్టారు.

సుద్యుమ్నుడు పెరిగి పెద్దవాడైనాడు. ఒకనాడు గుఱ్ఱం ఎక్కి, పరివారంతో వేటకై ఉత్తరదిక్కుగా పోయి అరణ్యాలలో జంతువులను వేటాడుతూ మేరుపర్వతం ప్రాంతంలోని కుమారవనంలో ప్రవేశించాడు. అప్పుడొక చిత్రం జరిగింది. సుద్యుమ్నుడు ఆ వనంలో అడుగు పెట్టాడోలేదో వెంటనే స్త్రీరూపం వచ్చి ఇళ అయినాడు. అతని పరివారం అంతా కూడా స్త్రీలుగా మారిపోయారు.

ఇలా జరగడానికి ఒక కారణం ఉంది. శంకరుడు నిత్యం పార్వతితో కూడి విహరించే ప్రదేశం అది. ఒకప్పుడు శివుడు ఉమాదేవితో శృంగారక్రీడలు సాగిస్తూ ఆ వనంలో ఉండగా కొందరు మహర్షులు మహేశ్వరుని దర్శనార్ధం అక్కడికి వచ్చారు. వారు వచ్చిన సమయానికి పార్వతి వివస్త్రయై శివుని తొడపై కూర్చుని ఉంది. ఋషులు రావడం చూసి ఆమె సిగ్గుపడింది. వెంటనే అక్కడి నుంచి లేచి వస్త్రం ధరించింది. ఋషులు కూడా అది గ్రహించి ఇది సమయం కాదని అక్కడినుంచి వెళ్ళిపోయారు. అయితే ఇది జరిగినందుకు శివుడికి కోపం వచ్చి 'తెలిసిగాని, తెలియక కానీ పురుషుడెవరైనాసరే కుమారవనంలో అడుగు పెడితే తక్షణం అతను స్త్రీ అయిపోవుగాక అని శాసించాడు. అదీ కథ. అప్పటి నుంచి పురుషులెవరూ ఆ ప్రదేశానికి వెళ్ళరు. ఈ విషయం తెలియక సుద్యుమ్నుడు అక్కడికి వెళ్ళడం వలన అతనికి, అతని పరివారానికి స్త్రీ రూపాలు వచ్చాయి.

ఇళ ఆ వనంలో తిరుగుతూ చివరకు బుధుని ఆశ్రమానికి వెళ్ళింది. బుధుడు చంద్రుని కుమారుడు. బుధుని వలన ఇళకు పురూరవుడనే చంద్రవంశపు రాజు కలిగాడు. పురూరవుడు షట్చక్రవర్తులో ఒకడు. గంగా యమునా సంగమ తీరాన గల ప్రతిష్ఠాన పురం ఇతని రాజధాని. ఇతను పాలించే లోకానికి మధ్యమలోకమని పేరు. పురూరవుని భార్య కాశీరాజ పుత్రి ఔశీనరి. రాజర్షి, సత్తముడైన పురూరవుడంటే దేవేంద్రుడికి అమిత అభిమానం. దానవులతో సంభవించే యుద్ధంలో పురూరవుడు ఇంద్రుడికి విజయం చేకూర్చేవాడు. పురూరవుడికి సోమదత్తం అనే ఓ దివ్య రధం ఉంది. లేడి చిహ్నం గల జెండా అతనిది. అతను దివ్యరధం ఎక్కి సమస్త లోకాలనూ సంచరించేవాడు.

దేవ వేశ్యలందరిలోకి ఊర్వశి అందాలరాశి. ఊర్వశి అంత అందకత్తె కావడానికి కారణం - పూర్వం శ్రీమన్నారాయణ మూర్తి గంధమాదన పర్వతంపై తపస్సు చేసుకుంటున్నాడు. అతని కఠోర తపస్సుకి మూడులోకాలు గజగజ వణికాయి. ఇంద్రుడు భయపడి ఎలాగైనా తపస్సు భంగం చేయాలనుకుని తనవద్ద ఉండే అప్సరసలలో అందమైన వారిని పిలిచి, నారాయణ ఋషి దగ్గరకు పోయి అతన్ని వశపరచుకో వలసిందిగా వారిని ఆఙ్ఞాపించాడు.

అప్సరసలు నారాయణ ఋషిదగ్గరకు పోయి ఆడారు, పాడారు. ఎన్నో వేషాలు వేసి, వలపులు కురిపించారు. అయినప్పటికీ భగవంతుడైన నారాయణ ఋషి ఇంచుకైనా చలించక, కళ్ళు తెరచి చూచి, వారికి బుద్ది చెప్పాలని సంకల్పించుకున్నాడు. వారు చూస్తూఉండగానే కొనగోటితో తన తొడగీరాడు. అప్పుడాయన తొడనుంచి జగన్మోహిని అయిన ఒక స్త్రీ జన్మించింది. నారాయణుని ఊరువు నుండి (తొడ నుండి) పుట్టడం వలన ఆమెకు ఊర్వశి అని పేరు వచ్చింది.

ఊర్వశి చక్కదనం చూచి, తమ అవివేకాన్ని గ్రహించి, అప్సరసలు మళ్ళీ ఇంద్రలోకం వెళ్ళిపోయారు. తర్వాత నారాయణ ఋషి తను సృష్టించిన ఊర్వశిని దేవేంద్రునికి ఇచ్చాడు. అప్పటినుంచి ఆమె స్వర్గానికి అలంకారంగా ఉంటూవచ్చింది. ఇంద్రుడు అవసరమైనప్పుడల్ల ఆమెను 'కోమలాయుధం' గా ఉపయోగించుకుంటున్నాడు.

ఓకనాడు ఊర్వశి చిత్రలేఖ, రంభ మొదలగు చెలికత్తెలతో కుబేరుని పట్టణమైన అలకాపురికి వెళ్ళి స్వర్గానికి తిరిగి పోతున్నది. కేశి అనే రాక్షసుడు ఊర్వశిని చూచి మోహించాడు. అతని నివాసం హిరణ్యపురం. ఆ పట్టణానికి ఆకాశ మార్గాన వెళ్ళాలి. కేశి ఊర్వసిని, చెలికత్తె చిత్రలేఖని చెఱపట్టి తీసుకు పోయాడు.

రంభ, మేనక తదితర అప్సరసలు బిగ్గరగా ఆక్రందనలు చేసారు. దివ్యరధంలో సంచరిస్తున్న పురూరవుడు వారివద్దకు వెళ్ళి విషయం తెలుసుకుని వారిని ఓదార్చి ధైర్యం చెప్పి ఈశాన్యదిక్కుగా బయలుదేరాడు. తిరిగి వచ్చేటప్పడికి తాము హేమకూట శిఖరంపై వేచి ఉంటామని అతనికి తెలియ చేసారు అప్సరసాంగనలు. పరాక్రమశాలి అయిన పురూరవుడికి ఈ పని ఒక అలెక్కలోది కాదని స్థిమితపడి పురూరవుడి రాకకై నిరీక్షిస్తున్నారు.

సోమదత్తం ఆఘమేఘాలమీద పరుగులు తీసింది. పురూరువుడు కేశి మార్గానికి అడ్డంగా తన రధాన్ని ఆపి, ఒకనిపై ఒకడు దివ్యాస్త్రాలను ప్రయోగించుకున్నారు. గొప్ప యుద్దం జరిగింది. పురూరవుడు దివ్యాస్త్రమైన వాయువ్యాస్త్రాన్ని అభిమంత్రించి రాక్షసునిపై ప్రయోగించాడు. ఆ అస్త్రప్రయోగం వలన రాక్షసుడు అతని పరివారం ఒక ప్రచండ వాయువుకు కొట్టుకు పోయి సముద్రంలో పడ్డారు.

అంతట పురూరవుడు ఊర్వశిని, చిత్రలేఖనూ తన రధం మీద ఎక్కించుకుని తక్కిన అప్సరసాంగనలున్న హేమకూటానికి వచ్చాడు. అలా రధంలో వచ్చేటప్పుడు పురూరవుడు ఊర్వశి ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

ఎవరికీ తెలియని విషయం కూడా నారద మహర్షికి ఇట్టే తెలిసిపోతుంది. అతనికి తెలిస్తే మూడు లోకాలకి తెలిసినట్లే. అవును మరి. అతను త్రిలోక సంచారి. ఇక్కడి సంగతులు అక్కడ, అక్కడి సంగతులు ఇక్కడ చెప్పటం అతనికొక సరదా. ఆ విధంగా తగవులు కూడా పెడుతూ ఉంటాడు. అయితే నారదుడు చేసేపని లోకానికి ఉపకారంగానే పరిణమిస్తూ ఉంటుంది. అదీ విశేషం.

నారదుడు దేవలోకం వెళ్ళి ఊర్వశిని కేశి అనే రాక్షసుడు చెరపట్టి తీసుకుపోయాడన్న సంగతి ఇంద్రుడి చెవిలో ఊదాడు. అది వినగానే ఇంద్రుడికి ఆందోళన కలిగి చిత్రరధుడనే గంధర్వుడిని పిలిచి, విషయం వివరించి, ఊర్వశిని భద్రంగా తీసుకురా అని ఆదేశించాడు. అంతట చిత్రరధుడు గంధర్వ సేనలతో హుటాహుటిన బయలు దేరాడు. మార్గ మధ్యంలో కొందరు చారణులు ఎదురుపడి పురూరవ చక్రవర్తి కేశిని జయించి ఊర్వశిని విడిపించాడని, అంతా హిమగిరి శిఖరంపై ఉన్నారని తెలియజేసారు. సంతోషంతో వెంటనే హిమాద్రికి వచ్చాడు.

గంధర్వుడు రావడం చూచి పురూరవ చక్రవర్తి మర్యాద చేసి గౌరవించాడు. జరిగినదంతా అప్సరసలు చిత్రరధునికి చెప్పారు. పురూరవుడు ఇంద్రుడికి మహోపకారం చేసాడని ఎన్నో విధాల పొగిడి స్వర్గానికి రమ్మనమని ఆహ్వానించాడు చిత్రరధుడు. ఈ సూచన చాలా బాగున్నదని ఊర్వశి, తక్కిన అప్సరసలు సమర్ధించారు. అయితే పురూరవుడు ఊర్వశిని రక్షించడంలో తన ప్రతాపం ఏమీ లేదని సవినయంగా చెప్పి, వారి ఆహ్వానాన్ని ఇప్పుడు అంగీకరించనందుకు మన్నించవలసిందని కోరాడు. ఊర్వశి పురూరవుడు తనతో రానందుకు లోలోపల విచారించింది. అతని వియోగం ఆమెకు దుర్భరముగా తోచింది.

ఊర్వశిని, అప్సరసలను తీసుకుని చిత్రరధుడు దేవలోకానికి బయలుదేరాడు. తన ప్రాణాలు కాపాడిన చక్రవర్తికి కృతఙ్ఞత చెప్పి ఆయన దగ్గర సెలవు తీసుకుందామని అనుకుంది ఊర్వశి. స్వయంగా మాట్లాడడానికి సిగ్గుపడి తన అభిలాషను ప్రాణసఖి అయిన చిత్రలేఖకు చెప్పింది. చిత్రలేఖ పురూరవుని వద్దకు వెళ్ళి ఊర్వశి అభిప్రాయం తెలియచేసింది. ఊర్వశికి దుఃఖం పొర్లివస్తూఉండగా వెళ్ళలేక వెళ్ళలేక వెనక్కి తిరిగి పురూరవుని చూస్తూ వెళ్ళింది. తన చెలికి రాజుపై మోహం పుట్టిందని చిత్రలేఖ తెలుసుకుంది.

అప్సరసలు వెళ్ళిన తరువాత పురూరవుడికి ఏమీ తోచలేదు. ఊర్వశి వియోగాన్ని అతడు భరించలేకున్నాడు. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ చాలాసేపు నిలుచుండి పోయాడు. మనసు పరిపరి విధాల పోతూ ఉంది. చివరకు తన రధాన్ని మరలించి ప్రతిష్ఠానపురం చేరాడు. ఊర్వశి సురక్షితంగా రావడం చూచి ఇంద్రుడు సంతోషించాడు. జరిగినదంతా విన్నాడు. రాజును ఎన్నోవిధాల ప్రస్తుతించాడు.

తన పట్టణం చేరుకున్నది మొదలు పురూరవుడికి నిద్రాహారాలు లేవు. ఎప్పుడూ ఊర్వశే కళ్లముందు కనిపిస్తుంది. విరహ వేదన భరించలక పోతున్నాడు. ఊర్వశి మీద చింతతో మంచం పట్టాడు. పరిపాలనా వ్యవహారాలేమీ పట్టించుకోవడం లేదు. చింతాక్రాంతుడై ఉన్నాడు. తనకు ఆంతరంగికుడు, వేడుక చెలికాడు (విదూషకుడు) అయిన మాణవకుడితో సంగతంతా చెప్పాడు.

పురూరవుని భార్య కాశీరజ పుత్రిక అయిన ఔశీనరి. వచ్చినది మొదలు తన భర్త అదోమాదిరిగా, దిగులుగా ఉండడం గమనించింది. కారణం ఏమిటో ఆమెకు అర్ధం కాలేదు. తన ఆంతరంగిక దాసి అయిన నిపుణికను పిలచి రాజు సంగతి చెప్పింది. నీవు వెళ్ళి రాజుగారి పరిస్థితి ఎలాఉందో తెలుసుకురా అంది.

నిపుణిక చాలా తెలివైనది. నేర్పు చాకచక్యం కలది. ఇటువంటి పనులు సాధించడంలో ఘటికురాలు. మాణవకుడికి ఈ విషయం తెలిసి ఉంటుంది. ప్రభువులు తమ మన్సులో మాట అతనికి చెప్పకుండా ఉండరు. కనుక విధూషకుడి దగ్గరకు పోయి ఏ విధంగానైనా సరే విషయం రాబట్టాలని బయలు దేరింది.

నిపుణిక మాణవికుడి దగ్గరకు వెళ్ళి ముచ్చట్లు ప్రారంభించింది. గరిక మీద పడిన మంచు బిందువులా అతని నోట్లో మాట దాగదని ఆమెకు తెలుసు. కనుక ఏవేవో మాయ మాటలు చెప్పింది. మాణవకుడు కూడా రహస్యం దాచుకోలేక పొట్ట ఉబ్బినట్లు నానా అవస్థ పడుతున్నాడు. ఈమె అసాధ్యురాలు. నా మనసులో మాట లాగాలని ప్రయత్నిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి అని లోలోపల అనుకున్నాడు.

'రాణిగారు రాజుగారికి ఒక మాట చెప్పమన్నారు - నిజంగా నామీద ప్రేమ ఉంటే నేనిట్లా దుఃఖిస్తూఉండగా ఏమీ పట్టనట్లు ఊరుకోవడం న్యాయమా - అని అడిగి రమ్మన్నారు మహారాణి' అని చెప్పింది నిపుణిక. 'ఓహో! అట్లాగా! రాణిగారిపట్ల రాజుగారు ఏమైనా ప్రతికూలంగా ప్రవర్తించారా' అని అడిగాడు మాణవకుడు. 'అవును రాజుగారు ఎవతెను గురించి తపించిపోతున్నారో, ఆమె పేరు పెట్టి రాణిగారిని పిలిచారు' అన్నది నిపుణిక తెలివిగా. రాజుగారే తన గుట్టు రట్టు చేసుకున్న తరువాత ఈ రహస్యం దాచడానికి నే అవస్థ పడడం దేనికనుకొని, 'అయితే రాజుగారు రాణిగారిని ఊర్వశీ అని పిలిచారా? ఆ అప్సరసను చూచినప్పడినుండి మహారాజుకు వెర్రెతింది. మహారాణికి దుఃఖం కలగచేయడమేకాక, నన్ను కూడా అనేకవిధాల వేధించుకుని తింటున్నాడు' అని ఉన్న సంగతి బయట పెట్టాడు.

నిపుణిక అతని దగ్గర శెలవు తీసుకుని వెళ్ళి, రాణి దగ్గరకు వచ్చి, జరిగినదంతా చెప్పింది. పురూరవుడు ఊర్వశిపై ప్రేమతో విరహవేదన పడుతున్నాడని మహారాణి తెలుసుకుంది. 'ఇక నుంచి నీవు సంగతంతా జాగ్రత్తగా కనిపెడుతూ ఉండు. ఎప్పటి విషయాలు అప్పుడు నాకు చెప్పు' అని దాసిని ఆఙ్ఞాపించింది.

పురూరవుడికి ఊర్వశి పిచ్చి మరీ ఎక్కువయిపోయింది. ఒకనాడు మాణవకునితో ప్రమదా వనానికి వెళ్ళాడు. అది వసంత ఋతువు. వనం అంతా చెట్లు చిగిర్చి ఉన్నాయి. పూలు సువాసనలు వెదజల్లుతున్నాయి. ప్రకృతియావత్తూ శోభాయమానంగా ఉంది. చల్లని దక్షిణపుగాలి మెల్లగా వీస్తున్నది. పురొరవుడికి విరహతాపం మరీ ఎక్కువైంది. తాళలేకున్నాడు.

ఇక అక్కడ ఊర్వశి పురూరవుడిని విడచి హేమకూట పర్వతంకుండి దేవలోకానికి వెళ్ళినది మొదలు ఆమె మనసు మనసులో లేదు. చివరకు తట్టుకోలేక తన ఆంతరంగిక చెలికత్తె చిత్రలేఖను వెంటపెట్టుకుని ప్రతిష్ఠాననగరానికి బయలుదేరింది. అప్రాజిత విద్యతో ప్రమదావనంలో దిగారు. దిగాలుపడిఉన్న చక్రవర్తిని చూచారు. తిరస్కరణీ విద్యతో అదృశ్యంగా ఆయన వద్దకు వెళ్ళి నిలుచున్నారు. పురూరవుడు తన మనోవేదనను విదూషకునితో వెళ్ళబోసుకున్నాడు. అదంతా ఊర్వశి, చిత్రలేఖ వింటూనే ఉన్నారు. ఊర్వశి తనలాగే పరితపించి పోతున్న పురూరవుడికి భూర్జపత్రం మీద తన గోళ్ళతో ప్రేమలేఖ వ్రాసింది. తన మదనవికారమంతా వెళ్ళగ్రక్కుతూ - ప్రియా! మీరు నన్ను గురుంచి ఏదేదో చెప్పారు. మీ విరహవేదన నాకు అర్ధమైంది. నాకు మాత్రం మీ మీద ప్రేమ లేదనుకున్నారా! తొలిచూపులోనే నా మనసు మీకు అర్పణ చేసాను. ఇంతకాలం మీ ఆలింగన సౌఖ్యం పొందలేని దురదృష్టవంతురాలను. నా స్థితిని గురించి మీకు మాటలలో చెప్పలేను. అయినా వినండి - మహారాజా! ఆ మదనుడు నన్ను ఎన్నివిధాల వేధించాలో అన్నివిధాల వేధిస్తున్నాడు. వెన్నెల, పన్నీరు, పుష్ప పరిమళం, మలయ మారుతం - ఇవన్నీ నాకు భరించరాని తాపం కలిగిస్తునాయి. నా అవస్థ ఇంతకంటే ఏం చెప్పను? ఇట్లు, మీ రతిసౌఖ్యాన్ని కోరు ప్రియురాలు ఊర్వశి' అని ప్రేమలేఖ వ్రాసి దాన్ని చక్రవర్తిముందు పడవేసింది.
---------------------------------------------------------
రచన - మువ్వల సుబరామయ్య, 
సుజనరంజని సౌజన్యంతో

Monday, May 20, 2019

మనవూళ్ళో దేవుళ్ళు - గ్రామాల్లో దేవతలు


            మనవూళ్ళో దేవుళ్ళు - గ్రామాల్లో దేవతలు                                                                    

 

సాహితీమిత్రులారా!

అది ఖమ్మం జిల్లా, పెనుబల్లి ఊరి శివార్లలో పది పాకలు. బస్ కూడా బతిమాలితే తప్ప ఆపడక్కడ. లారీలప్పుడప్పుడు ఆగుతుంటాయి. ఆ చిన్న లంబాడి తండాలో అందరూ రోజూవారి కూలీలే. తారు రోడ్డు నించి మట్టి దారిలో రెండు మైళ్ళు లోపలికి వెడితే చిన్న పేరుకూడాలేని ఆ ప్రాంతం. ప్రగతి పధంలో వెడుతున్న మన భారతదేశానికి, అక్కడ కూడా నివశించగలిగిన ప్రజల ఆశాజ్యోతుల్లా నూని దీపాలే తప్ప వీధి దీపాలు కూడా లేవు. అక్కడుంటాడు సైదులు.

మామూలు రోజుల్లో ఎవరూ పట్టించుకోరు కాని, సోమవారం రాత్రి మాత్రం కొద్ది మంది ఎక్కడెక్కడినించో వస్తారు ఆ పాకల్లో ఒక దాంట్లో జరిగే అద్భుతాలు చూడ్డానికి. నెమ్మదిగా చీకటి పడుతూనే అందరూ చేరారు. అగరువత్తుల సువాసన, రెండు దీపాల వెలుగులో కనిపిస్తున్నాడు, సుందరమైన ఫొటోలోంచి అందంగా నవ్వుతున్న శ్రీ కృష్ణ భగవానుడు. కృష్ణుడు పెరిగిన బృందావనం కూడా ఇంత నిరాడంబరంగా వుండేదేమో తెలియదు. నెమ్మదిగా భజన మొదలైంది - "నల్లని వాడివిరా ! నామాలు గలవాడా ! నా చిన్ని కృష్ణయ్యో చిన్ని కన్నయ్యా " ఆ పాట రాగంలోనే నాదస్వరంలాంటి ఒక మత్తు ఉంది. సైదులులో నెమ్మదిగా మార్పురావడం మొదలైంది. మంత్రం, యంత్రం ఏమి లేవక్కడ. మానవుణ్ణి మించిన శక్తి క్షేత్రం సృష్టిలో ఎక్కడుంది ! రాతి విగ్రహాల్లోంచే మనని అనుగ్రహించగలిగిన ఆ సర్వాంతర్యామి నిర్మల మనస్కులైన మనుషుల్లోంచి మాట్లాడ్డం ఎంతసేపు? ఓ పక్కన సైదులు ట్రాన్స్ లాంటి స్థితిలోకి వెళ్ళాడు. భజన ఆగిపోయింది. నమ్మిన వాళ్ళకి, సైదులు కొద్ది క్షణాల్లోనే దివ్యానుభూతి అవేసించిన శ్రీ కృష్ణుడయ్యాడు. ఇక అతనిలోంచి ఓ అతీత శక్తిగా భగవంతుడు మాట్లాడడం మొదలుపెట్టాడు.

"సత్తుపల్లి నించి వచ్చిన చెల్లెమ్మా....మనవడి ఇంజనీరింగ్ చదుకోసం వచ్చిన చెల్లెమా...కొడుక్కి పెళ్ళిచేసి కన్నీళ్ళు పెట్టుకున్న చెల్లెమ్మా...బాగున్నావామ్మా?" అని పిలిచాడు. అక్కడికి మొదటిసారి వచ్చిన ఆమె ఆశ్చర్య పోయింది. అతను తనగురించి చెప్పినవి నిజమే!

"నీ మనవడు చదువుకోసం అడగాలని వచ్చావమ్మా?" అన్నాడు కృష్ణుడు. అలా మొదలుపెట్టి ఒక్కొక్కరికి వారిగురించి అనేక విశేషాలు, ఆవేదనా సంద్రం నించి బయట పడే ఉపాయాలు చెప్పడంతో వారికి ఆనందం, ఆశ్చర్యం కలిగాయి. కొందరి మొఖాల్లో ఆనందం, కొందరికి ఆనంద బాష్పాలు. అక్కడున్నవాళ్ళందరికి అలా నవ్వుతూ, మానవాతీతమైన శక్తితో సమస్యలకు తనకి తానుగా కష్టాలని దైవ శక్తితో యధా శక్తి గుర్తించి, ఉపాయాలు చెప్పి మార్గదర్శకం చేసాడు, అన్నిటినీ మించి ఊరడించాడు. నిస్వార్ధంగా దేవుడి దగ్గర పెట్టిన అరటి పళ్ళని సైతం వారికే ఇచ్చేసి తను ఆనందాన్ని మాత్రమే పొందుతున్నాడు సైదులు. ఇలాంటి దివ్య సాధకులతో కూడిన సంఘటనలని చూసినప్పుడు అనిపిస్తుంది - ఇది దివ్య శక్తా? సంఘ సేవా? అతనిలో నిజంగా కృష్ణుడు పూనాడా? ఒకటి మాత్రం నిజం దేవుడంటూ మనిషికి కనిపిస్తే అంత ప్రేమగా మాట్లాడతాడు, వ్యధని అర్ధం చేసుకుంటాడు అని.

వ్యక్తిగత అనుభవాన్ని బట్టి, ఆయా నిజానిజాల నిర్ధారణ జరుగుతోంది. కొందరికి మహాద్భుతం అనిపించిన చోట ఇంకోరికి పచ్చి మోసం అనిపించ వచ్చు. దివ్య సాధకులు కూడా కొన్నిసార్లు మానవ సహజ మైన స్థితిలో వుండి తమ శక్తిని దుర్వినియోగం చెయ్యవచ్చు కదా? మన ఊళ్ళలో పండుగలకి నిప్పులమీద నడవడం చూశాం. వీరభద్ర భక్తులు, అమ్మవారి భక్తులు జాతరలలో కత్తులు గుచ్చుకోవడం, వీపునిండా సూదులు గుచ్చుకుని వాటికి దారాలు కట్టి చిన్న రధం లాగడం లాంటివి ఈనాటికి ఇండియాలోనే కాక మలేషియా లాంటి దేశాల్లో కూడా సుబ్రహ్మణ్య స్వామి పండుగ 'తైపూసం ' లాంటి చోట్ల ప్రతిఏటా చేస్తున్నారు.ఈ హింసా పూరితమైన భక్తి మంచిది కాదని వారికీ తెలుసు.అయితే భక్తి అనేది ఒక శక్తిని పుట్టిస్తోందా లేక నమ్మకానికే ఓ మానవాతీత శక్తి వుందా అన్నది ప్రశ్నార్ధకం.

అసలు ఇంత చిత్రమైన శక్తి ఆ సైదులుకెలా వచ్చింది? నిజంగా దేవుడు అలా చిన్న చిన్న చోట్ల, మనం వెతికే గిరులు - గోపురాలు, స్వర్ణ - వర్ణ మకుటాలలో కాక కొంపతీసి ఇలా పూరి పాకల్లోంచి, సామాన్య జీవితపు సంగ్రామంలోంచి శ్రీ కృష్ణుడై తన భక్తులతో మట్లాడుతున్నాడా? అలా అయితే ఏ అవధూతలను, ఉపాసకులను మనం వెతకాలి? ఎవరికి మొక్కాలి? ఎవరిలో ఆ పరమాత్ముడు తన నిశ్చల చైతన్యాన్ని నింపుతూ, కర్మ క్షయం చేస్తూ తను కూడా మానవ సంఘ నిర్మాణానికి పాటుపడుతున్నాడు ? అసలు అవసరమేముంది ? తను దేముడైతే మార్గ దర్శకం చేయడమెందుకు సర్వశక్తిమయుడు కనుక సమస్యలు తీర్చేయవచ్చు కదా?

"అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా " అన్నారు కదా లలితా సహస్రనామంలో అలా ధ్యాన సాధనలో వుంటే ఋతంభర ప్రజ్ఞ ద్వారా తెలుసుకునే శక్తి గల యోగులు మన్అ అనుగ్రహిస్తారా? "నిస్సందేహంగా! " అని శాస్త్రాలు చెపుతున్నాయి. మనకి ఏ గురువూ లభించనపుడు, ఇష్టదేవతా సాధనలోనో లేక ధ్యానంలోనో శ్రద్ధగా ముందంజ వేసేవారికి ప్రకృతినుండి ఆయా నిర్దేశాలు లభిస్తాయని, వారిని సన్మార్గంలో తీసుకెళతాయని భగవత్గీత నుండి, పతంజలి యోగ సూత్రాల దాకా అన్ని నర్మగర్భితంగా సూచిస్తున్నాయి. నాకు గురువు కావాలి అని ఉన్న వాళ్ళని, కుటుంబాన్ని వదిలేసి వెళ్ళనవసరంలేదని లాహిరి మహాశయులనుండి (ఒక యోగి ఆత్మ కధ) మనం తెలుసుకోవచ్చును. సప్త మహర్షులు కూడా వివాహితులేకదా!

యోగుల గురించి మాట్లాడుతున్నపుడు ఒక చిన్న చర్చ గురించి చెప్పాలి. రాజమండ్రిలో ఒక మాష్టరు గారు పేరెన్నిక గన్న ఒక సన్యాసి గారికి సన్మానం జరుగుతుంటే అడిగారు. "అయ్యా దయచేసి నాకు రెండు సందేహాలున్నాయి తీర్చండి అని. ఒకటి మనిషి దేన్నించి సన్యసించగలడు? అన్నీ ఆ పరబ్రహ్మ స్వరూపమైన తత్వమే అని ఎరిగినప్పుడు, అద్వైతమయ మైనప్పుడు ఒక దాన్ని త్యజించడం ఎలా ఇంకొకదాని కోసం? నా ఇంకో సందేహం - సన్యాసులకు సన్మానం చేయవచ్చునా?" అని.

మామూలు యోగులయితే ఈయన ప్రశ్నలకు కోపగించుకునే వారేమో, కాని ఆ సాధువు గారు ఇలా సమాధానమిచ్చారు. "యోగులందర్ని మనం యోగులని, సన్యాసులని, అవధూతలని, గురువులని అంటున్నాం. కానీ వాళ్ళలో కూడా ఎన్నో తత్వపరమైన భేదాలున్నాయి. కుంభమేలాకు లక్షలమంది సాధువులొస్తారు. అందులో అదృశ్య రూపులయిన సిద్ధులూ వుండొచ్చు, అడుక్కునే బిక్షుకులూ వుండవచ్చు. టిబెట్ లాంటి ప్రాంతాలలో కొన్ని చోట్ల అందరూ బౌద్ధ సన్యాసులే. ఆవులన్ని తెల్లనివి అని మనం ఎలా చెప్పలేమో అలాగే యోగులందరూ ఒకటే నని చెప్పలేం. వారి లక్ష్య సిద్ధికూడా వారి మార్గాన్ని, సాధనని బట్టి ఉంటుంది. ఇక మీ మొదటి ప్రశ్నకి జవాబు, మనిషి దేన్నుండీ నిజానికి సన్యసించలేడు. సన్యసించే వారు తమకి తామే శ్రాద్ధకర్మలు నిర్వహించుకుని, జంధ్యముంటే దాన్ని తొలగించుకుని, కుటుంబాన్ని వీడి వెళ్ళడం వల్ల పాపాలన్ని కడిగేసు కున్నట్టు, ఇంక ఆ రెండోరోజు నుంచీ మోక్షానికి సిద్ధం అనుకున్నా అది అజ్ఞానమే. సన్యాసం సాధనకు మొదటి మెట్టు. కాషాయం ధరించడం యుద్ధానికి వెళ్ళే సైనికుడు వేసుకునే యూనిఫార్మ్ లాంటిది. ప్రపంచంలో ప్రతి యూనిఫారంతోనూ కొన్ని బాధ్యతలుంటాయి. సైనికుడు అది వేసుకోగానే ఈ దేశమే నా కుటుంబం అనుకోగలగాలి. అయితే సన్యాసిది అంతకన్న పెద్ద లక్ష్యం, ఈ లోకమే నా కుటుంబం అనుకోగలగాలి. సన్యాసి ప్రతిదాంట్లోనూ ఆ సర్వవ్యాపకశక్తిని నిజంగా, పుస్తకల్లోచదినట్టు కాకుండా దర్శించగలగాలి. అంతర్ముఖంగా ఉన్న శత్రువులు - అరిషడ్వర్గాలతోనూ యుద్ధం చెయ్యాలి, తన జీవితాన్ని ఆ మహా లక్ష్యానికి అంకితం చేయాలి. అలా క్రమంగా అన్నిటా తమను దర్శించిన యోగులు కొందరు తమ అసలు వ్యక్తిత్వాన్ని పూర్తిగా నిర్మూలించగలుగుతారు. చిత్తవృత్తులను నిరోధించ గలుగుతారు.

అప్పుడు కాషాయమేం ఖర్మ ఆయోగికి ఏమీ అక్కర్లేదు. దిగంబరుడై సంఘ పరిధినే దాటి వైరాగ్య, అలౌకికానంద అనుభూతిలో ఉన్న ఆ యోగి ఏ భౌతిక సన్మానాలకి లొంగిపోడు. బుద్ధుడిలాంటి చక్రవర్తి కూడా యోగిగా ఆనందించాడు, అలెగ్జాండర్ కూడా ఒక సన్యాసి ముందు మోకరిల్లాడు. ఏ దేశంలో నైనా ఒక సన్యాసి గౌరవనీయుడు, అత్యంత ముఖ్యుడు - ఎందుకంటే అతడు నిర్మల చిత్తుడై నిష్పాక్షికంగా, పరదేవతా స్వరూపమై మానవాళి ఉన్నతిని కాంక్షిస్తాడు కనుక. అందుకే మనం ఋషి ప్రోక్తం అన్న విషయాలని ప్రామాణికంగా తీసుకుంటున్నాం. పురాణకాలంలో వాళ్ళు మాట్లాడేవారు, సంఘం వినేది. ఈరోజు స్వలాభాపేక్ష లేకుండా సంఘానికి హితం చెప్పే యోగులూ కనిపించరు, వాళ్ళెవరైనా చెప్పినా మనం వినం. ఒక యోగి, అతని సాధనా ఎంత గొప్పవంటే ఎవరైన చనిపోతే ధర్మ శాస్త్ర ప్రకారం శరీరాన్ని దహనం చెయ్యమంటారు. కానీ సన్యాసుల యోగుల శరీరాలు ఖననం చేస్తారు-సమాధిని సైతం పూజిస్తారు. కొందరు యోగులను నదీ ప్రవహాల్లో వదులుతారు. వారి శరీరాల్లో వుండే సాధనా శక్తి ఈ ప్రకృతికి చేరి మంచి జరగాలని అందులోని వుద్దేశం. శరీరల్లో దాగుండే కర్మ ప్రభావాలని బుద్ధిజంలో 'సంఖారా ' అంటారు. ఇది బహుశా సంస్కారాలకి ప్రతిరూపం కావచ్చు. విపస్సనా ధ్యాన మార్గంలో వీటిని గురించి వుంది. అందుకని సన్యాసిని పూజించడం సంఘం తనని తాను పూజించుకోవడమే, మనని రక్షించే నిస్వార్ధ మహా సైనికుడ్ని అభినందించడమే. ఆ అభినందన సభ అవగానే సైనికుడు మళ్ళీ తన విధులకి దేశపుటెల్లలోకి ఎలా అయితే వెళ్ళి పోతాడో, జనావళితో పూజలు చేయించుకుంటూ ఉండిపోడో అలాగే యోగి ఇలాంటి సత్కారములందుకుంటూ ఉండడు, ఉన్నా అది తన గురువుకో, తన ఇష్టదేవతకో అంకితం చేస్తాడు. ఆ సన్మానం అవగానే తన భౌతిక ప్రపంచపుటెల్లల్లోకి అంటే నిత్యచైతన్య చిచ్చక్తిలోకి వెళ్ళిపోతాడు." అని ముగించారు.

అది విన్న ఆ మాష్టారు ముకుళిత హస్తాలతో ఆ యోగితో అన్నారు - "ఇందాక ఆ మాలని మీకు వేస్తున్నప్పుడు మీరు ఎందుకు చిరునవ్వు నవ్వారో అర్ధమైంది" అని. మనోభావాలను సైతం చదవగల ఆ యోగి చెప్పారు, "అవును ఆ మాలను చూడగానే నాకు నిర్జీవులపై వేసే పూమాలలు గుర్తుకొచ్చాయి. వారణాసిలోని కాలభైరవుని పాదాలకు ఆ మాలను సమర్పించాను" అన్నారు.

"మరి మావంటి సాధకులకు యోగులవంటి సాధనా సిద్ధులెలా కలుగుతాయి? అసలు సామాన్య మానవుడి కోసం ఇంత అపురూప రహస్యాలనెందుకు అంద అందజేయలేదు? ఇది ఏవైనా ఒక ప్రత్యేక కులానికి రహస్యంగా అందుతున్న విద్యలు, మంత్రాలా? " అని అక్కడున్న ఒక సాధకుడు అడిగాడు.

స్వామి మందహాసంతో చెప్పారు, "ఆలోకంలో వాళ్ళు తపో శక్తి బద్ధులే కాని కుల,మత,దేశ,భాషలకు కాదు. ఈ సంగతి వచ్చింది కనుక కొన్ని విషయాలు చెపుతాను, కేవలం నీ సందేహం తీర్చడానికి. విషయాన్ని లోతుగా అలోచించు -వర్గభేదాలకు అతీతంగా. వాల్మీకి ఎవరు? ఏకలవ్యుడెవరు? రాముడు ఎవరు? కృష్ణుడేవరు?

అన్నిటికన్న ముఖ్యమైన విషయమేటంటే ఎక్కడ జన్మించాం అన్నదికాదు ముఖ్యం ఎందుకోసం జీవించాం అన్నది ముఖ్యం. ఋషులు సామాన్యులకు సైతం విద్యనందించే ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రతిభా పాటవాలు మామూలు మాటల్లో పెట్టడం కష్టం. అందులో కోట్లకొలది సృష్టి సూత్రాల్లో, ప్రకృతి రహస్యాల్లో ఒక్కటి తీసుకుందాం. శ్రద్ధగా వింటే బోధపడుతుంది. పతంజలి యోగసూత్రల్లో ఉంది, మనం దేని మీద మనం సమ్యమం చేస్తే దాని మూలతత్వ సిద్ధి కలుగుతుంది అని. అంటే మామూలు మాటల్లో నాభి చక్రం మీద మెడిటేషన్ చేస్తే శరీర వ్యూహ రచన జ్ఞానం ఏర్పడుతుంది. అందువల్ల మన శరీరంలో ఉన్న వచ్చిన, రానున్న రోగాలన్నీ మనకి తెలిసి పోతాయన్న మాట.

 సూర్యుడి మీద మెడిటేషన్ చేసేవాడికి జగత్సర్వం అర్ధమై వశీభూతమవుతుంది, వాడు మహా తేజోమయుడౌతాడు. బాల అంజనేయుడు సూర్యుడిని మింగాడు అంటే అర్ధం నిజంగా కాల్తున్న సూర్యుణ్ణి నోట్లో పెట్టేసుకున్నాడు అని కాక పోవచ్చు. మనమెవరమూ అక్కడలేము కదా, కనక నిజంగా సత్యాన్ని గ్రధజ్ఞానంగానో, మనోజ్ఞానంతో తప్ప గ్రహించలేం. హనుమంతుడు సూర్యుణ్ణి మింగే విషయాన్ని గురువులు ఇలా కూడా అర్ధం చెప్పారు - హనుమంతుడు అంటే హనువులు కలవాడు. అంటే బుగ్గలు ఉన్నవాడన్న మాట. ప్రాణాయామంతో శ్వాసను కుంభించిన వాడన్న మాట. సూర్యుడిమీద ధ్యానసిద్ధిని పొందాడు అని అర్ధం సూర్యుణ్ణి మింగడం అంటే. ఆ సూర్యుడు గాయత్రి మంత్రంలోని ఆ మహా భర్గుడు కావచ్చు, లేక హృదయ స్థానంలోనుండే సూర్య ద్వారం ఉందని అందులోనుంచి బ్రహ్మలోకానికి ప్రవేశమని పతంజలి చెప్పారు, అధర్వణవేదంలో కూడా ఆ విశేషాలున్నాయి.

'నీలతో యద మధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా
నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా
తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః
స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్ '
(నారాయణ సూక్తం)

అలా కీర్తించబడే అఖండ తేజోమయమైన బ్రహ్మత్వాన్ని ఆకళింపుచేసుకుని,అనాహతాన్ని పూర్తిగా సిద్ధింపచేసుకున్న ప్రేమ, స్వామి భక్తి ఆంజనేయునికి ఉన్నయని ఇంకో అర్ధం.అందుకే కొన్ని చిత్రాల్లో వేసినట్టు ఆయన హృదయాన్ని తెరిస్తే నారాయణుడైన ఆ రాములవారే ఉన్నట్టు చూపుతారు. ఆయన బ్రహ్మచారి అంటే బ్రహ్మ యందు చరించే వాడని అర్ధం.కొన్ని జీసస్ చిత్రాల్లో కూడా దివ్యాత్మని అనాహత చక్రంలో చూపిస్తారు.

అంతే కాదు సూర్య నాడి , చంద్ర నాడి అనేవి మన కుండలినిలో వున్నాయి కనుక అందులో సూర్య నాడిని పూర్తిగా చిన్నపుడే వశం చేసుకున్నాడు, తద్వారా అనంత విశ్వజ్ఞానాన్ని పొందాడు అని కూడా అర్ధం చెప్పవచ్చు. అందుకే హనుమంతుడి గురువు సూర్యుడు అన్నారు.

ఇప్పుడు మనం మొదలుపెట్టిన విషయానికొస్తే, సామాన్య మానవుడుకూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆ ఆంజనేయ రూపాన్ని కళ్ళారా చూసి దండం పెట్టుకున్నప్పుడు,అర్చించినప్పుడు తనకి తెలియకుండానే ఆ యోగ శక్తిమీద సమ్యమం చేస్తున్నాడు, ఆ శక్తిని పొందుతున్నాడు.దుర్గ గుడికి వెళ్ళినప్పుడు సిం హంలాంటి ప్రకృతిని జయించి, తనలోని తమో రాజసిక ప్రవృత్తులనధిగమించి బహుభుజుడై జీవన గమ్యాన్ని చేరగల దుర్గాన్ని తనలోనే నిర్మించుకుంటున్నాడు, విజయోన్ముఖుడవుతున్నాడు. చిన్న మాటల్లో చెప్పాలంటే నిరక్షరాస్యుడు కూడా గుడికి వెళ్ళి దండం పెట్టుకుని,అలా అనాలోచితంగా వినమ్ర భక్తితో ధ్యానం చేసుకుని, మనసులో నింపుకున్న ఆ మూర్తి ద్వారా మహా యోగ సిద్ధిని తెచ్చుకుంటున్నాడన్న మాట.ఇదే మహాభారతంలోని ఏకలవ్యుడి కధలో ఉన్న అంతరార్ధం. ద్రోణాచార్యుడే ఎదురుగా ఉండక్కర్లేదు,ఆయన మట్టి బొమ్మ పెట్టుకున్నా అది మాట్లాడుతుంది మౌనంగా, అంతర్లీనంగా - ధనుర్విద్యని నేర్పుతుంది అతీతంగా. చిత్రమేమిటంటే ఇలా జరుగుతున్న విషయం, ఏకలవ్యుడు కేవలం మట్టి బొమ్మతో తన విద్యమొత్తాన్ని గ్రహిస్తున్నట్టు ద్రోణాచార్యుడికి కూడా తెలియదు. దీన్ని బట్టి మనకి అర్ధమయ్యే రహస్యాలు చాలా ఉన్నాయి. విద్య అనేది ఇచ్చేవాడిని బట్టిలేదు, తీసుకునే వాడి గ్రాహ్యక శక్తిని బట్టి ఉంది అని ఒకటి, ఇంకోటి ప్రకృతిలోనే ఋతంభర ప్రజ్ఞ అనే ఒక చైతన్యం ఉంది అది ఎవరికి ఏ జ్ఞానం ఎంత కావాలన్నా అందజేస్తూ ఉంటుంది అన్నది ఇంకోటి.ఇలా మామూలు విగ్రహాలు, రూపాల ఫొటోలు వీటిల్లోంచి శక్తులు విభూతులు, విబూదులు అవీ ఎలా వచ్చేస్తాయో పతంజలి మహర్షి చెప్పారు.రూప విశేషాల మీద ధ్యానం చేస్తే ఆ రూపాల శక్తులు ప్రాప్తిస్తాయని ఎన్నో ఉపాధులని, ఉదాహరణలని యుగాలక్రితమే మనకి ఇచ్చారు. అందుకే సామాన్య మానవుడు సైతం చేసే విగ్రహారాధన ఆ రాతిబొమ్మకి కాదు సుమా! విగ్రహారాధన మనిషిని స్వగృహారాధన (శరీరం,సంసారం)నించి గ్రహాతీతమై, అనుగ్రహకారకమై నిగ్రహారాధనలోంచి నిరాకారబ్రహ్మని మనిషి సూక్షంగా అందించే ఆరాధనాశక్తి సాధనం అన్నమాట.

అందుకే పెద్ద గుడికూడా కట్టలేని పేదలున్న చోట, అలాంటి విజ్ఞానమో ఆసక్తో కూడా లేని గ్రామాల్లో కూడా గ్రామదేవతలు నెలకొని ఉన్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు గ్రామాల్లో వారు కూడా యధాశక్తి గ్రామదేవతలని నెలకొల్పి, అర్చించి తరించగలుగుతున్నారు. ఆయాశక్తులు కూడా వారికందుబాటులో ఉంటాయి. మంత్రం సరిగ్గా చదవలేదు, బీజాక్షరం పలకలేదు నేను నీకు కనపడను, అనుగ్రహించను అనడు కదా భగవంతుడు.నిజానికి మామూలు కంటే కొంచెం తొందరగానే గ్రామ వాసుల భక్తి ఈ గ్రామ దేవతలు పలుకుతున్నట్టు కనిపిస్తుంది.నిర్మలమైన భక్తికన్నా విలువైన శక్తి ఏముంది? చాలాచోట్ల ఒక చెట్టునో రాయినో కూడా దేవతగా పూజిస్తారు. పసుపు కుంకుమా పెడితే దేవుడే. జాతరొస్తే ఊరంతా కదలి రావల్సిందే గ్రామదేవతకి మోకరిల్ల వలసిందే. పల్లెవాసుల ప్రేమాభిమానాలు ఎక్కువ. అలిగినా మళ్ళీ అంతగా ప్రేమిస్తారు, అనుగ్రహిస్తారు. ఈ తత్వమే ఆ గ్రామ దేవతల్లో కూడా ఉంటుంది. దేవతా ప్రతిరూపాలు మనం, మన మనోభావ నిర్మాణాలు వాళ్ళు కనుక వాళ్ళు మనం సృష్టించిన పాత్రలో ఇముడుతారు, మనకోసం. అమ్మవార్లు, పేరంటాళ్ళు (దేవతలు) ఈరూపాలే.

పురాతన కాలం నించి దేవతా ఉపాసనలు ఎలా ప్రారంభమయ్యాయో, అవి ఈరోజు ఎలా రూపు దిద్దుకున్నాయో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరెవరు ఏ విధమైన ఉపాసనని అందుకో గలిగారు అనేది ఒక విచిత్రం. అందరికి ఈ మంత్ర, ఉపాసనా విద్యలు అందలేదు అనుకోడం నిజం కాదు. ఇందుకు చిన్న ఉదాహరణని చూద్దాం.స్త్రీ దేవతా మంత్రాలని విద్యలు అని కూడా అంటారు. ఆ విద్యల్లో అత్యంత రహస్యమైనవి అద్భుత శక్తి ప్రదాయక మైనవి దశమహావిద్యలు. చాలా కాలం ఇవి గోప్యంగా ఉంచబడ్డాయి. ఇవి సామాన్యులు అర్ధం చేసుకోలేరు, యోగ శక్తి రూపాలైన ఛిన్నమస్తలాంటివి అందరికి అర్ధంకాకపోగా అయోమయానికి దారితీయరాదని పండితులు భావించి ఉండవచ్చును. సరే ఈమెనే ఉదాహరణగా తీసుకుంటే ఛిన్నమస్త తంత్ర దేవతగా ఉపాసించబడ్డ కుండలిని యోగ స్వరూపం. ఇళ, పింగళ, సుషుమ్న అన్నీ కలిపి ముగ్గురు దేవతా మూర్తులుగానూ ప్రాణ చైతన్యం ధారగానూ చూపారు. ఇంతకన్న వివరాలు ఇప్పుడు చెప్పలేను కాని ఈమె గొప్ప ఆధ్యాత్మిక యోగశక్తి. రమణ మహర్షి శిష్యులైన కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని (నాయన) ఈమెను వేదంలోని ఇంద్రశక్తిగా కీర్తించారు. ఉమాసహస్రం, ప్రచండచండీ త్రిశతి రచించారు.

"రాయస్కామో వజ్ర హస్తం సుదక్షిణం పుత్రేన పితరం హువే " మంత్రం ఈమె మంత్రంగా గుర్తించారు.ఆమెనిలా కీర్తించారు కూడా.

"ఛిన్నాం భిన్నాం సుతరాం సన్నా
మన్నా భావదభితః ఖిన్నాం
ఏతాం పాతుం భరత క్షోణీం
జాయే జిష్ణోః కురుమాం శక్తః "
(ఉమా సహస్రం - నాయన గారు, 26 నవంబరు 1907)
ఓ దేవీ ఛిన్నాభిన్నమై క్షీణించుచు అన్నములేక అంతటను దుఃఖించు భారత భూమిని రక్షించుటకు శక్తినిమ్ము అని అర్ధం. ఛిన్నమస్తయే జమదగ్ని భార్య రేణుక. ఆమె సృష్టిలోని రేణువులకు అధిష్టాన దేవత. అంటే అణు శక్తి (ఏటామిక్ ఎనర్జీ) అన్నమాట.ఈ ఉపాసన ఎంతో శక్తివంతము, రహస్యము.హిమాలయాలనించి కేరళాలోని తంత్ర వేత్తలదాకా ఉన్నత స్థాయి సాధకులు ఈమెను ఉపాసిస్తారు. నేపాల్, టిబెట్లలో ఈమెనే 'వజ్రయోగిని ' అన్నారు. మోక్షానికి, అపారమైన యోగ శక్తికి బుద్ధిజంలో ఈమె చిహ్నంగా భావిస్తారు.

మరి ఇంత గొప్ప శక్తిని తరతరాలు ఎవరు ఉపాసిస్తున్నారో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.అది ఎవరో కాదు మన ఆంధ్రదేశంలోనే హరిజనులు ! రేణుకా ఎల్లమ్మ గా, ఎల్లమ్మ గా ఆ అమ్మ కులమతాలకతీతంగా ఆంధ్రదేశంలో కొన్ని వేల ఊళ్ళల్లో అర్చించబడుతోంది.ఒకప్పుడు కొన్నికుటుంబాలలో ఒక అమ్మాయిని ఎల్లమ్మ రూపంగా ఉంచి పూజించేవారు. ఆమెను 'మాతంగి ' అని పిలిచేవారు. పల్లెల్లో ఎల్లమ్మ కధ ఈనాటికి రేణుకా కధే. ఇది ఎలా సాధ్యం? కొన్ని వేల సంవత్సారాల క్రితమే అంత శక్తి సాధన అయిన రేణుకా సాధనని ఎవరు సంఘంలో మూలనున్న వారికి కూడా అందించి తద్వారా మానవులంతా సమానమే సాధన విషయంలో అని మౌనంగా మనకి తెలియ చెప్పారు? ఆ మహనీయుల ఆలోచనా దృక్పధానికి నమస్సులు.

ఎల్లమ్మ గ్రామ దేవత. గ్రామ దేవతలు అంటే చిన్న చూపు చూడరాదు.ఒక సారి ఒక పీఠాధి పతులు పర్యటిస్తూ ఒక ఊరిలో బస చేసారు. వారిని గ్రామ పెద్దలు ఆ గ్రామ దేవత రేణుకా ఎల్లమ్మ ఆలయానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆయన "ఆ.. ఆవిడ గ్రామ దేవత నేను వచ్చేదేమిటి " అని తిరస్కరించారు. తెల్లవారి చూస్తే ఆయన కనపడలేదు. ఎక్కడున్నారని వెతికితే ఆయన ఆ గ్రామదేవత ఆలయంలో జపం చేసుకుంటూ కనబడ్డారుట. మరి రాత్రికి రాత్రి ఆ అమ్మవారు ఏంచేసిందో ఆయన అభిప్రాయాలెందుకు మార్చుకున్నారో వాళ్ళిద్దరికే తెలియాలి.

తూర్పుగోదావరి జిల్లాలో కీ||శే|| ద్విభాష్యం పుల్లకవి గారు (దుర్గాడ వాస్తవ్యులు) తునిలోని తలుపులమ్మ వారిని ఏదో అన్నారుట. క్షణంలో ఆయనకొక ఆకస్మిక అనారోగ్యం కలగడంతో అది ఆమె లీలేనని గ్రహించి అమ్మవారిపై పద్యాలు రాసారు. తలుపులమ్మ అసలు తలపులమ్మట! ఆవిడకి తెలియని తలపులేముంటాయి ?!

తునిలో తలుపులమ్మ గుడిని సాయంత్రం మూసేస్తారు. తలుపు మూసాక ఇంక మళ్ళీ మర్నాటివరకు తెరవరు. ఒకసారి ఒక దంపతులు తమ బిడ్డను గుడిలో మర్చి పోయారుట.రాత్రంతా ఆ ద్వారందగ్గర ఉండి విచారిస్తూన్నారుట.పొద్దున్న చూస్తే బిడ్డ క్షేమంగా ఆడుకుంటూ ఉందిట. "ఏమిటమ్మా నువ్వు రాత్రి ఏడవలేదా, భయపడలేదా? " అంటే ఆ పాప చెప్పిందిట, "ఎందుకమ్మా భయం, రాత్రంతా నువ్వు నాతోనే ఉన్నావు. అన్నం కూడా పెట్టావు" అందిట. అంత ప్రేమగల తల్లి ఆ అమ్మవారు.

కాటన్ దొరకు కలలో కనపడి పక్కకు తీయించిన తన విగ్రహాన్ని, గుడిని యధాస్థానంలో పెట్టించిందిట ముత్యాలమ్మ. అనకాపల్లి నూకాలమ్మ శక్తి అపారం. కాట్రేని కోన మావిళ్ళమ్మ లీలలు కధలుగా చెపుతారు. పెద్దాపురం మరిడమ్మ కు జాతరలు ఉత్సవాలు చేస్తారు. సీలేరు దగ్గర ధారకొండలో ధారాలమ్మ గుడిదగ్గరకి తరచు ఒక పెద్దపులి వస్తుండేదిట. అది ఆమె వాహనంగా భావించే వారు. పైడితల్లమ్మను విజయనగరం ప్రాంతంలో పూజిస్తారు. సికిందరాబాద్ లో ఉజ్జయిని మహాకాళి గుడిలో 'రంగం ' చెపుతారు - ఆ సాలు భవిష్యత్ దర్శనం వివరిస్తారు. ఇలా ఆంధ్ర దేశంలోనే కాక ఇతర రాష్త్రాలలో కూడా ఇలా ఉపాసిస్తారనడానికి బస్తర్లోని దంతేశ్వరి అమ్మవారు నిదర్శనం. ఇలా ఎందరో దేవతలు వారి చిత్రమైన శక్తులు ఉన్నాయి.

నీరు స్వచ్చంగా ఉండడం ముఖ్యం, అది ఎక్కడిదైనా కావచ్చు.దేవతా శక్తి కూడా అలాంటిదే.అందరికి నీళ్ళు అందించే ప్రయత్నం ప్రకృతి చేస్తూనే ఉంది. అలారాని చోట్లకి డాం లు లాంటివి నిర్మించి నీరు అందించినట్లే మహాత్ములు అనేక సంస్థల ద్వారా మానవత్వాన్ని, దైవత్వాన్ని అందిస్తున్నారు. కొందరు భగీరధుల వంటి యోగులు ఆ దివ్య గంగనే భువికి తెస్తున్నారు, అయినా వినయంగా జీవిస్తున్నారు.
-----------------------------------------------------
రచన - ప్రఖ్యా మధుబాబు, 
సుజనరంజని సౌజన్యంతో

Sunday, May 19, 2019

సాహిత్యంలో చాటువులు - 3


సాహిత్యంలో చాటువులు - 3




సాహితీమిత్రులారా!

జీవితం ఎంత చిత్ర మైనది! ఇలా ఉండాలి అని మనం అనుకొంటాం, కాని ఇలా ఉంచాలి అని భగవంతుడు అనుకొంటాడు” అని పెద్దల నానుడి. ప్రతి వ్యక్తి జీవితంలో మంచి,చెడులు చీకటి,వెలుగుల్లా ఉంటూనే ఉంటాయి. వాటిని అనుభవించి అధిగమించడమే ఉత్తమ లక్షణం. అదృష్టం, దురదృష్టం కూడా పక్కపక్కనే ఉంటాయి. వాటిని మనం తప్పించుకోలేము. ఈక్రింది ఉదాహరణ చూడండి----

“ పాములు ఆడించి జీవనం సాగించే వాడి ఇంట్లో ఒక ముసలి పాము బుట్టలో ఉంటుంది. పాములవాడు అది తనకి ఇంక పనికి రాదని దానికి ఆహారం కూడా ఇవ్వడు. అదినీరసించి, చావుకు దగ్గరలో ఉంటుంది. బలహీనతవల్ల బుట్ట మూత తీసుకొని బయటకు రాలేక పోతుంది. ఇది ఆపాము పరిస్థితి. ఓ రోజు ఒక ఎలుక ఆహారం కోసం ఆ పామున్న బుట్టకి కన్నం పెట్టి అందులో దూరుతుంది. అప్పుడు ఆముసలి పాము నోటివద్దకు వచ్చిన ఆ ఎలుకను భక్షించి కొంచెం బలం పుంజుకొని, ఆ ఎలుక చేసిన కన్నం లోంచే బయటకి వచ్చి హాయిగా వెళ్లి పోతుంది.” ఒక చిన్ని సుభాషితం తెలిపే కథ. ఇక్కడ చనిపో వలసిన పాము అదృష్టం వల్ల బ్రతికింది, దురదృష్టం వల్ల బాగున్న ఎలుక మరణించింది. కనుక విధి వ్రాతను ఎవరు తప్పించుకో లేరు.అన్నది సారాంశం.ఇది వేదాంతం కాదు. జీవిత సత్యం. ఇట్టి విశేషాలను తెలిపే కొన్ని చాటువులని ఈ నెల తెలుసుకొందాం.

చాటు సాహిత్యంలో ‘శ్రీనాధుని’ చాటువులుగా చెప్పబడే కొన్ని పద్యాలు సుప్రసిద్ధాలు. (ఇవి శ్రీనాధుని పేరుతో ఎవరో రచించారని విమర్శకుల అభిప్రాయం.) వాటిలో కొన్ని----

“ మూతిని ముట్టగా వెరతు- ముద్దకు ముద్దకు కూటిలోపలన్
పాతిక పాలు సైకతము – పచ్చడి కొంచెము – ఆది యంతమున్
చూతమటన్న లేదు – మరి సున్నము కన్నను మెత్త నన్నమీ
రాతిరివంటి భోజన మరాతికినైనను వద్దు దైవమా!”

(వివరణ)

“కవిసార్వభౌముడు”గా పేరుగాంచిన శ్రీనాధునికి కూడా కష్టాలు తప్పలేదు. అని పై చాటు పద్యం తెల్పుతుంది. మంచి ఆరు రుచులతో కూడిన భోజనము తినే శ్రీనాధ కవికి, పలనాడు వెళ్లి నపుడు ఒకరి ఇంట రాత్రి పెట్టిన భోజనము ఎంతఅరుచిగా (చెడ్డగా) ఉన్నదో చెపుతూ ఇలాంటి భోజనము శత్రువుకైనా వద్దు దైవమా! అని బాధ పడతాడు. మరి ఆ భోజనం ఎలాఉంది అంటే -----

మూతిని ముట్టగా వెరతు= నోటిలో పెట్టు కోవడానికే భయంగా ఉందిట. పచ్చడి కొంచమే ఉందిట. ఇంకా ‘ఆది’ మొదట్లో వేసే ‘నేయి’, ‘అంతము’ చివరగా వడ్డించే పెరుగు లేక ‘మజ్జిగ’ చూడటానికి కూడా లేవుట! (“తక్రాంతంహి భోజనం” అని శాస్త్రం. తక్రం అంటే మజ్జిగ.) ఇంక సున్నంలా అన్నం చాల మెత్తగా ఉందిట. ఇటువంటి భోజనము, అరాతికి= శత్రువుకైనా వద్దు అని భగవంతుని ప్రార్థించాడుట శ్రీనాధుడు. ఇది ఈ చాటువు యొక్క భావం. ఇక్కడ అప్రస్తుతమైనా శ్రీనాధుడు వర్ణించిన ఆంధ్రుల భోజన పదార్ధాలను కొన్నింటిని తెలుసుకొందాం. కొన్ని ఆంధ్రులకి అంటే మనకే స్వంతం, ఇష్టమైనవి. ( ఈ వివరణ ఇప్పటి వాళ్ళు తెలుసు కొంటారని!)

అన్నం తెల్లగా మల్లెపూవులా మెతుకు మెతుకు అంటుకోకుండా ఉండాలి. అన్నంలోకి వేడి,వేడి కమ్మని నేయి, చక్కని ముద్ద పప్పు, లేహ్యాలు, చోష్యాలు అంటే పచ్చళ్ళు, పులుసులు, ముక్కల పులుసుని ‘దప్పళం’ అనికూడా అంటారు, ఇంకా తోట కూర పులుసు,మజ్జిగ పులుసు, చారు.(సాంబారు,రసం మనవి కావు.)అందులోకి వడియాలు, అప్పడాలు.

కూరలు- వంకాయకూర తప్పని సరి, పనసపొట్టు కూర, తీయ గుమ్మడికూర, కంద,అరటి,పొట్ల, దొండ,దోస, కాకర,బచ్చలి,తోట కూరలు, బెండకాయ వేపుడు. ఆవకాయి,మాగాయి, గోంగూర, కొబ్బరి నూల పచ్చళ్ళు.

పొడులు- కంది పొడి, పెసరపొడి, పప్పుల పొడి, కారపు పొడి.

ఇంక పిండివంటలు –వీటిని భక్ష్యాలు అంటారు. వడలు, ఆవడలు, పెరుగువడలు, జంతికలు,పప్పు చెక్కలు, చేగోణి(డి)లు,ఇవి కారం. ఇక మధురం-అతిరసాలు( అరిసెలు) బొబ్బట్లు, పూర్ణాలు,( వీటిని బూరెలు అనికూడా అంటారు) సొజ్జేఅప్పాలు, అప్పాలు,లడ్లు ( వీటిని మోదకాలు అంటారు) మినప సున్ని ఉండలు, కొబ్బరి ఉండలు, కజ్జికాయలు,మొ// అన్నంతో చేసేవి--క్షీరాన్నం,లేక పాయసం( పయః అంటే పాలు) పుళిహోర, –(పుళి అనగా చింత పండు, హోర అనగా అన్నం.) దీనినే చిత్రాన్నం అంటారు. దధ్యోదనం, (దధి=పెరుగు. ఓదనం=అన్నం.) వెన్ పొంగలి, (తెల్లని ) దీనిని పులగం అని కూడా అంటారు. శర్కర లేక చెక్కర పొంగలి, చివరగా చక్కని, చిక్కని గడ్డ మీగడ పెరుగు. ఇవి కొన్ని మాత్రమే.( ఉల్లి, వెల్లుల్లి నిషేధం.)ఇవి ఆనాటి వంటకాలు. ఇప్పుడు ఇట్టిదే శ్రీనాధుని ఇంకో చాటువు.

“ ఫుల్ల సరోజ నేత్ర! అల పూతన చన్నుల చేదు ద్రావి నా
డల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల? తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన నొక్క ముద్ద దిగ మ్రింగుము! నీ పస కాననయ్యెడిన్”

ఈ చాటువు కూడా శ్రీనాధుడు పల్నాటి సీమలో తనకి పెట్టిన కుభోజనము ను వర్ణించిన పద్యం. శ్రీకృష్ణుని తో చెప్పిన పద్యం.

( వివరణ)
ఫుల్ల సరోజ నేత్ర= వికసించిన తామరపూ రేకుల వంటి నేత్రములు కల శ్రీకృష్ణా! నీవు విషపూరితమైన పూతన అనే రక్కసి పాలు త్రాగేను అని, అడవిలో వచ్చిన దావాగ్నిని మ్రింగేను అని నిక్కేదవేల? గర్వపడతావు ఎందుకు?అదేమీ గొప్పకాదు. ఇక్కడ పల్నాటిలో తింత్రిణీ పల్లవము అంటేచింతాకుతో కలిపి ఉడికించిన బచ్చలి కూర వేసి పెట్టిన జొన్న సంగటి (ఓ రకమైన అన్నం ముద్ద) ఓముద్ద తింటే నీపస(నీ గొప్ప) తెలుస్తుంది. అని అంటాడు. ఇట్టివి శ్రీనాధుని పేరుతో ఉన్న చాటువులు ఎన్నో ఉన్నాయి. వాటిని చదివి ఆనందించండి.
----------------------------------------------------------
రచన -‘విద్వాన్’ తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు
, సుజనరంజని సౌజన్యంతో

Saturday, May 18, 2019

సాహిత్యంలో చాటువులు - 2


సాహిత్యంలో  చాటువులు - 2





సాహితీమిత్రులారా!


“పరోపకారాయ ఫలంతి వృక్షాః / పరోపకారాయ దుహంతి గావః
పరోపకారాయ వహంతి నద్యః / పరోపకారార్థ మిదం శరీరం!”

వృక్షాలు పళ్ళని, ఆవులు పాలని, నదులు నీటిని యితరులకే వినియోగిస్తాయి కాని అవి అనుభవించవు కదా! అట్లే మానవులు కూడా పరోపకారంకలిగి ఉండాలి అని పై సుభాషితం తెలియ జేస్తుంది. అట్లే కొన్ని మంచి గుణాలు పుట్టుకతోనే వస్తాయి అని ఈ క్రింది సుభాషితం వివరిస్తుంది.

“ దాతృత్వం – ప్రియ వక్తృత్వం- ధీరత్వం – ఉచితజ్ఞతా/
అభ్యాసేన నలభ్యంతే చత్వారః సహజా గుణాః//

౧.దానంగుణం. ౨.మంచిగా మాటాడటం, ౩.దేనికి చలించక ధైర్యంగా ఉండడం, .౪.ఇది మంచి. ఇది చెడు అని తెలుసుకొనే జ్ఞానం కలిగి ఉండడం. అనే నాలుగు గుణాలు సహజ సిద్దమైనవి. నేర్చుకొంటే వచ్చేవి కావు. ఇటువంటి సహజ గుణాలతో కూడిన ‘రాయని భాస్కరుడు’ అనే అమాత్యుని గొప్ప దాన గుణాన్ని తెలిపే కొన్ని చాటు పద్యాలని చదివి ఆనందిద్దాం. చాటువులు హాస్యాన్నే కాదు ఆచరణని కూడా బోధిస్తాయి.

“ఏ వ్రాలైనను వ్రాయును
‘నా’ వ్రాయడు వ్రాసెనేని నవ్వులకైనన్
‘ సి’ వ్రాసి ‘తా’ వడివ్వడు
భావజ్ఞుడు రాయనార్య భాస్కరుడెలమిన్.”

‘రాయని భాస్కరునికి’ చిన్నప్పటి నుండే దానగుణం అబ్బింది అనడానికి పైపద్యం ఒక ఉదాహరణ. ఎలాగో చూడండి---

“గొప్పవాడైన రాయని భాస్కరుడు అక్షరాలు దిద్దేటపుడు ‘నా’ అనే అక్షరం వ్రాయడట! ఒకవేళ వ్రాసినా, దానిప్రక్కన అంటే ‘నా’ ప్రక్కన ‘సి’ వ్రాసి ‘తా’ వత్తు ( స్తి ) ఇవ్వడట! అనగా ‘నాస్తి’ అనేపదం వ్రాయడు. అని భావం. నాస్తి అంటే సంస్కృతంలో ‘లేదు’ అని అర్థం. సంస్కృతంలో ‘నాస్తి’ అని వ్రాయడు అన్నట్లే తెలుగులో ‘లేదు’ అని వ్రాయడు అనే ఇంకో చాటువు.

“చేకొని రాయని బాచడు
కాకాలు గుణించు పిన్నకాలము నాడే
‘ లా’ కేత్వమీయనేరడు
‘ దా’ కును కొమ్మీయ డట్టి ధన్యుడు కలడే”

రాయని భాస్కరుడు బాల్యంలో తెలుగు గుణింతాలు నేర్చుకొనే సమయంలో ‘లా’ గుణింతం వ్రాసేటప్పుడు ‘లా’ కేత్వమివ్వడట, అట్లే ‘దా’ గుణింతంలో ‘దా’కి కొమ్ము అంటే ‘దు’ అని వ్రాయడట అనగా “ లేదు” అనే రెండక్షరాలు వ్రాయడట! అతడు ఎంత గొప్పవాడో కదా! అని భావం. ఈ చాటువులు ‘ప్రతి వారు దానగుణం’ కలిగి ఉండాలని తెలియ జేస్తాయి. రాయని భాస్కరుని గొప్పతనాన్ని తెలిపే ఇంకో చాటువు.

“ సరి బేసైరిపుడేల భాస్కరులు భాషానాథ? పుత్రా! వసుం
ధరపై నొక్కడు మంత్రియయ్యే! వినుకొండన్ రామయామాత్య భా
స్కరుడో? ఔను! అయితే సహస్రకరశాఖల్లేవు? అదే యున్నవే !
తిరమై దానము చేయుచో –రిపుల హేతిన్ వ్రేయుచో –వ్రాయుచో!”

చక్కని మత్తేభ పద్యంలో, బ్రహ్మ నారదుల సంభాషణా రూపంలో పై చాటువు లిఖించ బడింది.

నారదుడు బ్రహ్మని ఇలా ప్రశ్నిస్తాడు? “ ఓ భాషానాథ ! (భాషకి అధిపతివైన ఓ బ్రహ్మదేవా!) భాస్కరులు=సూర్యులు. సరి సంఖ్య అయిన పండ్రెండుమంది (‘ద్వాదశాదిత్యులు’అని ప్రసిద్ది.) ఉండాలి కదా? ఇప్పుడు బేసి సంఖ్య అయిన పదకొండుగ కనబడుతున్నారు! ఇంకో సూర్యుడు యేమైనాడు.” అని.
అపుడు బ్రహ్మ ఇలా జవాబిస్తాడు. “ నాయనా నారదా! ఒక సూర్యుడు భూలోకంలో మంత్రిగా వెలిసాడు!”

నారదుడు – “ వినుకొండలో రాయని భాస్కరుడు అనే పేరుతో ఉన్నవాడా!”
బ్రహ్మ – “ ఔను! అతడే!”
నారదుడు – “ మరి సహస్ర కరములు అనగా కిరణాలు ( లేదా చేతులు)లేవు.”
బ్రహ్మ - “ అవిగో! అవి శత్రువులను సంహరించేటపుడు, దానము
చేసేటపుడు, వ్రాసేటప్పుడు.! కనబడుతున్నాయి కదా!”
అనగా రాయని భాస్కరుడు సూర్యునివలే గొప్ప తేజస్సు కలవాడని, శత్రుసంహారంలో , దానగుణంలో, రచనలు చేయటంలో చాల గొప్పవాడని భావం. చూసారా! దానగుణాన్ని పై చాటువులు ఎంత గొప్పగా చెప్పాయో!
-------------------------------------------------------
రచన- ‘విద్వాన్’ తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు ,
సుజనరంజని సౌజన్యంతో

Friday, May 17, 2019

సాహిత్యంలో చాటువులు - 1


సాహిత్యంలో చాటువులు - 1



సాహితీమిత్రులారా!

పూర్వం “నవ్వు నాలుగు విధాల చేటు” అనేవారు. ఆ సామెత ఎందుకు వచ్చిందో ముందుగా తెలుసుకొందాం. “ రామాయణంలో రావణ వధానంతరం శ్రీరామ పట్టాభిషేకం వశిష్టుడు, వామదేవుడు, జాబాలి ,కశ్యపుడు మొదలగు పెద్దలందరూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ నిండు సభలో సీతారాములు సుగ్రీవ, ఆంజనేయ, జాంబవంత, విభీషణాదులను తగిన రీతిలో సత్కరిస్తూ ఉంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న లక్ష్మణుడు ‘పకపక’ మని నవ్వుతాడు. ఆ నవ్వు చూసి ఈ నలుగురు ఇలా అనుకొంటారు.

సుగ్రీవుడు- “ అన్నని అన్యాయంగా రామునిచేత చంపించి రాజ్యాన్ని సంపాదించి, రామునిచేత ఎలా సత్కరింపబడుతున్నడో ! కదా అని నన్నుచూసేనవ్వుకొంటున్నాడు.” అని అనుకొంటాడు.

విభీషణుడు – “ఇంటిగుట్టు లంకకి చేటు” అన్నవిధంగా అన్నగారి ప్రాణ రహస్యం రాముడికి చెప్పి, అన్నగారిని చంపించి లంకకి రాజైన తననుచూసి లక్ష్మణుడు నవ్వుకొంటున్నడేమో” అని బాధపడతాడు.

సీత- “సంవత్సర కాలం పర పురుషుడైన రావణుని వద్ద ఉండి ఇప్పుడు పట్టమహిషిగా రామునిప్రక్కన చక్కగా కూర్చొని, మర్యాదలుపొందుతున్న నన్నుచూసే నవ్వుతున్నా డేమో” అని అనుకొంటుంది.
భరతుడు –“ తల్లిద్వార అన్నగారిని అడవులకి పంపి, పదునాలుగు సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి, ఇపుడు అన్నగారికి ఇవ్వడం తనకి ఇష్టం లేదని” అనుకొని నవ్వుకొంటున్నాడేమో!” అని అనుకొంటాడు.

ఇలా నలుగురు నాలుగువిధాలుగా అనుకొంటుంటే, అసలు విషయం తెలిసిన శ్రీ రాముడు చిరునవ్వులు చిందిస్తూ “ లక్ష్మణా! నువ్వు ఇప్పుడు నవ్వేవుకదా! ఆనవ్వుకి కారణం ఏమిటి? ఎవరిని చూసి నవ్వేవు?.” అనిఅడుగుతాడు. అపుడు లక్ష్మణుడు “ అయ్యో!అన్నా! నేనుఎవరిని చూసికూడా నవ్వలేదు, పదునాలుగు సంవత్సరాలు నన్నువదలి నాభార్య ఊర్మిళను ఆవహించిన ‘నిద్ర’ ఒక్కసారిగా నన్ను ఆవహించింది. క్షణకాలం నారెప్పలు మూతపడ్డాయి. అందుకని నాలోనేనే నవ్వుకొన్నాను.” అని లక్ష్మణుడు చెప్పిన సమాధానం విని పైనలుగురు ‘అమ్మయ్య మనల్ని చూసి నవ్వలేదు’ అని తృప్తి పడతారు.

ఇది “నవ్వు నాలుగువిధాల చేటు” అన్న సామెత వచ్చిన కథ, అనవసరంగా నవ్వకూడదు అని తెల్పుతుంది కాని, ఎప్పుడు నవ్వకూడదు అని చెప్పదు. కనుక హాయిగా, ఆనందంగా ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. అందుకనే సినీ దర్శకుడు జంధ్యాల “ నవ్వడం యొక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వక పోవడం ఒక రోగం” అని నవ్వుని నిర్వచిస్తాడు. కనుక మనంకూడా హాస్యరస పూరితమైన చాటువులని చదివి హాయిగా నవ్వుకొందాం. రండి చదివి ఆనందించండి----

“ఎద్దీశునకశ్వంబగు?
గ్రద్దన నేదడవి తిరుగు ఖరకంటకియై
హద్దుగ నేవాడు ఘనుడు
పద్దుగ నుత్తరము లిందే పడయంగానౌ”


ఇది కూడా ప్రశ్నలోనే జవాబు ఉన్న చాటువు. ఎలాగో తెలుసుకొందాం—


ఎద్ది= ఏది. ఈశునకు= ఈశ్వరునకు. అశ్వంబగు=వాహనం అగును.(అశ్వం అంటే గుర్రం. కాని ఇక్కడ కవి వాహనం అనే అర్థంలో వాడాడు.)

ప్రశ్న- ఏది ఈశ్వరుని వాహనము? పదవిభజన కొంచం మార్చితే ప్రశ్నలోనే జవాబు దొరుకుతుంది. ఎద్ది+ఈశ్వరునకు.అనేపదాన్ని ఎద్దు+ఈశ్వరునకు, అనిమార్చి చదివితే “ ఈశ్వరునికి ఎద్దు వాహనము.” అనేజవాబు లభిస్తుంది.

అట్లే, రెండవపాదం – గ్రద్దన= త్వరితగతిని. ఖరకంటకియై=వాడియైన ముళ్ళు కలదై, ఏది= ఏ జంతువు. అడవితిరుగు= అవిలోతిరుగుతుంది. ముళ్ళతోకూడిన ఏజంతువు తొందర,తొందరగా,అడవిలో తిరుగుతూ ఉంటుంది? అన్నది ప్రశ్న.

ఏది+ అడవి. అనే పదాన్ని ఏదు + అడవి అని మారిస్తే జవాబు వస్తుంది. ఏదు =అంటే ముళ్ళపంది. శరీరం చిన్నగా ఉండి పెద్దపెద్ద ముళ్లుండే ముళ్ళపంది అడవిలో తిరుగుతూ ఉంటుంది అనిజవాబు.

హద్దుగ నేవాడు =బాగుగఎవడు. ఘనుడు =గొప్పవాడు.? అన్న ప్రశ్నకి
హద్దుగ = తనహద్దు తాను తెలిసినవాడు, ఎవడో వాడే ఘనుడు. అనిజవాబు.



నాల్గవ పాదానికి అర్థం- చక్కని జవాబులు ప్రశ్నలోనే ఉన్నాయి.అని.ఇది ఈచాటువు గొప్పతనం. ఇంకో చక్కని చాటువు చూద్దాం—

“కరచరణంబులు గల్గియు
కరచరణ విహీనుచేత కరమరుదుగ తా
జలచరుడు పట్టు వడెనని
శిర విహీనుడు చూచి నవ్వె చిత్రము గాగన్.”

ముందుగా పై పద్యభావం తెలుసుకొందాం. “ కాళ్ళు చేతులు ఉన్న జలచరుడు (నీళ్ళల్లో తిరిగేవాడు) కాళ్ళు చేతులు లేనివాడిచేత చంపబడే చిత్రమైన దృశ్యాన్నిచూసి, శిరస్సు లేనివాడు నవ్వేడట! ఎంత అద్భుతం! అని భావం. ఇప్పుడు వివరణ – కాళ్ళు చేతులు ఉండి నీటిలో సంచరించేది ‘కప్ప’. కాళ్ళు చేతులు లేనివాడు ‘పాము’, కప్పని పాము మింగుతుంటే, శిరస్సు లేనివాడు అంటే ఎండ్రకాయ (క్రాబ్) చూసి నవ్వింది. అన్న చిత్రమైన భావం పైచాటు పద్యంలో దాగి ఉంది.మీ పెదవులపై కూడా చిన్న చిరు నవ్వు వస్తోంది కదా! ఇంకెందుకు ఆలశ్యం హాయిగా నవ్వండి.
-------------------------------------------------------
రచన- ‘విద్వాన్’ తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు, 
సుజనరంజని సౌజన్యంతో

Thursday, May 16, 2019

జుగల్‌బందీ కచేరీలు


జుగల్‌బందీ కచేరీలు





సాహితీమిత్రులారా!

శాస్త్రీయ సంగీతంలో జుగల్‌బందీ కచేరీలకి కొంత ప్రత్యేకత ఉంది. రెండు వేరువేరు శైలులనో, వాయిద్యాలనో ఉపయోగించి వాటి మధ్యనున్న సామాన్య లక్షణాలని ఈ కచేరీలు విశదం చేస్తాయి. ఇది జరుగుతున్న క్రమంలో ఒక్కొక్క శైలిదీ విశిష్టత మనకు తెలుస్తూనే ఉంటుంది. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అన్న పద్ధతిలో ఈ మిశ్రమ సంగీతాన్ని శ్రోతలు స్వాదించి, ఆనందించగలుగుతారు. ఇందుకు భిన్నంగా రాధాజయలక్ష్మి వంటి గాయనుల ద్వయం ఒకేసారిగా కలిసి ఒకే పద్ధతిలో పాడుతూ ఉంటారు. బృందగానంలాగా సాగే ఇటువంటి కచేరీలకు జుగల్‌బందీకి ఉన్న అందం ఉండదు. పడుగూ పేకలాగా, కలినేత వస్త్రంలాగా విడివిడిగానూ, అప్పుడప్పుడు కలిసికట్టుగానూ వినబడే రెండు రకాల జుగల్‌బందీ సంగీతం దారే వేరు.

మునవ్వర్ అలీ ఖాన్ బాలమురళీకృష్ణ 1969లో నేను ఆంధ్రా యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో కేంపస్ బైట కాల్టెక్స్ కంపెనీ క్వార్టర్స్‌లో ఒక జుగల్‌బందీ కచేరీకి నేను హాజరు కాగలిగాను. కాగలిగాను అనడానికి కారణమేమిటంటే అది ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే ఏర్పాటు చెయ్యబడింది కాబట్టి. అందులో బాలమురళీకృష్ణ, మునవ్వర్ అలీ ఖాన్ (బడే గులాం అలీ కుమారుడు) పాడారు. 1980లలో బాలమురళి భీంసేన్ జోషీతోనూ, కిశోరీ అమోణ్‌కర్ తదితరులతోనూ తరుచుగా జుగల్‌బందీ కచేరీలు పాడడం జరిగింది కాని అప్పట్లో ఇది చాలా అరుదైన సంఘటనే.

బాలమురళిగారితో నాకున్న పరిచయం కారణంగా గేట్‌క్రాష్ అయిన నేను కచేరీ జరిగే ముందు నుంచీ అక్కడే ఉన్నాను కనక కొన్ని విశేషాలు నా కంటబడ్డాయి.

ముందుగా బాలమురళి, మృదంగ విద్వాన్ దండమూడి రామమోహనరావు తదితరులు దిగిన ఇంటికి మునవ్వర్ తదితరులు వచ్చారు. పరస్పర పరిచయాలూ, ఆలింగనాలూ, కుశలప్రశ్నలూ అయిన తరవాత కర్ణాటక, హిందుస్తానీ సంగీత పద్ధతుల గురించి కాస్త మాట్లాడుకున్నారు. రెండూ స్థూలంగా ఒకే సంగీతానికి వేర్వేరు రూపాలనీ, పేర్లు వేరైనా కామన్ రాగాలెన్నో ఉన్నాయనీ ఎవరికొచ్చిన యాసలో వారు ఇంగ్లీషులోనే మాట్లాడుకున్నారు.

మాటల మధ్యలోనే కల్యాణి (యమన్) రాగాల్లో తలొక సంగతీ, వరసలూ పాడుకోగా మేమంతా మా సంతోషాన్ని వ్యక్తం చేశాం. అలాగే హిందోళం (మాల్కౌస్) రాగాల ప్రస్తావన వచ్చింది. ఇలా కాసేపు ముచ్చటించుకున్నాక డిన్నర్ తినడానికని ఎవరి విడిదికి వారు వెళిపోయారు.

ఇదంతా చూస్తున్న నాకు ఆందోళన తగ్గలేదు. నేను చిన్న గొంతుతో బాలమురళిగారితో ‘అయ్యా, మీరు ఏ రాగాలు పాడబోతున్నారో అనుకున్నారు, సరే. మరి వాటిలో ఏయే పాటలు పాడతారో అనుకోలేదేం?’ అని అడిగాను. దానికాయన చిరునవ్వుతో ‘చూద్దాంలే, అతనికి తోచిందతను పాడతాడు. నాకు తోచిందేదో నేను పాడతాను ‘ అన్నాడు. ఆయన ధీమాగానే ఉన్నాడు కాని నాకే మధ్యలో ఆత్రుతగా అనిపించింది.

ఇంతలో దండమూడివారు ‘ఇదిగో, మరొహరూ మరొహరూ అయితే నేనిలాంటి కచేరీలకి ఒప్పుకోను తెలుసా? బాలమురళిగారు గనక పరవాలేదు. ఆయన మహా సమర్థుడు ‘ అన్నాడు. ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠతో నేను లోలోపలే తబ్బిబ్బయాను.

ఆ సంస్థ ఏర్పాట్లన్నీ ఘనంగా ఉన్నాయి. కళాకారులు నడిచి వస్తున్నప్పుడు ఇరువేపులా పిల్లలు నిలబడి వారు నడుస్తున్న దారిలో మల్లెపూలు చల్లారు. వారికి నిలువెత్తు మల్లెపూల దండలు సమర్పించారు. ప్రతిచోటా అమెరికన్ కంపెనీ డాలర్ల బలం కనబడింది. ఏర్పాట్లన్నీ చాలా చక్కగా జరిగాయి.

కాసేపటికి కచేరీ మొదలయింది. కలకత్తా నుంచి వచ్చిన మునవ్వర్ అలీకి తబలా వాయించడానికి బొంబాయి నుంచి నిజాముద్దీన్ ఖాన్ వచ్చాడు. దాదాపు ఒకే వయసుగల బాలమురళి, మునవ్వర్‌లకు అభిమానులం చాలామందిమి వింటూ ఉన్నాం. మొదటగా కల్యాణి ఆలాపన ప్రారంభించారు. యమన్‌లో మునవ్వర్ శైలి హుందాగా, అందంగా సాగింది. చిరపరిచితమైన బాలమురళి గానం కల్యాణి అందాలని ఎత్తి చూపింది.

కొంతసేపటికి హెచ్చరికలాంటిదేమీ ఇవ్వకుండా మునవ్వర్ యమన్‌లో ఒక తరానా (తిల్లానా) పాడటం మొదలుపెట్టాడు. తాన్న ధీం అంటూ సాగే ఇటువంటి పాటలకు సాహిత్యం ఉండదు. హిందుస్తానీ పద్ధతిలో సాహిత్యానికి ఎలాగూ ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. ద్రుత్ తీన్‌తాల్‌లో మొదలైన ఈ గీతానికి బాలమురళి ఎలా స్పందిస్తారోనని అందరమూ వేచి చూస్తున్నాం.

అయిదు నిమిషాల తరవాత ఆయనవంతు రానేవచ్చింది. మునవ్వర్ పాడిన ట్యూన్ వరసలోనే ఆయన అప్పటికప్పుడు ‘కల్యాణీ రాగిణీ’ అంటూ పల్లవి ఎత్తుకోగానే చప్పట్లు మారుమోగాయి. ఎంతో సమయస్ఫూర్తితో ఆయనొక చిన్న అనుపల్లవి కూడా కట్టి పాడేశారు. మునవ్వర్ కూడా అవే మాటలు పట్టుకుని ‘కల్యానీ రాగ్‌నీ’ అంటూ కొనసాగించాడు. ఏమాత్రమూ పోటీ ధోరణి లేకుండా ఇద్దరూ రాగాన్ని ఆహ్లాదంగా పాడి వినిపించారు.

తరవాత హిందోళం గానం చేశారు. మునవ్వర్ హిందుస్తాని పద్ధతిలో ఆలాపన తరవాత లక్షణగీతం శైలిలో ‘గావో మాల్కౌస్ ‘ అని ఊరుకున్నాడు. దానికి ప్రతిగా బాలమురళి ‘మనమంతా హిందువులం’ (హిందోళం అనేదానికి దగ్గరి మాట) అన్నారు! (మునవ్వర్ హిందువు కాదు గనక వ్యక్తిగతంగా నాకది తప్పు మాటేమో అనిపించింది గాని రాగం పేరుతో పోలినది కదా అని సరిపెట్టుకున్నాను)

చివరగా ఇద్దరూ సింధుభైరవి పాడారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఆ కచేరీ ఎంతో అద్భుతంగా, అపురూపంగా అనిపించింది. బాలమురళి లయవిన్యాసాలకి ముగ్ధుడైన నిజాముద్దీన్ ఆయన పాడుతున్నప్పుడు మృదంగంతో బాటుగా వాయించసాగాడు. చివరకు తాళవాద్యాల ‘తని ఆవర్తనం’ కూడా ఎంతో బాగా కుదిరింది. ఆ తరవాత సుమారు పదిహేనేళ్ళకు మునవ్వర్ కచేరీ బొంబాయిలో విన్నప్పుడు ఆయనను కలుసుకుని ఆనాటి కచేరీ గురించి గుర్తుచేశాను. ఆయన పరమానందంతో ‘ఓహో, మీరది విన్నారా? మేమానాడు చరిత్ర సృష్టించాం’ అన్నాడు. ఆయన 60 ఏళ్ళ లోపునే 1989లో చనిపోవడం చాలా దురదృష్టకరం.

అంతవరకూ నేను విన్న ప్రసిద్ధ జుగల్‌బందీ సంగీతంలో పాకిస్తాన్ గాయకులైన నజాకత్, సలామత్ అలీ సోదరులదీ, రవిశంకర్ (సితార్), అలీ అక్బర్ (సరోద్) లదీ ముఖ్యమైనవి. అలాగే విలాయత్ ఖాన్ (సితార్), ఆయన తమ్ముడు ఇమ్రత్ ఖాన్ (సుర్‌బహార్) వాయించిన అమోఘమైన కచేరీ విన్నాను. మరికొంత కాలానికి విలాయత్ ఖాన్ (సితార్) బిస్మిల్లా ఖాన్ (షెహనాయి) తో కచేరీ చేసి చరిత్ర సృష్టించారు. బిస్మిల్లా ఖాన్ (షెహనాయి), వి.జి.జోగ్ (వయొలిన్) కలిసి వాయించిన కచేరీలు కూడా ప్రసిద్ధమైనవే. హరిప్రసాద్ చౌరాసియా (వేణువు), శివకుమార్ శర్మ (సంతూర్) అనేక జుగల్‌బందీ కచేరీలు చేశారు. ఇటీవల షాహిద్ పర్వేజ్ (సితార్), రషీద్ ఖాన్ (గాత్రం) కలిసి అద్భుతమైన సంగీతం వినిపించారు. కర్ణాటక పద్ధతిలో లాల్గుడి జయరామన్ (వయొలిన్), రమణి (వేణువు) అనేక కచేరీలు చేశారు.

రెండు విభిన్న సంప్రదాయాల సమ్మేళనం మాత్రం నేను 1969లో వినడం అదే మొదటిసారి. ఆ తరవాత విలాయత్ ఖాన్ (సితార్), అంజాద్ అలీ ఖాన్ (సరోద్) లిద్దరూ లాల్గుడి (వయొలిన్) తో కలిసి హిందుస్తానీ, కర్ణాటక కచేరీలెన్నో చేశారు. ఈ మధ్య రాం నారాయణ్ (సారంగీ), రమణి (వేణువు) కూడా అటువంటిది చేశారు. టి.ఎన్.కృష్ణన్, ఆయన సోదరి ఎన్. రాజం లిద్దరూ వయొలిన్ మీద కర్ణాటక హిందుస్తానీ జుగల్‌బందీ కచేరీలు చేశారు. ఇలాంటివి ఇంకెన్నో జరుగుతున్నాయి. అప్పట్లో మాత్రం ఇవి చాలా అరుదుగా జరుగుతూ ఉండేవి. అటు రవిశంకర్ యెహుదీ మెనూహిన్ (వయొలిన్)తోనూ, జపానీయులతోనూ జుగల్‌బందీలు వాయించాడు కాని అవన్నీ ముందుగా కంపోజ్ చేసుకుని వాయించినవి.

జుగల్‌బందీ సంగీత కచేరీల్లో ఇద్దరు సంగీతకారులు ఒకే రాగం వినిపిస్తారు. ఇద్దరూ ఒకే బాణీకి చెందినవారయినా, వేరు పద్ధతుల్లో శిక్షణ పొందినవారయినా ఎవరి శైలి, దృక్పథం వారికుంటాయి. ఇద్దరూ కలిసినప్పుడు రాగానికీ, పాడే కృతికీ ఉన్న విభిన్న అంశాలు విదితం అవుతాయి. అన్నీ సరిగ్గా ఒనగూడితే ఈ శైలులు ఒకదానికొకటి సంపూరకంగా (సప్లిమెంటరీ లేదా కాంప్లిమెంటరీ) పనిచేస్తాయి. ఏ నాయుడుగారికో మంగతాయారులా కాకుండా ఇద్దరు కళాకారులకీ సమాన హోదా ఉంటుంది.

ఉదాహరణకు పాకిస్తాన్ సోదరుల్లో నజాకత్ శైలి మృదువుగా, రాగ స్వరూపాన్ని నిర్దేశిస్తూ ఉండేది. సలామత్ అతి వేగంగా, దూకుడుగా, విద్వత్తుతో వివరాలన్నీ నింపేవాడు. ఇద్దరూ కలిసి పాడుతున్నప్పుడు అద్భుతమైన సమన్వయం ఉండేది. వాద్యకారులైతే రెండు వాయిద్యాల్లోని తేడాలూ, శబ్ద విశేషాలూ అందంగా కలుస్తాయి. చిన్నతనం నుంచీ కలిసి నేర్చుకున్న రవిశంకర్, అలీ అక్బర్‌ల మధ్య అద్భుతమైన సమన్వయం ఉండేది. సరోద్ గాంభీర్యానికి సితార్ చిలిపితనం అందంగా తోడయేది. దీర్ఘమైన స్వరాలను పలికించగల షహనాయితో బాటు విస్ఫులింగాలు వెదజల్లగలిగిన సితార్ మోగినప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది. వీటన్నిటినీ మించి రాగాలను గురించిన ఇద్దరు మేధావుల సంభాషణ వింటున్నట్టుగా ఉంటుంది. ఉన్న సమయాన్ని ఇద్దరు పంచుకుంటున్నప్పటికీ, ఏ ఒక్కరికీ నిరాటంకంగా తమ ఆలోచనా సరళిని వ్యక్తం చేసే అవకాశం తగ్గినప్పటికీ జుగల్‌బందీ కచేరీలకు ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. ‘ఈ ఇద్దరి కుమ్ములాటలో ఎవడు గెలుస్తాడ్రా’ అనే ధోరణిలో ప్రేక్షకులు వింటే అది చాలా పొరపాటే. పరస్పర అభిమానం, గౌరవం ఉన్న సందర్భాల్లోనే జుగల్‌బందీలు రాణిస్తాయి.

నేను విన్న కొన్ని కచేరీల్లో విలాయత్ ఖాన్ సితార్ సంగీతం బిస్మిల్లా గారిని ఎంత ప్రభావితం చేసేదంటే ఆయన మామూలు కన్నా గొప్పగా షహనాయి వాయించాడనిపించేది. ఒక కచేరీలో విలాయత్ ఖాన్ పిలూ రాగం వాయిస్తున్నప్పుడు బిస్మిల్లా వాయించకుండా తలవంచుకుని వింటూ కూర్చున్నారు. రెండు మూడు సార్లు తనవంతు వచ్చినా ‘మీరే కానివ్వండి’ అనే సైగ చేశారు. ఆ తరవాత కొద్ది సేపు బిస్మిల్లా తన వర్షన్ ఎంతో భావయుక్తంగా వాయించగానే ప్రేక్షకులు చలించిపోయారు. అందుకనే పెద్ద కళాకారుల మధ్య సయోధ్య కుదిరితే వర్ణనాతీతమైన సంగీతం పుట్టుకొస్తుంది. ఇది సోలో కచేరీల్లో వీలవదు.

కర్ణాటక, హిందుస్తానీ జుగల్‌బందీల సంగతి కాస్త భిన్నమైనది. హిందుస్తానీ, కర్ణాటక సంగీతాల గురించి తెలిసినవారికి వాటి మధ్య గల పోలికలూ, వ్యత్యాసాలూ ఎటువంటివో చెప్పక్కర్లేదు. ఒకే రాగానికి వేరు వేరు పేర్లుండడమూ (మోహన, భూపాలీ), ఒకే పేరు కలిగిన విభిన్న రాగాలుండడమూ (తోడి), కర్ణాటక రాగాలు ఉత్తరాది శైలిలో జనాదరణ పొందడమూ (హంసధ్వని, కీరవాణి), హిందుస్తానీవి కర్ణాటక సంగీతంలో పాడడమూ (దేశ్, బాగేశ్రీ) మామూలే. లోతుగా విశ్లేషించని శ్రోతలకు కర్ణాటక సంగీతం గమకభూయిష్ఠంగా, పట్టు కలిగిన సంగతులతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. హిందుస్తానీ శైలి నింపాదిగా, అంత బిగువుగా అనిపించని సంగతులతో సాగుతుంది. కలిసి వాయిస్తున్నప్పుడు ఈ తేడాలు అందాన్ని కలిగిస్తూనే కొన్ని ఇబ్బందులను కూడా తెచ్చిపెట్టగలవు.

నేను గమనించినంత వరకూ వాయిద్యాల కర్ణాటక, హిందుస్తానీ జుగల్‌బందీల్లో అతి వేగంగా మోగే సితార్, సరోద్‌ల ప్రభావం కాస్త “సంసారపక్షంగా” మోగే కర్ణాటక సంగీతం మీద ఎక్కువగా పడుతుంది. ఇదంత హర్షణీయంగా అనిపించదు. గాత్రంలో బాలమురళి, జోషీగార్ల కచేరీలో అప్పుడప్పుడూ పోటాపోటీ ధోరణి కనిపించినప్పటికీ ఇద్దరూ ఉన్నత శ్రేణికి చెందిన అనుభవజ్ఞులు కనక హుందాగా సాగింది. అయితే బాలమురళి తప్ప హిందుస్తానీ గాయకులతో ‘తలపడి’ ధైర్యంగా ప్రయోగాలు చెయ్యగలిగిన కర్ణాటక గాయకులు తక్కువే. బొంబాయిలో అరుణా సాయిరాం, నీలా భాగవత్‌లు ఇటువంటి ప్రయత్నం చేశారు. ఈమధ్య రవికిరణ్ (చిత్రవీణ), విశ్వమోహన్ భట్ (మోహన్ వీణ) జుగల్‌బందీ చేశారు.

హిందుస్తానీ గాత్రంలో స్వరాలు పలుకుతూ స్వరకల్పన చెయ్యడం తక్కువ. వారి ‘తాన్‌లన్నీ ‘అ’ కారం మీదనే సాగుతాయి. ఆ పద్ధతిలో వేగంగా పాడడం కర్ణాటక గాయకులకు అలవాటు ఉండకపోవచ్చు. వారిది ప్రధానంగా సరిగమలతో సాగే విన్యాసం. ఒక్క బాలమురళి మాత్రం ఎంత వేగంగానైనా, ఏ పద్ధతిలోనైనా పాడగల సమర్థుడనేది తెలిసినదే. బహుశా అందుకే ఇతర కర్ణాటక గాయకులు ఇటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చెయ్యరేమోనని నాకనిపిస్తుంది.

నాకు వ్యక్తిగత పరిచయం ఉన్న చిట్టిబాబుగారితో జుగల్‌బందీ విషయం ప్రస్తావించినప్పుడల్లా ఆయన ‘అబ్బే, మనకి ఇతరులతో కుదరదయ్యా’ అని తోసిపుచ్చేవారు. ఆయనా (వీణ), మా గురువుగారైన ఇమ్రత్ ఖాన్ (సితార్) కలిసి వాయిస్తే వినాలని నాకు మహా కోరికగా ఉండేది. చాలా ఏళ్ళ క్రితం ఈమని శంకరశాస్త్రిగారు (వీణ) రేడియోలో గోపాలకృష్ణ (విచిత్రవీణ) తో కలిసి వాయించారు. ఆయన ముందు గోపాలకృష్ణ ‘నిలవలేకపోయాడని’ నాకనిపించింది గాని అది వేరే సంగతి.

కర్ణాటక-హిందుస్తానీ జుగల్‌బందీలో మరొక ఇబ్బంది పాటలకు సంబంధించినది. కర్ణాటక పద్ధతిలో ప్రసిద్ధ వాగ్గేయకారుల రచనలే ఎక్కువగా ఉంటాయి. హిందుస్తానీలో వాటిని పోలినవేవీ ఉండవు. ఇందులోని కష్టసుఖాలు నేను శ్రీకాంత్ చారి (వీణ) తో 1994లో కాలిఫోర్నియాలో సితార్ జుగల్‌బందీ కచేరీ వాయించినప్పుడు బాగా తెలిసివచ్చాయి. కర్ణాటక సంగీతజ్ఞులకు ఉత్తరాది సంగీతం గురించి తెలిసినంతగా హిందుస్తానీ వారికి దక్షిణాది సంగీతం గురించి తెలియదు. కాని తమాషా ఏమిటంటే వాతాపి వంటి కీర్తనలకు నకళ్ళు హిందుస్తానీలో తయారయాయి. అలాగే మరాఠీ నాటకాల్లో పాడేవారు కర్ణాటక సంగీతంలోని వరములొసగి (కీరవాణి) వంటి కీర్తనలను అనుకరించారు. ఏవో మీరా భజనలు తప్ప హిందుస్తానీ పాటలను కర్ణాటకంవారు పాడిన సందర్భాలేవీ నాకు గుర్తురావడం లేదు.

మొత్తం మీద ఈ ఉత్తర దక్షిణ సంప్రదాయాల మధ్య సంపర్కం ఏర్పడడానికి రాగాలు మాత్రమే తోడ్పడతాయని అనిపిస్తుంది. భాష, సాహిత్యాదుల వల్ల కలిగే అవరోధాలను ప్రయత్నపూర్వకంగా ‘భారతీయత’ను దృష్టిలో ఉంచుకుని అధిగమించాలి. అసలీ కలుపుగోలు పద్ధతి ఎందుకు? పులిహోరనూ, పులావునూ విడిగా తిని ఆనందించవచ్చునుగదా అనేవారూ లేకపోలేదు. ఇటువంటి కర్ణాటక-హిందుస్తానీ సమ్మేళనాల్లో కొంతవరకూ రాజీపడక తప్పదేమో. అలా కాకుండా ఒకే పద్ధతిలో ఇద్దరు గాయకులో, వాద్యకారులో కలిసి పాల్గొంటే మరింత గొప్పగా ఉంటుందనేదాంట్లో సందేహం లేదు.
----------------------------------------------------------
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, May 15, 2019

శ్రీ శ్రీ కవిత్వంపై … మరో వ్యాసం


శ్రీ శ్రీ కవిత్వంపై … మరో వ్యాసం




సాహితీమిత్రులారా!


శ్రీశ్రీ ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఒక మైలురాయి. లోగడ కన్యాశుల్కానికి వలె, సమకాలికులని తట్టిలేపి, త్రుళ్ళిపడేలా చేసే జవసత్వం, ఆస్ఫోటనశీలమైన ఉధ్ధృతం శ్రీశ్రీ కవిత్వానికున్నాయి. ఈ రీతిగా చెప్పడం విమర్శన మనిపించుకోదు. ఉన్న సత్యాన్ని నివేదించడంమాత్రమే అవుతుంది. శ్రీశ్రీ కవిత్వాన్ని లోతుగా పరిశీలించి విమర్శించే ప్రయత్నం ఇంతవరకూ (1952) జరగలేదనే భావిస్తాను. వచ్చిన విమర్శలు కానీ, ఇచ్చిన అభిప్రాయాలు కానీ ఇంచుమించు అభినందన ధోరణిలో జరిగిన గుణ సంకీర్తనలే. ముఖ్యంగా తన తరువాత వచ్చిన రచయితలకు శ్రీశ్రీ మరీ అభిమానపాత్రుడు. కాని అతనిని అనుకరించే అనుయాయి వర్గాలు చేసే (రచనా) ప్రయత్నాలు మాత్రం నీరసంగాను, హాస్యాస్పదంగాను ఉంటాయని చెబితే ఎవరికీ కోపం రానక్కరలేదు. శ్రీశ్రీ రచనల్లో స్థూల సమీక్షకు కనిపించే జిలుగులు, ఆడంబరాలు, శబ్ద(తౌ)లౌల్యాలు వగైరా గారడీలు మినహాయించి లోతైన సామాజిక చైతన్యం కానీ, అపూర్వమైన శిల్ప కౌశలం కానీ, స్వోపజ్ఞకమైన శబ్దశక్తి కానీ, వారు అందుకో లేకపోతున్నారు.

సమగ్రమైన ఆంధ్ర సాహిత్య చరిత్రలో శ్రీశ్రీకి మొత్తంమీద ఎటువంటి స్థానముంటుందో ఇప్పుడే అంచనా వేసి చెప్పటం తేలిక పని కాదు. నేనా ప్రయత్నం చేయను. ముందుతరం వాళ్ళకాపని వదిలేసి, ఒక కవి తాను మెచ్చుకునే మరొక సమకాలిక కవిని సమీక్షించే పద్ధతిలో మాత్రమే శ్రీశ్రీని పరిశీలిస్తాను. కవితా సంప్రదాయాన్ని మార్చి, సాహిత్య క్షేత్రంలో ఋతుపరివర్తనం తెచ్చే రచయితల నందరినీ కలవరపరిచే సమస్యలను పరిష్కరించడానికి చేసే యుద్ధపరంపరలే శ్రీశ్రీ రచనలు. కొత్తపునాదులతో, నూతన నిర్మాణం భావితరాలకు అందించాలన్న ఈ ఉద్యమం ఇంకా సాగుతూనే ఉన్నది. ఈ దేశ మాదేశమనక – ఈ భాష ఆ భాష అనక – అన్ని దేశాలలోను, అన్ని భాషలలోనూ.

రచయితగా శ్రీశ్రీలో మూడు దశలు గుర్తించటానికి వీలుంది. 1932 కు పూర్వం వ్రాసిన రచనలు అపరిపక్వంగా, అనుకరణ శీలములై ఉండేవి. 1932 నుండి సుమారు 1940 దాకా రెండవ దశ. ఈ దశలోనే అతని ప్రసిద్ధ రచనలు వచ్చాయి. అప్పుడే సజీవ సాహిత్య నిర్మాణం చేసి ప్రజా హృదయాన్ని తనవైపు ఆకర్షించుకున్నాడు. 1940 తర్వాత మూడవ దశ. ఈ దశలో అధివాస్తవిక ప్రభావం అతని రచనల్లో బాగా ప్రవేశించింది.

కవి కావ్యాన్ని సమీక్షించే సందర్భంలో అతని కావ్యగుణాలతో ప్రారంభించటం తేలిక. శ్రీశ్రీలో సర్వజన ప్రియమైన కొన్ని అద్భుత శక్తులున్నాయి. ఎంతటి తీవ్ర విమర్శకుడైనా మెచ్చుకోక తప్పని సంవిధాన చాతుర్యం, వైవిధ్యం, వైయక్తికమైన బాణి శ్రీశ్రీకి స్వార్జితమైన ఆస్తి. జనప్రియతకు ఇవే కాక మరికొన్ని కారణాలున్నాయి. మామూలు మాటలకు ప్రాణం పోసి బరువులేని బలంతో, మరుగులేని స్వచ్ఛతతో, కరువులేని శిల్పంతో పలకడంవల్ల ప్రతి మాటా, ప్రతి ఊహా మనస్సును గట్టిగా పట్టుకుంటుంది. అగ్గిపుల్లనో, అరటితొక్కనో, హారతి పళ్ళాన్నో- దేన్నైనా సరే కవితామయంగా చేసే స్పర్శవేది శ్రీశీకి తెలుసు. అకుంఠితమైన పటిమతో, అమోఘమైన శిల్పంతో నివేదనాలాఘవం చెడకుండా పలకడం వల్ల శ్రీశ్రీ పట్టింది బంగారమూ, ముట్టింది ముత్యమూ అయింది.

పైవన్నీ శ్రీశ్రీ కవితలో కనిపించే స్థూల లక్షణాలు. ఇంకా కొంత లోతుగా పరిశీలిస్తే అతని రచనల మీద రెండు ప్రభావాలు ప్రబలంగా పనిచేస్తున్నట్లు గుర్తించగలం. ఒకటి మార్క్సు సిద్ధాంతం. రెండవది సైకో ఎనాలిసిస్‌. మార్క్సు సిద్ధాంతం రెండవదశలోని రచనలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ ప్రభావమే శ్రీశ్రీ జీవిత దృక్పథాన్ని మార్చి మహా ప్రస్థానానికి దారి తీసింది.

1933 ప్రాంతాలలో శ్రీశ్రీ కవిగా, సంపూర్ణవ్యక్తిత్వంతో, సామాజికచైతన్య ప్రతినిధిగా బయటపడ్డాడు. అంతర్జాతీయ, జాతీయరంగాలలో అత్యంత ఉద్యమశీలమైన చిత్తప్రవృత్తిని ప్రచారానికి తెచ్చే విప్లవశక్తులు విజృంభిస్తున్న రోజులవి. 1929 లో వచ్చిన ఆర్థికదుస్థితి ఫలితంగా ధనస్వామ్యదేశాలలో నిరుద్యోగం, దారిద్ర్యం ప్రచండంగా పెరిగి పారిశ్రామికాభివృద్ధికి పెద్ద దెబ్బ తగిలింది. యూరప్‌లో తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఏర్పడింది. జర్మనీలో ఫాసిజం రాగానే ప్రపంచ రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. నాజీ నాయకత్వం క్రింద యుద్ధ ప్రమాద మాసన్నమయేసరికి దాన్ని ప్రతిఘటించే విప్లవశక్తులు పైకి లేచే ప్రయత్నం చేశాయి. వలసరాజ్యాలలో సామ్రాజ్యవాద మవలంబించిన దమన పద్ధతి విప్లవశక్తులకు దోహదాన్నిచ్చింది. మంచూరియా మీద జపాన్‌ చేసిన దాడిని ప్రతిఘటిస్తూ చైనాలో ప్రజాశక్తి విజృంభించింది. భారతదేశంలో సామ్రాజ్యవాదంతో పోరాటం శాసనోల్లంఘ నోద్యమంగా మారింది. దేశమంతటా విప్లవశక్తులు విశ్వరూపాన్ని తాలుస్తున్నాయి. జాతీయోద్యమాన్ని, విప్లవశక్తులను అణచివేయడానికి సామ్రాజ్యవాదపు దౌర్జన్యమంతా వినియోగింపబడ్డది. మీరట్‌ అరెస్టులు, కార్మికోద్యమాల విచ్ఛిత్తి, జాతీయోద్యమవిశ్లథనం – వీటితో దేశంలో అలజడి, ఆందోళన, సమ్మెలు వచ్చాయి. కానీ సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటించే శక్తులన్నీ ఏకోన్ముఖంగా సాగి నడవలేదు. వీటినన్నిటినీ సమీకరించే ప్రయత్నం జరిగింది. విప్లవశక్తులలో విభజన కూడదు. అందరూ ఏకం కావాలి. అందరూ నడుంకట్టి ముందుకు నడవాలి. అలసులు వెనకపడితే పడనీ, మనం ముందుకు పోదాం. “పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి” అని 1934 లో సామాజిక చైతన్య ప్రతినిధిగా శ్రీశ్రీ తన విప్లవవాణితో, దేశాన్ని మహాప్రస్థానానికి ప్రబోధించాడు. ఈ గీతం 1934 సం॥ ఏప్రిల్‌ నెల 12 వ తేదీన వ్రాసినట్లు తెలుస్తోంది. శ్రీశ్రీ ఒక్కడే ఆనాడు సామాజిక సమస్యలను జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులతో సమన్వయించి తెలుగులో ప్రగతిశీలమైన వీరవాణితో సామాజిక విప్లవానికి పురోగామిగా సాహిత్య విప్లవం సాగాలన్న దృఢసంకల్పంతో తన గొంతుక వినిపించాడు. ఆ ‘మహాప్రస్థానం’ సాహిత్యరంగంలో మొదట జరగాలన్న ప్రయత్నంచేసిన ఉద్యమనాయకుని కీర్తి శ్రీశ్రీకి దక్కింది.

అప్పటికప్పుడే ఇతర భాషలలో ఇలాంటి మనస్తత్వాన్నీ, రచనా స్వరూపాన్నీ అందించే సామగ్రి చాలా వచ్చింది. “ఈ పాటలోని ఆవేశానికి ప్రోద్బలాలు లామర్సయ్యే ‘లా ఇంటర్నేషనల్,’ బరన్స్ రచించిన ‘టెన్సార్ బర్న్,’ అలెగ్జాండర్ బ్లాక్ వ్రాసిన ‘ది ట్వెల్వ్’ ” అని శ్రీశ్రీ వేరొకచోట అంగీకరించాడు. ఇంతే కాకుండా, “హరీంద్ర కవి వ్రాసిన ‘షురూహువా జైహింద్’ అనే పాట, నజ్రుల్ ఇస్లాం గీతాలు నా మనస్సులో ఏదో మారుమూలల్లో మారు మోగుతూ ఉండి ఉండాలి …. నా కవిత అంతటి మీదా ఎడ్గర్ అల్లెన్ పో, గురజాడ అప్పారావుల ప్రభావం పని చేస్తున్నది” అని కూడా శ్రీశ్రీ ఒప్పుకున్నాడు. 1934 వ సంవత్సరము ఫిబ్రవరి నెల 18 వ తేదీ ఎడ్గర్ అల్లెన్ పో ‘బెల్స్’ ను ‘అనుసరణిస్తూ’ వ్రాసిన గేయములో

హరోం హరోం హర
హర హర హర హర
హరోం హరా అని పలికే గంటలు

అన్న పాదాలకూ కడమ పంక్తులకూ పొత్తుకలవక పోతే రెండు నెలల తరువాత ఉపసంహరించిన ఆ పంక్తులనుంచే ‘మరో ప్రపంచం’ గీతం వెలువడిందని శ్రీశ్రీ అంటాడు. ఇదంతా కవి రచనా విధానాన్ని నిర్ణయించే ప్రేరక సామగ్రిని పరిశీలించే పద్ధతి. కవి మనో మహాసనం లోనికి వెళ్ళి ఇలాంటి పరిశీలన ఎంతైనా చేయవచ్చును.

సుమారు 1910 లో ప్రారంభమైన భావకవితా ఉద్యమం శ్రీశ్రీ మహాప్రస్థానం నాటికి ఉన్న చమురంతా పీల్చి కొడిగట్టి ఆరిపోతోంది. ఆ రచనలు వైయక్తికమైన వేదనలతో, అనుభవాలతో, ప్రాబంధిక శిల్పంతో నిండి, అంతకు పూర్వమున్న కవిత్వం మీద తిరుగుబాటుగా వచ్చిన సామాజిక సమస్యలతో సంబంధంలేక, పరిమితమైన మధ్యమ వర్గాల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తూ త్వరలోనే జనప్రియతకు దూరమయ్యాయి. ఆ రచయితలు ప్రజలనుండి దూరమై తమతమ ఒంటిస్తంభపు మేడలలో ఉండిపోయారు. అప్పుడప్పుడే వికాసం పొందుతున్న సామాజిక చైతన్యానికి రూపమిచ్చి మాటలలోకి మార్చే కవికోసం తెలుగు దేశ మజ్ఞాతమైన ఆకాంక్షతో ఎదురు చూస్తోంది. భావకవిగా కృష్ణశాస్త్రి ఆనాటికే ఒక వెలుగు వెలిగి ఆరిపోతున్నాడు [1]. విశ్వనాథ, రాయప్రోలు మొదట జాతీయోద్యమ ప్రభావంతో స్పందించి దేశభక్తి ప్రేరితాలైన రచనలు చేసినా, అ తరువాత తరువాత మరోరకమైన రచనా పద్ధతి అవలంబించారు. ఆ పరిస్థితిలో ప్రజల ఆకాంక్షకు రూపమిచ్చి శ్రీశ్రీ తన కవితను ప్రజాయత్తం చేయడానికి ముందుకొచ్చాడు. సాహిత్య క్షేత్రంలో ఏర్పడ్డ వీరక్షామాన్ని నివారించాడు. తమ వాంఛలనే శ్రీశ్రీ బలమైన భాషలో పలికే సరికి ప్రజలతనిని గొప్ప కవిగా అంగీకరించారు. అచిరకాలంలోనే అతని కీర్తి బాగా పెరిగింది. శ్రీశ్రీ రచనలు మొన్న మొన్నటిదాకా పుస్తక రూపంలో రాకపోయినా, ఎందరెందరి హృదయాలలోనో ఇంకి ఉన్నాయి. అతని కవిత సామాజిక చైతన్య వాణి కాకపోతే అవి ఆ రీతిగా ఇంకేవి కావు. అశేషజన ప్రీతిని చూరగొనేవి కావు.

మార్క్సు సిద్ధాంత ప్రభావం శ్రీశ్రీకి జీవితాన్ని విమర్శించే విచారదృష్టినీ, సమాజ పరిస్థితుల వెనకాల ఉండే అగాధ నిగూఢ రహస్యాలను అవగతం చేసుకొనే శక్తినీ ప్రసాదించింది. కొన్ని రచనలలో ఆ సిద్ధాంతం ప్రతిపాదించే ప్రసిద్ధ సత్యాలు సాహిత్య ముద్రతో సాక్షాత్కరిస్తాయి. మార్క్సీయ దృక్పథంలో చరిత్రను సమీక్షిస్తూ చరిత్ర అంటే ఏమిటో, ఏఏ రూపాలు ఎలా తీసుకుంటుందో, ఏది నిజమైన చరిత్ర కాదో, చరిత్ర నుంచి ఉద్భవించే శక్తులు సామాజిక ధర్మాన్ని ఏ రీతిగా మారుస్తాయో, ఏ నిజాలు మనం గుర్తించాలో ‘దేశచరిత్రలు’ అన్న కావ్యంలో శ్రీశ్రీ చెబుతాడు. ఈ శాస్త్రీయ సత్యాలను ఉదాత్తమైన శిల్పంతో నిపుణంగా పొదిగితేగాని కవిత్వం కాదు. శ్రీశ్రీ వాటిని రసవత్కావ్య పంక్తులుగా మార్చిన పద్ధతి చూడండి.

ఏ దేశ చరిత్ర చూసినా – ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం – పరపీడన పరాయణత్వం
బలవంతులు దుర్బల జాతిని – బానిసలను కావించారు
నరహంతలు ధరాధిపతులై – చరిత్రలో ప్రసిద్ధి కెక్కిరి

* * *

పరస్పరం సంఘర్షించిన – శక్తులలో చరిత్ర పుట్టెను

* * *

చిరకాలం జరిగిన మోసం – బలవంతుల దౌర్జన్యాలు
ధనవంతుల పన్నాగాలూ – ఇంకానా! ఇకపై సాగవు
ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ – ఒక జాతిని వేరొక జాతీ
పీడించే సాంఘిక ధర్మం – ఇంకానా! ఇకపై సాగదు

శాస్త్ర సిద్ధాంతాలే చెప్పినా సాహిత్య గౌరవాని కెక్కడా లోపం రాలేదు. తాను చేసే సిద్ధాంత వ్యాఖ్యానంలో లోపం కనపడవచ్చు. “ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం” అనడంలో మార్క్సు దృక్పథం కాక శ్రీశ్రీలో దాగిన పరాజితుల నైరాశ్యపు జీర వినిపిస్తుంది.

శ్రీశ్రీలో తరుచు ఆంగ్ల కవుల ప్రభావం కనిపిస్తుంది. “దేశచరిత్రల”లో

నైలు నదీ నాగరికతలో – సామాన్యుని జీవితమెట్టిది?
తాజ్ మహల్ నిర్మాణానికి – రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?
సామ్రాజ్యపు దండయాత్రలో – సామాన్యుని సాహసమెట్టిది?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ – అది మోసిన బోయీలెవ్వరు?

అన్న పంక్తులు జాన్ మేన్స్‌ఫీల్డ్ వ్రాసిన “A Consecration” అన్న పద్యపంక్తుల్ని జ్ఞాపకం చేస్తాయి.

సాహిత్యాన్ని బుద్ధిపూర్వకంగా విప్లవాత్మకమైన ఆచరణకు సాధనంగా వినియోగించాలన్న దృష్టి మార్క్సీయ వర్గ కలహ సిద్ధాంతం నుండి బయలుదేరుతుంది. వర్గ కలహంలో సాహిత్యాన్ని బ్రహ్మాస్త్రంగా మార్చడమే విప్లవవాదుల ఆశయం. విప్లవరచయిత సాహిత్యం ప్రజలకోసమని విశ్వసిస్తూ, కష్టజీవుల జీవితపు లోతులనుండి దాని పునాదులు నిర్మించే ప్రయత్నం చేస్తాడు. శ్రీశ్రీ తన రచనలను పీడిత వర్గాల క్షేమానికి వినియోగిస్తానని ప్రతిజ్ఞచేస్తూ, జాతికి వెన్నెముకగా నిలచి ‘హేమం పిండి’ ‘వరాల వర్షం’ కురిపించే కర్షక కార్మికులే దేశభాగ్య నిర్మాతలవుతున్నారు గనుక వారి ఘర్మజలానికి ఖరీదు లేదంటాడు. ఈ వర్గసమాజంలో పీడితులంతా అశాంతితో విప్లవశంఖం వినిపిస్తారని జోస్యం చెబుతూ ఈ క్రింది వీరప్రతిజ్ఞ ముక్తకంఠంతో చేస్తున్నాడు.

కావున లోకపు టన్యాయాలూ
కాల్చే ఆకలి, కూల్చే వేదన
దారిద్ర్యాలూ – దౌర్జన్యాలూ
పరిష్కరించే – బహిష్కరించే
బాటలు తీస్తూ
పాటలు రాస్తూ
నాలో కదిలే నవ్య కవిత్వం
కార్మికలోకపు కల్యాణానికి
శ్రామికలోకపు సౌభాగ్యానికి
సమర్పణంగా
సమర్చనంగా
త్రిలోకాలలో
త్రికాలాలలో
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనేలేదని
కష్ట జీవులకు
కర్మ వీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ
వ్యధార్థ జీవిత యధార్థ దృశ్యం
పునాదిగా ఇక జనించ బోయే
భావివేదముల జీవనాదములు
జగత్తు కంతా చవులిస్తాయోయ్

వ్యధార్థ జీవిత యధార్థ దృశ్యాలు పునాదులుగా భావివేదాలు అవతరిస్తాయని శ్రీశ్రీ అంటాడు. వాటి జీవనాదాలే తన రచనలని చెప్పుకొన్నాడు. మయకోవిస్కీ గాని, పాబ్లో నెరుడా గాని వచ్చి శ్రీశ్రీని ఆప్యాయంగా కౌగిలించుకొనేటట్లు చేసే రచన ఇది. నేను ఈ గీతాన్ని కోహినూర్ వజ్రంగా భావిస్తాను.

ఈ పాటలో ఛందస్సు, భాష, భావన – అన్నీ ఉదాతమైన శిల్పంగా పెనవేసుకొన్నాయి. ఉపయోగించిన అక్షరావృత్తి, అనుప్రాస, యమకము రచనా సౌష్టవానికి దోహదం చేశాయి. పద్యపంక్తి జగణంతో ప్రారంభిస్తే ఊనిక (accent) సాధారణంగా రెండవ అక్షరం మీద పడి విలక్షణమైన ఊపు, గతీ వచ్చి పాదం కదను త్రొక్కుతున్నట్లుగా నడుస్తుంది. ఇలాంటి ఛందస్సంధానమే ‘మహాప్రస్థాన’ గీతంలోనూ శ్రీశ్రీ ప్రయోగించాడు.

పొలాల నన్నీ
హలాల దున్నీ
ఇలా తలంలో
హేమం పిండగ
జగాని కంతా
సౌఖ్యం నిండగ

అన్ని పంక్తులూ జగణంతో ప్రారంభించడం చేత ఆద్యక్షరాలు తేలిపోతూ, ద్వితీయాక్షరాలు ఊనిక చేత ఉచ్చారణ గౌరవం పొందుతూ గీతానికి ద్రుతగతిని ఆపాదిస్తున్నాయి. ఇందులోని భావం ఈనాటి సామాజిక చైతన్యానికి ప్రతిబింబం. ఇలాంటి భావమే ప్రాబంధిక శిల్పంతో ఆవిష్కృతమైనప్పుడు పెద్దన కావ్యంలో “అచటి నాల్గవజాతిహలము ఖాత్తవిభూతి ఆదిభిక్షువు భైక్షమైన మాన్చు” అన్న రూపం తీసుకుంటుంది. అది ఆనాటి భూస్వామ్య వ్యవస్థలో కొంత సామాజిక చైతన్యం ఉన్న కవివాణి.

విప్లవాత్మకమైన విలువలు మాత్రమే రచనలను రసత్కావ్యాలుగా మార్చవు. హృదయాన్ని ఆకర్షించే సుందరమైన శబ్దవ్యూహంలో పొదిగినప్పుడే సాహిత్య శ్రేణిలో చేర్చడానికి అర్హమవుతాయి. కావ్య శిల్పంలేని విప్లవాత్మకమైన రచన ఎంత నీరసమో, విప్లవాత్మకమైన విలువలు లేని కావ్య శిల్పమంత నిరర్థకము. ‘ప్రతిజ్ఞ’లో పై రెంటి ప్రౌఢమేళనం అసూయింప దగినవి.

“ధనస్వామ్య వ్యవస్థలో పరస్పర వైరుధ్యాలే దాని పతనానికి కారణమవుతాయనీ, తరువాత అంతకన్నా న్యాయబద్ధమైన, సామ్యసిద్ధమైన వ్యవస్థ ఏర్పడుతుందనీ చేసిన జోస్యం ఫలోన్ముఖానికి వస్తోంది” అన్న ప్రగాఢ విశ్వాసమే ‘జగన్నాథ రథ చక్రాల’లో కనిపిస్తుంది.

“పతితులార!
భ్రష్టులార!
బాధా సర్ప దష్టులార!”
అని పతిత వర్గాన్ని పిలిచి పిలిచి
‘ఏడవకండేడవకండి’ ‘జగన్నాథ రథ చక్రాలొస్తున్నా యొస్తున్నాయి’ అని ధైర్యమిచ్చి ఊరడిస్తూ

ఈ స్వప్నం నిజమౌతుంది
ఈ స్వర్గం ఋజువౌతుంది

అని హామీ ఇస్తూ భవిష్యత్తు మీద ఎలాంటి శంకాలేని ప్రబల విశ్వాసాన్ని ప్రకటిస్తాడు శ్రీశ్రీ. కాని సార్వత్రికంగా శ్రీశ్రీలో ఈ ఆశావాదం కనిపించదు.

నిజంగానే నిజంగానే
నిండుహర్షం వహిస్త్తుందా!
మానవాళికి నిజంగానే
మంచికాలం రహిస్తుందా!

అని భవిష్యత్తుని శంకించే దైన్యానికి పాలవుతాడు. ఇక్కద శ్రీశ్రీలో దాగిన సంశయాళువు పైకి లేచి అతనిలోనే ఉన్న ఆశావాది కంటే వేరుగా పలుకుతున్నాడు. ఇంకొకచోట మరీ నిరుత్సాహపడి నిస్పృహతో జీవిత ప్రయోజనాలకు వైయర్ధ్యమారోపిస్తాడు.

లేదు సుఖం లేదు సుఖం
లేదు సుఖం జగత్తులో
బ్రతుకు వృధా! చదువు వృధా!
కవిత వృధా! వృధా! వృధా!

* * *

బ్రతుకు ఛాయ, చదువు మాయ
కవిత కరక్కాయ సుమీ!

ఇంతకంటె ప్రగతి నిరోధకమైన రచన నే నూహించుకోలేను. ఇది పరాజితుల ప్రలాపమన్న సంగతి తెలిసికూడా, పరాజితుడైన నిరాశావాదిగా పలకడం శ్రీశ్రీ దౌర్నల్యాన్ని చాటుతుంది. కొన్ని రచనలలో కనిపించే ఆశావాదం శ్రీశ్రీ హృదయంలో లోతుగా వేరూని నిలవ లేదన్న శంక పాఠకుడికి కలుగుతుంది. మిథ్యావాదిని సాహసంతో ప్రతిఘటించి

జగతి మరపు, స్వప్నం, నిశ్శబ్దం ఇది
మాయ! మాయ! మాయ! మాయ!
మాయ! మాయ! మాయంటావూ?
అంతా మిథ్యంటావూ?

అని నిగ్గదీసి అడిగిన శ్రీశ్రీ – స్వార్థం కోసం సంప్రదాయ ప్రియులైన విలాస వర్గాలనూ, వాళ్ళు గీచిన రేఖలనూ, వాటిని రక్షించే సిబ్బందినీ ఎగతాళి చేస్తూ “తృప్తిగా చచ్చిపోతారు మీరు. ప్రపంచం మిమ్మల్ని మరిచిపోతుంది” అని చల్లగా చావు కబురు చెప్పి, “ముందుకు పోతాం మేము; ప్రపంచం మా వెంట వస్తుంది” అని బ్రహ్మాండమైన ఆత్మ ప్రత్యయంతో పలికిన శ్రీశ్రీ ఉన్నట్టుండి చతికిలబడి, నిరాశావాదిగా నీళ్ళు కారిపోవడం చాలా శోచనీయం. సమాజానికి క్షుద్ర నిరాశావాదంతో విష పాత్రలందించే కవులు క్షంతవ్యులు కారు. శ్రీశ్రీలోని ఈ వైరుధ్యం క్షమించరానిది. ఆలోచన ఆచరణతో విడిపోయినప్పుడు ఈ ప్రమాదం సంభవిస్తుంది. నైరాశ్య కలుషితమైన రచనలు సంవిధాన చాతుర్య మెంత గొప్పగా ఉన్నా సరే ‘మహాప్రస్థానం’ నుండి తొలగిస్తే మంచిది. సమాజ క్షేమాన్నీ, కవితా ప్రయోజనాన్నీ గుర్తించిన శ్రీశ్రీ కర్తవ్యమది.

శ్రీశ్రీ స్వప్రతిభను, స్వశక్తినీ చాటుకున్న గీతాలు కొన్ని చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. సంఘజీవిగానే కాక వ్యక్తిగా కవికి ఉనికి లేకపోలేదు. సంఘానికీ వ్యక్తికీ ఆశయాలలో పరస్పర వైరుధ్య మున్నప్పుడు సంఘం వ్యక్తిని గౌరవించదు. వ్యక్తి స్వాతంత్ర్యం సంఘానికి క్షేమకారి కానప్పుడు ఆ స్వాతంత్ర్యాన్ని సంఘం ఒప్పుకోదు. వెర్రివాణ్ణి సమాజ క్షేమంకోసం గదిలో వేసి తాళమేస్తుంది సంఘం. అట్లాగే సంఘద్రోహులై సామాజిక చైతన్యాన్ని పెడదారులు పట్టించే బుద్ధి జీవులను కూడా బహిష్కరించడంలో తప్పులేదు. కేవలం వ్యక్తి స్వాతంత్ర్యమన్నది అర్థరహితమైన మాట. వ్యక్తి జీవితం సంఘ జీవితానికి ఎదురీత కానంతవరకూ వ్యక్తి స్వాతంత్ర్య మభిలషణీయమే. శ్రీశ్రీ కావించిన స్వశక్తి ప్రతిభల స్వచ్ఛందగానములో కూడా సామాజికశక్తి ప్రచ్ఛన్నంగా అంతర్వాహినిగా ప్రవహిస్తుంది.

నేను సైతం
ప్రపంచాబ్జపు
తెల్లరేకై పల్లవిస్తాను

నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్ఛనలు పోతాను!

నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకిలేస్తాను!

అని స్వశక్తిని ఉల్లేఖించుకున్నా, ప్రపంచాగ్నిలో ఒక సమిధగా, విశ్వసృష్టిలో ఒక అశ్రువుగా, భువనఘోషలో ఒక గొంతుకగా ఉన్నానంటాడు కవి. తాను సంఘజీవి అన్నయధార్థం మరచిపోక, కవి ఎన్ని రంగురంగుల కలలు కన్నా సంఘం సమ్మతిస్తుంది. సంఘ క్షేమాన్ని ఉపేక్షించి స్వప్రయోజనంకోసం ఊహలతో క్రీడిస్తే సంఘద్రోహమవుతుంది. అట్టి వ్యక్తి స్వాతంత్ర్యం మీద ఆంక్ష విధించే హక్కు సంఘానికుంది. భావకవిత్వ పద్ధతులూ, గ్రాంధికభాషలో పద్యరచనా విధానమూ సన్యసించి వ్యావహారిక భాషలో కొత్త బాణీలో శ్రీశ్రీ సాగించిన మొదటి రచన ఈ పద్యమేనట.

‘ఉన్మాది,’ ‘భిక్షువర్షీయసి,’ ‘ఆకాశదీపం’ వంటి కొన్ని పద్యచిత్రాలలో శ్రీశ్రీ చిన్నమాటలతో పెద్ద వర్ణచిత్రాన్ని నిర్మిస్తాడు. మాటలను వీలైనంత పొదుపుగా వాడి గొప్ప కావ్యశిల్పాన్ని రూపొందించగల సామర్థ్యానికి ఈ రచనలు మచ్చుతునకలు. కొన్ని చోట్ల పద్యరచనలో ఎంత తేలిక మాటలు వాడాడో, పద్యశీర్షికలలో అంత ప్రౌఢశబ్దాలు ప్రయోగించాడు కవి. ‘భిక్షువర్షీయసి’ అన్న సమాసకల్పనంలోని ప్రౌఢి వల్ల పద్యానికి ఒక నిండుదనం వచ్చింది. అందమైన శిల్పానికి, సుందరమైన చలువరాతి పీఠం అమర్చినట్లుగా ఈ శీర్షిక కావ్యోత్కర్షకు దోహదం చేసింది.

‘శైశవగీతి,’ ‘మానవుడా’ ఒక జాతికి చెందిన రచనలు. ‘పూర్ణమ్మ గాథ’ లోని “మేలిమి బంగరు మెలతల్లారా! కలువల కన్నుల కన్నెల్లారా!” అన్న గురజాడ సంబోధనలు జ్ఞాపకంచేసే ‘శైశవగీతి’ లో శ్రీశ్రీ శిశువులోని భావిమానవుణ్ణి చూస్తున్నాడు.

పాపం, పుణ్యం, ప్రపంచమార్గం
కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ
ఏమీ ఎరుగని పూవుల్లారా!
అయిదారేడుల పాపల్లారా!

అని వారిని వాత్సల్యంతో సంబోధిస్తూ

మీదే మీదే సమస్త విశ్వం
మీరే లోకపు భాగ్య విధాతలు

అని వాళ్ళలోని భావిమానవులని విశ్వరాజ్యానికి పట్టాభిషిక్తులను చేస్తాడు. వాళ్ళని చూడగానే తన బాల్యం కూడా జ్ఞాపకం వచ్చి గతించిపోయిన శైశవరాగమాలికల కోసం, చెరిగిన బాల్యపు పదముల చిహ్నాలకోసం, మనస్సు వెనక్కి వెళ్ళింది. శైశవసీమలు ఎన్నడోదాటిన తాను మళ్ళీ ప్రాచీన శైశవరమ్యతలలోనికి ప్రయాణించే సంకల్పయత్నాలను గుర్తించి వాళ్ళు నవ్వుతున్నారేమో అని కవి సందేహిస్తాడు. తన శైశవంలో దాగిన భావిభాగ్యవిధాత అయిన మానవుడు కదా తానిప్పుడు! ప్రపంచంలోని సర్వానికీ ఎదిగిన వారసుడై మళ్ళీ వెనక్కి వెళ్ళడం హాస్యాస్పదం. అందుకే తన బాల్యాన్ని పారేసుకొన్నవస్తువులా సవిషాదంగా స్మరించే తన్ను చూచి వాళ్ళు నవ్వుతున్నారని శంకిస్తాడు. ఇందులో శైశవం, యౌవనం పరస్పరం అసూయ పడవలసిన దశలు కావని ధ్వనిస్తున్నాడు కవి. ‘మానవుడా’ అన్న కావ్యంలో శ్రీశ్రీ మానవుడి విశ్వరూపాన్ని సందర్శిస్తున్నాడు. యుగయుగాలుగా మానవుడు సాధించిన విజయాలు, పొందిన పరాజయాలు, కట్టిన స్వర్గాలు, కన్న స్వప్నాలు, బహుముఖాలుగా ప్రసరించే ఘనతా, అల్పత్వం అన్నీ చిర ప్రేక్షకునిలా సమీక్షిస్తాడు.

శ్రీశ్రీ రచనలలో ఎక్కువ ప్రచారానికి రానిదీ, శిల్పదృష్టిలో మిక్కిలి అందంగా ఉన్నదీ ‘కవితా! ఓ కవితా!’ ఇది యువరచయితలను కొందరిని బాగా ఆకర్షించిందే కానీ సామాన్య సాహితీప్రియుల మనస్సు నెక్కువగా చూరగొనలేదు. రచనలోని అస్పష్టత కొంత దానికి కారణం కావచ్చును. పొగమంచులో కనిపించే నీడలవలె తోచే భావాలూ, “అగ్ని సరస్సున వికసించిన వజ్రం” వంటి శబ్దసంకేతాలతో కొత్త అనుభవాన్ని ఆవిష్కరించే పద్ధతీ, శ్రీశ్రీకి సహజమైన స్ఫటిక స్వచ్ఛతనుండి ఈ రచనను కొంత దూరం చేసింది. కాని verse libre గా పూర్ణవిజయం సంపాదించిన రచన ఇది. ఇందులోని కొన్ని నిష్ఠురసత్యాలు ముసుగు తొలగింపబడి రుద్ర సుందరమైన శిల్పంతో ప్రత్యక్షమవుతాయి.

కడుపు దహించుకుపోయే
పడుపుకత్తె రాక్షసరతిలో
అర్ధనిమీలిత నేత్రాల
భయంకర బాధల పాటల పల్లవి

విన్న కవి పడుపువృత్తిలోని ఆర్థిక రహస్యాన్ని బట్టవిప్పి చూపిస్తున్నాడు. ఈ రచన చివర శ్రీశ్రీ రచయితగా తనకున్న ఆశయాలను ఉల్లేఖిస్తూ లోకం ప్రతిఫలించే రచనలతో

నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ
నా జాతి జనులు పాడుకొనే
మంత్రంగా మ్రోగించాలని
నా ఆకాశాలను
లోకానికి చేరువగా
నా ఆదర్శాలను
సోదరులంతా పంచుకొనే
వెలుగుల రవ్వల జడిగా
అందీ అందకపోయే
నీ చేలాంచలముల విసురుల
కొన గాలులతో నిర్మించిన
నా నుడి నీ గుడిగా
నా గీతం నైవేద్యంగా హృద్యంగా అర్పిస్తానో!

అని “కవిత”కు నివేదించి ప్రశ్నిస్తున్నాడు. చాలావరకు అర్పించాడనే లోకం కవిత పరంగా సమాధానం చెబుతుంది.

శ్రీశ్రీ కొన్ని రచనలను మరీ నిరాడంబరంగా, తేలికగా చేయబోయి శిల్పశూన్యంగా చేస్తాడు. ‘వాడు,’ ‘ఒక క్షణం’ వంటి రచనలలో కవి ఎగరదలుచు కొన్న ఎత్తుకెగరలేక విరమించి కూర్చున్నట్లు కనిపిస్తాడు. ‘దేనికొరకు’ అన్న రచనలో శిల్పం చాలా పేలవమై దయనీయంగా ఉంది.

ఇంతవరకు రెండవదశలోని ప్రసిద్ధ రచనలను (గర్జించు రష్యా – గాండ్రించు రష్యా; కొంపెల్ల జనార్దనరావు కోసం వంటివి మినహా) కొన్నిటిని స్థాలీపులాకన్యాయంగా స్పృశిస్తూ సమీక్షించాను. రచనలలోని శిల్ప-చ్ఛందో రహస్యాలను కూలంకషంగా వ్యాఖ్యానించలేదు. మహాప్రస్థానంలో చేరని కొన్ని రచనలను కూడా ఇందులో పేర్కొనవలసి ఉంటుంది. అస్తమానం లోతైన, బరువైన జీవిత సమస్యలనే చర్చిస్తూ వ్రాస్తూ శ్రీశ్రీ కూర్చోడు. బహుపక్షాలతో, బహువిధాలుగా ప్రసరించే జీవితాన్ని బహుముఖాలలో సందర్శిస్తేనే సంపూర్ణబింబం కనిపిస్తుంది. జీవితాన్ని పృథక్కరించి సమీకరిస్తూ తర్కించి, విమర్శిస్తూ సంస్కరించడం ఎంత అవసరమో, నవ్వుతూ వెక్కిరిస్తూ ఏడిపించి ఎగతాళి చేస్తూ దిద్దటం అంత అవసరం. ‘టాం టాం,’ ‘రుబాయత్,’ ‘కొంటె కోణాలు,’ ‘సిరిసిరిమువ్వ శతకం’ శ్రీశ్రీలోని హాస్య సామర్థ్యాన్నీ, ఉత్ప్రాస దక్షతనూ నిరూపిస్తాయి.

శ్రీశ్రీ ప్రేమగీతాలు వ్రాయలేదనే ఆక్షేపణ ఒకటుంది. క్రిందితరం వాళ్ళు వ్రాసిన ప్రేమగీతాలతో అజీర్తిచేసిన మనకి మళ్ళీ కొంచెం ఆరోగ్యం ఏర్పడేదాకా ఆ రచనలతో అట్టే అవసరం లేదేమో! కాని కవికి అవసరమైన ప్రేరణ కలిగినప్పుడు ప్రేమగీతం వ్రాయకూడదని కాదు. అతడు సంఘజీవిగా మేల్కొన్నప్పుడు ప్రేయసీప్రేమ గౌణమైపోతుంది. అప్పుడు సాహిత్యపు విలువలూ, కొలబద్దలూ మారిపోతాయి. జబ్బురకమైన ప్రేమగీతాలు కాక, ‘మరణానికి ప్రాణంపోసే’ ‘స్వర్గానికి నిచ్చెనవేసే’ ఆరోగ్యమైన రచనలు వస్తే లోకం ఆదరంతో ఆహ్వానిస్తుంది.

శ్రీశ్రీ వస్తు సంవరణంలోనే కాక రచనా సంవిధానంలో కూడా విప్లవాన్ని సాధించాడు. సమర్థుడైన కవిలో రచనా సంవిధానంలోని మార్పు కావ్యవస్తువు మారినప్పుడే రూపొందుతుంది. అభ్యుదయ కవి ఛందస్సులో, భాషలో, సంప్రదాయంలో ఏది ఉత్తమంగా ఉంటుందో దాన్ని స్వీకరిస్తాడు. శ్రీశ్రీ సంప్రదాయ ద్వేషి కాడు. ‘ఇదివరకు వెయ్యబడిన గట్టి పునాదుల మీదనే సాహిత్యసౌధం నిర్మింపబడుతున్నది’ అని విశ్వసిస్తాడు.

శ్రీశ్రీ కొన్ని రచనల్ని తెలుగుభాష ఎరగని పద్ధతిలో నిర్మించవచ్చును.[2] విచిత్ర రూపాలు కట్టవచ్చును.[3] ప్రతి ఉపమా కొత్తగా స్ఫురించవచ్చును.[4] కాని సంప్రదాయ వైఖరి ఎక్కడా దెబ్బతినదు. ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను’ అన్న గేయములో సమిధ శబ్ద ప్రయోగమే కవి వెనకాల ఉన్న యుగయుగాల సంప్రదాయాల స్మృతిని నిరూపిస్తోంది. ఈ లక్షణం శ్రీశ్రీ రచనలో సర్వత్ర కనిపిస్తుంది. కళావేత్త, కళామర్మజ్ఞుడు సంప్రదాయంలోని నిగ్గు నెప్పుడూ గౌరవిస్తాడు. ఒకానొకనాడు చేసిన ప్రయోగాలే నేటి సంప్రదాయాలు.

శ్రీశ్రీ వ్రాసిన ప్రతి రచనలోను ఛందో వైవిధ్యం, ఉక్తి వైచిత్ర్యం కనిపిస్తుంది. భావనలోని నవ్యత్వమే దీనికి కారణం. ఆంగ్లంలో ప్రసిద్ధంగా ఉన్న వర్స్ లిబర్‌ను శ్రీశ్రీ అభిమానించాడు. నియమితమైన ఛందస్సు పద్యగతిని పరిపాలిస్తుంది. వర్స్ లిబర్‌లో పద్యగతిని రూపొందించేది భావం. అంతర్నియమాలు అనుగతమై వస్తూ స్వేచ్ఛా నియమాల దాంపత్యంతో సమర్థుడైన కవి చేతిలో అంగ సౌష్ఠవాన్ని సంపాదించుకొనే రచనా విన్యాసమిది.

భాషను చాలా జాగ్రత్తగా ఉపయోగించడం తెలిసిన శ్రీశ్రీ జగన్నాథుని రథచక్రాలలో ‘చూర్ణమాన ‘, ‘దీర్ణమాన ‘[5] వంటి అసాధు శబ్దాలు ప్రయోగించడం విచారకరం. శబ్దశుద్ధిని నాదగుణం కోసం బలి చేసి, ‘ఘూర్ణమాన ‘ తో అనుప్రాస సాధించడంలో శబ్దాలు సాధువులా, అసాధువులా అని చూచుకోలేదు. ‘చూర్ణ’, ‘దీర్ణ’ రూపాలే భూతకాలిక కర్మార్థక క్రియాజన్య విశేషణ రూపాలు (past passive participles) వాటి మీద ఆత్మనే పది ధాతువుల మీద వచ్చే వర్తమాన కాలిక క్రియా జన్యవిశేషణ రూపంలోని శానచ్ (మాన) చేరటం హాస్యాస్పదమై, అసాధుతానభిజ్ఞతలను చాటుతుంది.

ఇటువంటి శబ్దలౌల్యం శ్రీశ్రీకి అనవసరం. ఇటువంటి అర్భక ప్రయోగాలు మరికొన్ని ఉన్నాయి. ఇవి ప్రమాద ఫలితాలని భావిస్తాను.

ఇక శ్రీశ్రీ మూడవ దశలోని రచనల వైఖరిని గూర్చి సంగ్రహంగా చెబుతాను. ఫ్రాయిడ్ ప్రతిపాదించిన సైకో – ఎనాలిసిస్ సిద్ధాంతం కళాక్షేత్రంలో అధివాస్తవిక (surrealism) మతాన్ని అవతరింపజేసింది. చిత్రకారుల్లో Max Ernst, Salvador Dali, రచయితలలో Paul Eluard, Dylan Thomas, George Hugnet ప్రసిద్ధులు. James Joyce, Gertude Stein కూడా ఇంచుమించు ఆ మతానికే చేరుతారేమో! మొదట్లో M. Andre Bretan అధివాస్తవికుల ఆశయాలను వివరిస్తూ మనస్సును విడుదల చేయటమే వారి ప్రధాన లక్ష్యమన్నాడు. క్రూర నిరోధక శాసనాలలోని పరిమితత్వాన్ని వాళ్ళు ఖండిస్తారు. సీమితమైన పరిధులను దాటే స్వేచ్ఛ మానవుడి కవసరం. అనుభూతి క్షేత్రము విశాలమై, అదే కావ్యవస్తువు కావాలి. సుప్తచైతన్యపు (subconscious) లోతులలో అనుభూతి క్షేత్రాన్ని విస్తరించుకోవాలి. జాగ్రత్ చైతన్యపు (conscious mind) నిరంకుశాధికారం లేకుండా బాహిరిల్లే సుప్తచైతన్యానికి శబ్దరూప మివ్వడమే అధివాస్తవిక రచన అవుతుందని ప్రాథమిక దశలో వారి వాదం. తొలిరోజుల్లో చాలా నవ్యంగాను, విలక్షణంగాను కనిపించిన అధివాస్తవికతలో రానురాను రాజీ ధోరణి వచ్చి కొంత మెరుగు మాసింది.

సుప్తచైతన్యము అనేక శబ్దచిత్రాలకు (verbal images), స్మృతిశేషాలకు (memory residues) పెద్ద పాతరలాంటిది.

అసంఖ్యాకములైన పూర్వ సంవేదనలు సుప్తచైతన్యంలో దాగి ఉంటాయి. సరియైన అనుబోధ యాదృచ్ఛికంగా స్ఫురించినప్పుడు దాని వెంట సహచారి సంవేదనలు పైకి జ్ఞానభూమిలోకి చొచ్చుకొని వస్తాయి. కాబట్టి జీవితంలో, ముఖ్యంగా మానసిక జీవితంలో రెండు అంతస్తులు గుర్తింపవచ్చును. ప్రతిదీ స్ఫుటంగా సరిహద్దులు కనిపించేలా తోచేదొకటీ – ఎంతవరకూ ఉందో తెలియక మరుగు పడిపోయి అస్పష్టమైన దింకొకటి – ఇదే జీవితంలో పెద్ద భాగమేమో! సముద్రంలో కొంచెమే పైకి తేలిన పెద్ద మంచు గుట్టలా మానవుడు జాగ్రత్ చైతన్యంలో కొంచెమే పైకి కనబడుతూ కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. మునిగి ఉన్న ఆ జీవితపు కొలతలు తీసి దాని స్వరూపాన్ని పరిశీలించే ప్రయత్న మధివాస్తవికులు చేస్తామంటారు. ఈ ఉద్యమంలో వాళ్ళెన్నో సంకేతాల (symbols) సహాయం తీసుకొంటారు. మనస్తత్వశాస్త్రం సంకేతాల అంతరార్థాలని వ్యాఖ్యానించే ప్రయత్నం చేసింది. ఈ శాస్త్ర పరిచయం కొందరిని అధివాస్తవిక రచనలకు ప్రేరేపించింది.

అధివాస్తవికులలో కొంత ఆదర్శ పరివర్తనం రాకపోలేదు. అధివాస్తవికుల కర్తవ్యం సుప్తచైతన్యంలోనికి మునకలు వేసి దాన్ని ఉన్నదున్నట్టుగా చిత్రించడమూ కాదు. దానినుండి ఏవేవో పదార్థాలు తీసుకొని ప్రత్యేకమైన స్వాప్నిక జగత్తును నిర్మించడము కాదు. జాగ్రత్ చైతన్యానికి, సుప్తచైతన్యానికి మధ్య ఉన్న అరలు పడగొట్టి అంతర బాహిర ప్రపంచాలను చేర్చి ధ్యానం – ఆచరణ కలిసిపోయే మానవ జీవితాన్ని పరిపాలించే అధివాస్తవికతను సృష్టించడమే వారి పని అని Max Ernst వాదం.

Joyce, Stein పూర్తిగా ఈ తెగకు చెందకపోయినా వాళ్ళ రచనలు ఆంతరంగిక స్వగతాలతోనూ, ‘చైతన్య స్రవంతుల’తోనూ మునిగితేలుతున్నాయి. స్వచ్ఛందానుబోధ (free association) వారి రచనలకి ప్రేరకమవుతుంది. Joyce రచనలు శ్రీశ్రీకి చాలా ప్రోత్సాహాన్నిస్తున్నాయి. (ఫెనిగన్స్ వేక్ వంటివి బాగా అర్థం కాకపోయినా) ‘కోనేటి దినం’ అన్న శ్రీశ్రీ రచన ఆ జాతికి చెందుతుంది. ‘చక్కని ముత్యాల సరాల’లో కవి తనకే తెలిసిన, లేదా ఒకరిద్దరు సన్నిహితులకు తెలిసిన సంకేతాలు వాడుకొని, ఏకాంతంలో తనకు కలిగిన అనుభవాలను చెబుతాడు. కొన్ని వాక్యాల చమత్కారం మినహాయించి అది అవగాహనకి దూరమవుతుంది. ఈ రచనా పద్ధతిలో ఇట్టి అనర్థ పరంపరలు వచ్చే అవకాశముంది. James Joyce కావ్యశిల్పాన్ని మెచ్చుకుంటూనే అతని రచనలలో బూర్జువా సంస్కారపు పతనోన్ముఖమైన దశ కనిపిస్తోందని D.S.Mirsky[6], Harry Martel and Martin Reiss[7] ఈ అభిప్రాయాన్నే ఇస్తారు. James T. Farrel మాత్రం Joyce వంటి రచయితలను భావి శ్రామిక వర్గాలు కూడా అభిమానిస్తాయని ఆశిస్తాడు.[8]

కాని స్వచ్ఛందానుబోధ పద్ధతి మీద ఆధారపడ్డ అధివాస్తవిక సంవిధానం నిజానికి స్వచ్ఛందం కాదన్న సంగతి Frind Jung and Mac Cardy నిరూపణలే రుజువు చేస్తాయి. సయుక్తికానుబోధలో యదార్థం పట్ల ఏర్పడే సామాజికానుభూతి భావనాప్రక్రియను పరిపాలిస్తుంది. స్వచ్ఛందానుబోధలో భావనాప్రక్రియ మీద సుప్తచైతన్యం అధికారం వహిస్తుంది. కాబట్టి అది స్వచ్ఛందం కాదు. సంఘానికి ఎదురీదిన మానవుడు ముక్తుడు కాడు. సమాజం ద్వారా ముక్తిని సాధించాలి. అధివాస్తవిక రచయిత బూర్జువా కావడం చేతను, అతని సామాజిక సంబంధం మీద స్వాధీనం తప్పడం చేతను, ఆ సంప్రదాయాల మీదా, ఆచారాల మీద తిరుగుబాటు చేయడంలోనే ముక్తి ఉన్నదని విశ్వసిస్తాడు. ఆదర్శప్రాయమైన ముక్తిని కళలోని ఐంద్రజాలిక శక్తి చేతను కళాకారుని వైలక్షణ్యం చేతను సాధించగలడని భావిస్తాడు అని Christopher Caudwell వాదం.[9]

విమర్శిస్తూ పోతే కళ కళ కోసమన్న వాదమే అధివాస్తవిక రచనా సంవిధానానికి మాతృక అని తేలుతుంది. సంవిధాన ప్రక్రియకు కావ్యవస్తువుకూ (form and content) ఉన్న పరస్పర వైరుధ్యం తీవ్రమై ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకసారి ఘర్షణ పొంది వాటిని మార్చివేయక తప్పదు. అధివాస్తవిక రచయిత రాజకీయ పరిభాషలో బూర్జువా విప్లవవాది. అతనికి బూర్జువా సంఘంలోని పెంపు చూచి చూచి విసుగెత్తి జుగుప్స కలిగి కలిగి పూర్తి స్వేచ్ఛ సామాజిక బంధాల సర్వనాశనం కావాలంటాడు. వాటిని అపాస్తం చేయటమే అతని అభిమతం. ఆ రీతిగా చూస్తే అంతవరకూ అతడు విప్లవవాది. కానీ ఆ కత్తుల బోనులోనే ఆ బూర్జువా సంఘపు కబంధ హస్తాలలోనే చిక్కుపడి అతడు దానికి అతీతుడు కాలేడు. అరాజకవాదం వలెనే అధివాస్తవికత కూడా ఆచరణలో తన్ను తాను ప్రతియోగిస్తుంది.[10]

శ్రీశ్రీలో రెండవ దశలోని రచనలకు, మూడవ దశలోని రచనలకు వచ్చిన ఈ వ్యత్యాసమేమిటి? ఎందుకు వచ్చింది. అతనిలో రాజకీయంగా ప్రగతిశీలమైన దృష్టి ఉన్నా కళాక్షేత్రంలో ప్రగతి నిరోధక వర్గంలోనికి జారిపోవడమెందుకు? వైచిత్రే సౌందర్యం, సౌందర్యమే వైచిత్రి అని భావించడమెందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం Harry Martel and Martin Reiss మాటలలో ఇలా ఉంటుంది.

“This situation results from the fact that the art and the artists having been divorced from the people by the very development of capitalism itself by the transformation of art works into luxury commodities by the individualistic mode of production, are driven to exalt as ‘freedom’ the very position of spiritual isolation and desolation enforced by the capitalist environment. It results from the powerful, often subtle influence of bourgeois ideology in all fields. This accounts for the modern artists tendencies to anarchic individualism and to indiscipline and his feeling of irresponsibility to the people as regards his art. On the other hand the accurate awareness of his spiritual isolation tends to drive him to find those forces which can lead him out of a growing status as pariah in capitalist society. Thus as a citizen he often is inclined to be with the people, but as artist he yields to the enemies of people and of art itself because he does not grasp the fact that the source of values is the people themselves.”

తన రచనలలో లోకం ప్రతిఫలించాలని గాఢంగా వాంఛించే శ్రీశ్రీ

కదిలేదీ కదిలించేదీ
మారేదీ మార్పించేదీ
పాడేదీ పాడించేదీ
పెను నిద్దుర వదిలించేదీ
మును ముందుకు సాగించేదీ
పరిపూర్ణపు బతుకిచ్చేదీ
కావాలోయ్ నవకవనానికి

అని కళా కాహళ హళా హళితో పలికిన శ్రీశ్రీ ప్రగతి నిరోధక రచనలు చేయక వట్టి చిత్రబంధ సంవిధాన లౌల్యంలో పడక ప్రజాజీవితపు లోతుల నుండి శక్తులు చేదుకొని పటిష్ఠ సాహిత్య నిర్మాత కావాలి. మహాప్రస్థానంలోని రచనలన్నీ తాను నిర్మించబోయే భావి వేదాలకు ‘జీవనాదాలు’గా, ‘ప్రతిజ్ఞ’లుగా ‘వాగ్దానాలు’గా మాత్రమే కనిపిస్తాయి. అదంతా ప్రజాసాహిత్యానికి నాందీ పాఠమే. నిజమైన, సర్వతోముఖమైన విశాలమైన, స్వచ్ఛంద సుందరమైన, ప్రజాజీవితాన్ని, సమస్యల్నీ వస్తువులుగా తీసుకొని సాహిత్య నిర్మాణం చేస్తే శ్రీశ్రీ ఆకాశమెత్తు పెరగటానికి అవకాశం ఉంది.

అథస్సూచికలు

కానీ వక్తగా మాత్రం కృష్ణశాస్త్రి వామపక్షాభిమానాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. ” పీడించే వాళ్ళుగా ఉన్న ఈ వర్గ సమాజముండాలనీ ఎవ్వరూ కోరరు. రానున్న విధానంలో మానవుడే మకుటధారి. పురోగమిస్తున్న లోకాన్ని ప్రతిఘటింపజూసేవారు ఎప్పుడూ అభ్యుదయ వాదులు కాజాలరు. ఈ ధనిక సమాజం పోవాలనుకోవటమే అభ్యుదయం. ఇది మనసులో పెట్టుకొని వ్రాసేది అభ్యుదయ రచన” అని 1945-46లో ఆంధ్రాభ్యుదయ సాహిత్యసమావేశపు అధ్యక్షోపన్యాసంలో కృష్ణశాస్త్రి వక్కాణించాడు.
నా ఆకాశాలను లోకానికి చేరువగా
ఉన్మాది మనస్సినీవాలి
కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలాగున్నది, జాబిల్లి – నల్లని రాతి పోలిక
ఈ రూపాలకు క్లిష్ట సమర్థనం సాధ్యం కాకపోదు. చూర్ణమైన మానం దీర్ణమైన మానము అని అర్థం చెప్పవచ్చును – అక్కడ అది శానచ్ ప్రత్యయం కాదనవచ్చును. అయితే అది కొండను త్రవ్వి ఎలుకను పట్టడమవుతుంది.
Joyce and Irish literature by D. S. Mirsky New Masses
Art and Class by Harry Martel and Martin Reiss
And since literature is a qualitative matter and since it is aesthetic and subjective the growth of future Proletarian literature will not be per se prove the failure of Joyce or Proust. A note in the literary criticism by James T. Farrel
Illusion and Reality – by Christopher Caudwell
It is also the character of surrealism as it is the character of anarchy as a political philosophy that it negates itself in practice
---------------------------------------------------------
రచన: శంఖవరం సంపద్రాఘవాచార్యులు, 
ఈమాట సౌజన్యంతో