Wednesday, September 19, 2018

శుక్లాంబరధరం …


శుక్లాంబరధరం …




సాహితీమిత్రులారా!


"శుక్లాంబరధరం విష్ణుం" అనే ఈ శ్లోకానికి
విశ్వనాథ సత్యనారాయణగారి
వ్యాఖ్య చూడండి-

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నాప శాంతయే

ఇది విఘ్నేశ్వరుని ప్రార్థన శ్లోకము. ఇది లేకుండ మనదేశములో నే కర్మలును ప్రారంభింపబడవు. క్రతువులు, నోములు, వ్రతములు అక్షరాభ్యాసములు, గృహప్రవేశములు సర్వమును విఘ్నేశ్వరపూజతోనే ప్రారంభింపబడును.

దేవుడు లేదన్నవారుకూడ, పరమాధునికులు కూడ కొన్ని యాచారములు పాటించుచునే యున్నారు. పేరునకు బ్రాహ్మణుని పిలిచి సర్వకార్యారంభముల యందు విఘ్నేశ్వర పూజ చేయించుచున్నారు.

విఘ్నేశ్వరు డంత ప్రధాన దేవత. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటె నధికుడన్నమాట.

మన పురాణములు వేఱు. మన వేదశాస్త్రములు వేఱు. మన యపనిషత్తులు వేఱు.

ఒక్కటియే మహానాగరకతకు నివి మూడు దశలు. మానవుల వివేకమునందు తారతమ్య ముండును. ఉండకూడదన్న ఆధునికుల సిద్దాంతములయొక్క ఆచరణములో కూడ నున్నవి. దానిని నీవెంత కాదన్నను అది కనిపించుచునే యున్నది. కొందరికి విప్పి చెప్పినగాని తెలియదు. వెంటనే భేదము కనిపించుచున్నది కదా!

ఈ విఘ్నేశ్వర స్తోత్రము మహావేదాంతార్ధము కలిగిన శ్లోకము. సర్వమునం దభివ్యాప్తమై యున్న మహాచైతన్యము యొక్క ప్రథమావతారమును బోధించునది.

పురాణదశకు వచ్చునప్పటికి దీని యర్థము వేఱు. విఘ్నేశ్వరుడు పార్వతీదేవి కుమారుడు. తెల్లని వస్త్రములు ధరించెడివాడు. విష్ణుమూర్తితో సమానుడు. శశియనగా చంద్రుడు. చంద్రవర్ణము కలవాడు. అనగా తెల్లనివాడు. చతుర్భుజుడు నాలుగు భుజములు కలవాడు.

శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ సరస్వతి, లక్ష్మీ, దుర్గ, విఘ్నేశ్వరుడు మొదలైన దేవతలకు నాల్గు భుజములున్నట్లు వర్ణితమై యున్నది. ఆయన ప్రసన్నవదనుడు. మొగము ప్రసన్నమై యుండునని యర్ధము.

సర్వవిఘ్నములు ఉపశమించుట కొఱకు ధ్యానించవలయును.

ఇది శ్లోకార్ధము.

మన మనేకులైన దేవతలను కల్పించుకొన్నాము.

ఒకప్పు డొక మంత్రి యొకసభలో నన్నాడుకదా “మనకు దేవతల కేమి, వేలమంది యున్నారు” అని. నేనేదో చదువుచుండగా నన్నాక్షేపణ చేసినాడు. నేను సమాధానము చెప్పియందును. చెప్పినచో సభ, నేనాయనను తిరస్కరించితినని భావించును.

లోకము వేఱు. సత్యము వేఱు. లోకమునకు సత్యముతో నవసరములేదు;

వ్యక్తి వేఱు. సాంఘిక మర్యాద పొందుచున్న స్థితి వేఱు.

సంఘములో వ్యవస్థను దూషించును. వ్యవస్థకు వ్యతిరేకముగా నడచును. వ్యక్తిగా ఆచారములను మన్నించును. శాస్త్రముల ననుసరించును. ఈ స్వయంప్రతారణ మొకటి నేటి లోకమునందు బహుధా దృశ్యమానముగా నున్నది.

ఇది జీవితముయొక్క సర్వశాఖలందు కనిపించుచున్నది. రాజకీయములయందు సంఘవ్యవస్థ యందు నెట్లో, సాహిత్యమునందు నట్లే యున్నది. అందుచేత సాహిత్యగ్రంథమైన దీనిని నేను శుక్లాంబరధర మన్న శ్లోకముతో ప్రారంభించుట కింత చెప్పికొనవలసి వచ్చినది.

ఒకటి పురాణ విఘ్నేశ్వరుడు.

రెండు – తత్త్వభూతుడైన విఘ్నేశ్వరుడు.

తత్త్వమైన విఘ్నేశ్వరుని ప్రార్థించుట యుండదు. తత్వమైన భగవంతుని ప్రార్థించుట యుండదు. సాధ్యముకాదు. అది ఆత్మవంచనము.

అది మనసున కేకాగ్రస్థితి వచ్చినప్పడు అనగా సర్వమైన యితర భావములు తొలగించికొన్నప్పడు సాధ్యము కావచ్చును. ఆ భగవంతునకు మూర్తిలేదు. నీ ఎవరిని ధ్యానించుచున్నావు? ఒక భావమును ధ్యానించు చున్నావా? భావమనగా ఊహ. ఆ యూహ నిలుచునా? ఎట్లు నిలుచును? ఒక్క యూహను నిలుపగల శక్తి ఎవనికుండును? ఇది యెంత అసాధ్యమైన విషయము! ఆలోచించరు.

కనుక మనము భగవంతు డన్నప్పుడు వానికి రూపకల్పన చేసినచో సృష్టియనగా నామ రూపములు గనుక- మన భావము రూపము నాశ్రయించి యుండును. ఈ నామము నాశ్రయించి యుండును.

దేనికైనను మనమొక పేరు పెట్టదుము, దేనికి పెట్టదుము? ఒక రూపమున్న దానికి పెట్టదుము. గుణమునకు పెట్టుదుము. కానీ, ఆ గుణమును ధ్యానింతువా? ఆ గుణమును కలిగిన యొక రూపమును కల్పించికొని దానిని ధ్యానించుట మానవ బుద్ధికి సాధ్యము.

అందుచేత విఘ్నములు పరిహరించు నొక దేవునికి రూపకల్పన చేసి దానిని ధ్యానింతుము.

మరి వినాయకుని గురించి పలుకథ లున్నవికదా! అవియేమి యని యడుగగా వాని విషయము వేఱు.

ఇట్లు రూపకల్పన చేసి మన మా దైవతమును ధ్యానించుచు పేరునకు తత్కాలమునకు వానిని శుక్లాంబరధరుడని చతుర్భుజుడని, శశివర్ణుడని చెప్పదుమేకాని వెనుక నున్న యర్థము వేఱు.

ఆ యర్ధము తెలిసి ధ్యానించినచో నధిక ఫలము.

కూలివాడు పనిని చేయను. వాడు దేనికి చేయుచున్నాడు? కూలికొఱకు. ఆ పని యొక్క పరమార్థము యజమాని పొందుచున్నాడు. కాని యిండ్ల కట్టెడి మేస్త్రీ నే నా యిల్లు కట్టితిని. ఈ యిల్లు కట్టితిని అనును. ఏ యిల్లును వీనిదికాదు. కట్టినది వాడే కట్టితినన్నయహంకారము వానిదే? ధన రూపముగా దాని ఫలితము వానికి చాల వచ్చినది.

ఇట్లు లోకమున పరమార్ధము వానిది కాకుండ చేయుట యున్నది. దానికి కొంత లాభమున్నది.

వాడు వట్టి కూలివానివలె గాక తన స్వంతపనివలె చేసినచో యజమాని వానికి నధికఫలము సమకూర్చును. మరియు నా కూలివాడు తా నొక యాత్మ తృప్తిని పొందును. నిజముగా శీలవంతుడు వాడు. సజ్జనుడు. ఉత్తమలోకములకు పోయెడివాడు.

ఈ కూలి విషయములో గృహస్థు వేఱు కూలి వేఱు కాదు. గృహస్థే యిల్లు నిర్మించి కొనును. అప్పుడు రెండు ధర్మములు కలిసి పోయినవి. అధిక ఫలము వచ్చినది. నష్టము లేదు. గృహము సిద్ధమైనది. వ్యయము లేదు.

దేవతా స్వరూపము తెలిసి దేవతారాధన చేయుట యటువంటిది. అట్లే సాహిత్య స్వరూపము తెలిసికొని సాహిత్య పఠనము చేయట అధిక ఫలవంతము.

అంబరము – 1. వస్త్రము 2. ఆకాశము.

శుక్లాంబరము తెల్లని యాకాశము. దానిని ధరించినవాడు. ఆకాశము నల్లగా కన్పించుచున్నది. ఈ కన్పించుట మన దృష్టి దోషమని ఆధునికులకు చాలమందికి తెలియును.

ఆకాశమునకు వర్ణము లేదు. కానీ విఘ్నేశ్వరుడు శుక్లాంబరధరుడు. తెల్లని ఆకాశమును ధరించినవాడు అనియర్థము. ఆకాశమునకు వర్ణములేదు కదా! కనిపించు నల్లదనము నల్లదనము కాదు కదా! లేని తెల్లదన మొకటి వచ్చినది.

సర్వభాషయ సంకేతములు కలది. సంకేతములు లేకుండ మనము మాటాడుకొన లేము, భాషయే సంకేతము. సంకేతమనగా గుర్తు, వానిపేరు రాముడు. ఇది సంకేతము.

ఇవిగాక వేఱే పలు సంకేతము లుండును. మన శాస్త్రములలో సత్త్వరజస్తమో గుణములని మూడున్నవి. సత్త్వగుణము తెలుపు. రజోగుణము ఎఱుపు. తమోగుణము నలుపు.

ఆకాశమనగా “నవకాశము.” ఇది పంచభూతములలో నొకటి. ఇది లేకుండ ఏ రెండు భూతములకు సంయోగము లేదు. ఒక భూతములో నున్న రెండణువుల మధ్యకూడ నాకాశముండును. ఈ యాకాశమునందు భగవచ్ఛక్తి యభివ్యాప్తమై యుండును.

సత్త్వగుణముచేత నభివ్యాప్తమైయున్న ఆకాశమును ధరించిన వాడు అని యర్థము. విష్ణువు – సర్వవ్యాపి. శశివరుడు – శశియనగా చంద్రుడు కదా! శశమును ధరించిన వాడు. శశమనగా కుందేలు. చంద్రునిలో నున్న మచ్చ కుందేలని అల్లిబుల్లి కథ. శశమనగా ‘దాట్లు పెట్టుచు దూకునది’ యని యర్ధము. అందుచేతనే చంద్రుని శశి యన్నారు. అతడు శుక్ల, కృష్ణపక్షములను చేయును. సూర్యునివలె నిత్యజ్యోతిస్సు కాదు. అందుచేత నతడు శశి. ఈ విఘ్నేశ్వరుడు ఆ జాతి కలవాడు. అనగా కాలస్వరూపుడు.

కాలము రెండు విధములు. ఖండకాలము, అఖండకాలము నని. ఖండకాలమనగా దిన, పక్ష మాస, సంవత్సరాత్మక మైనది. అఖండకాల మనగా సూర్యచంద్ర గ్రహచారములు లేనిచోట నుండునది.

ఈ విఘ్నేశ్వరుడు ఖండకాల స్వరూపుడని యర్థము. అనగా లోకమును పాలించెడివాడని యర్ధము. ఈ కాలమునందు బ్రతుకుచు ఈ కాలమున కధీనమైయున్న మనము ఖండకాలమును పాలించెడి యొక తత్త్వమును నిర్మించుకొని దానికి విఘ్నేశ్వర రూపము నిచ్చినాము.

చతుర్భుజం – చతుర్భుజుడు – నాలు భుజములు కలవాడు. భుజమనగా నొక యర్థము. భోజనము చేయునది. రెండవ యర్థము పాలించునది. నాల్గు భుజములతో విఘ్నేశ్వరుడు భుజించును. దేనిని? కాలమును అనగా ఖండకాలమును అఖండకాలముగా మార్చునన్న మాట.

పాలించుట యన్న యర్ధములో నాల్గు విషయములను పాలించు నన్నమాట. ధర్మార్థ కామమోక్షములు నాలుగు. ఈ నాల్డింటిని పాలించుచున్నాడు.

మనము కార్యారంభములయందు పూజింపగా మన ధర్మార్ధ కామములను పాలించుచున్నాడు. అందుకనియే కదా మన మతనిని ధ్యానించుట.

అతడే పరమేశ్వరుడుగా నీవు ధ్యానించినచో (ధ్యానించినచో తప్పలేదు. ద్రావిడ దేశమునం దొక కవయిత్రి విఘ్నేశ్వరుని ధ్యానించి మహాభక్తురాలైనది.) మోక్షమునుగూడ నొసంగగలడు. కాలమును నాలు చేతులతో భుజించుచున్నాడు కదా! నాలు యుగములుగా తనలో లయింపచేసికొనుచున్నాడని యర్ధము.

ఇంతపూజ దేనికి? నర్వవిఘ్నోప శాంతి కొఱకు, విఘ్నము లుపశమించుటకొఱకు, ఉపశమించునేగాని నశించవు. అతనిని ధ్యానించినచో నుపశమించును. విఘ్నమనగా కార్యమును చంపనట్టి లక్షణము. ఇది సృష్టిలో నున్నది. సృష్టిలక్షణ మన్నను తప్పలేదు.
---------------------------------------------------------
రచన: విశ్వనాథ సత్యనారాయణ, 
ఈమాట సౌజన్యంతో

No comments: