Monday, April 8, 2019

గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 1.


సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 1.




సాహితీమిత్రులారా!
పూర్వం ఆంధ్రభాషలో లోతైన పాండిత్యాన్ని సంపాదింపగోరి కావ్యనాటకసాహిత్యం లోతులను గ్రహించేందుకు వ్యాకరణ శాస్త్రం ఛందశ్శాస్త్రం అలంకార శాస్త్రం అధ్యయనం మొదలుపెట్టిన విద్యార్థులకు మూలఘటిక కేతన గారి ఆంధ్రభాషాభూషణం, అపర నన్నయభట్టు రచించిన ఆంధ్రశబ్దచింతామణి మొదలుగా శబ్దతత్త్వాన్ని నిశ్చయించే లక్షణగ్రంథాలు; మల్లియ రేచన కవిజనాశ్రయం, వెల్లటూరి లింగన సరసాంధ్రవృత్తరత్నాకరం వంటి ఛందస్తత్త్వాన్ని నిరూపించే ప్రకరణగ్రంథాలు; గుడిపాటి కోదండపతి రసమంజరి, వడ్డికవి శృంగార రసాలవాలం లాంటి సాహిత్యతత్త్వాన్ని నిర్దేశించే పాఠ్యగ్రంథాలు అనేకం ఉండేవి కాని, అవన్నీ ఆయా శాస్త్రాలలో ఏవో కొన్ని కొన్ని అంశాలకే పరిమితమైన వివృతికల్పాలు. లింగమగుంట తిమ్మకవి సులక్షణసారంలో ఛందస్సుకు ఆవశ్యకమైన వ్యాకరణాంశం చాలా కొద్ది, ఛందోవివరణమూ సంక్షిప్తమే. అనంతామాత్యుని ఛందోదర్పణంలో వ్యాకరణాంశం అతిస్వల్పం, ఛందోవిషయం కొంత విపులతరమే అయినా అందులో అలంకారాలు చర్చకు రావలసిన అవసరం లేకపోయింది. మూర్తికవి కావ్యాలంకారసంగ్రహంలో ఛందోవ్యాకరణాల ప్రసక్తి లేనే లేదు. ఉన్న సాహిత్యశాస్త్రవిశేషమైనా అటు రుయ్యకుని అలంకారసర్వస్వానికీ, విద్యాధరుని ఏకావళికీ, ఇటు విద్యానాథుని ప్రతాపరుద్రీయానికీ సమన్వయం కుదరక, అనువాదం సరిగా లేక ప్రామాణికతను సంతరించుకోలేకపోయింది. అప్పకవీయం వ్యాకరణప్రసంగమే కాని, ఆనుషంగికంగా వచ్చిచేరిన ఛందస్సుకే అందులో అగ్రియత్వం లభించింది. అనంతుని రసాభరణం, భైరవకవి కవిగజాంకుశం మొదలైనవి కొన్ని ఏదో ఒక లఘువిషయాన్ని గ్రహించి, దానినే ఎంతో కొంతగా విస్తరించిన వివృతిమాత్రాలు. ఉన్నంతలో వ్యాకృతికి చింతామణి, అహోబలపండితీయం; ఛందస్సుకు అప్పకవీయం లాగా అలంకారశాస్త్రంలో కావ్యకర్తలకు, కావ్యపాఠకులకు శబ్దార్థరచనారహస్యాన్ని ఎత్తిచూపే వస్తువిమర్శ కలిగిన కావ్యశిక్షాగ్రంథం ఒక్కటీ లేదు.

విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణి, పొత్తపి వెంకటరమణకవి లక్షణశిరోమణి మొదలైనవాటిలో లక్షణలక్ష్యాలు అసమగ్రంగా ఉండటమే గాక అవి పరోక్షసమన్వయసాపేక్షాలుగా ఉంటాయి. ప్రామాణికమైన ఒక లక్షణగ్రంథాన్ని తెచ్చుకొని రుయ్యకుని అలంకార సర్వస్వానికి జయరథుని విమర్శిని, మమ్మటుని కావ్యప్రకాశానికి మాణిక్యచంద్రుని సంకేతం వంటి మహావ్యాఖ్యానాలను ఎదుట ఉంచుకొని ఎక్కడికక్కడ సరిచూసుకొంటూ చదువుకొంటే కాని ఆ అధ్యయనం ముందుకు సాగదు. అటువంటి వ్యాఖ్యానగ్రంథాలైనా చింతామణికి బాలసరస్వతీయం, అధర్వణ కారికలకు అహోబల పండితీయం, అప్పకవీయంలో కొంత భాగానికి సుకవిమనోరంజనం వంటివి వ్యాకరణానికి వెలువడ్డాయి కాని, అన్ని ఛందోలంకారలక్షణగ్రంథాలకూ తెలుగు భాషలో సుపర్యాప్తంగా వ్యాఖ్యానాలు వెలువడలేదు. ఛందోలంకారాలకు సంస్కృతంలోని ఒక మూలాన్ని, దానిపై వెలసిన వ్యాఖ్యానాలను చదువుకొని, వాటికి సరిపడే తెలుగు ప్రయోగాలను సంపాదించి, ఆ రెండింటిని యథాయోగ్యంగా అన్వయించుకొనే అలవాటుండేది కాని, ఆ మాత్రపు కృషికైనా అలంకారశాస్త్రానికి తెలుగులో ఉన్న లక్షణగ్రంథాలు తక్కువ. వాటిపై పదవాక్యప్రమాణవిదుల విజ్ఞానవ్యాఖ్యలు వెలువడేంత ప్రామాణికత వాటికెన్నడూ కలుగలేదు. పైగా వాటి చర్చాపరిధి చాలా తక్కువ. కావ్యస్వరూపం, వృత్తిలక్షణం, గుణదోషనిరూపణం, శబ్దార్థాలంకారవివేచనం, రసభావవిశదిమ, నాయికానాయకుల గుణావస్థానిర్ణయం, దృశ్య శ్రవ్య కావ్యభేదాలు, రూపక పరిభాషాంగ ప్రశంస, కథాశరీరసంవిధానం, కవిసమయప్రదర్శనం, ప్రేక్షకులూ పాఠకులూ తప్పక తెలుసుకోవలసిన పారిభాషికపదాలు, నాట్యధర్ములు, ప్రకీర్ణకవిమర్శబోధ, ప్రకాశార్థాన్ని బట్టి కవి అంతరంగాన్ని ఆవిష్కరించటం మొదలైన ముఖ్యవిషయాలలో ఏ కొన్నింటికో అవి పరిమితాలు. విద్యార్థులు విద్యాధికులైన తర్వాత కూడా శృంగారప్రకాశ సరస్వతీకంఠాభరణాల వలె వారిని విద్యార్ణవం లోలోతులకు తీసికొనివెళ్ళి, విద్యాశిఖరి సమున్నతశిఖరాలపై విహరింపజేసే జీవితకాలప్రబోధగ్రంథం ఒక్కటీ లేదు.

అటువంటి లోపాన్ని పూరించటానికి బహుసంవత్సరాలు కృషిచేసి, వందలకొద్దీ గ్రంథాలనుంచి ప్రయోగాలను సేకరించి, అన్నింటి లక్షణాలను సూక్ష్మేక్షికతో పరీక్షించి, ఛందోవ్యాకరణాలంకార బృహద్విజ్ఞానకోశాన్ని సర్వలక్షణశిరోమణి అన్నపేరుతో కూర్చి; అందులో ఉపదేశింపబడినదానికే లక్ష్యానుబంధంగా ఒక ప్రబంధరాజాన్ని సంధానించిన ఒకే ఒక్క మహనీయుడు శ్రీ గణపవరపు వేంకటకవి. ఆ మహావిద్వాంసుడు కూర్చిన ఆ మహాప్రబంధం పేరు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం.

ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం భారతీయ సాహిత్యచరిత్రాధ్యేతలు ఎన్నడూ కనీ వినీ యెరుగని ఒక అపూర్వమైన, నిరుపమానమైన మహాకావ్యం. నిజం చెప్పాలంటే, అటువంటి కావ్యం భారతీయభాషలలో మరొకటి లేదు. అంతే కాదు. క్రీస్తుశకం 12వ శతాబ్ది నాటి కవి జినపాల గణి రచించిన సనత్కుమార చక్రి చరిత మహాకావ్యాన్ని ప్రశంసిస్తూ ఆయన శిష్యుడు సుమతి గణి తన గణధరసార్ధశతక బృహద్వృత్తిలో చెప్పిన ఒక శ్లోకం గణపవరపు వేంకటకవి రచనకు అన్వయించినట్లు తెలుగులో మరే కవి రచనకూ అన్వయింపదంటే అతిశయోక్తి కాదు. ఆ శ్లోకం ఇది:

నానాలంకారసారం రచితకృతబుధాశ్చర్యచిత్రప్రకారం
నానాచ్ఛందోఽభిరామం నగరముఖమహావర్ణకావ్యప్రకామమ్
దృబ్ధం కావ్యం సటీకం సకలకవిగుణం తుర్య చక్రేశ్వరస్య
క్షిప్రం యై స్తేఽభిషేకాః ప్రథమజినపదాశ్లిష్టపాలా ముదే నః.

వేంకటకవి కావ్యం కూడా బహువిధాలంకారసారమే. రచితకృతబుధాశ్చర్యచిత్రప్రకారమే. చిత్రకవిత్వంలో సాటిలేని కావ్యం ఇది. గర్భకవిత్వంలో దీనిని సరిపోలిన ప్రయోగసరళి నాటికీ, నేటికీ ఎవరికీ సాధ్యం కాలేదు. బంధకవిత్వంలో త్రిదశతరంగిణీ చతుర్హారావళీ చతుర్వింశతిజినస్తుతి విజ్ఞప్తికా విద్యుల్లతాదుల లాగా ఇది కేవల బంధకావ్యం కాకపోయినా, అంతకు మీరిన బంధచిత్రప్రకారాలు దీనిలో ఉన్నాయి. హరిశ్చంద్రనళోపాఖ్యాన రామకృష్ణార్జునరూపనారాయణీయాదులను పోలిన అనేకార్థరచన కాకపోయినా ద్విసంధాన త్ర్యర్థిఘటనాదులున్నాయి. శేషశైలేశలీలా శ్రీశౌరిశైశవలీలాదుల వలె కేవలం స్థానచిత్రాలతో (య-ర-ఱ-ల-ళ-వ-శ-ష-స-హ అనే పది అక్షరాలతో) కూర్చిన రచన కాకున్నా, ఇందులో ఉన్నన్ని చమత్కారాలు వాటిలో లేవు. చిత్రకవితాప్రణయనంలో ‘యదిహాస్తి త దన్యత్ర, యన్నేహాస్తి న తత్క్వచిత్’ అని సగర్వంగా చెప్పదగిన కావ్యం ఇదొక్కటే. సంస్కృతంలో హరవిజయ చిత్రబంధ రామాయణాదులు, ప్రాకృతంలో అజియసంతిథయ సౌరిచరియాదులు దీనితో కొంత సాటికి, పోటీకి వస్తాయేమో. తెలుగులో మాత్రం వేరొకటి లేదు. సనత్కుమార చక్రి చరిత మహాకావ్యం వలె ఇదీ నానాచ్ఛందోఽభిరామమే. ఇందులో ప్రయోగింపబడినన్ని ఛందస్సులను ఇంత మనోహరంగా ఏ తెలుగు కవీ ప్రయోగించలేదు. సనత్కుమార చక్రి చరితకు తుల్యంగా ఇదీ అష్టాదశవర్ణనాపూర్ణమే. దాని వలె ఇదీ సటీకమే. దీనికీ బంధచిత్రాలున్న ప్రతి ఒకటీ, లఘుటీకతోడి ప్రతి ఒకటీ – ఇప్పుడైతే లేవు కాని, గతశతాబ్దం దాకా ప్రచారంలో ఉండేవి. ఆ విధంగా మహాపండితుడు జినపాల గణి రచనను గురించి గణధరసార్ధశతక బృహద్వృత్తిలో సుమతి గణి చెప్పిన శ్లోకం ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసానికి అన్వయించినట్లు మరే కవి రచనకూ అన్వయింపదని స్పష్టం.

తొలినాటి ప్రస్తావనలు
గణపవరపు వేంకటకవిని గురించి సాహిత్యచరిత్రలో తొలిసారి ప్రస్తావించినవాడు శాసన పరిశోధనలలో, వ్రాతప్రతుల సేకరణలో కల్నల్ కోలిన్ మెకంజీకి సహాయుడుగా ఉండిన కావలి వెంకట రామస్వామిగారు. 1829లో ప్రకటించిన తన Biographical Sketches of the Deccan Poetsలో ఆయన Lukshmana Kavi the Second అన్న శీర్షిక క్రింద వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసాన్ని ప్రశంసించి, ఆయనది కొండవీడు అని, Prubandha Rajum అనే వ్యాకరణగ్రంథాన్ని వ్రాశాడని అంటూ — “This was the chief work composed by this poet, and was reckoned a very useful treatise, and it attained for the author the appellation of Lukshmana Kavi, a Grammatical Poet, which cognomen after ages have adapted” — అని, వేంకటకవికి లక్షణకవిగా ఉన్న ప్రసిద్ధిని పేర్కొన్నాడు. ఆయన నిర్దేశంలో Lukshmana Kavi, a Grammatical Poet అన్నది లక్షణకవి అన్న వ్యవహరణకు ప్రామాదికరూపం కాబోలు. అయితే, ఆయన అన్నట్లు Prubandha Rajum (ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం) వ్యాకరణగ్రంథం కాదు. వేంకటకవికి Grammatical Poet అన్న ప్రశస్తి సర్వలక్షణశిరోమణి రచన వల్ల కలిగింది. రామస్వామిగారు సర్వలక్షణశిరోమణి, ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసాలకున్న పారస్పరికసమన్వయాన్ని గ్రహించినందువల్లనో, వేంకటకవి తండ్రి గణపవరపు అప్పనకు లక్షణకవిగా ఉన్న ప్రసిద్ధిని విని ఉన్నందువల్లనో, వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలో తన లాక్షణికతను గురించి స్వయంగా చెప్పికొని ఉండటంవల్లనో, తన కాలంనాటి పెద్దలు చెప్పుకొనే మాటలను బట్టో వేంకటకవిని Lukshmana Kavi (లక్షణకవి) అని పేర్కొన్నాడని ఊహించాలి. లేకుంటే, Lukshmana Kavi the Second అని శీర్షికలో అన్నాడు కాబట్టి – పైడిపాటి లక్ష్మణమంత్రి ఆంధ్రనామసంగ్రహ నిఘంటువుకు ప్రతిగా వేంకటేశాంధ్రము అన్న శుద్ధాంధ్రనామనిఘంటువును సర్వలక్షణశిరోమణిలోని ఒక ఉల్లాసంగా కూర్చాడు కాబట్టి ఆ రోజులలో గణపవరపు వేంకటకవికి Lukshmana Kavi the Second అన్న ప్రఖ్యాతి ఉండినదేమో అనుకోవాలి.

1885లో బహుజనపల్లి సీతారామాచార్యుల వారు శబ్దరత్నాకరము పీఠికలో వేంకటకవిని గూర్చి ప్రస్తావిస్తూ — “అప్పయ వేంకటపతి – ఇతఁడు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసమను నొక పెద్ద లక్షణగ్రంథమును వ్రాసినవాఁడు.” — అని వ్రాశారు. ప్రబంధరాజంలో వివిధపద్యాలకు శీర్షికలుగా ఉన్న లక్షణవిషయాల అన్వయాన్ని బట్టి ‘లక్షణగ్రంథము’ అన్నారే గాని, ఆచార్యుల వారన్నట్లు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం లక్షణగ్రంథం కాదు.

1892లో ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసాన్ని అముద్రితగ్రంథచింతామణి పక్షాన ప్రకటించిన పూండ్ల రామకృష్ణయ్యగారు వేంకటకవి కవి చరిత్రను, జీవితాదికాన్ని కొంత విపులంగానే వివరించారు. 1933 భారతి పత్రిక మార్చి నెల సంచికలో వంగోలు వెంకటరంగయ్య పంతులుగారు ‘ఆనందరంగ పిళ్ళ – డూప్లే ద్విభాషి’ వ్యాసంలో పుదుచ్చేరిలో ఫ్రెంచి గవర్నరు ఫ్రాన్సిస్ జోసెఫ్ డూప్లే వద్ద దుబాసీగా ఉన్నతోద్యోగంలో ఉండిన ఆనందరంగ పిళ్ళై కాలంలో (1709-1761) వేంకటకవి సేనానాయకుడుగా ఉండినట్లు వ్రాశారు కాని, అందుకు ఆధారాలను చూపలేదు. ఆనందరంగ పిళ్ళై, గణపవరపు వేంకటకవి సమకాలికులే అయినా, వేంకటకవి కృతులలో ఆనందరంగ పిళ్ళై సంస్తవం లేదు. అచ్చయిన 12 సంపుటాల ఆనందరంగ పిళ్ళై డైరీలలోనూ, ఆయన జీవితచరిత్ర వ్యాసాలలోనూ ఎక్కడా గణపవరపు వేంకటకవి ప్రస్తావనలు లేవు. కాబట్టి ఈ విషయాన్ని ఇంకా నిర్ధారింపవలసి ఉన్నది.

వేంకటకవి రచనలని చెప్పదగినవి ప్రధానంగా మూడు: సర్వలక్షణశిరోమణి, విద్యావతీ దండకము, ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము. ఇవి గాక వేరేవీ దొరకలేదు. సర్వలక్షణశిరోమణి 1710-1715 (±) ప్రాంతాల, విద్యావతీ దండకం ఆ తర్వాత, ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం 1730-1755 ప్రాంతాల రచింపబడ్డాయి. ప్రకృతవ్యాసంలో ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము యొక్క సర్వాంగీణవిమర్శ గాక, తెలుగు సాహిత్యచరిత్రకు అపరిచితమైన ఒక్క అపూర్వమైన విశేషం మాత్రమే అధికరింపబడుతున్నది. అందులో సంప్రయుక్తమైన లక్షణజాతాన్ని గురించి, చిత్రకవిత్వాన్ని గురించి ప్రత్యేకంగా పరిశీలింపవలసి ఉంటుంది.

నామకరణౌచిత్యం
ఆంధ్రకవులెవరూ తమ కృతులకు ప్రబంధాదిగా పేరుపెట్టినట్లు కనబడదు. ఆ సంప్రదాయం ప్రబంధ చింతామణి, ప్రబంధ రత్నాకరం, ప్రబంధసార శిరోమణి వంటి సంకలన గ్రంథరచయితల సొంతం. సాహిత్యచరిత్రలో శ్రీ వేంకటేశ్వర స్వామి నామాంకితమైన ప్రథమాంధ్ర మహాప్రబంధం కూడా ఇదే. అంతకు మునుపెవరూ అటువంటి పేరుతో ఒక ప్రబంధాన్ని చెప్పలేదు. కొందరు కవులు శ్రీ వేంకటేశ్వర స్వామివారికే తమ కృతులను సమర్పించినప్పటికీ, ఒక్కరైనా శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణగాథను మహాప్రబంధంగా సంతరింపకపోవటం వింతగానే తోస్తుంది.

శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణగాథను, దివ్యలీలలను ప్రతిపాదించే ఈ ప్రబంధరాజానికి శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము అన్న పేరు గర్భితార్థప్రకాశకమై, శ్రుతిసుందరంగా అమరింది. వేంకటకవికి పూర్వం బొడ్డుచెర్ల తిమ్మన కూడా తన ప్రసన్నరాఘవ నాట్యప్రబంధంలో –

నందేల తిమ్మరాజ పు
రందర చిహ్న ప్రసన్నరాఘవ నాట్యా
మంద ప్రబంధరాజము
నందున …”

అంటూ తన కృతిని ప్రబంధరాజం అని చెప్పుకొన్నాడు కాని, ప్రబంధరాజము అన్న పేరును దాని శీర్షికలో నిలుపలేదు. అహోబలపతి కాళిందీకన్యాపరిణయంలో –

కాటుకకప్పు మోవి జిగి, గాదిలి నవ్వును బొత్తుఁ గూడుచుం
గైటభదైత్యవైరి ముఖకంజమునం దనరారెఁ జూడఁగా
మూటికి సాటియైన రసముఖ్యము లాదిగ శోణశుభ్రముల్
మేటి ‘ప్రబంధరాజము’న మేళనమంది మెలంగు కైవడిన్. (6-126)

అని ఈ శబ్దాన్ని వాడుకొన్నాడు కాని, దానిని తన గ్రంథానికి శీర్షికగా స్వీకరింపలేదు.

శ్రీ వేంకటేశ్వరుని కల్యాణగాథను వర్ణించే కావ్యాన్ని వేంకటేశ్వర విలాసము అనకుండా ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము అనటంలోని ఔచిత్యాన్ని మెచ్చుకోవాలి. శృంగార రసాధినాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆకాశరాజు కుమార్తెను పెండ్లాడి శేషాద్రికి తిరిగివచ్చేటపుడు స్వామిపుష్కరిణి దగ్గర నాగదత్తుడనే ధర్మహీనుడు వారిని అడ్డగించి హతప్రభుడవుతాడు. ఆ విధంగా వీరరసభావం అంగిరసమైన శృంగారానికి ఉద్దీపకమై అలరారింది. శ్రీ వేంకటేశ్వరవిలాస శ్రీ వేంకటేశ్వరవిజయాల అభివర్ణన వల్ల కావ్యరచనలో సాంతం శృంగార వీరాలను పోషించే సదవకాశం ఏర్పడింది. అవకాశమైతే ఏర్పడింది కాని, కవి ఉద్దేశం అది కాకపోవటం వల్ల ఆ రసాదివ్యక్తి సార్థకంగా జరగలేదు. ఆ విషయాన్ని మునుముందు వివరిస్తాను.

వేంకటకవి గ్రంథాన్ని అముద్రిత గ్రంథచింతామణి పక్షాన 1892లో ముమ్మొదట అచ్చువేసిన పూండ్ల రామకృష్ణయ్యగారు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము అనే వ్యవహరించారు కాని, 1932 నాటి మద్రాసు ప్రాచ్య లిఖితపుస్తక భాండాగారం వారి An Alphabetical Index of Telugu Manuscriptsలో గ్రంథం పేరు, ప్రబంధరాజ శిరోభూషణ విజయ వేంకటవిలాసము అని పేర్కొనబడింది. గ్రంథాలయంలోని వ్రాతప్రతుల ముఖబంధాలలోనూ, గ్రంథంలోనూ ఆ విధంగా లేదు. వారిదే, Descriptive Catalogue of Telugu MSS (Vol.II-Prabandhas) లోనూ ‘ప్రబంధరాజ శిరోభూషణ వేంకటేశ్వర విజయవిలాసమని యిదివఱలో దీనికి ప్రసిద్ధమై యున్న సమగ్రనామము’ అని ఉన్నది. పుస్తకంలో ఎక్కడా లేని, మునుపెవ్వరూ ఉదాహరింపని – ఈ ప్రబంధరాజ శిరోభూషణము అన్న ఆ ‘సమగ్ర నామం’ వారికెక్కడ దొరికిందో తెలియటం లేదు. ఆంధ్రకవుల చరిత్రములో వీరేశలింగం గారు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము అని ఒకచోట, ప్రబంధరాజ వేంకటేశ్వరవిలాసము అని మరొకచోట పేర్కొన్నారు. క్రొత్తపల్లి సూర్యారావు గారి వంటి మరికొంతమంది విమర్శకులు కూడా తమ వ్యాసాలలో ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము అని కొన్నిచోట్ల, ప్రబంధరాజ వేంకటేశ్వరవిలాసము అని మరికొన్ని చోట్ల ఈ విధమైన పర్యాయనామాంకనం చేశారు.

ఇంతకీ, కావ్యం అసలు పేరేమిటి? గణపవరపు వేంకటకవి సైతం దీనిని కావ్యంలోని అన్నిచోట్ల ఒకే పేరుతో గాక, వేర్వేరు చోట్ల వేర్వేరు పేర్లతో వ్యవహరించినట్లు కనబడుతుంది. ప్రబంధరాజం అవతారికలోని 29వ సంఖ్యగల వచనంలో – ‘యీ విలాసంబునకు సాటి యెందు లేదు’ అని ఒకచోట, ‘యిల విలాసంబు’ (ప.51) అని మరొకచోట దీనిని ఏకదేశంగా ‘విలాసము’ అని ఊరుకొన్నాడు. అవతారికలోని వక్ష్యమాణలక్ష్యవిశేషోద్దేశవచనములో, ‘నా రచియింపం బూనిన రసికజనహృదయోల్లాసం బైన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసమునకుఁ గథాక్రమం బెట్టి దనిన’ (అవ.63) అని ఒకచోట గ్రంథనామం ‘ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము’ అని పూర్తిగా పేర్కొన్నాడు. కావ్యాంతగద్యను వ్రాయకపోవటం వల్ల దానిని మళ్ళీ ఉదాహరించే వీలు లేకపోయింది. పాదాద్యంతాక్షర కావ్య కర్తృనామ గుప్త పూర్వకవినామగుప్త చిత్రము అని ఉన్న 845వ సంఖ్య గల సీసపద్యం పాదాలలోని మొదటి అక్షరాలను చేర్చి చదివితే ‘వెంకటేశ విలాసము’ అని ఏర్పడేటట్లు ఒకచోట వ్యవహరించాడు. వేంకటనగప్రభు పేర నొనర్చె సత్కవిప్రణుత విలాసరాజము ధరన్ అని ఇంకొకచోట దీనిని ‘విలాసరాజము’ అన్నాడు. ఈ విధంగా స్వయంగా వేంకటకవే తన గ్రంథనామాన్ని పరిపరిభంగుల వ్యవహరించటం కనబడుతుంది. సర్వలక్షణశిరోమణిలోని ఉల్లాసమైన ఆంధ్ర ప్రయోగరత్నాకరములో ఈనాడు ప్రబంధరాజంలో ఉన్న ఒక పద్యాన్ని ఉదాహరింపవలసినప్పుడు, స్వయంగా తానే దానిని ప్రబంధరాజియ్యం అన్నాడు. కస్తూరి రంగకవి ఆనందరంగరాట్ఛందము (3-59) లో ప్రబంధరాజం నుంచి ఒక ఉదాహరణను ఇస్తూ దానిని ప్రబంధరాజము అని పేర్కొన్నాడు.

వీటన్నిటినీ సమన్వయించితే, మొత్తం మీద గణపవరపు వేంకటకవి కావ్యానికి –

సంకలన గ్రంథాల లక్షణాన్ని పురస్కరించుకొని (ప్రబంధరాజ),
కథానాయకుని పేరును బట్టి (వేంకటేశ్వర),
నాగదత్తోపాఖ్యానంలో నాయకనిష్ఠమైన వీరరసభావోల్బణనను బట్టి (విజయ),
అంగిరసమై ఉన్న శృంగారాన్ని బట్టి (విలాసము)
అన్న భావాలను ఇమిడ్చికొన్న ఈ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము అన్న పేరు సర్వవిధాల ఔచిత్యవంతమని చెప్పవచ్చును.

ప్రబంధ కథానకం
చిత్రమేమంటే, ఇందులోని కథ సూచ్యగ్రమాత్రవిపులం. అంటే, సూది మొనకంటె కొంచెం పెద్దదన్నమాట. వర్ణనలు లెక్కలేనన్ని. ఉన్నది ఒక్క ఆశ్వాసమే కాని, మొత్తం 904 పద్యాలు (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారి ప్రతిలో 887 పద్యాలు) ఉన్నాయి. గర్భిత పద్యాలను, చిత్రబంధాలను చేర్చుకొంటే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. వర్ణనలు ఎక్కువ, సన్నివేశాలు తక్కువ. పాత్రలు ఇంతలో అడుగుపెట్టి అంతలో మాయమైపోతుంటాయి. సంభాషణలు రామరాజభూషణుని వసుచరిత్ర, తెనాలి రామకృష్ణకవి పాండురంగ మాహాత్మ్యాలలోని కథావ్యక్తుల సంభాషణలకు ప్రతిరూపాలు. అంతా శిథిలజాలబంధం లాగా అందదుకులతో కనబడుతుంది. ప్రథమ ముద్రణ పీఠికలో పూండ్ల రామకృష్ణయ్య గారు ఇలా వివరించారు:

ఈ గ్రంథము కథాప్రారంభము మొదలుకొని వెంకటాచల పట్టణవర్ణనము, నలిబిలిగోపురాది వర్ణనము, స్వామిపుష్కరిణి వర్ణనము, బయకాని కోన పాండుతీ ర్థాకాశగంగాదుల వర్ణనమును, వేంకటశైలవర్ణనమును, శ్రీ వేంకటేశ్వరస్వామి వర్ణనమును, శ్రీవారి వాహనవర్ణనమును, తిరునాళ్ల మహోత్సవాది వర్ణనమును మొదటి 58 పద్యముల వరకు వ్రాయఁబడియున్నది. అదిమొదలు సాయంతనాదివర్ణనాదులు, జాతివార్తలు, స్వామివారియెదుట జరుగు సంగీతము మేళముల వర్ణనములు లోనగు వృత్తాంతములు 112 పద్యముల వరకు వ్రాయఁబడియున్నవి. తర్వాత ప్రభాతవర్ణనాదులు చెంచునాయకులతో శ్రీవారి వేటసన్నాహ వర్ణనాదులు 240 పద్యముల వఱకు వ్రాయఁబడియున్నవి. అవ్వల శ్రీవారి కేలిడేగ యాకాశరాజచంద్రుని సుతయగు నాంచారుదేవి యుపవనమున వ్రాలుటయుఁ దోడ్తోన శ్రీవారచ్చటికి మంత్రిసహితుఁడై విచ్చేసి య వ్వెలంది యుదంత మరయుటకు మంత్రిఁ బంపఁగా నతనివలనఁ దానామె వృత్తాంతము విని య వ్వెలందినిఁ జూచి వర్ణించుటఁ దర్వాత నాకాశరాజు మంత్రివలన వేంకటేశ్వరస్వామివారి యభిప్రాయ మెఱింగి తన సుతకిచ్చి వివాహం బొనర్చి స్వగృహమునకు నగతనయ యగు దన తనయను బంపినపుడు త్రోవలో స్వామివారికిని నాగదత్తుఁడను జోరునకును యుద్ధము సంప్రాప్తమగుటయుఁ జోరవ్రజంబు స్వామిపుష్కరిణిం బడి సారూప్యం బందుటయు నష్టదిక్పాలకులు శ్రీవేంకటేశ్వరస్వామిని స్తుతించుటయు లోనగు పద్యములచేఁ దక్కిన గ్రంథబంతయు నొప్పుచున్నయది. ఈ గ్రంథమునందుఁ గథ విశేషముగ వ్రాయఁబడియుండలేదు. అయినను తన నేర్పఱితనమును లోకమునకుఁ దెల్పుటకై కవి యిదియొక వ్యాజము గల్పించుకొని యిట్టి లక్ష్యగ్రంథమును వ్రాసియున్నాఁడు.

ఇంత సారిష్ఠమైన ఇతివృత్తకల్పన వల్ల కావ్యం కావ్యమయిందా? అకావ్యమయిందా? అని పాఠకులకు సందేహం కలుగుతుంది. శబ్దార్థాలు ఉపసర్జనీకృతార్థాత్మలై ఉన్నప్పటికీ నానావిధాల శైలిభేదప్రదర్శనలౌల్యం మూలాన ఎక్కడికక్కడ వ్యస్తరచనలుగానే మిగిలాయి. విభావానుభావ వ్యభిచారభావాల సంయోగంతో రసనిష్పాదనకు కవి ప్రయత్నింపకపోవటం వల్ల రసాదికం కావ్యాత్మగా అమరేందుకు అవకాశం లేకపోయింది. నాయికానాయకుల పరస్పరదర్శనం, నాయికావిరహాల తర్వాత వివాహాన్ని వర్ణించాడే కాని, అది రతిపర్యవసితం కాకుండా నాగదత్తోపాఖ్యానం అడ్డువచ్చింది. పోనీ, అదన్నా నాయకుని ధర్మవీరానికి ఆలంబం అవుతుందా? అంటే, హరిభటులు చోరులను ఎదుర్కోవటమూ, చోరులు స్వామిపుష్కరిణిలో పడటం మొదలుగా అభివర్ణితం కావటం వల్ల భావశబలతకు దోహదకారిగా అంగిరసం పోషింపబడలేదని అంగీకరింపవలసివస్తుంది. సాంగమైన రసపోషణం ఉద్దేశింపబడనందున రసాదివ్యక్తిసమర్థాలైన శబ్దార్థాల ఎంపికకోసం కవి ప్రయత్నింపనే లేదనిపిస్తుంది. ‘దానికిది లక్ష్యం, దీనికది ఉదాహరణ’ అని పద్యాలను పేర్చుకొనిపోవటమే గాని, కావ్యశిల్పంలోని క్రమవికాసాన్ని కవి ఉద్దేశింపనే లేదని ఎక్కడికక్కడ వెల్లడవుతూనే ఉంటుంది. తరచు కనబడుతుండే రకరకాల శైలిభేదాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

ఏవంవిధమైన కథాశిల్పాన్ని పరికిస్తున్నప్పుడు వేంకటకవి దృష్టిలో కథాశిల్పానికంటె ముఖ్యంగా నిర్వహింపదగినది ఇంకేదో ఉన్నదని పాఠకులకు అడుగడుగున అనిపిస్తూనే ఉంటుంది. దేనినో చెప్పదలిచి ఈ కథను కేవలం ఒక ఆలంబనగా మాత్రమే తీసికొన్నాడేమో? అని సందేహం కలుగుతుంటుంది. సంఘటనలలో వక్తృ-వాచ్య విషయౌచిత్యం భంగపడుతున్నదని గుర్తింపలేనంత సామాన్యుడు కాడు కదా! కూతురు విరహాన్ని చూసిన ఆకాశరాజు అందరు తండ్రుల లాగా ముందువెనుకలు ఆలోచింపక వెంటనే మంత్రులను పిలిపించి వారితో సంబంధాన్ని గురించి సంప్రతిస్తాడు. ఈ సన్నివేశరచనలోని తొందరపాటు స్పష్టమే. నాయిక నాయకుని ఎదుట ఉండగానే, అతనిని కళ్ళెదుట చూస్తూ ఉండగానే, విరహ పరితాపభరమున (ప.454) వెచ్చనూరుస్తుంది. డేగను వెతుకుతూ వచ్చిన నాంచారును చూసిన నర్మసచివుడు, ఆమె ఎవరు? అని ఎవరినీ అడగకుండానే, అన్ని తెలిసినట్లు నాయకునికి ఆమెను గురించి తెలియజెబుతాడు. రసాదితత్పరమైన ప్రబంధనిర్మాణవైభవాన్ని ఉపేక్షించి కవి పద్యాలను నిలిపాడా? అని అనుమానం కలుగుతుంది. చిరుతనూరిలోని నారాయణవనానికి చెలికత్తెలతో జలకేళికి వచ్చిన నాంచారుకు శ్రీనివాసుని కేలిడేగ అక్కడున్న మామిడికొమ్మపై వాలివుండటం కనబడుతుంది. ఆమె వెంటనే, అత్యంతరయంబునన్, పొదివి, ఆ తరుశాఖల నెక్కి, ఆ పక్షిని, మిక్కిలిన్ సంతసంబంది పట్టుకొని చెట్టు దిగుతుంది. తెలుగు కావ్యాలలో ఎన్నడూ కనుపింపని అపూర్వమైన కావ్యనాయికా పరిచయం ఇది. నాయకునికి పక్షిని అందిస్తూ ఆమె అతనికేసి, నిలువున శృంగార రసము నిగ్గులు గులుకన్ (ప.455) చూస్తుంది. రసాదితాత్పర్యంతో కవి వాచ్య-వాచకయోజనకు ఎందుకు ప్రయత్నింపలేదు? పాత్రచిత్రణలో కానవచ్చే దోషాల పరిహారానికి సావధానమనస్కుడు కాలేదేమి? కావ్యార్థస్ఫురణతోనే కావ్యరచనకు పూనుకొన్నాడా? లేక సర్వలక్షణశిరోమణిలో చెప్పిన లక్షణాలకు ఇక్కడ లక్ష్యాలను ప్రదర్శించటంతో సంతోషపడి ఊరుకొన్నాడా? అని పుట్టలు పుట్టలు సందేహాలు పుట్టుకొస్తాయి. మహాలాక్షణికుడై తనపేరు వాఙ్మయచరిత్రలో చిరస్థాయికం కావాలనుకొన్నవాడు ఇటువంటి అందదుకుల కావ్యం ఎందుకు వ్రాశాడో? అనిపిస్తుంది. మొత్తం మీద ప్రబంధకథానకమంతా యాదృచ్ఛికమని, కవి చెప్పదలచినది ఇంకేదో ఉన్నదని – ఎప్పటికప్పుడు అనిపిస్తూనే ఉంటుంది.

అనువాద కావ్యమా?
ఈ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం అనువాద కావ్యమా? స్వతంత్ర కావ్యమా? అన్న ప్రశ్నకు వేంకటకవే స్వయంగా సమాధానం చెప్పాడు –

అఖిల పురాణ సారాంశ మి ట్లలవియే
యిల విలాసంబుగాఁ దెలుఁగుఁ జేయ (ప.51)

అని. ఈ మాటను బట్టి ప్రబంధరాజం అఖిలపురాణసారాంశమని, అఖిలపురాణసారాంశాన్ని విలాసంగా తెలుగు చేశాడు కాబట్టి, అది ఆంధ్రీకరణమే కాని స్వతంత్రకావ్యం కాదని భావింపవలసి ఉంటుంది. అఖిలపురాణసారాంశము అంటే ఏమిటి? అఖిలము అన్న సంజ్ఞతో ఏయే పురాణాలను కవి ఉద్దేశించాడు? అన్న ప్రశ్నలు ఉదయిస్తాయి. తన కావ్యం అఖిలపురాణసారాంశం అన్న భావాన్ని వేంకటకవి ప్రబంధరాజంలోని, ‘పాదాద్యంతాక్షర కావ్య కర్తృనామగుప్త పూర్వకవిగుప్త సీసపద్యము’లో కూడా సూచించివుండటం గమనార్హం. ఆ పద్యం ఇది:

{వెం} టాడి యసురుల విదళించు దేవ [వేం]
{క} ట రాజితాభిధ గ్రావతిల [క]
{టె} క్కైన వేల్పుల సొక్కించు నెఱజూ [ట]
{శ} యబలాతి శయాస శంభుచా [ప]
{వి} బుధసుధాహృతి విశ్రుత నిజవీ [తి]
{లా} వణ్య కారణ లలిత తిల [క]
{స} కలభక్తవ్రాతసారసోదిత ర [వి]
{ము} నిజనానందకృ న్ముఖ్యచరి [త]

(వ్యా) సనిగమోక్త దశశతాహ్వయధురీ (ణ)
(స) మరభుఙ్మాని కీర్తన సారరా (గ)
(పు) వ్వు దీపించు వి ల్గల ప్రోడతా (త)
(రా) వణాహిత దయ మమ్ముఁ బ్రబలఁ గను (ము). (ప.845)

ఈ పద్యం సీసచరణాల మొదటి ఎనిమిది అక్షరాలను వరుసగా జోడిస్తే, వెం-క-టె-శ-వి-లా-స-ము అని; చరణాల చివరి ఎనిమిది అక్షరాలను జోడిస్తే, వేం-క-ట-ప-తి-క-వి-త అని, ఎత్తుగీతి చరణాల ఆద్యంతాలలోని నాలుగు నాలుగు అక్షరాలను జోడిస్తే వ్యా-స-పు-రా-ణ-గ-త-ము అని దళాలు ఏర్పడుతున్నాయి. వ్యాసపురాణగతము అన్న మాటను బట్టి వేంకటపతి తన కావ్యం వేంకటేశ విలాసం వ్యాసపురాణానికి ఆంధ్రీకరణమని ప్రతిపాదిస్తున్నాడు.

వ్యాసపురాణ గతము అంటే ఏ పురాణం? శ్రీ వేంకటేశ్వర కథాప్రశంస బ్రహ్మాండ పురాణం, స్కాంద పురాణం, గరుడ పురాణం, పద్మ పురాణం, మార్కండేయ పురాణం, వామన పురాణం, వరాహ పురాణం మొదలైన ముఖ్యపురాణాలలోనూ, భవిష్యోత్తరంలోనూ, ఇంకా ఇతరత్రానూ ఉన్నది. వేంకటకవి ఏ ఒక్క పురాణపాఠాన్నో పేర్కొనక, అఖిలపురాణగతము అని, వ్యాసపురాణగతము అని, వ్రాసి ఉండటం వల్ల ఉన్న ఆ అన్ని పురాణకథలనూ చదివి, ఒక్కొక్కదానిలో తనకు నచ్చిన అంశాలను తీసుకొంటూ యథోచితంగా కథను నడిపించాడని అర్థంచేసుకోవాలి.

కాని, జాగ్రత్తగా చూస్తే వేంకటకవి శ్రీ ప్రబంధరాజ రచనకోసం గ్రహించిన కథ ఈ పురాణోదితాలలో దేనితోనూ సంవదించేదిగా కనబడటం లేదు. శ్రీనివాసుని కేలిడేగ చిరుతనూరి నారాయణవనంలో ఉన్న ఆకాశరాజు కూతురు కంటబడటమూ, దానిని వెతుకుతూ వచ్చిన నర్మసచివుడు ఆమె వృత్తాంతాన్ని స్వామికి తెలియజేయటమూ, అలమేలుమంగ స్వామిని చూసి విరహిణి కాగా ఆకాశరాజు వారి వివాహానికి పూనుకోవటమూ అన్న కథాభాగం ఈ పురాణాలలో దేనిలోనూ లేదు. నాగదత్తుడనే అధర్మపరుడు భోగలాలసుడై ధర్మపత్నిని విడిచి, వేశ్యల పొందుకోరి, కొంతకాలానికి వారిచే గెంటివేయబడి, చోరవృత్తిని అవలంబించి, అధర్మవర్తనుడై, వివాహితుడై తిరిగివస్తున్న స్వామిని మార్కొని, హరిబలాన్ని ఎదిరించి, పరాజితుడై స్వామిపుష్కరిణిలో పడి హరిని చేరుకోవటం – అన్న ఉపాఖ్యానం బ్రహ్మాండ, స్కాంద, గరుడ, పద్మ, మార్కండేయ, వామన, వరాహ పురాణాదులలో ఎక్కడా లేదు. కథాప్రారంభంలో నిషాదులు వచ్చి స్వామిని మృగయావినోదార్థం అడవికి తీసికొనివెళ్ళటం అన్నది పురాణకథలలో అగపడదు. వరాహ పురాణం ప్రథమభాగంలోని క్షేత్రఖండంలో (54వ అధ్యాయం) సుదర్శన చక్రం తిరుమలలో ఉండిన దొంగలను కడతేర్చిన వృత్తాంతం ఉన్నది. అది నాగదత్తోపాఖ్యానానికి మూలమని చెప్పటానికి వీలులేదు. వరాహ పురాణంలోనే తొండమానుడనే భక్తుడు ఒక పంచవన్నెల చిలుకను చూసి, అది శ్రీ వేంకటాచలాధీశునిదని ఒక బోయవాని వలన తెలిసికొని, స్వామిపుష్కరిణిలో స్నానంచేసి, వృక్షమూలాన ఉన్న స్వామిని దర్శించిన సన్నివేశం ఉన్నది. ఆ కథ వేంకటకవికీ తెలుసునని ప్రబంధరాజంలోని ‘ఊరీకృత తొండమాన్ చక్రవర్త్యాది భక్తసాత్కృత వైభవుని’ అన్న 561వ వచనంలోని దళం నిరూపిస్తున్నది. అది శ్రీనివాసుని కేలిడేగ ఆకాశరాజసుత కంటబడిన సన్నివేశానికి మూలమనలేము. భవిష్యోత్తరంలో ఆకాశరాజపుత్రి పద్మావతి చెలికత్తెలతో ఉద్యానవనంలో విహరిస్తుండగా ఒక ఏనుగు, దానిని వెంబడిస్తూ ఒక సుందరాంగుడు అక్కడికి రాగా – రాజపుత్రికి అతనిపై ప్రేమ అంకురించిన సన్నివేశం ఉన్నది. ఆ సుందరాంగుడప్పుడు తాను శ్రీనివాసుడనని ఎరిగించి, వకుళాదేవి సాయంతో రాయబారం నడిపి, చివరికి ఆమెను పెండ్లాడిన కథ ఉన్నది.

ఐతే, వేంకటకవి రచనలో ఆకాశరాజపుత్రి పేరు నాంచారు అని ఒకచోట (ప.277), అలమేల్మంగ అని ఒకచోట (ప.598), అలరుమేల్మంగ అని ఒకచోట (ప.497), అలమేల్మంగ నాంచారు అని ఒకచోట (ప.569) – రకరకాలుగా ఉన్నా, పద్మావతి అని ఒక్కచోటా చెప్పబడలేదు. నర్మసచివుడు ఆమె జన్మవృత్తాంతాన్ని స్వామికి ఎరుకపరిచేటప్పుడు తలిదండ్రులు ఆమెకు ‘ఒక శుభదినమున జలజనయన యని యభిధ యిడిరి’ అని మరొక తీరున చెప్పాడు. జలజనయన అన్న ఆ పేరును కథలో మళ్ళీ ఎక్కడా ప్రస్తావించలేదు. అలమేల్మంగ చెలికత్తె పేరు కనకమాలిక అని ఒకసారి (ప.334), కాంచనమాలిక అని ఒకసారి (ప.544), పర్యాయపదాలతో చెప్పాడు. ఆకాశరాజు పుత్రసంతానం కోరి బహుకాలం తపస్సుచేయగా శివుడు ప్రత్యక్షమై, చిరుతనూరిలో గల పద్మసరోవరంలో ఒక పద్మం ఉంటుంది. దాని నడుమ ఒక శిశువు కనబడుతుంది. ఆమెను నీ కుమార్తెగా గ్రహించి, పెంచి పెద్దచేశాక శేషశాయికిచ్చి పెండ్లిచెయ్యి, అని వరమిచ్చిన కథాభాగాన్ని ఉపర్యుక్త బ్రహ్మాండ, స్కాంద, గరుడ, పద్మ, మార్కండేయ, వామన, వరాహ పురాణేతరంగా ఏ పురాణంలో నుంచి గ్రహించాడో తెలియదు. వేంకటాచల మాహాత్మ్యాదులు అన్నిటిలో ఆకాశరాజు గృహిణి పేరు ధారుణీదేవి అని ఉన్నది. వేంకటకవి ఆమె పేరు చంద్రకళ అని చెప్పాడు. అలమేలుమంగ తన తల్లిదండ్రులైన చంద్రకళకు, నాకాశరాజునకు దండంబు వెట్టిన; చంద్రకళ తులగల చంద్రకళతో నాకాశరాజనిభయశోవిశదుఁ డగు నాకాశరాజు (ప.605), అని రెండుచోట్ల వచ్చింది. ఈ పేరు ఎక్కడిదో తెలియదు. భవిష్యోత్తరంలోని శ్రీనివాసకల్యాణంలో రాజు బృహస్పతిని, శుకమహర్షిని రావించి, వారి అనుమతి గైకొని, వివాహముహూర్తం నిర్ణయించి, శ్రీనివాసునికి కల్యాణపత్రికను పంపినట్లు, వకుళాదేవి వచ్చిన తర్వాత స్వామి ఆహ్వానాన్ని పురస్కరించుకొని దేవతలందరూ వచ్చి విడిదితీరినట్లూ ఉన్నది. ప్రబంధరాజంలో ఆకాశరాజు తన కుమార్తె విరహవిషయం తెలియగానే మంత్రులను రావించి, ఈతనికి కూఁతు నొసంగ సంగతంబే? (ప.561) అని చర్చించి (మా అమ్మాయిని మీకిచ్చి పెండ్లిచేయాలనుకొంటున్నాము – అని వివాహప్రస్తావం చేసి, వరుడు, వరుని కుటుంబం వారు ఒప్పుకొన్న తర్వాత నిశ్చితార్థం నిర్వహించి, కల్యాణపత్రికను పంపించటానికి బదులు) వెంటనే ఒక ‘సూచన’ను చేసినట్లుగా ఉన్నది. శ్రీనివాసుడు ఆ సూచనకు అంగీకరించి, పెండ్లివారింటికి వస్తాడు. మంగళస్నానం చేసి, సాలంకృతుడై, కల్యాణమంటపానికి చేరుకొంటాడు. అప్పుడు చెలికత్తెలు అలమేలుమంగ వద్దకు వెళ్ళి, ‘మీ తండ్రి దయార్ద్రహృదయుండై ధృతి నినున్ వెన్నునకు సాకల్యముగాఁ(!?) గల్యాణంబు సేయం దలంచి పిలుచుక రమ్మని ప్రేమమ్మున మముం బంపె,'(ప.569) అని ఆ వార్తను వినిపిస్తారు.

ఈ కథాకథనంలోని ఔచిత్యానౌచిత్యాల మాట అటుంచి, ఈ సన్నివేశాలకు మూలం ఏమిటో తెలియటం లేదని, వేంకటకవి ఏయే పురాణాలను చూసి, అఖిలపురాణగతము అన్నాడో నిర్ణయించటం సాధ్యం కాదని ప్రకృతార్థం. ఒకవేళ అనువాదమే అని నిర్ణయింపవలసి వస్తే రామరాజభూషణుని వసుచరిత్ర మహాభారతానికి, సురభి మాధవరాయల చంద్రికాపరిణయం వాల్మీకి రామాయణానికి ఎటువంటి అనువాదాలో, ఇదీ వ్యాసపురాణాలకు అటువంటి అనువాదమే అని గ్రహించాలి. అపూర్వమైన కావ్యానికి ఆలంబనగా అపురూపమైన కథను ఎన్నుకొన్నాడేమో తెలియదు.

‘వినికిసేయు తెరనాటక’మా?
ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసాన్ని 1977లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమికోసం పరిష్కరించిన వేదము వేంకటరాయశాస్త్రి గారు అవతారికలోని ఒక పాఠాన్ని పురస్కరించికొని, ఇది కావ్యసామాన్యం గాక – శ్రావ్యమైన తెరనాటకం కావచ్చునా? అన్న కొత్త ఆలోచనను చేశారు. ప్రబంధరాజంలో ఆ పాఠప్రస్తావం ఉన్న పద్యం ఇది:

భూరిశృంగారంబు పొడగట్టి నిలిచిన
        పోలిక ఘనరసస్ఫూర్తిఁ జెలఁగ
వలపు బోవని నీటిపైఁ దేలు పూవుఁ జ
        ప్పరము తెఱంగున భావ మలర
వనధివీచిక మీఁద వచ్చు వాలుగ విధం
        బున నొక మిన్న గమ్ముకొని రాఁగ
నాడెమై ననుఁగాంచు ననుఁగాంచు మనుచును
        బ్రాణము ల్గల పదరాజి మెఱయ

మునుపు నిపుడుఁ గవు లొనర్చు ననువుఁదెనుఁగుఁ
గబ్బములలోనఁ దెరనాటకంబు లెస్స
గా వినికిసేయు గతి నలంకారసరణి
వెలయ రచియించు యప్పయ వెంకటార్య. (అవతారిక.33)

ఇందులో ‘తెరనాటకంబు లెస్సగా వినికిసేయు గతి’ అన్నదాన్ని పట్టుకొని శాస్త్రిగారు ఈ విధంగా వ్రాశారు:

ఇది ఏకాశ్వాసప్రబంధము … ఆలోచింపఁదగినదే … నాకిట్లు తోఁచుచున్నది. ఈయన కాలమున యక్షగానములు బహుళప్రచారమునకు వచ్చినవి. వానిలో, అవి ప్రదర్శనయోగ్యములైనను, అంకవిభజన లేదు. పాత్రప్రవేశ నిర్గమనాదుల వలన కథ జరిగిపోవుచుండును. రాత్రియంతయు నాటకమాడువారు. ఈయన కావ్యములలో యక్షగానరచనాప్రక్రియలు చాలా గలవు. వట్టి కావ్యము గాక, చిత్రకావ్యమును గాక, సంగీతకావ్యముగా కూడ దీనిని గ్రహింపవలసియున్నది … ఆశ్వాంతమున గద్య వ్రాయక పద్యమే వ్రాసినాఁడు … నాటకములలో భరతవాక్యము శ్లోకమే గావున ఆ స్వరూపము కలుగుటకు కూడ కవి యిట్లొనరించియుండును … ఇది ‘వినికిసేయు తెరనాటకమా?

వేంకటరాయశాస్త్రిగారి ఈ ప్రతిపాదనను అంగీకరిస్తూ వేంకటకవి ప్రబంధరాజం తెరనాటకమే అని నిర్ధారించి, 1985లో మదురై విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య చల్లా రాధాకృష్ణశర్మగారి పర్యవేక్షణలో ‘గణపవరపు వేంకటకవి కృతులు: సవిమర్శక పరిశీలన’ అన్న శీర్షికతో పరిశోధించి పిఎచ్.డి పట్టాన్ని పొందిన ఆచార్య టి.ఎస్.గిరిప్రకాశ్ ఇందుకు సమర్థకంగా ఇంకా నాలుగు ఉపపత్తులను చూపారు:

ప్రబంధరాజం 181వ పద్యంలో కీల్బొమ్మ తెఱఁగున, రసంబు కదలు మాడ్కి, అన్న ప్రయోగాలున్నాయి.
ఇందులోని 105వ పద్యంలో తెఱలోపలఁ గనుపించియుఁ గనుపింపనట్లున్న యింతి మొగము మనోహరంగా వర్ణింపబడింది.
445వ పద్యంలో వలపుల సూత్రధారి, జంత్రపు బొమ్మ వర్ణింపబడ్డాయి.
యక్షగానసామాన్యములైన అష్టకము, ధవళము, శోభాన, హారతి వంటివి ఇందులో ఉన్నాయి.
అందువల్ల ఇది నిస్సందేహంగా ‘వినికిసేయు తెరనాటక’మే.

అని నిర్ధారించారు. జాగ్రత్తగా ఆలోచించి చూస్తే ఆచార్య గిరిప్రకాశ్ చూపిన ఉపపత్తులలో ఏ ఒక్కటీ తర్కానికి నిలిచేది కాదని తెలుస్తుంది. వీటిలో మొదటిది ‘కీల్బొమ్మ’ వేంకటేశ్వరుని అశ్వధాటిని వర్ణించే సందర్భంలో వచ్చింది. ఒక కావ్యంలోని ఒక పద్యంలో వర్ణనానుగతంగా కీల్బొమ్మ అన్న పదం ఉన్నంత మాత్రాన ఆ కావ్యం తెరనాటకం ఎట్లా అవుతుంది? రెండవది వేంకటేశ్వరుని యెదుట జరిగిన నృత్యప్రదర్శన సందర్భంలోనిది. అది ఒకానొక నటియొక్క ముఖవర్ణన. ఆ ముఖం ‘తెఱలోపలఁ గనుపించియుఁ గనుపింపనట్లు’గా ఉన్నదట. ఆ కల్పన కావ్యం తెరనాటకమన్న నిర్దేశానికి ఏ మాత్రమూ సూచకం కాదు. అటువంటి ఒకానొక కల్పన ఉన్నంత మాత్రాన ఆ కావ్యం తెరనాటకం ఎట్లా కాగలదు?

గిరిప్రకాశ్ చూపిన నాలుగవ ఉపపత్తి పద్యకావ్యంలో సంగీతనాటకాలలో ప్రవేశయోగ్యాలైన అష్టకాదుల ప్రయోగం. జాగ్రత్తగా చూస్తే, ఈ అష్టకం, ధవళం, శోభాన, హారతి, జంపె, త్రిపుటరేకులు, అర్ధచంద్రికలు, సువ్వాల, లాలి, ఏల, దరువు మొదలైన ప్రభేదాలన్నీ ప్రబంధరాజంలో 808వదైన చౌషష్టిభేద చిత్రసీసంలో గర్భితంగా వచ్చినవే గాని, కథాగతంగా చోటుచేసికొన్నవి కావు. అవి ఉన్నంత మాత్రాన ప్రబంధరాజం యక్షగానలక్షణలక్షితం కాదు. తెరనాటకమూ కాదు.

ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము తెరనాటకమన్న నిరూపణకు గిరిప్రకాశ్ చూపిన మూడవ ఉపపత్తి విషయాన్ని కూడా చూద్దాము. ప్రబంధరాజంలోని 445వ పద్యంలో వలపుల సూత్రధారి, జంత్రపు బొమ్మ, అన్న పదాలు ఉన్నమాట నిజమే. వేంకటకవి ‘స్తంభము’ అన్న శీర్షికను నిలిపి చెప్పిన ఆ పద్యం ఇది:

నెలఁతుక వేంకటేశ్వరుని నీటు గనుంగొని నిశ్చలాంగియై
వెలసె విలాసచేష్టలను వేఁ గలయంగ నటింపఁజేయు న
వ్వలపుల సూత్రధారి మురవైరి తనూరుచిఁ జూచి దానఁ జం
చలత వహింపఁగాఁ గదలఁ జాలని జంత్రపుబొమ్మ కైవడిన్.

వలపుల సూత్రధారి అయిన నాయకుని చూచి ఒక కాంత ఆయన మ్రోల గాత్రవల్లి నిశ్చలతను వహింపగా యంత్రపు బొమ్మ లాగా నిలిచిన సందర్భం ఇది. ‘స్తంభము’ అన్న సాత్త్వికభావాన్ని వర్ణింపబూనిన దృశ్యం. ఇటువంటి చిత్రణ ఉన్నంత మాత్రాన కావ్యం ‘వినికిసేయు తెరనాటకం’ ఎట్లా అవుతుంది? అంతే కాదు. సాహిత్యవిద్యార్థులకు పై పద్యాన్ని చూడగానే మూర్తికవి కావ్యాలంకారసంగ్రహంలోని సుప్రసిద్ధమైన ఈ పద్యం గుర్తుకు రావటం సహజమే:

కలికి నృసింహభూవరునిఁ గన్గొని నిశ్చలగాత్రవల్లియై
యలరె విలాసచేష్ట లొలయం గలయంగ నటింపఁజేయు నా
వలపుల సూత్రధారుఁ డనవద్యనృపాకృతిఁ జూచి ని
శ్చలత వహింపఁగాఁ గదలఁజాలని జంత్రపు బొమ్మయో యనన్. (3-39)

అని. రెండింటిలోనూ సందర్భం ఒక్కటే. మూర్తికవి గొబ్బూరి నరసరాజుకు అన్వయించి చెప్పిన విశేషణాలను వేంకటకవి శ్రీ వేంకటేశ్వరునికి అనువర్తింపజేశాడు. అందులోని పొరపాట్లను చర్చించటానికి ఇది తావు కాదు. వేంకటకవి పద్యం మూర్తికవి పద్యానికి పర్యాయపదాలతో కూర్చిన అనుకరణ అన్నది మాత్రమే ప్రసక్తింపబడుతున్నది. కలికి = నెలఁతుక. నృసింహభూవరునిన్ + కన్గొని = వేంకటేశ్వరుని నీటు గనుంగొని. నిశ్చలగాత్రవల్లియై + అలరె = నిశ్చలాంగియై వెలసె. విలాసచేష్టలు + ఒలయన్ + కలయంగన్ నటింపఁజేయు = విలాసచేష్టలను వేఁ గలయంగ నటింపఁజేయు. ఆ వలపుల సూత్రధారుఁడు = అ వ్వలపుల సూత్రధారి. అనవద్యనృపాకృతిన్ + చూచి = మురవైరి తనూరుచిఁ జూచి. నిశ్చలతన్ వహింపఁగాఁ = తానఁ జంచలత వహింపఁగా. కదలఁజాలని జంత్రపు బొమ్మయో + అనన్ = కదలఁ జాలని జంత్రపుబొమ్మ కైవడిన్ – అని ఈ అనుకరణ స్పష్టమే.

ప్రబంధరాజం తెరనాటకం అయితే, ఆ ప్రయోగాలకు మూలమైన కావ్యాలంకారసంగ్రహం కూడా తెరనాటకమే కావాలి.

ఆచార్య గిరిప్రకాశ్ గారి సమర్థన మాటను అటుంచి, ఇంతకీ ఈ ‘తెరనాటక’మన్న ప్రతిపాదనను చేసిన వేంకటరాయశాస్త్రి గారి మాటేమిటి? అంటే, పద్యాన్వయంలో శాస్త్రిగారు పొరబడ్డారని తెలుస్తూనే ఉన్నది. ‘కబ్బములలో తెరనాటకంబు లెస్సగా వినికిసేయు గతి’ అంటే అర్థమేమిటి? అసలు తెరనాటకం అంటే ఏమిటి? తెరను కట్టి ఆడే ఛాయానాటకం అనుకొందాము. దృశ్యకావ్యప్రభేదమైన ఆ తెరనాటకాన్ని వినికిచేస్తే అది శ్రవ్యకావ్యప్రభేదమే అవుతుంది గాని, అది తెరనాటకం ఎందుకవుతుంది? ఆ తెరనాటకాన్ని ‘వినికిచేయటం’ కావ్యరచనాగతంగా ఎట్లా వీలవుతుంది? తెరనాటకంలో అంతర్నాటకం వస్తే దానినెట్లా వినికిచేస్తారు? అన్న ప్రశ్నలను శాస్త్రిగారు ఆలోచించలేదన్నమాట.

అసలు సంగతి ఇది: 1892లో అచ్చయిన పూండ్ల రామకృష్ణయ్యగారి ముద్రణలోనూ, 1977లో వేదము వేంకటరాయశాస్త్రిగారు పునర్ముద్రించిన ప్రతిలోనూ ఈ పాఠం తప్పుగానే అచ్చయింది. పాఠదోషం విమర్శకుల అసంగతమైన అపార్థానికి కారణం అయింది. చెన్నైలో అడయారు థియొసాఫికల్ సొసైటీ వారి వ్రాతప్రతుల సంచయంలో ఉన్న ఈ పద్యపాఠం ఇది:

భూరిశృంగారంబు పొడగట్టి నిలిచిన
        పోలికె ఘనరసస్ఫూర్తి చెలఁగ
వలపు గోలని నీటిపై … లు పూవు చ
        ప్పరము తెరంగున భావ మలర
వనధివీచిక మీద వచ్చు వాలుగ విధం
        బున నొక మింన గంబుకొని రాగ
నాణెమై ననుగాంచు నను … ననుచును
        ప్రాణము ల్గల పదరాజి మెరయ

కబ్బములలోన గరనాటకంబు లెస్స
గా వినికిశెయు గతి నలంకారసరణి
మునుపు నిపుడు కవు లొనర్చు ననుపు తెనుగు
వెలయ రచియించు నప్పయ వెంకటార్యా.

అడయారు ప్రతికి 1978లో నేను వ్రాసికొన్న నకలు ప్రతి పాఠం ఇది. పద్యంలోని సాధుపాఠాల సంగతిని అటుండనిచ్చి, ఎత్తుగీతిలోని ప్రసక్తిని చూద్దాము. ‘కరనాటకంబు’ ప్రకృతసందర్భాన్ని బట్టి కర్ణాటకంబు అని ఉంటుంది. ఆధునికుల ముద్రణపద్ధతి ప్రకారం ఇట్లా ఉంటుంది:

కబ్బములలోనఁ గర్ణాటకంబు లెస్స
గా వినికిసేయు గతి నలంకార సరణి
మునుపు, నిపుడుఁ గవు లొనర్చు ననుపుఁ దెనుఁగు
వెలయ రచియింపు మప్పయ వేంకటార్య!

ఓ అప్పయ వేంకటార్యకవీ! నీవు మునుపటి కవులకు, నేటి కవులకు ఆదరణపాత్రమైన అలంకారప్రస్థానంలో నడచి, కావ్యాలలో సుశ్రావ్యమైన కర్ణాటకం లాగా శ్రవణసుభగమూ, సుమనోహరమూ అయిన అందమైన తెలుగులో రచన కావించు!

పద్యంలో ఉండవలసినది కర్ణాటకంబు అని. అది తెఱనాటకంబు కాదు. ఒక్క అపపాఠం ఎంతమంది, ఎన్నెన్ని అపార్థాలకు దారి తీసిందో చూడండి!
వేంకటకవి వైభవప్రశంస
గణపవరపు వేంకటకవి వైభవాన్ని గురించిన స్వీయప్రశంసలు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలో కొంత అధికంగానే ఉన్నాయి. ఆ విశేషణాలు నూరింటికి పైగానే ఉన్నాయి. వాటన్నిటిని క్రోడీకరిస్తే ఆయన 1. కవి, 2. పండితుడు, 3. ధర్మజ్ఞుడు, 4. సచ్ఛీలుడు, 5. భక్తిపరుడు, 6. మంచి పేరున్నవాడు, 7. చూడ చక్కనివాడు, 8. భోగి, 9. మహాదాత, 10. పరాక్రమశాలి, 11. వ్యవహారదక్షుడు అని తెలుస్తుంది. సర్వలక్షణశిరోమణిలో అయితే, వేంకటకవి బిరుదుగద్య కూడా ఒకటున్నది. 1917లో ఆంధ్ర కవుల చరిత్రమును ప్రకటిస్తున్నప్పుడు గణపవరపు వేంకటకవి చరిత్రమును వ్రాయవలసి వచ్చిన కందుకూరి వీరేశలింగంగారు ఆ విశేషణాలను చూసి మండిపడి, ‘స్వాతిశయమును చెప్పుకొన్న యాంధ్రకవులలో నెల్ల నితఁ డగ్రగణ్యుఁ డయినట్లు కనఁబడుచున్నాఁడు’ అని మొదలుపెట్టి, తీవ్రంగా నిప్పులు చెరిగారు. అప్పటికీ కోపం చల్లారక, తమ స్వీయచరిత్రములో కూడా ఈ విషయాన్ని మళ్ళీ తలచుకొని, ‘మనస్సులోఁ జింతయుఁ గోపమును గలిగి వాని విషయమునఁ గొంత కఠినముగ వ్రాయవలసినవాఁడ నైతిని’ అని నెమరువేసుకొన్నారు. కవుల చరిత్రలో చిత్రకవితను నిరసిస్తూ వేంకటకవిని గురించి మునుపు వ్రాసిన ఆ విమర్శనంతటినీ పునరుద్ఘాటించారు. ఆ వాక్యాలలోని తీవ్రతకు ఆశ్చర్యపడిన చాగంటి శేషయ్యగారు 1958లో అచ్చయిన తమ ఆంధ్రకవితరంగిణి 233వ పుటలో, ‘కవి వ్రాసికొనిన యాత్మస్తుతిభాగములను జదివి యేహ్యముఁ జెందిన హృదయముతో నున్నపుడు పంతులుగారి లేఖినినుండి వెలువడిన వాక్యములనుగా వాని నుపేక్షింపవలసియున్నది’ అని సర్దిచెప్పవలసివచ్చింది.

నిజానికి, 1892లో అముద్రిత గ్రంథచింతామణి పక్షాన నెల్లూరులో ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసాన్ని అచ్చువేసిన పూండ్ల రామకృష్ణయ్యగారే ఈ సందేహాన్ని త్రోసిపుచ్చి, పీఠికలో ఎంతో సుదీర్ఘమైన సమాధానం చెప్పారు. ఈనాడు మనకు కర్ణగోచరంగా ఉన్నప్పటికీ, ఒకనాడు నేత్రగోచరంగా ఉండినప్పుడు ఆ కాలపు పండితపామరుల యెదుట ‘ఇట్టి బద్దులగు సుద్దులు వ్రాసి తాను లోకము ముఖమెట్లు చూచుచుండును?’ అన్నారు. కవి ప్రసిద్ధుడై ఉండి, తెంపరితనం కొద్దీ అతిశయోక్తులను వ్రాస్తే, రాజాస్థానాలకు వస్తూ పోతూ ఉండిన రోజులలో ఒక్కరైనా ఈ విషయాన్ని నిలదీసి ఉండరా? అసత్యం ఎంతకాలం దాగుతుంది? అంటూ, వివరించారు. ‘ఇక్కవి వ్రాసినది నిజముగాని పక్షమున నితనికింత ప్రసిద్ధి కలుగనేరదు … … కాఁబట్టి యితఁడు వ్రాసినదంతయు నిజమని నమ్మవలసియున్నది,’ అని సమర్థించారు.

ఈ వాక్యాలను చదువుతున్నప్పుడు 1892లో అముద్రిత గ్రంథచింతామణి పక్షాన పూండ్ల రామకృష్ణయ్యగారు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసాన్ని అచ్చువేయక మునుపే వీరేశలింగంగారు గణపవరపు వేంకటకవి రచనను ఏదో పత్రికలో విమర్శించి ఉంటారని, 1892లో పూండ్ల రామకృష్ణయ్యగారు దానికే సవిస్తరంగా సమాధానం చెప్పివుంటారని, దానితో సంయమనం కోల్పోయి వీరేశలింగంగారు 1917 నాటి తమ కవుల చరిత్రములో దానిని మరింత తీవ్రంగా అభిశంసించి ఉంటారని అనిపిస్తున్నది. వీరేశలింగంగారి ఆ వ్యాసవిషయమై ఇంకా పరిశోధింపవలసి ఉన్నది.
---------------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: