Friday, July 19, 2019

భారతీయ చరిత్ర రచన: శైలీలక్షణం – ఉపసంహారం


భారతీయ చరిత్ర రచన: శైలీలక్షణం – ఉపసంహారం





సాహితీమిత్రులారా!


“సంతృప్తి, సంతోషం ఉన్నవాణ్ణి నేను. అందుచేత మంచి చరిత్రకారుణ్ణి కాను.”

                                                                                                               – యోహాన్ గోయ్‌థ

1. చరిత్ర అల్లికలో పడుగు పేకలు
దక్షిణ భారతదేశంలో, పదహారు పదునెనిమిది శతాబ్దాల మధ్యకాలంలో, చరిత్రకారుల కొరతేమీ లేదు. ఆధారాలు ఎక్కువగా లభించడం లేదు కాని అంతకు ముందు కాలంలో కూడా ఇలాంటి కొరతేదీ ఉండి ఉండకపోవచ్చు. ఆ కాలంలో తెలుగు, తమిళ, మరాఠీ, పార్సీ భాషలలో ఉన్న అశేషమైన చారిత్రక గ్రంథసంపదలో కొద్దిపాటి భాగాన్ని మాత్రమే ఉజ్జాయింపుగా యీ పుస్తకంలో అందించడం జరిగింది. ఈ చారిత్రక రచనలను కొన్ని లక్షణాల ఆధారంగా వర్గీకరించే ప్రయత్నం కూడా చేశాము. కార్యకారణ సంబంధాల చిత్రణ, చరిత్ర రచన కోసమై ఒక వ్యవస్థా నిర్మాణం, కథనశైలిలో కనిపించే రకరకాల కాలక్రమ రీతులు, మొదలైన లక్షణాలను పరిశీలించాము. ఒక నిగూఢమైన అంతర్గత తత్త్వం యీ రచనలను సచేతనం చేస్తుంది. ప్రపంచంలోని యే చారిత్రక రచనకైనా వర్తించే విషయమే యిది. వీటి తత్త్వాన్ని తెలుసుకోవడానికి కొన్ని విశ్లేషాత్మక సూత్రాలు అవసరమవుతాయి. చరిత్రకి సంబంధించిన కాలం, క్రమం, కారణం, మొదలైన అంశాల గురించి పాశ్చాత్యుల నుండి సంక్రమించిన (అరువు తెచ్చుకున్న) అభిప్రాయాలు, దక్షిణభారత చారిత్రక రచనల నిజస్వరూపాన్ని మరుగు పరిచాయనిపిస్తుంది. ఈ పూర్వస్థిత భావనలను పునస్సమీక్షించుకొని మన ఆలోచనాపరిధిని విస్తృత పరచుకోవలసిన అగత్యం ఇప్పుడుంది.

సాహిత్య ప్రక్రియ (genre) విషయానికి వస్తే – ఆధునిక యూరోపులో మాదిరిగా దక్షిణ భారతదేశంలో చరిత్ర రచన ఒక సాహిత్య ప్రక్రియ కాదు. రకరకాల రూపాల్లో చరిత్ర రచన సాగింది. సాధారణంగా యిది రెండు రకాల పొరపాట్లకి (తప్పుడు అవగాహనలకి) దారితీస్తోంది. ఒకటి – ఉద్దేశంలోను, చెప్పే స్వరంలోను, విషయంలోను కూడా స్పష్టమైన చారిత్రకత ఉన్న రచనలను, ఇతర ప్రయోజనాల కోసం చేసిన రచనల కోవలోకి చేర్చి గందరగోళ పడడం. రెండు – (మొదటి గందరగోళానికి అనవసర పరిహారంగా!) పూర్వకాలాన్ని ప్రస్తావించే, ప్రతిఫలించే, ప్రతీ రచననీ ఏదో ఒక రకమైన చారిత్రక రచనగా భావించడం. ఈ రెండవది మొదటి దానికన్నా తక్కువ పొరపాటేమీ కాదు. ఈ రచనలని సరిగా అర్థం చేసుకోడానికి కొన్ని సహజసిద్ధమైన పఠనసూత్రాలున్నాయి. వాటికి సంబంధించిన విజ్ఞత పూర్తిగా నాశనమైపోవడమే యీ గందరగోళానికంతకీ కారణం. చాలాసార్లు, చారిత్రక రచనలు, ఇతర రచనల మధ్య భేదాన్ని స్పష్టంగా నిర్ణయించడానికి ఒక్క వాక్యం సరిపోతుంది.

ఇలాంటి నిర్ణయాలన్నిటికీ కీలకమైన అంశమే మేము పేర్కొన్న ‘శైలీలక్షణం’ (Texture). అంత మాత్రాన భేదాన్ని సూచించే విలక్షణాంశం ఇదొక్కటే అని కాదు. నిర్మాణ వ్యవస్థ వంటి విషయాల గురించి ఇంతకుముందే ప్రస్తావించాము. రచనోద్దేశాన్ని ప్రకటించే స్పష్టమైన వాక్యాలు, పేర్లు, శీర్షికలు – ఇలా తమ రచనామార్గంలో రచయితలు వదిలే కొన్ని సాధారణమైన గుఱుతులు (generic markers) కూడా ఉంటాయి. కాని, ఎలాంటి స్పష్టమైన ప్రక్రియాసూచకాలు లేని సందర్భంలో, బహుశా శైలీలక్షణ స్థాయి అన్నిటికన్నా ప్రభావవంతమై, నిర్ణయాత్మక అంశంగా నిలుస్తుంది. ఎవరైనా తాము మాట్లాడే స్థానికభాషలో ఉన్న చారిత్రక రచనని చదివినా విన్నా, దాన్ని యిట్టే గుర్తు పట్టగలుగుతారు. ఇది రచన అల్లికలో అంతర్భాగమైన అనేక సూక్ష్మ సూచకాల వల్ల సాధ్యమవుతుంది. వాక్యనిర్మాణము, శబ్దసౌందర్యము, నిశ్శబ్దత, ప్రామాణికత మొదలైన సాహిత్య సాధనాలు రచయిత ఉద్దేశాన్ని నిర్దుష్టంగా, నిర్దిష్టంగా నిరూపించ గలుగుతాయి. ఇలాటి సూచకాలు విశ్లేషణకి సులువుగానే లొంగుతాయి కాని, చాలావరకూ, పాఠక-శ్రోతలు తమకి తెలియకుండానే వాటిని గ్రహించేటంత సున్నితంగా, అత్యంత సహజంగా రచనలో అవి ఒదిగిపోతాయి. రచన అంతటికీ మూలమైన ఒక ఉద్దేశపూర్వకతకు యీ సూచకాలు ఆకృతినిస్తాయి. “ఇది చరిత్ర, ఇదే చరిత్ర” అని చాటి చెపుతాయి. వీటి ప్రభావం క్రమప్రవర్ధకము (cumulative) స్వయంపరిపుష్టము (self-reinforcing) అయినందువల్ల అనేక శైలీలక్షణపు భేదాల మధ్య నుండి కూడా రచనోద్దేశం స్పష్టంగా తెలుస్తుంది.

నిర్మాణవాదుల శల్యపరీక్షకు శైలీలక్షణం అంత సులువుగా లొంగదు. ఇంతటి సూక్ష్మమైన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు, రచనాస్వరూపాన్ని గూర్చి, “యిది యిది, యిది కాదు” అని కచ్చితంగా గిరిగీసి చేసే మూకుమ్మడి వర్గీకరణలు చాలా అపరిపక్వంగా కనిపిస్తాయి. శైలీలక్షణం రచన తాలూకు పడుగుపేకల్లోకి మనను తీసుకుపోయి, అందులోని ప్రతి పోగునూ మనం సావధానంగా పరిశీలించాలని ఆకాంక్షిస్తుంది, ఆదేశిస్తుంది. రచన నిర్మాణానికీ, సంవిధానానికి అంతర్గతంగా ఉండే సూచకాల ఆధారంగా, రచన అల్లికలో ఏకమొత్తంగా వ్యక్తమయ్యేదే చారిత్రక గుణం. రచన నేపథ్యమేమిటి, అది ఏ వర్గానికి చెందినది, మొదలైన ప్రశ్నల పరిష్కారంలో బాహ్య ప్రమాణాలు (ఉదాహరణకి, ప్రాచీన భాండాగారాలూ శాసనాల ద్వారా లభ్యమయ్యే సమాచారం వంటివి) అంతగా ఉపయోగపడవు. శైలీలక్షణం వాటికి తక్షణ సమాధానాలు అందిస్తుంది. హికాయత్‌లు, బబద్‌లను అర్థం చేసుకోడంలో ఆగ్నేయాసియా చరిత్రకారులు ఇలాంటి సమస్యలనే ఎదుర్కొన్నారు. దక్షిణ భారతదేశ రచనలకే కాకుండా, మేము ప్రతిపాదిస్తున్న పద్ధతి, వాటికి కూడా అంతే బాగా వర్తిస్తుంది. ఆధునిక పాశ్చాత్య చరిత్రకారులకి కూడా యిది ఉపయోగపడుతుందన్నది మా వాదన. ఒక రచనని సర్వసమగ్రంగా అర్థంచేసుకోవాలన్న ఆకాంక్షతో, అది చెప్తున్నదేమిటో జాగ్రత్తగా, కాస్త వినమ్రంగా చదివే లేదా ‘వినే’ ఒక పద్ధతిని మేమిక్కడ ప్రతిపాదిస్తున్నాము.

చరిత్ర రచన ఒకే సాహిత్య ప్రక్రియకి, ఒకే జాన్రాకి పరిమితమైపోని వ్యవస్థలో, రీతి, రూపం, నిర్మాణం వంటి వాటి గురించి పట్టుబట్టడం వల్ల ప్రయోజనం లేదు. అలాంటి సందర్భంలో శైలీలక్షణం వీటికి సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. అంతేకాదు, పైన చెప్పిన వాటికన్నా శైలీలక్షణం తక్కువ ప్రామాణికమైనదేమీ కాదు. ఈ విషయాన్ని చాలా రకాలుగా నిరూపించే ప్రయత్నం ఈ పుస్తకంలో చేశాము. గతకాలాన్ని గురించి వాస్తవికము, హేతుబద్ధము అయిన కథనాన్ని అందించాలనుకునే రచయితకి శైలీలక్షణం అనేక మార్గాలను ముందుంచుతుంది. ఒకే ప్రక్రియకి పరిమితం చేసెయ్యదు. చరిత్ర ఆకృతి దాల్చేందుకు రెండంశాలు ప్రధానంగా అవసరమవుతాయి. ఒకటి కాల స్వరూపం, రెండు స్థల స్వరూపం. కాల స్వరూపం అంటే కాలక్రమాన్ని గురించిన లౌకిక వైఖరి. స్థల స్వరూపం అంటే ఒక ప్రదేశం కాదు. అది కాలస్వరూపపు వైఖరిలో వచ్చిన మార్పు వల్ల ఏర్పడిన చారిత్రక స్వరూపం. ఈ రెండు స్వరూపాలు క్రమంగా, చదునుగా ఉండాలనే నియమం లేదు. చరిత్ర, కాలము ఒకే వేగంతో, ఒకే క్రమంలో నడిచేవి కావు. కాలస్వరూపంలోని ఎగుడుదిగుడుల నుంచే చరిత్ర పుడుతుంది కాబట్టీ ఈ చారిత్రక కాలక్రమం తిన్నగానే సాగాలని లేదు. చరిత్ర కాలంతో పాటుగా అదే వేగంతో నడవదు. ప్రతీ సంఘటన కాలవేగంతోనే ఉండదు. కొన్ని కుదించబడతాయి, కొన్ని సాగదీయబడతాయి. అందువల్ల క్రమ వర్గీకరణ పద్ధతులలో చరిత్రను మనం తెలుసుకోలేము. ఈ రకమైన చారిత్రక క్రమాన్ని అర్థం చేసుకోడానికి రచనలో ఇమిడిపోయి వున్న సూచనలను గుర్తించగలగాలి. అందుకు సూక్ష్మగ్రాహ్యత అవసరమవుతుంది. పడుగుపేకల చట్రంలో అల్లుకుని ఉండే సూచకాలు, ప్రత్యేకంగా అల్లబడ్డ ఆ చరిత్ర చెప్పే సత్యాలను మన కళ్ళముందుంచుతాయి. అలా వ్యక్తీకరింపబడే సత్య స్వభావాన్ని గురించి స్థిరనిశ్చయానికి వచ్చేందుకు, శైలీలక్షణం ఎంతగానో తోడ్పడుతుంది. చరిత్ర రచనకి స్వాభావికమైన ఈ విషయాన్ని గురించి యిక్కడ మరికాస్త లోతుగా పరిశీలింవలసిన అవసరం ఉంది.

2. కల్హణుని రాజతరంగిణి – స్వరూప నిరూపణలో పొరపాట్లు
మేము పరిశోధించిన మేరకు, దక్షిణ భారత సాహిత్య ప్రక్రియా వ్యవస్థలో, చరిత్ర తానెప్పుడూ నిజం చెపుతున్నాననే అనుకుంటుంది. దక్షిణభారతమే అని యెందుకు, అటు పశ్చిమదేశాలు, యిటు చైనా, మధ్యలో ఇరాన్ — వీటన్నిటి చరిత్ర గురించి కూడా యిదే మాట చెప్పవచ్చు. కాస్త కరకుగా చెప్పాలంటే — చరిత్రకారులు కొన్ని కొన్నిసార్లు అబద్ధాలు ఆడుతునే ఉంటారు. కాని ఆ అబద్ధాలు చెప్పే పద్ధతిలో తేడా వుంటుంది. మేము పదే పదే ప్రస్తావిస్తున్నట్టు, జాగ్రత్తగా అంచనా వేసి నిర్ధారించవలసిన అంశాలకు ఆస్కారమిచ్చే కొన్ని వ్యక్తావ్యక్త నియమాలు చరిత్ర రచనలో ఉంటాయి. చరిత్ర గూర్చి తాను చేసే వ్యాఖ్యానానికి పూర్తిగా బద్ధుడై ఉంటాడు చరిత్రకారుడు. ఇది సాధారణంగా చరిత్రరచనలో వినిపించే అతని స్వరలక్షణంలో (texture of voice) మనకు గోచరిస్తుంది. చరిత్రకారుడు చెప్పే సత్యం, చారిత్రక సత్యాల (కనీసం చారిత్రక వాస్తవాల) పూర్ణ స్వరూపం ఎప్పుడూ కాదు. అయితే, తానెనున్నుకున్న రచనాస్వరూప నియమాల పరిధిలో, ఆ సత్యం యుక్తియుక్తము సమగ్రమూ అయి ఉంటుంది.

అందుకనే చరిత్ర రచనలలో, వాస్తవ-కల్పనల కమనీయమైన కలగలుపు, రకరకాలుగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చరిత్ర శుద్ధసాహిత్యంగా మారిపోవచ్చు. మహాభారతం విషయంలో ఇలా జరిగినట్టు అనిపిస్తుంది. కాలక్రమంలో చారిత్రకస్ఫూర్తి యితర ఉద్దేశాల చేత కప్పబడిపోవచ్చును. వాస్తవికతను పట్టిచ్చే రచనాచిహ్నాలు లుప్తమయిపోవచ్చును. అప్పుడు, రసభరితమో, నీతిబోధకమో, పౌరాణికమో, వ్యంగ్యచిత్రణమో అయిన కథలుగానే చరిత్ర విస్తరించుకుపోతుంది. ఈ వ్యవహారమంతా, “గతంలో జరిగిన సంఘటనలే చాలా వరకూ కాలగమనంలో తమ విశ్వసనీయతని అతిక్రమించి పుక్కిటి పురాణాలుగా మారిపోయాయి”, అన్న థుసిడైడిస్ (Thucydides)అభిప్రాయానికి దగ్గరగానే ఉన్నప్పటికీ పుక్కిటి పురాణాలు చరిత్రని పూర్తిగా మింగెయ్యడమనే థుసిడైడిస్ భావన కొన్ని దక్షిణాసియా రచనలకి యథాతథంగా వర్తించకపోవచ్చు.

దీనికి, పందొమ్మిదవ శతాబ్దపు పూర్వభాగంలో సెంజి నారాయణన్ అనే కరణం వ్రాసిన, కర్ణాటక రాజాక్కల్ చవిస్తార చరిత్తిరం (Extensive History of Carnatic Kings) అనే రచన ఉదాహరణగా నిలుస్తుంది. ఈ రచనలలో అనుభవసిద్ధమూ విశ్లేషణాత్మకమూ అయిన చారిత్రక వాస్తవికతతో పాటు, పౌరాణిక కల్పనలు కూడా వివిధ స్థాయిలలో పెనవేసుకొని ఉంటాయి. అదృష్టవశాత్తూ, ఆ చిక్కుముడులను ఎలా విప్పాలనేది పాఠకులు ఎవరికి వారు నిర్ణయించుకొనే అవకాశముంది. స్వభాషా పాఠకులకిది సహజంగా అబ్బుతుంది. తమ స్వానుభవం, సాంస్కృతిక వారసత్వం ఆధారంగా, తమకు విశ్వాసం కలిగించే అంశాలను వారెన్నుకుంటారు. కొన్ని కొన్ని సందర్భాలలో (ఆ రచనావ్యవస్థ పరిథిలో అసంగతం కానంత వరకూ) సాధారణ దృష్టికి అనుభవ దూరమనిపించే విషయాలను సైతం ‘వాస్తవాలుగా’ పరిగణించవలసి వస్తూంటుంది. ఉదాహరణకు, విజయరాఘవ నాయకుడు తంజావూరులో 1673లో జరిగిన యుద్ధంలో చనిపోయిన తర్వాత, తంజావూరుకు పశ్చిమాన అరవై మైళ్ళకు దూరంగా ఉన్న శ్రీరంగంలోని రంగనాథునిలో ఐక్యమవ్వడం కొందరు చూసినట్టుగా ‘తంజావూరు ఆంధ్రరాజుల చరిత్ర’లో ఒక కరణం చరిత్రకారుడు నమోదు చేశాడు. దీనిని కాదనే ధైర్యం మనకుందా! కోసెలెక్ (Reinhart Koselleck) అంగీకరించినట్టు, చారిత్రక సంఘటనల వాస్తవికతకు ప్రాధాన్యమిచ్చే పాశ్చాత్య చరిత్రరచనలో కూడా, పౌరాణిక కల్పనల పునరావృత్తి వంటిది సర్వసాధారణంగా కనిపిస్తుంది. వర్తమానం, భవిష్యత్తుకు గతమైపోయే నిరంతర పరిణామ క్రమంలోనే, మధ్యమధ్యలో, ఆ వరుసని అతిక్రమించే కొన్ని బలీయమైన, అతి సుపరిచితమైన, అర్థవంతమైన నమూనాలు తిరిగి తిరిగి ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, గతాన్ని గూర్చిన పునర్విమర్శ నుండే, ఆ సింహావలోకనానికి సహజమైన పొడిగింపుగా, అలాంటి పునరుక్తులు సృష్టింపబడతాయి.

చారిత్రకభూమిక నుండి దూరంగా సాగిపోయే రచనలకు మరికొన్ని బలవత్తరమైన ఉదాహరణలు కూడా ఉన్నాయి. తరచుగా యిది సమాజంలో విస్తరించుకొనే ఒకానొక సాముహిక స్పృహ మూలంగా జరుగుతుంది. ఓడినవాడి చరిత్ర గెలిచినవాడి చేతిలో కేవలం సాహిత్యంగా మారిపోతూ ఉంటుంది. బ్రిటిష్ పరిపాలనా కాలానికి ముందు దక్షిణాసియాలో వచ్చిన చాలా చారిత్రక రచనలకి సరిగ్గా యిలాంటి గతే పట్టింది. ఈ ప్రక్రియ ప్రారంభదశలో కొన్నిసార్లు అంచెలంచెలుగా సాగే ఆ మార్పును, మనం గమనించ గలుగుతాము. దీనికొక మంచి ఉదాహరణ ‘పద్మనాభ యుద్ధము.’ మొదటి దశలో పద్మనాభ యుద్ధమనే ఒక చారిత్రక దుర్ఘటన, వాస్తవ-కల్పనల వింతైన కలనేతగా చరిత్రను సృష్టించింది. ఆ తర్వాతి దశ – రచన మొత్తం కట్టుకథగా, పుక్కిటి పురాణంగా ముద్రవేయబడింది. ఒక రచనలో వాస్తవ-కల్పనల మధ్య ఉండే సున్నితమైన అంతరాలను గ్రహించే పరిణత ప్రజ్ఞ, సాధారణంగా పరాజితుల వర్గంలో నిలిచి ఉంటుంది. జయించి అధికారం చేపట్టిన వర్గం వారు, స్వరభేదాల గుర్తింపు లేని ప్రాథమిక పఠనానికే పరిమితులవుతారు. ఇది అస్పష్టతకీ, అయోమయానికీ దారితీస్తుంది.

అయితే, బ్రిటిష్ పాలనకి ముందు, భారతదేశంలోని మౌలిక సాహిత్య ప్రక్రియలలో సర్వత్రా చాలా వైవిధ్యభరితమైన వ్యక్తీకరణ కనిపిస్తుంది. అందువల్ల, చరిత్రరచనలో వాస్తవ-కల్పనల అల్లిక లోని అంతరువులను వివరించడానికి పైన చెప్పిన ప్రక్రియ (ఆధికారిక దృష్టికోణం ద్వారా వచ్చే మార్పు) ఒక్కటే సరిపోదు. దీనిని గూర్చి యింకా వివరంగా తెలియడానికి మరొక ఉదాహరణ చూద్దాం. పన్నెండవ శతాబ్ది మధ్యకాలానికి చెందిన కల్హణుని రాజతరంగిణి (కాశ్మీర రాజుల చరిత్ర) భారతదేశంలో వచ్చిన అతి తక్కువ చారిత్రక రచనలలో ఒకటిగా పరిగణింపబడింది. ఈ మహారచన యొక్క సిసలైన చారిత్రక గుణాన్ని గురించి ఎవ్వరికీ ఎలాంటి సందేహమూ ఉన్నట్టు లేదు. సాహిత్యంలో మాత్రం దీనికి సరైన స్థానం లేదు. ఇలాంటి చారిత్రక రచన భారతదేశంలో ఎలా పుట్టిందనడానికి అతి సులువైన, ఏమాత్రం లోతులేని వివరణ ఏమిటంటే – “కాశ్మీర సంస్కృతిపై విదేశీ ప్రభావం వల్ల అక్కడ చరిత్ర రచనవృద్ధి చెందినది” – అని. ఇది ఆచార్యుడు ఎ. ఎల్. బాషమ్, ది కాశ్మీర్ క్రానికిల్స్ అనే అనే వ్యాసంలో ఉటంకించిన మాట.

అయితే, భారతదేశానికి తనదైన, వైవిధ్యభరితమైన చరిత్ర రచనా విధానం ఉండవచ్చునన్న ఆలోచన పాశ్చాత్య చరిత్రకారులకి ఎన్నడూ తట్టలేదు. రాజతరంగిణి విదేశీ ప్రభావం వల్ల వచ్చిన చారిత్రక రచన అని చెప్తూనే, కల్హణుడు చేసిన ఆధారాల సేకరణ గురించి, అతని అట్టహాస రచనాశైలి గూర్చి, ‘తునాతునకలైపోయిన వృత్తాంతాన్ని ఒకచోట చేర్చి గుదిగూర్చి చెప్పడం’ తన లక్ష్యంగా అతను చేసిన విస్పష్ట ప్రకటన గురించి, దురదృష్టవశాత్తూ మార్మికతకు, ఇంకా చెప్పాలంటే మూఢత్వానికి లోనై అతడు చేసిన కొన్ని పొరపాట్ల గురించి – ఎంతో ఉత్సాహంతో విశ్లేషిస్తాడు బాషమ్. ఇక్కడ టాసిటస్ (Tacitus), స్యుటోనియస్ (Suetonius) అనే రోమన్ చరిత్రకారులు బాషమ్ విశ్లేషణలో గుట్టుగా తొంగిచూస్తారు. వీళ్ళకు కల్హణునిలో ఒక ఆత్మీయుడు కనిపించాడనడంలో సందేహం లేదు. అదే సమయంలో, కల్హణుడు తనని తాను చరిత్రకారునిగా కాక ఒక కవిగా భావించాడనీ, తన రచనని ప్రధానంగా ఒక కావ్యంగా పరిగణించాడనీ బాషమ్ గుర్తించాడు. అంచేత చరిత్ర రచన, కవిత్వము, రెండూ కల్హణుడికి సమానంగా ప్రేరణనిచ్చిన అంశాలే అన్నది అతని తీర్పు. విశ్లేషణతో కాకపోయినా ఈ తీర్పుతో మాత్రం మనం పూర్తిగా ఏకీభవించాలి.

కల్హణుడు నిజానికి కవే. అందుకే,

“జీవుల జీవితం బతివిచిత్రము బుద్బుదతుల్యమంచు మే
ధావిభవుల్ రసజ్ఞులు ముదంబున నీ కృతి రాట్తరంగిణీ
భావ సుధారసంబు జవిబట్టుచు, శాంతరస ప్రమోదపుం
దీవికి జీవనౌక వినుతింగనునట్లు నయింత్రు నేర్పునన్”

(శ్రీ స్వయంపాకుల వేంకట రమణశర్మ గారి అనువాదం)

జీవుల జీవితము నీటిబుడగలాగ క్షణభంగురమని యెఱిగిన విచక్షణులు, అమృతరసతుల్యమైన యీ రాజతరంగిణిలో మూర్ధాభిషిక్తమైన శాంతరసాన్ని తనివిదీర గ్రోలి ఆనందింతురు గాక అని ప్రకటించాడు. అంతే కాక, “ప్రతిభ అనే దివ్యనేత్రంతో గడచిన కాలాన్ని వీక్షించి, దాన్ని కళ్ళకు కట్టించే నిర్మాణశిల్ప నైపుణి కవిబ్రహ్మకి తప్ప వేరెవ్వరికి ఉంది?” అనడంలో కూడా మనకు కల్హణునిలో కవి స్పష్టంగా దర్శనమిస్తాడు. రచయిత ద్వారా స్వయంప్రకటితమైన యీ ‘కవి’ పాత్ర, ‘చరిత్రకారుని’ పాత్రకు ఏ మాత్రమూ అడ్డం రాదు, పాశ్చాత్య చరిత్రకారులు పొరబడుతున్నట్టుగా. మేము పుస్తకంలో అయిదు అధ్యాయాలలోనూ సుదీర్ఘంగా చేసిన చర్చ ద్వారా యీపాటికి పాఠకులకీ విషయం అర్థమయ్యే ఉంటుందని ఆశిస్తాము. చరిత్ర అనేక సాహిత్య ప్రక్రియలలో రచింపబడవచ్చు, అందుకు కావ్యం మినహాయింపు కాదు. నిజానికి, కవి కొన్నిసార్లు కేవలం వాస్తవాలలో యీదులాడనూ వచ్చు. సరిగ్గా యిక్కడే, ప్రాచీన భారతంలో ఏకైక చరిత్రకారునిగా చెప్పబడే కల్హణుడి విషయంలో కీలక వ్యత్యాసాలను గుర్తించే స్థితిలో యిప్పుడున్నాం. విచిత్రమైన విషయమేమిటంటే, ఏ రకంగా అయితే చరిత్ర రచనయితర సాహిత్య ప్రక్రియల ముసుగులో కప్పబడిపోయే అవకాశముందో, అదే విధంగా, పాశ్చాత్యదృష్టితో కాస్త ఆదరాబాదరాగా చూస్తే, కల్పన చరిత్రగా కనిపించే అవకాశమూ ఉంది. అంచేత కాశ్మీర రాజతరంగిణిని మరింత సూక్ష్మదృష్టితో పరిశీలించాల్సిన అవసరముంది. పూర్వ సంప్రదాయరీతులు, రాజవంశాల వివరాలుగల కీర్తిపత్రాలు, దానపత్రాలు, స్మృతిగ్రంథాలు మొదలైన వాటినన్నిటినీ సమీకరించి, నిశితంగా పరిశీలించి, రాజనీతి విధానాలను క్రమపద్ధతిలో, వాస్తవిక వివరాలతో పొందుపరచడాన్ని చూస్తే, రాజతరంగిణిలో ఉన్నదంతా ఖచ్చితంగా చరిత్రే అని అనిపించక మానదు. అది ఎంత వరకూ నిజం? ప్రస్తుతానికి యిక్కడొక చిన్న ఉదాహరణ మాత్రమే యివ్వగలం.

కల్హణునికి సమకాలీనుడైన జయసింహుని ఏలుబడిలో (1128-49), సుజ్జి అనే అతడు సమర్థుడైన సైనికాధికారి. రాజు అతడిని తన మనుగడకు ముప్పుగా భావిస్తాడు. ఇలాంటి బలమైన వ్యక్తులెందరి చావులనో కల్హణుడు తన రాజతరంగిణిలో విపులంగా వర్ణిస్తాడు. జయసింహుడు నిరాశలో కూరుకుపోతున్న సమయంలో ఎట్టకేలకు కులరాజనే ఒక సేనాని అతనికి దొరుకుతాడు. తన ప్రాణాలకు తెగించి సుజ్జిని హత్య చెయ్యడానికతడు సంతోషంగా సిద్ధపడతాడు. తనతో తీసుకువచ్చిన యిద్దరు సహాయకులను బయటనే ఉంచి, కులరాజు సుజ్జి ఉన్న గది లోపలకి ప్రవేశిస్తాడు. ఏదో నేరం చేసి, కులరాజుకు పట్టుబడ్డ ఒక జాలరి గురించి, సుజ్జికి సాక్ష్యమివ్వడానికి ఇద్దరు బైట నిలబడి వున్నారని చెపుతాడు. ఆ యిద్దరు సహాయకులూ లోపలకు వచ్చేసరికి సుజ్జికి ఆ మొత్తం వ్యవహారం మీద ఆసక్తి సన్నగిల్లుతుంది. దీని గురించి రేపు చూస్తాను, పొండి అని, హఠాత్తుగా వెనక్కి తిరిగి నిద్రమత్తుతో పక్క పైకి చేరతాడు. అతను చేసిన ఆ పొరపాటే అతనికి ప్రాణాంతకమవుతుంది. కులరాజు తన ఖడ్గాన్ని తీసి సుజ్జి ఎడమ భాగంలో పొడుస్తాడు. దానితో పూర్తిగా తెలివి వచ్చిన సుజ్జి, పెద్దగా అరుస్తూ తన ఆయుధం కోసం వెతుకుతాడు. కాని అప్పటికే ఆలస్యమైపోతుంది. మిగిలిన యిద్దరూ కూడా అతన్ని పదేపదే పొడుస్తారు. చూసేవాళ్ళకు ఏమి జరుగుతోందో అర్థమయ్యే లోపలే సుజ్జి విగతజీవుడవుతాడు. పించదేవుడనే ఒక్క యోధుడు తప్ప అతని అనుచరులందరూ పారిపోతారు. ముగ్గురు హంతకులూ కలసి అతన్ని కూడా తరిమేస్తారు. గది తలుపునూ కిటికీలనూ మూసేసి, సుజ్జి పడున్న మంచాన్ని తలుపుకడ్డంగా తోస్తారు. తటాలున శవం కింద పడిపోతుంది. ఇంతలో బయట మండువాలోనూ మెట్లమీదా ఉన్న సుజ్జి దళంలోని సైనికులు, మూసిన గదిపై దాడి చెయ్యడం మొదలుపెడతారు. అక్కడి నుంచి బయట పడేందుకు, సైనికులను ఎలాగయినా భయభ్రాంతులను చెయ్యాలని ఆశించిన కులరాజు, సుజ్జి తల నఱికి కిటికీలోంచి బయటకి విసిరేస్తాడు. ఆ బీభత్సదృశ్యాన్ని చూసి తట్టుకోలేక, కులరాజు అనుకున్నట్టుగానే, సైనికులందరూ అక్కడినుంచి పరుగులు తీస్తారు. అంతటితో కులరాజు లక్ష్యం సిద్ధిస్తుంది.

కాని, ఈ సన్నివేశాన్ని ఉత్తగా వివరించి ఊరుకొనడం యీ కవి-చారిత్రకునికి సంతృప్తినివ్వలేదు. కిటికీలోంచి బయటకి వచ్చి దుమ్ములో పడ్డ ఆ తెగిన తల, అక్కడ చూసిన వాళ్ళలో కలిగించిన నైరాశ్యం, భయోత్పాతం, చదివే మనలో కూడా కలిగించాలని అతని కోరిక. అందుకే, పాఠకుల యిష్టాయిష్టాలతో పనిలేకుండా ఆ దృశ్యాన్ని యిలా (అతి) సజీవంగా చిత్రించడానికి పూనుకున్నాడు:

బయట మండువాలో తెగిపడ్డ తలను; రక్తధారలు నిరంతరంగా స్రవిస్తున్న దాని తెల్లబడిన కళ్ళను, పాలిపోయిన చెవులను; పైపెదవి పైనున్న మీసాల వెండ్రుకలతో కప్పబడి, కాస్త నొక్కుకొని ఉన్న ముకుపుటాలను; చిందరవందరగా ప్రాంగణమంతా పరుగులుతీసే సైనికుల ప్రతిబింబాలు కదలాడి, జీవస్పందన ఉన్నదేమో అనే క్షణికభ్రాంతిని కలిగిస్తున్న గాజుపెంకుల్లాంటి కనుపాపలను; ఎగుడుదిగుడుగా తెగిపడ్డ మెడ అంచుల యెత్తుపల్లాలలో ఎండిపోయి, చూడ్డానికి పసుపుముద్దలా దళసరిగా అట్టకట్టిన కొవ్వును; దుమ్ముకొట్టుకుపోయి చింపిరిగా తయారయిన శ్మశ్రుకేశాలను; ఆ తల సుజ్జిదేనని నిశ్చయించడానికి ఒకే ఒక గురుతుగా మిగిలిన నుదుటనున్న కుంకుమబొట్టును; నేలకు వాలుగా తగలడం వలన, ఆ తాకిడికి పగుళ్ళువారిన పళ్ళను – చూసిన సేవకులు బిగ్గరగా కేకలు పెట్టడం మొదలుపెట్టారు.

ఇలాంటి అతివాస్తవిక చిత్రణ, శైలీపరంగా చూస్తే అసాధారణకార్యమే! సజీవ చిత్రణ కోసం, దీర్ఘవర్ణనల ఆవరణాలు ఏర్పరచబడ్డాయి. ఒకసారి ఆ ఆవరణంలోకి అడుగుపెట్టామా, అది సృష్టించే దుర్భరానుభూతినుండి తప్పించుకోడం అసాధ్యం. కవి పన్నిన వలలోంచి బయటపడలేము. ఒక ఆవరణం వెంట మరొక ఆవరణం, ఒక వర్ణన తర్వాత మరొక వర్ణన, అన్నీ ద్వితీయా విభక్తిలోనే. వాక్యాన్ని పూర్తిచేసి మనల్ని ఆ బీభత్సంనుండి విముక్తులను చేసే క్రియాపదం చిట్టచివరకు కాని రాదు. ఫలితం – పాఠకుణ్ణి మునుపెన్నడూ కనీవినీ యెరుగని దిగ్భ్రాంతికి గురిచేస్తూ, విస్తృతమైన వివరణతో, అద్భుతంగా, అతిస్పష్టంగా కళ్ళముందు ఆవిష్కరించబడిన వాస్తవం (ఊహా? జ్ఞాపకమా?) చివరికి మిగిల్చే అనుభూతిలో కళాసౌందర్యమేమీ లేదు. ఉన్నదల్లా కఠోరవాస్తవికత, అతిసహజత్వమూను. సాంప్రదాయిక కావ్యంలో లాగ విషయాలను నియంత్రించడమో, సంగ్రహించడమో, ఆదర్శీకరించడమో, తేలికపరచడమో మనకిక్కడ కనిపించదు. తద్విరుద్ధంగా, కవికున్న సర్వమార్గాలు, భాషావనరులు, చిత్రమైన యీ సన్నివేశాన్ని పూర్తి వాస్తవంగా మలచడానికి వినియోగించబడ్డాయి. ఈ సందర్భంలో బాబెల్ (Isaac Babel) గుర్తుకువస్తే ఆశ్చర్యం లేదు. అయితే, ఇది వాస్తవమైన చరిత్రా?

బహుశా కాదు. పోనీ, మేము పరిశోధిస్తూ వచ్చిన కరణపు వ్రాతలతో పోల్చి ఇది కాస్త బలహీనమైన చరిత్ర రచన అనుకోవచ్చు. వాస్తవికత ఒక్కటే చారిత్రకత కాలేదు. ఈ రచనలో కార్యకారణ సంబంధాల గూర్చి గాఢమైన అవగాహన కాని, పూసగుచ్చినట్టు కూర్చిన సంఘటనల కూర్పును అర్థయుక్తంగా వ్యాఖ్యానించగల కాస్త లోతైన సూత్రనిర్మాణం కాని వెతకడం వ్యర్థప్రయత్నమే. ఇక్కడ కల్హణుడు పరోక్షజ్ఞానం పైన ఆధారపడినాడన్న సంగతి గుర్తుంచుకోవడం ముఖ్యం. నఱకబడ్డ సుజ్జి తల గురించిన వర్ణన అతను ప్రత్యక్షంగా చూసినది కాదు. తాను విన్న సమాచారం ఆధారంగా స్వంతంగా సృష్టించినది. బహుశా అంతకు కొన్నేళ్ళ ముందు జరిగిన సంఘటనలే కాబట్టి అతనికి లభించినది వాస్తవానికి దగ్గరగా ఉన్న సమాచారమే అయ్యుండవచ్చు. నిజమే, జయసింహుని కొలువుకూటంలో తనకు తెలిసిన అంతఃపుర రహస్యాలను, వ్యక్తిగత రాజకీయాలను, విపులీకరించడంలో అతడు చాలా శ్రద్ధను కనపరిచాడు. రాజాస్థానాలలో జీవితాన్ని గూర్చి ఒక నిర్లిప్తమైన, విరక్తి నిండిన దృక్పథాన్ని, (కొద్దిపాటి ఉపదేశశైలిలో) ధ్వనింపచెయ్యడానికి యిలాంటి సంక్లిష్ట ప్రణాళికలను, పునరావృతమయ్యే విషాద వర్ణనలను ఉపయోగించుకున్నాడు. కొద్ది కాలం క్రితమే జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా సాగే కథనంలో సమగ్రత కోసం, విషయాలన్నిటినీ నిక్కచ్చిగా చెప్పే ప్రయత్నం ఒకపక్క చేస్తూనే, మరోవైపు, జుగుప్సాకరమైన యిలాంటి నాటకీయ సన్నివేశాలు కళ్ళముందు జరిగిన అనుభూతి పాఠకుల గుండెల్లో కలిగించే ప్రయత్నం కూడా చేశాడు కల్హణుడు. ఒక ప్రతిభావంతుడైన చారిత్రకనవలా రచయిత చేసేది కూడా యిదే కదా?

రాజతరంగిణి పూర్వ తరంగాలను కూడా నిష్పాక్షిక దృష్టితో చదివితే, మా యీ అభిప్రాయానికి మరింత బలం చేకూరుతుంది. తన రచనంతటికీ ఉత్కృష్టమైన నాల్గవతరంగంలో చాలా భాగం జయాపీడుడనే రాజు చేసిన సాహసకృత్యాలను గూర్చి చెపుతాడు కల్హణుడు. నేపాళరాజ్యంపై జయాపీడుడు తెగువతో చేసిన దండయాత్ర, అందులో అతడు పట్టుబడడం, అసాధారణరీతిలో తప్పించుకోడం, మొదలైన ఎన్నో అద్భుత సాహసాలను వర్ణిస్తాడు. ఇందులోని కథాంశం నవలాస్వరూపం కలిగినది. ఇది దండి దశకుమారచరిత్ర వంటి రచనల సరసన నిలబెట్ట తగినది. కథలోని ఉత్కంఠకి అనుగుణంగా కథనశిల్పం సాగుతుంది. ఇలాటి అంతర్గర్భితమైన నవలికలు ఈ రచన పొడుగునా తరచూ వస్తూంటాయి. ఈ నిర్మాణంలో — కథనంలో సరళక్రమాన్ని పాటించాలనే ఒక చరిత్రకారుని తీవ్రకాంక్ష, జరిగే సంఘటనలపై ఒక నీతిమంతుడి పెదవివిరుపు — మనకు కనిపించక మానవు. ఒకరకంగా చూస్తే యివన్నీ చరిత్ర లక్షణాలే. కానీ యీ రచనలో పూర్తి స్థాయి చారిత్రక విశ్లేషణా లక్షణాలు లేవు. అయితే, దీనికి కారణం, కళానైపుణ్యంతో, అక్కడక్కడ భావకవిత్వపు పోకడలతో సాగే, కల్హణుడి రచనాశైలి మాత్రం ముమ్మాటికీ కాదు. “చరిత్ర అంటే, గతాన్ని గూర్చి ఒక మేధోవంతమైన సంస్మరణే తప్ప అందులో ఉక్తివైచిత్రికీ, భావ విశృంఖలతకూ, విపరీత భావోద్వేగాలకు చోటులేదు” అన్న హెగెల్ (Hegel) నిర్దేశం పక్షపాతదృష్టితో చేసినదే.

మా సారాంశం ఏమిటంటే, రాజతరంగిణి మధ్యయుగాలలో భారతదేశంలో వచ్చిన ఒక విలక్షణ రచన అన్న ప్రచురాభిప్రాయంతో మేము తప్పక అంగీకరిస్తాము. గతాన్ని గురించి కల్హణుడు సృష్టించిన యీ సుదీర్ఘ రచన, రాజవంశావళిని చిత్రించే సంప్రదాయ పురాణమో, హర్షచరిత్ర వంటి రాచరికపు రాసలీలలు వర్ణించే కావ్యమో కాదు. అదే విధంగా పాశ్చాత్య సాహితీప్రక్రియకు లోబడిన చరిత్ర రచనకూడా కాదు. ఇతర కవులు కావాలని మితిమీరిన కల్పనలకి పాల్పడే సందర్భాలలో కల్హణుడు కఠోర వాస్తవికతకి చోటు కల్పిస్తాడు. తన వద్దనున్న ఆధారాల ద్వారా కష్టపడి సంకలించిన వాస్తవాలను విడిచిపెట్టడు. అయితే, యిలాంటి అతివాస్తవికత, మధ్యయుగాల చివరలో వచ్చిన కావ్యాలలో కూడా సర్వసాధారణంగా కనిపిస్తుంది. అది వాటిని చరిత్రగా మార్చదు. పదహారవశతాబ్ది మొదట్లో వచ్చిన పెద్దన మనుచరిత్ర కావ్యంలో, చక్కటి పరిశీలనతో విపులంగా వర్ణించిన వేట దృశ్యాలను చూస్తే, యీ తేడా అర్థమవుతుంది.

అసలు మనమీ సమస్యని అర్థం చేసుకోవడం లోనే చాలా వరకూ లోపం ఉంది. మనమింకా ఒక పాత ఉచ్చులో పడుతూనే ఉన్నాం. సాధారణంగా మనం మనకొక సామాన్య అవగాహనా పరిధిని ఏర్పరుచుకుంటాం. సమష్టిగా ఏర్పరచుకున్నదే అయినా, అది చాలా పరిమితమైనది. ఆ పరిధిని అతిక్రమించే విషయాలను అద్భుతాలనీ, అభూతకల్పనలనీ, మర్మభూయిష్టాలనీ ముద్రవేసి, రచనలో అలాంటి భాగాలను ఏరివెయ్యడానికి ప్రయత్నిస్తాం. ఈ దృష్టితో ఆలోచించి, “చరిత్రకారునికి తప్పకుండా ఉండాల్సిన అర్హతగా మనం భావించే చారిత్రకస్ఫూర్తి కల్హణుడిలో లే”దని కొట్టిపారేసే అవకాశముంది. పైపెచ్చు, “గొప్ప కాశ్మీర చరిత్రకారుడైన కల్హణుడు సైతం, చరిత్రకు సంబంధించి హిందూ భావజాలాన్ని ప్రభావితం చేసే ఆలోచనల బారినపడ్డాడు… పురాణాలను, ఐతిహ్యాలనూ, నిజమైన చరిత్రతో వేరు చేయగల నేర్పు భారతీయచేతన ఎప్పుడూ సంపాదించలేదు.” అని నిశ్చయించే అవకాశమూ ఉంది. ఈ నిశ్చయానికి వచ్చినది స్వయానా, కల్హణుడికి తన జీవితంలో చాలా భాగాన్ని, ఆత్మలో ముఖ్యభాగాన్నీ అంకితం చేసిన ఆరెల్ స్టెయిన్ (Aurel Stein) అనే పాశ్చాత్య చరిత్ర పరిశోధకుడు. ఇది అవగాహనారాహిత్యంతో చేసిన తప్పుడు వర్గీకరణ.

చరిత్ర అంటే కేవలం సంభవనీయత కాదు. రచన అల్లికలో అంచెలంచెలుగా, అతిసూక్ష్మంగా, చాలాసార్లు ఖచ్చితంగా, గుర్తించగల చిహ్నాలకు సంబంధించినది చరిత్ర. ఏ భాషలో చరిత్ర రచనసాగిందో, ఆ భాష మాట్లాడే పాఠకులు దాన్ని సులువుగా గుర్తిస్తారు. వాస్తవికత; చారిత్రక ఆధారాల సరైన వినియోగం; సంఘటనల మధ్య అర్థవంతమైన కార్యకారణ సమన్వయం; సమాచారసామగ్రి నంతటినీ సమీకరించి, సమీక్షించి, అందులోనుండి ఒక చారిత్రక అవగాహనను వెలికి తీసి, దాన్ని చదివించే గుణంతో గుది కూర్చడం; యివన్నీ కూడా ఎంతో కొంత చరిత్రకు ఉండవలసిన లక్షణాలే. ఈ లక్షణాలే ఒక గొప్ప చరిత్రకారుణ్ణి సగటు చరిత్రకారుడి నుంచి వేరు చేస్తాయి. ఇవన్నీ చరిత్ర అల్లికలో అంతర్గతంగా ఉంటాయి. ఏది సంభావ్యము, ఏది హేతుబద్ధము, ఏది అర్థవంతము, అనే విషయాల గురించి మన స్వంత అభిప్రాయాలనూ తీర్పులనూ, మరొక సంస్కృతికి చెందిన మౌలిక అవగాహనా రీతులతో కలగలిపి గందరగోళం చెయ్యడం ఇకనైనా ఆపవలసిన సమయం వచ్చింది. వాస్తవ-కల్పనల నడుమనున్న అంతరాన్ని తెలుసుకొనేందుకు ఆయా వ్యవస్థలలో వాటికి మాత్రమే స్వంతమైన అంతర్గతప్రమాణాలు ఉంటాయని గుర్తించాలి. మన పూర్వస్థిత భావాల కన్నా యీ ప్రమాణాలే మనకు తగిన పనిముట్లని తెలుసుకోవాలి.

3. గంగాదేవి – మిథ్యాచరిత్ర
కల్హణుడు సరే, చరిత్రకారుని లక్షణాలు కొన్నయినా అతనిలో ఉన్నాయి. ‘చారిత్రక కావ్యం’ సృష్టించిన యితర (అంతగా ప్రసిద్ధి పొందని) రచయితల విషయంలో కూడా అలాంటి భ్రాంతిలోనే పడుతూంటాం. చారిత్రక కావ్యం అన్న యీ పస లేని సాహిత్య ప్రక్రియ వర్గీకరణలో మళ్ళీ అనేక స్థాయీభేదాలు! రాచరికమో, సైనికపాలనో కలిగిన గతాన్ని గురించి యెలాంటి ప్రౌఢమైన లేదా కవితాత్మకమైన రచననైనా, ఈ పేరుతో పిలవడం ఆనవాయితీ అయిపోయింది. మండలకవి విరచిత పాండ్యకులోదయం; విజయనగర చక్రవర్తి, తన భర్త, అయిన అచ్యుతరాయలతో తన ప్రణయాన్ని గూర్చి తిరుమలాంబ రచించిన వరదాంబికా పరిణయమనే చంపూకావ్యం; కేరళ రాజవంశాన్ని గురించి అతుల కవి వ్రాసిన మూషిక వంశమనే కావ్యం; యిలా యెన్నో రకాల రచనలు అదే సాహిత్య ప్రక్రియ క్రిందకి జమ చేయబడ్డాయి. ఈ రచనలన్నీ వేటికవి విడిగా పరిశీలించాల్సినవి. వీటిలో కొన్ని, మా ప్రమాణాల మేరకు, చారిత్రక రచనలే. కాని చాలా వరకు కావు. అసలేమాత్రమూ చారిత్రకత లేని ఒక ప్రసిద్ధ రచనని యిప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. అది – మధురా సుల్తానులపై విజయనగర రాజు కంపనుని దండయాత్ర గూర్చి పదమూడవందల ఏభైలలో గంగాదేవి వ్రాసిన ‘మధురా విజయం.’

గంగాదేవి కంపనుడి రాణి. ఆమె తన ప్రియునికి పుట్టినరోజు బహుమతిగా ఒక చారిత్రక పత్రాన్ని సమర్పించిందని ఊహించడం హాస్యాస్పదమే అవుతుంది. అంచేత సహజంగానే యీ కావ్యం కంపనునికి పుట్టినరోజు కానుకగా అందించిన సన్మానపత్రంలా అనిపిస్తుంది. ఇందులో తన ప్రియుని శారీరక సౌందర్యాన్ని, శృంగారకళా కౌశలాన్ని, దేహదార్ఢ్యాన్ని, చాలా సుదీర్ఘంగా సొగసుగా వర్ణిస్తుందామె. ఈ మూడంశాలతోనూ ఆమెకు మంచి పరిచయం ఉండటం సహజమే. ఆశ్చర్యంగా, యీ మూడంశాలూ కూడా మధురపై అతడు చేసిన సైనికచర్యతో కలిసిపోతాయి. నవజనిత విజయనగర రాజ్య విస్తరణ కోసం కంపనుడు చేసిన దక్షిణదేశ దండయాత్ర, ఒక దక్షిణనాయకుని అంతఃపుర జైత్రయాత్రగా రూపాంతరం చెందుతుంది. చాలా వరకూ ఆ నాయకుని సమయం, త్రోవలో తన అంతఃపురస్త్రీలతో సలిపే క్రీడావినోదాలలోనే గడిచిపోతుంది. రతికేళీవిలాసాలతో ఋతువులు సాగిపోతాయి. యుద్ధం అనేదొకటి జరుగుతోందనీ, అతడు కత్తి పట్టాలనీ, అప్పుడప్పుడూ ఆ రాజకుమారునికి గుర్తు చెయ్యబడుతూ ఉంటుంది.

అయితే, అతిశయోక్తులపై పండితులకున్న అభిమానానికి యిలాంటి విషయాలేమీ అడ్డుకట్టు వేయలేక పోయాయి. అందుకే, “గంగాదేవిని మొట్టమొదటి దక్షిణ భారత చరిత్రకారిణిగా పేర్కొనడం ఎలాంటి శాస్త్రదృష్టితో చూసినా సమంజస” మయ్యింది. దండయాత్రకు సంబంధించి ఏవో కొన్ని ప్రామాణికమైన పేర్లు ప్రస్తావించినంత మాత్రాననే యీ రచన, “పూర్వకాలం భారతదేశంలో వచ్చిన చాలా కొద్ది పరిపూర్ణ చారిత్రక రచనలలో ఒకటి” అయ్యే అర్హత సంపాదించింది. అందువల్లనే – విజయనగర రాజు బుక్కరాయని తనయునిగా కంపనుని జననం మొదలుకొని, గంగాదేవితో అతని వివాహం (అతని జీవితంలో ప్రధాన ఘట్టం?); దక్షిణ దిశగా ప్రయాణమై చంప (శంభువరాయ) రాజుల నుండి తుండీరమండలాన్ని స్వాధీనం చేసుకొని మధురా రాజ్యాన్ని ముట్టడించమన్న బుక్కరాయని ఆదేశం; తండ్రి మాట తలదాల్చి, సులువుగా, మధ్య మధ్య తన భార్యలతో సరససల్లాపాలకై దీర్ఘ విరామాలు తీసుకుంటూనే, కంపనుడు తన పనిని చక్కబెట్టడం వరకూ సాగిన సుదీర్ఘ చరిత్ర, మనకీ రచన ద్వారా తెలుస్తుంది. కంపన యవనసురత్రాణుల (సుల్తాను) మధ్య ద్వంద్వయుద్ధంతో కథ సుఖాంతమవుతుంది. సుల్తాను చాలా బలవంతుడైన శత్రువు. అతడి తల తెగిన తఱువాత కూడా గుఱ్ఱపు పగ్గాన్ని పట్టుకున్న అతని ఎడమచేయి పట్టుదప్పదు. కుడిచేయి కంపనునిపై తిరుగుదాడి చెయ్యడానికి ప్రయత్నిస్తుంది. అయినా చివరకు తురుష్క సామ్రాజ్యం తాత్కాలికంగా నిరోధించబడుతుంది. బహుశా, కంపనుడికి తిరిగి తన అసలైన అభిరుచులపై దృష్టి సారించే అవకాశం లభిస్తుంది.

ఈ రచనకి రిచర్డ్ డేవిస్ (Richard H. Davis) అర్థవంతమైన వ్యాఖ్యానాన్ని అందించాడు. దీనినతడు హిందువుల ‘ప్రతిఘటనా ఇతిహాసాల (epics of resistance)’ కోవలోకి వర్గీకరిస్తాడు. మధురావిజయ కావ్యాన్ని సరైన సాంస్కృతిక చారిత్రక నేపథ్యంలో అర్థంచేసుకోడానికి యితని వ్యాఖ్యానం బాగా ఉపయోగపడుతుంది. అయితే, వచ్చిన చిక్కల్లా మధురావిజయంలో ఐతిహాసికాంశమేదీ లేదు. అన్ని విధాలా, నూటికి నూరుపాళ్ళూ, అది ఒక కావ్యం. వినోదాన్నీ ఆహ్లాదాన్నీ అందించేందుకు, ముఖస్తుతి చేసేందుకు, రచింపబడిన ఒక రాజకీయ కావ్యం. కవయిత్రి స్వయంగా కావ్యపీఠికలో యీ విషయాన్ని చెపుతుంది:

కరోతి కీర్తిమర్థాయ కల్పతే హన్తి దుష్కృతం
ఉన్మీలయతి చాహ్లాదం కిం న సూతే కవేః కృతిః

కీర్తిని చేకూరుస్తుంది. ధనాన్ని యిస్తుంది. పాపాన్ని రూపుమాపుతుంది. ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కావ్యం ఇయ్యని దేది? ఇలాంటి మహా ప్రయోజనాలను సాధించే ఆశయంతోనే కాబోలు, ఆమె తనని తానొక గొప్ప కవయిత్రిగా భావిస్తుంది:

తార్కికా బహవస్సన్తి శాబ్దికాశ్చ సహస్రశః
విరలాః కవయో లోకే సరసాలాపపేశలాః

తార్కికులెందరో ఉన్నారు. వైయాకరణులు వేలకువేలు ఉన్నారు. సరససూక్తులతో రంజింపజేసే మంచి కవులు లోకంలో చాలా తక్కువ.

దీనిని మనం అంగీకరించాలి. గంగాదేవి నదేష్దా (Nadezhda Mandelstam) వంటి రచయిత్రి కాకపోవచ్చు. కాని, ఆమెకు పదాలను పొందికగా కూర్చడం తెలుసు. ఆమె రచనాచాతుర్యం చాలాచోట్ల తళుక్కున మెరుస్తుంది. “దక్షిణభూమి అయిన మధుర, తురుష్కుల దుండగాలవల్ల నాశనస్థితిని పొందింది. ఆ దుర్మార్గులు కొబ్బరితోటలను నరికి వేశారు. సద్బ్రాహ్మణులకు సంకెళ్ళు వేశారు. ఒకప్పుడు ప్రేయసీప్రియులు విహరించిన వనాలు పాడుబడి, గుడ్లగూబల కేకలకు నెలవులయ్యాయి. ఆ అరుపులకన్నా ఎక్కువగా, చిలకలు పలికే (యవన తురుష్కుల దగ్గరనుండి నేర్చుకున్న) పారసీకపు పలుకులు ములుకుల్లా గుచ్చుకొని వేధిస్తున్నాయి.” ఇలాటి వివరాలన్నీ రాజు గుండె లోతులను (పెద్ద లోతేం కాదు కాని!) పట్టి కుదిపేస్తాయి. అయితే, దీనికి కొద్ది క్షణాల మునుపే ఆ రాజు మనసు వేరే విషయాలపై కేంద్రీకృతమై ఉంటుంది, అది వేరే సంగతి. అవి ఎలాంటి విషయాలంటే:

“పాదపద్మంబుల పైబడి పొరలాడి
యుత్సంగ తలముల యుదుటు దాటి
నీవిబంధము తోడి నెలవుల కెగబ్రాకి
నాభి చక్రంబు రంధ్రంబు దాకి
యుత్తుంగ కుచతటు లొఱసి యుద్ధతి బొంగి
కంధర వీచి దోర్బంధమొసగి
ఘననీల కైశికం బనువు మైకొన దాల్చి
ముఖచంద్ర బింబంబు ముద్దు వెట్టి”

(శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణశాస్త్రి గారి అనువాదం)

చరిత్రాత్మక దిగ్విజయాలు రూపుదిద్దుకొనేవి యిలాంటి విషయాలతో కాబోలు!

మరొక్కసారి చెపుతున్నాం. ఒక రచన చరిత్ర కాదు అంటున్నది ఆ రచనలోని సమాచారాన్ని బట్టి కాదు. కాస్త గట్టిగా వెతికితే అక్కడక్కడ మధురావిజయంలో వాస్తవాల ముత్యాలు (కనీసం అలా అనిపించేవి) కొన్ని దొరక్కపోవు. కానీ యిక్కడ అసలు సంగతి అది కాదు. వాస్తవాలను పొదగడం అంత పెద్ద విషయం కాదు. పురాణాలలో ఉన్నాయవి. జానపదగాథలలోనూ ఉండవచ్చు. ఆఖరికి వార్తాపత్రికల్లో కూడా ఉంటూ ఉంటాయి, అప్పుడప్పుడు. ఆ వాస్తవాలను ఎలా వాడుకున్నారు, వాడుకోబోతున్నారు అన్నది ముఖ్యం. గొప్ప కవులు కూడా చరిత్ర రచించవచ్చు, అమీర్ ఖుస్రో విషయంలో యిది చూశాం. అలాటప్పుడు చరిత్ర వ్రాయాలనే ఉద్దేశం వాళ్ళకుండాలి. ఈ ఉద్దేశాన్ని ప్రతిఫలించడానికి ప్రత్యేకమైన సాహిత్య ప్రక్రియ అవసరం లేదు. ఏ సాహిత్య ప్రక్రియ తీసుకున్నా, దానికి అంతర్గతంగా ఉండే సూచకాలకు ఆ రచన ఉద్దేశాన్ని వ్యక్తం చేసే సామర్థ్యం ఉంటుంది. వాటితో పాటు మేము పేర్కొన్న శైలీలక్షణపు ప్రమాణాలు కూడా తగిన పాత్ర పోషిస్తాయి. ‘చారిత్రక’ కావ్యాలు రచించిన చాలామంది ప్రాచీన కవులలో అలాంటి ఉద్దేశమేదీ మనకు కనిపించదు. సాధారణంగా, వారి ఆంతర్యం మనకి సులువుగానే అర్థమవుతుంది.

4. ప్రజల చరిత్ర – దూపాటి కైఫీయతు
ఆఖరుగా, మరొక్క విభిన్నమైన ఉదాహరణతో, చరిత్ర-మిథ్యాచరిత్రల మధ్యనున్న వ్యత్యాసాన్ని వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాము. కేవలం కాలక్రమం పైన కాక కార్యకారణ సంబంధం పైనా, జరిగిన సంఘటనలను వట్టిగా నమోదు చేయడం కాక వాటిని అర్థం చేసుకోడం పైనా, శ్రద్ధాసక్తులు కనపరిచే రచనలను మేము పరిశీలించాము. గతకాలపు సంగతులను ఊరికే ఏకరువు పెట్టడానికీ, వాటి ద్వారా ఒక నూతనావిష్కరణ చెయ్యడానికీ మధ్యనున్న తేడా, ఆయా రచయితలకు, వాటిని చదివే పాఠకులకూ కూడా తెలిసిన విషయమే. పాశ్చాత్య పద్ధతిలో సాగే చరిత్ర రచనకొంత చప్పగా, నీరసంగా సాగడం మనకు అనుభవం లోనిదే. మేము పరిశీలించిన రచనలీ కోవకు చెందినవి కావు. అలంకారప్రయోగం, ఊహించని కథాక్రమం, కదిలేదీ కదిలించేదీ అయిన భాష, నర్మగర్భమైన వ్యంగ్యం, కొన్నిమార్లు ప్రశంస, కొన్నిమార్లు సున్నిత విమర్శ, ధ్వనించే రచయిత సొంతగొంతు – మధ్యయుగాలలో దక్షిణభారతదేశంలో వచ్చిన అత్యుత్తమ చారిత్రక రచనల శైలీలక్షణంలోని సూచకాలు. ఈ సర్వప్రయత్నంలోనూ వాస్తవికత అంతర్లీనంగా, చాలా సహజంగా ఒదిగిపోతుంది. రకరకాల రూపాలలో వ్యక్తమవుతుంది. వాస్తవ ఘటనల పరిధిలోనే, అవి సంఘటించే కాల క్రమంలోనూ, గమనవేగంలోనూ, నిర్మాణంలోనూ అనేక గతిభేదాలు చోటు చేసుకుంటాయి. మన జీవితంలో మాదిరిగానే రచనలోనూ, యీ రకరకాల కాలగతులు, ఒక్కుమ్మడిగా ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి అల్లుకొని ఉంటాయి. గతకాలపు సంఘటనలను తనదైన పద్ధతిలో ఎంచుకొని, వాటి తారతమ్యాలను విచారించి, వాటి మధ్యనున్న సంబంధాలను పరిశీలించి, ఒక క్రమాన్ని ఏర్పరచి తనదైన వ్యాఖ్యానాన్ని అందించానన్న స్పృహ చరిత్రకారునికి ఉంటుంది. దానికతడు బాధ్యత కూడా వహిస్తాడు. మరొక స్థాయిలో, యీ చారిత్రకస్పృహకు సంబంధించి తన సమాజం ఏర్పర్చుకున్న ఒక సమష్టి జ్ఞానవ్యవస్థను (epistemology) చరిత్రకారుడు గుర్తించగలుగుతాడు. ఆ వ్యవస్థ ద్వారా ఆ సమాజం, చరిత్రను ఏయే తీరులలో అర్థం చేసుకుంటుందో గ్రహిస్తాడు.

ఈ రచనా వైఖరులన్నిటినీ, బొబ్బిలి మొదలుకొని సెంజి, కంపిలి, హంపి, తంజావూరుల వరకూ గల వివిధ ప్రాంతాలకు సంబంధించిన రచనల ద్వారా మేమీ పుస్తకంలో విశదపరిచే ప్రయత్నం చేశాము. ఒక సామాజిక వాతావరణంలో విస్తరించుకున్న చారిత్రకస్పృహ, పదిహేను పదహారు శతాబ్దాల మధ్య కాలంలో, సుసంపన్నమైన చరిత్రరచనా సారస్వతంగా, చిక్కని ఆకృతి దాల్చింది. గతాన్ని గూర్చి సుదీర్ఘంగా సాగిన విచార విశ్లేషణల స్వరూపమది. దక్షిణాసియాలోని ప్రాచీన చరిత్ర రచనప్రక్రియలతో ఈ సాహిత్యానికి సంబంధముంది. అయితే, వాటినుండి విడివడి ఒక కొత్త పుంతను తొక్కడం కూడా మనకీ సాహిత్యంలో గోచరిస్తుంది. ఒక రకంగా యిది దక్షిణ భారతదేశంలో అప్పుడే ఆవిర్భవించిన ఒక కొత్త ‘ఆధునికత’ను సూచిస్తుంది. అది సాధారణ ప్రమాణాలకు ఎన్నో మైళ్ళు ముందుండే ఆధునికత. గతాన్ని గూర్చిన యీ కొత్త స్పృహ – బలమైన వ్యక్తివాదం, మానవశరీర సామర్థ్యాన్ని గూర్చిన ఒక కొత్త చైతన్యం, వివిధ సామూహిక (మతపరమైన) అస్తిత్వాల సరిహద్దులను చెరిపేసి, రాచరికానికి ఒక కొత్త నిర్వచనాన్ని యిచ్చే ఒక సమష్టి రాజకీయసంస్కృతి – మొదలైన లక్షణాల సమ్మేళనం. ఈ ఆధునికత పదునెనిమిది పందొమ్మిదవ శతాబ్దపు సంధియుగం వచ్చేటప్పటికి, వలసవాద ఆధునికత ప్రాబల్యంలో మరుగున పడిపోసాగింది. ఇంగ్లీషు కంపెనీవారు దక్షిణభారతంలో తమ పట్టు బిగిస్తున్న కాలంలో, తమకు తెలిసిన, తాము గ్రంథస్థం చేసిన నైతిక-సాంస్కృతిక ప్రపంచం తమ కళ్ళముందే అంతరించిపోవడం గమనించిన కరణాల బాధ, ఆ కాలపు చరిత్ర రచన శైలీలక్షణంలో ఒక మార్పుగా కనిపిస్తుంది.

ఈ మార్పును తెలిపే ఒక శక్తివంతమైన రచన దూపాటి కైఫీయతు. దీనిని పందొమ్మిదవ శతాబ్దపు తొలినాళ్ళలో ఒక అనామకుడైన కరణం రచించాడు. ఈ కైఫీయతు రచనాకాలానికి, పాత ఏలుబడి పోయి ఒక నూతన వ్యవస్థ అవతరించింది. దానికి తెర తీసినవాడు థామస్ మన్రో (Thomas Munro). మన్రో అమలు పరచిన రైతువారీ విధానం, పాత అధికార వ్యవస్థల స్థానే నూతన వ్యవస్థకి నాంది పలికింది. ఈ కొత్త విధానం రైతులకూ రాజ్యానికీ ప్రత్యక్ష సంబంధం నెలకొల్పింది. దీని ఫలితంగా (కొంతవరకూ దీనికి పూర్వరంగంగా), తరతరాలుగా, ప్రాంతీయ రాజకీయ నిర్మాణాలలో వచ్చిన అనేక మార్పులకు తట్టుకుంటూ నిలబడిన పాలెగాళ్ళ వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆ గతించిన వ్యవస్థకు శ్రద్ధాంజలి ఘటించడానికో, కోల్పోయిన ఒక స్వర్ణయుగ చిత్రాన్ని మన కళ్ళముందు సృష్టించడానికో యీ కైఫీయతు వ్రాయబడ లేదు. మూడువందల ఏళ్ళ కల్లోలభరితమైన కమ్మ నాయక వంశ చరిత్రను చిత్రిస్తుందీ కైఫీయతు. సునిశితమైన వ్యంజనను, వక్రోక్తిని, పరిస్థితులను ఎదుర్కొనే ఒక మొండి పట్టుదలను ప్రదర్శిస్తూ ఇ. ఎల్. డాక్టోరో (E. L. Doctorow) వ్రాసిన వెల్కమ్ టు హార్డ్ టైమ్స్ నవలలా సాగుతుంది.

అలనాటి సమాజంలోని రాజకీయ-ఆర్థిక సమీకరణాలు, అవి కాలక్రమంలో ఒక పటిష్ఠ వ్యవస్థగా రూపొందిన తీరు, రచనలో అడుగడుగునా ఎంతో నేర్పుతో మనకు బొమ్మకట్టి చూపిస్తాడు రచయిత. క్రమేపీ మన్రో కాలానికి ఆ వ్యవస్థ క్షీణించిపోవడం అతడు గమనిస్తాడు. మధ్యయుగాంతపు నైతికవ్యవస్థ పూర్తిగా పతనమై పోవడానికి దారితీసిన చారిత్రక క్రమం యిందులో కనిపిస్తుంది. అయితే, వికాసయుగానంతర (post-Enlightenment) కాలంలో పశ్చిమ ఐరోపాకు చెందిన గిబన్ (Edward Gibbon), రాన్కే (Leopold Ranke), మోంసెన్ (Theodor Mommsen), మిషెలెట్ (Jules Michelet) వంటి ప్రత్యక్షవాద (positivist) చరిత్రకారుల రచనలలో అంతర్లీనంగా కనిపించే ప్రయోజనవాదం, ఈ కైఫీయతులో మనకు కనిపించదు. ఆ ఐరోపా చరిత్రకారుల రచనలలో వారికి తెలియకుండానే క్రిస్టియన్ల శాంతియుగ విశ్వాసం (millenarianism), అంతర్లీనంగా అల్లుకుపోయి, వస్తుగత దృక్పథపు (objectivism) చట్రంలోనే యిరుక్కుపోయి, యింకిపోయింది. దాన్ని గుర్తించకుండా వారి రచనలను అర్థం చేసుకోడం అసాధ్యం. ఈ విషయంలో, తనకు ఇంచుమించు సమకాలీనులైన ఐరోపా చరిత్రకారుల కన్నా, దూపాటి కైఫీయతు వ్రాసిన అజ్ఞాత కరణానికి (పద్మనాభ యుద్ధ రచయిత లాగే) తన దృక్పథాన్ని గూర్చి స్పష్టమైన అవగాహన ఉంది.

దీని గురించి మేమిక్కడ క్లుప్తంగా వివరిస్తాము. ఈ కథ కూడా కృష్ణదేవరాయల దగ్గర మొదలవుతుంది. శాయప్పనాయకుడనే ఒక ఇరవయ్యేళ్ళ కమ్మ యువకునికి రాయలవారు, శ్రీశైలానికి తూర్పున పదహారు కోసుల దూరంలో ఉన్న గుడిపాడు అనే గ్రామాన్ని అమరంగా వ్రాసిస్తారు. పడమటి తెలంగాణాలోని అటవీప్రాంతానికి నడిబొడ్డది. శాయప్ప, అతని కొడుకు వేంగళనాయుడు, మనుమడు వేంకటాద్రినాయుడు అక్కడ తమ ఆధిపత్యాన్ని స్థాపించుకుంటారు. వీరి ఏలుబడి ప్రశాంతంగా సాగిపోయినట్టు కనిపిస్తుంది. శాయప్పనాయుని వంశక్రమంలో జరిగే మార్పులను, వాళ్ళకు పైనున్న విజయనగర పరిపాలనావ్యవస్థలో సమాంతరంగా జరుగుతున్న మార్పులతో పాటుగా మన ముందుంచుతాడు కరణం చరిత్రకారుడు. కృష్ణరాయల మరణానంతరం తలెత్తిన సమస్యలు, ఆ తర్వాత శాలివాహన శకం 1505లో (క్రీ.శ. 1582) విజయనగర సామ్రాజ్యం తురుష్క బాదుషా వశమవ్వడం, మొదలైన విషయాలన్నీ మనకు తెలుస్తాయి. ఈ కైఫీయతులో వరుసగా వచ్చే ఉపాఖ్యానాలు, తిరిగి తిరిగి పునరావృతమయ్యే కొన్ని రకాల కథావస్తువుల కథననిర్మాణాల చుట్టూ అల్లుకొని ఉంటాయి. అయినా కూడా, వంశావళిని చిత్రించే సరళక్రమాన్ని మాత్రం తప్పిపోకుండా జాగ్రత్తగా అనుసరించడం విశేషం.

పదహారు పదునెనిమిది శతాబ్దాల మధ్యకాలంలో, దక్కనీ రాజకీయాలనే విశాల రంగస్థలంపై దూపాటి నాయకులవి చాలా చిన్న పాత్రలు. వారికున్న పరిమితమైన అధికార వైభవాన్ని గురించి కరణం రచయితకు ఎలాంటి భ్రమలూ లేవు. దాని గురించి అతడికి బాగానే తెలుసు. అయితే, వారికున్న బలమల్లా, మారే ప్రభుత్వాలకు అనుగుణంగా తమ ప్రభుభక్తినీ విధేయతను మార్చుకోగల సామర్థ్యం. సాధారణంగా, వారి అధికారానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలవంటివి ఒక నియోగి బ్రాహ్మణుని అధీనంలో ఉండేవి. అవకాశవాద రాజకీయ సమీకరణాలను అంచనా వేసి, వాటికి తగ్గట్టు కార్యసాధన చేసే నేర్పున్న ఆ నియోగి బ్రాహ్మణుని మధ్యవర్తిత్వం ద్వారా దూపాటి నాయకులు తమ అధికారాన్ని కాపాడుకొనేవారు. ఈ ప్రకారంగా కమ్మ నాయకులు, ముందు విజయనగర రాజ్యం క్రింద తమ అధికారాన్ని స్థాపించుకొని, ఆ తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీ పరిపాలన కిందకి మారి (దీనికోసం వారు తమ శత్రువులైన ఆ ప్రాంతపు బోయలపై కుతుబ్ షాహీకున్న శత్రుత్వాన్ని తమకి మిత్రత్వంగా మార్చుకున్నారు), అటు పైన మొఘలాయి సామ్రాజ్యం అంతరించాక హైదరాబాదులో ఏర్పడిన ఆసఫ్ జాహీ నిజాముల పరిపాలనలోకి మారారు. అంచేత ఒక రకంగా చూస్తే యిది దూపాటి నాయకుల హక్కుల నిరంతర పరిరక్షణా చరిత్ర. ప్రామాణికమైన వారి అధికార ధృవీకరణ పత్రాలు కాగితాలపై కాని రాతిపలకలపై కాని, జాగ్రత్తగా భద్రపరచబడి ఉండేవి. ఒకోసారి, వారు నిరంతరం దాసోహమనే మహారాజుల కొలువులోని చిట్టా పుస్తకాలలో (రిజిష్టర్లలో) కూడా ఉండేవి. అలాంటి ఒక సందర్భంలో, వారి నియోగి మధ్యవర్తి, పూనేలోని పేష్వా బాలాజీ బాజీరావు కొలువు దాకా వెళ్ళవలసి వచ్చింది. ఈ రుజువులు చాలాసార్లు దస్తావేజులలో ఉన్నా, కొన్నిసార్లు దేవాలయ శాసనాలలో కూడా ఉండేవి. అవసరమైనప్పుడు యథాతథంగా ఉటంకించబడేవి కూడా.

ఒక రకంగా చూస్తే, చరిత్రను నమోదు చేసే ప్రక్రియావిధానమే యీ కైఫీయతులో నాయకస్థానాన్ని ఆక్రమించుకొనే ప్రధానాంశం. మనిషి కర్మబద్ధత, వ్యక్తి స్వేచ్ఛ, మొదలైన పురాతన విషయాలను పునస్సమీక్షించుకొనేందుకు, ఒక చక్కని నమూనాను అందించే, బొబ్బిలి రంగారాయుడు, దేశింగురాజు వంటి ఏకవీరుడెవరూ యీ రచనలో కనిపించడు. దాని బదులు, ప్రామాణికమైన పత్రాల ఆధారంతో చరిత్ర గురుతులు చెరిగిపోకుండా తరతరాలు నిలిచి ఉంటాయనీ, వాటి చుట్టూ నిర్మించబడిన వ్యవస్థ ఎప్పటికప్పుడు పునరుజ్జీవనం పొందుతుందనీ – ఒక గట్టి నమ్మకం, మనకీ రచన పైపొరల్లోనే ప్రస్ఫుటంగా ద్యోతకమవుతుంది. దూపాటి వంశపాలనకు వినాశమూ, విచ్ఛితీ ఏర్పడిన తరుణంలో, ఎవరో ఒక నియోగి రాయబారి, వారి హక్కుల సాధనకు కావలసిన సాక్ష్యాధారాలను శ్రమకోర్చి సమకూర్చుకొనే విధానమంతా, ఒక ఆలోచనాత్మక పదచిత్రంగా మనకు మరల మరల దర్శనమిస్తుంది. పదునెనిమదవ శతాబ్దపు మధ్యకాలంలో పరిస్థితి ఇలాగే ఉండేది. ఆ పరిస్థితికి, నిజాము, మరాఠులు, బుస్సీ (ఇతని ప్రస్తావన నేరుగా లేకపొయినా) మధ్య నడచిన రాజతంత్రపు ఎత్తుజిత్తులతో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇబ్రహీం ఖాన్ అనే అతడు కమ్మనాయకులను మరోసారి అణచివేయడానికి అలాంటి అవకాశాన్నే చేజిక్కించుకుంటాడు. అయితే, దస్తావేజులనే తమ తరగని గని సహాయంతో వారు తిరిగి పైకి లేవడం ఎలానూ కచ్చితమే.
ఇది [ఇబ్రహీం ఖాన్ యరగొండుపాళేన్ని ధ్వంసం చెయ్యడం] ఒక అవతారసమాప్తి అయినట్లుగానే అయిపోయెను. ఈలాగున కొన్ని దినములు గడచేవరకు ఈ దూపాటితాలూకాను కానలరెడ్డి అనే పరాయిసంస్థానీకుడు వ్యవహారం చేసుకొంటూ తాను అనుభవిస్తూ ఉండెను. అపుడు ఈ శాయపనాయనివారు ఎవరయినా పోయి హుజూరున [గోల్కొండ నవాబు] చెప్పుకొని బోధించేందుకు క్షాత్రవంతులయినవారు అంతా పోయిరి. తతిమ్మా ఉన్నవారైనా ఏదోపోయి ఒక మార్గం ఏర్పరచుకోవడానకు ఏమి బలం చాలకనో (…) ఆరీతున కొన్ని దినములు జరిగిన తరువాత శాయపనాయనిజోగన్నగారి కుమారులు చెన్నప్పనాయడు పురుషోత్తంనాయడు ఇద్దరు వెనుకటి దస్తావేజులు ఏమైనా ఉన్నవేమోనని విచారించేవరకు యరగొండుపాళెం దోచుకొని అగ్నితప్తం చేసిన సమయంలో ఒకటి అయినా ఆకరం లేకుండాపోయెను.

ఇకముందు సాధన ఏమి విచారించవలసినది అని వీరు విచారణీయం చేస్తున్న సమయమందు గుండాపణతుల పెదఓరుగంటిగారి మనుమడు శంభుడు అనే నియ్యోగి పూర్వమునుండి యీ సంస్థానానికి బాధ్యుడేగనుక గద్వాల రాయదుర్గం ఆ ప్రాంత్యములనుంచి వచ్చేటప్పుడు ఆ కాగిదాలు కొన్ని కొన్ని తీసుక వచ్చినాడు గనుక ఆ తారకాలు ఈ పైని వ్రాసిన సనదులు వగైరా కొన్ని కాగితాలు చెన్నప్పనాయడు పురుషోత్తమనాయనింగారికి చూపించినంతలో ఈ కాగితాలు తీసుకొని గుండాపణతుల శంభుడు తాము కొర్లకుంటవారు, రావురువారు, బోడవారు, నల్లాటివారితోకూడ షహరుకు పోయి హజరతు నవాబు సాహేబుల వారి దర్శనం చేసుకొని తమ పుర్వోత్తరం యావత్తు మనవి చేసికొని తమ వద్దనున్న పూర్వపుదస్తావేజులు అన్నీ చూపించినంతలో యథాప్రకారం శలవు ఇవ్వడానకు ఎక్కడెక్కడ దేశాలు అన్నీ అమీనులు హుమ్మారావులకు జాగీర్లు అయి ఉన్నందున ఒట్టుకు సీమలు ఇచ్చే యుక్తం లేదని అపుడు దూపాటి సీమలో దోరణాలసముత్ వగైరా ఏభైయెనిమిది గ్రామాదులున్ను దూపాటితాలూకా పైకి మంతనాల కనుమ, చామ కనుమను వచ్చే హస్వీలున్ను కొచ్చెర్లకోటసీమలో కురిచేటి వంటి పదియిర్వయి గ్రామాదులున్ను ఇవి కొద్దికొద్దిగా పేష్‌కష్ యేర్పఱచి ఫర్మానా వ్రాసి యిచ్చినారు.

మేమింతకుముందు ప్రస్తావించిన యితర కరణాల రచనలలాగే, యిది కూడా స్పష్టమైన తెలుగు వచనంలో, కరణాల రచనాశైలికి స్వాభావికంగా, పొడుగైన వాక్యాలతో సాగుతుంది. సూటిగా, పదునైన వ్యంగ్యంతో ఆకర్షణీయంగా ఉంటుందా శైలి. గోల్కొండ, మొఘల్ పాలనా యంత్రాంగానికి సంబంధించిన ఆధికారిక, రెవెన్యూ పారిభాషిక పదాలు కూడా యిందులో సర్వత్రా కనిపిస్తాయి. అంతటా ఒక బలమైన వాస్తవికత ద్యోతకమవుతూ ఉంటుంది. ప్రపంచాన్ని గురించి, అందులోని రాజకీయ ఆర్థిక వాస్తవాల గురించి, ఒక సంక్లిష్టమైన, సూక్ష్మమైన, విలక్షణమైన దృష్టి – అద్భుతమైన సంఘటనలు, వాటి అవగాహనల రూపంలో అభివ్యక్తమవుతుంది. సుదీర్ఘమైన చరిత్ర జ్ఞాపకాలను, తరతరాలుగా పరిశీలించి, పరిశోధించి, నిశ్చయించి, విమర్శనాత్మకంగా స్థాపించడం ఈ రచనలో చూడగలం. ఇది అప్పుడప్పుడు చాలా తీక్షణరూపం కూడా దాలుస్తుంది. ఈ చిన్ని ప్రాంతంలో, కృష్ణదేవరాయలు మొదలుకొని ఈస్టిండియా కంపెనీ వరకూ సాగిన చరిత్ర గతిని మనమిందులో గమనిస్తాం. ఈ వృత్తాంతానికి ఒక రకంగా మన్రో రెవెన్యూ తీర్మానం ముగింపు నిస్తుంది. ప్రసిద్ధమైన కరణాల విశ్లేషణా పద్ధతి ఎరిగున్న జాగురూకుడైన పాఠకుడు, ముగింపు ఘట్టాలు అందించే అనుభవపాఠాలను గ్రహించ గలుగుతాడు. ఈ పాఠాలు సాధారణంగా లోగొంతులో, అర్థచ్ఛాయల ద్వారా, భావాత్మకమైన ఖాళీల (అధ్యాహారాల) సహాయంతో, కథనంలో కేవలం సూచనప్రాయంగా మాత్రమే వ్యక్తీకరించబడతాయి. ఇప్పుడింక అలాంటి సూక్ష్మభేదాలను తిరిగి టీకాతాత్పర్యాల సహితంగా యిక్కడ విప్పి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చర్వితచర్వణానికి బదులు, ఒక్క రెండు చక్కని శబ్దచిత్రాలను మాత్రం ఉదాహరణగా యిచ్చి ముగిస్తాం.

ఇందులో మొదటిది, పైన చెప్పిన సంఘటన జరగడానికి కొన్నేళ్ళకు ముందు, ఆ ప్రాంతాన్ని మొఘలులు ఆక్రమించిన కొత్తలలో జరుగుతుంది. ఆ కాలంలో, పరాభూతుడైన కారుమంచి అయ్యపరాజు అనే ఒక నియోగి పాత్ర మనకెదురవుతుంది. అతడు దూపాటి నాయకుల ఆస్థానంలో నౌకరీ చేస్తున్నవాడే, అవమానానికి గురై, ఖైదు చేయబడతాడు. అతడా బంధిఖానా నుండి తప్పించుకొని, దూపాటి నాయకులకు శత్రువు, తిరుగుబాటుదారుడు, అయిన మీర్ ఫజురుల్లా అనే అమీరు దగ్గర చేరి, నాయకుల ముఖ్య పట్టణమైన దద్దనాల, దాని చుట్టుపట్లనున్న ప్రాంతాల మర్మాలు, ఆ సంస్థానం సైనిక బందోబస్తు గురించిన సమాచారం, ఆ అమీరుకి చేరవేస్తాడు. అప్పుడు:

మీర్ ఫజురుల్లా అనేవారున్ను కొంత గుఱ్ఱం మందిని తీసుకొని అయ్యపరాజుతోకూడా తాను ఖుద్దు తరలి ఎకా ఎకీన వచ్చి దద్దనాల పట్టణం చుట్టూ ముట్టడివేసి పట్టణం దోచి బహుమందిని హతం చేసి శాయపనాయనివారి నగరు మీదికి వచ్చేవరకు పెద వెంకటాద్రినాయడు అతిశయమైన క్షాత్రవంతుడు కాడు గనుక అధికారబలం చాలనివాడు అయినందుచే తను ఆ వచ్చిన ఫంజు పట్టణం చరాచురా చేసేవరకు పెద వెంకటాద్రినాయడు ఎంత క్షాత్రవంతుడు కాకున్నా కొంత దూరం ఎదిరించి చూడవలెననే రోషం చేతను రాజ్యలక్ష్మి అనే నామం కల్గిన గుఱ్ఱం సవారీ కావలెనని తెప్పించి సవారీ కాబొయ్యేవరకు తొడక్రింద వృషణాలు పడి నల్గి నష్టపోయెను. అంతట నగరిలో క్షాత్రవంతుడైన పురుషుడు లేనందున పట్టణమంతా దోచుకొని అనేకమైన ప్రజలను కొట్టివేసిన తర్వాత నగరిలో ఉన్న స్త్రీలను అందరిని ఒక కొట్టడిలో ప్రవేశింపజేసి నగరున్ను తమాం దోచేవరకు అక్కడున్న స్త్రీలు గృహాలకు చిచ్చు కల్పించుకొని గృహాలతోకూడ స్త్రీలున్ను హతమైపోయిరి. వారు అందరు హతమయ్యేవరకు చిన వెంకటాద్రినాయనివారి కుమారుడు మల్లికార్జున నాయడు అనే పేరున శిశువు అయిదు సంవత్సరములవాడై యుండెను. ఆ విలయకాలమందు ఒక దాసీమనిషి ఈ శిశువును దాచుకొని నగరి చుట్టూ ఉన్న ప్రాకారానకు ఉండే గవాక్షి గుండా యెత్తుకొని పోయి తూర్పుకొండవీటి సీమలో వారి రాజబంధువులు రావెళ్ళవారు కిలారువారు అనే ఇంటిపేరిటివారు నలభైయిండ్లవారు తాళ్ళూరు, తక్కెళ్ళపాడు అనే గ్రామములలో ఉండియుండగా అక్కడికి తీసుకొని పోయెను.

ఎప్పుడూ ధీరులైన నాయకులే అంటే చిరాకు కలుగుతుంది. రాజసం సంగతి అలా ఉంచితే, కాస్త నమ్మశక్యం అనిపించే, మామూలు మనిషి (పాపం, పరిహాసాస్పదుడైనా) ఎదురవ్వడం నిజంగా కాస్త ఊరట కలిగించే విషయమే. ఆదర్శవంతం కానంత మాత్రాన, ఇలాంటి సంఘటనలను సవరించివేసి, మసిపూసి మారేడుకాయ చెయ్యవల్సిన అవసరం లేదని యీ చరిత్రకారుడు గ్రహించాడు. చిన్నపిల్లవాడైన వారసుడిని చివరి క్షణంలో ఒక సేవకురాలు గుట్టుగా కోట బయటకు తీసుకుపోయి రక్షించడం అనే అంశం ఇంతకు ముందు కూడా మనకు తారసపడింది. అది యిక్కడ ఒక రకమైన సాంప్రదాయిక కథావస్తువైపోయింది. బయటనుండి వచ్చిన యిలాంటి కథాంశాలతో పాటు, పచ్చి వాస్తవికతతో, నిక్కచ్చిగా భద్రపరచబడిన కుటుంబ సంప్రదాయాలు కూడా పక్కపక్కనే కనిపిస్తాయి. దుష్టుడైన నియోగికి కూడా చివరకు తగిన శాస్తి జరుగుతుంది. ఇలాంటివాడు చాలా ప్రమాదకరమైన మనిషని, దద్దనాల స్వాధీనమయ్యాక, అయ్యపరాజును ఉరితీయిస్తాడు మీర్ ఫజురుల్లా. ఇక మళ్ళీ మరో ఆవృత్తి మొదలయినట్టే. మళ్ళీ కమ్మ నాయకుల వంశస్థుడు కష్టపడి తన హక్కులను తిరిగి సంపాదించే ప్రయత్నం మొదలుపెట్టవచ్చు.

ఇలా పారంపరికగా వచ్చే కొన్ని అంశాలు ఏకంగా కవిసమయాల స్థాయిని పొందుతాయి. ఇలాగే కోటనుండి రహస్యంగా రక్షింపబడిన మరో శాయప్ప వంశస్థుడు, మల్లికార్జునుడనే వాణ్ణి, నియోగులు, వెలమలు, తన బంధువులైన కమ్మవారు కలిసి పెంచుతారు. మీర్ ఫజురుల్లా చేసిన దద్దనాల విధ్వంసం (క్రీ.సం. 1710) తర్వాత పదేళ్ళకు, మల్లికార్జునుడు తన కుటుంబ హక్కులను, ఆ ప్రాంతపు సర్వాధికారి అయిన ఆసఫుజా నిజాముల్ ముల్కుగారి నడిగి తిరిగి తీసుకోవాలని బయలుదేరుతాడు.

వేయి రెండువేల మందితోకూడా పాలకీలు గుఱ్ఱాలు వగైరా సవారీలతోకూడా షహరుకు పోయి ఒక ప్రదేశమందున దిగి హజరతుగారికి వీరు వచ్చిన సమాచారం ఎరుక చేసిన మీదను హజరతుగారు అనుమానించి శాయపనాయనివారు అందరు దద్దనాలపట్నం హలాలైనప్పుడు వారి గృహాలతోకూడా లయం అయిపోయినారన్న సంకోచం మనస్సున ఉంచుకొని పరీక్ష పూర్వకముగా వీరిని బైటికి రమ్మని శలవు ఇవ్వడంలో దిడ్డిదర్వాజాను రమ్మని చెప్పిరి గనుక వీరు ఆ మర్మం తెలియక వారు శలవు ఇచ్చిన దర్వాజా పర్యంతం పోయినంతలో ఈ మల్లికార్జుననాయడు ఎంత చిన్నవాడైనా గొప్పవారి గర్భవాసమందు ఉత్పత్తి అయినాడు గనుక సంకోచంతోచి ఏనుగు నెక్కి దిడ్డిదర్వాజాను పోవటము మనకు సాంప్రదాయం కాదు, మనమీద దయవచ్చినప్పుడే మనమున ప్రీతి చేశేరు. ఇంతటినుంచి తిరిగిపోవలసినదేనని ఆ దర్వాజా దాటిపోక తిరిగి వచ్చి యథాపలాన ప్రవేశించేటంతటిలో ధణివారు ఈ సమాచారం విని వారి సొత్తు అయినవాడు గనుకనే మనము చేసిన ఎత్తుకు త్వరపడి నడచినవాడుకాడు అని దయవచ్చి తిరిగి పెద్ద దర్వాజాను రమ్మను మని దివానులను పంపించిరి గనుక మరునాడు సాయంత్రంవేళ పోయి హజరతుగారి దర్శనం చేసుకొని తమ సమాచారములు యావత్తు పూర్వోత్తరములు అడిగిన తర్వాత ఈ చిన్నవారు తేజస్సు కలవాడున్ను దేవాంశ కలవాడున్ను వస్తుతః క్షాత్రవంతుడు అయిన వెంకటాద్రినాయని కుమారుడు గనక ధణివారి యెదుట కూర్చుండి వారు అడిగిన ప్రశ్నలకు మరియొకరిని యోచన అడుగక ఉత్తరం చక్కగా ఖామందుతో మనవిచేసినంతలో అత్యంత సంతోషం చేతను చాల దయవచ్చి వీరిదగ్గిర ఉన్న వకీలు దస్తావేజులు మొదలయినవి కొన్నికొన్ని చూపించినందున చక్కగా విచారించి వినుకొండ మొదలయిన దుర్గాలు దేఖీలు తాలూకాలు జహగీర్లు వ్రాసియిచ్చి తన దగ్గర మల్లికార్జుననాయని కొన్ని దినములుంచుకొని తర్వాత సెలవు ఇచ్చిన మీదను…

ఈ సన్నివేశంలో మల్లికార్జునునికి యుక్తితో పెట్టిన పరీక్ష, అతని ఔచితీమంతమైన ప్రవర్తనకు మెచ్చి అతడిని సన్మానించిన విధానమూ, నిజాముల్ ముల్కు వివేక ఔదార్యాలకు తార్కాణాలుగా నిలిచాయి. మొదటి రెండు శతాబ్దాల పాలనాకాలంలో శాయప్పవంశం తమ అధికారాన్ని కాపాడుకోడానికీ, పోయిన దాన్ని తిరిగి పొందడానికీ, యిలాంటి ఉన్నతాధికార కేంద్రాల ఆసరా ఉండేది. అసలు సమస్య తర్వాత కాలంలో, ఆ కుటుంబంలోనే చీలికలు ఏర్పడి, పదునెనిమిదవ శతాబ్దపు చివరి దశకాలలో అంబానాయడు అనే (కొంత దుర్బుద్ధి కలిగిన) పాత్ర ప్రవేశించడంతో, మొదలవుతుంది. అలా మొదలైన వారి వంశ విచ్ఛిత్తి ప్రక్రియకు కొన్ని దశాబ్దాల తర్వాత, మన్రో ప్రవేశపెట్టిన తీర్మానం ముక్తాయింపు నిచ్చింది. ఇటు దస్తావేజులు కాని, అటు రక్షింపబడిన చరిత్ర (విస్తృతార్థంలో) కాని, దూపాటి నాయకులను రక్షించ లేకపోయాయి. చివరికి, ఆ వంశానికి ఆఖరి ప్రతినిధి అయిన ‘సుబ్బానాయనింగారికి కుంఫిణీవారు దయతో ఎంతో కొంత జీవనం’ ఇప్పించాలని మనవి చేసుకోడం తప్ప మరేమీ చెయ్యలేని పరిస్థితిలో కైఫీయతు ముగుస్తుంది.

అయినా కాని, మల్లికార్జుననాయని ప్రవర్తన మనకెన్నో సందేశాలని అందిస్తుంది. ఒక మంచి సంస్కారం – గతాన్ని గూర్చి ఒక సహజమైన, శక్తివంతమైన అవగాహన, సూక్ష్మమైన అనుభూతి – ఆ యువరాజుని పరీక్షలో గట్టెక్కించింది. దక్షిణ భారతదేశ చరిత్రకారుడు కూడా, చరిత్ర రచనా విధానంలో ‘దొడ్డి దర్వాజా’ నుండి ఒక అడుగు వెనక్కి వేసి, తమ పూర్వీకులైన కరణాలు తొక్కిన రాజ మార్గాన్ని అనుసరించాల్సిన సమయం ఆసన్నమయింది.
-------------------------------------------------------
రచన: నాగరాజు పప్పు 
మూలం: వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షూల్మన్, సంజయ్ సుబ్రహ్మణ్యం
ఈమాట సౌజన్యంతో

No comments: