Sunday, September 30, 2018

భాష బ్రతికించదు చంపదు


భాష బ్రతికించదు చంపదు






సాహితీమిత్రులారా!

దోర్బల ప్రభాకర శాస్రి గారు
చెప్పాలనుంది అనే కార్యక్రమంలో
చెప్పిన అంశాలను వినండి
ఈ వీడియోలో.


Saturday, September 29, 2018

గ్రామ్య శబ్ద విచారణము


గ్రామ్య శబ్ద విచారణము



సాహితీమిత్రులారా!


విద్వాంసుల ధోరణులు వేరు వేరు రీతుల నుంటవి. హాస్యరసము మీద కొందరి కలం పరుగులిడుతుంది. కొందరి బుద్ధులు దోషాన్వేషణములో వాడి తేరుతవి. మరికొందరి బుద్ధులు తిట్లకు తీరివుంటవి. ఈ మూడు రీతులు చాలినంత లేకపోవడమువల్లనే, మన భాష యిప్పటి యీ దురవస్థలో వున్నదని నా అభిప్రాయము.

కాని, కన్ను కొంచెము తెరచి, యితర దేశములలో భాషలు యెలా పెరుగుతున్నవో, అదిన్ని, గత కాలములో మన దేశ భాషలు యెట్లు పెరిగినవో అదిన్నీ, కాని: శ్రద్ధతో భాషా శాస్త్రమును కరచి, గ్రాంథిక వ్యావహారిక భాషలను పరిశీలించి, మరి తప్పులుపట్ట తలపడితే, ఉభయతారకంగా వుండును. తీర్పులు చెప్పడం సులభం; విద్యాపరిశ్రమ కష్టం.

అంతవరకు ఎవరి స్వాభావానుసారముగా వారిని వ్రాయనిస్తేనే తప్ప, పేపర్లకు యీ పాటి వ్రాయడమూ ఉండదు. అచ్చు ఆఫీసులు మూసి, పత్రికా సంపాదకులు తపస్సుకు కూచోవలసి వస్తుంది.

ఇక మా మిత్రులు మ.లక్ష్మణరావుగారి మాట. మ. రాయప్రోలు సుబ్బారావు పంతులుగారు యేమి వ్రాశారో నేను చూచి యుండలేదు. లక్ష్మణరావుగారి వ్రాతను పట్టి చూడగా వారికి, వాడుక భాషయందు నిరసన భావం వున్నట్టు కనబడుతుంది. ఏలనో? వారు దయచేసి కారణము చెప్పుదురు గాక.

గతకాలములో నవమాష్టం పారాయణము చెయ్యడమందు నిపుణులైన బ్రాహ్మణ ఉద్యోగస్థులు రయితును, రట్రను, పరిపాటిగా, ఒక స్వారస్యమైన తిట్టు తిట్టుతూ వచ్చేవారు. ఇప్పుడైనా కడపెడలను ఆ శబ్దం, వినబడ్డం కద్దు. యీనాడు కొందరు పండితులూ, కవులూ, అట్టిదియే గ్రామ్యోక్తి వొకటీ, గ్రామ్య భాషను గురించి వినియోగించుదురు.

వారిలో తెగబడి దీవించినవారు శ్రీ బాలకవి భోగరాజు నారాయణమూర్తిగారు. వారి వ్రాసిరి.

గీ. “అజుని సృష్టి విచిత్రమేమందు నౌర
ఘనుల నిరుపమ పాండిత్యగరిమ మేమొ
అంబురాశిలోఁ గాలకూటంబు వోలె
గ్రామ్య భాషయు కొత్తగా ప్రబలె నిపుడు.”

గీ. నిరత మన లక్షణంబుల నెగడుచుండి
ఆంధ్ర భాషతోఁ బోరాట మాడ దొడగె
లంజ సంతతి పొత్తుకై లావు మించి
యౌరసుని తోడఁ బోరాట మాడునట్లు

సీ. నవనవాలంకార నవ్య వైభవమన్న
దలనొప్పియట దీని సరణియేమో
మహిని వ్యాకరణోక్తి మాటలాడుట యన్న
వాంతి యౌనట దీని వరుస యేమొ
సాహిత్య విద్యుక్త సల్లక్షణములన్న
మరి బోసికొను దీని పరణి యేమొ
వివిధ భావ్యాకార వృత్త గీతములన్న
మూల డాగును దీని లీలలేమొ

గీ. తగుదునని తాను గూడను తగవు లిపుడు
సేయగా బూనే దెల్గుతో వేయి యేల
ఆంధ్ర భాషా వధూటి గృహంగణమున
దాసియై మెలగుటకువైన దగునె చెపుడ.

“Appearances are deceptive” అని వొక ఆంగ్లేయోక్తి కలదు. తిట్టగానే, అసూయ కాబోదు, భూషించగానే, అనురాగము కాబోదు. ముద్దు తిట్లూ భక్తి తిట్లూ రసభరితములు. నారాయణమూర్తిగారి తిట్లు కూడా అట్టివేమోయని సందేహం పొడముతున్నది. లేని యెడల అవలక్షణములు వారికవిత్వమందు వారేల వాడుదురు?

వారు ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికకు వ్రాసిన పద్యములు కాక, శ్రీ రాయబహద్దర్ వీరేశలింగం పంతులుగారి లైబ్రరీని గురించి ఆంధ్ర ప్రకాశికకు వ్రాసిన పద్యములను కూడా నేను చదివితిని. అందు కొన్ని స్వారస్యములు కానవచ్చినవి.

స్వభాషను దేశమునందునన్ జీవ వినాశ – ఘోరమునుఁ బొందగ నీయక .
పూజితమై కవీంద్ర సుమ పుష్కలమై ద్విజరాజ పుంజమై చెలంగు నీ రాజమహేంద్ర పట్టణ వర స్థిత బాలక పుస్తకాలయోర్వీజము.
కల్పతరోపమానమై.
నవ నవ గ్రంథ సంధానుడై యే కవి
అతుల తేజ సంయుతంబయి
ఈ సంస్కృత ప్రయోగములు మిక్కిలి సరళములు కావనుకుంటాను. ఇక తెనుగున కళలు ద్రుత ప్రకృతికములతో సంబంధించిన నియమములను వీరు సంస్కరించినట్లు కనపడుతుంది.

చాల యుపద్రవమయ్యె.
దేశ భాషలందెల్ల యనుచు
కథల నవ్వుల కల్లమి కలలబడుట
భాషను చక్కగా
అటు చేతురుగాక
ఇది గ్రామ్యమునకు వృత్తి కల్పించుట కదా ? బలియులు బలియురు కావలయును.

పై వ్రాసిన మాటలు, రాయవలసి వచ్చినందుకు చాలా చింతిస్తున్నాను. బాల కవులు ప్రతిభావంతులని వింటిని. మన ప్రాచీన కవుల గ్రాంథిక భాషలో రాయడమన్నది గరిడీ విద్య. భగవంతుడు కాళ్ళు యిచ్చినందుకు సుఖంగా నడవక గెడలెక్కుదురు; యేమి చెయ్యను?

రామాయణమును తెలుగు చేసిన మ. వావిలకొలను సుబ్బారావు పంతులుగారు కూడా ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో గ్రామ్యమును గురించి సరసముగా కొంత ముచ్చటించిరి. “కులటయగు మాత కన్న బతివ్రతయగు మాత యెక్కువ పూజ్యురాలైనట్లు, గ్రామ్య భాష కన్న లాక్షణిక భాషయే ప్రశస్తమని బుద్ధిమంతులెల్ల నంగీకరింతురు. అట్టి సలక్షణ భాష నుపేక్షించినచో గలుగు ననర్ధములు పెక్కులు గలవు. గ్రంథ విస్తర భీతి సంక్షేపించెద. గాని తుదకాంధ్ర పదము నామావశిష్టమగు.”

పర భాషల నేర్చుట కడుపు కూటి విద్యగా నెంచి యింకొక చోట రాయడంలో సుబ్బారావు పంతులుగారు పరభాషల నేర్చుట కేవలం గర్హ్యము కాదనుటకు ప్రమాణముగా యీ క్రింది పద్యమును వుదహరించిరి.

“క్షితిమ్లేచ్చ భాష శ్రుతి గ
ర్హిత మగునట్లేనని ధరిత్రిని దానిన్
మతి రోసి విడువ గూడదు
సతతము వ్యవహార హాని సంధిలు కతనన్”

పై పద్యమున మ్లేచ్చ భాషయని రాయడములో అప్పకవి తురకల భాషను మనస్సులో వుంచుకున్నాడు. ఆ కింది ఉదాహరణములను చూడండి. సుబ్బారావు పంతులుగారు యింగ్లీషు భాషను మనస్సులో వుంచుకొనిరి. గాని శ్రుతి గర్హితమయిన మ్లేచ్చితము, యిది గాని, అదిగాని కాదనుకుంటాను.

పతంజలి వ్యాకరణాధ్యయన ప్రయోజనములను చెప్పడములో, శతపథ బ్రాహ్మణంలోని ముక్కొకటి యెత్తి రాసినారు.

“తేஉసురా హేలయె హేలయ ఇతి కుర్వసతః పరాభవభూవుః
తస్మాబ్రహ్మణేన న మ్లేచ్చితనై నాపభాషితవై !
మ్లేచ్చో హ నా ఏష య దవశబ్దః [1]

మరివొక చోట మహాభాష్యంలో —

“గరీయా నప శబ్దోప దేశః ఏకైకన్య శబ్దస్య బహవో అపబ్రంశాః
తద్యథా గౌరిత్యస్య శబ్దస్య గావీ , గోణీ, గోతా, గోపోతలికేత్యేవ మాదయో పభ్రంశాః “[2]

శ్రుతి దృష్ట్యా, సంస్కృతపు మాట, లోకుల నోట మారి సంస్కృత లక్షణమునకు పొందక పోగా, అట్టి మాట మ్లేచ్చితము లేక అపశబ్దమగును. అంతేగాని తురకమూ, యింగిలీషూ మ్లేచ్చితములు కావనుకుంటాను.

ఉద్యోతంలో నాగోజీభట్టు
“నమ్లేచ్చితవై భాషా విషయమితి భ్రమ నివృత్త్యర్ధం తద్వివరణం నాపభాషితవై ఇతి…
అపశబ్దత్వం వ్యాకరణనుగత శబ్దస్యేష ద్భ్రంశన ఏవ ప్రసిద్ధమితి భావః ॥
నను మ్లేచ్చోనామ పురుష విశేషోవా సకథమపసబ్దో? త అహ ఘణితి ।
నిన్దావచనా న్మ్లేచ్చతేరితి భావః ।
నిన్దాచ శాస్త్ర బోధిత విపరితోచ్చా రణేన పాపసాధనత్వాత్ ।
ఏవంత మ్లేచ్చా ఇత్యస్య నిన్ద్వా ఇత్యర్థ ఇతధిక్ ॥ [3]

వేద దృష్ట్యా అన్య దేశ భాషలకు మ్లేచ్చిత దోషము వర్తించనేరదు. “గ్రామ్యము నందుగల యనేక దోషంబుల గ్రహించియే పూర్వులు ‘అపశబ్దం ప్రయుంజానో యనేక గౌరవం నరకం ప్రజేత్’[4] అని శాసించినారని సుబ్బారావుగారు ఒక బాంబును నాబోట్ల మీద విసర జూడగ అదిపంతులుగారి చేతిలోనే పేలినది. యుక్తమే కదా?

సుబ్బారావు పంతులుగారు రామయణమును తెనిగించినారు. వారి తెనుగు సంస్కృత పదములతో నిండి వున్నది. వీరి సంస్కృత ప్రయోగములలో మ్లేచ్చితములు అక్కడక్కడ కలవు. “గోవీ, గోణీ, ఆణవయతి”[5] ఇత్యాది అపభ్రంశములను పఠించిన శిష్టేతరులకు , లోకసిద్ధి అయినా శరణమైయుండెను. స్వసిద్ధాంత ప్రకారము పంతులుగారికి శరణమూ కానరాదు.

గాని, ఉద్యోతంలో “ప్రకరణాచ్చతత్వంగోయం నిషేదః”[6] అని, అహోబల పండితీయములో “అత ఏవ వ్యాకరణ మహాభాష్యే సర్వోప్యప
శబ్ద నిషేదః క్రతు విషయ ఏవ ఇతి ప్రతిపాదితం [7] . ఇటువలెనే శబ్ద కౌస్తుభంలో కూడా మహా భాష్యమందు “యాజ్ఞే కర్మణి ననియమో అన్యత్రా నియమః”[8] ఉద్యోతంలో “యజ్ఞే సుశబ్ద ప్రయోగాద్ధర్మోప శబ్ద ప్రయోగాద ధర్మ ఇతి తత్రైవ తయోః ప్రయోగ నియమః తదతిరిక్త స్థలేతు సుశబ్దాప శబ్దయోః ప్రయోగే అనియమః”[9]

ఇలా రాయడంచేత సుబ్బారావు పంతులుగారి రామాయణమందు నాకు అనాదరణ కలదని భావించకండి. వీరి కవిత్వం సాఫైనది. వారి దైవభక్తి అందరూ యెన్నతగి యున్నది. తెలుగులో వీరి పాండిత్యము అసమానము గాని తెనుగులు నేర్చి, వీరి ఆంధ్రీకరణమును చదువుటకన్న, సంస్కృతంలో మిడిమిడి జ్ఞానం సంపాదించుకొని వాల్మీకి రామయణం చదువుకోవడమే శ్రేయమని నా అభిప్రాయం.

ఆంధ్రపత్రికలో “గ్రామ్యమును నిరసించుచు” వీరు వ్రాసిన వ్యాసమును బ్ర॥ శ్రీ కాశీభట్ల బ్రహ్మయ్యగారు పొగిడి, తమ పత్రికలో ప్రచురించిరి. బ్రహ్మయ్య శాస్త్రిగారు కూడా వ్యావహారిక భాష “అందరి నోటంబడి కులటవలె భ్రష్టత నంది యుండును” అని వ్రాసిరి. బ్రహ్మయ్య శాస్తుల్లుగారి దర్శనము నేను చేసి వుండకపోయినా చాలా కాలమునుండి వారి నెరుగుదును. వారి భాష నిర్దుష్టము. విద్యయు, తత్వాన్వేషణమును వారికి వ్యసనములవుట చేత, మాలో అభిప్రాయ భేదములున్నా వారి యెడల నాకు విశేష గౌరవము కలదు.

వాడుక భాషను గురించిన నా అభిప్రాయములను ప్రమాణములతో విమర్శించిన వారు వీరొక్కరే. సమాధానములు, మరివొక చోట చెప్పదలచితి గాని, వారు ఉదహరించిన యింగ్లీషు పుస్తకములు ప్రస్తుత వాదమునకు ప్రసక్తములు కావు. ఇక వారి వాదమునకు సంస్కృత వ్యాకరణము యెటుల సహకారియో తెలియవలసి వున్నది. కన్నడ గ్రాంథిక భాష మారుచు వచ్చెను గదా? ఆ మారుదలకు ఆ దేశపు శిష్టులు యెటుల వొప్పిరో? తెనుగు గ్రాంథిక భాష మాత్రము మారలేదా?

ఈ మధ్య “యిలస్ట్రేటెడ్ లండన్ న్యూస్” అను పత్రికలో చెస్టర్‌టన్ (Chesterton) అను బుద్ధిశాలి, వైరుధ్యం లేని వినోదము గురించి చమత్కారముగా ముచ్చటించిరి, సీమలో Unionist versus frce trader అనునది. అటువంటిదే. పాత గ్రాంథిక భాషను, సలక్షణముగా వ్రాయవలసినదన్న శాస్తులు గారి మతమునకున్నూ, శిష్టులు యీనాడు వాడుకుంటూ వున్న భాషలో నుంచి క్రొత్త గ్రాంథిక భాషొకటి కల్పించుకోవలసినదన్న నా మతమునకున్నూ వైరుధ్యం యెక్కడ? మా జాగాలే వేరు.

పరిశీలించి చూడగా, శాస్తుల్లుగారికిని, నాకును అభిప్రాయ భేదము చాలా తక్కువ. గ్రాంథిక భాష వాడుక చేసేవారు. దాని నియమములను పూర్తిగా మన్నించవలసినదనే నా అభిప్రాయము. ఆ భాషను సాధించలేని వారు, అనగా లోకానికెల్లా, బ్రహ్మయ్య శాస్తులు గారి వంటి పదిమంది తప్ప కడమందరూ, వాడుక భాషలోనుంచి సులభ సాధ్యమైన వొక క్రొత్త గ్రాంథిక భాషను కలిపించుకుంటే, శాస్తులుగారికి యేమి కొరత?

వాడుక భాషను కులట అని మర్యాదచేసే పండితులు దానిని దూరముగా విసర్జించక యేల వాడుక చేతురో? వారు ‘యాంటీనాచ్’ కారు గాబోలును.

ఇక కళింగ దేశ చరిత్ర మాట: దానిని గురించి మా మిత్రులు నాతో ముచ్చటించినప్పుడు, వారు కోరకముందే, వారి నిర్ణయములను యెరిగిన వాడనౌట చేత, యిదివరకు నలుగురు వ్రాస్తూ యున్న భాషనే వ్రాతునంటిని. అట్టి వొప్పుదలకు కారణము దేశమున చరిత్ర జ్ఞానము విరివి కావలెనని మా మిత్రులు చేస్తూవున్న మహోద్యమమునకు తోడ్పడను అభిలాషే. అంతేగాని ఇప్పుడు గ్రంథకర్తలు వ్రాస్తూవున్న అత్యంత కృత్రిమ భాషకంటె, బ్రాహ్మణాదులు వాడుకునే భాష మంచిదని తెలియక కాదు.

ఇప్పుడు లక్ష్మణరావు పంతులుగారు నాకు వొక చిక్కు తెచ్చిపెట్టినారు. వారు రాసిన లేఖలో లక్షణ ప్రయుక్తమనే మాటొకటి ప్రయోగించారు. యీ లక్షణం స్వభావం యెట్టిదో వారు కొంచము శ్రమ చేసి పత్రికాముఖంగా లోకానికి వ్యక్తీకరిస్తే ఉపయోగంగా ఉంటుంది.

వ్రాతను బట్టి పోల్చుకుందామని, విజ్ఞాన చంద్రికా గ్రంధమాలలో చటుక్కున చేతికి వచ్చిన ఆంధ్రుల చరిత్రను తీసి చూస్తిని. దానిలో భూమిక మా మిత్రులు రాసినదే. మొదటి వాక్య కబందమును చదివి చూడగా భాష లక్షణానుసారంగా వున్నట్లు నాకు కానరాలేదు. “అనియు మాద్గ్రామ్యంహి యత్యపభ్రమంశః [10] అనే లక్షణము ప్రమాణం అయిన యెడల ఈ భాషకు గ్రామ్యత గట్టిగా పట్టి వున్నది. గ్రామ్యంలో దిగిన వెనుక ఆగడం యెక్కడో!

అది అటుండగా గ్రామ్యశబ్దార్థం యేమిటి? “శతాంధాః కూపం ప్రవిశంతి”[11] వొకడన్నాడని వొకడండమేనా, తత్వవిచారంకద్దా? సంస్కృత భాషా కావ్యదోషము. అహోబల పండితులు దీనిని గురించి కొంత రాసినారు (రాజా భుజంగరావుగారి పుస్తకములో 117 పేజీ చూడంది.)

గ్రామ్య శబ్దానికి సాధారణమైన అర్ధము మోటు. ఈ శబ్దమునకు విరోధి “నాగరము, నాగరికము, నాగరకము.” యింగ్లీషులో నాగరికము Polite, refined అందురు. గ్రామ్యము Low, vulgar అందురు.

“శబ్దేపి గ్రామ్యతాస్త్యేవ సాసభ్యేతర కీర్తనాత్” శిష్టులు రాత్రీ పగలు వాడుకచేసే భాషను గ్రామ్యమనడము, అనాలోచితమనుకుంటాను. అదే గ్రామ్యమౌట నిజమైతే ఇప్పటి మన గ్రంథకర్తలంతా గ్రామ్య జనమే. ఒక్క మహామహోపాధ్యాయులు తర్క “పామరాది ప్రయుక్తం యత్తద్గ్రామ్య మభిధీయతే.”[12]

గనుక యిటుపైని బ్రాహ్మణాదులు వాడుకునే నాగరికమైన భాషను పండితులు గ్రామ్యమనక పోవడము ఉచితమని భావిస్తాను. నాగరకమని దానికి పేరుపెట్టి గ్రామ్యమును వొక చీడి దించితే, శబ్దౌచిత్యము సాధితమౌతుంది.

“అనియద్గ్రామ్యం హి యత్వపభ్రశః”[13] అని కొందరనగలరు. ఆ మాటకు వస్తే, నియమం లేని భాషే వుండదు. వొక వేళ వుండుననుకున్నా, గ్రామ్య భాషకు వొక నియమం చేసుకుంటే, గ్రామ్యత పోవలెను. యీ కారిక రాసిన వైయాకరణుడు అయితేనేమి, అహోబల పండితుడైతేనేమి, సంస్కృత లక్షణానుసారంగా, తెనుగుకు లక్షణం కల్పించకోరి, అసందర్భములు కల్పించుకున్నారు.

కాదంటిరా, నియమమంటే యేమిటో, సంస్కారం అంటే యేమిటో, వాటి స్వభావ మెట్టిదో వాటి చరిత్ర యెట్టిదో స్పష్టముగానూ విపులముగానూ యెవ్వరేని ఉపన్యసించి మమ్ముల తరింపజేతురు గాక. సంకేతిక సుప్రసిద్ధ పదములు కూడా యెట్టివో తెలియగోరితిని.

గ్రామ్య, మ్లేచ్చిత, అపభ్రంశ శబ్దములను గురించి ముందు వ్రాసెదను. గ్రామ్యమును గురించి మా మిత్రులు బ్రహ్మశ్రీ వేదం వేంకటరాయ శాస్తులవారు చాటలు చెరిగి చర్చించినారు. వారు గ్రామ్య భాషను రాసిన కొన్ని పాటలు బర్న్‌స్ అను మహాకవి పాటలను పోలియున్నవి.

గ్రామ్య భాషను గురించి యెవరేమి ప్రచురించినను దయచేసి ఆ పత్రికలు నాకు పంప వేడెదను. గ్రామ్య భాషా చర్చ గోరిన పత్రికా సంపాదకులు గ్రామ్యమును గురించి, నా వ్యాసములు వారి పత్రికలలో యెత్తి ప్రచురింతురు గాక!

ఇంతవరకు వ్రాసిన పిదప మా మిత్రులొకరు శ్రీ బాలకవిగారి విమలాదేవి అను నవలను నాకిచ్చిరి. స్థాలీపులాక న్యాయముగా పరిశీలించ ఈ ప్రయోగములు కానవచ్చినవి

అనవసరమైన చోట్లను అనగా అనుకరణములేని చోట్ల అన్యదేశములు.
సూచీ పత్రములో ఔరంగజేబు ఖాయిలా; యా ఖుదా యా అల్లా; హుషారీ, ఖత్తల్ – ఇట్టివి చాలా కలవు.
సంధి విసంధులు తోవలు కానరావు
వఱకు ఆంధ్రోపాధ్యాయ పదవి; గ్రంథకర్తను అగు; సమగ్ర సృష్టియనియు, ఇందు; ఇప్పుడు; ఇందిర; ఇట్లు, ఉదయమున; గార్లు; ఆశ్చర్యాతిరేకముచేత, రాజసింహుడు; అతని ఏమి యీ యన్యాయము; ఇంతలో నారాజభటులు ఆ పురుషుని ఈడ్చుకొని బాటసారిని సమీపించిరి.
తనకుగల – నుత్సాహము; విరిచి గట్టి; నాకిదియే ప్రథమ ప్రయత్నమని దెలుపుచుండ; రాజ్యమునకు వారసననియు, (వారిన్ లేక వారిన) చంద్రావతి మహారాణిబట్టి తెచ్చిన యాతడు సంతోషాతిశయమున.
న్యాయమైన ఆడుది; సాటి వంశజుడే; అన్యధా తలంచి; సంరక్షణ స్మరణ; ఈ ప్రయాస కూడ; కుంభకర్ణుని పాత్ర; అర్ధపూర్ణ దృష్టి; సృష్టింపబడె; అంతా రామమయం (మిగిలిన పాట సంస్కరింపబడినది); నీవు చింతాక్రాంతయై; దండన; ఘటనము; సాహాయము; జాగ్రత్తగా; అసహ్యపరుడు (అసహ్య పాత్రుడనుటకు) ఇతరత్ర; తన తదంతరము; కుమారిత; భగవాన్ వశిష్టుల వారు; ఆపద నివారణోపాయము; ఆడపడుచు.
ఇవన్నీ తప్పులని నా అభిప్రాయమని కాదు “అపశబ్ద భయం నాస్తి అప్పలాచార్య సన్నిధే”[14] అని చెప్పే వుంచాడు. బాలకవుల ప్రయోగసరణి కవిత్రయమువారి సరణికి చాలా దూరమనుకుంటాను.

అథస్సూచికలు

1.అసురులు హే అరయః హే అరయః అని అనడానికి బదులు హే అలయః హే అలయః అని అనడం వల్ల పరాజయం పొందారు. హే అని ఫ్లుతంగా ఉచ్చరించాలి. ఫ్లుతం అయితే హే అరయఁ అనాలి గాని, హేఅలయః అనరాదు. ఇదొక తప్పు. మరొకటి అరయః (శత్రువులు) అనడానికి మారు అలయః అని రకు/మారుల వాడడం. అందువల్ల పరాజయం పొందారు.కనుక తప్పులు పలుకరాదు. మ్లేచ్చమంటే అపశబ్దం.
2.అపశబ్దంగా మారడం సహజం. అపశబ్దంగా ఉచ్చరించడమనే అలవాటు బలమైంది. ప్రతి శబ్దానికి అపభ్రంశాలు ఎన్నో ఉంటాయి. ఉదాహరణకు గౌః అనే పదానికి గావీ, గోణీ, గోతా, గోపాతలికా మొదలయినవి అపభ్రంశ పదాలు.
3.నమ్లేచ్చితవై అంటే, మ్లేచ్చ భాషా విషయమేమో అని భ్రమ పడరాదని , దానిని నివారించడానికే నాపభాషితవై అని వివరించారు పతంజలి.నమ్లేచ్చితవై అంటే అపశబ్దం పలుకరాదు – అని అర్ధం. అపశబ్దమంటే వ్యాకరణానికి అనుగుణమైన శబ్దోచ్చారణము చేయకపోవడం, మ్లేచ్చ అంటే మనిషా, దేశమా? రెండూ కాదు. మ్లేచ్చ అంటే తప్పు అని అర్ధం. తప్పు చేయరాదు. వ్యాకరణ శాస్త్రానికి విరుద్ధమైన ఉచ్చారణ చేయడమనే తప్పు వల్ల పాపం కలుగుతుంది. ఇంతకూ మ్లేచ్చ అంటే తప్పుగాని మరొకటి కాదు.
4.అపశబ్దం ప్రయోగించేవాడు రౌరవ నరకంలో పడతాడు.
5.గావీ, గోణి,అణవయతి – గౌః అనే పదానికి గావీ, గోణీ అనేవి అనయతి అనేదానికి అణవయతి అనేవి అపభ్రంశ రూపాలు.
6. సందర్భాన్ని బట్టి ఈ నిషేధం క్రతువుకు యజ్ఞానికి సంబంధించినదే. యజ్ఙభాగమే.
7. అందువలన వ్యాకరణ మహాభాష్యంలో అపశబ్ధ నిషేదమంతా యజ్ఞానికి సంబంధించినదే అని ప్రతిపాదమైంది.
8. యజ్ఞ కర్మలోనే ఆ నియమం గాని, ఇతరత్రా ఆ నియమం లేదు.
9. యజ్ఞంలో సుశబ్దం వాడితే ధర్మం కలుగుతుంది. అపశబ్దం వాడితే అధర్మం కలుగుతుంది. అందువల్ల అక్కడే యజ్ఞంలోనే ప్రయాగ నియమం. ఇతర స్థలాలలో సుశబ్ద అశబ్ద ప్రయోగ నియమం లేదు.
10.ఒక గుడ్డివాడిని నమ్మి వంద మంది గుడ్డివారూ బావిలొ పడుతారు.
11. సభ్యం కాని వాటిని – అనాగరకమైన వాటిని పలుకడం వల్ల శబ్దంలో గ్రామ్యత్వమనేది ఉండనే ఉంది.
12. పామరులు మున్నగువారు వాడేభాషను గ్రామ్యమంటారు.
13. నియమం లేకపోతే గ్రామ్యం, అనే అపభ్రంశం.
14. అప్పలాచార్యుల వద్ద అపశబ్దమనే భయమే (మాట) లేదు.
--------------------------------------------------------
రచన: గురజాడ అప్పారావు, 
ఈమాట సౌజన్యంతో

Friday, September 28, 2018

అల్లాష్టకము


అల్లాష్టకము




సాహితీమిత్రులారా!

అష్టకాలు దాదాపుగా హిందూ దేవీదేవతల మీదే కనిపిస్తాయి
కాని అల్లాష్టకమనే ఈ అష్టకాన్ని  జెజ్జాల కృష్ణ మోహన రావు గారు కూర్చారు
ఇక్కడ చూడండి-

అల్లా యొక్కడె దైవం
బల్లా పంపెను ముహమదు నవనీతలిపై
నెల్లరి జీవన పథముల
దెల్లముగా దెలియ జేసి దివ్యము జేయన్

అల్లా జగమున కాదియు
నల్లా విశ్వమున కంత మగు నెంచంగా
నల్లా శాంతికి నెప్పుడు
నిల్లై నిల్చును, సమతకు నిరవగు నవనిన్

అల్లా నీవే జనకుడు,
యల్లా నీవే జననియు, నాప్తుడు నీవే,
యల్లా నీవే బంధువు,
యల్లా విత్తములు, విద్య లంతయు నీవే

తల్లుల చల్లని ప్రేమలు,
పిల్లల మాటలు, నగవులు, ప్రియమగు పాటల్
ఫుల్ల ధవళ కుసుమ సరము
లల్లా తెల్లని మనసున కతి ముదము నిడున్

అల్లా యెడారి నొంటిగ
మెల్లగ పడి లేచుచుంటి మిడిమిడి వడలో
జల్లని నీ జేతుల రం-
జిల్లగ నడిపించి యిల్లు జేర్పించు దయన్

కల్లయు కాదిది కనగా
నెల్ల జగ మొక మధుశాల, యెల్లరు పాంథుల్,
త్రుళ్ళు మదియు సఖి పాటల,
నల్లా ప్రేమామృతరస మాస్వాదించన్

అల్లా నామస్మరణయు
కుళ్ళును మదిలో కడుగును కుతుకముతో, నా
యల్లా కరుణకు నెల్లై
యెల్లరి జీవముల నిల్చు హృదయపు కళయై

అల్లా శాంతిని నింపుమ,
యల్లా తొలగించు భ్రాంతియవనిక ద్రుటిలో
దెల్లని కాంతుల జూపుమ
యల్లా గాఢాంధకారమం దిల మాకున్

ఫలశ్రుతి-

అల్లాష్టకమును జదువగ,
నల్లాష్టకము నతి భక్తి నందఱు వినగా,
నల్లా యిచ్చును జీవుల
యుల్లమునకు సుఖము శాంతి నురుతర గతితో

Wednesday, September 26, 2018

గ్రామ్యభాష – శిష్టభాష


గ్రామ్యభాష – శిష్టభాష



సాహితీమిత్రులారా!



సవరలు, కోయలు మొదలయిన మోటు జనులు సంఘములలో అందరూ ఒక్క విధమయిన భాషే మాట్లాడుతారు; శిష్ట భాష అనీ గ్రామ్య భాష అనీ తారతమ్యము ఉండదు. నాగరికులతో సంబంధముగలవారు కొందరు నాగరికుల మాటలు కొన్ని తమ భాషలో కలిపి వాడుకొంటారు. వాటి ఉచ్చారణ సరిగా ఉండకపోయినా, అందరూ వాటిని మెచ్చుకొంటారు. గాని నాగరికులు వాటిని “అపభ్రంశ” మంటారు. వర్ణవ్యవస్థ యేర్పడ్డ సంఘములలో భాషావ్యవస్థ కూడా ఏర్పడుతుంది. మాట్లాడేవారి ప్రతిష్ఠ, గౌరవము, కులీనత్వము మొదలయినవాటిని బట్టి వారి భాష “శిష్ట భాష” అని మెప్పుపొందుతుంది; అట్టి వారితో సహవాసము చేత, ఇతర జాతుల వారికి కూడా శిష్ట భాష అలవడుతుంది. క్రమక్రమముగా ఈ “శిష్టభాష” సంఘములో వ్యాపిస్తుంది. “దేశభాష” అనేది ఈలాగుననే ఏర్పడుతుంది.

వ్యవహార భ్రష్టమయి, నాగరికులు పూర్వము రచించిన గ్రంథములలో మాత్రము నిల్చి ఉన్న భాష, ఆ గ్రంథములు చదివే వారికే తెలుస్తుంది గాని ఇతరులకు తెలియదు. ‘గ్ర్యామ్య భాష’ అది మాట్లాడే జాతివారికే కాని ఇతరులకు బాగా తెలియదు. ‘శిష్ట భాష’ ఒక్కటే సంఘములోనివారికి, మొత్తము మీద అందరికీ తెలిసే భాష; గనుకనే దానికి ‘దేశ భాష’ అనే పేరు కలిగినది. అది అచ్చుకొట్టినట్టు దేశమందంతటా ఒక్క లాగున ఉండదు. వ్యవహారమందుండే భాషలన్నిటి “స్వభావము” ఇట్టిదే. మన తెలుగువారి దేశభాష ఒకొక్క జాతిలోనూ, ఒకొక్క మండలములో ఒకొక్క విశేషము కలిగి ఉన్నా మొత్తము మీద అందరికీ సామాన్యమై అంగీకరించక తప్పదు. ఏ ప్రదేశమందున్నా వారు ఆ ప్రదేశమందున్న శిష్టభాషలో గ్రంథములు రచిస్తే అక్కడివారికే కాక తక్కిన ప్రదేశములందున్న వారికి కూడా మొత్తము మీద సుబోధముగానే ఉంటవి. కవుల సంప్రదాయము అన్ని దేశములలోనూ ఇదే.

శిష్టజనులు వాడే భాష ‘ గ్రామ్యము’ అని నిందించడము అవివేకము. ‘గ్రామ్యమ్’ అనేది సంస్కృత భాషలోని శబ్దము; ఆ భాష అనుశాసించిన పాణిన్యాదులు గానీ, కావ్య లక్షణము రచించిన పండితులు కానీ శిష్ట భాష గ్రామ్యమని చెప్పలేదు. ఆంధ్ర శబ్ద చింతామణి, అప్పకవీయము, బాలవ్యాకరణము మొదలయిన లక్షణ గ్రంథములు రచించిన వారు ‘లక్షణ విరుద్ధ మయిన భాష గ్రామ్యము’ అన్నారు, గాని ఆ మాట తప్పు. గ్రామ్యమనగా పామరజన వ్యవహారమనిన్ని, పామరులనగా ఆభీరులు (మేకలు కాచే గొల్లజాతివాళ్ళు) మొదలయినవారనిన్ని లాక్షణికులు నిర్వచించినారు. లక్షణ విరుద్ధమయిన భాష “చ్యుత సంస్కారము” అని ‘ దోషము’ గా పేర్కొన్నారు. ఇంగ్లాండులో నేడు శిష్ట వ్యవహారమైందున్న ఇంగ్లీషు భాషే దేశ భాష; శిష్టులు కానివారి భాష Vulgar అని, Slang అని, Cockney అని, Cant అని, Patois అని, Brogue అని అంటారు; శిష్టులు అట్టి భాషను నోటను ఉచ్చరించనే ఉచ్చరించరు; శిష్టుల సంభాషణలో అట్టి మాటలు వినబడవు. Rail అనే మాట ‘రైల్’ అని గ్రామ్య జనులు పలుకుతారు. అది ‘Cockney’, ‘vulgar’ ఉచ్చారణ అంటారు. Funk వంటి మాటలు Slang అంటారు; ఇట్టి మాటలు శిష్టుల వాడుకలో చేరితే మరి నింద్యములు కావు. శబ్దముల శిష్టత్వమే అవి వాడేవారి శిష్టత్వము వల్ల కలుగుతుంది, గాని వాటికి స్వభావసిద్ధమయినది కాదు. ‘కూకో’, ‘కూర్చో’, ‘కూచో’, ‘కూకొని’, ‘కూర్చొని’, ‘కూర్చుని’, ‘కూచుని’ — వీటిలో ‘కూకో’, ‘కూకొని’ గ్రామ్యజనులున్ను తక్కినవి శిష్ట జనులున్ను వాడుతున్నారు; ప్రాచీనాంధ్ర కావ్యములందు ఇవి కనబడవు; కొత్త తెలుగు మాటలు. నేటి కవులు యధేష్టముగా ఈ “శిష్టభాషితములు” ప్రౌఢరచనలో ప్రయోగిస్తున్నారు. ‘కూకో’, ‘కూకొని’, ‘తొంగో’, ‘ తొంగొని’ గ్రామ్యములు గనుక శిష్టులు సంభాషణలో నయినా వాడరు. జాతీయత తెలియజేయడమునకు పాత్రోచితముగా నాటకాలలోనూ, నవలలోనూ, కథలలోనూ కొందరు ఇట్టి శబ్దములు ప్రయోగిస్తున్నారు. ఇట్టి వ్యవస్థ అన్ని దేశములలోను ఉన్నది.

సంస్కృత భాషారచనలో అపభ్రంశ భాష చేర్చరాదని లాక్షణికులు నిషేధించినారు; గాని అపభ్రంశ భాషలలో గ్రంథాలు రచించగూడదని చెప్పలేదు. బృహత్కథ, సప్తశతి, సేతుబంధము, కర్పూర మంజరి మొదలయిన గద్య కావ్యములూ, పద్య కావ్యములూ నాటకములూ గొప్ప కవులు ప్రాకృత భాషలో రచించినారు కారా? నికృష్టమైన పైశాచీ భాషలో రచించిన కావ్యములు (ఎంకిపాటల వంటివి) సయితము సహృదయులు మెచ్చుకున్నారే! కేవలమూ గ్రామ్య భాషలో కవిత కూర్చడము నిర్దోషమయి ఉండగా, మన శిష్ట వ్యవహారమందున్న తెలుగు కావ్యరచనకు యోగ్యము కాదనడమూ, అది గ్రామ్యమని నిందించడమూ అవివేక విలసితము కాదా?

” ఇంగ్లీషు భాష సంభాషణలో ఒక విధముగాను, గ్రంథాలలో మరి ఒక విధముగా ఉండదా? అట్టి భేదము తెలుగులో కూడా ఉండవద్దా? అని కొందరు అడుగుతారు. అటువంటి భేదము అన్ని భాషలలోను ఉన్నది. Saintsbury అనే ఇంగ్లీషు పండితుడు ఈ విషయమయి అన్న మాటలు ఈ ప్రశ్నకు ప్రత్యుత్తరముగా చెప్పుతున్నాను. “willnot అని అనవలసి వచ్చినప్పుడు won’t అని వాడకూడదు; నిజమే. కాని won’t అని అనవలసినప్పుడు will not అని వాడడము అసహ్యముగా ఉంటుంది. ఏ సందర్భములో ఏది వాడవలెనో శిష్టుల వాడుకము పట్టి తెలుసుకోవలెను.” ఇష్టగోష్ఠిలో library, veterinary, deputy అనే మాటలు ‘లైబ్‌రి’, ‘ వెటరిన్‌రి’, ‘డెప్‌టి’ అనిన్ని సభలో ‘లైబ్‌రరి’, ‘వెటరినరి’, ‘డిప్యుటి’ అనిన్ని శిష్టులు ఉచ్చరిస్తారు. సంభాషణ లోని శైలి కిన్నీ గ్రంథములలోని శైలికిన్నీ కొంచెము భేదమున్నా అది అందరికీ తెలిసిన వ్యవస్థను అనుసరించి ఉంటుంది. ఇంగ్లండులో 200 సంవత్సరములయి వ్యావహారిక భాషలో గ్రంథరచన అందరూ అభ్యసిస్తూ ఉన్నందున శిష్టుల వాడుకను బట్టి కొన్ని వ్యవస్థలు ఏర్పడి ఉన్నవి. అవి Current English Dictionary, King’s English, ModernEnglish Usage అనే లక్షణ గ్రంథములందు Fowler పండితుడు తెలియజేసినాడు. అట్టి గ్రంథములు మరికొందరు కూడా రచించినారు. అయితే లాక్షణికులు వ్యవస్థ ఏర్పర్చే అధికారము గలవారు కారు; శిష్ట వ్యవహారమందు ఏర్పడిన వ్యవస్థను బట్టి అనుశాసనము చేస్తారు; అది “శాసనము” కాదు. వారి అనుశాసనము అన్ని నియమములోను అందరూ అనుసరించరు. ‘మా యిష్టము మాది’, ‘మా వాడుక, మా కిష్టము’ అనే కవులు ఇంగ్లీషువారిలోను, ఫ్రెంచి వారిలోను ఉన్నారు. తెలుగు వాడుకను గురించి వ్యవస్థలు నిరూపించి లక్షణము రచించే కాలము ఇంకా రాలేదు. తిక్కన చెప్పినట్టు పాత మాటలు విడిచిపెట్టి ఔచితిని బట్టి దేశభాషా శబ్దములు ప్రయోగించి గద్య కావ్యములు పద్య కావ్యములు రచించడము కవులు కొంత కాలము అభ్యసిస్తే కాని వ్యవస్థలు ఏర్పడవు. ముందుగా వ్యవస్థలు ఏర్పర్చుకొని మాతృభాషలో కవితలు ఏ దేశములో ఎవరూ కూర్చలేదు. భాషావ్యవస్థలు భాషలోనే ఉన్నవి; మనము వాటిని కనుక్కోవలెను.

బంగాళీ బాలకవులు తమ “చలిత్ భాష” (అనగా వర్తమాన వ్యవహారిక భాష) లోనే నానావిధ గ్రంథములూ రచిస్తున్నారు. సరికొత్త మాటలే కాని “పాతపడ్డ మాటలు వాడము” అని దీక్ష పట్టినారట. There is a strong body of writers who advocate the supersession of the old literary language by this living and vigorous form of spoken Bengali అని కలకత్తా విశ్వవిద్యాలయములోని పండితుడు డాక్టరు సునీతికుమార చటర్జి గారు “A Brief sketch of Bengali Phonetics” అనే గ్రంథములో వ్రాసినారు. తెలుగు బాలకవులు కూడా బంగాళీ వారివలె మాతృభాషాభిమానము కలవారై చక్కని కవితలు కూర్చగలిగితే ఆబాలగోపలమయిన అభినవాంధ్ర సారస్వతము ఉదయిస్తుంది. దానివల్ల వారికీ, వారి భాషకూ, వారి సంఘమునకూ లోకములో గౌరవ ప్రతిపత్తులు కలుగుతవి. సంఘముయొక్క భాగ్యము కవిబ్రహ్మల చేతిలో ఉన్నది.
---------------------------------------------------------
రచన: గిడుగు రామమూర్తి పంతులు, 
ఈమాట సౌజన్యంతో 

Tuesday, September 25, 2018

చెప్పు నన్ను జూతు - చందమామ


చెప్పు నన్ను జూతు -  చందమామ





సాహితీమిత్రులారా!

1948 ఆగష్టు నెల చందమామలో
ప్రచురించినది ఈ పొడుపుపద్యం

నరుడుగాని మరియు నారాయణుడుగాని
బీదగాని మరియు సాదగాని
కుడువగలడె నన్నుగాదని
చెప్పు నన్ను జూతు, చందమామ


సమాధానం - ఉప్పు

Monday, September 24, 2018

నాపె పైటలోనె ఆరగించె


నాపె పైటలోనె ఆరగించె





సాహితీమిత్రులారా!


ఈ పొడుపుపద్యం విప్పండి
ఈ పద్యం 1947 సెప్టెంబరు
చందమామ లో ప్రచురించినది.


తల్లిమూపుపైన తనయుని గొంపోవ
దారిదొంగజూచి వారిజంపి
వండికూరచేసి వహ్వా యటంచును
నాపె పైటలోనె యారగించె

సమాధానం - అరటిపువ్వు

Sunday, September 23, 2018

నేనెవరిని?


నేనెవరిని?




సాహితీమిత్రులారా!

ఇది 1947 జులై నెల చందమామలో వచ్చిన
పొడుపుకథ మరి ఆలోచించి చెప్పండి.

నేను ఐదు అక్షరాల దేవుణ్ణి
నేను నడకలో ఉన్నాను
కాని పరుగులో లేను
రంభలో ఉన్నాను 
కాని మేనకలో లేను
సింహంలో ఉన్నాను 
కాని పులిలో లేను
హరిలో ఉన్నాను 
కాని బ్రహ్మలో లేను
పాములో ఉన్నాను 
కాని తేలులో లేను
నాపేరేమిటి?

సమాధానం -

నేను ఐదు అక్షరాల దేవుణ్ణి
నేను డకలో ఉన్నాను
కాని పరుగులో లేను
ర భలో ఉన్నాను
కాని మేనకలో లేను
సింహంలో ఉన్నాను
కాని పులిలో లేను
రిలో ఉన్నాను
కాని బ్రహ్మలో లేను
పాములో ఉన్నాను
కాని తేలులో లేను
నాపేరేమిటి?




Saturday, September 22, 2018

విద్యాసుందరి


విద్యాసుందరి






సాహితీమిత్రులారా!

పరిచయము
బెంగుళూరు నాగరత్నమ్మ
‘ఎందరో మహానుభావులు, అందరికి వందనములు’ అనే త్యాగరాజస్వామి కీర్తనను వినని తెలుగువారు అరుదే. తెలుగువారని ఎందుకు, కర్ణాటక సంగీతములో ఆసక్తి ఉన్నవారందరికీ ఈ పంచరత్న కృతి పరిచితమే. అట్టి మహానుభావులలో ఒక స్త్రీ, సుమారు 125 సంవత్సరాలకు ముందు దక్షిణ భారత దేశములో పుట్టింది. ఆమెయే విద్యాసుందరి నాగరత్నమ్మ. ఈమె శారదాస్వరూపిణి, లలిత కళలకు కాణాచి. భరతనాట్యము, శాస్త్రీయ కర్ణాటక సంగీతము, కవిత్వము ఆమెకు కరతలామలకము. భోగినిగా ఆమె జీవితము ఆరంభమై, తరువాత రాగిణిగా మారి, పిదప విరాగిణియై, చివరకు యోగినిగా ముగిసింది. రక్తితో నిండిన ఆమె మనస్సు విరక్తితో నిండి భక్తి మార్గములో ప్రయాణము చేసి విముక్తి పొందింది. కన్నడ సీమలో జన్మించి, తెలుగు దేశమంతా సంచరించి, తమిళ భూమిలో అంతమయింది. ఆమె మన స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో ఒక పుటను వ్రాసింది. ఆమె తెలుగు సాహిత్య చరిత్రలో ఒక పుటను వ్రాసింది. ఆమె ఆనాటి రాజకీయ, సాంఘిక చరిత్రలో కూడ ఒక పుటను వ్రాసింది. కాని ఈ రోజు ఆమె పేరు వాగ్గేయకారుడైన త్యాగరాజస్వామి వారిపేరితో ముడి వేయబడింది. అది విడదీయగలేని ఒక బ్రహ్మముడి! త్యాగరాజస్వామికి భక్త్యంజలులు అర్పించే వారందరూ ఆమెకు కూడ శ్రద్ధాంజలులు తప్పక అర్పిస్తారు. ఆమె నాట్యములో బేలూరు శిలాబాలిక. సంగీతములో పరుగులు తీసే వరద కావేరి. కవితాహృదయములో పారిజాత కుసుమము. స్వాభిమానములో ఝాన్సీ లక్ష్మీబాయి. స్త్రీ స్వేచ్ఛా వాదములో ఈనాటి అమ్మలకు మూలపుటమ్మ. ఆమె జీవితము నన్ను చాల కాలమునుండి ఆకర్షిస్తూ ఉంది. దాని ఫలితమే ఈ చిన్ని వ్యాసము.

ముద్దుపళని రచించిన రాధికాసాంత్వనము నందలి కింది పద్యము నాగరత్నమ్మకు కూడ వర్తిస్తుంది –

ఏ నాతి నీ రీతి నెంతొ భక్తి జెలంగ
     వ్రాయించె జయధాటి రామకోటి
యే నారి నీ దారి నెలమి విద్వచ్ఛ్రేణిఁ
    దనియించె నెఱ మెచ్చి ధనము లిచ్చి
యే కల్కి నీ పోల్కి నిలఁ గీర్తిఁ గైకొనె
    గబ్బముల్ చేనంది ఘనతఁ జెంది
యే బాల నీ లీల నిటు దొరాదొరలచేఁ
    బొగడొందె గడిదేఱి పొలుపుమీఱి

తలప నే ధీర నీ మేరఁ దాతయార్యు
పాదముల వ్రాలె మది నెంచి ప్రస్తుతించి
కలరె నీసాటి ముత్యాలు కన్న మేటి
ప్రబల గుణపేటి శ్రీ ముద్దుపళని బోటి

– ముద్దుపళని, రాధికాసాంత్వనము (అవతారిక 32)

నాగరత్నమ్మ సర్వతోముఖ ప్రజ్ఞను విశ్లేషించుటకు ముందు ఆమె జీవితమును సంగ్రహముగా తెలిసికొంటే బాగుంటుందనుకొంటాను.

బాల్యము – మైసూరు
నాగరత్నమ్మ క్రీస్తుశకము 1878లో నవంబరు మూడవ తేది మైసూరికి సమీపములోనున్న కపిలా నదీతీరములో ఉండే నంజన్‌గూడులో పుట్టింది. ఆమె తల్లి పుట్టులక్ష్మమ్మ ఒక దేవదాసి, ఆమెకు జన్మ నిచ్చిన తండ్రి సుబ్బరావు అనే వకీలు. పూవు పుట్టగానే పరిమళించేటట్లు, ఆమె చిన్నప్పటినుండి సంగీతము అంటే చెవి కోసికొనేది. ఆమెకు పెద్ద ఊరిలో ఉంటే విద్యాభ్యాసము బాగా జరుగుతుందనుకొని మైసూరికి మకాము మార్చబడినది. ఆ కాలములో మైసూరును బ్రిటిషువాళ్లు నేరుగా పాలించలేదు. మైసూరికి మహారాజు చామరాజ ఒడెయరు. అతని ఆస్థానములో విద్వాంసులైన గిరిభట్టర తమ్మయ్య నాగరత్నమ్మకు పాఠాలు నేర్పేవారు. పాటలు మాత్రమే కాక సంస్కృతము, కన్నడము ఇత్యాదులలో కూడ ఆమె జ్ఞానాన్ని ఆర్జించడానికి ఆరంభించింది. ఆమె విద్యాభ్యాసము ఇలా మూడు పువ్వులు, ఆరు కాయలుగా అవుతుంటే ఒక ఇక్కట్టు వచ్చింది. ఏదో చిన్న విషయములో నాగరత్నమ్మ తల్లి పుట్టులక్షమ్మకు, తమ్మయ్యకు భేదాభిప్రాయము వచ్చింది. అతడు తోకతొక్కిన పాములా లేచి “ఇక మీద నీ పిల్లకు నేను పాఠాలు నేర్పను. ఇక్కడనుండి తక్షణము వెళ్లండి. మా ఇంటి గడప ఇకమీద దాటకండి”, అన్నాడు. తల్లికి కూడ కోపము వచ్చింది. “నా పిల్లకు ఇంకా బాగుగా విద్య నేర్పించి ఇదే ఊరిలో కచ్చేరి చేయించకపోతే చూడు, అంతవరకు మీ ఇల్లు మాత్రమే కాదు, మైసూరు కూడ వదలి వెళ్లిపోతాము!” ఈ సమయములో వకీలు సుబ్బారావు వీళ్ళను విడిచి పెట్టాడు.

విద్యాభ్యాసము – బెంగళూరు
ఎవరో చెప్పారు పుట్టులక్షమ్మతో “మీరు కంచికి వెళ్ళండి, అక్కడ ధనకోటి అమ్మాళ్ అనే వారు ఉన్నారు, ఆమె మీకు సహాయము చేయవచ్చు”, అని. కంచికి పిల్లతో వెళ్ళింది పుట్టులక్షమ్మ. ధనకోటి అమ్మాళ్ ఇంటికి చాలమంది విద్వాంసులు వచ్చేవాళ్ళు, అందులో వాగ్గేయకారుడు శ్యామశాస్త్రి కొడుకైన సుబ్బరాయ శాస్త్రి, మనుమడైన అణ్ణాసామి శాస్త్రి కూడ ఉండేవారు. వీరి మూలముగా ధనకోటి గారికి అపురూపమైన కృతులు లభించాయి. కాని ఆమెకు ఆరోగ్యము బాగు లేదు, ఆయాసము, ఉబ్బసము. తొమ్మిదేళ్ళ నాగరత్న పాటలను విన్న ధనకోటి ఆమె విద్యాభాసమును శ్రీరంగములో కొనసాగించడానికి ఏర్పాటు చేస్తాను అన్నది. కాని అంత దూరము వెళ్ళటానికి తల్లికి మనస్సు, ఇంటి పరిస్థితులు అడ్డము వచ్చాయి. చివరకు ఆమె బెంగళూరు చేరింది. వరుసకు తమ్ముడైన వెంకటసామి ఇంటికి వెళ్ళింది. అతడు ఫిడేలు పాఠాలు చెప్పేవాడు. అతడు తన దగ్గర కొన్ని రోజులు పాఠాలు నేర్పించి విద్వాన్ మునిసామప్పవద్దకు తీసికొని వెళ్ళాడు. మునిసామప్ప కూడ వాయులీన విద్వాంసుడు. అతని గురువు కృష్ణస్వామి భాగవతర్, ఇతడు త్యాగరాజు ఆప్త శిష్యుడైన వాలాజాపేట్ వెంకటరమణ భాగవతర్ కొడుకు. అతడు ఆమెను శిష్యురాలిగా స్వీకరించాడు. తల్లి కూలినాలి చేసి పోషిస్తూ ఉండేది. నా దగ్గర డబ్బులు లేవు అంటే, మునిసామప్ప ఫరవాలేదు, నా మేనకోడలు చంద్రవదనతో నేర్చుకొంటుంది అనేవాడు. తాను సంగీతము నేర్పడము మాత్రమే కాదు, ఆంగ్లము, తెలుగు, తమిళ భాషలలో శిక్షణ, నాట్యాచార్యులైన కిట్టణ్ణచే నృత్యాభ్యాసము, తిరువేంగడాచారిచే అభినయకౌశల్యము పొందజేశాడు. పుట్టుకతో వచ్చిన ప్రతిభ అనే వజ్రాన్ని ఈ గురువులు సాన పెట్టి ప్రకాశవంతము చేశారు. అప్పుడు నాగరత్నమ్మకు సుమారు 13, 14 ఏళ్ళు. ఈ సమయములో ఒక పెద్ద దుర్ఘటన జరిగింది. కూతురిపై ఎంతో ఆశ పెట్టుకొన్న పుట్టులక్షమ్మ ఉన్నట్లుండి చనిపోయింది. చిన్న పిల్లకు ఇది గొడ్డలిపెట్టు అయింది. కాని మునిసామప్ప ఆమెకు ధైర్యము చెప్పి తల్లి ప్రతిజ్ఞను నెరవేర్చుట నీ కర్తవ్యము అని బోధపరచి ఆమెను సముదాయించాడు.

రంగప్రవేశము
1892 నవరాత్రి ఉత్సవం సమీపించీంది. ఈ ఉత్సవములో నాగరత్నమ్మచే పాడించాలనే యోచన మునిసామప్పకి వచ్చింది. మైసూరులో వీణా శేషణ్ణగారి ఇల్లు సంగీతానికి ఒక దేవాలయము వంటిది. ఎందరో విద్వాంసులు, రసికులు అక్కడ గుమిగూడేవారు. నాగరత్నమ్మ రంగప్రవేశము అక్కడే. ఆమె సంగీతములోని సంప్రదాయ శుద్ధత, సాహిత్యములోని మంచి ఉచ్చారణ, కంఠములోని మాధుర్యము, అందమైన కల్పన ఆ విద్వత్సదస్సులోని ప్రాజ్ఞులను ఆనందపరచింది. కచ్చేరి ముగిసిన పిదప ఆమె వినయవిధేయతలతో అందరికీ నమస్కారము చేసింది. అక్కడ ఉన్న విద్వాంసులలో ఒకరైన బిడారం కృష్ణప్పను తనకు ఇంకా విద్యను నేర్పించమని ఆమె అడిగింది. ఈ సమయములో పెద్ద రాజకుమారి జయలక్ష్మమ్మణ్ణి ఋతుమతియైనది. ఆ సందర్భములో నాగరత్నమ్మను పాడమని అంతఃపురమునుండి ఆహ్వానము వచ్చింది, కొన్ని దినముల పిదప ఆమె జనానాలో నాట్యప్రదర్శన కూడ చేసింది. ఆమెకు ఒక విధముగా సంతోషము, తన తల్లి ప్రతిజ్ఞ నెరవేరిందని, మరొక విధముగా దుఃఖము కూడ. తన అభివృద్ధికొరకు తన సర్వస్వాన్ని ధారపోసిన ఆమె లేదు కదా అని. ఈ సమయములో ఆమె స్వర్గమునుండి నిన్ను ఆశీర్వాదము చేస్తుందని గురువు మునిసామప్ప భరోసా చెప్పాడు. ఇలా ఆమె రెండేళ్ళు మైసూరిలో నివసించింది. 1894 డిసెంబరులో చామరాజ ఒడెయరు చనిపోయారు. దానితో ఆమె మైసూరిని వదలి మరలా బెంగళూరు చేరింది.

యౌవనము – బెంగళూరు
షోడశి నాగరత్నమ్మ విద్యావతి, రూపవతి. ఆటలలో పాటలలో అందె వేసిన చేయి. ఆమె ఇంటికి రసికులు వచ్చేవారు. న్యాయవాదులు, న్యాయాధీశులు, ధనికులు, కళాపోషకులు ఆమె సంగీతగోష్ఠికి హాజరు అయ్యేవారు. అట్టివారిలో జడ్జి నరహరి రావు ఒకరు. ఈ నాటి హనుమంత నగర్ దగ్గరి సుబ్రహ్మణ్యస్వామి గుడి వద్ద ఒక పురాతన మంటపములో ఆమె ప్రతివారము కొందరు రసికుల సమక్షములో పాడేది. కొన్ని రోజులు నరహరి రావు గారు ఏవో వేరు పనుల కారణముగా విమనస్కులై ఉండగా, నాగరత్నమ్మ తనపై అతనికి కోపము వచ్చిందో, తానేమయినా తప్పు చేశానో అనుకొని దుఃఖించి మరల అతనిని చూచినప్పుడు తాను ప్రత్యేకముగా వ్రాసిన ఒక జావళిని వినిపించింది. నాగరత్నమ్మ వ్రాసిన ఒకే ఒక పాట ఇదియే. (ఆ పాట, నా అనువాదము కూడ అదే ఛందస్సులో ఉన్నది. కనుక తెలుగు పాటను కూడ అదే రాగములో కన్నడములోని పాటవలెనే పాడుకొనవచ్చును.) కోయముత్తూరు తాయి ఈ జావళిని గ్రామఫోన్ రికార్డ్‌గా ఇచ్చిన తరువాత ఇది చాల ప్రసిద్ధిని పొందిందని చెబుతారు. కన్నడములోని పాటను కే. వీ. నారాయణస్వామి గారు కూడా పాడారు.

మాతాడ బారదేనో మారమణనె
మాతనాడదె ఇంతు మౌనదిందిరువె
ప్రీతి గొలిద ప్రాణకాంతనె
నీ ఒందు ….
అంగళద బెళదింగళు
బిసిలాగి తోరుతిదె
భృంగద రవ కేళ
భీతి యాగుతిదె ….

మంద మారుత బందు
మరుళ మాడుతె నాథ
చందవుళ్ళ దేహ
కాంతి బాడుతె స్వామి ….

కామ శరవు ఎన్న
మైయలి తగలిదె
నామగిరి నరహరియె
న్యాయవేనో ….

మాటాడ వేలనయ్య మారమణుడా
మాటలాడక ఇట్లు మౌనముగ నుంటివి
ప్రీతి కొఱగు ప్రాణకాంతుడ
నీవొక ….
ముంగిలిలో దెలివెన్నెల
వడగాసి మండె గదా
తుమ్మెద సడి వినగ
భయము కల్గె మది ….

మంద పవనము వచ్చి
మరులు గొల్పెను నాథ
అందమైన తనువు
వన్నె వాడెను స్వామి ….

అంగజాస్త్రము నాదు
అంగము దగిలెను
నామగిరి నరహరీ
న్యాయమే యిది ….

ఈ పాటను విన్న మరునాడు నరహరి రావు ఆమె ఇంటికి వెళ్ళి “పిచ్చిదానా, ఏదో పని ఒత్తిడివల్ల పరధ్యానముగా ఉన్నా. నీపైన నాకు కోపము ఏమీ లేదు. నేను నిన్నుగురించి ఆలోచిస్తున్నాను. నీ విద్యకు, నీ ప్రతిభకు, నీ సాధనకు ఈ ఊరు సరియైనది కాదు. నీవు మదరాసుకు వెళ్ళి అక్కడ నీ విద్య ఔన్నత్యాన్ని, మైసూరు రాజ్యపు పేరును నిలబెట్టాలి. నా స్నేహితుడు రాజరత్నం ముదలియార్ నీకు సహాయము చేస్తాడు, వెళ్ళు” అన్నారు.

మదరాసు – దిగ్విజయము
ఇరవైయైదు ఏళ్ళ వయస్సులో నాగరత్నమ్మ మదరాసుకు వచ్చింది. ఆమెకు మదరాసులో సంగీత సాధనకు పూచి శ్రీనివాస అయ్యంగారుల ప్రోత్సాహము దొరికింది. ఆమె ఇంటిలోని కచ్చేరీలకు, భజనల కార్యక్రమములకు చాల మంది సంగీత విద్వాంసులు వచ్చేవారు. ఈ సమయములో ఆమె దక్షిణ భారతదేశములో దిగ్విజయయాత్ర చేసిందంటే అందులో అతిశయోక్తి లేదు. బొబ్బిలినుండి అనంతశయనము (తిరువనంతపురం) వరకు ఆమె పర్యటించింది. తిరుపతి వేంకటేశ్వరకవులలో ఒకరైన వేంకటేశ్వరకవి ఈమెపై ఒక లఘుకావ్యమును వ్రాసినారట. ఈ దేశ సంచారములో ఆమెకు ఎన్నో జయపత్రాలు లభించాయి. జయ పత్రమునకు అర్హత ఏమంటే సభలో మిగిలినవారు పాడినవి ఆమె అంతకంటె బాగుగా పాడుట, ఆమె పాడినదానిని మిగిలినవారు పాడలేక పోవుట. ఈ
సందర్భములో రాజమండ్రిలో జరిగిన కచ్చేరి చాల ప్రసిద్ధమైనది. ఆ సమ్మేళనమునకు ఆహ్వానము సంస్కృతములో వచ్చింది. బండినుండి దిగినప్పుడు ఆమెను ఎదుర్కొనుటకు ఒక విద్వత్సమూహమే కాచియుండింది. ఆరతిచేసి మంగళవాద్యములతో ఆమెను సభకు ఒక ఊరేగింపులో తీసికొని వెళ్ళినారు. అక్కడ ఆమె సంస్కృతములోనే మాటలాడింది. పాడిన పాటలంతా సంస్కృత భాషలోనిదే. సభాంతములో శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి గారు ఆమెకు ఎర్రని మణులతో ఆమె రూపుతో నున్న ఒక గండపెండేరాన్ని తొడిగినారట. ఇది ఒక అపూర్వమైన సన్మానము, గౌరవము అనుటలో సందేహము లేదు. మదరాసులో ఆమె ఒక కొత్త ఇల్లు కట్టి, దాని గృహప్రవేశ సందర్భములో తన గురువులైన బిడారం కృష్ణప్పగారిని ఆహ్వానించి పురందరదాసాది వాగ్గేయకారులచే రచించబడిన కన్నడ గీతములను మాత్రమే పాడించినదట. దీని ద్వారా తన మాతృభాష అయిన కన్నడము ఇతర భాషలకంటె సంగీతములో తక్కువైనది కాదు అని నిరూపించింది.

అపాయము – కలలో త్యాగరాజు
నాగరత్నమ్మకు ఒక కూతురు ఉండేది, తండ్రి ఎవరో మనకు తెలియదు. ఆ పాప కొన్ని ఏళ్ళకు బాల్యములోనే చనిపోయింది. ఇది తల్లి మనసుకు చాల బాధ కలిగించింది. దానిని మరచిపోవాలని ఒక చిన్న పిల్లను పెంపుడు కూతురుగా ఆదరిస్తూ పెంచుతూ ఉండేది. ప్రతి రోజు నిద్ర పోవడానికి ముందు ఈ పిల్ల పాలు ఇచ్చేది. ఒక రోజు ఆమెకు ఒక కల వచ్చింది, కలలో ఒక సన్యాసి వచ్చి ఆమెను నీకు రేపు ఒక అపాయము సంభవించబోతుంది జాగ్రత్త అని హెచ్చరించాడట. మెలకువ రాగానే ఈ సన్యాసి ఎవరై ఉంటారో అని పుస్తకాలను తిరగవేస్తుంటే ఆ సన్యాసి రూపము త్యాగరాజువలె ఉండినదట. అయినా తనకు త్యాగరాజస్వామి అపాయాన్ని గురించి ఎందుకు తెల్పాలి అని ఆలోచించింది. ఇక రాత్రి వచ్చింది. ప్రతి దినములా ఆమె పెంపుడు కూతురు ఆమెకు పాలు ఇవ్వడానికి వచ్చింది. కాని ఎందుకో లోటా చెయి జారి కింద పడింది, పాలు నేల పాలయింది. ఆ పిల్ల ఏడవటం మొదలు పెట్టింది. “నీవెందుకు ఏడుస్తావు, పాలు చల్లిపోతే వేరే పాలు తాగితే పోతుంద” అన్నది నాగరత్నమ్మ. ఆ పిల్ల నాగరత్నమ్మ కాళ్ళపై పడి ఇంకా ఎక్కువగా ఏడవడం మొదలు పెట్టింది. “అమ్మా, ఆ పాలలో విషము కలిపా నేను, నా తల్లిదండ్రులు నీవు పోతే నీ ఆస్తి అంతా నాకు దక్కుతుంది, అలా చేయమన్నారు, చాల తప్పు జరిగింది” అని చెప్పిందట. నాగరత్నమ్మ ఆ పిల్లను లేవదీసి తనతో గదిలోనికి తీసికొని వెళ్ళి బీరువా తలుపులు తెరిచి నీకు కావల్సింది తీసికో అని చెప్పిందట. ఈ సంఘటనతో ఆమె మనస్సుకు ఒక పెద్ద ఆఘాతమే కలిగింది. దేవుడిని నమ్మినట్లు మనుష్యులను నమ్మడానికి సాధ్యము అవుతుందా? పురందరదాసు నంబి కెట్టవరిల్లవో రంగయ్యన నంబదె కెట్టరె కెడలి (నమ్మి చెడ్డవాడు ఎవ్వడూ లేడు, రంగని నమ్మక చెడిపోతే పోనీ) అని పాడాడు గదా! మరు దినము ఉదయము లేచి స్నానము చేసి త్యాగబ్రహ్మ పటానికి ముందు ధ్యానము చేస్తూ ఇలా అనుకొంది – ఆ మహానుభావుడు నన్ను ఎందుకు హెచ్చరించాడు, అతని ఋణాన్ని ఎలా తీర్చుకోవడమో?

తిరువైయ్యారు – జీర్ణోద్ధారణము
ఈ సమయములో బిడారము కృష్ణప్పనుండి ఒక ఉత్తరము వచ్చింది. అందులో కృష్ణప్ప గారు తాను తిరువైయ్యారుకు వెళ్ళానని, అక్కడ శ్రీ త్యాగరాజస్వామి సమాధి పరిస్థితి చాలా దుఃఖాన్ని కలిగించిందని వివరించారు. “మనము తినే ఈ తిండి ఆ మహానుభావుని దయవల్లనే కదా, మరి ఆ సమాధిని చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నీకు శ్రద్ధ, సౌకర్యము రెండూ ఉన్నాయి. నీవు త్యాగబ్రహ్మ సమాధిని పునరుద్ధరిస్తే ఆ స్వామి నిన్ను అనుగ్రహిస్తాడు”, ఇది ఆ జాబు సారాంశము. రెండు రోజులకు ముందు త్యాగబ్రహ్మ తనకు జరగబోయే ముప్పును గూర్చి హెచ్చరించడము, నేడేమో ఈ ఉత్తరము. మిత్రులైన మునుసామి నాయుడు, నాగరాజభాగవతరులను సంప్రదించి ఆ రోజే ఆమె తంజావూరికి ప్రయాణము కట్టింది. తిరువైయ్యారు క్షేత్రమునకు పంచనద క్షేత్రము అని పేరు. ఇక్కడ కావేరీనది తూర్పునుండి పడమర దిక్కునకు ప్రవహిస్తుంది (అందువలనే నదము అని పేరు). నది ఒడ్డున త్యాగరాజుల వారి సమాధి , అది స్మశానము కూడ, కొబ్బరి చెట్లు, రాళ్ళు, ముళ్ళ కంపలు. ఆ చోటును చూసి ఆమె దీనిని తప్పక జీర్ణోద్ధారణము చేయవలసినదే అని తీర్మానించింది. ఆ స్థలాన్ని దాని చుట్టు ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజుల ద్వారా, రెవిన్యూ అధికారుల ద్వారా తన వశము చేసికొని పరిశుద్ధము చేయించి, తరువాత గుడి, గోడలు కట్టించింది. తన స్వంత ధనాన్ని, నగలను ఈ ఖర్చుకై ఉపయోగించింది. తన మదరాసు ఇంటిని అమ్మి రాత్రనక పగలనక వ్యయప్రయాసల కోర్చి దేవాలయ నిర్మాణాన్ని ముగించింది. అక్టోబర్ 27, 1921లో పునాదిరాయిని నాటగా, జనవరి 7, 1925 రోజు గుడి కుంభాభిషేకము జరిగింది. స్థలాభావము వలన ఇంకా నేల కొని ఒక మంటపము, పాకశాల 1938లో నిర్మించింది. ఒక్కొక్క నిర్మాణముతో ఆమె ఆభరణాల సంఖ్య తక్కువవుతూ వచ్చింది!

ఆరాధన – పార్టీ రాజకీయాలు
త్యాగరాజస్వామి చని పోయిన దినము పుష్య బహుళ పంచమి. తాను బ్రదికి ఉన్నంతవరకు త్యాగరాజు మనుమడైన త్యాగరాజు తన తాతకు తద్దినము పెట్టేవాడు. అతని పిదప త్యాగరాజ శిష్యపరంపర ఈ కార్యాలను చేస్తుండేది. ఉమయాళపురం సుందర, కృష్ణ భాగవతులు, తిల్లైస్థానం రామ అయ్యంగార్, వాలాజాపేట్ వెంకటరమణ భాగవతర్. వీళ్ళందరు వారివారి ఊళ్ళల్లో ఈ శ్రాద్ధాన్ని చేసేవారు. రామ అయ్యంగార్ తరువాత వారి శిష్యులైన నరసింహ, పంచూ భాగవతర్ సోదరులు ఈ శ్రాద్ధాన్ని తిరువైయ్యారులో సంగీతముతో సహా చేసేవారు. అన్నదమ్ములలో కలిగిన విరసము వల్ల అవి రెండు పార్టీలుగా మారాయి. పెరియ కక్షి (పెద్ద పార్టీ) నరసింహ భాగవతరుది, చిన్న కక్షి (చిన్న పార్టీ) పంచూ భాగవతరుది. నాగరత్నమ్మ త్యాగరాజుల ఆలయాన్ని కట్టిన తరువాత ఆమె కూడ ఈ వర్ధంతిని చేసేది. అనగా మూడు పార్టీలు చేసేవి ఈ తద్దినాలను. ఈ మూడు పార్టీలు చివరకు 1940నుండి శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభ ఆధ్వర్యాన ఒకే విధమైన పద్ధతిని అనుసరించారు. దీని ఫలితముగా చిన్న పార్టీకి మొదట పూజ చేసే హక్కు, తరువాత నాగరత్నమ్మకు, చివర సభయొక్క సభ్యులకు.

చివరి రోజులు

1929నుండి నాగరత్నమ్మ నివాసము తిరువైయ్యారులోనే. భక్తులకు, సంగీత విద్వాంసుల సౌకర్యానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. 1946లో చిత్తూరు నాగయ్య త్యాగయ్య చిత్ర నిర్మాణ సందర్భములో తిరువైయ్యారుకు వెళ్ళి నాగరత్నమ్మను కలిశారు. తనకు కూడ ఏమైనా త్యాగరాజస్వామికి చేయాలనే కోరిక ఉందని చెప్పగా ఒక సత్రాన్ని కట్టమని ఆమె సలహా ఇవ్వగా నాగయ్య గారు త్యాగరాజనిలయాన్ని కట్టించారు. ఆమె మైసూరునుండి వచ్చే భక్తులకై ఒక సత్రాన్ని కట్టాలని చాల కృషి చేసింది. కాని ఆరు వేల రూపాయలను మాత్రమే మైసూరు రాజ్యములో సేకరించగలిగింది. “అమ్మా నీవెందుకు మదరాసులో కచ్చేరీలు చేసి ఈ కార్యానికి ధనార్జన చేయరాదా” అని ఎవరో అడిగితే “నిజమే అక్కడ ఒకే దినములో దీనికన్న ఎక్కువ గణించగలను. కాని ఇది మైసూరు ప్రజలకు, ఈ కార్యానికి మైసూరువారు సహాయము చేస్తేనే మంచిది” అని చెప్పిందట. ఆమెకు 1951లో త్యాగరాజస్వామి కలలో కనబడి వెంకటగిరికి వెళ్ళమని ఆదేశించారట, కాని కారణము తెలుపలేదు. ఆమె అక్కడికి వెళ్ళగా, అక్కడ పుట్టపర్తి సాయిబాబాను సందర్శించింది. వాళ్ళిద్దరు త్యాగరాజస్వామి వ్రాసిన అపూర్వ రాగాల కృతులను పాడారట. ఆమె మే 19, 1952 నాడు త్యాగరాజస్వామిని తలుచుకొంటూ ప్రాణాలను త్యజించింది. ఆమెకు త్యాగరాజస్వామి చెంతనే దహనసంస్కారములను జరిపారు. ఆమె సమాధి త్యాగరాజస్వామి ఆలయానికి ఎదురుగానే ఉన్నది. ఆమె చేతులు జోడించి తన సర్వస్వమైన ఆ మహానుభావునికి నమస్కారము చేస్తూ శిలావిగ్రహముగా నేడు కూడ కూర్చుని ఉంది.

నాగరత్నమ్మ సంగీతము
నాగరత్నమ్మ మంచి గురువులవద్ద సంగీతాభ్యాసము చేసింది. మునిసామప్ప త్యాగరాజుల శిష్యపరంపరకు చెందిన వారికి శిష్యుడు. నాట్యాచార్యుడు కోలార కిట్టప్ప సదాశివరావు శిష్యుడు. నాగరత్నమ్మ కాక, వరాలు అని పిలువబడిన బెంగళూరు వరలక్ష్మి అతని ప్రసిద్ధ శిష్యురాలు. తరువాత మైసూరులో గురువైన బిడారం కృష్ణప్ప కర్ణాటక సంగీతములో అతి ప్రసిద్ధుడు. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ కూడ కృష్ణప్ప శిష్యులే. తరువాత మదరాసులోని పూచి శ్రీనివాస అయ్యంగార్ గొప్ప సంగీత విద్వాంసులు. ఇలా ఎందరివద్దనో నేర్చుకొని తనదైన ఒక కొత్త బాణీని ఈమె సృష్టించుకొన్నది. ఆమెకు త్యాగరాజ కృతులంటే ఎంతో ఇష్టము. సాహిత్యమును చక్కగా అర్థము చేసికొని హృదయములో హత్తుకొనేటట్లు పాడగలిగేది. ఆమెకు సంస్కృతముతో బాగుగా పరిచయము ఉండినా కూడ దీక్షితుల కృతులను పాడుటకు జంకు పడేది. మాతృభాష కన్నడము కనుక దేవరనామములలో కూడ ఆసక్తి మెండు. ఆమెను గురించి ప్రఖ్యాత వాగ్గేయకారులైన మైసూరు వాసుదేవాచార్యులు (పట్ణం సుబ్రహ్మణ్య అయ్యర్ శిష్యుడు, బ్రోచేవారెవరురా, మామవతు శ్రీసరస్వతీ, ఇత్యాదుల రచయిత) తాను వ్రాసిన నాను కండ కలావిదరు అనే కన్నడ పుస్తకములో ఇలా చెప్పారు (అనువాదము నాది) – “నాగరత్నమ్మది సుశిక్షితమైన సంగీతము. ఆఅమె కంఠములోని ఒక అపూర్వ లక్షణము ఏమనగా అందులో స్త్రీ కంఠముయొక్క మాధుర్యముతో పురుష స్వరపు గాంభీర్యము కూడ మిళితమైనది. సంగీత శాస్త్రాధ్యయనముతోబాటు నాట్య, అభినయ శాస్త్రములలో ఆమెకు పరిచయము ఉన్నందువలన ఆమె సంగీతము భావభరితము ఐనది. ఆమె కచ్చేరులలో స్వరకల్పనకన్న రాగాలాపనకు ప్రాముఖ్యత అధికము. యదుకులకాంభోజి రాగము పాడని కచ్చేరీలు అరుదు. ఆమెకు సంగీతములో మంచి పాండిత్యము ఉన్నందువలన విద్వాంసుల సవాలుకు జవాబును ఇచ్చే శక్తి ఆమెకు ఉండినది.” ఆమె ఒక గొప్ప ఇన్వెంటర్ కూడ. ఆమె ఒక చోటినుండి మరొక చోటికి తరచు వెళ్ళాలి, ఆ సమయములో తంబూరాను తనతో తీసికొని వెళ్ళేది. తంబూరా చాల పొడవైన వాద్యము గదా! రైలులో తీసికొని వెళ్ళడము కష్టము. ఒక కొలాప్సిబుల్ తంబురాను తానే నిర్మించింది. అది మూడు భాగాలు – సొరకాయ, తంత్రీ భాగము, మెట్లు ఉండే భాగము. మూటిని విడివిడిగా తీసికొని వెళ్ళవచ్చు. కావలసినప్పుడు వాటిని ఒకదానితో ఒకటి చేరిస్తే తంబురా లభిస్తుంది. శ్రుతి దోషము లేక శుద్ధమైన నాదమును ఇచ్చేది ఆ తంబూరా. ఆమె వేయికి పైగా కచ్చేరీలను ఇచ్చింది. ఒక చిన్న పుస్తకములో కార్యక్రమాలను గురించిన వివరాలు, తనకు దొరకిన వేతనము, ఇలాటివి వ్రాసేది. మొట్ట మొదట ఆదాయపు పన్ను కట్టిన వారిలో ఆమె ఒకతె! కోలార్ నాగరత్నమ్మ, కోలార్ రాజం, వీణా ధనమ్మాళ్, మదరాసు లలితాంగి (వసంతకుమారి తల్లి), హరికథా విదుషి బన్నీ బాయి ఆమెకు ఒకప్పుడు సమకాలీకులు. గ్రామఫోన్ రికార్డ్‌లను అసంఖ్యాకముగా సేకరించిన శ్రీ వీ. ఏ. కే. రంగారావును కడుపుతో నున్నప్పుడు, వారి తల్లిని నాగరత్నమ్మ ఆశీర్వదించి ఒక నిమ్మ పండును ఇచ్చి దీనిని పూజాగృహములో ఉంచమని చెప్పిందట. నీకు కొడుకు పుడుతాడని కూడ చెప్పగా, వాడొక మంచి సంగీత విద్వాంసుడు కమ్మని ఆశీర్వదించమని అడుగగా, అందరూ అందల మెక్కితే మోసేదానికి బోయీలు కావాలిగా అని చెప్పి, అతడు సంగీతాన్ని మెచ్చుకొనే రసికుడవుతాడు అని పలికిందట. భవిష్యత్తును దివ్యదృష్టితో చూడడము అంటే ఇదేనేమో? ఆమె పాడిన గ్రామఫోన్ రికార్డులు రంగారావుగారి దగ్గర ఉన్నవట. అందులో త్యాగరాజకృతులు, ముకుందమాల శ్లోకములు, పట్ణం సుబ్రహ్మణ్య అయ్యర్ పాటలు, జావళులు ఉన్నవి. ఆ కాలములో ఇద్దరు నాగరత్నమ్మలు ఉండేవాళ్ళు – ఒకరు కోలార్ నాగరత్నమ్మ, మరొకరు బెంగళూరు నాగరత్నమ్మ. ఆమె పేరులోని ఇంగ్లీషు అక్షరాలైన బీ. ఎన్. ఆర్. ఆమెకు మరొక పేరయ్యింది. ఆమె పాటలను కొందరు బెంగాల్ నాగపూర్ రైల్వే స్టీం ఇంజన్‌కు పోల్చేవారట!

ఆమెకు ప్రియమైన ఒక పాట ఏకధాతు దివ్యనామ కీర్తనయైన “శ్రీరామ జయరామ” అనే ఉత్సవ సంప్రదాయ కీర్తన. ఈ పాటలో రామాయణములోని బాల, అయోధ్య కాండల సారాంశము ఉన్నది. ఆమె స్వయముగా శ్రీ త్యాగరాజస్వామిపై సంస్కృతములో ఒక అష్టోత్తరశతనామమును రచించినది. అన్ని అష్టోత్తరశతనామాలను అనుష్టుప్‌ ఛందములో రాస్తారు. నాగరత్నమ్మ అలా కాక దీనిని ఒక ప్రత్యేకమైన శైలిలో రాశారు.

నాగరత్నమ్మ – రాధికాసాంత్వనము
నాగరత్నమ్మ కన్నడ దేశములో పుట్టి తన మాతృభాషయైన కన్నడమును మాత్రమే కాక సంస్కృత, తెలుగు, తమిళ భాషలలో ప్రావీణ్యమును గడించినది. ఈ భాషలలో గల పుస్తకాలను కూడ చదివింది. ఆమెకు తెలుగంటే చాల ప్రీతి. ఆమె నోటినుండి వచ్చిన పలుకులు ఇవి- “నేను చిన్ననాటనుండియు సంగీత విద్యతోబాటుగా సాహిత్యవిద్యయందు గూడ కొంచెము పరిశ్రమ చేయుచు మా దేశభాషయగు కన్నడములోను, తెలుగులోను పెక్కు గ్రంథములు చదివితిని. తరువాత బెంగళూరినుండి యీ చెన్నపట్టణమునకు వచ్చినది మొదలుగా నరవములో కూడ ననేకగ్రంథములు చదువుచుంటిని. అయినను నా కాంధ్రభాషా గ్రంథములయందు గల యభిరుచి పై భాషలలో నంతగా లేకపోయినది. ఇట్లుండగా వేలాంవెర్రి అను సామెతగా చాల దినములనుండి తెలుగు బాసలో కవిత్వము చెప్పవలయునను కుతూహలము కూడ కలిగి పట్టుదలతో మరల భారతాదిగ నాంధ్ర గ్రంథములు చదివితిని.” తిరుపతి వేంకటేశ్వరకవులు రచించిన శ్రవణానందము అనే పుస్తకములో రాధికాసాంత్వనపు ప్రసక్తిని చదివి ఆ పుస్తకమును కొని చదువగా అందులోని తప్పులను చూచి చాల బాధ పడింది. సి పి బ్రౌన్‌దొరవంటి వారికి కూడ ఈ గ్రంథము ప్రియతమమైనదే. వేంకటనరసు దీనిని 1887లో ప్రచురించాడు, కాని అవతారికను, కొన్ని పద్యాలను పుస్తకమునుండి తొలగించాడు. ఆమె స్నేహితులొకరు తన ప్రతిని పంపగా దానిని చదివిన పిదప ముద్రిత ప్రతికి దీనికి గల భేదములను గమనించింది. అచ్చు ప్రతిలో కొన్ని పద్యాలే లేవు. ఆంధ్రకవుల చరిత్రలో రాధికాసాంత్వనము గురించి వీరేశలింగము పంతులు తప్పు తప్పుగా వ్రాసినది ఈమె గమనించింది. పళని తల్లి పేరు ముత్యాలు అని వీరేశలింగం అనుకొన్నారు. ముత్యాలు అన్నది తండ్రి పేరు. అదీగాక పంతులుగారు “గ్రంథములోని భాగము లనేకములు స్త్రీలు వినదగినవియు, స్త్రీనోటినుండి రాదగినవియు గాక దూష్యములైయున్నవి” అని రాశారు. హంసవింశతి, వైజయంతీవిలాసము, తారాశశాంకము మున్నగు పుస్తకాలలో కూడ “దూష్యములగు” పద్యాలున్నాయి. అంతకంటె ఎక్కువ రాధికాసాంత్వనములో లేదు. కాని వాటిని రాసిన కవులు పురుషులు, అయితే దీనిని రాసింది ఒక స్త్రీ, అందులో ఒక దేవదాసి కూడ. పంతులుగారి “రసికజనమనోరంజనములోని బూతులకన్నను నిందు పచ్చి బూతులు కంబట్టుచున్నదా” అని నాగరత్నమ్మ ప్రశ్నించింది. “ఈ గ్రంథము రస మొల్కుచుండుటచేతను, ఇది రచించినది స్త్రీయేగాక మాజాతిలో పుట్టిన దగుటచేతను దీనిని మంచి ప్రతిగా ముద్రింప వలయునను తలంపుతో వ్రాతప్రతిని ముద్రిత పుస్తకమును సరిచూచి నా మనసున కింపైన పాఠమునుంచి యొక ప్రతి పని బూని వ్రాసితిని” అని ప్రస్తావనలో మార్చి 9, 1910 (సౌమ్య సంవత్సర మహాశివరాత్రి) నాగరత్నము పలికింది. దీనిని వావిళ్ళ వారు ప్రచురించారు. జనుల శీలానికి, ధార్మిక వ్యవస్థకు ఈ పుస్తకములోని బూతు పద్యాలు అడ్డు తగులుతాయని 1911 లో పోలీస్ కమిషనర్ కన్నింగ్‌హాం ప్రతులను జప్తు చేయగా, వావిళ్ళ సంస్థను బూతు పుస్తకము ప్రచురించారని ప్రభుత్వము అభియోగము చేసింది. ప్రసిద్ధులైన కవులు, పండితులు, న్యాయవాదులు వావిళ్ళ వారి తరఫున అర్జీ పెట్టుకొన్నారు. అయినా బ్రిటిష్ ప్రభుత్వము తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నది. వావిళ్ళ దుకాణాలపై దాడి 1927లో జరిగింది. ఈ కేసును గురించిన వివరాలను వావిళ్ళవారి రాధికాసాంత్వన ప్రతి చివర గల అనుబంధములో చదువ వీలగును. చివరకు భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చిన తరువాత టంగుటూరు ప్రకాశం పంతులు మదరాసు రాజధాని ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు, అంటే సుమారు 36 సంవత్సరాలకు పిదప ఈ బహిష్కారము తొలగించబడినది. ఆ సమయానికి నాగరత్నమ్మ తిరువైయ్యారులో ఒక యోగినిగా మారింది. మచ్చుకు కింద రాధికాసాంత్వనమునందలి నిషేధించబడిన ఒక పద్యము –

ఎందఱిఁ జూడ నీవఱకు, నెందఱితోడుత ముచ్చటాడ, నే
నెందఱిఁ గేళిఁ గూడి సుఖ మెంతయుఁ జెందను? దాని యల్ల చో-
టందము, పొందు చందమును, నందునఁ జిందు సుఖద్రవంబు నే
చందనగంధియందుఁ గన, సారెఁ దలంచిన దానికే తగున్
– ముద్దు పళని, రాధికాసాంత్వనము, 3.113

నాగరత్నమ్మ తెలుగులో మద్యపానము అనేపుస్తకము, తమిళములో పంచీగరణ బౌదీక అను పుస్తకమును, సంస్కృతములో త్యాగరాజ అష్టోత్తరశతనామములను రచించెను. నాగరత్నమ్మ తెలుగు శైలి ఎలా ఉంటుందో అనేదానికి నిదర్శనముగా కింద ఆమెయే రాసిన రాధికాసాంత్వనములోని కడనుడి పద్యములు –

చిన్నికృష్ణుని కరుణా విశేషమునకుఁ
బాత్రురాలగు మా ముద్దు పళని ముద్దు
లొలుక వ్రాసినదని దీని నుద్ధరింప
సాహసించిన యీ నన్ను సైచవలయు

వదలఁగ బుద్ధి పుట్ట దిటువంటి ప్రబంధము నెన్ని సారులేఁ
జదివిన నింకనుం జదివి సంతస మందఁ దలంచుచుండు నె-
మ్మది యని తప్పు లెన్నియొ సమంజసమౌ గతి దిద్దియుంటి నో
చదువరులార! నాదయిన సాహసమున్ క్షమియింప వేడెదన్

నాగరత్నమ్మ – స్త్రీ సమానత్వము
త్యాగరాజస్వామి ఆరాధన సమయములో ఒక శతాబ్దము ముందు నేటిలా స్త్రీలను పాడనిచ్చేవారు కాదు. చాల దూరములో బయట ఒక గలీజుగా ఉండే చోట కావాలంటే వారు పాడుకోవచ్చు. వీణా ధనమ్మాళ్ వంటి విదుషీమణులకు కూడా ఇదే గతి. నాగరత్నమ్మ స్త్రీలకు కూడ పురుషులవలెనే అవకాశము ఇవ్వాలని పోరాడి ఆ స్థానాన్ని కల్పించింది. ఆమె 1948లో రాసిన వీలునామాలో తన సర్వస్వాన్ని ఆలయానికి అప్పగించింది. అది మాత్రమే కాదు ఆలయములో స్త్రీల, దేవదాసీల ప్రదర్శనలను ఏ కారణమువలన కూడ ఆపరాదు అని షరతు పెట్టింది. సాహిత్యములో గాని, సంగీతములో గాని స్త్రీలు పురుషులకు ఏ మాత్రము సాటివారు కారన్న ఊహ నాగరత్నమ్మకు అసహ్యము.

నాగరత్నమ్మ – దేవదాసి పద్ధతి
భారతదేశములో పురాతనకాలమునుండి దేవదాసి పద్ధతి అమలులో నుండింది. ఒక వర్గపు స్త్రీలు తమ జీవితాన్నే స్వామి సేవకై, దేవుని భోగములకై అంకితము చేసికొనుటే దీని ఉద్దేశము. కాళిదాసు మేఘదూతములోని ఒక పద్యములో కూడ వీరిని గురించిన ఒక వర్ణన గలదు. ఆ పద్యము –

పాదన్యాస-క్వణిత-రశనాస్ తత్ర లీలావధూతై
రత్నచ్ఛాయా-ఖచిత-వలిభిశ్చామరైః క్లాంతహస్తాః
వేశ్యాస్ త్వత్తో నఖపదసుఖాన్ ప్రాప్య వర్షాగ్రబిందూ-
నామోక్ష్యంతే త్వయి మధుకరశ్రేణిదీర్ఘాన్ కటాక్షాన్
– మేఘదూతం – 35, కాళిదాస మహాకవి

అక్కడ (ఉజ్జయినిలోని మహాకాలుని ఆలయములో) ఆటవెలదులు నృత్యము చేసేటప్పుడు వారి ఒడ్డాణములోని మువ్వలు వారి పదములతో సవ్వడి చేస్తాయి. రత్నఖచితమైన విసనకర్రలతో వాళ్ళు అందముగా వీస్తున్నారు. ఓ మేఘమా, నీ వర్షబిందువులు వాళ్ళ గోళ్ళపై పడగా ఎంతో హాయి కలిగిస్తుంది. నీపై వాళ్ళు తుమ్మెదల బోలు కటాక్షవీక్షణాలను ప్రసరిస్తారు.

దేవాలయము ఉంటే దేవదాసీలు ఉంటారన్న మాట. దక్షిణదేశములో ఒక్కొక్క గుడి అధీనములో నున్న దేవదాసీల సంఖ్య గర్వకారణమైనది. ఎలా మహమ్మదీయులను నిగ్రహించడానికి పోరాడే సిక్ఖు మతస్థులకు ఒక కుమారుని హిందువులు ప్రసాదించారో, అదే విధముగా కొన్ని కులాల వారు ఒక కూతురును దేవదాసిగా ఆలయాలకు అంకితము చేసేవారు. వారు నిత్యసుమంగళులు, సౌభాగ్యవతులు అని పిలువబడేవారు. అందులో కొందరు సంగీత నాట్యాలను అభ్యసించారు. భరత నాట్యము, ఒడిస్సీ నాట్యము వీరి పరిశ్రమవల్లనే నేటివరకు నిలిచింది. యుక్త వయస్సు వచ్చిన తరువాత వీరికి దేవుడి గుడిలో దేవుడితో పెళ్ళి. దేవుని విగ్రహ స్పర్శచే పావనమైన మంగళసూత్రాన్ని పూజారి వారి మెడలో కట్టుతాడు. తరువాత వాళ్ళు ఆ పూజారితోనో లేక రాజులతోనో, తరువాతి కాలములో జమీందారులు, స్తోమత ఉన్న వర్తకులు మున్నగువారితో దైహిక సంపర్కము పెట్టుకొంటారు. (దీనిని గురించి ప్రసిద్ధ స్త్రీవాద రచయిత ఎం. కే. ఇందిర కన్నడములో గెజ్జె పూజె అనే నవలలో వివరించారు, మినుగుతార కల్పన నటించిన అదే పేరితో గల చలన చిత్రము కూడ అత్యుత్తమమైనదే.) వీళ్ళందరూ బ్రాహ్మణేతర కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళే. వారి సంఘములో తల్లికే (అమ్మమ్మకు) అధికారము ఎక్కువ (మాతృస్వామ్యము లేక మేట్రిలీనియల్). సామాన్యముగా దేవదాసీలు ఒకే పురుషునితో మాత్రమే సంపర్కము పెట్టుకొనే వాళ్ళు. అతడు చనిపోతే మరలా ఇంకొకరితో పొత్తు ఉంచుకోరు. సుబ్బులక్ష్మి, వసంతకుమారి, లతా మంగేష్కర్, వీణా ధనమ్మాళ్, ముక్తా, బృందా మున్నగు ప్రసిద్ధ గాయనీమణులు దేవదాసీ వంశములోనే పుట్టారు. దేవదాసీలకు పురుషులతో ఉండే సంబంధము కేవలము దైహికము మాత్రమే కాదు. అది రసికులకు కళాకారులకు మధ్య ఉండే అవినాభావ సంబంధము, వారిని కలిపే ఒక ముడి వంటిది.

కొందరు నాగరత్నమ్మను గురించి రాసేటప్పుడు ఆమె పంకములో పుట్టిన పంకజము వంటిది అని చెప్పారు. కాని నాగరత్నమ్మ తాను బురదలో పుట్టిందని ఎన్నడూ అనుకోలేదు. తన కులముపైన ఆమెకు అభిమానము, గర్వము ఉండేది. తాము జనులు అనుకొనేటట్లు వేశ్యలు కాము, కళాకారులము అని ఆమె భావము. ఈ స్వాభిమానమే తన కులానికి చెందిన ముద్దు పళని రాధికాసాంత్వనాన్ని ప్రచురించాడానికి ఆమెకు ప్రోత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించింది. సంఘ సంస్కర్తలు, స్వాభిమానావలంబులు (జస్టిస్ పార్టీ, సెల్ఫ్‌రెస్పెక్ట్ మూమెంట్‌కి చెందిన వాళ్ళు) ఈ పద్ధతిని తొలగించాలని పట్టు బట్టారు. నిమ్న వర్గాలకు చెందిన ఈ పార్టీ నిమ్నవర్గాలకు చెందిన దేవదాసీలపై దాడి చేసింది! అదియును కాక ఇది ఒక బ్రాహ్మణ-బ్రాహ్మణేతర పోరాటములో చదురంగపు పావు అయింది. వీరితోబాటు కొన్ని క్రైస్తవ సంస్థలు, బ్రిటిష్ ప్రభుత్వము కూడ చేతులు కలిపాయి. హిందీలో నాచ్ అంటే నాట్యము అని అర్థము. nautch girls అంటే బోగమువాళ్ళు అని అర్థము, వేశ్యానిర్మూలన కార్యక్రమమే ఆంటీనాచ్ మూమెంట్. దేవదాసియైన డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి దీనికి నడుము కట్టింది. ఆమె ఆ కాలములో అసెంబ్లీలో మొదటి మహిళా సభ్యురాలు. నాగరత్నమ్మ మదరాసు దేవదాసీ సంఘాన్ని ప్రారంభించింది, దానికి ఆమె కార్యదర్శి. ధనమ్మాళ్, సేలం మీనాక్షీ, మైలాపూర్ గౌరి మున్నగువారు అందులో సభ్యులు. పురాణాలనుండి, ఆగమాలనుండి ఎన్నో వాదాలను బయటికి తీసి దేవదాసి పద్ధతి కొనసాగాలని నాగరత్నమ్మ ప్రయత్నించింది. మఠాలలో స్వాములవారివలె తాము కూడ సన్యాసినులమని వాదించారు. కాని ఇదంతా బూడిదలో పోసిన పన్నీరయింది. చివరకు 1927లో ప్రవేశ పెట్టబడిన బిల్లు 1947లో చట్టమయింది. ఇది ఆమె జీవితములో ఒక పెద్ద ఓటమి. కర్ణాటకములో ఇది 1982లో, ఆంధ్రప్రదేశములో 1988లో అమలులోనికి వచ్చింది. తక్కువైనా ఇంకా మన దేశములో దేవదాసీలు ఉన్నారు. “పగలంతా దేవదాసులు, రాత్రి దేవీదాసులు” ఉన్నంతవరకు దేవదాసీలు మరొక పేరుతో మసలుతూనే ఉంటారు. ఇప్పుడు నృత్య, సంగీతాది కళలను అందరూ నేర్చుకొంటున్నారు, దేవదాసీలు మాత్రమే కాదు.

ముగింపు
నాగరత్నమ్మనుండి మనము ఎన్నో నేర్చుకోవచ్చు. ఆమెలా ఎన్నో భాషలు నేర్చుకోవచ్చు, ఆమెలా ఎన్నో కళలు నేర్చుకోవచ్చు. గురువులకు, పెద్దవారికి, విద్వాంసులకు ఆమె వినయ విధేయతలతో ఒళ్ళు కుంచించుకొని నమస్కరించేదని వాసుదేవాచార్యులు అన్నారు. ఆమె సౌందర్యము పూజ్యభావాన్ని కలుగ జేసేదట. ఆమె మితభాషి, నిగర్వి, కాని తప్పుంటే దానిని చూపక తప్పుకోదు. ధనార్జనను సద్వినియోగము చేసికొన్నది. తల్లిని ఎప్పుడు మరచిపోలేదు. ప్రతి యేడు తల్లియొక్క స్మారక దినాన్ని సమారాధనలతో, సంతర్పణలతో, దానాలతో, ఉపవాసముతో గడిపేది. బీదలపై కరుణ, సానుభూతి ఎక్కువ ఆమెకు. తాను త్యాగరాజు పాదాలవద్ద దాసినని చెప్పుకొనే అణకువ, వినయము గలిగినది. ఆమెకు గానకళావిశారద, విద్యాసుందరి అనే బిరుదులు ఉన్నా, త్యాగసేవాసక్త అనే బిరుదంటే ఆమెకు ఇష్టము. ఉత్తమ కళలకు, సహృదయతకు, మానవత్వానికి ఆమె ఒక త్రివేణీసంగమమే. కాలగర్భములో మరుగునబడిన ఒక భారతరత్నము బెంగళూరు నాగరత్నమ్మ.

ఆటవెలఁది నీవు, తేటగీతులఁ బాడి
త్యాగరాజుతోడి యోగ మొంద,
రసిక జనుల హృదయ రాజీవములు బూచె
రాగరత్నదీప, నాగరత్న!
-------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో 

Friday, September 21, 2018

వాడుక భాషలో పద్యాలు


వాడుక భాషలో పద్యాలు





సాహితీమిత్రులారా!

వాడుక భాషలో పద్యాలు అనే వ్యాసం
చదవండి .............
పరిచయము
ఇరవైయవ శతాబ్దంలో వాడుక భాషలో తెలుగు కవిత్వం ఎలా వికసించిందో అనే విషయాన్నిగురించి ముందటి వ్యాసంలో [మో-1] తెలిపాను. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశం వాడుక భాషలో ఛందోబద్ధమైన పద్యాలు రాయడాన్ని గురించి వివరించడమే. ఇలా రాయడంలో మనం ఎదురుకొనే సమస్యలను తెలుపుతాను. ప్రసిద్ధులు కొందరు రాసిన పద్యాలను మీ గమనికకు తేవడం మాత్రమే కాక చివర నేను రాసిన కొన్ని ఉదాహరణలను కూడ జత చేస్తున్నాను. కవిత్వభాష తీరుతెన్నులను గురించి, వాడుక భాషలో పద్యాలను గురించి ఇంతకు ముందే భైరవభట్ల కామేశ్వరరావుగారు ఈమాటలో ప్రచురించిన వ్యాసాలలో [కా-1][కా-2]) కొన్ని విషయాలు చర్చించబడ్డాయి.

గేయకవిత్వం రాసేటప్పుడు కొద్దిగా స్వేచ్ఛను తీసికొనవచ్చు. కొన్ని చోటులలో అక్షరాలను పొడిగించుకొనవచ్చు, కొన్ని చోటులలో తగ్గించుకోవచ్చు. హ్రస్వాన్ని దీర్ఘం చేసికోవచ్చు, దీర్ఘాన్ని హ్రస్వం చేసికోవచ్చు. గేయాలలో ప్రాధాన్యత లయకు, సంగీతానికి ఎక్కువ. వచనకవిత్వంలో రచయితకు స్వాతంత్ర్యం ఇంకా ఎక్కువ. అన్ని పంక్తుల నిడివి ఒకటిగా నుండనక్కరలేదు. ఇందులో ప్రాధాన్యత భావాలకు మాత్రమే. ఇట్టి కవితలలో పాదాంతములోని విరామాలవల్ల, పాదంలోని అనుప్రాసలవల్ల లయను కల్పించవచ్చు. అందుకే ఈ యుగంలో కవులు గేయ కవితల, వచన కవితల మాధ్యమాన్ని ఎన్నుకొన్నారు. నియమాలు వాళ్ల భావాలకు అడ్డురావు.

నియమ కతిపయములు
పద్యాలకు ఎన్నో నియమాలుంటయి [తి-1]. అందులో కొన్ని:

ప్రతి పద్యంలో పాదముల సంఖ్య నియమించబడి ఉంటుంది. వృత్తాలలో సామాన్యంగా ఇది నాలుగు. ద్విపదలో రెండు, త్రిపదలో మూడు, షట్పదలో ఆరు, సీసంలో నాలుగు, పిదప వచ్చే ఆటవెలది లేక తేటగీతిలో ఇంకా నాలుగు.
ప్రతి పాదములో ఒక నిర్దిష్టమైన అక్షరసమూహాలు ఉంటాయి. ఈ అక్షర సమూహాలను గణములు అంటారు. ఈ గణాలు మూడు విధాలు – అక్షర గణాలు (మ, భ, జ, స, న, య, ర, త, లగ, గల, లల, గగ, ల, గ), మాత్రాగణాలు (రెండు, మూడు, నాలుగు, ఐదు మాత్రలు), ఉప లేక అంశ గణాలు (సూర్య గణాలు, ఇంద్ర గణాలు, చంద్ర గణాలు). వృత్తాలైన చంపక, ఉత్పలమాలలలో, శార్దూల, మత్తేభవిక్రీడితాలలో అక్షర గణాలు ఉంటాయి. జాతులైన కందము, ఉత్సాహ, రగడ లాటి పద్యాలను మాత్రాగణాలతో రాస్తారు. ఉపజాతులైన సీసము, ఆటవెలది, తేటగీతి లాటి పద్యాలను అంశగణాలతో రాయాలి. ద్విపద, అక్కరలవంటి జాతి పద్యాలను అంశ గణాలతో రాస్తారు.
పాదములోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. వృత్తాలకు, జాతులకు ప్రాస తప్పక ఉండాలి. ఉపజాతులకు ఈ ప్రాస ఐచ్ఛికము. అన్ని ద్రావిడ భాషలలో ఇట్టి ప్రాస నియమము ఉన్నది. కన్నడ, మలయాళ భాషలలో యతి నియమముకన్న ప్రాస నియమము అతి ముఖ్యము.
తెలుగు పద్యాల విశేషతలలో వడి లేక యతి చాలా ముఖ్యమైనది. సంస్కృత ఛందస్సులో యతి అనేది ఒక విరామము మాత్రమే. అంటే పాఠకునకు యతిస్థానమువద్ద ఊపిరి పీల్చుకోడానికి అవకాశం ఉంటుంది. పాదాంతములో కూడా ఇట్టి విరామము ఉంది. కాని తెలుగులో యతి అక్షరబాంధవ్యాన్ని సూచిస్తుంది. ప్రతి పాదములో మొదటి అక్షరానికి, పాదం మధ్యలో ఉన్న అక్షరానికి లేక అక్షరాలకు చుట్టరికం ఉండాలి. అంటే ఆ అక్షరాలలోని అచ్చులు, హల్లులు ధ్వని సామీప్యాన్ని పొంది ఉండాలి.
ఉదాహరణకు మొదటి అక్షరము క అయితే యత్యక్షరము క, గా, ఖై, ఘౌ, క్ష లాటివిగా ఉండాలి. ఉపజాతులలో యతికి బదులు ప్రాసయతిని కూడా వాడుతారు. అంటే రోసి అనే పదానికి మూస అనే పదానికి రెండవ అక్షరమైన స-కారము ద్వారా ప్రాస యతి చెల్లుతుంది. కాని యతిప్రాసలు లేకుండా కూడా రాయప్రోలు సుబ్బారావుగారివంటి మహాకవులు కావ్యాలను రాశారు. వారు రాసిన కాళిదాసుని మేఘదూతమునకు అనువాదమైన దూతమత్తేభమునుండి [సు-1] ఒక పద్యాన్ని కింద ఉదహరిస్తున్నాను. కాళిదాసు మేఘదూతాన్ని మందాక్రాంతవృత్తములో రాయగా, రాయప్రోలువారు దానిని యతిలేని, ప్రాసలేని మత్తేభవిక్రీడితములో తెలుగులో అనువదించారు.

అధికారంబున నేమరిల్లి – ప్రభుశాపగ్రస్తుడై – యక్షు డొ-
క్కడు, కాంతావిరహార్తితో, జనకకన్యాస్నానపుణ్యోదకం-
బుల ఛాయాతరువీథులన్, నవయుచుండెన్ రామగిర్యాశ్రమం-
బులలో, ప్రజ్ఞలు గ్రుంక, భోగ్యమగు వర్షాంతంబు నీక్షించుచున్

ఛందస్సు రీత్యా పైన చెప్పిన అన్ని లక్షణాలు ఉంటేనే అవి పద్యాలౌతాయి. మహాకవుల పద్యాలలో తప్ప సామాన్యుల రచనలలో యతికై, ప్రాసకై ఊత పదాలు, అనవసరమైన పదాలు, అంతగా సరిపోని పర్యాయ పదాలు అప్పుడప్పుడూ దొర్లుతూ ఉంటాయి.

వాడుక భాష
వాడుక భాష అంటే ప్రజలు వారి దైనందిన కార్యక్రమాలలో (మాట్లాడడం, చదవడం, రాయడం) వాడే భాష. తెలుగు సాహిత్యంతో కొంతైనా పరిచయమున్నవారికి తప్ప సామాన్య ప్రజానీకానికి ఏవో ఒక కొన్నిటికి తప్ప, చాలా సంస్కృత పదాలకు గాని, అచ్చ తెలుగు పదాలకు గాని అర్థం తెలియదు. అంటే వారి భాష పరిమితమైనది. ఇట్టి భాష ప్రాచీనమైన వ్యాకరణములకు, నిఘంటువులకు లోబడి ఉండదు. అంటే ఈ భాష నన్నయ భట్టు శబ్ద చింతామణి, చిన్నయసూరి బాలవ్యాకరణాదుల సూత్రానుసారంగా ఉండదు. ఆథునిక ప్రయోగాలకనుగుణంగా నిఘంటువులోని పదాలకు మార్పులు, కూర్పులు, చేర్పులు ఉంటాయి. కొన్ని ఒత్తులను తొలగిస్తారు. కొన్నిటిని తారుమారు చేస్తారు. కొన్ని దీర్ఘాలు హ్రస్వాలుగా, కొన్ని హ్రస్వాలు దీర్ఘాలుగా మారుతాయి ఇందులో. అంతమాత్రాన, ఆ భాషలో సౌందర్యం లేదని చెప్పలేము. అది కూడా అందమైనదే. అది ఒక జీవనది లాటిది. ఈ వాడుక భాషలోని కొన్ని ముఖ్యాంశాలు కింద ఇస్తున్నాను.

పద్యాలలో ద్రుతప్రకృతికమును (పొల్లు న-కారము) కూడా కవులు వాడుతారు. వచ్చెదను అనే పదానికి బదులు వచ్చెదన్ అనే వాడుక సర్వసాధారణం పద్యాలలో. కాని వాడుక భాషలో మనం ద్రుతాన్ని ఉపయోగించము. నేను మీ యింటికి రేపు వచ్చెదన్ అని ఎవరైనా మాట్లాడితే మనం తప్పక నవ్వుకొంటాము.
అదే విధంగా మ-కారానికి బదులు బిందుపూర్వక బ-కారము, ఒత్తుతోటి మ-కారము పద్యాలలో ఉంటాయి. పద్మము అనే పదానికి బదులు పద్మమ్ము, పద్మంబు అని కూడా పద్యాలలో ఉపయోగిస్తాము.
మరొక విషయం – వాడుక భాషలో ప్రథమావిభక్తిలోని ము-కారానికి బదులు అనుస్వారాన్ని వాడుతాం మాటల్లో. అన్నము తిన్నాను అనే దానికి బదులు అన్నం తిన్నాను అంటాము కదా? కానీ పద్యాలలో అలా కాదు.
ఇది మాత్రమే కాక క్రియల ఉపయోగం కూడా గ్రాంథిక భాషలో, వాడుక భాషలో వేరువేరు విధంగా ఉంటుంది. తెచ్చెదను, వచ్చెదను లాటి ప్రయోగాలకు బదులు తెస్తాను, వస్తాను లాటి పదాలను వాడుక భాషలో ఉపయోగిస్తాము.
ఒత్తు ర-కారాన్ని మాట్లాడేటప్పుడు ఉపయోగించము. వ్రాత, క్రింద, ఇత్యాదులను రాత, కింద అనే పలుకుతాము కదా?
మాట్లాడేటప్పుడు సంధులను, సమాసాలను ఎక్కువగా ఉపయోగించము. సమాసాలుంటే అందులో రెండు మూడు పదాలకంటే ఎక్కువ ఉండవు. సంధులు లేకుండా పదాలను విడదీసి మాట్లాడుతాం. (ఇక్కడ నాకు నవ్వు పుట్టించే ఒక విషయాన్ని తప్పక చెప్పాలి. అదేమంటే, కవులు, పండితులు, వైయాకరణికులు దుస్సంధిని అంగీకరిస్తారు కాని విసంధిని చూస్తే మండిపడతారు.)
ఇప్పుడు మనం రాసే భాషలో అరసున్నను ఉపయోగించడం లేదు. కానీ కావ్య భాషలో వ్యాకరణరీత్యా దీని ఉపయోగం ఎంతో అవసరం. అరసున్న తెలిపే కొన్ని ముఖ్య విషయాలు – అరసున్న హ్రస్వాక్షరానికి తరువాత ఉంటే, అక్కడ నిండు సున్నను కూడా ఉపయోగించవచ్చు (పసిఁడి – పసిండి, వెలుఁగు – వెలుంగు ఇత్యాదులు). ఒకప్పుడు (ఇప్పుడు కూడా తమిళనాడులో) దీర్ఘాక్షరానికి తరువాతి అరసున్నను అనుస్వారముగా వాడారు (కోఁతి – కోంతి, మూఁతి – మూంతి, ఇత్యాదులు). న-కారానికి తరువాత పరుషము సరళమైనప్పుడు దానికి ముందు అరసున్న ఉంచుట వాడుక (పూచెన్ గలువలు, పూచెఁ గలువలు, ఇత్యాదులు). డు-కారాంత నామవాచకాలలో డు-కారానికి ముందు అరసున్న ఉంటుంది, దీనిని కూడా నిండు సున్నగా ఉచ్చరించవచ్చును (రాముఁడు, రాముండు). కొన్ని విభక్తి ప్రత్యయాల లోపాన్ని కూడా ఇది సూచిస్తుంది (రాముఁ గని, రాముని గని).
మనం వాడుక భాషలో పద్యం రాయాలంటే పైన చెప్పిన విషయాలను గుర్తులో పెట్టుకొని చెవులకు ఇంపుగా కృత్రిమత, పరుషత లేకుండా రాయాలి. పద్యములలోని లయకు, గతికి ఎట్టి అడ్డంకి రారాదు. కావ్యభాషయొక్క కష్టాలను, వ్యావహారిక భాషయొక్క ఆవశ్యకతను గురించి గిడుగు సీతాపతిగారు భారతీశతకములో [గో-1] ఇలా చెప్పారు.

మహిమన్ శిష్టుల నోట బుట్టి, కవి సమ్మానంబునన్ దేవవా-
క్సహవాసంబును బొంది, వ్యాకరణ రక్షాబంధ సూత్రాలచే
మహనీయస్థితి గాంచి, పండితులకే మాన్యంబుగా నిల్చు నీ
బహు కావ్యోద్ధృత భాష సాధ్యమగునే భాషింపగా భారతీ!

సులభంగా అర్థమయ్యే కొన్ని పద్యాలు
వాడుక భాషలో తెలుగు పద్యాలు లేవా అని ప్రశ్నిస్తే, దానికి జవాబు కచ్చితంగా ఉన్నాయి. పోతన భాగవతములో పొడుపు కొండ మీదఁ బొడిచింది మొదలుగా, శరణంబులు నీ పదాబ్జ శావానిరతుల్ అనే చోటులలో వ్యావహారికాన్ని ఉపయోగించారు [భా-1. ఇట్టి పద్యాలను మనం కొన్ని శతకాలలో, అవధానాలలో, హాస్యరసమయ సన్నివేశాలలో, చాటువులలో చదువగలము. కింద కొన్ని ఉదాహరణలను ఇస్తున్నాను.

శతకములలో: కవి చౌడప్పా, గువ్వల చెన్నా, సంపగిమన్నా అనే మకుటాలతో ఉండే కందపద్య శతకాలను [వీ-1] చాలవరకు వాడుక భాషలోనే రాశారు ఆ కవులు. వేమన పద్యాలలో [వే-1] కూడా ఇట్టివి కొల్లలు. జనార్దనాష్టకములోని పద్యాలు కూడా వ్యావహారికాన్ని జ్ఞప్తికి తెచ్చేవే [రు-1].

గుడిసెయు మంచముఁ గుంపటి
విడియమును బొగాకుఁ దన్ను విడనొల్లని మే
ల్బడఁతియుఁ గల్గిన జలి యె-
క్కడిదప్పా కుందవరపు కవి చౌడప్పా

వెల్లుల్లిఁ బెట్టి పొగిచిన
పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా
మొల్లముగ నూని వేసుక
కొల్లగ భుజియింపవలయు గువ్వల చెన్నా

గాడిదవలె బూడిదఁ బొ-
ర్లాడుచుఁ గొక్కెరయుఁ బోలె ధ్యానము సేసే
బేడిదపుఁ గపటయోగుల
జాడలు ఘను లెంచరన్న సంపఁగిమన్నా

అజ్ఞానమె శూద్రత్వము
సుజ్ఞానము బ్రహ్మమౌట శ్రుతులను వినవా
యజ్ఞాన ముడిగి వాల్మికి
సుజ్ఞానపు బ్రహ్మ మొందె జూడర వేమా

అలుకలన్నియు దీరగా, నా అండ కెప్పుడు వస్తివీ
పిలిచి నవరత్నాల సొమ్ములు ప్రేమతో నెపుడిస్తివీ
వలచి వలపించియును గూరిమి వదలకెప్పుడు వస్తివీ
కలసి వేడుక, దనుజమర్దన, కందుకూరి జనార్దనా!

సినిమాలలో: శ్రీశ్రీగారు ఏదో ఒక సినిమాకు రాసిందనుకొంటాను కింది సీసపద్యము [శ్రీ-1]. ఇందులో మనం ప్రతినిత్యం మాట్లాడే విధంగా భరిస్తాడు, చెప్పడం, వదలడం, ఆంగ్ల పదమైన సిల్కు వాడబడినవి.

ఇంత పాతివ్రత్య మెవడు భరిస్తాడు
  ఇంతి కాదిది దంతి యినుప బంతి
పతిభక్తి యనరాదు హత విధీ దీనిని
   పతిహింస యనుచు చెప్పడమె లెస్స
ఈయమతో బ్రతు కిహలోక నరకమే
   ఈ యిల్లు వదలడం హాయి హాయి
సతి వద్దు సంసార సంకటమే వద్దు
   సన్యాసి యొక్కడే ధన్యజీవి

కనుక మతి చెడిపోవక మునుపె ముద్దు
లొల్కు సిల్కు కాషాయము లొగి ధరించి
పరుగు తీసెద కాశికి వడి వడి వడి
శపథ మిది సత్యమిది సునిశ్చయము నిదియె

సినిమా పాటలు కూడా ఛందోబద్ధమైనవే. వాటిని రాసేటప్పుడు సినీకవులు మాత్రాఛందస్సును, అంత్యప్రాసలను ఎక్కువగా వాడుతారు. కింద అమరశిల్పి జక్కన చిత్రంనుండి దేశి ఛందస్సైన ద్విపదలో (అక్కడా ఇక్కడ ఇంద్రగణాలకు బదులు పంచమాత్రలు, ప్రాసయతులు ఉన్నాయి ఇందులో) సముద్రాల రాఘవాచార్యులు రాసిన పాట [తె-1] –


మురిసేవు విరిసేవు
అమరశిల్పి జక్కన సినిమా, ఘంటసాల

మురిసేవు విరిసేవు ముకురమ్ము జూచి
మరచేవు తిలకమ్ము ధరియించ నుదుట
నీ రూపు గన నీకె పారవశ్యాల
మా రాజు మనసేలు మరుని తంత్రాల

ఏ కాంతు దరి జేర ఏకాంత వేళ
ఈ కబురు పంపేవె ఓ కీరపాణి
చిలకమ్మ కనబోవు చెలుని పేరేమె
చెలియరో నీ స్వామి చెన్న కేశవుడ

గోపికలు సేవించు గోపాల దేవు
రూపుని మురళిని మోపి కెమ్మోవి
సరసానురాగాల స్వామి దరిజేరి
సారూప్య మోక్షమ్ము సాధింతువేమొ

విలు చేత బూనేవు వీరాల బాల
పలికిరా ఎవరైన పరిహాస లీల
నవయౌవనము దోచి నమ్మించిరా నీ
ధవునిపై పగలూని దాడి జేసేవ

ఆటలను పాటలను హావ భావముల
నీటులో నీసాటి నెఱజాణ నీవె
అలరింపగా నిన్ను ఆనంద లీల
చెలు వెరుగు కేశవుడు చేరు నీ వేళ

కౌశికుని మది గొనిన కలికి మేనకవొ
శ్రీశుకుని దరి కులుకు చెలి రంభ వేమొ
సరసలయ గతి చూడ స్వామి రాడమ్మ
పరమాత్ము గను దారి భక్తి జేరమ్మ

పేరడీలు, మణిప్రవాళాలు, ఆంగ్లంలో పద్యాలు: రెండు భాషల పదప్రయోగాలను, వాక్య నిర్మాణాలను ఉపయోగించి రాసిన వాటిని మణిప్రవాళాలు అంటారు, అంటే ఇందులో వేటికి అవి మనలను మణులలా, పగడాలలా ఆకర్షిస్తాయి. ఒకప్పుడు తమిళ, సంస్కృత పదాలతో మలయాళములో (లీలాతిలకం, ఉణ్ణియచ్చి చరితం, ఇత్యాదులు) ఈ మణిప్రవాళాలు ఎక్కువగా ఉండినవి [వా-1]. దీక్షితులు కూడా కొన్ని మణిప్రవాళాలను రాశారు [పా-1], (వేంకటాచలపతే నిను నమ్మితి అనే పాటలో శ్రీనివాస శేషాచలమునుంచి శీఘ్రమే వందు…, వాసుదేవనే వాంఛితార్థ ఫల మిచ్చు వరదనే…). గిడుగు సీతాపతివారు [సీ-1] కూడా ఒక స్వాగత వృత్తాన్ని ఇట్టి భాషలో ఉదహరించారు.

తండులాలు గృహమందు న సంతి
తిండికైతె పదిమంది వసంతి
కుండలన్ని గృహమందు లుఠంతి
ముండనాకొడుకు లెల్ల హసంతి

ఈ నాడు పద్యాలలో ఆంగ్ల పదాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. అవి కొన్ని చోటులలో నామవాచకాలు, మరి కొన్ని వేళలలో క్రియలు. ఇవి నేటికాలపు మణిప్రవాళాలు కాబోలు!

శ్రీశ్రీగారు వేమనను పేరడీ చేస్తూ రాసిన కింది పద్యం [రా-1] కూడా ఆసక్తికరమైనదే. ఈ ఆటవెలదిలోని మొదటి పాదములో కాకికి, సైకోకు ప్రాసయతిని గమనించాలి.

కాకికేమి తెలుసు సైకోఅనాలిసిస్
ఆటవెలది ద్విపద కత్తగారు
ఐదు, మూడు, రెండు ఆముక్త మాల్యద
విశ్వదాభిరామ వినుర వేమ

స్నేహితులైన చేకూరి రామారావు గారిని సన్మానిస్తూ కోవెల సంపత్కుమారాచార్యులు చేరా అనే మకుటంతో ఒక శతకాన్నే [స-1] రాశారు. అందులోని భాషాశైలి వ్యావహారికమే. అందులోనుండి మచ్చుకు ఒక రెండు కందాలు కింద ఉదహరిస్తున్నాను –

వీరప్పన్, ఏన్గుల సం-
హారప్పన్, కుంభిదంత హరిగంధ వ్యా-
పారప్పన్, కిడ్నాపుల
ధీరప్పన్ ప్రభుత తాడు తెంచెను చేరా

ఇస్మాయిల్ స్మైలిస్తే
ఆస్మాన్‌లో పిట్ట వాలునా చెట్టుపయిన్
జాస్మిన్ ఖుష్బూ లొలికే
అస్మితలే క్రొంబ్రతీక లౌనటె చేరా

పై పేరడీలలో వలెనే కింది కరుణశ్రీ పద్యం [మ-1] కూడా ఒక మణిప్రవాళమే.

పాకెట్లో రాకెట్లిడి
బ్రాకెట్లాడకుము ప్రజల భవితవ్యముతో
బ్రోకర్లను స్వార్థానికి
జోకర్ల నొనర్పకోయి భుట్టో భాయీ

ఆంగ్లంలో తెలుగు ఛందస్సులో పద్యాలను రాయడంలో ప్రతిభ నార్జించినవారు సుప్రభగారు. వారు రాసిన ఒక పద్యం కింద ఇస్తున్నాను. ఇది పాదమునకు నాలుగు య-గణములతో ఉండే భుజంగప్రయాతము [శా-1] (ఈ వృత్తాన్ని గురించి నేను ఒకప్పుడు శంకరాచార్యులను గురించి రాస్తూ ప్రస్తావించాను [మో-2]).

భు. four bacchii (IUU) in one line
Demanding, Demanding, denying the request!
Demanding to get love, demanding to get heart
Demanding to worship, demanding to follow
Demanding he always, repeating the same words

అవధానాలలో, ఆశువులలో: ఆ కాలంలో చిలకమర్తి లక్ష్మీనరసింహారావుగారు టంగుటూరు ప్రకాశంగారి కోరికను మన్నించి పకోడిపై ఆశువుగా కంద పద్యాలను చెప్పారట [ప్ర-1]. అందులో ఒకటి –

ఆ కమ్మదనము, ఆ రుచి,
ఆ కరకర, ఆ ఘుమఘుమ, ఆ పొంకము లా
రాకలు పోకలు పడుపులు
నీకే తగు, ఎందు లేవు, నిజము పకోడీ

పానుగంటి లక్ష్మీనరసింహరావుగారు తాను రాసిన కంఠాభరణము అనే నాటకంలో రామలక్ష్మణులను ఆశుకవులు బేడ ఇచ్చిన ఒక లుబ్ధాగ్రేసరునితో చెప్పిన పద్యం కిందిది [ప్ర-1].

తోడా లివ లేవో, గుడి
ఘోడాయే నివ్వలేవొ కొమరుగ దలపన్
బోడెమ్మ చాకలివలె
బేడా యిచ్చెదవు దూడ పేడా అరయన్

బులుసు వేంకట రామమూర్తిగారు ఒక అవధానంలో పూరించిన దుష్కరప్రాస పద్యం ఒకటి [ప్ర-1] కింద ఇస్తున్నాను.

పిట్మను షార్టుహేండు టయిపింగును ప్యాసయి వెస్టుకోస్టు యె-
స్టేట్మినరల్సు లోన పని సేయు స్టెనో యొకనాడు బీచిలో
ఖాట్మను నా బరంగు దొరగారి కుమార్తెను జూచి యిట్లనెన్
కుట్మలదంతి నీ పయిన కోరిక లీరిక లెత్తె నీతరిన్

నా ప్రయత్నాలు
కామేశ్వరరావుగారు తమ వ్యాసంలో ఒక విషయం చెప్పారు. అదేమంటే వాడుక భాషలో కవితలు ఎక్కువగా లేవని. లేవంటే, ఎలా? ఎవరైనా రాయాలి. రాస్తే వాటికి ఆదరణ ఉండాలి. అది లేక ఎవ్వరూ రాయరు గదా! నేను ఉదహరించిన పద్యాలు కూడా పేరడీలు లేక తమాషాకై హాస్యరసప్రధానమైన పద్యాలు. అన్ని రసాలకు అనువయ్యేటట్లు వాడుక భాషలో పద్యాలు రాయడానికి వీలవుతుంది. కాని ఛందస్సు నెరిగినవారు తమ ఉన్నతాశ్వమునుండి దిగి ప్రయత్నం చేయాలి. ఇలా రాసిన పద్యాలను కవులు, పండితులు, విమర్శకులు ఆదరించాలి, అభినందించాలి, ఆనందించాలి. వ్యావహారిక భాషలో పద్యాలను రాయడంవల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. భాషపైన, వ్యాకరణంపైన అంతగా అధికారం లేకున్నవారు కూడా పరిశ్రమించవచ్చు. దీనివల్ల ఛందస్సు ప్రక్రియ ఏ కొందరికో మాత్రమే కాక అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ కళకు మళ్లీ ఒక నవజీవనం కలుగుతుంది, నవ చైతన్యం పుడుతుంది. కింద వ్యావహారిక భాషలో సామాన్యముగా మనం తెలుగులో వాడే వృత్తాలలో, జాత్యుపజాతులలో వ్రాసినవాటిని మీముందు పెట్టి ఈ వ్యాసాన్ని ముగిస్తాను. ఇందులోని వస్తువు ఏ ఒక్క ప్రత్యేకమైన విషయంపైన కాక అన్ని విషయాలపైన రాసినవి.

వృత్తాలు
వ్యావహారిక భాషలో వృత్తాలను వ్రాసేటప్పుడు కొన్ని విషయాలను మనం గుర్తులో ఉంచుకోవాలి. తెలుగులో సర్వసాధారణంగా ఉపయోగించే వృత్తాలు నాలుగు. అవి శార్దూలవిక్రీడితము, మత్తేభవిక్రీడితము, చంపకమాల, ఉత్పలమాల. వీటికి ప్రతి పాదాంతములో గురువు ఉన్నది. గురువుతో అంతమయ్యే పదాలు తక్కువ, అదీ కాక ప్రాస కుదరాలి. ఈ రెండు కారణాలవల్ల ఏ పాదం ఆ పాదంతో అంతం కాదు తెలుగు పద్యాలలో. తెలుగులో ప్రాసాక్షరమైన పాదపు రెండవ అక్షరం సరిగా కుదరకపోతే పదాన్ని ముందు పాదాంతములో ఆరంభించుట వాడుక.

సంస్కృతంలా కాక, తెలుగులో (కన్నడంలో కూడా) పాదాంతములో విరామం లేదు. అందుకే ఒక పాదం మరొక పాదములో చొచ్చుకుపోతుంది. ఒక విధముగా చూస్తే ఈ వృత్తాలన్నీ నియమబద్ధమైన వచనాలే. ఒక్కొక్క పాదంలో పదాలు ఒక్కొక్క విధంగా అమర్చబడిఉంటాయి కనుక ఒక ప్రత్యేకమైన లయ ఉండదు వీటిని పాడేటప్పుడు. ము-కారాంత పదాలు అనుస్వారంతో అంతమవుతాయి కాబట్టి వీటిని చివరి గురువుగా ఎన్నుకోవచ్చు వాడుక భాషలో. విక్రీడితాలను గురించి (మో-3), మాలావృత్తాలను గురించి (మో-4) నేను ఇంతకు ముందు రాసిన వ్యాసాలను ఇక్కడ ఉదహరించడం అవసరమే.

1) శార్దూలవిక్రీడితము: ఈ వృత్తాన్ని వ్యావహారిక భాషలో రాసేది కొద్దిగా కష్టమే, ఎందుకంటే ఇందులోని ప్రతి పాదం మూడు గురువులతో ఆరంభమవుతుంది.

నువ్వేమో ఒక పూల తోట, మరి నేనో ముళ్లు! నా మానసీ
నువ్వేమో ఒక రాజ బాట, మరి నేనో రాళ్ళు! నా రూపసీ
నువ్వేమో ఒక తేనె ఊట, మరి నేనో వేము! నా ప్రేయసీ
నువ్వేమో ఒక సంజె వెల్గు, మరి నేనో రేయి! నా ఊర్వశీ

2) మత్తేభవిక్రీడితము: శార్దూలవిక్రీడితములోని మొదటి గురువును రెండు లఘువులు చేయగా లభించినదే ఈ మత్తేభవిక్రీడితము అనే వృత్తము.

చిలకా యెందుకె,నీకు కోపములు? రా చిల్కా విలాసాలతో
చిలకా యెందుకె, నీకు మౌనములు? రా చిల్కా వినోదాలతో
చిలకా యెందుకె, నీకు యోచనలు? రా చిల్కా సరాగాలతో
చిలకా యెందుకె, యీ విచారములు? రా చిల్కా పరాగాలతో

3) చంపకమాల: వృత్తాలలో చంపకమాలనే కవులు ఎక్కువగా తమ కావ్యాలలో వాడారు. తెలుగు భాషకు బాగుగా అతికిపోయిన వృత్తము ఇది.

తిరుపతి కెళ్లుదాం పదర, దేవుడి దీవెన లందడానికై,
సరసర కొండ మెట్టులను, స్వామి హరీ, అని ఎక్కుదాం, పరా-
త్పర అని మొక్కుదాం, పదము పాడుచు, ఆడుచు, వెంకటేశ్వరా,
వరముల నీయరా, వరద, వాంఛల దీర్చర, యంచు వేడుదాం

4) ఉత్పలమాల: చంపకమాలలోని మొదటి రెండు లఘువులను ఒక గురువుగ చేస్తే దొరికిన వృత్తము ఇది.

చంద్రుని చూడు, పున్నమిది, చల్లని వెన్నెల, చూపవా ముఖం?
ఇంద్రుని చెల్లెలా, యిపుడు, యింపుగ సొంపుగ యివ్వవా సుఖం?
చంద్రిక నాకు నీకు గల సంగడి, పొంగెను ప్రేమసాగరం,
చెంద్రికమోము నవ్వులను జిమ్మగ, నువ్విట రావె వేగిరం!

జాతులు
కందమును చతుర్మాత్రలతో, ఉత్సాహను త్రిమాత్రలతో రాస్తారు. మధ్యాక్కర, ద్విపదలను సూర్యేంద్ర గణాలతో రాస్తారు. వీటన్నిటికీ ప్రాస తప్పక ఉండాలి.

1) కందము: కందపద్యాలలో సరి పాదాలలో చివరి అక్షరం ఎప్పుడూ గురువుగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు ము-కారాంత పదాలను అనుస్వారం పెట్టి ఉచ్చరిస్తాము. ఆ విధంగానే ఇందులో నాదం, మోదం అని వాడాను. కందాలలో, పాదాంతములో గురువులు గల వృత్తాలలో ఇట్టి వ్యావహారిక భాషలోని పదాలు బాగా ఉపయోగానికి వస్తాయి.

వస్తానని చెప్పాడే
యిస్తానని చెప్పినాడె యింపగు నాదం
తెస్తానని చెప్పాడే
నేస్తమ్మయి నాకు మంచి నెయ్యపు మోదం

2) ద్విపద: ద్విపద చాల అందమైన దేశి ఛందస్సు. సామాన్యముగా దేశి ఛందస్సులో ఒక పాదం మరొక పాదములోకి చొచ్చుకొని పోవు. ద్విపదలో ప్రతి పాదం తప్పకుండా స్వతంత్రంగా నిలవాలి.

న్యూయార్కు నింగిలో నూతన క్రాంతి
వేయి రంగుల వెల్గు వెల్లువ కాంతి
పోయింది, వెలవెలబోయింది నెలయు
హాయిగా వెన్నెల నడవి గాచింది

3) మధ్యాక్కర: నన్నయ, ఎఱ్ఱాప్రెగడలు భారతంలో రాసిన ఈ దేశి ఛందస్సును తరువాత విశ్వనాథ సత్యనారాయణ గారు మాత్రమే విరివిగా వాడారు. ఇది కూడ వ్యావహారిక భాషలో అందంగానే కనిపిస్తుంది.

అందాల రాశికి లాలి, ఆనంద జ్యోతికి లాలి
గంధాల బొమ్మకు లాలి, కలహంస శిశువుకు లాలి
కుందన ప్రతిమకు లాలి, గుడిలోని మూర్తికి లాలి
మందాకిని యలకు లాలి, మా యింటి పాపకు లాలి

4) ఉత్సాహ: ఉత్సాహ పద్యం ఒక చక్కని గతితో నడుస్తుంది. ఇది ఒక మార్చింగ్ చేసేటప్పుడు పాడే పాటలా ఉంటుంది.

ఆడ పిల్ల అంటె నీకు అలుసు అంత ఎందుకో?
కోడె నాగులాగ నిన్ను కొట్టి కాటు వేయునోయ్!
చీడపురుగులాటి నిన్ను చిదిమి పారవేయునోయ్!
పాడు బుద్ధి చాలు కాలు పట్టి పాహి యను బ్రదర్!

ఉపజాతులు
నిజంగా పదహారణాల దేశి ఛందస్సు ఉపజాతులు. ఇందులో ప్రాస లేదు. సామాన్య యతినో (అక్షరమైత్రి) లేక ప్రాసయతినో వాడుకోవచ్చు. సీసములాటి పద్యాలు చాలా పురాతనమైనవి.

1) ఆటవెలది: కిందిది ఒక వచన కవితలా కనిపించినా, ఇందులో ఆటవెలదికి ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి. కావ్యాలలో వచనములలో పద్యాలను చొప్పించడం కూడా ఒక కళ. ఇట్టి వచన పద్యాలను చిత్రకవిత్వముగా కూడా పరిగణిస్తారు.

నేను నువ్వు – నింగి, నేల – రంగుల హేల
నేను నువ్వు – గాలి, నీటి దార
నేను నువ్వు – కొండ, నీలాల మేఘాలు
నీకు నేను – అవును – నాకు నువ్వు

2) తేటగీతి: ఇందులో కావాలనే వాడుకలో ఉన్న దుష్ట సమాసాలను (సంస్కృత పదం మొదట, తెలుగు పదం తరువాత ఉండే పదాలు) ఉపయోగించాను.

ఓ వసంతగాలీ, నువ్వు ఊపవమ్మ
పంచవన్నెల పూలను పచ్చికపయి
నేడు, ఆకాశపందిరి నీడలోన
నా ప్రియుడు వచ్చి చూస్తాడు నన్ను మెచ్చి

3) సీసము: తెలుగు ఛందస్సు ప్రత్యేకత సీసపద్యము. సీసమునకు సీసపు నాలుగు పాదాలతోబాటు చివర ఆటవెలదినో, తేటగీతినో రాయాలి. అప్పుడే అది సీస మవుతుంది.

ఎంతగా పిలిచినా ఎందుకే పలుకవు
   చింత నీదే గదా సిరుల రాణి
ఆకసం జూచినా హరివిల్లు జూచినా
   చెలియ నీ రంగులే నిలిచినాయి
తరగలో నువ్వెగా నురుగులో నువ్వెగా
   ముంగురుల నలుపు యుంగరాలొ
గాలి ఊగించగా పూలు తూగాడ నీ
   నవ్వులే దలచాను నన్ను మరచి

ఆటలాడుదాం యిప్పుడే ఆరుబయట
పాట పాడుదాం యిప్పుడే పరవశించి
మాట లాడుదాం యిప్పుడే మనసు విప్పి
ఆలసించకు యిక్కడ అలసినాను

4) ముత్యాలసరము: గురజాడ అప్పారావు గారి ద్వారా బహుళ ప్రచారములో వచ్చినది ముత్యాలసరం. దేశమంటే మట్టి కాదోయ్ లాటి ప్రబోధగేయాలు ఈ ఛందస్సులోనిదే. అప్పారావుగారు ఇందులో ప్రాసను ఎక్కువగా వాడ లేదు. వారు లయకు మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చారు.

నవ్వు చిత్రం నువ్వె నా చెలి
దివ్వె కాంతులు నువ్వె నా సఖి
గువ్వ పాటలు నువ్వె ప్రేయసి
మువ్వలా రావే

ముగింపు
మొన్ననుండి నిన్న పుట్టింది, నిన్ననుండి ఈరోజు పుట్టింది, ఈరోజునుండి రేపు పుడుతుంది. మొన్న ఉన్నవాళ్లు నిన్న లేరు, నిన్నటివాళ్లు నేడు లేరు, నేటివారు రేపు ఉండరు. కాలచక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది. భాసుడి తరువాత కాళిదాసు, కాళిదాసు పిదప నన్నయ, నన్నయ తరువాత పోతన, పోతన తరువాత శ్రీశ్రీ, శ్రీశ్రీ పిదప ఇంకా ఎందరో. నన్నయనాటి భాష వేరు, నేటి భాష వేరు. అవే పదాలతో, అలాగే పద్యాలు రాయనవసరం లేదు ఈ రోజు. అంటే ఆకాలపు పద్యాలు బాగులేవని కాదు. కొత్త గాలి వీచింది, కొత్త శైలి వచ్చింది. అవే నియమాలు కూడా పాటించ నవసరం లేదు. ఒక వృత్తపు లయను పాడు చేయకుండా, ఒక గురువును రెండు లఘువులు చేస్తూ, రెండు లఘువులను ఒక గురువుగా చేస్తూ రాస్తే ఛాందసులు ఒప్పుకోకపోయినా అది ఒక వృత్తము కాకపోదు. ఛందస్సులో కూడా దానికి విషమవృత్తమని ఒక పేరు ఉంది. గణాలు తప్పినా, గమనం తప్పలేదని అంగీకరిస్తారనుకొంటాను చంపకమాలను బోలిన కింది పద్యంలో.

తలుపుల తీయరా, పసిడి తలుపుల తీయర కొత్త మేడలో
పలుకుల నాడరా, తెలుగు పలుకుల నాడర కొత్త పాటలో
నిలువక సాగరా ముందు, నిలువక సాగర కొత్త ఊహతో
వెలుగుల జిమ్మరా, అలల వెలుగుల జిమ్మర కొత్త దారిలో

నా ఉద్దేశంలో ఇలా గతిలయలు చెడకుండా శ్రుతుల కింపుగా రాస్తే అది తప్పు కాదు. ఇక్కడ శ్రీశ్రీగారు చెప్పిన కింది వాక్యాలతో [రా-2] ఈ వ్యాసాన్ని ముగిస్తాను –
“నేను ఏవో యతిప్రాసలు లేని పద్యాలు వ్రాస్తూండడం చూచి మా నాన్నగారు నాకు సులక్షణసారం [తి-1] కొనిపెట్టారు. ఛందస్సు ప్రథమపాఠం చెప్పారు. అప్పటికి నాకు ఏడెనిమిది సంవత్సరాలకు మించి ఉండదు. ఆ రోజు నుండి ఎన్ని పద్యాలు వ్రాశానో చెప్పను, అన్నీ తప్పులే! కాని ఒకసారి చేసిన తప్పు మళ్లీ చెయ్యలేదు. అందరూ నా తప్పులు దిద్దేవారే! కొన్ని తప్పులు నాకు తప్పుగా తోచలేదు. అవి చెయ్యడానికి నాకేదో హక్కు ఉందనిపించింది. అందువల్ల నా వ్యక్తి చైతన్యం ప్రగాఢతరం అవుతున్నట్లు, నా బలం హెచ్చినట్లు నాకు స్పష్టంగా తోచింది!”
-----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో 

Wednesday, September 19, 2018

శుక్లాంబరధరం …


శుక్లాంబరధరం …




సాహితీమిత్రులారా!


"శుక్లాంబరధరం విష్ణుం" అనే ఈ శ్లోకానికి
విశ్వనాథ సత్యనారాయణగారి
వ్యాఖ్య చూడండి-

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నాప శాంతయే

ఇది విఘ్నేశ్వరుని ప్రార్థన శ్లోకము. ఇది లేకుండ మనదేశములో నే కర్మలును ప్రారంభింపబడవు. క్రతువులు, నోములు, వ్రతములు అక్షరాభ్యాసములు, గృహప్రవేశములు సర్వమును విఘ్నేశ్వరపూజతోనే ప్రారంభింపబడును.

దేవుడు లేదన్నవారుకూడ, పరమాధునికులు కూడ కొన్ని యాచారములు పాటించుచునే యున్నారు. పేరునకు బ్రాహ్మణుని పిలిచి సర్వకార్యారంభముల యందు విఘ్నేశ్వర పూజ చేయించుచున్నారు.

విఘ్నేశ్వరు డంత ప్రధాన దేవత. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటె నధికుడన్నమాట.

మన పురాణములు వేఱు. మన వేదశాస్త్రములు వేఱు. మన యపనిషత్తులు వేఱు.

ఒక్కటియే మహానాగరకతకు నివి మూడు దశలు. మానవుల వివేకమునందు తారతమ్య ముండును. ఉండకూడదన్న ఆధునికుల సిద్దాంతములయొక్క ఆచరణములో కూడ నున్నవి. దానిని నీవెంత కాదన్నను అది కనిపించుచునే యున్నది. కొందరికి విప్పి చెప్పినగాని తెలియదు. వెంటనే భేదము కనిపించుచున్నది కదా!

ఈ విఘ్నేశ్వర స్తోత్రము మహావేదాంతార్ధము కలిగిన శ్లోకము. సర్వమునం దభివ్యాప్తమై యున్న మహాచైతన్యము యొక్క ప్రథమావతారమును బోధించునది.

పురాణదశకు వచ్చునప్పటికి దీని యర్థము వేఱు. విఘ్నేశ్వరుడు పార్వతీదేవి కుమారుడు. తెల్లని వస్త్రములు ధరించెడివాడు. విష్ణుమూర్తితో సమానుడు. శశియనగా చంద్రుడు. చంద్రవర్ణము కలవాడు. అనగా తెల్లనివాడు. చతుర్భుజుడు నాలుగు భుజములు కలవాడు.

శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ సరస్వతి, లక్ష్మీ, దుర్గ, విఘ్నేశ్వరుడు మొదలైన దేవతలకు నాల్గు భుజములున్నట్లు వర్ణితమై యున్నది. ఆయన ప్రసన్నవదనుడు. మొగము ప్రసన్నమై యుండునని యర్ధము.

సర్వవిఘ్నములు ఉపశమించుట కొఱకు ధ్యానించవలయును.

ఇది శ్లోకార్ధము.

మన మనేకులైన దేవతలను కల్పించుకొన్నాము.

ఒకప్పు డొక మంత్రి యొకసభలో నన్నాడుకదా “మనకు దేవతల కేమి, వేలమంది యున్నారు” అని. నేనేదో చదువుచుండగా నన్నాక్షేపణ చేసినాడు. నేను సమాధానము చెప్పియందును. చెప్పినచో సభ, నేనాయనను తిరస్కరించితినని భావించును.

లోకము వేఱు. సత్యము వేఱు. లోకమునకు సత్యముతో నవసరములేదు;

వ్యక్తి వేఱు. సాంఘిక మర్యాద పొందుచున్న స్థితి వేఱు.

సంఘములో వ్యవస్థను దూషించును. వ్యవస్థకు వ్యతిరేకముగా నడచును. వ్యక్తిగా ఆచారములను మన్నించును. శాస్త్రముల ననుసరించును. ఈ స్వయంప్రతారణ మొకటి నేటి లోకమునందు బహుధా దృశ్యమానముగా నున్నది.

ఇది జీవితముయొక్క సర్వశాఖలందు కనిపించుచున్నది. రాజకీయములయందు సంఘవ్యవస్థ యందు నెట్లో, సాహిత్యమునందు నట్లే యున్నది. అందుచేత సాహిత్యగ్రంథమైన దీనిని నేను శుక్లాంబరధర మన్న శ్లోకముతో ప్రారంభించుట కింత చెప్పికొనవలసి వచ్చినది.

ఒకటి పురాణ విఘ్నేశ్వరుడు.

రెండు – తత్త్వభూతుడైన విఘ్నేశ్వరుడు.

తత్త్వమైన విఘ్నేశ్వరుని ప్రార్థించుట యుండదు. తత్వమైన భగవంతుని ప్రార్థించుట యుండదు. సాధ్యముకాదు. అది ఆత్మవంచనము.

అది మనసున కేకాగ్రస్థితి వచ్చినప్పడు అనగా సర్వమైన యితర భావములు తొలగించికొన్నప్పడు సాధ్యము కావచ్చును. ఆ భగవంతునకు మూర్తిలేదు. నీ ఎవరిని ధ్యానించుచున్నావు? ఒక భావమును ధ్యానించు చున్నావా? భావమనగా ఊహ. ఆ యూహ నిలుచునా? ఎట్లు నిలుచును? ఒక్క యూహను నిలుపగల శక్తి ఎవనికుండును? ఇది యెంత అసాధ్యమైన విషయము! ఆలోచించరు.

కనుక మనము భగవంతు డన్నప్పుడు వానికి రూపకల్పన చేసినచో సృష్టియనగా నామ రూపములు గనుక- మన భావము రూపము నాశ్రయించి యుండును. ఈ నామము నాశ్రయించి యుండును.

దేనికైనను మనమొక పేరు పెట్టదుము, దేనికి పెట్టదుము? ఒక రూపమున్న దానికి పెట్టదుము. గుణమునకు పెట్టుదుము. కానీ, ఆ గుణమును ధ్యానింతువా? ఆ గుణమును కలిగిన యొక రూపమును కల్పించికొని దానిని ధ్యానించుట మానవ బుద్ధికి సాధ్యము.

అందుచేత విఘ్నములు పరిహరించు నొక దేవునికి రూపకల్పన చేసి దానిని ధ్యానింతుము.

మరి వినాయకుని గురించి పలుకథ లున్నవికదా! అవియేమి యని యడుగగా వాని విషయము వేఱు.

ఇట్లు రూపకల్పన చేసి మన మా దైవతమును ధ్యానించుచు పేరునకు తత్కాలమునకు వానిని శుక్లాంబరధరుడని చతుర్భుజుడని, శశివర్ణుడని చెప్పదుమేకాని వెనుక నున్న యర్థము వేఱు.

ఆ యర్ధము తెలిసి ధ్యానించినచో నధిక ఫలము.

కూలివాడు పనిని చేయను. వాడు దేనికి చేయుచున్నాడు? కూలికొఱకు. ఆ పని యొక్క పరమార్థము యజమాని పొందుచున్నాడు. కాని యిండ్ల కట్టెడి మేస్త్రీ నే నా యిల్లు కట్టితిని. ఈ యిల్లు కట్టితిని అనును. ఏ యిల్లును వీనిదికాదు. కట్టినది వాడే కట్టితినన్నయహంకారము వానిదే? ధన రూపముగా దాని ఫలితము వానికి చాల వచ్చినది.

ఇట్లు లోకమున పరమార్ధము వానిది కాకుండ చేయుట యున్నది. దానికి కొంత లాభమున్నది.

వాడు వట్టి కూలివానివలె గాక తన స్వంతపనివలె చేసినచో యజమాని వానికి నధికఫలము సమకూర్చును. మరియు నా కూలివాడు తా నొక యాత్మ తృప్తిని పొందును. నిజముగా శీలవంతుడు వాడు. సజ్జనుడు. ఉత్తమలోకములకు పోయెడివాడు.

ఈ కూలి విషయములో గృహస్థు వేఱు కూలి వేఱు కాదు. గృహస్థే యిల్లు నిర్మించి కొనును. అప్పుడు రెండు ధర్మములు కలిసి పోయినవి. అధిక ఫలము వచ్చినది. నష్టము లేదు. గృహము సిద్ధమైనది. వ్యయము లేదు.

దేవతా స్వరూపము తెలిసి దేవతారాధన చేయుట యటువంటిది. అట్లే సాహిత్య స్వరూపము తెలిసికొని సాహిత్య పఠనము చేయట అధిక ఫలవంతము.

అంబరము – 1. వస్త్రము 2. ఆకాశము.

శుక్లాంబరము తెల్లని యాకాశము. దానిని ధరించినవాడు. ఆకాశము నల్లగా కన్పించుచున్నది. ఈ కన్పించుట మన దృష్టి దోషమని ఆధునికులకు చాలమందికి తెలియును.

ఆకాశమునకు వర్ణము లేదు. కానీ విఘ్నేశ్వరుడు శుక్లాంబరధరుడు. తెల్లని ఆకాశమును ధరించినవాడు అనియర్థము. ఆకాశమునకు వర్ణములేదు కదా! కనిపించు నల్లదనము నల్లదనము కాదు కదా! లేని తెల్లదన మొకటి వచ్చినది.

సర్వభాషయ సంకేతములు కలది. సంకేతములు లేకుండ మనము మాటాడుకొన లేము, భాషయే సంకేతము. సంకేతమనగా గుర్తు, వానిపేరు రాముడు. ఇది సంకేతము.

ఇవిగాక వేఱే పలు సంకేతము లుండును. మన శాస్త్రములలో సత్త్వరజస్తమో గుణములని మూడున్నవి. సత్త్వగుణము తెలుపు. రజోగుణము ఎఱుపు. తమోగుణము నలుపు.

ఆకాశమనగా “నవకాశము.” ఇది పంచభూతములలో నొకటి. ఇది లేకుండ ఏ రెండు భూతములకు సంయోగము లేదు. ఒక భూతములో నున్న రెండణువుల మధ్యకూడ నాకాశముండును. ఈ యాకాశమునందు భగవచ్ఛక్తి యభివ్యాప్తమై యుండును.

సత్త్వగుణముచేత నభివ్యాప్తమైయున్న ఆకాశమును ధరించిన వాడు అని యర్థము. విష్ణువు – సర్వవ్యాపి. శశివరుడు – శశియనగా చంద్రుడు కదా! శశమును ధరించిన వాడు. శశమనగా కుందేలు. చంద్రునిలో నున్న మచ్చ కుందేలని అల్లిబుల్లి కథ. శశమనగా ‘దాట్లు పెట్టుచు దూకునది’ యని యర్ధము. అందుచేతనే చంద్రుని శశి యన్నారు. అతడు శుక్ల, కృష్ణపక్షములను చేయును. సూర్యునివలె నిత్యజ్యోతిస్సు కాదు. అందుచేత నతడు శశి. ఈ విఘ్నేశ్వరుడు ఆ జాతి కలవాడు. అనగా కాలస్వరూపుడు.

కాలము రెండు విధములు. ఖండకాలము, అఖండకాలము నని. ఖండకాలమనగా దిన, పక్ష మాస, సంవత్సరాత్మక మైనది. అఖండకాల మనగా సూర్యచంద్ర గ్రహచారములు లేనిచోట నుండునది.

ఈ విఘ్నేశ్వరుడు ఖండకాల స్వరూపుడని యర్థము. అనగా లోకమును పాలించెడివాడని యర్ధము. ఈ కాలమునందు బ్రతుకుచు ఈ కాలమున కధీనమైయున్న మనము ఖండకాలమును పాలించెడి యొక తత్త్వమును నిర్మించుకొని దానికి విఘ్నేశ్వర రూపము నిచ్చినాము.

చతుర్భుజం – చతుర్భుజుడు – నాలు భుజములు కలవాడు. భుజమనగా నొక యర్థము. భోజనము చేయునది. రెండవ యర్థము పాలించునది. నాల్గు భుజములతో విఘ్నేశ్వరుడు భుజించును. దేనిని? కాలమును అనగా ఖండకాలమును అఖండకాలముగా మార్చునన్న మాట.

పాలించుట యన్న యర్ధములో నాల్గు విషయములను పాలించు నన్నమాట. ధర్మార్థ కామమోక్షములు నాలుగు. ఈ నాల్డింటిని పాలించుచున్నాడు.

మనము కార్యారంభములయందు పూజింపగా మన ధర్మార్ధ కామములను పాలించుచున్నాడు. అందుకనియే కదా మన మతనిని ధ్యానించుట.

అతడే పరమేశ్వరుడుగా నీవు ధ్యానించినచో (ధ్యానించినచో తప్పలేదు. ద్రావిడ దేశమునం దొక కవయిత్రి విఘ్నేశ్వరుని ధ్యానించి మహాభక్తురాలైనది.) మోక్షమునుగూడ నొసంగగలడు. కాలమును నాలు చేతులతో భుజించుచున్నాడు కదా! నాలు యుగములుగా తనలో లయింపచేసికొనుచున్నాడని యర్ధము.

ఇంతపూజ దేనికి? నర్వవిఘ్నోప శాంతి కొఱకు, విఘ్నము లుపశమించుటకొఱకు, ఉపశమించునేగాని నశించవు. అతనిని ధ్యానించినచో నుపశమించును. విఘ్నమనగా కార్యమును చంపనట్టి లక్షణము. ఇది సృష్టిలో నున్నది. సృష్టిలక్షణ మన్నను తప్పలేదు.
---------------------------------------------------------
రచన: విశ్వనాథ సత్యనారాయణ, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, September 18, 2018

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె


స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె






సాహితీమిత్రులారా!

ఈ సమస్యను పూరణనను ఏల్చూరివారి పరిశీలనను
ఈ వ్యాసంలో గమనించండి...............

తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధమైన ఉదంతం ఇది: ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల నిండుసభలో మహాకవి ధూర్జటి కావ్యగానం జరిగిందట. నిస్తులమైన ఆ కావ్యమాధురికి విస్తుపోయిన రాయలవారికి ఆ కవిత్వ రసభావాల కూర్పులోని తీయదనానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. విద్యాపరిషత్తులోని విద్వత్సభ్యులను ఉద్దేశించి ఈ పద్యపరిప్రశ్నను అడిగాడట:

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ
యతులితమాధురీమహిమ?”

అని. రాయల వారిచ్చినది చంపకమాల పద్యంలో ఒకటిన్నర పాదాలకు వ్యాపించి, సమస్య వలె కనుపించటంతో ఆయన మనోగతానికి అనుగుణమైన సమాధానం ఏమని చెబితే ఆయనకు నచ్చుతుందో సద్యఃకృతంగా తోచక పరిషత్తులోని పండితులు మౌనంగా ఉండిపోయారట.

అప్పుడు తెనాలి రామకృష్ణుడు లేచి, ‘రాజా! నాకొక పక్షం రోజులు వ్యవధినిస్తే ఈ ప్రశ్నకు తగిన సమాధానం దేవర వారి చిత్తానికి విన్నవించుకొంటాను,’ అని, మొత్తానికి రాయలవారిని సమ్మతింపజేశాడట.

ఆ రోజునుంచి రామకృష్ణుడు కొలువుకు వెళ్ళటం మానివేశాడు. తెల్లవారుజాముననే మారువేషం వేసుకొని ధూర్జటి గారింటికి బయలుదేరటం, ఆయన దినచర్యను కనిపెట్టటం మొదలుపెట్టాడు. ధూర్జటిగారు ప్రతినిత్యం పంచపంచ ఉషఃకాలాన లేచి, కాలకృత్యాలను ముగించుకొని, శివదీక్షకు కూర్చొని ఒకటొకటిగా స్తోత్రనివేదనం, భస్మస్నానం, భస్మధారణం, రుద్రాక్షధారణం, సంధ్యావందనం, లింగార్చనం, ఇష్టదేవతారాధనం, నైవేద్యం, పూజావిధానమంతా పూర్తికాగానే కొద్దిసేపు విశ్రమించి, ఆ తర్వాత భోజనభాజనాదులను ముగించుకొని, ఆస్థానప్రవేశానికి ఆవశ్యకమైన తీరున పండితవేషాన్ని ధరించి కొలువుకు వెళ్ళి వస్తుండటం, ఇంటికి రాగానే మరుసటినాడు సభలో వినిపించవలసిన గ్రంథభాగానికి సమాయత్తమవుతుండటం మూలాన రామకృష్ణుడికి పెద్దగా తనకు పనికివచ్చే ఆచూకీలేవీ పొడచూపలేదు.

పక్షాంతం కావచ్చే సమయానికి – అన్నాళ్ళుగా పడుతున్న శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరై, రాజుగారికిచ్చిన మాట తప్పేట్లున్నదని భయపడుతున్న తరుణంలో రామకృష్ణుడు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ధూర్జటి కొలువు నుంచి తిరిగిరాగానే కొంతసేపు సేదతీరి, మునిమాపు వేళయేసరికి డాబు, దర్పం మీరిన భోగరాయవేషాన్ని ధరించి, ఇంటినుంచి బైటపడి, పదే పదే అటు చూసుకొంటూ ఇటు చూసుకొంటూ – రహస్యంగా నాగవాసం దారి పట్టాడట. రామకృష్ణుడు ఆయనను అనుసరిస్తూ ఆయన ఒక ఇంటిలోకి వెళ్ళాక, బయట ఆ ఇంటి అరుగుమీదే చేతిని తలక్రింద దిండుగా అమర్చుకొని రాత్రంతా అక్కడే తీరికగా విశ్రమించాడట. ధూర్జటి తెల్లవారుజామున తలుపు తెరుచుకొని బయటికి వచ్చి, అరుగుమీదున్న రామకృష్ణుణ్ణి చూసి గుట్టు రట్టయిందని గ్రహించి, ఇక చేసేదేమీ లేక, దైవంమీద భారంవేసి ఇల్లు చేరుకొన్నాడట.

ఆ మధ్యాహ్నం రామకృష్ణకవి పేరోలగంలో అడుగుపెట్టి, రాయల వారిచ్చిన సమస్యను పూర్తిచేశాడట:

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ
యతులితమాధురీమహిమ?” “హా! తెలిసెన్; భువనైకమోహనో
ద్ధతసుకుమారవారవనితాజనతాఘనతాపహారి సం
తతమధురాధరోదితసుధారసధారలు గ్రోలుటం జుమీ.”

అని. ఆ పూరణలోని అంతరార్థం ఎంతో కొంత నలుగురికీ తెలిసినదే కనుక రాయలవారు, రాయలవారిని చూసి సదస్యులు నవ్వారట. చేసేదేమీ లేక ధూర్జటి కూడా నవ్వి తలవంచుకొన్నాడట.

సమస్యలోని పరిశీలనీయాంశాలు
స్మరణోత్సవంగా ఉన్న ఈ కథానకాన్ని ప్రఖ్యాత విమర్శకులు శ్రీ గురజాడ శ్రీరామమూర్తి గారు మొట్టమొదట 1876లో ప్రబంధకల్పవల్లి పత్రికలోనూ, ఆ తర్వాత 1893లో వావిళ్ళ వారు అచ్చువేసిన తమ కవిజీవితములు సంపుటంలో కొద్దిపాటి మార్పుతోనూ ప్రకటించారు. ఒకానొక రోజున కాళహస్తిమాహాత్మ్యాన్ని తెనిగించిన ధూర్జటి అనే కవీశ్వరుడొకడు రాజాస్థానానికి విచ్చేసి, కృష్ణరాయలతో తన గ్రంథాన్ని గురించిన ప్రశంస కావించాడని, అప్పుడు రాయలు ఆ గ్రంథాన్ని తెప్పించి సావధానంగా పరిశీలించాడని, ఆ కవి వాక్చమత్కృతికి ముగ్ధుడై పండితులను, స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ, యతులితమాధురీమహిమ? అని అడిగాడని, ఆయన పాఠం. నేను చిన్నప్పుడు విన్న కథారూపాన్ని నేను ఉదాహరించాను.

పై విధంగా, స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ, యతులితమాధురీమహిమ? అని పద్యంలోని ఒక పాదాన్నో, ఒకటిన్నర పాదాన్నో; లేక రెండు, మూడు పాదాలను సైతమో పృచ్ఛకుడు అన్వయరహితంగానో, అర్ధోక్తిగానో, ప్రశ్నార్థకంగానో నిలిపి, పరిశిష్టభాగాన్ని అర్థవంతంగా పూరించమని ఇచ్చిన అసమాపకవాక్యాన్ని ‘సమస్య’ అంటారు. సాధారణంగా నాలుగవ పాదాన్ని సమస్యగా ఇవ్వటం ఉంటుంది కాని, నిజానికి పృచ్ఛకుడు ఏ పాదాన్నైనా, పద్యంలోని ఎంత భాగాన్నైనా ఇవ్వవచ్చును.

పైని శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చినది ‘సమస్య’ అనుకొంటే, దానికి లాక్షణిక పరిభాషలో, ప్రథమపాదాదిగత కవిజన ప్రతివచనీయము అని పేరు. పద్యంలోని తొలిభాగాన్ని పృచ్ఛకుడు ఇవ్వగా పూరయిత ఆ మిగిలిన భాగాన్ని కొనసాగించి, దత్తార్థాన్ని యథోచితంగా పరిపూర్ణించాలన్నమాట.

‘స్తుతమతి యైన ఆంధ్రకవి’ అన్న విశేషణం
సమస్యను వినగానే మన మనస్సులను ఆకర్షించే ముమ్మొదటి విషయం ధూర్జటిగారిని ఉద్దేశించి కృష్ణరాయల నోట వెలువడిన ‘స్తుతమతి యైన ఆంధ్రకవి’ అన్న విశేషణం. మతి శబ్దానికి – మన్యతే అనయా ఇతి మతిః అని వ్యుత్పత్తి. మన అంటే జ్ఞానం. జ్ఞానము అంటే జీవుడు, ఈశ్వరుడు, జగత్తు అనే భేదభ్రాంతికి అధిష్ఠానమై నిత్యము, స్వయంప్రకాశము, సచ్చిదానందస్వరూపము, అద్వితీయము అయిన బ్రహ్మచైతన్యం. ఆ బ్రహ్మచైతన్యము యొక్క ఎరుక దేని మూలాన కలుగుతుందో – అంటే, ఆ జ్ఞానసాధకమైనది మతి. సత్యాసత్యాల, తత్త్వాపతత్త్వాల వివేకాన్ని కలిగించే నిశ్చయాత్మకమైన వృత్తి అది. ఎవరి మూలాన ఆ జ్ఞానము మనకు కలుగుతున్నదని గ్రహించి కృతజ్ఞతతో స్మరిస్తున్నామో, జ్ఞానమూలుడని సన్నుతిస్తున్నామో, ఆ మహనీయుడే స్తుతమతి.

స్తుతమతి అన్నాడు సరే, ఆంధ్రకవి అనటం దేనికి? ఏమీ, ధూర్జటికి సంస్కృతభాషానిరంకుశమహాప్రభుత్వం అలవడలేదా? రాయలు ఆయన సంస్కృతభాషానిరంకుశమహాప్రౌఢిని గుర్తించనే లేదా? తెలుగు కవులకు సామాన్యమైన అష్టభాషావిశారదత్వం ఆయనకు లేదనే ప్రభువు అభిప్రాయమా? శ్రీకాళహస్తిమాహాత్మ్యములో సంస్కృతాంధ్రాలతోపాటు కన్నడపదాలు సైతం చోటుచేసుకొన్నాయి కదా, బహుభాషాకోవిదుడనేందుకు ఆ నూతనసంవిధానం నచ్చకపోయిందా? సకలవాగ్విశారదుడు అనక, వట్టి తెలుగుకవి అన్న విశేషణంతో సరిపెట్టివేశాడా? సంస్కృత తమిళ కన్నడాదిభాషాకవుల మధ్య కేవలం సంజ్ఞాపనకోసం ఆంధ్రకవి అన్నాడా? అని సందేహించేవారు తప్పక గుర్తింపవలసిన విషయం ఇది.

ఆంధ్రకవి అన్నది రాయల దృష్టిలో ఒక అపురూపమైన గౌరవం. పుట్టినప్పటి నుంచి నేర్చుకొన్న సంస్కృత భారతిని కాదని, అందులో ఎన్ని కావ్యాలనో చెప్పినప్పుడు చెందిన సంతృప్తిని కాదని, ఆమూలచూడంగా అభ్యసించిన ప్రాకృతాలను కాదని, తరతరాలుగా ఇంటిలో నెలకొన్న తుళు వాక్తతిని కాదని, కమనీయమైన కన్నడ కస్తూరిని కాదని, విష్ణుచిత్తీయ తమిళాన్ని కాదని, తనకెంతో ఆభిమానికమైన ఆంధ్రభాషకు పట్టాభిషేకం చేసి, భగవదిచ్ఛానుసారం ఆ భాషలో ఆముక్తమాల్యదా మహాప్రబంధాన్ని విరచించిన రాయల నోట వెలువడిన అనర్ఘమైన గౌరవవాచకం అది. కళింగ జైత్రయాత్రకు బయలుదేరి శ్రీకాకుళంలో విడిదితీరినప్పుడు ఆయనకు రాత్రి కలలో సాక్షాత్కరించిన శ్రీమహావిష్ణువు సైతం ఆయన పలుకు నుడికారంలో, అంధ్ర జలజాక్షుఁడు కదా. ఆ అంధ్రజలజాక్షుడే స్వయంగా ‘అంధ్రభాష యసాధ్యంబె! యందు నొక్క, కృతి వినిర్మింపు మింక మాకుఁ బ్రియంబు గాఁగ’ అన్నాడు కదా. అంతే కాక,

“తెలుఁ గ దేల? యన్న, దేశంబు తెలుఁ; గేను
తెలుఁగు వల్లభుండ; తెలుఁగొ కండ;
యెల్ల నృపులు గొలువ నెఱుఁగవే బాసాడి,
దేశభాషలందుఁ దెలుఁగు లెస్స.”

అని – (1) నేనున్నది తెలుగు దేశం, (2) నేను తెలుగుదేశంలో వెలసి, తెలుగువారిని అభిమానించి, వారి అభిమానాన్ని పొందిన తెలుగు వల్లభుణ్ణి, (3) తెలుగు భాష మధురాతిమధురం, (4) నా మాట సరే, నీ కొలువులోని సర్వరాజన్యులు నానా భాషాభణితులను భాషిస్తుండగా – ఆ దేశభాషలలో తెలుగు లెస్స అని నీకు మాత్రం తెలియలేదా? అని స్వయంగా ఆ భగవంతుడే నాతో అన్నాడు – అని చెప్పుకొన్నాడు కదా, స్వప్నగతమైన ఆ భగవద్వాక్యాన్ని అమిత ప్రీతిపాత్రంగా తన ఆముక్తమాల్యదలో నిలుపుకొన్నాడు కదా, ఆయన దృష్టిలో ఆంధ్రకవి అన్నది అంతటి మహనీయమైన విశేషం అన్నమాట. అంతే కాదు. ఆయనే ఒకప్పుడు నిండుసభలో అల్లసాని పెద్దన గారిని పిలిచి, పెద్దను చేసి, స్వారోచిష మనుసంభవానికి కృతిపతిత్వాన్ని అర్థించినపుడు ఆ మహాకవిని గురించి ఒకదానికంటె ఒకటి ఉత్తరోత్తరబలీయంగా విశేషణాలను పేర్కొంటూ, ‘(1) హితుఁడవు (2) చతురవచోనిధివి, (3) అతులపురాణాగమేతిహాసకథార్థ, స్మృతియుతుఁడవు (4) ఆంధ్రకవితా, పితామహుఁడవు – ఎవ్వ రీడు? పేర్కొన నీకున్’ అని, తనయెడ ఆయనకు గల ఆప్తభావానికంటె, ఆ మహామహుని చతురవచఃకౌశలికంటె, నిఖిలపురాణశాస్త్రకోవిదత్వానికంటె బలీయస్తరంగా ఆంధ్రకవితాపితామహత్వాన్ని సాహితీమేరుశిఖరాగ్రాన అధివసింపజేశాడు కదా. నంది తిమ్మన గారు తనకు పారిజాతాపహరణము కావ్యకుసుమాన్ని ‘పారిజాత, హరణ మను కావ్య మొనరించె నంధ్రభాష, నాదివాకరతారాసుధాకరముగ’ అని సమర్పించినపుడు ఎంతో సంతోషంగా అందుకొన్నాడు కదా. స్తుతమతి యైన యాంధ్రకవి ధూర్జటి – అన్న బిరుదాంకనంలో రాయలకు తెలుగు భాష అంటేనూ, ధూర్జటి గారంటేనూ అంతటి గౌరవం ఇమిడి ఉన్నదన్నమాట.

పాఠాంతరాల క్లిష్టసమస్య
ముద్రితప్రతులలో కృష్ణరాయలు అడిగిన ప్రశ్నకు రెండు మూడు పాఠాంతరాలు కనబడుతున్నాయి. వాటి అర్థచ్ఛాయలలో కొంత వ్యత్యాసం ఉన్నది:

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ
యతులితమాధురీమహిమ?”

అన్నది గురజాడ శ్రీరామమూర్తి గారు చూపిన తొలినాటి పాఠం.

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గెనో
యతులితమాధురీమహిమ?”

అని దీనికే కొద్దిపాటి మార్పుతో పాఠాంతరం ఉన్నది.

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గె నీ
యతులితమాధురీమహిమ?”

అని మరొక పాఠం.

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గెనో
యతులితమాధురీమహిమ?”

అని ఇంకొకటి. ఈ నాలుగు పాఠాలలో అర్థసన్నివేశాన్ని బట్టి మొదటిది, రెండవది ఒక తీరున; మూడవది, నాలుగవది ఒక తీరున ఉన్నాయి. రెండవ దానిలో ‘అతులితమాధురీమహిమ ఏల కల్గెనో?’ అన్నప్పుడు నిజానికి ధూర్జటి రాజసభలో ప్రత్యక్షంగా ఉండవలసిన అవసరం లేదు. ఆయన పరోక్షంలో కూడా రాజు, ధూర్జటి గారి కవిత్వానికి ఇంతటి తియ్యదనం ఎందుకు వచ్చిందో? అని ప్రసంగవశాన అడగటానికి అవకాశం ఉన్నది. మొదటి పాఠం ప్రకారం, స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె – ఈ, యతులితమాధురీమహిమ? అని ప్రశ్నించినపుడు, ‘ఈ’ అన్న నిర్దేశార్థకం అప్పుడే చదువబడిన మధురమైన సన్నివేశంలోని రసప్రతీతికి స్ఫోరకం. భువనవిజయ మహాసభలో కావ్యగానం జరిగినప్పుడు ధూర్జటి కవి సమక్షంలోనే ఆ సంభాషణ సాగినదనుకోవాలి. అందువల్ల ‘ఏల కల్గెనో, యతులితమాధురీమహిమ’ అన్న పాఠానికంటె, ‘ఏల కల్గె నీ, యతులితమాధురీమహిమ’ అన్న పాఠం మెరుగు.

పాఠాన్ని మరికొంత సూక్ష్మంగా విమర్శించి చూద్దాము. ‘ధూర్జటిగారి కవిత్వానికి ఇంతటి తియ్యదనం ఎలా వచ్చింది?’ అని కృష్ణరాయలు ప్రశంసాపూర్వకంగా అడగటం విద్వజ్జనులున్న పరిషత్తులో అది సందర్భోచితమైన ప్రశ్న. స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గెనో, యతులితమాధురీమహిమ? లేదా, స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గె నీ, యతులితమాధురీమహిమ? అనటంలో రాజుకు కలిగిన గౌరవాతిశయం ధ్వనిస్తున్నది. ఆ విధంగా దానిని ప్రథమపాదాదిగతంగా ప్రశ్నించినప్పుడు ధూర్జటిగారి కవిత్వంలో అంతటి తీయదనం ఏ సంస్కారం వల్ల ఉప్పతిల్లిందో కవులు సార్థకంగా వివరింపవలసి ఉంటుంది.

కాని, అందుకు విపరీతంగా, ధూర్జటిగారి కవిత్వానికి ఇంతటి తియ్యదనం ఎందుకు వచ్చిందో? అని కృష్ణరాయలు అడగటం విద్వజ్జనులున్న పరిషత్తులో మెచ్చుకోలుకైన ప్రశ్న అనిపించదు. ‘ఎలా వచ్చిందో?’ అని గాక, కవులు ‘ఎందుకు వచ్చిందో?’ సమాధానం చెప్పాలి. ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ, యతులితమాధురీమహిమ?’ అన్న ప్రశ్నలోనే పరిహాసానికి తగిన పునాది ఉన్నది. అటువంటి సూచన అక్కడ లేదని అనుకోవటం సాధ్యం కాదు. ‘ఎందుకు వచ్చింది?’ అన్న ప్రశ్నలో ఉన్న ఆక్షిప్తి ధూర్జటి వ్యక్తిగతజీవితాన్ని కొంత స్పృశించేదిగానే కనబడుతుంది. అందరికీ తెలిసిన ఆ విధమైన స్వాభావికోదంతాన్ని ప్రసక్తించటం దేనికని కవులు నిరుత్తరంగా ఉండిపోవటం సహజమే. పైగా రాజు ఆ వ్యక్తిగతవిమర్శకు ఎటువంటి సమాధానాన్ని ఎంతవరకు అనుమతించేదీ ఊహించటం కష్టం. ఆ శంకాసంకోచం లేని రామకృష్ణుడు కవి శృంగారవర్తనను వెలిపెట్టడం రాజు ప్రశ్నకు పరిణామస్వరూపమే. అనుమతి తీసికొని పదిహేను రోజులు ఆగి చెప్పినా, అప్పటికప్పుడే సద్యఃస్ఫురితంగా ఆశుగతిని చెప్పినా – రాజు సూచ్యంగా సూచించినదే కనుక, వ్యక్తిగతజీవితాన్ని వెల్లడించే పూరణను వెలికి చెప్పటం భావ్యమే. కానప్పుడు అది నిండుసభలో మహాకవిని నిష్కారణంగా అవమానించినట్లే అవుతుంది. రాజుకు ఎంత మాత్రమూ సమ్మతిలేని కల్పనను ప్రవేశపెట్టినందుకు తదాగ్రహానికి గురికాకనూ తప్పదు.

అందువల్ల కృష్ణదేవరాయలు ధూర్జటికి అవమానాస్పదం కాగల విధంగా సమస్యను రూపొందించి, స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గెనో, యతులితమాధురీమహిమ? అని భువనవిజయ మహాసభలో అడిగి ఉండటం నిజమై ఉండదు. స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గె నీ, యతులితమాధురీమహిమ? అనే అడిగి ఉంటాడు.

రాజు ‘ఏల కల్గె?’ అని ప్రశ్నింపక ‘ఎట్లు కల్గె? అని ప్రశ్నించి ఉన్నట్లయితే, ‘ఎట్లు’ అన్న అవ్యయానికి ‘ఏ ప్రకారంగా’ అన్న అర్థంతోపాటు ‘ఏల కల్గె?’ అన్న ప్రశ్నకూడా అంతర్భావిగా లేకపోలేదు. అయితే, రాయలు ‘ఎట్లు కల్గె?’ అని ప్రశంసాపూర్వకంగా అమితాదరంతో అడిగినప్పుడు అందుకు పూరయితృకవి ఆ మాధురీమహిమ ఎట్లా వచ్చినదీ చెప్పాలి గాని – కేవలం వాక్యపూర్ణతాసంపాదన నిమిత్తం ఆ సందర్భానికి తగని పరిహాసంతో కూడిన సమాధానం చెప్పి ఉండటం భావ్యం కాదు. పరిహాసం పవిత్రతను గుర్తించదని; తెనాలి రామకృష్ణుడు అపహాస్యానికి గాక చమత్కారానికి మాత్రమే ఆ పూరణను చేశాడని – మనము వాదంకోసం అంగీకరించినా, రాజు అపూర్వమైన పారవశ్యాన్ని పొంది తెలుసుకొనగోరిన ‘ఎట్లు కల్గె?’ అన్న ప్రశ్నకు రామకృష్ణకవి చేసిన పూరణలో ఆ మాధురీమహిమ ఏ గురూపదేశలబ్ధంగా, ఏ మహాకృషిసమాసాదితంగా, ఏ జన్మాంతరసంస్కారగతంగా, ఏ భగవద్వరప్రసాదఫలంగా వెల్లివిరిసిందో కవిత్వపరంగా వివరించే సముచితమైన సమాధానం రాలేదని కూడా మనము గుర్తుంచుకోవాలి. అది రాజు స్వస్థితికి, ధూర్జటి సుస్థితికి అనువైన పరిణామం కాదు.

కనుక పద్యపాఠాన్ని మరింత జాగరూకతతో పరిశీలించి అర్థనిర్ణయం చేయాలని వేరే చెప్పనక్కరలేదు. ఆ నేపథ్యంతో ఆలోచించి, తెనాలి రామకృష్ణకవి ప్రతిపాదించిన పద్యార్థం ఏమిటో సరిచూద్దాము.

రామకృష్ణకవి పూరణ
పద్యాన్ని ‘హా! తెలిసెన్’ అన్న ఉపక్రమణికతో మొదలుపెట్టడంతోటే రాజుకు, సదస్యులకు రామకృష్ణకవి చెప్పబోతున్నదేమిటో తెలిసిపోయి ఉండాలి. అయితే, నలుగురూ ఊహించలేని అపూర్వమైన అర్థసంగతితో చెప్పటమే మహాకవి ప్రతిభావిశేషం కదా. అందువల్ల ప్రతీతమైన పద్యార్థాన్ని, ప్రతీయమానమైన అర్థాన్ని పరిశీలిద్దాము:

హా! తెలిసెన్ = అసలు సంగతి తెలిసిందండోయి! అని భావం. ఏమి తెలిసిందో చెప్పబోయే ఆ ఉదంతానికి ‘హా!’ అన్న ప్రతిపదోక్తం ఆశ్చర్యార్థకంగానూ ఉన్నది; ఆక్షేపసూచకంగానూ ఉన్నది. చెప్పబోతున్నది ఆశ్చర్యం వల్ల చేస్తున్న పొగడ్తో, ఆక్షేపణపూర్వకమైన తెగడ్తో ఊహించటం కష్టం.

ఇంతకీ తెలిసిందేమిటి? భువనైకమోహన – భువన + ఏక + మోహన = పధ్నాలుగు భువనాలను ఒక్క తీరున సమ్మోహింపజేసే; ఉద్ధత = ఔద్ధత్యాన్ని వహించిన (గర్వాన్ని కలిగిన); సుకుమార = కోమలులైన; వారవనితా + జనతా = వేశ్యకాంతల; ఘన = అధికతరమైన; తాపహారి = (విరహిజనుల యొక్క) మన్మథతాపార్తిని హరింపజేసేది అయిన; సంతత + మధుర = నిత్యమధురమైన; అధర + ఉదిత = క్రిందిపెదవినుంచి ఉట్టిపడే; సుధారసధారలు = అమృతరసప్రవాహాలను; క్రోలుటన్ + చుమీ = ఆస్వాదించటం వల్లనే సుమండీ! అని.

సాకూతమైన సమాధానం
రాయలు తెలుసుకొనగోరిన రహస్యానికి సమాధానంగా రామకృష్ణకవి చేసిన పూరణ మనోహరంగా ఉన్నది. రాయలు మహాపండితుడు. మాధుర్యౌజఃప్రసాదాలనే కావ్యగుణాలలో ఒకటైన మాధుర్యాన్ని ‘మహిమ’ అన్న విభూతివిస్తారకమైన ఐశ్వర్యభావనతో జోడించి ‘మాధురీమహిమ’ అన్న పదబంధాన్ని సరిక్రొత్తగా సృజించటంలోనే ఆయన పాండిత్యవైభవం వెల్లడయింది. ధూర్జటిగారి కవిత్వాన్ని మనన చేసినకొద్దీ ఆ మాధుర్యం ఊటలువారి ఆయనపైని గౌరవం మరింత మరింతగా పెరుగుతుందని చెప్పటానికి ‘స్తుతమతి’ అయిన ధూర్జటి కవి అన్న నిర్దేశంతో వాక్యోపక్రమం చేశాడు. ‘ఆంధ్రకవి’ అన్న బిరుదాంకనంతో ఆ గౌరవాతిశయాన్ని ఉన్నతోన్నతంగా ధ్రువీకరించాడు. భక్తికవిత్వానికి మాధురీమహిమను ప్రతిపాదించటమూ ఆయనకు గల లక్షణజ్ఞానానికి నిదర్శకంగానే అమరింది.

‘మాధుర్యము’ అంటే – బహుశో యచ్ఛ్రుతం వాక్య ముక్తం వాపి పునః పునః, నోద్వేజయతి యస్మాద్ధి త న్మాధుర్య మితి స్మృతమ్, అని నాట్యశాస్త్ర నిర్వచనం. ఎన్నిమార్లు విన్నా, మళ్ళీ మళ్ళీ విన్నా – మనస్సుకు వైముఖ్యమూ, ఉద్వేజనమూ కలుగకపోగా, తీయదనమే ఊటలువారుతుండటం అన్నమాట. అవ్యాహతం మనః పుంసాం మృదుత్వజనకం తతః, హరత్యన్యపదార్థేభ్యో మధురం వస్తు కీర్తితమ్ – అని దీనినే భావవివేకం పర్యాయోక్తంగా వివరించింది. తాపతప్తమై ఉన్న మనస్సును చల్లబరిచే మహాశక్తి అది. శీతలీక్రియతే తాపో యేన త న్మధురం స్మృతమ్ – అని భావప్రకాశంలో శారదాతనయుడు. ఈ మాధుర్యం కావ్యగుణాలలో ఒకటి. ఈ గుణం లలితకోమలపదావళితో కూడినప్పుడు శబ్దగుణమని, శబ్దార్థం మనసుకెక్కిన తర్వాత కలిగే వైచిత్రితో కూడినప్పుడు అర్థగుణమని నాట్యశాస్త్రవ్యాఖ్యలో అభినవగుప్తుల వారన్నారు. వాక్యరచన కోమలమై విలసిల్లాలి. రసభావం మనను ఆ మధురస్రవంతిలో ముంచెత్తివేయాలి. లలితై రక్షరై ర్యుక్తం శృఙ్గారరసరఞ్జితం, శ్రావ్యం నాదసమోపేతం మధురం ప్రమదాప్రియమ్ – అని సోమేశ్వరుడు మానసోల్లాసంలో చెప్పనే చెప్పాడు కదా. ఇది శబ్దగుణమైనప్పుడు పృథక్పదత్వం (విడివిడి పదాలతో కూడిన సుబోధమైన శైలి) వల్ల కలుగుతుందని కావ్యాలంకారసూత్రవృత్తిలో వామనుడన్నాడు. అనతిదీర్ఘసమాసత్వం (దీర్ఘసమాసాలు లేకపోవటం), స్థాన ప్రయత్నాది సామ్యం వల్ల, అనుప్రాసాది వర్ణవిన్యాసం వల్ల కలిగే శ్రావ్యత అన్నవి దీని లక్షణాలు. ఇది అర్థగతమైనప్పుడు మసృణత్వం, ఉక్తివైచిత్రి వల్ల కలిగే ప్రాణశక్తి దీని లక్షణాలు. అర్థోచితవచోబన్ధో మాధుర్య మభిధీయతే – అని ప్రకాశవర్షుని రసార్ణవాలంకారం. మధురమైన అర్థానికి తగిన మధురమైన శబ్దాన్ని నిబంధించటమే మాధుర్యమనే రసధర్మమని ఆయన ఉద్దేశం. ఆహ్లాదకత్వం మాధుర్యం శృఙ్గారే ద్రుతికారణమ్, కరుణే విప్రలమ్భే తచ్ఛాన్తే చాతిశయాన్వితమ్ – అని మమ్మటుని కావ్యప్రకాశం. మనస్సుకు ద్రుతిని కూర్చే (చిత్తాన్ని ద్రవింపజేసే) హ్లాదనం ద్వారా రసాన్ని ప్రవహింపజేసే గుణవిశేషం ఇది. ఆత్యంతికమైన తీవ్రావేశం కలిగినప్పుడు సైతం తొట్రుపాటు లేని హృదయధర్మం మాధుర్యమని సాహిత్యమీమాంసలో మహాలంకారికుడు మంఖుకుడన్నాడు.

ఇటువంటి లక్షణవిషయాలన్నీ ప్రస్తావనకు రాగలవని తెలిసిన రామకృష్ణకవి తదనుగుణంగానే తన పూరణను నిర్వహించాడు. శృంగార వేదాంతాలను సామ్యభావంతో పరిష్కరించాడు.

రాయలు అడిగిన ప్రశ్న పద్యపూర్వార్ధంలో ఉన్నంత మాత్రాన అది పూర్వపక్షార్థం కాదు. పూర్వపక్షాశ్రయమైన సిద్ధాంతవిరోధకోటి లోనిది కాదు. అది ప్రశంసాపూర్వకమైన వాక్యోపక్రమం. అందువల్ల రామకృష్ణకవి యోగ్యయోగసామర్థ్యంతో, సిద్ధాంతానుకూలమైన తర్కంతో వాస్తవాన్ని నిర్ధారణ చేయవలసివచ్చింది.

రాయలు మాధురీమహిమ ఎట్లు కలిగెను? అని వ్యక్తీకరించినది సందేహం. దానికి హేతువుగా రామకృష్ణకవి అధరసుధారసాస్వాదనను ప్రతిపాదించాడు. ఆ అధరముయొక్క ధర్మవైశిష్ట్యాన్ని అమృతరసస్యందితగా నిరూపించాడు. ‘క్రోలుటన్ చుమీ’ అన్న నిశ్చయంతో అదే అసలు హేతువు అని ముగించాడు.

ఎట్లు కల్గెను? అన్న ప్రశ్నలోనే, ఏల కల్గెను? అన్న మరొక సందేహం కూడా అంతర్భావిగా ఉన్నది కదా. దానికి కూడా సమాధానం చెప్పాలి కనుక శ్లేషానుప్రాణితంగా సాదృశ్యహేతుకమైన అన్యార్థాన్ని నిక్షేపించాడు.

రెండు అర్థాలలో ఏది ప్రధానం? అంటే, ఎవరి సంస్కారాన్ని బట్టి వారు ప్రధానార్థాన్ని గ్రహిస్తారన్నమాట.

తీయదనానికి ఆశ్రయమైనది వారవనిత క్రింది పెదవి. సుధారసధారలు చిప్పిల్లటానికి విషయభూతంగా కవి స్వీకరించిన వస్తువిశేషం అది. ఆ రసాస్వాదనం ధూర్జటి కవిత్వానికి తీయదనాన్ని అలవరించినదని చెప్పటం కవితాత్మకమైన భావన.

భువనైక + మోహన

భువనైకమోహన అన్నప్పుడు రామకృష్ణకవి పూరణలో అర్థాంతరస్ఫురణ కూడా ఉన్నది. ‘మోహనము’ అన్నది మన్మథుని శస్త్రశక్తులలో ఒకటి. ఆ ప్రకారం ‘లోకాలన్నింటిని వశపరచుకొనే మన్మథుని సమ్మోహనశక్తియొక్క ఉద్ధతిని కలిగినప్పటికీ మిక్కిలి కోమలులైన వారవనితల ఘనతాపహారి – సంతతమధురాధరోదిత – సుధారసధారలు’ అని పద్యాన్ని అన్వయింపవచ్చును.

ఘన + తాపహారి, ఘనతా + అపహారి

ఇందాక చెప్పుకొన్న అర్థానికి మారుగా, భువనైకమోహనో, ద్ధతసుకుమారవారవనితాజనతాఘనతాపహారి అన్న సమాసాన్ని పుంలింగంగా గ్రహించి, దానిని ధూర్జటికి అన్వయించి, భువనైకమోహన = ఈరేడు లోకాలను సమ్మోహింపజేసే, ఉద్ధత = ఔద్ధత్యాన్ని వహించిన (గర్వాన్ని కలిగిన); వారవనితాజనతా = వేశ్యాంగనల; ఘనతా + అపహారి = గర్వాతిశయాన్ని పోగొట్టేవాడైన ధూర్జటిగారిచే; (వారవనితల యొక్క) సంతత మధురాధర ఉదిత సుధారసధారలు క్రోలుటన్ చుమీ – అని మరొక అన్వయం కూడా సాధ్యమే.

వారవనితాజనతా ఘనతా + అపహారి అన్న విరుపులో వారవనితా జనతకు అంతకాలమూ ఉన్న ఘనత (పరువు) కూడా ధూర్జటి వాళ్ళ ఇంటికి వెళుతుండటం వల్ల తొలగిపోతుందనే వెక్కిరింత లేకపోలేదు. ఘనతా + అపహారి = ఇటువంటివాడు ఇంటికి వచ్చిపోతూ వాడవదినెలకు ఉన్న పరువును కూడా తీస్తున్నాడన్నమాట.

ఇదీ వ్యంగ్యార్థంలో భాగమే కాని, రామకృష్ణకవికి అనభిమతార్థం కాదు.

ఉద్ధత > ఉద్యత

భువనైకమోహనో, ద్ధతసుకుమార అన్నప్పుడు ‘ఉద్ధత’ అన్న ఆ విశేషణానికంటె ‘ఉద్యత’ అన్న అనుసంధేయార్థం కూర్పబడి ఉంటే పద్యాన్వయం ఇంకా సులభంగా ఉండేది. ప్రతిపాద్యార్థమూ మరింత ప్రశంసనీయంగా ఉండేది.

“…హా, తెలిసెన్! భువనైకమోహనో
ద్యతసుకుమారవారవనితాజనతాఘనతాపహారి సం
తతమధురాధరోదితసుధారసధారలు గ్రోలుటం జుమీ.”

అన్నప్పుడు, భువనైకమోహన = సమస్తభువనాలను ఒక్క తీరున (సౌందర్యాదిభిః ముగ్ధతాకరణే) సమ్మోహింపజేసేందుకు, ఉద్యత = పూనుకొన్న, వారవనితాజనతా = వేశ్యాంగనలయొక్క, ఘన + తాపహారి = (విరహిజనుల) అధికతరమైన మన్మథార్తిని హరింపజేసే, సంతత మధుర = నిత్యమధురమైన, అధర = క్రిందిపెదవినుంచి, ఉదిత = ఉదయించిన, సుధారసధారలు = అమృతరసప్రవాహాలను (ప్రథమకు ద్వితీయార్థం); క్రోలుటన్ + చుమీ = ఆస్వాదించటం వల్లనే సుమండీ!

అని స్పష్టమైన అర్థప్రతీతి సాధ్యమయ్యేది. వ్రాతప్రతులలో అటువంటి పాఠం ఉన్నదేమో పరిశోధించాలి.

పద్యపూరణ: ప్రామాణ్యవివేచన
రాయల కొలువులో ధూర్జటి కవిత ప్రశంసకు పాత్రమై, రాయలు పూరణీయంగా అడిగిన ఈ పద్యపాదం కథ కేవలం జనశ్రుతులలో వినబడే కట్టుకథ కాదని, పద్దెనిమిదవ శతాబ్ది తొలిపాదం నాటికే ఇది ఈ నోట ఆ నోట నాటుకొని ఉన్నదని ధూర్జటి వంశీయుడైన కుమార ధూర్జటి క్రీస్తుశకం 1710 ప్రాంతాల తన కృష్ణరాయ విజయము అవతారికలో (1-29) కృతిభర్త తనతో పలికిన వాక్యంగా గ్రంథస్థం చేసిన విషయాన్ని బట్టి తెలుస్తున్నది:

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు గల్గెనో
యతులితమాధురీమహిమ” నా మును మీ పెదతాత చాల స
న్నుతిఁ గనెఁ గృష్ణరాయల మనోజ్ఞసభన్; విను, మీవు నట్ల – మ
త్కృతబహుమానవైఖరులఁ గీర్తి వహింపుము ధాత్రిలోపలన్!”

ఇందులో కుమార ధూర్జటి కృష్ణరాయల వాక్యాన్ని యథాతథంగా పేర్కొని ఉండటం వల్ల పై కథోదంతమంతా సత్యమేనని భావించటానికి వీలవుతున్నది. కృష్ణరాయవిజయం కృతిభర్త ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు గల్గెనో, యతులితమాధురీమహిమ నా మును మీ పెదతాత చాల స, న్నుతిఁ గనెఁ గృష్ణరాయల మనోజ్ఞసభన్’ అనటం వల్ల కృష్ణదేవరాయలు అడిగినది ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు గల్గెనో, యతులితమాధురీమహిమ’ అనే గాని, ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల గల్గెనో, యతులితమాధురీమహిమ’ అని కాదని వెల్లడవుతున్నది. అయితే, ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు గల్గెనో, యతులితమాధురీమహిమ’ అన్న పాఠానికంటె ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు గల్గె – నీ, యతులితమాధురీమహిమ’ అన్న పాఠం మేలని అనుకొన్నాము. కుమార ధూర్జటి ఈ పాఠభేదాలను గమనించి ఉండకపోవచ్చును. లేదా, ఆ పాఠం తన అవతారిక సందర్భంలో ఇమడదని ఆయన అనుకొని ఉండవచ్చును.

రాజసభలో సమస్యను తెనాలి రామకృష్ణుడు ఒక్కడే పూరించాడో, పరిపరివిధాలైన ఇతరుల పూరణలు కూడా ఉండినవో తెలుసుకోవటానికి ఆధారాలు లేవు.

పద్యరచనా కాలం
ధూర్జటి కృతులుగా మనకు లభిస్తున్నవి మొత్తం రెండు కృతులు. 1. శ్రీకాళహస్తి మాహాత్మ్యము, 2. శ్రీకాళహస్తీశ్వర శతకము. సాహిత్యచరిత్రకారులు వీటి రచనాక్రమం ఇదేనని భావిస్తున్నా, వీటిలో ఏది మొదటిదో, ఏది తర్వాతిదో నిర్ధారించటానికి ప్రకటమైన ఆధారాలు లేవు. రెండింటి రచనాకాలాన్ని నిరూపించే ప్రామాణికమైన ఆధారమేదీ బయల్పడలేదు.

ధూర్జటి కృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవిసమాజంలో ఒకడని కథాశ్రవణమే కాని, అందుకు సమకాలిక చారిత్రికాధారాలేవీ గురజాడ శ్రీరామమూర్తి గారు ఈ కథను చెప్పినప్పుడు వెల్లడి కాలేదు. ఒకానొక రోజున కాళహస్తిమాహాత్మ్యాన్ని తెనిగించిన ధూర్జటి అనే కవీశ్వరుడొకడు రాజాస్థానానికి విచ్చేసి, కృష్ణరాయలతో తన గ్రంథాన్ని గురించిన ప్రశంస కావించాడని, అప్పుడు రాయలు ఆ గ్రంథాన్ని తెప్పించి సావధానంగా పరిశీలించాడని, ఆ కవి వాక్చమత్కృతికి ముగ్ధుడై పండితులను ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ, యతులితమాధురీమహిమ?’ అని అడిగాడని ఆయన కథనం. ధూర్జటి రాయాస్థానంలో లేడని ఆయన కథనం. అయితే, కొండవీటి దండకవిలెలోని అష్టదిగ్గజ కవుల పట్టికలో ధూర్జటి పేరున్నది. ఉన్నది. అదేమంత ప్రామాణికమైన సాక్ష్యం కాదు. విశ్వనాథ స్థానాపతి రాయవాచకంలో ధూర్జటి పేరు లేదు. జనశ్రుతి మాత్రం ఆయన అష్టదిగ్గజకవులలో ఒక్కడనే.

కుమార ధూర్జటి పైని చెప్పిన ‘కృష్ణరాయల మనోజ్ఞసభన్’ అన్న ప్రమాణం గాక, ఆ కుమార ధూర్జటి కొడుకు లింగరాజకవి చెప్పిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యములో ఈ పద్యం ఉన్నది:

“శ్రీకాళహస్తిగౌరీనాథపదపద్మసద్భక్తియుక్తి నిశ్చలతఁ గాంచి
సారసుధాసారసరసోక్తిగుంభనఁ గాళహస్తిమాహాత్మ్య(?మహత్త్వ)కథ నొనర్చి
కృష్ణరాయకిరీటకీలితమణిగణార్చితపదాబ్జద్వయశ్రీ వహించి
యాసేతుకాశీతటావనీఖ్యాతసత్కీర్తివిస్ఫూర్తిఁ జాల వెలసి

ధరణిఁ జెలువొందె నే కవీశ్వరవతంస
రత్న మ మ్మహనీయు, ధూర్జటిసుధీంద్రుఁ
దలఁతు జలనిధివీచికా కలకలాను
కారిభూరికవిత్వవాక్పటిమ గులుక.”

ఇందులో చెప్పినట్లు కృష్ణరాయలు ధూర్జటి పాదాలకు సకిరీటంగా వంగి నమస్కరించిన సందర్భం ఎప్పటిదో లింగరాజకవి వర్ణించలేదు. చెప్పిన సందర్భాన్ని బట్టి మాత్రం ధూర్జటి కృష్ణరాయల ఆస్థానవిద్వాంసులలో ఉన్నాడనే అనుకోవాలి. అయితే కృష్ణరాయల పాలనాకాలానికి సుమారు రెండు శతాబ్దాల తర్వాత ఆయన ఉన్నాడు. ఎన్ని వివరాలను ఎంతవరకు తెలుసుకొన్నాడో చెప్పలేము.

క్రీస్తుశకం 1509 – 1524 సంవత్సరాల మధ్య శ్రీకృష్ణదేవరాయల ప్రాభవం జగద్విదితంగా ఉండిన రోజులలో ధూర్జటి కృతికర్తృత్వం సాగినట్లు కనబడదు. అల్లసాని పెద్దన, నంది తిమ్మనాదులకంటె కొంత ఆలస్యంగా ఆస్థానప్రవేశం చేసి, అక్కడి విలాసాలకు అలవాటుపడి, అదే సమయంలో రాయల కొలువులోని స్థితిగతులను పరిశీలిస్తూ, కావ్యరచనకు ఆవశ్యకమైన సాధనసామగ్రిని సమకూర్చుకొనే ప్రయత్నంలో ఉన్నాడేమో అనిపిస్తుంది. శ్రీకాళహస్తిమాహాత్మ్యము ఆశ్వాసాంతగద్యలో తన కవితాలక్షణాలను ప్రస్తావింపక నిర్విశేషంగా ‘భవపరాఙ్ముఖ ధూర్జటి ప్రణీతంబైన’ అని మాత్రం చెప్పి ఊరుకొన్నాడు. రాయల ఆస్థానంలో ఉన్న తరుణం ఈ భవపరాఙ్ముఖత్వానికి అనుకూలించిన తరుణమై ఉండదు.

శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తుశకం 1509లో రాజ్యానికి వచ్చాడు. 1530 దాకా పరిపాలించాడు. రాజ్యానికి వచ్చింది మొదలు 1516లో కళింగదేశం విజయనగర మహాసామ్రాజ్యంలో విలీనమైనంత వరకు ఘోరయుద్ధాలతో తీరిక లేకుండా ఉన్నాడు. 1517లో నంది తిమ్మన పారిజాతాపహరణమును అందుకొన్నాడు. అందులో భువనవిజయ సభాభవనం ప్రశంస ఉన్నది. ఆ తర్వాత 1519-1520 నాటి అల్లసాని పెద్దన స్వారోచిష మనుసంభవము (మనుచరిత్ర) లోనూ, తదితరకావ్యాలలోనూ ఉన్నది. 1524 ప్రాంతాల రాయల ఆముక్తమాల్యద రచన జరిగింది. 1518లో కొడుకు తిరుమలరాయలు జన్మించాడు. 1524లో ఆ పిల్లవాడి హత్య జరిగింది. 1524 నుంచి 1530 వరకు రాజ్యమంతా కుట్రలతో కూహకాలతో నిండి, తాడును చూసి పామనుకొనే దుఃస్థితిలో జీవచ్ఛవంగా కాలం గడిపాడు. అనుమానంతో తిమ్మరుసును చెరపట్టాడని పాశ్చాత్య చరిత్రకారులు వ్రాసినది నిజమే అయివుంటుంది. భువనవిజయంలో మళ్ళీ కొలువుతీరినట్లు కనబడదు. సంకుసాల నరసింహకవి వంటి కవులు తమ కావ్యాలను రాజుకు అంకితం చేద్దామని నెలల తరబడి వేచి ఉండి, నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోయిన కాలం అది.

1530లో కృష్ణరాయల మరణానంతరం విజయనగర సామ్రాజ్యం కుక్కలు చింపిన విస్తరి అయింది. అప్పటికే తిమ్మరుసు ప్రాభవం అంతరించి అయిదారేళ్ళు దాటింది. కన్నులు పోయాయి. ఆయన చుట్టపక్కాలకూ ప్రాపకాలు తప్పాయి. రోజులు గడవటం కష్టమయింది కాబోలు, 1533లో పాపం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి గుడిలో అంతవరకు అనుభవిస్తుండిన తన ప్రసాదస్వామ్యం హక్కులను సర్వభుక్తంగా తాళ్ళపాక అన్నమాచార్యుల కొడుకు పెద తిరుమలాచార్యులకు అమ్ముకొన్నాడు. ధూర్జటిని ఆదరింపగల స్థితిలో లేడు. ధూర్జటి వేరే రాజులను ఆశ్రయించినట్లు లేదు. కృష్ణరాయల తర్వాత అచ్యుతదేవరాయలు సింహాసనం ఎక్కాడన్నమాటే గాని రాచరికానికే తీరని మచ్చతెచ్చిన పరామకిరాతకుడు. అల్లసాని పెద్దన అంతటివాడు ‘కృష్ణరాయల తోడ దివి కేఁగలేక, బ్రదికియున్నాఁడ జీవచ్ఛవంబ నగుచు’ అని పరితపించిన రోజులవి. ధూర్జటికి ఆ మాత్రపు అదృష్టమన్నా దక్కినట్లు లేదు. జీవచ్ఛవానికన్నా దయనీయంగా గడిపిన రోజులవి. రాజశబ్దమంటేనే అసహ్యం పుట్టింది. ‘ఛీ! జన్మాంతరమందు నొల్లను జుమీ, యీ ‘రాజ’ శబ్దంబు’ అని చీదరించుకొన్నాడు. తన వర్తనపై తనకే పశ్చాత్తాపం ఉదయించింది. శ్రీకాళహస్తీశ్వర శతకంలోని రాజనింద అంతా అక్షరాక్షరం ఆ అచ్యుతరాయలకు వర్తిస్తుంది. అందువల్ల 1535కు దరిదాపుల శతకరచన జరిగినదని పెక్కుమంది విమర్శకుల విశ్వాసం. ఏ సంగతీ నిర్ధారణగా చెప్పలేము. వైరాగ్యం అలవడి, మనస్సును చిక్కబట్టుకోగలిగినట్లు కనబడదు. శతకంలో ‘విరక్తుఁ జేయఁగదవే’ అని స్వామిని పదే పదే వేడుకొన్నాడు. కావ్యం విషయానికి వస్తే, శ్రీకాళహస్తిమాహాత్మ్యములో మనస్సు కొంత నిలకడతో ఉన్నట్లు కనబడుతుంది. విజయనగర సామ్రాజ్యోన్నతి నాడు పొందిన ఆనందపు ఛాయలేవీ అందులో అగుపించవు. అసలు కృష్ణరాయల రాజ్యప్రస్తావనమే లేదు. 1523 – 1524 ప్రాంతాల రచన మొదలై, కృష్ణరాయలకు ఎన్నో ఒడిదుడుకులు ఎదురైన 1525 – 1530ల నడిమి కాలంలో పూర్తయి ఉండవచ్చునని అనిపిస్తుంది. లేక, 1523 నాటికే మొదలుపెట్టాడో. చతుర్థాశ్వాస పర్యంతం అప్పటికి పూర్తయినట్లున్నది. కృష్ణరాయలు అప్పటికింకా స్తిమితంగా ఉన్న 1524 ప్రాంతంలో ఎప్పుడో భువనవిజయంలో తన కావ్యగానం చేసే అవకాశం వచ్చి ఉంటుంది. ఆ గానమాధురికి రాయలు ముగ్ధుడై, ‘స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గె నీ, యతులితమాధురీమహిమ?’ అని ప్రశ్నించటమూ, అప్పుడు తెనాలి రామకృష్ణుడు సమాధానం చెప్పటమూ భావ్యమే.

మరి ఆ కాలంలో తెనాలి రామకృష్ణుని స్థితేమిటి? అప్పటికింకా ‘రామకృష్ణుడు’ కాలేదని, ఇంకా ‘రామలింగడు’ గానే ఉన్నాడని మనకు తెలుసు. క్రీస్తుశకం 1530 ప్రాంతాల ఉద్భటారాధ్య చరిత్రము రచన జరిగింది. అప్పటికి రామలింగడు గానే ఉన్నాడు. 1530 తర్వాత అచ్యుతరాయల సంస్థానంలో ఈ కథాసన్నివేశం జరిగినదని అనుకొన్నా, అప్పటికీ రామలింగడు గానే ఉన్నాడు. 1550 – 65 ప్రాంతాల కందర్పకేతు విలాసము, హరిలీలా విలాసము కావ్యాలను చెప్పాడు. 1560 – 65 లకు నడిమికాలంలో ఎప్పుడో వైష్ణవం పట్ల మొగ్గుచూపాడు. భట్టరు చిక్కాచార్యుల సన్నిధిని సమాశ్రయణం సిద్ధించిన సమయం అది. 1575లో పాండురంగ మాహాత్మ్యము రచన జరిగింది. 1575 – 1580లకు మధ్య ఘటికాచల మాహాత్మ్యము రచన. అప్పటికి డెబ్భై సంవత్సరాలనుకొంటే 1510 ప్రాంతాల జన్మించి ఉండాలి. అప్పటికి ఎనభై సంవత్సరాలనుకొంటే 1500 ప్రాంతాల జన్మించి ఉండాలి. ఎటుచూసినా 1524 ప్రాంతాల ధూర్జటి వంటి మహాకవిపై పరిహాస చంద్రహాసాన్ని ఝళిపించేందుకు 14 కంటె 24 ఏళ్ళ ప్రాయపువాడై ఉండటం సమంజసం. అందువల్ల, 1500 – 1580 అన్నది రామకృష్ణుని జీవితకాలం అన్నమాట.

1524 నాటికి తెనాలి రామకృష్ణకవి ఇంకా తెనాలి రామలింగకవి గానే ఉన్నందువల్ల కథావిషయాన్ని ఇదమిత్థంగా నిర్ధారించేందుకు తగిన సాధనసంపత్తి లేదని కాబోలు, బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు, ‘కృష్ణరాయలు ధూర్జటికవి కవనశక్తినిఁగూర్చి పద్యరూపమునఁ బ్రశ్నింపఁగా నొకకవి పూరించిన పూరణము’ అని ఈ చాటువును కృష్ణదేవరాయల ఆస్థానంలో ‘ఎవరో కవి’ చేసిన పూరణగా తమ చాటుపద్యమణిమంజరిలో (1988 నాటి ముద్రణలో 127-వ పద్యం శీర్షిక) ఉదాహరించారు.

శైవ వైష్ణవ నామాంకనాలలో విభేదం ఉన్నంత మాత్రాన ఈ పద్యపూరణను ఎవరో కవి చేసిన పూరణ అని భావింపనక్కరలేదు. రామలింగకవి శైవుడుగా ఉన్న రోజులలో చేసినప్పటికీ, ఆ తర్వాత ప్రసిద్ధిలోకి వచ్చిన రామకృష్ణ నామాన్ని బట్టి జనులు దీనిని రామకృష్ణకవి రచనగా భావించటం అసంభావ్యమేమీ కాదు.

ఈ పూరణను నిర్వహించిన తర్వాత కొద్ది కాలానికే రామకృష్ణకవి ఉద్భటారాధ్య చరిత్రమును పూర్తిచేశాడు. అందులో తన కవిత్వాన్ని గురించి కృతిపతి ఊరదేచమంత్రి సహజసాహితీమాధురీసంయుతాత్ముఁడవు అని చెప్పినట్లుగా వ్రాశాడు. భక్తాగ్రేసరుడైన బమ్మెర పోతనగారి సహజపాండిత్య కవితావైచిత్రిలోని ప్రాణశక్తి, పరమమాహేశ్వరుడైన ధూర్జటిగారి కవనంలోని భగవన్ముఖీనమాధుర్యలక్షణం మనస్సును లోగొన్నందువల్ల కాబోలు, ఉద్భటారాధ్య చరిత్ర అవతరణికలో ఆ సహజపాండిత్యాన్ని, ఈ సుభగమాధురీమహిమను మేళవించాడని అర్థం. ధూర్జటి గారి అపూర్వమైన ‘మాధురీమహిమ’ ఇంకా ఆయన గుండెలకు హత్తుకొని ఉన్నదన్నమాట.

పద్యభావం: పునరవలోకనం
జాగ్రత్తగా పరిశీలిస్తే రామకృష్ణకవి కృష్ణరాయల ప్రశ్నను అమేయమైన ప్రతిభతో వక్తవ్యానికి అనుగుణంగా మలిచి చెప్పాడని అర్థమవుతుంది. ధూర్జటి కృష్ణరాయల సభలో చదివిన శ్రీకాళహస్తి మాహాత్మ్యము చతుర్థాశ్వాసంలోని మాణిక్యవల్లి కథ ప్రసక్తికి వచ్చిందని, ఆ కథాసంగతమైన ఉదంతాన్ని రామకృష్ణుడు ఉభయార్థద్యోతంగా చమత్కరించాడని తెలుస్తుంది.

దక్షిణదేశంలోని మధురాపురంలో మాణిక్యవల్లి అనే వేశ్యకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు. గణికాజనానికి ఉచితమైన వాతావరణంలో పెంచినా, వారు శివభక్తికి నోచుకొని చిన్ననాడే వైరాగ్యాన్ని అలవరచుకొంటారు. కులవృత్తిని వీడరాదని ఆమె వారికి చెవిలో ఇల్లుకట్టుకొని వారకాంతల విధివిధానాలను నూరిపోస్తుంది. వారు –

“అమృతము గ్రోలు జిహ్వ చవియంచుఁ దలంచునె తేనె? నింటిలో
నమరమహీరుహం బుదయమైన నరుం డవనీశు వేఁడునే?
యమిజనభాగ్యరూప మగు నాదిమతత్త్వముఁ గాళహస్తిదై
వము భజియించు మానసము వారవధూమదసౌఖ్య మెంచునే?”

అని ఆమె పలుకులను తిరస్కరిస్తారు. అమృతాన్ని ఆస్వాదించటానికి నోచుకొన్న నాలుకకు వట్టి తేనె రుచి అవుతుందా? పెరటిలో కల్పవృక్షం నెలకొన్న భాగ్యశాలికి రాజును ప్రార్థింపవలసిన ఆవశ్యకత ఉంటుందా? ఇంద్రియాకర్షణలకు లోనుగాక నిగ్రహం అలవరచుకొన్నవారి పుణ్యవశాన నేలకు దిగివచ్చిన స్వామిని, సర్వతత్త్వాలకు ఆద్యప్రకృతి అయిన శ్రీకాళహస్తిదేవుని పూజించేవారి మనస్సు వారకాంతలతోడి పొందును కోరుకొంటుందా? మేము మాంసలసుఖాన్ని ఆశించే మానవభుజంగులతోడి సౌఖ్యానికి తావీయము. జగన్నాయకుడైన పరమేశ్వరుని సన్నిధికై ఉవ్విళ్ళూరుతున్నాము – అని అంటారు. కుమార్తెల ఆ వైరాగ్యభావనకు వేశ్యమాత ఎంతగానో చింతిస్తుంది. ఆమె ఒత్తిడిని భరింపలేక వారు శ్రీకాళహస్తిక్షేత్రంలో శివుని సన్నిధికి వెళ్ళిపోవాలనుకొంటారు. దారిదొంగలు వారికి అపకారం చేయవచ్చునని సందేహించి ఈశ్వరుడే వారికి మానవరూపంలో సాక్షాత్కరించి శ్రీకాళహస్తికి తీసుకొనివెళ్తాడు. ఆ మోహనక్షేత్రములో వారు నత్కీరుని శతకపద్యాలతో పరమేశ్వరుని సన్నుతిచేస్తూ, అపూర్వమైన పారవశ్యాన్ని పొందుతారు. ఈశ్వరుడు సతీసమేతుడై వారికి ప్రత్యక్షమై తన సన్నిధి రూపమైన పెన్నిధిని వారికి అనుగ్రహిస్తాడు. ఆకాశవాణి వారి భక్తిపారమ్యాన్ని పురజనులకు వినిపించి, శివుని అనుగ్రహానికి నోచుకొన్న ఉదంతాన్ని వివరించి, వారి పేరిట ఆ పుణ్యక్షేత్రంలో మహేశ్వరలింగాలను ప్రతిష్ఠించాలని ఆదేశిస్తుంది.

మహాకవి ధూర్జటి శైవభక్తిపారమ్యానికి, తమిళంలో సీకాళత్తిపురాణంలో ఉన్న స్థూలచిత్రణకు ప్రాణప్రతిష్ఠ చేసిన ఆయన భంగీభణితికి, సాటిలేని మాధురీమహిమకు ఉదాహరణీయమైన కథ ఇది.

వారవనితా జనత – అంటే ఆ మాణిక్యవల్లి కుమార్తెలు. వారి పలుకులు ఎన్నో జన్మల అనుభవతాపాన్ని హరింపజేసే మాధుర్యసుధారసధారలు. శివుని యందలి అఖండాకారమైన అనురక్తి, పరమప్రేమ, సర్వసమర్పణభావం, పారమార్థికత, విషయవాసనల పట్ల అనాసక్తి, తత్ఫలమైన వైరాగ్యం వారికి పుట్టుకతోనే అలవడటం వారి భాగ్యవిశేషం. శివార్చనానియమసంగతి తప్ప వారికి అన్యబంధాలు లేవు. పరమేశ్వరుడు వారి భక్తినిష్ఠను గుర్తించి, సన్నిధిని అనుగ్రహించి, తానే వారి వెన్నంటి నడిచి, తాను స్వయంవ్యక్తుడై వెలసిన పుణ్యక్షేత్రానికి తానే తీసికొని వెళ్ళాడన్న కథను పోలిన కథ సాహిత్యంలో వేరొకటి లేదు. తాము అనునిత్యం సేవించుకొంటున్న ఆరాధ్యదైవతం కనుల మ్రోల నిలిచి తమను ఆత్మాభిముఖంగా నడిపిస్తున్నాడన్న అభిజ్ఞానం లేని ఆ బాలికలు మధురాపురం నుంచి చిదంబర నటరాజు వెలసిన పుణ్యక్షేత్రం దారిని మూడు నాలుగు రోజుల ప్రయాణంలో ఆ ‘ఘనతాపహారి’ యొక్క ‘సంతతమధురాధరోదితసుధారసధారలను’ ఆస్వాదించే మహాపుణ్యానికి నోచుకొన్నారు. జన్మించినది ఆదిగా శివారాధనం తప్ప వేరొకటి యెరుగని ఆ పుణ్యవతుల ఘనతాపహారి = జన్మజన్మల తాపశాంతికర ‘సంతతమధురాధరోదితసుధారసధారలను’ మనోమందిరంలో నిలుపుకొన్న ధూర్జటి పవిత్రవాక్కులకు లౌకికకవుల వాగ్విశేషాలతో ఔపమ్యానికి అందని మాధుర్యమయప్రాణశక్తి అందివచ్చింది. అమోఘమైన ఆ వాగ్ధారలో ఓలలాడిన రాయలవారికి ఆ అతులితమైన మాధురీమహిమ అచ్చెరువు గొలిపింది. తత్పూర్వం ఎన్నడూ యెరుగని పారవశ్యాన్ని పొందాడు.

మహాభక్తురాండ్రైన మాణిక్యవల్లి కుమార్తెలు నత్కీరుని శతకపద్యాలను స్తోత్రం చేసి పరమశివుని సన్నిధిని పొందిన ఈ చతుర్థాశ్వాస కథకు మునుపు తృతీయాశ్వాసంలో సాక్షాత్తు మహాకవి నత్కీరుని కథే ఉన్నది. పాండ్యరాజు కొలువుకు ఒక హరద్విజుడు వచ్చి సుందరేశ్వరస్వామి తనకిచ్చిన పద్యాన్ని చదివి వినిపిస్తాడు. ఒక ప్రియుడు తన ప్రియురాలి ధమ్మిలబంధము యొక్క గంధాన్ని మించిన సుగంధం ఉంటుందా? అని ఒక తుమ్మెదను అడగటం ఇతివృత్తం. నత్కీరుడు హరద్విజుడు చెప్పిన పద్యంలో లోకరీతి, కవిసమయం రెండూ తప్పాయని ఆక్షేపిస్తాడు. అప్పుడు సుందరేశ్వరుడే స్వయంగా వచ్చి సభలో కూర్చొని, అందులో తప్పేమిటో చెప్పమని అడుగుతాడు:

“ఈ రాజన్యుని మీఁద నేఁ గవిత సాహిత్యస్ఫురన్మాధురీ
చారుప్రౌఢిమఁ జెప్పి పంప, విని, మాత్సర్యంబు వాటించి న
త్కీరుం డూరక తప్పువట్టెనఁట, యేదీ! లక్షణంబో? యలం
కారంబో? పదబంధమో? రసమొ? చక్కం జెప్పుఁడీ త” ప్పనన్.

అని అడుగుతాడు. ఆ తర్వాత సాక్షాత్తు సుందరేశ్వరునితోడి వాదంలో పార్వతీ ధమ్మిల్లబంధమైనా సరే, దానికి సహజగంధం ఉండదని తెగవేసి చెప్పిన నత్కీరునికి లౌకిక పాండిత్యగర్వభంగం, ఆ తర్వాత శాపకలనం, తత్కారణాన పశ్చాత్తాపం, పాపవిముక్తికీ మనశ్శాంతికీ పరమేశ్వర పుణ్యతీర్థసేవనం, ఆ తర్వాత అతను శివసాయుజ్యాన్ని పొందిన పర్యంతం తృతీయాశ్వాస కథ కొనసాగుతుంది.

పరమేశ్వరుడు తన కవితలో ‘సాహిత్యస్ఫురన్మాధురీ చారుప్రౌఢిమ’ ఉన్నదని చెప్పినప్పటి ఆ అమోఘమైన సన్నివేశం రాయల వారి మనస్సులో నిలిచిపోయి ఉండాలి. దానినే ధూర్జటి కవితకు అన్వయించి,

“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కెట్లు కల్గె నీ
యతులితమాధురీమహిమ?”

అని సదస్యులతో తన ఆనందాన్ని పంచుకొన్నాడు. ఆ మహానందాన్ని, ఆ సన్నివేశం పూర్వాపరాలను గుర్తించిన రామకృష్ణకవి అందుచేతనే భక్తి శృంగారాలను మేళవించి –

“… హా! తెలిసెన్; భువనైకమోహనో
ద్ధతసుకుమారవారవనితాజనతాఘనతాపహారి సం
తతమధురాధరోదితసుధారసధారలు గ్రోలుటం జుమీ.”

అని ఆయన మనోగతాన్ని తన మనోధర్మానుసారం మనోహరంగా పరిపూర్ణించాడు. మహాశివుని భక్తురాండ్రైన పుణ్యాంగనల జీవితగాథను ధూర్జటి నిజోదంతంతో సమన్వయించాడు.

ఈ పూరణను విన్న రాయలు రామకృష్ణకవికి ఏ బహుమానం సమర్పించుకొన్నా అది తక్కువే అవుతుంది.

తన కావ్యోక్తిమాధురికి ప్రాణంపోశాడని నిండుమనస్సుతో ధూర్జటి గారు ఆ రోజు యువకవి శిరస్సుమీద ఎన్ని దీవెనలు కురిపించాడో!

సభవారంతా ఎంత మురిసిపోయారో!
----------------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు, 
ఈమాట సౌజన్యంతో
-