Tuesday, April 23, 2019

విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు


విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు





సాహితీమిత్రులారా!

[విశ్వనాథ రెండు నవలికలు (Two Novellas by Visvanatha Satyanarayana) అన్న పేర, హా హా హూ హూ, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు–నవలికలను 2018లో పుస్తకంగా పెంగ్విన్ ఇండియా వారు ప్రచురించబోతున్నారు. నారాయణరావు అనువదించిన అన్ని కావ్యాలు, రచనలు లాగానే ఈ అనువాదానికి కూడా ఆయన రాసిన తొలి, మలి పలుకులు మన సాహిత్య చరిత్ర గురించి, కవులు రచయితల గురించి ఒక విభిన్నమైన విశిష్టమైన దృక్పథాన్ని మనకు అందిస్తాయి. ఈమాట వెల్చేరు నారాయణరావు ప్రత్యేక సంచికలో ఇటువంటి అనువాదాలు కొన్ని అందించాం. ఇక్కడ విశ్వనాథ రెండు నవలికలు పుస్తకానికి నారాయణరావు రాసిన ముందుమాటను తెలుగులో ప్రచురిస్తున్నాం. ]

బ్రిటిష్‌వారి రాజకీయ ఆధిపత్యం, పాశ్చాత్య ఆధునికతాభావాలు — ఈ రెండూ పెనవేసుకున్న నేపథ్యంలో భారతదేశంలోకి వలసవాదం ప్రవేశించింది. హేతువాదం, మనుషులందరూ సమానమే అన్న ఊహ, చరిత్ర సరళరేఖ లాగా నడుస్తుందనే విశ్వాసం, మనుషుల సౌఖ్యం కోసం ప్రకృతిని జయించే విజ్ఞానశాస్త్రాల గొప్పదనం — ఇవన్నీ పాశ్చాత్య నాగరికత వల్ల వచ్చి, భారతీయులకి ఒక గొప్ప వరం లాగా కనిపించాయి. ఈ ఊహలు పాశ్చాత్యదేశాల లోంచి వచ్చాయి కాబట్టి పాశ్చాత్యులు భారతీయులకన్నా అధికులుగా, భారతదేశానికి యజమానులుగా భావించుకొని వ్యవహరించగల అవకాశాన్ని వారికి తెచ్చిపెట్టాయి. ఒకవైపు భారత జాతీయవాదులు బ్రిటిష్‌వారి రాజకీయ ఆధిపత్యాన్ని తిరస్కరించారు గాని వాళ్ళు తెచ్చిపెట్టిన ఆధునికతను వదులుకోలేక పోయారు. ఆ విషయాన్ని దీపేశ్ చక్రవర్తి ఇలా వివరించారు:

పౌరసత్వం, రాజ్యం, పౌరసమాజం, సాంఘికరంగం, పౌరహక్కులు, చట్టం ముందు అందరూ సమానులనే ఊహ, వ్యక్తిభావన, వ్యక్తికి చెందిన రంగానికి, సమాజానికి చెందిన రంగానికి మధ్యన ఉన్న తేడా, ప్రజాస్వామ్యం, ఆత్యంతికంగా ప్రజలే దేశానికి హక్కుదారులు, సామాజిక న్యాయం, శాస్త్రబద్ధమైన హేతువాదం, వగైరా వగైరా అన్నిటి మీద యూరప్ నుంచి వచ్చిన భావాల, యూరప్ చరిత్ర వల్ల వచ్చిన ఆలోచనల ముద్ర ఉంది. చరిత్ర అక్కడి చాలా విషయాలను ప్రభావితం చేస్తూ వచ్చింది. ఈ ఊహలకి యూరప్‌లో వైజ్ఞానిక విప్లవం (Enlightenment period) రూపొందుతున్న కాలంలో స్థిరమైన రూపం ఏర్పడింది.

వలసకాలంలో రచయితలు దాదాపుగా అందరూ జాతీయవాదులు. ఆ కారణంగా బ్రిటిష్ ప్రభుత్వ ఆధిపత్యానికి వాళ్ళు వ్యతిరేకులు. అయినా, వాళ్ళెవరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా వచ్చిన ఆధునిక సంస్కృతిని మాత్రం వదులుకోడానికి ఇష్టపడలేదు. భారతదేశపు సాహిత్యాల చరిత్రలో వలసయుగంలో ఒక ప్రత్యేకమైన వేర్పాటు కనిపిస్తుంది. వలసయుగంలో నుంచి ప్రారంభమైన సాహిత్య చరిత్రకు ఆధునికయుగం, నవ్యయుగం వంటి పేర్లు పెట్టడం భారతదేశ సాహిత్యాల చరిత్రలు అన్నింటిలోనూ కనిపిస్తాయి. ఈ యుగంలో ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే అంతకు పూర్వం ఉన్న సాహిత్యాలను తిరస్కరించడం. భారతీయ సాహిత్యాల్లో ఆధునిక కవులు, రచయితలు సమకాలీన సామాజిక విషయాలను గురించి రాశారు. స్థానిక ఉద్యమాల కార్యక్రమాన్ని ఆమోదించారు. కులభేదాలను, అగ్రకులాల ఆధిపత్యాన్ని, క్రతువులను, మతాలను, బ్రాహ్మణ ఆధిక్యతను తిరస్కరించారు. అందులో కొందరు వర్గపోరాటాన్ని, విప్లవాన్ని ఆహ్వానించారు కూడా. అందరూ సామాజిక సంఘ సంస్కరణల అవసరాన్ని అంగీకరించారు. అలా ఆంగీకరించకపోతే వాళ్ళు ఆధునికులు కారు. బంకించంద్ర నుంచి గోపీచంద్ వరకూ రవీంద్రనాథ టాగూర్ నుంచి సుమిత్రానందన్ పంత్ వరకూ సుబ్రహ్మణ్య భారతి నుంచి శ్రీశ్రీ వరకూ దాదాపు అందరు భారతీయ సాహిత్యకారులు, అందరూ ఒక్కలాగే, అదే సరళిలోకి నడిచి వెళ్ళారు — ఒక్క విశ్వనాథ సత్యనారాయణ తప్ప. ఈయన గురించి భారతదేశానికి బయట ఎవరికీ ఏమీ తెలీదు. ఈయన లాంటి వాళ్ళు చాలా కొద్దిమంది ఇతర భారతీయభాషల్లో కనిపిస్తారు.

విశ్వనాథ: నేపథ్యం
విశ్వనాథ సత్యనారాయణ 1895లో తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య పల్లెటూరి వీధిబడులలో జరిగింది. ఆ పల్లెటూరి వాతావారణం ఆయనకు చాలా నేర్పించింది. వీధిగాయకులు, వీధినర్తకులు, పురాణ ప్రవచనాలు చేసేవారు, పుక్కిటి కథలు చెప్పేవారు, నోటితో పాటలు కట్టి పాడేవారూ — వీరందరినీ ఆయన అతి దగ్గరగా అర్థం చేసుకున్నారు. వారిలో ఇప్పుడు దళితులని పిలవబడుతున్న కులాలవారు కూడా ఉండేవారు. ఆయన పెద్దక్కగారు ఆ పాటలన్నిటినీ తమ్ముడికి తిరిగి పాడి వినిపించేవారు. జానపద గాథలనూ రామాయణ మహాభారతాలలోని ఉదంతాలనూ ఆమె చెప్పేవారు. అక్కడి దేవాలయంలో ప్రతియేటా తిరణాలు జరిగేవి. ఎక్కడెక్కడి నుంచో ఈ ప్రదర్శకులంతా వచ్చి వాటిలో పాల్గొంటుండేవారు. వారిలో నటులు, వాద్యకారులు, విదూషకులు, మల్లయోధులు, ఐంద్రజాలికులు, పగటి వేషాలు కట్టి ఒప్పించగల బహురూపి విద్య నేర్చినవారూ — అందరూ ఉండేవారు. ఊళ్ళో అందరు ఒకరినొకరు ఏ కులం వాళ్ళయినా, అక్క అన్నయ్య బాబాయి అత్తయ్య — ఇలా కులంతో ప్రసక్తి లేకుండా వరసలు కలుపుకొని పిలుచుకొనేవారు. పెద్ద ఉమ్మడికుటుంబంలో ప్రేమా ఆప్యాయతల మధ్యన కథలతోటీ పాటలతోటీ ఆహ్లాదకరంగా గడిచిపోయిన తన బాల్యాన్ని సత్యనారాయణ తరచుగా జ్ఞాపకం చేసుకునేవారు. కల్లా కపటం కనిపించని ఆ గ్రామీణ వాతావరణంలోని అనురాగం పసివాడుగా ఉన్నప్పుడే ఆయన ప్రపంచంలో భాగమైపోయింది. ఆ ఊళ్ళో పెద్దవాళ్ళకి మాత్రమే అర్థమయే కొట్లాటలు, పెనుగులాటలు, విరోధాలు, కల్మషాలు — ఇవేవీ ఆయనకు కనిపించలేదు.

సత్యనారాయణకు పదకొండేళ్ళు వచ్చేసరికి పెద్దలు ఇచ్చిన ఆస్తి ఇంచుమించు పూర్తిగా హరించుకుపోయింది. ఆయన తండ్రి గొప్ప దాత. ఆ దాతృత్వంలో తన కుటుంబ సంక్షేమం ఆయనకు పట్టలేదు. కుమారుడికి ఆంగ్లవిద్య నేర్పిస్తే తన పొట్ట తాను పోసుకోగలడని నిర్ణయించుకుని, తండ్రి తమ కుటుంబాన్ని దగ్గరలో ఉన్న మచిలీపట్నానికి తరలించారు. కొడుకు తెలుగులో పద్యాలు రాస్తుండటాన్ని గమనించిన తండ్రి తీవ్రంగా మందలించారు. అలాంటి పిచ్చి పిచ్చి పనులతో కాలాన్ని వృథా చేయద్దని హెచ్చరించారు. కాని సత్యనారాయణ పద్యాలు రాస్తూనే ఉండేవారు. తనకే తృప్తిగా అనిపించక ఆ తొలి పద్యాలలో కొన్ని వేల పద్యాలను చింపేశారు. పుస్తకాలు కొని చదువుకోవటానికి డబ్బుండేది కాదు గనుక ఒక పుస్తకాల అంగడిలో కూర్చుని చదువుతుండేవారు. ఆ అంగడి యజమాని దయగలవాడు, ఎంత సేపు కూర్చుని చదువుకున్నా అడ్డు పెట్టేవాడు కాదు. కొన్నిసార్లు చదువుతూన్న పుస్తకం పూర్తి కాకపోతే, ఆ రాత్రికి ఇంటికి తీసుకుపోనిచ్చేవాడు కూడా. ఆంగ్ల విద్యను కొనసాగిస్తూనే సత్యనారాయణ తర్క వ్యాకరణ వేదాంత శాస్త్రాలన్నిటినీ చదువుకున్నారు. ఆ కాలంలో గొప్ప పండితులైన కంభంపాటి రామమూర్తి శాస్త్రి, పరిమి రామనరసింహ శాస్త్రి, కానుకొలను త్రివిక్రమరావు వంటి వారి గ్రంథాల ద్వారా తర్క వ్యాకరణ వేదాంత శాస్త్రాలను అధ్యయనం చేశారు. తెలుగు కవిత్వానికి సంబంధించి, అప్పటి గొప్ప కవి చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రికి (1870-1950) శిష్యులైనారు[2].

1920 ప్రాంతాలకి తెలుగు సాహిత్యంలోని ముఖ్యులలో ఒకరుగా సత్యనారాయణ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వాక్యాలలో విరుపు, సంస్కృత సమాసాలను ప్రత్యేక పద్ధతిలో వాడే ఉపజ్ఞ, ఎంతోమంది చదువరులను బలంగా ఆకర్షించేవి. తెలుగులో చెప్పుకోదగిన సాహిత్యకారుల వరసలో ఆయన సులువుగానే చేరిపోయారు. అయన ప్రారంభ కవిత్వం జాతీయవాదంతోనూ దేశభక్తితోనూ నిండిపోయి ఉండేది. గతకాలపు తెలుగు రాజుల, సామ్రాజ్య నిర్మాతల గొప్పదనాన్ని కీర్తించేవారు. వస్తువు కొత్తది కాకపోయినా ఆయన శిల్పం కొట్టొచ్చినట్లుండేది. ఎందరో కవులు జాతిని కీర్తించే కవిత్వం చెప్పినా వారెవరితోనూ పోల్చలేని ప్రత్యేకత ఆయనది. 1940లలో రామాయణాన్ని కేవలం వృద్ధులు చదువుకునే మతగ్రంథంగా పక్కకు పెట్టేసి ఉన్న పరిస్థితిలో, ఆయన మొత్తం ఆరుకాండలతో సమగ్రంగా తెలుగులో రచించాలని సంకల్పించారు.

ఆధునిక సాహిత్యకారులలో అందరూ కాల్పనిక ప్రేమ గురించి మాట్లాడుతుండేవారు. షెల్లీ, కీట్స్, ఇలియట్‌ల కవిత్వాన్ని ఉటంకించేవారు. స్త్రీ స్థానాన్ని ప్రత్యేకంగా పైకి ఎత్తేవారు. సత్యనారాయణ మాత్రం బ్రాహ్మణ ధర్మం గురించే మాట్లాడేవారు. ఆ ధర్మాన్ని రసం, ఔచిత్యం, వక్రోక్తి, ధ్వనులతో ముడిపెట్టి సాహిత్యంలోకి అన్వయించేవారు. అభినవగుప్తుడు, మమ్మటుడు వంటి ప్రాచీన ఆలంకారికులను ఉదాహరిస్తుండేవారు. ఆ దృక్పథాన్ని ఆధునికులు అప్పటికి నలభై యేళ్ళ కిందటే తిరస్కరించారు. ఆ దృష్టికి సంబంధించిన సంప్రదాయమంతా దాదాపు నశించిపోయింది. తన సంఘ సంస్కరణలో భాగంగా వీరేశలింగం (1848-1919) సవర్ణుల ఆచారవ్యవహారాల పైన దాడిచేశారు. ప్రాచీన వాఙ్మయంలో శృంగార రసపోషణ హద్దు మీరి ఉందని అభిప్రాయపడిన సి. ఆర్. రెడ్డి (1880-1951) ఆ సాహిత్య సంప్రదాయాన్ని నిందించారు. కొన్ని శతాబ్దాల నుంచీ నిలచి ఉన్న సాహిత్య ప్రమాణాలు కూలిపోసాగాయి. ఆధునికత జగన్నాథ రథచక్రాలలాగా సాహిత్యరంగంలోకి విరుచుకుపడింది. దానితో విభేదించిన ప్రతీ ధోరణి తిరోగమనమనిపించుకుంది. నవీనం కాని ప్రతీదానికి కాలదోషం పట్టిందనే భావించబడింది. భావకవులుగా తమను చెప్పుకున్నవారు, పండితులనూ సంప్రదాయ కవిత్వ ప్రమాణాలనూ బహిరంగంగా ధిక్కరించారు. త్వరలోనే మార్క్సిస్టులు రంగప్రవేశం చేసి అప్పటివరకూ వచ్చిన తెలుగు కవిత్వమంతా భూస్వామ్య వ్యవస్థకి చెందినదనీ తిరోగామి కవిత్వమనీ తీర్మానించి తిరస్కరించారు. సామాన్యులకోసం ఉద్దేశించబడే వారి విప్లవ కవిత్వం మాత్రమే కవిత్వమని వారి విశ్వాసం.

ఇరవైయవ శతాబ్దపు తొలి దశకాలలో సంప్రదాయ విద్యాబోధన క్షీణించటం మొదలైంది. ఆ పద్ధతిలో ఒకే పండితుడు తనకు తెలిసిన దాన్నంతటినీ శిష్యులకు బోధించటం ఉండేది. శిష్యులకు ఆశ్రయమూ చాలాసార్లు భోజనమూ కూడా గురువుగారి ఇంట్లోనే జరుగుతూ ఉండేవి. అలా కాని పక్షంలో, ఆ ఊర్లో ఉన్న బ్రాహ్మణ గృహస్థులు రోజుకు ఒక విద్యార్థికి భోజనం పెట్టే బాధ్యతను తీసుకునేవారు. ఆ విధంగా వారంలో ఏడు రోజులూ భోజనం అమరుతుండేది. విద్యార్థులు అందరూ బ్రాహ్మణులే అయి ఉండేవారు. విద్యాదానం చేస్తుండిన పండితుడి పోషణను జమీందారులు చూసుకునేవారు. ఇక్కడ ఎక్కువగా రాణించిన విద్యార్థులు కాశీలోగాని, బెంగాల్‌ లోని నవద్వీపంలోగానీ తమ అధ్యయనాన్ని కొనసాగించి తాము కూడా బోధించే స్థాయి గల పండితులయే దశకి చేరేవారు. తర్క మీమాంస వ్యాకరణాది ప్రాచీన శాస్త్రాల అధ్యయనం ఎంతో కాలంగా ఇలాగే సాగుతూ వచ్చింది. ఆదరణ కరవై ఆ వ్యవస్థ క్రమక్రమంగా నశించిపోయింది.

ఆధునిక విద్యలో భాగాలుగా ఆంగ్లభాషతో పాటుగా చరిత్ర, గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం వంటి పాశ్చాత్య శాస్త్రాలను బ్రిటిష్ ప్రభుత్వం నడిపే విద్యాసంస్థలలో బోధించటం ప్రారంభమైంది. ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. ఉత్తీర్ణులైన వారికి బి. ఏ, ఎం. ఏ వంటి పట్టాలు ప్రదానం చేయబడేవి. ఆ పట్టాలను పొందగలిగినవారికి అప్పటి ఉద్యోగ వ్యవస్థలో లాభసాటి ఉద్యోగాలు లభిస్తుండేవి. ఆయా విద్యాసంస్థలలో తెలుగునూ సంస్కృతాన్నీ కూడా బోధించేవారు గాని, ఆంగ్లమాధ్యమంలో చెప్పబడే తక్కిన అంశాల మీద పెట్టే శ్రద్ధను దేశభాషల మీద పెట్టేవారు కాదు. ఈ కొత్త విద్యాసంస్థలలో బోధనా సిబ్బంది రెండు శ్రేణులుగా ఉండేది. కళాశాలలలోనూ విశ్వవిద్యాలయాలలోనూ పట్టాలు తెచ్చుకున్న వారిని ఉపన్యాసకులనీ ఆచార్యులనీ పిలిచేవారు, వారిది ఒక వర్గం. తెలుగునూ సంస్కృతాన్నీ బోధించేందుకు ఏర్పాటైన విద్యాశాలలను ప్రాచ్య కళాశాలలు అనేవారు. వాటికి డిప్లొమాలను మాత్రమే ప్రదానం చేసే అధికారం ఉండేది. ఆ డిప్లొమాలు తెచ్చుకుని వచ్చినవారికి ఆంగ్లవిద్యా పరిచయం చాలా కొద్దిగానో, అసలు లేకుండానో ఉంటూ ఉండేది. వారిని పండితులు అని పిలిచేవారు[3]. ఇది రెండవ వర్గం. ఉపన్యాసకులకూ ఆచార్యులకూ సమృద్ధిగా వేతనాలు ఇచ్చేవారు. పండితుల వేతనాలు చాలీ చాలకుండా ఉండేవి. వేషధారణలో సైతం రెండువర్గాలకూ చాలా భేదం ఉండేది. పండితులు సాధారణంగా దేశీయమైన ధోవతి కట్టుకొని పైన కోటు తొడుక్కునేవారు. బ్రాహ్మణ పద్ధతిలో శిరోముండనం చేయించుకొని పిలక పెట్టుకునేవారు. నుదుట మతచిహ్నంగా బొట్టు పెట్టుకునేవారు. ఉపన్యాసకులూ ఆచార్యులూ పాశ్చాత్య పద్ధతిలో పంట్లాం, చొక్కా, జాకెట్, టై ధరించేవారు. జుట్టును పొట్టిగా కత్తిరించి ఉంచుకునేవారు. ఒకవేళ వారూ ఎప్పుడైనా ధోవతిని ధరించినా, తలను గొరిగించుకోవటం గానీ పిలక పెట్టుకోవటం గానీ ఎన్నడూ జరిగేదే కాదు. పాఠ్యాంశాలన్నీ ఆంగ్లం లోనే బోధించబడేవి. తెలుగు కేవలం ద్వితీయభాష. ఐచ్ఛికం. ఆంగ్లమూ దాని సంబంధిత శాస్త్రాలూ మాత్రమే తమ అభివృద్ధికి ఉపయోగిస్తాయని ఆ విద్యార్థులకు చాలా బాగా తెలుసు. తెలుగును బోధించే తరగతులకు సక్రమంగా వెళ్ళేవారు కూడా కాదు. వెళ్ళిన సందర్భాలలో తెలుగు పండితుడి వేషభాషలను ఎగతాళి చేయటమూ జరుగుతుండేది. వెటకారపు నవ్వులూ దగ్గులూ పిల్లికూతలూ తెలుగు తరగతి గదిలో వినబడుతుండేవి. స్త్రీ శరీరానికీ శృంగారానికీ సంబంధించిన వర్ణనల గురించి పండితులను విద్యార్థులు ప్రశ్నలు వేసి ముప్పతిప్పలు పెట్టేవారు. పాత తెలుగు కావ్యాలలో అటువంటి వర్ణనలు పుష్కలంగా ఉండేవి. వాటిని పరిహరించిన తర్వాతనే పాఠ్యాంశాలను నిర్ణయించాలనే ఉద్దేశం అధికారులకి ఉండినా కూడా చాలాసార్లు అలా వీలయేది కాదు. చాలా సామాన్యమైన సాహిత్య భాగాలలో కూడా ఊరువుల, వక్షోజాల, చూచుకాల, జఘన భాగాల, సంభోగకార్యాల వివరణలు ఉండేవి. సంస్కృత పదాలలోనో, పాతకాలపు తెలుగులోనో ఉండే ఆ మాటలను వాడుక తెలుగులో వివరించమని పురుష విద్యార్థులు పండితులను వేధించుకు తినేవారు. అదే తరగతి గదిలో ఉన్న విద్యార్థినులను ఇటువంటి అల్లరి బాగా ఇబ్బంది పెట్టేది. వాళ్ళు విడిగా వేరే బల్లల పైన కూర్చుంటేనేం!

అటువంటి విద్యాసంస్థలలో తెలుగు పండితుల స్థితి దయనీయంగా ఉండేది. ఏమాత్రమూ ఊహశక్తి లేని ఒక శిలాజంగా అతను చూడబడేవాడు. కంఠస్థం చేసిన విద్యనంతా అప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోగలిగే అతని శక్తి, గతకాలంలోనే ఇరుక్కుపోయి ఉండటానికి చిహ్నంగా మాత్రమే గ్రహించబడేది. ఆధునికమైన ఏ శాస్త్రాన్నీ అభ్యసించగల మేధ అతనికి లేకుండినట్లే తీర్మానించబడేది. అయితే, ప్రతిభాశీలురూ ప్రబలంగా కనిపించేవారూ అయిన కొందరు పండితుల వలన ప్రభావితులై సంస్కృతాంధ్రాలలో మంచి అభిరుచిని పెంచుకున్న విద్యార్థులూ లేకపోలేదు. అటువంటి కొద్ది మినహాయింపులని వదిలేస్తే యాజమాన్యం దృష్టిలోనూ విద్యార్థుల దృష్టిలోనూ ఆ పండితుల స్థానం ఏమంత గొప్పది కాదు. వారూ ఏ ప్రతిఘటనా లేకుండా ఆ పరిస్థితిని అంగీకరించి ఉండిపోయేవారు.

తెలుగు చదువటన్న తేలికగా జూచు
టాంగ్ల పాఠశాలలందు గలదు-అని చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి అతి యథాలాపంగా వ్రాశారు.

ఆంగ్ల పాఠశాలలు అంటే అప్పటి పాఠశాలలు అన్నీ. తెలుగు తప్పించి మొత్తమంతా ఆంగ్లంలోనే బోధించబడేవి. నిజానికి తెలుగులో సమాధానాలు వ్రాయవలసిన ప్రశ్నలను కూడా ఆంగ్లం లోనే ఇచ్చేవారు. ఆ స్థితి ఇరవైయవ శతాబ్దంలో చాలా కాలమే కొనసాగింది.

తెలుగు భాషతో ఏ మాత్రమూ పరిచయం లేని బ్రిటిష్ అధికారులు ఆ భాషను బోధించే పద్ధతిని పర్యవేక్షిస్తుండేవారు. ఒకసారి ఒక తెలుగు పండితుడు తరగతి గదిలో ఒక పద్యాన్ని పూర్వపద్ధతిలో వివరించటం బ్రిటిష్ అధికారి కంటపడింది. గంట కొట్టే వరకూ పండితుడు ఆ ఒక్క పద్యాన్నే వివరిస్తుండిపోయాడు. అందులోని సమాసాలనూ వాటి విగ్రహవాక్యాలను, సంధులనూ వాటి పరిచ్ఛేదాలను, అలంకారాలనూ వివరంగా బోధించినాక విద్యార్థుల చేత ఆ పద్యాన్ని గొంతెత్తి వల్లె వేయించాడు. దీన్నంతా గమనించిన బ్రిటిష్ పర్యవేక్షకుడు — చాలా సమయం వృథా అయిపోతోందని, బోధనను వేగవంతం చేయవలసిన అవసరం ఉందని, వ్యాఖ్య రాసి పై అధికారులకు పంపాడు. ఇలాంటి అనుభవాలు ఎదురు పడినాకనే, తమ పాపఫలితంగా అటువంటి పాఠశాలలలో తెలుగును బోధించవలసి వస్తోందని వేంకటశాస్త్రి ఆక్రోశించారు. భమిడిపాటి కామేశ్వర రావనే హాస్య రచయిత ఆ తెలుగు ఉపాధ్యాయుల కడగండ్ల గురించి 1940ల ప్రారంభంలో ఒక వ్యాసం రాశారు[5]. గౌరవ వాచకమైన పండితుడనే పదానికి అర్థం మారిపోయింది. బతకలేని బడిపంతులు అని ఆ మాటకు అర్థం చెబుతుండేవారు[6]. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయేందుకు మధ్య తరగతి తెలుగు వారు ఉద్యమిస్తుండిన ఆ కాలంలోనే, తెలుగు భాష ఘనతను వారు నొక్కి చెప్పుకుంటుండిన అప్పుడే-తెలుగు పండితుల స్థితి దిగజారటం[7] ఒక గమనించవలసిన వైరుధ్యం.

గతించిన శతాబ్దాలలో తెలుగు పండితులు గొప్ప దశను అనుభవించారు. వారికి అమితమైన ఆదరణ ఉండేది. తమ కావ్యాలను అంకితం తీసుకున్న రాజుల నుంచి భూమినీ ధనాన్నీ పొంది సన్మానించబడేవారు. రాజులే కాకుండా మంత్రులూ సేనాధిపతులూ, చివరకు గ్రామాధికారులు కూడా పండితులను పోషించేవారు. పదకొండవ శతాబ్దానికి చెందిన నన్నయ భట్టు మొదలుకొని ఆయా కవుల గ్రంథాల అవతారికలను పరిశీలిస్తే ఆ పోషణ ఎంత వైభవంగా ఉండేదో మనకు కనబడుతుంది. పదహారవ శతాబ్దానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు, పదిహేడవ శతాబ్దం వాడైన విజయరాఘవ నాయకుడు వంటి మహారాజుల ఔదార్యాన్నీ ఔన్నత్యాన్నీ కథలు కథలుగా పద్యాలలోనూ గేయాలలోనూ కవులు స్మరించుకుంటూ వచ్చారు.

బ్రిటిష్ పాలకులు ఆ పూర్వరాజుల చర్యలను అనుకరించలేదు కాని జమీందారులు మాత్రం శాయశక్తులా ఆ సంప్రదాయాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. జమీందారులు నిజానికి రాజులకు కప్పం కడుతుండిన భూస్వాములు, రాజులు అంతరించాక తమ స్వతంత్ర ప్రతిపత్తి కోసం పెనుగులాడినవారు. ఇరవైయవ శతాబ్దం మొదలయేసరికి అదీ తగ్గిపోయింది. ఆ శతాబ్దపు తొలి దశాబ్దాలలో సాంప్రదాయిక పండితుల దుస్థితి గురించి, సత్యనారాయణకు గురువైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి ఇలా రాశారు:

అచ్చాఫీసులటంచు హూణుల కుపాధ్యాయత్వమంచున్ మఱిన్
వెచ్చంబిచ్చెడి బచ్చుటిండులకడన్ వేదాంతమంచున్ మహో
ద్యచ్చారిత్రులు పండితుల్ మెలఁగఁగా నయ్యెంగదా! పొట్టకై
చచ్చున్ గాలమువచ్చె గౌరవము నాశంబయ్యెఁ గామేశ్వరీ – కా. శ. 10-22 [8] [9]

తమ సంప్రదాయ విద్యలో విశ్వాసం నశించిన కొందరు పండితులు పూర్వగ్రంథాలను ఆధునిక విమర్శనా దృష్టితో చూడటం మొదలు పెట్టారు. వారి దృక్పథం అయోమయమయింది. పాత కవుల కాలాన్ని కొత్త చరిత్ర ప్రకారం లెక్కపెట్టబోయారు. పాశ్చాత్యుల భాషోత్పత్తి శాస్త్రము, వారి ప్రత్యక్షైక వాదపు సాహిత్య చరిత్ర, నిర్దేశించిన ప్రమాణాలను ఈ తెలుగు పండితులు అంగీకరించటం మొదలైంది. భారతీయ కావ్యదృష్టితో ఆ రెండూ బొత్తిగా పొసగని విషయాలు. అంతే కాకుండా ఆ కాలపు విక్టోరియన్ నైతిక సూత్రాలకు సమ్మతినిస్తూ వలసలకు పూర్వం వచ్చిన సాహిత్యం లోని శృంగారాన్ని నీతి బాహ్యమైనదానిగా పరిగణించారు. అనంతర కాలంలో ఆధునిక మేధావులు అవలంబించిన మార్క్సిస్ట్ సూత్రాలు, ఆ శృంగారరసాన్ని భూస్వామ్య సంబంధిగా ప్రకటించాయి. పాలకుల విషయవాంఛాతృప్తి కోసం రచించబడినదనీ సామాన్యులకు ఉద్దేశించినది కాదనీ తీర్మానించాయి.

ఆ విధంగా – ఆధునిక కవుల నుంచి మార్క్సిస్ట్‌ల వరకూ ఏర్పడుతూ వచ్చిన ఒక బలవత్తరమైన సమూహం సత్యనారాయణనూ ఆయన సాహిత్యకృషినీ తీవ్రంగా వ్యతిరేకించింది.

సంస్కృతాన్నీ పాత తెలుగునూ చిన్న చూపు చూడటం పరిషత్తులలో నూతన మేధావులను తయారు చేసింది. పూర్వకావ్యాలన్నీ ఒక అజ్ఞానయుగానికి చెందినవని వారు నిస్సందేహంగా నమ్మారు. వాటిని పఠించే పండితులూ ఉదాహరించేవారూ మూఢులుగా చూడబడేవారు. అవే కావ్యాలకు పాశ్చాత్యులు చేసిన అనువాదాల లోంచి ఆంగ్లవాక్యాలను ఉదాహరించటాన్ని మాత్రం సహించేవారు. ఆధునిక మేధావులు ఆంగ్ల కవులనూ పాశ్చాత్య తత్త్వవేత్తలనూ అధ్యయనం చేసేవారు. వారి ఆలోచన ఆంగ్లంలో సాగేది. వ్యక్తిగతమైన ఉత్తరాలకూ, దినచర్యనూ గమనికలనూ రాసుకునేందుకూ ఆంగ్లాన్నే ఉపయోగించేవారు. సంప్రదాయ సాహిత్యంలో వారికేమైనా ఆసక్తి ఉంటే అది రసావిష్కారానికీ దాన్ని గ్రహించటానికీ సంబంధించినది అయి ఉండేది కాదు. అది కేవలం వారి రాజకీయ, సామాజిక సిద్ధాంతాలకు, విశ్వాసాలకు బయటినుంచి ఊతమిచ్చేది మాత్రమే అయేది. ఆధునిక రచయిత కులాన్ని తిరస్కరించాలి. శృంగార వర్ణనలను పరిహరించాలి. మతపరమైన మూఢ విశ్వాసాలను ఖండించాలి. స్త్రీల గురించి ప్రగతిశీల భావాలను ప్రకటించాలి. సవర్ణ బ్రాహ్మణుల వలన తక్కువ కులాల వారు పడిన బాధలను ఖండించాలి. సత్యనారాయణ ఇవేవీ చేయదలచుకోలేదు కనుక ఆయనను తిరోగామిగా భూస్వామ్య వాదానికి ప్రతినిధిగా తీర్మానించి భద్రంగా పక్కకి పెట్టారు.

సత్యనారాయణను వైదిక సంస్కృతీ సంరక్షకుడిగా, మార్పుకు వ్యతిరేకిగా, వెనకకు చూసేవాడిగా మూసపోశారు. సమకాలికుడైన మార్క్సిస్ట్ విప్లవకవి శ్రీశ్రీ ‘విశ్వనాథ వారు వెనక్కి వెనక్కి నడవగా వేదకాలం ఇంకా వెనక్కి వెళ్ళింది’ అని వ్యంగ్యంగా రాశాడు. సమకాలికుడు, కవి రచయిత, అయిన తెన్నేటి సూరి ఒక అపహాస్యనాటికను రచించాడు. అందులో సత్యనాయణను ఉద్దేశించిన పాత్ర చేతిలో కలానికి బదులుగా కత్తి పట్టుకొని ఝళిపిస్తూ సత్యనారాయణ రాసిన పద్యాన్నే వల్లిస్తూ రంగం మీదికి వస్తుంది. ఆ పద్యం వేనరాజు అన్న పౌరాణిక నాటకం లోది. కథానాయకుడైన పృథు మహారాజు, వేనరాజు చేస్తున్న వేదధర్మ విరుద్ధమైన పరిపాలనను ఖండిస్తూ ఆ పద్యాన్ని పాడుతూ రంగప్రవేశం చేస్తాడు. సూరి రాసిన నాటికలో అది సత్యనారాయణ పెట్టే పెడబొబ్బ అయింది. నోరు తిరగని సంస్కృత పదాలతో నిండి, చదువుతుంటే ఊపిరందనీయని ఆ పద్యం ఇది –

అతి మనోబుద్ధ్యహంకృతుల్ ఔపనిషదు
లాత్త గండూషితత్రయు లౌర్వ వహ్ని
గర్భితాంతః తపస్కులు ఘనులు ఋషుల
కెవ్వడు విరోధి తద్వధ కెత్తినయది[10]

మనస్సుకూ బుద్ధికీ అహంకారానికీ అతీతులు, సముద్రజ్వాలా భీకరమైన తమ అంతరాత్మల నుంచి ఎగసే ఉచ్ఛస్వరాలతో ఉపనిషత్తులకూ వేదాలకూ ఆకృతి ఇచ్చిన వారు –వారు ద్రష్టలు, జ్ఞానులు, ఘనులు. వారినెవరు విరోధిస్తారో వారి పైకి ఎత్తిన కత్తి ఇది.

అతి గంభీరమైన సంస్కృత సమాసాలు, అమిత శక్తివంతంగా కూర్చిన పదబంధాలూ ఆ పద్యంలో ఆగ్రహాన్నీ తీవ్రతనూ స్ఫురింపజేస్తాయి. మొదటి మూడు పదబంధాల మొదటి అచ్చులు – అ, ఔ, ఆ; తర్వాత వచ్చే సంధిస్వరం; ఆ తర్వాత వచ్చే గహనమైన హల్లుల సమాసాలలో ఒకటి విసర్గతో అంతమవటం; చదువుతుంటే ఊపిరి తిప్పుకోనివ్వవు. ఒకవేళ ఆగి తిప్పుకుందామనుకున్నా, తప్పనిసరిగా పలికి తీరవలసిన మహా ప్రాణాక్షరం ఘ వెంటపడి ఎవ్వడు విరోధి వరకూ తరుముతుంది, ఆ పైన రెండు పదబంధాలతో పద్యం పూర్తయేవరకూ. ఆధునిక విలువలతో సత్యనారాయణ చేసిన పోరాటానికి ఈ ఏకవాక్యపద్యం చిహ్నంగా నిలిచింది.

సత్యనారాయణలో మహత్తరమైన విద్వత్తు, దానికి సాటి వచ్చే బ్రహ్మాండమైన ఊహ, సృజనశక్తి ఉన్నాయి. పురాణ ఇతివృత్తాలతో, సాంప్రదాయికమైన శైలితో, కట్టిపడేసే నవీన రసోత్పత్తితో ఆయన తెలుగు కవిత్వాన్ని మున్నెన్నడూ అందుకోని ఎత్తులకి చేర్చారు. ప్రాచీన సాహిత్యాన్నీ పద్ధతులనూ వ్యతిరేకించే విమర్శకులకు ఆయన నిర్భయంగా ఎదురు నిలిచారు. ఆంగ్ల విద్య వల్లనే తెలుగు కవులూ మేధావులూ వారి వారసత్వాన్నీ పారంపర్యమైన ప్రావీణ్యాన్నీ కోల్పోతున్నారని ఆయన నొక్కి చెప్పారు. ఎక్కువ ప్రజాదరణ లేని ఆ పక్షాన్నే ఆయన స్వచ్ఛందంగా ఎంచుకున్నారు. రామాయణం వంటి ప్రాచీన కావ్యాలు అభివృద్ధి నిరోధకాలనే రాజకీయ దృక్పథం నాగరికమైనదిగా భావించబడే కాలంలో, తాను రచిస్తున్న ఆరు కాండల రామాయణ కల్పవృక్ష కావ్యపు అవతారికలో ఇలా అంటారు.

మరల నిదేల రామాయణం బన్నచో,
        నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ
తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు,
        తన రుచి బ్రదుకులు తనివి గాన
చేసిన సంసారమే సేయు చున్నది,
        తనదైన అనుభూతి తనది గాన
తలచిన రామునే తలచెద నేనును,
        నా భక్తి రచనలు నావి గాన

కవి ప్రతిభలోన నుండును గావ్యగత శ
తాంశములయందు తొంబదియైన పాళ్ళు
ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయి
రెట్లు గొప్పది నవకథా ధృతిని మించి.[11]

అయితే ఇటువంటి ఆత్మరక్షణ ఆయనను విమర్శకుల దాడుల నుంచి కాపాడలేదు. కొత్త కాలపు కవులు రామాయణ కల్పవృక్షం లోని శయ్యను పాతబడిపోయిందని, భావాలను కాలదోషం పట్టినవనీ ఆక్షేపించారు. వారికీ, కల్పవృక్షాన్ని సమర్థించే వారికీ మధ్య పోరాటం జరుగుతూనే ఉండేది. సాహిత్య పత్రికలే కాకుండా దినపత్రికలు సైతం ఈ రెండు వర్గాల మధ్యన వివాదాలను ప్రోత్సహించేవి[12]. ఆ కారణంగా స్పర్థ ఇంకా ఎక్కువైంది.

సామాజికం గానూ రాజకీయం గానూ జరిగే ప్రతి ఒక్క మార్పునూ తప్పు పట్టేవాడుగా, వెనుచూపు మాత్రమే ఉన్నవాడుగా, సత్యనారాయణను హేళన చేశారు. ఆయన సాహితీ వ్యక్తిత్వాన్ని ఒక వ్యంగ్యచిత్రంగా వ్యతిరేకులు రూపొందించారు. ఆయన జీవన విధానం, వేషధారణ కూడా ఆ చిత్రణకు తోడ్పడుతుండేది. నున్నగా గొరిగించుకొని సంప్రదాయ బ్రాహ్మణులు పెట్టుకొనేలాగా పిలక పెట్టుకొనేవారు. పాత పండితుల లాగా ధోవతి కట్టుకొని పైన కండువా వేసుకొనేవారు. నుదుట స్మార్త పద్ధతిలో బొట్టు పెట్టుకునేవారు. ఇందుకు విరుద్ధంగా భావకవులు, టాగూర్ వలన ప్రభావితులైన వారి పద్ధతిలో బెంగాలీ పంచె, లాల్చీ తొడిగేవారు. జుట్టును గిరజాలుగా భుజాల వరకూ పెంచుకొని బంగారపు చట్రం కళ్ళజోళ్ళు పెట్టుకొనేవారు. మార్క్సిస్ట్ కవులు పంట్లాం, చొక్కా వేసుకొని జుట్టును పొట్టిగా కత్తిరించుకొనేవారు. వేషధారణ లోనే ఆయా కవులు వేరు వేరు ప్రపంచాలకు చెందినవారుగా కనిపించాలనుకునేవారు. జటిలమైన పదాలనూ వాడుకలో లేనివాటినీ ఎంచుకుంటాడని ప్రత్యర్థులు ఎగతాళి చేసేవారు. ప్రాచుర్యంలో ఉన్న పత్రికలు ఆయనను అధిక్షేపించే వ్యంగ్య చిత్రాలనూ పరిహాసాలనూ ప్రచురించేవి[13].

శ్రీశ్రీ వ్యంగ్యంగా ఇలా రాశారు, ఏకవీరడు అనే పేరన.

శ్రీమాన్ విశ్వనాథ సత్యనారాయణ
గారి శ్రీమద్రామాయణ
కావ్యం రోజూ పారాయణ
చేసేవాళ్ళెవరూ లేరా యన
ఉన్నానని ఒకడేనా అంటే సంతోషిస్తారాయన [14]

సత్యనారాయణను మెచ్చుకొనేవారిలో ఒకడైన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి కూడా ఆయనను సరదాగా వేళాకోళం చేస్తూ అనుకరించారు.

కించిత్ తిక్త కషాయ బాడబ రస క్షేపాతిరేకాతి వాక్
సంచార ప్రచయావకాశములలో కవ్యుద్ఘ! గండాశ్మముల్
చంచల్లీల నుదాత్త వాగ్గరిమతో సాధించి వేధించుమా!
పంచారించి ప్రవహ్లికావృతి కృతిన్ పాషాణ పాక ప్రభూ!

పద్యం చివరన రుక్మిణీనాథ శాస్త్రి చేసిన సంబోధన ‘పాషాణ పాక ప్రభూ’ అన్నది సత్యనారాయణకు మారు పేరుగా మిత్రులూ శత్రువులూ కూడా వాడేవారు[16].

ఆయన దగ్గర సమాధానాలు లేకపోలేదు. ప్రతిస్పందిస్తూ ఇలా అన్నారు:

తొలినాళుల పద్యార్థము
తెలియనిచో పాఠకునిది తెలియమి, యీ నా
ళుల వ్రాసిన కవి దోషము
కలి ముదిరిన కొలది చిత్రగతులన్ నడచెన్!

భారతదేశపు కాల గమనం సర్పిలంగా ఉంటుంది. కలియుగంలో అన్ని విలువలూ క్రమక్రమంగా క్షీణించి ఆఖరికి నశించిపోతాయి. సరళరేఖాత్మకంగా ఉండే క్రైస్తవ కాలమానాన్ని సత్యనారాయణ ఒప్పుకొనేవారు కాదు.

బిగ్గరగా ఖండించే విమర్శకులకు ప్రతిగా అభిమానులు ఆయనను అంత గట్టిగానూ సమర్థించేవారు. తెలుగు భాష లోని అతి గొప్ప కవులలో ఒకడుగా, సరస్వతీ అవతారంగా ఆయనను చెప్పుకొనేవారు. ఆ అభిమానులలో చాలా మంది సంస్కృతమూ తెలుగూ చదువుకున్న సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాల లోంచి వచ్చినవారు. కొత్త తరంలో ఆ రెంటికీ కాలం చెల్లిపోతోంది. ఇరవైయవ శతాబ్దపు తొలి దశాబ్దాలలో ఈ సాహిత్య యుద్ధం వెనుక కులాల సంఘర్షణ కనిపించేది. పాత పద్ధతులు పాటించే బ్రాహ్మణులు సత్యనారాయణను స్తుతించేవారు. ఆ కాలంలో చాలా చురుకుగా పైకి వస్తున్న బ్రాహ్మణేతరులు ఆయనను కాలదోషం పట్టినవాడిగా తిరస్కరించేవారు. ఆంగ్ల విద్య అభ్యసించి ఆధునికులై, తమ కుటుంబ సంప్రదాయాలతో విభేదించే బ్రాహ్మణులు కూడా ఈ పోరాటంలో బ్రాహ్మణేతరుల తోనే చేతులు కలిపేవారు.

ఈ భీషణమైన సాంస్కృతిక సంఘర్షణలో, విచక్షణా రహితంగా గీయబడిన హద్దులలో, దాడులలో ప్రతి యుద్ధాలలో – సత్యనారాయణ లోని వలసవాద వ్యతిరేకత మరుగున పడిపోయింది. సత్యనారాయణ వలసవాదాన్ని వ్యతిరేకించటం కేవలం బ్రాహ్మణాధిక్యాన్ని నిలబెట్టటం కోసమేనని ఆధునికులు అభిప్రాయపడ్డారు. గడిచిన కాలమంతా అజ్ఞానంతో మూఢత్వంతో నిండి ఉందని అనుకున్నారు. రామ మోహన రాయ్ నుంచి వీరేశలింగం వరకూ సంఘ సంస్కర్తలైన వారు వ్యతిరేకంగా పోరాడినది వాటికే.

తన సామాజిక ప్రణాళికను విమర్శకులు ఖండించినా, సాహిత్య పరంగా ఆయన ఎవరూ కాదనలేనంత శక్తిమంతుడు. కేవలం ఒక పాత కాలపు పండితుడిగా ఆయనను తీసిపారేయటం ఎవరికీ వీలు కాలేదు. ఆయన ప్రాచీనుడు కాలేనంత నవ్యుడు, నవ్యుడు కాలేనంత ప్రాచీనుడు. రచయితగా, కవిగా, విమర్శకుడుగా, ప్రతిస్పర్థులకు ప్రబలమైన సమాధానంగా ఆయన ఎల్లెడలా కనిపించేవాడు. అర్ధశతాబ్దం పాటు ఆయనది సాహిత్య రంగంలో విస్మరించలేని అస్తిత్వం.

1930లలో ఆయన తన మహాసృష్టిగా భావించబడే వేయి పడగలు నవలను వెయ్యి పుటలతో రచించారు. వలసవాద ప్రభావం లేని భారతదేశాన్ని తాను దర్శించి, పట్టు వదలని జీవశక్తితో దాన్ని వేయిపడగలులో సమర్థించారు. ఆ తర్వాత ఆయన చాలా నవలలు రాశారు. వాటిలో పాత్రలు ఆధునికత అనబడే కలికాలంతో పోరాడుతుంటాయి, ఓడిపోతూ కూడా ఉంటాయి. 1940లలో రాసిన చెలియలికట్ట, సమకాలికుడైన చలం రాసిన నవలకు సమాధానం. స్త్రీలకు లైంగిక స్వేఛ్చనూ సామాజిక స్వాతంత్ర్యాన్నీ ప్రతిపాదించిన తీవ్ర రచయిత చలం. ఆయన రాసిన మైదానంనవలలో రాజేశ్వరి అనే బ్రాహ్మణ స్త్రీ తన భర్తను వదిలేసి ఒక ముస్లిమ్‌ యువకుడితో వెళ్ళిపోతుంది. ఆరుబయలు మైదానంలో, జన సంచారం లేని చోట – వారిద్దరూ అక్కడ సంఘపు కట్టుబాట్లకు అతీతంగా ప్రేమా సంతోషమూ శృంగారమూ నిండిన జీవితం గడుపుతారు. సంఘాన్ని తిరస్కరించటంలో ఉన్న సమస్యను సత్యనారాయణ చెలియలికట్టలో చెబుతారు. సముద్రం తన హద్దును దాటదనీ చెలియలి కట్ట సముద్రానికి సోదరి అనీ దాన్ని దాటితే అది వావి తప్పటమనీ జనంలో ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం మీదనే చెలియలికట్ట నవల పేరు ఆధారపడింది. ప్రజలు నివసించే భూమి మీదకి సముద్రం రాదు. ఘోరపాతకాలు సంభవించినప్పుడే సముద్రం పొంగి ఊళ్ళను ముంచెత్తుతుంది. నవలలో అందుకే, అలాగే జరిగినట్లుగా చిత్రిస్తారు.

తన అరవైయవ పడిలో ఒక ప్రచురణ సంస్థతో పన్నెండు నవలలు రాసే ఒప్పందాన్ని సత్యనారాయణ చేసుకున్నారు. ఆ నవలలు అన్నింటికీ మంచి-చెడుల మధ్యన జరిగే పోరాటమే ఇతివృత్తం. దైవిక శక్తులకూ తద్విరుద్ధమైన వాటికీ నిరంతరంగా జరుగుతున్న యుద్ధంగా ఆ పురాణ వైర గ్రంథమాలను సంకల్పించారు. ఓడిపోయిన తర్వాత కూడా తిరిగి తిరిగి తలెత్తే దైవవిరోధ శక్తులు చివరకు అంతరించిపోవటాన్ని ఆ నవలలలో చెప్పదలచుకున్నారు.

సాహిత్యం లోనూ సామాజికం గానూ వేషధారణ లోనూ పూర్తి సంప్రదాయవాదిగా కనిపించే సత్యనారాయణలో చాలా ఆధునికత కూడా ఉండేదని స్నేహితులు అనేవారు. ఆయన జీవిత చరిత్ర ఇంకా రావలసి ఉంది. ఆంగ్ల నవలలు ఎక్కువగా చదివేవారు, ఆంగ్ల చలన చిత్రాలను విపరీతంగా చూసేవారు. సాధారణ వైదిక బ్రాహ్మణుడి లాగా కాక జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించేవారని సన్నిహితులు చెబుతారు.

చాలా ప్రేమ గల మనిషి అని కూడా దగ్గరివారు అంటారు. బాగా ఆప్యాయంగా ఉండేవారు, కాని మాటలో కరకుదనం వల్ల సులభంగా అపార్థం చేసుకోబడేవారు. తనను పొగడేవాళ్ళను కూడా కొన్ని సార్లు శత్రువులుగా చేసుకొనేవారు. ఆయన అభిరుచులు రాజీ పడనివి. లోతు లేని చదువునూ పైపై మాటలనూ సహించలేకపోయేవారు. సరైన అంశాలకు కాకపోయినప్పుడు ప్రశంసించేవారి మీద కూడా కోప్పడేవారు. తన సామర్థ్యం పట్లా ప్రతిభ పట్లా సంపూర్ణమైన విశ్వాసం ఉండటం ఒక్కొక్కసారి గర్వపడటంగా కనిపించేది. బీదరికంలో ఉన్నప్పుడు కూడా పోషకులు కాగల వారిని అతిగా స్తుతించటం ఆయనకు రుచించేది కాదు. అందుకు నిదర్శనంగా ఈ ఉదంతాన్ని ప్రస్తావిస్తారు.

జయపురం మహారాజా అయిన విక్రమదేవవర్మకు మంచి సాహిత్యాభిరుచి ఉండేది. ఆయన స్వయంగా కవి కూడా. ఏలూరులో జరిగిన ఒక సభలో ఆయన కవులను సత్కరిస్తున్నారు. చిన్నా పెద్దా కవులు వెళ్ళి రాజా వారిని పొగుడుతూ పద్యాలు చెప్పి నూట పదహారు రూపాయల బహుమానాలు పట్టుకువెళుతున్నారు. గురువు గారైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి సత్యనారాయణను కూడా వెళ్ళి పద్యాలు చదవమన్నారు. సత్యనారాయణకి అప్పుడు డబ్బు చాలా అవసరం. ఆ రోజుల్లో నూట పదహారు రూపాయలంటే పెద్ద మొత్తమే. ఆయన నిలబడి ఈ పద్యం చదివారు.

వ్రేగగు హైమ సౌధమణి వీధికఁ బుట్టెను రాచబిడ్డ క
ల్పాగము వోలె నేల విరియంబడి బంగరు ముద్ద లే దెసన్
ద్యాగమువొందె వారసతు లాడిరి మంగళతూర్యరావముల్
మ్రోగెను లోకపుంజనులు బోరన సన్నుతి వెట్టి రెంతయున్.

ఒక్క చిఱుపేద గుడిసెలో నుద్భవిల్లి
నాడు కవికూన, పదియవనాడు, మంత్ర
సాని దెప్పిన దన్నము చాలదంచు
మంత్రమో సణ్గినాడొ బ్రాహ్మణుఁడు వచ్చి.

ఆ రాచబిడ్డ కళ్యాణ పల్యాణ సజ్జిత పంచకళ్యాణిఁ జెలువు గులికె
ఈ కవికూన, పేరాకట మాడి కన్నులలోనఁ బ్రాణముల్ నిలుపుకొనియె
ఆ రాచకూన, మార్గాయాసఖిన్ను, క్ష్మాజములు వంగి పథశ్రమములు వాపె
ఈ కవిబిడ్డ దుఃఖైకజన్ముని దీక్ష్ణకిరణుండు శుచి నుడుకించి వైచె.

రాజునిరంత భోగమధురంబగు జీవితమై, గతించెడున్
రోజునఁ దూర్యముల్ మరల మ్రోసెను, శ్రీ కలకంఠకంఠ గీ
తీ జగతీ ఘలంఘల గతి ప్రమదంబొలసెన్ మనోజ్ఞ వ
ర్షా జయనాద నీరద భరంబయి మ్రోగెఁ ద్రయీనినాదముల్.

నాటి సంజవేళ నభమున ధగధగా
యిత విలాసదీప్తి జతనుపఱచి
సానయిడిన మణివిధాన దీపిల్లు తా
రక యొకండు నేల రాలిపడియె.

కవికి క్షుధాగ్ని పీడితము కాయము త్రెళ్లెను; కాష్ఠవహ్నిలో
శవ మిడునంతలో నపరసాగరమందున గర్మసాక్షి క్రుం
కువడె, నొకింతలోన మెఱుగుల్ దెసలందున గ్రమ్ముకొంచు నూ
త్నవిలసనంబు చిమ్ము నొక తారక మింటికి నెక్కె వెంబడిన్.[18]

సత్యనారాయణ భావాలూ అభిప్రాయాలతో సంబంధం లేకుండా, కొన్నిసార్లు దుర్మార్గంగా కూడా ఉండే విమర్శలతో నిమిత్తం లేకుండా, ఆయన పుస్తకాలు అమ్ముడు పోయేవి. పుస్తకాల మీద వచ్చే ఆదాయం మీద చాలా భాగం ఆధారపడి జీవించిన తెలుగు రచయిత, బహుశా ఆయన ఒకరేనేమో. నిజానికి, అప్పటికి పుస్తకాల అమ్మకపు వ్యవస్థ పూర్తిస్థాయిలో నెలకొనలేదు. ప్రచురణ ఇంకా ఒక పరిశ్రమగా ఏర్పడని రోజులు అవి.

తన పుస్తకాలను తానే ముద్రించుకొనేవారు. కొందరు మధ్యతరగతి వారు కవి పండితులను సన్మానించే దాతలుగా జమిందారీ సంప్రదాయాన్ని కొనసాగించేవారు. అటువంటివారి నుంచి సత్యనారాయణకు సహాయం అందుతుండేది. పుస్తకాలను అంకితం తీసుకున్నవారు ముద్రణ ఖర్చులు భరించేవారు. ఆ దాతలనూ వారి కుటుంబాలనూ స్తుతిస్తూ పూర్వకవుల పద్ధతిలో[19] సత్యనారాయణ పద్యాలు రాసేవారు. అవి ఆ పుస్తకాల మొదటి పుటలో ముద్రించబడుతుండేవి. కాని ఆ దాతలను తాను చేయి చాచి అడుగుతున్నట్లుగా ఆ పద్యాలధోరణి ఉండేది కాదు. తాను ఎత్తున నిలబడి వారిని ఆశీర్వదిస్తున్నట్లుగానే సత్యనారాయణ భావించుకొనేవారు. కొన్ని గ్రంథాలను ప్రేమ కొద్దీ మిత్రులకు అంకితమిచ్చేవారు. అటువంటప్పుడు చెప్పిన పద్యాలు చమత్కారంగా ఉండేవి. చాలా పద్యాలు నిలిచిపోయాయి. గొప్ప చరిత్ర పరిశోధకుడైన మల్లంపల్లి సోమశేఖర శర్మ గురించి చెప్పిన పద్యాలు ప్రసిద్ధమైనవి. ‘డిగ్రీలు లేని పాండిత్యంబు వన్నెకు రాని యీ పాడు కాలాన బుట్టి’ అన్న వాక్యం వాటిలో ఒక పద్యం లోది. సోమశేఖర శర్మ ఎన్నో శిలాశాసనాలనూ రాగిరేకులనూ బహుశ్రమతో పరిశీలించి వాటిలోని సమాచారాన్ని నిగ్గు తేల్చినవారు. ఎందరో ఆంధ్రరాజుల చరిత్రలను ఆయన బయటికి తెచ్చారు. ఆ రంగంలో ఎందరికో మార్గదర్శకులు కాగల కృషి చేసి ఉన్నా కూడా ఏ విశ్వవిద్యాలయమూ ఆయనను బోధకుడుగా తీసుకోలేదు. శర్మకు చరిత్రలో పట్టా లేకపోవటమే దానికి కారణం. ఆ విషయం అప్పటి ఆంధ్రులందరికీ తెలిసినదే. సత్యనారాయణ మాటలు, ఇటువంటి వాక్యాలు, ఇంకా చాలా వ్యాప్తి లోకి వచ్చి సందర్భోచితంగా ఉదాహరించబడేవి. చాటు పద్యాల సంప్రదాయం ఆ విధంగా కొనసాగినట్లయింది.

వ్యక్తిగతం
ఆయనతో 1950ల నుంచీ నాకు పరిచయం ఉంది. అప్పట్లో చదువుకు కొంత విరామం ఇచ్చి ఉన్నాను. ఏవో చిన్నా చితక ఉద్యోగాలు చేస్తూ, ఆసక్తిగా అనిపించినదాన్నల్లా చదువుతూ ఉండేవాడిని. కవులతోనూ పండితులతోనూ గోష్ఠులలో పాల్గొనేవాడిని. ఆ కాలంలో సత్యనారాయణను చాలాసార్లు కలుసుకున్నాను. ఆయన ఉండే విజయవాడ నేను ఉంటున్న ఏలూరికి నలభై మైళ్ళ దూరంలో ఉండటం ఒక కారణం. ఆయన బాగా దగ్గరకు చేరనిచ్చేవారు. అది ఇంకొక కారణం. మార్క్సిస్ట్ సాహిత్య సిద్ధాంతాలతో నేను తీవ్రంగా ప్రభావితుడినై ఉన్న కాలం అది. శ్రీశ్రీకి గొప్ప అభిమానిని. మా తరంలో చాలామందిమి శ్రీశ్రీ విప్లవ కవిత్వంతో ప్రేరేపించబడిన వారమే. నాకు స్నేహితులూ పరిచయస్తులూ అయిన చాలా మందికి తెలుగు లోని ప్రాచీన సాహిత్యంతో పరిచయమే లేదు. అందువల్ల సత్యనారాయణను చేర్చుకొనే ప్రసక్తే ఉండేది కాదు. మార్క్స్, మావోల రచనలు చదువుతూ చర్చిస్తూ కాలం గడిపేవాళ్ళం. సార్త్ర, కాఫ్కా, హైన్, పిరాండెల్లో, ఉనామునో వంటి ఫ్రెంచ్, జర్మన్ కవులనూ రచయితలనూ చదివి ముచ్చటించుకోవటం మాకు బాగుండేది. సత్యనారాయణ పట్ల నా అభిరుచి నా స్నేహితులకు వింతగా ఉండేది. నాకోసం భరించేవారు. ఆయన పద్యాలను నేను పైకి చదివినప్పుడు వారికేమీ అర్థం కాకపోయినా కొన్నిసార్లు ఆస్వాదించగలిగేవారు. ఆ కవిత్వంలో ఏదో విశేషం ఉందని ఒప్పుకునేవారు. మరొక సాహిత్య బృందమూ ఉండేది నాకు. వాళ్ళు కొంత వయసు మీరినవారు, తెలుగునూ సంస్కృతాన్నీ మాత్రమే చదువుకుని ఆంగ్ల భాషతో బొత్తిగా పరిచయం లేకుండినవారు. ఒకదానికొకటి సంబంధం లేని, ఒకదాన్ని ఇంకొకటి పట్టించుకోని రెండు ప్రపంచాలలో అలా నేను జీవిస్తుండేవాడిని. ఆధునికులైన నా మిత్రులు సత్యనారాయణను కొంచెమైనా భరించగలిగేవారు కాని, అటువంటి తిరోగమన కవిత్వాన్ని నేనెందుకు చదువుతానో నా మార్క్సిస్ట్ స్నేహితులకు అర్థమయేది కాదు. ఆ మార్క్సిస్ట్ కవుల కవిత్వాన్ని నేను మెచ్చుకోవటం పండితులైనవారు లెక్క చేసేవారు కాదు. వారి దృష్టిలో అది కవిత్వమే కాదు. నేను మాత్రం సత్యనారాయణను చదువుతూనే వచ్చాను. ఏళ్ళు గడిచే కొద్దీ ఆయన సాహిత్యం ఇంకొంత లోతుగా అర్థమవుతూ వచ్చింది. రాజకీయం గానూ సామాజికం గానూ సత్యనారాయణ అభిప్రాయాలతో నేను ఏకీభవించకపోయినా అది సాధ్యమైంది. ఒక సందర్భంలో నేనూ ఆయనా ఒకే బహిరంగ వేదిక పైన మాట్లాడటం తటస్థించింది. ఆయన యథాప్రకారంగా పూర్వ కవులనూ ఋషులనూ సమర్థించారు. నేను నా కుర్రతనపు ఉత్సుకత కొద్దీ మార్క్సిస్ట్ కవులనూ వారి విప్లవసాహిత్యాన్ని గట్టిగా సమర్థిస్తూ మాట్లాడాను. ఆయన పట్ల నా గౌరవం ఏమాత్రమూ తగ్గలేదు. తక్కినవారంతా ఆయనలోని సంప్రదాయవాదిని చూస్తే నేను మాత్రం ఒక ఆధునిక కవినే చూస్తూ వచ్చాను.

అమెరికాకు వెళ్ళాక కూడా ఆయనను చాలా సార్లు కలుసుకున్నాను. ఆయన సాహిత్యంలో కొంత భాగాన్ని ఆంగ్లం లోకి అనువదిస్తానని అడిగాను. ఆయన సంతోషంగా ప్రోత్సహించారు. 1976లో ఆయన మరణించే లోపు ఏమీ చేయలేకపోవటం నాకొక వైఫల్యం. 2002లో డేవిడ్ షూల్మన్‌తో కలిసి నేను ప్రచురించిన ఇరవైయవ శతాబ్దపు తెలుగు కవిత్వం సంపుటంలో సత్యనారాయణవి కొన్ని పద్యాలను అనువదించి చేర్చగలిగాను. ఆయన పట్ల నాకున్న అవగాహన లోనూ ఆదరం లోనూ షూల్మన్ కూడా భాగం తీసుకున్నాడు[20].

ఈ సంపుటిలో రెండు నవలికలు ఉన్నాయి: హా హా హూ హూ, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు. వీటి రచనా కాలం నిశ్చయంగా తెలియదు. ఆయన సాహిత్యపు పట్టికను క్రోడీకరించినవారు హా హా హూ హూ 1932లో రచించబడిందని అంటారు. సత్యనారాయణ కుమారుడు 1952లో అని చెప్తారు. విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు 1961లో పుస్తకరూపంలో వచ్చింది. కాని అంతకు చాలా ముందే కృష్ణాపత్రికలో[21] ధారావాహికంగా వచ్చింది. ఆ తేదీలు స్పష్టంగా తెలియవు. ఇది సత్యనారాయణను పరిచయం చేసే ఒక వినమ్రమైన ప్రయత్నం. బహుశా కాలాతీతం కూడా అయిందేమో. ఇది చదివినాక ఇంగ్లీష్ చదివే పాఠకులకు ఆయన రచనలను ఇంకొంత దగ్గరగా పరిశీలించాలనిపిస్తే నా ప్రయత్నం కొంత నెరవేరినట్లే.

హా హా హూ హూ
హిందూ పురాణాలలో కనిపించే మానవాతీత జాతులలో ఒకటి గంధర్వజాతి. ఇది ఒక గంధర్వుడి కథ. గంధర్వులు అర్థదివ్యులు. వాళ్ళకి గుర్రం తలా మనిషి శరీరమూ రెక్కలూ ఉంటాయి. ఆకాశంలో ఎగురుతూ ఆ గంధర్వుడు స్పృహ తప్పి లండన్ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో పడిపోతాడు. అదేదో వింత జంతువు అనుకొని చుట్టూ జనం మూగుతారు. అది ఏమిటై ఉంటుందా అని తర్కించుకుంటారు. ఆ తర్వాత రక్షక భటులు వచ్చి, గంధర్వుడు ఎవరికీ హాని చేయకుండా చుట్టూ ఒక బోను నిర్మిస్తారు. గంధర్వుడు మేలుకొని ప్రాకృతంలో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఆయన ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఎవరికీ అంతు పట్టదు. దగ్గరగా వింటే మాటలు విడివిడిగా తెలియక కేవలం పెద్ద ధ్వని లాగా వినిపిస్తుంది. లండన్ విశ్వవిద్యాలయం లోని సంస్కృత పండితులు దూరం నుంచి విని ఆ భాష సంస్కృతానికి దగ్గరగా ఉన్నదని కనిపెడతారు. వాళ్ళు ఆయనని సంస్కృతంలో ‘ఏమిటి అంటున్నావు?’ అని ప్రశ్నిస్తారు. గంధర్వుడు స్వచ్ఛమైన సంస్కృతంలో ‘అత్ర సమీపే అస్తి వా కచ్చిన్నదీ — స్నాతుమిచ్ఛామి.’ (దగ్గరలో ఏదైనా నది ఉన్నదా? స్నానం చేయగోరుతున్నాను) అని సమాధానం ఇస్తాడు.

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు
ఈ రెండవ నవలలో కూడా మంచి కల్పనా చాతుర్యం ఉంటుంది. పదమూడవ శతాబ్దంలో మహాభారతాన్ని పదిహేను పర్వాలు తెలుగు చేసిన తిక్కన, రాజకుమారులకు జంతువుల కథల ద్వారా రాజనీతిని నేర్పిన విష్ణుశర్మ – కోస్తా ఆంధ్ర రాష్ట్రం లోని విజయవాడలో ఒక తెలుగు ఉపన్యాసకుడి కలలోకి వచ్చి ఇంగ్లీష్ నేర్పమని అడుగుతారు. దేవతలకు రాజూ స్వర్గానికి అధిపతీ అయిన ఇంద్రుడు వాళ్ళని పంపించినట్లు చెబుతారు. మళ్ళీ మళ్ళీ వచ్చే కలలలో కథ జరుగుతూ ఉంటుంది. బోధకుడికీ విద్యార్థులకీ మధ్యన సంభాషణలు ఉల్లాసంగా నడుస్తాయి. ముగింపు అనూహ్యంగా ఉంటుంది.

అనువాదం గురించి
సత్యనారాయణ చాలా అరుదుగా మాత్రమే చేతితో రాసేవారు. దాదాపు అన్ని నవలలనూ నోటి చెబుతూండగా లేఖకులు రాసేవారు. తరచుగా చాలా చిన్న వాక్యాలను చెప్పేవారు. హఠాత్తుగా ఆపేసినట్లు అనిపిస్తుంది. మధ్య మధ్యలో సుదీర్ఘమైన సంస్కృత సమాసాలు ఉంటాయి. కానీ ఈ రెండు నవలలో భాష సరళంగా ఉంటుంది. పెద్ద పెద్ద సంస్కృత పదాలూ తక్కువే. మొదటి నవల హా హా హూ హూలో శైలి సాఫీగా సాగుతుంది. వాక్యనిర్మాణమూ పేరాలను విడగొట్టటమూ అక్కడక్కడా సరిగ్గా లేదనిపిస్తుంది కానీ ఆ రెండు ఇబ్బందులకూ ముద్రణా దోషాలు కూడా కారణం అయి ఉండవచ్చు. విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు దగ్గరికి వచ్చేసరికి సత్యనారాయణకు కొంత అజాగ్రత్త వచ్చింది. ఒకేసారి పది పన్నెండు నవలలను, వంతులవారీగా పనిచేసే లేఖకులకు చెబుతూ వచ్చారు. తన ఇష్టానుసారం వాక్యాలు చెప్పుకుపోతుండేవారు. లేఖకులు ఏమి రాశారో గమనించి సరిచేయటం ఉండేది కాదు. ఉన్నవి ఉన్నట్లు గానే ఆ రాత ప్రతులు ముద్రణశాలలకు వెళ్ళేవి. ఎవరూ వాటిని పరిష్కరించి సవరించటం గానీ అచ్చయిన చిత్తు ప్రతిని దిద్దటం గానీ జరిగేవి కావు. ఒక్కొక్కసారి పేరాగ్రాఫులు పేజీల కొద్దీ సాగి కనబడతాయి. లేఖకుడికి కొత్త పేరా మొదలు పెట్టమని చెప్పి ఉండకపోవటం కారణమై ఉండచ్చు. విరామచిహ్నాలు ఒక క్రమపద్ధతిలో ఉండవు, వర్ణక్రమం అతి స్వతంత్రంగా ఉంటుంది. ఆ లేఖకుల గురించీ రాయటంలో వారి అలవాట్ల గురించీ సంపూర్ణమైన సమాచారం లభించటం లేదు. అందువల్ల ఆ వర్ణక్రమాన్ని రచయిత ఉద్దేశించారా లేక లేఖకులు అలా రాశారా అనే విషయం ఇదమిద్ధంగా తెలియదు.

నేను వీటిని మౌఖిక నవలలు అని అంటాను. రాసిన నవలలకూ వీటికీ ఒకే రకమైన అనుశాసన సూత్రాలు వర్తించవు. వాటిలో ఉన్న ఆ ప్రత్యేక లక్షణాన్ని నా అనువాదం లోకి తీసుకురావాలని ప్రయత్నించాను. కాకపోతే నా అనువాదాలలోకి ఎంతో కొంతగా రాత నవలల పద్ధతి వచ్చి తీరుతుంది. ఎందుకంటే నేను వీటిని స్వయంగా రాస్తున్నాను, ఎవరికీ చెప్పి రాయించటం లేదు.

ఇరవైయవ శతాబ్దపు తొలి దశాబ్దాలలో, ఏ మాండలిక భాషలో రాయాలనే సంగతి మీద వేడివేడిగా వాదోపవాదాలు జరిగేవి. అప్పటివరకూ తెలుగు సాహిత్యం ఇంచుమించు పూర్తిగా పద్యరూపం లోనే ఉండేది. వాటికి ఛందస్సు నియమాలు ఖచ్చితంగా వర్తించేవి. ఏ విధమైన మార్పులూ చేర్పులూ అంగీకరించబడేవి కావు. ఛందస్సు, ప్రాస నియమాలు, పదాల పొందిక – ఇవి ఉన్న పద్ధతులలో ఏదో ఒక విధంగా మాత్రమే ఉండి తీరాలి కనుక కావ్యభాష అమిశ్రితంగానే ఉంటూ వచ్చింది. తొమ్మిది వందల ఏళ్ళ పాటు అలాగే జరగటం ఏ భాషాచరిత్ర లోనైనా పెద్ద విశేషం. సంస్కృతాన్ని మాట్లాడటం మానివేసిన వేయి ఏళ్ళ వరకూ అది కావ్యభాష గానే నిలిచి ఉండిన తీరు కూడా తెలుగును ప్రభావితం చేసి ఉండచ్చు. రకరకాల మాండలికాలు మాట్లాడే భాషలో ఉన్నా రాసే భాష ఒకటిగానే ఉండిపోయింది.

పందొమ్మిదవ శతాబ్దంలో అచ్చు యంత్రం కనిపెట్టబడటంతో వచనానికి అవసరం ఎక్కువైంది. ఈస్టిండియా కంపెనీ కొలువులో ఉండిన తెలుగు పండితుడు పరవస్తు చిన్నయ సూరి తెలుగు భాషకు వ్యాకరణాన్ని రాశారు. సంస్కృతంలో ఉన్న గొప్ప నిర్ణాయిక వ్యాకరణాలను అనుసరిస్తూనే ఆ తెలుగు వ్యాకరణం ఏర్పడింది. తొమ్మిది వందల ఏళ్ళుగా తెలుగు కావ్యాలలో ఉపయోగించిన భాషనంతటినీ చిన్నయ సూరి తన వ్యాకరణం లోకి చేర్చారు. అదే వ్యాకరణం వచనానికి కూడా వర్తిస్తుందని ఆయన భావించారు. కానీ అన్ని వందల ఏళ్ళ నుంచీ వ్యాఖ్యానాలలోనూ వ్యాపారపు లావాదేవీల లోనూ వాడుతుండిన వచనం ఒకటి ఉంది. దాన్ని చిన్నయ సూరి విస్మరించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులే తెలుగు భాషాబోధనను పర్యవేక్షించేవారు కనుక చిన్నయసూరి వ్యాకరణాన్నే వారు పాఠశాలలలో ప్రవేశ పెట్టారు. కానీ వాక్య నిర్మాణం లోనూ వర్ణక్రమం లోనూ విద్యావంతులు మాట్లాడే భాష వ్యాకరణంలో లాగా కాక పూర్తిగా వేరేగా ఉండేది. ఆ రెండూ వేరు వేరు భాషలని అనిపించేంత అంతరం వాటి మధ్య కనిపించేది. విద్యార్థీ విద్యార్థినులు తాము అప్పటివరకూ రాస్తుండిన భాషను వ్యాకరణ విరుద్ధమైనదని వదిలిపెట్టి, చిన్నయ సూరి వ్యాకరణం లోని సూత్రాలకు లోబడి ఉండే కొత్త భాషను నేర్చుకోవలసి వచ్చింది.

ఆధునిక విద్యావేత్త గిడుగు రామమూర్తి (1863-1940) ఆ రాత భాషను మార్చి తీరాలని తీవ్రంగా ఉద్యమించారు. చిన్నయ సూరి వ్యాకరణం లోని భాషను ఆయన గ్రాంథిక భాష అన్నారు. విద్యావంతులు మాట్లాడే వ్యావహారిక భాషకే (శిష్ట వ్యావహారికం) మద్దతు ఇవ్వాలని ఆయన ప్రకటించారు.

ఆయన వాదంలో చాలా సబబు ఉంది. ఎప్పుడో రాసి ఉన్న కావ్యాల లోని భాషను ఇప్పుడు రాస్తున్న వచనానికి ఉపయోగించమనటం కృత్రిమంగా తోచింది. అయితే, చిన్నయ సూరి వ్యాకరణాన్ని గిడుగు రామమూర్తి తిరస్కరించటం, అసలు వ్యాకరణమే అవసరం లేదని అర్థం చేసుకోబడింది. ఏ నియమాలూ లేకుండా ఎలా మాట్లాడితే అలాగే రాయవచ్చుననే అభిప్రాయం ఏర్పడింది. తెలుగు సాహిత్య ప్రపంచం రెండు వర్గాలుగా చీలింది. చిన్నయ సూరి వ్యాకరణాన్ని సమర్థించే సంప్రదాయవాదులు, ఆ నియమాలు భాషా స్వేచ్ఛను హరించి వేస్తాయనే ఆధునికులు – వీరి మధ్యన ఎడ తెగని వివాదాలు భీషణంగా కొనసాగినాయి. ఆ వివాదాలలో భావస్పష్టత లేకపోవటం దురదృష్టం.

అంత గొప్ప పండితుడైన గిడుగు రామమూర్తి తాను సమర్థించే శిష్ట వ్యావహారికానికి వేరే నియమ నిబంధనలు కావాలని చెప్పలేకపోయారు. అసలు ఆ శిష్ట వ్యావహారిక భాషాస్వరూపాన్ని ఆయన సమగ్రంగా నిర్వచించనూ లేకపోయారు. ఫలితంగా ఎలా మాట్లాడితే అలాగే రాయవచ్చుననే కల్లోలపు పరిస్థితి ఏర్పడింది. ప్రపంచంలో ఎక్కడా కూడా మాట్లాడే భాషను యథాతథంగా రాయరని, రాత భాషకి ఉండే నియమాలు కాలానుగుణంగా మారుతూ వస్తాయి గాని అసలు లేకుండా పోవని, ఆ అయోమయంలో ఎవరికీ బోధపడలేదు.

సత్యనారాయణ ఈ విషయంలో సంప్రదాయవాదుల వైపే ఉన్నారు. ఆయన రాసేది ఎక్కువ భాగం కవిత్వమే కనుక ఆ దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చు. విచిత్రమేమిటంటే, సమకాలీన పరిస్థితులను చిత్రించే నవలలలో కూడా ఆయన అదే భాషను ఉపయోగించేవారు. అయితే, నవలను చెప్పి రాయించేవారు కనుక రాను రాను వ్యావహారిక భాష లోని ప్రయోగాలు వాటిలోకి అప్రయత్నంగా వచ్చేసేవి. ఆయన చివరి నవలలలో పాత కొత్త భాషల ప్రయోగాలు పరస్పర విరుద్ధంగా కలబోసుకొని ఉంటాయి. వర్ణక్రమం అనేక విధాలుగా – అటు సాంప్రదాయిక వ్యాకరణాన్ని గాని, ఇటు మాట్లాడే భాషను గాని అనుసరించకుండా ఉంటుంది. అయినా కూడా ఆయన వాక్యనిర్మాణం సంభాషణాశైలి లోకి అద్భుతంగా ఒదుగుతుంది. భావ వ్యక్తీకరణ లోనూ ఆయన వాక్యాలు అతి ప్రబలమైనవి. కాలదోషం పట్టిన వ్యాకరణాన్ని అనుసరించ పూనుకోవటం ఆయన సృజనశక్తిని అడ్డుకోలేకపోయింది. ఆఖరికి జరిగినదేమంటే, తనదే అయిన ఒక వినూత్న భాషతో విలక్షణమైన వాతావరణమొకటి ఆయన నవలలలో విస్తరించింది. ఆ వచనపు శైలి ఆయన ముద్రగా నిలబడిపోయింది.

నవలలను చెప్పి రాయించటం ఇంకొన్ని సమస్యలను కూడా తెచ్చి పెట్టింది. చెబుతూ ఉన్న విషయాన్ని వదిలి వేరే వైపుకి ఆయన వాగ్ధార వెళ్ళిపోయేది. అది కొన్నిసార్లు చాలాదూరమే వెళ్ళిపోయి ఆ సమయంలో తను అనుకుంటున్నవన్నీ పాత్రల మధ్య సుదీర్ఘ సంభాషణలు గానో, ఆ సందర్భానికి రచయిత చేసే విస్తృత వ్యాఖ్యానం గానో, నవల లోకి వచ్చి పడేవి. ఈ అప్రస్తుత సంభాషణలు, వ్యాఖ్యానాలు కూడా ఆయన నవలలకు ఒక ఆకర్షణని తెచ్చిపెట్టాయి. వాటిని చాలా ఇష్టంగా చదువుకొనే అభిమానులూ ఉన్నారు.

హా హా హూ హూలో అటువంటివి తక్కువ. దాన్ని అనువదించటంలో నేను దాదాపు పూర్తిగా మూలవిధేయంగానే ఉన్నాను. కాని విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు విషయంలో కొంత స్వేచ్ఛను అవలంబించాను. ఆ నవలను చెబుతూన్న కాలంలో రచయిత బుద్ధి ఏయే విధాల ప్రసరించిందో తెలుసుకొనే ఆసక్తి ఉన్న విమర్శకులకు పర్వాలేదు గానీ అదంతా తెలుగు రాని పాఠకుడికి శ్రమగా ఉంటుంది. నిజానికి తెలుగు పాఠకుడికి కూడా శ్రమే అవుతుందేమో. అంతే కాకుండా, స్థానికమైన విషయాల ప్రస్తావనను ఉన్నది ఉన్నట్లుగా అనువదిస్తే అనంతమైన సంఖ్యలో పదసూచికలను ఇవ్వవలసి వస్తుంది. ఈ నవలికను నేను కొంతవరకు క్లుప్తీకరించాను. అప్రస్తుత వ్యాఖ్యానాలను అనువదించలేదు. కొన్ని చోట్ల యథాతథంగా కాక భావానువాదాన్ని మాత్రమే చేశాను. ఇలా చేయటం వల్ల నవలకు ఉన్న మౌఖిక స్వరూపం మారిపోవచ్చునని నాకు తెలుసు. అయితే పూర్తిగా రాత నవలే అయిపోకుండా కొంతయినా మౌఖికంగా అనిపిస్తుందని ఆశిస్తున్నాను. చేసిన మార్పులను చిన్నవి గానూ నవల సమగ్రతను దెబ్బతీయనివి గానూ ఉండేలాగా జాగ్రత్త వహించాను. నవలిక లోని ప్రాథమిక శిల్పాన్ని భంగపరచలేదు. కలల క్రమాన్నీ వివరాన్ని శ్రద్ధగా భద్రపరచాను.
----------------------------------------------------
రచన: మైథిలి అబ్బరాజు,
మూలం: వెల్చేరు నారాయణరావు,
ఈమాట సౌజన్యంతో

No comments: