Wednesday, October 31, 2018

విశ్వవిజ్ఞానం - 8


విశ్వవిజ్ఞానం - 8


సాహితీమిత్రులారా!

రేమెళ్ళ అవధానులుగారు
మనకు అందించిన
విశ్వవిజ్ఞానంలోని 8 వ భాగం
వీక్షించండి


Tuesday, October 30, 2018

తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు – 3


తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు – 3




సాహితీమిత్రులారా!

తెలుగులో మూడుకి సంబంధించిన మాటలు మూడొంతుల ముప్పాతిక వరకు సంస్కృతం నుండి దిగుమతి అయినవే అని అనిపిస్తుంది. తెలుగులో లేకపోలేదు, కాని వాటి వాడకం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లడం లేదు, అంతే. ఆరు మూడైనా, మూడు ఆరైనా, “మూడు” లేకపోతే ఇటువంటి రాతలు చదవ బుద్ధి కాదు కనుక మూడు నిమిషాల పాటు అ మూడేదో తెచ్చుకుని ఈ తరువాయి చదవండి.

ముప్పావలా అంటే మూడు పావులాలు. మువ్వన్నె అంటే మూడు రంగులు. మువ్వురు అంటే ముగ్గురు. మువ్వంద అంటే మూడు వందలు ట. ఇక్కడ ఏదో సంధి సూత్రం పని చేస్తూ ఉండి ఉండాలి కాని లేకపోతే …. కాస్తా …. ఎలాగవుతుంది?

ముప్పేటలో మూడు పేటలుంటే ఉన్నాయేమో కాని ముప్పేటకాయ అంటే మూడు పాళ్ళు ముదిరి ఇంకా ఒక పాలు లేతగా ఉన్న కొబ్బరి కాయ. ముక్కంటి అంటే మూడు కన్నులు కలవాడు శివుడు; కలది కొబ్బరికాయ.

విశాఖపట్నం జిల్లాలో ముచ్చిలక అనే మాటని ముప్పాతిక అనే అర్థంలో వాడడం నేను చూసేను. కాని నిఘంటువులో ముచ్చిలక అంటే భూస్వామి, కౌలుదారుల మధ్య ఖరారునామా అనే అర్థం ఒక్కటే ఉంది. ఇదే నిజమైన పక్షంలో ముచ్చిలకకీ, మూడుకీ మధ్యనున్న బాదరాయణ సంబంధమేమిటో?

ముమ్మారు అన్నా ముమ్మిడి అన్నా మూడు సార్లు అని అర్థం కదా, మరి ముమ్మిడివరం అంటే మూడు సార్లు వరం అని అర్థమా? దేవుడి దగ్గర మూడు వరాలు పుచ్చుకుందికేనేమో ముమ్ముడివరంలో బాలయోగి వెలిసేడు.

ముప్పది అంటే మూడు పదులు, వెరసి ముప్ఫయ్‌. ఇలాగే ముయ్యేడు అంటే మూడు ఏళ్ళు వెరసి ఇరవై ఒకటి. మున్నూరు 300 అయినట్లే మూడు మూళ్ళు తొమ్మిది కాస్తా ముమ్మూడు అవుతుందన్నది ముమ్మాటికీ నిజం.

మనిషిని పోలిన మనిషి కనిపిస్తే “ముమ్మూర్తులా మీలాగే ఉన్నాడండీ” అంటాం.

మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు తిరుపతిలో స్వామి పుష్కరిణిలో మూడుకోట్ల తీర్థములు వస్తున్నవనే ఐతిహ్యం కారణంగా ఆ రోజుని ముక్కోటి ఏకాదశి అంటారు.

ఈ పైన చెప్పిన ఉదాహరణలన్నిటినీ వ్యాకరణంలో ఒక్క సూత్రంతో టూకీగా చెప్పెయ్యొచ్చు. “సమవాధికరణంబగు ఉత్తర పదంబు పరంబగునప్పుడు మూడు శబ్దమున డువర్ణంబునకు లోపంబును, మీది హల్లునకు ద్విత్వంబును అగు”. కనుక మూడు + లోకములు = ముల్లోకములు. ఇదే విధంగా ముప్పాతిక, మువ్విధం, ముక్కాలి పీట, ముత్తాత, ముజ్జగము, మొదలగునవి.

వ్యాకరణంలో ముఖ్యమైన సంధి త్రిక సంధి. ఈ సందర్భంలో అ, ఇ, ఎ అనే అక్షరాలని త్రికం అంటారు.

ముయ్యంచు అంటే త్రిభుజం అని ఎంతమందికి తెలుసు? ఈ త్రిభుజాన్ని త్రికోణి అని కూడ అంటారు.

“త్రి”తో మొదలయే సంస్కృతం మాటలు తెలుగులో కొల్లలు. త్రిమూర్తులు, త్రిలోకములు మనకు తెలిసున్నవే. ఆయుర్వేదంలో సొంఠి, పిప్పలి, మిరియాలని త్రికటుకాలనిన్నీ; కరక, తాడి, ఉసిరికలని త్రిఫలాలనిన్నీ; వాత, పిత్త, శ్లేష్మాలని త్రిదోషాలనిన్నీ అంటారు.  వ్యాకరణంలో మాత్రం త్రిదోషాలంటే పద, వాక్య, అర్థ దోషాలు.

“ట్రిగొనామెట్రి” అన్న మాటని త్రి, గుణ, మాత్ర అని మూడు మాటలుగా విడగొట్టి “మూడు గుణాలని (సైను, కొసైను, టేంజెంటు) కొలిచే శాస్త్రం” అని అన్వయం చెప్పొచ్చు.

త్రిశూలం త్రినేత్రుడి ఆయుధాలలో ఒకటి. త్రిదండం అనేది మనోదండం, వాగ్దండం, కర్మదండం అనబడే మూడు వెదురు బద్దలతో కట్టిన దండం. శైవులు నుదుటి మీద అడ్డుగా పెట్టుకునే విభూతి పెండికట్లని త్రిపుండ్రం అంటే వైష్ణవులు నిలువుగా పెట్టుకునే బొట్టుని ఊర్వ్థపుండ్రం అంటారు.

బ్రహ్మపదార్థము సగుణబ్రహ్మము, నిర్గుణబ్రహ్మము అని రెండు రకాలే అయినా సగుణబ్రహ్మము సూత్రం త్రికాలాలలోనూ త్రిగుణాత్మకం (సత్వ, రజో, తమో గుణాలు) అని త్రిమతాచార్యులైన శంకర, రామానుజ, మధ్వాచార్యులు ఏకీభవించేరు. మనస్సులో అనుకున్నది ఒకటి, నోటితో చెప్పేది మరొకటి, చేత్తో చేసేది ఇంకొకటి అయితే ఆ పనిలో త్రికరణశుద్ధి లేదు.

“త్రి” అన్న అక్షరం మాటకి మొదట వచ్చినట్లే మూడుని సూచించడానికి “త్రయం” అన్న తోక సర్వసాధారణంగా మాటకి చివర వస్తుంది త్రిమూర్తులలో ఒకడైన శివుడిని “త్రయంబకుడు” అన్నప్పుడు తప్ప. భారతాన్ని తెలిగించిన నన్నయ, తిక్కన, ఎర్రనలు కవిత్రయం. అవస్థా త్రయంలో ఒంటి మీద తెలివి ఉన్న పరిస్థితిని జాగ్రదావస్థ అనిన్నీ, తెలివి తప్పిన తర్వాత నిద్రావస్థ అనిన్నీ, కలలు కనే సమయాన్ని స్వప్నావస్థ అనిన్నీ లేదా సుషుప్తావస్థ అనిన్నీ అంటారు. ఈ సుషుప్తావస్థ గురించి మనకి అనాది నుండి తెలుసుకానీ, ఈ దృగ్విషయం (“ఫినామినన్‌”) పాశ్చాత్యులకి ఈ మధ్యనే అవగాహన అయింది. దీనినే వీళ్ళు “రెం స్లీప్‌” అంటారు.

సులభంగా అర్థం అయే కవిత్వం ద్రాక్షాపాకం, కొంచెం కష్టపడితే కాని అర్థం కాకపోతే అది కదళీపాకం, బొత్తిగా కొరుకుడు పడనిది నారికేళపాకం. ఈ మూడింటిని గుమ్మగుచ్చి పాకత్రయం అంటారు. ఇలాగే ఈషణత్రయం అని ఒకటుంది. నారేషణ అంటే ఆడదాని యందు ఆశ. పుత్రేషణ అంటే కొడుకు పుట్టాలనే కోరిక, ధనేషణ అంటే డబ్బు కోసం తాపత్రయం. “తాపత్రయం” అన్న మాటకి అసలు అర్థం ఆధ్యాత్మికం, ఆధిభౌతికం, ఆధిదైవికం అయినప్పటికీ ఆ విషయాన్ని విస్మరించి మనకి తోచిన విధంగా వాడేయడానికి ఊరికే తాపత్రయ పడిపోతూ ఉంటాం.

మంత్రత్రయం (అష్టాక్షరి, ద్వయం, చరమశ్లోకం) లోని త్రయం గురించి గతంలో ఒకసారి ముచ్చటించేను. ఇక, “ఓం నమో నారాయణాయ” అన్నది అష్టాక్షరి. చరమశ్లోకం గురించి ఆఖర్న చెబుతాను.

కాళహస్తి, ద్రాక్షారామం, శ్రీశైలం ఉన్న త్రిలింగ దేశమే తెలుగు దేశం అని అంటారు కానీ రాజమండ్రి దగ్గర ఉన్న కోటిలింగాలని లెక్కపెట్టడం మరిచిపోయారా, ఏమిటి?

“త్రయం”కి ఇంగ్లీషులో సమానార్థకం “ట్రిపుల్‌” లేదా “ట్రయొ”.

ఇంగ్లీషులోని “ట్రై”, “ట్రి”లు తెలుగులోని “త్రి” జ్ఞాతులు కనుక “ట్రై ఏంగిల్‌” అన్న మాటకి సరి అయిన తెలుగు “త్రికోణం”.

ఇదే బాణీలో ముయ్యాకు అంటే మూడాకుల దళం అని అర్థం. ఈ మూడాకుల దళాన్నే ఇంగ్లీషులో “ట్రైఫోలెయెట్‌” అంటారు. “ట్రైడెంట్‌” అంటే “మూడు దంతాలు ఉన్నది” అనే అర్థం స్ఫురించినా ఇంగ్లీషులోనూ తెలుగులోనూ ఇది మూడు పళ్ళు ఉన్న త్రిశూలం.

“ట్రైక్లోరో మెతేన్‌” అన్న రసాయన నామాన్ని త్రిహరిత పాడేను అని నేను తెలిగించేను. దీని వ్యుత్పత్తి కావలసిన వారు నేను రాసిన “రసగంధాయరసాయనం” పుస్తకం చదవండి.

త్రిశంకు స్వర్గం, త్రిశంకు చక్కెర మొదలైన మాటలలోని “త్రి” కీ, మూడుకీ ఏమీ సంబంధం లేదని మనవి చేసుకుంటున్నాను. ఇంతకీ త్రిశంకు చక్కెర ఏమిటా అని ఆరాట పడకండి. అది “ఇన్వర్ట్‌ సుగర్‌” అన్న మాటకి నా తెలుగుసేత. దీని వృత్తాంతం కూడ “రసగంధాయరసాయనం” లో ఉంది.

కేమ్‌బ్రిడ్జి విశ్వవిద్యాలయంలో జరిగే పరీక్షలలో పరీక్షని పర్యవేక్షించే వ్యక్తి (“వాచరు”) ముక్కాలిపీట మీద కూర్చునేవాడుట. అందుకనే ఈ పరీక్షలని “ట్రైపోప్‌” అనేవారు.

పాశ్చాత్యుల ప్రస్తావన ఎలాగూ వచ్చింది కనుక ఒక చిన్న పిట్టకథ చెబుతాను. రాజకీయాలలో మనం మన దేశాన్ని కుల వర్గాలుగా విడగొట్టినట్లే పూర్వం రోం సామ్రాజ్యాన్ని  రోమను, సెబీను, ఆల్బను అని మూడు కుల వర్గాలుగా విడగొట్టేరు. లేటిన్‌ లో “ట్రైబస్‌” అంటే మూడో వంతు కనుక ఈ కుల వర్గాలని వారు “ట్రైబ్‌” అన్నారు. రాజాస్థానానికి వచ్చే రాబడిలో మూడో వంతు ప్రతి “ట్రైబ్‌” నుండి వస్తోంది కనుక ఆయా కుల వర్గాలు కట్టే పన్నుని “ట్రిబ్యూట్‌” అన్నారు. “కంట్రిబ్యూషన్‌” అన్న మాట ఇందులోంచి వచ్చినదే. ఉపనదిని “ట్రిబ్యూటరీ” అనడానికి కూడ కారణం ఇదే నదిలోని నీటిని “కంట్రిబ్యూట్‌” చేస్తున్నాది కనుక!

రెండు పేటల దారంతో నేసిన బట్టని “ట్విల్‌” అన్నట్లే, మూడు పేటల దారంతో నేసిన బట్ట “డ్రిల్‌” బట్ట. ముప్పిరి అంటే మూడు పేటలు కనుక “డ్రిల్లు” బట్టని ముప్పిరి బట్ట అనొచ్చు.

“త్రిమితీయ” అన్న ప్రత్యయాన్ని “త్రీ డిమెన్‌షనల్‌” అన్న అర్థంలో వాడుతున్నారు కొందరు. ఈ లెక్కని ఈ “ఫోర్‌ డిమెన్‌షనల్‌” ప్రపంచాన్ని “చతుర్‌మితియం” అనొచ్చు. కాని “ఫోర్‌ డిమెన్‌షనల్‌” అన్న మాటకి “తురీయ మితీయం” అనే మాట మరొకటి ఉంది.

ఒక సంఖ్యని 3 చేత భాగించగలమా లేమా అని సంశయం వస్తే ఆ సంఖ్యలోని అంకెలని అన్నింటిని కలిపి ఆ మొత్తాన్ని మూడు చేత భాగించి చూడండి. ఈ మొత్తాన్ని 3 చేత భాగించ గలిగితే ఆ సంఖ్యనీ భాగించగలం. ఉదాహరణకి 531 లోని అంకెల మొత్తం 5 + 3 + 1 = 9. ఈ 9 ని 3 చేత భాగించగలం కనుక 531 నీ భాగించగలం.

వృత్తలేఖిని, కొలబద్ద సహాయంతో ఒక గీతని కాని, కోణాన్ని కాని సమద్విఖండన చేయవచ్చని రేఖాగణితంలో దిట్టలయిన గ్రీకులు ఎప్పుడో కనుక్కున్నారు కానీ ఒక కోణాన్ని “ట్రైసెక్ట్‌” (సమత్రిఖండన) చెయ్యడం ఎలాగో వాళ్ళకి తెలియలేదు. ఈ పని చెయ్యడం అసంభవం అన్న విషయం మనకి ఇప్పటి కాలంలోనే అర్థం అయింది!

భూగర్భశాస్త్రంలో “మూడవ, తృతీయ” అన్న అర్థం రావలసినప్పుడల్లా “టెర్‌షియరీ, ట్రయాసిక్‌” అనే పూర్వప్రత్యయాలు వాడతారు.

“ట”మాషా ఏమిటంటే ఇంగ్లీషులో ట కార త కారాలకి ఒకే ఒక అక్షరం ఉన్నా భాష ఉచ్చారణలో ట కార త కారాలతో మొదలయే “మూడు” మాటలు చాల ఉన్నాయి. కాని తెలుగులో ట కార త కారాలకి విడివిడి అక్షరాలు ఉన్నా ట కారంతో మూడు మాటలు తెలుగులో లేవు.

రెండు రోడ్ల కూడలిని కూడలి కిందే లెక్కించరు, ఎందుకంటే రోడ్డు మీద ఎక్కడ నిలబడ్డా, ముందున్న రోడ్డు, వెనకున్న రోడ్డు కలిపి రెండు రోడ్ల కింద లెక్క లోకి వస్తుంది కనుక. మూడు రోడ్ల కూడలిని లేటిన్‌ లో “ట్రివియం” అంటారు. ఈ రకం కూడలిలో కూర్చుని ప్రజలు పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారుట. మనదేశంలో ఇప్పటికీ ఇలా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు కనిపిస్తూనే ఉంటారు. ఇటువంటి “ట్రివియల్‌” కబుర్లు చెప్పి మీ కాలం వృధా చెయ్యడం నాకు ఇష్టం లేదు కనుక, ప్రస్తుతానికి ఈ బాతాకానీ ఆపుతాను.
----------------------------------------------------------
రచన: వేమూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో 

Monday, October 29, 2018

విశ్వవిజ్ఞానం - 7


విశ్వవిజ్ఞానం - 7




సాహితీమిత్రులారా!

రేమెళ్ళ అవధానులుగారు
మనకు అందించిన
విశ్వవిజ్ఞానంలోని 7 వ భాగం
వీక్షించండి




Sunday, October 28, 2018

తెలుగులో అంకెలు, సంఖ్యలు 11 నుంచి పైన


తెలుగులో అంకెలు, సంఖ్యలు 11 నుంచి పైన



సాహితీమిత్రులారా!

తెలుగులో పది, ఒండు పదకొండు ఎలా అయిందో అదే విధంగా పాత ఇంగ్లీషులో “ఎలెవెన్‌” అంటే “(పదిమీద) మిగిలింది ఒకటి” అని అర్థం. ఇదే విధంగా “ట్వెల్వ్‌” అర్థం “మిగిలింది రెండు”. ఇది కాస్తా సంస్కృతంలో ద్వ, దశ ద్వాదశ అయింది. ఇదే మాట లేటిన్‌లో “డూవోడెసిమ్‌”. “డూవో” అంటే రెండు, “డెసిమ్‌” అంటే పది. మాటకట్టడి చూసేరా? లేటిన్‌కీ సంస్కృతానికీ పోలిక ఉంది. పాత ఇంగ్లీషుకీ తెలుక్కీ పోలిక ఉంది. ఈ డూవోడెసిమ్‌ అన్న లేటిన్‌మాట భ్రష్టయి ఇంగ్లీషులో “డజను”గా మారింది. కనుక డజనుని ద్వాదసికి భ్రష్టరూపంగా తెలుగులోకి తీసేసుకోవచ్చు. లేదా తెలుగులో డజనుని ద్వాదశం అనొచ్చు. ఇలాంటి నియమాలు ఒక డజను సంపాయించగలిగే మంటే ఇంగ్లీషు మాటల్ని డజన్ల కొద్దీ తెలుగులోకి తీసుకురావచ్చు.

పాశ్చాత్యదేశాలలో, హోటేళ్ళు మొదలైన అంబరచుంబితాలలో (అంటే “స్కైస్క్రేపర్‌”లలో) సాధారణంగా పదమూడో అంతస్తు ఉండదు. అంటే, పన్నెండు తర్వాత పద్నాలుగు వస్తుంది. మనకి ఏడు ఎలాగో పాశ్చాత్యులకి పదమూడు అలాగ. పదమూడు వల్ల కీడు కలుగుతుందనే భయాన్ని “త్రిస్‌కైడేకాఫోబియా” అంటారు. తెలుగువాళ్ళకి త్రయోదశభీతి లేదు కానీ అమావశ్య అంటే కొంచెం భయం ఉంది.

ఇంగ్లీషులో ఎవెవెన్‌, ట్వెల్వ్‌ లకి తెలుగులో పదకొండు, పన్నెండు లతో పోలిక ఉన్నాదని చెప్పేను కదా. ఈ పోలిక తర్వాత కనపడదు. థర్టీన్‌ త్రీ, టీన్‌ అయితే తెలుగులో పదమూడు మూడు, పది కాదు; పది, మూడు. ఇంగ్లీషులో ముందు మూడు, తర్వాత పది వస్తే తెలుగులో కొంచెం తిరకాసు వచ్చింది. ఇదే తిరకాసు నైన్‌టీన్‌ వరకు కనిపిస్తుంది.

ఇక్కడ సంస్కృతంలో లెక్క పెట్టే పద్ధతిని ఒకసారి పునర్విమర్శిద్దాం. ఉదాహరణకి, ఎనభైరెండుని ద్వ్యశీతి అంటే 2, 80 అనీ, ఎనభై మూడుని త్య్రశీతి అంటే 3, 80 అనీ చెబుతూ, ఎనభై తొమ్మిది దగ్గరికి వచ్చేసరికి “నవాశీతి” అనకుండా “ఏకోన నవతి” అన్నారు. అంటే “తొంభైకి ఒకటి తక్కువ” అని అర్థం. ఈ పద్ధతి ఇంగ్లీషులోనూ తెలుగులోనూ కూడ కనిపించదు. కాని రోమక సంఖ్యలని రాసేటప్పుడు ఈ సంస్కృతంలో వాడే పద్ధతినే ఇప్పటికీ వాడుతున్నాం అని గమనించండి.

మనం తొమ్మిది రాత్రులని నవరాత్రులు అన్నట్లే ఇంగ్లీషులో పద్నాలుగు రాత్రులని “ఫోర్టీన్‌ నైట్స్‌” అంటారు. దీన్ని కుదిస్తే “ఫోర్ట్‌నైట్‌” అవుతుంది.

పక్కా తెలుగు వాడికీ పదహారుకీ ఏదో తీయని సంబంధం ఉండబట్టే పదహారణాల ఆంధ్రుడు అన్న పేరు వాడుకలోకి వచ్చింది.

భారతంలో పద్ధెనిమిదికి చాలా ప్రాముఖ్యత ఉంది. అష్టాదశ పర్వాలు. భారతయుద్ధంలో పద్ధెనిమిది అక్షౌహిణుల సైన్యం. భగవద్గీతలో పద్ధెనిమిది అధ్యాయాలు. ఈ 18 అధ్యాయాలలో ఉన్న 700 చిల్లర శ్లోకాలనీ 18 శ్లోకాలలోకి కుదించి దానిని అష్టాదశగీత అన్నారు. పురాణాలు, ఉపపురాణాలు పద్ధెనిమిదేసి ఉన్నాయి.

పచ్చీస్‌పాళీ ఉత్తరాది వారి ఆట అనుకుంటాను. ఈ ఆటలోనే దస్సు, దోదస్సు, పచ్చీసు వస్తాయి.

దేశానికి కొత్తగా వచ్చే మనుషులకి జబ్బు చేస్తే వారిని కొన్నాళ్ళు ” క్వారన్‌టీన్‌”లో పెడతారు అంటే. ఆగంతుకులకి ఏమైనా అంటురోగాలుంటే అవి మిగిలిన వాళ్ళకి సోకకుండా నలభైరోజుల పాటు ఏకాంతరవాసం ఏర్పాటు చేస్తారు. ఫ్రెంచి భాషలో “క్వారంటె” అంటే నలభయ్‌!

అరవైకి మానవ సంస్కృతిలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. మనకున్న సంవత్సరాలు అరవై. అరవై ఏళ్ళు బతికితే అదొక మైలురాయి లాంటిది. కనుక మన సంస్కృతిలో షష్టిపూర్తికి అంత ప్రాముఖ్యత. గంటకి 60 నిమిషాలు, నిమిషానికి అరవై “సెకండు”లు, సెకండుకి అరవై “థర్డ్‌”లు. ఇదే విధంగా వృత్తంలో ఒక డిగ్రీకి అరవై నిమిషాలు, నిమిషానికి అరవై సెకండ్లు, సెకండుకి అరవై థర్డ్‌లు. ఇప్పటికైనా అర్థమయిందా “సెకండు” అన్న మాటలోని అంతరార్థం? మనలో కొందరు “సెకండు షో”, “సెకండు హేండు” మొదలైన ఇంగ్లీషు మాటలని నిర్మొహమాటంగా వాడేస్తూ నిమిషంలో అరవైయవ వంతైన సెకండు దగ్గరకు వచ్చేసరికి దానిని “సెకను” అంటారు, అక్కడికేదో తెలుగు మీద అభిమానం మండిపడి పోతూన్నట్లు.

ఇరవై, ముప్ఫయ్‌, .. , తొంభయ్‌ అన్న అంకెలు దరిదాపు అన్ని భాషలలోనూ ఒకే బాణీలో వెళతాయి. ఇరు, పది ఇరువది లేదా ఇరవై… ఏను, పది ఏబది లేదా ఏభయ్‌. ఆరు, పది అరువది లేదా అరవై. కాని అరవై దాటిన తరవాత వచ్చే అంకెలు అన్ని భాషలలోనూ పైన ఉదహరించిన బాణీలో నడవవు. ఉదాహరణకి, ఏడు, పది డెబ్బది ఎలాగయిందో, ఏ వ్యాకరణసూత్రం ఉపయోగించాలో నాకు అర్థం కాలేదు. ఈ రకం ప్రవర్తన ఇంగ్లీషులో కనిపించదు కాని ఫ్రెంచి భాషలో ఎనభైని నాలుగు ఇరవైలు అనే అలవాటు ఉంది.

నూరు, వంద అన్న పేర్లు ఎలాగొచ్చేయో తెలియదు. “రెండు వందల”, “మూడు వందల” అని అంటాం కానీ “వంద పదహారు”కి బదులు “నూటపదహారు” అంటాం. ఈ నూటపదహారుకి మన సంస్కృతిలో ఒక ప్రత్యేకస్థానం ఉంది. కట్నం, పారితోషికం మొదలైనవి వంద ఇవ్వకూడదు, నూరు ఇవ్వకూడదు నూటపదహార్లు ఇవ్వాలి.

“నూరు” ఎప్పుడు వాడాలో, “వంద” ఎప్పుడు వాడాలో అన్న సందేహనివృత్తికి ఒక నియమమంటూ ఉన్నట్లు లేదు. అంతేకాదు, పేరుకి నూరే కాని ఆచరణలో నూరుని నూరులా వాడని సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

శతకంలో నూరు కాదు, నూట ఎనిమిది పద్యాలుంటాయి. కాని “వేమన శతకం”లో వందల కొద్దీ పద్యాలున్నాయి కనుక వాటిని వేమన పద్యాలంటేనే మెరుగేమో. పూజ చేయించేటప్పుడు చదివే అష్టోత్తరశత నామాలు నూట ఎనిమిది.

విశాఖపట్నం జిల్లాలో వంద మామిడి పళ్ళు కొంటే నూటపన్నెండు వస్తాయి. మామూలు వంద 100 అయితే “పెద్ద వంద” 112. ఈ ఆచారం ఇంగ్లండులోనూ ఉంది. “హండ్రెడ్‌వెయిట్‌” అంటే 112 పౌనులు. “హండ్రెడ్‌కౌంట్‌” అంటే 112 శాల్తీలు.

మనిషి పూర్ణాయుర్దాయం నూరేళ్ళు అని చాలమంది నమ్మకం. కాని ఈ రోజులలో చాల మంది నూరు దాటే బతుకుతున్నారు. అసలు గాంధీ గారు “నూట ఇరవై ఏళ్ళు బతుకుతాను” అని అనేవారు. ఈ నూట ఇరవై ఎక్కడి నుండి వచ్చిందా అని చాల రోజులు ఆలోచించేను.

మనిషి ఆయుర్దాయం నూరన్న నమ్మకంతోటే నూరేళ్ళు నిండుగా బతుకు అని ఆశీర్వదిస్తాం. దీన్నే వేదాల్లో “జీవేమ శరదః శతం” అంటే “నూరేళ్ళు జీవించాలి” అని కోరుకోవడం. ఈ నూరేళ్ళూ ఎలా జీవించాలి? ఆరోగ్యంగా, ఇంకొకరి మీద ఆధారపడకుండా, సంఘశ్రేయస్సుకి భంగం కలగకుండా, జబ్బుపడి మంచం పట్టిపోకుండా, పనిచేస్తూ జీవించాలి. నూరేళ్ళు పనిచెయ్యడం అంటే కుదురుతుందా? నిద్రాహారాల మాటేమిటి? రోజుకి నాలుగో వంతు నిద్రాహార విశ్రాంతులకి కేటాయించి, పనిచేసే కాలమే లెక్క కట్టగా ఆయుర్దాయం 125 సంవత్సరాలు. ఇందులోంచి బాల్యంలో గడిపిన కాలం కొంత కొట్టేస్తే గాంధీగారి నమ్మకానికి ఆధారం దొరుకుతుంది.

డాలర్లో నూరోవంతు సెంటు. సెంటు అంటే నూరు అనే అర్థం కూడా ఉండబట్టే “సెంటు పెర్సెంటు” అంటే నూటికి నూరు అయింది. క్రికెట్‌లో వంద రన్నులు కొడితే అది “సెంచెరీ”. వంద సంవత్సరాల కాలమైన శతాబ్దం కూడ సెంచెరీయే.

సహస్రం అంటే వెయ్యి. విరాట్‌పురుషుడికి వెయ్యి తలలు, వెయ్యి కళ్ళు, వెయ్యి పాదాలు ఉన్నాయని వర్ణిస్తాం; “సహస్ర శీర్షం దేవం, సహస్రాక్షం సహస్రపాత్‌”. ఇక్కడ “వెయ్యి” అంటే “ఎన్నో” అని అర్థం చెప్పుకోకుండా, “వెయ్యి తలలుంటే రెండు వేల కళ్ళు ఉండొద్దా?” అని అడగడం అవివేకం. ఇది అలంకారాలలో ఒకటయిన అజహర్లక్షణానికి మరొక ఉదాహరణ అని సరిపెట్టుకోవాలి.

ఇంగ్లీషులో “మిలియనమ్‌” అంటే వెయ్యి సంవత్సరాలు. దీన్నే మనం సహస్రాబ్దం అంటాం. మనం ఇప్పుడు, పాశ్చాత్య పంచాంగం ప్రకారం, ఒక సహస్రాబ్దం దాటి మరొక సహస్రాబ్దంలోనికి ప్రవేశించే సంధి యుగంలో ఉన్నాం. ఈ రోజుల్లో “వైటుకె” సమస్య గురించి వినని వాళ్ళు అరుదేమో?

మిల్లీ అంటే వెయ్యో వంతు. ఈ “మిల్లీ”లో నుండి ఉద్భవించిన “మైలు” అంటే వెయ్యి అంగల దూరం.

ఇంగ్లీషులో “సెంటీపీడ్‌” అంటే వందపాదాలు కల పురుగు అని అర్థం. కాని సెంటీపీడులని పట్టుకుని వాటి పాదాలు లెక్కపెడితే అవి 30 కీ 42 కీ మధ్య ఉంటాయి కాని వంద ఎప్పుడూ ఉండవు. “మిల్లీపీడు” అంటే వెయ్యి పాదాలు కల పురుగు. కాని వీటికి సాధారణంగా ఏ రెండు వందల కాళ్ళో ఉంటాయి అంతే. (నేతిబీరకాయ లాంటి మాటలు ఇంగ్లీషులోనూ ఉన్నాయి.) ఈ మధ్య 750 కాళ్ళు ఉన్న మిల్లీపీడుని కనుక్కున్నారు. ఎక్కడైనా వెయ్యి కాళ్ళు ఉన్న మిల్లీపీడు దొరుకుతుందేమోనని వెతుకుతున్నారు. ఇవి పురాణాలలో పెట్టిన పేర్లు కావు కదా! శాస్త్రవేత్తలు వీటికి పేర్లు పెట్టడంలో పప్పులో కాలేసేరు! సెంటిపీడులనీ మిల్లిపీడులనీ కలిపి “మిరియపోడా” అంటారు. “మిరియడ్‌” అంటే పదివేలు. “మిరియపోడా” అంటే పదివేల కాళ్ళు ఉన్న పురుగు అని అర్థం. కనుక ఈ పేర్లన్నిటినీ అతిశయోక్తులుగా తీసుకోవాలి.

వెయ్యిని ఇంగ్లీషులో “థౌజండ్‌” అంటాం కదా! “థౌజండ్‌” అంటే “గట్టివంద” లేదా”పెద్దవంద”, అని అర్థం. ఇటలీ వాళ్ళు తీసిపోయారా? వాళ్ళు వెయ్యికి “మిల్లీ” తగిలించి దానిని “గట్టివెయ్యి” లేదా “మిలియోన్‌” చేసేరు. అదే మిలియన్‌ అయింది. కాని గట్టి వంద వెయ్యి అయితే గట్టివెయ్యి పదివేలు అవాలి, న్యాయంగా. కాని ఇక్కడ అయి చావలేదు.

పెద్ద పెద్ద అంకెలని ఊహించి లెక్క పెట్టడం భారతీయులకి వెన్నతో పెట్టిన విద్య. ఉదాహరణకి పెద్దపెద్ద అంకెలు ఎంతవరకు లెక్కపెట్ట వచ్చో చూద్దాం.

ఒకటి పక్కన సున్న వేస్తే అది పది. పదిని ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. మన చేతులకి పది వేళ్ళు ఉన్నాయి కదా!

పది మధ్య సున్న వేస్తే “పంది” అవుతుంది కానీ, అది వేరే విషయం.
పది పక్కన సున్న చుడితే అది వంద. వందని ఊహించుకోవడం కూడ పెద్ద కష్టం కాదు. వంద రూపాయలు ఖర్చు పెడితే ఏమీ రాని ఈ రోజులలో వంద పెద్ద సంఖ్య కానే కాదు. కాని నా చిన్నతనంలో వంద చాలా పెద్ద సంఖ్య. మా పెద్దన్నయ్య పెళ్ళికి నూటపదహార్లు కట్నం ఇచ్చేరు!

ఒకటి పక్కన మూడు సున్నలు చుడితే అది వెయ్యి. ఒక మంచి చొక్కా కొనుక్కోవాలంటే వెయ్యి రూపాయలు అయిపోతోంది ఈ రోజులలో.

ఒకటి పక్కన నాలుగు సున్నలు చుట్టడంతో మనం పేర్లు పెట్టే పద్ధతిలో కొంచెం మార్పు వచ్చింది. 10,000 కి మరో కొత్తపేరు పెట్టకుండా “పదివేలు” అనేసి ఊరుకున్నాం. మనమే కాదు ఇంగ్లీషు వాడూ ఇదే పని చేసి, “టెన్‌, హండ్రెడ్‌, థౌజండ్‌” అయిన తర్వాత మనలాగే “టెన్‌ థౌజండ్‌” అన్నాడు. కాని ఇంగ్లీషు వాడు మనదేశం రాక పూర్వం దీనిని “మిరయడ్‌” అనే వాడు. మిరయడ్‌ రూపాయలు ఉంటే హైదరాబాద్‌ నుండి ఢిల్లీ విమానంలో వెళ్ళిరావచ్చు.

ఒకటి పక్కన ఐదు సున్నలు చుడితే అది లక్ష. దీన్ని హిందీలోనూ, ఇంగ్లీషులోనూ కూడ “లేక్‌” అంటారు. తంతే దమ్మిడీ లేని బేపనోళ్ళ ఇళ్ళలోనే ఈ రోజులలో కట్నాలు లక్ష రూపాయలు ట! పూర్వం గొప్పవాళ్ళు లక్షాధికారులు. “వాళ్ళింట్లో లక్షలు మూలుగుతున్నాయిరా!” అనుకునే వాళ్ళం. ఇప్పుడు లక్ష అంటే ఎవ్వరూ ఖాతరు చెయ్యడం లేదు.

ఒకటి పక్కన ఆరు సున్నలు చుట్టగా వచ్చిన సంఖ్య “పది లక్షలు”. కొత్తసున్న చుట్టినప్పుడల్లా ఒక కొత్త పేరు పెడదాం అనుకుంటే, ఆ కొత్త పేరే మిలియను. అమెరికాలో మిలియను డాలర్లు ఆస్తి ఉంటే మధ్య తరగతిలో కొంచెం పైమెట్టు లో ఉన్నట్లు లెక్క వేసుకోవచ్చు. మన దేశంలో లక్షాధికార్లకి పట్టిన గతే అమెరికాలో ఈ మిలియనీర్లకి కూడ పడుతోంది. బిల్‌ గేట్స్‌ లాంటి బిలియనీర్లు వచ్చిన తర్వాత మిలియనీర్ల ముఖాలు ఎవ్వరూ చూడడం లేదు.

ఒకటి పక్కన ఏడు సున్నలు చుడితే అది కోటి. దీన్ని హిందీలో “కరోర్‌” అంటారు. ఇదే ఇంగ్లీషులో “క్రోర్‌”. ఈ రోజులలో గొప్పవాళ్ళు కోటీశ్వరులు, లేదా కరోర్‌పతులు. “వాళ్ళింట్లో డబ్బు కోటికి పడగలు ఎత్తిందిరా!” అనుకునే వాళ్ళం. అంత డబ్బుంటే ఆ డబ్బు పాములుగా మారిపోతుందనే కథ నా బాల్యంలో వినేవాడిని.

కోటిని ఊహించుకోవడం కొంచెం కష్టం నా బోంట్లకి. ఉదాహరణకి భారతదేశం జనాభా ఉరమరగా 100 కోట్లు! కాంగ్రెస్‌ పార్టీ వాళ్ళు పార్టీ నిధి కొరకు డబ్బు దండుకుంటూ హైదరాబాదులో ఉన్న ఒక “ఇండస్ట్రియలిస్టు” దగ్గరకి వెళితే ఆయన ఒక కోటి ఇచ్చి మరేమీ అనుకోవద్దని క్షమార్పణ వేడుకున్నాట్ట. ఆయనని నేను ఒకసారి కలుసుకున్నాను. పేరు మాత్రం చెప్పను. క్రీ.శ. 1992లో ఆంధ్రప్రదేశ్‌లో పుగాకు, సారా వగైరాల అమ్మకం పన్ను ద్వారా వచ్చిన ఆదాయం 840 కోట్ల రూపాయలుట!

మానవకోటి, జంతుకోటి అన్న మాటలలో మాత్రం కోటి అంటే ఎన్నో అనే అర్థం. కనుక “ఏనిమల్‌ కింగ్‌డమ్‌” వంటి “బయాలజీ” మాటని “జంతుకోటి” అంటేనే బాగుంటుంది.

ఒకటి పక్కన ఎనిమిది సున్నలు చుడితే వచ్చే సంఖ్యకి మంచిపేరు, నలుగురికీ పరిచయం అయిన పేరు ఏదీ లేదు. పదికోట్లు అనో, దశకోటి అనో, వంద మిలియన్లు అనో అనవచ్చు; కాని అవి కొత్త పేర్లు కావు. “వెంకట్రావ్‌, పెద వెంకట్రావ్‌” అన్నట్టు పాత పేర్లనే పునరావృతం చేసేం, అంతే.

ఒకటి పక్కన తొమ్మిది సున్నలు చుడితే వచ్చే సంఖ్య వంద కోట్లు లేదా బిలియను. మిలియను ఊహించుకోవడం చేతనయిన వాళ్ళకి కూడ బిలియను ఊహించుకోవడం కష్టం. వెయ్యికీ మిలియనుకీ మధ్య ఎంత దూరం ఉందో మిలియనుకీ బిలియనుకీ మధ్య అంత దూరం అని ఉపమానం చెప్పినా ఆ ఉపమానం ఉపయోగకారి కాదు. కనుక రెండు ఉదాహరణలు చెబుతాను.  ఈ భూలోకపు జనాభా 5 బిలియన్ల పై చిల్లర. ప్రస్తుతం ప్రపంచం అంతటిలోనూ ధనవంతుడైన బిల్‌గేట్స్‌ దగ్గర దరిదాపు ఏ ఏభై బిలియను డాలర్లో ఉంటాయని అంచనా.

అసలు ఆధునిక శాస్త్రీయ యుగం మొదలయే వరకూ పాశ్చాత్య దేశాలలో పెద్ద పెద్ద సంఖ్యలతో పనే ఉండేది కాదు. బిలియనుతో సామాన్యులకి అవసరం ఏముంటుంది? కనుక మొన్న మొన్నటి వరకూ పాశ్చాత్య భాషలలో పెద్ద పెద్ద సంఖ్యలకి పేర్లే లేవు. పని ఉంటే కదా పేర్ల అవసరం? కాని మన భారతదేశంలో ఏమి పని వచ్చిందో తెలియదు కాని పెద్ద పెద్ద సంఖ్యలకే కాదు, పేద్ద పేద్ద సంఖ్యలకి కూడ పేర్లు ఉన్నాయి. ఉదాహరణకి ఒకటి తర్వాత 11 సున్నలు చుడితే అది అర్బుదం, 13 సున్నలకి ఖర్వం, 15 సున్నలకి పద్మం, 17 సున్నలకి క్షోణి, 19 సున్నలకి శంఖం, ఇలాగే తరువాయి బేసి సంఖ్యల సున్నలుంటే వాటిని క్రమంగా క్షితి, క్షోభం, నిధి, సరి సంఖ్యలైన సున్నలుంటే వాటి పేరుకి “మహా” తగిలించి మహాపద్మం, మహాఖర్వం, వగయిరా పేర్లు. ఒకటి తర్వాత 27 సున్నలుంటే పర్వతం, 28 పరార్థం, 29 అనంతం. ముప్పయ్‌ సున్నలుంటే సాగరం, 31 అవ్యయం, 32 అచింత్యం, 33 అమేయం, … భూరి, వృందం, అన్న పేర్లు ఉన్నాయి. ఈ లెక్కలో వృందం తర్వాత ఏమి పేర్లు వస్తాయో ఇదమిద్ధంగా తెలియదు కానీ రావణాసురుడి సైన్యం ఎంత పెద్దదో వర్ణిస్తూ వాల్మీకి ఒకటి తర్వాత 55 సున్నలు చుడితే వచ్చే సంఖ్యంత అని చెప్పి దానికి మహౌఘం అని పేరు పెట్టేడు.

ఈ పేర్లు మనదేశంలో వాడుకలో లేవు కానీ మన దగ్గర ఈ పేర్లు నేర్చుకున్న జపాను వాళ్ళు ఇప్పటికీ వీటిని వాడుతున్నారు. మచ్చుకి ఒకటి తర్వాత 80 సున్నలు వేయగా వచ్చిన సంఖ్యని జపాను వాళ్ళు “పుకషీగీ” అంటారు. పుకషీగీ అంటే “అచింత్యం”. ఒకటి తర్వాత 56 సున్నలు వేయగా వచ్చిన సంఖ్యని “కుగాషా” అంటారు. కుగాషా అంటే “గంగా నది ఒడ్డున ఉన్న ఇసకంత” అని అర్థం.

పేర్లు పెట్టడం అంటూ పెట్టేరు కానీ, ఈ పేర్లలో ఒక బాణీ లేకపోతే జ్ఞాపకం పెట్టుకోవడం కష్టం. అప్పుడు ఒకదానికి మరొక పేరు వాడే ప్రమాదం ఉంది. మన ప్రాచీన గ్రంథాలలో, మచ్చుకి, ఒకటి తర్వాత 12 సున్నలు ఉన్న సంఖ్యని ఒకచోట మహార్బుదం అన్నారు, మరొక చోట న్యర్బుదం  అన్నారు. ఇలాంటి ఇబ్బందుల నుండి తప్పించుకుందికి అధునాతనులు ఒక పద్ధతి ప్రవేశపెట్టేరు. ఈ పద్ధతిలో సంఖ్యల పేర్లలో బాణీ ఈ విధంగా ఉంటుంది. పది, వంద, వెయ్యి మామూలే. తర్వాత కొత్త పేరు ఒకటి తర్వాత ఆరు సున్నలు చుట్టగా వచ్చిన మిలియను. తర్వాత కొత్తపేరు ఒకటి తర్వాత తొమ్మిది సున్నలు చుట్టగా వచ్చిన బిలియను. అలా మూడేసి సున్నలు అధికంగా చేర్చినప్పుడల్లా మరొక కొత్త పేరు. ఈ లెక్కని ఒకటి తర్వాత ఆరు సున్నలుంటే మిలియను, తొమ్మిది ఉంటే బిలియను, 12 అయితే ట్రిలియను, 15 సున్నలకి క్వాడ్రిలియను, తదుపరి క్వింటిలియను, అలా.

బాగానే ఉందయ్యా! ఇవన్నీ “లియను” అనే శబ్దంతో అంతం అవుతున్నాయి. కాని ఈ “లియను” ముందుండే పూర్వప్రత్యయం జ్ఞాపకం పెట్టుకోవడం ఎలా? ఈ పూర్వ ప్రత్యయాలని విడిగా, వరసగా వాటి అర్థాలతో రాసి చూద్దాం.
బి రెండు, ట్రి మూడు, క్వాడ్‌ నాలుగు, క్వింట్‌ అయిదు, సెక్స్‌ట్‌ ఆరు, సెప్ట్‌ ఏడు, ఆక్ట్‌ ఎనిమిది, నవ్‌ తొమ్మిది … అలా అలా వెళుతుందీ వరస. ఈ వరస అర్థం ఏమిటంటే మిలియనుని మూలంగా తీసుకుని ఆ మిలియనుని రెండు సార్లు వేసి హెచ్చవేస్తే వచ్చే సంఖ్య బిలియను, మూడు సార్లు గుణిస్తే వచ్చే సంఖ్య ట్రిలియను, నాలుగు సార్లు గుణకారం చెయ్యగా వచ్చింది క్వాడ్రిలియన్‌, ..

ఆగాలి, కొంచెం ఆగాలి.. ఇక్కడ నేను తప్పేనా చెబుతూ ఉండుండాలి, మీరు తప్పేనా అర్థం చేసుకుని ఉండుండాలి. ఎందుకంటే మిలియనుని రెండు సార్లు వేసి గుణిస్తే ఒకటి తర్వాత 12 సున్నలు వస్తాయి కాని తొమ్మిది రావు. నిజానికి అది నిజమే. బ్రిటిష్‌ వాళ్ళ హయాంలో ఈ ప్రపంచం ఉన్నప్పుడు వాళ్ళు అన్నీ తార్కికంగా ఆలోచించి ఒక పద్ధతిలో పేర్లు పెట్టేరు. ఒకటి తర్వాత 12 సున్నలుంటే దానిని బిలియను అనీ, 18 సున్నలుంటే దానిని ట్రిలియను అనీ, అలా అనుకుంటూ వెళ్ళమన్నారు. అలాగే వెళ్ళేవాళ్ళం. తర్వాత ఈ అమెరికా వాళ్ళు వచ్చేరు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి, పైపెచ్చు ఈ అమెరికా వాడి దగ్గర డబ్బు మస్తుగా ఉంది. దాంతో జబ్బశక్తి, గోరోజనం పుంజుకున్నాయి. తన శక్తిని ప్రపంచానికి చాటడం ఎలా? ఇంగ్లీషువాడు ఎడం పక్కని నడిపితే తను కుడి పక్కన కారు నడుపుతానన్నాడు. ఇంగ్లీషు మాటలకు స్పెల్లింగులు మార్చేస్తానన్నాడు. కొన్నింటికి అర్థాలే మార్చీసీడు. అందుకనే ఈ రోజులలో బిలియను అంటే ఒకటి తర్వాత తొమ్మిది సున్నలే. ట్రిలియను అంటే ఒకటి తర్వాత 12 సున్నలూ, అలాగ వెళుతోంది ఈ బండి. ఈ మార్పు వల్ల వచ్చిన నష్టం ఏమిటంటే పూర్వప్రత్యయాన్ని చూసి ఆ సంఖ్యలో ఎన్ని సున్నలుంటాయో చెప్పడం కష్టం బట్టీ పట్టేయాలి అంతే.

ఈ పేర్లు ఇంకా ఎంత దూరం వెళతాయి? మిలియనుని వంద సార్లు వేసి హెచ్చవేస్తే వచ్చే సంఖ్యని “సెంటిలియన్‌” అనమన్నాడు బ్రిటీషువాడు. అప్పుడు సెంటిలియన్‌ అంటే ఒకటి తర్వాత 600 సున్నలు అని ఠకీమని చెప్పగలిగి ఉండేవాళ్ళం. కాని ఈ అమెరికా వాడి సొద వల్ల ఆ సౌలభ్యం పోయి ఒకటి తర్వాత 303 సున్నలు చుడితే అది సెంటిలియన్‌ అయింది.

వంద మన మస్తిష్కంలో ఎలా పాతుకుపోయిందంటే ఒకటి తర్వాత వంద సున్నలు వేస్తే వచ్చే సంఖ్యకి పేరేమిటి అనే సందేహం ఒకాయనకి వచ్చింది. సరదాగా పొడుపు కథలా కొడుకుని అడిగేడు. ఆ కొడుకుకి మాత్రం ఏం తెలుసు? సరదాగా ఒక పిచ్చి మాట తయారుచేసి “గూగోల్‌” అన్నాడు అదేదో సినిమాలో శివరావు “గిడిగిడి”  అన్నట్టు. ఆ గూగోల్‌ స్థిరపడి పోయింది. ఒకటి తర్వాత గూగోల్‌ సున్నలు చుట్టగా వచ్చిన సంఖ్య? దీన్ని “గూగోప్లెక్స్‌” అనమని మరొక ప్రభృతుడు సలహా ఇచ్చేడు.

నా చిన్నతనంలో నేను నా తమ్ముడు గిరి వీధి వసారాలో కూర్చుని “అంకెల ఆట” ఆడుకుంటున్నాం (ఆ రోజులలో టీవీలు లేవుగా!). ఆట మధ్యలో దారిన పోతున్న తొర్రిపంతులు కలిసేడు.

“మరయితే ఒకటి తర్వాత గూగోప్లెక్సు సున్నలు చుడితే దానిని ఏమంటారండీ?” అన్నాడు. దానికి సమాధానంగా తమ్ముడు గిరి చటాలున “టొర్రిపంతులు” అన్నాడు. అప్పటినుండీ మా ఇంట్లో మాత్రం “అన్నిటి కంటె పెద్ద సంఖ్య ఏమిట్రా?” అని ఎవరైనా అడిగితే దానికి సమాధానం “టొర్రిపంతులు”!
----------------------------------------------------------
రచన: వేమూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో

Saturday, October 27, 2018

విశ్వవిజ్ఞానం - 6


విశ్వవిజ్ఞానం - 6




సాహితీమిత్రులారా!

రేమెళ్ళ అవధానులుగారు
మనకు అందించిన
విశ్వవిజ్ఞానంలోని 6 వ భాగం
వీక్షించండి


Friday, October 26, 2018

అంకెలు, సంఖ్యలు: రెండు


అంకెలు, సంఖ్యలు: రెండు





సాహితీమిత్రులారా!

రెండు కి సంబంధించిన మాటలు తెలుగులో జోడీ, జోడు, జత, జంట, ఇరు, ఉమ్మడి అన్న మాటలలోనూ, సంస్కృతంలో యుగళ, యుగ్మ, ఉభయ, ద్వి, ద్విగు, ద్వంద్వ, ద్వయి, ద్వైత, మొదలైన రూపాలలోను కనిపిస్తాయి.

జోడీలు అంటే జతలు, జంటలు. జోళ్ళు అంటే పాదరక్షలు; ఈ జంటలో ఒకే ఒక దానిని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు దానిని పాదరక్ష అనో, చెప్పు అనో చెప్పవచ్చు. సులోచనాలని కళ్ళజోడు అని మనం అంటే, ముక్కుజోడు అని తమిళులు అంటారు.

ఈరు, ఇరు అంటే రెండు, ఇద్దరు అని రెండర్ధాలు ఉన్నాయి. ఈరారు అంటే 12, ఈరేడు అంటే 14, ఈరెనిమిది 16.

ఇరుకెలకులు, ఇరుచక్కి, ఇరుదిసలు, ఇరువంకలు – ఈ మాటలన్నిటికి ‘రెండు పక్కలు’ అని అర్ధం.

ఇరుగు, పొరుగు వారితో సఖ్యంగా ఉండాలంటే వారితో ఉమ్మడి వ్యాపారం చెయ్యటం అంత మంచిది కాదేమో.

యుగళ గీతం అంటే ‘డూయట్‌’ లేదా ఇద్దరు పాడే పాట. ఈ ఇద్దరిలోను ఒకరు ఆడ, మరొకరు మగ అవాలని నిబంధన ఉందో, లేదో నాకు తెలియదు.

యుగళ అనే మాట యుగ్మం లోంచి వచ్చింది. పూజ చేసేటప్పుడు ‘వస్త్రయుగ్మం సమర్పయామి’ అన్నప్పుడు, పంచ, కండువా కాని, చీర, రవికల గుడ్డ అని కాని మనం అర్ధం చేసుకోవాలి.

ఈ యుగ్మం లోంచి వచ్చినదే యోగ అన్న మాట. యోగం అంటే మనస్సునీ, శరీరాన్నీ సంధించటం. అంటే మనస్సు అధీనం లోకి శరీరాన్ని తీసుకురావటం. ఈ ప్రక్రియలో యోగాసనాలు ఒక చిన్న భాగం మాత్రమే.

స్త్రీ యొక్క అండంతో పురుషుడి బీజం సంయోగం చెందిన తర్వాత మిగిలేదే యుగ్మం + అండం = యుగాండం, లేదా ఇంగ్లీషులో ‘జైగోట్‌’. మనం బజారులో కొనుక్కునే కోడిగుడ్డు అండమా, యుగాండమా అని నాకు ఇప్పటికీ అనుమానం నివృత్తి కాలేదు.

రెండు వేదాలు చదివిన పండితుడు ద్వివేది. వేదుల, ద్వివేదుల అన్న ఇంటిపేర్లు తెలుగు వారిలో బాగానే కనిపిస్తాయి కాని, త్రివేదుల, చతుర్వేదుల కొంచెం తక్కువ, మనలో. ఉత్తరాది వారిలో త్రివేదీ, చతుర్వేదీ బాగా కనిపిస్తారు. ఆంధ్ర రాష్ట్రపు మొదటి గవర్నరు పేరు త్రివేది. వేదుల వారు మాత్రం ఒంటి వేదుల వారే.

రెండు భాషలు వచ్చిన ఆసామీ దుబాసీ. ఇదే మాటని ‘ట్రాన్స్‌లేటర్‌’ అన్న అర్ధంలో మనం వాడేస్తూ ఉంటాం. ఒక భాషని మరొక భాష లోకి తర్జుమా చెయ్యటం ఏమీ ఆషామాషీ వ్యవహారం కాదు.

వైష్ణవుడు అయినవాడు జపించవలసిన మంత్రాలలో ద్వయం ఒకటి. “శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయనమః” అనేది ద్వయ మంత్రం. దీనినే మంత్రరత్నం అని కూడ అంటారు.

మధ్వాచార్యులవారు స్థాపించిన శాఖ ద్వైతం. అహం బ్రహ్మస్మి అంటే వీరు ఒప్పుకోరు. జీవాత్మ, పరమాత్మ ద్వివిధమైన ఆత్మలు అని వీరి సిద్ధాంతం.

మహాభారతంలో ద్వైతవనం అనే అడవి కనిపిస్తుంది. కాని ఈ అడవిలో ఉన్న ద్వైతం ఏమిటో?

కలనేత వస్త్రాన్ని హిందీలో ‘దోరంగి’ అంటారు. అంటే రెండు రంగుల బట్ట. ఈ ‘దో’ లోంచి వచ్చినదే ‘దోయి’. కనుదోయి, చనుదోయి అన్నవి తెలుగు మాటలే. రెండు చేతులని కలిపి దొన్నెలా చేస్తే వచ్చేది దోయిలి. దీన్నే మనం దోసిలి అని కూడ అంటాం.

కంప్యూటర్లు వాడకం లోకి వచ్చేక ద్వియాంశ (‘బైనరీ’) పద్ధతి పరపతి పెరిగింది; అంతవరకు అంకెలని దశాంశ పద్ధతిలోనే లెక్కించేవారు.

ద్వితీయం అంటే రెండవది. కాని, రెండవ పెళ్ళి అన్న అర్ధం లోనే ఎక్కువగా వాడతారు. అద్వితీయం అంటే మొదటిది అనే అర్ధం – మొదటి పెళ్ళి అని కాదు.

జీవశాస్త్రం లో ప్రతి జంతువుకీ, మొక్కకీ ద్వినామ (‘బైనరి’) పద్ధతిలో పేర్లు పెడతారు; మొదటిది జాతి పేరు, రెండవది శాల్తీ పేరు. మనకి ఇంటి పేరు, పెట్టిన పేరు ఉన్నట్లే ఇది కూడ.

ద్విత్వాక్షరం అంటే ఒక అక్షరం కింద మరొకటి రావటం. ద్విత్వాక్షరం అన్న మాటలో మూడు ద్విత్వాక్షరాలు ఉన్నాయి. ఒక అక్షరం కింద అదే అక్షరం పునరుక్తం అయితే అది ద్విరుక్తాక్షరం. అమ్మ, అక్క, కర్ర, కప్ప మొదలైన మాటలలో రెండవ అక్షరాలు ద్విరుక్తాక్షరాలు. ద్విత్వానికీ, ద్విరుక్తానికీ మధ్య ఉన్న ఈ తేడాని చాల మంది గమనించరు.

ద్విరదం అంటే రెండు కోరలు కలది. – ఏనుగు. రెండు కోరలు కల జంతువులు ఇంకా ఉన్నాయి కాని, సందర్భ శుద్ధి లేనప్పుడు ఏనుగనే చెప్పుకోవాలి. ద్విజిహ్వులు అంటే రెండు నాలుకలు గల మనుష్యులు. అమెరికా రాజకీయ నాయకులు ఒకళ్ళకి చెయ్యమని చెప్పేది ఒకటి, వారు చేసేది మరొకటి కనుక వీరిని ద్విజిహ్వులు అంటే నేను ఏమీ అనుకోను. నేనిలా అన్నానని మనం అమెరికా వాళ్ళ మీద విరుచుకు పడిపోనక్కర లేదు. మన వాళ్ళు ఏమీ తక్కువ కాదు; వారి కంటె వీరు రెండాకులు ఎక్కువ చదివిన వారే.

ద్విపద అంటే రెండు పాదాలు కల ఒక పద్య విశేషం.

ద్విరేఫం అంటే రెండు ‘రేఫ’లు – అనగా ‘ర’ కారాలు – కలది, బ్రమరం. దీనినే మనం తుమ్మెద అని కూడ అంటాం. ఇది ఒక జాతి తేనెటీగ.

ద్విజం అంటే రెండు జన్మలు కలది. గుడ్డు లోంచి పుట్టిన జీవులన్నీ ద్విజములే. మానవులలో రెండు సార్లు పుట్టిన వారు ద్విజులు – అనగా ఉపనయనం అయిన వారు.

రెండు జడల సీతని ద్విజడ అనొచ్చు కానీ, రెండు జడల సీత అంటేనే బావుంటుంది.

నదిలో రెండు వైపులా నీరుండి మధ్యలో నేల ఉంటే అది ద్వీపం. ద్వీపం లో పుట్టిన వాడు ద్వైపాయనుడు. అలా పుట్టిన వాడు నల్లగా ఉంటే అతగాడు కృష్ణద్వైపాయనుడు అవుతాడు. వ్యాసుడు పేరు లేని వాడు; అతని తల్లిదండ్రులు పేరు పెట్టే లోగానే అడవులలోకి తపస్సు చేసుకుందికి వెళ్ళిపోయేడు. ద్వీపంలో పుట్టిన నల్లవాడు కదా అని మొదట్లో కృష్ణద్వైపాయనుడు అని పిలచే వారు. దరిమిలా వేదాలని సంస్కరించి వ్యాసుడైనాడు.

రెండర్ధాలు ఉన్న పద్యాన్ని ద్వ్యర్ధి అంటారు.

ద్విచక్కెర అంటే రెండు చక్కెరలు కలసి ఉన్న పదార్ధం. మనం కాఫీ లో వేసుకునే పంచదారలో గ్లూకోజు, ఫ్రూక్టొజు అనే రెండు చక్కెరలు ఉన్నాయి కనుక అది ద్విచక్కెరే.

ఎలక్త్రానిక్స్‌ లో తారసపడే కొన్ని శూన్య నాళికలో ఒక ఏనోడు, ఒక కేథోడు ఉంటాయి కనుక వీటిని ‘ద్వియోడు’ అనాలని నా గోడు.

ద్విగుణీకృతం అంటే రెట్టింపు చెయ్యటమే కాని, ద్విమాత్రకం అంటే రెండు కొలతలు కలది అని అర్ధం. దీనిని ఇంగ్లీషులో ‘టు డైమెన్షనల్‌’ అంటారు.

రెండు కి సంబంధించిన మాటలు ఇంగ్లీషులో కొల్లలు. రెండుని ఇంగ్లీషులో ‘టు’ అంటాం. ఈ ‘టు’ స్పెలింగు ‘టి, డబల్‌యు, ఒ’. ఈ మూడింటిలో మొదటి రెండక్షరాలు అయిన ‘టి. డబల్‌యు’ లు పక్క పక్కని ఎప్పుడు వచ్చినా ‘రెండు’ అనే అర్ధం స్పురిస్తుంది. ‘ట్వైలైట్‌’ అంటే పగలు కాదు, రాత్రి కాదు; ఈ రెండింటికి మధ్య ఉన్న సంధ్య వేళ. ‘ట్వైన్‌’ అంటే రెండు పేటలు వేసి పేనిన దారం. మనం మరచి పోయేం కాని, దీనినే తెలుగులో జమిలిదారం అనేవారు. ‘ట్విల్‌’ అంటే రెండు రకాల దారాలతో నేసిన బట్ట. ఒక కొమ్మ చీలి రెండుగా అయితే వచ్చినది ‘ట్విగ్‌’.

‘బి’, ‘బిస్‌’, ‘బై’, అనే ప్రత్యయాలని జోడించి, ‘రెండు’ మాటలని ఎన్నో తయారు చెయ్యవచ్చు. రెండు సార్లు (లేదా, రెండు వైపులా) ఉడికించినది కనుక ‘బిస్కట్‌’ అన్నారు. రెండు పక్కలా కాల్చిన అట్టు కనకనే మన దోశ లోని ‘దో’ వచ్చిందేమో అని నాకు చిన్న ధర్మ సందేహం వస్తున్నాది. రెండు కళ్ళకీ అమరే పరికరం కనుక ‘బైనాక్యులర్స్‌’ అయింది. రసాయన శాస్త్రం లో రెండింతలు అనటానికి ‘బిస్‌’ అనే పూర్వ ప్రత్యయం వాడతారు.

రెండు సమభాగాలుగా విడదీసినప్పుడు ‘బైసెక్ట్‌’ అన్న మాటని వాడతాము గాని ఇక్కడ రెండుగా విడతీయటంలో చెడు ఏమీ జరగలేదు. కాని, ‘డై, డిస్‌’ అనే ప్రత్యయాలు వాడినప్పుడు చీల్చటం, విడదీయటం అనే అర్ధాలు వస్తాయి కాని, ఇక్కడ ఈ విడతీయటం మంచిది కాదు అనే అర్ధం స్పురిస్తుంది. ఏ కీలుకా కీలు కోసేసేపద్ధతిని ఇండియాలో ‘డిస్సెక్ట్‌’ అనీ, అమెరికాలో ‘డైసెక్ట్‌’ అనీ అంటారు. ఈ జాతికి చెందిన మాటలే ‘డిస్రప్ట్‌’, ‘డిస్టర్బ్‌’, ‘డివోర్స్‌’ మొదలైనవి.

డూప్లికేట్‌ అంటే జతలో ఒకటి. ఇదే మాటని మనం ‘నకలు’ అనే అర్ధం లో వాడతాం. ‘అసలు’ రైలు బండి ఏ కారణం చేతనైనా ఆగిపోతే దాని స్థానంలో వచ్చే మరొక బండిని ‘డూప్లికేటు’ అనే వాళ్ళం – నా చిన్న తనం లో. .

‘డూస్‌’ అంటే రెండు. టెన్నిస్‌ లో ‘డూస్‌’ అన్నప్పుడు, మరి రెండు ‘పాయింట్లు’ వరుసగా ఎవ్వరు గెలిస్తే వారు ఆట గెలిచినట్లు.

‘బైసెక్ట్‌’ గురించి మరొక విషయం. వృత్తలేఖిని, కొలబద్ద సహాయంతో ఒక గీతని కాని, కోణాన్ని కాని సమద్విఖండన చేయవచ్చని రేఖాగణితంలో దిట్టలయిన గ్రీకులు ఎప్పుడో కనుక్కున్నారు.

గణితంలో రెండుకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రథాన సంఖ్యలలో ఇదొక్కటే సరి సంఖ్య; మిగిలినవి అన్నీ బేసి సంఖ్యలే. రెండు ఫిబొనాచీ సంఖ్య. రెండు రెళ్ళని కలిపినా, గుణించినా నాలుగే వస్తుంది. ఇదే విధంగా ఏ అంకెని మూడు సార్లు వేసి కలిపినా, గుణించినా ఒకే సమాధానం వస్తుందో చెప్పుకోండి, చూద్దాం. కావలిస్తే కాగితం, కలం వాడండి.

రెండు యొక్క వర్గమూలాన్ని పైథోగొరోస్‌ సంఖ్య అంటారని చెప్పుకున్నాం కదా. దీనిని ఏ రెండు సంఖ్యల నిష్పత్తి గాను రాయలేము కనుక ఇటువంటి సంఖ్యలని అనిష్ప సంఖ్యలు (‘ఇర్రేషనల్‌ నంబర్స్‌’) అంటారు. ఇక్కడ ‘ఇర్రేషనల్‌’ అన్నప్పుడు తర్కాభాసమని కాకుండా ‘రేష్యో’ (నిష్పత్తి) కాని’ అని తాత్పర్యం చెప్పుకోవాలి.

ఈ అధ్యాయం ముగించే లోగా అంకెల మాటలతో చిన్న చెలగాటం ఆడదాం. ఈ దిగువ చూపిన అంకెల వరస (‘సీక్వెన్స్‌’) వెనక ఉన్న వరస (తర్కం) ఏమిటో చెప్పుకొండి చూద్దాం.

1, 11, 21, 1211, 111221, 312211, 1311221, …

సమాధానం: కొద్ది సేపు ఆలోచించినా చెప్పుకోలేక పోతేనే ఈ దిగువ ఇచ్చిన సమాధానం చూడండి. ఈ ఆట ఇంగ్లీషులో బాగా రాణిస్తుంది. తెలుగులో కూడ ప్రయత్నించి చూద్దాం. ఇక్కడ లెక్కల ‘ట్రిక్కు’ ఏమీ లేదు. మాటలతో చెలగాటమే. కొంచెం సేపు ఆలోచించి సమాధానం తెలియకపోతేనే దిగువ ఇచ్చిన సమాధానం చదవండి.

మొదటి అంకె ఒకటి కదా. దీనిని ‘ఒక ఒకటి’ అని తెలుగులోనూ, ‘వన్‌ వన్‌’ అని ఇంగ్లీషు లోనూ అంటాము కదా. ఇంగ్లీషులో ‘వన్‌ వన్‌’ అని అన్నప్పుడు, మొదటి వన్‌ విశేషణం, రెందవది విశేష్యం. ఇప్పుడు ఈ రెండీంటిని విశేష్యాలుగానే భావిస్తే ‘వన్‌ వన్‌’ కాస్తా 11 అవుతుంది. అవునా?

ఇప్పుడు 11 ‘రెండు ఒకట్లు’ లేదా ‘టు వన్స్‌’ కనుక దీనిని ‘21’ అని రాయవచ్చు. ఇప్పుడు ఈ ‘21’ ని ‘ఒక రెండు, ఒక ఒకటి,’ అనొచ్చు. దీనినే ఇంగ్లీషులో అంటే, ‘వన్‌ టు, వన్‌ వన్‌’ అవుతుంది. ఇదే తర్వాత వచ్చే సంఖ్య – 1211.

ఈ 1211 ని వన్‌ వన్‌, వన్‌ టు, టు వన్స్‌’ అందాం. ఇందులో మొదటి ‘వన్‌ వన్‌ ని 11 గా రాద్దాం. అలాగే ‘వన్‌ టు’ ని 12 గా రాద్దాం. ‘టు వన్స్‌’ కి బదులు 21 అని రాద్దాం. ఇప్పుడు వీటన్నిటినీ గుత్తగుచ్చితే 111221 వస్తుంది. తమాషాగా లేదూ?
----------------------------------------------------------
రచన: వేమూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో

Thursday, October 25, 2018

విశ్వవిజ్ఞానం - 5


విశ్వవిజ్ఞానం - 5




సాహితీమిత్రులారా!

రేమెళ్ళ అవధానులుగారు
మనకు అందించిన
విశ్వవిజ్ఞానంలోని 5 వ భాగం
వీక్షించండి

Wednesday, October 24, 2018

అంకెలు, సంఖ్యలు : అర్ధగర్భితమైన శ్లోకాలు


అంకెలు, సంఖ్యలు : అర్ధగర్భితమైన శ్లోకాలు





సాహితీమిత్రులారా!

పెద్ద పెద్ద సంఖ్యలంటే మనవాళ్ళకి బొత్తిగా భయం లేదని గతంలో ఒకసారి చెప్పేను. పెద్ద పెద్ద సంఖ్యలని కుదించి చిన్న చిన్న మాటలలో చెప్పడంలో మన పూర్వీకులు దిట్టలు. సంఖ్యలని చిన్న చిన్న మాటలలో కుదించి చెప్పవలసిన అవసరం ఎందుకొచ్చిందో ముందు చెబుతాను.

కాగితాలు, ముద్రణాయంత్రాలు లేని అనాది కాలంలో మన సంస్కృతిని విజ్ఞానసంపదని తరతరాల పాటు కాపాడి మన పూర్వులు మనకి అందించేరు. మరే టెక్నాలజీ లేని రోజులలో విజ్ఞానాన్ని కంఠతా పట్టడం ఒక్కటే వారికి తెలిసిన మార్గం.మన వర్ణాశ్రమ ధర్మంలో ఈ కంఠతా పట్టే పనిని బ్రాహ్మణులకి అప్పగించేరు. కొంతమంది బ్రాహ్మణ బాలురు జీవితాంతం చెయ్యవలసిన పని ఇదే. వాళ్ళని “లివింగ్‌ రికార్డర్లు” అనో, సజీవ గ్రంథాలయాలు అనో అన్నా అతిశయోక్తి కానేరదు. వాళ్ళు కంఠస్థం చేసే శ్లోకాలు వాళ్లకి అర్థం అయితే మరీ మంచిది, కాని అర్థం కానక్కర లేదు. స్వరం తప్పకుండా, శబ్దదోషం లేకుండా కంఠతా పట్టడం, ఆ  తర్వాత అదే విషయం కొడుకులకో, శిష్యులకో నేర్పడం. వీళ్ళు ఇలా శ్లోకాలు వల్లెవేస్తూ కూర్చుంటే కడుపు నిండేదెలా? అందుకని ఈ “ఓరల్‌ ట్రెడిషన్‌”ని రక్షించడం కొరకు రాజులు బ్రాహ్మణులని పోషించడం మొదలుపెట్టేరు. ఇలా కొన్ని శతాబ్దాల పాటు జరిగింది.

తరువాత తాటేకు మీద ఘంటంతో వ్రాయడం నేర్చుకున్నారు. తాళపత్రగ్రంధాలతో “ఇంటింటా ఒక స్వంత గ్రంధాలయం” నిర్మించడానికి అవకాశాలు తక్కువ. కనుక కంఠస్థం చెయ్యడం అనేది మన విద్యావిధానంలో ఒక ముఖ్యాంశం అయిపోయింది.

వచనాన్ని కంఠస్థం చెయ్యడం కంటె పద్యాన్ని కంఠస్థం చెయ్యడం తేలిక. అందుకనే ఆర్యభట్టు, భాస్కరాచార్యులు మొదలైన వారంతా గణితాన్ని కూడ శ్లోకాలలోనే రాసేరు. పద్యంలో బిగుతు వుండాలి. పైగా విశాలమైన భావాన్ని క్లుప్తంగా పద్యపాదంలో ఇరికించాలి. అందుకని మనవాళ్ళు ఒక సంక్షిప్త లిపి (“కోడ్‌”)ని తయారుచేసుకున్నారు. గణితశాస్త్రంలోని సునిశితమైన విషయాలని ఆ సంక్షిప్తలిపి లోనికి మార్చి, వాటిని ఛందస్సుకి సరిపడా పద్యపాదాలలో ఇరికించేసరికి వాటిలోని గూఢార్థం మన బోంట్లకి అందుబాటులో లేకుండాపోయింది. అంతేకాని ఎవ్వరికీ తెలియకుండా విద్యని, విజ్ఞానాన్ని రహస్యంగా దాచాలనే బుద్ధి మన సంస్కృతిలో లేదు.

వేదమంత్రాల పరిస్థితి కూడ ఇటువంటిదే అయివుంటుంది. మన పురాతన గ్రంధాలని కూలంకషంగా అర్థం చేసుకోవాలంటే భాష, వ్యాకరణం అర్థమైనంత మాత్రాన సరిపోదు. వారు కాచివడపోసిన సూత్రాలలోని గూఢార్థాలు కూడ అర్థం అవాలి. ఇలా గూఢభాషలో, లేదా సంక్షిప్తలిపిలో, రాయడం కంఠోపాఠం చెయ్యడానికి అనుకూలిస్తుందనే చేసేరు కాని విద్యని నలుగురికీ పంచిపెడితే “ఇంటలెక్య్టువల్‌ ప్రోపెర్టీ”కి నష్టం వస్తుందని కాదు. ఇలా “ఇంటలెక్య్టువల్‌ ప్రోపెర్టీ” వంటి ఊహలు ఎవ్వరి పుర్రెలోనైనా పుడితే వాళ్ళని నిరుత్సాహపరచడానికో ఏమో “తనకి వచ్చిన విద్యని శిష్యులకి బోధించకపోతే గురువు బ్రహ్మరాక్షసుడు అవుతాడు” అని ఒక లోకప్రవాదం కూడ లేవదీశారు.

ఇక, ఈ ఉపోద్ఘాతాన్ని కట్టిపెట్టి, ఉదాహరణకి ఆర్యభట్టీయం అనే గణితశాస్త్ర గ్రంధం లోని పన్నెండవశ్లోకాన్ని పరిశోధించి చూద్దాం.

మఖీ భఖీ ఫఖీ ధఖీ ణఖీ ఞ్‌ఖీ
ణఖీ హస్‌ఝ స్కకీ కిష్గ ఘఖీ కిఘ్వ
ఘ్లకీ కిగ్ర హక్య ధకీ కిచ
స్గష్జ ణ్వ క్లప్త ఫ ఛ కళార్థ జ్యా

ఈ శ్లోకంలో ఆఖరిపదం ఒక్కటే సంస్కృతం; మిగిలిన 24 పదాలూ 24 శబ్దసముదాయాలు. వీటిలో ప్రతి శబ్దసముదాయం ఒక అంకెని కానీ సంఖ్యని కానీ సూచిస్తుంది. ఆ అంకెలన్ని “జ్యా” అనే రేఖాగణిత భావాన్ని నిర్వచించడానికి ఉపయోగపడతాయి. మనం ఈ రోజులలో “ట్రిగొనామెట్రీ”లో వాడే “సైను” యొక్క నిర్వచనం ఈ శ్లోకంలో గూఢమైన పద్ధతిలో నిబిడీకృతమై ఉంది. ఈ పద్ధతి కూడ ఆర్యభట్టు ప్రవేశపెట్టినదే అయి ఉండవచ్చు.

తెలుగు లోనూ సంస్కృతం లోనూ 25 హల్లులని ఐదు వర్గాలుగా విడగొట్టి రాస్తాం కదా. క, ఖ, గ, ఘ, ఙ్‌  లని కవర్గు అనీ, చ, ఛ, జ, ఝ, ఞ్‌ లని చవర్గు అనీ, ట, ఠ, డ, ఢ, ణ లని టవర్గు అనీ, త, థ, ద, ధ, న లని తవర్గు అనీ, ప, ఫ, బ, భ, మ లని పవర్గు అనీ పిలుస్తారు. ఈ హల్లులకి 1, 2, 3, .. 25 అనే విలువలని వరుసగా ఆపాదిద్దాం. ఇదే విధంగా య లగాయతు హ వరకు ఉన్న య, ర, ల, వ, శ, ష, స, హ లకి 30, 40, 50, 60, 70, 80, 90, 100 అనే విలువలని వరుసగా ఆపాదిద్దాం.

ఇక మిగిలిపోయినవి సంస్కృతంలోని అచ్చులు. వీటి విలువలు ఈ దిగువ చూపిన పద్ధతిలో ఇద్దాం.

అ, ఆ  : 100  **   0 = 1
ఇ, ఈ  : 100  **   1 = 100
ఉ, ఊ  : 100   **   2 = 10 000
ఋ, ౠ  : 100   **   3 = 1 000 000
ఌ, ౡ : 100   **   4 = 1 తర్వాత 8 సున్నలు
ఏ    : 100  **   5 = 1 తర్వాత 10 సున్నలు
ఐ   : 100   **   6 = 1 తర్వాత 12 సున్నలు
ఓ   : 100   **   7 = 1 తర్వాత 14 సున్నలు
ఔ    : 100   **   8 = 1 తర్వాత 16 సున్నలు

ఈ పద్దతిలో లెక్కపెట్టడం ఎలాగో చూద్దాం. ముందుగా గుణింతాలని చూద్దాం.

క = క్‌   *    అ = 1   *   1 = 1
కి = క్‌   *    ఇ = 1   *    (100   **    1) = 100
గు = గ్‌  *   ఉ = 3  *    (100   **    3) = 30 000

ఇదే విధంగా ద్విత్వాక్షరాల విలువలని పరిశీలిద్దాం.

గ్న = గ్‌   +  న = 3  +    20 = 23
గ్ను = (గ్‌  +   న)  *    ఉ = 23   *   (100   **   2)
ఖ్యుఘృ = ఖ్యు   +   ఘృ =  (2  +   30)   *   (100   **   2)  +   4  *   (100   **   3) = 4 320 000

ఇలా అంకెల స్థానంలో అక్షరాలు వాడి, ఆ అక్షరాలతో మాటలు పేర్చి, ఆ మాటలతో శ్లోకాలు కూర్చి, ఆ శ్లోకాలని కంఠస్థం చేసి, మనవాళ్ళు వాళ్లకి తెలిసిన పరిజ్ఞానాన్ని మనకి అందించేరు.

ఇంతవరకు వచ్చిన తర్వాత పైన చూపిన శ్లోకానికి అర్థం చెప్పకపోతే ఏమి మర్యాదగా ఉంటుంది? ఒక వృత్తంలో నాల్గవభాగాన్ని తురీయం అంటారు. ఇంగ్లీషులో అయితే “క్వాడ్రెంట్‌”. ఈ తురీయంలో ఉన్న 90 డిగ్రీలని 24 సమభాగాలు చేస్తే ఒకొక్కభాగం 3.75 డిగ్రీలు. ఈ డిగ్రీలని 60 పెట్టి గుణిస్తే 225 నిమిషాలు వస్తాయి. అవునా?

ఇప్పుడు మన శ్లోకం లోని మొదటిమాట “మఖీ” విలువ ఎంతో కడదాం.

మఖీ = 25   *   (100   **   0)    +    (2  *   100) = 225

కనుక “మఖీ” అంటే ఒక వృత్తంలోని తురీయంలో 24వ వంతు. ఇలాగే శ్లోకం అంతా ఓపిక పట్టి అర్థం చేసుకోవచ్చు.

ఇదే విధంగా వేదాలలో ఉన్న మంత్రాలు కూడ అర్థగర్భితమైనవి. ఆ సూక్ష్మం కూడ పరిశోధన చేసి కనుక్కోవచ్చు.

ఇలా అంకెలకి బదులు అక్షరాలు వాడడంలో ఆర్యభట్టు ప్రత్యేకత ఏమీ లేకపోవచ్చు. ఆర్యభట్టు కాలం (క్రీ.శ. 500) నాటికి ఈ పద్దతి గ్రీకులకి, రోమనులకీ తెలుసు. ఆర్యభట్టు పద్ధతిలో చెప్పుకోదగ్గ అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ దశాంశపద్దతిలో లెక్కించడం, స్థానబలం సూత్రం ఉపయోగించడం గమనించదగ్గ విషయాలు. ఆ రోజులలో ఈ రెండు భావాలు ఎవ్వరికీ తెలియవు. రెండవ విషయం, అచ్చులకీ, హల్లులకీ వివిధమైన విలువలని ఇచ్చి గుణింతాల ద్వారా పెద్ద పెద్ద సంఖ్యలని సృష్టించి, వాటిని ఛందోబద్ధం చేసి శ్లోకాలుగా వ్రాయడం.

ఇంతకీ మనవాళ్ళకి పెద్ద పెద్ద సంఖ్యలంటే ఎందుకు భయం లేకపోయింది? దీనికి శాస్త్రీయంగా సమాధానం చెప్పలేను కానీ, కొంతవరకు ఊహాగానం చెయ్యగలను. ఏమీలేకపోవడం అనే భావానికి సున్న అని పేరుపెట్టి గణితశాస్త్రంలో ఒక సంచలనం లేవదీశారు మనవాళ్ళు. అలాగే అంతులేకుండా లెక్కపెట్టడానికి “అనంతం” అనే భావాన్ని సృష్టించేరు. ఈ రెండూ ప్రాయోగికమైన అవసరాలు తీర్చుకుందికి సృష్టించినవి కాకపోవచ్చు. ఈ అవసరం తార్కికంగా వచ్చి ఉండవచ్చు. ఒకటికి ఒకటి కలిపితే రెండు వస్తుందని తెలిసిన తర్వాత, తాడి తన్నే వాడి తల తన్నేవాడుంటాడని తెలిసిన తర్వాత, పరంపరానుగతంగా, పుంఖానుపుంఖాలుగా వచ్చే సంఖ్యలకి అంతు ఉండదని ఊహించడం ఇప్పటి వెనుక చూపుతో తేలికే కాని ఆ రోజులలో ఇది పెద్ద ఘనకార్యమే అయి ఉంటుంది.

(20 27 డిసెంబరు 2001 “నేచర్‌”, పేజీ 851 లో ప్రచురించబడ్డ రొడ్డం నరసింహ గారి వ్యాసం సహాయంతో)
----------------------------------------------------------
రచన: వేమూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, October 23, 2018

విశ్వవిజ్ఞానం - 4


విశ్వవిజ్ఞానం - 4




సాహితీమిత్రులారా!

రేమెళ్ళ అవధానులుగారు
మనకు అందించిన
విశ్వవిజ్ఞానంలోని 4 వ భాగం
వీక్షించండి

Monday, October 22, 2018

మన భాషలో అంకెలు, సంఖ్యలు


మన భాషలో అంకెలు, సంఖ్యలు



సాహితీమిత్రులారా!

“అంకెలు నా సంగడికాళ్ళు” అన్నాడు, గణితంలో నభూతో నభవిష్యతి అనిపించుకున్నమహా మేధావి శ్రీనివాస రామానుజన్‌.

సంగడికాడు అంటే స్నేహితుడు కనుక అంకెలు రామానుజన్‌స్నేహితులుట! అప్పడాలలాంటి ఎక్కాలు కంఠస్తం చెయ్యలేని మనలాంటి అర్భకులకి ఇనపగుగ్గిళ్ళలాంటి రామానుజన్‌స్నేహితులు కొరుకుడుబడతారా? అందుకని పాలల్లో నానబెట్టినపేలాల లాంటి అంకెలతో సరిపెట్టుకుందాం ప్రస్తుతానికి.

తెలుగులో అంకెలు, సంఖ్యలు అన్న రెండు మాటలు ఉండడం ఉన్నాయి కానీ వీటివాడకంలో నిర్దిష్టత అంతగా లేదు. సున్న నుండి తొమ్మిది వరకూ ఉన్న వాటిని”అంకెలు” అనాలనీ, ఆ పైన ఉన్న వాటిని “సంఖ్యలు” అనాలనీ ఒక నియమం ఉందికానీ ఈ నియమాన్ని అప్పుడప్పుడు ఉల్లంఘించక తప్పదు.

భాష పుట్టుకకి ముందే అంకెలు పుట్టుంటాయనే అనుమానం కొందరిలో లేక పోలేదు.ఇది నిజమైనా కాకపోయినా “అంకెల మాటలు” మాత్రం మనం మాట్లాడే భాషలలోకొల్లలుగా కనిపిస్తాయి. మన దేశంలో తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు అనే మూడుభాషలనీ తప్పించుకుని బ్రతకలేము కనుక ఇక్కడ భాష అంటే ఈ మూడు భాషలూఅని గ్రహించునది.

తెలుగు, సంస్కృత భాషలలో ద్విగు సమాసం అని ఒకటుంది. సమాసం అంటేమాటల కలయిక. ఈ మాటల్లో మొదటి మాట సంఖ్యావాచకం అయితే అది ద్విగు సమాసం. ముల్లోకములు,నలుదిశలుమొదలైన ద్విగు సమాసాలు మన భాషలో ఎన్నో ఉన్నాయి.

అంకెల మాటలే కాదు. ప్రతి భాషలోనూ అంకెల పాటలు కూడ ఉంటాయి. . ఉదాహరణకితెలుగులో “ఒకటి ఓ చెలియ .. రెండూ రోకళ్ళు .. మూడూ ముచ్చిలక .. నాలుగూనందన్న” అన్న అంకెల పాట చాలా మందికి తెలిసే ఉంటుంది.

ముందు “ఒకటి” తో మొదలు పెడదాం.

1

“ఒక”నే కొందరు “వక” అనీ, మరికొందరు “వొక” అనీ రాస్తారు కానీ “ఒక”ఒప్పు, మిగిలిన రెండు ప్రయోగాలూ తప్పు అని నాదొక అభిప్రాయం. మరియొక అభిప్రాయానికి మరొకరిని సంప్రదించిచూడండి.

“ఒక”కి సంక్షిప్త రూపం “ఓ”. “ఒకటీ ఓ చెలియ” అనే పాటలో “ఒకటీ” అన్నదిఅంకెని సూచిస్తుంది. “ఓ” అన్నది “ఒక” అనే అర్థాన్ని ఇస్తుంది.

“ఒక” అన్నా “ఒంటి” అన్నా ఒకటే అర్థం. అందుకనే “ఒకటికి” అన్నా “ఒంటేలుకి” అన్నా ఒకటే.

“ఒంటరి” అంటే ఎవరి తోటీ సాంగత్యం లేకుండా ఉన్న వాడనో, కాక పెళ్ళి కానివాడనో, నాతిగల బ్రహ్మచారి అనో అర్థం స్ఫురిస్తుంది. ఒంటరులు ఒక కులం. సైన్యంలో పదాతులని కూడ ఒంటరులుఅనే అంటారు. సైనికదళంలో ఉన్న వాళ్ళు ఒంటరి వాళ్ళు ఎలాగవుతారు? పూర్వం ఒంటరుల కులం వాళ్ళు సైన్యంలోచేరేవారో ఏమో!

“ఒకేఒక” అని నొక్కి వక్కాణించవలసి వస్తే “ఒక్క” అని “క” ని నొక్కి పలికితేసరిపోతుంది. లేక “ఒక్కగానొక్క” అని అనొచ్చు.

“ఒకానొక” అంటే “ఏదో ఒక” అనే అర్థం స్ఫురిస్తుంది. ఒకప్పుడు అంటే ఒక వేళ,ఒక నాడు, మొదలైన అర్థాలు చెప్పుకోవచ్చు కదా. కాని “ఒక వేళ” అన్నప్పుడు “అయితే గియితే” అనే అర్థంకూడ వస్తుంది.

“ఒండు” అంటే కన్నడంలోనే కాదు తెలుగులో కూడా “ఒకటే”. నా మాట మీద నమ్మకంలేకపోతే “ఒండొరులు” అనే ప్రయోగం చూడండి.

రాముడికి ఒక భార్య, ఒక మాట, ఒక బాణం. రాముడిలా జీవితాంతం ఒకేఒకభార్య ఉంటే, వాళ్ళు ఏక పత్నీ వ్రతులు.ఒకొక్క రోజుకి ఒకొక్క భార్య చొప్పున మారుతూ వుంటే, వాళ్ళు ఏక పత్నీ వ్రతులుకారు. వాళ్ళని ఏమనాలో నాకు తెలియదు.

ఒకే కడుపున పుట్టిన వారు ఏకోదరులు. ఒకే ఒక అంకం ఉన్న నాటకాలని ఏకాంకికఅంటారు. ఒకే రకం పంటని సాగు చేస్తే దానిని ఏకసాయం అంటారు. రక రకాల పంటలని సాగు చేస్తేఅది వ్యవసాయం అవుతుందేమో!

“ఏక” సంస్కృతం అయినప్పటికీ తెలుగు వాడుకలో “ఒక” మాటల కంటే “ఏక”మాటలే ఎక్కువ.

“ఏక” కానిది “అనేక” కనుక చాలా రోజులు “అనేక దంతం భక్తానాం” అంటేఎక్కువ దంతాలు (పళ్ళు) ఉన్న మనలాంటి భక్తులు అనుకునే వాడిని. కాదుట!

ఇలా “ఏక” తోక దగ్గర వచ్చే పదాలకి “ప్రత్యేక”, “తదేక” అనేవి మరొకరెండు ఉదాహరణలు.

“ఒంటరితనం” అంటే అభీష్టానికి వ్యతిరేకంగా ఏకాంతంగా ఉండడం. “ఏకాంతం”అంటే కోరుకుని ఒంటరిగా ఉండడం.

ఒంటరిగా ఉన్న వ్యక్తిని “ఏకాకి” అని లోకులు అంటారు కాని “కావు కావు” అనిఅరిచే కాకులు నిజంగా ఏకాకులు కావు.

ఒంటరిగా ఉన్న వాళ్ళని, ఒంటెద్దు బుద్ధులు ఉన్న వాళ్ళని “ఒంటి పిల్లి రాకాసి”అంటారు. “ఒంటరి ఒంటె” అని కూడ అంటారు.

మంత్రాలకి చింతకాయలు రాలతాయని భ్రమ పడే వాళ్ళంతా ఒంటి బ్రాహ్మణుడుమంచి శకునం కాదంటారు.

అరగంట కాని వేళలో గడియారం గంట కొడితే ఒంటిగంట అయినట్లు లెక్క.

గణితంలో “ఏకాంతర కోణం” అన్నప్పుడు “ఏకాంతర” అంటే ఒకటి విడిచి మరొకటిఅని అర్థం.

గణితంలో “ఒకటి” ముఖ్య సంఖ్య (“కార్డినల్‌నంబర్‌”), “ఒకటవ” అన్నదిక్రమ సంఖ్య (“ఆర్డినల్‌నంబర్‌”). గణితం దృష్టిలో ఒకటి బేసి సంఖ్య, నిజ (“రియల్‌”) సంఖ్య, ధన సంఖ్య,సహజ (“నేచురల్‌”) సంఖ్య, పూర్ణాంకం, నిష్ప (“రేషనల్‌”) సంఖ్య. గణితంలో “ఒకటి” ప్రథానసంఖ్య (“ప్రైమ్‌నంబర్‌”) కూడా. ఈ ప్రథాన సంఖ్యలే శ్రీనివాస రామానుజన్‌ సంగడికాళ్ళందరిలో ప్రథానులు.

ఒకసారి వింటే కంఠతా వచ్చే వారిని ఏకసంథాగ్రాహి అంటారు.

ఏకాగ్రత అంటే ఒకే ఒక అంశం మీద దృష్టి నిలపడం అని ఏకగ్రీవంగా తీర్మానంచెయ్యవచ్చు. ఏకాగ్రత లేనివారు ఏకసంథాగ్రాహులు కాజాలరు.

ఏకాహం అంటే ఒకే దినం చేసే కర్మకాండ అనేవారితో నేను ఏకీభవిస్తాను.

ఎకాఎకీ అంటే ఒకే దారి తీసుకుని వచ్చెయ్యడం. “ఏకాండీగా ఉన్న తాను” అన్నప్పుడు ఏక ఖండమైన బట్ట అని వివరణ.

తెలుగులో పదినీ ఒకటినీ కలిపితే “పదునొకటి” వస్తుంది. తెలుగు పదికి”ఒండు” కలపగా వచ్చినది “పదకొండు”. కాని సంస్కృతంలో దశనీ ఏకనీ కలిపితే “దశేక” కాదు, “ఏకాదశ” అవుతుంది.ఇది తెలుగుకీ సంస్కృతానికీ ఉన్న తేడాలలో ఒకటి.

వ్యాకరణంలో సంధి కార్యం జరిగినప్పుడు రెండు అక్షరాల స్థానంలో ఒకేఒక అక్షరం ఆదేశంగా వస్తే దానిని ఏకాదేశ సంధి అంటారు.

రాజనీతిలో ఏకాధిపత్యం వేరు, నిరంకుశత్వం వేరు.

“ప్రథమ” అంటే “ఒకటవ” అని అర్థం కనుక ప్రథానం అంటే ముఖ్యమైనది.వివాహాది కార్యక్రమాలలో తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమాన్ని ప్రథానం అంటారు.

ఈ రోజులలో గ్రీకు, లేటిను, ఇంగ్లీషు భాషల ప్రభావాన్ని తప్పించుకు తిరిగేవాడుధన్యుడు కాడు కనుక …

గ్రీకు భాషలో “మొనో” అంటే ఏక. అందుకనే ఏకాంతంగా బతికేవాడిని “మొనాకోస్‌” అంటారు. ఇందులోంచే “మంక్‌” అన్నమాట వచ్చింది. ఇటువంటి వారిని మనం “ఏకాకి” అనవచ్చు.

లేటిన్‌నుంచి వచ్చిన “యూని”, గ్రీకు నుంచి వచ్చిన “మొనో” అన్న ప్రత్యయాలతోఇంగ్లీషులో ఎన్నో మాటలు ఉన్నాయి.”యూనిట్‌, యునీక్‌, యునైట్‌, యూనిటీ, యూనివర్స్‌, మొనోపలీ” మొదలైనవి.”మోనోలిథిక్‌” అంటే ఏకశిల.

మోనో అంటే “ఒక”. టోన్‌అంటే “స్వరం”. కనుక మోనోటోన్‌అంటే ఎగుడుదిగుళ్ళులేకుండా ఉండే ఒకే ఒక స్వరం. ఇలా ఉదాత్త అనుదాత్తాలు లేకుండా అంటే మొనోటనస్‌గా ఉండే కార్యక్రమాలు బోరుకొడతాయి. ఈ “ఒక” సోది “మొనోటనస్‌”గా తయారయే లోగా ఇక్కడ ఆపుదాం.
----------------------------------------------------------
రచన: వేమూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో 

Sunday, October 21, 2018

విశ్వవిజ్ఞానం - 3


విశ్వవిజ్ఞానం - 3




సాహితీమిత్రులారా!

రేమెళ్ళ అవధానులుగారు
మనకు అందించిన
విశ్వవిజ్ఞానంలోని 3వ భాగం
వీక్షించండి

Saturday, October 20, 2018

సాహిత్యంలో చమత్కారం


సాహిత్యంలో చమత్కారం




సాహితీమిత్రులారా!

గరికపాటివారి
సాహిత్యంలో చమత్కారం
వీడియో వీక్షించండి-


Friday, October 19, 2018

విశ్వవిజ్ఞానం - 2


విశ్వవిజ్ఞానం - 2




సాహితీమిత్రులారా!

రేమెళ్ళ అవధానిగారు
విశ్వవిజ్ఞానం పేరున
జయటీ.వి. లో
అనేకమైన వీడియోలు
చేసి ఉన్నారు వాటినుండి
మనం మన వేదాల్లో పురాణాల్లో
దాగిన అంశాలు విశ్వానికి సంబంధించిన
అనేక విషయాలు మనకు అవగతమౌతాయని
ఆశించి అప్పుడప్పుడు వీటిని గురించిన వీడియోలను
అందించాలని తలచాని మీరు వీటిద్వారా మంచి
రహస్యాంశాలను గ్రహించగలరని మనవి.



Thursday, October 18, 2018

త్రిపదలు


త్రిపదలు





సాహితీమిత్రులారా!


పరిచయము
భారతీయ సాహిత్యములో పద్యములన్నియు సామాన్యముగా చతుష్పదలు; ద్విపదలను కూడ కొన్ని సమయములలో నుపయోగిస్తారు. కాని త్రిపదలు చాల అరుదుగా మన కళ్లకు కనబడుతాయి. ఇటీవలి కాలములో జపాను సాహిత్యమునందలి హైకూల ప్రభావమువలన త్రిపదలను హైకూల రూపములో మనము అప్పుడప్పుడు చదువుతుంటాము. కాని ఈ హైకూలను కూడ అలా జపాను సంప్రదాయరీత్యా కాని లేకపోతే మరేవైనా నియమములతో గాని అందఱు వ్రాయడము లేదు, ఎవరికి తోచినట్లు వారు వ్రాస్తున్నారు. వాటిలో భావసాంద్రత ఉన్నా, శిల్పములో లోపములు ఉన్నవేమోనని అనిపిస్తుంది. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము ఛందశ్శాస్త్రములోని త్రిపదలనుగుఱించి సంక్షిప్తముగా చర్చించుటయే.

వేదములలో త్రిపదలు
ఋగ్వేదమును ప్రపంచములో అతి ప్రాచీనమైనదో లేక అతి ప్రాచీనమైన గ్రంథములలో నొకటిగానో పరిగణిస్తారు. ఋగ్వేదములో మొట్టమొదటి పద్యము గాయత్రీఛందములోని త్రిపదయే. అది –

అగ్నిమీళే పురోహితం
యజ్ఞస్త్వ దేవ మృత్విజం
హోతారం రత్నధాతమం – ఋగ్వేదము 1.001.01

(అగ్ని నుచ్ఛుఁ బురోహితున్
యజ్ఞదేవుని ఋత్విజున్
ప్రార్థింతు సర్వభాగ్యదున్)

అదే విధముగా సంధ్యావందనము చేసేటప్పుడు ఉచ్చరించే గాయత్రీమంత్రము కూడ ఒక త్రిపదయే-

ఓం భూర్భువః స్వః
తత్సవితుర్వరేణ్యం (వరేణియం)
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్

(సవితృని మహత్వమున్
భువిపై మనమందగన్
కవించ బ్రస్తుతింతమా)

వేదములలో గాయత్రీఛందము (పాదమునకు ఆఱు అక్షరములు ఉండే వృత్తముల ఛందము కూడ గాయత్రియే, కాని అవి త్రిపద గాయత్రికి చేరినవి కావు) ప్రసిద్ధి కెక్కినది. ఈ త్రిపదగాయత్రిలో పాదమునకు ఎనిమిది అక్షరములు ఉంటాయి (గాయత్ర్యా వసవః), సామాన్యముగా చివరి నాలుగు అక్షరాలు IUIU రూపములో నుంటాయి (I – లఘువు, U – గురువు).

గాయత్రీఛందము మాత్రమే కాదు, ఇంకను ఇతర విధములైన త్రిపదలు కూడ వైదిక ఛందస్సులో నున్నాయి [1]. అవి ఉష్ణి, కకుప్(భ్), పురాఉష్ణి.

ఉష్ణికి సూత్రము – ఉష్ణిగ్గాయత్రౌ జాగతశ్చ – (పింగళ ఛందస్సు 3.18). ఈ త్రిపదలో మొదటి రెండు పాదములకు గాయత్రివలె ఎనిమిది అక్షరాలు, మూడవ పాదమునకు జగతివలె పండ్రెండు అక్షరాలు, అనగా పాదములలోని అక్షరముల అమరిక 8-8-12. ఉదాహరణకు ఋగ్వేదములోని క్రింది పద్యము –
తా వాం విశ్వస్య గోపా
దేవా దేవేషు యజ్ఞీయా
ఋతావానా యజసే పూతదక్షసా – ఋగ్వేదము, 8.025.01

(అన్నిటిని కాపాడే మిమ్ములను నేను పూజిస్తున్నాను. మీరు దేవతలు, దేవతలలో నుత్తములు, ధర్మమును నియతితో పాటిస్తారు, మీ యీ శక్తి పవిత్రమైనది)

మధ్య పాదములో 12 అక్షరముల జగతి, మొదటి మూడవ పాదములలో 8 అక్షరముల గాయత్రి అమరికతో (8-12-8) నున్న దానిని కకుప్ లేక కకుభ్ అంటారు. దీని సూత్రము కకుమ్మధ్యే చేదంత్యాః – (పింగళ ఛందస్సు 3.19). ఋగ్వేదమునుండి దీనికి ఉదాహరణ –
ఆ గంతా మా ఋషణ్యత
ప్రస్థావానో మాప స్థాతా సమన్యవః
స్థిరా చిన్ నమయిష్ణవః – ఋగ్వేదము 8.020.01

(వేగముగా పయనించే మిమ్ములను ఎవ్వరు ఆపలేరు. స్ఫూర్తిమంతులైన మీరు ఇక్కడికి రండి, దూరముగా నుండకండి, ఎంత కఠినమైన వస్తువునైనను మీరు వంచగలరు)

12-8-8 అక్షరముల అమరికతో నుండే పద్యమును పురాఉష్ణి అంటారు. (పురాఉష్ణిక్పురః – పింగళ ఛందస్సు 3.20). దీనికి ఉదాహరణ –
యాథా వాసంతి దేవాస్ తథేద్ అసత్
తాదేశాం నకిర్ ఆ మినత్
అరావా చన మర్తియః – ఋగ్వేదము 8.028.04

(దేవతలు ఏమి కోరుకొంటారో, అదే విధముగా జరుగుతుంది. అసురులు గాని, మనుజులు గాని ఈ దైవశక్తిని తగ్గించలేరు)

కకుభ్ ఛందపు అమరికలో ఒక తెలుగు పద్యమును క్రింద ఇస్తున్నాను. పాదాలను మార్చితే ఇదే పద్యమును ఉష్ణిగా, పురాఉష్ణిగా కూడ మార్చవచ్చును. –

హరీ నా హృదయమ్ములో
చిరమ్ముగా స్థిరమ్ముగా మనంగ రా
స్మరింతు ననయమ్ము నిన్

ఉష్ణి, కకుభ్, పురాఉష్ణిలవలె నున్న అక్షరాల అమరికతో మాత్రాగణములతో ఎలా పద్యములను సృష్టించవచ్చునో అనే విషయమును తఱువాత వివరిస్తాను.

తమిళములో త్రిపదలు
వెణ్బా అనే తమిళ ఛందోప్రక్రియను రెండు పాదములనుండి 1000 పాదములవఱకు వ్రాయవచ్చును. ఈ వెణ్బాకు ప్రతి పాదములో నాలుగు శీరులు (గణములు) ఉంటాయి, చివరి పాదములో మాత్రము మూడే ఉంటాయి. రెండు పాదముల వెణ్బాను కురల్ వెణ్బా అంటారు. అలాగే మూడు పాదముల వెణ్బా కూడ ఉన్నది. వీటిని చిందియల్ వెణ్బా అంటారు [2]. కొన్ని వెణ్బాలలో మొదటి రెండు పాదములకు మాత్రమే ప్రాస ఉంటుంది. ఇవిగాక వెణ్‌తాళిశై అని కూడ త్రిపదలు ఉన్నాయి. పాదములలో నాలుగు గణములకన్న ఎక్కువగా ఉండే వెణ్బాలు కూడ ఉన్నాయి. క్రింద ఒక రెండు ఉదాహరణలు –

ఇళమళై యాడు మిళమళై యాడు
మిళమళై వైగలు మాడుమెన్ మున్‌గై
వళై నెగిళ వారాదోన్ కున్ఱు – కలిత్తొగై 25

(నా ముంజేతులనుండి గాజులు జారేటట్లు చేసినవాడు పెద్ద కొండైనా కూడ వానజల్లులా మాత్రమే ఉంటాడు; అది కొంతసేపు కురిసే జల్లుకాదు, రోజంతా కురిసే వానజల్లు)

ఆర్వుట్రార్ నెంజమళియ విడువానో
వోర్వుట్రెరుదిఱ మొల్గాద నోగో
లఱంబురి నెంజత్తవన్ – కలిత్తొగై 42

(ఏ ఒకవైపు మొగ్గకుండా ఉండే త్రాసుముల్లులా ధర్మమును అనుసరించేవాడు తన్ను ప్రేమించినదాని మన్సును నాశనము చేస్తాడేమో? [చేయడనుకొంటాను])

వళైందదు విల్లు – విళైందదు పూశల్
ఉళైందన ముప్పురం ఉందీపఱ
ఒరుంగుడన్ వెందవా రుందీపఱ – తిరువాశగం, శివపురాణం, 14.1

(విల్లు వంగింది, యుద్ధము ఆరంభమైనది. త్రిపురములు నశించి బూడిదగా మారింది. ఆ మంచి వార్తను తలచుకొంటే అత్యద్భుతమైనదిగా తోచుతుంది. ఇదొక ఆనంద ఘడియ.)

చివరి ఉదాహరణను కొందఱు 4-6 శీరులతోడి ద్విపదగా భావిస్తారు.
కన్నడములో త్రిపదలు
ఎనిమిదవ శతాబ్దపు ప్రారంభములో బాదామిలో ఒక శిలాశాసనముపైన కప్పె ఆరభట్ట అనే ఒక వీరుడిని పొగడుతూ ఐదు పద్యములు ఉన్నాయి. అందులో మూడు త్రిపదులు. మనకు ఇప్పుడు దొరికిన కన్నడ త్రిపదులలో ఇవియే పురాతనమైనవి.

సాధుగె సాధు మాధుర్యంగె మాధుర్యం
బాధిప్ప కలిగె కలియుగ విపరీతన్
మాధవ నీతన్ పెఱనల్ల

(సాధువునకు సాధు – స్వాదువునకు స్వాదు
బాధించు వాని – వధియించు యముఁడగు
మాధవుఁ డితఁడు – మఱొకండె)

ఒళ్ళిత్త కెయ్వొరార్ పొల్లదు మదఱంతె
బల్లిత్తు కలిగె విపరీతా పురాకృత
మిల్లి సంధిక్కు మదు బందు

(అతఁడు మంచికి మంచి – అతఁడు చెడుకు చెడు
అతఁడు బలుండు, – పూర్వజన్మల పుణ్య
మతని సంధించెఁ గలిలోన)

కట్టద సింఘమన్ కెట్టొడే నెమగెందు
బిట్టవొల్ కలిగె విపరీతం గహితర్కళ్
కెట్టర్ మేణ్ సత్త రవిచారం

(కట్టుటయు, వదలి-బెట్టుటయు సరికాదు
దిట్టపు సింహ-మును, కలియుగమందు
మెట్టె నరులను ద్రుటిలోన)

పై పద్యములలో మొదటి దానికి తప్ప మిగిలిన వాటికి సరియైన త్రిపది లక్షణములు లేవు. ఏది ఏమైనా క్రీస్తుశకము ఏడు, ఎనిమిది శతాబ్దాలకే కన్నడ కవులు త్రిపదులను వాడినారు. కన్నడములో మనకు నేడు లభ్యమైన పుస్తకాలలో మొదటిదైన కవిరాజమార్గము అనే లక్షణగ్రంథములో కూడ త్రిపది గుఱించిన ప్రస్తావన ఉన్నను త్రిపదిఛందస్సులో పద్యము మాత్రము లేదు. కాని పంపాది కవులు త్రిపదిలో వ్రాశారు. అంశ లేక ఉపగణములతో నిర్మించబడిన త్రిపది తాళయుక్తము కాదని శార్ఙదేవుడు అభిప్రాయపడినప్పటికీ చక్కగా వ్రాస్తే త్రిపదులను కూడ తాళయుక్తముగా పాడుకొనవచ్చును.

నాగవర్మ ఛందోంబుధిలో [3] త్రిపది లక్షణములు ఈ విధముగా చెప్పబడినవి –

బిసరుహోద్భవగణం – రసదశ స్థానదొళ్
బిసరుహనేత్ర గణమె బర్కుళిదువు
బిసరుహనేత్రే త్రిపదిగె – 5.299

(బిసరుహోద్భవమగు – రస దశ స్థానముల్
బిసరుహనేత్ర-గణము లితరములు
బిసరుహనేత్ర త్రిపదికి

ఓ పద్మాక్షీ, ఆఱవ (రస), పదవ (దశ) గణములు బ్రహ్మగణములుగా నుండాలి, మిగిలినవి విష్ణుగణములు త్రిపదికి)

తుది గణము విష్ణుగణముగా నుండినయెడల దానిని చిత్ర అనియు, రుద్ర గణముగా నున్న దానిని చిత్రలత అనియు పిలిచెదరు. చిత్రలతకు బదులు విచిత్రము అని ఉండవలయునని ప్రసిద్ధ లాక్షణికులు భావిస్తారు. త్రిపదిగుఱించి దీర్ఘముగా కర్కి, వెంకటాచల శాస్త్రి చర్చించారు [4, 5].

జయకీర్తి తన ఛందోనుశాసనములో [6] త్రిపది లక్షణములను క్రింది విధముగా వివరించాడు –

కరకరాబ్ధిత్ర్యంశ – చరణా దిగ్రసరతిః
స్మరమయీ లాది గిరిహరాంశా
విరమణాచ్చిత్రా త్రిపదికా – 7.09

(పదకొండు (కర, కర, అబ్ధి) గణములు, మూడు పాదములు, పదవ (దిక్), ఆఱవ (రస) గణములు రతి (బ్రహ్మ) గణములు, మిగిలినవి మదన (విష్ణు) గణములు, ఏడవ (గిరి), పదునొకండవ (హరాంశ అనగా ఏకాదశ రుద్రులు) గణములు లఘ్వాదిగా నుండవలెను చిత్ర అనే త్రిపదికి)

తరువాతి కాలములో (సుమారు 12వ శతాబ్దము) కన్నడములో త్రిపద మాత్రాగణస్వరూపమును దాల్చినది. విష్ణు గణములకు పదులు పంచమాత్రలను, బ్రహ్మ గణములకు బదులు త్రిమాత్రలను ఉపయోగించారు.

సర్వజ్ఞుని త్రిపదులు
కన్నడములో ప్రజాకవి, సంఘ సంస్కర్త సర్వజ్ఞ అనే మకుటముతో సుమారు 16వ శతాబ్దములో ఎన్నియో త్రిపదులను వ్రాసినాడు. అవి ఈ నాటికి కన్నడ దేశములో బహుళ జనాదరణతో పాడబడుచున్నవి. మచ్చుకు నేను అనువదించిన కొన్ని సర్వజ్ఞుని త్రిపదులను ఇక్కడ చదువవచ్చును –

ఒబ్బనల్లదె జగకె ఇబ్బరుంటే మత్తె
ఒబ్బ సర్వజ్ఞ కర్తనీ జగకెల్ల
ఒబ్బనే దైవ సర్వజ్ఞ – దైవ 19

ఒకడెగా జగమునకు – నకట నిర్వురు గలరె
నొకడు సర్వజ్ఞు – డొడయడీ జగమునకు
నొకడె దైవమ్ము సర్వజ్ఞ

గురువింద బంధుగళు – గురువింద దైవగళు
గురువింద లిహుదు – పుణ్యవదు జగకెల్ల
గురువింద ముక్తి సర్వజ్ఞ – గురుమహిమె 15

గురువుచే బంధువులు – గురువుచే దైవములు
గురువుచే గల్గు – గొప్ప పున్నెము లిలను
గురువుచే ముక్తి సర్వజ్ఞ

జ్ఞానదిం మేలిల్ల – శ్వాననిం కీళిల్ల
భానువిందధిక – బెళకిల్ల జగదొళగె
జ్ఞానవే మిగిలు సర్వజ్ఞ – జ్ఞాన 43

జ్ఞానమున కధికమ్ము – శ్వానమున కధమమ్ము
భానువున కంటె – భాసమ్ము లేదు ధర
జ్ఞానమే మిన్న సర్వజ్ఞ

ఆగబా ఈగబా – హోగిబా ఎన్నదలె
ఆగలే కరెదు – కొడువవర ధరమ హొ-
న్నాగదే బిడదు సర్వజ్ఞ – దాన 62

మాపురా మఱలిరా – రేపురా యనకు, నీ-
వాపకుం డీయు – మప్పుడే యది హేమ-
మైపోవు నిజము సర్వజ్ఞ

కులవిల్ల యోగిగె – చలవిల్ల జ్ఞానిగె
తొలెగంబవిల్ల – గగనక్కె, స్వర్గదలి
హొలెగేరి యిల్ల సర్వజ్ఞ – కుల 79

కులమేది యోగులకు – చల మేది జ్ఞానులకు
అల నింగి కేది – అంటు దూలము, దివిని
వెలివాడ లేదు సర్వజ్ఞ

హాలుబోనవు లేసు – మాలె కొరళిగె లేసు
సాలవిల్లదన – మనె లేసు బాలరా
లీలె లేసెంద సర్వజ్ఞ – బడతన 126

పాలన్నమది బాగు – మాల మెడలో బాగు
బాలకుని యాట – బాగు, ఋణహీనతయు
మేలు గృహమందు సర్వజ్ఞ (పేదఱికము 126)

స్త్రీల పాటగా త్రిపది – కన్నడములో జానపద గేయాలలో, స్త్రీల పాటలలో త్రిపదులు ఉన్నాయి. మచ్చుకు ఒక ఉదాహరణ –

తౌరూరు హాదీలి గిడవెల్ల మల్లిగె
హూవరళి పరిమళ ఘమ్మెందు నా కొయ్దు
గిడకొందు హూవ ముడివేను

పుట్టింటి దారిలో – చెట్టంత మల్లెలే
దట్టమౌ తావి – ప్రతి చెట్టు విరి గోసి
పెట్టుకొంటాను జడలోన

కొన్ని కర్ణాటక త్రిపదులు – కన్నడములో త్రిపదను పాడుకొనడానికి అనుకూలముగా మఱొక విధముగా కూడ వ్రాస్తారు. జగన్నాథ విట్ఠలుడు వ్రాసిన ఒక ఉదాహరణ –

జ్ఞాన సుజ్ఞాన ప్ర-జ్ఞాన విజ్ఞానమయ
మాణవకరూప వసుదేవ తనయ సు-
జ్ఞానవను కొట్టు కరుణిసో

(జ్ఞాన సుజ్ఞాన ప్ర-జ్ఞాన విజ్ఞానమయ
మాణవకరూప వసుదేవ తనయ సు-
జ్ఞానము నొసంగి కరుణించు
మాణవక = శిశువు)

ఈ త్రిపదను పాడేటప్పుడు రెండవ పాదములో వసుదేవ పదమును క్రింది విధముగా మళ్లీ ఉపయోగిస్తారు –

జ్ఞాన సుజ్ఞాన ప్ర-జ్ఞాన విజ్ఞానమయ
మాణవకరూప వసుదేవ, వసుదేవ తనయ సు-
జ్ఞానవను కొట్టు కరుణిసో

ఇలాటి ప్రయోగముతో తెలుగులో రెండు ఉదాహరణములను క్రింద ఇచ్చాను –

త్రిభువనాల్, త్రిపదములు, నభముపై, భూమిపై
ప్రభువు బలి పైన పదమెత్తె, పదమెత్తె మోహనుం-
డభయ హస్తాలతో మహిని

ఒక పదము కన వాంఛ, యొకటి కను యనుభూతి,
యొక పదము కనగ తన్మయత, తన్మయత త్రిపదలో
ప్రకటించె నగుచు రాధమ్మ

పంచమాత్రలు, త్రిమాత్రలతో నేను వ్రాసిన కొన్ని కర్ణాటక త్రిపదలు –

శిశిరకాల వర్ణన-
పత్రములు రాలినవి – ధాత్రీజములనుండి
చిత్రమగు వర్ణ – శృంగారముల నిండి
ధాత్రి కంబళము – కన రండి

ప్రేయసీప్రియుల తలంపు-
నిన్ను జూడగ గోరె – చిన్న మన సీ ఘడియ
నిన్ను స్పర్శించ – నే నేంతు ప్రతి ఘడియ
కన్నెత్తి చూడు – మీ ఘడియ

రైతుల ఆత్మహత్య-
ఒక వైపు దారిద్ర్య – మొక వైపు ఋణ బాధ
ఒక వైపు యేడ్పు – ఒక వైపు క్షుద్బాధ
ఇక నాకు శరణు – ఉరి త్రాడు

పత్రికలలో వచ్చిన గుడియాపై-
రణభూమి జనె పతియు – తను మఱలి రాలేదు
మనసు శిల జేసి – మఱల పెండ్లాడితిని
కనవచ్చె నేడు – నను, విధీ

తెలుగులో త్రిపదలు
మలయాళ భాషలో చాల అరుదుగా త్రిపదలు అగుపిస్తాయి. హిందీలో ఇది ఉన్నట్లు లేదు. తెలుగులో మొదటి ఛందోగ్రంథమైన కవిజనాశ్రయములో [7] కన్నడ త్రిపది లక్షణములే చెప్పబడినవి –

త్రిదశేంద్రు లాఱగు – పదియగు నెడనకున్
గదియ రెంటను మూఁట
నదుకుడుఁ ద్రిపదకు నమరు

త్రిదశేంద్రు లాఱగు – పదియగు నెడనకున్
గదియఁగ రెండిటను మూఁట సూర్యుల
నదుకుడుఁ ద్రిపదకు నమరు

(కవిజనాశ్రయము, జాత్యధికారము 31, పరిష్కృత పాఠము [8] నుంచి.)

దీని ప్రకారము, త్రిపదకు మొదటి రెండు పాదాలలో నాలుగు గణములు, మూడవ పాదములో మూడు గణములు ఉంటాయి. అందులో ఆఱవ, పదవ గణములు సూర్యగణములు, మిగిలినవి ఇంద్రగణములు. మొదటి పాదములో ప్రాసయతి గలదు. నా అభిప్రాయములో త్రిపద యొక్క ఒక గొప్ప ప్రత్యేకత ఏమనగా దీనికి అక్షరసామ్య యతి లేదు. తెలుగు ఛందస్సులో జాతులలో యతి లేని రెండు పద్యములు – త్రిపద, షట్పద. వీటికి ప్రాసయతులే. బహుశా ఈ కారణము వలన నేమో ప్రాచీన కవులు ఈ యతి లేని ఛందస్సులను ఏ కావ్యములో కూడ వాడలేదు. తఱువాతి కాలములో త్రిపద లక్షణములు మారినను, ఈ యతిరాహిత్య నియమము మాత్రము మారలేదు.

కవిజనాశ్రయకర్త త్రిపద విషయములో సంపూర్ణముగా కన్నడ ఛందస్సును అనుసరించాడు.కాని విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణిలో [9] త్రిపద లక్షణాలను క్రింది విధముగా వివరించినాడు –

త్రిపదికి నొక యంఘ్రి – నింద్రులు నలువురు
ద్యూప్తు లిద్దఱు సూర్యు లిర్వు రౌల
ద్యుపతిద్వయార్కులు నౌల – కా. చూ. అష్టమోల్లాసము 60

దీని ప్రకారము త్రిపద మొదటి రెండు పాదములు సీసపాదముతో సరిపోతాయి. మూడవ పాదములో రెండు ఇంద్రగణములు, ఒక సూర్యగణము. కన్నడ త్రిపదిలోని సూర్యగణము చివర చేరినది ఇందులో. అంతే కాదు, మొదటి పాదములో ప్రాసయతి లేదు.

తఱువాత అనంతుని ఛందములో [10] నేటి త్రిపద లక్షణములు ఉన్నాయి –

సరవిఁ బ్రాసము నొంది – సురపతుల్ నలువురు
హరియు గై కార్కులు కలియ
జరగు నిప్పగిదియై త్రిపద – ఛందోదర్పణము, తృతీయాశ్వాసము 47

మొదటి పాదములో ప్రాసయతితో నాలుగు ఇంద్రగణములు, రెండవ, మూడవ పాదములలో రెండు ఇంద్ర గణములు, ఒక సూర్య గణము. అక్షరసామ్య యతి లేదు.

తెలుగు త్రిపదలోని యతి రాహిత్యమును అప్పకవి [11] స్పష్టముగా తెలిపినాడు –

తొలుతను నల్వు రిం-ద్రులు రెంట మూఁటను
బలభిద్ద్వయంబును రవియు
వళిలేక నలరారుఁ ద్రిపద – అప్పకవీయము, చతుర్థాశ్వాసము 283

కాని లక్షణ పద్యములో సామాన్య యతిని (తొ-ద్రు) కూడ వాడియుండుట కాకతాళీయమా? పొత్తపి వేంకటరమణకవి [12] కూడ మూడు త్రిపదలలో త్రిపద లక్షణములను ఇలా వివరించినాడు –

సరవి మొదల పురం-దర గణములు నాల్గు
పరఁగ రెండవ మూడు పదము
ల రచియింపఁదగు నింద్రులిరు
వురు రవి యొక్కరుం – డిరవుగా నొక్కొక
చరణంబునకును బ్రాసములు
జరుగు వడులు లేక కృతులు
మొదలి పదమునకుఁ – గుదురుపవలె రెండు
ముదమునఁ బ్రాసము లీల
గదియింపఁ ద్రిపద శ్రీకృష్ణ – లక్షణశిరోమణి, వృత్తాధికారము 338

ఇందులో అక్షరసామ్య యతి యే త్రిపద మొదటి పాదములో కూడ లేదు.
తెలుగు కావ్యములలో త్రిపద
ముందే చెప్పినట్లు త్రిపదను తెలుగులో ఇరవైయవ శతాబ్దము వఱకు ఏ కవి వాడలేదు. మొట్ట మొదట విశ్వనాథ సత్యనారాయణ శ్రీరామాయణకల్పవృక్షములో ఈ ఛందస్సును ఉపయోగించారు. ఆ పద్యములు –

మౌనీంద్ర యోగసం-పన్ని రూపిత మూర్తి
నానాత్రయీ శిఖావర్తి
దానితాశ్రిత జనతార్తి

ఉపనిషదుదిత ది-వ్యోపసానాసాధ్య
జపహోమ శమదమారాధ్య
కృపణాభియోగ నేపథ్య

కాని కవిసామ్రాట్టు కూడ ప్రాసయతిని ఉపయోగించలేదు, ఎందులకో?

ద్విపదయా, త్రిపదయా లేక చతుష్పదయా – కన్నడ తెలుగు త్రిపదల గణముల అమరిక పట్టికలో వివరించబడినది.


త్రిపద గణముల పట్టిక
విన్నకోట పెద్దన ప్రకారము త్రిపద మొదటి రెండు పాదములు ఒక సీస పాదము, మూడవ పాదము మధ్యాక్కర అర్ధపాదము. ఈ లక్షణాలతో క్రింద ఉదాహరణలు. వీటిలో నేను పెద్దనలా వడితో, ప్రాసయతిని కూడ ఉంచినాను.

చలిలోన నిను జూడ – జ్వలియించె మనసిందు
నిలువెల్ల కనులాయె – నిజము నిజము
పలుకరా పలుక రా – పాపి

చిత్తమ్ము నిను దల్వ – జిత్తరమ్మయె మేను
పొత్తమ్ము మూసేను – పొంగి పొంగి
మెత్తగా రమ్ము నా – మిత్ర

ఇప్పటి తెలుగు త్రిపద లక్షణములను పరిశీలిద్దాము. మూడు పాదములలో గణముల అమరిక – ఇం ఇం – ఇం ఇం / ఇం ఇం సూ / ఇం ఇం సూ. ఇందులో మొదటి పాదము ప్రాసయతితో సీసపాదములోని పూర్వార్ధము, రెండవ మూడవ పాదములు మధ్యాక్కరలోని అర్ధ పాదములు. రెండవ మూడవ పాదములు రెంటిని చేరిస్తే మనకు ప్రాసయతితోడి మధ్యాక్కర పాదము లభిస్తుంది. అనంతుడు క్రొత్తగా త్రిపద లక్షణములను వివరించినప్పుడు బహుశా మధ్యాక్కరచే ప్రభావితు డయ్యాడేమో? తెలుగు త్రిపదను (కన్నడ త్రిపదిని కూడ) ఇం ఇం / ఇం ఇం / ఇం ఇం సూ / ఇం ఇం సూ అని వ్రాస్తే అది యెట్టి యతి లేని ఒక చతుష్పది అవుతుంది. ఇం ఇం – ఇం ఇం / ఇం ఇం సూ – ఇం ఇం సూ అని వ్రాస్తే అది ప్రాసయతితోడి ద్విపద అవుతుంది. ఈ విషయాలను ఎందుకు చెబుతున్నానంటే ఈ ఛందస్సు ద్విపదయా, త్రిపదయా, లేక చతుష్పదయా అన్నది మన దృక్కోణముపైన ఆధారపడిన విషయము. తెలుగు త్రిపదకు కొన్ని ఉదాహరణములు –

ఒక పద మ్మా నింగి – యొక పద మ్మీ నేల
యిక నీదు త్రిపదమ్ము రయము
యకలంక యుంచు నా శిరము

ఈ ఱాలపై పాఱు – నీరాల గానమ్ము
లే రాగముల సుస్వరమ్ము
లీ రమ్య శ్రుతుల మోదమ్ము

నను జూడు సుకుమారి – ప్రణయాల కావేరి
మనసార నే నిన్ను గోరి
వని నుంటి రమ్ము యీ దారి

మనసున మనసయి – తనరెడు వలపయి
కనులకు నూతన కళగ
నను గను నగవుల సెలగ

కలలోన వింటి నే – కలహంస రావమ్ము
కల మాసె కను దెఱ్వ, గాని
కలహంస మనసులో నెగిరె

ముదముల విరియయి – పదముల ఝరియయి
వదనపు వలపుల శశిగ
సదమల రా మృదు నిసిగ

చివరి త్రిపద మొదటి పాదాన్ని విడదీసి వ్రాసినయెడల త్రిపద ఒక విధముగా చతుష్పదయే!

ముదముల విరియయి
పదముల ఝరియయి
వదనపు వలపుల శశిగ
సదమల రా మృదు నిసిగ

మూడవ, నాలుగవ పాదములను కలిపి వ్రాయగా లభించిన ద్విపద –

ముదముల విరియయి -పదముల ఝరియయి
వదనపు వలపుల శశిగ – సదమల రా మృదు నిసిగ

మాత్రాగణములతో త్రిపద
అంశ లేక ఉపగణములకు బదులు మాత్రాగణములతో త్రిపదలను రచించినయెడల అవి కర్ణసుభగముగా నుంటుందనే విషయములో ఏ సందేహము లేదు. ఈ విధానములో సూర్యేంద్ర గణములకు బదులు త్రిమాత్ర-చతుర్మాత్రలు లేక చతుర్మాత్ర-పంచమాత్రలు లేక పంచమాత్ర-షణ్మాత్రలను ఉపయోగించవచ్చును. అలా వ్రాసిన త్రిపదలకు కొన్ని ఉదాహరణలను క్రింద ఇస్తున్నాను –

మొదటి పాదము – (చ, చ) (చ, చ) ప్రాసయతి
రెండవ పాదము – చ, చ, త్రి
మూడవ పాదము – చ, చ, త్రి
అన్ని పాదాలకు ప్రాస

మనసున తేనెలు – తనువున వీణలు
ప్రణయపు టామని పొంగు
కనుగవ కింపగు రంగు

మాయని మమతల – తీయని పాటల
నా యెద నింపుమ నెపుడు
గాయము మాయగ నిపుడు

మొదటి పాదము – (పం, పం) (పం, పం) ప్రాసయతి
రెండవ పాదము – పం, పం, చ
మూడవ పాదము – పం, పం, చ
అన్ని పాదాలకు ప్రాస

ఆనంద శిఖరాన – నేనుందు నీకొఱకు
కానంగ రావేల నాకై
నే నిప్డు వేచేను నీకై

వెలుగు నీవన్నాను – తెలుగు నీవన్నాను
వెలిగించు దీపాల నెన్నో
పలికించు గీతాల నెన్నో

మొదటి పాదము – (ష, ష) (ష, ష) ప్రాసయతి
రెండవ పాదము – ష, ష, పం
మూడవ పాదము – ష, ష, పం
అన్ని పాదాలకు ప్రాస

లంబోదర యంబాప్రియ – సాంబసుతా గజవదనా
జంబూఫల నైవేద్యము జేతు నేన్
సంబరముగ శుక్లాంబర గొలుతు నిన్

ఆమనిలో విరిసిన యా – కోమల నవ కుసుమములా
యామినిలో విరిసిన విరి మాలలా
కోమలి నీ వా వెన్నెల డోలలా

రాగమైన మల్హారుగ – మేఘమాల కన్నీరుగ
వేగవేగ మీ ధరపై కురిసిపో
నా గుండెను చల్లార్చగ మెఱిసిపో


8-8-12 అక్షరములతో త్రిపద – వైదిక ఛందస్సులోని త్రిపదలనుగుఱించి చర్చించినప్పుడు రెండు పాదములలో గాయత్రివలె ఎనిమిది అక్షరములు, ఒక పాదములో జగతివలె 12 అక్షరములు ఉండే ఉష్ణి, పురాఉష్ణి, కకుప్ ఛందములను సోదాహరణముగా మీకు తెలిపినాను. ఎనిమిది అక్షరములను, 12 అక్షరములను త్రి, చతుర్, పంచ మాత్రలతో నిర్మిస్తే మనకు గానయోగ్యమైన త్రిపదులు లభిస్తాయి. నిడుద పాదమునకు మాత్రము అక్షరసామ్య యతి నుంచినాను. అట్టి నా ప్రయత్నమును క్రింది ఉదాహరణములలో చదువ వీలగును.

త్రిమాత్రలతో ఉష్ణివలె 8-8-12 అక్షరములతో –
మనసు నిన్ను దలచె
తనువు నిన్ను బిలిచె
కనులు కలిసె – క్షణము నిలిచె

చతుర్మాత్రలతో ఉష్ణివలె 8-8-12 అక్షరములతో –
తాళము తప్పైనప్పుడు
కాల మ్మొనర్చు చప్పుడు
ప్రేలిన విశ్వపు – ప్రేమకు దెప్పుడు

పంచమాత్రలతో ఉష్ణివలె 8-8-12 అక్షరములతో –
ఒక పువ్వు బూచినది
ఒక పువ్వు నవ్వినది
ఒక పువ్వు రాలినది – ఓడినది

త్రిమాత్రలతో కకుభ్ వలె 8-12-8 అక్షరములతో –
నీవు చెప్పినావు నాడు –
“నీవు లేక లేను – నేను, నీవె తోడు”
నీవు గోడమీద, నేడు

చతుర్మాత్రలతో కకుభ్ వలె 8-12-8 అక్షరములతో –
తారక లాకాశములో
కోరిక లెప్పుడు – గుండెల దడలో
లేరెవరీ పానుపులో

పంచమాత్రలతో కకుభ్ వలె 8-12-8 అక్షరములతో –
ఒకవంక చిఱుజల్లు
ఒకవంక తడితడిగ – హొంబూలు
ఒకవంక హరివిల్లు

త్రిమాత్రలతో పురాఉష్ణి వలె 12-8-8 అక్షరములతో –
ఎక్క డేగె నేడు – హృద్యమైన సొంపు
ఎక్క డాకు లిచ్చు యింపు
ఇక్క డిందు లేమి చంపు

చతుర్మాత్రలతో పురాఉష్ణి వలె 12-8-8 అక్షరములతో –
అందము జిందిన – యామని యెరవా
ఇందీ భూమికి కరువా
సౌందర్య మ్మది మరువా

పంచమాత్రలతో పురాఉష్ణి వలె 12-8-8 అక్షరములతో –

సకలమ్ము నెదురించు – సాహసము
ఒకనాటి యౌవనము
ఇక రాని దాదినము

హైకూ
త్రిపదల వెనుక ఇంత గొప్ప చరిత్ర దాగి ఉన్నదన్న సంగతి చాల మందికి తెలియక పోయినను, అందఱికి హైకూలను గుఱించి తెలిసి ఉంటుంది. ఈ హైకూ ప్రక్రియ మొదట జపాన్ దేశములో ఉద్భవించినది. హైకూ ఒక త్రిపద – మొదటి మూడవ పంక్తులలో ఐదు అక్షరములు, రెండవ పంక్తిలో ఏడు అక్షరాలు ఉంటాయి యిందులో. హైకూ ఒక చిత్రసందర్శనానుభూతిని కలిగిస్తుంది. పదములకన్న ఆ పదములు సృష్టించిన చిత్రములు హైకూ ప్రత్యేకాకర్షణ. ఒక చిత్రము మాత్రమే కాదు, రెండు భిన్నమైన చిత్రములు హైకూలో సామాన్యముగా మనకు కనిపిస్తాయి. మత్సుఒ బాషో, ఉయెజిమా ఒనిత్సూరా గొప్ప జాపనీయ హైకూ కవులు.

17 అక్షరములతో వ్యావహారిక భాషలో ద్వితీయాక్షర ప్రాసయుక్తమై వ్రాసిన కొన్ని హైకూలను క్రింద చదువవచ్చును –

గోవిందా హరీ
దేవుని రథోత్సవం
గోవిందా బిచ్చం

చంచల పుష్పం
చంచల హృదయం – అ
చంచలాకాశం

పాలభిషేకం
పాలులేని పాలిండ్లు
పాలకై యేడ్పు

దూరంగా శశి
దూరంగా కొండ – ఇంకా
దూరంగా నువ్వు

తార లెన్నెన్నో
ఈ రాత్రిలో – జీవన
తార నాదేది

తలపై గంగ
గళము దాకి గంగ
ప్రళయ గంగ

మరో ఆకాశం
మరో అందాల తార
మరి యీ తార
త్రిపద ఛందస్సులో హైకూలు
తెలుగులో ఎందరో కవులు హైకూలను వ్రాస్తున్నారు. కాని ఈ హైకూలను వ్రాసినప్పుడు 5-7-5 అక్షరములతో అందఱు వ్రాయడము లేదు. హైకూల భావాలను నేను పైన వివరించిన ఛందోబద్ధమయిన త్రిపదలలో వెలిబుచ్చవచ్చును. అప్పుడు హైకూలలో చిత్రములను మాత్రమేగాక భాషా సౌందర్యమును కూడ అనుభవించవచ్చును.

కొన్ని హైకూలకు త్రిపదలలో నా అనువాదములను క్రింద పఠించవచ్చును –

Wake, butterfly –
It’s late, we’ve miles
To go together. – Basho

తుమ్మెదా వేళాయె – లెమ్ము సత్వరముగా
రమ్మిద్దరమ్ము దూరమ్ము
రమ్ము వెళ్లాలి వేగమ్ము

Come out to view
the truth of flowers blooming
in poverty – Basho

చూడ రా వేగమే – చూడవా వేగమే
చూడు మీ పుష్పాల సొంపు
చూడు మీ ముఱికిలో కంపు

Polished and polished
clean, in the holy mirror
snow flowers bloom – Basho

తుడువగా తుడువగా – గడు నిద్ద మద్దమ్ము
విడిగినవి యందు పుష్పాలు
బెడగిడుచు హిమమౌక్తికాలు

I’m a wanderer
so let that be my name –
the first winter rain – Basho

నేను ప్రవాసిని – నా నామమ్మది
వానలు తొలిగా కురిసె
నీ నవ శిశిరము విరిసె

The old pond;
A frog jumps in —
The sound of the water – Basho

ఏనాటి సరసియో – ఈ నాడు పాతబడె
ఆ నీట కప్ప మునిగింది
ధ్వానముల సుడియు రేగింది

Fallen sick on a journey,
In dreams I run wildly
Over a withered moor – Basho

బలహీనమయె తనువు – చలి జ్వరము పాలైతి
పలవరింపులలోన నేను
అల కొండనే యెక్కినాను

A cooling breeze—
and the whole sky is filled
with pine-tree voices. – Onitsura

సరసపు తెమ్మెర – పరువగ చల్లగ
విరివిగ నిండెను నింగి
తరువుల సడుల జెలంగి

Watching, I wonder
which poet could put down his quill …
a perfect moon! – Onitsura

చిమ్మగ శశి ద్యో-తమ్ముల నీ నిసి
కమ్మగ పున్నమి లాఁగు
యిమ్ముగ నే కవి యాగు

Don’t weep, insects –
Lovers, stars themselves,
Must part – Kobayashi Issa

జడియకుడు క్రిములార – అడలు టది యెందులకు
కడకు తారకలు ప్రేమికులు
మడియకను నుందురే పుడమి

meteor shower
a gentle wave
wets our sandals – Michael Dylan Welch

అక్కడ నాకాశములో – చుక్కలు బలు రాలుచుండె
ఇక్కడ నొక సంద్రపు టల తడిపినది
మక్కువతో మా పదముల తుడిచినది

ముగింపు
పది యక్షరములకు తక్కువగా ఉండే వృత్తములకు, ప్రాసయతి మాత్రము కలిగి ఉండే లయగ్రాహివంటి ఉద్ధురమాలావృత్తములకు తప్ప మిగిలిన వృత్తములకు, జాతి పద్యములకు అక్షరసామ్యయతి లేక వడి తెలుగులో తప్పక ఉంటుంది. దీనికి మినహాయింపు త్రిపద, షట్పదలు మాత్రమే. త్రిపదలను కన్నడ కావ్యములలో అక్కడక్కడ ఉపయోగించారు, షట్పదులతో కావ్యములనే వ్రాసారు కన్నడ కవులు. కాని ఈ రెండు ప్రక్రియలకు తెలుగు కవులు ససేమిరా అన్నారు. పద్యములను వ్రాయుటకు పూనుకొనే విద్యార్థులు ప్రారంభదశలో యత్యక్షారలకోసం ప్రాకులాడడము సహజమే. కాని ప్రారంభదశలో వారు త్రిపదలాటి పద్యములను అల్లినచో పద్యరచనా విధానమును చక్కగా అవగాహనము చేసికొనుటకు వీలవుతుంది. మాయామాళవగౌళరాగమును సంగీతము నేర్చే విద్యార్థులు ఎలా అభ్యసిస్తారో అదే విధముగా త్రిపదను పద్యరచనా విద్యార్థులు అభ్యాసము చేసికొనవచ్చును, తఱువాత తెలుగు షట్పది, దాని పిదప ఆటవెలది తేటగీతులు, తఱువాత కందము, ఆ తఱువాత చంపకోత్పలమాలలు, అలా అభ్యాసము చేసికొని పద్యరచనా ప్రావీణ్యమును గడించవచ్చును. అదే విధముగా హైకూవంటి పదచిత్రాలకు కూడ త్రిపద సహాయకారియే అని నా ఉద్దేశము.
-----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, October 17, 2018

దుర్గాష్టమి శుభాకాంక్షలు


దుర్గాష్టమి శుభాకాంక్షలు



సాహితీమిత్రులకు
శ్రేయోభిలాషులకు
దుర్గాష్టమి శుభాకాంక్షలు

తెలుగు ప్రపంచభాష ఎప్పుడవుతుంది?


తెలుగు ప్రపంచభాష ఎప్పుడవుతుంది?




సాహితీమిత్రులారా!


తెలుగు చాలా అందమైన భాష. తెలుగు చాలా తియ్యని భాష. తెలుగు చాలా గొప్ప భాష. (అప్పుడే చప్పట్లు కొట్టకండి.) ఈమాటని ఎవ్వరూ కాదనరు. మా అమ్మాయి చాలా అందమైనది. చాలా తెలివైనది. నాతో ఆ విషయం మీద మీరు ఎప్పుడూ పోట్లాడరు. మీ అమ్మాయి అందమైనది కాదు అని నాతో వాదించరు. పోన్లే పాపం ఆ తండ్రికి కూతురంటే ప్రేమ, అని వొదిలేస్తారు. తెలుగు విషయంలో కూడా అంతే. తెలుగువాళ్ళు కానివారి సభకి వెళ్ళి, అందరూ ఇంగ్లీషువాళ్ళో, అందరూ ఫ్రెంచివాళ్ళో, అందరూ జర్మన్లో ఉండగా, తెలుగు ప్రపంచంలోకల్లా అందమైన భాష, గొప్ప భాష అని మీరనండి, తెలుగువాళ్ళు అంతేలే, తెలుగువాళ్లకి వాళ్ళ భాష అంటే అభిమానమని కాసేపు ఊరుకుంటారు.  వాళ్ళ సభ్యత అడ్డు వస్తుంది కాబట్టి అంతకన్నా ఇంకేమీ అనరు.

మనకి తెలుగు అందమైన భాష కావడానికి కారణం మనకి తెలుగు ఒక్కటే రావడం. మనకి ఇంకొక భాష నిజంగా రాదు. ఉద్యోగరీత్యా వచ్చిన ఇంగ్లీషు భాష మనకి వొచ్చు. సాహిత్యరూపంలో వచ్చే ఇంగ్లీషు మనకి రాదు, కాకపోతే రాదని మనకి తెలియదు. తెలుగువాళ్ళు ప్రపంచంలోకి వచ్చారు. అమెరికా వచ్చారు, ఇంగ్లాండు వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు. దాదాపుగా ఇంగ్లీషు మాట్లాడేటటువంటి దేశాలన్నింటిలోనూ తెలుగువాళ్ళు కొద్దొ గొప్పో వున్నారు. కొద్దిమంది ఇంగ్లీషు మాట్లాడని ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కూడా వున్నారు. ఇంత దూరం వొచ్చినా మనం తెలుగు వాళ్ళమే, అంటే తెలుగు మీద ప్రేమ వున్న వాళ్లమే.

ఇంతకీ – తెలుగు మీద ప్రేమ అంటే ఏవిటి? మా అమ్మాయి తెలుగు పండితురాలవుతుందంటే నేను ప్రోత్సహిస్తాననే నమ్మకం లేదు నాకు. మీరు ఇంజనీర్లవక్కర్లేదు, డాక్టర్లవక్కర్లేదు, కంప్యూటర్‌ సైంటిస్టులవక్కర్లేదు, తెలుగు పండితులవండి చాలు అని మీ పిల్ల్లలతో అంటారని నాకు నమ్మకం లేదు. అయినా ఇక్కడ, మరీ ముఖ్యంగా అమెరికాలో, అప్పుడప్పుడు ఇంగ్లండ్ లో కూడా, తెలుగు నిలబెట్టాలనే మాట వినిపిస్తోంది. అమెరికాలో ఈమధ్య ఈ మాట మరీ వినిపిస్తోంది. ముఖ్యంగా ఇలాటి సభల్లో.

మరి అమెరికాలో తెలుగు నిలబెట్టడం అంటే ఏమిటి? తెలుగువాళ్ళు అమెరికా వొచ్చిన మాట నిజమే. కాని అమెరికాలోకి తెలుగు వెళ్ళలేదు. తెలుగు మన ఇళ్ళల్లో ఉంది. ఇంట్లో పెద్దవాళ్ల మాటల్ల్లో వుంది. కాని అమెరికాలో తెలుగు లేదు. అమెరికా స్కూళ్లలో తెలుగు లేదు, ఒకటి రెండు జాగాలలో తప్ప, విశ్వవిద్యాలయాల్లో లేదు, గ్రంథాలయాల్లో లేదు, పుస్తకాల షాపుల్లో లేదు, రేడియోలో, టి.వి. లో లేదు. మన పిల్లలు అమెరికన్ ఇంగ్లీషు మాట్లాడుతున్నారు. పిల్లలు మనతో తెలుగు మాట్లాట్టం లేదే అన్న బెంగ ఇప్పుడిప్పుడే కలుగుతోంది మనకి. వాళ్ళు అమెరికన్లు అయిపోతున్నారు. వాళ్ళు ఒకవేళ కొద్దో గొప్పో తెలుగు మాట్లాడినా, వాళ్లు తెలుగు వాళ్ళు కారు. ఏదో ఒక ఉగాది రోజునో, సంక్రాంతి రోజునో పరికిణీలు కట్టుకుని, జడగంటలు పెట్టుకుని నాట్యం చేసినా, వాళ్ళు నిత్యజీవితంలో అమెరికన్లే.

తెలుగు, మీరు మీ యిళ్ళల్లో మాట్లాడుకుంటున్నంత వరకూ బాగానే ఉంటుంది. ఇంకో యాభై యేళ్ళ వరకూ నాకు హామీయే, ఇక్కడున్న పెద్ద వాళ్ళందరూ తెలుగులో మాట్లాడతారు, కొందరు తెలుగులో రాస్తారు, రచయితలూ, కవులూ అవుతారు. మీరు తెలుగులో పుట్టి, తెలుగులో పెరిగి ఇక్కడికి వొచ్చిన వాళ్ళు. అందుచేత హాయిగా ఉంటుంది మీతో తెలుగు మాట్లాడుతూంటే. ఇప్పుడు మీ పిల్లలూ, మీ మనవలూ కుటుంబాల్లో తెలుగు మాట్లాడాలని, వాళ్ళకి తెలుగు నేర్పాలనే ప్రయత్నం కొంత కొంత మనలో కనిపిస్తోంది. మన పిల్లలకి తెలుగు చెప్పాలని దీక్షగా పనిచేస్తున్న వాళ్లని ఓ పదిమందిని నేను ఎరుగుదును. వాళ్ళ ఆసక్తికి, శ్రద్ధకి, పిల్లలకి తెలుగు నేర్పడంలో వాళ్ల కృషికి నమస్కారాలు చెప్పాలి.

కాని, వాళ్ళు పాఠాలు చెప్పడానికి పుస్తకాలు లేవు, వాళ్ళు పాఠం చెప్పే పద్ధతులు లేవు.

మనం తెలుగు నేర్చుకోలేదు. మనకి తెలుగు వచ్చింది. ఏది మీరు నేర్చుకున్నారో, అది మీరు చెప్పగలరు. సంగీతం నేర్చుకుంటే, సంగీతం చెప్పగలరు. నాట్యం నేర్చుకుంటే, నాట్యం నేర్పగలరు. వంకాయ కూర చెయ్యడం మీకొస్తే వంకాయ కూర ఎలా చెయ్యాలో మీరు చెప్పగలరు. కానీ, తెలుగు మనం నేర్చుకోలేదు. ఏరకంగా తెలుగు మన మనస్సుల్లోకి ప్రవేశించిందో  ఏరకంగా తెలుగు మన శరీరంలో  భాగమైపోయిందో మనం చెప్పలేం. అంచేత తెలుగు పుట్టుకతో రానివాళ్లకి తెలుగు ఎలా చెప్పాలో మనకి తెలియదు.

నేను మా యింటి’కి’ వెళతాను. కానీ మా అమ్మ ‘దగ్గరికి’ వెళతాను. మా తాతయ్య ‘దగ్గరికి’ వెళతాను. కారు దగ్గరికి వెళతాను. ఇంటికి అన్నప్పుడు ‘కి’ అని ఎందుకు అంటాము? అమ్మ, తాతయ్య, ఇలాంటి మాటలు అన్నప్పుడు  ‘దగ్గరికి’ అని ఎందుకంటాం? అమ్మకి, తాతయ్యకి, కారుకి అని ఎందుకు అనం? అక్కడ ‘దగ్గర’ ఎందుకు పెడతాం, ఇక్కడ ఎందుకు మానేస్తాం?

మనం పుస్తకాలు కొనుక్కోవచ్చు, చొక్కా కొనుక్కోవచ్చు. కాని అన్నం కొనుక్కోం, భోజనం కొనుక్కోం, కాఫీ కొనుక్కోం. నేను కాఫీ  కొనిపెట్టను, కాఫీ ఇప్పిస్తాను. భోజనం కొనిపెట్టను, భోజనం పెట్టిస్తాను. మీకు చొక్కా కొనిపెడతాను. కొను అనే క్రియ తినే పదార్థాలకు ఎందుకు వాడం తెలుగులో?

నాకు ఆకలేస్తోంది. నాకు భయం వేస్తోంది. నాకు సంతోషంగా ఉంది. ఇంగ్లీషులో I am hungry అవుతుంది కదా, నేను ఆకలేస్తోంది అంటే ఎందుకు తప్పు?

మా యింటికి నేనొక్కణ్ణే యజమానిని. నా డబ్బుతోనే కొనుక్కున్నాను. అయినా మా యిల్లు అంటాను నేను. మీ అమ్మకి మీరు ఒక్కరే కొడుకో, కూతురో కావచ్చు. అయినప్పటికీ మీ అమ్మ అంటాను. నీ అమ్మ అంటే తిట్టు! ఏ కారణం చేత?

ఇంగ్లీషు పుట్టుకతో మాట్లాడడం వొచ్చిన వాళ్ల పలుకుబడిలో  take (తీసుకొను) అనే క్రియ భోజనానికీ, స్నానానికీ, కాఫీ లాంటి ద్రవ పదార్థాలకీ, సలహాకీ – ఉమ్మడిగా వాడతారు. మరి తెలుగులో భోజనం తీసుకోరు, స్నానం తీసుకోరు. వీటికి చెయ్యడం క్రియగా వాడాలి. మళ్లా భోజనం చెయ్యడం, వంట చెయ్యడం అనే మాటల్లో చెయ్యడం ఒకే అర్థంలో లేదు. అంటే, తెలుగులో  ప్రతి నామవాచకానికి ఒక నిర్దిష్టమైన క్రియ వుంది, ఆ క్రియకి చిన్న చిన్న అర్థచ్చాయలు ఉన్నాయి. ఆ క్రియలు ఇంగ్లీషులో మల్లే వుండవు.

ఈ వివరాలు మనకి ఇప్పుడున్న తెలుగు వ్యాకరణాలేవి చెప్పవు. ఆ వ్యాకరణాలు తెలుగు వొచ్చేసిన వాళ్ల కోసం రాసినవి.

అలాంటి వ్యాకరణాలు తెలుగు నేర్పడానికి పనికి రావు. తెలుగు మొదటి భాష కాని వాళ్ల కోసం వ్యాకరణాలు, భాషా బోధన విధానాలూ తయారు చెయ్యవలసిన అవసరం మనకి ఇంత వరకూ కలగలేదు. అంతే కాదు, ఆ బోధన విధానాలు ఇంగ్లీషు మాతృభాష అయిన వాళ్లకీ, ఇంకొక భారతీయ భాష మాతృభాష అయిన వాళ్లకీ వేరువేరుగా తయారు చెయ్యాలి అనే దృష్టి కాని, పిల్లలకి ఒకరకం గానూ, పెద్దవాళ్ళకి మరొక రకంగానూ, పుస్తకాలు తయారు చేయాలనే ఆలోచన కూడా మనకు కలగలేదు.

మన పిల్లల మాతృభాష ఇంగ్లీషు. అంటే మన పిల్లల మొదటి భాష ఇంగ్లీషు. వాళ్ళు ఇంగ్లీషులో ఊహిస్తారు, ఇంగ్లీషులో మాట్లాడతారు, ఇంగ్లీషులో ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారు. వాళ్ళకి తెలుగు చెప్పటం ఎలా? ఫ్రెంచ్‌ నేర్చుకోవచ్చు, జర్మన్‌ నేర్చుకోవచ్చు, ఇటాలియన్‌ నేర్చుకోవచ్చు. మీకిష్టమొచ్చిన భాషలు నేర్చుకోవచ్చును. దానికి కావలిసిన పుస్తకాలు విడియోలు బోలెడు ఉన్నాయి. ఆ ఆ భాషలు ఎలా నేర్పాలో తెలుసుకొని, నేర్పేవాళ్ళున్నారు. ఆయా భాషల సాహిత్యం చెప్పేవాళ్ళున్నారు. అందుకు కావలసిన పరికరాలు తయారు చెయ్యడానికి కొన్ని వందలమంది పరిశోధనలు చేశారు. చాలా అమెరికన్‌ యూనివర్సిటీలలో ఈ.ఎస్.ఎల్ అంటే English as Second Language అని ఒక ప్రత్యేక విభాగం వుంటుంది. తెలుగు మాతృభాష కానివాళ్లకి తెలుగు నేర్పే విధానాలని గురించి ఆంధ్ర దేశంలో ఎన్ని యూనివర్సిటీలలో పరిశోధన చేస్తున్న వాళ్లున్నారో చెప్పండి నాకు.

తెలుగు విషయంలో ఈ భాష రెండో భాషగా నేర్పడానికి అనుసరించవలసిన పద్ధతులూ, రాయవలసిన పుస్తకాలూ తయరు చేసేవాళ్లని మనం తయారు చేసుకోవాలి. తెలుగు దేశంలో వున్న విశ్వవిద్యాలయాలలో వున్నతెలుగు భాషా శాస్త్రవేత్తలలొ ఈ రంగంలో పని చేసేవాళ్లని ఈ పని చెయ్యమని పురమాయించాలి. వాళ్లకి అందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. అంటే వాళ్ళకి డబ్బిచ్చి, ఈ రంగంలో పరిశోధనలు చేసి, ప్రామాణికమైన పుస్తకాలు రాయమని చెప్పాలి. మనం ఎవ్వరమూ అడగక పోయినా ఇప్పటికే ఈ పని చేసిన ఒకరిద్దరు భాషాశాస్త్రజ్ఞుల్ని నేనెరుగుదును. ఒకరు, ప్రపంచ విఖ్యాత ద్రావిడ భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి గారు, రెండవ వారు, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ నించి ఈ మధ్యనే రిటైర్‌ అయిన పరిమి రామ నరసింహం గారు. తెలుగు రెండో భాషగా చెప్పడానికి కావలిసిన వ్యాకరణాలు రాసిన వాళ్లు వీరిద్దరూ. అయితే ఆ వ్యాకరణాలు పెద్దవాళ్ళ కోసం రాసినవి, అంటే కాలేజీ లో చేరే వయస్సున్న వాళ్లకోసం రాసినవి.

పైకి చెప్పక పోయినా తెలుగు భాష చవక అనే అభిప్రాయం ఒకటి మనలో చాలా గట్టిగా వుంది. చవక అంటే తక్కువ డబ్బుతో దొరికేది అని అర్థం. శని ఆదివారాల్లో మనలో ఉత్సాహవంతులు పిల్లలలకి తెలుగు చెప్పడం ఆనందించదగిన విషయం. వాళ్లు ఊరికే పనిచేస్తారు. వాళ్ళకి జీతాలివ్వక్కరలేదు. కాని, మన పిల్లలకి తెలుగు రావాలనుకుంటే అందుకు కావలసిన పెట్టుబడి మనం పెట్టాలి.

మన దగ్గిర డబ్బు లేక కాదు. తెలుగుభాష మీద ప్రేమ లేక కాదు. మనకు తెలుగుని ఏరకంగా పైకి తీసుకు రావాలో తెలియదు. డబ్బు ఎక్కడ  పెట్టాలో తెలియదు. డబ్బు పెట్టుబడిగా పెట్టేటప్పుడు ఫలానా కంపెనీలో షేర్లు కొనండి, ఫలానా కంపెనీలో పెట్టుబడి పెట్టండి అని చెప్తారు. సరిగ్గా అదే పద్ధతిలో తెలుగు మీద పెట్టుబడి పెట్టమని అడుగుతున్నాను. తెలుగు మీద ప్రేమని చూపించమని అడగట్లేదు. ఉదారంగా విరాళాలివ్వమని అడగటం లేదు నేను. తెలుగు మీద పెట్టుబడి పెట్టమంటున్నాను. పెట్టుబడి అంటే అర్థమేమిటి? దీనివల్ల లాభాలొస్తాయి, ఆ లాభాల వల్ల మీరు బాగుపడతారు. నేను షేర్లెందుకు కొంటాను? వాటి ధర పెరుగుతుంది,  నాకు లాభం వస్తుంది. నా డబ్బు ఎక్కువౌతుంది.

నేనెవ్వరినీ నిస్వార్థంగా పని చెయ్యమని అడగను. నిస్వార్థంగా పనిచేస్తున్నాననే వాళ్ళంటే నాకు భయం. మనకి స్వార్థం లేకపోతే ఇక్కడికి వొచ్చేవాళ్లం కాదు. స్వార్థం కోసమే ఇక్కడున్నాం. స్వార్థం తప్పు కాదు. కానీ తెలివైన స్వార్థం కావాలి. అజ్ఞానంతో కూడుకున్న స్వార్థం మన స్థానాన్ని తగ్గిస్తుంది. తెలివితేటలతో ఉన్న స్వార్థం మనకు ఉపయోగపడుతుంది.

తెలుగుని మన పిల్లల మనస్సుల్లో నిలబెట్టమని అడిగేది ఎందుకూ అంటే మీ స్వార్థం కోసం అడుగుతున్నాను. ప్రజాస్వామిక దేశాలలో అధికసంఖ్యాకుల కన్నా సంస్థాగతంగా కూడి ఉన్న తక్కువమందికి ఎక్కువ బలముంటుంది. ఈ సంగతి సాధారణంగా తెలీదు మనకి. మనం organized minority గా అవగలమా? ఆ organized minorityగా అవడానికి కావలిసిన ప్రయత్నంలో తెలుగు ఒక భాగం, ముఖ్యమైన భాగం. ఈ ముఖ్యమైన భాగం నిలబెట్టుకోవడంలో మన పిల్లలందరూ తెలుగు పండితులై పోవలసిన అవసరం లేదు. మీరు కోరుకున్నా అవరు వాళ్ళు, ఒకవేళ అయినా వాళ్ళు బాగుపడరు. అంచేత వాళ్ళు తెలుగు పండితులై పోవాలనీ, తెలుగులో రచనలు చేయాలనీ, కోరుకోకండి మీరు. వాళ్ళు తెలుగు నా భాష అనుకుంటే చాలు, మాట్లాడగలిగితే చాలు. వాళ్ళు ఒకరితో ఒకరు తెలుగు మాట్లాడుకుంటే అప్పుడు వాళ్ళకి మనం తెలుగు వాళ్ళం అనే భావన ఏర్పడుతుంది.

కానీ, తెలుగులో బాగా పని చేయగలిగిన వాళ్లు కొద్ది మంది కావాలి. వాళ్ళు పండితులవాలి. ఆ కొద్ది మందీ విశ్వవిద్యాలయాల్లో పని చేసేవాళ్ళు కావాలి. వాళ్లు తెలుగు వాళ్ళే అవక్కరలేదు. ఫ్రెంచివాళ్ళు కావచ్చు, ఇంగ్లీషువాళ్ళు కావచ్చు, జర్మన్లు కావచ్చు, అమెరికన్లు కావచ్చును. వాళ్ళు తెలుగులో పనిచేయాలి. వాళ్ళు తెలుగులో పెద్ద పని చేయాలి. చాలా కొద్దిమంది పనిచేస్తే చాలు. తెలుగు సాహిత్యం మీద పీహెచ్‌.డీలు చేసినవాళ్ళూ, గొప్పగొప్ప పుస్తకాలు రాసినవాళ్ళూ అందరూ తెలుగు వాళ్లే కానక్కర్లేదు. ఈ విషయం ఇంకొంచెం వివరంగా ఒక నిమిషంలో చెప్తాను.

ఈ మధ్య తరచూ  ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఆంధ్ర దేశంలో ప్రభుత్వపు ఖర్చు తోను, ఈ దేశంలో ఇదిగో ఇలా మన ఖర్చు తోనూ. నేను ప్రస్తుత సందర్భానికి అనుగుణంగా ఒక సంగతి అడుగుదాం అనుకుంటున్నాను. ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి కదా, ప్రపంచ ఇంగ్లీషు మహాసభలు జరుగుతున్నాయా? ప్రపంచ ఫ్రెంచి మహాసభలు జరుగుతున్నాయా? ప్రపంచ జర్మన్‌ మహాసభలు జరుగుతున్నాయా? మరి ప్రపంచ తెలుగు మహాసభలు ఎందుకు జరుగుతున్నాయి? తెలుగు ప్రపంచభాష కాదు కాబట్టి.

తెలుగుని ప్రపంచభాష చేయాలి. అంటే, దానికి కావలిసిన పరికరాలేమిటి?

మనం ఒక ఉత్సాహంలో రెండు రోజులో మూడు రోజులో ఒకచోట చేరి, బ్రహ్మాండమైన ఉపన్యాసాలు చెప్పి, అంతకన్న బ్రహ్మాండమైన ఉపన్యాసాలు విని, ఎన్నాళ్లుగానో కలుసుకోలేక పోయిన తెలుగు స్నేహితులని మళ్ళీ పలకరించి, మంచి తెలుగు భోజనాలు చేసి, వెళ్ళిపోతాం.

ఎక్కడ చూసినా సరే, చిన్న చిన్న సంస్థలు, ఎక్కువ బలమైన ఏర్పాట్లు లేని సంస్థలను నేను చూశాను. సంస్థ అంటే కొన్ని తరాల పాటు నిలిచేది. విశ్వవిద్యాలయం ఒక సంస్థ. అది ఒక ఐదేళ్ళో, మూడేళ్ళో, నాలుగేళ్ళో ఉండి ఆగిపోదు. నడుస్తూ ఉంటుంది, కొన్ని వందల సంవత్సరాలు నడుస్తుంది.

మనం ప్రపంచం గుర్తించదగిన ప్రచురణ సంస్థలు నిర్మించాలి. విశ్వవిద్యాలయాలలోకి, లైబ్రరీలకి, పుస్తకాల షాపుల్లోకి ఆ సంస్థలు ప్రచురించిన పుస్తకాలు వెళ్లగలగాలి. హీబ్రూ లోంచి వచ్చినటువంటి అనువాదం పెద్ద పుస్తకాల షాపుల్లో తేలికగా దొరుకుతుంది. గట్టిగా ఐదుకోట్ల జనాభా ఉండరు వాళ్ళు. ఆ చాలా కొంచెం మంది ఈ దేశం మొత్తం మీద ఎంత ప్రభావం చూపిస్తున్నారో ఒకసారి చూడండి వెళ్ళి. విశ్వవిద్యాలయంలో హీబ్రూ డిపార్ట్‌మెంట్ లేని పెద్ద విశ్వవిద్యాలయం ఎక్కడుందో వెళ్ళి చూడండి. అలా అని, యూదుల కుటుంబాలలో ఉండేవాళ్ళందరూ హీబ్రూ నేర్చేసుకుంటున్నారా  – లేదు. వాళ్ళు ఇంగ్లీషే నేర్చుకుంటున్నారు. అయినా హీబ్రూ భాషని గౌరవిస్తారు. ఆ భాషలోంచి అనువాదమైన పుస్తకాలు వెంటనే కొంటారు. అవి లైబ్రరీలో ఉన్నాయో లేదో చూస్తారు. యూనివర్సిటీలో పాఠాలు చెప్తున్నారో లేదో అని చూస్తారు. హీబ్రూలో ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిగేలా చూస్తారు. అమెరికాలో కూడా హీబ్రూ నేర్చుకోదలుచుకుంటే అన్ని అవకాశాలూ వున్నాయి. కొన్ని వేల లక్షల డాలర్లు అమెరికన్  యూనివర్సిటీలలో పెట్టుబడిగా పెట్టారు యూదులు.

విశ్వవిద్యాలయాలలో తెలుగు శాశ్వతంగా నిలబడడానికి కనీసం ఒకటి రెండు మిలియన్ల డాలర్లు కావాలి. మనం తల్చుకుంటే ఆ పని చెయ్యగలం. గత పాతిక ఏళ్ళుగా తెలుగు సంస్థలు  — ఒకప్పుడు ఒకటే వుండేది, ఇప్పుడవి నాలుగు అయ్యాయి – రెండేళ్లకొకసారి ఒకరితో ఒకరు పోటి పడి మహాసభలు నిర్వహిస్తారు. వాటి కోసం రెండురోజుల్లో కనీసం కొన్ని మిలియన్ల  డాలర్లు ఖర్చు పెడతారు  —  రాజకీయ నాయకుల కోసం, సినిమా తారల కోసం, ఇతర ఆనందాల కోసం. అందులో ఇరవయ్యోవంతు ఒకచోట తెలుగు నిధిగా చేర్చి వుంటే ఈపాటికి నాలుగయిదు విశ్వవిద్యాలయాల్లో తెలుగు endowed professorship ఏర్పాటు చెయ్యగలిగి వుండేవాళ్ళం. అయినా ఈ సంస్థల ముఖ్యులే తెలుగు దేశం వెళ్లి తాము తెలుగు పీఠాలు ఏర్పాటు చేస్తున్నామని ఉపన్యాసాలు చెప్తారు.

తెలుగు పీఠం అంటే, ఇప్పుడు అమెరికాలో రెండో మూడో యూనివర్సిటీలలో ఉన్నట్టు, తెలుగు నేర్పడానికి ఉన్న చిన్న లెక్చరరు స్థాయి ఉద్యోగం కాదు. అమెరికన్‌ విశ్వవిద్యాలయాలలో లెక్చరరు అంటే తాత్కాలికంగా పనిచేసే ఉద్యోగి. కొన్ని విశ్వవిద్యాలయాలలో నిరంతరం కొనసాగుతూనే వున్న, నిత్య తాత్కాలికతలో వుండే ఉద్యోగి. విశ్వ విద్యాలయాలో పీహెచ్.డీ.లని తయారు చేసే స్థాయి ఈ వ్యక్తికి ఉండదు. అంచేత, తెలుగు నిజంగా నిలబడాలంటూ ప్రొఫెసరు స్థాయిలో ఉద్యోగులు తెలుగు కోసం ఏర్పడాలి. ఇలాటి ప్రొఫెసరు స్థాయి ఉద్యోగులు సంస్కృతానికి ఉన్నారు. తమిళానికి ఉన్నారు. హిందీకి ఉన్నారు. తెలుగుకి లేరు.

యూనివర్సిటీలలో తెలుగు ప్రొఫెసర్లు ఏర్పడడానికి అమెరికాలో తెలుగు వాళ్ళు, తెలుగు దేశంలో తెలుగు వాళ్ళూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమూ కలిసి ఒక ప్రణాళిక వేసుకోవాలి. విశ్వవిద్యాలయాలలో తెలుగు సాహిత్య, సాంస్కృతిక విషయాల మీద పిహెచ్.డి.లు తయారయి, వాళ్ల పని ప్రపంచ వ్యాప్తం అయితే తప్ప తెలుగు ప్రపంచ భాషగా బయటికి రాదు. ఇంగ్లీషు ద్వారా, అలాంటి ఇతర ప్రపంచ భాషల ద్వారా తెలుగు గురించిన విజ్ఞానం ఇతర ప్రపంచ భాషల్లోకి వెళ్లడానికి చాలా కాలం పడుతుంది. అంత దీర్ఘకాల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేస్తే తప్ప, వట్టి మాటల వల్ల తెలుగు ప్రపంచ భాష అయిపోదు. కంప్యూటర్లలో వాడడానికి తెలుగు ఫాంట్లు తయారు చేసి వాటిలో విడుదల చేసినంత మాత్రాన తెలుగు ప్రపంచభాష అయిపోదు.

ఇంతకన్న ముందుగా, ఆంధ్ర దేశంలో విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖల సంగతి చూడండి. అమెరికాలో తెలుగు ప్రొఫెసర్‌ స్థానాలు ఏర్పడ్డాయనే అనుకుందాం. ఆ స్థానాల్లో పని చెయ్యడానికి కావలసిన అర్హతలున్న వాళ్ళని తెలుగు శాఖలు తయారు చేస్తున్నాయా? అక్కడ తెలుగులో పిహెచ్.డి. పొందిన వాళ్ళు ఒక్కరైనా ప్రపంచంలో ఇతర దేశాల్లో తెలుగు ప్రొఫెసర్లు అవడానికి తగిన వాళ్లేనా? అమెరికాతో మొదలు పెట్టి ఏ ఇతర పాశ్చాత్య దేశాల్లోను, అచ్చంగా అంధ్రదేశంలో లాగా, తెలుగు శాఖలు వుండవు. ఇక్కడి దేశాల్లో దక్షిణ ఆసియా దేశాలని గురించి పాఠాలు చెప్పే శాఖలు ప్రాంతీయ అధ్యయన విభాగాల ఆవరణలో వుంటాయి. ఆ దక్షిణ ఆసియా దేశాల శాఖలలో విద్యార్థులు, దక్షిణ ఆసియా లోని భాషల్లో ఏదో ఒకదానిని ప్రధాన భాషగా నేర్చుకుంటారు, దానితో పాటు మరొక దక్షిణ ఆసియా భాష అప్రధాన భాషగా నేర్చుకుంటారు. ఇంతవరకూ దక్షిణ ఆసియా భాషలన్నీ — అంటే, సంసృతం. హిందీ, తమిళం, ఈ చాలా విశ్వవిద్యాలయాలలో దక్షిణ ఆసియా శాఖల్లోనే ఉన్నాయి. ఈ శాఖలు ఎలా పనిచేస్తాయి, అందులో పని చేసేవాళ్ళకి ఎలాంటి విద్యార్హతలు కావాలి అనే విషయాలు తెలుగు దేశంలో ఏ విశ్వవిద్యాలయపు తెలుగు శాఖా తెలుసుకోడానికి ప్రయత్నించలేదు. తెలుగు దేశపు పరిమిత అవసరాల కోసం ఏర్పడ్డ ఈ శాఖలకి తమ విద్యార్థుల్ని ఇతర దేశాలకి పంపి అక్కడి విశ్వవిద్యాలయాలలో పని చెయ్యడానికి తగిన వాళ్ళుగా తీర్చి దిద్దవలసిన అవసరం ఇంతవరకూ కలగలేదు. మరి ఇప్పుడు తెలుగుని ప్రపంచ భాషగా చెయ్యాలన్న ఆలోచన నెరవేరాలంటే, తెలుగు దేశంలో వున్న విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలు ప్రపంచ దృష్టి అలవరుచుకోవాలి.

పుస్తకాల ప్రచురణ దగ్గరికొస్తే  ఇంకా అన్యాయంగా వుంది మన పరిస్థితి. పుస్తకాలు బోలెడు అచ్చు వేస్తున్నాం. కొన్ని చాలా అందంగా కూడా అచ్చు వేస్తున్నాం. కొన్ని అందంగా అచ్చు అయినా, ఆ పుస్తకాలు అమ్ముడు పోయిన తరవాత మళ్ళా ఎక్కడ దొరుకుతాయో తెలీదు నాకు. పంతొమ్మిదివందల పదిలో, ఇరవైలో, పదిహేనులో, ముప్పైలో అచ్చైన పుస్తకాల కోసం నేను వేటాడుతున్నాను, దొరకవు ఆ పుస్తకాలు. ఏ అక్కిరాజు రమాపతి రావు వంటివాళ్ళో వెళ్ళి ఆ లైబ్రరీల్లో, ఆర్కైవుల్లో, వాళ్ల దగ్గిర, వీళ్ల దగ్గిర ప్రాధేయపడి సంపాదించుకోవాలి. ఎందుచేత ఒక్క లైబ్రరీలో ఆ పుస్తకాలు అన్నీ లేవు? ఎందుచేత ఆ పుస్తకాలు నాకు దొరకవు? అచ్చైన పుస్తకాలు ఈవాళ తాళపత్ర  ప్రతులకన్నా కష్టం సంపాదించడం. ఎంచేత? ఎవరూ దాచిపెట్టరా పుస్తకాలు. ఏ లైబ్రరీలోనూ లేవు. అంటే మనం అలాంటి సంస్థల్ని నిర్మించలేదు.

ఎవరి పుస్తకాలని వాళ్ళు వేసుకుని, అమ్ముకోవడమో, అమ్ముకోలేకపోతే ఊరికినే పంచుకోవడమో చేస్తున్నారు మన రచయితలూ, కవూలూను. ఎవరి పుస్తకాలు వాళ్ళమ్ముకునే దశలో ఎందుకున్నాం మనం? మనకు చెప్పుకోతగ్గ ప్రచురణ సంస్థలు ఎందుకు లేవు? ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురణ సంస్థ ఒక పుస్తకం వేస్తే, కొన్ని వందల సంవత్సరాల తరవాత కూడా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఉంటుందా పుస్తకం. తిరిగి తిరిగి మళ్ళా అచ్చు వెయ్యకపోయినా కనీసం వాళ్ళ దగ్గిర ఆ పుస్తకం దొరుకుతుంది. అల్లాంటి ప్రచురణ సంస్థలు నిర్మించలేక పోవడం తెలుగు వారికి తెలుగు మీద ఆసక్తి లేదు అని చెప్పడానికి ఒక గుర్తు.

తెలుగులో వున్న విజ్ఞానంలో ఏది ప్రపంచం నేర్చుకోవాలి? ఏది నేర్చుకోకపోతే ప్రపంచ విజ్ఞానానికి నష్టం? మనం ప్రపంచానికి అందించిన విజ్ఞానం వుందా? వుంది, అని చెప్పే సామాజిక స్థైర్యం తెలుగుదేశం ఎప్పుడో కోల్పోయింది. తెలుగులో ఒకప్పుడు ఉండే సాంస్కృతిక నాయకులు, కొమర్రాజు లక్ష్మణ రావులూ, గిడుగు రామ్మూర్తులూ, గురజాడ అప్పారావులూ ఇప్పుడు లేరు. ఇప్పుడు మనకున్న వాళ్ళంతా రాజకీయ నాయకులే. రాజకీయంగా ఉద్యోగాలు పోయినవాళ్లు  సంస్కృతి గురించీ, భాష గురించీ మాట్లాడతారు. ఎందుకు? మళ్ళా రాజకీయాల్లో ఉద్యోగం సంపాదించుకోడానికి. ఇంకొందరికి తెలుగు అంటే ఒక అమాయకమైన ప్రేమ. తెలుగు మీద వాళ్లకి వున్న ఆ అమాయకమైన ప్రేమ ప్రకటించుకోడానికి ఈ ఉద్యాగాలు పోయిన రాజకీయ నాయకులు అవకాశం ఇస్తారు. ఫలితం: ఖరీదయిన  ప్రపంచ తెలుగు మహాసభలూ, అంతులేని ఉపన్యాసాలూ, పత్రికల్లో ఫొటోలూను. ఆశ్చర్యమేమిటంటే ఈ జట్టులో అమెరికాలో వున్న తెలుగు సంస్థలలో ప్రముఖులు కూడా చేరడం. అమెరికాలో తెలుగు మూడు పువ్వులూ ఆరు కాయలుగా అభివృద్ధి చెందిపోతోందని తెలుగు దేశంలో ఉపన్యాసాలివ్వడం.

ఈ సభలు ప్రపంచంలో తెలుగు ప్రపంచభాషగా నిలబడడానికి ఏమీ చెయ్యవు. ఈ ఉపన్యాసాల మంత్రాల వల్ల ప్రపంచ వైజ్ఞానిక లోకంలో తెలుగు చింతకాయలు రాలవు.

ఒక భాషని రెండో భాషగా నేర్పడానికి ప్రత్యేకమైన శిక్షణ కావాలి. ఆ రకమైన శిక్షణ పొందడానికి ఉత్సాహవంతులైన తెలుగు వాళ్ళు ప్రయత్నం చేయాలి. వాళ్ళు స్కూళ్ళలో, కాలేజీలలో విశ్వవిద్యాలయాల్లో తెలుగు నేర్పే రోజు వొస్తే అమెరికాలో తెలుగు నిలబడుతుంది. ఆపైన ఇంకా విశ్వవిద్యాలయాలతో మనం కలిసి పనిచేస్తే, తెలుగుకి ప్రొఫెసరు స్థాయిలో యూనివర్సిటీలలో ఉద్యోగాలు నెలకొల్పగలిగితే, అప్పుడు వాళ్ళ కృషి ఫలితంగా తెలుగు ప్రపంచ భాష అవుతుంది.

ప్రపంచ స్థాయిలో తెలుగు గురించి తెలుసుకునే వాళ్ళు, తెలుగు లో వున్న సాహిత్యాన్నీ, ఇతర వైజ్ఞానిక సమాచారాన్నీ అంది పుచ్చుకునే వాళ్లు  ప్రపంచవ్యాప్తంగా వుంటారు. మన పిల్లలు ఏ స్కూల్లో చేరినా, ఏ విశ్వవిద్యాలయంలో చేరినా తెలుగు చదువుకునే వసతులు ఏర్పడతాయి. మన పిల్లలే కాదు ఇతర పిల్లలు కూడ తెలుగు నేర్చుకుంటారు.

మన భాష ఏదో మన ఇళ్ల్లల్లో పెద్దవాళ్ళు మాట్లడుకునే ఒకరకమైన పిచ్చి భాష అనే అభిప్రాయం పోయి, ఇది ప్రపంచంలో గొప్ప నాగరిక భాషల్లో ఒకటి అనే నిబ్బరం మన పిల్లల్లో ఏర్పడుతుంది.

నమస్కారం.
----------------------------------------------------------
రచన: వెల్చేరు నారాయణరావు, 
ఈమాట సౌజన్యంతో