Thursday, February 27, 2020

అగస్త్యుడు ఎవరు?


అగస్త్యుడు ఎవరు?




సాహితీమిత్రులారా!

ప్రాచీన తమిళ సాహిత్యంలో అగస్త్యుడు అనే పేరుతో
ఒకరికంటే ఎక్కువ మంది కనిపిస్తున్నారు.
అయితే వారిలో ఇద్దరుమాత్రం ముఖ్యులు.
ఒకటి మొదటి సంగం కాలంలోని అగస్త్యుడు కాగా
రెండవవాడు మధ్యసంగం కాలంలోనివాడు.

                   తమిళ వాఙ్మయ వికాసం పాండ్యరాజుల పోషణలో మూడు సంగాల ద్వారా జరిగినట్లు తెలుస్తున్నది. వాటిలో ేలైస్సంగం మొదటి సంగం క్రీస్తుకు పూర్వమే మధురలో ఇది ప్రారంభమైంది. దీనిలో అగత్తియవార్ (అగస్త్యుడు) తోబాటు 549 మంది కవులున్నారని వారిలో శివుడు, మురుగన్ కూడా సభ్యులేనని చెప్పే గాథలుప్రచారంలో ఉన్నాయి.
అగస్త్యుని రచనగా ప్రసిద్ధిపొందిన లక్షణగ్రంథం, అగత్తియంలో 12 వేల సూత్రాలు ఉండేవని ప్రతీతి. కానీ ఇప్పుడు కొన్ని మాత్రమే లభ్యమౌతున్నాయి. పరమశివుడు సంస్కృత వ్యాకరణాన్ని పాణినికి, తమిళ వ్యాకరణాన్ని అగస్త్యునికి ప్రసాదించాడనే ఐతిహ్యం ఉంది.
కాబట్టి వీరిరువురు సమకాలీనులని నమ్మాల్సి వస్తోంది. ఏది ఏమైనా తమిళ భాషకు వ్యాకరణాన్ని అందించినందుకు అగస్త్యుని తమిళ పితామహునిగా తమిళులు ప్రస్తుతిస్తారు. అంతే కాకుండా తమిళాన్ని అగస్త్యం అని కూడా చెబుతారు. పాణిని అనుసరించి అగస్త్యుడు వ్యాకరణం వ్రాశాడని కొందరి అభిప్రాయం.  దానివల్లనే అతని లక్షణ గ్రంథంలో కర్మణ్యర్థం, సప్తవిభక్తులు, తద్భవరూపంలో సంస్కృత శబ్దాలు మొదలైనవి చోటుచేసుకున్నాయని పండితుల అభిప్రాయం.

         మధ్యసంగం కపాడపురంలో వెలసింది. అందులో 59 మంది కవులుండేవారని వారిలో అగస్త్యుడు, తొల్కాప్పియవార్ మొదలైనవారు ప్రసిద్ధులని తెలుస్తున్నది.అగస్త్యుని 12 మంది శిష్యులలో తొల్కాప్పియవార్ ఒకరు.సంస్కృత లాక్షిణికుడు, కాకతీయ పాలకుడైన ప్రతాపరుద్రుని(1294-1325) ఆస్థానకవి అయిన విద్యానాథుని అసలుపేరు అగస్త్య పండితుడని కొందరి అభిప్రాయం. అయితే దీనికి సరైత ఆధారాలు లేవు. కాబట్టి వీరు ఇద్దరు ఒక్కరే అని భావించనవసరం లేదు.

No comments: