Thursday, April 18, 2019

వచన పద్యం: ఆభాస లక్షణ నిరాకరణం


వచన పద్యం: ఆభాస లక్షణ నిరాకరణం





సాహితీమిత్రులారా!

ఇటీవల వస్తున్న ఒక రకం కవితా స్వరూపానికి వచన కవిత, వచన పద్యం ఇత్యాదిగా చాలా పేర్లు వాడుకలో ఉన్నై. దీని పేర్లను గురించి సంపత్కుమార (1968), నరసింహారెడ్డి (1968) విశేషమైన చర్చ చేశారు. నరసింహారెడ్డి వచన కవిత్వం అనే పేరును, సంపత్కుమార వచన పద్యం అనే పేరును ఎన్నిక చేశారు. నరసింహారెడ్డి మొత్తం 15 పేర్లను పేర్కొన్నారు. వీటిని రెండు గ్రూపులుగా విభజించవచ్చు. మొదటి తరగతి వచన అనే పూర్వపదంతో ఉన్న సమస్త పదాలు. అవి: 1. వచన కవిత, 2. వచన పద్యం, 3. వచన గేయం, 4. వచన గీతం. ఇతరమైనవి రెండో తరగతి. అవి ముక్తచ్ఛందం (సోమసుందర్), స్వచ్ఛందకవిత్వం (వరవరరావు) మొదలైనవి. మొదటి తరగతిలో ఉన్న నాలుగు పేర్ల మధ్యా చెప్పుకోదగిన భేదం లేదు. పద్యం, గేయం, గీతం అనేవి కవిత్వానికి పర్యాయ పదాలుగానే పై పేర్లలో ప్రయుక్తమయినై.

వచన గేయం, వచన గీతం అని శ్రీరంగం శ్రీనివాసరావు, కుందుర్తి ఆంజనేయులు వాడారు. వచన పద్యం అనే పేరు మొదట పట్టాభిరామిరెడ్డి (పఠాభి), తరువాత సంపత్కుమార వాడారు. వచన కవిత అనే పేరు కుందుర్తి ఆంజనేయులు, టి.వి. రమణారెడ్డి, కోవెల సుప్రసన్నాచారి మొదలైనవారు వాడుతున్నారు. ఈ పేరే ఎక్కువ ప్రచారంలో ఉన్నట్టు సంపత్కుమార (1968), నరసింహారెడ్డి (1968) ఇద్దరూ పేర్కొన్నారు. ప్రీవర్సు ఫ్రంటువారు కూడా ఈ పేరే ఎన్నిక చేశారు (ఆంజనేయులు, గోపాల చక్రవర్తి, 1967). అయినప్పటికి, ఈ వ్యాసంలో – వచనకవిత అనే పేరు అప్పుడప్పుడూ వాడినా – వచన పద్యం అనే పేరే స్వీకరిస్తున్నాను. దానికి కారణాలివి. 1. పద్యం అనే పేరు verse కి సమానార్థకంగా తెలుగులో వాడుతున్నారు. 2. వృత్తాలు, జాతులు, ఉపజాతులు, రగడలు – ఇవన్నీ పద్యాలుగానే ప్రాచీనులు పరిగణించారు. 3. సంపత్కుమార ఒక్కరే ఈ కవితా స్వరూపానికి లక్షణాలు చెప్పటానికి సీరియస్‌గా ప్రయత్నించారు. ఆయన అభిప్రాయాల్నే ప్రధానంగా సవిమర్శకంగా ప్రస్తావించదల్చుకున్నాను గనుక ఆయనకు నచ్చిన పేరే గ్రహించదల్చుకున్నాను.

అసలు లక్షణాలను పరామర్శించ బోయేముందు అపోహలు కలక్కుండా ఉండటానికి ఒక విషయం స్పష్టంగా చెప్పాల్సివుంది. నరసింహశాస్త్రి (1971) ఇటీవల భారతిలో, “వచనకవిత – అభిమానుల అత్యుక్తులు” అనే పేరుతో ఒక వ్యాసం రాశారు. అందులో ఆయన వచన పద్య స్వరూపాన్నే కాక, అందులో వస్తున్న కవిత్వాన్ని కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. వచన పద్య తత్వపరిశీలన అక్కడ సుష్ఠుగా జరగలేదు. ప్రాచీన ఛందః పద్ధతిని సమర్ధించటమూ, ఆధునిక పద్ధతినీ వ్యతిరేకించటమూ, ఆయన అక్కడ పెట్టుకున్న ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నై. నాకు వచన పద్య స్వరూపం మీదగాని, ఆ రూపంలో వస్తున్న వస్తున్న కవిత్వం మీదగాని వ్యతిరేకత లేదు. కవిత్వం ఏ తొడుగు వేసుకున్నా నా కభ్యంతరం లేదు. ఒక్కో తొడుక్కి ఒక్కో ప్రయోజనం ఉండవచ్చు. ఆ ప్రయోజనాల్లో ఒకానొకటి నాకు నచ్చవచ్చు. అది వేరే విషయం. ప్రస్తుత పరిశీలన ఛందస్స్వరూపానికి మాత్రమే పరిమితం.

ఈ వ్యాసంలో నేను ప్రస్తావించని విషయాలు చాలా ఉన్నై. వచన పద్యం చారిత్రక పరిణామాన్ని గురించి విమర్శకుల్లో చాలా అభిప్రాయాలున్నై. కొందరు దీనిని సమాజ పరిమాణంతో ఉన్న సంబంధాన్ని నిరూపించటానికి ప్రయత్నించారు. దాన్ని గురించి ఈ వ్యాసంలో ప్రస్తావించను. వచన గేయం ఒక ఉద్యమమని కుందుర్తి ఆంజనేయులు (నవత-2) ప్రకటించారు. ఈ విషయంలో నేను రమణారెడ్డితో (1967) ఏకీభవిస్తాను. అయినా అందుకు కారణాలు ఈ వ్యాసంలో ప్రస్తావించను. వచన పద్యంలో కథాకావ్యాలు రావాలని కుందుర్తి ఆంజనేయులు, శీలా వీర్రాజు, కోవెల సుప్రసన్నాచార్యులు వంటివారు అభిప్రాయపడ్డారు. కీ. శే. బాలగంగాధర తిలక్ ఇందుకు వ్యతిరేకులు. ఈ విషయంలో నాది అలీన విధానం.

ఈ వ్యాసంలో నేను చేయదల్చుకున్నది వచన పద్యానికి లక్షణాలుగా చెప్పబడుతున్న వాటిని పరామర్శించటమే. ఈ లక్షణాలు కేవలం ఆభాస మాత్రాలేనని, అవి శాస్త్రచర్చకు నిలవ్వని నా అభిప్రాయం. అందుకే వాటిని నిరాకరిస్తున్నాను. అది హేతుబద్ధంగా చేయటమే ఈ వ్యాసంలో నేను చేసిన ప్రయత్నం.

వచన పద్యం తత్వాన్ని గురించి, చరిత్రను గురించి, ఇటీవల (అంటే దాదాపు ఒక దశాబ్దకాలం) భారతి, ఆంధ్రపత్రిక, నవత, సృజన, జనధర్మ వంటి పత్రికల్లో విశేషమైన చర్చ జరిగింది. వాటిల్లో కుందుర్తి ఆంజనేయులు, కె. వి. రమణారెడ్డి. దేవరకొండ బాలగంగాధర తిలక్, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, వే. నరసింహారెడ్డి, అద్దేపల్లి రామమోహనరావు, పెండ్యాల వరవరరావు, వేగుంట మోహనప్రసాద్, ఆవంత్స సోమసుందర్, టి. యల్. కాంతారావు, అరిపిరాల విశ్వం – ఇంకా అనేకులు పాల్గొన్నారు. వీటిలో కొన్నిటిని వచన కవిత అనే పేరుతో ఫ్రీవర్సు ఫ్రంటువారు కుందుర్తి ఆంజనేయులు, గోపాలచక్రవర్తి (1967) సంపాదకత్వాన ఒక సంకలనం వేశారు.

వచనపద్యం చాలామంది దృష్టిని ఆకర్షించింది. కొత్తకవులు అంతా వచన పద్యాల్లోనే రాస్తున్నారు. అంతేకాదు. పాతకాలపు కవులు కూడా ఈ పద్ధతిలో రాయడానికి ప్రయత్నించారు. (చూ. భాగవతుల శంకరశాస్త్రి (ఆరుద్ర) రాసిన సినీవాలికి కాటూరి వేంకటేశ్వరరావుగారి పీఠిక.) ప్రధానంగా కథలూ, నవలలూ రాసే రచయితలు వచన పద్యం ద్వారా కవులైనవారున్నారు. (స్పందన సాహితివారు 1959లో ప్రచురించిన ‘స్పందన’ అనే సంకలనంలో వాసిరెడ్డి సీతాదేవి రచించిన ‘అన్వేషణ’ అనే ఖండిక ఉంది. పోతుకూచి సాంబశివరావు వచన పద్యాలు ‘రాసి సిరా’ అనే పేరుతో 1963లో ప్రచురితమయినై.) ఆలిండియా రేడియో యువవాణి కార్యక్రమాల్లో కుర్రవాళ్ళు ఆవేశంతో వచన పద్యాలే చదువుతున్నారు. ఎన్నికల ప్రచార కరపత్రాల్లోకి కూడా ఈ వచన పద్యం వ్యాపించింది. ఒక ఏడాది కిందట జరిగిన పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేసిన పి. వి. రంగారావు వచన పద్యంలో కరపత్రం వేశారు.

ఇంతగా ప్రచారంలో ఉన్న కవితా ప్రక్రియను గురించిన చర్చ కూడా ఇంత విస్తారంగానే జరిగింది. చాలామంది వచన పద్యం అంటే ఏమిటో చెప్పకుండానే దానిమీద పెద్ద పెద్ద వ్యాసాలు రాశారు. కొంతమంది వచన కవిత్వాన్ని గురించి కవితామయ నిర్వచనాలిచ్చారు. కవిత్వాన్ని గురించి కవిత్వంలో చెప్పితే అది లక్షణం కాదు. స్పష్టంగా శాస్త్ర పరిభాషలో హేతుబద్ధంగా దాని లక్షణం చెప్పాలి. (అట్లాంటి ప్రయత్నం చేసింది నాకు తెలిసినంతవరకు ఒక్క సంపత్కుమార మాత్రమే. ఆయన లక్షణాలని నేను నిరాకరించటం, ఆయన ప్రయత్నాన్ని కించపరచటంగా అర్థం చేసుకోకూడదు.) నేనీ ఆరోపణలను నిరాధారంగా చెయ్యటం లేదు. మచ్చుకి ఈ వాక్యాలు గమనించండి.

వచన గీతానికి ప్రాణప్రదమైన లక్షణం గమనవైవిధ్యం. ఇది సంభాషణలోని యాసలూ, కాకువులూ, ఉచ్ఛారణ విశేషాల మీద ఆధారపడి ఉంటుంది.

– శ్రీరంగం శ్రీనివాసరావు (1939)

వచన గేయం సమాజాన్ని గురించి సూటిగా చెబుతుంది. సమాజం మీద యీటెలుగా విర్చుకు పడుతుంది. సమాజంలో అనేకమందికి అర్థం అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేస్తూ, ప్రజా హృదయాల్లోని విప్లవ దృక్పథాన్ని నిద్రలేపి సంపూర్ణ సామాజిక వికాసానికి దోహదం చేస్తుంది.

– అద్దేపల్లి రామమోహనరావు (1969)

ఇట్లాంటి వాక్యాలు చాలా వ్యాసాలనుంచి చూపించవచ్చు. చాలామంది వచన పద్యం ఎట్లా పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో, ఏం చెయ్యగలదో చర్చించారేగాని దాని లక్షణాలేమిటో ఎవరూ చెప్పరు. వచన పద్య ప్రవక్తలు, సిద్ధాంతకర్తలుగా పత్రికల్లో కనిపిస్తున్న కుందుర్తి ఆంజనేయులు, అరిపిరాల విశ్వం, అద్దేపల్లి రామమోహనరావు, కోవెల సుప్రసన్నాచారి, టి. ఎల్. కాంతారావు మొదలయిన వారంతా వచన పద్యం మీద పెద్ద పెద్ద వ్యాసాలు రాసినవారే కాని వారి వ్యాసాల్లో వచన పద్యాలను గురించిన పొగడ్తలు తప్ప శాస్త్ర సంక్షిప్తత అసలు కనపడదు. అయినా అక్కడక్కడ కొన్ని ఆభాస లక్షణాల ప్రస్తావన కనిపిస్తుంది. వాటిని ఒక్కొటక్కటే పరామర్శించి ఖండిస్తాను.

తూగు, విసురు, ఊపు, విరుపు, లయ, భావలయ, అంతర్లయ, అంతర్నాదం, భావగణాలు వచన పద్య లక్షణాలుగా కొందరు ప్రతిపాదించారు. వీటిలో తూగు, విసురు, ఊపు, విరుపు అనేవాటిని ఒక గణంగానూ; లయ, భావలయ, అంతర్లయ, భావగణాలు అనేవాటిని ఇంకో గణంగాను వేరుచేసి పరిశీలిస్తాను. ముందుగా ఈ ప్రవచనాలు చూడండి.

వచన గేయానికి మొట్టమొదటి లక్షణం నిరాడంబరత. వచన గేయాన్ని కుంటుపడనీయకుండా ఆద్యంతం చదివేటట్లు చేయగల సొగస్సు, విసురు అలపరచటం ఛందోబద్ధమయిన పద్య రచనకంటే కష్టమయిన పని – వచన గేయంలో ఒక్క ఉపమానాల విషయంలోనే కాదు. ఇతర సందర్భాల్లో కూడా ఈ విసురు ఒక ముఖ్య లక్షణంగా ప్రతిపాదిస్తున్నాను.

– ఆంజనేయులు (1958)

వచన గేయానికి ఒక స్థిరత్వం, స్తిమితత్వం ఏర్పడాలంటే పంక్తి నిర్మాణంలో ఒక తూగు కూడా అవసరం.

– ఆంజనేయులు (1967)

వదిలేసిన ఛందస్సు యొక్క ఎఫెక్ట్సు మరో రూపంలో సాధించబడుతున్నవి. ఆధునిక వచన గేయాల్లో విరుపూ, విసురూ, ధోరణీ, పలుకుబడీ ఇందుకే పుట్టినవి.

– ఆంజనేయులు (1965)

మాత్రా ఛందస్సువల్లా, కావ్య భాషా గుణంవల్లా వచ్చిన ఊపూ, విసురూ తెలుగు నుడికారపు సొంపువల్ల తేవాలనే ప్రయత్నం వచన గేయంగా రూపొందింది.

– ఆంజనేయులు (1969)

ఇన్ని చోట్ల ఇన్ని విధాలుగా కుందుర్తి ఆంజనేయులు ప్రతిపాదించిన ఊపు, విసురు, తూగు అనేవాటిని గుర్తు పట్టడానికి తగిన సాధనాలు లేవు. వీటిని పారిభాషిక పదాలుగా ఉద్దేశించినట్టు కూడా నాకు తోచటం లేదు. వ్యస్తపదత్వం విరుపు అయితే ఏ పద్యాల్లో అయినా వుండచ్చు. అది కవి శైలికి సంబంధించిన విషయం. భావోద్వేగం విసురయితే అది ఛందస్సుతో సంబంధం లేకుండా కవిత్వానికి ఉండే లక్షణం. ఈ ఊపు ఏమిటో నాకు తెలీదు. ఇదీ, విసురూ ఒకటేనేమో? సమభారత్వాన్ని తూగు అంటారు. అందుకు శ్రీనాధుడి సీస పద్యాల్ని ఉదాహరణలుగా సాహిత్య విమర్శకులు చూపిస్తుంటారు. సమభారత్వం సమపరిమాణం గల గణాల ప్రయోగం వల్లనే సాధ్యం. అట్లాంటి గణనియమం లేని వచన పద్యాల్లో తూగు ఎలా వుంటుంది? ఒకవేళ ఉన్నా అవి మాత్రా పద్యాలవుతై గాని వచన పద్యాలు గావు. ఒక వస్తువుకి కొన్ని లక్షణాలు ప్రతిపాదించేటప్పుడు ఆ లక్షణాల్ని తెలిపే మాటకు అర్థం చేసుకోగల్గిన వివరణ ఇయ్యటం లక్షణకారుడి కనీస ధర్మం. అట్లాంటి ధర్మాన్ని వచన పద్య సిద్ధాంతకర్తలు పాటించక పోవటం మన దురదృష్టం. ఆ లక్షణాల్ని గురించి వారికే స్పష్టమైన అవగాహన లేదని తీర్మానించుకోవాల్సి ఉంటుంది. కుందుర్తి ఆంజనేయులు తాను ప్రతిపాదించిన విసురుకు ఉదాహరణగా గోపాల చక్రవర్తి రాసిన ఈ పాదాలను ఉదాహరించారు.

ఆకసం నిండా మేఘాలు
వ్రేలాడు ఏన్గులవలె
దేవవేశ్య ఊర్వశి శిరోజాలవలె
ఉన్మత్త మనో వల్మీకంలో
ఊర్ధ్వంగా ప్రసరించే వేడి వేడి తలపులవలె
మహిషాసురుని మీసాలవలె
అనభ్యుదయవాది ఆలోచనవలె

పై పాదాల్లో నాక్కనిపించిన గుణం ఒక ఉపమేయానికి అనేక ఉపమానాలు వాడటం. ఇది మాలోపమ అవుతుంది. ఇదే విసురు అని ఆంజనేయులుగారి ఉద్దేశమా? ఇది వచన పద్యానికి మాత్రమే ఎందుకు పరిమితం? ఛందస్స్వరూపానికి ఉపమాన బాహుళ్యానికీ ఉన్న అవినాభావ సంబంధమేమిటి? ఇంత అస్పష్టమైన, అసమర్థమైన ప్రతిపాదనలు చెయ్యటానికి కారణం కవులైనవాళ్ళు సిద్ధాంతకర్తలు కూడా కావాలన్న ఉబలాటమే.

ఇక రెండో వర్గ లక్షణాలు. మొదటి వర్గాన్ని కుందుర్తి ఆంజనేయులు గానీ, ఇతర అనుయూయులు గానీ పరిభాషగా ఉద్దేశించారని చెప్పలేం. సీరియస్‌గా చర్చించదగిన విలువ నిజానికీ ప్రతిపాదనలకు లేదు. కాని, రెండో వర్గంలో లయ, అంతర్లయ, అంతర్నాదం, భావగణాలు అనే వాటిని పరిభాషగా ఉద్దేశించినట్టు కనిపిస్తున్నది. కొద్ది భేదాలతో ఇవన్నీ సమానార్థకాలుగా కనిపిస్తున్నై. కానీ అంతర్లయ, అంతర్నాదం వేరు వేరని మాదిరాజు రంగారావు (1969) ఉద్దేశించినట్లు కింది వాక్యాలవల్ల తెలుస్తుంది.

అనుభూతి ప్రమాణంలో, ఆవేశపు పొంగులో మనోగతిని బట్టి, శబ్ద సంయోజనమూ, వాక్యరీతి, భావవిన్యాసమూ రూపొందిన రచనలివి. ఇందులో ఏ ఛందస్సూ ఉద్దేశించలేదు. అంతర్లయ కన్నా అంతర్నాదం అనుభవానికి వచ్చే స్వేచ్ఛా కవితగా భావిస్తాను

– రంగారావు (1969) యుగసంకేతం పీఠికలో.

అంతర్నాదమంటే ఏమిటో రంగారావు చెప్పలేదు. అంతర్లయ అంటే ఏమిటో ఇతరులు చెప్పలేరు. ఇక రెంటికీ తేడా తెలుసుకొనే మార్గమేమిటి?

లయ, అంతర్లయ, భావలయ అనే మాటల్ని దాదాపు ఒకే అర్థంలో రచయితలు వాడుతున్నట్టు కనిపిస్తున్నది. సి. నారాయణరెడ్డి ఇట్లా అంటున్నారు:

వచన గేయమునకు లయ ముఖ్యము. ఈ లయ గణములను కూర్చుటలోనే ఉత్పన్నము కాదు. ఒకానొక ఊపులో, విసురులో పదములను గుప్పించుట వలన ఈ లయ ఏర్పడును. ఏ నియమమును లేకుండ శుద్ధవచనమును లయాత్మకముగ మార్చినచో అది వచన గేయమగును.

… పాఠకునిలో భావోద్వేగమును కలిగించు అంతర్లయ దీని ప్రధాన లక్షణము. దీనిలో కేవలము అనుప్రాసాదుల వలన సంక్రమించు శబ్దలయ అనుషంగికమైనది. దీనికి అతీతమైన భావలయ ముఖ్యమైనది. భావలయ అనగా పూసలలో దారమువలె నుండు అంతర్లయ.

– సి. నారాయణరెడ్డి, సిద్ధాంత గ్రంథం (1967)

నారాయణరెడ్డి గారి ప్రకారం వచన పద్యానికి లయ ముఖ్య లక్షణం. ఈ లయ ఒకానొక (?) ఊపులో, విసురులో పదాల్ని గుప్పించటం వల్ల వస్తుంది. ఒకానొక అంటే ఎలాంటి? మళ్ళీ మొదటికే వచ్చాం. ఆ ఊపు, విసురు అర్థం అయితేకాని ఈ లయ అర్థం కాదు. అదే పుస్తకంలో ఇంకోచోట భావలయ ముఖ్యమంటున్నారు. భావలయ అంటే ఏమిటి? “పూసల్లో దారంలాగా ఉండే అంతర్లయ.” అది తెలిస్తే గదా ఇది తెలియటానికి. మార్జాలమంటే బిడాలం!

పై వాక్యాల్లో నారాయణరెడ్డి కొత్తగా చెప్పిందేమీ లేదు. కుందుర్తి ఆంజనేయులు, అరిపిరాల విశ్వం మొదలైనవాళ్ళు చెప్పిందాన్నే వేరే మాటల్లో చేశారు. వాళ్ళ ప్రతిపాదనలెంత అస్పష్టంగా ఉన్నాయో ఇదీ అంతే.

ఈ భావలయను అరిపిరాల విశ్వం ప్రతిపాదించినట్టు కుందుర్తి ఆంజనేయులు ఆమోదపూర్వకంగా రాసిన ఈ వాక్యాలవల్ల తెలుస్తున్నది.

ఆ మార్గం (వచన కవితా మార్గం) పూర్తిగా వృద్ధి పొందటానికి మిత్రులు డా. అరిపిరాల విశ్వంగారు స్థాపించిన భావలయ సిద్ధాంతము, కోవెల సంపత్కుమార ప్రతిపాదించిన భావగణ సిద్ధాంతము బాగా ఉపయోగపడే సాధనాలు.

– ఆంజనేయులు (1967 ఎ.)

విశ్వం, కృష్ణాపత్రిక 1941 జనవరి 7, 14 సంచికల్లో ‘ప్రాచీనాలంకారుల ధ్వనికి, ఆధునిక వచన కవిత్వంలోని భావలయకూ గల సాదృశ వైషమ్యాలు’ అనే పేరుతో పెద్ద వ్యాసం ప్రచురించారు. ఈ వ్యాసంలో ఒక్కో కవి పద్యాలను ఉదాహరించి ఇందులో భావలయ ఉంది చూడమంటారే గాని అదేమిటో చెప్పలేదు. దాదాపు వచన కవిత్వానికి లక్షణాలు ప్రతిపాదించిన వాళ్ళందరూ ఇదే పని చేశారు. (ఒక్క సంపత్కుమార ఇందుకపవాదం.) లయను గురించి కుందుర్తి ఆంజనేయులు ఇలా అంటున్నారు.

శబ్దానికిగాని, భావానికిగాని ఆనాటి వచనాలలోని లయ వచనపు లయ. వచన గేయంలోని లయ కవిత్వపు లయ. ఈ రెంటి మధ్య గల సరిహద్దు కేవలం బుద్ధికి మాత్రమే తోచే స్వభావం కలిగి చాలా సున్నితంగా ఉంటుంది. వచన గేయమైనా విశృంఖల విహారం చెయ్యరాదనీ, దాని నడకలోనూ ఒక (!) లయ పంక్తిలో ఒక నిర్మాణ పద్ధతి ఉండాలని సారాంశం.

– కుందుర్తి ఆంజనేయులు (1967 బి.)

ఒక లయ అంటే ఎట్లాంటి లయో తెలీదు. పైగా అది కవిత్వపు లయ అట! అదెట్లా ఉంటుందో ఎవ్వరూ స్పష్టంగా చెప్పరు. దాన్ని విడదీసి చూడటం కష్టమని ఆంజనేయులు గారి అభిప్రాయంలాగా కనపడుతున్నది.

వచన పద్యంలో శబ్దలయను వీరెవరూ అంత ప్రధానంగా పరిగణిస్తున్నట్టు లేదు. (శబ్దలయ అనేటప్పటికి మళ్ళీ మాత్రా ఛందస్సు అవుతుందేమోనని వీరి భయం కావచ్చు!). శ్రీరంగం శ్రీనివాసరావు రాసిన ‘కవితా ఓ కవితా’ ఖండికను కొందరు వచన పద్యంగా గుర్తించకపోవటానికి ఇదే కారణమనుకుంటాను. శబ్దాని కతీతమైన అంతర్లయ గాని, భావలయ గాని, వచన పద్యానికి ముఖ్యమని వీరి అభిప్రాయం. అది ఇంగ్లీషులో వాడుతున్న Rhythm of thought అనే పదానికి తెలుగులో సమానార్థకంగా కనిపిస్తున్నది.

పద్యంలో అర్థవంతమైన శబ్దాల కూర్పు (Morphological Arrangement), ధ్వనుల కూర్పు (Phonological Arrangement) ఉంటై. ధ్వనుల కూర్పు అక్షరపరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఆ అక్షరాలనే గురు లఘువులని ఛందశ్శాస్త్ర కర్తలు విభజించారు. గురులఘుక్రమం నిర్ణీతమైన అక్షరగణఛందస్సు అవుతుంది. అట్లా కాక గురు లఘు సమూహాల పరిమాణాన్నే తీసుకొని త్రస్య (త్రిశ్ర) చతురస్రాది భేదాలుగా విభజించి ప్రయోగిస్తే మాత్రాగణఛందస్సు అవుతుంది. మాత్రాగణఛందస్సు లయ ప్రధానమైనది. నియతమైన మాత్రాపరిమాణం గల గురు లఘు సమూహాల (మాత్రా గణాల) క్రమావృత్తిని ఛందస్సులో లయగా నిర్వచించవచ్చు. అయితే వీటిల్లో పదప్రయోగం కూడా సహకరిస్తేనే లయ సాధ్యమవుతుంది. ఇక్కడ అర్థవంతమైన శబ్దాల పాత్ర ఉంటుంది. దీన్నే Morphological Arrangement అంటున్నాను. ప్రయోగించిన పదాలు మాత్రా గణాంతంలో విరిచి చదివినా అర్థబోధకు ఆటంకం కలక్కపోతే పదప్రయోగం లయానుకూలమవుతుంది. పూర్వపదాంతాక్షరంతో మాత్రాగణాన్ని ప్రారంభించినట్టయితే లయ భంగమవుతుంది. పదంత విరామము (Word Juncture), గణాంత విరామమూ కలసి వస్తే లయ స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కోసారి పదాంత విరామం బదులు పదాంశాంత విరామం (Morpheme Juncture) గణాంత విరామంతో కలిసినా లయ కనిపిస్తుంది. ఈ రెండూ సాధ్యం కానపుడు ఊనిక (Stress) ఉన్న అక్షరంతో గణం ప్రారంభమయినప్పుడు అక్షరం పదమధ్యమైనా లయానుకూలమే. తెలుగులో ఒక పదంలో రెండో అక్షరం గురువు కాకపోతే మొదటి అక్షరం మీద ఊనిక ఉంటుంది. రెండో అక్షరం గురువైనా, మొదటి అక్షరం కూడా గురువే అయితే మొదటి అక్షరం మీదనే ఊనిక ఉంటుంది. మొదటి లఘువు తరువాత గురువుంటే ఆ గురువు మీద ఊనిక ఉంటుంది. మూడక్షరాల పదాలను ప్రమాణంగా తీసుకుంటే ఊనిక ప్రవర్తనను ఈ విధంగా చూపించవచ్చు.(ముద్ద అచ్చు ఊనికను సూచిస్తుంది.)

U l l
U l U
U U l
l l l
l l U
l U l
l U U

రెండక్షరాలకూ ఇదే పద్ధతి వర్తిస్తుంది. నాలుగక్షరాలక్కూడా ఇది వర్తిస్తుంది గాని అక్కడ పదాంశ విభాగమూ (Morpheme Division), పదాంశ గణమూ (Morpheme Class) ఊనిక ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చు. తెలుగులో ఊనిక ప్రవర్తన మీద పరిశోధన అంతగా జరగలేదు కనుక ఇంతకన్నా ఊనిక మీద ఎక్కువ చెప్పటం ప్రస్తుతం సాధ్యం కాదు. పై వాటిల్లో మొదటి అక్షరం మీద ఊనిక ఉన్నవాటిని అనులోమ గణాలనీ, రెండో అక్షరం మీద ఊనిక ఉన్నవాటిని విలోమగణాలనీ అనవచ్చు.

ఈ ఊనిక సహాయంతో పద మధ్యాక్షరంతో గణం ప్రారంభమైనా అక్షరం ఊనిక ఉన్నదయితే లయ సరిపోతుంది. ఉదాహరణకు:

చక్ర | వర్తి అ | శోకు | డెక్కడ

అన్న పాదంలో చక్ర తో పదం అయిపోలేదు. కాని చక్ర అర్థవంతమైన రూపం. అందువల్ల చక్ర తరువాత పదాంశాంత విరామం (Morpheme Juncture) ఉంది. ఇక్కడికి ఒక మూడు మాత్రల గణం అశోకుడెక్కడ అన్నప్పుడు శో మీద ఊనిక ఉంది. అందుకు కారణం దీని పూర్వాక్షరం పదాది లఘువు. ఊనికతో ఉన్న అక్షరంతో గణం ప్రారంభమయింది. వర్తి – అవిభాజ్యమైన రెండు గణాల మధ్య ఉండటంవల్ల ఇది గణం కాగలిగింది. డెక్కడ అన్నప్పుడు పదవిభాగం చేస్తే అజాది పదం వస్తుంది. ఊనిక ఎప్పుడూ అచ్చుమీదే ఉంటుంది. అందువల్ల అర్థస్ఫురణకు భంగం ఉండదు.

అక్షర నిర్ణయంలో స్వరమే ప్రధానమని సీతాపతి (1921) ఇలా అంటున్నారు.

ఈ సందర్భమున మాత్రా పరిమాణము అచ్చును గూర్చి చెప్పవలెను. వ్యంజనము గూర్చి చెప్పకూడదు. అచ్చులబట్టి అక్షరములేర్పడును గాని వ్యంజనములబట్టి ఏర్పడవు. ‘భ్రన్’ లో ఎన్ని వ్యంజనములున్నా అచ్చు ఒక్కటే గనుక అది ఒక్క అక్షరమనే చెప్పవలెను.

ఇక్కడ కీ. శే. గిడుగు సీతాపతి ఉద్దేశించింది – ప్రధానంగా అక్షర నిర్ణయాన్ని గురించి. అక్షర సంఖ్యా నిర్ణయం అచ్చుల ఆధారంగానే చెయ్యాలనే నిర్ణయం భాషాశాస్త్ర సమ్మతమైంది. మాత్రా పరిమాణంలో వ్యంజనానికి అసలు ప్రమేయం లేదని సీతాపతిగారి అభిప్రాయంగా నేననుకోను. అచ్చు అక్షరానికి శిఖరప్రాయమైనది (Syllable Peak) కాబట్టి అక్షర బేధాన్ని బట్టి గురు లఘు భేదాలేర్పడతై గాబట్టి మాత్రా పరిగణన ప్రధానంగా అచ్చులమీద ఆధారపడి ఉంటుంది అనేది సీతాపతిగారి అభిప్రాయం. అయితే ఇంత స్పష్టంగా చెప్పక పోవటంవల్ల ఇది పాటిబండ్ల మాధవశర్మగారి (1966) విమర్శకు గురి అయింది.

లయస్ఫురణకు, పద, పదాంశ విరామాలు, పదంలో ఊనిక ప్రధానపాత్ర వహిస్తున్నయ్యని పైన నిర్ణయించబడింది. ఇంకా పరిశోధిస్తే కేవలం ఊనికనే లయకు కారణంగా నిరూపించవచ్చు ననుకుంటాను. అయితే ఈ ఊనిక ప్రవర్తన పద, పదాంశ విభాగం మీద ఆధారపడి ఉంటుంది. పద, పదాంశ విభాగ విరామాల పరిజ్ఞానం ఛందశ్శాస్త్రానికి ఎట్లాగూ తప్పవనుకుంటాను.

మాత్రా పద్యాల్లో సాధారణంగా లయ నియతంగా ఉంటుంది. లయభంగమైన ఘట్టాలు లేవని కాదు. ఖండగతి (5+5) పద్యాల్లో ఒక్కోసారి మిశ్రగతి (3+4+3) కనిపిస్తుంది. మాత్రా పద్యాల్లో ఎక్కువగా మాత్రాగణాల ఎన్నికతోనే లయ నిర్ణీతమవుతుంది. అక్షరగణచ్ఛందస్సుల్లో లయ గణాల ఎన్నికను బట్టి నిర్ణీతం కాదు; పదాల ఎన్నికను బట్టి నిర్ణీతమవుతుంది. అక్షరగణచ్ఛందస్సుల్లో గురు లఘు ప్రయోగంలో కవికి స్వేచ్ఛే లేదు. లయను ఎన్నుకోవటంలో మాత్రం స్వేచ్ఛ ఉంది. లయ లేకుండా (అంటే లయస్ఫురణ లేకుండా) శుద్ధవచనంగా రాసిన పద్యాలున్నై. మాత్రా పద్యాల్లో సరిగ్గా నియమాన్ని పాటిస్తే లయ విషయంలో స్వేచ్ఛ లేదు. (కనీసం తక్కువ.) గురు లఘు ప్రయోగంలో మాత్రం చాలా స్వేచ్ఛ (స్వేచ్ఛ అనేకంటే choice అనటం సబబు) ఉంది. సాధారణంగా లయస్ఫూర్తి లేని మాత్రా పద్యముండదు. కానీ లయ లేని వృత్తం ఉండవచ్చు.

దీన్నిబట్టి లయ ప్రధానంగా అక్షరగుణం (Syllabic Quality) అనీ, నియతపరిమాణం (Quantity) గల గణాలుగా ప్రయోగించటం వలన లయ సిద్ధిస్తుందనీ, దీనికి గణాంతాల దగ్గర విరిచి చదివినా అర్థభంగం కాని విధంగా పదాల కూర్పు ఉండాలనీ తేలుతున్నది. ఒక నియతపరిమాణం గల గణాలు క్రమావృత్తమైనప్పుడే లయ ఉంటుంది. ఈ లక్షణం వచన పద్యంలో ఉంటే, అదే మాత్రా పద్యమవుతుంది. మాత్రా పద్యంలో ఒకే రకపు లయ సాధారణంగా పద్యమంతా ఉంటుంది. వచన పద్యంలో అవసరాన్ని బట్టి భిన్నలయలు ఉండవచ్చునంటే, అది గతులు మార్చిన మాత్రా పద్యమవుతుంది గాని వచన పద్యం కాదు. అంటే పైన వివరించిన పద్ధతుల్లో, లయ ఉన్న పద్యం మాత్రా పద్యమో, తద్వికారమో అవుతుంది తప్ప వచన పద్యం కాదన్నమాట. వచన పద్యంలో స్పష్టమైన అక్షర సంబంధమైన లయ ఉండదని సారాంశం. బహుశా ఇది గుర్తించే కాబోలు విశ్వం (1961) భావలయనూ, సంపత్కుమార (1967) భావగణాలనూ ప్రతిపాదించారు. వేరుగా కనిపిస్తున్నా ఈ రెండూ ఒకటే. శబ్ద రూపంలో అక్షరసమూహాల పరిమాణాన్ని బట్టి మాత్రాగణాలుంటై. తద్వారా సాధించిన లయ శబ్దలయ అవుతుంది. దీన్నే అక్షరలయ అని కూడా అనవచ్చు. అది చెవికి వినిపించేది. అర్థంతో నిమిత్తం లేకుండా శ్రోత గుర్తించేది. అట్లా కాకుండా భావగణాల ద్వారా సాధించేది భావలయ. భావగణాలుంటే భావలయ ఉంటుంది. భావగణాలు లేవని నిరూపిస్తే భావలయ సిద్ధాంతం కూడా నిరాసమవుతుంది.

ఛందశ్శాస్త్రంలో గణాలు – అవి మాత్రా గణాలు గానీ, అక్షర గణాలు గానీ పరిమిత సంఖ్యాకాలు. అంటే పరిగణనీయాలు, వాటి మిశ్రమాలు. పద్యపాద పరిమితిని బట్టి అధిక సంఖ్యాకాలు కావచ్చు. కాని గణాలు మాత్రం పరిమిత సంఖ్యాకాలే. అవి నిసర్గ, ఇంద్ర, చంద్ర, సూర్య గణాలు కావచ్చు. రెండు, మూడు, నాలుగు, ఐదు మాత్రల గణాలుగా రావచ్చు. కానీ, ఈ భావగణాల సంఖ్య ఎంత? భావాలు ఎన్ని ఉంటయ్యో భావగణాల సంఖ్య అంతన్నమాట! భావాలు ఎన్ని ఉంటయ్యో ఎవరు అంచనా వెయ్యగలరు? అనంతమైన భావగణాలున్నప్పుడు వాటికి వ్యవస్థ ఏమిటి?

అక్షర గణాల్లో కాని, మాత్రా గణాల్లో కాని, ఒక్కో గణం పరిమితిని ఉచ్ఛారణతో కొలవవచ్చు. ఒక్కో భావగణ పరిమితిని భావంతో కొలవగలమా? భావాలు వ్యక్తమయ్యేది భాషలో వాక్య వాక్యాంశాల ద్వారా కాబట్టి వాటి ద్వారానే కొలవాల్సి ఉంటుంది. సంపత్కుమార (1967) ఇచ్చిన ఉదాహరణలను బట్టి చూస్తే వ్యాకరణ రూపైకత (grammatical similarity in form) ఉన్న వాక్యాంశాలను ఒక గణంగా భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. కీ. శే బాలగంగాధర తిలక్ కవిత లోనుంచి ఈ భాగాన్ని సంపత్కుమార ఉదహరించారు.

ప్రతిమాటకీ | శక్తి ఉంది | పదును ఉంది
ప్రతిమాటకీ | అర్థం ఉంది | ఔచిత్యం ఉంది.

ఇక్కడ కి-విభక్తి బంధం ఒక గణం. తరువాత వచ్చిన నామం, క్రియ కలిపి ఒక గణం. శక్తి, పదును, అర్థం, ఔచిత్యం అనేవి ఒక రకపు (నామ) గణాలు గానూ, ఉంది అనేది ఒక (క్రియా) గణం గానూ ఎందుకు విభజించకూడదు? శక్తి ఉంది అనేది ఒక భావమా?రెండు భావాలా? ప్రతిమాటకీ శక్తి అనేది ఒక గణం ఎందుకు కాగూడదు? భావగణాలను వేరు చేసే నిర్దిష్టమైన సూత్రాలేమిటి? Objective criteria ఏమైనా ఉన్నయ్యా? కేవలం arbitraryగా చేసే విభాగమేనా? ఈ ప్రశ్నల్లో వేటికీ సమాధానాలు దొరకవు. అందుకే సంపత్కుమార (1967) ఇక్కడ అర్థాన్ని బట్టి గణ విభజన ఆభాసరూపకంగా చెయ్యవచ్చునన్నారు. వారి భావగణాలు అభాసాలే గాని, నిర్దిష్టమైనవి కావని వారే అంగీకరిస్తున్నారు. ఈ ఆభాస గణాలు వచన పద్యాన్ని నిరూపించలేవు కాబట్టి వాటిని నిరాకరించవల్సి వస్తున్నది. అసలు విషయమేమిటంటే భావాలని గణాలుగా విభజించటం సాధ్యం కాదనీ, వీరు విభజించింది వ్యాకరణ రూపైకత ఉన్న పద సమూహాలు కాబట్టి, వీటిని న్యాయంగా వ్యాకరణ గణాలు అని అనాల్సి ఉంటుందనీ తేలుతున్నది. వ్యాకరణ గణాలు వాక్య శబ్ద నిర్మాణానికి సంబంధించినవి. వాటి ఆవృత్తి ఒకే శబ్దంతో అయితే పునరుక్తి, భిన్నశబ్దాలయితే అనుప్రాస అవుతుంది. సంపత్కుమార భావగణాలంటున్న వ్యాకరణ గణాలు పద్య బాహ్య స్వరూపానికి అవసరమైన గణాలు కావనీ, వాక్య నిర్మాణానికి అవసరమైన కూర్పు అనీ తేలుతున్నది. పద్య నిర్మాణం వేరు, వాక్య నిర్మాణం వేరు. వేటి సూత్రాలు వాటికే ఉన్నై. భావగణాలే లేనప్పుడు వాటి మీద ఆధారపడి ఉండే భావలయ కూడా ఉండదని చెప్పక తప్పదు.

ఇవికాక సంపత్కుమార 1962లో పది లక్షణాలు, 1965లో ఆరు లక్షణాలు ప్రతిపాదించారు. ఇక వాటిని పరామర్శిస్తాను. 1962లో లక్షణాల్ని సంక్షిప్తం చేస్తే వచ్చినవే 1965లో ప్రతిపాదితమైన లక్షణాలు. అందువల్ల 1965లో లక్షణాల్నే ఇక్కడ ఇస్తాను.

1. భావాన్ని, భావాంశాన్ని బట్టి పాదాలను విభజించటం.
2. క్రియా పదాలతో ప్రారంభించటం, పూర్తి చేయటం.
3. క్రియారహితంగా భావాన్ని వాక్యంగా రూపించటం.
4. అనియతంగా యతిప్రాసల్ని, అంత్యప్రాసల్ని ఉపయోగించటం.
5. ఒక్కొక్క పాదాన్ని తత్పూర్వ పాదంకన్నా పొడిగిస్తూ తగ్గిస్తూ భావోద్దీప్తిని కలిగించడం.
6. భావాన్ని లయబద్ధంగా స్ఫురించేట్టు పాదాలలో పదాలకూర్పు ద్వారా ఇమడ్చటం.

వీటిని ఈ క్రమంలో కాకుండా నాకు వీలైన క్రమంలో పరిశీలిస్తాను. వీటిల్లో 2, 3, 4 లక్షణాలను ఆభాసంగానైనా లక్షణాలుగా అంగీకరించలేం. క్రియాపదాలతో ప్రారంభించటం, పూర్తి చేయటం పద్య లక్షణమెలా అవుతుంది? మాటవరసకు అవుతుందనుకుందాం. క్రియాపదం మధ్యలో ఉండదా? క్రియాపదం అంటే సమాపకమా? అసమాపకమా?

గోవేగదా అని దండం పెట్టబోతే
ఉన్నట్లే ఉండి ఎగిరి మీదపడుతుంది

– సంపత్కుమార నేల విడిచిన సాము (చేతనావర్తం, పే. 2)

వాడెప్పుడు తెర దించుతాడో తెలవదు
ఏ ఘట్టంలో మరి ఈ నాటకం ముగుస్తుందో
అనుక్షణం అయిపోయిందనే అనిపిస్తుంది
అయితే ఇది మొదలంటాడు వాడు.

– సంపత్కుమార ఆత్మాశ్రయం (చేతనావర్తం పే. 13)

క్రియాపదం సమాపకమైనా, అసమాపకమైనా పై ఖండికల్లో పాదం మధ్యలో వచ్చినట్లు స్పష్టమే కదా. అంటే, క్రియా పదం పాదాది మధ్యంతాల్లో ఎక్కడైనా రావచ్చునన్నమాట. ఈ మూడు చోట్లా కాకుండా ఇంకెక్కడొస్తుంది?

క్రియారహితంగా భావాల్ని వాక్యంగా రూపించడం మూడో లక్షణం. దీనికి మాదిరాజు రంగారావు కవిత నుంచి ఉదాహరణలు చూపించారు. వాక్యప్రయోగ విశేషం పద్య లక్షణంగా చెప్పటం విచిత్రం. క్రియ అవసరమైన చోట లేకుండా చెప్పటం వాక్యదోషం అవుతుంది. అయితే కవులకు ఈ లైసెన్సు ఉంది. ఒకానొక కవి శైలీవిశేషాన్ని పద్య లక్షణంగా చెప్పటం కుదరదు. మాదిరాజు రంగారావు వచన పద్యాల్లో గ్రాంథిక భాష ఉపయోగిస్తారు కాబట్టి దాన్ని కూడా వచన పద్యం లక్షణంగా అంగీకరిస్తామా?

యతిప్రాసల్నీ, అంత్యప్రాసల్నీ అనియతంగా ప్రయోగించటం నాలుగో లక్షణం. అనియతత్వం ఒక లక్షణం ఎట్లా అవుతుంది? అనుప్రాస అలంకారం. తెలుగులో అక్షరసామ్యయుక్తమైన యతిప్రాసలు అలంకార సన్నిభాలే. అయితే, ప్రాచీన కవులు వీటిని నియమాలుగా పాటించారు. మాత్రా పద్యాల్లో వీటిని చాలామంది అనియతంగానే పాటించారు. కాని, వాటిని మాత్రా పద్య లక్షణాలుగా ఎవరూ చెప్పినట్టు లేదు.

పై లక్షణాల్లో 1, 5, 6 లక్షణాలు ఆభాసంగానైనా లక్షణాలుగా కనిపిస్తున్నై. ఆరో లక్షణానికి సమానమైంది సంపత్కుమార (1962) లో ఇలా ఉంది:

10. గణవిభజనాదులకు భిన్నముగా రచనాశక్తి నాధారముగా చేసి లయను సమాకర్షించుట.

సంపత్కుమార (1962) నీ, (1965) నీ కలిపి చూస్తే ఆయన ఇక్కడ భావలయనే ఉద్దేశించినట్టు కనిపిస్తుంది. భావలయను ఇంతకు ముందే విపులంగా చర్చించి నిరాకరించాను.

1, 5 లక్షణాలు పాద విభజనకు సంబంధించినవి. పద్యానికీ, గద్యానికీ పాదవిభజన ప్రధాన బేధం అని ప్రాచీనులు చెప్పారు.

పాదకల్పనంబు వలవదు గద్యమునకు
పాదనియతినొప్పుఁ బద్యంబులు

అని అనంతుడు ఛందోదర్పణంలో అన్నాడు. సంపత్కుమార (1962, 1965, 1967, 1968, 1970) పాదబద్ధతను గూర్చి చాలా చోట్ల ఉద్ఘాటించారు. వచన పద్యాన్ని ఛందో విభాగంలో చేర్చటానికి ఆయన ప్రధానంగా దీనిమీదే ఆధారపడినట్లు కనిపిస్తున్నది. ఉదాహరణకు ఈ వాక్యాలు చూడండి.

ఛందో విభాగానికి చెందిన ప్రతిదీ పాదబద్ధమై లేదా పాద విభాగంతో ఉంటుంది. పాదబద్ధత ఛందస్సు యొక్క మొట్టమొదటి లక్షణం. పాదాలు అన్నీ సమాన రూపంలో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అయినా అదీ పద్యమే.

– సంపత్కుమార (1968)

వచనం నుంచి పద్యాన్నీ భేదింపజేసేది దాని పాదబద్ధత. పద్యానికి సంబంధించి ఇతర విషయాలనేకం ఎట్లా ఉన్నా అది పద్యం కావటానికి పాదబద్ధత ప్రధాన లక్షణం. పాదబద్ధంగా ఉండాలన్నదే ప్రధానం తప్ప పాదసమత్వం గానీ, పాద సంఖ్యా నియమం గానీ కావు… అందువల్ల ప్రధానమయిన పాదబద్ధతను స్వీకరించి, మిగిలిన అంశాలను ఐచ్ఛికం చెయ్యటం, ఒక దశలో నిరాకరించటం, వచన పద్యంలో ప్రధానంగా గమనించవలసి ఉంటుంది.

– సంపత్కుమార (1970)

వీటిని బట్టి ఇంతకుముందు చర్చించిన లక్షణాలు ఐచ్ఛికాలనీ, ఒక్కోసారి వాటిని నిరాకరించవచ్చనీ, పాదబద్ధత మాత్రం నిరాకరింపరాని లక్షణమనీ సంపత్కుమార అభిప్రాయంగా మనం గ్రహించవచ్చు. పాదబద్ధత స్థాపితమైతే వచనపద్యం సలక్షణమైన పద్యరూపంగా అంగీకరించవచ్చని తాత్పర్యం. పాదబద్ధత అన్ని పద్యాలకూ లక్షణమవుతుంది గదా: మరి వచన పద్యాన్ని మిగతా పద్యాలనుంచి పృథక్కరించటమెట్లా అనే ప్రశ్నకు అనియత గురు లఘ్వక్షర ప్రయోగాన్ని వేరు చేసే గుణంగా సరిపెట్టుకోవచ్చు. అంటే పాదబద్ధత ఏకైక, అనైచ్ఛిక లక్షణమన్నమాట.

ఈ పాదబద్ధతకి లొంగనివి కూడా ఆధునిక కవిత్వంలో కొన్ని ఉన్నై. కీ. శే. బాలగంగాధర తిలక్ రాసిన ఆర్తగీతం, రాత్రి వేళ అనే ఖండికల్లో ఈ పాదబద్ధతను పాటించినట్లు కనిపించదు.

నిర్జనస్థలం, ఎవ్వరూ లేరు, చుట్టూ పరచుకున్న మైదానపు
నగ్నదేహాన్ని స్పృశించబోయే నీచుల శాఖాగ్రపు వ్యగ్రపు
తొందర నిశ్శబ్దం మెల్లగా అడుగులు వేస్తూ నడుస్తోంది. ఆకాశం
మీద ఒక చుక్క మరో నక్షత్రంతో మాట్లాడే మాట మనసుకి
వినిపిస్తోంది.

– తిలక్ ‘రాత్రి వేళ’

ఇందులో పాదవిభజనకు ఆధారాలేమిటో నాకర్థం కావడం లేదు. ముఖ్యంగా మూడో పాదం ఆకాశంతో అంతం కావటానికి హేతువు ఎవరయినా చెప్తే సంతోషిస్తాను.

పాపికొండలకావల నిజాం గజాంకుశం కాలేదూ నీవు?
కోనసీమలో, లంకసీమలో పాపాల దీపాల నార్పలేదూ
నీవు? విచ్చుకత్తుల బోను రెక్కలు త్రుంచలేదూ
రాత్రిని కప్పుకొని, ధాత్రిని మప్పుకొని చరించలేదూ నీవు?

– కె. వి. రమణారెడ్డి బాధాగాధము.

పైదాంట్లో రమణారెడ్డి అచ్చులో కూడా పాదబద్ధత పాటించలేదు. అయితే దీన్ని “వచన పద్యములను కూడా అతిక్రమించి ఆవేశస్ఫోరకంగా అంతర్లయాన్వితంగా సాగిన ఈ కావ్యం కావ్యోపన్యాసం అనదగింది” అంటున్నారు రమణారెడ్డి. నరసింహారెడ్డి (1968) దీన్ని తానంటున్న వచన కవితగానే పరిగణించారు.

నగ్నముని రాసిన మొహమ్మీది చంద్రుడు అనే ఖండిక (దిగంబర కవులు – 2) లో పాదబద్ధత అసలు పాటించలేదు. స్వరూపాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి మేం రాస్తున్నది వచన కవిత అని మేం అనదల్చుకోలేదు అని దిగంబర కవులు అన్నా వచన పద్య కవులు, సిద్ధాంతకర్తలు వాళ్ళని వదలలేదు. వాళ్ళు ఒప్పుకోకున్నా దిగంబర కవుల స్వరూపం ఫ్రీవర్సుదే నంటున్నారు వరవరరావు (1967).

దిగంబర కవుల్ని వదిలేద్దాం. రమణారెడ్డి బాధాగాధాన్నీ కావ్యోపన్యాసమనే అందాం. వచన పద్య కవులందరూ ఒప్పుకునే తిలక్ మాటేమిటి? వీటిని అపవాదాలుగా పరిగణించి పాద బద్ధతను గురించిన మిగతా అంశాలు పరిశీలిద్దాం. పాదబద్ధత పద్యానికీ, గద్యానికీ ప్రధానమైన భేదమనీ, పాదసంఖ్యా నియమం అంత ప్రధానం కాదనీ, పాదాలు సమపాదాలే కానక్కర్లేదనీ, విషమ పాదాలు కూడా అంగీకార్యాలేననీ సంపత్కుమారతోపాటూ నేను కూడా అంగీకరిస్తాను.

(ఆంధ్ర పత్రిక, ఉగాది సంచిక. 1972.)

వచన పద్యం: లక్షణ చర్చ – ఉపయుక్త గ్రంథ, వ్యాస సూచి.
-------------------------------------------------------
రచన: చేకూరి రామారావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: