Tuesday, November 13, 2018

శ్లోకము - 2


శ్లోకము - 2




సాహితీమిత్రులారా!

శ్లోకం గురించిన వ్యాసంలో 2వ భాగం ఆస్వాదించండి.........

అనుష్టుప్పు లోని భేదములు
వక్త్రా

అనుష్టుప్పు భేదములు – కుండలీకరణములలో నుండు 5,6,7 అక్షరములకు గణములు వరుసగా బేసి, సరి పాదములకు వర్తిస్తాయి
అనుష్టుప్పు ఛందములలోని భేదములను వివరించుటకు నేను కల్పించిన చిత్రము ఉపయోగపడుతుంది. ఇందులో మొట్టమొదటిది వక్త్రా. వక్త్రా సూత్రములు: పాదస్యానుష్టుప్వక్త్రమ్; న ప్రథమాత్స్నౌ; ద్వితీయచతుష్టయో రశ్చ; వాన్యత్; య చతుర్థాత్. వీటి అర్థము: అనుష్టుప్పు వక్త్రా ఛందములో పాదమునకు ఎనిమిది అక్షరములు, అన్ని పాదములలో ఆది గణముగా న-గణము, స-గణము ఉండరాదు. సరి పాదములలో ర-గణము కూడ వర్జనీయమే. ఇది ఉపదేశము మాత్రమే. 5, 6, 7 అక్షరములు య-గణముగా నుండాలి. ప్రతి వక్త్రా పాదమును 24 విధములుగా వ్రాయ వీలగును (6 గణములు X 2 నాలుగవ అక్షరము X2 ఎనిమిదవ అక్షరము). అనగా ఈ అనుష్టుప్పు వక్త్రను 331776 (24 X 24 X 24 X 24) విధములుగా వ్రాయ వీలగును. క్రింద ఒక ఉదాహరణము-

నీదు వక్త్రమ్ములో కెంపుల్
నీదు నేత్రమ్ములో వంపుల్
నీదు గాత్రమ్ములో నింపుల్
నీదు డెందమ్ములో సొంపుల్

పథ్యా
పథ్యా యుజో జ్ అనేది పింగళసూత్రము. అంటే సరి పాదములలో 5, 6, 7 అక్షరములు జ-గణముగ నుండాలి. మిగిలిన లక్షణములు వక్త్రా వలెనే. ఒక ఉదాహరణము-

గోవిందా చూపు పథ్యమ్మౌ
త్రోవను నీవు వేగమే
భావమ్ములకు సత్యార్థ
జీవమ్మొసఁగు చిన్మయా

అనుష్టుప్పు పథ్యా లక్షణములను పరిశీలిస్తే దీనికి శ్లోక లక్షణములకు పాదముల ద్వితీయార్ధములో ఎట్టి భేదము లేదు. కావున అనుష్టుప్పు పథ్యా శ్లోకమునకు ప్రతీక. కాని, శ్లోకములో పాదాదిలో న-గణము తప్ప మిగిలిన ఏడు గణములు (వక్త్రా, పథ్యా వీటిలో అనుమతించని స-గణముతో సహా) కవులచేత ఉపయోగించబడినవి. సరి పాదములలో చివరి అక్షరము ఎల్లప్పుడు గురువే లేక గురుతుల్యమే. బేసి పాదములలో లఘువును వాడినారు. దీనిని అనుసరించి బేసి పాదములను 7X2X2 = 28 విధములుగా, సరి పాదములను 14 విధములుగా వ్రాయ వీలగును. అనగా మొత్తము శ్లోకమును 153664 విభిన్న రీతులలో వ్రాయవచ్చును.

విపరీతా
సూత్రము విపరీతైకీయమ్. బేసి పాదములలో 5, 6, 7 అక్షరములు జ-గణముగా, సరి పాదములలో ఆ అక్షరములు య-గణముగా (పథ్యాకు తారుమారుగా) ఉంటే దానిని అనుష్టుప్పు విపరీతా అంటారు. మిగిలిన నియమములు పథ్యావలెనే. క్రింద ఒక ఉదాహరణము-

అపారకరుణామయీ
జపింతు నీదు నామమ్మున్
విపరీతమె కోరికల్
ప్రపన్ను వడి గావన్ రా

చపలా
చపలాయుజో న్ అనునది సూత్రము. బేసి పాదములలో 5, 6, 7 అక్షరములు న-గణముగా ఉంటుంది ఇందులో. మిగిలిన లక్షణములు పథ్యా వలెనే. క్రింద ఒక ఉదాహరణము-

అపారమ్ము చెలువము
లుపమానమ్ము లేదుగా
చపలా చంద్రవదనా
విపులనేత్ర వేగ రా

సైతవ
సూత్రము సర్వే సైతవస్య. అనగా అన్ని పాదములలో 5, 6, 7 అక్షరములు జ-గణముగా ఉంటుంది. క్రింద ఒక ఉదాహరణము-

ఈ మనముల మధ్యలోఁ
బ్రేమయు సైతవమ్ముగా
శ్యామసుందర మెప్పుడున్
బ్రేమమందిరమే గదా
విపులా
సూత్రము విపులా యుగ్ల సప్తమః, అనగా ఇందులో సరి పాదములలో ఏడవ అక్షరము లఘువు. బేసి పాదములలో య-గణములో మార్పు లేదు. ఈ లక్షణములను పరిశీలిస్తే పథ్యా, విపులా వీటికి భేదము లేదు. రెండు ఒక్కటే. మఱి ఈ అనుష్టుప్పు విపులా ఎందుకు చెప్పబడినది? బేసి పాదములలోని య-గణమును వేఱు గణములతో మార్చినప్పుడు మనకు విపులా భేదములు లభిస్తాయి. ఈ భేదములే నేను ప్రారంభములో శ్లోకములోని ప్రత్యేకతలుగా ఉదాహరించినాను. పింగళసూత్రము – భ్రౌ న్తౌ చ. అనగా పింగళుని ప్రకారము బేసి పాదములలో య-గణమునకు బదులు భ, ర, న, త గణములను ఉంచి వ్రాసినప్పుడు మనకు భ-విపులా, ర-విపులా, న-విపులా, త-విపులా లభిస్తాయి. ఇందులో కూడ రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు బేసి పాదములలో ఇట్టి గణములను ఉంచినప్పుడు మనకు జాతిపక్షవిపులా లభిస్తుంది, మొదటి లేక మూడవ పాదములో ఒకదానిలో మాత్రమే ఉంచినప్పుడు మనకు వ్యక్తిపక్ష విపులా లభిస్తుంది. మ-గణముతో కూడ విపుల ఉదాహరణములలో ఇవ్వబడినవి. హేమచంద్రుని ఛందోనుశాసనములో స-గణముతో విపుల కూడ చెప్పబడినది. దుఃఖభంజనకవి వాగ్వల్లభలో జ-గణ విపులా, య-గణ విపులా అని కూడ ఉన్నది. య-గణ విపులా పథ్యా, జ-గణ విపులా (జాతి పక్షములో) విపారీతా అవుతుంది. అదే విధముగా న-గణ విపులా (జాతి పక్షములో) చపలా అవుతుంది. ఇట్టి విపులా భేదములను హేమచంద్రుడు తద్విపులా అని పిలిచినాడు. క్రింద ఆఱు విధములైన విపులా భేదములకు నా ఉదాహరణములు-

న-విపులా

నన్ను జూడుమ సకియా
విన్నవింతును నామొఱల్
కన్నుదోయి కలియఁగా
మిన్ను దిగున్ ధరాస్థలిన్ (జాతి)

తిక్కనార్యుఁడు గవితల్
చక్కగా నాటకమ్మనన్
మక్కువన్ దాఁ దెలుంగందు
నక్కజమ్ముగ వ్రాసెఁగా (వ్యక్తి)

త-విపులా

ఆకాశములోఁ దారక
లేకాంతముగ నుండెనా
రాకాశశియో రమ్యము
చీఁకాకులు ధరాస్థలిన్ (జాతి)

కాలిదాసు కావ్యమ్ము లా
కళారూపపు జ్యోతులే
మాలదాల్చిన స్త్రీమూర్తుల్
శిలారూపపు చింతనల్ (వ్యక్తి)

భ-విపులా

మల్లికా సుమమ్ములతో
వెల్లివిరిసె రమ్యమై
చల్లఁగాను రాత్రియు రం-
జిల్లగా నిల నుల్లముల్ (జాతి)

శ్రీనాథకవీ కవితా
శ్రీనాథసూన శారదా
శ్రీనికేతన శృంగార
శ్రీనికేతన చిన్మయా (వ్యక్తి)

ర-విపులా

ఆనందపు సంద్రమందు
నేనుంటిని బ్రియున్ గనన్
వానిన్ గన మేన నాకుఁ
దేనెలు ప్రవహించెనే (జాతి)

శ్రీకృష్ణరాయా నరేశా
ప్రాకట కవినాయకా
లోకోపకార సంకల్పా
రాకాచంద్రనిభాననా (వ్యక్తి)

మ-విపులా

పద్మినీ పద్మాక్షీ దేవీ
పద్మముఖీ నిరంజనా
పద్మాసనీ పాలించన్ రా
పద్మనాభప్రియా రమా (జాతి)

కవివిష్ణూ కవిబ్రహ్మా
కవిశంకర వాఙ్నిధీ
కవిసార్వభౌమశ్రేష్ఠా
కవి పెద్దన దీనిధీ (వ్యక్తి)

స-విపులా

మనసున మనసైన
వనితా నిన్ను గోరితిన్
తనువునఁ దనువై రా
కనులముందు ప్రేమతో (జాతి)

సత్యనారాయణా నీవు
సత్యముగా కవీంద్రుఁడే
నిత్యము నిన్ను దలంతుఁ
జిత్తమ్ములోన నొజ్జగా (వ్యక్తి)

దేశి వాఙ్మయములో శ్లోకము
నాగవర్మ ఛందోంబుధిలో శ్లోక లక్షణములు ఈ విధముగా చెప్పబడినవి-

అయ్దాఱెంబెడెయొళ
మెయ్దుగె లఘుగురు, కరాబ్ధిపద సప్తకదొళ్
మెయ్దోఱుగె లఘు లక్షణ
మెయ్దుగె పెఱతష్టవర్ణపూర్ణం శ్లోకం – (నాగవర్మ ఛందోంబుధి, 3.12)

ఆరేళనెయ తాణది లఘు
తోఱెదొడం శ్లోకలక్షణం కెడదౌవం
బేఱె పురాతన మునివర్
తోఱిదరంతెరడఱొళగెయం గురువుచితం – (నాగవర్మ ఛందోంబుధి, 3.13)

మొదటి పద్యములో అన్ని పాదములలో ఐదవ, ఆఱవ అక్షరములు లఘువు-గురువుగా ఉండాలి. ఏడవ అక్షరము రెండవ (కర), నాలుగవ (అబ్ధి) పాదములలో లఘువుగ ఉండాలి, బేసి పాదములలో గురువు, మొత్తము ఎనిమిది అక్షరములు ఉంటాయి పాదములో. రెండవ పద్యములో బేసి పాదములో ఏడవ స్థానములో గురువుకు బదులుగా లఘువును ఉంచవచ్చును. అట్టి సమయములో ఆఱవ అక్షరము కూడ లఘువుగా ఉండాలి. 6,7 అక్షరములు రెండు లఘువులుగానో లేక రెండు గురువులుగానో బేసి పాదములలో ఉండవచ్చును అని నాగవర్మ చెప్పుతాడు. వీటికి పురాతనమునుల ఉదాహరణములు ఉన్నాయి అంటాడు. అనగా 5, 6, 7 అక్షరములు న-గణమైనప్పుడు అది అనుష్టుప్పు చపలా అవుతుంది.

అంతేకాక ఒక ఉదాహరణమును కూడ శ్లోకరూపములో ఇచ్చినాడు:

యోగి యోగ జితస్తోమం
స్వాగమ జ్ఞానమాదికం
రాగదింబినితంగీగె
నాగవర్మ బరంగళం

(ఈ శ్లోకము తన్ను పోషించిన రాజునుగుఱించి రచించినట్లున్నది.)

తెలుగులో పొత్తపి వేంకటరమణకవి లక్షణశిరోమణిలో శ్లోకపు లక్షణములను క్రింది సీస పద్యములో చెప్పినాడు.

సీ.
శ్లోకలక్షణ మను-ష్టుపు ఛందమున సర్వ
వృత్తంబు లిన్నూట – యేఁబదాఱు
వెలయునీ స్వస్థాన – విషమ వృత్తంబులే
శ్లోక పాదంబు సు-శ్లోకమయ్యె
తల్లక్షణంబు పా-దాంతమ్ములను గురు
వైదవ వర్ణంబులవి లఘువులు
ప్రథమ తృతీయ చ-రణము నేళింట వి-
దితమౌ గురు(వు మఱి) – ద్విక చతుర్థ
తే.
పదయుగంబున లఘువు స-ప్తమమునందుఁ
దనరు నిట్లు (సు)బోధాభి-దాన కాళి
దాసకృత లక్ష్యలక్షణో-దాహరణముల
నమరసింహాది సకల కా-వ్యములఁ గృష్ణ
పాదాంతములో గురువు, ఐదవ అక్షరము లఘువు, బేసి పాదములలో ఏడవ అక్షరము గురువు, సరి పాదములలో ఏడవ అక్షరము లఘువు, ఈ విధముగా కాలిదాసు శ్రుతబోధలో చెప్పబడినది అంటాడు. అంతే కాక శ్లోకము అనుష్టుప్పు ఛందములో జన్మించిన 256 వృత్తములలోని కొన్ని వృత్తములతో వ్రాసిన విషమ వృత్తములు అని కూడ అంటాడు.

కన్నడము, తెలుగులో శ్లోకముల వాడుక అరుదు. కన్నడములోని మొదటి లక్షణగ్రంథమైన కవిరాజమార్గములో కొన్ని శ్లోకములు వాడబడినవి. రెండవ పరిచ్ఛేదములో చిత్రకవిత్వపు రీతులను వివరించేటప్పుడు కవి శ్లోకపు ఛందస్సును వాడినాడు. గోమూత్రికా బంధమునకు ఉదాహరణముగా ఒక శ్లోకము:

జలదాగమదిం చిత్త
స్ఖలితం కేకినర్తనం
జలదాగమదిం చిత్త
స్ఖలితం కేళనల్లనం – (శ్రీవిజయుని (నృపతుంగని) కవిరాజమార్గం, 2.128)

(మేఘముల రాకవలన చిత్తచాంచల్యమును పొందిన నెమలి నాట్యమాడుచున్నది. మేఘముల రాకవలన చిత్తచాంచల్యమును పొందిన నేను నల్లని అడగాలి.)

మదనతిలకం, కావ్యావలోకనం మొదలగు గ్రంథములలో కూడ శ్లోక ప్రయోగములు ఉన్నాయి. తెలుగులో ఇంతకు ముందే చెప్పినట్లు కొక్కొండ వేంకటరత్నం పంతులుగారు అమృతవాహిని అని శ్లోక ఛందస్సును ప్రవేశ పెట్టినారు. బిల్వేశ్వరీయమునుండి ఒక ఉదాహరణము:

నుతింతున్ తనుమధ్యాంబన్
నుతింతున్ బిల్వనాథునిన్
మతిన్ గౌరీపురీ చిత్ర
హిత చారిత్ర మెంచెదన్ – (కొక్కొండ వేంకటరత్నము పంతులు బిల్వేశ్వరీయము, 2.318)
-----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: