Thursday, January 31, 2019

ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు


ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు





సాహితీమిత్రులారా!

పరిచయము
నవీనయుగములో మాత్రా ఛందస్సుకు ఒక గొప్ప స్థానము నిచ్చి కవితావ్యవసాయమును చేసినవారిలో గురజాడ అప్పారావు తఱువాత శ్రీశ్రీ అగ్రగణ్యుడు. శ్రీశ్రీ మహాప్రస్థానం[1] తెలుగు భాషలో ఒక నూతన కవితాశైలికి నాందీవాక్యమును పలికినదన్న విషయములో అతిశయోక్తి లేదు. ఇందులో ఎన్నో గేయములలో ఎన్నో రకములైన మాత్రాఛందస్సులను శ్రీశ్రీ వాడినాడు. ఈ వ్యాసములో నేను అట్టి ఛందస్సులలో నొక దానిని గురించి చర్చిస్తాను.

మహాప్రస్థానంలో ఈ ఛందస్సులో ఐదు గేయములు ఉన్నాయి, అవి – అద్వైతం (అ), ఋక్కులు (ఋ), దేశచరిత్ర (దే), నవకవిత (న), పేదలు (పే).

ఈ ఛందస్సు ప్రత్యేకత ఏమనగా – ఇందులో ప్రతి పాదములో 14 మాత్రలు ఉంటాయి. అవి 6, 8 మాత్రలుగా విఱుగుతాయి. రెండవ భాగములోని ఎనిమిది మాత్రలు సామాన్యముగా రెండు చతుర్మాత్రలుగా ఉంటాయి. కొన్ని సమయములలో రెండు చతుర్మాత్రలకు బదులు ఒక అష్టమాత్ర కూడ వాడబడినది. కన్నడ, తెలుగు భాషలలోని దేశి ఛందస్సులో వర్జించబడిన లగారంభమగు ఎదురు నడకను కవి స్వీకరించాడు. అందువలన ఈ కవితలలో మనకు ఎదురు నడక కూడ అక్కడక్కడ గోచరిస్తుంది. ఈ యెదురు నడక ఆఱు మాత్రల పూర్వ భాగములో, ఎనిమిది మాత్రల ఉత్తర భాగములో, రెంటిలో కూడ ఉన్నాయి. కాని ఉత్తరార్ధములో రెండవ చతుర్మాత్రకు ఈ యెదురు నడక లేదు. ఈ 14 మాత్రల ఛందస్సును సరిగా ఉపయోగిస్తే ఇది నిజముగా అందమైన దన్న విషయములో సందేహము లేదు. హిందీ భాష యందలి మాత్రాఛందస్సులో 6, 8 మాత్రల విఱుపుతో ఛందస్సు ఏదియు లేదు. మిశ్రగతి లయతో భామినీషట్పదివలె అమర్చబడిన ఛందస్సును అప్పారావు ముత్యాలసరము అని పిలిచినట్లు, శ్రీశ్రీ ఈ 14 మాత్రల ఛందస్సుకు ఏ పేరు పెట్టినట్లు లేదు. దీనికి నేను ఆనందార్ణవము అని పేరును పెట్టాను. మిరియాల రామకృష్ణ ఇట్టి ఛందస్సు చతురస్రగతి యని తెలిపారు[2]. నా ఉద్దేశములో అది సరికాదు. వీటిలోని మాత్రల విఱుపు నిస్సందేహముగా ఆఱు, ఎనిమిది మాత్రమే.

ఆనందార్ణవము
ఈ ఆనందార్ణవఛందస్సును ఎన్ని విధములుగ కల్పించ వీలగును అనే ప్రశ్నకు జవాబును పరిశీలిద్దాము. ఆఱు మాత్రలు 13 విధములుగా సాధ్యము. అందులో పది షణ్మాత్రలకు (UIUI, UIIU, UIIII, IIIUI, IIIIU, IIIIII, UUII, IIUU, UUU, IIUII) ఎదురు నడక లేదు, మూడింటికి (IUIU, IUUI, IUIII) ఉన్నాయి. రెండవ భాగములోని మాత్రాగణములు చతుర్మాత్రలు అయిన పక్షములో, ఈ చతుర్మాత్రలు 5 విధములుగా సాధ్యము. అందులో నాలుగింటికి (UU, IIU, UII, IIII) ఎదురు నడక లేదు, ఒక దానికి (IUI) గలదు. పూర్తిగా షణ్మాత్రలను, చతుర్మాత్రలను ఉపయోగిస్తే ప్రతి పాదమును 13*5*5 = 325 విధములుగా వ్రాయ వీలగును. అందులో 78 విధములను శ్రీశ్రీ పై ఐదు కవితలలో నుపయోగించాడు. ఇందులో కొన్ని తప్ప మిగిలిన అధిక భాగము ఏ లాక్షణిక గ్రంథములో లేదు. వాటినన్నిటిని కూలంకషముగా పరిశోధించి లక్షణ లక్ష్యములను నేను ఈవ్యాసంలో తెలియబఱచినాను. ఇవిగాక రెండవ భాగములో అష్టమాత్ర ఉపయోగించబడిన 10 వృత్తములకు కూడ లక్షణములను ఇచ్చాను.

గేయములలో పదచ్ఛేదయతి
ఒక విధంగా చూసినట్లయితే, గేయములు నిజముగా ఏకపాద వృత్తములు! ఈ విషయము ఆశ్చర్యకరముగా కనిపించవచ్చును కాని ఇది ముమ్మాటికి నిజము. మఱొక ముఖ్య విషయము. ‘ఛందస్సు సర్పపరిష్వంగము’ నుండి విముక్తుడనయ్యానని చెప్పుకొన్న శ్రీశ్రీ ఎన్నో ఛందస్సు విధివిధానాలను పాటించాడు. తెలుగులో (కన్నడములో కూడ) వృత్తములకు పాదాంత యతి లేదు, అనగా పాదము ఒక పదముతో అంతము కానక్కరలేదు. ఒక పదము ఒక పాదము చివర ఆరంభమై మఱొక పాదములో అంతము కావచ్చును. కాని సంస్కృతములో పాదాంతయతి పాటించబడుతుంది. గేయము అనగా పాడదగినది. పాటలలో ఏ పంక్తి ఆ పంక్తికి అంతమయితే మాత్రమే గానానుభూతిని పొంద వీలవుతుంది. లేకపోతే చెవులకు బాధాకరముగా ఉంటుంది. అదే విధముగా సంస్కృతములో శార్దూలవిక్రీడితము, స్రగ్ధరలవంటి వృత్తములకు పాద మధ్యములో కూడ పదముల విఱుపు ఉంటుంది. దీనినే ఆ భాషలో యతి అంటారు. తెలుగు భాషలోని పద్యములకు పదపు విఱుపుకన్న అక్షరసామ్యత లేక వడి ముఖ్యము. గేయ రచనలో శ్రీశ్రీ పాదమధ్యములో, పాదాంతములో పదచ్ఛేదయతిని తప్పక ఉపయోగించాడు. ఈ ఆనందార్ణవ ఛందస్సులో కూడ ఆఱు మాత్రలవద్ద పదముల విఱుపు, అదే విధముగా పాదాంతములో కూడ పదమును అంతము చేసి గేయమును వ్రాశాడు. ఉదాహరణమునకు ‘ఆనందం అర్ణవమైతే’ అనే పాదమును తీసికొన్నప్పుడు, ఇందులో ఆనందం – ఆఱు మాత్రల పదము, అర్ణవ – నాలుగు మాత్రల పదము, మైతే – నాలుగు మాత్రల పదము. ఆఱు మాత్రలవద్ద, ఆనందం పదము అంతమయినది, తరువాత ఏడవ మాత్రవద్ద ఒక క్రొత్త పదము ఉపయోగించబడినది. అదే విధముగా 14వ మాత్ర వద్ద పదము అంతమయినది. తరువాతి పాదము ‘అనురాగం అంబరమైతే’ క్రొత్త పదముతో ప్రారంభమవుతుంది. ఈ సంస్కృత ఛందస్సు నియమములు గేయములలో శ్రీశ్రీ రసానుభూతికోసం వాడాడు. అంతే కాక పదములను ఈ14 మాత్రల చట్రములో ఇమిడించుటకై హ్రస్వములను దీర్ఘముగా చేయుటకు వెనుకంజ వేయలేదు, ఉదా. ‘రగులుకొనే రాక్షసి బొగ్గూ.’ బొగ్గు అంటే మూడు మాత్రలే, కాబట్టి బొగ్గూ అని పదమును పొడిగించాడు.

ఖ్యాత వృత్తములలో ఆనందార్ణవపు నడక
శ్రీశ్రీకి ఇలాటి ఛందస్సు ఉపయోగించవలెననే ఆలోచన ఎలా వచ్చి ఉంటుంది? సంస్కృత ఛందస్సులో ఇంతకు ముందు చెప్పినట్లు ఇట్టి వృత్తములు కొన్ని ఉన్నా, అవి సామాన్యముగా ఉపయోగములో లేనివి. కాని వైతాళీయములలో ఇట్టివి ఉన్నాయి. ఆపాతలిక అనే అర్ధసమ వైతాళీయ వృత్తములో బేసి పాదములలో పూర్వ భాగములో ఆఱు మాత్రలు, ఉత్తర భాగములో చతుర్మాత్రలైన భ-గణము, గగము ఉండును. సరి పాదములలో ఎనిమిది మాత్రలు, భ-గణము, గగము ఉండును. అనగా ఆపాతలికపు బేసి పాదములలో శ్రీశ్రీ ఉపయోగించిన 6, 8 మాత్రల విఱుపుతో అమరిక ఉన్నది. అదే విధముగా వైతాళీయములో మాత్రల సంఖ్య (బేసి 6, సరి 8) ఇట్టిదే. కాని ఉత్తర భాగములోని గణములు ర-లగ, అనగా రెండు చతుర్మాత్రలు కాని ఒక అష్టమాత్ర. క్రింద వీటికి ఉదాహరణములను ఇచ్చాను.

ఆపాతలిక – బేసి పాదములు – 6 మాత్రలు – భ-గగ // సరి పాదములు – 8 మాత్రలు – భ-గగ

మానిని నీ – మాధవుఁ డేడే
మానసమందున – మాయల ఱేఁడే
తేనియవలెఁ – దీయఁగఁ బల్కున్
కానఁగ మెల్లఁగఁ – గల్లలఁ జిల్కున్

వైతాళీయము – బేసి పాదములు – 6 మాత్రలు – ర-లగ // సరి పాదములు – 8 మాత్రలు – ర-లగ

గోదావరి – గుండెలో సదా
ఖేదము మోదము – కేళి యాడుఁగా
గోదావరి – గొంతులో సదా
నాదము బ్రహ్మా-నంద మీయుఁగా

ఛందోగ్రంథములలో వివరించబడినా కూడ, వైతాళీయము, ఆపాతలిక తెలుగులో ఉపయోగించబడలేదు. కావున 14 మాత్రల గేయమునకు స్ఫూర్తిని మఱెక్కడైనా వెదకాలి. చంపకోత్పలమాలలలో, శార్దూల మత్తేభవిక్రీడితములలో ఇట్టి అమరికలు గలవు. అట్టి పద్యములను చదివినప్పుడు అక్కడక్కడ ఈ అమరికలు ధ్వనించి ఉండవచ్చును. శ్రీశ్రీ మేధస్సులో అతనికి తెలియకుండ ముద్రితమైన ఈ మూసలు ఈ ఛందోనిర్మాణమునకు దారి తీసినదేమో?

ఉత్పలమాల – U I I U I U I I I U I I U I I U I U I U
ఉత్పలమాల – U I I U I U I I I U I I U I I U I U I U
ఉత్పలమాల – U I I U I U I I I U I I U I I U I U I U
ఉత్పలమాల – U I I U I U I I I U I I U I I U I U I U
ఉత్పలమాల – U I I U I U I I I U I I U I I U I U I U
ఉత్పలమాల – U I I U I U I I I U I I U I I U I U I U
ఉత్పలమాల – U I I U I U I I I U I I U I I U I U I U

ఉత్పలమాలలో ఆఱు అమరికలలో 14 మాత్రల అమరికలు గలవు. అందులో చివరి దానిలో ఉత్తర భాగములో రెండు చతుర్మాత్రలకు బదులు ఒక అష్టమాత్ర ఉన్నది. ఇది చంపకమాలకు కూడ అన్వయిస్తుంది, ఎందుకంటే ఈ రెండు వృత్తముల భేదము – చంపకమాలలోని మొదటి రెండు లఘువులు ఉత్పలమాలలో ఒక గురువు అవుతుంది.

శార్దూలవిక్రీడితము – U U U I I U I U I I I U U U I U U I U
శార్దూలవిక్రీడితము – U U U I I U I U I I I U U U I U U I U
శార్దూలవిక్రీడితము – U U U I I U I U I I I U U U I U U I U
శార్దూలవిక్రీడితము – U U U I I U I U I I I U U U I U U I U
శార్దూలవిక్రీడితము – U U U I I U I U I I I U U U I U U I U
శార్దూలవిక్రీడితము – U U U I I U I U I I I U U U I U U I U
శార్దూలవిక్రీడితము – U U U I I U I U I I I U U U I U U I U

శార్దూలవిక్రీడితములో కూడ ఆఱు అమరికలకు 14 మాత్రలు ఉన్నాయి. అందులో రెండవ, ఐదవ, ఆఱవ అమరికలకు ఉత్తరార్ధములో రెండు చతుర్మాత్రలకు బదులు ఒక అష్టమాత్ర ఉన్నది. ఇది మత్తేభవిక్రీడితమునకు కూడ అన్వయిస్తుంది, ఎందుకంటే ఈ రెండు వృత్తముల భేదము – శార్దూలవిక్రీడితములోనిలోని మొదటి గురువు మత్తేభవిక్రీడితములో రెండు లఘువులు అవుతుంది.

[పై అమరికలలో న/జ/భ/లగ (చంపకమాల మొదటి 11 అక్షరములు) గణములతో సుమ అను వృత్తపు లక్షణములను కలిగిన పాదములు (అ-27: వలయములై చలించినపుడే, అ-28: విలయములై జ్వలించినపుడే), స/స/జ/గ (చంపకోత్పలమాలలలోని చివరి 10 అక్షరములు) గణములతో సహజా అను వృత్తపు లక్షణములను కలిగిన పాదములు (దే-46: పడిపోయెను పేక మేడలై, దే-60: అణగారిన ఆర్తులందరూ, న-03: పులి చంపిన లేడినెత్తురూ) ఈ గేయములలో ఉన్నాయి. వలయములై చలించినపుడే – పడిపోయెను పేక మేడలై, అనే కాల్పనిక పాదము యతిలేని ఒక చంపకమాల పాదము.]

మాలావృత్తములకు, విక్రీడిత వృత్తములకు కొన్ని 14 మాత్రల అమరికల ఉదాహరణములను క్రింద ఇస్తున్నాను –

అర్ధసమవృత్తము అతిగంధము –
బేసి పాదములు – చంపకమాల పూర్వార్ధము (1-11) – న/జ/భ/లగ IIIIU – IUI IIU
సరి పాదములు – చంపకమాల ఉత్తరార్ధము (12-21) – స/స/జ/గ IIUII – UIUIU

ప్రతిమగ రా – వరించఁ ద్వరగా
నతిగంధపు – హ్లాదనమ్ముతో
ప్రతి క్షణమున్ – బ్రతీక్షణములే
బ్రతుకెప్పుడు – బంధనమ్ములే

పై అర్ధసమవృత్తము అతిగంధపు రెండు పాదములను కలిపి వ్రాస్తే ఇలాగుంటుంది –

ప్రతిమగ రా – వరించఁ ద్వరగా – నతిగంధపు – హ్లాదనమ్ముతో
ప్రతి క్షణమున్ – బ్రతీక్షణములే – బ్రతుకెప్పుడు – బంధనమ్ములే

ఇప్పుడు ఇవి చంపకమాలలోని రెండు పాదములుఅవుతుంది. కాని ఈ పాదములను చదివినప్పుడు మనకు చంపకమాలను చదివినట్లు అనిపించదు!

అర్ధసమవృత్తము పుష్పరాశి –
బేసి పాదములు – మత్తేభవిక్రీడితము (1-10) – స/భ/ర/ల IIUU – IIU IUI
సరి పాదములు – మత్తేభవిక్రీడితము (11-19) – స/త/త IIUU – UIUUI

వనమందున్ – వర పుష్పరాశి
మనమందున్ – మందహాసమ్ము
వనమందున్ – స్వర పుష్పరాశి
మనమందున్ – మౌన గీతమ్ము

పై అర్ధసమవృత్తము పుష్పరాశిని కలిపి వ్రాస్తే ఇలాగుంటుంది –
వనమందున్ – వర పుష్పరాశి మనమందున్ – మందహాసమ్ము
వనమందున్ – స్వర పుష్పరాశి మనమందున్ – మౌన గీతమ్ము

ఇప్పుడు ఇవి మత్తేభవిక్రీడితములోని మొదటి 19 అక్షరముల రెండు పాదములుఅవుతుంది. కాని ఈ పాదములను చదివినప్పుడు మనకు మత్తేభవిక్రీడిత వృత్తపు ధార కనిపించదు!

అర్ధసమవృత్తము కోరకము –
బేసి పాదములు – శార్దూలవిక్రీడితము (2-11) – త/జ/భ/ల UUII – UIUIII
సరి పాదములు – శార్దూలవిక్రీడితము (12-19) – మ/య/లగ UUU – IUUIU

చిత్తమ్మున – శ్రీధరుం డెపుడు
మత్తిల్లన్ – మనోజ్ఞమ్ముగా
నృత్తమ్మును – నిత్య మాడుఁ గద
చిత్త మ్మా – శివమ్మౌనుగా

రెండేసి పాదములను కలిపి వ్రాసి చదివితే మనకు ఇది శార్దూలవిక్రీడితపు నడకగా ధ్వనించదు.

ఉత్పలమాల (4-13) ర/న/భ/గ UIUI – IIU IIU

రాగవీణ – రవముల్ వినఁగా
సాఁగి రమ్ము – స్వర యోగములో
నూఁగి పొమ్ము – యొగి మోదముతో
భోగమన్న – భువిలో నిదియే

శార్దూలవిక్రీడితము (6-14) ర/న/మ UIUI – IIU UU

లోక మెల్ల – రుచులన్ దోఁచెన్
నాక మెల్ల – నవమై పూఁచెన్
నాకు నీవు – నవమే కాదా
నీకు నేను – నెనరే కాదా
శ్రీశ్రీ ఆనందార్ణవ గేయములు
మహాప్రస్థానములో 14 మాత్రలపైన ఆధారపడిన ఛందస్సును ఉపయోగించిన ఐదు గేయములు – అద్వైతం (38 పంక్తులు), ఋక్కులు (13), దేశచరిత్ర (96 పంక్తులు), నవకవిత (28 పంక్తులు), పేదలు (20 పంక్తులు), అనగా మొత్తము 195 పంక్తులు. ఇందులో ఋక్కులులోని తొమ్మిదవ పంక్తిలో (ఔనౌను శిల్ప మనర్ఘం) 13 మాత్రలు, ఋక్కులులోని 14వ పంక్తిలో (వాక్కుంటే వ్రాసీ) 10 మాత్రలు, దేశచరిత్రలోని తొమ్మిదవ పంక్తిలో (భీబత్స రస ప్రధానం) 12 మాత్రలు మాత్రమే ఉన్నాయి. ఇది ముద్రణలోని దోషమో లేక శ్రీశ్రీ కావాలనే అలా వ్రాశాడో మనకు తెలియదు. వాటిని తొలగిస్తే లభించిన పంక్తులు 192. ఈ 192 పంక్తులలో 78 విధములైన 14 మాత్రల ఛందస్సులు మనకు కనబడుతాయి. పంక్తుల సంఖ్యలతో ఈ ఐదు గేయములు, ప్రతి యొక్క పంక్తి ఛందస్సు మొదటి అనుబంధములో ఇవ్వబడినవి. 78 స్వతంత్ర ఛందస్సులు రెండవ అనుబంధములో ఇవ్వబడినవి. ఇందులో ప్రతి ఛందస్సు ఏ గేయములో, ఏ పంక్తిలో వస్తుందో అనే విషయమును కూడ తెలియబఱచినాను. ఆ వృత్తములు ఎన్నిమారులు వాడబడినవో అన్న సంఖ్య చతురస్ర కుండలీకరణములలో చూపబడినవి. ఈ 78 వృత్తములలో ఏయే వృత్తములు వేళంకర్ సంకలనము జయదామన్[3], దుఃఖభంజనకవి వ్రాసిన వాగ్వల్లభ[4] గ్రంథములలో ఉన్నవో వాటిని ఎఱ్ఱని రంగుతో చూపినాను, అవి 22. వృత్తములోని మొదటి ఆఱు మాత్రలు, తఱువాతి ఎనిమిది మాత్రలు కూడ చూపబడినవి. ఈ ఎనిమిది మాత్రలు రెండు చతుర్మాత్రలు కాని పక్షములో అట్టి అష్టమాత్రను క్రింద ఒక అడ్డగీతతో చూపియున్నాను. రెండు అర్ధ భాగములలో పాదము లగారంభమయితే (అనగా ఎదురు నడకను కలిగి ఉన్నట్లయితే) దానిని కూడ ఎఱ్ఱ రంగుతో చూపియున్నాను. ఈ 78 వృత్తములకు ఉదాహరణములను మూడవ అనుబంధములో ఇవ్వబడినవి.

ఈ 78 వృత్తముల కొన్ని వివరములను క్రింద ఇస్తున్నాను –

పాదమునకు 7 అక్షరములు – ఉష్ణిక్కు ఛందము – సర్వగురువృత్తము – 1
పాదమునకు 8 అక్షరములు – అనుష్టుప్పు ఛందము – 6 గు, 2 ల – 7
పాదమునకు 9 అక్షరములు – బృహతి ఛందము – 5 గు, 4 ల – 24
పాదమునకు 10 అక్షరములు – పంక్తి ఛందము – 4 గు, 6 ల – 23
పాదమునకు 11 అక్షరములు – త్రిష్టుప్పు ఛందము – 3 గు, 8 ల – 17
పాదమునకు 12 అక్షరములు – జగతి ఛందము – 2 గు, 10 ల – 5
పాదమునకు 14 అక్షరములు – శక్వరి ఛందము – సర్వలఘు వృత్తము – 1

ఛందోగ్రంథములలో వివరించబడినవి – 22
నేను కల్పించినవి – 56

పూర్వార్ధములో ఎదురు నడకతో ఉండే వృత్తములు – 12
ఉత్తరార్ధములో ఎదురు నడకతో ఉండే వృత్తములు – 12
రెండు అర్ధములలో ఎదురు నడకతో ఉండే వృత్తములు – 4
లఘ్వంతమైన వృత్తములు – 33
ఉత్తరార్ధములో రెండు చతుర్మాత్రలు లేక ఒక అష్టమాత్ర కలిగిన వృత్తములు – 10 (ఎదురు నడక 2)

ఒక్క పంక్తిలో మాత్రమే వాడిన వృత్తముల సంఖ్య – 43
పది, పదికన్న ఎక్కువ పంక్తులలో వాడిన వృత్తములు – 4 (శిప్రా, శృంగి, నాయికా, ఉదితము)

6, 4, 4 మాత్రలతో 325 వృత్తములు సాధ్యము. అందులో 68 వృత్తముల మూసలను శ్రీశ్రీ ఈ ఐదు గేయములలో వాడెను. 6, 8 మాత్రలతో 432 వృత్తములు సాధ్యము, అందులో 10 వృత్తముల మూసలు ఈ గేయములలో ఉన్నవి.

ఇంతకు ముందే చెప్పినట్లు, తెలుగు ఛందస్సులో యతి లేక వడి అంటే అక్షరసామ్యము, అనగా యతి స్థానము వద్ద గల అక్షరమునకు పాదాదిలో ఉన్న అక్షరమునకు లాక్షణికులు నిర్ణయించిన రీతిలో పొత్తు కుదరవలెను. కాని సంస్కృతములో యతి అన్నది పదముల విఱుపు, అనగా యతి స్థానము వద్ద ముందు పదము విఱుగవలెను, లేక యతి స్థానము వద్ద సంధి జరుగవలెను. పాదాంతములో కూడ సామాన్యముగా పదము అంతము కావలెను. ఇట్టి యతిని పదచ్ఛేదయతి అంటారు. శ్రీశ్రీ తప్పని సరిగా ఇట్టి యతిని పాటించెను, ఉదా. కావాలోయ్ | నవకవనానికి | కాని పాదమునందలి ఉత్తరార్ధములోని రెండు చతుర్మాత్రల మధ్య ఈ విఱుపు ఎల్లప్పుడు లేదు, ఉదా.

పదముల విఱుపు ఉన్న పాదము: అ-03 అనురాగపు | టంచులు | చూస్తాం
పదముల విఱుపు లేని పాదము: అ-05 నీ కంకణ | నిక్వాణంలో

అన్ని ఛందస్సులతో ఒక గేయము
పై ఐదు గేయములలో శ్రీశ్రీ ఉపయోగించిన 78 ఛందస్సులతో ఒక గేయమును క్రింద వ్రాసియున్నాను. ఇందులో వరుసగా రెండవ అనుబంధములోని ఆయా సంఖ్యలు గల ఛందస్సులు వాడబడినవి. ఇందులో పదచ్ఛేదయతి, పాదాంతయతి, వీటితో అక్షరసామ్యయతిని లేక వడిని కూడ ఉపయోగించినాను. ఇది వ్యావహారిక భాషలో వ్రాయబడినది. ఇది ఒక ఉదాహరణము మాత్రమే –

ఆనందార్ణవము

01. ఏముందో – ఈ లోకంలో
02. కానుకగా – కష్టాలన్నీ
03. ఏదేవుడు – ఇచ్చాడిట్లా
04. కష్టాలే – కథలయ్యాయా
05. శూలాలే – సుఖమ్ము లౌనా
06. ముళ్లే స-మ్మోదము లౌనా
07. కన్నీళ్లే – కామితార్థమా
08. కన్నీళ్లే – కావ్య మ్మగునా
09. తిమిరములో – దివ్వెల్ లేవా
10. సమరమ్మున – శాంతుల్ రావా
11. పరాజయము – పాపమ్మౌనా
12. ఏ సుధలకు – ఈ ఆరాటం
13. ఎవరిస్తా – రిట పీయూషం
14. గళమ్ములో – కమనీయమ్మై
15. వెతలన్నీ – విలాసమౌనా
16. విరించితో – వివాదమేనా
17. వేదనతో – విచారమేనా
18. నేత్రమ్ముల – నిరాశలేనా
19. శ్రమజీవీ – చాకిరి చాలోయ్
20. ఎవ్వరికో – యీ జతనమ్ముల్
21. వారందఱి – బానిస నీవా
22. వారించే – ప్రజ లిల లేరా
23. ఇక వద్దీ – యెద్దు జీవితం
24. సఖ్యముతో – సంతసమ్ముతో
25. సౌఖ్యమ్ముగ – సాహసమ్ముతో
26. ఉండాలోయ్ – యొకటై యవనిన్
27. నవ జీవం- నాలో పారగ
28. నవప్రభల్ – నాలో నాడగ
29. దేవునికే – దీటై క్రొత్తగ
30. చిత్రమ్మును – సృష్టించా లిక
31. ఆనాడే – యగుగా భూమికి
32. సత్యమ్మై – జన్మ దినమ్ముగ
33. నవ లోకపు – నవ నాదమ్ముల్
34. వికాసముల – విలసద్రాగం
35. కలహంసల – కళావిలాసం
36. అమరముగా – నామని గీతం
37. కుసుమమ్ముల – కోమల నృత్యం
38. ప్రభాతముల – రాగపు కాంతుల్
39. వెన్నెల తెర – వేసిన మాయల్
40. వరవీణ – స్వరముల సొంపుల్
41. హరుసముతో – హాయి నీయగా
42. మనమందున – మౌనరాగమౌ
43. నవమగు నీ – నాదమ్ములకై
44. కూరిమితో – కోరిక లలలై
45. నవసృష్టికి – నాందీవాక్యము
46. పల్కించుము – వరమై భూమికి
47. రాగములో – రసప్రవాహము
48. వేగమ్మున – విలాస మిచ్చును
49. నవగీతం – నాకపు నాదము
50. ప్రభాతమో – రాత్రియొ యెప్పుడు
51. కాంతులతో – క్షాంతియు నిండును
52. లోకమ్మున – లోటులు లేవిక
53. యుద్ధ మ్మీ – యుగమున రాదిక
54. శస్త్రమ్ములు – క్షయించంగ నిల
55. సామమ్మే – సంతస మగు నిక
56. కష్టము లిక – కరువగు గాదా
57. కల నిజమగు – కంటి ముందుగా
58. గతమ్ము లొక – కథగా నగుగా
59. భువనములో – ముదమ్ము లెదురౌ
60. ప్రజలందఱు – రమించి మనగా
61. మతాల పగ – మాయము లగుగా
62. ఆనందము – లలరుగ విరులై
63. కలలన్నిటి – కనులం జూడగ
64. మానసమున – మధువే పారును
65. నవజీవన – నవోదయమ్మగు
66. ధ్వనించు గద – ధరాతలమ్మున
67. పాటలు పలు – వరమ్ములై యిక
68. నవనాదము – నాట్యము సేయును
69. నవ మార్గం – నగుచును బిల్చును
70. వసంతములు – ప్రమోదమ్ములగు
71. మురియున్గా – పుడమి పచ్చగను
72. ఆకాశపు – టవధుల్ సులభము
73. ప్రపంచమున – పలుపలు హక్కులు
74. సమాన మిక – జను లెల్లరికిని
75. మరో జగతి – మహా రుచిరములు
76. కనువిందై – కనబడుగద నిక
77. అనంతమౌ – హరుసపు తరగలు
78. గలగలమని – కడు వడి పరుగిడు
ముత్యాల సరములు
గురజాడ అప్పారావు వ్యాప్తి చేసిన ముత్యాల సరముల అమరికను క్రింది విధముగా కూడ అవగాహన చేసికొన వచ్చును –

పాదము 1 – మత్తకోకిల – మత్తకోకిల
పాదము 2- మత్తకోకిల – మత్తకోకిల
పాదము 3- మత్తకోకిల – మత్తకోకిల
పాదము 4 – మత్తకోకిల – మత్తకో

మొదటి మూడు పాదములను (1) హరిణగతి రగడ లేక (2) వృషభగతి రగడ అర్ధ పాదము లేక (3) మత్తకోకిల లయతో ఉండే అర్ధపాదము లేక (4) భామినీ షట్పది మొదటి రెండు పాదములు, మూడవ పాదములోని ప్రథమార్ధముగా భావించవచ్చును. క్రింద ఇట్టి ముత్యాల సరమునకు ఒక ఉదాహరణము –

ఈ వసంత – మ్మెంత సుందర
మీ వసంత – మ్మెంత సుఖకర
మీ వసంత – మ్మెంత మధురము
జీవరాశికిఁ – జెలువమై

రత్నాలసరములు – శతదళ షట్పద
పురాతన వృత్తములలో నర్కుటకము ఒకటి. ప్రతి పాదములో 17 అక్షరములు దీనికి. దీని చివర రెండు లగములు చేర్చినప్పుడు మనకు చంపకమాల లభిస్తుంది. శ్లోకములలోని సరి పాదములలో చివరి నాలుగు అక్షరములు రెండు లగములే. మాఘుడు చంపకమాలను (ధృతశ్రీ) ఈ విధముగా కనుగొని ఉండవచ్చునని నా ఊహ. నర్కుటక వృత్తమునకు కుటక, అవితథ, నర్దటక అని కూడ పేరులు ఉన్నాయి. నర్కుటకపు లయతో ఉండే మరికొన్ని వృత్తములు – వంశదళ, శైలశిఖా, మణికల్పలతా, ఉన్మాల్యా, వరయువతీ, ఉడుపథ, వాణిని. సంస్కృతములో యతి ప్రస్తావన లేదు. చంపకమాల, నర్కుటకములతో అర్ధసమ వృత్తమును కల్పించవచ్చును. రెండు వృత్తములకు చంపకమాలవలె యతి నుంచిన ఉదాహరణములను ఈమాటలో నేను వ్రాసిన చంపకోత్పలమాలల కథలో చదువవచ్చును. మఱొక ముఖ్యమైన విషయము. కన్నడ శాసనములలో అతి ప్రాచీనమయిన వృత్తము నర్కుటకము[5] అని పండితుల ఊహ (సుమారు క్రీస్తు శకము 500, బినమణి యంతు …). ఈ వృత్తములను 6-8 మాత్రలుగా విడదీసి ఒక అర్ధసమ వృత్తమును, ఒక షట్పదిని, ఒక నూతనమైన ‘సరము’ను వ్రాయు విధానమును ఇక్కడ తెలియజేస్తున్నాను. ఈ సరమునకు నేను రత్నాలసరము అని పేరు నుంచినాను.

చంపాకటకము –
బేసి పాదములు – చంపకమాల – 6-8-6-8
సరి పాదములు – నర్కుటకము – 6-8-6-2

సరసముఖా – సరోజనయనా – స్వరచిత్రముఁ – జక్క వ్రాసెదన్
హరుసముతో – నపూర్వముగ నీ – వరుదెంచుమురా
విరులవలెన్ – బ్రియమ్ముగ మదిన్ – విరబూయును – బ్రేమచింతనల్
సిరులివె సు-స్థిరమ్ము మనికిన్ – జిరమై నిలుచున్

శతదళ షట్పదిగా (నూరు మాత్రలు) –

సరసముఖా సరోజనయనా
స్వరచిత్రముఁ జక్క వ్రాసెదన్
హరుసముతో నపూర్వముగ నీ – వరుదెంచుమురా
విరులవలెన్ బ్రియమ్ముగ మదిన్
విరబూయును బ్రేమచింతనల్
సిరులివె సుస్థిరమ్ము మనికిన్ – జిరమై నిలుచున్

రెండు రత్నాల సరములుగా –

సరసముఖా – సరోజనయనా
స్వరచిత్రముఁ – జక్క వ్రాసెదన్
హరుసముతో – నపూర్వముగ నీ
వరుదెంచుమురా

విరులవలెన్ – బ్రియమ్ముగ మదిన్
విరబూయును – బ్రేమచింతనల్
సిరులివె సు-స్థిరమ్ము మనికిన్
జిరమై నిలుచున్

రత్నాల సరమును కూడ ముత్యాల సరమువలె క్రింది విధముగా వివరించవచ్చును –

పాదము 1 – చంపక (ఉత్పల) మాల ప్రథమార్ధపు లయ లేక 6 – 8 మాత్రలు
పాదము 2- చంపక (ఉత్పల) మాల ద్వితీయార్ధపు లయ లేక6 – 8 మాత్రలు
పాదము 3- నర్కుటకము లేక చంపక (ఉత్పల) మాల ప్రథమార్ధపు లయ లేక 6 – 8 మాత్రలు
పాదము 4 – నర్కుటకపు ద్వితీయార్ధము లేక చివరి నాలుగు అక్షరములు లుప్తమైన చంపక (ఉత్పల) మాల ద్వితీయార్ధపు లయ లేక 6-2 మాత్రలు.

ముత్యాల సరములు, రత్నాల సరములు
ముత్యాలసరాలలో మొదటి మూడు పాదములలో 14 మాత్రలు (3-4, 3-4 మిశ్రగతి), నాలుగవ పాదములో 9 నుండి 14 మాత్రలు ఉంటాయి. పైన వివరించబడిన రత్నాలసరాలలో మొదటి మూడు పాదములలో 14 మాత్రలు, నాలుగవ పాదములో కనీసము ఎనిమిది మాత్రలు. పాదములలోని మాత్రల సంఖ్య ఒకటే అయినా, ఈ రెండు సరముల నడక వేఱు. ముత్యాలసరాలు మిశ్రగతిలో త్రిపుట తాళానికి సరిపోతుంది. రత్నాలసరాలు చతురస్రజాతి ధ్రువతాళానికి సరిపోతుంది (లఘువు, ద్రుతము, రెండు లఘువులు, అనగా 4+2+4+4 = 14 మాత్రలు). రత్నాల సరముల మొదటి మూడు పాదములు శ్రీశ్రీ గేయములలోని ఆనందర్ణావ ఛందస్సు నియమములను అనుసరించును, నాలుగవ పాదములో కనీసము ఎనిమిది మాత్రలు ఉండాలి. క్రింద రత్నాల సరమునకు ఉదాహరణములు –

దండలవలె – తారాగణములు
నిండు శశియు – నింగి తెరువులో
మండెను హృది – మారా జెక్కడ
దండుగ బ్రదుకే

నిండిన యీ – నీరవ నిశిలో
పిండివోలె – వెన్నెలె లెల్లెడ
గుండెలోన – గ్రుచ్చిన గునపము
దండుగ బ్రదుకే

పై రత్నాల సరములను చేర్చి వ్రాస్తే, అది శతదళ షట్పదగా మారుతుంది (మూడవ, ఆఱవ పాదములలో ప్రాసయతితో.)

శతదళషట్పది –

వందలుగా – వారిదమాలలు
సుందరముగ – శుభ్ర గగనమున
తొందరగా – దొరలుచు నుండెను – దూదిపింజలై
వందలుగా – వారిజమాలలు
సుందరముగ – శుభ్ర సరసిలో
తొందరగాఁ – దూఁగుచు నాడెను – తొగరుపుంజలై

పై శతదళషట్పదిని రెండు రత్నాల సరములుగా క్రింద చూపినట్లు వ్రాయ వచ్చును. నాలుగవ పాదములో ప్రాస లేదు.

రత్నాలసరములు –

వందలుగా – వారిదమాలలు
సుందరముగ – శుభ్ర గగనమున
తొందరగా – దొరలుచు నుండెను
దూదిపింజలై

వందలుగా – వారిజమాలలు
సుందరముగ – శుభ్ర సరసిలో
తొందరగాఁ – దూఁగుచు నాడెను
తొగరుపుంజలై

ముగింపు
శ్రీశ్రీ నేను ఆనందార్ణవము అని పేరుపెట్టిన 6-8 మాత్రల ఛందస్సును ఏ విధముగా సృష్టించాడో మనకు తెలియదు. కాని అది చంపకోత్పలమాలలలో, శార్దూల మత్తేభవిక్రీడితములలో అంతర్లీనమై ఉన్నదని ఇక్కడ నిరూపించినాను. పంక్తికి 14 మాత్రలు కలిగిన ముత్యాల సరము ఛందస్సు మిశ్రగతితో నుండును (3,4-3,4 మాత్రలు). అది త్రిపుట తాళమునకు సరిపోవును. ఈ నడకను యక్షగానములలో త్రిపుటరేకులు అని అంటారు. భామినీషట్పది, మత్తకోకిల మున్నగునవి ఈ నడకకు ఉదాహరణములు. పంక్తికి 14 మాత్రలు కలిగిన ఆనందార్ణవ ఛందస్సుతో రత్నాల సరమును కల్పించవచ్చును. దీని తాళము ధ్రువతాళము. ముత్యాలసరములకు, రత్నాల సరములకు మాత్రల సంఖ్య ఒక్కటే. కాని గతి వేఱు, తాళము వేఱు. ఛందశ్శాస్త్రములో ఇలాటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఓపికతో వెదకినప్పుడు గవ్వలు, నత్తగుల్లలు మాత్రమే కాదు, ముత్యాలు, రత్నాలు కూడ మనకు లభిస్తాయి.
---------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, January 30, 2019

నేనొక చిత్రమైన చిక్కుముడి: 2. ఆలోచనను ఆలోచిస్తున్న ఆలోచన


నేనొక చిత్రమైన చిక్కుముడి: 

2. ఆలోచనను ఆలోచిస్తున్న ఆలోచన




సాహితీమిత్రులారా!
అవునంటావా? కాదంటావా?
ప్రయాణం మొదలైతే పెట్టేను కానీ ఒక పక్క బెరుగ్గానే ఉంది. బిక్కు బిక్కుమంటూ అడుగులు వేస్తున్నాను. అంతలో హఠాత్తుగా నా ఎడమ చెవి వైపు, ‘హలో’ అని వినిపించింది. బయటనుండి ఎవరైనా నా ఎడమ చెవిలో ఊదారో, లేకపోతే నా లోపలినుంచి ఎడమ చెవి ద్వారా ఆ మాట బయటకి వచ్చిందో నాకు తెలియలేదు. ఏదైతేనేం హఠాత్తుగా మాటలు వినపడేసరికి ఉలిక్కిపడ్డాను. ఇటూ అటూ ఎవరూ లేరు. అసలే భయంతో ఉన్నానేమో, యీ వింతకి మరింత భయం వేసింది.

“ఎందుకలా ఉలికిపడతావ్!” మళ్లీ అదే గొంతు.

“ఎవరు నువ్వు?” కొద్దిగా ధైర్యం చేసి నా గొంతు పెగిల్చాను.

“నువ్వే నేను.” జవాబు వచ్చింది. ఆ గొంతు నెమ్మదిగానే ఉన్నా, అంటున్న ఆ మాటలకి భయం రెట్టింపయింది. ఇదేదో దెయ్యమో పిశాచమో లాగుంది. ప్రయాణం మొదలుపెడుతూ ఏ వినాయకుడినో తలుచుకోకుండా బేతాళుడిని తలచుకున్నాను. కొంపదీసి ఆ బేతాళుడు కాదు కదా!

“కొంపతియ్యకుండానే నేను బేతాళుడిని కాను లేవోయ్. నువ్వేమైనా విక్రమాదిత్యుడివా ఏంటి, బేతాళుడు నీతో మాట్లాడ్డానికి.”

నేను మనసులో అనుకున్నవి కూడా యితడికి తెలిసిపోతున్నాయి! నా భయం చూసి యితగాడికి నవ్వులాటగా ఉన్నట్టుంది.

“నువ్వెవరో నిజం చెప్పు. నువ్వు నేనేమిటి!” యీసారి కొంచెం గట్టిగానే అడిగాను.

“నీతో నువ్వు, నీలోకి నువ్వు ప్రయాణం మొదలుపెడితే మరి నీకు తోడెవరు వస్తారు, నువ్వు కాక!”

కొద్ది కొద్దిగా ఆ మాటలు అర్థమవుతున్నాయి. గొంతు కూడా పోల్చుకోగలిగాను. అవును, అది నా గొంతుకే. కాకపోతే ఒకవైపుగానే వినిపిస్తూ కాస్త వింతగా ఉంది. భయం తగ్గింది. అడుగులు నింపాదిగా ముందుకు పడ్డాయి.

“బేతాళుడిని కాకపోయినా నేనుకూడా నీకు అలసట తెలియకుండా కథలూ కబుర్లూ చెపుతానులే!” ఈసారి ఆ మాటలకు భయం పూర్తిగాపోయి హుషారొచ్చింది.

“ఇక ఆలస్యం దేనికి మొదలుపెట్టు మరి!”

ఎడమ నేను కథ చెప్పడం మొదలుపెట్టింది: అనగనగా ఒక రాజ్యంలో ఒక తత్త్వవేత్త ఉండేవాడు. ఊరికే తన మానాన తాను ఉండకుండా ప్రజలందరికీ తన తత్త్వాలను బోధించడం మొదలుపెట్టాడు. ఆ బోధలకు చిర్రెత్తుకొచ్చిన రాజు అతనికి మరణశిక్ష విధించాడు. అయితే ఆ తత్త్వవేత్త చాలా మేధావి అనీ, అతనికి మరణశిక్ష తగదనీ కొందరు సన్నిహితులు రాజుకు హితవు చెప్పారు. అప్పుడా రాజుకు ఒక చిలిపి ఆలోచన వచ్చింది. తత్త్వవేత్త మేధని పరీక్షించాలనుకుంటాడు. శిక్ష వేసే రోజున తత్త్వవేత్తని సభకి రప్పించి అతనితో, ‘నీకిప్పుడు ఉరిశిక్ష కానీ, శిరచ్ఛేదం కానీ విధించబడుతుంది. ఆ రెండిటిలో ఏమిటన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ నీకే యిస్తున్నాను. నువ్విప్పుడు ఒక వాక్యం చెప్పాలి. అది నిజం అయితే నీకు ఉరి, అబద్ధమైతే శిరచ్ఛేదం,’ అన్నాడు రాజు. తత్త్వవేత్త తడుముకోకుండా, ‘మీరు నాకిప్పుడు శిరచ్ఛేదం విధిస్తారు,’ అన్నాడు. అప్పుడు రాజు అతడికి ఏ శిక్ష విధించాడు?

బేతాళుడిలాగానే కథ చివర ప్రశ్న కూడా వేసిందే! ఇంకా నయం, తల వేయిచెక్కలవ్వడం వంటి ప్రమాదకరమైన నియమాలేం పెట్టలేదు! కొద్దిగా ఆలోచించగానే విషయం అర్థమయింది.

నేను: రాజు ఏ శిక్షా విధించలేడు.

ఎడమ నేను: ఎందుకు?

నేను: తత్త్వవేత్తకి ఉరిశిక్ష వెయ్యాలంటే, ఆ తత్త్వవేత్త చెప్పిన వాక్యం నిజం కావాలి. అంటే అతనికి శిరచ్చేదం విధించాలి. పోనీ శిరచ్ఛేదం విధించాలంటే, అతను చెప్పిన వాక్యం అబద్ధం కావాలి. అలాంటప్పుడు శిరచ్ఛేదం విధించే అవకాశం లేదు! అంచేత ఇప్పుడు అతనికి శిక్ష విధించాలంటే రాజు తన మాటను తప్పాలి! కాబట్టి ఏ శిక్షా విధించలేడు.

ఎడమ నేను: శభాష్! నా, అదే… మన పరువు నిలబెట్టావ్!

నేను: ఇది కచ్చితంగా తత్త్వవేత్తలు తమ గురించి తాము సృష్టించుకున్న వట్టి కట్టుకథే అయ్యుండాలి. ఏ దేశంలో ఏ రాజూ యిలా తాను విధించిన శిక్షని రద్దు చేసిన దాఖలాలు చరిత్రలో ఎక్కడా కనిపించవు మరి!

ఎడమ నేను: అవును. తత్త్వవేత్త చెప్పిన వాక్యంలో ఉన్న మెలిక ఈ కథలోని అసలు విషయం.[1] నువ్వు ఇంతకుముందు ప్రస్తావింవావే, ‘ఈ వాక్యం అబద్ధం’ అనే వాక్యం. దాని కోవకు చెందిన తిరకాసే (Paradox)యిది కూడాను.[2] అయితే, ఆ మెలికను తనకు వేయబోయే శిక్ష గురించి చెప్పే వాక్యంతోనే తయారుచేయడం ఇందులోని విశేషం. రాజు వేయాల్సిన శిక్ష వాక్యం తాలూకు తప్పొప్పులపై ఆధారపడుతుంది. ఆ వాక్యం తప్పా ఒప్పా అన్నది తిరిగి వేసే శిక్ష మీద ఆధారపడుతుంది! ఈ మెలికలో కూడా ఒక రకమైన ఆత్మసూచన (Self-Reference) దాగి ఉంది.

నేను: ఓహో, భలేగా ఉంది. ఈ ఆత్మసూచన నిజంగా పెద్ద తిరకాసు వ్యవహారంలాగే ఉన్నదే!

ఎడమ నేను: ఇలాంటి తిరకాసులన్నింటికీ కలిపి ఇంగ్లీషులో ఒక పేరుంది తెలుసా?

నేను: ఏవిఁటి

ఎడమ నేను: దానిని Liar’s Paradox అంటారు.

నేను: ఓహో. అయితే తెలుగులో దీనిని ‘తప్పొప్పుల తిరకాసు’ అందాం!

ఎడమ నేను: బావుంది, అలాగే అందాం! మనకి దొరుకుతున్న చరిత్ర బట్టి, ఆత్మసూచన ద్వారా ఏర్పడే తిరకాసులన్నింటిలోనూ పాతది యీ తప్పొప్పుల తిరకాసే. ఈ పేరడాక్సు అనేక కాలాలలో, అనేక రూపాలలో కనిపిస్తుంది.[3] అన్నింటిలోకి మొట్టమొదట కనిపించే రూపం ఏమిటో తెలుసా?

నేను: ఏమో నాకేం తెలుస్తుంది, నువ్వే చెప్పు.

ఎడమ నేను: “క్రీటనులందరూ వట్టి అబద్ధాలకోరులు, ఎప్పుడూ అబద్ధమే చెప్తారు” అని ఒక క్రీటన్ అంటే ఆ వాక్యం నిజమా అబద్ధమా?[4]

ఆ వాక్యం గురించి ఆలోచిస్తూ ఉండగానే ఎడమ నేను మళ్లీ అందుకుంది.

ఎడమ నేను: ఇలాటివే మరికొన్ని అవతారాలు చూడు:

ఒక మనిషి తాను అబద్ధం చెపుతున్నానని అన్నాడు, అది నిజమా అబద్ధమా?[5]

‘ఈ వాక్యం నిజం కాదు.’ అనే వాక్యం నిజమా అబద్ధమా?[6]

‘ఈ వాక్యం వట్టి అబద్ధం’ అనే వాక్యం నిజమా అబద్ధమా?[7]

నేను: ఆగాగు. అలా నువ్వు గుక్కతిప్పుకోకుండా చెప్పుకుపోతుంటే ఎలా. నన్ను కాస్త ఆలోచించుకోనీ. ‘ఈ వాక్యం నిజం కాదు.’ అనే వాక్యం నిజమా అబద్ధమా? నిజం అనుకుందాం. అప్పుడు దాని ప్రకారం నిజం కాదన్నమాట! పోనీ నిజం కాదు, అనుకుందాం. ‘నిజం కాదు’ అన్నది నిజం కాకపోతే, అది నిజమే అవ్వాలి! అవును ఈ వాక్యాలన్నీ ఒకలాగే ఉన్నాయి కదా. మరి యిన్ని రకాలెందుకు?

ఎడమ నేను: అవును, ఈ వాక్యాలన్నీ సుమారు ఒకలాంటివే. చాలా చిన్న చిన్న తేడాలు మాత్రం ఉన్నాయి. వాటి గురించి నువ్వు తాపీగా ఆలోచించుకో. ఈ తప్పొప్పుల తిరకాసు వెనకనున్న అసలు మెలిక అర్థం అయ్యింది కదా?

నేను: ఓ అర్థమయింది. అసలు మెలిక వాక్యం తప్పొప్పుల నిర్ణయంలో ఉంటుంది. వాక్యం అబద్ధం అని మొదలుపెడితే అది నిజం అవుతుంది, నిజం అని మొదలుపెడితే అది అబద్ధం అవుతుంది. ఈ తిరకాసుకు కారణం ఆ వాక్యం తన గురించి తాను చెప్పుకోడమే కదా!

ఎడమ నేను: అవును. దీనికి దగ్గర చుట్టమే ఇంకొక పేరడాక్సు ఉంది.

“ఈ ప్రశ్నకు సరైన సమాధానం ‘కాదు’ అనా?” అని నేను అడిగితే, నీ సమాధానం ఏమిటి? అవునంటావా? కాదంటావా?

నేను ఆలోచనలో పడ్డాను. ‘ఈ ప్రశ్న’ అనేది ఆ వాక్యంలో ఉన్న ప్రశ్ననే సూచిస్తోంది. దానికి సమాధానం ‘అవును’ అంటే ఆ వాక్యం ప్రకారం ‘కాదు’ అవ్వాలి. ‘కాదు’ అంటే ఆ ప్రశ్నకు సమాధానం కాదే కాబట్టి, ఆ వాక్యానికి సమాధానం ‘అవును’ అవ్వాలి. అవునంటే కాదనిలే, కాదంటె అవుననిలే – ఏ.ఎమ్. రాజా గొంతు వినిపించింది!

నేను చెప్పకపోయినా నాకు సమాధానం తెలిసిపోయిందని ఎడమ నేనుకు ఎలాగో తెలిసిపోతుంది కదా! అంచేత కబుర్లు కొనసాగించింది.

ఎడమ నేను: సరిగ్గానే ఆలోచించావు. ఇందులో కూడా ఉన్నది అదే తిరకాసు. వాక్యం తప్పా-ఒప్పా అన్న ప్రశ్న బదులు, సమాధానం అవునా-కాదా అన్నదిక్కడ ప్రశ్న. సరే, తమ గురించి తాము చెప్పుకోలిగే శక్తి వాక్యాలకే కాదు, పదాలకు కూడా ఉంది తెలుసా!

నేను: పదాలు కూడా తమ గురించి తాము చెప్పుకోగలవా? అదెలా!

ఎడమ నేను: చెపుతానుండు, కంగారు పడకు. అలాంటి పదాల ద్వారా కూడా తిరకాసులను సృష్టించవచ్చును. తర్కశాస్త్రంలో చాలా ప్రసిద్ధమైన ఒక ఉదాహరణ చెప్తాను విను.[8] ఇది కాస్త ఎక్కువగా బుర్రపెట్టి ఆలోచించాల్సిన విషయం. కాబట్టి కొంచెం శ్రద్ధగా వినాలి మరి.

నేను బుద్ధిగా తలూపాను.

ఎడమ నేను: నీకు విశేషణాలు, అదే adjectives, అంటే ఏమిటో తెలుసు కదా?

నేను: ఓ ఎందుకు తెలీదు! ఒక వస్తువులో ఉన్న విశేషాన్ని చెప్పే పదం విశేషణం. భాషలో చాలా విశేషణ పదాలుంటాయి కదా. పెద్ద, చిన్న, పొడుగు, పొట్టి, వేడి, చల్లన, చక్కని. అలాగే రంగులను సూచించే పదాలను కూడా విశేషణాలుగా వాడొచ్చు – తెలుపు లేదా తెల్లని, నలుపు లేదా నల్లని, ఎరుపు లేదా ఎర్రని, యిలా. భాషని సూచించే పదాలు కూడా విశేషణాలుగా ఉపయోగపడతాయి. మచ్చుకు – ఇంగ్లీషు సినిమా, తెలుగు పత్రిక, హిందీ పాట మొదలైన మాటలలో భాషని సూచించే పదాలు విశేషణాలు. అలాగే సంఖ్యా వాచకాలూను. ఒక చెట్టు, రెండు పుస్తకాలు, బహుళ జాతులు – వీటిలోని ఒక, రెండు, బహుళ, యివి విశేషణాలు.

నా భాషా జ్ఞానాన్ని గడగడా ఏకరువుపెట్టాను.

ఎడమ నేను: సరిగ్గా చెప్పావు. అంతే కాదు. విశేషణం అంటే ఎప్పుడూ ఒక పదమే ఉండాలని లేదు. ఒకటి కన్నా ఎక్కువ పదాల కూర్పు కూడా విశేషణాలయ్యే సందర్భాలుంటాయి. ఉదాహరణకు – ‘మూడక్షరాల పదం’ అన్న కూర్పులో ‘మూడక్షరాల’ అనేది ‘పదా’నికి విశేషణం. అలాగే ‘బహుళ పద వాక్యం’ అన్నప్పుడు ‘బహుళ పద’ అనేది ‘వాక్యా’నికి విశేషణం. అర్థమయిందా?

నేను: అర్థమయింది.

ఎడమ నేను: పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టుగా, విశేషణాలలో విశేషమైన విశేషణాలు కొన్ని ఉన్నాయి!

ఊపిరిపీల్చుకోడానికా అన్నట్టు ఒక్క క్షణం ఆగింది. నాలో ఉత్సుకత పెరిగింది.

ఎడమ నేను: ఈ విశేషణ పదాలను జాగ్రత్తగా చూడు – చిన్న, ఒక, ఏక, తెలుగు, ఐదక్షరాల. వీటిలో ఉన్న ప్రత్యేకత గుర్తించగలవా?

కొద్దిగా ఆలోచించాను. ‘ఐదక్షరాల’ది ఏమిటి అవ్వగలదు? ఆఁ తట్టింది.

నేను: ఇవన్నీ ఒక పదానికి విశేషణంగా వాడవచ్చు. ‘చిన్న పదం’, ‘ఒక పదం’, ‘తెలుగు పదం’, ‘ఐదక్షరాల పదం’, యిలా.

ఎడమ నేను: సరిగ్గానే చెప్పావు. అంత కన్నా మరో గొప్ప ప్రత్యేకత కూడా ఉంది. మరోసారి ఆలోచించు తెలుస్తుందేమో.

ఇంకేం విశేషం ఉంది చెప్మా? కొద్దిగా ఆలోచించాను. ఊఁహూఁ తెలియడం లేదు.

ఎడమ నేను: ‘చిన్న’ అనే పదం చిన్న పదమా పెద్ద పదమా?

నేను: చిన్న పదం.

ఎడమ నేను: అలాగే ‘ఐదక్షరాల’ అనే పదంలో ఎన్ని అక్షరాలున్నాయి?

నేను: ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు!

ఎడమ నేను: ఇప్పుడర్థమయిందా వీటిలోని ప్రత్యేకత?

నేను: ఓహ్! అర్థమయింది. ‘ఒక’ అనే పదం తీసుకుంటే అది ఒక పదమే! ‘తెలుగు’ అనేది తెలుగు పదమే. ‘ఐదక్షరాల’ అనేది అక్షరాలా ఐదక్షరాల పదమే!

ఎడమ నేను: అంటే ఇవి తమ గురించి తాము చెప్పుకుంటున్నాయి, తమని తామే సూచించుకుంటున్నాయన్న మాట.

నేను: అవునవును! పదాలు తమ గురించి తామే చెప్పుకోవడం అంటే ఇదేనన్నమాట!

ఎడమ నేను: అవును. ఇది కూడా ఒకరకమైన ఆత్మసూచనే. తమలోని విశేషాన్ని తామే సూచించే యిలాంటి విశేషణాలను స్వవిశేష విశేషణాలు అందాం. ‘స్వవిశేష’ అంటే తనలోని విశేషాన్ని తనే సూచించే విశేషణం.

నేను: స్వవిశేష విశేషణం! బావుంది!

ఎడమ నేను: తమని తాము సూచించుకొనే విశేషణాలు ఉన్నప్పుడు, తమని తాము సూచించుకోని విశేషణాలు కూడా ఉంటాయి కదా? అలాంటి వాటిని కొన్ని చెప్పు చూద్దాం.

దీనికి పెద్దగా ఆలోచించనక్కరలేకపోయింది.

నేను: పెద్ద, అనేక, ఆంగ్ల, ఏకాక్షర. ఇవి కూడా ఒక పదానికి, లేదా పదాల కూర్పుకి విశేషణంగా వాడదగిన పదాలే. ‘పెద్ద పదం’, ‘అనేక పదాలు’, ‘ఆంగ్ల పదం’, ‘ఏకాక్షర పదం’, యిలా. అయితే ఆ విశేషణ పదాలకు అవి సూచించే లక్షణం లేదు. ‘పెద్ద’ అనే పదం పెద్దది కాదు కదా. ‘ఆంగ్ల’ అనేది ఆంగ్ల పదం కాదు తెలుగు పదం. ‘ఏకాక్షర’ అనేది నాలుగక్షరాల పదం.

ఎడమ నేను: బావుంది, దారిలో పడ్డావు! ఇలాంటి విశేషణాలను పరవిశేష విశేషణాలు అందాం. ‘పరవిశేష’ అంటే, తమలో ఉన్న విశేషం కాకుండా వేరే పదాలలోని విశేషాన్ని సూచించే లక్షణం అన్న మాట. ఏ విశేషణమైనా ‘స్వవిశేషం’ అయినా కావాలి, లేదా ‘పరవిశేషం’ అయినా కావాలి. అంతేకదా?

నేను: అంతే అంతే!

ఎడమ నేను: సరే, యీ స్వవిశేష, పరవిశేష విశేషణాల గురించి నీకు పూర్తిగా అర్థమయినదో లేదో చూద్దాం. అజంత, హలంత, నిర్యోష్ఠ్య – ఈ పదాలలో ఏవి స్వవిశేష విశేషణాలో, ఏవి పరవిశేష విశేషణాలో చెప్పు.

నేను: అజంత అంటే అచ్చుతో అంతమయ్యే పదాలు, హలంత అంటే హల్లుతో అంతమయ్యే పదాలే కదా. మరి నిర్యోష్ఠ్య అంటే?

ఎడమ నేను: పెదవుల కదలికతో పలికే వర్ణాలను ఓష్ఠ్యాలు అంటారు. ప, ఫ, బ, భ, మ అనే హల్లులు ఓష్ఠ్యాలు. అలాగే అచ్చుల్లో ఉ, ఊ, ఒ, ఓ – పలికేటప్పుడు పెదవులు గుండ్రంగా చుట్టాలి. అంచేత అవికూడా ఓష్ఠ్యాలే. ఓష్ఠ్యాలు లేని పదాలను నిర్యోష్ఠ్యాలు అంటారు.

అర్థమయింది. ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తే ఎడమ నేను అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం దొరికిపోయింది. మీరు కూడా ఆలోచించండి.

ఎడమ నేను: సరే, ఈ మెట్టుకూడా ఎక్కేసావు. ఇప్పుడొకసారి గట్టిగా ఊపిరి పీల్చుకో. అసలైన చిక్కుముడి ఇప్పుడు రాబోతోంది!

నేను ఊపిరి పీల్చుకొని సిద్ధమయ్యాను.

ఎడమ నేను: ‘స్వవిశేష విశేషణం’, ‘పరవిశేష విశేషణం’ అనే పదబంధాలలో ‘స్వవిశేష’, ‘పరవిశేష’ అనే పదాలు కూడా విశేషణాలే అన్న సంగతి గమనించావా?

నేను: ఊఁ, అవును. అవి ఒక విశేషణ పదంలోని విశేషాన్ని సూచించే పదాలు.

ఎడమ నేను: ఏ విశేషణమైనా అయితే స్వవిశేషమో లేదా పరవిశేషమో అవ్వాలని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అంచేత, ‘స్వవిశేష’, ‘పరవిశేష’ అనే పదాలు కూడా స్వవిశేషమైనా, పరవిశేషమైనా అవ్వాలి. అవునా?

నేను: ఊఁ, అవును.

ఎడమ నేను: అయితే మరి, ‘పరవిశేష’ అనేది ఎలాంటి విశేషణం? స్వవిశేష విశేషణమా లేక పరవిశేష విశేషణమా?

నేను ఆలోచనతో బుర్ర గోక్కోవడం చూసి ఎడమ నేను కాస్త బుజ్జగింపుగా అంది:

ఎడమ నేను: మరొక్కసారి వాటి నిర్వచనాన్ని నెమరు వేసుకుందాం. తనలోని విశేషాన్ని తానే సూచించుకొనే లక్షణమున్న విశేషణం ‘స్వవిశేష విశేషణం’. తనలోని విశేషాన్ని తాను సూచించుకోనిది ‘పరవిశేష విశేషణం’. ఇప్పుడు ‘పరవిశేషం’ అనే విశేషణం స్వవిశేషమా పరవిశేషమా? అంటే అది తన గురించి తాను చెప్పుకుంటుందా చెప్పుకోదా?

నా ఆలోచన కొనసాగించాను…

నేను: ‘పరవిశేష’ అనేది ‘స్వవిశేష విశేషణం’ అనుకుందాం. అంటే, తాను స్వవిశేష విశేషణం అయ్యి కూడా ‘పరవిశేష’ అనే లక్షణాన్ని సూచిస్తోంది. ‘పెద్ద’ అనే పదం చిన్నదయి కూడా పెద్ద అనే లక్షణాన్ని సూచిస్తున్నట్టు. అప్పుడది తన గురించి తాను చెప్పుకోవడం లేదు. అలా అయితే అది ‘పరవిశేష విశేషణం’ కావాలి!

ఎడమ నేను: అవును. పోనీ పరవిశేష అన్నది పరవిశేష విశేషణం కావచ్చును కదా?

నేను: అలా అయితే, ‘చిన్న’ అనేది చిన్నపదమే అయినట్టు, తనలోని విశేషాన్ని గురించి తానే చెప్పుకున్నట్టు అవుతుంది. అలాంటప్పుడు అది ‘స్వవిశేష విశేషణం’ కావాలి, ‘పరవిశేష విశేషణం’ కాలేదు!

ఎడమ నేను: అద్గదీ సంగతి. ఇందులో తిరకాసు అర్థమయిందా? ‘పరవిశేష’ అనేది పరవిశేష విశేషణమా, స్వవిశేష విశేషణమా అని తేల్చి చెప్పడం వీలు కాని పని. పరవిశేషం అనుకుంటే స్వవిశేషం కావాలి, స్వవిశేషం అనుకుంటే అది పరవిశేషం కావాలి. ఒకే పదం రెండూ కాలేదు కదా!

అవును, ఇది ఒక పెద్ద చిక్కుముడే! ఈ చిక్కుముడిని అర్థం చేసుకోవడం కొద్దిగా బుద్ధికి పరిశ్రమే అయింది. దీని గురించి ఒకటికి రెండు మార్లు ఆలోచిస్తూ నడక సాగించాను. మెల్లిమెల్లిగా అర్థమయినట్టే అనిపించింది. కాకపోతే యీ తిరకాసులన్నీ–అవి ఆత్మసూచకాలైన వాక్యాల ద్వారా కావచ్చు, పదాల వల్ల కావచ్చు–వట్టి మాటల గారడీలుగా అనిపించాయి. ఎడమ నేనుతో అదే అన్నా. పైగా జయభేరిలో రేలంగి అన్నట్టు, ‘మాటలతో ఇరకాటం కాదు సజావైన సవాలు వెయ్’ అని కూడా అన్నాను. ఎడమ నేను గొంతులోంచి చిన్న నవ్వు వినిపించింది.

ఎడమ నేను: అలా అంటావా. నీకలా అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదులే. మహామహా తర్కశాస్త్రవేత్తలే దీని గురించి తర్జనభర్జనలు పడ్డారు. కానీ వీటిలోని తిరకాసుకు అసలు కారణం కేవలం మాటలు మాత్రం కాదు. ఆ మాటల వెనకనున్న అర్థాలు, ఆ అర్థాల వెనకనున్న తార్కిక ఆలోచన. ఆ ఆలోచనలోని ఆత్మసూచనే, అంటే తనను తానే సూచించుకొనే లక్షణమే అసలు మెలిక!

నా అపనమ్మకం ఎడమ నేనుకు అర్థమైపోయింది.

ఎడమ నేను: సరే, ఇది నీకు స్పష్టం కావాలంటే మరో చిట్టి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను.

కథ అనే సరికి కొత్త ఉత్సాహం వచ్చింది. చెప్పు చెప్పు అన్నట్టు తల ఊపాను.

ఎడమ నేను: అనగనగా ఒక పల్లెటూళ్లో ఒకే ఒక క్షురకుడు, అనగా బార్బర్ ఉన్నాడు. అతనికి ఒక నియమం ఉంది. ఆ ఊళ్లో తమకి తాము గడ్డం గీసుకోని వారికే అతను గడ్డం గీస్తాడు. తనకు తాను గడ్డం గీసుకొనే ఏ వ్యక్తికీ అతను గడ్డం గీయడు. చాలా సజావైన నియమం లాగానే ఉంది కదూ!

ఇందులో తిరకాసేమైనా ఉందేమోనని ఒక్క క్షణం ఆలోచించాను. ఏం కనిపించలేదు. అవునన్నట్టు తలూపాను.

ఎడమ నేను: అయితే దీనికి సమాధానం చెప్పు చూద్దాం. ఆ క్షురకుడు తన గడ్డం తాను గీసుకుంటాడా లేదా?

నేను: ఇదేం ప్రశ్న! తన గడ్డం తాను గీసుకోకుండా ఉంటాడా?!

ఎడమ నేను: అక్కడే ఉంది మరి తిరకాసు! నువ్వన్నట్టు తన గడ్డం తాను గీసుకుంటాడనుకుందాం. అప్పుడతను ‘ఆ ఊళ్ళో తమకి తాము గడ్డం గీసుకునే వ్యక్తుల’ గుంపులో చేరతాడు. కానీ అతని నియమం ప్రకారం ఆ గుంపులో ఏ వ్యక్తికీ అతను గడ్డం గీయకూడదు కదా. అంచేత తనకి తాను గడ్డం గీసుకోకూడదు!

ఓహో, అదా సంగతి! వచ్చిందిరా మెలిక అనుకున్నా.

ఎడమ నేను: పోనీ తనకు తాను గడ్డం గీసుకోడు అనుకుందాం. అప్పుడతను ‘ఆ ఊళ్ళో తమకి తాము గడ్డం గీసుకోని వ్యక్తుల’ గుంపులోకి చేరతాడు. అతని నియమం ప్రకారం ఆ గుంపులో ప్రతి వ్యక్తికీ అతను గడ్డం గీస్తాడు కాబట్టి, తనకి తాను గడ్డం గీసుకోవాలి!

నేను: పాపం ఆ క్షురకుడు తాను పెట్టుకున్న నియమంలో తానే చిక్కుకుని చివరకు గడ్డం గీసుకున్నాడో లేదో మరి!

ఎడమ నేను: నీ హాస్యం బాగానే ఉంది కానీ, ఈ కథలోని తిరకాసు కేవలం భాషకి సంబంధించినది కాదని ఒప్పుకుంటావా?

ఆ మెలిక గురించి ఆలోచిస్తూనే మెల్లిగా తలూపాను.

ఎడమ నేను: ఒక తార్కిక నియమం లేదా నిర్వచనం వల్ల ఏర్పడ్డ తిరకాసిది. ఇందులో మెలిక ఏమిటో జాగ్రత్తగా ఆలోచించు. ఒక వ్యక్తి (క్షురకుడు) ఒక నిర్వచనం ద్వారా మొత్తం ఊళ్లో ఉన్న వ్యక్తులను రెండు వేర్వేరు గుంపులుగా భాగించాడు. క్షురకుడు కూడా ఆ ఊరిలో మనిషే కాబట్టి ఆ రెండు గుంపుల్లో ఏదో ఒక దానిలో (ఒక దానిలో మాత్రమే) ఉండాలి. అయితే తాను చేసిన నిర్వచనాన్ని తనకే వర్తించుకోవలసి వచ్చినప్పుడు తిరకాసు ఏర్పడింది. ఆ రెండు గుంపులలో ఏ గుంపులో ఉంటాడు అనేది ఇదమిత్థమని నిర్ణయించడానికి వీల్లేకుండా పోయింది. ఇందులో కూడా అంతర్గతంగా ఉన్నది ఆత్మసూచన వల్ల ఏర్పడే తిరకాసే!

నిజమే. ఇందులో ఉన్న తిరకాసు వట్టి మాటల వల్ల ఏర్పడ్డది కాదు. రెండు గుంపులను నిర్వచించడంలో కూడా నిజానికి ఏ తిరకాసూ లేదు. ఆ నిర్వచనం ద్వారా క్షురకుడు పెట్టుకున్న నియమం, ఆ నియమాన్ని తనకు అన్వయించుకోవలసి రావడం దగ్గరుంది అసలు మెలిక. అర్థమయింది. అదే అన్నాను ఎడమ నేనుతో.

నేను: బావుంది తిరకాసు. మొత్తానికి నువ్వు భేతాళుడికి ఏమాత్రం తీసిపోకుండా మంచి చిక్కుప్రశ్నలనే సంధిస్తున్నావ్!

ఎడమ నేను: ప్రతి మనిషిలోనూ ఒక భేతాళుడు ఉంటూనే ఉంటాడు. అప్పుడప్పుడూ యిలా బయటపడుతూంటాడు. ఇంతకీ ఈ కథ ఎక్కడనుండి పుట్టిందో తెలీదు కానీ బెర్‌ట్రండ్ రసెల్ (Bertrand Russell) అనే పెద్దాయన ద్వారా వ్యాప్తిలోకి వచ్చింది.[9] ఇలాంటి తిరకాసునే రసెల్ గణిత పరిభాషలో తయారుచేసి అప్పటి సెట్ థియరీలో (సమితుల సిద్ధాంతం) ఉన్న పెద్ద లోపాన్ని బయటపెట్టాడు. అతని పేరు మీద అది రసెల్ పేరడాక్సుగా ప్రసిద్ధి చెందింది.[10]

నేను: అవును రసెల్ గురించి నేనూ విన్నాను. అతను బహుముఖ ప్రతిభాశాలి కదా. తర్కం ఆధారంగా అటు తత్త్వశాస్త్రాన్నీ, ఇటి గణితశాస్త్రాన్నీ నిర్మించడానికి ఆయన చేసిన కృషి అసామాన్యం అని కూడా చదివాను.

ఎడమ నేను: అవును. ఆధునిక కాలంలో పాశ్చాత్య గణిత శాస్త్రానికి గట్టి పునాది వేసినవాళ్ళలో రసెల్‌ది తిరుగులేని స్థానం.

నేను: ఇలా కాలికేస్తే మెడకీ, మెడకేస్తే కాలికీ అన్నట్టున్న యీ పేరడాక్సులని తీరికూర్చుని ఎవరు ఎందుకు సృష్టించారు? దీనికీ గణితశాస్త్రానికీ అసలు ఏమిటి సంబంధం?

ఎడమ నేను: మనిషన్న వాడికి ఎవడికైనా ఆలోచన ఉంటుంది కదా. ఆ ఆలోచనను ఒక పద్ధతిగా పేర్చి దానికొక శాస్త్రీయ రూపాన్ని యిచ్చేదే తర్కం. దాని మీద ఆధారపడి వృద్ధి చెందినదే గణితం. అలాంటి తార్కికమైన ఆలోచనకు సవాలు విసిరేవే పేరడాక్సులు. ఇవి ప్రాచీన కాలం నుంచీ మనిషి మేధను సవాలు చేస్తూనే ఉన్నాయి. ఆత్మసూచన అనే లక్షణం, తర్కశాస్త్రంలో జవాబులు లేని ప్రశ్నలెన్నిటినో మేధావుల ముందుంచింది.

నేను: ఓహో! అంటే రసెల్ కన్నా ముందే యీ ఆత్మసూచన గురించీ, అది సృష్టించే తిరకాసుల గురించీ అంతకు ముందున్న తర్కశాస్త్రవేత్తలు ఆలోచించారా?

ఎడమ నేను: నిస్సందేహంగా. పాశ్చాత్య చరిత్రలో తర్కశాస్త్రానికి చాలా గొప్ప ప్రాధాన్యం ఉంది. అసలు మనం చెప్పుకున్న ఉదాహరణలన్నీ తిరకాసులని భావించడానికి మూలకారణం పాశ్చాత్య తర్క సిద్ధాంతాలే. దాని వెనకనున్న వారి తాత్విక దృక్పథమే.

నేను: అవన్నీ తిరకాసులేగా. దాని వెనక పెద్ద సిద్ధాంతమూ దృక్పథమూ ఏముంది?

ఎడమ నేను: అది తెలియాలంటే పాశ్చాత్య తత్త్వ, తర్క శాస్త్రాల మూలాల గురించి కొద్దిగా తెలుసుకోవాలి…

నేను: ఎందుకు మరి తాత్సారం, తెలుసుకోడానికి నేను సిద్ధంగా ఉన్నా. చెప్పుమరి.

ఎడమ నేను గొంతు సవరించింది.
పాశ్చాత్యుల దృక్పథం
ఎడమ నేను: సరే. జాగ్రత్తగా విను. పాశ్చాత్యదేశాలలో చాలా కాలం వరకూ, తత్త్వశాస్త్రం (Philosophy), తర్కం (Logic), గణితం (Mathematics) – ఈ మూడూ ఒకదానితో ఒకటి పెనవేసుకొని వృద్ధి చెందాయి. మనకి కనిపించే ఈ భౌతిక ప్రపంచం, అభౌతికమైన ఒక హేతువు, తర్కం ఆధారంగా ఏర్పడిందనీ, నడుస్తోందనీ, ఆ తర్కమే పరమసత్యమనీ, దానిని మానవ మేధ ద్వారా అర్థం చేసుకోవచ్చుననే భావన పాశ్చాత్య తత్త్వ చింతనలో ఒక ప్రధాన స్రవంతిగా సాగింది. ఈ సిద్ధాంతంలో సత్యం అనేది సార్వజనికం (Non-subjective), వ్యక్తిని బట్టి మారదు. అది పూర్తిగా వస్తుగతం (Objective). ఈ సిద్ధాంతానికి ఆద్యుడు పైథాగరస్ (Pythagoras) అని చెప్పవచ్చును.

నేను: ఓహ్ పైథాగరస్! నేను స్కూల్లో పైథాగరస్ థియరమ్ చదువుకున్నాను. అతనేనా ఇతను?

ఎడమ నేను: అవును అతనే. పైథాగరస్ క్రీ.పూ. 500 కాలానికి చెందిన గ్రీకు తత్త్వవేత్త. పడమట దేశాలలో చాలా కాలం వరకూ రకరకాల శాస్త్రాల అభివృద్ధికి కేంద్రం గ్రీకుదేశమే. ప్రపంచాన్ని నడిపించేది గణిత సూత్రాలే అన్నది పైథాగరస్ సిద్ధాంతం. సంఖ్యలే ప్రపంచానికి మూల స్తంభాలనీ, వాటి మధ్యనున్న క్రమబద్ధమైన సూత్రాలే దాన్ని నడిపిస్తున్నాయనీ అతను సూత్రీకరించాడు. దానిని నిరూపించడానికి బలంగా కృషి చేశాడు. సంగీతం వెనకనున్న గణిత సూత్రాలను మొట్టమొదటగా కనుగొన్నది అతడే. సంఖ్యాశాస్త్రం (Number System), జ్యామితి (Geometry) మొదలైన గణిత శాస్త్ర అంశాలలో ఎన్నో సూత్రాలను పైథాగరస్ నిరూపించాడు. గ్రహగమనం వెనక కూడా నిర్దిష్టమైన గణిత సూత్రాలున్నాయని అతను ఊహించాడు.

నేను: ఓహో. పైథాగరస్ అంటే ఒక గణితశాస్త్రవేత్త అనే అనుకున్నాను. తత్త్వవేత్త కూడా అన్నమాట.

ఎడమ నేను: అవును. పైథాగరస్ ప్రభావం ఆ తర్వాతి గ్రీకు తత్త్వవేత్తలు చాలామందిపై పడింది. వారిలో ప్లేటో, అతని శిష్యుడు అరిస్టాటిల్ ముఖ్యులు.

నేను: ఆఁ! సోక్రటీస్ శిష్యుడు ప్లేటో, అతని శిష్యుడు అరిస్టాటిల్, అతని శిష్యుడు అలెక్జాండర్, వీళ్ళది గొప్ప గురుశిష్య పరంపర అని చదివాను.

ఎడమ నేను: అవును. వీళ్ళలో అరిస్టాటిల్ పాశ్చాత్య తర్కశాస్త్రానికే ఆద్యుడని చెప్పవచ్చు. అతను వేసిన పునాదుల మీదనే తర్కశాస్త్రం చాలా వరకూ నిర్మించబడింది. హేతుబద్ధమైన ఆలోచనకు అరిస్టాటిల్ చాలా గొప్ప స్థానం ఇచ్చాడు. ఆయన దేవునికి యిచ్చిన నిర్వచనం ఏమిటో తెలుసా?’

నేను: దేవుడికి నిర్వచనమా!

ఎడమ నేను: అవును. ‘ఆలోచనను ఆలోచిస్తున్న ఆలోచన’[11]

నేను: ఓహ్! ఈ ఆలోచన చాలా చిత్రంగా ఉందే!

ఎడమ నేను: చిత్రమే మరి! ఒకరకంగా తర్కం అంటే ఆలోచన గురించిన ఆలోచనే కదా. అంటే అరిస్టాటిల్ దృష్టిలో దైవం తర్కస్వరూపం అన్న మాట!

నేను: ఓహో!

ఎడమ నేను: తర్కానికి సంబంధించి అరిస్టాటిల్ చేసిన రచనలన్నింటినీ కలిపి అతని శిష్యులు ఆర్గనాన్ (Organon) అన్న పేరుతో సంకలనం చేశారు. ఆర్గానన్ అంటే సాధనం.

నేను: ఇంగ్లీషులో ఆర్గన్ అనే పదానికీ దీనికీ సంబంధం ఉందా?

ఎడమ నేను: అవును, దాని మూలం ఈ పదమే. ఒక పని చేయడానికి ఇంద్రియం సాధనం కాబట్టి దానికా పేరు వచ్చింది. అందుకే సంస్కృతంలో కూడా ఇంద్రియాలను కరణాలు అంటారు. కరణం అన్నా పని చేసే సాధనం అనే అర్థం. ఆలోచనను అర్థం చేసుకొనే సాధనం తర్కం. అందుకే అరిస్టాటిల్ తర్క సంకలనానికి ఆ పేరు సరిగ్గా సరిపోయింది.

నేను: బావుంది.

ఎడమ నేను: తర్కశాస్త్రంలో, అనగా లాజిక్కులో ప్రధానమైన అంశం ఏమిటి?

చెపుతూ చెపుతూ మధ్యలో నాకీ పరీక్షలెందుకు? కొద్దిగా ఆలోచించి జవాబిచ్చాను.

నేను: మనకి కచ్చితంగా తెలిసున్న విషయాల ఆధారంగా కొన్ని ప్రతిపాదనలు చేయడం. ఆ ప్రతిపాదనల సత్యాసత్యాలను తర్క సూత్రాలను అనుసరించి నిరూపించడం.

ఎడమ నేను: సరిగానే చెప్పవు. తర్కశాస్త్రంలో, ముఖ్యంగా పాశ్చాత్య తర్కంలో యిదే ప్రధానమైన అంశం. ప్రతిపాదనల తప్పొప్పుల నిర్ణయాన్ని గురించి విచారించి, మొట్టమొదటిసారిగా కొన్ని నిర్దిష్టమైన తార్కిక సూత్రాలను తయారు చేసింది అరిస్టాటిలే. ప్రతిపాదనల తప్పొప్పుల గురించి అరిస్టాటిల్ కన్నా ముందు అతని గురువు ప్లేటో, ప్లేటో గురువు సోక్రటీసు కూడా ఆలోచించారు. వాటిని వివరంగా సూత్రబద్ధం చేసినది మాత్రం అరిస్టాటిల్.

నేను: ప్రతిపాదనల తప్పొప్పుల గురించి సూత్రాలేముంటాయి. అయితే ఒప్పు, లేకపోతే తప్పు అంతే కదా!

ఎడమ నేను: నీకిది చాలా తేలికయిన విషయంలా అనిపించవచ్చు కానీ, సరిగ్గా నువ్వు ఇప్పుడన్నదే అరిస్టాటిల్ సూత్రాలలో ఒక ముఖ్యమైన సూత్రం. దాన్ని ‘మూడో దారి అసాధ్యం’ అంటారు.[12] అంటే ఒక విషయాన్ని ప్రతిపాదించే ఏ వాక్యమైనా సరే నిజమైనా అవ్వాలి లేదా అబద్ధమైనా అవ్వాలి, మరొక మూడో దారి అన్నది అసాధ్యం. ఉదాహరణకు ‘ఇండియా మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ’ అనే వాక్యం ఒక విషయాన్ని ప్రతిపాదిస్తున్నది కదా. అది నిజమైనా కావాలి, అబద్ధమైనా కావాలి. అది నిజం అని మనకు తెలుసు. అలాగే ‘రెండు రెళ్ళు ఆరు’ అనే వాక్యం కూడా ఒక ప్రతిపాదనే. అది అబద్ధం అని కూడా మనకు తెలుసు.

నేను: ఓహో, ఇంత చిన్న విషయానిక్కూడా ఒక సూత్రం ఉండాలా!

ఎడమ నేను: మరి. సరే అయితే యీ ప్రతిపాదన నిజమో అబద్ధమో చెప్పు: వచ్చే ప్రపంచ కప్పు ఇండియా గెలుస్తుంది.

నేను: అదెలా చెప్పగలం. నిజమైనా కావచ్చు అబద్ధమైనా కావచ్చు.

ఎడమ నేను: యిప్పుడే కదా ఒప్పుకున్నావు ఒక ప్రతిపాదన నిజమైనా కావాలి అబద్ధమైనా కావాలి, మూడో మార్గం లేదని. పైగా అదొక పెద్ద విషయమా అని కూడా అడిగావు! మరి నేను చెప్పిన ప్రతిపాదన ఒప్పయినా, తప్పయినా కూడా కావచ్చు అంటున్నావ్?

మళ్లీ బుర్ర గోక్కోవడం నా వంతయింది.

ఎడమ నేను: కొన్ని ప్రతిపాదనలు నిజమో అబద్ధమో ఆ ప్రతిపాదన చేస్తున్న సమయంలో తెలియకపోవచ్చును. వచ్చే ప్రపంచ కప్పు గురించిన ప్రతిపాదన అలాంటిది. అది నిజమో అబద్ధమో మనకిప్పుడు తెలియదు. కానీ ఆ వాక్యం నిజమో, అబద్దమో అయి తీరాలని మాత్రం తెలుసు కదా!

నేను: ఆఁ, అవును. ఆ ప్రతిపాదన సత్యాసత్యాలను ప్రస్తుతానికి నిర్ణయించలేం కానీ, నిర్ణయించగలిగినప్పుడు అది కచ్చితంగా నిజమో అబద్ధమో అవుతుంది. అర్థమయింది.

ఎడమ నేను: అరిస్టాటిల్‌దే మరొక సూత్రం: ‘ఒకేసారి ఒక ప్రతిపాదన, దాని వ్యతిరేక ప్రతిపాదన, రెండూ నిజం కాలేవు’.[13] అంటే ఒకేసారి ఒక ప్రతిపాదన నిజమూ అబద్ధమూ కూడా కావడం అసాధ్యం. ఉదాహరణకు, ‘తెల్లనివన్నీ పాలు’ అనే ప్రతిపాదన అబద్ధం అయితే, ‘తెల్లనివన్నీ పాలు కావు’ అనేది నిజం అవుతుంది. అలాగే ‘ప్రతి త్రిభుజంలో మూడు కోణాల మొత్తం ఎప్పుడూ 180 డిగ్రీలు అవుతుంది’ అనే ప్రతిపాదన నిజమైతే దాని వ్యతిరేక ప్రతిపాదన ‘ప్రతి త్రిభుజంలో మూడు కోణాల మొత్తం ఎప్పుడూ 180 డిగ్రీలు కావు’ అనేది అబద్ధమే అవుతుంది.

నేను: ఈ సూత్రానికీ ముందు నువ్వు చెప్పిన సూత్రానికీ పెద్దగా తేడా ఏముంది?

ఎడమ నేను: పెద్దగా లేదు కానీ కొద్దిగా ఉంది. జాగ్రత్తగా ఆలోచించు. అదలా ఉంచితే, యింతకు ముందు చెప్పుకున్న తిరకాసులన్నింటి వెనుకా యీ సూత్రాలే పనిచేస్తున్నాయన్న విషయం గమనించావా? ఒక ప్రతిపాదన తప్పొప్పులను కచ్చితంగా నిర్ణయించగలగాలి అనే నిశ్చయాత్మకత యీ రెండు సూత్రాల వెనుకా ఉంది. అలా నిర్ణయించలేని ప్రతిపాదనలు విరోధాలుగా, పేరడాక్సులుగా పరిగణించబడ్డాయి.

నేను: ఓహో. అంటే ఒకేసారి నిజమూ అబద్ధమూ కూడా అయ్యే ప్రతిపాదనలు పేరడాక్సులన్న మాట.

ఎడమ నేను: అవును. తప్పొప్పుల తిరకాసులో జరిగేది అదే కదా. అయితే, కొన్ని ప్రతిపాదనలు పైకి తిరకాసుగా కనిపించినా అందులో నిజానికి విరోధం ఉండదు. తిరకాసు కాని తిరకాసు. అలాంటిదొకటి ఇప్పటికే నేను నీకు చెప్పాను! ఏమిటో కనుక్కో చూద్దాం.

మళ్లీ నాకు పరీక్ష! ఎడమ నేనులో యింతటి పరీక్షాధికారి ఒకడున్నాడని యింత కాలం నాకు తెలియనే లేదు! మళ్లీ బు. గో. మొదలుపెట్టాను.

ఎడమ నేను: సరే నేనే చెప్తాను. తప్పొప్పుల తిరకాసు అతిప్రాచీన రూపాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకో.

నేను: గుర్తుకొచ్చింది. ‘క్రీటనులందరూ వట్టి అబద్ధాలకోరులు, ఎప్పుడూ అబద్ధమే చెప్తారు’ అని ఒక క్రీటన్ అంటే ఆ వాక్యం నిజమా అబద్ధమా?

ఎడమ నేను: ఇందులో ఉన్న తిరకాసేమిటో చెప్పు?

నేను: ‘క్రీటనులందరూ ఎప్పుడూ అబద్ధమే చెప్తారు’ అన్న వాక్యం నిజం అనుకుందాం. ఆ వాక్యాన్ని చెప్పింది కూడా క్రీటనే కాబట్టి, అది కూడా అబద్ధమే కావాలి. ఇది విరోధానికి దారి తీస్తోంది. అదే కదా తిరకాసు?

ఎడమ నేను: సరే, మరి ఆ వాక్యం అబద్ధమైతే?

నేను: అంటే, క్రీటనులు అబద్ధం చెప్పరన్నమాట. మరి అప్పుడు ఆ క్రీటను చెపుతున్నది నిజం కావాలి కదా?

ఎడమ నేను: అక్కడే ఉంది లాజిక్కులోని అసలు ట్రిక్కు. ‘క్రీటనులందరూ ఎప్పుడూ అబద్ధమే చెప్తారు’ అనే వాక్యానికి వ్యతిరేక వాక్యం ఏమిటి? జాగ్రత్తగా ఆలోచించు.

నేను: ‘క్రీటనులందరూ ఎప్పుడూ అబద్ధమే చెప్పరు’

ఎడమ నేను: అంటే?

నేను: అంటే ఎప్పుడో ఒకప్పుడు నిజం కూడా చెప్తారు అని.

ఎడమ నేను: అంతే కదా. అంటే ఎప్పుడూ నిజం చెప్తారు అని కాదు కదా?

నేను: కాదు.

మెల్లిగా ట్యూబులైటు వెలుగుతోంది.

ఎడమ నేను: ఎప్పుడో ఒకప్పుడు నిజం చెప్తారు. ఎల్లప్పుడూ నిజం చెప్పాలని లేదు. అంచేత ఆ క్రీటన్ చెప్పిన ‘క్రీటనులందరూ ఎప్పుడూ అబద్ధమే చెప్తారు’ అన్న వాక్యం నిజం అవ్వాలని లేదు.

నేను: అవును అబద్ధం అనుకుంటే ఏ చిక్కూ లేదు. నిజం అనుకుంటేనే యిబ్బంది.

ఎడమ నేను: అంచేత ఆ వాక్యం కచ్చితంగా అబద్ధమేనని నిర్ణయించవచ్చు. కాబట్టి యిక్కడున్నది నిజమైన విరోధం కాదు, విరోధాభాస మాత్రమే! ఇది పూర్తి తిరకాసు కాదన్నమాట, అరతిరకాసు మాత్రమే!

నేను: అరతిరకాసు, బావుంది!

ఎడమ నేను: ఇలా, ఒక ప్రతిపాదనను నిజమనుకొని, దాని ద్వారా విరోధం ఏర్పడుతుందని నిరూపించి, అందువల్ల ఆ ప్రతిపాదన తప్పే అయ్యుండాలని నిర్ధారణ చేయడం తర్కశాస్త్రంలో ఒక ప్రసిద్ధమైన వాద పద్ధతి. దీనిని గణితశాస్త్రంలో కూడా చాలా విరివిగా ఉపయోగిస్తారు. ఇంగ్లీషులో దీనిని Proof By Contradiction అంటారు.[14] భారతీయ న్యాయశాస్త్రంలో దీనిని ‘ప్రమాణ బాధిత అర్థప్రసంగం’ అని పేర్కొన్నారు.

నేను: ఓహో. అర్థమయింది. అయితే ఈ పద్ధతి విరోధాభాసల విషయంలోనే సాధ్యమవుతుంది. నిజమైన విరోధం ఉన్నప్పుడు మాత్రం సాధ్యం కాదు కదా? ‘ఈ వాక్యం నిజం కాదు’ అనే ప్రతిపాదన తీసుకుంటే అందులో సిసలైన విరోధం ఉంది. అది నిజమని తీసుకుంటే అబద్ధమని నిరూపించవచ్చు. కానీ అబద్ధమని తీసుకుంటే తిరిగి నిజమని నిరూపించవచ్చు. అంచేత అది అసలుసిసలైన పూర్తి తిరకాసు!

ఎడమ నేను: సరిగ్గా చెప్పావు. ఇప్పటికి నీకు బాగా అర్థమైనట్టుంది! అరిస్టాటిల్ విస్తృతంగా ప్రచారం చేసిన యీ తార్కిక ఆలోచనా విధానం ఆధునిక కాలం వరకూ చాలా ప్రభావాన్ని చూపించింది, ఇంకా చూపిస్తోంది కూడా! ఈ ఆలోచనా ధోరణిలో, తర్కానికి లొంగని తిరకాసులను అసంగతాలుగా అసంబద్ధాలుగా పాశ్చాత్య తార్కికులు త్రోసిపుచ్చారు. వట్టి మాటల గారడీలని కొట్టిపారేశారు కూడా. ఎదుటివాళ్ళ వాదన తర్కసమ్మతం కాదని నిరూపించడానికి మాత్రం ఈ వాదపద్ధతి బాగా ఉపయోగపడింది.

నేను ఓహో అంటూ అప్పటిదాకా ఎడమ నేను చెప్పిన పాశ్చాత్య తర్కాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఒక వాక్యం నిజమో అబద్ధమో కావాలన్నది మామూలు బుద్ధికి సరైనదనే అనిపిస్తుంది. దానినే అరిస్టాటిల్ సూత్రబద్ధం చేశాడు. ఒక వాక్యం నిజమైతే దానికి సరైన వ్యతిరేక వాక్యం అబద్ధం కావాలన్న అంశాన్ని కూడా సూత్రీకరించాడు. తార్కికులందరూ ఈ సూత్రాలపైనే తర్కశాస్త్రాన్ని నిర్మించారు. తనను తాను సూచించుకొనే లక్షణమున్న కొన్ని వాక్యాలు–అటు నిజమూ, యిటు అబద్ధమూ కూడా కాకుండా పోయేవి ఎదురైనప్పుడు వాటిని తర్కసమ్మతం కాని తిరకాసులుగా కొట్టిపారేశారు. ఇంత వరకూ అర్థమయింది. అయితే మరి రసెల్ అనే ఆ పెద్దాయన, పైగా గణితవేత్త, తీరి కూర్చుని అలాంటి ఒక పేరడాక్సుని సృష్టించడం ఎందుకు? అదే ప్రశ్న అడిగాను.

ఎడమ నేను: మంచి ప్రశ్న వేశావు. పాత కాలపు మేధావులు అసంగతాలుగా కొట్టిపారేసినా, ఆధునికకాలంలో తర్కశాస్త్రాన్ని ఆధారం చేసుకొని గణితశాస్త్రాన్ని పటిష్ఠంగా నిర్మించాలన్న ప్రయత్నాలు మొదలైనప్పుడు, ఈ పేరడాక్సులు ఒక పెద్ద తలనొప్పి వ్యవహారంగా తయారయ్యాయి. వాటికి ఏదో ఒక సమాధానం చెపితే తప్ప, తర్కమూ దానిపై ఆధారపడే గణితమూ స్థిరంగా నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పందొమ్మిది యిరవై శతాబ్దాల సంధి కాలంలో తర్క గణితశాస్త్రాలను సవాలు చేసే తిరకాసులు ఒక్కసారిగా వెల్లువెత్తాయి.[15] అప్పటి సిద్ధాంతాలలోని లోపాలను, వాటికున్న పరిమితులను అన్వేషించే క్రమంలో తర్కవేత్తలే యిలాంటి తిరకాసులను సృష్టించారు.

నేను: ఓహో! అంటే రసెల్ పేరడాక్సుని కూడా రసెల్ అందుకే తయారుచేశాడన్న మాట.

ఎడమ నేను: అవును. గణితశాస్త్రంలో ఒక ముఖ్యమైన అంశం సమితులు, అంటే Sets. ఆ సమితుల గురించి అప్పటి సిద్ధాంతాలలో ఉన్న పరిమితులను విశ్లేషించే సందర్భంలో, క్రీ.శ. 1901లో రసెల్ దానిని కనుగొన్నాడు. ఈ వెల్లువెత్తిన తిరకాసులన్నింటి వెనకా దాగిన మూలసూత్రం ఒకటే: ఆత్మసూచన! అపుడున్న గణిత సిద్ధాంతాలను ఆధారంగా, వాటికి అణుగుణంగానే ఆ పేరడాక్సులను తయారు చేయగలగడం, అసలు తలనొప్పికి కారణం. ఇలాంటి అసంగతమైన విరోధాలకు తావిచ్చేలా సూత్రాలూ, వాటిపై ఆధారపడిన సిద్ధాంతాలూ ఉన్నాయంటే వాటిలో ఏదో లోపం ఉన్నట్టే కదా. అలాంటి దోషపూరితమైన, లేదా అసంపూర్ణమైన సిద్ధాంతాలను ఆధారం చేసుకుని ఒక పటిష్ఠమైన శాస్త్రాన్ని నిర్మించడం ఎలా? ఇదీ ఆనాటి శాస్త్రవేత్తలకు ఆత్మసూచన విసిరిన సవాలు.

నేను: చాలా పెద్ద సవాలే విసిరిందన్న మాట!

ఎడమ నేను: అవును. దీనిని మొట్టమొదటగా ఢీకొట్టి ఎదుర్కొన్నది కూడా రసెల్ అనే చెప్పవచ్చు.

నేను: ఓహో! అతనెలా ఢీకొన్నాడు?

ఎడమ నేను: ఆ పేరడాక్సులన్నింటి వెనక ఉన్నది, ఏదో ఒక రకమైన ఆత్మసూచనే అని గుర్తించాడు. కాబట్టి అసలు ఆ ఆత్మసూచన అనేదాన్ని శాస్త్రంలో నిషేధించాలని అతను ప్రతిపాదించాడు. ఆత్మసూచనను ఒక విషవలయంగా (vicious circle) పేర్కొన్నాడు![16] అంచేత ఏ ప్రతిపాదన అయినా, తన గురించి తాను ఎలాంటి ప్రతిపాదనా చేయకూడదని అతను నియమం చేశాడు.

నేను: అంటే తప్పొప్పుల తికమకలో వచ్చే వాక్యాలు–‘ఈ వాక్యం అబద్ధం’ మొదలైనవి–శాస్త్రబద్ధమైన ప్రతిపాదనలు కావన్నమాట!

ఎడమ నేను: అవును. రసెల్ నియమం ప్రకారం కావు.

నేను: ఈ, ఇది, నేను, నా, మొదలైన సర్వనామాలు ఉపయోగించకుండా ఒక వాక్యం తన గురించి తాను చెప్పుకోగలదా?

ఎడమ నేను: ఆలోచించు. అలాంటి వాక్యాల గురించి యింతకుముందే మనం మాట్లాడుకున్నాం.

నేను: క్రీటనులందరూ ఎప్పుడూ అబద్ధమే చెప్తారని ఒక క్రీటన్ చెప్పడం.

ఎడమ నేను: అవును. అయితే అందులో నేరుగా క్రీటన్ క్రీటనుల గురించి చెప్పినట్టు ఉంది. అలా నేరుగా సూచనలేని వాక్యాలు కూడా తయారు చేయవచ్చు.

నేను:అదెలా?

ఎక్కడో దూరం నుంచి ఒక గొంతు బుసబుసగా వినిపించింది: ‘చివర క్రియాపదంతో అంతమయ్యేదే సరైన తెలుగు వాక్యం.’

నేను: ఓహ్, మనతో పాటు ఎవరో కూడా వస్తున్నారే!

ఎడమ నేను: అవునవును. ఇంతకీ ఆ వాక్యం సంగతేమిటి?

నేను: ఆ వాక్యంలో సర్వనామాలేం లేవు. తానొక తెలుగు వాక్యమై ఉండి, తెలుగు వాక్యాన్ని నిర్వచిస్తోంది. పైగా, క్రియాపదంతో అంతమయ్యేదే సరైన తెలుగు వాక్యం అన్నది ఆ నిర్వచనం. ఆ వాక్యం మాత్రం క్రియతో అంతం కావడం లేదు! అంటే అది చెపుతున్న విషయం తప్పా ఒప్పా?

ఎడమ నేను: సరిగ్గా గుర్తుపట్టావు. అది తన గురించి తాను ప్రతిపాదించుకొనే వాక్యమే. ఒక ప్రతిపాదన నేరుగా తన గురించి తాను చెప్పకపోయినా, ఒక సమూహం గురించి చెపుతూ ఆ సమూహంలో తానొక భాగమైతే అది కూడా ఆత్మసూచన కిందకే వస్తుంది, కానీ ఇందులో తిరకాసుందేమో ఆలోచించు?

నేను: ఆ వాక్యం ఒప్పనుకుంటేనే ఇబ్బంది. తప్పయితే ఏ యిబ్బందీ లేదు. అంటే ఇది అరతిరకాసన్న మాట!

ఎడమ నేను: అవును.

నేను: మరి యిలాంటి వాక్యాలు రసెల్ ప్రకారం శాస్త్ర సమ్మతమైన ప్రతిపాదనలేనా?

ఎడమ నేను: లేదు. ఆత్మసూచన అంటూ ఉన్నది కాబట్టి, రసెల్ నియమం ప్రకారం అది కూడా శాస్త్రసమ్మతమైన ప్రతిపాదన కాదు!

నేను: అంటే తిరకాసేమీ లేకపోయినా ఆత్మసూచన ఉన్న ప్రతిపాదన శాస్త్రసమ్మతం కాదన్నమాట.

ఎడమ నేను: అవును. అలాగే ఏదైనా ఒక నిర్దిష్ట భావాన్ని నిర్వచించేటప్పుడు ఆ నిర్వచనంలో ఆ చెపుతున్న భావం ఒక భాగం కాకూడదు. అంటే ఉదాహరణకు ‘స్వవిశేష విశేషణం’, ‘పరవిశేష విశేషణం’ అనే నిర్వచనాన్ని ఆ పదాలకు తిరిగి అన్వయించడానికి వీలులేదు. ఈ రకంగా అసలు ఆత్మసూచన అనే లక్షణాన్నే తర్క గణితశాస్త్రాలనుండి బహిష్కరించి ఊపిరి పీల్చుకున్నాడు రసెల్.

నేనుకూడా కాస్త ఊపిరి పీల్చుకున్నాను.

నేను: మొత్తానికి ఆత్మసూచనకి జీవిత బహిష్కరణ శిక్ష వేయడంతో తర్క గణిత శాస్త్రాలు హాయిగా ఊపిరి పీల్చుకున్నాయన్న మాట!

ఎడమ నేను: అబ్బే, ఇల్లలగ్గానే పండగా! ఆత్మసూచనను బొత్తిగా కాదంటే అసలు గణితశాస్త్రంలో కొన్ని నిర్వచనాలే అసాధ్యాలైపోతాయి! ‘సమితి’ (Set) అనే ఒక భావాన్ని (concept) తీసుకుంటే, రసెల్ నియమం ప్రకారం ఏదైనా ఒక సమితిని నిర్వచించేటప్పుడు, ఆ నిర్వచనంలో సమితి అనేది భాగం కాకూడదు. అంటే సమితుల సమూహాన్ని మరొక సమితిగా నిర్వచించడం కుదరదు. కానీ గణితశాస్త్రంలో చాలా సమితులను అలా నిర్వచించాల్సిన అవసరం వస్తుంది. అలాంటి నిర్వచనాలు ఎలా సాధ్యం?

నేను: మళ్లీ యిదొక చిక్కా! ఆమాత్రం రసెల్ ఆలోచించలేదా?

ఎడమ నేను: అది ఆషామాషీగా ఆలోచిస్తే తేలే విషయం కాదు మరి! అయినా రసెల్ దానికొక మందు కనిపెట్టాడు.

నేను: ఈ రసెల్ ఎవడో అసాధ్యుడిలా ఉన్నాడే!

ఎడమ నేను: అవును. అలాగే అనుకోవచ్చు. ఇంతకీ అతను చూపిన తరుణోపాయం ఏమిటంటే, ప్రతి భావానికీ ఒక తరగతిని అంటగట్ట వచ్చును. అంటే ఉదాహరణకు సంఖ్యలన్నీ ఒకటవ తరగతికి చెందిన భావాలు అనుకుందాం. అప్పుడు సంఖ్యల సమితి అనేది దానిపై తరగతికి, అంటే రెండో తరగతికి చెందిన భావం అవుతుంది. సంఖ్యా సమితుల సమితి అనేది దానికన్నా పై తరగతికి, అంటే మూడో తరగతికి చెందిన భావం అవుతుంది. ఇలా భావాలను తరగతుల దొంతరగా (hierarchy) నిర్వచించాలి. అప్పుడు ఆత్మసూచన నిషేధ నియమం ఒకే తరగతికి, లేదా అంతకన్నా పై తరగతికి చెందిన భావాల విషయంలోనే వర్తిస్తుంది. అంటే ఒక భావాన్ని నిర్వచించేటప్పుడు, అదే తరగతిలో ఉన్న భావాలను కానీ, అంత కన్నా పై తరగతిలో ఉన్న భావాలను కానీ ఉపయోగించకూడదు. తన కన్నా కింద తరగతిలో ఉన్న భావాలను తన నిర్వచనంలో ఉపయోగించవచ్చును. ఇలాంటి తరగతులతో కూడిన సిద్ధాంతానికి తరగతి సిద్ధాంతం (Type theory) అని పేరు.

నేను: ఆగాగు. నన్ను కొంచెం ఆలోచించుకోనీ.

ఎడమ నేను: సరే నీకు అర్థమవ్వడానికి ఒక ఉదాహరణ యిస్తాను. ఇటుకలతో ఒక గోడ కడుతున్నాం అనుకో. ఒక దానిపై ఒకటిగా, ఇటుకల వరసలని ఒక దొంతరగా పేరుస్తాం కదా.

నేను: అవును.

ఎడమ నేను: అందులో అన్నిటికన్నా కిందనున్న ఇటుకల వరస పైన మరొక ఇటుకల వరస పేరుస్తాం. ఇప్పుడు ఆ కింద వరసలో ఇటుకలని ఆధారం చేసుకొని పై వరసలో ఇటుకలు ఉన్నాయా, పై వరసలో ఇటుకలను ఆధారం చేసుకొని కింద వరసలో ఇటుకలున్నాయా?

నేను: కింద వరసమీద ఆధారపడి పై వరసలో ఇటుకలున్నాయి.

ఎడమ నేను: అలానే ఆ రెండో వరసమీద మరొక వరస వేస్తే, ఆ మూడో వరస ఇటుకలు, కింద రెండు వరసలమీదా ఆధారపడి ఉంటాయి అంతేనా?

నేను: అవును. అలాగే ఒక వరసలో ఇటుకలు తమపై తాము ఆధారపడవు.

ఎడమ నేను: కరెక్ట్. గణితశాస్త్రంలో ప్రతిపాదనలు కానీ నిర్వచనాలు కానీ సరిగ్గా అలా ఒక దొంతరలో ఉండాలన్నది రసెల్ నియమం. ఇలా ఎలాగో అలా మొత్తానికి రసెల్ ఆత్మసూచన వల్ల ఏర్పడే తిరకాసులను ఎదుర్కొని విజయవంతంగా ఒక పటిష్ఠమైన, అంటే దోషరహితమైన, సంపూర్ణమైన గణిత సిద్ధాంతాన్ని తయారు చేశాడు. చేశానని అనుకున్నాడు.

నేను: మళ్లీ ఆ ‘అనుకున్నాడు’ ఏమిటి? నిజంగా తయారు చేయలేదా?

ఎడమ నేను: దాని గురించి తర్వాత చెప్పుకుందాం కానీ ముందిది ఆలోచించు. తనను తాను (పూర్తి వాక్యాన్ని) సూచించే సర్వనామాలు ఉపయోగించకుండా, అలాగే తానుండే ఒక సమూహాన్ని నేరుగా సూచించకుండాను, తన గురించి తాను ప్రతిపాదించే వాక్యం ఏదైనా తయారు చేయగలవా?

మళ్లీ ఇంకొక భేతాళ ప్రశ్న! ఈసారి నానుండి అంత వేగిరం సమాధానం రాదని ఎడమ నేనుకి తెలిసిపోయింది.

ఎడమ నేను: దీని గురించి తీరికగా ఆలోచించు, తొందరేమీ లేదు.

నేను: అలాగే. అయితే ఆత్మసూచన విసిరిన సవాళ్ళ గురించి ఆలోచించినది ఒక్క రసెలేనా, ఇంకెవరైనా కూడా ఉన్నారా?

ఎడమ నేను: ఇంకా ఉన్నారు. అయితే అతని తర్వాత వచ్చిన శాస్త్రజ్ఞులు చాలా వరకూ అదే రసెల్ చూపిన దారిలోనే వెళ్ళారు. టార్‌స్కీ (Alfred Tarski) అనే పోలిష్ శాస్త్రవేత్త 1930లో భాషకి కూడా అలాంటి ఒక సిద్ధాంతాన్ని తయారు చేశాడు.

నేను: అంటే?

ఎడమ నేను: మనం చేసే ప్రతిపాదనలు ఒక భాష ద్వారానే కదా చేస్తాం?

నేను: అవును.

ఎడమ నేను: అయితే ఆ ప్రతిపాదనలు భౌతిక జగత్తులోని అంశాల గురించి కావచ్చు, లేదా భాషకి సంబంధించినవే కావచ్చు.

నేను: అంటే?

ఎడమ నేను: మచ్చుకి, ‘పాలు తెల్లగా ఉంటాయి’ అనేది ఒక తెలుగు వాక్యం. అందులో ‘పాలు’, ‘తెలుపు’ అనేవి భాషలోని అంశాలు కావు. భౌతిక జగత్తులో ఉన్న వస్తువులు, వాటికున్న గుణాలూను. వాటి గురించిన ప్రతిపాదన ఒక తెలుగు వాక్యంలో చేశాం. అవునా?

నేను: అవును.

ఎడమ నేను: అలాగే కొన్నిసార్లు మనం చేసే ప్రతిపాదనలు ఆ భాషకి సంబంధించినవే కూడా అవుతాయి. మచ్చుకి ‘తెలుగులో ఏబైయ్యారు అక్షరాలున్నాయి’ అనే వాక్యం.

నేను: అవునవును! ‘చివర క్రియాపదంతో అంతమయ్యేదే సరైన తెలుగు వాక్యం’ అన్నది కూడా అలాంటిదే కదా!

ఎడమ నేను: సరిగ్గా చెప్పావు. ఇవి ఒక భాష గురించి అదే భాషలో చేస్తున్న ప్రతిపాదనలు. టార్‌స్కీ సిద్ధాంతం ప్రకారం, అలాంటి వాక్యాలను వేరే తరగతికి చెందిన భాషగా గుర్తించాలి. దీనిని అతను మెటా-లేంగ్వేజ్ అంటాడు. భౌతిక వస్తువుల గురించి చెప్పే భాష ఒకటో తరగతికి చెందినదైతే, భాషను గురించి చెప్పే భాష రెండో తరగతికి చెందుతుంది. ఈ రకంగా అతను భాషల దొంతరను నిర్వచించాడు. అలా భాషలను దొంతరగా రూపొందిస్తే అప్పుడు అందులో ఆత్మసూచన ఉండదనీ, తద్వారా వచ్చే తిరకాసులను అధిగమించ వచ్చుననీ సిద్ధాంతం చేశాడు.

నేను: కానీ వ్యాకరణం అంతా ఒక భాష గురించి, అదే భాషలో చేసిన ప్రతిపాదనలే కదా! ఇందులో దొంతర ఎక్కడుంది?

ఎడమ నేను: నిజమే. టార్‌స్కీ చేసిన సిద్ధాంతం శాస్త్రీయ భాషలకు (Formal Languages)[17] వర్తిస్తుంది తప్ప, సహజ భాషలకు (Natural languages) వర్తించదు. సహజ భాషలలో ఆత్మసూచన అనివార్యం, దాని ద్వారా ఏర్పడే తిరకాసులను తప్పించుకోనూ లేము!

నేను: హమ్మయ్య! అయితే మామూలుగా మనం మాట్లాడుకొనే భాషల్లో యథేచ్ఛగా తిరకాసులను సృష్టిస్తూనే ఉండొచ్చన్న మాట!

ఎడమ నేను: ఆహా, భేషుగ్గా! ఆత్మసూచన గురించీ దానివల్ల ఏర్పడే పేరడాక్సుల గురించీ తత్త్వవేత్తలు, తర్కశాస్త్రజ్ఞులూ ఇప్పటికీ ఆలోచనలు సాగిస్తూనే ఉన్నారు. కొంతకాలం కిందట జోర్గెన్‌సెన్ (Jorgen Jorgensen) అనే తత్త్వశాస్త్రవేత్త అసలు ఆత్మసూచన అన్నదే బూటకమని, దానివల్ల ఏర్పడ్డవని చెపుతున్న పేరడాక్సులన్నింటినీ చాలా తేలికగా పరిష్కరించవచ్చుననీ ఒక ఆసక్తికరమైన వాదన చేశాడు.[18]

నేను: ఇంత కథా చెప్పి ఆఖరికి అసలు ఆత్మసూచనే బూటకమనడం అన్యాయం!

ఎడమ నేను: తర్కానికి సత్యాసత్యాలతోనే తప్ప న్యాయాన్యాయాలతో పెద్దగా సంబంధం లేదు!

నేను: ఇంతకీ ఏమిటిట జోర్గెన్‌సెన్ వాదన?

ఎడమ నేను: భాషలో ఎప్పుడూ ఒక పదం కానీ వాక్యం కానీ వేరొక విషయానికి చిహ్నం, అంటే గుర్తు. అలా సూచించబడే విషయం వేరే ఒకటి అప్పటికే ఉండాలి. అందువల్ల ఏ పదమూ వాక్యమూ తనకి తానే గుర్తు కాలేదు. అలా జరిగితే అసలది ఏ అంశాన్నీ సూచించకుండా పోతుంది కదా. అంటే తమని తాము సూచించుకొనే వాక్యాలంటూ ఉండేందుకు వీలులేదు. ఒకవేళ ఉన్నా అవి అర్థరహితమైన వాక్యాలు. ఇక వాటి తప్పొప్పుల ప్రసక్తే లేదు! అంచేత వాటిలో తిరకాసు అంటూ ఏం లేదు. ఇదీ ప్రధానంగా అతని వాదం.

నేను: ఊఁ. ఇది కొంత అతివాదంగా అనిపించినా ఆలోచించదగ్గ వాదమే అనిపిస్తోంది.

ఎడమ నేను: సరే అలాగే ఆలోచించు. మాటల్లో పడి చాలా దూరమే వచ్చేశాం. ఇప్పటికి, ఇవీ స్థూలంగా ఆత్మసూచన సృష్టించే తిరకాసులూ, వాటి గురించి పాశ్చాత్యుల దృక్పథమూను.

నేను: బావుంది. అవునూ మరి దీని గురించి పాశ్చాత్య మేధావులేనా ఆలోచించినది, మన భారతీయులెవరూ ఆలోచించలేదా? వాళ్ళకీ తిరకాసుల గురించి తెలియలేదా?

ఎడమ నేను: ఎందుకు లేదు. ఒకరకంగా పాశ్చాత్య దృక్పథం గురించిన కథ ఎక్కడ ఆగిందో భారతీయ చింతన గురించిన కథ అక్కడ మొదలవుతుంది!

నేను: అవునా! మరెందుకింక ఆలస్యం, చెప్పు చెప్పు.

ఎడమ నేను: మరీ అంత తొందరైతే ఎలా! ప్రయాణంలో కాస్త విశ్రాంతి విరామం ఉండొద్దూ. అంచేత మళ్లీ కలుద్దాం.

అలా అంటూ ఎడమ నేను నాలోకి జారుకుంది, నా ఉత్సాహమ్మీద నీళ్ళు జల్లి. అయినా యిదీ ఒకందుకు మంచిదే. ఇప్పటి దాకా విన్న విషయాలన్నీ నెమరేసుకోడానికి నాకూ కొంత సమయం కావాలి. మీకు మాత్రం వద్దూ. అంచేత మనం కూడా మళ్లీ కలుద్దాం!

అధస్సూచికలు
ఇలాంటి కథ అనేక రూపాలలో కనిపిస్తుంది. ఈ కథను Anton Dumitriu (1905-1992) అనే రొమానియన్ తత్త్వవేత్త పేర్కొన్నాడు. ఇలాంటి మరిన్ని తిరకాసు కథలను Florin Vasiliu రచించిన Paradoxism’s Main Roots అనే పుస్తకంలో చూడవచ్చు.

Paradoxని ఇంతకు ముందు కొందరు ‘విరోధాభాస’గా అనువదించారు. విరోధాభాసలో విరోధ ఆభస మాత్రమే – అంటే ఉన్నట్టు కనిపించినా నిజానికి విరోధం లేనిది. కానీ చాలా పేరడాక్సుల్లో నిజంగానే విరోధం ఉంటుంది. ఇంతకుముందు కనకప్రసాద్ గారు తన వ్యాసాల్లో పేరడాక్సుని తిరకాసు అన్నారు. నాకది నచ్చి దానినే ఉపయోగిస్తున్నాను.

Insolubilia అన్న పేరుతో మధ్యయుగాలలో Liar’s Paradox అనేక రూపాలలో కనిపిస్తుంది, Albertus of Saxonia అనే జర్మన్ తత్త్వవేత్త తన Perutilis logica అనే పుస్తకంలో ఈ Liar’s Paradoxకి మొత్తం19 రూపాలను చూపించాడు. అందులో కొన్ని రూపాలను Paradoxism’s Main Roots పుస్తకంలో చూడవచ్చు.

క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన Epimenides of Knossos అనే క్రీటన్ తత్త్వవేత్త ఈ వాక్యం చెప్పినట్టుగా కనిపిస్తుంది. అతని పేర యీ తిరకాసును Epimenides paradox అంటారు. అయితే Epimenides దీనిని పేరడాక్సుగా పేర్కొనలేదు. తర్వాతి తత్త్వవేత్తలు అందులోని తిరకాసుని గుర్తించి దానికా పేరు పెట్టారు.

క్రీ.పూ. 4వ శతాబ్దానికి చెందిన Eubulides of Miletus అనే గ్రీకు తత్త్వవేత్త ఈ పేరడాక్సుని పేర్కొన్నట్టుగా చరిత్రకారులు చెపుతున్నారు.

ఈ రూపం మరింత బలవత్తరమైన తిరకాసు! ‘ఈ వాక్యం అబద్ధం’ అనే వాక్యం నిజమా అబద్ధమా అని తేల్చలేం. అయితే ఆ వాక్యం నిజమూ అబద్ధమూ కాకుండా ఉండే అవకాశం ఉంది. కానీ ‘ఈ వాక్యం నిజం కాదు’ అనే వాక్యం నిజమూ అబద్ధమూ కాకుండా పోయినా అది నిజమవ్వాల్సిన అవసరం వస్తుంది. కానీ నిజం అయితే నిజం కాకుండాపోవాలి!!

ఈ రూపం కూడా బలవత్తరమైన రూపమే. ఈ వాక్యం నిజమైతే వట్టి అబద్ధమే కావాలి, కానీ అలా జరగలేదు. పోనీ అబద్ధమే అనుకుంటే అప్పుడది నిజమై కూర్చుంటుంది. పోనీ నిజమూ అబద్ధమూ అవుతుందని అనడానికీ లేదు. ‘వట్టి అబద్ధం’ అంటే అబద్ధమే తప్ప నిజం అవ్వడానికి వీలులేదు కదా!

దీనిని Grelling–Nelson paradox అంటారు.

ఇది Barber’s Paradoxగా తర్కశాస్త్రంలో చాలా ప్రసిద్ధి చెందింది.

క్రీ.శ. 1901లో రసెల్ కనుగొన్న పేరడాక్సు, Russell’s paradoxగా ప్రసిద్ధి చెందింది. ఇది అర్థం కావాలంటే గణితంలో సమితుల గురించి తెలియాలి. సమితి అంటే కొన్ని వస్తువుల సమూహం. కొన్ని సమితుల సమూహాన్ని కూడా మరొక సమితిగా నిర్వచించవచ్చు. అలాంటి ఒక సమితుల సమితిలో తిరిగి అదే సమితి ఉండగలదా లేదా? ఉండవచ్చు లేకపోవచ్చు. ఇది ఒకరకమైన ఆత్మసూచన. ఇప్పుడు, తనలో తానే సమితిగా లేని సమితులన్నింటినీ కలిపి ఒక సమితిగా నిర్వచించామనుకోండి. అలాంటి సమితిలో తాను ఉంటుందా ఉండదా అన్నది ప్రశ్న. ఇది ఒక బ్రహ్మాండమైన తిరకాసు. ఉంటుందని అనుకుంటే ఉండదని తేలుతుంది, ఉండదని అనుకుంటే ఉంటుందని తేలుతుంది!

అరిస్టాటిల్ ముఖ్యరచన Metaphysics 12.9 (1074b34)లో యిది వస్తుంది. గ్రీకులో దీని రూపం: ‘hê noêsis noêseôs noêsis’. దాన్ని నండూరి రామమోహనరావు తన విశ్వదర్శనంలో యిలా తెలుగులోకి అనువదించారు.

దీన్ని ఇంగ్లీషులో Law of excluded middle అంటారు.

దీన్ని ఇంగ్లీషులో Law of noncontradiction అంటారు.

ఈ వాద పద్ధతిని పూర్వం లాటిన్ భాషలో Reductio ad absurdum అనేవారు. భారతీయ న్యాయశాస్త్రంలో దీనిని ‘ప్రమాణ బాధిత అర్థప్రసంగం’ అని పేర్కొన్నారు.

అలా వెల్లువెత్తిన తిరకాసుల్లో కొన్ని ముఖ్యమైనవి – Burali-Forti paradox (1897), Cantor’s paradox (1899), Russell’s paradox (1901), Richard paradox (1905), Berry’s paradox (1908), Grelling–Nelson paradox (1908)

An analysis of the paradoxes to be avoided shows that they all result from a kind of vicious circle. The vicious circles in question arise from supposing that a collection of objects may contain members which can only be defined by means of the collection as a whole.- Whitehead, Alfred North, and Bertrand Russell. PRINCIPIA MATHEMATICA. Volume I, Chapter II, Section I: The Vicious Circle Principle.

Formal Languages ప్రధానంగా గణితంలోనూ కంప్యూటర్ శాస్త్రంలోనూ వస్తాయి. ఈ భాషలలో కొన్ని మౌలికమైన సింబల్స్ ఉంటాయి. వాటిని కొన్ని నిర్దిష్టమైన సూత్రాల ద్వారా కలిపి పదాలను సృష్టిస్తారు. అలాంటి పదాలను మళ్లీ కొన్ని నిర్దిష్టమైన సూత్రాలను అనుసరించి వాక్యాలుగా నిర్మిస్తారు. కంప్యూటర్ భాషలన్నీ అలా తయారుచేసిన ఫార్మల్ భాషలే.

Jorgen Jorgensen – SOME REFLECTIONS ON REFLEXIVITY Mind, Volume LXII, Issue 247
-------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, January 29, 2019

వేయిపడగలు-గాన్ విత్ ద విండ్: 4. వైరుధ్యం వర్సెస్ వైవిధ్యం


వేయిపడగలు-గాన్ విత్ ద విండ్: 

4. వైరుధ్యం వర్సెస్ వైవిధ్యం






సాహితీమిత్రులారా!

మెలనీ-రెట్ బట్లర్
గాన్ విత్ ద విండ్ రచయిత్రి అత్యంత హృద్యంగా చిత్రించిన అనుబంధం మెలనీ-రెట్ బట్లర్‌లది. పైపైన చూస్తే మెలనీ-రెట్ బట్లర్‌ల స్వభావాలు ఉత్తర, దక్షిణ ధ్రువాలనిపిస్తాయి. వెనకటి వ్యాసంలో చెప్పినట్టు, మెలనీ ప్రశాంతగంభీరంగా ప్రవహించే నది అయితే, రెట్ గల గలా చప్పుడు చేస్తూ ఆర్భాటంగా దూకే జలపాతం. మళ్ళీ పైపైనే చూస్తే రెట్‌ది కళంకిత చరిత్ర అయితే, ఎలా చూసినా మెలనీది నిష్కళంక చరిత్ర. రెట్‌ది స్థిరమైన విలువల మైలురాళ్ళు ఏవీ లేని జీవనగమనం అయితే, ఆయా సందర్భాలలో సడలింపును పాటించినప్పటికీ మెలనీది అలాంటి జీవనగమనం కాగల అవకాశమే లేదు. ఈ తేడాలలోనే ఇద్దరి మధ్యా పోలికలను ప్రస్ఫుటింపజేయడంలో మానవస్వభావవైవిధ్యం పట్ల అపారమైన అవగాహనను, పాత్రనిర్మాణ దక్షతను రచయిత్రి చాటుకుంటుంది. ఈ పోలికలే ఇద్దరి మధ్యా ఒక అపురూపమైన ఆత్మీయబంధాన్ని కల్పిస్తాయి.

ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోడంలోనైనా గొప్ప ఇంగితజ్ఞానాన్ని కనబరచడం, తదనుగుణంగా ఎప్పటికప్పుడు తమ వ్యవహార శైలిని సవరించుకోవడం ఇద్దరి మధ్యా ఒక ముఖ్యమైన పోలిక. ఇద్దరి జీవితం నుంచీ ఇందుకు సంబంధించిన ఉదాహరణలను గత వ్యాసాలలో చూడవచ్చు. నవలలోని మిగిలిన ఏ పాత్రలలోనూ లేనంత ఆలోచనావైశాల్యం ఇద్దరి మధ్యా ఇంకొక పోలిక. మళ్ళీ ఇందులో మెలనీదే పైచేయి. రెట్‌ను కూడా తన ప్రభావపరిధిలోకి తెచ్చుకుని, తన ఆధిక్యం ముందు శిరసు వంచేలా చేయగలిగిన భావవైశాల్యం ఆమెది. వ్యక్తులు, పరిస్థితులపై మానవీయతతో స్పందించడంలోనూ, స్వల్ప పరిచయంలోనే ఎదుటివారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలగడంలోనూ ఇద్దరి మధ్యా అతికినట్టు కుదిరిన మరో రెండు పోలికలు.

బార్బిక్యూ విందులో మెలనీ, రెట్ ఇద్దరూ పాల్గొంటారు కాని, వారిమధ్య పరిచయం, సంభాషణ ఉండవు. ఆ తర్వాత మెలనీని రెట్ చూసేది అట్లాంటాలో సైనికుల సహాయార్థం జరిగిన పార్టీలోనే. అప్పుడు స్కార్లెట్‌తోపాటు మెలనీ కూడా తన పెళ్లి ఉంగరాన్ని విరాళంగా ఇవ్వడాన్ని అతను గమనిస్తాడు. ఆ మరునాడు, రెట్ లాంటి కళంకితునితో నృత్యం చేయడాన్ని ఆంట్ పిటీపాట్ తప్పుపట్టి స్కార్లెట్‌ను మందలించినప్పుడు, మెలనీ జోక్యం చేసుకుని రెట్ చెడ్డవాడంటే తను నమ్మదని, అతను పరిపూర్ణమైన పెద్దమనిషిలా కనిపిస్తున్నాడనీ అంటుంది.

ఈ మాటలు జరుగుతున్న సమయంలోనే రెట్ నుంచి మెలనీకి ఒక కవరు అందుతుంది. దానిని తెరచి చూడగానే మెలనీ కళ్ళు జలజలా వర్షిస్తాయి. అందులో తను విరాళంగా ఇచ్చిన పెళ్లి ఉంగరం, రెట్ రాసిన లేఖ ఉంటాయి. కాన్ఫెడరసీకి మగవాళ్ళ ప్రాణాలు అవసరమైతే కావచ్చు కాని, ఆడవాళ్ళు ప్రాణప్రదంగా భావించే వాటిని కూడా ఇమ్మని అడిగే అవసరం దానికి ఇంకా కలగలేదు. నువ్వు చూపిన సాహసం పట్ల నా గౌరవానికి గుర్తుగా దీనిని స్వీకరించగలవు. నీ త్యాగం వృథా అయిందని అనుకోవద్దు. ఈ ఉంగరం విలువకు పదిరెట్లు చెల్లించి తీసుకున్నాను– అని ఆ లేఖలో ఉంటుంది. అతని అభిమానానికి చలించిన మెలనీ, ‘చూశావా, అతను ఎంత పెద్దమనిషో’నని ఆంట్‌తో అంటుంది. పెళ్లి ఉంగరాన్ని త్యాగం చేయడంతో సహా స్కార్లెట్, మెలనీల వ్యక్తిత్వాల మధ్య తేడాను మెలనీతో తొలి పరిచయంలోనే రెట్ గ్రహిస్తే, అతను పెద్దమనిషన్న సంగతిని మెలనీ గ్రహిస్తుంది. ఎదుటివారిని ఇట్టే అంచనా వేయగల అసాధారణ వివేకంలో ఇద్దరి మధ్యా ఉన్న సామ్యాన్ని ఈ ఉదాహరణల ద్వారా రచయిత్రి ఎంతో నేర్పుతో సూచిస్తుంది. స్కార్లెట్ కూడా రెట్ మనసులో స్థానం సంపాదించుకున్నదే కాని, ప్రస్తుత సందర్భంలో ఒక్క మెలనీ పెళ్లి ఉంగరాన్ని మాత్రమే కొని పంపడం ద్వారా ఇద్దరి మధ్యా వ్యత్యాసాన్ని ఎత్తిచూపడంలో అతను ఏమాత్రం మొహమాటపడడు. స్కార్లెట్ పట్ల అతనిది ఆకర్షణ అయితే, మెలనీ పట్ల అపారమైన గౌరవం.

తొలి పరిచయంలోనే ఒకరిపై ఒకరికి కలిగిన గౌరవభావం రెట్, మెలనీలలో చివరివరకూ అలాగే ఉండిపోయి, పరస్పరాభిమానంగా వికసిస్తుంది. భర్త ఆష్‌లీ సమాచారం కోసం మెలనీ టెలిగ్రాఫ్ ఆఫీసుకు వెళ్ళి అలసటతో స్పృహ తప్పి పడిపోయినప్పుడు, అటువైపు వచ్చిన రెట్ ఆమెను చూసి, గర్భవతి అని గ్రహించి ఇంటికి తీసుకువెళ్లి దింపుతాడు. భర్త సమాచారం కోసం ఇలా కష్టపడవద్దని మందలించి ఆ బాధ్యతను తను తీసుకుంటాడు. ‘నీ గురించి జనం అంత దారుణంగా ఎలా మాట్లాడతా’రంటూ అప్పుడు మెలనీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అతను వెళ్ళిపోయిన తర్వాత, ‘అతని గురించి ఎవరేం చెప్పినా సరే నా ఇంటి తలుపులు అతనికి జీవితాంతమూ తెరచుకునే ఉంటా’యని ఆంట్ పిటీపాట్, స్కార్లెట్‌ల ముందు మెలనీ ప్రకటిస్తుంది. ఆమాటల్లో, పైకి కనిపించే ఆమె స్వభావానికి భిన్నమైన అనుశాసనము, నిష్కర్ష ధ్వనిస్తాయి.

నాటి దక్షిణాది సాంప్రదాయిక సమాజంలో మగవాళ్ళకు, అందులోనూ అవివాహిత పురుషులకు గర్భవతి ఎదురుపడకూడదు. ఆ ప్రస్తావన, అందుకు సంబంధించిన చర్చ మగవారి నోట వినిపించకూడదు. అలాంటి సంకోచాలేవీ లేని రెట్, మెలనీ గర్భవతి అన్న సంగతిని తన ముందు ప్రస్తావించినప్పుడు స్కార్లెట్ సైతం విస్తుపోయి పెద్ద తప్పు జరిగిపోయినట్టు బాధపడుతుంది. యుద్ధం అట్లాంటాలోకి అడుగుపెట్టిన ఉద్రిక్తఘట్టంలో రోజుల బాలెంతగా ఉన్న మెలనీతో కలసి స్కార్లెట్ టారాకు బయలుదేరినప్పుడు, మెలనీని రెట్ ఎత్తుకుని తీసుకెళ్ళి బండిలోకి చేర్చుతాడు. అప్పుడు కూడా స్కార్లెట్ సిగ్గుతో చితికిపోతుంది. కానీ విశేషమేమిటంటే, రెట్‌కే కాదు, మెలనీకి కూడా అది తప్పుగా కనిపించదు. సమయానుకూలంగా స్పందించగల వివేకంలో ఇద్దరికీ గల సామ్యాన్ని వెల్లడించే సందర్భాలలో ఇదొకటి.

ఇతరులతో మాట్లాడేటప్పుడు సాధారణంగా పారుష్యం, అధిక్షేపం, వ్యంగ్యం ధ్వనించే రెట్ గొంతు మెలనీ దగ్గరికి వచ్చేసరి మారిపోతుంది. ఆ గొంతులో గొప్ప గౌరవం, మర్యాద, మన్నన ఉట్టిపడతాయి. టారాకు బయలుదేరిన స్కార్లెట్, మెలనీలతోపాటు బండిలో కొంత దూరం వెళ్ళిన రెట్, ఆ తర్వాత వారిని విడిచిపెట్టి తను సైన్యంలో చేరడానికి నిర్ణయించుకున్నప్పుడు; అతనికీ స్కార్లెట్‌కు మధ్య ఏకాంత సంభాషణ జరుగుతుంది. శత్రువునుంచి ప్రమాదం అన్నివైపులా పొంచి ఉన్న అలాంటి భయోద్విగ్న క్షణాలలో స్కార్లెట్ పట్ల మోహాన్ని పట్టలేక రెట్ ఆమెను ఆలింగనం చేసుకుని చుంబించబోతే స్కార్లెట్ అతని చెంప ఛళ్ళుమనిపించి, ఇంకెప్పుడూ నీ మొహం చూడనంటుంది. నవ్వుకుంటూ అతను అక్కడినుంచి బండి దగ్గరకు వచ్చి, మెలనీని జాగ్రత్తగా చూసుకోమని వాళ్ళతో ఉన్న డార్కీ బాలిక ప్రిస్సీకి(Prissy) చెప్పి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో అతని మాటతీరు మారిపోతుంది.

సాంప్రదాయిక సమాజంలోని మంచినంతటినీ పుణికిపుచ్చుకున్న మెలనీని, ఆమె ప్రాతినిధ్యం వహించే విలువలను సంరక్షించే బాధ్యతను రెట్ తీసుకున్నాడా అన్నట్టుగా వారిరువురి అనుబంధ చిత్రణ ఉంటుంది. యుద్ధానంతర పునర్నిర్మాణ ఘట్టంలో మెలనీ ప్రభావము, ప్రాధాన్యము ఒక్కసారిగా పెరగడం, ఆమెపై మొదటినుంచీ అతనికున్న అంచనాకు తిరుగులేని నిరూపణ అవుతుంది. తను విపరీతమైన మమకారం పెంచుకున్న కూతురు బానీని సాంప్రదాయిక విలువలతో పెంచాలనుకున్న రెట్‌కు మెలనీ ఒక్కతే అందుకు పెద్ద ఆశాకిరణంలా కనిపిస్తుంది. ఈ విషయంలో మనకు సాయపడగలిగింది మెలనీ ఒక్కతే. ఆమెను దూరంగా ఉంచడానికీ, అవమానించడానికీ నువ్వు చేయవలసిందంతా చేశావు. ఆమె పేదరికాన్నీ నాసిరకం దుస్తులనూ ఎత్తిచూపుతూ నా దగ్గర ఎద్దేవా చేయద్దు. అట్లాంటాలో నిక్కమైన, నికార్సైన ప్రతిదానికీ ఆత్మా, కేంద్రస్థానమూ తనే-నని స్కార్లెట్‌తో అంటాడు.

అట్లాంటాలో ఒక మిల్లు, స్టోరు నడుపడంలో శ్రమిస్తూ స్కార్లెట్ ఆరోగ్యం పాడుచేసుకుంటోందన్న కారణంతో ఆష్‌లీకి తెలియకుండా తనే అతనికి డబ్బిచ్చి మిల్లు కొనిపించడంలోనూ మెలనీ పట్ల, ఆమె కుటుంబం పట్ల రెట్ సంరక్షకస్పృహతోనే వ్యవహరించినట్టు కనిపిస్తుంది. ఆ సందర్భంలో మెలనీకి, అతనికి జరిగిన సంభాషణ ఆమె వ్యక్తిత్వానికే కాదు, రెట్ వ్యక్తిత్వంపట్ల ఆమె అవగాహనకూ అద్దం పడుతుంది. తను డబ్బు ఇచ్చిన సంగతి ఆష్‌లీకి తెలియకూడదని రెట్ అన్నప్పుడు, భర్తను తను మోసగించలేనని, అతని వద్ద తనకు రహస్యాలు ఉండవని మెలనీ అంటుంది. అప్పుడు స్కార్లెట్ కోసం ఈమాత్రం చేయలేవా అన్నప్పుడు మెత్తబడుతుంది. మిల్లు యజమానిగా ఆష్‌లీ బాగా డబ్బు సంపాదించవచ్చనీ నీ కొడుకు మంచి యూనివర్సిటీలో చదివి వృద్ధిలోకి వస్తాడనీ అన్నప్పుడు, తల్లి మనసుకు హత్తుకునేలా ఉన్న ఆ మాటల వెనుక గడుసుదనాన్ని చటుక్కున అర్థంచేసుకున్న మెలనీ చిరునవ్వు నవ్వి, ‘పుస్తకం చదివినట్టు నిన్ను చదవగలను.’ అని రెట్‌తో అంటుంది. నీ మంచితనం కొద్దీ నాకు సహాయం చేయాలనుకుంటున్నావు కానీ, నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని. ప్రపంచంలో ఏ ఆడదైనా కోరుకునేవన్నీ నాకు ఉన్నాయి– అంటుంది. ఆ మాటకు రెట్ సమస్థాయిలో స్పందిస్తూ, ‘అవి నీకు ఎప్పుడూ ఉండేలా చూడడమే నేను కూడా కోరుకునేది.’ అంటాడు.

రెట్‌పై మెలనీ ప్రభావాన్ని పతాకస్థాయిలో ప్రదర్శించిన సందర్భం, బానీ దుర్మరణం. తను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురి మరణాన్ని రెట్ తట్టుకోలేకపోతాడు. పిచ్చిపట్టినట్టు అయిపోతాడు. మృతదేహానికి అంత్యక్రియలు జరపడానికి కూడా వీలు లేకుండా మూడు రోజులపాటు గదిలో తన దగ్గరే ఉంచుకుని తలుపులు బిగించుకుంటాడు. ఆ సమయంలో అతన్ని సమీపించడానికి కూడా ఎవరికీ ధైర్యం చాలదు. పరిచారిక మామీ ద్వారా ఈ విషయం తెలుసుకున్న మెలనీ రెట్ ఇంటికి వెళ్ళి గది తలుపులు తీయించి అంత్యక్రియలకు ఒప్పించడమే కాదు; అతని చేత అన్నం తినిపిస్తుంది.

మెలనీ రెండోసారి గర్భవతై, కడుపు పోయి మృత్యుముఖంలో ఉండి స్కార్లెట్‌ను చూడాలనుకున్నప్పుడు రెట్ ఆమెను తీసుకుని మెలనీ ఇంటికి బయలుదేరతాడు. స్కార్లెట్‌కు ఆమె గర్భవతి అన్న సంగతి కూడా అప్పటికి తెలియదు. ‘నీకు తెలుసా? తను కచ్చితంగా నీకు చెప్పి ఉండదు,’ అని రెట్‌తో అంటుంది. ‘ఆమె చెప్పక్కర్లేదు. నేను గ్రహించగలను. గత రెండు మాసాలుగా ఆమె చాలా సంతోషంగా ఉంది. అందుకు మరో కారణం ఏదీ లేదన్న సంగతి నాకు తెలుసు.’ అని రెట్ అంటాడు. ‘కడుపు పోయినంత మాత్రాన చనిపోతారా, నేను చనిపోయానా!’ అని స్కార్లెట్ సందేహం వ్యక్తం చేసినప్పుడు, ‘నీకున్న దారుఢ్యం ఆమెకు లేదు. ఆమె కసలు ఎలాంటి దారుఢ్యమూ లేదు. ఒక్క హృదయం తప్ప ఆమెకు ఇంకేమీలే’దని రెట్ అంటాడు.

మెలనీ మృత్యుముఖంలో ఉన్న ఆ క్షణాలలో అతని మాట తీరే కాదు, మనిషి తీరే మారిపోతుంది. స్కార్లెట్‌ను మెలనీ ఇంటిదగ్గర దింపి తన ఇంటికి తిరిగి వచ్చేసిన రెట్, డైనింగ్ హాలులో ఒంటరిగా కూర్చుండిపోతాడు. కాసేపటి తర్వాత ఇంటికి తిరిగివచ్చిన స్కార్లెట్ వైపు బరువు, అలసట నిండిన కళ్ళతో తదేకంగా చూస్తాడు. ఆ కళ్ళలో ఎప్పుడూ ఉండే వెలుగు లేదు. ఆ ముఖంలో ఎలాంటి భావమూ లేదు. ఎప్పటిలా వెక్కిరింపుగా పెదవి విరవడమూ లేదు. ఆమెవైపు చూసి, వచ్చి కూర్చోమని చెప్పి, ‘ఆమె చనిపోయిందా?’ అని అడుగుతాడు. అతని తీరు స్కార్లెట్‌కు కొత్తగా అనిపించి భయంగొలుపుతుంది. అతని చూపుల్లో ప్రశాంతత, ఒకవిధమైన కారుణ్యమూ తొంగిచూస్తాయి. అతని ప్రశ్నకు ఆమె తల ఊపుతుంది. ‘భగవంతుడు ఆమె ఆత్మకు శాంతి ప్రసాదించుగాక!’ అని భారంగా అన్న అతను, ‘నాకు తెలిసి సంపూర్ణ కారుణ్యం మూర్తీభవించిన ఏకైక వ్యక్తి ఆమె.’ అంటాడు. ఆ మాటతో మెలనీ తనపట్ల చూపించిన ప్రేమాదరాలు గుర్తొచ్చి స్కార్లెట్‌లో దుఃఖం కట్టలు తెంచుకుంటుంది. ‘నువ్వు నాతో ఎందుకు రాలేదు? నేను తట్టుకోలేకపోయాను. నువ్వు నాతో ఉంటే బాగుండేదనిపించింది,’ అంటుంది. ‘నేను అసలే తట్టుకోలేకపోయేవాడి’నంటాడు రెట్. కాసేపు మౌనంగా ఉండిపోయి, ఆ తర్వాత, అతి ప్రయత్నంమీద, ‘ఆమె ఒక మహోన్నత మహిళ!’ అంటాడు. తనలో బాల్యంలోనే అంతరించిందనుకున్న తీవ్రభావోద్వేగం ఒక్కసారిగా ఎగతన్నుకు వచ్చిన ఆ క్షణాలలో ఇదే మాట అతని నోట మరోసారి వెలువడుతుంది.

విశేషమేమిటంటే, మెలనీ-రెట్‌ల మధ్య రచయిత్రి చిత్రించిన అనుబంధం కేవలం వ్యక్తిగతం కాదు; అంతకు మించిన సామాజిక వైశాల్యం దానికి ఉంది. రెట్ పాత్రను ముందునుంచీ మలచిన తీరుతోను, నాటి సాంప్రదాయిక ప్లాంటర్‌ల సమాజంలో అతని స్థానం గురించి మధ్య మధ్య చేస్తూవచ్చిన వ్యాఖ్యలతోనూ కలుపుకుని ఈ ఇద్దరి అనుబంధాన్ని పరిశీలించినప్పుడు దానికిగల సామాజిక పార్శ్వం అర్థమవుతుంది. రెట్ జూదరి, వ్యభిచారి, తప్పుడు పద్ధతుల్లో డబ్బు గడించినవాడు. ప్లాంటర్‌ల సమాజం పెద్దమనిషిగా గుర్తించగల లక్షణం అతనిలో ఒక్కటి కూడా లేదు. కన్నతండ్రితోపాటు ప్లాంట‌ర్‌ల సమాజం మొత్తం అతన్ని వెలివేసింది. తన స్వస్థలమైన చాల్స్‌టన్‌లో తనను ఆహ్వానించే కొంప ఒక్కటీ లేదని అతనే చెప్పుకుంటాడు. అట్లాంటాలోనూ దాదాపు అదే పరిస్థితి. జూదరిగా అతన్ని ఈసడించుకోవడంలోనూ ప్లాంటర్‌ల సమాజంలోని వైరుధ్యాన్ని, డాంబికత్వాన్ని రచయిత్రి అడుగడుగునా ఎత్తిచూపుతుంది. జూదంలో డబ్బు, ఇళ్ళు, భూమి, బానిసలను కోల్పోయిన అన్నో తమ్ముడో తండ్రో లేదా బంధువో లేని కుటుంబం జార్జియా రాష్ట్రం మొత్తంలోనే లేదని, అయినప్పటికీ సమాజం అలాంటి వ్యక్తిని పెద్దమనిషిగానే గుర్తిస్తుందని, అదే రెట్ లాంటి వృత్తిజూదరినైతే అస్పృశ్యుడిగా పరిగణించి వెలివేస్తుందనీ ఒకచోట అంటుంది. యుద్ధరూపంలో వచ్చిపడిన విపత్తు, కాన్ఫెడరేట్ ప్రభుత్వానికి రెట్ అందించిన సేవలూ అడ్డురాకపోతే అట్లాంటాలో కూడా ఒక్కరూ అతన్ని దగ్గరికి రానిచ్చేవారు కారని అంటుంది. అతన్ని ద్వేషిస్తూనే అతని నుంచి సహాయాలు పొందడానికి వెనుకాడని ప్లాంటర్‌ల సమాజంలోని అల్పత్వాన్ని, తన పాపపరిహారంగానే అతను తమకు సాయపడుతున్నట్టు సర్దిచెప్పుకునే ఆత్మవంచననూ పలు సందర్భాలలో కళ్ళకు కట్టిస్తుంది.

మేరీ వెదర్ కూతురు మే బెల్ (May Belle) పెళ్లి ముచ్చట అలాంటి సందర్భాలలో ఒకటి. యుద్ధసమయం కనుక పెళ్లి కూతురు ధరించే తెలుపు శాటిన్ వస్త్రం దొరకని పరిస్థితి వస్తుంది. కాన్ఫెడరసీలో ఉన్న శాటిన్ వస్త్రం మొత్తాన్ని యుద్ధపతాకాల తయారీకి ఖర్చుపెట్టేశారు. ప్లాంట‌ర్‌ల పోరాటం కోసం తలపిన్నులను, బటన్‌లను, అందమైన షూలను త్యాగం చేయడాన్ని గర్వంగా భావిస్తాను కానీ శాటిన్ వస్త్రాన్ని మాత్రం త్యాగం చేయలేనని పెళ్లికూతురు భీష్మిస్తుంది. కాన్ఫెడరేట్ పెళ్లికూతురు ధరించాల్సింది చేనేత వస్త్రమే కానీ శాటిన్ వస్త్రం కాదని, దేశభక్తిని రంగరిస్తూ తల్లి మేరీ వెదర్ ఎంత నచ్చజెప్పినా వినదు.

మెలనీ ద్వారా ఈ విషయం రెట్‌కు తెలుస్తుంది. అతను గజాల కొద్దీ శాటిన్ వస్త్రాన్ని, అందమైన అల్లిక పని కలిగిన మేలి ముసుగును తెప్పించి పెళ్లి కానుకగా ఇస్తాడు. మే బెల్ ఎంత సంతోషిస్తుందంటే దాదాపు అతన్ని ముద్దు పెట్టుకోబోతుంది. వాటి ధర చెల్లిస్తామని మాటవరసకు కూడా అనలేని పరిస్థితి వారిది. యుద్ధసమయంలో అంత ఖరీదైన కానుకను స్వీకరించడం తగదని మేరీ వెదర్‌కు తెలిసినా అడ్డుచెప్పలేకపోతుంది. అంతవరకూ తను తీవ్రంగా విమర్శిస్తూ వచ్చిన రెట్‌ను పెళ్లి విందుకు ఆహ్వానించడం ఆమెకు తప్పనిసరి అవుతుంది. అతన్ని విందుకు ఆహ్వానించడమే అతనిచ్చిన కానుకల కంటే పెద్ద కానుక అని ఆమె అనుకుంటుంది.

అప్పటికే జూదరిగా, వ్యభిచారిగా ముద్రవేయించుకున్న రెట్, కాన్ఫెడరేట్ యుద్ధ ప్రయత్నాలను విమర్శించినవాడిగా, యుద్ధానికి దూరంగా ఉన్నవాడిగా, శత్రువుతో వ్యాపార లావాదేవీలు జరిపేవాడిగా దేశద్రోహి అన్న కొత్త ముద్ర కూడా తెచ్చుకుంటాడు. అయినా కాన్ఫెడరేట్ సైనికుల సహాయం కోసం అతని నుంచి పెద్ద మొత్తాలలో విరాళాలు తీసుకోడానికి ఆ ముద్ర అడ్డు రాదు. దిగ్బంధాన్ని అమలు చేస్తున్న యాంకీ నౌకాదళం కన్నుకప్పి అతను తెప్పించిన సరకుల్ని రెండు చేతులతో అందుకోడానికీ అడ్డు రాదు. కాన్ఫెడరసీ భవిష్యత్తు, యుద్ధరంగంలో పోరాడుతున్న సైనికుల మీద ఎంత ఆధారపడి ఉందో, ఇలా సరకు తెప్పించగల రెట్ ప్రావీణ్యం మీదా అంతే ఆధారపడి ఉందన్న గ్రహింపు కలగడానికి ఎంతో సమయం పట్టదు. యుద్ధసమయంలోనే కాదు, యుద్ధానంతరం కూడా రెట్ నుంచి కాన్ఫెడరేట్‌కు బహుముఖ సాయాలు అందుతూనే ఉంటాయి. అలాగే వ్యక్తుల స్థాయిలో కూడా. కానీ అవేవీ రెట్ మీద ఉన్న రకరకాల ముద్రలను చెరపలేకపోతాయి. అతనికి ఆమోదయోగ్యతను తేలేకపోతాయి.

ఈ నేపథ్యం నుంచి మెలనీ-రెట్‌ల మధ్య చిత్రించిన అనుబంధాన్ని గమనించినప్పుడు, వ్యక్తిగతాన్ని మించి అది సంతరించుకున్న సామాజిక స్వభావం ఎలాంటిదో అర్థమవుతుంది. రెట్‌కీ, అతన్ని వెలివేసిన ప్లాంటర్‌ల సాంప్రదాయిక సమాజానికీ మధ్య మెలనీ ఒక పెద్ద అతుకుగాను, వారధిగానూ మారుతుంది. నిర్ణయాత్మకమైన ఈ యుద్ధ ఘట్టంలో తనూ కాన్ఫెడరేట్ గుండెతో స్పందిస్తున్నదే. దాని విలువలు, విశ్వాసాలు, భావజాలంలో పాలు నీళ్లలా కలసిపోయినదే. పైగా అందులోనూ ఎందరిలోనో లేని నిబద్ధత, శీలసమగ్రత, స్వచ్ఛత ఆమెలో ఉన్నాయి. ఆపైన సాటి వ్యక్తులు ఎందరిలోనో కనిపించని గొప్ప ఇంగితజ్ఞానము, మానవస్వభావవైవిధ్యం పట్ల అపారమైన అవగాహన, అనుకంప ఆమెలో ఎలా ఉన్నాయో ఇప్పటికే పలు ఉదాహరణలతో చెప్పుకున్నాం. ఇంకొకటి చెప్పుకుంటే, తను ఆశ్రయమిచ్చి ఆదరించిన ఆర్చీ(Archie) అనే బండివాడు ఒక సందర్భంలో స్కార్లెట్‌ను తప్పుపట్టినప్పుడు అతనిపై మెలనీ ఆగ్రహిస్తూ అంటుంది: నువ్వు ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే ఇంట్లోంచి పంపేస్తాను. అందులో ఆమె తప్పులేదు. తను చేయాలనుకున్నది ఆమె చేసింది. వాళ్ళు చేయాలనుకున్నది వాళ్ళు చేశారు. ఎవరైనాసరే తాము చేసి తీరాలనుకున్నది చేయవలసిందే. మనందరం ఒకేలా ఆలోచించం, ఒకేలా వ్యవహరించం. మనల్ని బట్టి అవతలి వాళ్ళ ప్రవర్తనపై తీర్పు చెప్పడం తప్పు.

మానవస్వభావవైవిధ్యం పట్ల ఇలాంటి గుర్తింపు, గౌరవమూ; అందుకు కారణమైన విజ్ఞతావివేకాలే ఆమెకు ఔన్నత్యాన్ని కల్పించి అట్లాంటాలోని స్వీయసమాజం మొత్తానికే ఆమెను ఎలా నాయకురాలిగా ప్రతిష్టించాయో చెప్పుకున్నాం. అంతేకాదు, ఆయా వ్యక్తులకు, పరిస్థితులకు అనుగుణంగా కట్టుబాట్లను, విశ్వాసాలను సడలించుకుంటూ స్పందించగల గొప్ప ఆలోచనాస్వాతంత్ర్యాన్ని పై లక్షణాలు ఆమెకు అలవరచాయి. ఆపైన కట్టుబాట్లు, విశ్వాసాల కంటే ఎత్తుపీట మీద మానవీయత, కారుణ్యం వంటి సహజాతాలను ప్రతిష్టించే వెసులుబాటునూ ఆమెకు కల్పించాయి. తనదైన సాంప్రదాయిక సమాజంలో తను విడదీయలేని భాగంగా ఉంటూనే, ఆ సమాజం తాలూకు ఇతరేతర కొలమానాలకు అదనంగా; లేదా వాటిని ఒక్కోసారి అప్రధానం చేస్తూ మానవత్వం, కారుణ్యం వంటి కొత్త కొలమానాలను నిశ్శబ్దంగా, నిరార్భాటంగా స్థాపించడంలో మెలనీ వైశిష్ట్యం కనిపిస్తుంది. ముందే చెప్పినట్టు, ఈ కొత్త కొలమానాల స్థాపనలో ఆమె ధర్మశాస్త్రకర్తలలో మాత్రమే కనిపించే నిష్కర్షను, నిస్సంకోచాన్నీ ప్రదర్శిస్తుంది. రెట్ ఉత్తముడని, పెద్దమనిషి అని తొలి పరిచయం నుంచీ నొక్కిచెప్పడంలో, అతని గురించి ఎవరేమనుకున్నాసరే, నా ఇంటి తలుపులు అతనికి, అతని జీవితాంతమూ తెరిచే ఉంటాయని శాసించడంలో ఇది కనిపిస్తుంది.

రెట్ బట్లర్ ప్లాంటర్‌ల తరగతికి చెందిన జనం మధ్య ఉంటూనే, వారికి దూరంగానూ ఉంటూ వారి స్థితిగతులపై వ్యాఖ్యాత పాత్ర నిర్వహించినట్టే; మెలనీ సాంప్రదాయిక సమాజంలోను, దాని భావజాలంలోను, ఒదిగి ఉంటూనే దానిని అధిగమిస్తూ లోపలినుంచి దానిని సంస్కరించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ వేయిపడగలకు, గాన్ విత్ ద విండ్‌కు గల ఇతివృత్త సామ్యాన్ని మరోసారి గుర్తు చేసుకుంటే, రెండూ పతనోన్ముఖమైన సాంప్రదాయిక సమాజాన్ని, ఆ పతనం నుంచి తమను తాము కాపాడుకోవడం గురించిన పెనుగులాటనే చిత్రించాయి. ధర్మారావు, ఆష్‌లీ సహా రెండు నవలలోనూ ఉన్న ఆయా పాత్రల మధ్య మనం ఇంతవరకూ పరిశీలించిన పోలికలు, తేడాలను అలా ఉంచితే; వేయిపడగల సమాజానికి నాలుగువర్ణాల వ్యవస్థ ఆధారభూమిక అయినట్టుగా గాన్ విత్ ద విండ్ సమాజానికి బానిసల వ్యవస్థ ఆధారభూమిక అయింది. ఈ పోలికల్లోనే రెండింటి మధ్యా ఉన్న అతి కీలకమైన తేడాలలో ఒకటి ఏమిటంటే, వ్యవస్థలో భాగమవుతూనే ఆ వ్యవస్థను అధిగమిస్తూ, దానికి కొత్త కొలమానాలను ఇచ్చి కొత్త ప్రమాణాలను నిర్దేశించిన మెలనీ లాంటి పాత్ర వేయిపడగలులో లేకపోవడం. మెలనీలానే ధర్మారావు కూడా మానవీయ స్పందనలు, కారుణ్యం ఉన్నవాడే. కానీ ఇద్దరిలో తేడా ఎక్కడుందంటే; మానవీయత, భూతదయ ముఖ్యమే కానీ తాను విశ్వసించే చాతుర్వర్ణ్య వ్యవస్థను పరిరక్షించడం ధర్మారావుకు అంతకంటే ముఖ్యం. అదే మెలనీ విషయానికి వస్తే, వ్యవస్థ తాలూకు కట్టుబాట్లను, విశ్వాసాలను, విలువలను పాటించడం ముఖ్యమే కాని; వాటికీ మానవీయతకు, భూతదయకు మధ్య విరోధం ఏర్పడితే మాత్రం ఆమె మొగ్గు రెండో వైపే.

మరో విధంగా చెప్పుకోవాలంటే, వేయిపడగలులోలా సాంప్రదాయిక వ్యవస్థాపరిరక్షణ గురించిన ఆరాటాన్నే ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని గాన్ విత్ ద విండ్‌ను రచించి ఉంటే, అది ఆష్‌లీ నాయకుడిగా ముమ్మూర్తులా మరో వేయిపడగలు అయ్యేది. కానీ మెలనీ పాత్ర (తమ తమ రీతుల్లో స్కార్లెట్, రెట్ బట్లర్‌లు కూడా) ఆ పరిణామాన్ని నివారించి రెండింటి మధ్యా పెద్ద అంతరాన్ని కల్పించింది. మెలనీ పాత్ర ముఖంగా మానవీయతా కోణాన్ని నొక్కి చెప్పడంలో రకరకాల హెచ్చుతగ్గులు, చీలికలు, వివక్షలు, ముద్రలు, ఆధిపత్య ధోరణులతో కూడిన సాంప్రదాయిక వ్యవస్థ స్థానంలో కలుపుగోలు(inclusive) స్వభావం కలిగిన ఉదార వ్యవస్థను లక్షించడం కనిపిస్తుంది.

ఎక్కడైనా సరే, సాంప్రదాయిక వ్యవస్థకు నిచ్చెనమెట్ల స్వభావం ఉంటుంది. ఆధిపత్య స్థానంలో ఉన్నవారు ఆర్థికంగా, సామాజికంగా తమకు కింది స్థానంలో ఉన్నవారిపై, లేదా భిన్న భావజాలాలు, సంస్కృతులు, విశ్వాసాలు, ఆహారపు అలవాట్లు ఉన్నవారిపై, శత్రువులపై రకరకాల ముద్రలు వేయడం, కించపరచడం, తీర్పు చెప్పడం ఉంటుంది. వ్యక్తులలోను, వ్యవస్థలలోను, సంస్కృతీ సాహిత్యాలలోను, అలవాట్లలోను ఉన్న వైవిధ్యాన్ని గుర్తించి గౌరవించే బదులు, వాటి ప్రాతిపదికపై ఎక్కడికక్కడ మనుషులను విడగొట్టి చూడడం ఉంటుంది. వేయిపడగలలోని ధర్మారావు వ్యక్తిగత స్థాయిలో ఉదారుడిగా, మానవతావాదిగా కనిపించవచ్చు. కానీ నిచ్చెనమెట్ల స్వభావం కలిగిన చాతుర్వర్ణ్య వ్యవస్థను మనసావాచా విశ్వసించేవాడిగా మనుషుల్ని విడగొట్టి చూడడం, వైవిధ్యాన్ని గుర్తించకపోవడం, తన సంప్రదాయ సంస్కృతీసాహిత్యాల పట్ల విపరీతమైన ఆత్మోత్కర్షను, ఇతరులకు చెందిన వాటిపట్ల అంతే తృణీకారాన్ని చాటుకోవడం, తీర్పు చెప్పడం అతని ద్వితీయ ప్రకృతిగా నవల అంతటా వ్యక్తమవుతుంది. అన్నింటా ఈ విభజనదృష్టే వేయిపడగల ఇతివృత్త నిర్మాణం మొత్తానికి పునాది అవుతుంది. ఇందుకు సంబంధించిన అనేక ఉదాహరణలను గత వ్యాసాలలో చూడవచ్చు.

పరాయి పాలన కారణంగా తమ సాంప్రదాయిక వ్యవస్థ, విలువలు, వైభవాలూ అంతరించిపోతున్నందువల్ల రచయితలో కలిగిన తీవ్రదుఃఖవిషాదాలనే ఆత్మాశ్రయరీతిలో ఏకోన్ముఖంగా అక్షరబద్ధం చేసిన రచనగా వేయిపడగలను పరిశీలించే ఒక కోణం లేకపోలేదు. అదే సమయంలో సర్వత్రా సాంప్రదాయిక సమాజాలలో ఉండే పైన చెప్పిన లక్షణాలే వేయిపడగలలో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, నవల మొత్తంలో ధర్మారావు చేసింది, ప్రతి విషయంలోనూ ‘మనమూ-వాళ్ళూ’ అన్న తేడా తీసుకొచ్చి తీర్పరి పాత్రను నిర్వహించడమే. మనుషులు, దేశాలు, సంస్కృతులు, సాహిత్యాలు, భాషల మధ్య హెచ్చుతగ్గుల తేడాలను తీసుకురావడమే కాదు, వాటిని ఇలా సిద్ధాంతీకరిస్తాడు: ఆవు చురుకైన జంతువు. బర్రె మందమైన జంతువు. ప్రకృతిలోని యా మాంద్యము దాని రక్తమందున్నది. ద్రవ్యమును బట్టియే గుణము వచ్చినది. వాని రెండింటికీ నవినాభావ సంబంధమున్నది. బ్రాహ్మణుని చూడగానే బ్రాహ్మణుడని తెలియుచున్నది. తుని వైపు క్షత్రియులను చూడుము. వెంటనే క్షత్రియుడని తెలియును… క్రైస్తవుడు క్రైస్తవునివలె కనిపించుచున్నాడు. అది భేదమే. అది వర్ణమే… అందరమొక్కటి యను సిద్ధాంతము పశువులన్నియు నొక్కటియే యను సిద్ధాంతము వంటిది… అట్లే భిన్న వర్ణములందు భేదములున్నవి.

ఇంకా ఆసక్తికరం ఏమిటంటే, సాంప్రదాయిక సమాజాలు ఈ వివక్షకు, విభజనదృష్టికి అనువైన వ్యక్తీకరణను, పదజాలాన్ని, ముద్రలనూ కూడా తమ భాషలలో అభివృద్ధి చేసుకుంటాయి. అవి అలా నిత్యవ్యవహారంలో భాగం కావడంవల్ల ఆ భాషీయులకు తెలియకుండానే వారి చైతన్యంలో ఇంకి సంభాషణల్లో యథేచ్ఛగా దొర్లుతాయి. ‘మాలకూడు’, ‘మాలదానిని’ పెళ్లి చేసుకోవడం గురించి అరుంధతి, ధర్మారావుల మధ్య జరిగిన సంభాషణను కిందటి వ్యాసంలో ఉదహరించుకున్నాం.

కులీనత గురించిన పట్టింపు, తరగతులుగా మనుషుల విభజన; రెట్ బట్లర్ వంటి భిన్న భావజాలాలు కలిగినవారిపై, శత్రువుపై రకరకాల ముద్రలు వేయడంతో సహా ఒక సాంప్రదాయిక సమాజంగా గాన్ విత్ ద విండ్ చిత్రించిన సమాజంలోనూ ఇవే లక్షణాలున్నాయి. తేడా ఎక్కడుందంటే, వేయిపడగలు ఈ లక్షణాల దగ్గరే ఆగిపోగా, గాన్ విత్ ద విండ్ వీటిని దాటి వెళ్ళి విభజన దృష్టి స్థానంలో కలుపుగోలు దృష్టిని స్థాపించడానికి ప్రయత్నిస్తుంది. మెలనీ ముఖంగా జరిగింది అదే. రెట్ బట్లర్‌ను సమర్థించడంలో, వ్యతిరేకులపై ముద్రలు వేసి శీలహననానికి పాల్పడే సాంప్రదాయిక సమాజం తాలూకు ఆధిపత్య ధోరణిని ఆమె నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. డా. మీడ్, మిసెస్ మేరీ వెదర్ చెబుతున్న అన్ని దుర్లక్షణాలు అతనిలో ఉండవని నేను కచ్చితంగా చెప్పగలను. అతను అన్నార్తుల నోటి దగ్గర ముద్ద లాక్కునే మనిషి కాదు. (కాన్ఫెడరేట్‌పై) మనలో ఉన్నంత విధేయతా, దేశభక్తీ అతనికీ ఉన్నాయి– అని ఆంట్ పిటీపాట్‌తో అంటుంది. ఆవేశకావేషాలు నిండిన నాటి యుద్ధ వాతావరణంలో, యుద్ధాన్ని విమర్శిస్తూ దానికి దూరంగా ఉన్న వ్యక్తిని వెనకేసుకురావడంలోనే కాక, తన ఇంటి తలుపులు అతనికి ఎప్పుడూ తెరచుకునే ఉంటాయని ప్రకటించడంలోనూ అసామాన్యమైన తెగింపును, ధిక్కారాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె నైతిక స్థైర్యం నుంచి, శీలస్వచ్ఛతనుంచి పుట్టిన లక్షణాలవి. ఆ క్రమంలో ఆమె, విభజన స్వభావం కలిగిన సాంప్రదాయిక సమాజపు భాషనూ, వ్యక్తీకరణనూ కూడా పరోక్షంగా తోసిపుచ్చుతుంది. శత్రువుతో సహా ఎవరి పట్లా అవహేళన, నింద, న్యూనత ధ్వనించే మాటలను మెలనీ నోట రచయిత్రి ఎక్కడా పలికించకపోవడం, భాష విషయంలో ఆమె కనబరచిన ప్రత్యేక స్పృహను పట్టి చూపుతుంది. ఇంకా చెప్పాలంటే భాషను ప్రజాస్వామికం చేసే ప్రయత్నానికి అది దగ్గరగా ఉంటుంది. ‘మనందరం ఒకేలా ఆలోచించం, ఒకేలా వ్యవహరించం. మనల్ని బట్టి అవతలి వాళ్ళ ప్రవర్తనపై తీర్పు చెప్పడం తప్పు.’ అని మెలనీ అనడంలోనూ వైవిధ్యాన్ని గుర్తించి గౌరవించే ప్రజాస్వామిక స్పృహే కనిపిస్తుంది.

ధర్మారావు వైఖరి ఇందుకు పూర్తి భిన్నం. అతను అధికసంఖ్యాకుల అభిప్రాయం చెల్లుబాటయ్యే ప్రజాస్వామిక వ్యవస్థనే నిరాకరిస్తాడు. ఆ నిరాకరణను సిద్ధాంతీకరించబోతాడు. కాబోయే తన రెండవ అత్తగారు అనసూయకీ (చిన్న అరుంధతి తల్లి), రెండవ మామగారు పశుపతికీ అతనికీ జరిగిన కింది సంభాషణలో అది కనిపిస్తుంది:

అనసూయ:
బాల వితంతువుల సంగతి విచారించకపోయినచో బాల్యమృతులను గూర్చి విచారించరాదా?

ధర్మారావు:
(వ్యంగ్యముగా) చచ్చినవారి సంగతి మాకెందుకు? వారి సంగతి మ్యునిసిపల్ వారికి. మాది మ్యారేజి బ్యూరో, మాకు మిగిలినవి పెండ్లిండ్లు, ప్రేమ. ఇక దేని గురించి మాటాడమందువు? కొన్ని సంగతులు మాటాడినచో రాచరికము వారూరకుండరు. విద్యావిషయము మాకు తెలియదు. వేదాంతము మొదలైన వగమ్యములు. పదార్థవిజ్ఞానశాస్త్రాదు లగాధములు. మిగిలినవి పెండ్లి, ప్రేమ. మా పరిశోధన, శాస్త్రచర్చ, ప్రయోజకత్వము వీని మీద. మా పక్షము గెలుచుననుటకు మా సంఖ్య యెక్కువ. మా వాదన నిజము కనుకనే గెలుచుచున్నది.

అనసూయ:
అందుకు కాదు. మీకు దంభమెక్కువ గనుక గెలుచుచున్నది. యాథార్థ్య మతీతజ్ఞానవిషయము కానీ, యెక్కువమంది చెప్పునది కాదు. గొర్రెల మంద యుండును. ఏనుగులు రెండో, మూడో. గౌరవ మేనుగులకే. ఏనుగు గొప్ప యేమనినచో యేమని చెప్పగలము? అది మనసునకే తెలియును.

ధర్మారావు:
ధర్మము కూడా నట్టిదే. అదియు మనసునకే తెలియును, మన మేనుగుల కిచ్చినంత గౌరవము పాశ్చాత్యు లీయరు. మన ధర్మశాస్త్రముల గతియు నంతే.

పశుపతి:
ఆ శాస్త్రముల గూర్చి మన దేశీయులకే చాలామందికి నమ్మకము లేదు. అవి వ్రాసినవారు మనవంటివారే.

ధర్మారావు:
మన దేశీయులకే నమ్మకము లేదనగా; మన దేశీయులనగా, మన దేశమునందు పుట్టినవారని యర్థము. మనదేశమనగా నాల్గు హద్దులు గల ప్రదేశమని కాదర్థము. ఇచ్చటి మతము, సంఘము, ఆచారములు సర్వమునని యర్థము. ఈ భూఖండమునందు పుట్టినంతలో నొరిగినదిలేదు. మన మతసంఘాచారములయందు పుట్టవలయును. వాడూ మనదేశస్థుడు. ఇంక అవి వ్రాసినవారు మనవంటివారే నంటివి. ఆ మాటలు చాలా తప్పు. వారు మనవంటివారు కాదు. ఒక్కటి చూడు. రాజును నా వంటివాడే యని వీథిలో నిలుచుండి యనుము. ఏమగును? ఊరికి జానెడు బెత్తెడులో నుందువు. ధర్మశాస్త్రకర్తలు మనవంటివారే. వారురి తీయించరుకదా!

అధికసంఖ్యాకుల అనుశాసనం చెల్లే ప్రజాస్వామ్యంపై అవహేళన, వ్యంగ్యం, అక్కసు రంగరించి చేసిన పై వ్యాఖ్యలను అనేక కోణాలనుంచి అర్థంచేసుకోడానికి అవకాశముంది. ఆ అవహేళన వెనుక గొర్రెలమంద పోలికతో అధికసంఖ్యాకులను అజ్ఞానులుగా, అన్ని రకాలుగా అనర్హులుగా జమకట్టి చిన్నబుచ్చే ధోరణి ఉంది. అల్పసంఖ్యాకులైన తాము ఏనుగులమని, జ్ఞానంపై తమదే గుత్తాధిపత్యమనీ చాటుకోవడం ఉంది. అదే సమయంలో ఆ అక్కసులో స్వీయఅస్తిత్వ భయం నుంచి పుట్టే అశక్త క్రోధం కూడా పచ్చిగా బయటపడిపోతోంది. ఆ అస్తిత్వ భయానికి రెండు ముఖాలున్నాయి. మొదటిది, తాము శతాబ్దాలుగా అభివృద్ధి చేస్తూవచ్చిన సాంప్రదాయిక జ్ఞానం మొత్తం అధికసంఖ్యాక ప్రాబల్యం కలిగిన ప్రజాస్వామ్య వ్యవస్థలో తిరస్కృతికి, నిరాదరణకు గురవుతుందన్న భయం. వ్యవస్థలో సమూలమైన మార్పు వచ్చినప్పుడు అలాంటి భయాలు సహజంగా ఉంటాయి కనుక వాటిని కొంత సానుకూల దృష్టితో అర్థంచేసుకునే అవకాశం లేకపోలేదు. అయితే, ఆ అస్తిత్వ భయం తాలూకు రెండవ ముఖాన్ని గమనిస్తే, అందులో సొంత మనుగడకు సంబంధించిన భయం కూడా కనిపిస్తుంది. శతాబ్దాలుగా, బహుశా సహస్రాబ్దాలుగా అన్ని రంగాలలోనూ ఈ దేశ బౌద్ధిక జీవితాన్ని శాసిస్తున్నది, ప్రభావితం చేస్తున్నది తామే కనుక; తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జ్ఞానానికి ప్రజాస్వామ్యంలో ముప్పు వాటిల్లడమంటే నేరుగా తమ మనుగడకు ముప్పు వాటిల్లడమే.

బాల వితంతువుల గురించి మీకెందుకు, ముందుగా బాల్య మరణాలను పట్టించుకొండని అనసూయ అనడంలో వితంతు వివాహాలను నిషేధించే సాంప్రదాయిక అనుశాసనంలో ప్రజాస్వామ్యం జోక్యం చేసుకుని, వాటిని సమర్థిస్తోందన్న అసహనము, అందువల్ల కలిగిన అశక్త క్రోధంతో బాల వితంతువులకు, బాల్య మరణాలకు లేని పోటీని తీసుకురావడమూ కనిపిస్తుంది. పెండ్లిండ్లు, ప్రేమల గురించిన చర్చలకు; విద్య, వేదాంతం, పదార్థవిజ్ఞానశాస్త్రాలకు మధ్య లేని పోటీని తీసుకురావడంలో ధర్మారావులోనూ వ్యక్తమవుతున్నది అలాంటి అసహనమే. జ్ఞానసంబంధ విషయాలలో కూడా ఆధిక్యత-న్యూనత; లేదా మనమూ-వాళ్ళూ అన్న తేడాను తీసుకొచ్చే మనస్తత్వమే ఇక్కడా. ఆపైన అధికసంఖ్యాకుల అభిమతానుసారంగా నడిచే ప్రజాస్వామ్య వ్యవస్థ అన్ని రకాల శాస్త్రాల అభివృద్ధికీ అడ్డుగోడ అవుతుందని, ఆ రెండింటికీ మధ్య ఏదో విరోధం ఉందన్న అపోహ దీని వెనుక ఉంది. నిజానికి తనతో ఏకీభవించని జ్ఞానాన్ని నిషేధించే లక్షణం సాంప్రదాయికతకే ఉంది కానీ ప్రజాస్వామికతకు లేదు. ఉంటే అది ప్రజాస్వామ్యమే కాదు. జ్ఞానాన్ని నిషేధించకపోగా దానిని ప్రజాస్వామ్యీకరిస్తూ విస్తృత ప్రజానీకానికి దానిపై హక్కు కల్పించడంలోనే ప్రజాస్వామ్యపు మౌలికత ఇమిడి ఉంది. ధర్మశాస్త్రాల గతిని తలచుకుని ధర్మారావు బెంగపడడంలోనూ ప్రజాస్వామ్యం పట్ల అతని అనవగాహన వ్యక్తమవుతుంది. ప్రజాస్వామ్యం తనదైన తాత్వికతకు అనుగుణంగా ధర్మశాస్త్రాలను తిరగరాస్తూ కొత్త ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తుందన్న స్పృహ అతనిలో లేదు. భారత ప్రజాస్వామిక రాజ్యాంగరూపంలో అవతరించినది కొత్త ధర్మశాస్త్రమే.

వితంతు పునర్వివాహాలకు చట్టబద్ధత కల్పించడం, బాల్య వివాహాలను నిషేధించడం వగైరాల రూపంలో వ్యక్తిగత ధర్మశాస్త్రాలను దాటి వెళ్ళడంలో ఈ దేశ మెజారిటీ మతస్తులు ఇతరులకు గొప్ప ఒరవడి అయిన సంగతిని స్మరించుకుంటూనే వితంతు పునర్వివాహాలను నిరాకరించడంలో, బాల్య వివాహాలను సమర్థించడంలో వేయిపడగల రచయితకు, నేడు ట్రిపుల్ తలాక్‌ను సమర్థిస్తున్న ఇస్లామిక్ సంప్రదాయవాదులకు మధ్య ఉన్న పోలికను గమనించడానికి ఇతరేతర అభిమానాలు అడ్డు రాకూడదు. దేశీయులనగా ఎవరో వేయిపడగల రచయిత ఇచ్చిన నిర్వచనమూ ప్రస్తుత సందర్భంలో ఆసక్తికరమే. దేశమంటే నాలుగు హద్దులు కలిగిన ప్రదేశం కాదని, ఇక్కడ పుట్టిన ప్రతివాడూ ఈ దేశస్థుడు కాడని, ఇక్కడి మత, సంఘ, ఆచారాలలో పుట్టినవాడే ఈ దేశస్థుడనీ ధర్మారావు అంటున్నాడు. ఈ విధంగా మత, సంఘ, ఆచార ప్రాతిపదికపై ఈ దేశస్థులను విభజిస్తున్నాడు. ఈరోజున రాజకీయ ప్రాబల్యాన్ని తెచ్చుకున్న హిందుత్వ భావజాలం ఈ నిర్వచనం పునాది మీదనే అభివృద్ధిచెందిన సంగతి తెలిసినదే. వందేళ్ల వెనక్కి వెళ్లి చూస్తే, గాంధీ నాయకత్వంలోని స్వాతంత్రోద్యమం తాలూకు భావజాలంతోను, తదనంతర పరిణామాలతోనూ సాంప్రదాయిక సమాజం జరుపుతూవచ్చిన పోరాటం రాను రాను అసమయుద్ధంగా పరిణమించింది. దాంతో అది కలిగించిన తీవ్ర నైరాశ్య, అకర్మణ్యతల పార్స్వాన్నే ధర్మారావు ముఖంగా వేయిపడగలు చిత్రించింది. అయితే, విభజన స్వభావం కలిగిన తనదైన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నమూనాను అమలుచేయడంలో శతాబ్దాల అనుభవం కలిగిన సాంప్రదాయిక సమాజం అంత తేలికగా ఓటమిని అంగీకరించి కత్తి దించే ప్రశ్న లేదు. తన వందల ఏళ్ల అస్తిత్వంలో ఎదుర్కొన్న అనేకానేక పతనోత్థానాలలో ఇప్పుడు జరుగుతున్నది ఒకటి మాత్రమే. గత నూరేళ్ళ కాలంలో తన పునరుత్థానానికి, పునర్వైభవానికి అది ఎంతో పకడ్బందీగా పూర్వరంగాన్ని నిర్మించుకుంటూనే వచ్చింది. అదిప్పుడు ఫలవంతమైంది. వేయిపడగల దృష్ట్యా చెప్పుకుంటే, అందులో చిత్రించిన సాంప్రదాయిక సమాజము, దాని భావజాలము, దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మారావులూ వెనకటి ఆభాస నైరాశ్యం నుంచి, అకర్మణ్యత నుంచి బయటపడి పూర్తి క్రియాశీలతను తెచ్చుకున్నారు. దాని పర్యవసానంగా, విభజన స్వభావం కలిగిన సాంప్రదాయిక సమాజానికీ, కలుపుగోలు స్వభావం కలిగిన ప్రజాస్వామ్య తాత్వికతకూ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా జరుగుతున్న ముమ్మర పోరాటాన్నే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక యవనిక మీద ఈరోజున మనం దర్శిస్తున్నాం. భావజాలంతో సహా తనదైన మొత్తం అజెండాను ఏకపక్షంగా జనం మీద విధించే ప్రక్రియలో విమర్శను, ప్రతిపక్షాన్ని సహించకపోవడం అనేది ఆధిపత్య స్వభావం కలిగిన సాంప్రదాయిక సమాజాల మౌలిక నిర్మాణంలోనే భాగమవుతుంది. రెట్ బట్లర్ రూపంలో ఒక బలమైన ప్రతిపక్షం కాని, మెలనీలా అంతర్గత సంస్కరణకు ప్రయత్నించిన ప్రభావోపేత వ్యక్తిత్వం కలిగిన పాత్రకాని, స్కార్లెట్‌లా జీవితేచ్చకు ప్రతీక అయిన పాత్ర కానీ వేయిపడగలులో లోపించడానికి కారణం అదే.

తమ భావజాలాన్ని వ్యతిరేకించేవారిపై రకరకాల ముద్రలు వేయడంతో సహా; విభజన పూర్వకమైన సాంప్రదాయిక భాష, వ్యక్తీకరణ సహస్రాధిక ప్రమాణంలో బలం పుంజుకోవడం నేటి మన దైనందిన అనుభవం. ఉదాహరణల కోసం గాలించవలసిన అవసరమే లేదు. వేయిపడగల సాంప్రదాయిక సమాజ పునరుత్థానానికి ఇది మరో ప్రత్యక్ష సాక్ష్యం. దేశభక్తి, జాతీయత గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ప్రస్తుత సందర్భంలో గాన్ విత్ ద విండ్‌లో దేశభక్తి గురించిన ప్రస్తావనలు ప్రత్యేకించి ఆసక్తిని కలిగిస్తాయి. దేశభక్తి అంటే తాము పుట్టి పెరిగిన, తమ మనుగడకు దోహదమైన నేలను ప్రేమించడమే నన్న సరళమైన నిర్వచనం ఆష్‌లీ, స్కార్లెట్‌ల మాటల్లో వ్యక్తమవుతుంది. వేయిపడగల సాంప్రదాయిక సమాజం ఇచ్చే నిర్వచనం ఇందుకు భిన్నంగా సంక్లిష్టంగా ఉంటుంది. దాని ప్రకారం, ఈ దేశంలో పుట్టిన ప్రతివాడూ ఈ దేశీయుడు కాదు. ఈ దేశ మత సంఘ ఆచారాలలో పుట్టినవాడు మాత్రమే ఈ దేశీయుడు. దేశీయతను ఇలా విభజించడమంటే దేశభక్తినీ విభజించడమే. పుట్టి పెరిగిన, మనుగడకు దోహదమైన నేలను ప్రేమించడమే దేశభక్తి అన్న సరళ నిర్వచనానికి బదులు, దేశానికి ఒక దేవతారూపాన్ని కల్పించి దానికి మతస్పర్శను ఆపాదించడంసహా మామూలు బుద్ధికి అందనంత ఎత్తుకు తీసుకువెళ్లి సంక్లిష్టం చేయడం మన సాంప్రదాయిక భావజాలంలో కనిపిస్తుంది. ఇదొక్కటే కాదు, సరళమైన ప్రతిదానినీ సంక్లిష్టం చేసే స్వభావం మన సాంప్రదాయిక భావజాలానికి ఉంది. నేడు మన దేశంలో ఇతరుల దేశభక్తిని, జాతీయతాదృష్టిని ప్రశ్నించి ముద్రలు వేస్తున్న తీరును దృష్టిలో ఉంచుకున్నప్పుడు, ‘(కాన్ఫెడరేట్‌పై) మనలో ఉన్నంత విధేయత, దేశభక్తీ అతనికీ ఉన్నాయి.’ అని రెట్ బట్లర్ గురించి మెలనీ అంటూ ముద్రలు వేసే సాంప్రదాయిక ధోరణిని వ్యతిరేకించడం ఆశ్చర్యం గొలిపే యాదృచ్చికతతో ప్రాసంగికతను స్థాపించుకుంటోంది. అంతర్యుద్ధానుభవం అమెరికాలోని దక్షిణాది ప్లాంటర్‌ల సాంప్రదాయిక సమాజాన్ని కలుపుగోలు స్వభావం కలిగిన ప్రజాస్వామికత వైపు అనివార్యంగా నడిపించిందనుకుంటే; అలాంటి యుద్ధానుభవం లేని భారతదేశ సాంప్రదాయిక సమాజం, పడిపోయిన ప్రతిసారీ తిరిగి జవసత్వాలను పుంజుకుని పైకి లేస్తూ తన అస్తిత్వాన్ని ఎప్పటికప్పుడు పొడిగించుకోగలుగుతోందా అన్నది ఆసక్తి గొలిపే ఒక అకడమిక్ ప్రశ్న.

(అయిపోయింది)
----------------------------------------------------------
రచన: కల్లూరి భాస్కరం, 
ఈమాట సౌజన్యంతో

Monday, January 28, 2019

వేయిపడగలు-గాన్ విత్ ద విండ్: 3. మారే ప్రపంచంలో మారని విలువ మెలనీ!


వేయిపడగలు-గాన్ విత్ ద విండ్: 

3. మారే ప్రపంచంలో మారని విలువ మెలనీ!






సాహితీమిత్రులారా!

గొప్ప ఉరవడితో శబ్దిస్తూ ఎత్తైన కొండలు గుట్టల మీంచి దూకడమే లక్ష్యంగా చిత్రగతులు పోయే జలపాతం; పైకి కనబడని లోతులతో, అవతలి ఒడ్డు కనిపించని మహావైశాల్యంతో ప్రశాంతగంభీరంగా ప్రవహించే జీవనది; ప్రకృతిలో దేని అందం, దేని ఆకర్షణ, దేని విలువ దానివే. ఒకటి చూపుల్ని అమితంగా మంత్రించి అద్భుతత్వంలో ముంచి తేల్చితే, ఒకటి అలసిపోయిన ఆత్మకు హాయి గొలుపుతుంది. మాటవరసకు గాన్ విత్ ద విండ్ లోని స్కార్లెట్, రెట్ బట్లర్ జీవితాలకు జలపాతంతో సామ్యాన్ని ఊహించుకుంటే, మెలనీ హామిల్టన్, అసలు ప్రవహిస్తున్నట్టే తోచని జీవనది! నదితో మెలనీ పోలిక ఎంత గొప్పగా అతుకుతుందంటే, సన్నని పాయగా పుట్టి క్రమంగా వైశాల్యాన్ని, లోతును సంతరించుకునే నదిలానే — నవల ప్రారంభంలో ఏమాత్రం నదురుగా కనిపించని అర్భకురాలు, అనామకురాలిగా పరిచయమైన మెలనీ, నవల అంతానికి చేరుకుంటున్న కొద్దీ యుద్ధంతో మానసికంగా, భౌతికంగా కుంగిపోయిన ప్లాంటర్ల సమాజం మొత్తాన్ని తన చలవదనపు ఒడ్డుమీదికి లాక్కుని అక్కున చేర్చుకునే ఒక మహానదిగా విస్తరిస్తుంది.

ఊఁహూఁ. మెలనీ వ్యక్తిత్వపు ఔజ్వల్యం ముందు ఈ నాలుగు వాక్యాలు మిణుగురుల పాటి కూడా చేస్తాయనిపించడం లేదు. ఇది వృధాప్రయాస అనిపిస్తోంది. పోనీ, ప్రపంచసాహిత్యం మొత్తం ఇంతవరకు సృష్టించిన అత్యుదాత్త వ్యక్తిత్వాలను ఒక్క చేతి వేళ్లమీద లెక్కించవలసివస్తే, వాటిలో మెలనీ తప్పనిసరిగా ఉంటుందని చెబితే ఎలా ఉంటుంది!? …ఏమో!

రచయిత్రి మెలనీ పాత్రను మలచిన తీరులో, సహజత్వంలో, ఇట్టే ఒదిగిపోయే ఒక ప్రణాళిక కనిపిస్తుంది. పైకి చెప్పని ఒక స్పష్టమైన తాత్వికత కనిపిస్తుంది. దూరమైన రెట్‌ను తిరిగి గెలుచుకుంటానన్న ఆత్మవిశ్వాసాన్ని, రేపటి మీద ఆశను ప్రకటించుకుంటూ స్కార్లెట్ టారాకు ప్రయాణమైందని చెప్పి నవల ముగించడం ద్వారా రచయిత్రి మొత్తం కథకు నాయిక ఆమే నని చెప్పదలచుకుందా అనిపిస్తుంది. కానీ మెలనీ పాత్రచిత్రణ దృష్ట్యా చూసినప్పుడు అంతిమంగా ఆమెనే నాయికగా స్థాపించదలచుకుందా అన్న అభిప్రాయం కలుగుతుంది. నవల ముగింపునకు వస్తున్న దశలో రెండోసారి ప్రసవం కష్టమై మెలనీ కన్నుమూసినట్టు రచయిత్రి చెబుతూనే, ఆమె ప్రభావాన్ని, ఆమె ప్రాతినిధ్యం వహించిన విలువలనూ నవల పుటలను దాటిస్తూ అనంతకాలంలోకి ప్రవహింపజేసి చిరంజీవుల్ని చేసింది.

రెట్ బట్లర్ లానే మెలనీ పరిచయానికి కూడా బార్బిక్యూ విందే ప్రధానవేదిక అవుతుంది. ఆ సందర్భంలో మెలనీ, ఆష్‌లీల పెళ్లి చర్చకు వస్తుంది. తను ఆష్‌లీ భుజాలవరకూ కూడా రాదు. అర్భకత్వం కొట్టొచ్చినట్టు కనిపించే శరీరాకృతి. అమ్మ ధరించే భారీ హూప్ స్కర్టు (Hoop Skirt: నడుము నుంచి గంట ఆకారంలో ఉండే స్కర్టు) చిన్నపిల్ల ధరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆపైన సిగ్గరి. కళ్ళు మాత్రం పెద్దవి. వాటిలో బెదురు తొంగిచూస్తూ ఉంటుంది. ముఖం పిరికితనాన్ని వ్యక్తం చేస్తూ ముద్దుగొలుపుతూనే, సీదా సాదాగా ఉంటుంది. వయసొచ్చిన ఆడపిల్ల ముఖాన్ని ఆకర్షణీయం చేసే నయగారాలు ఏవీ అందులో కనిపించవు. రచయిత్రి మాటల్లో చెప్పాలంటే, భూదేవంత నిరాడంబరంగానూ, తాజా ఆహారమంత శ్రేష్ఠంగానూ, ఊట జలాలంత నిర్మలంగానూ కనిపిస్తుంది. అయితే, కవళికలు ఎంత సీదా సాదాగా, శరీరాకృతి ఎంత చిన్నగా ఉన్నా ఆమె కదలికలలో మాత్రం ఎదుటివారిని విచిత్రంగా తాకే ఒక హుందాతనం తొణికిసలాడుతూ పదిహేడేళ్ళ వయసును మించిన పెద్దరికాన్ని తోపింపజేస్తూ ఉంటుంది.

తన ఈడు ఆడపిల్లలు చాలామందిలా ఏమాత్రం నదరుగా కనిపించని మెలనీ, ఆష్‌లీని పెళ్లాడబోతున్నట్టు తెలిసిన తర్వాతే అందరి కళ్ళల్లో పడుతుంది. మిసెస్ టార్లెటన్ అంటుంది: “ఏమిటా అమ్మాయి పేరు? మెలనీయా? ముద్దుగా కనిపించే ఓ అర్భకం పిల్ల. తన పేరూ, మొహమూ నాకు ఎప్పుడూ గుర్తుండవు…మనిషిని చూడు. కడ్డీలా సన్నగా, గాలేస్తే ఎగిరిపోయేంత సున్నితం. బొత్తిగా ఎలాంటి హుషారూ లేదు. సొంత అభిప్రాయం సున్నా. ‘నో మేడమ్, యెస్ మేడమ్’ అంటూ ఎవరేం చెప్పినా తలూపడమే.”

బార్బిక్యూ విందులో స్కార్లెట్, మెలనీ ఒకరికొకరు ఎదురుపడిన సందర్భాన్ని చిత్రించిన తీరు ఎలా ఉంటుందంటే, భవిష్యత్తులో వారిద్దరి సంబంధం ఎలా ఉండబోతోందో అది సూచనగా చెప్పి రచయిత్రి పాత్ర చిత్రణ దక్షతను ఆశ్చర్యస్ఫోరకంగా వెల్లడిస్తుంది. స్కార్లెట్‌ను మెలనీ ఎంతో ఇష్టంగా చూసి చిరునవ్వు నవ్వుతుంది. తను ధరించిన ఆకుపచ్చ దుస్తులు ఎంతో బాగున్నాయంటుంది. కానీ ఆష్‌లీని ఒంటరిగా కలసి మాట్లాడాలన్న తహతహలో ఉన్న స్కార్లెట్ మర్యాదకైనా మెలనీ మాటకు స్పందించదు. ఒకవైపు మెలనీ అర్భక ఆకారం పట్ల తృణీకారభావం, ఇంకోవైపు మగవాళ్ళను వెంట తిప్పుకోగల తన అందచందాల గురించిన స్వాతిశయం; వీటికి తోడు, తను కోరుకున్న ఆష్‌లీని పెళ్లాడబోతున్నట్టు తెలిసి మెలనీపై కలిగిన అసూయ. ఇలా స్కార్లెట్‌పై మెలనీ అభిమానం, మెలనీపై స్కార్లెట్ వైముఖ్యం, వారిద్దరి మధ్యా ఆష్‌లీ అడ్డుగా- అనే ఈ త్రికోణ సంబంధం విందు ఘట్టంలో బీజరూపంలో వ్యక్తమై క్రమంగా కొమ్మలు, రెమ్మలతో విస్తరించి దాదాపు నవల అంతా పరచుకుంటుంది. చివరికొచ్చేసరికి ఈ త్రికోణసంబంధంలో సంభవించిన అద్భుతరూపపరివర్తన మెలనీని, ఆమె వ్యక్తిత్వాన్ని సహస్రాధిక ప్రమాణంలో పెంచడంతో స్కార్లెట్ ఆమె ముందు మరుగజ్జు అవుతుంది.

నిజానికి స్కార్లెట్ ఒక్కతే కాదు, మెలనీ ఉజ్వల వ్యక్తిత్వం ముందు ఆమె భర్త ఆష్‌లీ కూడా వెలవెల బోతాడు. మెలనీ కార్యక్షేత్రం అతన్ని దాటి చాలా ముందుకు విస్తరిస్తుంది. అయితే ఆ సంగతిని రచయిత్రి ఎక్కడా ప్రత్యక్షంగా చెప్పదు. మెలనీ ముఖతః కూడా ఆ స్పృహ ఎక్కడా వ్యక్తం కాదు. వారిద్దరి దాంపత్య చిత్రణ, భారతీయ సంప్రదాయం ఆదర్శవంతంగా భావించే భార్యాభర్తల సంబంధాన్ని ముమ్మూర్తులా పోలి ఉంటుంది. అది ఎక్కువతక్కువలకు, వ్యక్తిత్వ తారతమ్యాలకు, స్పర్థలకు చోటివ్వని పరిపూర్ణ అన్యోన్య దాంపత్యం. మెలనీ వ్యక్తిత్వం ఎంత వైశాల్యాన్ని సంతరించుకున్నా అది భర్త భావజాలంలో భాగమవుతూ అతని నీడలో తను ఒదిగి ఉంటూనే. వారిద్దరి మధ్య ప్రత్యక్ష సంభాషణ జరిగిన ఘట్టాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. దాంపత్యం మేరకే చూసినప్పుడు వేయిపడగలలోని అరుంధతీ ధర్మారావుల దాంపత్యానికి మెలనీ ఆష్‌లీల దాంపత్యం ఏవిధంగానూ భిన్నమైనదీ కాదు, న్యూనమైనదీ కాదు. భర్తను కూడా దాటి మెలనీ ముందుకు వెళ్ళిన క్రమాన్ని రచయిత్రి వాచ్యంగా చెప్పకపోయినా ఇతర పాత్రలతో, ముఖ్యంగా స్కార్లెట్, రెట్ బట్లర్‌లతో మెలనీ సంబంధ చిత్రణ ద్వారా అది ఉన్మీలనమవుతుంది.

మెలనీ-స్కార్లెట్
బార్బిక్యూ విందులో మెలనీ, స్కార్లెట్ కలసుకున్న పై ఘట్టం జరిగే సమయానికి మెలనీ అన్న చాల్స్ హామిల్టన్‌తో స్కార్లెట్ వివాహం ఊహలోనే లేదు. ఆష్‌లీ తనను నిరాకరించడంతో కలిగిన క్షణికావేశంలో చాల్స్‌ను స్కార్లెట్ పెళ్లి చేసుకుని మెలనీకి వదిన అవుతుంది. ఈ కొత్త బంధుత్వం స్కార్లెట్ పట్ల మెలనీ అభిమానాన్ని మరింత పెంచింది కానీ మెలనీపై స్కార్లెట్ వైముఖ్యంలో మార్పులేదు. యుద్ధం ఇద్దరినీ ఒక గూటికి చేర్చుతుంది. ఆష్‌లీ, చాల్స్‌, యుద్ధానికి వెళ్ళడం, చాల్స్ మరణం; అట్లాంటాలో ఆంట్ పిటీపాట్‌తో కలసి ఒకరికొకరు తోడుగా గడిపే అనివార్యతను కల్పిస్తాయి. అప్పటికే స్కార్లెట్‌పై మెలనీకి ఉన్న ఇష్టం ఈ సహజీవనంలో ప్రేమగా వికసిస్తూ ఆమె చుట్టూ అమాయకంగా అల్లుకుపోతుంది. మెలనీపై స్కార్లెట్ అయిష్టత అలాగే ఉన్నా గతిలేని పరిస్థితిలో ఆమె ప్రేమలత అల్లుకోడానికి తనో పందిరి కావలసివస్తుంది. ఈ క్రమంలోనే మెలనీ వ్యక్తిత్వంలోని సొబగులు ఆమెకు మధ్య మధ్య మెరుఫుల్లా తాకి విస్మయం కలిగిస్తాయి. అంతలోనే ఆమెపట్ల తన వైముఖ్యం, అసూయ, ద్వేషం; తనలోని స్వార్థమనే చీకట్లు ఆ మెరుపుల్ని కప్పివేస్తుంటాయి. మెలనీని స్కార్లెట్ అర్థంచేసుకునే ఈ క్రమం ఎంత మందగతిలో సాగుతుందంటే, మెలనీ చల్లని తోడు తనకు ఎంత అవసరమో ఆమె పూర్తిగా గ్రహించేలోపలే మెలనీ ఈ లోకం నుంచే నిష్క్రమిస్తుంది.

మెలనీది తన ఆంట్ పిటీపాట్ పోలిక అని, ఆమెలానే అస్తమానూ సిగ్గుతో ముడుచుకుపోతుందనీ అనుకుంటూనే తనలో ఒకవిధమైన ఇంగితజ్ఞానం ఉన్నట్టు స్కార్లెట్ గమనిస్తుంది. మెలనీ గురించి ఆమెకు ఇది తొలి ఎరుక. అత్త ముఖంలో లానే మెలనీ ముఖంలోనూ నైర్మల్యం, సత్యం, దయ, ప్రేమ నిండిన పసిదనపు ఛాయలు తొంగిచూస్తూ ఉంటాయి. ఎదుటివారిలో మంచినే తప్ప చెడును చూడలేని ఆ పసిస్వభావం మెలనీ ముఖంలో నిత్యసంతోషాన్ని తెచ్చిపెడుతుంది. తన ప్రవర్తన అవతలివారిలో సంతోషాన్ని, సంతృప్తిని నింపాలనీ ఆమె కోరుకుంటుంది. అందుకే చిన్నా పెద్దా అంతస్తుల తేడా లేకుండా అందరికీ తలలో నాలుక అవుతుంది. తన రూపంతోనూ, ఆభిజాత్యంతోనూ మగవారిని వెంట తిప్పుకునే స్కార్లెట్‌కు పూర్తి భిన్నమైన, స్త్రీపురుష వయోభేదాలకు అతీతమైన ఆకర్షణ మెలనీది. అట్లాంటాలో ఆమెకు ఉన్నంతమంది ఆడ, మగ స్నేహితులు ఇంకెవరికీ లేరు. అలాగని మెలనీ ప్రవర్తన అపూర్వమూ కాదు, అసాధారణమూ కాదు; దక్షిణాది ప్లాంటర్‌ల సమాజంలోని ఆడపిల్లలకు చిన్నప్పటినుంచీ అలవరిచే ప్రవర్తనే అది. ఈ సంతోషపూరితమైన స్త్రీ వ్యవహారసరళే దక్షిణాది సమాజాన్ని ఆహ్లాదభరితం చేసేదని రచయిత్రి అంటుంది. మెలనీ వ్యక్తిత్వపు విశిష్టత ఎక్కడ ఉందంటే, మిగతా ఆడపిల్లలకు భిన్నంగా యుద్ధం అనే మహా విపత్తును కూడా ఎదురొడ్డి ఈ వ్యవహారసరళిని కాపాడుకోవడంలో!

యుద్ధకాలంలోనూ ఆ తర్వాతా మెలనీతో గడిపినన్ని రోజుల్లో ఆమె గురించి స్కార్లెట్‌కు ఇంచుమించు రోజుకో ఆశ్చర్యం, రోజుకో కొత్త ఎరుక! ఇద్దరూ క్షతగాత్రులైన సైనికులకు ఆసుపత్రి సేవలు అందించే కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. అయితే, స్కార్లెట్ అయిష్టంగా, మెలనీ ఇష్టంగా! పిరికిగొడ్డు అనుకునే మెలనీ ఆసుపత్రి వాతావరణాన్ని, అక్కడి దుర్గంధాన్ని భరించడం అలా ఉంచి; శస్త్రచికిత్సలకు సైతం సాయపడడం చూసి స్కార్లెట్ విస్తుపోతుంది. మృత్యుముఖంలో ఉన్న, కాలో చెయ్యో కోల్పోయిన సైనికులకు మృదుత్వము, సానుభూతి, ఆహ్లాదమూ నిండిన తన ప్రవర్తనతో మెలనీ కారుణ్యదేవతలా కనిపిస్తుంది.

స్కార్లెట్, మెలనీల వ్యక్తిత్వాల మధ్య తేడాను చూపించే మరో సందర్భం, సైనికుల సహాయార్థం జరిగిన కార్యక్రమం. పెళ్ళికి ముందే కాదు, పెళ్లి తర్వాత కూడా చాల్స్‌ను స్కార్లెట్ ఏనాడూ ప్రేమించలేదు, గౌరవించలేదు. పైగా ఇంత చిన్నవయసులోనే వైధవ్యం తెచ్చిపెట్టి తన జీవితాన్ని నాశనం చేశాడన్న అక్కసు అతని మీద ఉంది. సైనికుల సహాయార్థం విరాళం అడిగినప్పుడు తన పెళ్లి ఉంగరాన్ని ఇచ్చేస్తుంది. ఆ క్షణంలో ఆ ఉంగరాన్ని వదిలించుకోవడమే ఆమెకు ప్రధానంగా కనిపిస్తుంది తప్ప, సైనికుల కోసం ఇవ్వడం కాదు. ఎదుటివారిలో మంచినే తప్ప చెడును ఊహించుకోవడమే తెలియని మెలనీ ఆ చర్యను గొప్ప త్యాగంగా అర్థంచేసుకుని గర్వంతో పులకించిపోతుంది. తను ఎంతో ప్రేమించే భర్త ఆష్‌లీ తన వేలికి తొడిగిన పెళ్లి ఉంగరాన్ని విరాళంగా ఇచ్చేస్తుంది. ఇద్దరూ చేసింది ఒకటే అయినా ఆంతర్యంలో రెంటి మధ్యా హస్తిమశకాంతరం.

ఆ కార్యక్రమంతోనే ముడిపడిన మరో అంశంలో మెలనీ వ్యక్తిత్వంలోని ఇంకొక ఆశ్చర్యకరమైన పార్శ్వం స్కార్లెట్ దృష్టికి వస్తుంది. తను వితంతువు, పైగా సంతాప దినాలు ఇంకా పూర్తి కాలేదు. విందువినోదాలలో పాల్గొనడం అలా ఉంచి, అసలు తను పదిమందిలోకి రానే కూడదు. కానీ యుద్ధసమయం కనుక ఒక మేరకు మినహాయింపు లభిస్తుంది. తాము కోరుకున్న యువతితో నృత్యం చేసే అవకాశాన్ని కార్యక్రమ నిర్వాహకులు వేలం వేసినప్పుడు స్కార్లెట్‌ను రెట్ బట్లర్ హెచ్చుమొత్తానికి పాడుకుంటాడు. మిగతా అమ్మలక్కలతోపాటు స్కార్లెట్ కూడా దిగ్భ్రాంతి చెందుతుంది. రెట్ పట్ల తనలో ఎంత అయిష్టత ఉన్నా తనకు ఎక్కువ ధర పలికినందుకు గర్విస్తూ, నృత్యించే ఆ అవకాశాన్ని స్కార్లెట్ వినియోగించుకుంటుంది. ఇంటికొచ్చాక ఆ చర్యను పిటీపాట్ తీవ్రంగా తప్పు పడుతుంది. అసలు నృత్యం చేయడమే తప్పైతే, రెట్ బట్లర్ లాంటి తప్పుడు మనిషితో చేయడం ఇంకా తప్పంటుంది.

దుఃఖంతో కుంగిపోయిన స్కార్లెట్‌కు ఆ సమయంలో మెలనీ నుంచి సమర్థన, ఓదార్పు లభిస్తాయి. సైనికుల కోసం, ఆసుపత్రి కోసం నువ్వు చేసిన పని తప్పు కాకపోగా ఎంతైనా అభినందనీయమని మెలనీ అంటుంది. అసలే తను భర్త మరణించిన దుఃఖంలో ఉందని, నాలుగు గోడల మధ్య మగ్గిపోవడం తనను ఇంకా బాధిస్తుందనీ ఆంట్‌తో అంటుంది. యుద్ధ సమయం అన్ని సమయాల వంటిది కాదని, ఇంటికీ ఊరికీ అయినవారికీ దూరంగా బయట, ఆసుపత్రిలో ఒంటరిగా గడిపే సైనికులను తలచుకున్నప్పుడు మనం ఇంటికే పరిమితమవడం స్వార్థమవుతుందని, మనందరం అప్పుడప్పుడు పార్టీలకు వెళ్లవలసిందేనంటుంది.

పైన చెప్పుకున్నట్టు, దక్షిణాది ప్లాంటర్‌ల సాంప్రదాయిక సమాజంలోని అమ్మాయిలకు ఒక పరిపూర్ణమైన నమూనాగా భావించదగిన మెలనీకి ఆ సమాజం తాలూకు కట్టుబాట్లపై ఎంత పట్టింపు ఉంటుందో ఊహించుకోగలం. ఇందుకు భిన్నంగా కేవలం తన ఇష్టాయిష్టాలకు, సరదాలకు, స్వార్థాలకూ అనుగుణంగా జీవించడమే లక్ష్యంగా కట్టుబాట్లను తోసిరాజనే స్వభావం స్కార్లెట్‌ది. కానీ ఇక్కడ విచిత్రమేమిటంటే, కట్టుబాట్లను పక్కకు నెట్టేసి ముందుకు వెళ్లడంలోనే స్కార్లెట్‌లో అసాధారణమైన తెగింపు కనిపిస్తుంది తప్ప, వాటిని నిరాకరించడంలో కాదు. వాచా వాటిని కాదనడం దగ్గరికి వచ్చేసరికి ఆమెలో ఊగిసలాట, అధైర్యం అనేక సందర్భాలలో వ్యక్తమవుతాయి. పార్టీలో రెట్ బట్లర్‌తో ఆమె సంభాషణ అలాంటి ఒక సందర్భం. ‘అమ్మలక్కల మాటలను నువ్వు పట్టించుకుంటావా?’ అని అతను అడిగినప్పుడు, ‘అంత గుచ్చి గుచ్చి అడిగితే పట్టించుకోననే చెబుతానని, అయితే ఆడపిల్ల అన్నాక పట్టించుకోవాలేమోననీ’ ఆమె సందిగ్ధంగా సమాధానం చెబుతుంది.

విశేషమేమిటంటే, అనామకంగా, అర్భకంగా, వ్యక్తిత్వరహితంగా కనిపించే మెలనీలో ఆ ఊగిసలాట, అధైర్యం మచ్చుకైనా కనిపించవు. సమయానుసారంగా కట్టుబాట్లను సడలించే ధైర్యమే కాదు; ఆ సంగతిని నిర్ద్వంద్వంగా, యుక్తియుక్తంగా, సహేతుకంగా ప్రకటించగల వివేకమూ ఆమెలో ఉంది. ‘యుద్ధ సమయం అన్ని సమయాలలాంటిది కా’దనడంలో అది కనిపిస్తుంది. ఎందులోనూ ఊగిసలాట లేకపోవడం అనే ఈ లక్షణం ఆమెలో ఇంకా అనేక సందర్భాలలో వ్యక్తమవుతుంది. యుద్ధ ప్రయోజకత్వం విషయానికే వస్తే, భర్త ఆష్‌లీ ఒక దశలో సందిగ్ధానికి లోనవుతాడు. గెలిచినా, ఓడినా ఫలితం ఒకలానే ఉంటుందనుకుంటాడు. కానీ మెలనీలో ఎలాంటి సందిగ్ధత, ఫలితం గురించిన ఎలాంటి విచికిత్స లేదు. యుద్ధమంటూ వచ్చాక అందులో పాల్గొని వీరమరణం చెందడమే అత్యున్నతమంటుంది. ‘ఆష్‌లీ యూనియన్ పట్ల విధేయతను చాటుకుని జైలునుంచి విడుదలై పారిపోయి రావచ్చుకదా!’ అని స్కార్లెట్ అన్నప్పుడు, మెలనీ ఆ మాటకు తీవ్రంగా స్పందిస్తుంది. ఆమె కోపం ప్రదర్శించిన చాలా అరుదైన సందర్భాలలో ఇది ఒకటి. ‘ఆయన అలాంటి పని చేస్తాడని ఎలా అనుకుంటున్నావు? సొంత కాన్ఫెడరసీని అలా వంచిస్తాడా? అంతకన్నా రాక్ ఐలండ్‌లో తను మరణించడానికైనా సిద్ధపడతాడు. జైల్లోనే తను మరణిస్తే నేను ఎంతో గర్విస్తాను. పారిపోయి వస్తే ఆయన మొహం కూడా చూడను,’ అంటుంది. భర్త క్షేమంగా తిరిగిరావాలని అహర్నిశలూ పరితపించే మెలనీ నోట ఈ పరుషవాక్యాలు స్వభావవిరుద్ధంగా తోచి ఒకవైపు ఆశ్చర్యం కలిగిస్తాయి. మరోవైపు, కొన్ని సాంప్రదాయిక విలువల పట్ల పట్టువిడుపులు లేని ఆమె వైఖరిని వెల్లడిస్తాయి. అదే సమయంలో, ఎక్కడ గీత గీయాలో ఎక్కడ గీత చెరిపేయాలో తూచినట్టు నిర్ధారించగలిగిన ఆమెలోని అసాధారణ వివేకాన్నీ పట్టి చూపుతాయి. ఇంకా విశేషమేమిటంటే, ఈ సందిగ్ధతారాహిత్యంలో చివరికి రెట్ బట్లర్ కూడా ఆమెకు సాటి రాకపోవడం. తన సిద్ధాంతాలనూ, సూత్రీకరణలనూ సవరించుకున్న సందర్భాలు అతనికీ ఉన్నాయి. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూనే ఒక దశలో తను కూడా అందులో పాల్గొనడం ఒక ఉదాహరణ. ఈ కోణంలో చూసినప్పుడు నవల మొత్తంలో మెలనీయే నాయికామణిగా భాసిస్తుంది.

ఒకవైపు మెలనీ స్వభావంలోని ఈ ఆశ్చర్యకరమైన పార్శ్వాన్ని గమనిస్తూనే మరోవైపు స్కార్లెట్ ఆమె స్పర్శను, ఓదార్పును చీదరించుకుంటుంది. ‘నన్ను నేను సమర్థించుకోగల’ననుకుంటూ ఆమె సమర్థింపును ఈసడించుకుంటుంది. తనలో కరడుగట్టిన అహం, ఆభిజాత్యం, ద్వేషం మెలనీ ఔన్నత్యం ముందు తలవంచే క్రమానికి ఇది ఇంకా ప్రారంభం మాత్రమే.

మెలనీ స్వభావం స్కార్లెట్‌ను మరింత ఆశ్చర్యంలో ఆలోచనలో ముంచెత్తే మరో కీలక సందర్భం, యుద్ధం నేరుగా అట్లాంటాలోకే అడుగుపెట్టడం. మెలనీ ప్రసవించే సమయం తోసుకువస్తుంటూంది. తను అసలే అరిపేద, ఆపైన ఆమె కటిస్థలం ఎంత ఇరుకంటే, డాక్టర్ మీడ్ ఉద్దేశంలో ఆమె సంతానం కనడానికే యోగ్యురాలు కాదు. భయస్తురాలైన అత్త పిటీపాట్ మెలనీని, స్కార్లెట్‌ను తీసుకుని తన కజిన్ ఉండే మెకాన్‌కు (Macon) వెళ్లిపోవాలనుకుంటుంది. తను ససేమిరా మెకాన్‌కు రానని, తన పుట్టిల్లు టారాకు వెళ్లిపోతాననీ స్కార్లెట్ పట్టుబడుతుంది. అప్పుడు, ‘నన్ను ఒంటరిని చేసి వెళ్లవద్దు, నువ్వు నాకు సోదరి కన్నా ఎక్కువ, అదీగాక నన్ను జాగ్రత్తగా చూసుకుంటానని ఆష్‌లీకి మాట ఇచ్చావ’ని మెలనీ తనను కాళ్లా వేళ్లా పడినప్పుడు స్కార్లెట్ ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ ఉండిపోతుంది. ఆమె మీద తన అయిష్టాన్ని ఏనాడూ దాచలేదు; ఆష్‌లీ రాకకోసం, అతని క్షేమసమాచారం కోసం తన కంటే ఎక్కువ ఆత్రంగా ఎదురుచూస్తూ ఇన్ని మాసాల్లో ఆమె ముందు తను వందలసార్లు బయటపడిపోయింది, అయినా తనను ప్రేమించే ఇంత మూర్ఖురాలేమిటని అనుకుంటుంది. తన ప్రేమాస్పదులలో మంచిని తప్ప మరేమీ చూడలేని ఆమె స్వభావానికి విస్తుపోతుంది.

పిటీపాట్ మెకాన్‌కు వెళ్లిపోతుంది. స్కార్లెట్, మెలనీలు అట్లాంటాలో ఉండిపోతారు. యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతూ పట్టణం మొత్తాన్ని ఉద్రిక్తత అంచుల మీద నిలబెడుతుంది. ఎంత అత్యవసరానికైనా వీథిలోకి వెళ్లలేని పరిస్థితి. ఇంకోవైపు నెలలు నిండి ఏ క్షణంలోనైనా మెలనీ ప్రసవించే అవకాశం. స్కార్లెట్‌లో స్వార్థ, పరార్థాల మధ్య సంఘర్షణ పతాకస్థాయిని అందుకుంటుంది. మెలనీని తన చావుకు తనను విడిచిపెట్టి, తను టారాకు వెళ్లిపోవాలని ఆమె అనుకోని క్షణం లేదు. వీథుల్లో ఏప్రిల్ వర్షంలా కురిసే తూటాల మధ్య డాక్టర్ కోసం తను వెళ్ళేది లేదని అనుకుంటుంది. తనతో ఏ విధమైన సారూప్యమూ లేని, తను అమితంగా ద్వేషించే మెలనీ కోసం తను అట్లాంటాలో ఉండిపోవడం ఆమెకు వింతగా అనిపిస్తుంది. మెలనీ త్వరగా ప్రసవించాలనే కాదు, చివరికి ఆమె చావును కూడా కోరుకుంటుంది. ఆష్‌లీకి తను ఇచ్చిన మాట అడ్డుపడకపోతే ఆమె స్వార్థమే గెలిచి ఉండేది. నిజానికి ఆ మాటకు కట్టుబడడంలో ఉన్నదీ స్వార్థమే.

ఈ ఘట్టంలోనే మెలనీ, స్కార్లెట్‌ల మధ్య జరిగిన ఒక సంభాషణలో మెలనీ వ్యక్తిత్వపు మరో విశిష్ట కోణం మెరపులా తాకుతుంది. ‘నువ్వు ప్రసవించడానికి ఎంత సమయం పట్టిం’దని మెలనీ అడుగుతుంది. ‘నేను పెరట్లోకి వెళ్ళాను. తిరిగి ఇంట్లోకి వెళ్ళేంత వ్యవధి కూడా లేకుండా ప్రసవించాను. ఇలాంటి ప్రసవాన్ని అప్రతిష్టగా భావిస్తారని అమ్మ చెప్పింది. ఒక డార్కీ ఇలాగే ప్రసవించిందట.’ అని స్కార్లెట్ అంటుంది. అప్పుడు, ‘నేను కూడా అలాంటి డార్కీనైతే బాగుండుననిపిస్తోం’దని మెలనీ అంటుంది.

మెలనీ ప్రసవించాక ఆమెను తీసుకుని బట్లర్ సమకూర్చిన చిన్న బండిలో స్కార్లెట్ సాహసోపేత ప్రయాణం సాగించి టారాకు చేరుకుంటుంది. మెలనీ అసలే దుర్బలురాలు, దానికితోడు బాలెంత. పుష్టికరమైన ఆహారం లేదు. పూర్తిగా మంచానికే పరిమితమవుతుంది. తనకు పాలు పడకపోవడంతో డిల్సీ (Dilcey) అనే నల్లజాతి స్త్రీ ఆ పసిబిడ్డకు స్తన్యమిస్తుంది. రోగగ్రస్తులకు ఆకలి ఉండదని, తనకిచ్చే పాలు కూడా డిల్సీకే ఇవ్వమని మెలనీ అన్నప్పుడు ఆ నిస్వార్థత స్కార్లెట్‌కు కోపం తెప్పిస్తుంది. అంతకన్నా ఆమెకు ఆశ్చర్యం గొలిపింది, మంచానికే అతుక్కుపోయిన అంత నిస్సత్తువ స్థితిలో కూడా ఇంట్లోని పనివాళ్లతోపాటు తన కొడుకు వేడ్ (Wade), చివరికి తండ్రి జెరాల్డ్ కూడా మెలనీనే పట్టుకుని వేళ్లాడడం!

అసలే తిండికి కటకట పడుతున్న పరిస్థితిలో తండ్రి, చెల్లెళ్ళు, పనివాళ్ళ పోషణభారంతోపాటు మెలనీ భారం కూడా తనకెందుకున్న స్కార్లెట్ ఆమెను, పసికందును అత్త దగ్గరకు మెకాన్‌కు పంపేయాలని కూడా ఒక దశలో అనుకుంటుంది. మెలనీ లాంటి దుర్బలులను తను ఎప్పటికీ ప్రేమించలేనని అనుకుంటుంది తప్ప; మెలనీ ఉనికే తనకు కొండంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుందన్న సంగతిని అప్పటికీ గ్రహించలేని కరడుగట్టిన అజ్ఞానం తనది. ఆ అజ్ఞానాన్ని సమూలంగా పెకిలించగల ఘట్టం త్వరలోనే వస్తుంది కాని, అది స్కార్లెట్‌పై శాశ్వతప్రభావం చూపలేకపోతుంది.

ఒక యాంకీ సైనికుడు దొంగతనానికి ఇంట్లోకి జొరబడతాడు. స్కార్లెట్ అతన్ని చూసి భయంతో బిక్కచచ్చిపోతుంది. ఇంట్లో తను, అస్వస్థులైన ఇద్దరు చెల్లెళ్ళు, బాలెంత అయిన మెలనీ తప్ప మగవాళ్ళు ఎవరూ లేరు. సైనికుల అత్యాచారాల గురించి తను విన్నవన్నీ ఆ క్షణంలో ఆమెకు గుర్తుకొస్తాయి. అతని కంటపడకుండా తను పారిపోలేని పరిస్థితి. అతను డైనింగ్ హాలు దాటి వంటింటి వైపు వెళ్ళడం చూసి ఆమెలోని భయం కాస్తా కసిగా, క్రోధంగా మారిపోయి గొప్ప తెగింపును తీసుకొస్తుంది. కారణం, నిర్మానుష్యాలైన చుట్టుపక్కల ఇళ్ళలోంచి తాము వెతికి తెచ్చిపెట్టుకున్న యాపిల్ పళ్ళు, కూరగాయలు వంటింట్లో ఉన్నాయి. ఇద్దరికి సరిపోయే ఆహారం అవి. కానీ ఇంట్లో ఉన్న తొమ్మిది మంది పంచుకోవాలి. అవి ఆ దొంగ పాలు కావడాన్ని ఆమె సహించలేకపోతుంది. ఆపైన తల్లి ఎలెన్ తన కుట్టుపని సామగ్రిని ఉంచుకునే బంగారు పెట్టెను అతని చేతిలో చూసి మరింత ఆగ్రహంతో ఊగిపోతుంది. చప్పుడు చేయకుండా ఒక సొరుగు లాగి భర్త చాల్స్‌కు చెందిన ఒక బరువైన పిస్టల్ తీస్తుంది. ఆమెను చూసి ఆ సైనికుడు తన పిస్టల్ గురిపెట్టేలోపలే తను అతన్ని కాల్చివేస్తుంది.

తను ఒక మనిషిని చంపింది! ఆ దిగ్భ్రాంతి నుంచి తేరుకోవడం, ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవడం స్కార్లెట్‌కు వెంటనే సాధ్యం కాలేదు. తను పేల్చిన పిస్టల్ చాల్స్‌దే కానీ దానినతను ఎప్పుడూ వాడలేదు, తను వాడింది. అంటే ఈ ఏడాది కాలంలో యుద్ధం, అది తెచ్చిపెట్టిన జీవనకల్లోలం స్త్రీ-పురుష వివక్షను ఎలా చెరిపివేసిందో ఈ చిన్న సూచన ద్వారా రచయిత్రి స్ఫురింపజేస్తుంది. తీరా, రక్తపు మడుగులో పడున్న ఆ సైనికుని మృతదేహాన్ని సమీపించి అక్కడ ఉన్నతల్లి తాలూకు పెట్టెను, అందులోని వస్తువులను చేతిలోకి తీసుకున్నాక స్కార్లెట్‌లో అపరాధభావన తొలగిపోయి సంతృప్తి, గర్వం అంకురిస్తాయి. కళ్ళెత్తి చూసేసరికి ఇంకో ఆశ్చర్యం! మెట్ల మీద మెలనీ! చింకిపాతతో ఉంది. బలహీనమైన ఆమె చేతిలో చాల్స్‌కు చెందిన ఓ బరువైన కరవాలం. నిశ్శబ్దంగా ఆమె కళ్ళు స్కార్లెట్ కళ్లను కలసుకున్నాయి. ఎప్పుడూ మార్దవంగా కనిపించే ఆమె ముఖంలో పట్టలేని గర్వం తెచ్చిపెట్టిన ఒక ఔజ్వల్యం; విపరీతమైన ఆనందం ఉట్టిపడే ఆమె చిరునవ్వులో ఒక ఆమోదముద్ర. స్కార్లెట్ హృదయంలో ఆ క్షణంలో చెలరేగే తీవ్ర కల్లోలంతో ఆ చిరునవ్వు తులతూగింది.

ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరైన స్కార్లెట్, ‘తను అచ్చం నా ప్రతిరూపంలా ఉంది, నా హృదయసంచలనాన్ని తను అర్థం చేసుకుంది’ అనుకుంటుంది. అంతేకాదు, ‘నేను చేసిన పనే తనూ చేసి ఉండే’దనుకుంటుంది. ఆ ఊహ కలిగించిన పులకింతతో కళ్ళెత్తి, గాలిలో తేలిపోతున్నట్టున్న ఆ దుర్బలమూర్తిని చూసింది. అయిష్టమూ తృణీకారమూ తప్ప తనలో ఏనాడూ ఎలాంటి ఆదరభావమూ కలిగించని మనిషి తను. అలాంటి ఆష్‌లీ అర్ధాంగిపై ఆమెలోని ద్వేషంతో సంఘర్షిస్తూ ఆ క్షణంలో ఒక ప్రశంసాభావన, సహవాసస్ఫూర్తీ ఉబికి వచ్చాయి. మృదువుగా ధ్వనించే ఆ కంఠధ్వని మాటున ఎలాంటీ అల్పభావోద్వేగస్పర్శ లేని ఒక మెరుపు లాంటి స్పష్టత, పావురం కళ్ళలాంటి ఆ కళ్ళలో దుర్భేద్యమైన ఉక్కు తాలూకు మెరుపులీనే పదునైన సన్నని అంచులూ కనిపించాయి. ప్రశాంతంగా పారే ఆమె రక్తంలో సాహసం ఎగరేసిన జెండా రెపరెపలూ మోగించిన భేరీధ్వానాలూ ఉన్నట్టనిపించింది.

అంతలోనే వాస్తవికతలోకి వచ్చి స్కార్లెట్ అప్రతిభురాలై ఉండిపోయిన స్థితిలో మెలనీ వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకుంటుంది. పిస్టల్ పేలిన ధ్వనికి స్కార్లెట్ చెల్లెళ్ళు, కొడుకు భయంతో కేకలు పెడుతున్నప్పుడు మెలనీ వారి దగ్గరికి వెళ్ళి, చాల్స్ పిస్టల్ తుడుస్తుండగా అది పొరపాటున పేలిందని సముదాయిస్తుంది. ‘ఎంత తేలిగ్గా అబద్ధమాడింది! నాకైతే ఆ ఆలోచన వెంటనే వచ్చేది కా’దని స్కార్లెట్ అనుకుంటుంది. పనివాళ్లు వచ్చే లోపలే శవాన్ని ఇక్కడి నుంచి తప్పించాలని తొందరపెట్టిన మెలనీ అందుకు సాయపడడానికి ముందుకొస్తుంది. నేనే ఆ పని చేస్తానని స్కార్లెట్ అన్నప్పుడు, శవం పడున్న ప్రదేశాన్ని శుభ్రం చేసే బాధ్యత మెలనీ తీసుకుంటుంది. అతని భుజం సంచీలో ఏమైనా తినే పదార్థాలు ఉండచ్చని వెతుకుదామని సలహా ఇచ్చింది. అందులో చిన్న కాఫీ పొట్లంతో పాటు అతను దొంగిలించిన రకరకాల వస్తువులు; అతని జేబులో పెద్ద మొత్తంలో డబ్బు దొరుకుతాయి.

పైకి కనిపించే తన ఆకృతికి, స్వభావానికి భిన్నంగా; ఒక మనిషిని చంపడంతో సహా యుక్తాయుక్త మీమాంసను అధిగమించి తక్షణమే క్రియాశీల కావడంలో స్కార్లెట్‌లో లేని వేగం మెలనీలో ఉంది. అంతకంటే ఆశ్చర్యకరంగా ఆ వేగంలోనూ సమయస్ఫూర్తితోపాటు ఎక్కడా తడబాటుకు, ఊగిసలాటకు తావివ్వని అసాధారణమైన స్పష్టత ఉంది. అప్పుడున్న ఆ క్లిష్టపరిస్థితులలో మెలనీతో బలమైన సహవాసిత్వాన్ని అల్లుకోవడం ఎంత అవసరమో స్కార్లెట్ గ్రహించడానికి ఇంతకు మించిన అనుభవం మరొకటి ఉండదు.

ఆ తర్వాత ఒక అగ్నిప్రమాదం నుంచి మెలనీ తనను కాపాడిన మరో గొప్ప అనుభవం స్కార్లెట్‌కు ఎదురవుతుంది. ఆ సమయంలో తన ఆడబడుచుపై ఆమెలో మున్నెన్నడూ లేనంత గౌరవభావము, మరింత సన్నిహిత సహవాసిత్వ భావన, అంకురిస్తాయి. ఈ విషయం తనతో చెప్పాలని కూడా అనుకున్న స్కార్లెట్, ప్రతి అవసరానికీ నేనున్నానని తను ముందుకు వస్తూనే ఉందని అనుకుంటుంది. అయితే, మళ్ళీ అదీ క్షణికమే అవుతుంది. మెలనీపట్ల అయిష్టమూ చిన్నచూపే కాక; వాటిని మించిన ద్రోహబుద్ధి ఆమెలో ఆ తర్వాతా పడగవిప్పుతూనే వచ్చింది. ఆష్‌లీ టారాకు తిరిగి వచ్చిన తర్వాత అతనితో జరిగిన తన దీర్ఘసంభాషణలో, ఇద్దరం ఏ మెక్సికోకో పారిపోదామని స్కార్లెట్ ప్రతిపాదన చేసినప్పుడు, మెలనీకి నేను ద్రోహం చేస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావని ఆష్‌లీ ప్రశ్నిస్తాడు.

మెలనీ సాంప్రదాయికమైన కట్టుబాట్లను, అంతస్తుల తేడాలను తోసిరాజన్న సందర్భాలు ఉన్నట్టే, వాటిపై తన పట్టింపును చాటుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఈ వైరుధ్యాన్ని కాస్త లోతుగా చూసి అర్థం చేసుకుంటే వాస్తవంగా మెలనీ పట్టింపు వీటి వేటి మీదా కాక, మనిషి గురించి, మానవత్వం గురించి అన్న అభిప్రాయం కలుగుతుంది. ఉదాహరణకు, తమలానే సంపన్న ప్లాంటర్ తరగతికి చెందిన కేథలీన్ కాల్వర్ట్ (Cathleen Calvert) అనే అమ్మాయి తమ అంతస్తుకు తగని హిల్టన్ (Hilton) అనే ఓవర్సీర్‌ను పెళ్లిచేసుకోబోతున్నట్టు స్కార్లెట్, మెలనీలకు చెప్పినప్పుడు, అందులో ధ్వనించిన విషాదం మెలనీని చలింపజేస్తుంది. దాంతో కాల్వర్ట్‌ల వంశమే అంతరించే ప్రమాదాన్ని ఊహించుకుని, అంతకన్నా పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడమే ఉత్తమమని స్కార్లెట్‌తో అంటుంది. అంతేకాదు, పనివాడు పోర్క్‌ను పంపించి కేథలీన్‌ను మన ఇంటికి రప్పించుకుందామని, తను మనతోనే ఉంటుందనీ స్కార్లెట్‌తో అంటుంది. ఇంట్లో అయినవారికే కడుపునిండా తిండిపెట్టలేకపోతున్న దుర్దశలో మెలనీ సలహాకు స్కార్లెట్ విస్తుపోతుంది. ‘నువ్వే నెలల తరబడిగా నా దాతృత్వం కింద గడుపుతున్న సంగతి నీకు ఎప్పుడూ తట్టలేదు. యుద్ధం ఎలాంటి మార్పూ తేని మనుషుల్లో నువ్వొకదానివి. అసలేమీ జరగనట్టు, జీవితం ఇంతకుముందు ఉన్నట్టే ఉన్నట్టు అనుకుంటున్నా’వని మనసులో అనుకుంటుంది. ప్రతి సందర్భంలోనూ తనకు అక్కరకు వస్తూ, చివరికి తన ప్రాణాలను కూడా కాపాడిన మెలనీ తన ‘దాతృత్వంలో జీవిస్తోం’దనుకోవడం స్కార్లెట్‌లో ఇప్పటికీ చావని అహానికి, మెలనీపై చిన్నచూపుకీ సూచన.

కేథలీన్ విషయంలో అంతస్తుకు ప్రాధాన్యమిచ్చిన మెలనీయే విల్ బెంటీన్ అనే బీదరైతు విషయానికి వచ్చేసరికి అంతస్తుల తేడాలను తోసిపుచ్చే వైఖరి తీసుకుంటుంది. ఆమెలోని నిర్ద్వంద్వతను, స్కార్లెట్ లోని ద్వైధీభావాన్నీ ఆశ్చర్యకరంగా పట్టి చూపే మరో సందర్భం ఇది. విల్ బెంటీన్ వ్యక్తిత్వానికి ముగ్ధురాలైన స్కార్లెట్ తన చిన్న చెల్లెలు కరీన్‌ను అతనికిచ్చి పెళ్లి చేయాలనుకున్నా, ఓహారాలకు తూగడని సంశయించినప్పుడు- ‘అతనికున్నలాంటి దయార్ద్ర హృదయమూ పరోపకారచింతనా ఉన్నవారు ఎవరైనా ఉత్తమజన్ములే’ నంటూ మెలనీ ఆ వివాహం ఆలోచనను సమర్థిస్తుంది. ఇలాంటి అనేక ఘట్టాలలో మెలనీలో తన ఆకృతికీ, స్వభావానికీ పూర్తి భిన్నంగా తోచే, కేవలం ధర్మశాస్త్రకర్తలలో మాత్రమే కనిపించే, ఒక నిష్కర్ష, ఒక అనుశాసనత్వం ధ్వనిస్తాయి. ఆమెలోని నైతిక దారుఢ్యం నుంచి, అన్ని రకాల సంకోచాలనూ చెరిపివేయగల ఎల్లలెరుగని ప్రేమైక శీలం నుంచి, అచంచలమైన మానవీయ చింతననుంచీ సంక్రమించే లక్షణాలు అవి. ఆ ప్రేమైకాశీలత, ఆ మానవీయ చింతనల ముందు కట్టుబాట్లు, అంతస్తుల తేడాలు సహా కాలం గిరిగీసేవి అన్నీ పక్కకు తొలగిపోతాయి. లేదా వాటికి అనుగుణంగా సర్దుకుంటాయి, రూపాంతరం చెందుతాయి. ఎలాంటి సంక్షోభాలనైనా అధిగమించి బతికి బట్టకట్టే కొన్ని విలువలు ఎప్పటికీ మనిషి వెన్నంటి ఉంటూనే ఉంటాయి. అంతిమంగా మెలనీ ప్రాతినిధ్యం వహించేది ఆ విలువలకు. వాటి గురించిన స్పృహ, ప్లాంటర్ల తరగతికి చెందిన ఎందరిలోనో లేని గొప్ప ఆశాభావాన్ని ఆమెలో నింపుతుంది. కేథలీన్‌ను కలసుకున్న సందర్భంలో జరిగిన సంభాషణ ఇందుకు ఒక ఉదాహరణ. ‘స్కార్లెట్, (యుద్ధంలో) మరణించిన మన మగవాళ్ళ స్థానాలను భర్తీ చేసేలా, వాళ్ళ లాంటి ధైర్యవంతుల్నిగా మన పిల్లల్ని పెంచుదా’మని మెలనీ అంటుంది. ఇందులో ఆమె ఉగ్గడించినది ధైర్యమనే చిరంతన విలువను! దానికి కేథలీన్ స్పందిస్తూ, ‘అలాంటి పురుషులు మళ్ళీ పుట్టరు, వాళ్ళ స్థానాలను ఎవరూ భర్తీ చేయలేరు,’ అంటుంది. ప్రేమైకశీలమూ మానవీయచింతనా అనే లోతుల్లోంచి ఉబికివచ్చే ఆశాభావం నిండిన మెలనీ వ్యక్తిత్వానికి, మిగతావారి వ్యక్తిత్వానికి ఉన్న తేడాకు ఇది మచ్చుతునక. ఈ తేడాలోనే ఉంది మెలనీ ముఖంగా నవల ధ్వనించే మొత్తం సందేశమంతా.

భారతీయ సాంప్రదాయిక గృహిణి విషయంలో నొక్కి చెప్పే ‘పాతివ్రత్య’చాయలు మెలనీలోనూ ప్రస్ఫుటంగా కనిపించడం రెండు సాంప్రదాయిక సమాజాల మధ్య భౌగోళికదూరాన్ని చెరిపివేస్తూ సామ్యాన్ని వెల్లడించే ఇంకొక విశేషం. యుద్ధం ముగిశాక, ప్రాణాలతో బయటపడిన దక్షిణాది సైనికులు తిండి కోసం, నిలువ నీడకోసం అల్లాడుతూ గుంపు గుంపులుగా నడిచివస్తూ ఉంటారు. అలా టారా నీడలోనూ కాసేపు సేదదీరుతూ ఉంటారు. అతిథిని ఆదరించి అన్నం పెట్టే వెనకటి పరిస్థితి ఇప్పుడు లేదు. అయినా ఉన్నదాన్నే వారితో పంచుకుంటూ వచ్చినా ఇక మీదట అది సాధ్యం కాదనుకున్న స్కార్లెట్ ఆతిథ్యం తగ్గించమని పనివాడు పోర్క్‌ను ఆదేశిస్తుంది. దాంతో మెలనీ తన వాటా ఆహారంలో కొంతే తీసుకుని మిగతాది అతిథులకు పెట్టే ఏర్పాటు చేస్తుంది. ఇది తెలిసిన స్కార్లెట్, ప్రసవించిన తర్వాత ఇంతవరకు నువ్వు బలం పుంజుకోలేదు, ఇలా చేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుందని మందలిస్తుంది. అప్పుడు మెలనీ కళ్ళల్లో ఎన్నడూ కనిపించనంత ఉద్వేగం కనిపిస్తుంది. ఇలా అంటుంది: ఓహ్! స్కార్లెట్, నా మీద కోప్పడకు. నన్నిలా చేయనివ్వు. ఇది నన్నెంత ఆదుకుంటుందో నీకు తెలియదు. ఒక పేదమనిషితో నా వాటా అన్నం పంచుకున్నప్పుడల్లా నేను ఒకటే అనుకుంటూ ఉంటాను; ఉత్తరాదిన ఎక్కడో ఏ రోడ్డు మీదో ఇలాగే నడిచివెళ్లే నా ఆష్‌లీకి ఏ చల్లని తల్లో తన అన్నం లోంచి నాలుగు ముద్దలు పెడుతుంది. తను నా దగ్గరికి రావడానికి అది ఓపిక నిస్తుంది.

భర్త క్షేమం కోసం భారతీయ గృహిణులు చేసే ఉపవాసాలు, వ్రతాలతో ఇక్కడ పోలిక సరే; ఆశ్చర్యం గొలిపే ఒక తేడా కూడా ఉంది. ఉపవాసాలు, వ్రతాల వెనుక వ్యక్తమయ్యే ఒక యాంత్రిక విశ్వాసానికి భిన్నంగా తనిక్కడ ఒక అన్నార్తుడికి అన్నం పెడితే, దయగల ఏ తల్లో తన భర్తకూ ఇలాగే అన్నం పెడుతుందన్న ఒక సరళమైన తర్కము, లౌకికంగా మన బుద్ధికి అందే ఒక హేతుబద్ధత మెలనీ మాటల్లో ఉన్నాయి. అంతేకాదు, దయ, సానుభూతి వంటి సహజాతాలు దేశ కాలాలను, ప్రాంతాలను, శత్రుత్వాలనూ కూడా దాటి తమ ఉనికిని చాటుకుంటాయన్న గొప్ప భరోసా, దృష్టివైశాల్యం ఆ మాటల్లో వ్యక్తమవుతాయి.

మెలనీలోని ఈ సరళ తార్కికత, హేతుబద్ధత మరింత ఆశ్చర్యకరంగా వ్యక్తమైన మరో సందర్భం అట్లాంటాలోని ప్లాంటర్‌ల సమాజానికి ఆమెను నాయకురాలిగా ప్రతిష్టిస్తుంది. అమరవీరుల సమాధులున్న ప్రదేశాన్ని అందంగా తీర్చిదిద్దడానికి, యుద్ధంవల్ల వితంతువులు, అనాథలుగా మారినవారికి కుట్టుపని నేర్పించి ఉపాధి కల్పించడానికీ రెండు సంఘాలు ఏర్పడి అప్పటికే పనిచేస్తూ ఉంటాయి. యుద్ధంలో మరణించిన యాంకీ, కాన్ఫెడరేట్ సైనికుల సమాధులు పక్కపక్కనే కలసిపోయి ఉండడం, వాటి చుట్టూ కలుపు మొక్కలు పెరిగిపోవడంతో శత్రుసైనికుల సమాధుల దగ్గర కూడా శుభ్రం చేయాలా అన్న ప్రశ్న తలెత్తుతుంది. కుట్టు పని సంఘం శుభ్రం చేయాలని భావిస్తే, రెండో సంఘం దానిని వ్యతిరేకిస్తుంది. వివాదం ముదిరి ఘర్షణకు దారితీస్తుంది. యాంకీల సమాధుల్నే తవ్వేసి వాళ్ళ మృతదేహాలను చెత్తకుప్ప మీద పారేస్తానని మిసెస్ మీడ్ అంటుంది. ఇలా ఆగ్రహావేశాలు మిన్నంటిన ఆ దశలో మెలనీ వాళ్ళ మధ్యకు వెళ్ళి గొంతు విప్పుతుంది. ఆమె మృదువైన కంఠధ్వనికి, అందులోని గాద్గద్యానికి చలించిన రెండు పక్షాలూ వెంటనే మౌనంగా వహిస్తాయి. ఒక్కసారిగా చల్లబడిన ఆ నిశ్శబ్ద వాతావరణంలో మెలనీ గొంతు ఇలా వినిపిస్తుంది: నేను ఒక మాట చెప్పదలచుకున్నాను. నేను చాలా రోజులుగా దీని గురించి ఆలోచిస్తున్నాను. మనం సమాధుల దగ్గర కలుపు తీయడమే కాదు, వాటి దగ్గర పువ్వులు కూడా ఉంచాల్సిందే. మీరు ఏమనుకున్నా సరే, నా ప్రియమైన చార్లీ సమాధి దగ్గర పువ్వులు ఉంచిన ప్రతిసారీ పక్కనే ఉన్న ఒక అజ్ఞాత యాంకీ సమాధి దగ్గర కూడా పువ్వులు ఉంచి వస్తూ ఉంటాను. అది- అది దిక్కూ దివాణంగా లేనిదిగా కనిపిస్తుంది!

వ్యతిరేకులు ఆమె మాటలకు అడ్డుతగలబోతారు. అప్పుడు మెలనీ ప్రాధేయపూర్వకంగా వాళ్ళతో అంటుంది: దయచేసి నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ఈ విషయం మీద మాట్లాడే హక్కు నాకు లేదని తెలుసు. ఒక్క చార్లీ తప్ప నా ప్రియతములు ఎవరూ యుద్ధంలో చనిపోలేదు. అయితే, తనను ఎక్కడ సమాధి చేశారో, భగవంతుడి దయవల్ల నాకు తెలుసు. కానీ, తమ కొడుకుల్ని, భర్తలను, సోదరులను ఎక్కడ సమాధి చేశారో కూడా తెలియని అభాగ్యులు ఈ రోజున మనలో ఎంతమంది ఉన్నారో గమనించారా…

దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోతుంది. అంతటా నీరవనిశ్శబ్దం అలముకుంటుంది. యుద్ధంలో తమ ప్రియతములను కోల్పోయిన అక్కడున్న ఎందరో మహిళల గుండెల్ని మెలనీ మాటల్లోని నిష్టురసత్యం శూలంలా గుచ్చుకుని నిరుత్తరలను చేస్తుంది. దాంతో మరింత స్థైర్యాన్ని పుంజుకున్న మెలనీ అంటుంది: యాంకీల సమాధులు మన దగ్గర ఉన్నట్టే, మన వాళ్ళ సమాధులు యాంకీల దేశంలో ఎక్కడో ఉంటాయి. ఏ యాంకీ మహిళైనా మన వారి సమాధుల్ని తవ్వి పారేస్తానంటే మన కెలా అనిపిస్తుంది — అదే, ఒక ఉత్తమురాలైన యాంకీ మహిళ అక్కడా ఉండే ఉంటుందని తెలిస్తే మనకెంత బాగుంటుంది– యోగ్యులైన యాంకీ మహిళలు కచ్చితంగా ఉంటారు. ఎవరేమనుకున్నా సరే, వాళ్ళందరూ అయోగ్యులు కావడానికి వీల్లేదు. తమకు ఎంత శత్రువులైనాసరే, మన వాళ్ళ సమాధుల దగ్గర వాళ్ళు కలుపు తొలగించి పువ్వులు కూడా ఉంచితే అదెంత హృదయంగమంగా ఉంటుంది! చార్లీ ఉత్తరాదినే చనిపోయి ఉంటే ఏ పుణ్యాత్మురాలైనా అలా చేస్తుందన్న ఊహ నాకు ఎంతో ఓదార్పునిస్తుంది. నా గురించి మీరు ఏమనుకున్నా లెక్క చేయను… రెండు సంఘాలనుంచీ తప్పుకుంటాను. నాకు కనిపించిన ప్రతి యాంకీ సమాధి దగ్గరా కలుపు తొలగిస్తాను. అంతేకాదు, వాటి దగ్గర పువ్వులు కూడా ఉంచుతాను. నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను!

ఈ చివరి మాటలతో, కళ్ళు జలజలా వర్షిస్తుండగా ఆపుకోలేని ఉద్వేగంతో తడబడుతూ మెలనీ బయటకు వెళ్లబోతుంది. ఓ గంట తర్వాత, గ్రాండ్‌పా మేరీవేదర్ అంకుల్ హెన్రీ హామిల్టన్‌కు చెప్పిన ప్రకారం, మెలనీ ఈ మాటలన్న తర్వాత అక్కడున్న అందరూ భోరున విలపిస్తూ మెలనీని వాటేసుకుంటారు. వాతావరణం ఒక్కసారిగా ప్రేమోద్వేగపూరితంగా మారిపోతుంది. రెండు సంఘాలకూ మెలనీని కార్యదర్శిని చేస్తారు.

ఇక్కడ యాంకీ సైనికుల సమాధుల దగ్గర కూడా శుభ్రం చేసి పువ్వులు ఉంచితే అక్కడి దయగల తల్లులు తమ వాళ్ళ సమాధులనూ అలాగే గౌరవిస్తారన్న- అదే సరళమైన తర్కం, అదే హేతుబద్ధత మెలనీ మాటల్లో! ఎల్లలెరుగని మంచితనం, మానవత్వాల పట్ల అదే ధీమా. మళ్ళీ అది స్వార్థాన్ని పూర్తిగా చంపుకుని పరార్థం కోసం పాకులాడాలని చెప్పే విపరీత ఆదర్శవాదం కాదు; స్వార్థంతో కూడిన పరార్థచింతన. యుక్తియుక్తంగా మనల్ని ఒప్పించగలిగిన ఆచరణయోగ్యమైన పరార్థదృష్టి. మెలనీ ప్రేమాస్పద వ్యక్తిత్వాన్ని మరింత ఉజ్వలింపజేస్తూ ఆకర్షణ గొలిపేది ఆమెలోని ఈ అసాధారణ వివేకమే. వీటికి అదనంగా, ఆరు నూరైనా సరే, తను నమ్మింది ఆచరించే ఆమెలోని సాహసాన్నీ ధిక్కారాన్నీ అంతిమంగా అందరినీ తన వెంట నడిపించుకోగలిగిన నాయకత్వ లక్షణాన్నీ కూడా వెల్లడించే సందర్భం ఇది. అయితే అట్లాంటా లోని ప్లాంటర్‌ల సమాజానికి తను నాయకురాలు అవుతున్న సంగతి అప్పటి కామెకు తెలియనే తెలియదు.

ఇక్కడినుంచి ఓసారి వెనకకు, అంటే మెలనీ, స్కార్లెట్‌లు టారాలో కలసి గడిపిన రోజులకు వెడదాం. ఎప్పటిలానే మెలనీని అర్థంచేసుకోడానికి స్కార్లెట్‌కు ఒక జీవితకాలం పట్టేలానే ఉంది. ఆమె తండ్రి జెరాల్డ్ చనిపోతాడు. తల్లి ఎలెనును అమితంగా అభిమానించే గ్రాండ్‌మా ఫాన్‌టెయ్‌న్ (Fontaine) జెరాల్డ్ అంత్యక్రియలకు వస్తుంది. ఆమె ఈ ఒక్క సందర్భంలోనే కనిపించి మాయమయ్యే చిన్న పాత్ర. కానీ దక్షిణాది ప్లాంటర్‌ల సమాజం తీరుతెన్నులను లోతుగా ఎరిగి వ్యాఖ్యానించగలిగిన ఒక ప్రతినిధిపాత్ర. రెట్ బట్లర్ లోని కరకుదనం, మెలనీలోని వివేకం, స్కార్లెట్ లోని సాహసంతో పాటు, రేపటి పట్ల ఆ ముగ్గురిలోనూ ఉన్న ఆశాభావం ఆమె మాటల్లో వ్యక్తమవుతుంది.

ఆమెకూ స్కార్లెట్‌కూ మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. నవలలోని దీర్ఘసంభాషణలలో అదొకటి. వివిధ సందర్భాలలో జరిగిన ఈ దీర్ఘసంభాషణలు అంతర్యుద్ధ నేపథ్యంలో ప్లాంటర్‌ల సమాజ స్థితిగతుల సమీక్షలుగానూ భవిష్యనిర్దేశాలుగానూ కనిపించి కీలకమైన ప్రబోధాత్మక పాత్ర నిర్వహిస్తాయి. ఈ దీర్ఘసంభాషణలు అన్నింటిలో స్కార్లెట్ భాగస్వామి కావడం కూడా గమనించవలసిన అంశం. విచిత్రంగా, ఇలాంటి అంతర్యుద్ధమే ప్రధాన వస్తువుగా ఉన్న మహాభారత ఇతిహాసంతోనూ ఇక్కడ పోలిక కుదురుతోంది. అందులో కూడా వివిధ ఘట్టాలలో ప్రబోధాత్మకాలైన దీర్ఘ సంభాషణలు ఉంటాయి. యుద్ధ సమయంలో భగవద్గీత రూపంలో కృష్ణార్జునుల మధ్య జరిగిన దీర్ఘసంభాషణ ఇలాంటిదే.

కరీన్‌ను తను ఇష్టపడినా, సుఎలెన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు అంత్యక్రియల ప్రసంగంలో విల్ బెంటీన్ ప్రకటిస్తాడు. డబ్బుమీద ఆశతో యూనియన్‌కు విధేయతను చాటే పత్రంపై సంతకం చేయమని తండ్రిపై ఒత్తిడి తెచ్చి పరోక్షంగా అతని ఆకస్మిక మరణానికి బాధ్యురాలిగా నింద మోయవలసివచ్చిన సుఎలెన్‌పై సానుభూతే అతని ఈ నిర్ణయానికి కారణం. ఫాన్‌టెయిన్, స్కార్లెట్‌ల సంభాషణలో ఈ పెళ్లి ప్రస్తావన వస్తుంది. ‘నీ చెల్లెలు తన తరగతికి చెందని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా?’ అని ఫాన్‌టెయిన్ అడుగుతుంది. ‘తరగతా?’ అంటూ విస్తుపోయిన స్కార్లెట్, ‘ఇప్పుడు తరగతి ఎవరిక్కావాలి? అమ్మాయిని పోషించగలిగిన మొగుడు దొరికితే గొప్ప’ అంటుంది. ‘అయితే విల్ నీ కుటుంబంలో ఒకడు కావడం నీకు సమ్మతమేనా?’ అని ఫాన్‌టెయిన్ గుచ్చి అడుగుతుంది. తను ఈ పెళ్లిని ఖండించబోతోందనుకున్న స్కార్లెట్ ఆమె మీద విరుచుకుపడడానికి సిద్ధమవుతూ, ‘సమ్మతమే’నని నొక్కి చెబుతుంది.

కానీ, ఫాన్‌టెయిన్ స్పందన ఆమె ఊహను తలకిందులు చేసి ఆశ్చర్యపరుస్తుంది. చిరునవ్వుతోనే ఈ పెళ్ళికి తన ఆమోదాన్ని సూచించిన ఫాన్‌టెయిన్, ‘ఇంతవరకూ నీ మీద నాకు ఎప్పుడూ ఇష్టం కలగలేదు. చిన్నప్పటినుంచీ నువ్వు కొరకరాని కొయ్యవే (మూలంలో వాడిన మాట, hickory nut). నేను మినహా ఆడవాళ్ళు ఎవరూ అలా ఉండడం నాకు నచ్చదు. కానీ నువ్వు సమస్యలను ఎదుర్కొనే తీరును నేను ఇష్టపడతాను. నీకు ఎంత నచ్చనివైనా నీ చేతుల్లో లేని వాటి గురించి నువ్వు అదే పనిగా గింజుకోవు,’ అని స్కార్లెట్‌తో అంటుంది.

‘అయితే ఈ పెళ్లిని నువ్వు ఆమోదిస్తున్నావన్నమాట,’ అని తను గుచ్చి అన్నప్పుడు ఫాన్‌టెయిన్ చెప్పిన సమాధానం స్కార్లెట్‌ను మరోసారి చిత్తు చేస్తుంది. ‘ఈ పెళ్లిని నువ్వు ఎంత ఆమోదించవో నేనూ అంతే ఆమోదించను. కానీ నేను ఆచరణవాదిని, నువ్వూ అంతే,’ నన్న ఫాన్‌టెయిన్ పడిపోయిన ప్రతిసారీ తిరిగి పైకి లేచిన ప్లాంటర్‌ల సమాజపు గతాన్ని స్పృశిస్తూ దానిలోని జీవశక్తి ఎలాంటిదో చెబుతుంది. అంతకంటే ముఖ్యంగా ఈ అంతర్యుద్ధ పతనాన్ని తట్టుకుని తిరిగి ఈ సమాజం సంతరించుకోగల పూర్వవైభవం పట్ల చెక్కుచెదరని ఆశాభావాన్ని ప్రకటిస్తుంది. మన చేతుల్లో లేని అసంతుష్టికర పరిణామాలు సంభవించినప్పుడు దాని గురించి ఊరికే గింజుకోవడంలో తనకు ఎలాంటి అర్థమూ కనిపించదంటుంది. తిరిగి పుంజుకునే అదను కోసం నిరీక్షిస్తూ, ఇలాంటి అనేక ఉత్పాతాలను చిరునవ్వుతో ఎదుర్కొన్నామని, ఆ విధంగా ఎలాగైనా బతికి బట్టకట్టే కళలో సిద్ధహస్తులమయ్యామని, అదే మన అస్తిత్వ రహస్యమనీ అంటుంది. ‘మనం ప్రతిసారీ తప్పుడు గుర్రాల మీదే పందెం కాశాం. హ్యూగనాట్‌లతో కలసి ఫ్రాన్స్ నుంచి; కెవాలియర్‌లతో కలసి ఇంగ్లండ్ నుంచి; బోనీ ప్రిన్స్ చార్లీతో కలసి స్కాట్లండ్ నుంచి; నల్లజాతివారితో కలసి హేటీ (Haiti) నుంచి మనం పారిపోయి ఇక్కడికి వచ్చాం. అయినా కొన్నేళ్లలోనే తిరిగి పైకి ఎగబాకగలిగాం,’ అంటుంది. పతనం నుంచి పైకి లేచే ఈ ప్రక్రియలో మనకంటే తక్కువ తరగతి జనాల బుజాలపై కూడా చేతులు వేసి నడిచామనీ, వాళ్ళు మనకు ఎంతవరకు పనికొస్తారో అంతవరకూ వాడుకున్నానమనీ, తిరిగి వెనకటి బలాన్ని పుంజుకున్నాక వారిని తన్ని తరిమేశామనీ అంటుంది. అదేపనిగా గతవైభవాన్ని తలచుకుంటూ మనకు మనం అణగారిపోవాల్సిందే తప్ప, మనల్ని అణగదొక్కే శక్తి ఈ మొత్తం ప్రపంచానికే లేదని తీర్మానిస్తుంది.

[Huguenots: క్రైస్తవమతంలోని సంస్కరణ సంప్రదాయానికి చెందిన ఫ్రెంచ్ ప్రొటెస్టెంట్‌లను సూచించే ఈ మాట 16వ శతాబ్దిలో పుట్టి 19వ శతాబ్ది ప్రారంభంవరకు వ్యాప్తిలో ఉంది; Cavaliers: 1640 లలో ఇంగ్లీష్ అంతర్యుద్ధంలో రాజుకు మద్దతు తెలిపినవారు; Bonnie Prince Charlie: [1720-88] ఇంగ్లండ్, స్కాట్లండ్, ఐర్లండ్‌ల రాజు జేమ్స్ II కొడుకు ప్రిన్స్ చాల్స్ ఎడ్వర్డ్ స్టువర్ట్ ఈ పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. స్కాట్లండ్‌లో స్టువర్ట్‌లకు ప్రజల మద్దతు ఉండేది. బ్రిటన్ సింహాసనంపై తన హక్కును స్థాపించుకునేందుకు ఇతను 1745లో రాజు జార్జి IIతో యుద్ధం చేసి ఓడిపోయి అయిదు మాసాలపాటు స్కాట్లండ్‌లో అజ్ఞాతంగా గడిపి ఆ తర్వాత ఫ్రాన్స్‌కు పారిపోయాడు.]

‘తక్కువ తరగతి జనాన్ని అవసరానికి వాడుకుని ఆ తర్వాత తన్ని తరిమేస్తా’మనడంలోని విపరీత, వికృత మనస్తత్వాన్ని హర్షించలేకపోయినా ఫాన్‌టెయిన్ అన్న మిగతా మాటలు ఈ నవలలోని ఆష్‌లీకే కాక వేయిపడగలు లోని ధర్మారావుకూ వర్తిస్తాయి. ఇద్దరూ గతవైభవ స్మరణలోనే మునిగి వర్తమానంలో అకర్మణ్యతలోకి జారిపోయినవారే. (అలౌకిక జగత్తుకు చెందిన ఒక అజెండా ధర్మారావుకు ఉన్నప్పటికీ, లౌకిక జగత్తుకు వస్తే, నవలలో చిత్రితమైన మేరకు అతనిలో అకర్మణ్యతే కనిపిస్తుంది.) తమకంటే తక్కువ తరగతికి చెందిన జనాలతో కలసి నడవడంలో ఇబ్బంది పడినవారే.

అదలా ఉంచితే, ఈ సంభాషణ సందర్భంలోనే మెలనీ గురించి ఫాన్‌టెయిన్ అన్న మాటలు స్కార్లెట్‌కు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆష్‌లీని ఒక అప్రయోజకుడిగా తీసిపారేస్తూ, విల్క్స్ కుటుంబం ఈ గడ్డుకాలాన్ని దాటడమంటూ జరిగితే ఆ ఘనత మెలనీదే కానీ ఆష్‌లీది కాదని ఆమె అంటుంది. ఆ మాటకు విస్తుపోయిన స్కార్లెట్, తను మెలనీతో చాలాకాలంగా కలిసుంటున్నానని, ఆమె గురించి తనకు బాగా తెలుసని, తనో రోగిష్టిదని, బాతును కూడా అదిలించే ధైర్యం తనకు లేదనీ అంటుంది. నిజానికి ఇక్కడ ఆశ్చర్యం గొలిపేది, మెలనీతో అన్ని అనుభవాల తర్వాత కూడా ఆమె ఎలాంటిదో తెలుసుకోలేకపోయిన స్కార్లెట్ లోని అజ్ఞానం. అప్పుడు ఫాన్‌టెయిన్ అంటుంది: ఆమె బాతును కూడా అదిలించలేకపోవచ్చు, తన ప్రాణప్రదుడైన ఆష్‌లీకి గాని, తన కొడుక్కి గాని, తను విశ్వసించే ఉత్తమ జీవనసరళికి గానీ ముప్పు ఏర్పడితే ఈ ప్రపంచాన్నీ ఈ యాంకీ ప్రభుత్వాన్నే కాదు, దేనినైనా అదిలించగలదు. ఆమెది నీ లాంటి, నా లాంటి పంథా కాదు; మీ అమ్మ పంథా. మీ అమ్మ జీవించి ఉంటే ఆమెలానే వ్యవహరించి ఉండేది. మెలనీని చూస్తుంటే చిన్నప్పటి మీ అమ్మే నాకు గుర్తొస్తోంది… తను అర్భకురాలే కావచ్చు, కానీ విల్క్స్ కుటుంబాన్ని ఉద్ధరించగలిగింది తనే.

సుఎలెన్, విల్ బెంటీన్‌ల పెళ్లై, కరీన్ చాల్స్‌టన్‌లోని కాన్వెంట్‌కు వెళ్ళిన తర్వాత ఆష్‌లీ, మెలనీ అట్లాంటా చేరతారు. యుద్ధంలో పాక్షికంగా ధ్వంసమైన ఒక రెండంతస్తుల భవనంలోని చిన్న భాగంలో కాపురం పెడతారు. అంత అందవికారమైన కొంప ఎక్కడా ఉండదని స్కార్లెట్ అనుకుంటుంది. దానికితోడు చవకబారు ఫర్నిచర్. కానీ మెలనీకి ఆ ఇల్లు ట్వెల్వ్ ఓక్స్ లోని తమ ఒకప్పటి భవంతి కన్నా అందంగా కనిపిస్తుంది. కారణం, చాలాకాలం తర్వాత తను, తన భర్త తమదైన ఒక కప్పు కింద ఉన్నారు. అవివాహిత అయిన ఆష్‌లీ చెల్లెలు పాతికేళ్ళ ఇండియా కూడా మెకాన్ నుంచి వచ్చి అన్నా వదినెల పంచన చేరింది. రోజులు మారాయి, చేతిలో చిల్లిగవ్వ ఆడని పరిస్థితి. కానీ కూటికి కరువైన పెళ్లికాని ఆడబంధువులను దగ్గరికి తీసి ఆదరించే దక్షిణాది సాంప్రదాయిక జీవనశైలిలో ఎలాంటి మార్పూ లేదు.

మెలనీలో వెల్లివిరుస్తున్న ఆ సంతోషమూ సంతృప్తీ స్కార్లెట్‌కు మరో ఆశ్చర్యం. తను ముందే బలహీనురాలు. ప్రసవం ఉన్న ఆ కాస్త ఓపికనూ హరించింది. ఆపైన తిండికి కటకట, టారాలో అందరితో కలసి తనూ కాయకష్టం చేయవలసి వచ్చింది. దాంతో కొంచెమైనా ఆరోగ్యాన్ని పుంజుకునే అవకాశం ఆమెకు కలగలేదు. చిక్కి శల్యమైంది. ఆమె చిన్న ముఖంలో కళ్ల కింద ఉన్న నల్లని మచ్చలు ఆ కళ్ళను మరీ పెద్దవిగా చూపిస్తున్నాయని స్కార్లెట్ అనుకుంటుంది. కానీ, వాటిలోని అభివ్యక్తి మారలేదు, ఏ చీకూచింతా లేని తన కౌమార వయసులో ఆ అభివ్యక్తి ఎలా ఉండేదో ఇప్పుడూ అలాగే ఉంది. యుద్ధమూ అది తెచ్చిపెట్టిన అంతులేని వ్యథా ఆ కళ్ళల్లో ఉట్టిపడే ప్రశాంతమాధుర్యం ముందు ఓడిపోయాయి. తన చుట్టూ రేగిన ఎలాంటి కల్లోలాలైనా సరే చెదరగొట్టలేని స్వభావసిద్ధ నైర్మల్యం కలిగిన నిత్యసంతోషి అయిన ఒక ఇల్లాలి కళ్ళు అవి.

తను ఆ కళ్లను అలా ఎలా ఉంచుకోగలిగిందోనని స్కార్లెట్ అనుకుంటుంది. అసూయతో ఆమెనే చూస్తూ ఉండిపోతుంది. తన కళ్ళు ఒక్కోసారి ఆకలిగొన్న పిల్లి కళ్ళలా ఉంటాయని తనకు తెలుసు. మెలనీ కళ్ళ గురించి ఓసారి రెట్ అన్న మాటలు ఆమెకు గుర్తొస్తాయి. ఈ తుంటరి ప్రపంచంలో రెండు సత్కార్యాలను తలపించే కళ్ళు అవి (Like two good deeds in a naughty world)!

ఇక్కడ మెలనీని వేయిపడగలులోని అరుంధతితో పోల్చాలనిపిస్తుంది. అలాగే, ధర్మారావుతో కూడా. భర్త తోడిదే లోకంగా జీవించడంలో మెలనీ, అరుంధతీ సమానమే. మెలనీలానే అరుంధతి జబ్బుపడి చిక్కిశల్యమవుతుంది. మెలనీలానే కన్నుమూస్తుంది. జబ్బుపడినప్పటి ఆమె స్థితిని రచయిత ఇలా వర్ణిస్తాడు: ఖద్దరు చీరెలు బరువై మోయలేక అరుంధతి స్వదేశీ మిల్లు సన్న చీరెలు తాల్చుచుండెను. ఆమె స్నానము చేసిన యొడలి మీద చీర యత్తుకుని, పరిశుష్కితములైన యామె యంగములు బొమికల ప్రోవు వలె కనిపించెను. ఆమె యొడలు పలుచనై తాటియాకు వలె నుండెను.

భర్తపట్ల ఆమెది ఎంతటి పేదరికాన్ని, కష్టాన్ని, శారీరక అనారోగ్యాన్ని అయినా జయించి నిశ్చలంగా వెలిగిన అంకితభావం. అరుంధతీ, ధర్మారావుల దైహిక, మానసిక తాదాత్మ్యాన్ని రచయిత అత్యంత హృద్యంగా చిత్రిస్తాడు. మెలనీ, ఆష్‌లీల దాంపత్య చిత్రణలో అది కనిపించదు. నవల పొడవునా అది గుప్తంగానే ఉంటుంది. అసలు వారిద్దరి మధ్యా ఎక్కడా సంభాషణే కనిపించదు. మళ్ళీ అరుంధతీ, మెలనీల వ్యక్తిత్వాల మధ్య ఎంతో అంతరమూ కనిపిస్తుంది. ఒక మహాయుద్ధం తెచ్చిపెట్టిన జీవన కల్లోలాన్ని ప్రత్యక్షంగా చవి చూసిన అనుభవం మెలనీకి ఉండడం, అరుంధతికి లేకపోవడం అన్నది ఆ అంతరానికి ఒక కారణమైనా, దేశీయ నేపథ్యాలకు చెందిన కారణాలూ ఉన్నట్టు అనిపిస్తుంది. మొదటగా చెప్పాలంటే, అరుంధతి పూర్తిగా భర్త చాటు ఇల్లాలు. భర్త సాహచర్యంలోనే ఆమె ప్రపంచజ్ఞానంలో కొంచెమైనా ఓనమాలు దిద్దుకుంటుంది. లోకాన్ని, వ్యక్తులను భర్త కళ్ళతోనే చూస్తుంది. భర్త ఇష్టాయిష్టాలనే తన ఇష్టాయిష్టాలుగా చేసుకుంటుంది. భర్తకు విడిగా ఆమెకు తనదైన కార్యక్షేత్రం ఏదీ లేదు. భర్తపట్ల మెలనీ అంకితభావం పూర్తిగా అలాంటిదే అయినా భర్తకు విడిగా ఆమెకు సొంత కార్యక్షేత్రం ఉంది. యుద్ధం ఆ కార్యక్షేత్రాన్ని మరింత ప్రస్ఫుటం చేసి ఆమె హృదయ, భావ వైశాల్యాలను అనూహ్య ప్రమాణానికి పెంచి, అట్లాంటాలోని దక్షిణాది సమాజం మొత్తానికే తనను నాయకురాలిగా ప్రతిష్టించిన మాట నిజమే. కాని, యుద్ధం లేకపోయినా ఆమెకు తనదైన కార్యక్షేత్రం ఉండి ఉండేదనడంలో సందేహం లేదు. స్కార్లెట్ తల్లి ఎలెన్‌తో ఆమెను పోల్చడమే ఇందుకు నిదర్శనం. ఎలెన్‌కు యుద్ధాన్ని దగ్గరగా చూసిన అనుభవం లేదు. కానీ పిల్లల పెంపకం, గృహనిర్వహణలలో భర్తకు విడిగా ఆమె దక్షతకు అద్దంపట్టే తనదైన కార్యక్షేత్రం ఉంది. అరుంధతి విషయంలో అలాంటిది కనిపించదు.

దాంపత్యానుభవంలో అరుంధతి పరిపూర్ణ స్త్రీయే కానీ, లౌకికమైన పరిణతులలో ఆమె బాల్యావస్థను దాటలేదు. సాంప్రదాయిక బ్రాహ్మణ కుటుంబాలలో బాల్యం నుంచీ అలవరిచే కులభేదాలు, హెచ్చు తగ్గుల తేడాలు, వాటికి సంబంధించిన పరిభాష వయసు పెరిగిన తర్వాత కూడా అరుంధతిలో అలాగే ఉండిపోతాయి. వాటిని సొంత బుద్ధితో వివేచించుకోగలిగిన లోకానుభవం, అధ్యయనం, అందుకు అవసరమైన తర్కం, హేతుబద్ధత అరుంధతిలోనే కాదు; అలాంటి సాంప్రదాయిక కుటుంబానికి చెందిన గృహిణులలో అభివృద్ధి చెందే అవకాశాలు తక్కువ. తమకంటే తక్కువ కులస్తులని భావించేవారిపై, పనివారిపై ప్రేమాదరాలు కనబరచడంలో వారిని కుటుంబ సభ్యులుగా పరిగణించడం వేరు; కులభేదాలను, హెచ్చు తగ్గులను సూత్రరీత్యా విశ్వసించడం వేరు. రెండింటినీ కలగాపులగం చేయకూడదు.

ధర్మారావు తండ్రి రామేశ్వరశాస్త్రి రంగాజమ్మ అనే క్షత్రియ స్త్రీని పెళ్లిచేసుకోవడం, భోగకాంతను (గిరిక తల్లి) చేరదీయడం అత్తవారింటికి వచ్చిన కొత్తలో అరుంధతికి వింతగా తోస్తాయి. వాటి గురించి అడిగినప్పుడు హఠాత్తుగా కోపం ముంచుకొచ్చి ధర్మారావు ఆ ప్రశ్ననే నిషేధిస్తాడు. అది భర్తకు ఇష్టం లేని ప్రస్తావన అనుకున్న అరుంధతి అంతటితో ఊరుకుంటుంది. భర్త చాటు ఇల్లాలుగా ఆమెకు భర్త ఇష్టాయిష్టాలే తప్ప మామగారి సంబంధాలతో సహా ఏవీ ముఖ్యం కాదని ఇందులోని ధ్వని. మంగమ్మ గురించిన సందర్భంలో ధర్మారావు అన్న మాటలు, ఒక సాంప్రదాయిక భారతీయ గృహిణికి, భర్తకు ఉండే సంబంధం ఎలాంటిదో స్పష్టంగా చెబుతాయి. భర్తనుంచి అందే జ్ఞానాన్ని మాత్రమే భార్య ప్రతిఫలించాలి. స్వయంప్రకాశమూ స్వతంత్ర బౌద్ధికవికాసమూ ఆమె పత్నీత్వాన్ని పలుచన చేస్తాయి. ధర్మారావు అంటాడు: భర్త, స్త్రీకిని ప్రపంచమునకును మధ్య తెర వంటివాడు. తెర తీసివేసినచో, లోకజ్ఞత దొడ్డి పెట్టిన వేల్పు గిడ్డి, సర్వము పిదుకును.

అరుంధతి జబ్బుపడినప్పుడు భర్తకూ, తనకూ జరిగిన కింది సంభాషణలో సాంప్రదాయిక కుటుంబాలలో కులభేదాలను చాటే పరిభాష కనిపిస్తుంది. భర్త నిషేధించినది తన తండ్రికి గల ఇతరేతర సంబంధాలను ప్రశ్నించడాన్నే తప్ప, ఈ పరిభాషను కాదు.

అరుంధతి:
నేడు జబ్బు చేసినదని మాలకూడు తినమందురా?

ధర్మారావు:
వారు మనకన్నా చెడిపోలేదు.

అరుంధతి:M/h5> చెడిపోకపోనిచో ఈసారి మాలదానినే పెండ్లి చేసికొనుడు.
ధర్మారావు:
చెంపపైని కొట్టరా? తీరికగా కూర్చుండి దుష్టపు మాటలు మాట్లాడెదవేల?

పతితగా ముద్రపడి పశ్చాత్తాపంతో ఆధ్యాత్మికం వైపు మళ్లిన మంగమ్మ తన ఇంట్లో సత్సంగం జరుపుతోందని కుమారస్వామి ధర్మారావుతో అన్నప్పుడు ‘గూడెములో క్రతువు జరిపినట్లు’ అని ధర్మారావు అంటాడు. గూడెం పట్ల, గూడెంలో ఉండే జనాలపట్ల ఈ మాటల్లో వ్యక్తమవుతున్న అవహేళన, ఇతరత్రా అతని స్వభావచిత్రణకు పూర్తి భిన్నంగా ఉండి ఆశ్చర్యచకితం చేస్తుంది. తనూ, గణాచారి కలసి వెడుతుండగా ఒక పంచముడు ఎదురైన సందర్భంలో అతను అన్న మాటల్లోనూ ఇలాంటి అవహేళనే ధ్వనిస్తుంది: ఒక్క పది యేండ్లాగుము. అప్పుడు గణాచారియే ఉండడు. అప్పుడు మనందరమును కలసి దేవాలయములోనికే పోదము. స్వామి కప్పుడు గణాచారి ప్రసక్తి యుండదు...

ఇంకోవైపు పాత ఆచారాలు, కట్టుబాట్లపై ధర్మారావుకు ఉన్నంత విధేయత మెలనీకీ ఉంది. నిత్యపరిణామశీలి అయిన ఈ ప్రపంచానికి అనుగుణంగా తాను మారడానికి తిరస్కరించడంలోనూ ఆమె మరో ధర్మారావే. కానీ తేడా ఎక్కడుందంటే, తమకంటే తక్కువ తరగతి జనాలపట్ల అరుంధతీ ధర్మారావులలో వ్యక్తమైన వివక్ష కానీ అవహేళన కానీ మెలనీలో లేవు. నవల పొడవునా ఆమె స్వభావచిత్రణను గమనిస్తే, ఆమెలో అలాంటివి అసలు ఊహకే అందవు. యుద్ధసమయంలో తను కూడా యాంకీలను శత్రుపూరిత దృష్టితోనే చూస్తుంది. అది యుద్ధం వరకే. ఆ తర్వాత యాంకీలలో ఉండగల మానవీయ స్పందనల పట్ల సైతం గొప్ప విశ్వాసాన్ని, గౌరవాన్ని ఎలా చాటుకుందో పైన చెప్పుకున్నాం. మళ్ళీ పేదరికాన్ని ఎలాంటి ఫిర్యాదూ లేకుండా వరించడంలోనూ ఒకింత హెచ్చుతగ్గుల తేడాతో–మెలనీ, అరుంధతి, ధర్మారావుల మధ్య పోలిక ఉంది. అయితే దుర్భరమైన లేమిలోనూ గొప్ప ఆత్మగౌరవాన్ని, సాహసాన్ని, ఔదార్యాన్ని, దయనూ మరింతగా చాటుకునే అవకాశాన్ని యుద్ధ నేపథ్యం మెలనీకి కల్పించింది. అలాంటి యుద్ధ నేపథ్యం లేదు కనుక అరుంధతీ ధర్మారావులలో ఈ లక్షణాలు అదే స్థాయిలో ప్రస్ఫుటించే అవకాశం సహజంగానే ఉండదు. ఆ మేరకు వారిద్దరికీ సందేహలాభాన్ని ఆపాదించినా, అంతస్తులకు, సామాజిక ప్రతిపత్తిలోని హెచ్చు తగ్గులకు, కుల భేదాలకు అతీతంగా మనిషిని మనిషిగా గౌరవించే భావవైశాల్యంలో మెలనీకీ, అరుంధతీ ధర్మారావులకూ మధ్యనున్న పైన చెప్పిన అంతరం స్పష్టమే.

మళ్ళీ మెలనీ-స్కార్లెట్‌ల విషయానికి వస్తే, మెలనీపై స్కార్లెట్ ద్వేషానికి, ఆమెపై మెలనీ ప్రేమకు, మధ్య జరిగిన అంతులేని పెనుగులాటలో చివరికి మెలనీ ప్రేమే జయిస్తుంది. అట్లాంటాలో స్కార్లెట్, ఆష్‌లీల మధ్య జరిగిన ఒక ఘటన ఆ పెనుగులాటను పతాకస్థాయికి తీసుకెళ్లి స్కార్లెట్ లోని కరడుగట్టిన ద్వేషాన్ని సైతం కరిగిస్తుంది. మొదటిసారి మెలనీపై ఆమెలో అస్పష్టతకు తావులేని సానుకూలభావన తొంగిచూస్తుంది. ఒక భావోద్వేగ పూరిత ఏకాంతంలో స్కార్లెట్‌ను ఆష్‌లీ దగ్గరకు తీసుకున్న దృశ్యాన్ని ఆష్‌లీ చెల్లెలు ఇండియా చూసి ఊరూవాడా ఏకం చేస్తుంది. అపరాధభావనతో కుంగిపోయిన స్కార్లెట్, మెలనీకి తన మొహం చూపించడానికి సిగ్గుపడుతుంది. అంతేకాదు, చిన్నప్పుడు తప్పు చేసినప్పుడు తల్లి ఎలెన్‌కు తను వివరణ ఇచ్చుకున్నట్టే మెలనీకి వివరణ ఇచ్చుకుని హృదయ భారాన్ని దింపుకోవాలను కుంటుంది. ఆ విధంగా తల్లిపై తనకున్న భయభక్తులే మెలనీపై ఏర్పడడం ఆమెకే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సందర్భంలో మెలనీ స్పందన, ఆమె ఉదాత్త వ్యక్తిత్వానికి స్కార్లెట్ బేషరతుగా దాసోహమయ్యే ప్రక్రియను సంపూర్ణం చేస్తుంది. స్కార్లెట్ నుంచి ఎలాంటి వివరణను వినడానికీ మెలనీ తిరస్కరిస్తుంది. ఏవో ఉబుసుపోక వదంతులకు అంత ప్రాధాన్యం ఇవ్వడం, యుద్ధకాలంలో ఎదురైన విపత్కర పరిస్థితులను వీరోచితంగా ఎదుర్కోవడంలో మనం చాటుకున్న అద్భుత సాహచర్యాన్ని, అప్పటి అపురూపమైన అనుభవాలను అవమానించడమేనని స్పష్టం చేస్తుంది.

అయితే తన పట్ల స్కార్లెట్‌లో ఈ పరివర్తన వచ్చిన సమయానికి మెలనీ ఈ లోకంనుంచే నిష్క్రమించబోతోంది. రెండోసారి గర్భవతి అయిన మెలనీ మృత్యువుకు చేరువవుతున్నదన్న వార్త స్కార్లెట్‌కు పిడుగుపాటు అవుతుంది. ఒకప్పుడు మెలనీ చావును కోరుకున్న తను, ఇప్పుడు మెలనీ ఎట్టి పరిస్థితిలోనూ కన్నుమూయ కూడదనుకుంటుంది. గతంలో ఎన్నడూ లేనంతగా మెలనీ అవసరం తనకు ఇప్పుడు ఉందనుకుంటుంది. ఇంతకాలం తనపై తనే ఆధారపడిందన్న ఆహాన్ని పటాపంచలు చేస్తూ వాస్తవానికి ప్రతి ఘట్టంలోనూ తనే మెలనీపైనే ఆధారపడిందన్న గ్రహింపు ఆమె అంతరాంతరాలలోంచి తన్నుకువస్తుంది. తన చేతిలోని కత్తీ డాలూ, తనకు ఓదార్పూ బలమూ అన్నీ మెలనీయేనన్న ఎరుక తనను కమ్ముకున్న స్థితిలో ఆమె మృత్యుముఖంలో ఉందన్న వార్త ఒక్కసారిగా స్కార్లెట్‌ను భయభ్రాంతం చేస్తుంది. మెలనీయే తన ఏకైక నేస్తం అనుకున్న స్కార్లెట్, అమ్మ తర్వాత తనను నిజంగా ప్రేమించింది తనే అనుకుంటుంది. అంతేకాదు, తను అచ్చం అమ్మేనని, ఆమెలో అమ్మను చూశారు కనుకనే అందరూ ఆమె స్కర్ట్ పట్టుకుని వేళ్లాడారని అనుకుంటుంది.

(ఆఖరి భాగం)
----------------------------------------------------------
రచన: కల్లూరి భాస్కరం, 
ఈమాట సౌజన్యంతో