Sunday, December 23, 2018

మత్తకోకిల కథ


మత్తకోకిల కథ






సాహితీమిత్రులారా!

జెజ్జాల కృష్ణ మోహన రావు గారి మత్తకోకిల కథను ఆస్వాదించండి..............
సంగ్రహము
సుందరమైన తాళవృత్తాలలో మత్తకోకిల ప్రసిద్ధమైనది. పింగళఛందస్సులో విబుధప్రియగా నిది పేర్కొనబడినా, దానికి యివ్వబడిన ఉదాహరణ యే కాలమునాటిదో చెప్పడము కష్టము. క్రీస్తు శకము 650 నాటికి ఈ వృత్తములో శ్రవణబెళగొళ శాసనములో, తమిళ తేవారములో పద్యములున్నవి. విబుధప్రియా, ఏళుశీర్ విరుత్తం, హరనర్తన, చర్చరీ, ఉజ్జ్వల, మల్లికామాలె, మల్లికా అని ఎన్నో పేరులు ఉన్న ఈ వృత్తానికి తెలుగులో మత్తకోకిల అని పేరు. నన్నయ, నన్నెచోడుల నాటి కాలమునుండి నేటివరకు వాడబడుచున్న వృత్తమిది. భామినీషట్పది, వృషభగతిరగడ, త్రిపుటరేకులు, ముత్యాలసరము మున్నగు నూతన అవతారముల నతి లీలగా నెత్తుకొన్న వృత్తము మత్తకోకిల. ఈ వృత్తపు ఆరంభము, పరిణామము, దీని లయతో నుండే యితర వృత్తాలను గురించిన చర్చ యీ వ్యాసపు ముఖ్యోద్దేశము. శ్రీకృష్ణకర్ణామృతములో నీ వృత్తము నుపయోగించిన లీలాశుకుడు, ఈ లయలో నొక అష్టపదిని వ్రాసిన శ్రీజయదేవకవి ఆంధ్రులేనా అన్న సంశయము కూడ కలుగుతుంది.

పరిచయము
అందమైన తాళవృత్తాలలో మత్తకోకిల సుప్రసిద్ధమైనది. దీనికి ఎన్నో పేరులు ఉన్నాయి, అవి – విబుధప్రియా, హరనర్తనం, హరనర్దకం, చర్చరీ, ఉజ్జ్వలా, మల్లికామాలె, మాలికోత్తరమల్లికా, మల్లికా, ఏళుశీర్ విరుత్తం, మత్తకోకిల. మత్తకోకిల ప్రతి పాదమునకు 18 అక్షరాలు కలిగిన ధృతి ఛందములో పుట్టిన 91955వ సమవృత్తము. పింగళుని ఛందఃశాస్త్రములో[1] ఎనిమిదవ అధ్యాయములోని మొదటి సూత్రము – అవానుక్తం గాథా, అంటే ఈ గ్రంథములో ఇంతవరకు చెప్పబడని విషయాలు కొన్ని ప్రయోగ రూపములో ఉన్నాయి, వాటిని గాథా ప్రకరణము అని చెప్పాలి. ఇదే అధ్యాయములో పదునారవ సూత్రము – విబుధప్రియా ర్సౌ జ్జౌ భ్రౌ వసుర్దిశా, అనగా విబుధప్రియకు గణములు ర స జ జ భ ర, పాదము ఎనిమిది, పదిగా విరుగుతుంది. ఇది ఛందఃశాస్త్రములో మత్తకోకిల మొదటి పరిచయము. కాని దీనికి ఉదాహరణగా ఇవ్వబడిన క్రింది పద్యము ఎవరు వ్రాసినదో, ఏ కాలము నాటిదో అనే విషయము మనకు తెలియదు.

కుంద కుట్మల కోమల-ద్యుతి దంతపంక్తి విరాజితా
హంసగద్గదవాదినీ – వనితా భవేత్ విబుధప్రియా
పీనతుంగ పయోధర-ద్వయ భార మంథరగామినీ
నేత్రకాంతి వినిర్జిత – శ్రవణావతంసిత కైరవా

మల్లెమొగ్గలవలె మెరిసిపోయే పల్వరుస గలదానా, గద్గదస్వరముగల హంసలా వాదించి పండితులకు ప్రీతికరమైనదానా, ఎత్తైన వక్షోజములతో మెల్లగా నడచుదానా, కనుల మెరపును తిరస్కరించే తెల్ల కలువపూవులను చెవులలో అలంకరించుకొన్నదానా!

మనకు ఇప్పుడు పింగళుని ఛందఃశాస్త్రము హలాయుధుడు వ్రాసిన టీకతో (దీనిని హలాయుధవృత్తి అంటారు) నున్నది. ఈ హలాయుధుడు పదవ శతాబ్దము వాడు. పై ఉదాహరణను హలాయుధుడు చేర్చి ఉండవచ్చును, అంటే అది పదవ శతాబ్దానికి ముందటిదన్నమాట. ఎంత ముందటిదో మనకు తెలియదు. ఇదే అధ్యాయములోని పందొమ్మిదవ సూత్రము శశివదనా న్జౌ భ్జౌ జ్జరౌ రుద్రదిశా (శశివదనకు నజభజజజర గణాలు, పాదము పదకొండు, పదిగా విరుగుతుంది). ఇది మన చంపకమాలకు లక్షణము, దీని ఉదాహరణము మాఘుని శిశుపాలవధ నుండి ఇవ్వబడినది, అంటే పింగళునికన్నా కొన్ని శతాబ్దాల తరువాతిది. అందువల్ల మత్తకోకిల పింగళునిచే పేర్కొనబడినా, దానిని మొట్టమొదట ఎవరు ప్రయోగించారో మనకు ఇదమిథ్థంగా తెలియదని తెలుస్తుంది.

తమిళములో మత్తకోకిల?
క్రీస్తు శకము ఏడవ శతాబ్దములో తమిళ దేశములో తిరుజ్ఞానాసంబందర్ అనే ఒక బాలయోగి ఉండేవాడు. ఇతడు ఒక గొప్ప బాలకవి (child prodigy అని చెప్పవచ్చును). ఈ ద్రావిడ శిశువు సాక్షాత్తు ఆ పార్వతీదేవి స్తన్యాన్ని గ్రోలి కవితను వ్రాసినాడన్న ప్రసక్తి శంకరాచార్యుల సౌందర్యలహరిలోని క్రింది శిఖరిణీ వృత్తములో నున్నది –

తవ స్తన్యం మన్యే – ధరణిధరకన్యే హృదయతః
పయఃపారావారః – పరివహతి సారస్వతమివ |
దయావత్యా దత్తం – ద్రవిడశిశురాస్వాద్య తవ యత్
కవీనాం ప్రౌఢానా-మజని కమనీయః కవయితా
(సౌందర్యలహరి – 75)

ఆ కాలములో జైనమతావలంబులకు శైవులకు వాదోపవాదాలు జరిగేవి. మదురైలో ఏనుగు ఆకారములో ఉండే ఒక కొండ జైనులకు ఉనికి. దానిని ఆనైమలై అంటారు. అక్కడి జైనయోగులతో నేను వాదులాడి వారిని ఓడించి జయాన్ని పొందుతాను అని మధురాపురి మహారాణి మంగయర్కరశితో సంబందర్ చెప్పిన పద్యము మత్తకోకిలకు తమిళప్రతియే అనడములో సందేహము లేదు. జైనాచార్యులు ఎందరో అతి క్రూరముగా చంపబడ్డారు ఈ మతవైషమ్యములో. ప్రాకృతభాషపట్ల నిరసన కూడ ఆ కాలములో ఉండినట్లున్నది. ఇది ఒక బాధాకరమైన చారిత్రక సంఘటన.

మానినేర్విళి మాదరాయ్వళు తిక్కుమాపెరున్ తేవి కేళ్
పానల్వాయొరు పాలనింగివ నెన్ఱునీపరి వెయ్తిడేల్
ఆనైమామలై యాదియాయ ఇడంగళిఱ్పల అల్లల్ చేర్
ఈనర్గట్కెళి యేనలేందిరు వాలవాయర నిఱ్కవే (తిరుజ్ఞానసంబందర్ తిరు ఆలవాయ్ తేవారం తిరుప్పదిగం – 3.411)

జింకలా కన్నులతో ఉండే ఓ పాండ్య రాజమాతా, మీరు నా మాట వినండి. పాలుగారే చెంపలతో ఉండే ఒక బాలకుడని నా గురించి తలబోయకండి. ఆలవాయిలో నెలకొన్న ఆ స్వామి కృపవలన నేను ఆనైమలై నుండి మనకు కష్టాలను కలిగించే ఆ జైనులను ఓడించగలను.

ఆగమత్తొడు మందిరంగ ళమైంద చంగత పంగమా
ప్పాగతత్తొ డిరైత్తురైత్త చనంగళ్వెట్కుఱు పక్కమా
మాగతక్కరి పోఱ్ఱిరిందు పురిందునిన్ఱుణుం మాచుచేర్
ఆగతర్కెళి యేనలేందిరు వాలవాయర నిఱ్కవే (తిరుజ్ఞానసంబందర్ తిరు ఆలవాయ్ తేవారం తిరుప్పదిగం – 3.412)

వేదములను బాగుగా చదివిన వారికి సిగ్గు కలిగేటట్లు ఆ భాషకు వికృతముగా ప్రాకృతములో మాటలాడుతూ, కోపముతో మదించిన ఏనుగులా మురికి బట్టలతో సంచరించే జైనులకు నేనేమీ తీసిపోను, ఆ ఆలవాయిలోని దేవుడి దయవల్ల.

సంబందర్ 16ఏళ్లకే చనిపోయాడట, ఇతని మరణము క్రీ. శ. 660లో అని అంటారు. ఇదే నిజమయితే, పై పద్యములు సుమారు క్రీ. శ. 650 నాటివయి ఉండాలి. ఈ వృత్తాన్ని తమిళములో ఏళు శీర్ ఆశిరియ విరుత్తం[2] అంటారు, అనగా ఏడు గణములు ఉండే ఆశిరియ వృత్తమని అర్థము. ఆ గణాలు వరుసగా తేమా, కూవిళం, తేమా, కూవిళం, తేమా, కూవిళం, కూవిళం. మనకు సుపరిచితమయిన గురులఘువుల పద్ధతిలో, తేమా UU లేక UI, కూవిళం UII, UIU. చివరిది UIUగా ఉండాలి. నా ఉద్దేశములో దీనిని కూవిళంగని, కూవిళంగని, కూవిళంగని, కూవిళం అని కూడ వ్రాయవచ్చును.

మత్తకోకిలలో శిలాశాసనము
క్రీస్తు శకారంభములో ఆనైమలైలో ఒక జైనుల సాంస్కృతిక కేంద్రము వర్ధిల్లుతుండగా, అలాటిదే మరొకటి శ్రవణబెళగొళలో ఆవిర్భవించినది. అక్కడ కొండమీది గుడిలో ఎన్నో శాసనాలు ఉన్నాయి. అందులో సుమారు క్రీ. శ. 650 నాటి శాసనము[3] ఒకటి మత్తకోకిల (కన్నడములో మల్లికామాలె) వృత్తములో నున్నది. నాకు తెలిసినంతవరకు శాసనాలలో మనకు కనిపించే మొట్టమొదటి మత్తకోకిల యిది. అది –

భద్రవాహు సచంద్రగుప్త మునీంద్ర యుగ్మది నొప్పె వల్
భద్రమాగిద ధర్మ మందువలిక్కెవందినిసల్కలో
విద్రుమాధర శాంతిసేన మునీశనాక్కియె వెళ్గొళా
అద్రి మే లశనాది విట్ట పునర్భవక్కెరె యాగి U

భద్రబాహు (చంద్రగుప్త మౌర్యుని గురువు), చంద్రగుప్త మునీంద్రు లిద్దరిలా ఒప్పుచున్నది. చాలా మంగళప్రదమైన ధర్మము లేశ మాత్రము బలహీనమైనప్పుడు పగడములా మెరిసిపోయే పెదవులున్న శాంతిసేన మునీశ్వరుడు వెళ్గొళములో ఉండే కొండపైన ఆహారమును త్యజించి మరో జన్మ లేకుడా తపస్సు చేసినాడు.
కన్నడములో మత్తకోకిల
మత్తకోకిలను కన్నడములో మల్లికామాలె, మాలికోత్తరమల్లికా గా పిలుస్తారు. మొదటి నాగవర్మ (క్రీ. శ. 990) మల్లికామాలె[4] లక్షణాలను క్రింది విధముగా వివరిస్తాడు.

జ్వాలి వాయు దినేశయు-గ్మ శశాంక పావకరెంబివర్
లీలెయిం బరె విశ్రమం – వసుసంఖ్యెయొళ్ నిలె భామినీ
నీలలోల సహస్రకుం-తళె సందుదింతిదు మల్లికా-
మాలె యెంబుదు ని-శ్చయం కవిరాజహంసవినిర్మితం (నాగవర్మ ఛందోంబుధి – 2.194)

ఓ భామినీ, నీలకుంతలా, అగ్ని (ర-గణము), వాయువు (స), ఇద్దరు సూర్యులు (జ జ), చంద్రుడు (భ), అగ్ని (ర) – వీరి గణాలతో ఎనిమిది అక్షరాలకు పాదము విరుగునట్లు కవిరాజహంస (నాగవర్మ) అమర్చగా ఏర్పడిన వృత్తమును మల్లికామాలె అంటారు.

ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమును తెలపాలి. కన్నడ భాషలో ఛందోంబుధిని వ్రాసిన నాగవర్మ, కవిజిహ్వాబంధనము వ్రాసిన ఈశ్వరకవి, నందిఛందస్సు కర్త తమ లక్షణగ్రంథాలలో భార్యలను సంబోధించి పద్యాలను వ్రాసినారు. మహేశ్వరుడు పార్వతికి ఛందశ్శాస్త్రాన్ని మొట్టమొదట బోధించినట్లు ఒక కథ ఉన్నది, దానికి అనుసరణ కాబోలు ఈ కవుల గ్రంథరచనా ప్రణాళిక.

తరువాత జయకీర్తి (పదునొకండవ శతాబ్దారంభము) సంస్కృతములో వ్రాసిన ఛందోనుశాసనములో[5] ఈ వృత్తమును గురించి ఇలాగంటాడు: మాలికోత్తరమల్లికా రసజా జ్భరైశ్చ గతాగతా. ఈ వృత్తాన్ని మల్లిక తదుపరి వచ్చే మాలిక (అంటే మల్లికామాల) అంటాడు జయకీర్తి. జయకీర్తి గణములను గురించి చెప్పాడే కాని యతిని గురించి చెప్పలేదు ఈ సూత్రములో. అంతేకాదు, మత్తకోకిల లయతో ఉండే తరల, మదనసాయక వృత్త లక్షణములను కూడ క్రింది సూత్రాలలో తెలిపాడు జయకీర్తి. వీటికి కూడ యతిని చెప్పలేదు. జయకీర్తికి నాగవర్మ ఛందోంబుధి పరిచితము, కాని అందులోని మల్లికామాలకు నాగవర్మచే యివ్వబడిన యతిని జయకీర్తి చెప్పక, యతి విషయాన్ని సందిగ్ధముగా వదలినాడు.

తరలము – అతిధృతౌ నభరాః సజౌ జగురూ తదా తరలం స్మృతం

మదనసాయకము – నగణతో భజగణౌ త్రిధా గురుపరౌ యదా మదనసాయకః

హరనర్దకము, ఉజ్జ్వల, చర్చరీ – కేదారభట్టప్రణీత వృత్తరత్నాకరములో[6] (బహుశా క్రీ.శ. 1150 ముందు) ఈ వృత్తము హరనర్దకము అని పేర్కొనబడినది. ఈ లాక్షణికుని ప్రకారము పాదము ఎనిమిది, ఐదు, ఐదు అక్షరాలకు విరుగుతుంది. హేమచంద్రుడు (క్రీ.శ. 1089 – 1172) సుమారు క్రీ.శ. 1150లో రచించిన ఛందోనుశాసనములో[7] ఈ వృత్తమును ఉజ్జ్వల అనే పేరుతో సోదాహరణముగా వివరించాడు.

సూత్రము – ర్సౌ జౌ భ్రావుజ్జ్వలం జైః రసజజభరాః జైరిత్యష్టభిర్యతిః

రసజజభర గనములతో పాదము ఎనిమిది అక్షరాలకు విరుగుతుంది.

పాణిపాదవిలోచనా-నన పద్మకాననశాలినీ
నిమ్ననాభి మహాహ్లదా – త్రివలీతరంగవిభూషితా
కుంకుమారుణ పీవర-స్తన చక్రవాకయుగాంచితా
కేలిసింధురివోజ్జ్వలా – మదనస్య రాజతి కామినీ (హేమచంద్రుని ఛందోనుశాసనము – 2.313)

తామరపూవులవలె చేతులు, పదములు, కన్నులు, ముఖము గలదానా, లోతైన బొడ్డుగలదానా, అలలా ఉండే త్రివళితో శోభించుదానా, కుంకుమలా ఎఱ్ఱని చక్రవాకములవలె గుండ్రని వక్షోజములు గలదానా, కేళీసముద్రములో ఉజ్జ్వలమైనదానా, సంయోగములో భాసించుదానా!

ప్రాకృతపింగళకారుడు (14వ శతాబ్దపు ప్రథమ భాగము) దీనిని చర్చరీ[8] అనే పేరుతో వ్యవహరించాడు. పింగళఛందస్సు[1] అధఃసూచికలో ఇందులోని ఉదాహరణ ఇవ్వబడినది. చర్చరీ కామదహన పండుగ (హోలీ) సమయములో కృష్ణుని చుట్టు చేరి గోపికలు చేసే ఒక నాట్యవిశేషము అంటారు. ఈ చర్చరీ నటనలను గురించిన ప్రస్తావన హర్షుని రత్నావళిలో[9] కూడ ఉన్నది.

తెలుగులో మత్తకోకిల
తెలుగులో ఈ వృత్తమును నన్నెచోడుడు కుమారసంభవములో[10] ముద్రాలంకారముతో వాడినాడు. ఆ పద్యము –

మెత్త మెత్తన క్రాలు దీవు స-మీరణుండ, మనోభవుం
డెత్తకుండఁగ వేగకూడఁగ – నెత్తు, మెత్తక తక్కినన్
జత్తు సుమ్ము వసంతుచే నని – చాటునట్లు చెలంగె నా
మత్తకోకిల లారమిం గడు – మాసరంబగు నామనిన్ (నన్నెచోడుని కుమారసభవము – 4.108)

అందమైన ఆమనివేళలో ఆ తోటలోని మత్తకోకిలలు “ఓ పవనమా, నీవేమో మెల్లమెల్లగా వీస్తున్నావు. మన్మథుడు నీపై దండయాత్ర చేయకముందు నీవే త్వరగా వానిపై దండెత్తు, అలా చేయకపోతే వసంతుడు నిన్ను చంపుతాడు, జాగ్రత్త సుమా” అని హెచ్చరించేటట్లు ధ్వనులు చేసినవి.

కవిజనాశ్రయకర్త (రేచన లేక భీమకవి) నన్నయ నన్నెచోడుల పిదప జీవించి ఉంటాడు. మత్తకోకిల లక్షణాలను[11] ఇలా చెప్పాడు –

శ్రావకాభరణాంక విన్ రస-జాభరేఫల దిగ్విరా-
మావహంబుగ మత్తకోకిల – యండ్రు దీనిఁ గవీశ్వరుల్

ఇందులో ఇతడు నిస్సందేహముగా పాదము పది అక్షరాల (దిశా యతి) తరువాత పదునొకండవ అక్షరముపైన అని చెప్పినాడు. అంతే కాక దీనికి మత్తకోకిల అని పేరు అన్నాడు. ఈ మత్తకోకిల పేరు బహుశా నన్నెచోడుని నుండి గ్రహించి యుండవచ్చును. కన్నడములోని చంపకమాలె తెలుగులో చంపకమాల అయినది, అదే విధముగా ఉత్పలమాలె ఉత్పలమాల అయినది. కాని మల్లికామాలె మల్లికామాలగా ఎందుకు తెలుగులో వ్యవహరించబడలేదు? నా ఉద్దేశములో దీనికి రెండు కారణాలు ఉండి ఉండవచ్చును. మల్లికామాల అని ముద్రాలంకారయుక్తముగా వాడదలచినప్పుడు ఆ పదము ఒక పాదము చివరినుండి వేరొక పాదము మొదట వస్తుంది. ఒకే పాదములో మల్లికామాల అని వ్రాయుటకు వీలుకాదు. కాని మత్తకోకిల అనే పదమును ఒకే పాదములో మూడు చోటులలో వ్రాయవచ్చును – మత్తకోకిల మత్తకోకిల మత్తకోకిల మత్తకో. ఇది సామాన్య కారణము. మత్తకోకిల అందమైన తాళబద్ధమైన వృత్తము. బహుశా ఆ కాలములో ఈ వృత్తమును నాట్యములో, సంగీతములో వాడేవారేమో? ఒక రకమైన వీణకు కూడ మత్తకోకిల అని పేరు. సంగీతములోని ఈ వృత్తపు ప్రాశస్త్యాన్ని తెలియబరచుటకై దీనికి మత్తకోకిల అని పేరు పెట్టారేమో? అదియును గాక కోకిల పంచమస్వరమును పలుకుతుంది గదా?
మత్తకోకిలకు యతి
మత్తకోకిలకు యతిని మూడు విధాలుగా ఉంచవచ్చును. ఈ వృత్తపు గురు లఘువులు –

UI UII UI UII UI UII UIU.

ఇందులో మొదటి ఎనిమిది, చివరి ఎనిమిది అక్షరాల గురులఘువులు ఒకే విధముగా ఉన్నాయి. అందువలన పాదమును ఎనిమిది-పది అక్షరాలుగా, పది-ఎనిమిది అక్షరాలుగా విడదీయడానికి వీలవుతుంది.

U I U I I U I U I I
U I U I I U I U

అనగా, అక్షర సామ్య యతిని (వడిని) తొమ్మిదవ అక్షరముతోగాని, పదునొకండవ అక్షరముతో గాని ఉంచుకొనవచ్చును. సంస్కృతములో, కన్నడములో ఎనిమిది-పది యతి ఉంటే, తెలుగులో, తమిళములో పది-ఎనిమిదిగా యతి ఉన్నది. మరొక మూడవ విధము ఏమనగా, ఇది తాళవృత్తము కాబట్టి మొదటి అక్షరానికి పదవ అక్షరానికి ప్రాసయతిని ఉంచవచ్చును. ఈ మూడు విధాలను క్రింది పద్యములో చూడ వీలగును –

మత్తకోకిల – యతి (1, 11)

వందనమ్ముల నిత్తు నే భవ – బంధనమ్ముల ద్రుంచరా
సింధుజాహృదయేశ్వరా సిరి – చిందుతో కరుణించరా
నందనందన పుష్పముల్ నవ – నందనమ్మున బూఛెరా
అందగాడని యందురా హరి – యందమౌ మది వేచెరా

మత్తకోకిల – యతి (1, 9)

వందనమ్ముల నిత్తు నే – భవ బంధనమ్ముల ద్రుంచరా
సింధుజాహృదయేశ్వరా – సిరి చిందుతో కరుణించరా
నందనందన పుష్పముల్ – నవ నందనమ్మున బూఛెరా
అందగాడని యందురా – హరి యందమౌ మది వేచెరా

మత్తకోకిల – ప్రాసయతి (1, 11)

వందనమ్ముల నిత్తు నే భవ
బంధనమ్ముల ద్రుంచరా
సింధుజాహృదయేశ్వరా సిరి
చిందుతో కరుణించరా
నందనందన పుష్పముల్ నవ
నందనమ్మున బూఛెరా
అందగాడని యందురా హరి
యందమౌ మది వేచెరా

రామాయణములో మత్తకోకిల
మత్తకోకిల గణస్వరూపములో ఒక అద్భుతమైన ఆకృతి దాగియున్నది. ఇంతవరకు దీనిని ఎవ్వరు చర్చించినట్లు లేదు. మొదటి ఎనిమిది చివరి ఎనిమిది అక్షరాలు ఒకే విధముగా ఉన్నవని ఇంతకు ముందే చెప్పియున్నాను. అంత మాత్రమే కాదు, మరో రెండు అమరికలు కూడ దాగి యున్నవి వీటిలో. అవి:

(1) ఈ ఎనిమిది అక్షరాలు అనుష్టుభ్ శ్లోకములోని సరి పాదాలకు సరిగా సరిపోతాయి. ఐదు నుండి ఏడవ అక్షరాలు జ-గణముగా ఉండాలి శ్లోకములోని సరి పాదాలలో. మత్తకోకిల మొదటి, చివరి ఎనిమిది అక్షరాలకు ఇది చక్కగా సరిపోతుంది.

వాల్మీకి రామాయణమునుండి ఒక ఉదాహరణ –

మత్త కోకిల సన్నాదైః
నర్తయన్ ఇవ పాదపాన్
శైల కందర నిష్క్రాంతః
ప్రగీత ఇవ చాऽనిలః (4-1-15)

మత్తకోకిలలు పాడుతూ ఉంటే గాలి ఊచగా కదిలే చెట్లు ఆ పాటకు నాట్యము వలె కనబడుతున్నది.

ఇందులో నర్తయన్ ఇవ పాదపాన్ అనే శ్లోకపు రెండవ పాదము మత్తకోకిల పూర్వోత్తరార్ధములవలె ఉన్నవి.

(2) ఈ ఎనిమిది అక్షరాలలో కూడ మొదటి మూడు అక్షరాలు చివరి మూడు అక్షరాలవలె ఉన్నవి. అనగా మాత్రుష్కా బొమ్మలవలె సౌష్ఠవములో మరొక సౌష్ఠవము మనకు గోచరిస్తుంది ఈ వృత్తములో. ఈ మూడు అక్షరాలకు అంత్య ప్రాస నుంచితే పాడుకోడానికి బాగుంటుంది. క్రింద రెండు ఉదాహరణలు:

ఇందులో ఉత్తరార్ధములో ర-గణములకు అంత్యప్రాస నుంచి వ్రాసినాను –

పూవు లీ వని రంగు రంగుల బూచెనే మది నూచెనే
తావు లీ వనిలోన గాలులు దాచెనే మది దోచెనే
రావె యిప్పుడు జీవనమ్మున రాగమై యనురాగమై
మోవి నానుము మోద మొందగ భోగముల్ సురయోగముల్

ఇందులో పూర్ణముగా ప్రాసయతియే, అదనముగా అంత్యప్రాసలు –

పూవుగా వికసించుమా నొక
తావిగా ప్రకటించుమా
భావిగా నరుదెంచుమా చిఱు
దేవిగా కరుణించుమా
భావమై మది జేరుమా రస
రావమై నను గోరుమా
హావమై నడయాడుమా నవ
జీవమై నను గూడుమా
సంస్కృతములో మత్తకోకిల
సంస్కృతములో ఈ వృత్తములో వ్రాయబడిన పద్యాలను వెదుకగా నాకు దొరికినవి రెండు మాత్రమే. ఒకటి చంద్రశేఖరాష్టకము ( వాచకము, గీతము), మరొకటి శ్రీకృష్ణాష్టకము (వాచకము, గీతము). చంద్రశేఖరాష్టకము కొందరు శంకరాచార్య విరచితమని అంటారు, కాని దీని రచయిత మార్కండేయుడట. ఇది పురాణపురుషుడైన మార్కండేయుడైతే, తప్పక యిది అతని పేరిట మరొక కవి వ్రాసినది. లేకపోతే మార్కండేయుని పేరుతో వేరొక కవి ఉన్నాడేమో? ఏది ఏమైనా, ఇతని కాలము మనకు తెలియదు. అందులోనుండి ఒక పద్యము:

రత్నసాను శరాసనం రజతాద్రిశృంగ నికేతనం
శింజినీకృత పన్నగేశ్వర అచ్యుతానల సాయకం
క్షిప్ర దగ్ధ పురత్రయం త్రిదశాలయై రభివందితం
చంద్రశేఖర మాశ్రయే మమ కింకరిష్యతి వై యమ

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం (మార్కండేయ కృత చంద్రశేఖరాష్టకం)

శ్రీకృష్ణాష్టకమును వ్రాసినది వాదిరాజయతి. ఇతడు వ్యాసరాయల సమకాలికుడు, వారి శిష్యుడు కూడ. ఇతని కాలము శ్రీకృష్ణదేవరాయల నాటిది, అనగా ఇతడు 16వ శతాబ్దములో జీవించాడు (ఇతని ఆయుర్దాయము 120 సంవత్సరాలట). శ్రీకృష్ణాష్టకమునుండి ఒక పద్యము:

మధ్వమానసపద్మ భానుసమం స్మరప్రతిమం స్మర
స్నిగ్ధ నిర్మల శీతకాంతి లసన్ముఖం కరుణోన్ముఖం
హృద్యకంబుసమానకంధర మక్షయం దురితక్షయం
సిద్ధసంస్తుత రౌప్యపీఠకృతాలయం హరిమాలయం
పాలయాచ్యుత పాలయాజిత పాలయా కమలాలయ
లీలయా ధృతభూధరాంబురుహోదర స్వజనోదర (వాదిరాజయతి, శ్రీకృష్ణాష్టకము)

లీలాశుకుడు ఆంధ్రుడే(నా)?
ఇంతకంటె ముందుగా, లీలాశుకుడు వ్రాసిన శ్రీకృష్ణకర్ణామృతములో మొదటి శతకములో ఈ వృత్తములోని ఒక పద్యము క్రింద యివ్వబడినది.

పల్లవారుణ పాణిపంకజ – సంగి వేణురవాకులం
ఫుల్ల పాటల పాటలలీ పరి-వాది పాద సరోరుహం
ఉల్లసన్మధురాధరద్యుతి – మంజరీ సరసాననం
వల్లవీ కుచకుంభ కుంకుమ – పంకిలం ప్రభు మాశ్రయే (1.09)

ఈ పద్యములోని ఒక విశేషమేమంటే ఇందులో ద్రావిడ భాషలవలె ప్రాస ఉన్నది. లీలాశుకుడు అన్ని పద్యాలను ఇలా ప్రాసతో వ్రాయలేదు. ఇందులో అన్నిపాదాలు 10, 8 అక్షరాలుగా విడదీయబడ్డాయి. రెండవ, మూడవ పాదాలు ఎనిమిది అక్షరాలకు విరిగినా, మొదటి (పం-కజ), నాలుగవ (కుం-కుమ) పాదాలు అలా విరుగలేదు. కావున లీలాశుకుడు మత్తకోకిలవలన ప్రభావితుడయ్యాడా? లీలాశుకుని ఆంధ్రులు, కేరళదేశస్థులు, ఉత్తరములోని మథురాపురవాసులు తమ దేశములో పుట్టినాడు[12] అంటారు. సంస్కృతములో పాదము ఎనిమిది అక్షరాలకు విరుగుతుందని చెప్పినప్పుడు ఇతడు ఆ నిబంధనను పాటించక తెలుగు (లేక తమిళ) యతిని ఎందుకు ఉంచినాడు అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఈ వృత్తమే కాకుండా లీలాశుకుడు చంపకమాలను బోలిన నర్కుటకవృత్తాన్ని (మొదటి శతకము, ఐదవపద్యము) కూడ ఉపయోగించాడు. చంపకమాల కన్నడ తెలుగు భాషలకు మాత్రమే పరిమితము. పై రెండు కారణాలవలన లీలాశుకుడు బహుశా ఆంధ్రుడేమో? రజనీకాంతరావు తన వాగ్గేయకారుల చరిత్రములో[13] లీలాశుకుడు ఆంధ్రుడై ఉంటాడనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. జయదేవలీలాశుకుల వంటివారి కీర్తి, సంగీతసాహిత్యాది లలితకళలపై వారి ప్రభావము వారు ఆంధ్రులైనా కాకపోయినా యెప్పుడూ శాశ్వతమే. ఛందోవిధానముగా నా నిర్ణయము ఒక చారిత్రక సత్యమును నిరూపించటానికి తోడ్పడగలదనే ప్రయత్నము మాత్రమే.

భామినీ షట్పది
కన్నడ దేశి ఛందస్సులో సుప్రసిద్ధమైన భామినీషట్పదికి మత్తకోకిలకు పోలికలు ఉన్నాయి. దీనిని చూపుటకై మత్తకోకిలకు రెండు మార్పులను చేసి రెండు వృత్తాలను నేను సృష్టించినాను. అవి మాలా, ప్రతిమా వృత్తాలు. మాలావృత్తానికి మత్తకోకిల పాదము చివర ఒక గురువును చేర్చాను, ప్రతిమా వృత్తానికి మత్తకోకిల పాదములోని చివరి రెండు అక్షరాలను తొలగించినాను. మాలావృత్తమును అట తాళములో లేక త్రిపుట తాళములో పాడవచ్చును. ఈ వృత్తముల ఆకృతిని, లయను క్రింది ఉదాహరణముల ద్వార పరిశీలించవచ్చును –

మాల – ర స జ జ భ ర గ, యతి (1, 11), 19 అతిధృతి 93019

అటతాళ యుక్తముగా –
పాడుమా నవ రాగ మాలిక – భవ్యమై యతి నవ్య రీతిన్
చూడుమా నవ మేఘ మాలిక – శోభతో గగనాన బ్రీతిన్
నేడెగా నవ హర్ష మాలిక – నిండుగా మనమందు లేచెన్
మేడలో విరిపాన్పుపై మెల – మెల్లగా చలి గాలి వీచెన్

త్రిపుటతాళ యుక్తముగా –
నిన్న రేతిరి పూట మెల్లగ – నిద్రలో గల యొండు వచ్చెన్
సన్న జాజుల తావి జల్లుచు – చంద్రకాంతులు వన్నె దెచ్చెన్
కన్నుదోయియు జూడజాలని – కాంతి చాపము లెందు నిండెన్
తెన్ను లెన్నియొ క్రొత్త క్రొత్తగ – దేలి నా కగుపించుచుండెన్

ప్రతిమా – ర స జ జ భ గ – యతి (1, 11), 16 అష్టి 27483

సుందరా హృదయాంతరాంతర – సుందరప్రతిమా
స్యందనమ్మున స్వర్ణచక్రపు – చక్కనౌ సడులన్
నందనందన యిందుశీతల – నన్ను గావ సదా
ముందు రా మృదుహాసకాంతుల – మోహనాకృతితో

ఇప్పుడు మాలావృత్తమును ప్రాసయతితో మొదటి పాదముగా, ప్రతిమావృత్తమును అక్షరసామ్య యతితో రెండవ పాదముగా వ్రాస్తే మనకు భామినీ షట్పదిలోని ఒక ప్రత్యేకత లభిస్తుంది.

భామినీ షట్పది ప్రత్యేకత: బేసి పాదాలు – మాల, ప్రాసయతి (1, 11); సరి పాదాలు – ప్రతిమా, యతి (1, 11)

కాలి దామర నొండు చిన్నని – గేల దామర యందు నుంచుచు
లీల ముచ్చట మోముదామర – లెస్స నుంచెనుగా
శ్రీలతోడను సోయగమ్మున – మేలు నీయగ నవ్వు జిందెడు
బాలకృష్ణుని దల్చ నా మది – పల్లవించెనుగా

భామినీ షట్పదికి ఆఱు పాదములు ఉంటాయి. మొదటి మూడు పాదములవలె చివరి మూడు పాదములు ఉంటాయి. మొదటి రెండు పాదాలలో 3, 4; 3, 4 మాత్రలు, మూడవ పాదములో 3, 4; 3, 4; 3, 4, 2 మాత్రలు. ఇలాగే 4, 5, 6 పాదాలు. మొత్తము 102 మాత్రలు పద్యములో. మూడవ, ఆఱవ పాదములలోని చివరి గురువును లఘువుగా కూడ వ్రాస్తారు, కాని పాడేటప్పుడు అది గురుతుల్యము.

కామలతలో పుష్పలత లీ
యామనిన్ నవ నూత నాశల
నా మనస్సున లేపి గూర్మిగ – నాదముల నింపె
భామినీ షట్పదిని గనుమా
యా మహోజ్జ్వల వర్ణములతో
భూమిజమ్ముల కుసుమములపై – మూగి మ్రోగె సుమా

కన్నడ భాషలో భామినీషట్పదిలాటి షట్పదులతో కావ్యములనే వ్రాసినారు. ఇందులో సంగీత సుభగత్వము ఉండడమువలన ఇవి గానయోగ్యము, సామాన్య ప్రజలకు కూడ సులభముగా పఠనీయము. కుమారవ్యాసుడనే కవి కన్నడ మహాభారతమును మల్లికామాల మరొక అవతారమైన ఈ దేశి ఛందస్సులో వ్రాసినాడు. అందుండి మొదటి పద్యము:

శ్రీవనితెయరసనె విమల రా-
జీవ పీఠన పితనె జగకతి
పావననె సనకాది సజ్జన నికర దాతా రా-
రావణాసుర మధన శ్రవణ సు-
ధా వినూతన కథన కారణ
కావు దానత జనవ గదుగిన వీరనారయణ (కుమారవ్యాసుని గదుగు భారతము – 1.1)

లక్ష్మీపతీ, కమలాసనుని తండ్రీ, లోకపావనా, సనకాది సజ్జనులకు దాతా, రావణసంహారీ, చెవుల కమృతమువలె నుండు కథలకు కారణభూతుడా, గదగుపురిలోని వీరనారాయణుడా, జనులందరిని కాపాడుము.

వృషభగతిరగడ
నాగవర్మ ఛందోంబుధిలో[4], జయకీర్తి ఛందోనుశాసనములో[5] రగడలను గురించి వివరించారు. జయకీర్తి రగడలను రఘటాబంధము అని ప్రస్తావించగా, నాగవర్మ రగళె అని చెప్పినాడు. కన్నడములో మూడు విధములైన రగడలు ఉన్నాయి – అవి త్ర్యస్రగతిలోని ఉత్సాహ రగళె, చతురస్రగతిలోని మందానిల రగళె, ఖండగతిలోని లలిత రగళె. ఏడు మాత్రల మిశ్రగతి కన్నడములో భామినీషట్పది రూపములో నున్నది. రగడలు ప్రాసాంత్యప్రాసలతో మాత్రాగణబద్ధమైన ద్విపదలు. తెలుగులో ఎన్నో విధములైన రగడలు ఉన్నాయి. అందులో మిశ్రగతిలోని రగడను వృషభగతి రగడ అంటారు. కవిజనాశ్రయకర్త రగడలను ఉదహరించలేదు, రగడలను గురించి మనము మొట్టమొదట అనంతుని ఛందోదర్పణములో[14] చదువుతాము. వృషభగతి రగడకు వరుసగా నాలుగు త్రిచతుర్మాత్రలు ఉంటాయి. ఇంతకు ముందే మాలావృత్తము వివరించబడినది. ఈ మాలావృత్తము నిజముగా వృషభగతి రగడయొక్క ఒక ప్రత్యేకత. క్రింద వృషభగతిరగడగా ఒక మాలావృత్తము. ఇందులో చివరి అక్షరాలను తొలగిస్తే మనకు మత్తకోకిల లభిస్తుంది.

వృషభగతిరగడ – మాల – మత్తకోకిల

మాధవా యని నేను బిల్చిన – మానసమ్మున నీవె గా(దా)
మోదమా యని నేను బిల్చిన – మోహనాకృతి నీదె గా(దా)
శ్రీధరా యని నేను బిల్చిన – శ్రీల రూపము నీవె గా(దా)
యాదవా యని నేను బిల్చిన – నంద మన్నియు నీదె గా(దా)

రగడలను పాల్కురికి సోమనాథుని నుండి నేటివరకు కవులు విభక్తి ప్రత్యయాలతో వ్రాయబడిన ఉదాహరణ కావ్యములలో[15] కళికోత్కళికలు వ్రాసేటప్పుడు ఉపయోగించారు. క్రింద వృషభగతిరగడకు ఒక ఉదాహరణ:

మఱియు సజ్జన భక్త గృహముల – మరగి తిరిగెడి కామధేనువు
కఱద లెఱుఁగక వేఁడు దీనుల – గదియు జంగమ రత్నసానువు
శైలజాముఖ చంద్రరోచుల – చవులఁ దవిలెడు నవచకోరము
వేలుపుందపసుల తలంపుల – వెల్లికొల్పెడు నమృతపూరము
దేవతలు మువ్వురకు నవ్వలి – దెస వెలుంగుచు నుండు నెక్కటి
భావవీథులఁ గలసి పలుకుల – బట్టి చెప్పఁగరాని చక్కటి
ఆఱు రేకుల మంత్రకుసుమము – నందు వెలిఁగెడి చంచరీకము
వేఱుసేయక యోగిజనములు – వెదకి పొందెడు నూర్ధ్వలోకము
(రావిపాటి త్రిపురాంతకకవి త్రిపురాంతకోదాహరణము – ప్రథమావిభక్తి కళిక – త్రిపుట తాళము)

యక్షగానములలో త్రిపుటరేకులు
భారతీయ సాహిత్యములో గీతగోవిందమును మొదటి యక్షగానము అని చెప్పవచ్చును. తెలుగులో మనకు దొరకిన యక్షగానాలలో మొట్టమొదటిది కందుకూరి రుద్రకవి వ్రాసిన సుగ్రీవవిజయము[16]. యక్షగానములలో తాళబద్ధములైన పద్యములు, పాటలు వ్రాయడము పరిపాటి. అట్టి తాళబద్ధమైన గేయములలో త్రిపుటరేకులు ప్రసిద్ధమైనవి. ఇంతకుముందే నేను మాలావృత్తమును పరిచయము చేసినాను. మత్తకోకిలలోని చివరి నాలుగు అక్షరాలు తొలగించగా వచ్చిన వృత్తము రేఖ. క్రింద రేఖకు ఒక ఉదహరణ:

రేఖ – ర స జ జ గల – యతి (1, 11), 14 శక్వరి 11099

చింపివేయకు నేను వ్రాసిన – చిత్ర లేఖ
త్రెంపివేయకు నా కరాన య-దృష్ట రేఖ
గంప పూవులు వాడె నా జడ – గాన రమ్ము
చంప కింకను వంద ముద్దుల – జప్పు నిమ్ము

బేసి పాదాలు మాలావృత్త పాదములుగా, సరి పాదములు రేఖ పాదములుగా నుంచి వ్రాయగా వచ్చిన అర్ధసమవృత్తము త్రిపుట రేకుల ఒక ప్రత్యేకత అవుతుంది. అలాటి ఒక వృత్తమును క్రింద చదువవచ్చును.

బేసి పాదాలు – మాల, ప్రాసయతి (1, 11)
సరి పాదాలు – రేఖ, యతి (1, 11)

వేంకటేశుని వీరవర్యుని – సంకటమ్ముల బాపువానిన్
బంకజాక్షుని దల్తు నిచ్చట – పాహి యంచు
అంకమందున మాటలాడు శ-శాంక సోదరితోడ నా మీ-
నాంకు దండ్రిని దల్తు నేను న-మామి యంచు

త్రిపుటరేకులకు మొదటి పాదము వృషభగతిరగడ లాటిది (3, 4; 3, 4 – 3, 4; 3, 4 మాత్రలు, యతి లేక ప్రాసయతి ఐదవ మాత్రాగణముతో చెల్లుతుంది). రెండవ పాదములో 3, 4; 3, 4 – 3, 3 మాత్రలు ఉంటాయి, యతి లేక ప్రాసయతి ఐదవ మాత్రాగణముతో చెల్లుతుంది. రెండు పాదాలకు ప్రాస నియతము. ఈ లక్షణాలతో క్రింద ఒక ఉదాహరణ:

కొండపై నెలకొన్న రాయడు – కొండవలె దా దీర్చు కోరిక
లండ నుండును బాయ కెపుడా – యచ్యుతుండు
నిండు భక్తిని స్వీకరించును – దండముల దండల గ్రహించును
నిండు శాంతికి స్థాన మత్యతి – నిర్మలుండు

సుగ్రీవవిజయములో సీత నెడబాసిన శ్రీరాముని శోకమును వర్ణించే త్రిపుటరేకులను క్రింద చదువవచ్చును –

హా సతీమణి ధర్మచారిణి – హా గుణోన్నత జనకసుత నను
బాసిపోయితి వింతలోనే – పద్మనయన
ఎంత భయపడి తల్లడించితొ – యెంత యడలితొ యెంత బడలితొ
యింతి రావణుఁ డెత్తుకొని చన – నేమి సేతున్
నన్ను విడిచియు నిలువఁజాలక – నాతి వచ్చితి వడవిఁ దిరుగను
నిన్ను వీడి యే నెట్టు లోర్తును – నీలవేణి
లేఁటి మాయలు మదిని దెలియగ-లేక పాపపు రక్కసునిచే
బోటి నిను గోల్పడితి నిఁక నా – కేటి బ్రతుకు
ఇందుముఖి నినుఁ బాసినప్పుడె – యేల పోకను నిలిచెఁ బ్రాణము
నిందలకుఁ బాలైతి ధరలో – నిన్ను బాసి
రమణిరో నినుఁ బాసినప్పుడె – రాతిరే శివరాతి రాయెను
నిముసమైనను నాదు కంటికి – నిదుర రాదు
పలుకు పలుకున నొలుక నమృతము – పలుక నేర్చిన జాణ ముద్దుల
కలికి చిలుకల కొలికి నిన్నెటఁ గందు నొక్కొ
కూడఁ జని యా పసిఁడి మృగమును – గూల్చి చర్మముఁ దెచ్చినాఁడను
వేడుకలు గనుఁగొనఁగనేరక – వెఱ్ఱినైతి
లలన నినుఁ గలనైనఁ బాయఁగఁ – గలన నీవిట లేకయుండినఁ
జలనమొందెను నాదు హృదయము – జలజనయనా
నన్ను నీవెడఁబాయ వెన్నడు – నిన్ను నేనెడఁబాయఁజలను
గన్నెరో యీ వెతలు వచ్చెను – గడవఁ దగవే (కందుకూరి రుద్రకవి సుగ్రీవవిజయ యక్షగానము – 19)
కోకిలస్వర జాతిపద్యము
మత్తకోకిల లయ అపూర్వమైనది, అందుకే దీనిని ఆధారము చేసికొని ఉత్పన్నమైన వృషభగతిరగడ, త్రిపుటరేకులు, భామినీషట్పది ఉదాహరణ కావ్యములలో, యక్షగానములలో, కన్నడ కావ్యములలో వాడబడినవి. ఈ లయతో యితర వృత్తములు కూడ నున్నాయి. నేను సేకరించిన, సృష్టించిన మత్తకోకిల లయలున్న వృత్తాలను పట్టికలో చూడవచ్చును. మాత్రామత్తకోకిలకు కోకిలస్వరము అని పేరు నుంచినాను. ఇది యతిప్రాసలతో కూడుకొన్న ఒక జాతి పద్యము. ఏడు మాత్రల కోకిలస్వర అనే పదములో మూడు, నాలుగు మాత్రలు పక్కపక్కన ఉండడము గమనార్హము. ఇందులో రేఖ, ప్రతిమ, మాల, మత్తోత్సాహ, అమరలతిక, సుగతి, రంజిత, వసంతకోకిల నేను కనుగొన్న వృత్తములు. రేఖ, ప్రతిమ, మాలా వృత్తములు త్రిపుటరేకుల, భామిని షట్పదుల వివరణకై కనుగొన్నవి.


మత్తకోకిల లయవృత్త పట్టిక
మత్తోత్సాహ వృత్తమును త్ర్యస్రగతిలో కూడ పాడుకొనవచ్చును. అదే విధముగా అమరలతికను చతురస్రగతిలో, సుగతిని ఖండగతిలో, రంజితను రెండు విధములైన మిశ్రగతులలో పాడుకొనవచ్చును. హృత్కోకిల వృత్తమును శ్రీమతి సుప్రభ కనుగొన్నారు. మత్తకీరవృత్తమును కొక్కొండ వేంకటరత్నము పంతులుగారు సృష్టించినారు. మిగిలిన వృత్తములు లక్షణగ్రంథములలో పేర్కొనబడినవి. మత్తకోకిల తరువాత తరళవృత్తమును కవులు విరివిగా వాడినారు. నన్నయ మత్తకోకిలకన్న ముందుగా తరళమునే భారతములో ఉపయోగించినాడు. ఇంద్రుడు తన కుమారుడైన యర్జునుని పొగడుతూ చెప్పిన క్రింది పద్యము నన్నయ భారతములోని అరణ్యపర్వము నందలి తరళ వృత్తము.

శివుఁడు వీనికిఁ బ్రీతుఁడై దయసేసెఁ బాశుపతాస్త్ర మా
దివిజముఖ్యులతోడ నేనును దివ్యబాణము లిచ్చితిన్
దివిరి యీతఁడు మత్ప్రియంబున దేవకార్యము దీర్పఁగా
సవినయస్థితి నున్నవాఁడు నిజప్రతాప బలోన్నతిన్ (శ్రీమదాంధ్రభారతము, అరణ్యపర్వము, 1.374)

మత్తకోకిల లయలు
గీతగోవిందము:- మిశ్రగతిలోని అందాలకూ శ్రీజయదేవకవి కూడ ఆకర్షితుడయ్యాడు. గీతగోవిందములోని ఏడవ అష్టపది ఏడు మాత్రల మిశ్రగతికి చెందినదే. బహుశా జయదేవకవి ఆంధ్ర ప్రాంతములో నుండినవాడు కాబట్టి అతనికి ఈ అష్టపది నిర్మాణమునకు మత్తకోకిల కారణమయినదో ఏమో? భావగాంభీర్యములో గొప్పదైన ఈ అష్టపది ఇలా ప్రారంభమవుతుంది.

మామియం చలితా విలోక్య వృతం వధూ నిచయేన
సాపరాధతయా మయాపి న వారితాతి భయేన

మత్తకోకిలలోని చివరి గురువును తొలగించగా వచ్చిన రూపమాలి వృత్తము కూడ ఇట్టిదే.

జనార్దనాష్టకము:- మత్తకోకిల లయతో మాత్రాగణములతో అత్యుత్తమముగా ప్రబంధయుగములోనే పద్యములు వ్రాసిన ఘనత కందుకూరి రుద్రకవికి చెందుతుంది. కొందరు ఇతడు శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజములలో నొకడు అని కూడ అంటారు. ఇతని జనార్దనాష్టకము[17, 18] నిజముగా వాడుక భాషలో అందరి అవగాహనకు అందుబాటులో ఉండేటట్లు వ్రాయబడినది. నేటి కాలపు భరతనాట్య అభ్యాసములో శృంగార పదముల శిక్షణలో ఈ పద్యములకు కూడ స్థానము ఉన్నది. రుద్రకవి కవిత్వము జనరంజకముగా నుండాలని ఆ కాలములోనే భావించాడు కాబోలు, ఇతని యక్షగానము, జనార్దనాష్టకము దీనికి గొప్ప నిదర్శనాలు.

ముత్యాలసరము:- నవయుగములో మత్తకోకిల లయ మరొక ఛందస్సులో ఆవిర్భవించినది, అదే ముత్యాలసరము. ఇది గురజాడ అప్పారావుగారి[19] సృష్టి. మొదటి మూడు పాదాలలో మిశ్రగతిలో పదునాలుగు మాత్రలు, నాలుగవ పాదములో ఏడునుండి పదునాలుగువరకు మాత్రలుండును. యతిప్రాసలు ఇందులో ఐచ్ఛికము. “ఒక జాతి పార్సీ గజలు యొక్క నడక ముత్యాలసరములలో తెచ్చుకొనుటకే నే యత్నించియుంటిని” అని అప్పారావు చెప్పుకొన్నాడు. ఈ ముత్యాల సరాలను గురించిన దీర్ఘ చర్చ చేకూరి రామారావు ముత్యాల సరాల ముచ్చట్లు[20] అనే పుస్తకములో చదువవచ్చును. హఫీజ్ (14వ శతాబ్దము) వ్రాసిన క్రింది గజల్[21] యిట్టిదే.-

వాఇజాకీఁ జల్వబర్ మహ్రాబొమెంబర్ మీకునంద్
చూఁబఖిల్వత్ మీరవంద్ ఆఁ కారెదీగర్ మీకునంద్

పారసీక ఉర్దూ భాషలలో మత్తకోకిల లయను బహర్ రమల్ ముసమ్మన్ మహజూఫ్ అంటారు (బహర్ అంటే పద్యము లేక వృత్తము). దీని సూత్రము ఫాయలాతున ఫాయలాతున ఫాయలాతున ఫాయలున్. దీనిని మన గురులఘువులవలె ఈ విధముగా వివరిస్తారు: =-== / =-== / =-== /=-= (= గురువు, – లఘువు). గాలిబ్ వ్రాసిన ఈ లయలోని సబ్ కహాఁ కుఛ్ లాలహ్ ఓ గుల్ మేఁ నుమాయా హో గయీ అనే గజల్‌ను ఇక్కడ వినవచ్చును.

ఇటీవల ఈమాట రచయిత తఃతఃగారి ప్రేరణవలన హిందీ చిత్రసీమలో సుప్రసిద్ధమైన ఆప్కీ నజరోఁ నే సమఝా ప్యార్ కా కాబిల్ ముఝే అన్న పాట మిశ్రగతిలో సాగినదని కనుగొన్నాను. ఈ పాటను ఇదే అర్థములో నేను అనువదించి యున్నాను. కాని అప్పారావుగారికి ఎందుకు మత్తకోకిలలాటి వృత్తాలు, త్రిపుటరేకులు గుర్తుకు రాలేదో? గురజాడవారి మొదటి ముత్యాలసరము నిక్కడ చూడవచ్చును –

గుత్తునా ముత్యాలసరములు
కూర్చుకొని తేటైన మాటల
కొత్తపాతల మేలు కలయిక
క్రొమ్మెరుంగులు జిమ్మగా (గురజాడ అప్పరావు, తోకచుక్క – 1)

కాని అంతకుముందే ప్రచురించబడిన మేలుకొలుపు గేయము కూడ మిశ్రగతిలో నడచినదే –

మేలుకొనుమీ భరతపుత్రుడ
మేలుకొనుమీ సుజనపుత్రుడ
మేలుకొనుమీ సచ్చరిత్రుడ
మేలుకొనవయ్యా, వత్సా, మేలుకో

కాని వీటి కన్నిటికీ మాతృక క్రింది స్త్రీల పాట అని నేననుకొంటాను –

గుమ్మడేడే గోపితల్లీ
గుమ్మడేడే ముద్దుగుమ్మా
గుమ్మడేడే కన్నతల్లీ
గుమ్మడేడమ్మా

శ్రీశ్రీ జయభేరి[22] నినాదము కూడా మిశ్రగతిలో సాగినదే –

నేనుసైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేనుసైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను
నేనుసైతం భువనఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను

వసంతకోకిల:- ఎదురునడకతో, అనగా పాదాదిలో లఘువు తరువాత గురువునుంచి వ్రాయుట, మత్తకోకిల గతి ఏలాగుంటుందో అనే ఆలోచనకు కలిగిన రూపము క్రింది పద్యము. ఉత్సాహకు ముందు గురువు నుంచితే పంచచామరము మనకు ఏ విధముగా లభిస్తుందో, అదే విధముగా మత్తకోకిల పాదారంభములో ఒక లఘువు ఉంచితే మనకు వసంతకోకిల లభిస్తుంది.

వసంతకోకిల – జ-భ-ర-స-జ-జ-గ , యతి (1, 12), 19 అతిధృతి 186038

అసీమమైనది పొంగి లేచెడు – హర్షసాగర మీమదిన్
హసించుచున్నవి పూల డోలలు – హాయిహాయిగ నీ వనిన్
వసంతకోకిల పాడెఁ గొమ్మలఁ – బంచమస్వర బద్ధమై
వసంతకాలము శోభ నిండగ – వచ్చె నేడిల నిద్దమై

పాటలు:- త్రిపుట తాళములో ఎన్నో పాటలు ఉన్నా, వాటి కన్నిటికీ కచ్చితముగా మత్తకోకిల లేక కోకిలస్వరపు లయ ఉండదు. క్రింద ఇంచుమించు ఈ లయను ప్రతిబింబించే త్రిపుటతాళములోని ఒక రామదాసు కీర్తన:

రాగము సురటి, తాళము – త్రిపుట

పల్లవి:
మరువకను నీ దివ్య నామస్మరణ మెప్పుడు చేయుచుంటిని
సత్కృపను ఇక వరము లిచ్చెడి స్వామి వనుచును ఎంచు నను మీ
సరిగ వేల్పులు లేరటంచును మరిగ నే చాటుచును నుంటిని
చరణం:
రాతి నాతిగ చేసినావు అజామిళునిపై కృప గలిగి ని-
ర్హేతుకంబుగ బ్రోచితివి ప్రహ్లాదు గాచితి వట సభను ద్రౌ-
పతికి చీరల నొసగితివి సుంతైన నాపై దయను జూపవు
చరణం:
లోకములు నీలోన గలవట లోకముల బాయవట నీవిది
ప్రకటముగ శ్రుతు లెన్నడు చాటుట పరమ సంతోషమున వింటిని
ఇకను నీవే బ్రోవకున్నను యెవరు నాకిక దిక్కు రామా
చరణం:
దాసమానస పద్మ భృంగా దేవ సంతత చిద్విలాస
భాస సీతా మానసోల్లాస భద్రశైలనివాస శ్రీరామ
దాసపోషక ఇంద్రనీల శుభాంగ పక్షితురంగ రామా
ఇంతకు ముందే మత్తకోకిల లయలోని ఒక హిందీ గజలును మీకు పరిచయము చేసినాను. తెలుగులో ఇలాటి పాటలను వెదుకుతూ ఉన్నాను. పాడమని నన్నడగతగునా పదుగురెదుట పాడనా అనే పాటలోని ఈ పల్లవి యిట్టిదే, కాని చరణములకు ఈ లయ లేదు. కన్నడములో ఈ అపూర్వమైన లయతో రెండు పాటలు ఉన్నాయి. అవి గోపాలకృష్ణ అడిగ వ్రాసిన యావ మోహన మురళి కరెయితొ (ఏ మోహన మురళి పిలిచెనొ), జ్ఞానపీఠ పురస్కారమును పొందిన కె. వి. పుట్టప్ప వ్రాసిన దోణి సాగలి ముందె హోగలి. ఈ పాటలో యాదృచ్ఛికముగా మత్తకోకిల అనే పదము కూడ దొరలినది. దీనిని అదే అర్థముతో నేను చేసిన అనువాదము నిక్కడ అందజేస్తున్నాను –

పల్లవి:
పడవ సాగును ముందుముందుకు దూర తీరము జేరగా
వీచు గాలికి పడుచు లేచెడు సరసుపై నడయాడగా
చరణం:
స్వర్ణకలశమునుండి ముత్తెపు నీటి దారను జల్లుచు
మేఘమాలకు రంగు లీయుచు యక్షలోకము వ్రాయుచు
చూడు పూర్వ దిగంతమందు నిసర్గసుందరి యందము
రంజిలంగను యామె కిప్పుడు సుప్రభాతము బల్కుమా
చరణం:
సరసి యంచులపైన వెల్గెడు నీటి చుక్కలు మెరసెగా
మించువలెను తళుక్కుమంచుచు లేత సూర్యుని కాంతిలో
పచ్చపచ్చని జొన్నచేనుల చల్లగాలులు వీచగా
దాగి పాడెడు మత్తకోకిల మధుర గీతము పాడగా
చరణం:
దూరమందున కొండపైగల తెల్ల మేఘము తేలెగా
మొయిలువలెనే మెల్ల మెల్లగ పడవ యాడుచు సాగెగా
మనము లీలామాత్రజీవుల మిలను జీవనలీలలో
నిన్న నిన్నగ నేడు నేడుగ నుండు రేపది రేపుగా
మలయాళ భాషలో కూడ మత్తకోకిల మల్లికా అని ప్రసిద్ధికెక్కిన వృత్తము. ఈ వృత్తములో కుమరన్ ఆశాన్ కవి వ్రాసిన సంకీర్తనం అనే ఐదు పద్యాలలో మొదటి దానిని క్రింద చదువవచ్చును.

చంత మేఱియ పూవిలుం శబళాభమాం శలభత్తిలుం
సంతతం కరతారియన్నొరు చిత్రచాతురి కాట్టియుం
హంత చారు కటాక్షమాలకళ్ అర్కరశ్మియిల్ నీట్టియుం
చింతయాం మణిమందిరత్తిల్ విళంగు మీశనె వాళ్తువిన్ (కుమరన్ ఆశాన్)

అందమైన పూలలో, రంగురంగుల సీతాకోకచిలుకలలో వాని విచిత్ర సృష్టిని చూస్తాము. వాని దీవెనలను సూర్యరశ్మిలో పొందుతాము. ఆ ఈశ్వరుని మనమందిరములో ఎప్పుడు ధ్యానించవలెను.

ముగింపు
విబుధప్రియగా మొలకెత్తి, ఏడు గణముల వృత్తముగా చిగురించి, మల్లికామాలగా పల్లవించి, మత్తకోకిలగా ఉజ్జ్వల సంగీతాన్ని కల్పించి, హరనర్తనములో చర్చరీ నృత్యమును ప్రదర్శించి, భామినీషట్పదిగా పదములందించి, వృషభగతిరగడగా రాణించి, త్రిపుటరేకులుగా యక్షులకు పులకలిచ్చి, ముత్యాలసరముగా నాంధ్రభారతి కంఠసీమ నలంకరించిన ఒక గొప్ప తాళవృత్తమైన మత్తకోకిల నిజముగా కోకిలస్వరమే. ఈ నా వ్యాసమును ఈ లయతోడి కొన్ని కోకిలస్వరములతో ముగిస్తున్నాను.

పాలవెల్లీ మేల్మి మల్లీ – ప్రాణవల్లీ ప్రేయసీ
కాలి మువ్వై చెల్మి పువ్వై – కందు నవ్వై రా శశీ
పూలతోటై మేలి బాటై – ముద్దుగా దేవప్రియా
మాల వేయన్ లీల లీయన్ – మంచి జేయన్ రా ప్రియా

జలదరవములు వినగ నెమలులు – సరస గతులను నటనలన్
సలిపె గనులకు నిడగ సొబగుల – చలిత పదముల చటులతన్
జలదములవలె మెఱయు లలితుని – చలనముల గన మనసులో
నలల తలపులు బెఱిగె వలపుల – నవియు నదియగు క్షణములో

హిమము కురిసిన వేళలో నా – హృదయ మెందుకు కదలెనో
సుమము విరిసిన వేళలో నీ – శోక మెందుకు మనసులో
ద్రుమము లాకులు రాల్చినప్పుడు – తోచుచుందువు స్మృతులలో
మమత నిండగ నొక్క నిముసము – మాటలాడిన చాలుగా

శ్యామసుందర మదనమోహన – శ్యామ ఘడియల వేళలో
శ్యామ రాగము పాడెదను నే – శ్యామలాభ్రపు నీడలో
శ్యామ నేనిట చక్కగా నా – శ్యామవలె సుస్వరముతో
శ్యామలాంగా యనుచు బిలుతును – స్వామి రా నీ నగవుతో

నిన్న రేతిరి వస్తివా యని – నేను వేచితి నిజముగా
కన్నె బహుమతి తెస్తివా యని – కాచి నిల్చితి కన్నయా
వెన్నముద్దుల నిస్తువో యని – వెన్నెలలలో వేచినా
గిన్నెపాలను* పిల్లి తాగెను – కృష్ణమోహన రావిదేం
-----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: